Krishna
-
అమెరికా నుంచి వచ్చి కన్నకూతుళ్లే దహన సంస్కారాలు
పెనమలూరు(కృష్ణా జిల్లా): ఆప్యాయత, అనురాగాలతో అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి మరణించడంతో కుమార్తెలే కుమారులై అంత్యక్రియలు జరిపించి రుణం తీర్చుకున్న ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో చోటుచేసుకుంది. పోరంకికి చెందిన కొడాలి వెంకటరత్నం (68)కి భార్య అరుణ కుమారి, కుమార్తెలు సంతోషి శ్రీదేవి ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా వెంకటరత్నం ఈనెల 11న మృతి చెందారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న కుమార్తెలు అమెరికా నుంచి మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నారు. వెంకటరత్నంకు కుమారులు లేకపోవటంతో అక్కాచెల్లెళ్లిద్దరూ శ్మశాన వాటికకు వెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. పెద్ద కుమార్తె సంతోషి తండ్రి చితికి నిప్పంటించింది. వెంకటరత్నం కుమార్తెలిద్దరినీ గ్రామస్తులు అభినందించారు. కౌలు రైతు బలవన్మరణం చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): వ్యవసాయం కలిసిరాక...సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనో వేదనకు గురై ఓ కౌలురైతు బలవన్మరణం పొందిన సంఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆళ్ల ఆదినారాయణ(45) తనకున్న అర ఎకరంతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని రెండెకరాల్లో మిర్చి, ఎకరం పాతికలో పసుపు, ఎకరంలో మొక్కజొన్న, మిగిలిన దాంట్లో వరి సాగు చేశాడు. రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. మిరప, పసుపు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆశించిన దిగుబడి రాకపోగా, పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక మదనపడ్డాడు. ఏమి చేయాలో పాలు పోక సోమవారం సాయంత్రం గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు.గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోవటంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
దుర్గగుడి ఈఓ శీనానాయక్
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని అభివృద్ధి పనులను ఈవో మంగళవారం పరిశీలించారు. ప్రాంగణంలో నిర్మిస్తున్న పూజా మండపాన్ని పరిశీలించారు. ప్లాన్ ప్రకారం ఇంకా జరగాల్సిన పనులు, రెండో అంతస్తును తనిఖీ చేశారు. దాతల సహకారంతో నిర్మించిన నూతన యాగశాల తుది పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయనే వివరాలను ఈఈ కోటేశ్వర రావును అడిగి తెలుసుకున్నారు. మల్లేశ్వరస్వామి ఆలయం చుట్టూ పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. నూతన పూజా మండపాలు, యాగశాలను త్వరగా విని యోగంలోకి తీసుకురావాలని సూచించారు. అభివృద్ధి పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని, రోజువారీ సమీక్షించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈవో వెంట ఈఈ కోటేశ్వరరావు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కమిషనర్ సమీక్ష దుర్గగుడి ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ఇతర ఆలయ అధికారులు మంగళవారం కమిషనర్ రామచంద్రమోహన్తో సమావేశమయ్యారు. గొల్లపూడిలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఆలయంలో జరుగుతున్న పనులతో పాటు భవిష్యత్తు ప్రణాళికలపై ఈవోతో చర్చించినట్లు సమాచారం. -
ఇంకెంత కాలం!
● గోకులం బిల్లుల కోసం పాడిరైతుల నిరీక్షణ ● జిల్లాలో 1,081 గోకులం షెడ్లు మంజూరు ● 1,051 పనులు ప్రారంభం.. 751 షెడ్లు నిర్మాణం పూర్తి ● మిగిలినవి వివిధ దశల్లో నిలిచాయి ● లబ్ధిదారులకు రావాల్సిన నిధులు రూ.6.19 కోట్లు పెడన: గోకులం, మినీ గోకులం పథకాల కింద పశువుల షెడ్లు నిర్మించుకున్న పాడి రైతులు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. ఐదు నెలలు దాటినా బిల్లులు రాకపోవడంతో ఇంకెంత కాలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీ ఇస్తోందని ముందుకొచ్చిన వారి ఆశలు అడియాసలుగా మారు తున్నాయి. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ. లక్షలు ఖర్చు చేసినా నేటి వరకు బిల్లులు అందలేదు. ఎప్పటికి వస్తాయనేది తెలియడం లేదు. అప్పులు చేసి నిర్మించామని, ఇప్పటి వరకూ నగదు ఇవ్వకపోవడంతో అప్పులే మిగిలాయని పాడి రైతులు వాపోతున్నారు. జిల్లాలో 1,081 గోకులం షెడ్లు మంజూరు కాగా 1,051 షెడ్ల పనులు ప్రారంభించారు. 751 షెడ్లను రైతులు నిర్మించుకున్నారు. ఇవి పూర్తై ఐదు నెలలు దాటి ఆరో నెల వచ్చినా రావాల్సిన బిల్లులు రూ.6.19 కోట్ల ఇంకా విడుదల చేయలేదు. ఎన్నికల సమయంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు స్పందించకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. గ్రామాల్లో పశుపోషకులు గోకులం షెడ్ల పనులు ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో మధ్యలో నిర్మాణ పనులను నిలిపేసినవి కూడా ఉన్నాయి. పాడి రైతులంటే చిన్నచూపా! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తర్వాత పాడిరైతుల అభివృద్ధికి మినీ గోకులం షెడ్లు నిర్మిస్తామని ముందుకు వచ్చింది. కేంద్ర సహకారంతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ పెంచి పశుపోషకుల జీవన శైలి మెరుగుపర్చాలన్నదే గోకులం షెడ్ల ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఉపాధి పథకం ద్వారా నిర్మించే గోకులం షెడ్లకు.. పశువుల షెడ్లకు 90 శాతం రాయితీ, గొర్రెలు, మేకలు, కోళ్లకు 70 శాతం రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వీటిని నిర్మించాలని సంకల్పించింది. రెండు పశువులకు రూ.1.15లక్షలు, నాలుగు పశువులకు రూ.1.85 లక్షలు, ఆరు పశువులకు రూ.2.30లక్షలను అందిస్తామని పేర్కొంది. ఇందులో లబ్ధిదారుని వాటా పది శాతంగా తెలిపింది. ఆరు పశువులకు నిర్మించే షెడ్డుకు రూ.2.30లక్షలు కేటాయించగా లబ్ధిదారుని వాటా రూ.23వేలు పోగా మిగిలిన రూ.2.07 లక్షలు ప్రభుత్వం చెల్లించాలి. రెండు పశువులకు లబ్ధిదారుని వాటా రూ.11,500అయితే రూ.1,03,500 ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 90, 70 శాతం సబ్సిడీ ఇస్తుండటంతో పాడి రైతులు ఆసక్తిగా సిఫార్సులతో మరీ గోకులం షెడ్లును నిర్మించుకున్నారు. తీరా ఇప్పుడు బిల్లులు రాకపోవడంతో కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నారు. అప్పులు చేసి మరీ.. గోకులాలకు రాయితీ ఇస్తామని ప్రభుత్వం పాడి రైతులకు ఆశపెట్టింది. దీంతో షెడ్ల నిర్మాణానికి రైతులు ముందుకొచ్చారు. నిర్మాణ దశలో ఉన్నప్పుడు రెండు విడతలుగా నగదు చెల్లించాలి. బేస్మెంట్ దశలో రూ.30 వేలు, షెడ్డు పూర్తి స్థాయిలో నిర్మించాక మిగిలిన నగదు ఇవ్వాలి. గోకులం షెడ్లు నిర్మాణం ప్రారంభించి ఐదు నెలలు దాటినా కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చెల్లించలేదు. రైతులకు ఉపాధి హామీ మస్తర్ల రూపంలో చెల్లించాల్సిన నగదు కూడా నేటికీ జమకాలేదు. అప్పులు చేసి షెడ్లును పూర్తి స్థాయిలో నిర్మించారు. మరికొందరు రైతులు గోకులం షెడ్ల నిర్మాణ పనులు అసలు ప్రారంభించలేదు. కృష్ణా జిల్లాలో 1,081 గోకులం షెడ్లు మంజూరు జిల్లాలోని 25 మండలాల్లో 415 గ్రామ పంచాయతీల్లో 1,081 గోకులం షెడ్లు నిర్మాణానికి ఆమోదం వచ్చింది. వీటిల్లో 1051 షెడ్లు పనులు ప్రారంభమయ్యాయి. అత్యధికంగా బంటుమిల్లి మండలంలో 80 మంజూరయ్యాయి. ఆ తర్వాత బాపులపాడులో 78, గూడూరు 67, పెడన 62, కృత్తివెన్ను 60 చొప్పున మంజూరు కావడమే కాకుండా పనులు కూడా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 751 షెడ్లను పూర్తి స్థాయిలో నిర్మించారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో నిర్మించిన 751 షెడ్లకు సుమారుగా ఉపాధి శ్రామికుల వేతనాల రూపంలో రూ.6.19 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉంది. -
గృహనిర్మాణాలపై ప్రత్యేక దృష్టి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ నెల 22వ తేదీ నాటికి 910 గృహాలను పూర్తి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ అధికారులను ఆదేశించారు. జెడ్పీ సమావేశపు హాలులో మంగళవారం సాయంత్రం గృహ నిర్మాణ పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గృహ నిర్మాణంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలో చాలా వెనుకబడి ఉందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో 10 వేల గృహాలు నిర్మాణం పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఏప్రిల్ 16న కలెక్టర్ సమీక్షించినప్పుడు రూఫ్ లెవల్లో 506, పై కప్పు స్థాయిలో 2,033 గృహాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు పురోగతిని పరిశీలిస్తే కేవలం 237 గృహాలు మాత్రమే పూర్తి చేశారని ఇలా ఉంటే లక్ష్యాలను ఎప్పటికి సాధిస్తారని ఆమె ప్రశ్నించారు. ఇకనైనా ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ పెండింగ్లో ఉన్న లేఅవుట్లలో లబ్ధిదారులు, ఇంజినీరింగ్ సహాయకులతో సమావేశం నిర్వహించి 22వ తేదీ నాటికి 910 గృహాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.రూ.72 లక్షలు మాత్రమే వినియోగించారుజిల్లాకు రూ.13 కోట్ల అదనపు ఆర్థిక సాయంగా నిధులు విడుదలైనా ఇప్పటి వరకు కేవలం రూ.72లక్షలు మాత్రమే వినియోగించారన్నారు. ఉన్నతాధికారులు 15 రోజులకు ఒకసారి గృహనిర్మాణ పురోగతిపై సమీక్షిస్తున్నారని జిల్లాలో ప్రగతి లేకపోవడంతో తాము సమాధానం చెప్పడానికి ఇబ్బంది కలుగుతోందన్నారు. ఇకపై క్షేత్ర స్థాయిలో అధికారులు వారానికి మూడుసార్లు గృహనిర్మాణంపై సమీక్షించాలన్నారు. ప్రతిరోజూ తాను టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ అధికారి వెంకట్రావు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, ఏపీఎంఐపీ పీడీ విజయలక్ష్మి, డీటీడబ్ల్యూవో ఫణిదూర్జటి, బీసీ సంక్షేమ శాఖాధికారి జి. రమేష్, డెప్యూటీ సీఈవో ఆనంద్కుమార్, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ -
● కబ్జాకోరల్లో బుడమేరు ● డ్రెయిన్లోనే చేపల చెరువులు, తోటల సాగు, ఫ్యాక్టరీల నిర్మాణాలు ● వరదల్లో రైతులను నట్టేట ముంచిన ఆక్రమణలు ● ప్రభుత్వం చర్యలు చేపట్టేనా?
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గుడివాడరూరల్: బుడమేరు కాలువను అడ్డగోలుగా ఆక్రమించేస్తున్నారు. దీనిపై చేపల చెరువులు, తోటలు సాగు చేయడంతోపాటు, ఫ్యాక్టరీలు, భవనాలు నిర్మిస్తుండటంతో బుడమేరు కబ్జా కోరల్లో చిక్కుకుంది. దీంతో వానలు పడితే బుడమేరు కాల్వ పరిసర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమని కాలం గడపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కొందరు అధికారుల అండతో.. కొందరు అవినీతి అధికారుల అండదండలతో డ్రెయిన్లో చేపల చెరువుల యజమానులు అక్రమాలకు పాల్పడ్డారు. బాపులపాడు మండలం కురిపిరాల, ఓగిరాల, పెదపాడు మండలంలోని కొణికి, ఒడ్డిగూడెం, నందివాడ మండలం పుట్టగుంట, కుదరవల్లి, అరిపిరాల, ఎల్ఎన్పురం, ఇలపర్రు ప్రాంతాల్లో అడ్డగోలుగా డ్రెయిన్లో చేపల, రొయ్యల చెరువుల సాగు మూడు పువ్వులు ఆరు కాయలు అనే చందాన సాగుతోంది. చెరువుల తవ్వకాలను పరిసర ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయినా బడాబాబులు పాలకుల అండదండలతో తవ్వేయడంతో డ్రెయిన్ కరకట్ట కుదించుకుపోయింది. ఫలితంగా నీరు దిగువకు వెళ్లని పరిస్థితి నెలకొంది. ఫ్యాక్టరీల నిర్మాణాలు జిల్లాలో అరిపిరాలకు చెందిన ఓ టీడీపీ నేత ఏకంగా డ్రెయిన్లో భారీస్థాయిలో బిల్డింగ్లు నిర్మించి వాటిల్లో పలు రకాల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశాడు. డ్రెయిన్లోనే 25 మీటర్ల మేర పూడ్చి ఆరడుగుల మేర మెరకచేశాడు. అయితే నీరు–చెట్టు పనులను సైతం సదరు నేత సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడంతో ఆక్రమణలు తొలగ కుండా జాగ్రత్త పడటం విశేషం. ఆక్రమణలు ఉన్న ప్రాంతం గన్నవరం నియోజకవర్గంలో ఉండటం అక్కడ ఎమ్మెల్యే ఇంటి పేరు, సామాజికవర్గం.. ఇదే నేతది కావడంతో ఆక్రమణలు తొలగించే దమ్ము ఎవరికి ఉందంటూ సదరు నేత బహిరంగంగానే వ్యాఖ్యానించడంపై సొంత పార్టీ నాయకులే గుర్రుగా ఉన్నారు. దీంతో ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది.విజయవాడ పరిసర ప్రాంతాల్లోని మురుగు నీటిని బుడమేరు కొల్లేటిలోకి తీసుకువెళ్తుంది. ఇది మురుగునీటి కాలువగానే కాకుండా విజయవాడరూరల్, నందివాడ, ఉంగుటూరు, పెదపారుపూడి, బాపులపాడు, పెదపాడు, మండవల్లి మండలాల్లోని గ్రామాలకు సాగునీరు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఇటీవల విజయవాడ, ఉంగుటూరు ప్రాంతాల్లో బుడమేరును ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. పెదపారుపూడి, నందివాడ, బాపులపాడు, పెదపాడుకు సంబంధించి కొందరు బడాబాబులు డ్రెయిన్లో అడ్డగోలుగా చేపల చెరువులు తవ్వేశారు. డ్రెయిన్, కాల్వల్లో చేపల చెరువులు తవ్వడానికి అనుమతులు లేవు. ప్రభుత్వం ఆక్రమణలు తొలగించేనా? కొంతకాలం క్రితం బుడమేరుకు వచ్చిన వరదల దెబ్బకు గ్రామాలతోపాటు విజయవాడ వంటి మహా నగరం సైతం ముంపునకు గురై విలవిలలాడింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బుడమేరు ఆధునికీకరణకు చర్యలు తీసుకున్నారు. ఆయన మరణాంతరం 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక బుడమేరు ఆధునీకరణ పనులు చేపట్టినా ఆ పార్టీ నేతలే నీరు–చెట్టు రూపంలో కాంట్రాక్టర్లగా అవతారం ఎత్తి పనులు చేపట్టారు. బుడమేరును ఐదు రీచ్లుగా విభ జించి పనులు జరిగాయి. పసుపు నేతల ‘మేత’ కారణంగా లోపభూయిష్టంగా జరిగాయి. కరకట్ట అభివృద్ధి పనులను తూతూ మంత్రంగా చేయడంతో బుడమేరుకు ముంపు సమస్య తప్పలేదు. ఇటీవల బుడమేరు వరదలతో కలిగిన నష్టాన్ని బేరీజు వేసుకుని దాన్ని ప్రక్షాళన చేస్తామని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ నుంచి బుడమేరు కొల్లేరులో కలిసే వరకు ఉన్న ఆక్రమణలన్నీ తొలగిస్తామన్నారు. బుడమేరు పరీవాహక గ్రామాల ప్రజలు, రైతులు మాత్రం త్వరగా ఆక్రమణలు తొలగించి ముంపు నుంచి కాపాడాలని కోరుతున్నారు. -
నిధులు ఈ వారంలో వచ్చేస్తాయి
జిల్లాలో గోకులం షెడ్ల నిర్మాణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టారు. మెటీరియల్కు సంబంధించి నిధులు వచ్చి ఉన్నాయి. ఉపాధి కూలీల వేతనాలు రూ.6,19,71,224 రావాల్సి ఉంది. ఇవి కూడా వారం పది రోజుల్లో వస్తాయని సమాచారం ఇచ్చారు. పాడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆలస్యమైందంటే. 751 షెడ్లు పూర్తయ్యాయి. మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని చెబుతున్నాం. –ఎన్వీ శివప్రసాద్, డ్వామా పీడీ, మచిలీపట్నం, కృష్ణాజిల్లా -
ఎన్టీటీపీఎస్లో మాక్డ్రిల్
ఇబ్రహీంపట్నం: యుద్ధ వాతావరణం, ఉగ్ర ముప్పు నుంచి ఉద్యోగులు ఎలా రక్షణ పొందాలనే అంశంపై ఎస్పీఎఫ్ సిబ్బంది ఎన్టీటీపీఎస్లో మంగళవారం మాక్డ్రిల్ నిర్వహించారు. ముఖ్యఅతిథి ఆర్డీఓ కావూరి చైతన్య మాట్లాడుతూ అనుకోని విపత్తలు ఎదురైనప్పుడు ఉద్యోగులు తమకు తాము రక్షించునే పద్ధతులు తెలియజేయడమే మాక్డ్రిల్ ఉద్దేశమన్నారు. అగ్నిప్రమాదం, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తీసుకోవల్సిన రక్షణ చర్యలు, ఎదుటివారు సమస్యల్లో చిక్కుకుంటే ఎలా స్పందించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఉపద్రవాల సమయంలో స్పందించాల్సిన తీరుపై అగ్నిమాపక శాఖ, పోలీస్, మెడికల్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్డ్రిల్ ద్వారా చూపించారు. ఏసీపీ ఎస్వీడీ ప్రసాద్, ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ రాజు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఈ శివరామాంజనేయులు, పోలీస్, ఫైర్, మెడికల్, తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బరువు.. ఆధరవు
● దివిసీమ రైతుకు బిహార్ కంద సాగుతో లాభాలు ● కంద బరువు 13.50 కిలోలు మేళ్లమర్తిలంక(మోపిదేవి): వాణిజ్య పంటలకు కృష్ణాజిల్లా దివిసీమకు చెందిన మోపిదేవి మండలానికి మంచి పేరు ఉంది. అధిక దిగుబడులు సాధించడానికి రైతులు పోటీ పడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల మేళ్లమర్తిలంకకు చెందిన మోర్ల వెంకటేశ్వరరావు 10 సెంట్ల మెట్ట భూమిలో బిహార్ కంద సాగు చేపట్టారు. ప్రతి కందదుంప 10 నుంచి 13 కిలోల బరువు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక్కొక్కదుంప 3నుంచి 4 కిలోల బరువు ఉంటుంది. 10 సెంట్ల భూమిలో 4(1,000కిలోల) పుట్టల కంద దిగుబడి వచ్చిందని, మార్కెట్లో పుట్టెకు రూ. 15 వేల వంతున విక్రయించగా మొత్తం రూ. 60 వేలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఖర్చులు సుమారు రూ. 7 వేలు అయినట్లు వివరించారు. అత్యధికంగా 13.50 కిలోల బరువున్న కంద దుంపను చూసి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
తిరుపతమ్మకు బోనాలు
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారికి మంగళవారం నాయీబ్రాహ్మణులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఏటా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని వారు తెలిపారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘ నేతలు కొలిపాక బ్రహ్మం, రాము, ఉప్పు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో బంగారు పతకం పెనమలూరు: రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బాడీ బిల్డర్ సీహెచ్ దుర్గాప్రసాద్ 70 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడని జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్, అశోక్ తెలిపారు. మంగళవారం వివరాలు వెల్లడిస్తూ ఈ నెల 12న సత్యసాయి జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన కదిరిలో రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించారన్నారు. దుర్గాప్రసాద్ 70 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించగా, 70 కేజీల పైవిభాగంలో రాహుల్కృష్ణ బెస్ట్ ఆఫ్ సిక్స్ సాధించాడన్నారు. స్విమ్మర్లకు అభినందన పటమట(విజయవాడతూర్పు): ఖేలో ఇండియా–2025 యూత్ గేమ్స్ అండర్–18 కేట గిరీలో ఆలిండియా చాంపియన్షిప్లో 64 పాయింట్లతో ఏపీ తృతీయ స్థానంలో నిలిచింది. విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన అండర్–18 స్విమ్మర్లు తీర్థు సామదేవ్, దేవ గణేష్, యజ్ఞ సాయిలను వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం కమిషనర్ ధ్యానచంద్ర అభినందించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన స్విమ్మర్లకు వీఎంసీ తరఫున అన్ని విధాలా సహకరిస్తామని, భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ డాక్టర్ లత, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఐ.రమేష్, కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ వి.వినోద్, సహాయక కోచ్ నితీష్, ఇతర కోచ్లు పాల్గొన్నారు. కనులపండువగా నరసింహునికి చక్రతీర్థం వేదాద్రి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరుక్కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారికి చక్రతీర్థం కార్యక్రమాన్ని కనులపండువగా చేశారు. స్వామి వారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా సమీపంలోని కృష్ణానదిలో అర్చకులు పరాంకుశం శ్రీనివాసాచార్యులు, వేదాంతం శ్రీధరాచార్యులు, మురళీధరాచార్యుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేసి చక్రతీర్థం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకిలో ఊరేగించారు. రాత్రికి పూర్ణాహుతి, ధ్వజారోహణ చేశారు. ఈవో సురేష్బాబు, భక్తులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీకి 7,762 మంది హాజరు మచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రెండో రోజైన మంగళవారం జిల్లా వ్యాప్తంగా 7,762 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్ఐఓ పీబీ సాల్మన్రాజు తెలిపారు. జిల్లాలోని 42 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన మొదటి ఏడాది ఇంగ్లిష్–1 పరీక్షకు 7,626 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 7,306 మంది హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన రెండో ఏడాది ఇంగ్లిష్–2 పరీక్షకు 136 మంది హాజరవ్వాల్సి ఉండగా 115 రాశారని తెలిపారు. -
కృష్ణాజిల్లా
ఎడ్ల బండలాగుడు పోటీలు లింగాలపాడులో లక్ష్మీ పేరంటాళ్ల అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న ఎడ్ల బండలాగుడు పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ట్రాఫిక్తో టెన్షన్ రోడ్లపైకి వస్తే నిత్యం ట్రాఫిక్లో టెన్షన్తో ప్రజలు ప్రయాణిస్తుంటారు. దీంతో వారు అనేక శారీరక, మానసిక సమస్యలకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. దుర్గమ్మ సన్నిధిలో.. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025u8లో 7 -
ఉత్కంఠభరితంగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
రెండు పళ్ల విభాగం విజేతలకు బహుమతుల అందజేత నందిగామరూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉన్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలలో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన నాలుగు పళ్ల విభాగంలో ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల వెంకటలక్ష్మీ సాయిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు ప్రదర్శన కమిటీ సభ్యులు మాట్లాడుతూ నాలుగు పళ్ల విభాగంలో ఏడు జతలు పోటీ పడ్డాయని, 15 నిమిషాల వ్యవధిలో 8.50 క్వింటాళ్ల బండను లాగినట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు. నగదు బహుమతుల అందజేత గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన రెండు పళ్ల ఎడ్ల ప్రదర్శన పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం బయ్యారం గ్రామానికి చెందిన కేఎంకే బుల్స్ కడియం మణికంఠ ఎడ్ల జత మూడు వేల అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలవగా, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన కేఆర్ఆర్ బుల్స్ కొప్పుల గోవర్దన్రెడ్డి ఎడ్ల జత 2,695.09 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడికి చెందిన జమ్మనబోయిన సుబ్రహ్మణ్యం ఎడ్ల జత 2,061 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. చందర్లపాడు మండలం బ్రహ్మబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన పాలెం వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రాగిపాడుకు చెందిన యద్దనపల్లి మనోజ్ చౌదరి ఎడ్ల జత 2,045 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన పోకల శ్రీనివాసరావు నాయుడు, పద్మావతి నాయుడు ఎడ్ల జత 1,750 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బట్ట కార్తికేయ యాదవ్ ఎడ్ల జత 1,554 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయని తెలిపారు. విజేతలకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో మొరాయిస్తున్న స్టేర్ లిఫ్ట్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సుమారు రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు స్టేర్ లిఫ్ట్ తరచూ మొరాయిస్తుండడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వృద్ధులు, వికలాంగులు స్టేర్ లిఫ్ట్ను సద్వినియోగం చేసుకుని స్కానింగ్ పాయింట్ వరకు చేరుకుంటున్నారు. అయితే ఈ లిఫ్ట్ తరచుగా మొరాయిస్తోంది. ప్రారంభించిన 7 నెలల కాలంలో ఎక్కువ సార్లు మరమ్మతులకు గురికావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్టేర్ లిఫ్ట్ను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే అంటే గత ఏడాది నవంబర్ 8న మొదటిసారిగా నిలిచిపోవడంతో టెక్నికల్ సిబ్బంది మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఓ సారి ఈ స్టేర్ లిఫ్ట్ పని చేయకపోవడం పరిపాటిగా మారింది. గత మూడు రోజులుగా స్టేర్ లిఫ్ట్ పని చేయకపోవడంతో ఆలయ ఇంజినీరింగ్ సిబ్బంది టెక్నీషియన్ను పిలిపించారు. ఆరు బయ ట వర్షం నీరు పడటంతో మోటరు పాడైపోయిందని చెప్పారు. అయితే స్టేర్ లిఫ్ట్కు ఏడాది పాటు వారంటీ ఉండటంతో కంపెనీనే పూర్తి బాధ్యత వహిస్తుందని చెబుతున్నా, ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది భక్తుల ప్రశ్న. స్టేర్ లిఫ్ట్ ఏర్పాటు చేసే సమయంలోనే మెట్లపై వర్షం నీరు పడకుండా షెడ్డు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. -
ఆర్టీసీ డ్రైవర్పై దాడికి పాల్పడిన నిందితుల అరెస్ట్
కోనేరుసెంటర్/బంటుమిల్లి: బంటుమిల్లిలో ఆర్టీసీ డ్రైవర్పై దాడికి పాల్పడిన నిందితులను బంటుమిల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం బందరు డీఎస్పీ సీహెచ్ రాజ మచిలీపట్నంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్న ఎం.నాగరాజు గత వారం విధి నిర్వహణలో భాగంగా గుడివాడ డిపో నుంచి బస్సు తీసుకుని సరిగ్గా బంటుమిల్లి సెంటర్కు రాగానే ఎదురుగా బైక్లు అడ్డు రావటంతో హారన్ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన సోమిశెట్టి వెంకటనారాయణ, రాఘవరపు సతీష్, దాసు శ్రీనివాసు మద్యం మత్తులో డ్రైవర్ నాగరాజుపై దాడికి పాల్పడ్డారు. వీరి దాడిని సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న మహిళా కండక్టర్పై కూడా దురుసుగా వ్యవహరించారు. బాధితుడు నాగ రాజు అదే రోజు బంటుమిల్లి పోలీస్స్టేషన్లో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టుకు హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన ముగ్గురిపై నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. రూరల్ సీఐ, బంటుమిల్లి ఎస్ఐ పాల్గొన్నారు. -
ట్రాఫిక్తో టెన్షన్.. టెన్షన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకవైపు మండే ఎండలు, మరోవైపు గజిబిజి ట్రాఫిక్తో రోడ్డుపై ప్రయాణించాలంటేనే జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంతమంది యువకులు అడ్డదిడ్డంగా నడిపే వాహనాలతో ట్రాఫిక్లో పద్ధతిగా వెళ్లేవారికి వాహనాలు నడపాలంటేనే చిరాకు, టెన్షన్ వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యం ట్రాఫిక్లో ప్రయాణించే వారు అనేక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పిల్లల్ని పరీక్షలకు తీసుకెళ్లడం, ఉద్యోగ విధులకు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో సమయానికి వెళ్లలేమని టెన్షన్ పడుతుంటారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు... ● పెనమలూరుకు చెందిన రాజేష్ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు డ్యూటీకి వెళ్లేటప్పుడు నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలే ఆఫీసులో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అమలులో ఉంది. పది నిమిషాలు ఆలస్యమైతే, మూడు రోజులకు ఒక సీఎల్ కట్ చేస్తుండటంతో తీవ్రమైన టెన్షన్ నెలకొంటుంది. ట్రాఫిక్లో ప్రయాణిస్తూ తీవ్రమైన మానసిక వత్తిడికి గురవుతున్నారు. ● గాంధీనగర్కు చెందిన ఉద్యోగి గన్నవరంలో పనిచేస్తుంటారు. ప్రతిరోజూ తమ కుమార్తెను బెంజిసర్కిల్ వద్ద కళాశాలలో దించి కార్యాలయానికి వెళ్తుంటారు. ఇలా ప్రతిరోజూ కళాశాలకు, కార్యాలయానికి సమయానికి వెళ్లలేమనే టెన్షన్కు గురవుతూ, నలభై ఏళ్ల వయస్సులోనే హైపర్టెన్షన్ బారిన పడ్డారు. ఇలా వీరిద్దరే కాదు. నగరంలోని ట్రాఫిక్తో అనేకమంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఏమి చేయాలి... ● మనం వెళ్లే ప్రాంతం దగ్గరలో ఉన్న సమయానికి కంటే కొద్దిగా ముందుగా బయలు దేరాలి. అప్పుడు ట్రాఫిక్ ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ● వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించి, పబ్లిక్ వాహనాల్లో ప్రయాణిస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ● నిత్యం ప్రయాణించే వారు యోగా, మెడిటేషన్ చేయాలి. ● కాలుష్యం బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. వైద్యులు గుర్తించిన సమస్యలివే... ట్రాఫిక్లో ప్రయాణించే వారు యాంగ్జయిటీకి గురవుతున్నారు. యాంగ్జయిటీకి గురయ్యే వారు కార్యాలయానికి వెళ్లిన గంట వరకూ పనిపై దృష్టి పెట్టలేక పోతున్నారు. నిత్యం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసే వారికి కాలుష్యం కారణంగా రక్తం చిక్కపడి గుండెపోటు, మెదడుపోటు వచ్చే అవకాశం ఉంది. నిత్యం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసే వారు చిన్న వయస్సులోనే హైపర్టెన్షన్ బారిన పడే అవకాశం ఉంది. ట్రాఫిక్లో ప్రయాణంతో నిద్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేసే వారిలో స్పైన్ సమస్యలు వస్తున్నాయి. ట్రాఫిక్ చిక్కులతో కోపం, ఆవేశం, చిరాకు పెరుగుతుంది. ట్రాఫిక్లో డ్రైవింగ్తో సమస్యలు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణించడం వలన కాలుష్య ప్రభావానికి గురవుతుంటారు. ఫలితంగా రక్తం చిక్కపడి బ్రెయిన్స్ట్రోక్, గుండెపోటు వంటి వాటికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా చికాకు, పనిపై దృష్టిపెట్టలేక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బీపీ, వెన్నెముక సమస్యలకు సైతం దారితీయొచ్చు. –డాక్టర్ టీవీ మురళీకృష్ణ ,జనరల్ మెడిసిన్ స్పెషలిస్టు రద్దీ రోడ్లపై ప్రయాణంతో మానసిక, శారీరక సమస్యలు రక్తపోటు అధికం అవుతుందంటున్న వైద్యులు యాంగ్జయిటీ, నిద్ర సమస్యలు ఎక్కువే కాలుష్యంతో రక్తం చిక్కపడి స్ట్రోక్కు దారితీయొచ్చు విపరీతంగా పెరిగిపోయిన వ్యక్తిగత వాహనాలు యాంగ్జయిటీకి గురవుతారు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం ద్వారా కొందరు యాంగ్జయిటీకి గురవుతారు. దీనివలన చికాకుతో రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. హైపర్టెన్షన్ బారిన పడతారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టును వినియోగించడం మేలు. –డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్ -
పెడన మున్సిపల్ కమిషనర్పై సీడీఎంఏకు ఫిర్యాదు
పెడన: పెడన మున్సిపల్ కమిషనర్ ఎం.గోపాలరావు పనితీరు సక్రమంగా లేదని, మున్సిపల్ స్థలాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు సీడీఎంఏకు ఫిర్యాదు చేశారు. అమరావతిలోని సీడీఎంఏ కార్యాలయంలో సీడీఎంఏ పి.సంపత్కుమార్ను కలిసి ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ కౌన్సిలర్ కటకం ప్రసాద్ మాట్లాడుతూ పెడన పట్టణ మున్సిపాలిటీకి చెందిన ఆర్ఎస్ నంబర్ 366–1బి లో 18 సెంట్ల స్థలాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుపై సివిల్ అండ్ క్రిమినల్ చర్య తీసుకోవడానికి వీలు లేకుండా మున్సిపాలిటీ స్థలాన్ని అమ్ముకున్న వారికి సపోర్ట్ చేస్తున్న పెడన మున్సిపల్ కమిషనర్ ఎం.గోపాలరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ ఏడాది జనవరి 21న పెడన మున్సిపాలిటీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ గరికిముక్కు చంద్రబాబు తన లేఖ ద్వారా ఒక అంశాన్ని అజెండాలో చేర్చి కౌన్సిల్లో చర్చించి, తీర్మానించి ప్రభుత్వానికి పంపించవలసిందిగా కోరారన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ రిపోర్ట్ నంబర్ 84సి నంబర్ 1241/బి, అండ్ జి/ఈ1– 2025 ప్రకారం ఇది 2017 సెప్టెంబరు 6న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డిపార్ట్మెంట్ పెడన మున్సిపాలిటీకి తెలిపిన విధంగా పెడన మున్సిపాలిటీకి చెందిన ఆర్ఎస్ నంబర్ 366–1 బి లో 18 సెంట్ల తామరచెరువు ప్రభుత్వ స్థలాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. మున్సిపాలిటీకి చెందిన 18 సెంట్ల స్థలాన్ని అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్న వారిపై సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకునే నిమిత్తం కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరామన్నారు. కౌన్సిల్ మీటింగ్లో ఈ విషయాన్ని ఒక అంశంగా చేర్చమని కమిషనర్ ఎం.గోపాలరావుకు పంపించామన్నారు. ఈ విషయమై కమిషనర్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్కు లీగల్ ఒపీనియన్ నిమిత్తం పంపించారని, వారి వద్ద నుంచి ఈ అంశం న్యాయంగానే ఉందని రిపోర్టు ఇచ్చారని సీడీఎంఏకు వివరించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కౌన్సిల్లో కమిషనర్ నోటిఫై చేసి తీసుకురాకుండా కౌన్సిల్ను తీవ్ర అవమానపరిచారని అన్నారు. కౌన్సిల్ సమావేశంలో సభ్యులు పలుమార్లు అడిగినా సమాధానం దాటవేశారని తెలిపారు. అదీ కాకుండా కౌన్సిల్ సభ్యులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ఎండార్స్మెంట్లు పంపించారని తెలిపారు. సదరు కమిషనర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీడీఎంఏను కలసిన వారిలో కటకం ప్రసాద్తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఖాజా, కౌన్సిలర్ చంద్రబాబు, వైఎస్సార్సీపీ నాయకుడు కోమట్ల అనిల్ తదితరులున్నారు. -
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి
ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుహాసిని లబ్బీపేట(విజయవాడతూర్పు): రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రతరమై ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటిద్దాం, వడదెబ్బ వలన సంభవించే మరణాలను అరికడదామని ఆమె పిలుపునిచ్చారు. ఎండ తీవ్రత వలన శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి (104.9 డి.ఎఫ్) మెదడు మీద ప్రభావం చూపుతుందని, దీని వలన మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం (హైపో థలామస్) దెబ్బతిని వడదెబ్బకు గురి అవుతారని చెప్పారు. దీనినే ‘హీట్ స్ట్రోక్‘లేదా ’సన్ స్ట్రోక్ ‘అంటారని, ఇది ప్రమాదకరం, ప్రాణాంతకమని హెచ్చరించారు. వాతావరణపు వేడిమికి శరీరం ఎక్కువసేపు గురికావడం వలన చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోవడం, శరీరంలో నీటి నిష్పత్తి తగ్గిపోవడం సంభవిస్తుందని, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో ఎక్కువ శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు మూడు లేక నాలుగు లీటర్ల నీటిని చెమట రూపంలో మన శరీరం కోల్పోయి వడదెబ్బకు ఎక్కువగా గురవుతారని డాక్టర్ సుహాసిని తెలిపారు. వయస్సు 65 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. -
సుమధురంగా అన్నమయ్య సంకీర్తనం
విజయవాడకల్చరల్: శ్రీ అన్నమయ్య సంకీర్తనా అకాడమీ( శ్వాస), కంచికామకోటి పీఠస్థ శారదా చంద్రమౌళీశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి సందర్భంగా లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నమయ్య జయంతి జాతీయ స్థాయి సంగీత కార్యక్రమాలు మధురంగా సాగుతున్నాయి. మంగళవారం నాటి కార్యక్రమంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు సంగీత విద్యాలయం విద్యార్థినులు, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల విద్యార్థినులు, బంకుమల్లి విద్యాసాగర్, ధూళిపాళ వాసవి అన్నమయ్య రచించిన చక్కని తల్లికి చాంగ్భళా, పలుకుతేనియ తల్లిని, అదివో అల్లదివో శ్రీహరి వాసము, తందనానా ఆహి తందనానాతో పాటు అనేక సంకీర్తనలను అత్యంత మధురంగా ఆలపించారు. చివరిగా మల్లాది సోదరులు అన్నమయ్య పదానికి పట్టం కడుతూ సంకీర్తనలను గానం చేశారు. శ్వాస నిర్వాహకులు సత్యబాబు, ప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సీబీఎస్ఈ ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ విద్యార్థుల ప్రతిభ గుడివాడటౌన్: సీబీఎస్ఈ విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించినట్లు ప్రిన్సిపాల్ సత్యారామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు చెందిన జె.లక్ష్మీ నరసింహ భరద్వాజ్ 490/500, ఎం.అక్షయప్రియ, ఆర్.వివేక్ 488/ 500తో పాటు 480 పైబడి 24 మంది, 475 పైబడి 52 మంది, 470 పైబడి 81 మంది, 460 దాటిన వారు 165 మంది విజయం సాధించారని పేర్కొన్నారు. ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను, సిబ్బందిని, ప్రోత్సహించిన తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యం తరఫునఅభినందించారు. పలు కేసుల్లో నిందితునిపై పీడీ యాక్టు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గంజాయి విక్రయాలతో యువత ఆరోగ్యానికి భంగం కలిగించడంతో పాటు దొంగతనాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అక్బర్ బాషాపై ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించింది. విద్యాధరపురానికి చెందిన అక్బర్ బాషాపై ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో 35 కేసులు ఉన్నాయి. వీటిలో 5 గంజాయి కేసులు, 30 దొంగతనం, దోపీడీ కేసులు నమోదయ్యాయి. భవానీపురం స్టేషన్లోనే 4 గంజాయి కేసులు, 5 దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బెయిల్పై విడుదల అయి వచ్చి తిరిగి గంజాయి విక్రయాలు, దొంగతనాలు కొనసాగిస్తున్నాడు. అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండడంతో ప్రభుత్వం అక్బర్బాషాపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అక్బర్ బాషాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. -
ఘంటసాల శయన ప్రాజెక్టు నిర్మాణానికి కృషి
మంత్రి కందుల దుర్గేష్ ఘంటసాల: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఘంటసాల శయన ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఘంటసాల గ్రామంలోని బౌద్ధ స్థూపం వద్ద బుద్ధుని జయంతి వేడుకలు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు రేగుళ్ల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సోమ వారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో పర్యాటక రంగం అభివృద్ధి చేస్తామన్నారు. నేటి సమాజంలో బుద్ధని బోధనలు అనుసరణీయమన్నారు. బౌద్ధ భిక్షువు భంతే ధమ్మ ధజ థెరోతో కలసి మంత్రి దుర్గేష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రవీంద్ర కుమార్ డప్పువాయిద్యాలు, నృత్య కళాకారులతో కలసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బౌద్ధ భిక్షువులు, కార్యక్రమానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, అధికారులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. జిల్లాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన ఘంటసాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. బుద్ధ విహార్ వద్ద బుద్ధ జయంతి ఉత్సవాలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు రేగుళ్ల మల్లికార్జునరావులతో కలసి గీతాంజలి శర్మ ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా జరిగిన రెండు సదస్సుల్లో బౌద్ధ శాసనాలు, బౌద్ధ నాటకాలు, ఘంటసాల బ్రహ్మీ శాసనాలు, నాటకాలు, సామాజిక ప్రగతి తదితర విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమాల్లో మెప్మా పీడీ సాయిబాబు, డీసీ చైర్మన్ భాను ప్రకాష్, తహసీల్దార్ బి.విజయప్రసాద్, ఎంపీడీఓ డి.సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
డైట్లో 10 మంది అధ్యాపకుల నియామకం
గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరులో ఉన్న ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్)లో పది మంది అధ్యాపకులను నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారిలో తొమ్మిది మంది విధుల్లో చేరారు. డైట్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల్లో చాలా కాలానికి పది మంది స్కూల్ టీచర్లను డెప్యుటేషన్పై నియమించారు. వారిలో ముగ్గురు శనివారం, మరో ఆరుగురు సోమవారం విధుల్లో చేరారు. రాధాకృష్ణ (ఫిలాసఫీ), రాంప్రసాద్ (గణితం), డాక్టర్ మోహనరావు(గణితం), శ్రీనివాస్ (సైన్స్), శివ పార్వతి (సైన్స్), వేణుగోపాల్ (తెలుగు), వెంకట సుబ్బలక్ష్మి (ఇంగ్లిష్), జోజిబాబు (ఇంగ్లిష్), లక్ష్మీనాంచారమ్మ (సైకాలజీ) ఛాత్రోపాధ్యాయులకు పాఠాలు చెప్పనున్నారు. ఈ సందర్భంగా డైట్ సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ పి.వినయకుమార్ నూతనంగా విధుల్లో చేరిన వారికి అభినందనలు తెలిపారు. వారికి కొన్ని సూచనలు చేశారు.ఎన్టీఆర్ జిల్లాలో శిశు మరణాలపై సమీక్షలబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో 2024 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకూ జరిగిన శిశు మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆయా శిశువుల మరణాలపై అంతర్గత శాఖాపరమైన ఆడిట్ నిర్వహించారు. ప్రతి శిశు మరణాన్ని శాసీ్త్రయ దృక్ఫ థంతో విశ్లేషించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని స్పష్టంచేశారు. పోషకాహార, జన్యు, అవగాహనలోపాలు, సామాజిక కారణాలు తదితర వాటిని విశ్లేషించుకోవడం రానున్న రోజుల్లో శిశు మరణాలను నివారించగలమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శిశు మరణాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఐఓ డాక్టర్ శరత్బాబు, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, శిశు మరణాలు జరిగిన ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.వైభవంగా నరసింహ స్వామి తెప్పోత్సవంవేదాద్రి(జగ్గయ్యపేట): జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో తరుకల్యాణ మహోత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి స్వామి తెప్పోత్సవం అంగరంగ వైభ వంగా జరిగింది. ఆలయ సమీపంలోని కృష్ణానదిలో ప్రత్యేకంగా పడవను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణలో స్వామి వారి ఉత్సవ మూర్తులను నదిలో ఊరేగించారు. లోకకల్యాణార్థం ఏటా స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు పరాంకుశం శ్రీధరాచార్యులు, శేషాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సురేష్బాబు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.మండు వేసవిలో మంచు తెరలుచల్లపలి: మండు వేసవిలో మండల కేంద్రమైన చల్లపల్లిలో మంచు తెరలు కనువిందుచేశాయి. వేసవి నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధి కంగా నమోదవుతయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కురిసిన మంచు ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించింది. మండు వేసవిలో మంచు ఇలా మంచు పట్టడంపై ప్రజలు ఒకింత ఆశ్చర్యచకితులయ్యారు. తెల్లవారుజాము నుంచి ఏడు గంటల వరకు మంచు దట్టంగా కురిసింది. -
కళతప్పిన మామిడి మార్కెట్
జి.కొండూరు: మైలవరం మామిడి పండ్ల మార్కెట్ రైతు మార్కెట్గా పేరుగాంచింది. సహజ సిద్ధంగా పండించిన మామిడి పండ్లను రైతులు నేరుగా ఈ మార్కెట్కు తీసుకొచ్చి విక్రయాలు జరుపుతుంటారు. వినియోగదారులతో పాటు చిరు వ్యాపారులు సైతం ఈ మార్కెట్లోనే పండ్లను కొనుగోలు చేస్తుంటారు. మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఈ మామిడి పండ్ల మార్కెట్కి ఇప్పుడు కష్టమొచ్చింది. ఈ ఏడాది పురుగులు, తెగుళ్లు ఆశించి, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మామిడి దిగుబడులు తగ్గిపోయి మార్కెట్ కళ తప్పింది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేక రోడ్ల పక్కనే రైతులు విక్రయాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించి ప్రత్యేక స్థలం కేటాయించి మార్కెట్కు ఊతమిస్తే జిల్లాలోనే అతి పెద్ద మామిడి పండ్ల మార్కెట్గా అవతరించే అవకాశం ఉందని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు.తోటల నుంచి నేరుగా మార్కెట్కు..మైలవరం మామిడి పండ్ల మార్కెట్కు మైలవరం, జి.కొండూరు, విజయవాడరూరల్, రెడ్డిగూడెం, ఎ.కొండూరు మండలాల పరిధిలోని మామిడి తోటల నుంచి రైతులు నేరుగా పండ్లు తీసుకొస్తారు. బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు వంటి పండ్లను ఎక్కువగా విక్రయిస్తారు. రైతులతో పాటు ఈ మార్కెట్లో దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న కొందరు వ్యాపారులు మామిడి తోటలను లీజుకొని పండ్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ మార్కెట్లో స్థిరంగా వ్యాపారం చేసే వ్యాపారులు 50 మంది వరకు ఉండగా రైతులు చుట్టు పక్కల మండలాల నుంచి 200 మంది వరకు వచ్చి మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. మామిడి ప్రారంభంలో వచ్చే కాయలను ప్రయివేటు మార్కెట్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. కాయ ముదిరి పంటకు వచ్చిన తర్వాతనే ఈ మార్కెట్ ప్రారంభమవుతుంది. మైలవరం మామిడి పండ్ల మార్కెట్ ఏప్రిల్ రెండో వారం తరువాత ప్రారంభమై జూన్ రెండో వారం ముగిసే వరకు కొనసాగుతుంది. రైతులు, తోటలు లీజుకు తీసుకున్న వ్యాపారులు నేరుగా విక్రయాలు జరపడం వల్ల నాణ్యమైన, సహజ సిద్ధంగా పండిన పండ్లు వినియోదారుడికి తక్కువ ధరకే లభిస్తాయి. గత ఏడాది వరకు ఈ మార్కెట్లో రోజుకు 15 టన్నుల వరకు పండ్ల విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది దిగుబడి లేకపోవడంతో వ్యాపారం సగానికి పడిపోయింది. ఈ మార్కెట్లో వ్యాపారం మూడు అంచలుగా జరుగుతుంది. రైతులతో పాటు కొంత మంది వ్యాపారులు కూడా పండ్లు విక్రయిస్తారు. హోల్సేల్ ధరలకే వినియోగదారుడికి మామిడి పండ్లు లభిస్తాయి. మైలవరం పశువుల ఆస్పత్రి ఎదురుగా విజయవాడ, భద్రాచలం జాతీయ రహ దారికి ఇరువైపులా మార్కెట్ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చిన్న, పెద్ద రసాలు డజను రూ.150 నుంచి సైజును బట్టి విక్రయిస్తున్నారు. బంగినపల్లి డజను రూ.240 చొప్పున విక్రయిస్తున్నారు.ఈ ఫొటోలోని మహిళ పేరు సందిపాము వెంకట రత్నమ్మ. ఇరవై ఏళ్లుగా మైలవరం మామిడి పండ్ల మార్కెట్లో వ్యా పారం చేస్తోంది. ఈ ఏడాది 12 ఎకరాల తోట లీజుకు తీసుకొని రూ.3 లక్షల వరకు ఖర్చు పెట్టింది. పురుగులు, తెగుళ్లు, పెనుగాలులతో కూడిన అకాల వర్షం వల్లన తీవ్రంగా నష్టపోయింది. లాభం సంగతి అటుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి నష్టపోయింది. అయినప్పటికీ పండ్లను సరసమైన ధరకే విక్రయిస్తోంది. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఈ వ్యాపారానికే అలవాటు పడిపోయానని పేర్కొంటోంది. ప్రభుత్వం పరిహారం అందిస్తే కొంతమేర నష్టాలు తగ్గుతాయని ఆశిస్తోంది. -
మంత్రిని కలవకుండా సీహెచ్ఓలను అడ్డుకున్న పోలీసులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రిని కలుద్దామని వస్తే అడ్డగిస్తారా అంటూ పోలీసులపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్ఓ) ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా సమస్యల పరిష్కారం కోరుతూ సీహెచ్ఓలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వస్తున్నట్లు సీహెచ్ఓలు తెలుసుకున్నారు. తమ సమస్యలను మంత్రికి వివరిద్దామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని కళాక్షేత్రం ఆవరణలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. -
దుర్గమ్మ ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున మూడు గంటలకు నిర్వహించిన సుప్రభాత సేవకు 15 మంది ఉభయదాతలు హాజరయ్యారు. అనంతరం అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చన 32 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తి వద్ద నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొనగా, రికార్డు స్థాయిలో చండీహోమానికి 139కు టికెట్లను విక్రయించారు. రెండు 250 మందికి పైగా భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు అన్నీ కిటకిటలాడాయి. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. -
పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి
పీజీఆర్ఎస్లో డీఆర్వో చంద్రశేఖరరావు చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు ఆదేశించారు. కలెక్ట రేట్లోని సమావేశపు హాలులో సోమవారం పీజీ ఆర్ఎస్ (మీ–కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీఓ కె.స్వాతి, సమగ్ర శిక్ష ఏపీసీ కుమిదిని సింగ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. డీఆర్వో మాట్లాడుతూ.. పెండింగ్ అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుతున్న అర్జీలతో పాటు వివిధ శాఖల వద్ద పరిష్కరించాల్సిన గతంలోని కొన్ని అర్జీలు పెండింగ్లో ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. రక్తహీనత, తలసేమియా బాధితులతో పాటు గర్భిణులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందించేందుకు అవసరమైన రక్తాన్ని సేకరించేందుకు నియోజకవర్గాల వారీగా మండలస్థాయిలో రక్తదాన శిబిరాలను నిర్వహించాలన్నారు. వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అవసరమైన వాటికి సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో అధికారులు 125 అర్జీలను స్వీకరించారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. ● గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలలో ఎంబీఏలో చేరానని, ఆర్థిక సమస్యల కారణంగా చదువును కొనసాగించలేకపోయానని, 2020వ సంవత్సరంలో అడ్మిషన్ల సమయంలో తన వద్ద నుంచి తీసుకున్న సర్టిఫికెట్లను పూర్తి ఫీజు చెల్లించ కుండా ఇవ్వనంటున్నారని తన ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇప్పించాలని పెదపారుపూడి మండలం మహేశ్వరపురం గ్రామానికి చెందిన సీహెచ్. శ్యామన్ అర్జీ ఇచ్చారు. ● తమ గ్రామంలో పంటబోదెలను యంత్రాలతో తవ్వి మట్టిని యథేచ్ఛగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ఉపాధి హామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బందరు మండలం గుండుపాలెం గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. ● మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిలోని మొవ్వ మండలం నిడుమోలు గ్రామం వద్ద సర్వీస్ రోడ్డు సరిగా లేక వాహనదారులు, ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జాతీయ రహదారి అధికారులను అడిగితే స్పందించటం లేదని సర్వీస్ రోడ్డు, డ్రెయిన్ల నిర్మాణం చేయాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. -
సర్దుబాటు ప్రక్రియపై ఉపాధ్యాయుల నిరసన
చిలకలపూడి(మచిలీపట్నం): పాఠశాలల పునఃవ్యవ స్థీకరణ ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చర్య తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం మచిలీ పట్నంలోని ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జీఓ నంబరు 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాని స్థానంలో కొత్త జీఓ విడుదల చేసిన అనంతరం పాఠశాలలను పునః వ్యవస్థీకరించాలని కోరారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1ః20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని పేర్కొన్నారు. అన్ని మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఐదు తరగతులను బోధించడానికి ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. విద్యార్థుల సంఖ్య 75కు మించితే పీఎస్, హెచ్ఎం పోస్టులను అద నంగా కేటాయించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య 130 మించితే ఆరో ఎస్జీటీ, ప్రతి 30 మందికి ఒక ఎస్జీటీని, అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూలు అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మను కలెక్టరేట్లోని సమావేశంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ షౌకత్హుస్సేన్, బి.కనకా రావు, జె.లెనిన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల కళ్లెదుటే కానరాని లోకాలకు..
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): తల్లిదండ్రుల కళ్లెదుట కుమార్తె కానరాని లోకాలకు వెళ్లిపోయింది. కొండపల్లి శ్రామికనగర్కు చెందిన తిరుమలకొండ వీరబాబు, సుచరిత దంపతుల కుమార్తె మహాలక్ష్మి(5) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తిరువూరు సమీపంలోని వల్లంపట్ల గ్రామంలో ఆదివారం రాత్రి శుభకార్యానికి కారులో వెళ్లారు. సోమవారం ఉదయం తిరుగు ప్రయాణంలో ఎ.కొండూరు వద్ద కారును ట్రక్ ఆటో ఢీకొట్టింది. కారులో కూర్చున్న మహాలక్ష్మి (5) మృత్యువాత పడింది. మిగిలిన వారికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరువూరు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె కళ్లెదుటే మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొండపల్లి తీసుకువచ్చిన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలిక మృతి -
వైభవంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. ఇంద్రకీలాద్రి ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద పూలతో అలంకరించిన వాహనాన్ని అధిష్టించిన ఉత్సవమూర్తులకు ఈవో శీనానాయక్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ప్రచార రథంతో పాటు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనం ముందుకు సాగింది. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ, భక్తజనుల కోలాటనృత్యాలు, డప్పుకళాకారులు విన్యాసాల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. ఘాట్రోడ్డు నుంచి ప్రారంభమైన ప్రదక్షిణ కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణవీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరింది. ఆది దంపతులకు పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, పండ్లు సమర్పించి తమ కుటుంబాలు చల్లగా ఉండేలా దీవించాలని వేడుకున్నారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు స్వర్ణకవచాన్ని అలంకరించారు. స్వర్ణకవచంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున అమ్మవారికి స్వర్ణకవచం అలంకరిస్తారు. -
19 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
చిలకలపూడి(మచిలీపట్నం): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో విద్య, వైద్య, ఏపీఎస్ ఆర్టీసీ, పోలీసు, పోస్టల్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో పది అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఆయా శాఖలు సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వహణకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,544 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్, కస్టోడియన్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను ఇప్పటికే నియమించారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, వాటికి సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరవకుండా చూడాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద ముఖ్యమైన ఔషధాలతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను వైద్య సిబ్బంది సిద్ధంగా ఉంచాలన్నారు. అన్ని ఏర్పాట్లు చేయండి పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా నిరంతరాయ విద్యుత్, ఆయా రూట్లలో విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పరీక్షలకు సమాంతరంగా 14 పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలు కూడా జరుగుతాయని, మొత్తంగా 2,307 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో డీఈవో పీవీజే రామారావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డీవో కె.స్వాతి ఇతర అధికారులు పాల్గొన్నారు. 30 పరీక్ష కేంద్రాలు జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖర రావు -
ముగిసిన గడువు.. పూర్తికాని ఈకేవైసీ
పెడన: రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకునే గడువు ముగిసినా.. లక్ష్యం పూర్తి కాలేదు. ఈకేవైసీ చేయని కార్డుదారుల పేర్లు తొలగిస్తారని తెలుస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సవరించి పారదర్శక సేవలు అందిస్తామని అంటూనే ప్రజాభారం తగ్గించుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేషన్కార్డుల్లో సభ్యులను తొలగించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్కార్డులో ఎంత మంది కుటుంబ సభ్యులుంటే అందులోని వారంతా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది. దీనికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుని సంబంధిత రేషన్ డీలర్ల ద్వారా ఈకేవైసీ చేయించారు. దీని గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. అయినా వందశాతం పూర్తి కాకపోవడంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్థానిక అధికారులు వేచి చూస్తున్నారు. 19,905 యూనిట్లకు ఈకేవైసీ చేయాలి ప్రస్తుతం ఇప్పటి వరకు మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో 3,79,692 యూనిట్లు ఉంటే వీటిల్లో 3,59,787 యూనిట్లు ఈకేవైసీ పూర్తయ్యాయి. మిగిలిన 19,905 యూనిట్లు ఈకేవైసీ కావాల్సి ఉంది. వీరు అడ్రస్లలో లేరా లేక స్థానికంగా నివాసం ఉండటం లేదా అనేది తేలాల్సి ఉంది. అదీ కాకుండా వీరి పేరుతో ప్రతి నెలా రేషన్ కూడా పంపిణీ అవుతుందా లేదా అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యులను బట్టి యూనిట్లుగా విభజించారు. ఒక్కో కార్డులో ఒకటి నుంచి ఐదుగురు సభ్యులు వరకు ఉన్నారు. ఐదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేయించాల్సి ఉంది. ఈకేవైసీ చేయని కార్డుదారుల పేర్లు తొలగింపు! పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో 3.79 లక్షలు యూనిట్లు ఇప్పటి వరకు రూ.3.59 లక్షలు ఈకేవైసీ పూర్తి మరో 19 వేల యూనిట్లు పరిస్థితి ఏంటో.. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో యూనిట్లును పరిశీలిస్తే... మండలం మొత్తం ఈకేవైసీ ఈకేవైసీ యూనిట్లు అయినవి కానివి మచిలీపట్నం 1,93,322 1,81,618 11,704 పెడన 57,797 55,148 2,649 గూడూరు 44,334 42,718 1,616 బంటుమిల్లి 40,355 38,471 1,884 కృత్తివెన్ను 43,884 41,832 2,052 మొత్తం 3,79,692 3,59,787 19,905 -
ట్రాక్టర్పై నుంచి జారిపడి డ్రైవర్ మృతి
గూడూరు: మట్టి ట్రాక్టర్పై నుంచి జారిపడిన డ్రైవర్ మరణించిన ఘటన సోమవారం మండల పరిధిలోని మల్లవోలులో చోటు చేసుకుంది. మల్లవోలు శివారు ముదిరాజుపాలెం గరువుకు చెందిన పూల నరసింహ(25) ట్రాక్టర్ డ్రైవర్. వారం రోజులుగా రాయవరం పొలిమేర నుంచి చటారిపాలెంకు ట్రాక్టర్లతో మట్టి తోలకానికి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం చటారిపాలెం మట్టి డంప్ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్పై నుంచి జారి పడిపోయాడు. అతని నడుంపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. నరసింహను తొక్కుకుంటూ వెళ్లిన ట్రాక్టరు చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. వెనుక వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు నరసింహ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవించే పూల శ్రీనుకు ఇద్దరు కుమారులు వారిలో నరసింహ పెద్దవాడు. తన కుమారుడికి పెళ్లి కూడా కాలేదంటూ.. అతను దుర్మరణం చెందడంపై శ్రీను కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
బైక్ దొంగల అరెస్ట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 20లక్షల నగదు, 11 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇటీవల భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సంఘటనా స్థలంలోని ఆధారాలను సేకరించి దర్యాప్తు చేశారు. వెస్ట్ ఏసీపీ దుర్గారావు పర్యవేక్షణలో సీఐ ఉమామహేశ్వరరావు సిబ్బంది బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని అనుమానితులు, పాత నేరస్తులపై నిఘా ఉంచారు. హెచ్బీ కాలనీకి చెందిన గడ్డం శరణ్సాయి, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం డోలాస్ నగర్కు చెందిన బొక్కా కార్తీక్లను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా గొల్లపూడిలోని అట్కిన్సన్ స్కూల్ సమీపంలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకు పంపారు. రూ. 20 లక్షల నగదు, 11 బైక్లు స్వాధీనం -
అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో అప్రమత్తం
చిలకలపూడి(మచిలీపట్నం): వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన అంశాలపై ముద్రించిన కరపత్రాలను ఆమె సోమవారం కలెక్టరేట్లోని సమావేశం హాలులో విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులకు డీ హైడ్రేషన్, సాధారణంగా వచ్చే వ్యాధులతో సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరమన్నారు. వడదెబ్బ నుంచి తట్టుకునేందుకు ప్రతి రోజూ నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. తేలిక పాటి కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. మితంగా భోజనం చేయాలన్నారు. ఎండల్లో బయట తిరగ కూడదని సూచించారు. అతిసార వ్యాధి నుంచి పిల్లలను రక్షించండి అతిసార వ్యాధి నుంచి పిల్లలను రక్షించడానికి చర్యలు చేపట్టాలని గీతాంజలిశర్మ అన్నారు. ఈ వ్యాధి సోకకుండా సబ్బునీటితో చేతులను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. శుభ్రమైన తాగునీటిని ఉపయోగించాలన్నారు. చిన్న పిల్లలకు మొదటి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలను మాత్రమే తాగించాలన్నారు. కార్యక్రమాల్లో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ ఎస్.షర్మిష్ట, ఆర్డీవో కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ -
గడువు ముగిసినా కొనసాగుతుంది
రేషన్కార్డులకు సంబంధించి ఈకేవైసీ గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఏమి రాలేదు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందాలన్నా, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తదితర వాటికి తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రజలు అవగాహనతో ఈకేవైసీ చేయించుకునేందుకు ముందుకు రావాలి. సభ్యులు ఈకేవైసీ చేయించుకోకపోతే నిత్యావసర సరకులు పొందడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకా ఎవరైనా చేయించుకోవాల్సిన వారుంటే తక్షణం ఈకేవైసీ చేయించుకోవాలి. –కె అనిల్కుమార్, ఇన్చార్జి తహసీల్దార్, పెడన -
ప్రజల కోసమే పోలీసులు
కోనేరుసెంటర్: ప్రజల కోసమే పోలీసు వ్యవస్థ పని చేస్తోందని ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా నేరుగా తమను కలిసి న్యాయం పొందవచ్చని కృష్ణా ఎస్పీ ఆర్గంగాధరరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మీకోసమన్నారు. సమస్యల పరిష్కారంలో సిబ్బందిపై ఎలాంటి అవినీతి ఆరోపణలకు పాల్పడినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని అర్జీలను ఫోన్లలో మాట్లాడి పరిష్కరించారు. మిగిలిన అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగిన మీకోసంలో 38 అర్జీలు అందినట్లు ఆయన తెలిపారు. ఎస్పీ గంగాధరరావు -
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులు.. మహిళ బలి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులకు ఓ మహిళ బలైన ఘటన చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామంలో జరిగింది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న అబ్బూరి మాధురిని టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ నోటికొచ్చినట్లు తీవ్ర దుర్భాషలాడారు. అందరి ముందూ దూషించడంతో పాటు దౌర్జన్యం చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన మాధురి.. రవితేజ చేసిన అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.తనపై తీవ్ర దుర్భాషలాడుతూ.. దౌర్జన్యం చేస్తున్నా కానీ ఎవరూ అడ్డుకోలేదని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. తన చావుకు ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ కారణమంటూ మాధురి వీడియోలో పేర్కొంది. తనకు జరిగిన అన్యాయం మరొక మహిళకు జరగకూడదంటూ తన ఆవేదన వెల్లబుచ్చిన మాధురి.. తాను చచ్చిపోతున్నానని.. మరో మహిళకు ఇలాంటి అవమానం జరగకూడదంటూ పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలను సెల్ఫీ వీడియోలో మాధురి వేడుకుంది. -
Hot Summer: చెమట గడ్డలు, ఉడుకు గడ్డలు, నివారణ ఇలా!
లబ్బీపేట(విజయవాడతూర్పు) : వేసవి ఉక్కపోతకు గాలిసోకని టైట్ దుస్తులు తోడవడంతో ఎక్కువ మంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో చర్మవ్యాధుల వైద్యులను సంప్రదిస్తున్న వారిలో ఎక్కువ మంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురైన వారు ఉంటున్నారు. టైట్ దుస్తులు, జీన్స్ వంటివి వేసుకుని పది, పన్నెండు గంటల పాటు ఉంటున్న వారిలో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. వాటికి తోడు వేసవిలో సన్బర్న్, సెగ గడ్డలు, రాష్ వంటివి సోకే అవకాశం ఉందంటున్నారు. నగరంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చర్మవ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి : రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీరవేసవిలో ఇబ్బందే వేసవిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడతాయి. దీంతో చర్మవ్యాధులతో పాటు, ఇతర సమస్యలు తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా సన్బర్న్, రాష్ (చెమట పొక్కులు), చెమట గ్రంథులతో ఏర్పడే గడ్డలు(ఉడుకు గడ్డలు), ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సన్ ఎలర్జీ, ఇతర చర్మవ్యాధులతో పాటు, మహిళలు మంగు వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి : సక్సెస్ అంటే...‘సాఫ్ట్వేర్’ ఒక్కటే కాదు బాస్! ఎండలో తిరిగే వారితో పాటు, ఉక్కపోత ప్రాంతాల్లో ఉండే వారు ఈ వ్యాధులతో ఇబ్బంది పడతారు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బిగుతుగా ఉండే వ్రస్తాలు ధరించే వారికి, స్నానం చేసిన తర్వాత చర్మాన్ని సరిగ్గా తుడుచుకోకుండా వ్రస్తాలు ధరించే వారికి ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. తొడల మధ్య తామరలాగా రావడంతో పాటు, దురదలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వారు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడంతో పాటు, అనంతరం తేమ లేకుండా చర్మాన్ని శుభ్రంగా తుడిచి, వైద్యులు సూచించిన లోషన్స్ రాసి అరికట్టవచ్చు. ప్రస్తుతం ఫంగల్తో ఇబ్బంది పడుతూ వైద్యుల వద్దకూ క్యూ కడుతున్నారు. సన్బర్న్(చర్మం కాలిపోవుట) ఎండలో ఎక్కువగా తిరిగే వారు సన్బర్న్కు గురవుతుంటారు. చర్మంపై కాలినట్లు మచ్చలు ఏర్పడతాయి. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. సన్బర్న్స్కు గురైన వెంటనే వైద్యుని సంప్రదించాలి. నీరు, పానీయాలు సేవించాలి. వైద్యుని సలహా మేరకు సన్ర్స్కీన్ లోషన్స్ వాడి అరికట్టవచ్చు. సెగగడ్డలు ఇవి చెమట గ్రంథులతో ఏర్పడతాయి. అధిక ఉష్ణోగ్రతల్లో ఉండే వారికి ఎక్కువగా వస్తుంటాయి. చిన్న చిన్న సెగగడ్డలుగా వస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. వీటి నివారణకు క్రీమ్స్, పౌడర్స్ అందుబాటులో ఉన్నాయి. వైద్యుని సలహా మేరకు యాంటి బయోటిక్ మందులు వాడాలి. రాష్(చెమట కాయలు) ఎండలో తిరిగే వారికి ఎక్కువగా రాష్ వస్తుంది. గాలి సోకని మందమైన దుస్తులు, సిల్క్ వస్త్రాలు ధరించిన వారు దీని బారిన పడతారు. చర్మం కందిపోయినట్లు అనిపించడం, పొక్కులు వస్తాయి. ఇదీ చదవండి : 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో చర్మవ్యాధులు సోకకుండా జాగ్రత్తలువేసవిలో శరీరానికి మాయిశ్చరైజర్స్, సన్స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ కాకుండా గొడుగు, తలకు టోపీ ధరించాలి. ముఖ్యంగా లూజు దుస్తులు, కాటన్వి వేసుకోవాలి. రాత్రి వేళల్లో సైతం గాలిసోకే ప్రాంతంలో నిద్రించాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అనంతరం శరీరాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. స్నానం అనంతరం చర్మానికి పౌడర్ రాసుకుంటే చెమట పొక్కులు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు.ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకిన వారు వాడే టవల్స్ మరొకరు వాడితే సోకే అవకాశం ఉంది. వాటిని వేడి నీటిలో నానబెట్టి వాష్ చేయాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా తగిన జాగ్రత్తలతో చర్మ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. వేసవిలో పలుచటి లూజుగా ఉండే కాటన్ దుస్తులు వాడాలి. నీరు, నీటిశాతం ఎక్కువగా ఉండే పళ్లు తీసుకుంటే చర్మవ్యాధులు రాకుండా చూడవచ్చు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను నివారించవచ్చు. జిమ్, వాకింగ్, స్పోర్ట్స్కు వెళ్లే వారు, ఆలస్యం చేయకుండా వెంటనే స్నానం చేయాలి. –డాక్టర్ సెంథిల్ కుమార్, చర్మవ్యాధుల నిపుణులు, మొగల్రాజపురం ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర -
తలవంచని అమ్మతనం
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు సుందరి. భార్యాభర్తలు ఇద్దరూ ఇళ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఓ ఆటో ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె ప్రయాణిస్తున్న ఆటో బోల్తా కొట్టడంతో నడుం విరిగింది. నిలబడి పనులు చేయలేని పరిస్థితికి చేరింది. దీంతో ఇద్దరు పిల్లల పోషణ కష్టమైంది. వారి కడుపు నింపేందుకు మనసు చంపుకొని యాచన వృత్తి చేపట్టింది. చక్రాల కుర్చీలో తిరుగుతూ యాచన చేస్తోంది. తాడేపల్లికి చెందిన ఆమె హిందీ, ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడుతోంది. గతంలో ఇళ్లలో పనిచేసే సమయంలో యజవానులతో మాట్లాడే క్రమంలో భాషలు వచ్చాయని చెప్పింది. ప్రభుత్వం స్పందించి సొంత ఇల్లు, చిరు వ్యాపారానికి సాయం చేయడంతోపాటు, ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఇప్పిస్తే తనకు ఆసరాగా ఉంటుందని ఆమె ప్రాథేయ పడుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
పద కవితకు ఆద్యుడు అన్నమయ్య
విజయవాడ కల్చరల్: పద కవితకు ఆద్యుడు అన్నమయ్య అని లబ్బీపేట శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణ బాధ్యుడు డాక్టర్ సీహెచ్ రామ్మోనరావు అన్నారు. శ్రీ వేంకటేశ్వర సంకీర్తనా అకాడమీ(శ్వాస) కంచి కామకోటిపీఠం శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో 8 రోజులపాటు నిర్వహించే జాతీయ అన్నమయ్య సంగీత మహోత్సవాలు లబ్బీపేటలోని శ్రవణ సదనంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. రామ్మోనరావు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలు తెలుగు భాషా వీచికలుగా అభివర్ణించారు. లలిత కళలతోనే మనో వికాసం కలుగుతుందన్నారు. తొలిరోజు నృసింహ జయంతి సందర్భంగా తరికొండ వెంగమాంబ జయంతిని నిర్వహించారు. వెంగమాంబ రచించిన సంకీర్తనలను సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనరసమ్మ, శ్రేష్ట మ్యూజిక్ అకాడమీ విద్యార్థినులు, మానస, లాస్యలు మధురంగా ఆలపించారు. కార్యక్రమాన్ని సంస్థ సభ్యులు సత్యబాలు, ప్రసాద్ నిర్వహించారు. నగరానికి చెందిన పలువురు సంగీత విద్వాంసులు పాల్గొన్నారు. -
ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం
తాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనంలో ఉదయం 9 గంటలకు సర్వగ్రహ దోష నివారణ, దృష్టి దోష నివారణ కోసం లక్ష్మీ నారసింహస్వామి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించామని, సాయంత్రం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్వామి వారి కల్యాణం, మల్లె పుష్పార్చన ఉత్సవాలు నిర్వహించామని అనంతరం తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించామని తెలిపారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
చిలకలపూడి(మచిలీపట్నం): నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎస్ఎస్ఎన్ఎంవీఆర్వీ ప్రసాద్, సహాధ్యక్షుడిగా ఎం. ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా డి. కుమార్, ఎ. కోదండరామ్, కార్యదర్శిగా ఎస్. రాము, సంయుక్త కార్యదర్శులుగా నాగలక్ష్మి, గోపీకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్కే జాబార్, కోశాధికారిగా ఎం. నాగలక్ష్మీలను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన ఆర్. శ్రీనివాస్, కె. కొండయ్య తెలిపారు. గుడివాడలో జాబ్మేళా చిలకలపూడి(మచిలీపట్నం)/గుడివాడ రూరల్: గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలలో ఈ నెల 14వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ ఆదివారం తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనాశాఖ ఆధ్వ ర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్మేళాను నిర్వహిస్తున్నామన్నారు. హెటీరో ల్యాబ్స్ లిమిటెడ్, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ముత్తూట్ ఫైనాన్స్, పతంజలి ఫుడ్స్ తదితర కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ కంపెనీల్లో ఉద్యోగాలకు పదో తరగతి నుంచి పీజీ వరకు పూర్తి చేసి ఉన్న వారు పాల్గొనవచ్చని, వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఎంపికై న వారికి మంచి వేతనంతో పాటు సౌకర్యాలతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వివరాలకు 9848819682, 9666654641లలో సంప్రదించాలన్నారు. ద్వారకాతిరుమల వెంకన్నకు పట్టువస్త్రాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఆలయ ఈవో వీకే శీనానాయక్ ఆదివారం పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల వెళ్లిన దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులను ఆ దేవస్థాన ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులు, దుర్గగుడి ప్రధాన అర్చకులు లింగంభోట్ల దుర్గాప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందించారు. నేడు కలెక్టరేట్లో మాక్డ్రిల్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అగ్ని మాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అగ్ని కీలల్లో, ఉక్కిరిబిక్కిరి చేసే పొగల్లో ఎవరైనా చిక్కుకుంటే ఎలా కాపాడాలి? భూకంపాలు, ఎడతెరపి లేకుండా కురిసే భారీ వర్షాల సమయాల్లో భవనాలు కూలితే ఏమిచేయాలి? అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దీనిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, రవాణా తదితర శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటారని, నగర ప్రజలు కూడా కార్యక్రమాన్ని తిలకించి అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు. పవర్ లిఫ్టింగ్లో షబీనాకు 4 స్వర్ణాలు మంగళగిరి: ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్లో జరుగుతున్న ఏషియన్ జూనియర్ ఎక్యూప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన షేక్ షబీనా 84 కేజీల విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఆదివారం గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధాని వివరాలు చెబుతూ.. ఈ నెల 10వ తేదీన జరిగిన స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 85 కేజీలు, డెడ్ లిఫ్ట్ 180 కేజీలు, ఓవరాల్ 455 కేజీల విభాగాలలో పతకాలు కై వసం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా తెనాలికి చెందిన షబీనా మంగళగిరిలోని పవర్ లిఫ్టింగ్ కోచ్ షేక్ సంధాని వద్ద శిక్షణ పొందుతున్నారు. -
పాపం.. పసుపు రైతు!
కంకిపాడు: బహిరంగ మార్కెట్లో జరుగుతున్న మాయాజాలానికి పసుపు రైతులు నలిగిపోతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరను స్థిరంగా ఉంచుతున్నారు. సన్నకొమ్ములు, పుచ్చులు కనిపిస్తున్నాయంటూ ధరను తగ్గించి అన్నదాతలను లూటీ చేస్తున్నారు. గత రెండు సీజన్లలో ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది కూడా గరిష్ట ధర దక్కుతుందనే ఆశలో అన్నదాతలు ఉన్నారు. దీనికి తోడు పంటను నిల్వ చేసుకునే సన్నాహాల్లో ఉన్నారు. కష్ట, నష్టాలకోర్చి సాగు.. ప్రధాన వాణిజ్య పంటల్లో పసుపు ఒకటి. దీన్ని ఈ ప్రాంత రైతాంగం పచ్చబంగారంగా పిలుస్తారు. ఈ సీజన్లో కృష్ణాజిల్లా వ్యాప్తంగా 5,031 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 707 ఎకరాల్లో పంటను సాగు చేశారు. ప్రధానంగా కడప మైదుకూరు, ప్రగతి, శీలం, ఇతర స్థానిక విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నారు. ఎకరాకు రూ.1.70 లక్షలు వరకూ పెట్టుబడులు పెట్టారు. భారీ వర్షాలు, వరదలతో సాగు ఆరంభంలో పంటకు నష్టం జరిగింది. ఆటు పోట్లను అధిగమించి రైతులు పంటను సంరక్షించుకున్నారు. వర్షాల కారణంగా అక్కడక్కడా దుంప పుచ్చు ఆశించింది. పచ్చి పసుపు 60–70 పుట్టు (పుట్టు అంటే 225 కిలోలు) వరకూ దిగుబడి వచ్చింది. ఉడకబెట్టి, ఎండబెట్టిన పిదప 22 క్వింటాళ్ల నుంచి గరిష్టంగా 26 క్వింటాళ్ల వరకూ దిగుబడులు చేతికందాయి. సిండికేట్తో రైతులకు కష్టాలు.. ఈ ఏడాది పంట చేతికొచ్చిన మార్చి, ఏప్రిల్ నెలల్లో క్వింటా పసుపు కొమ్ములు రూ. 9,100 పలికింది. ఇంకా ధర పెరుగుతుందని అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. రూ. 11,500 వరకూ చేరింది. అయితే గడిచిన 20 రోజులుగా క్వింటా పసుపు కొమ్ముల ధర రూ. 11వేల మీదే నిలిచిపోయింది. ధర పెరగకుండా వ్యాపారుల సిండికేట్ అడ్డు పడుతోందని రైతులు భావిస్తున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంట నాణ్యత దెబ్బతినటం, ఊట సరిగా ఊరకపోవటంతో కొమ్ములు నాణ్యంగా ఉన్నప్పటికీ సైజు సన్నగా ఉండటాన్ని వ్యాపారులు సాకుగా మార్చుకున్నారు. అక్కడక్కడా పుచ్చు, కొమ్ములు సన్నంగా ఉన్నాయని ధరను తగ్గించేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా మార్చుకుని ధర నిర్ణయం చేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. సన్నం, పుచ్చు నెపంతో క్వింటా రూ. 9వేల నుంచి రూ. 11వేల లోపు చెల్లిస్తూ అన్నదాతను నిట్టనిలుపునా ముంచేస్తూ వ్యాపారులు తమ జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు బహిరంగ మార్కెట్లో వినిపిస్తున్నాయి. సిండికేట్ అయి కొను‘గోలుమాల్’ నాసిరకం పేరుతో ధర తగ్గింపు రూ. 9వేల నుంచి రూ. 11వేలు పలుకుతున్న ధర 20 రోజులుగా ధరను స్థిరంగా ఉంచుతున్న వైనం ధర పెరుగుతుందనే ఆశలో అన్నదాతలు పంటను నిల్వ చేసుకునేందుకు సన్నాహాలు ధర పెరగకుండా వ్యాపారుల మాయాజాలం -
‘ప్రొటోకాల్’కు టికెట్లు తప్పనిసరి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘ప్రొటోకాల్, అంతరాలయ దర్శనాలకు టికెట్లు తప్పని సరి చేయండి.. సిఫార్సులపై వచ్చే వారి ఆధార్ నంబర్లతో పాటు వారిని ఎవరు పంపారనే వివరాలు పుస్తకంలో నమోదు చేయండి.. గతంలో ఏం జరిగిందో నేను అడగను.. ఇకపై తప్పనిసరిగా ఇవి చేయండి’ అని దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం దుర్గగుడిపై భక్తుల రద్దీ అధికంగా ఉండటంలో కీలక ప్రదేశాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్ పాయింట్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు గుంపులు గుంపులుగా ఉండటాన్ని గమనించి పరిశీలించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, అధికారుల పేరిట వచ్చిన వారిగా గుర్తించి టికెట్లపై ఆరా తీశారు. ప్రొటోకాల్ ఉన్న వారికి ప్రస్తుతం జరుగుతున్న విధానాన్ని స్వస్తి పలికి, ఇకపై ప్రతి ఒక్కరికీ ఒక టికెటు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అవసరమయితేనే దేవస్థాన సిబ్బంది ప్రొటోకాల్ దర్శనాలకు రావాలని సూచించారు. అనంతరం టికెట్ చెకింగ్ పాయింట్ వద్ద అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో వస్తున్న భక్తులతో మాట్లాడారు. సమాచార కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడిన ఈవో సిఫార్సులపై దర్శనానికి విచ్చేసే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుతో పాటు సిఫార్సు చేసిన వారి వివరాలు నమోదు చేయాలని సూచించారు. మహా మండపంలో తనిఖీలు.. మహా మండపం 7వ అంతస్తులోని దేవస్థాన మైక్ ప్రచార కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎస్పీఎఫ్ సిబ్బంది చాంబర్లో తనిఖీలు నిర్వహించిన ఆయన డ్యూటీ చార్ట్ను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో ప్రాంగణంలో దేవస్థాన ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత మజ్జిగ పంపిణీని పరిశీలించి, భక్తులకు పంపిణీ చేశారు. -
కవులు సమాజాన్నిఅధ్యయనం చేయాలి
విజయవాడ కల్చరల్: కవులు సమాజాన్ని అధ్యయనం చేయాలని కవి నగ్నముని అన్నారు. లలిత పబ్లికేషన్స్ ప్రచురించిన రాధాకృష్ణ కరి రచించిన లైఫ్ డ్రామా, అమూల్యాచందు రచించిన భూమినవ్వడం చూశాను కవితా సంపుటాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని బాలోత్సవ్ భవన్లో ఆదివారం నిర్వహించారు. నగ్నముని మాట్లాడుతూ యువ కవుల చేతులో కవిత్వం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. సమాజాన్ని చైతన్య పరిచే అంశాలు అందులో కనిపిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ శాంతి శ్రీ అమూల్యాచందు రచించిన భూమి నవ్వడం చూశాను పుస్తకాన్ని సమీక్ష చేస్తూ అమూల్య కవిత్వంలో సమాజ ప్రేరేపిత అంశాలు కనిపిస్తాయన్నారు. కవిత్వంలో ఆమె వాడిన పదాల కూర్పు, పదబంధాలు ఆలోచింప చేస్తాయన్నారు. రాధాకృష్ణ కవిత్వాన్ని కవయిత్రి వాణిశ్రీ నైనాల సమీక్షించారు. సీనియర్ కవి వసీరా సుధామురళి ప్రసంగించారు. నగ్నముని కవితా సంపుటాలను ఆవిష్కరించారు. పదోన్నతులు కల్పించండి ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు వీకేఎన్ జయలక్ష్మి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో 28 ఏళ్లుగా ఉద్యోగోన్నతి లేకుండా చేస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని ఏపీ ఉమెన్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వీకేఎన్ జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ హాల్లో ఆదివారం సంఘ సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ నుంచి సూపర్వైజర్లుగా పదోన్నతి కల్పించాలన్నారు. 2211 హెడ్ కింద పని చేస్తున్న ఎంపీహెచ్ఏ(ఎఫ్)లకు ఐదేళ్లుగా రవాణా భత్యాలు లేవన్నారు. ప్రభుత్వం స్పందించి రవాణాభత్యం ఇప్పించాలని కోరారు. రెగ్యులర్ ఎంపీహెచ్ఏ(ఎఫ్) రీడిప్లాయ్మెంట్ రద్దు చేసి బదిలీలు చేయాలని కోరారు. ఫీల్డ్ స్టాఫ్కు ఎఫ్ఆర్ఏ రద్దు చేయాలని కోరారు. నర్సెస్ డే సందర్భంగా ఏఎన్ఎంలను ఘనంగా సత్కరించారు. సమావేశంలో ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రమీల, ఎస్వీ మహాలక్ష్మి, బి.విమల, కె.మురళీకృష్ణ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
చర్మవ్యాధులు సోకకుండా జాగ్రత్తలు
● వేసవిలో శరీరానికి మాయిశ్చరైజర్స్, సన్స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. ● ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ కాకుండా గొడుగు, తలకు టోపీ ధరించాలి. ● ముఖ్యంగా లూజు దుస్తులు, కాటన్వి వేసుకోవాలి. ● రాత్రి వేళల్లో సైతం గాలిసోకే ప్రాంతంలో నిద్రించాలి. ● గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అనంతరం శరీరాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ● స్నానం అనంతరం చర్మానికి పౌడర్ రాసుకుంటే చెమట పొక్కులు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు. ● ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకిన వారు వాడే టవల్స్ మరొకరు వాడితే సోకే అవకాశం ఉంది. వాటిని వేడి నీటిలో నానబెట్టి వాష్ చేయాలి. -
హైకోర్టు మాజీ ఏజీపీ నాగభూషణం మృతి
జగ్గయ్యపేట అర్బన్: వైఎస్సార్ సీపీ నాయకుడు, సీనియర్ న్యాయవాది, హైకోర్టులో ఏజీపీగా సేవలందించిన అమృత నాగభూషణం(60) అనారోగ్యానికి గురై ఆదివారం ఉదయం జగ్గయ్యపేటలో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగభూషణం మరణం వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు.. మృతుడు నాగభూషణం నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు వట్టెం మనోహర్, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపాగ సుందరరావు, న్యాయవాది పసుపులేటి సత్యశ్రీనివాసరావు, పార్టీ పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి గొట్టిపాళ్ల సురేష్, ప్రచార విభాగం అధ్యక్షుడు గోగుల వెంకయ్య ఉన్నారు. న్యాయవాదుల నివాళులు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్, న్యాయవాది నాగభూషణం ఆకస్మిక మృతిపై బార్ కౌన్సిల్ తరఫున పలువురు న్యాయవాదులు నివాళులర్పించారు. సీనియర్ న్యాయవాది రాయపూడి శ్రీనివాసరావు, బార్ మాజీ అధ్యక్షుడు అన్నెపాగ కాంతారావు, న్యాయవాదులు గోనెల వెంకటేశ్వర్లు, దామాల సంతోష్, మన్నెపల్లి బసవరాజు, ఆరేపల్లి వెంకటేశ్వర్లు, ఆలేటి కిషోర్, అన్నెపాగ కిషోర్బాబు తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
అదును చూసి మట్టి అక్రమ తవ్వకాలు
సెలవు రోజులే లక్ష్యంగా తవ్వేస్తున్న మట్టి మాఫియా ఘంటసాల: మండలంలో మట్టి మాఫియా అదును చూసి అక్రమ తవ్వకాలు చేపడుతోంది. సెలవు రోజులే లక్ష్యంగా అర్ధరాత్రులు హడావుడిగా మట్టి తవ్వేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి ఘంటసాల మండలం తెలుగురావుపాలెం శివార్లలో రాత్రికి రాత్రే మట్టి తవ్వకాలు చేశారు. తెల్లవారి ఆదివారం మట్టి తవ్వకాలు చూసి గ్రామస్తులు నివ్వెరపోతున్న పరిస్థితి నెలకొంది. ఘంటసాల గ్రామంలోని మల్లంపల్లి రోడ్డులో శనివారం రాత్రి టిప్పర్లతో భారీగా మట్టిని తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘంటసాల మండలంలో సెలవు రోజే లక్ష్యంగా జరుగుతున్న మట్టి మాఫియా ఆగడాలను అధికారులు అరికట్టాలని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మైలవరం బైపాస్ రోడ్డులో జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం మైలవరం గ్రామానికి చెందిన పజ్జూరు శివనారాయణ(55) ద్విచక్ర వాహనంపై పశువుల మేతకు గడ్డి తీసుకువస్తున్నాడు. ఎ.కొండూరు మండలం చీమలపాడు నుంచి కూరగాయల లోడుతో విజయవాడ వెళుతున్న నాలుగు చక్రాల ఆటో వాహనానికి గేదె అడ్డు వచ్చింది. దీంతో గేదెను తప్పించబోయి ద్విచక్ర వాహనానికి ఆటో తగిలింది. ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివనారాయణ రోడ్డుపై పడిపోయాడు. అతని తలకు బలమైన దెబ్బ తగలడంతో ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. నాలుగు చక్రాల ఆటోను స్థానికులు అడ్డుకుని నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మహిళలపై పోలీసుల తీరు అమానవీయం
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో మహిళలపై పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా విడదల రజనిపై పోలీసులు ప్రదర్శించిన తీరే నిదర్శనమన్నారు. వారి వైఖరిని ఖండిస్తున్నామన్నారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు దేశంలో యుద్ధవాతావరణం నెలకొంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా కట్టడి చేయాలి, ఎలా కక్ష తీర్చుకోవాలనే దానిపై దృష్టి పెట్టినట్లు ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రజని విషయంలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే రౌడీల్లా వ్యవహరించడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో ఆ ఘటనే ఉదాహరణ అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్టంలో చేసిందేమీ లేదన్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన ఎటు పోతోందో అర్థం కావడం లేదని, బీసీ, దళిత మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించారన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలని, తప్పనిసరిగా చట్టం ముందు నిలబడి మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
చెరువులో దూకి వాచ్ మెకానిక్ ఆత్మహత్య
గన్నవరం: కోనాయి చెరువులో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఇస్లాంపేటకు చెందిన మొఘల్ అన్వర్(60) వాచ్ మెకానిక్.. రెండేళ్ల క్రితం అతని భార్య మృతి చెందగా, అప్పటి నుంచి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కోనాయి చెరువులోని పైలెట్ ప్రాజెక్ట్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువు గట్టుపై అతని సైకిల్, చెప్పులు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీధర్, సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమారై ఉన్నారు. బైక్ ఢీ.. వ్యక్తి మృతి మక్కపేట(వత్సవాయి): బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోళ్ల నాగేశ్వరరావు(45) పంచాయతీ కార్యాలయంలో కొంతకాలంగా స్వీపర్గా చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అతన గోపినేనిపాలెం రహదారివైపు నడుచుకుని వెళ్తుండగా చిల్లకల్లు వైపు నుంచి వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి నాగేశ్వరరావును ఢీకొట్టింది. ఘటనలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. ఘటనపై ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్ 10 కేజీల గంజాయి స్వాధీనం మధురానగర్(విజయవాడసెంట్రల్): గంజాయి విక్రయించడానికి సిద్ధంగా ఉన్న ఐదుగురు యువకులను ఆదివారం గుణదల పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుణదల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎం. ఏడుకొండల గుణశేఖర్, కె.సాయి నితిన్, కొత్తపల్లి వసంత కుమార్, వల్లపు మణికంఠ, కట్ట గోపి ఐదుగురు స్నేహితులు. వీరు మధురానగర్లో ఒక రూమ్లో ఉంటే వేర్వేరు పనులు చేస్తుంటారు. వీళ్లు జల్సాలు, మద్యం, గంజాయికి బానిసయ్యారు. వీరికి డబ్బులు సరిపోక గంజాయి కొని తీసుకొచ్చి ఇక్కడ అధిక లాభానికి అమ్ముదామని ఆలోచనతో ఐదుగురూ ఒడిశా వెళ్లి అక్కడ మారుమూల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొని తీసుకువచ్చారు. గుణదల రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయిని ఐదుగురు పంచుకొనడానికి రాగా ముందస్తు సమా చారం మేరకు గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీను, గుణదల సిబ్బంది ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వారి నుంచి 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. అనుమానాస్పద మృతిపై కేసు కంకిపాడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కంకిపాడు పోలీస్స్టేషన్లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కంకిపాడుకు చెందిన సాయిరాం వరప్రసాద్ సింగ్(62) బ్యాంక్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. అతనికి వివాహమైంది. కుమారై ఉన్నారు. అతని భార్య సుమారు ఐదేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగా నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన సింగ్ అనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురై అపార్ట్మెంట్ కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 10వ తేదీ జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులు కంకిపాడు పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. -
ప్రీ వెడ్డింగ్ షూట్కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
పిడుగురాళ్ల: పట్టణ శివారు అయ్యప్పస్వామి దేవస్థానం వద్ద హైవే పక్కనున్న సేఫ్టీ రెయిలింగ్ను కారు ఢీకొట్టిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొండాపూర్కు చెందిన బాణావత్ అరవింద్, సోనియాల వివాహం ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్కు కోసం చీరాల సముద్ర తీరానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పక్కనున్న రెయిలింగ్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురి గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేశారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి నెలకొంది. దుర్గామల్లేశ్వరస్వామివార్లను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆదిదంపతులకు జరిగిన పలు ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమం, లక్ష కుంకుమార్చన విశేషంగా జరిగాయి. లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్లలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు త్వరత్వరగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారి ఆలయంలో సూర్యోపాసన సేవ జరిగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, అనంతరం పల్లకీ సేవలోనూ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మోపిదేవిలో..మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. తెల్లవారుజాము నుంచే తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. నాగపుట్ట, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
విద్యార్థులకు స్వేచ్ఛనిద్దాం
జగ్గయ్యపేటకు చెందిన హారికకు చిన్నప్పటి నుంచే లెక్కలు అంటే ఇష్టం. ఇంజినీరింగ్ చేయాలన్నది ఆమె కోరిక. తల్లిదండ్రులకు కుమార్తెను డాక్టరుగా చూడాలనుకున్నారు. ఆ తపనతో వారు ఆమెను బైపీసీలో బలవంతంగా చేర్పించారు. పాస్ మార్కులతో గట్టెక్కడంతో మెడిసిన్లో సీటు రాలేదు. అప్పటికిగానీ తల్లిదండ్రులు వారి తప్పును తెలుసు కోలేకపోయారు. ● పిల్లల భవిత.. పెద్దల బాధ్యత ● గ్రూపుల ఎంపికలో పిల్లలకు స్వేచ్ఛనివాలంటున్న విద్యావేత్తలు ● తల్లిదండ్రుల నిర్ణయాలతో పిల్లలకు కష్టాలు ● వారి ఇష్టాన్ని గుర్తించాలంటున్న విద్యావేత్తలు ● బలవంతం చేస్తే మొదటికే మోసం మచిలీపట్నానికి చెందిన కుమార్కు ఆర్ట్స్ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషల్ సంబంధిత సబ్జెక్ట్లపై మంచి పట్టుసాధించాడు. గ్రూప్స్ రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్ గ్రూపులో చేరాలనుకున్నాడు. ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. అతను చదవలేక ఫెయిలయ్యాడు. గుడివాడకు చెందిన గణేష్కు చిన్నతనం నుంచే సీఏ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో కొడుకును ఇంజినీరుగా చూడాలనుకున్నారు. అతన్ని బలవంతంగా ఎంపీసీలో చేర్పించారు. అయిష్టంతో చదివిన అతను ఎంపీసీని పాస్ మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాడు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్లో గ్రూపులు ఎంచుకునే స్వేచ్ఛను పిల్లలకివ్వాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రుల ఒత్తిడితో మక్కువ లేని సబ్జెక్టులు తీసుకుని చదవలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంటర్ ప్రవేశ సమయంలో తల్లిదండ్రుల బల వంతంతో కొందరు, గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచనతో మరికొందరు ఇష్టం లేని గ్రూపుల వైపు అడుగులేసి చతికిలపడుతున్నారు. ఇంటర్ కీలకం విద్యార్థి దశలో ఇంటర్ కీలకం. ఈ దశలో పడిన అడుగు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పది పరీక్షలు రాసి ఇంటర్ ప్రవేశాల కోసం వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. పిల్లల ఆసక్తి తెలుసుకుని ప్రోత్సహించాలి. అప్పుడే వారు రాణించగలుగుతారు. ఇష్టాన్ని గుర్తించాలి పిల్లల ఇష్టాలను పక్కనబెట్టి డాక్టర్, ఇంజినీర్ చేయాలని తల్లిదండ్రులు కలలుకంటున్నారు. తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతున్నారు. మేము చెప్పే కోర్సులను తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో విద్యార్థులు వారి ఆసక్తిని పక్కనబెట్టి తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి రాణించలేకపోతున్నారు. పిల్లల ఇష్టాన్ని గుర్తించినప్పుడే రాణిస్తారన్న సత్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని మానసిక శాస్త్రవేత్తలు హితవు పలుకుతున్నారు. జిల్లాలో పది ఉత్తీర్ణులైనవారు 41,260 మంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో 48,243 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 41,260 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కొందరు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో చేరడానికి సన్నద్ధమవుతున్నారు. ఇంకొందరు ప్రభుత్వ కళాశాలల్లో చేరనున్నారు. మరికొందరు పాలిటెక్నిక్, ఏపీఆర్ జేసీ వంటి పోటీ పరీక్షలతో ఆయా కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పాస్ మార్కులతో గట్టెక్కిన విద్యార్థులు తక్కువ సమయంలో ఉపాధి లభించే ఐటీఐ, ఒకేషనల్ కోర్సులను ఎంచుకుంటున్నారు. సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ఇప్పటికే విద్యార్థులు ప్రణాళిక రచించుకున్నారు. ఇలాంటి సమయంలో ఏది ఉత్తమం, ఏ కోర్సులు తీసుకోవాలి వంటి సలహాలు ఇవ్వడం వరకే తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావించాలి. గ్రూపుల ఎంపికలో పిల్లలకు స్వేచ్ఛ నివ్వాలని నిపుణులు చెబుతున్నారు. -
చెరువు తవ్వకాలు నిలిపివేత
కృత్తివెన్ను: మండలంలోని నిడమర్రు పంచాయతీ పరిధిలో జరుగుతున్న చెరువు తవ్వకాలను నిలిపివేసినట్లు డెప్యూటీ తహసీల్దార్ శశికుమార్ తెలిపారు. అక్రమ చెరువుల తవ్వకాలపై శనివారం ‘కన్నేసి..తవ్వేసి’ శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. ఎంఆర్ఐ మాధవి, వీఆర్వోలు నాగరాజు, దుర్గ క్షేత్రస్థాయికి వెళ్లి పనులు నిలిపివేయించారు. ఇకపై పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని డీటీ హెచ్చరించారు. ఎన్టీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్లోని రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం ఒకటో యూనిట్ సాంకేతిక లోపంతో నిలిచింది. దీంతో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఆ తర్వాత కొంతసేపటికి 8వ యూనిట్లోని బాయిలర్ ట్యూబ్ లీకవడంతో యూనిట్ను షట్డౌన్ చేయడానికి ఇంజినీర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎర్త్ అయ్యి ఒక్కసారిగా ప్లాంటు మొత్తం నిలిచి పోయింది. ఈ పరిణామాలతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి ఆగిపోయింది. రెండు యూనిట్లో మొత్తం 1,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇంజినీరింగ్ అధికారులు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మరమ్మతులు చేసినా రెండు ప్లాంట్లు వినియోగంలోకి రాలేదని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం విమానాశ్రయం(గన్నవరం): ఇండియా–పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయం ప్రవేశం వద్ద వాహనాలను క్షుణంగా తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. ప్రయాణికులను మాత్రమే ఎయిర్పోర్ట్లోకి పంపిస్తున్నారు. విమానాశ్రయ సందర్శనకు వచ్చే విజిటర్లను భద్రత కారణాల దృష్ట్యా లోపలికి అనుమతించడం లేదు. టెర్మినల్లో ప్రయాణికులు, వారి లగేజీని పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పోలీస్ భద్రతను పెంచడంతో పాటు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. 13న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్–16 బాలుర క్రికెట్ జట్టును ఈ నెల 13వ తేదీ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎంపిక చేస్తున్నట్లు కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2009 సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, వైట్ డ్రస్, స్పోర్ట్స్ షూస్, సొంత కిట్తో ఆ రోజు ఉదయం ఏడు గంటలకు ఎంపిక ప్రాంగణంలో సంప్రదించాలని సూచించారు. జట్టుకు ఎంపిౖకైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. డ్రెస్ కోడ్ పాటించరే..! పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట): పెనుగంచి ప్రోలులోని తిరుపతమ్మ ఆలయ ఈఓ బి.హెచ్.వి.ఎస్.ఎన్.కిషోర్కుమార్ శనివారం డ్రెస్ కోడ్ పాటించకుండానే అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణకు భిన్నంగా వన్థర్డ్ (షార్ట్), టీషర్టుతో అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు ఆలయ పరిసరాలను సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆలయ ఉద్యోగులు అందరూ తెల్లని సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంది. ఉద్యోగులందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన ఆలయ కార్య నిర్వాహణాధికారే డ్రెస్ కోడ్ పాటించకపోవడంపై భక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు. -
విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సురేష్ సాధారణ విద్యార్థి. పదో తరగతి పాస్ మార్కులతో గట్టెక్కాడు. గణితం, సైన్సు సబ్జెక్టులపై పట్టు లేదు. అయితే స్నేహితులు ఎంపీసీ, బైపీసీ తీసుకోవడంతో తాను గొప్పగా చెప్పుకోవడానికి ఎంపీసీని ఎంచుకున్నాడు. సబ్జెక్టులు కష్టం కా
బలవంతం చేయడం సరికాదు విద్యార్థులను సాధ్యమైనంత వరకూ వారికి నచ్చిన గ్రూపులోనే చేర్పించాలి. పదో తర్వాత ఇంటర్ మీడి యెట్ ప్రవేశంలో పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. వారికి నచ్చిన కోర్సుల్లో చేరేందుకు సహకరించాలి. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను చెప్పడం వరకే సరి పెట్టుకోవాలి. వారి అభిప్రాయాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకూడదు. ఇరుగుపొరుగు పిల్లలతో పోల్చకూడదు. –డాక్టర్ డి. కై లాసరావు, విద్యావేత్త ● ఒత్తిడి పెట్టడంతో ఇబ్బందులే పిల్లల అభిప్రాయాలు తెలుసుకోకుండా చదవాలంటూ ఒత్తిడి పెట్టడితే ఇబ్బందులు తలెత్తుతాయి. పిల్లల సామర్థ్యాలను తెలుసుకోవాలి. –డాక్టర్ ప్రసాద్బాబు, సైకాలజిస్ట్, అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్, ఇగ్నో -
సైనికుల త్యాగాలు మరువలేనివి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వీర జవాన్ మురళీనాయక్కు నివాళులర్పిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం (సామాజిక న్యాయ మహా శిల్పం) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి.. మురళీనాయక్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన చేసి రెండు నిముషాలు మౌనం పాటించారు. వుయ్ స్టాండ్ విత్ ఇండియన్ ఆర్మీ, మురళీ నాయక్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ యుద్ధంలో మురళీనాయక్ మరణించాడన్న వార్త తెలిసిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారని, ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారన్నారు. ఈనెల 13న వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా మురళీనాయక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదారుస్తారన్నారు. మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసుల దాడి దుర్మార్గమన్నారు. రజనిపై పోలీసుల దాడి అమానుషం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీ మహిళ, మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. సెంట్రల్ సమన్వయకర్త మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ● వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటాం -
గంజాయి విక్రేత మనోజ్పై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అమలు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): గంజాయి సరఫరా, పలు చోరీ కేసుల్లో నిందితుడైన నగరానికి చెందిన తుమ్మల మనోజ్పై నగర పోలీసులు పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అమలు చేశారు. విజయవాడ నగరంతో పాటు పలు జిల్లాల్లోని విద్యాసంస్థల వద్ద గంజాయి విక్రయిస్తూ యువతను మత్తుకు బానిసలు చేయడమే లక్ష్యంగా పనులు నిర్వహించడం ఇతని నైజం. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఆర్పీ రోడ్డులో నివాసముండే తుమ్మల మనోజ్పై 2011లో తొలిసారిగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసు నమోదైంది. ఆ తరువాత 2012లో మరో కేసు నమోదు కాగా అప్పటి నుంచి వరుసగా గంజాయి విక్రయిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. సత్యనారాయణపురం, వన్టౌన్, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, భవానీపురం, కృష్ణలంక, పటమట, మాచవరం, పట్టాభిపురం, నూజివీడు టౌన్, విశాఖపట్నంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 28 సార్లు గంజాయి అమ్ముతూ పట్టుబడి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడు. బెయిల్పై బయటకు వచ్చిన తరువాత కూడా తన నేర ప్రవృత్తిని కొనసాగించేవాడు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగ జేస్తున్నందున అతనిపై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్–1988 అమలు చేస్తూ పోలీసుశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగర ఇన్చార్జి పోలీసు కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వుల మేరకు శనివారం పశ్చిమ ఏడీసీపీ జి.రామకృష్ణ పర్యవేక్షణలో నార్త్ ఏసీపీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ సిబ్బందితో కలిసి మనోజ్ను అదుపులోనికి తీసుకున్నారు. న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. -
జల్లు స్నానాలకూ అవకాశం లేదు !
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సార్ కృష్ణా నదిలో నీళ్లు అడుగు ఎత్తు కూడా లేవు.. కనీసం జల్లు స్నానాలు చేసేందుకు కూడా అవకాశం లేకుండా ఉందని పలువురు భక్తులు దుర్గాఘాట్లో పుణ్యస్నానాల గురించి ఈవో వీకే శీనానాయక్ ఎదుట ఏకరువు పెట్టారు. నదీ తీరంలో ఉన్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. కృష్ణమ్మ చెంతనే ఉన్నా భక్తులు నీళ్లు కొనుక్కొవాల్సి వస్తుందని మరో మహిళా భక్తురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సార్ బట్టలు మార్చుకునేందుకు గదులు కట్టారు.. అందులో క్షణం కూడా ఉండలేని పరిస్థితి.. ఉక్కపోతతో అల్లాడుతున్నామని.. కనీసం గదులకు మరమ్మతులు చేయించాలని మరో భక్తురాలి విన్నపం... దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ దుర్గాఘాట్, కేశ ఖండనశాల, హెడ్ వాటర్ వర్క్స్ వద్ద కొండ ప్రాంతం, శివాలయం, యాగశాల, నూతన పూజా మండపాలు, జమ్మిదొడ్డిలోని దేవస్థాన భవనాలను శనివారం పరిశీలించారు. ఒకరిపై మరొకరు..! దుర్గాఘాట్కు చేరుకున్న ఈవో శీనానాయక్కు పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నదీలో నీటి మట్టం తగ్గినా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయలేదు సార్ అని వివరించగా, ఈవో దానిపై ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. అయితే షవర్లకు నీటిని పంపింగ్ చేసేందుకు విద్యుత్ సదుపాయం లేదని చెప్పారు. దీంతో ఎలక్ట్రికల్ విభాగం సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆలయ ఎలక్ట్రికల్ సిబ్బంది విద్యుత్ లైన్లను పరిశీలించగా, మోటార్లు పని చేయడం లేదని తేలింది. ఇదే విషయాన్ని ఈవో దృష్టికి తీసుకువెళ్లగా, అసలు వేసవి కాలం మొదలైన తర్వాత మోటార్లను తనిఖీ చేశారా అని ప్రశ్నించారు. మరో భక్తురాలు స్నానఘాట్లో తాగునీటి ఇబ్బంది గురించి ఫిర్యాదు చేశారు. నదీ తీరం పక్కనే ఉన్నా తాగేందుకు నీళ్లు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈవో ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా స్నానఘాట్లో పూజా సామగ్రి విక్రయించే వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించారు. దుస్తులు మార్చుకునే గదులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పూజా మండపం, యాగశాల పరిశీలన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పూజా మండపం, యాగశాలలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఈవో శీనానాయక్ ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని నూతన నిర్మాణాలతో పాటు మరమ్మతులకు గురైన అర్చక క్వార్టర్స్, వాటర్ ట్యాంక్లను పరిశీలించారు. వాటర్ ట్యాంక్లను ఎప్పుడు శుభ్రం చేసింది వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం దుర్గాఘాట్కు ఎదురుగా ఉన్న కేశ ఖండన శాలను పరిశీలించి ప్రతి నిత్యం ఎంత మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.. తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవో వెంట ఈఈలు కోటేశ్వరరావు, వైకుంఠరావు, ఏఈలు కుటుంబరావు, మస్తాన్రావు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నదీ తీరం పక్కనే ఉన్నా తాగేందుకు నీళ్లు లేవు దుర్గాఘాట్లో సమస్యలపై ఈవోకు భక్తుల ఏకరువు దుస్తులు మార్చుకునే గదుల్లో మార్పులు చేయాలి -
నరసింహస్వామికి వైభవంగా హనుమంతు సేవ
వేదాద్రి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరుక్కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం హనుమంతు సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హనుమంతు వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అర్చకులు శ్రీధరాచార్యులు, వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో సురేష్బాబు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు స్వామి వారి కల్యాణం జరుగుతుండటంతో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీక్షా స్వాముల ఇరుముడి సమర్పణ, అమ్మ, స్వామి వారి ఎదురుకోలోత్సవానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిల్లకల్లు పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేశారు. సీఎస్ఎస్ఎస్ఎన్రెడ్డికి డీఐఈఓగా ఉద్యోగోన్నతి పాయకాపురం(విజయవాడరూరల్): ఎన్టీఆర్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్చార్జిగా పని చేస్తున్న సీఎస్ఎస్ఎస్ఎన్ రెడ్డిని ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లా డీఐఈఓగా ప్రమోషన్ ఇచ్చి బదిలీ చేసింది. ఆయన పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా, జిల్లా ఒకేషనల్ ఆఫీసర్గా పని చేశారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఏలూరు నుంచి బి.ప్రభాకర్ను ప్రభుత్వం ఎఫ్ఏసీగా నియమించింది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కంచికచర్ల: హైదరాబాద్ నుంచి విజయవాడకు బైక్పై వస్తుండగా శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ బి.రాజు కథనం మేరకు విజయవాడ సున్నపు బట్టీల సెంటర్కు చెందిన మహ్మద్ రఫీ ఉజ్ జమాన్(45) అనే వ్యక్తి హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులు విజయవాడలో నివాసం ఉంటున్నారు. రఫీ పెద్ద కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుందని భార్య ఫోన్ చేసి చెప్పింది. దీంతో రఫీ హైదరాబాద్ నుంచి బైక్పై విజయవాడ బయలుదేరారు. కంచికచర్ల సమీపంలోకి రాగానే ఫ్లై ఓవర్పై గోడకు బైక్ తగిలి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలవటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. రఫీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బైక్ చోరీల ముఠా ఆటకట్టు
కంకిపాడు: కంకిపాడు పోలీసులు మోటారు బైక్ల చోరీ ముఠా ఆటకట్టించారు. ఈ కేసులో నలుగురి నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ మేరకు కంకిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్రావు శనివారం కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 25న గంగూరు గ్రామానికి చెందిన మహమ్మద్ జివుల్ రెహమాన్ ఈడుపుగల్లులోని మసీదు వద్ద నమాజ్ చేసుకునేందుకు తన స్నేహితుడి మోటారు బైక్పై వచ్చాడు. నమాజ్ చేసుకుని బయటకు వచ్చి చూసే సరికి బైక్ కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్ కంకిపాడు పట్టణంలోని ఫ్లై ఓవర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా యువకులు రెండు మోటారు బైక్లపై వెళ్తూ పట్టుబడ్డారు. వారి వాహనాలకు రికార్డులు లేకపోవటంతో గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ద్విచక్ర వాహనాలను చోరీ చేసే ముఠాగా గుర్తించారు. రూ.21.46 లక్షల విలువైన 50 బైక్ల రికవరీ కృష్ణాజిల్లాలోని కంకిపాడు, పెనమలూరు, పెడన, మచిలీపట్నం, గుడ్లవల్లేరు, ఎన్టీఆర్ జిల్లాలోని భవానీపురం, మాచవరం, విజయవాడ టూ టౌన్, గుంటూరు జిల్లా కొత్తపేట, మంగళగిరి టౌన్, ఏలూరు జిల్లాలోని ఏలూరు టూ టౌన్, బాపట్ల జిల్లాలోని రేపల్లె పోలీసుస్టేషన్లలో మొత్తం ఐదు జిల్లాల పరిధిలో 17 పోలీసుస్టేషన్లలో రూ.21.46 లక్షల విలువైన 50 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు విచారణలో నేరం అంగీకరించారు. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన మొహమ్మద్ రిజ్వాన్, కోడూరు మండలం గౌడపాలెంకు చెందిన కేశన సురేష్, ఉల్లిపాలెం గ్రామానికి చెందిన షేక్ ఇబ్రహీం, కోలా కృష్ణారావులను మోటారు బైక్ల చోరీ కేసులో నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ముందుగానే చోరీ చేసేందుకు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని సీసీ కెమెరాల్లో చిక్కకుండా ఉండేలా హెల్మెట్ ధరించి చోరీలకు పాల్పడటం ఈ ముఠా నైజమన్నారు. ఫంక్షన్ హాల్స్, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, హాస్పిటల్స్ వద్ద పార్కు చేసి ఉన్న వాహనాలే వీరి లక్ష్యంగా పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రత్యేక చర్యలు తీసుకున్న సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్, హెచ్సీ కె.చంద్రబాబు, పీసీలు పీఎస్ఎన్ మూర్తి, ఎస్డి బాబీబాబులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్యాన్సర్పై అవగాహన పెంచుకోవడం ద్వారా తొలిదశలో గుర్తించి, పూర్తిగా నయం చేసేందుకు అవకాశం ఉంటుందని టెలికం రంగ దిగ్గజం ఎన్కే గోయల్ సూచించారు. క్యాన్సర్పై అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్యాన్సర్పై అవగాహన పెంచడం, క్యాన్సర్ రోగులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ను ఆయన శనివారం ఆవిష్కరించారు. విజయవాడ మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో గోయల్ మాట్లాడుతూ.. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో స్వచ్ఛంద సంస్థల కృషి ఎంతో కీలకమన్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎన్.సుబ్బారావు మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధి బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు, అందుబాటులో ఉన్న చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధిని జయించేందుకు అవసరమైన తోడ్పాటు అందించాలన్నారు. క్యాన్సర్ విముక్త భారత నిర్మాణానికి కృషి.. ఇండియన్ రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్ఐఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వేమూరి వరప్రసాద్ మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స ప్రభావవంతంగా ఉంటుందన్నారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా క్యాన్సర్ విముక్త భారత నిర్మాణానికి సిటిజెన్ ఫోర్స్ కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పిన్నంశెట్టి రమేష్బాబు మాట్లాడుతూ.. క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ పని చేస్తుందన్నారు. ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.వి.మోహన్ ప్రసాద్, సినీ నటి చంద్రానీదాస్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా జరిగింది. సమాన పనికి సమాన వేతనం, కార్మికులను పర్మినెంట్ చేయాలని నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కోటేశ్వరరావు గౌడ్, గౌరవాధ్యక్షుడు గుంటుపల్లి శేషగిరిరావు మాట్లాడుతూ.. అత్యవసర విభాగాలైన నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రెయినేజీ, పార్క్లు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అన్ని విభాగాల్లో పనిచేస్తున్న టెక్నికల్ సిబ్బందికి రూ.29,200లు, నాన్ టెక్నికల్ సిబ్బందికి రూ.24,500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల సర్వీసు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి.. కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ను రద్దు చేస్తే కార్మికులందరిని పర్మినెంట్ చేయాలన్నారు. కార్మికుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీ, కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలి, ఆదివారాలు, దేశ, జాతీయ పండుగలకు సెలవు దినాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్ సమన్వయ కార్యదర్శి బత్తుల శివశంకర్, నగర అధ్యక్షుడు పిట్టా మహేష్, కార్యదర్శి ఎండీ గౌస్, ఉపాధ్యక్షులు బుచ్చిబాబు, వి.జైపాల్, బి.నాగరాజు, నాయకులు సాంబశివరావు, విష్ణుప్రసాద్, శివాజీ, బి.విజయ్, ఎన్.దుర్గారావు పాల్గొన్నారు. కొంకేపూడి పవర్ ప్లాంట్, ఓఎన్జీసీల పరిశీలన పెడన: భారత్, పాక్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడంతో పెడన మండలంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కొంకేపూడి పవర్ప్లాంట్, నందిగామ ఓఎన్జీసీ కార్యాలయాలను పెడన అధికారులు పరిశీలించారు. పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.నాగేంద్రబాబు, ఇన్చార్జి తహసీల్దార్ కె.అనిల్కుమార్లతో పాటు పెడన ఎస్ఐ జి.సత్యనారాయణ ఆయా ప్రాంతాల్లోని అధికారులు, సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. పవర్ప్లాంట్ పనులు ఇంకా ప్రారంభించలేదని అధికారులు పేర్కొనడంతో అయినా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే నందిగామ ఓఎన్జీసీ వద్ద నిఘా పెంచాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. -
‘ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షునిగా విద్యాసాగర్ను ఎన్నుకుందాం’
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో సేవలందిస్తున్న ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలపర్తి విద్యాసాగర్ రాష్ట్ర అధ్యక్షుడిగా అభ్యర్థిత్వానికి ఎన్టీఆర్ జిల్లా పూర్తి మద్దతు తెలియజేస్తూ జిల్లా కార్యవర్గ సమావేశం తీర్మానం చేసినట్లు జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు డి.సత్యనారాయణరెడ్డి తెలిపారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవో కార్యవర్గ సమావేశం సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అధ్యక్షుడు కేవీ శివారెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో నూతన అధ్యక్షుడని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోరాట పటిమ కలిగిన విద్యాసాగర్కు ఆ పదవికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షుడు వీవీ ప్రసాద్, జిల్లా కార్యదర్శి పి.రమేష్లు మాట్లాడుతూ రాష్ట్ర సంఘానికి అధ్యక్ష బాధ్యతలు సంకల్పబలం కలిగిన విద్యాసాగర్కు అప్పగించాలని కోరుతున్నామన్నారు. అధ్యక్ష పదవికి విద్యాసాగర్ పేరును బలపరస్తూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బి.సతీష్కుమార్, జి.రామకృష్ణ, ఎం.రాజుబాబు, సీహెచ్ దిలీప్కుమార్, బి.నాగేంద్రరావు, డి.విశ్వనాథ్, కె.శివలీల, నగర శాఖ అధ్యక్షుడు సీవీఆర్ ప్రసాద్, కార్యదర్శి నజీరుద్దీన్, జిల్లాకు చెందిన తాలూకా యూనిట్ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవో కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గుంటుపల్లి సీఏ కన్వెన్షన్ హాల్ సమీపంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందన్నారు. గాయాలు పాలైన వ్యక్తిని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని చెప్పారు. మృతుడి వయసు 40–45 ఏళ్లు ఉంటాయని, ఎత్తు 5.6 అడుగులు, తెలుపు అంచు కలిగిన హా్ఫ్ హ్యాండ్ నెక్ టీ షర్ట్, నలుపు అంచు కలిగిన కట్ బనియన్, బ్లూకలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94406 27084, 90591 21109 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు. -
తాడిగడపలో వాచ్మెన్ ఆత్మహత్య
పెనమలూరు: తాడిగడప గ్రామం గ్రీన్సిటీలో వాచ్మెన్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ జె.వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప గ్రీన్సిటీ కాలనీలో బద్దులూరి వెంకటేశ్వరరావు అపార్టుమెంట్లో దాలిపర్తి చిన్న ఆదిశేషు(70) వాచ్మెన్గా పని చేస్తున్నాడు. అతని భార్య రెండేళ్ల క్రితం చనిపోవటంతో అప్పటి నుంచి అతను బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి గ్రీన్సిటీ ఆవరణలో రాత్రి చెట్టుకు ఉరేసుకొని ఆదిశేషు మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉద్యమిద్దాం
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, వాటి పరిరక్షణకు ఉపాధ్యాయులు ఉద్యమించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అంబటిపూడి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో గురువారం ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గిపోతుందని, సున్నా నమోదు పాఠశాలలు గత ఏడాది కంటే ఈ ఏడాది పెరగనున్నాయన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈవీ రామారావు మాట్లాడుతూ అమలులో ఉన్న స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్ ప్రకారం రాష్ట్రమంతటా ఏకరీతిలో పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితాలు తయారు చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వి. సాంబశివరావు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.నాగ సోమేశ్వరమ్మ, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కె.సీతా రామయ్య ప్రసంగించారు. అనంతరం నాయకులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. -
మందులకు ఎండదెబ్బ!
బీపీ, సుగర్ పేషెంట్లూ జరభద్రం! ● అధిక ఉష్ణోగ్రతలో మందులు ఉంచితే పనిచేయవు ● ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలి ● రోజూ వాడే మందులకు తగిన ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలంటున్న నిపుణులు ● ఎప్పటికప్పుడు లెవెల్స్ తనిఖీ చేసుకోవాలని సూచనలు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నప్పటికీ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. బయటకు రావడం అలా ఉంచితే ఉక్కపోతతో ఇళ్లలోనే ఉండలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో వేసవిలో కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసే వారు ఎక్కువే. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం దీర్ఘకాలిక వ్యాధులకు వాడే మందులపై పడి, పనిచేయ కుండా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మందుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువే.. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మే రెండో వారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రభావం గదిలోపల కూడా కనిపిస్తోంది. సాధారణంగా గదిలోపల ఉష్ణోగ్రత 24 నుంచి 27 డిగ్రీల మధ్య ఉంటుంది. ఇది కాస్త ఎండ దెబ్బకి 32 డిగ్రీల సెల్సీయస్ దాటిపోతుంది. ఆరు బయట ఈ ఏడాది 40 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదు కావచ్చంటున్నారు. ఈ తరుణంలో అద్దాలు మూసి ఉంచిన కారు, వ్యానుల్లో రెండింతలు, మూడింతలు వరకూ ఉండవచ్చు. మండుతున్న ఉష్ణోగ్రతలు దీర్ఘకాలిక మందుల పనితీరుపై ప్రభావం చూపి సుగర్, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రస్ఫుటంగా కనిపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మందుల భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలో ఉంచిన మందులు వాడటం వల్ల వ్యాధులు అదుపులో ఉండవని చెబుతున్నారు. ● మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక మందులు సాధారణంగా 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చాలి. ముఖ్యంగా జానుమెట్, జార్డియాన్స్, కొమ్బిగ్లెజా, సిటాగ్లిఫ్టిన్ కార్దేస్, ఆటర్వాస్టాటిన్, రాబెప్రజోల్, మేకోబాలమిన్ వంటి మందులు 30 డిగ్రీల ఉష్ణోగ్రత లోపు, అమరిల్, విల్దాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్, సారోగ్జిటజార ఆమ్లోడిపిన్, క్లిన్ దపిన్, విటమిన్ ఈ, డీ మందులు 25 డిగ్రీలలోపు భద్రపర్చాలి. ● ఇన్సులిన్ మందు గుడ్డులో ఉండే ప్రోటీన్ వంటిదే. కొద్దిసేపు అధిక వేడిమికి గురైన గుడ్డు ఉడికినట్లు, ఇన్సులిన్ కూడా అదే విధంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎండలో ఉంచి తర్వాత ప్రిడ్జ్ వంటి వాటిలో ఉంచి వాడినా ప్రయోజనం ఉండదని సూచిస్తున్నారు. మందులు కొనుగోలు చేసే సమయంలోనే నిర్ధిష్ట ఉష్ణోగ్రతలు ఉన్న మందుల షాపుల్లో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ● రిఫ్రిజిరేటర్లు లేని వారు మట్టికుండలో నీళ్లు పోసి, దానిలో ఇన్సులిన్ను భద్రపరుచుకోవచ్చు. ఇన్సులిన్ వాడుకునే వాళ్లు బాటిల్స్, ఇన్సులిన్ పెన్లను ఐస్బాక్స్, ఐస్ ఉన్న ప్లాస్కోలో ఉంచాలి. ఇన్సులిన్ స్టాక్ను ఫ్రిడ్జ్ డోర్ అడుగు భాగంలో పెట్టుకోవాలి. డీప్ ఫ్రీజర్లో ఉంచకూడదు. అనుకోకుండా సుగర్ ఎక్కువగా ఉన్నట్లయితే వేడికి ఇన్సులిన్ సరిగా పనిచేయక పోవడమే కారణమని అని భావించాలి. వేసవిలో ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. బయటకు వెళ్లేటప్పుడు గ్లూకోజ్ టెస్ట్స్ట్రిప్స్, మందులు సరిపడా తీసుకు వెళ్లడమే కాకుండా, సరైన ఉష్ణోగ్రతలో వాటిని ఉంచాలి. – డాక్టర్ కె. వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణుడు, విజయవాడ సరైన ఉష్ణోగ్రతలో ఉంచాలి.. ఇలా భద్రపరచాలి.. -
హంసలదీవి టు మహాబలేశ్వరం !
కోడూరు: కృష్ణానదిని కాలుష్యం, ఆక్రమణల నుంచి రక్షించి, భవిష్యత్ తరాలకు సురక్షితమైన నది జాలలు అందించాలనే సంకల్పంతో జల బిరాదారి జాతీయ కన్వీనర్, జనసేన పార్టీ పర్యావరణ విభాగం ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కృష్ణా జలయాత్రను ప్రారంభించారు. హంసలదీవి పుష్కరఘాట్ వద్ద నుంచి శుక్రవారం ఈ యాత్రకు బొలిశెట్టి శ్రీకారం చుట్టారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు, విద్యార్థులు, మేధావులను సమన్వయం చేస్తూ జలయాత్రను చేపట్టినట్లు ఆయన చెప్పారు. ‘కృష్ణానది నాది.. దాని పరిరక్షణ బాధ్యత నాది’ అనే నినాదంతో ఈ యాత్ర సాగుతుందని, నదిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలన్నారు. హంసలదీవి నుంచి యాత్రను ప్రారంభించి విజయవాడ కనకదుర్గా ఘాట్, శ్రీశైలం, కర్నూలు, తెలంగాణ సంగమేశ్వరం, కర్ణాటకలోని అలంపూర్, కుడల్ సంగం, మహారాష్ట్రలోని ఆల్మట్టి, ఉజని మీదగా మహాబలేశ్వరం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. కృష్ణానది పరిరక్షణ అందరి బాధ్యత.. తెలుగువారి జీవనాధరమైన కృష్ణానదిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నదిలో కాలుష్యాన్ని నివారించడంతో పాటు నది ఆక్రమణకు గురి కాకుండా ప్రజలే స్వచ్ఛందంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సత్యనారాయణ, బుద్ధప్రసాద్లు ఉల్లిపాలెం వారధి వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని పరిశీలించారు. పార్టీ జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత సత్యన్నారాయణ, పర్యావరణవేత్త అనుమోలు గాంధీ, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ (రాజా), పీసీ కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, చల్లపల్లి మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ కనకదుర్గ, మత్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గగుడి ఈవో బాధ్యతల స్వీకారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన నూతన ఈవోగా డెప్యూటీ కలెక్టర్ వీకే శీనానాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం దుర్గగుడికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతికి కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఆలయానికి చేరుకున్న శీనానాయక్ను ఆలయ ఈఈ కోటేశ్వరరావు, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని చాంబర్లో ఈవోగా కుటుంబ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసే ప్రతి సామాన్య భక్తుడు వీఐపీతో సమానమేనని, వారికి గౌరవించి అమ్మవారి శీఘ్ర దర్శనం కల్పిస్తామన్నారు. దుర్గగుడి అభివృద్దికి పెద్ద పీట వేస్తామని, పనుల్లో ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. అనంతరం మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు జరిపించుకున్నారు. కీలక విభాగాల పరిశీలన.. ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శీనా నాయక్ ఆలయంలో పలు కీలక విభాగాలను పరిశీలించారు. అమ్మవారి దర్శనం అనంతరం మల్లేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న పూజా మండపం, యాగశాల, నూతన అన్నదాన భవనం, ప్రసాదాల పోటు భవనాలను పరిశీలించారు. అనంతరం మహామండపం రెండో అంతస్తు, మూడో అంతస్తులో జరుగుతున్న అన్నదానాన్ని పరిశీలించారు. అన్నప్రసాదం నాణ్యత గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. నాల్గవ అంతస్తులోని దేవస్థాన పరిపాలనా విభాగానికి చేరుకుని ఇంజినీరింగ్, పరిపాలనా విభాగం, అకౌంట్స్, లీజెస్, స్టేషనరీ విభాగాలను పరిశీలించారు. ఆయా చాంబర్లలో అందుబాటులో ఉన్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. చాంబర్లలో కుర్చీలు అన్ని ఖాళీగా ఉన్నాయేంటని తన వెంట ఉన్న సీసీని అడిగారు. శుక్రవారం కావడంతో ఆలయ అధికారులు, సిబ్బంది మొత్తానికి క్యూ లైన్ల వద్ద ప్రత్యేక విధులు కేటాయిస్తారని వివరించారు. భారత సైన్యం కోసం ప్రత్యేక పూజలు భారత దేశ రక్షణ కోసం శ్రమిస్తున్న త్రివిధ దళాల సైన్యానికి స్థైర్యం ఇవ్వాలని దుర్గగుడిలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. -
తీర ప్రాంతాల్లో నిఘా పటిష్టం
కోనేరుసెంటర్: సముద్ర తీర ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు మైరెన్ పోలీసులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాలను శుక్రవారం ఆయన స్వయంగా పరిశీలించారు. గిలకలదిండి మైరెన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీ న్యూ ఫిషింగ్ హార్బర్ నుంచి మైరెన్ పోలీసులతో కలిసి బోటులో సముద్ర మొగ వరకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో శత్రు దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. శత్రు దేశాలు భారత భూభాగంలోకి సముద్ర మార్గం గుండా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. సముద్ర తీర ప్రాంతాలైన గిలకలదిండి, ఓర్లగొంది, పాలకాయతిప్ప మైరెన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని తీర ప్రాంత గ్రామాలు అన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. సముద్ర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉండేలా మైరెన్ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. -
‘జీవనోపాధి’ కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో జీవనోపాధుల కార్యాచరణ ప్రణాళికను సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేసి ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తయారుచేసేందుకు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపుహాలులో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంట్లో ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే జూన్ నెల మొదటి వారంలో కొత్త రుణాలతో పెద్ద ఎత్తున యూనిట్లు నెలకొల్పేందుకు సంసిద్ధం కావాలన్నారు. ప్రణాళిక ప్రకారం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున ప్రధానంగా ఏడు గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా నూరు శాతం పూర్తిస్థాయిలో జీవనోపాధులు కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. వ్యాపార యూనిట్లు నెలకొల్పేందుకు కృషి.. చల్లపల్లి మండలం నూకలవారిపాలెం, ఉంగుటూరు మండలం వెన్నుతల, నందివాడ మండలం తుమ్మలపల్లి, బందరు మండలం గరాలదిబ్బ, పమిడిముక్కల మండలం మల్లపూడి, బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి, పెనమలూరు మండలం గంగూరు గ్రామాలను ఎంపిక చేశామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. కొత్త వారికి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఇప్పటికే తెలుసుకున్నామని, దానిని అనుసరించి ఎస్హెచ్జీల అంతర్గత రుణ సహాయం, ఉన్నతి, శ్రీనిధి, బ్యాంక్ లింకేజ్ తదితర పథకాలను అనుసంధానం చేస్తూ బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించి వ్యాపార యూనిట్లను నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు. బ్యాంక్ రుణాలు ఇవ్వటం ముఖ్యంకాదని, లబ్ధిదారులు తప్పనిసరిగా సంబంధిత యూనిట్లు నెలకొల్పి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి చిననరసింహులు, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ వెంకట్రావు, వ్యవసాయశాఖ అధికారి మనోహర్, మత్స్యశాఖ అధికారి నాగరాజు, బీసీ కార్పొరేషన్ ఈడీ శంకరరావు, ఏపీఎంఐపీ పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
దమననీతిపై నిరసన స్వరం
ప్రశ్నించే గొంతులను నొక్కడం అప్రజాస్వామికం అంటున్న ప్రజాసంఘాలు చిలకలపూడి(మచిలీపట్నం)/ఘంటసాల (అవనిగడ్డ)/చల్లపల్లి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంలో భాగంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి కూటమి ప్రభుత్వం సంకెళ్లు వేసే దిశగా అడుగులు వేస్తోంది. తప్పును తప్పుగా చెబుతూ చెడును వివరించే రీతిలో పత్రికలు పనిచేయడాన్ని చూసి ఓర్వలేక, కేసుల రూపంలో భయబ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోంది. పత్రికాస్వేచ్ఛను అణగదొక్కాలనే రీతిలో అరాచకాలు సృష్టిస్తోంది. దీనిలో భాగంగానే ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి ఇంటిపై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా.. సెర్చ్ వారెంట్లు లేకుండా.. ఇంట్లోకి జొరబడి మూడు గంటల సేపు పోలీసులు వేధించారని ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి.. ధనార్జనే లక్ష్యంగా కూటమి పార్టీలోని ప్రతి నాయకుడూ అధికార దర్పంతో ముందుకు సాగుతున్నారని విమర్శిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం కాలరాస్తే సహించేది లేదని.. గళమెత్తి పోరాటం చేస్తామని బాహాటంగానే చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం పాల నలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి కుట్రపూరితంగా అరెస్టులు చేపడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అరాచకత్వాలను ప్రేరేపిస్తున్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు చేయటం కక్ష సాధింపు చర్యే. – జక్కుల ఆనంద్బాబు, జిల్లా అధ్యక్షుడు, దళిత జేఏసీ ఫోర్త్ ఎస్టేట్పై దాడి.. హేయమైన చర్య మారుతున్న ప్రభుత్వాల వైఖరి కారణంగా పత్రికా స్వేచ్ఛ క్రమంగా మసకబారుతోంది. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం ఫోర్త్ ఎస్టేట్గా పిలిచే మీడియా ఎంత దృఢంగా ఉంటే సమాజం అంత అభివృద్ధి చెందుతుంది. పాలకుల లోపాలను, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు గొంతెత్తే మీడియా సంస్థలు, వాటి ప్రతినిధులపై అక్రమ దాడులు నిర్వహించటం మానుకోవాలి. – శీలం నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు నిర్భంధ సోదాలు నిర్వహించడం సరికాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ప్రతివ్యక్తికి భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. పత్రికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వచ్చినపుడు వాటిని ఖండించడమో, లేదంటే వివరణ ప్రకటించేలా చేయడమో చేయాలి. ఇంకా పరువుకు భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేయాలి. అంతేకానీ ప్రభుత్వం పోలీసుల ద్వారా భయపెట్టే పనులు చేయడం మంచిది కాదు. ఒక ప్రధాన పత్రికలో పనిచేస్తున్న ఎడిటర్ ఇంట్లోనే హక్కులు హరించేలా ఇలా సోదాలు జరగడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఈ ఘటనపై ప్రభుత్వం కచ్చితంగా బాధ్యత వహించాలి. – జెక్కా కేశవరావు, పౌరహక్కుల సంఘం జిల్లా కమిటీ సభ్యుడు, ఘంటసాల -
అనుమానితులు కనబడితే సమాచారం ఇవ్వండి
కోనేరుసెంటర్: జిల్లాలో అనుమానిత వ్యక్తులు, ప్రమాదకర వస్తువులు, పేలుడు పదార్థాలు కనబడితే ప్రజలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు కోరారు. పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆటలను అరికట్టేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం మాక్ డ్రిల్ నిర్వహించింది. మాక్ డ్రిల్లో ఎస్పీ గంగాధరరావు స్వయంగా పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వాహనాలను తనిఖీలను దగ్గరుండి పరిశీలించారు. తొలుత ఎస్పీ మచిలీపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో సోదాలు నిర్వహించారు. అనంతరం అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెనుమూడి వారధి వద్ద ఉన్న చెక్ పోస్ట్ను పరిశీలించి, అక్కడ సీసీ కెమెరాల పని తీరును ఆరా తీశారు. ఆపరేషన్ సిందూర్ గురించి సోషల్ మీడియాలో ఎవరైనా విమర్శలు చేసిన తప్పుడు ప్రచారాలకు పాల్పడిన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన కఠినంగా శిక్షించబడతారని హెచ్చరించారు. ప్రజల రక్షణ, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై 94407 96400 సమాచారం ఇవ్వాలని, సమాజ రక్షణ కోసం పోలీసులకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. -
భారత్ గౌరవ్ ప్రత్యేక వేసవి పర్యాటక ప్యాకేజీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవి సీజన్లో దక్షిణ భారత దేశంలోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించుకునే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైళ్లు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ సత్యకిశోర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఏరియా మేనేజర్ రాజాతో కలిసి బ్రోచర్ను ఆవిష్కరించి, ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. దివ్య దక్షిణ యాత్ర.. దివ్య దక్షిణ యాత్ర పేరుతో నడిచే ఈ ప్రత్యేక పర్యాటక రైలు విజయవాడ మీదుగా ఈ నెల 22న సికింద్రాబాద్లో బయలుదేరి, తిరిగి 30న సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ యాత్రలో అరుణాచలం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శింపచేస్తారు. మూడు కేటగిరిల్లో ఉన్న ఈ ప్యాకేజీలో ఎకానమీ(స్లీపర్ క్లాస్)లో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.14,700, పిల్లలకు రూ.13,700, స్టాండర్డ్(3 ఏసీ) పెద్దలకు రూ.22,900, పిల్లలకు రూ.21,700, కంఫార్ట్(2 ఏసీ) పెద్దలకు రూ. 29,900, పిల్లలకు రూ.28,400 ధరగా నిర్ణయించారు. ఈ ప్రయాణంలో సందర్శన ప్రాంతాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, హోటళ్లలో బస, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అల్పాహారం, భోజన సదుపాయాలు, ప్రతి కోచ్లో ఎస్కార్ట్, సందర్శించే ప్రదేశాల్లో గైడ్, ప్రమాద బీమా సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. హరిద్వార్, రిషికేశ్, వైష్ణోదేవి యాత్ర.. జూన్ 3 నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ యాత్రలో హరిద్వార్, రిషికేశ్, ఆనంద్పూర్, నైనా దేవి ఆలయం, అమృత్సర్, మాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ యాత్రలో ఎకానమీ పెద్దలకు రూ.18,510, పిల్లలకు రూ.17,390, స్టాండర్డ్ పెద్దలకు రూ.30,730, పిల్లలకు రూ.29,420, కంఫార్ట్ పెద్దలకు రూ.40,685, పిల్లలకు రూ.39,110 ధరగా నిర్ణయించారు. గంగా రామాయణ యాత్ర.. సరస్వతి పుష్కరాల సందర్భంగా గంగా రామాయణ ప్రత్యేక పర్యటక రైలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ యాత్రలో కాశీ, అయోధ్య, నైమిషరన్య, ప్రయాగ్రాజ్ తదితరా ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చన్నారు. ఈ యాత్రలో ఎకానమీ పెద్దలకు రూ.16,800, పిల్లలకు రూ.15,700, స్టాండర్డ్ పెద్దలకు రూ.26,600, పిల్లలకు రూ.25,300, కంఫార్ట్ రూ.34,900, పిల్లలకు రూ.33,300 ధరగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన యాత్రికులు టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా విజయవాడ రైల్వే స్టేషన్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో లేదా 92814 95848, 92810 30714 నంబర్లలో బుక్ చేసుకోవాలని కోరారు. టూరిజం అధికారులు సత్యకిశోర్, రాజా బ్రోచర్ ఆవిష్కరణ -
అంతా మా ఇష్టం..
● దర్జాగా అసైన్డ్ భూముల కబ్జా ● వందలాది ఎకరాల్లో సముద్రాన్ని తలపించేలా తవ్వకాలు ● పదుల సంఖ్యలో ప్రొక్లయిన్లు, వందలుగా ట్రాక్టర్లు ● కన్నెత్తయినా చూడని అధికార యంత్రాంగంకృత్తివెన్ను: ఒకటికాదు రెండుకాదు దాదాపు 800 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా చెరువు తవ్వకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. పొరుగు జిల్లాకు చెందిన కొందరు బడా బాబులకు స్థానికంగా ఉన్న ‘తమ్ముళ్లు’ తోడవడంతో నిరాటంకంగా తవ్వకాలు సాగుతున్నాయి. కృత్తివెన్ను మండలంలో ఇంత భారీ ఎత్తున అక్రమ చెరువు తవ్వకాలు జరుగుతున్నా.. స్థానిక రెవెన్యూ యంత్రాంగం అటువైపు కన్నెత్తయినా చూడకపోవడం గమనార్హం. చెరిగిన సరిహద్దులు.. చెరువు తవ్వకాలలో అక్రమార్కులు రెవెన్యూ గ్రామాల సరిహద్దులు సైతం చెరిపేశారని అధికారులే తలల పట్టుకుంటున్నారు. వారి ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడంతో ఏ గ్రామం హద్దులు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నట్లు వాపోతున్నారు. వందలాది ఎకరాల అసైన్డ్ భూముల్లో జరుగుతున్న తవ్వకాలపై ప్రశ్నించే సాహసం ఎవరూ చేయకపోవడంతో మండలంలో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పెదలంక డ్రెయినే సరిహద్దుగా.. కొల్లేరు ముంపు నీరు సముద్రంలో కలిసేందుకు ప్రధాన మార్గంగా ఉన్నటువంటి పెదలంక డ్రెయిన్ను సరిహద్దుగా చేసుకుని భారీ చెరువుల కట్టలు వేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో అధికవర్షాల వల్ల వచ్చే వరద నీరు సముద్రంలో కలిసేందుకు కష్టమవుతుంది. కృత్తివెన్నుతో పాటు కలిదిండి, బంటుమిల్లి, ముదినేపల్లి, గుడ్లవల్లేరు మండలాలలోని పంటపొలాలు, చెరువులకు ప్రమాదం పొంచి ఉంది. సరికొత్తగా బ్లాక్ మెయిలింగ్.. ఇదిలా ఉంటే తవ్వకాలపై అధికారులు ప్రశ్నిస్తుంటే లీజుదారులు, ‘తమ్ముళ్లు’ కలసి అధికారులనే బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. రైతులతో ‘మీ ఆర్థిక కష్టాలు తీర్చాలని మేం వచ్చామే గాని ఇందులో మాకు ఎటువంటి లాభం లేదు చెరువు తవ్వకాలు అడ్డుకుంటే మేం వదిలేసి వెళ్లిపోతాం’ అని బెదిరిస్తున్నట్లు సమాచారం. దీంతో స్థానికంగా ఉంటున్న కొందరు నాయకులు అధికారుల వద్దకు వచ్చి చూసీ చూడనట్లు ఉండాలని చెబుతున్నట్లు సమాచారం. వాస్తవానికి పేదవర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను వారే చేసుకోవాలి. లేదా సొసైటీగా ఏర్పడి ఉమ్మడి సాగు చేయాలి. కానీ ఇక్కడ అటువంటివి ఏమీ లేకుండా ఇష్టానుసారంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటీవల వర్షం కురుస్తుండటంతో పనులకు రెండు రోజులు తాత్కాలికంగా బ్రేక్ పడినా తరువాత దీనిపై సంబంధిత అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందా లేక చూసీచూడనట్లు వదిలేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. కృత్తివెన్ను మండలంలోని నిడమర్రు పంచాయతీలో వేలాది ఎకరాలు అసైన్డ్ భూముల్లో నిరాటంకంగా చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. అవ న్నీ ప్రభుత్వ భూములే అని అధికారులు చెబుతున్నప్పటికీ.. కనీసం అటువైపు చూడకపోవడంతో తవ్వకాలకు అడ్డేలేకుండా పోయింది. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ ‘గత ప్రభుత్వంలోనే బావుంది.. ఎక్కడ పనులు జరుగుతున్నాయో తెలిసేది.. కానీ ఇప్పుడు ఎవరిష్టం వారిది.. ప్రభుత్వ భూములు అని తెలిసినా తవ్వేస్తున్నారు. ఏంటని ప్రశ్నిస్తే అధికారంలో ఉన్నాం ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు.. అంతా మా ఇష్టం.. అంటూ మాట్లాడుతున్నారు’ అని వాపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
ఆపరేషన్ సిందూర్కు సంఘీభావం
కోడూరు: పాకిస్తాన్పై భారత్ సైన్యం చేస్తున్న ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా కోడూరు పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ సర్పంచి వెన్నా షైనీ, కార్యదర్శి బండే శేషగిరిరావు పర్యవేక్షణలో వివిధ సంఘాలు, రాజకీయ ప్రముఖులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జవాన్లకు మద్దతుగా నినాదాలు చేస్తూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలపై మండిపడ్డారు. జాతీయ పతాకాలతో కోడూరు ప్రధాన రహదారుల వెంట ప్రదర్శన నిర్వహించి దేశభక్తిని చాటారు. అనంతరం ప్రధాన సెంటర్ల మానవహారం ఏర్పాటు చేశారు. మాజీ జెడ్పీటీసీ బండే శ్రీనివాసరావు, ఎస్కేఆర్ విద్యాసంస్థల సలహాదారు కోట వెంకటసుబ్బారావు, సచివాలయ సిబ్బంది, ఆర్యవైశ్య ప్రముఖలు పాల్గొన్నారు. -
నందిగామ కూటమి నేతల చీప్ పాలిటిక్స్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ కూటమి నేతల చీప్ పాలిటిక్స్కు తెరతీశారు. నందిగామ గాంధీ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం తొలగించాలని మున్సిపల్ కౌన్సిల్లో నిర్ణయించారు. మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల తీరుపై వైఎస్సార్సీపీ, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మొండితోక జగన్మోహన్ రావు మీడియాత మాట్లాడుతూ.. గాంధీ బొమ్మ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ట్రాఫిక్ సమస్య సాకుగా చూపి విగ్రహాన్ని తొలగించేందుకు దురుద్ధేశంతో కౌన్సిల్లో తీర్మానం చేశారు. గాంధీసెంటర్లో అస్తవ్యస్తంగా ఉన్న విగ్రహాలను వైఎస్సార్సీపీ హయాంలో ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేశాం. విగ్రహాలను మార్చే సమయంలో కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులతో చర్చించిన తర్వాతే మార్పు చేశాం’’ అని ఆయన వివరించారు.విగ్రహాలను మారుస్తున్న సమయంలో అప్పటి టీడీపీ నాయకులు కోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్ విగ్రహం తొలగించాల్సిన అవసరం లేదని హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. హైకోర్టు చెప్పినా అక్రమంగా తీర్మానం చేసి విగ్రహాన్ని తొలగించేందుకు యత్నిస్తున్నారు వైఎస్ జగన్ పాలనలో కూటమి అధికారంలోకి వచ్చిన పదినెలల కాలంలోనే ఈ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు గమనించాలి. ఈ క్షణం ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయం’’ అని మొండితోక జగన్మోహన్రావు చెప్పారు. -
శుభకార్యానికి వెళుతూ...
గుడ్లవల్లేరు: వారంతా శుభకార్యానికి హాజరయ్యేందుకు ఎంతో హుషారుగా ట్రాక్టర్లో బయలుదేరారు. అయితే వారి ఆనందం క్షణాల్లోనే ఆవిరై పోయింది. ట్రాక్టరు బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఘోరం జరిగిపోయింది. ట్రాక్టర్ను స్టార్ట్ చేసి అక్కడే రివర్స్ చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఐదుగురు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందివాడ మండలం రుద్రపాక వద్ద ఉన్న గాజులపాలెంలో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు గురువారం గుడ్లవల్లేరు మండలం విన్నకోటకు చెందిన బంధువుల బృందం ట్రాక్టర్లో బయలుదేరింది. ఊరు దాటకముందే ఊళ్లోనే ట్రాక్టర్ రివర్స్ చేసే క్రమంలో అదుపు తప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముత్యాల అరుణ్(16), కూరెళ్ల అభిషేక్(15) చికిత్స పొందుతూ మృతి చెందారు. కె.జయరాజు అనే వ్యక్తికి పొట్ట చీల్చుకుని పేగులు బయటపడటంతో గుడివాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జయరాజుకు ఆపరేషన్ చేశాక గానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులిద్దరి భౌతిక కాయాలకు గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏఎస్ఐ వి.బాల వెంకటేశ్వరరావు తెలిపారు. ట్రాక్టర్ తిరగబడటంతో ఇద్దరు యువకుల దుర్మరణం మరొక వ్యక్తి పరిస్థితి విషమం చికిత్స పొందుతున్న మరో ఐదుగురు వ్యక్తులు -
అంతర్ రాష్ట్ర బైక్ చోరీ ముఠాకు చెక్!
కంకిపాడు: బైక్ల చోరీలకు పాల్పడే అంతర్ రాష్ట్ర ముఠాకు చెక్ పడింది. ఇద్దరు కీలక నిందితులను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా చోరీ చేసిన 50 బైక్లను ఇప్పటికే పోలీసులు రికవరీ చేసి పోలీసుస్టేషన్కు కూడా తరలించారు. వివరాల్లోకి వెళితే... ఇటీవల ద్విచక్ర వాహనాల చోరీలు అధికమయ్యాయి. కంకిపాడు పోలీసుస్టేషన్ పరిధిలోని ఈడుపుగల్లు పరిసరాల్లో సుమారు 5 మోటరు బైక్లు చోరీ అయ్యాయి. దీనిపై కంకిపాడు పోలీసులు లోతైన దర్యాప్తు సాగించారు. సీసీ ఫుటేజ్లను సేకరించి, వారి కదలికలను, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానమైన ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కదిలిన డొంక... బైక్ చోరీలకు పాల్పడే ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ సాగించటంతో డొంక కదిలింది. ఈ ఇద్దరు నిందితులు ఎంతో చాకచక్యంగా బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని అనేక చోట్ల ఈ ముఠా బైక్ చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఎక్కడెక్కడ బైక్లను కుదువ పెట్టింది?, విక్రయించిందీ? తెలుసుకుని వాటిని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్కు తరలిస్తున్నారు. ఇప్పటికే 50 బైక్లను పోలీసుస్టేషన్కు తరలించినట్లు సమాచారం. నిందితులను నేడు లేదా రేపు అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఇప్పటికే 50 బైక్ల స్వాధీనం -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ తీగె తగిలి మృతి
కంచికచర్ల: ఇంటి ముందు ఉన్న తీగైపె ఉతికిన దుస్తులు ఆరేసే క్రమంలో విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన కంచికచర్లలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ బి.రాజు కథనం మేరకు కంచికచర్ల ప్రణీత కాలనీకి చెందిన చమ్మేటి నందిని(24) ఇంటి ముందు దుస్తులు ఆరేసే తీగైపె బుధవారం రాత్రి ఈదురుగాలులకు విద్యుత్ తీగె తెగి పడింది. ఇది గమనించని నందిని యథావిధిగా రోజూలాగానే ఉతికిన దుస్తులను తీగైపె ఆరేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ఒక్కసారిగా కింద పడిపోయింది. గమనించిన స్థానికులు ఆమెను వైద్య చికిత్స కోసం స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రసాయనాలతో మగ్గించిన పండ్లతో ముప్పు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాల్షియం కార్బైడ్ తదితర హానికర, నిషేధిత రసాయనాలతో మగ్గబెట్టిన పండ్ల వలన ప్రజారోగ్యానికి పెనుముప్పు ఏర్పడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. మామిడి, అరటి, బొప్పాయి వంటి తొందరగా పాడయ్యేందుకు అవకాశమున్న పండ్లను మగ్గబెట్టడానికి నిషేధిత రసాయనాలు వాడకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించేందుకు గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. వరిగడ్డి వంటి వాటిలో మగ్గబెట్టిన పండ్లతో ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని, హానికర రసాయనాలు వాడితే ఆర్సినిక్, ఫాస్ఫరస్ అవశేషాలతో చర్మ రోగాలు, గొంతు సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. కార్బైడ్ ఉపయోగించి మగ్గబెట్టిన పండ్లపై నల్లని మచ్చలుంటాయని వివరించారు. బాగా కడిగి తినేలా అవగాహన కల్పించాలన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు నున్న, కేదారేశ్వరపేట వంటి మార్కెట్లలో ఆహార భద్రత, మునిసిపల్, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారుల బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాలని, శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపాలన్నారు. నిషేధిత రసాయనాలు వాడినట్లు తేలితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా కార్బైడ్, నిషేధిత రసాయనాలు ఉపయోస్తే ఆ విషయాన్ని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నంబరు 94403 79755కు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా ఆహార భద్రత అధికారి, కమిటీ సభ్య కన్వీనర్ ఎన్.పూర్ణచంద్రరావు, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీకుమార్, జిల్లా అగ్రీ ట్రేడ్ మార్కెటింగ్ అధికారి కె.మంగమ్మ, గజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎన్.రమేష్బాబు, ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిషేధిత రసాయనాలు వాడినట్లు రుజువైతే క్రిమినల్ కేసు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
అవార్డు అందుకున్న కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ గురువారం అవార్డు అందుకున్నారు. విజయవాడలోని రాజ్ భవన్ దర్బార్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్కు బంగారు పతకం, సేవా పురస్కారం అందజేసి అభినందించారు. గత సంవత్సరం బుడమేరు, కృష్ణానది వరదల్లో ప్రజలకు ఎన్నో విశిష్టమైన సేవలు అందించినందుకు గుర్తింపుగా రెడ్క్రాస్ ఈ అవార్డు ప్రకటించింది. జిల్లాలో రెడ్క్రాస్ సేవలు విస్తృతంగా అందించేందుకు నిరంతరం రెడ్క్రాస్ జిల్లా కమిటీకి దిశానిర్దేశాలు చేస్తూ ముందుకు నడపటం వల్ల ఈ అవార్డు ఆయనకు వచ్చింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ఎం.హరిజవహర్లాల్, జాయింట్ సెక్రటరీ పి.ఎస్.సూర్యప్రకాష్, ఐఆర్సీఎస్ చైర్మన్ వై.డి.రామారావు, సీఈఓ ఎ.కె.ఫరీదా తదితరులు పాల్గొన్నారు. తీర గ్రామాల్లో మైరెన్ పోలీసుల పహారానాగాయలంక: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దివిసీమలోని పాలకాయతిప్ప మైరెన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది గురువారం సముద్ర తీరగ్రామాల్లో పహారా చేపట్టారు. సముద్ర మార్గం నుంచి ఉగ్రవా దులు జిల్లాలోకి ప్రవేశించే వీలు లేకుండా మండలంలోని ఎదురుమొండి, ఈలచెట్లదిబ్బ, నాచుగుంట గ్రామాల పరిధిలో రెండు డ్రోన్ కెమెరాల సహాయంతో మైరెన్ పోలీసులు గస్తీ నిర్వహించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ కొత్త వ్యక్తుల సంచార సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని తీరగ్రామాల ప్రజలకు సిబ్బంది అవగాహన కలిగించారు. బీచ్ ఫెస్టివల్కు పకడ్బందీ ఏర్పాట్లుచిలకలపూడి(మచిలీపట్నం): త్వరలో జరిగే బీచ్ ఫెస్టివల్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయా లని సంబంధిత అధికారులకు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. గురువారం సాయంత్రం తన చాంబర్లో ఎస్పీ ఆర్.గంగా ధరరావుతో కలిసి బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసేలా బీచ్ ఫెస్టివల్కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమాలన్నీ సాయంత్రం నుంచే మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బీచ్ ప్రాంతంతో పాటు రోడ్ల వెంబడి విద్యుత్ దీపాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు, పోలీస్ అవుట్పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. సముద్రతీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో చంద్రశేఖరరావు, బందరు ఆర్డీఓ కె.స్వాతి, డీఎస్పీ సీహెచ్ రాజా, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. సత్యదేవుడికి దుర్గమ్మ పట్టువస్త్రాలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం తరఫున గురువారం పట్టువస్త్రాలను అందజేశారు. సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా దుర్గగుడి ప్రధాన అర్చకుడు లింగంభోట్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు పట్టువస్త్రాలను అన్నవరం ఆలయానికి తీసుకెళ్లారు. స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించిన దుర్గగుడి అర్చక బృందానికి అన్నవరం దేవస్థాన అర్చకులు, అధికారులు ప్రసాదాలను అందజేశారు. -
ప్రభుత్వానికి వ్యవసాయ భూములు ఇవ్వలేం
ఇబ్రహీంపట్నం: ఏడాదికి మూడు పంటలు పండే వ్యవసాయ భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వానికి ఇవ్వబోమని రైతులు స్పష్టంచేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి పేరుతో మూలపాడు, త్రిలోచనాపురం, జమీమాచవరంలో భూసేకరణపై గురువారం గ్రామ సభలు నిర్వహించారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న భూముల రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదని తహసీల్దార్ వెంకటేశ్వర్లు దృష్టికి రైతులు తీసుకొచ్చారు. కొంతమందికి ప్లాటు ఇచ్చినా అభివృద్ధికి నోచుకోలేద న్నారు. ఇప్పటికే రెండు వేల ఎకరాలు లంక భూ ములు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, పర్యాటక అభివృద్ధి, స్పోర్ట్స్ క్లబ్ పేరుతో మరో రెండు వేల ఎకరాలు తీసుకుంటే వ్యవసాయానికి భూమి మిగలదని రైతులు వాపోయారు. రాజధానిలో వేల ఎకరాల భూమి ఇప్పటికీ ఖాళీగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మరో మూడు నాలుగేళ్లు పడుతుందని, ఈ లోపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అమరావతి రాజ ధాని ఇప్పటికీ అభివృద్ధి కాలేదని, ఈ ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి తాము తెచ్చుకోబోమని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్లో ఏమి ఇస్తారో ముందు ప్రకటించాలని పట్టుబట్టారు. భూమి ఉంటే జీవనోపాధి కలుగుతుందని, ప్లాటు ఉంటే కుటుంబం గడవదని పేర్కొన్నారు. రైతుల వాదనలతో సభ రసాభాసగా మారింది. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. కొటికలపూడిలో గ్రామసభలో ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వబోమని జమీమాచవరం రైతులు చెప్పారు. మూలపాడులో 313 ఎకరాలు, త్రిలోచనాపురంలో 1,390 ఎకరాలు, జమీమాచవరంలో 301 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తహసీల్దార్ ప్రకటించారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, వైస్ ఎంపీపీ బండి నాగమణి, సర్పంచులు రెంటపల్లి నాగరాజు, చింతల భూలక్ష్మి, పలువురు రైతులు పాల్గొన్నారు. మూలపాడులో తెగేసి చెప్పిన రైతులు -
తమ్ముళ్లకే సబ్సిడీల్
పెడన: ఆధునిక వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం అనివార్యమైంది. కౌలు రైతులు, పేద, మధ్యతరగతి రైతులకు యంత్ర పరికరాలను సమకూర్చుకునే ఆర్థిక స్తోమతు ఉండదు. ఈ నేపథ్యంలో పొలాలను దుక్కి దున్నడం నుంచి పంట నూర్పిడి వరకు అవసరమైన యంత్ర పరికరాలను గతం నుంచి ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తూ ఆదుకుంటోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హత ఆధారంగా సబ్సిడీ యంత్రపరికరాలు అందడంలేదు. 40 నుంచి 50 శాతం రాయితీతో గ్రామ సచివాలయాల ద్వారా మంజూరు చేసే యంత్రపరికరాలను తమకు అనుకూలమైన రైతులకు మాత్రమే ఇవ్వాలని టీడీపీ నాయకులు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాల మేరకు తెలుగు తమ్ముళ్లకే యంత్రపరికరాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించిన అనంతరమే యంత్రపరికరాలను మంజూరు చేస్తున్నామని అధికారులు చెప్పుకొస్తున్నారు. అర్హత ఉన్నా యంత్రపరికరాలు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యంత్రపరికరాలు అనివార్యం గతంలో కూలీలు, పశువుల సహకారంతో రైతులు వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు కూలీల సంఖ్య తగ్గిపోవడం, కూలి ధరలు అధికం కావడంతో దూర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి పనులు చేయించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిని అధిగమించడానికి అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుంటు వ్యయభారాలను తగ్గించుకుంటున్నారు. ఈ క్రమంలో కూడా ఆయా ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలను అందజేస్తూ వస్తున్నాయి. పరికరం సామర్థ్యాన్ని బట్టి 40 నుంచి 50 శాతం వరకు రాయితీపై అందిస్తారు. ట్రాక్టరు అనుబంధ పరికరాలను ట్రాక్టరున్న రైతులకు మాత్రమే అందించేలా చర్యలు చేపట్టారు. ఆయిల్ ఇంజిన్లు, కల్టివేటర్లు, పవర్ స్ప్రేయర్లు వంటి యంత్రాలు అందరికీ అవసరమే. వీటిని అర్హత మేరకు రైతులకు మంజూరు చేయాలి. కూటమి అధికారంలో వచ్చిన పిమ్మట కేవలం తమ పార్టీకి అనుకూలమైన వారికే మాత్రమే సబ్సిడీపై యంత్రపరికరాలను మంజూరు చేసేలా కూటమి నాయకులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అందించే యంత్రపరికరాలు ఇవీ.. రైతులకు సబ్సిడీపై అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మండల వ్యవసాయశాఖకు పలు యంత్రపరికరాలు చేరాయి. బ్యాటరీ, పవర్ స్ప్రేయర్లు, దుక్కు పరికరాలు, రోటావీటర్లు, పవర్ వీడర్లు, పవర్ టిల్లర్లు వంటి యంత్రపరికరాలు వచ్చాయి. మరి కొన్ని యంత్ర పరికరాలు రావాల్సి ఉంది. వచ్చిన వాటిని వచ్చినట్లుగా కూటమి నాయకులు చెప్పిన రైతులకు అధికారులు అందజేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లకే సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు తాము సూచించిన వారికే ఇవ్వాలని కూటమి నాయకుల హుకుం యంత్రపరికరాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసినవారికే పంపిణీ చేశామంటున్న అధికారులు ఆన్లైన్ దరఖాస్తుల ప్రకారమే.. రైతులకు అనేక రకాల యంత్ర పరికరాలను ప్రభుత్వం రాయితీపై ఇస్తోంది. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ఎక్కువ మంది ఆయిల్ ఇంజిన్లు కావాలంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే యంత్రపరికరాలను అందజేశాం. ఇంకా కొన్ని రావాల్సి ఉంది. వాటిని కూడా రాగానే దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అందజేస్తాం. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకావశం లేదు. ప్రభుత్వం సూచించిన సమయంలోనే అర్హులైన రైతులు తమకు కావల్సిన యంత్రపరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న వారికే సబ్సిడీపై యంత్రాలను అందజేస్తాం. – నూరున్నీసా, ఇన్చార్జి ఏఓ, పెడన మండలం -
కదం తొక్కిన కలం
పత్రికా స్వేచ్ఛను పరిహాసం చేస్తూ, ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కదం తొక్కారు. అక్షరంపై అక్కసు ఎందుకంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుతో పత్రికా స్వేచ్ఛకు పెను ప్రమాదం ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ముక్తకంఠంతో ఖండించారు. ‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై దాడి.. పత్రికా స్వేచ్ఛపై దాడి, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు, ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా?, పత్రికా స్వేచ్ఛపై దాడి సిగ్గు సిగ్గు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): విజయవాడ వెట ర్నరీ కాలనీలో ఉన్న ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంపై గురువారం ఉదయం పోలీసులు దాడి చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం సెర్చ్ వారెంట్ లేకుండానే పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. ధనంజయరెడ్డితో దురుసుగా ప్రవర్తించారు. ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించినా సమాధానమివ్వకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఆందో ళన బాటపట్టారు. పోలీసుల తీరును మచిలీపట్నం పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు. పోలీసుల అత్యుత్సాహం కూటమి ప్రభుత్వ కుట్రే తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. అక్రమ కేసులు, దాడు లతో పత్రికరంగానికి సంకెళ్లు వేయలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ‘సాక్షి’ మీడియాను లక్ష్యంగా చేస్తున్న ఈ దాడులను పాత్రికేయుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మచిలీపట్నంలో నిరసన ప్రదర్శన విజయవాడలోని ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడి అలజడి సృష్టించడం, ఇంట్లో మహిళలు, పిల్లలు భయభ్రాంతులకు గురయ్యేలా ప్రవర్తించటాన్ని తీవ్రంగా ఖండిస్తూ మచిలీపట్నంలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ ఆర్.గంగా ధరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ.. పత్రికా రంగంలోనే గౌరవప్రదమైన హోదాలో ఉన్న ఆర్.ధనంజయరెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి నిరాధార ఆరోపణలతో కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం సిగ్గుచేటన్నారు. అక్రమ కేసులు, దాడులతో పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవటం పోలీసుల అవివేకమన్నారు. కేసులు పెట్టి, దాడులు చేసి జర్నలిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవటం, మీడియా స్వేచ్చను అణగదొక్కాలనుకోవటం జర గని పని అని తేల్చిచెప్పారు. గతంలో ధనంజయరెడ్డిపై పెట్టిన అక్రమ కేసు, నేడు సోదాల పేరుతో పోలీసులు చేసిన హడావిడి ముమ్మాటికి కూటమి ప్రభుత్వ కుట్రేనని మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ధనంజయరెడ్డి ఇంట్లోకి చొరబడి సోదాలు అంటూ ఆయన కుటుంబాన్ని ఇబ్బందిపెట్టిన విజయవాడ సీపీ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛను హరించేలా కూటమి ప్రభుత్వం పాల్పడు తున్న చర్యలకు స్వస్తి పలకాలన్నారు. లేదంటే ఉద్యమబాట పట్టక తప్పదని హెచ్చరించారు. అనంతరం ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలను ఖండిస్తూ ఎస్పీ ఆర్.గంగాధరరావుకు మచిలీపట్నం పాత్రికేయుల ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టటాన్ని ఖండించాలని, దాడులు అరికట్టాలని ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పాత్రికే యులు పాల్గొన్నారు. విజయవాడలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు బందరు రోడ్డులో శాంతియుతంగా నిరసన తెలిపారు. అక్కడ నుంచి కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్కు చేరుకున్నారు. పోలీసుల దాడి ఘటనపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పలు చోట్ల జర్నలిస్టులు కదం తొక్కారు. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆయా చోట్ల ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడికి నిరసన పత్రికా స్వేచ్ఛపై ప్రభుత్వ తీరును ఎండగట్టిన జర్నలిస్టులు అధికారులు, ఎస్పీ గంగాధరరావుకు వినతి పత్రాలు అందజేత -
డీఎస్సీ అభ్యర్థులెవరూ సంతృప్తిగా లేరు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీ అభ్యర్థులు ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని, మానసిక అశాంతితో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. విజయవాడ ధర్నా చౌక్లో డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాని కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరిగింది. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో లక్ష్మణరావు మాట్లాడుతూ.. పరీక్షకు సన్నద్ధమవడా నికి 45 రోజులు సమయం చాలదని, 90 రోజులు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో జిల్లాకో పేపర్ విధానం అమలు చేయాలని కోరారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామన్న మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభ్యర్థులందరికి న్యాయం చేయని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆన్లైన్ పరీక్షను రద్దుచేసి ఆఫ్లైన్లో పెట్టాలని, పీఈటీ పోస్టులు సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు -
జిల్లాలో వేగంగా జల్జీవన్ మిషన్ పనులు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కేంద్ర అధికారులకు వివరించారు. జలజీవన్ మిషన్ పథకం అమలు ప్రక్రియ, పథకం అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై గురువారం న్యూఢిల్లీ నుంచి ప్రాజెక్టు అమలు జరుగుతున్న రాష్ట్రాలలోని జిల్లాల కలెక్టర్లతో కేంద్ర జల జీవన్ మిషన్ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు నగరంలోని కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే జలజీవన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రూ.6,100 కోట్ల నిధులతో జిల్లాలోని 16 మండలాలు, కృష్ణాజిల్లాలోని 24 మండలాలు, ఏలూరు జిల్లాలోని పది మండలాలు మొత్తం 50 మండలాలను కలిపి వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి తాగునీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రూ.2వేల కోట్ల నిధులతో 337 పనులు జరుగుతున్నాయని, ఇవి వచ్చే ఆగస్టు నాటికి పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పులిచింతల నుంచి నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని గ్రామాలకు, ఇబ్రహీంపట్నం వద్ద వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ నుంచి మైలవరం, జి.కొండూరు, తిరువూరు, ఎ.కొండూరు మండలాలలోని వివిధ గ్రామాలలకు, గొల్లపూడి వద్ద నుంచి ఏలూరు జిల్లాలోని 10 మండలాలు, కృష్ణాజిల్లాలోని 24 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, విస్సన్నపేట, జి.కొండూరు మండలాల్లోని వివిధ గ్రామాలకు జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించే కార్య క్రమానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎస్.విద్యాసాగర్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీల నియామకం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణాజిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీలలో నియమించారు. వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కాగిత జవహర్లాల్ నెహ్రూ(మచిలీపట్నం), జాయింట్ సెక్రటరీలుగా జంపాన కొండలరావు(పెనమలూరు), అత్తలూరి రెహమాన్( పెడన)లను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
ఒంటరి మహిళపై దౌర్జన్యం
టీడీపీ నాయకుల ఒత్తిడితో కేసు నమోదు చేయని పోలీసులు రామవరప్పాడు: ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్న ఒంటరి మహిళపై ఓ వ్యక్తి మద్యం మత్తులో దౌర్జన్యానికి పాల్పడిన ఘటన గురువారం ప్రసాదంపాడులో చోటు చేసుకుంది. ‘‘ నీ అంతు తేలుస్తా, నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా, నాకు టీడీపీ నాయకుల అండ ఉంది నిన్ను చంపితే దిక్కెవరు’’ అంటూ ఆ వ్యక్తి రెచ్చిపోయాడు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు టయోటా షోరూమ్ పక్క వీధిలో కాల్వగట్టు ప్రాంతంలో బి.జయశ్రీ తన ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటుంది. ఓ ఫొటో స్టూడియోలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కుమారులను చదివిస్తోంది. ఇదే ప్రాంతంలో రోషిబాబు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జయశ్రీ ఒంటరి మహిళ కావడంతో తరుచూ అసభ్య ప్రవర్తనతో వేధిస్తున్నాడు. నిత్యం మద్యం తాగి వచ్చి రాత్రుళ్లు బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఫూటుగా మద్యం తాగి జయశ్రీ ఇంటిపైకి వచ్చి దుర్భాషలాడుతూ గొడవకు దిగాడు. అతనితో పాటు రోషిబాబు కుటుంబ సభ్యులు కూడా గొడవకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేసు నమోదు చేయడం లేదు రోషిబాబు గత కొన్ని నెలలుగా నిత్యం మద్యం తాగి తన ఇంట్లోకి చొరబడి గొడవ పడుతూ చంపుతానని బెదిరిస్తున్నాడంటూ పటమట సీఐ, ఎస్ఐలను కలిసి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదని జయశ్రీ వాపోయింది. గతంలో కులం పేరుతో దూషిస్తూ బాణసంచా కాల్చి ఇంట్లో పడేసి బీభత్సం సృష్టించాడని తెలిపింది. స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపించింది. రోషిబాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం జరగకపోతే పోలీసు కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపింది. -
అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఘటనపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహంతిపురం జాడ పాపయ్య వీధిలో కట్టా హేమంత్కుమార్, స్రవంతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిది ప్రేమ వివాహం కాగా ఒక బాబు సంతానం. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో అదే వీధిలో ఉండే స్రవంతి తండ్రి పోతురాజు సర్ది చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన భార్యభర్తలిద్దరికీ గొడవ జరగ్గా పోతురాజు కుమార్తె ఇంటికి వెళ్లి సర్ది చెప్పి తిరిగి తన ఇంటికి వచ్చేశాడు. గురువారం తెల్లవారుజామున స్రవంతి నాలుగేళ్ల కుమారుడు తాతయ్య వద్దకు వచ్చి అమ్మ కదలడం లేదని చెప్పాడు. దీంతో పరుగు పరుగున కుమార్తె ఇంటికి వెళ్లే సరికి లోపల ఫ్యాన్ హుక్కు చున్నీతో ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతురాలి ఇంటికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. తండ్రి పోతురాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సీహెచ్ఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ)కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.సందీప్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీహెచ్ఓలు బుధ వారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సీహెచ్ఓలను పర్మినెంట్ చేయాలన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, రద్దు చేసిన ఈఎఫ్పీఓను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించాలని ఈ సందర్భంగా కోరారు. ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలను మినహాయించాలని, హెచ్ఆర్ పాలసీతోపాటు ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్, ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, సీహెచ్ఓలకు కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో అసోసియేషన్ ప్రతినిధులు, సీహెచ్ఓలు పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ -
భూగర్భ జలవిలాపం
కూటమి అధికారంలోకి వచ్చాక యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: వీరులపాడు మండలంలో కట్టలేరు ఒడ్డునే ఉన్న దొడ్డదేవరపాడు గ్రామానికి తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వి.అన్నవరం వద్ద వైరా నదిలో బోరు వేసి, అక్కడి నుంచి పైపులైన్ ద్వారా దొడ్డదేవరపాడు గ్రామంలోని ట్యాంక్ను నీటితో నింపుతున్నారు. ఆ నీటిని గ్రామంలోని దళిత కాలనీ, బీసీ కాలనీకి వంతుల వారీగా మూడు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. అది కూడా అరకొరగానే. తరచూ పైపులైన్లు లీకవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల ఇబ్బందులు తప్పడంలేదు. తీగునీరు అందని దళితవాడ వాసులు కట్టలేరులో చలమల నీటితోనే దాహార్తి తీర్చుకుంటున్నారు. యువకులు సైకిళ్లకు ప్లాస్టిక్ క్యాన్లు కట్టుకుని, మహిళలు బిందెలతో చెలమల వద్దకు వచ్చి తాగునీటిని తీసుకెళ్లడం ఇక్కడ నిత్య కృత్యం. తాగునీటి కష్టాలు ఒక్క దొడ్డదేవరపాడు గ్రామానికే పరిమితం కాలేదు. ఏటిపట్టు గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. నీరు అందక రక్షిత మంచినీటి పథకం మోటార్లు పాడైపోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు ఓ వైపు కృష్ణానది మూడు వైపులా మున్నేరు, వైరా, కట్టలేరు ఉపనదులు ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల మోటార్లను కృష్ణా, ఉపనదుల ఒడ్డునే ఏర్పాటు చేశారు. కూటమి అధికారం చేపట్టిన తర్వాత వాగులు, వంకలు, ఏర్లు అన్న తేడా లేకుండా విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతు న్నాయి. కృష్ణా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో పరివాహక ప్రాంతంలోని రక్షిత మంచినీటి పథకాలకు నీరు అందడం లేదు. నదికి నీటి ప్రవాహ పాయలు కుడివైపుగా ఉండడం, ఎడమవైపు పొక్లెయిన్లతో ఇసుక తవ్వడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో గత ఏడాది మార్చిలో 7.34 మీటర్లలో లోతున భూగర్భలాలు నమోద య్యాయి. ఈ ఏడాది మార్చి నాటికి 8.63 మీటర్లకు పడిపోయాయి. పెండ్యాలలో 3.99 మీటర్ల నుంచి 4.5 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఎక్కడ చూసినా ఇసుక తవ్వకాల జాడలే.. కంచికచర్ల మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు కృష్ణానది నుంచి, నాలుగైదు గ్రామాలకు మున్నేటి నుంచి తాగునీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం కృష్ణానదిలో ఎక్కడ చూసినా ఇసుక తవ్విన జాడలే కనిపిస్తున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో మండల ప్రజలు తాగునీరు, వాడుక నీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చందర్లపాడు మండలం కాసరబాద నది ఒడ్డునే ఉన్నప్పటికీ నీటి కష్టాలు తప్పడం లేదు. ఇక్కడ ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా సాగుతున్నాయి. పొక్కునూరు గ్రామంలోనూ నీటి ఎద్దడితో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. వత్సవాయి మండ లంలో మున్నేరు పరివాహక గ్రామాల్లో సైతం భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి అవస్థలు తప్పడం లేదు. డ్యామ్ ఉన్న పోలంపల్లిలోనే భూగర్భ జలమట్టం తగ్గిపోయింది. ఎ.కొండూరు మండలంలో స్థానికంగా లభించే నీటిని తాగునీటికి వినియోగించే పరిస్థితి లేదు. ఎటు చూసినా ఇసుకే.. విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో అడుగంటిన భూగర్భ జలాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎండిపోయిన రక్షిత నీటి పథకాలు పల్లెలు, పట్టణాల్లో తాగునీరు అదంక ప్రజలకు తప్పని ఇబ్బందులు నందిగామ పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. పట్టణానికి తాగునీరు సరఫరాచేసేందుకు మునేరులో ఆరు బోర్లు వేశారు. నాలుగు బోర్లలో నీరు పూర్తిగా అడుగంటింది. రెండు బోర్ల ద్వారా అరకొర నీరు సరఫరా అవుతోంది. దీంతో మునిసిపాలిటీలో నాలుగైదు రోజులకు ఓ సారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఉచిత ఇసుక పథకం పేరుతో కూటమి నేతలు జేసీబీలతో విచ్చలవిడిగా ఇసుకను తోడేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. చందర్లపాడు మండలం కాసరబాద కృష్ణానదిలో ఇసుక రీచ్ పేరుతో ఇరవై అడుగుల లోతు పెట్టి పెద్ద పొక్లెయిన్లతో ఇసుకను తవ్వటంతో నదిలో ఇసుక తప్ప చుక్కనీరు కనిపించటంలేదు. కంచికచర్ల మండలం కీసర, వేములపల్లి, పెండ్యాల, రీచ్లలో ఇసుకను అక్రమంగా తవ్వకాలు జరపటంతో మున్నేరులో కనీసం పశువులు తాగేందుకు చుక్కనీరు కరువైంది. నీరు అందక విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఇటీవల గండేపల్లి, కంచికచర్ల గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే విద్యుత్ మోటార్లు పూర్తిగా కాలిపోయాయి. -
ఇంగ్లిష్లో ‘పవర్’ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
అది ఓ మారుమూల గ్రామం.. అందులో ఓ ప్రాథమిక పాఠశాల.. పరిమిత సంఖ్యలో ఉండే విద్యార్థులు.. వారికి వాడుక భాష తప్ప.. తెలుగు కూడా సరిగ్గా రాని పరిస్థితి. అలాంటి వారు జాతీయ స్థాయి వేదికపై ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడటం, రాయడం అంటే ఆషామాషీ కాదు. కానీ దానిని సుసాధ్యం చేసి చూపించారు ఈ బుడతలు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పుణ్యమాని ఇంగ్లిష్ మీడియంలో చదువుతూ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా 30లక్షల మంది విద్యార్థులతో పోటీ పడి తమ పాఠశాల, గ్రామం, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని చాంపియన్గా నిలిపి వారెవ్వా వండర్ కిడ్స్ అనిపించుకున్నారు. జి.కొండూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య అనేది చారిత్రక తప్పిదంలా నానా యాగీ చేసిన నేటి పాలకులకు, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు సాధిస్తున్న అద్భుత ఫలితాలు చెంపపెట్టులా మారాయి. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండల పరిధి కనిమెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. మారుమూల పల్లెటూరులో ఉన్న ఈ పాఠశాల ఇప్పుడు దేశంలోనే హాట్ టాఫిక్గా మారింది. జాతీయ స్థాయి ఇంగ్లిష్ వర్డ్ పవర్ చాంపియన్ షిప్ పోటీలలో మొదటి రెండు స్థానాలను కై వసం చేసుకొని, రాష్ట్రానికి ఓవరాల్ చాంపియన్ ట్రోఫీని సాధించి.. కార్పొరేట్ పాఠశాలలకు తామేమీ తక్కువ కాదని నిరూపించారు ఇక్కడి విద్యార్థులు. పట్టు సాధించే విధంగా.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం విద్యను అమలు చేసిన నాటి నుంచి కనిమెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ విద్యా బోధన జరుగుతోంది. ఈ పాఠశాలకు మండవ విజయలక్ష్మి ఒక్కరే ఉపాధ్యాయురాలుగా, హెచ్ఎంగా పని చేస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లిష్పై పట్టు సాధించే విధంగా విజయలక్ష్మి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం అందించిన పుస్తకాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వినూత్న పద్ధతుల్లో అదనంగా ప్రతి రోజూ ముప్పై నిముషాలు ప్రత్యేక తరగతి నిర్వహించి బోధన చేశారు. పేద కుటుంబ నేపథ్యం.. కనిమెర్ల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన అన్నా చెల్లెళ్లు బి.రేవంత్కుమార్, బి. సింధు ప్రియ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి పేరు తెచ్చారు. ఈ చిన్నారుల తండ్రి భూపతి ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తుండగా, తల్లి దయామణి వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నివసించడానికి పక్కా ఇల్లు కూడా లేని ఈ కుటుంబం నుంచి ఇద్దరు చిన్నారులు జాతీయస్థాయిలో ప్రతిభచాటి రాష్ట్రానికి, జిల్లాకి, కనిమెర్ల గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టారు. వీరిద్దరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ సైతం వీరిద్దరితో పాటు హెచ్ఎం విజయలక్ష్మిని సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంగ్లిష్ మీడియం విద్యతో సత్ఫలితాలు ‘నాడు–నేడు’తో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూనే అద్భుతాలు జాతీయ ఇంగ్లిష్ వర్డ్ పవర్ చాంపియన్ షిప్ పోటీల్లో సత్తా మొదటి రెండు స్థానాలు కై వసం చేసుకున్న అన్నా చెల్లెళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు పాఠశాలలకు మెరుగైన వసతులను అందించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం చేపట్టిన ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద కనిమెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఆధునికీకరణ కోసం రూ.12లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఈ నిధులతో భవనం మరమ్మతులు, ప్రహరీ నిర్మాణం, టాయిలెట్ల రిపేర్లు, అత్యాధునిక సామగ్రి, విద్యోపకరణాలు అందించడం వంటి పనులను చేశారు. -
రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విప్లవం
– మంత్రి కొల్లు రవీంద్ర ఐనంపూడి(పామర్రు): రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విప్లవం మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఐనంపూడి గ్రామంలో రూ.11.26 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పురోభి వృద్ధికి అడుగులు పడ్డాయన్నారు. వచ్చే ఆరు నెలల్లో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణ పను లను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షుడు వల్లూరిపల్లి గణేష్, కెదరవల్లి ప్రవీణ్చంద్ర, మాజీ సర్పంచ్ బొప్పన భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొత్త రేషన్కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో కొత్త రేషన్కార్డులు జారీ కోసం అర్హులు తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ బుధవారం సూచించారు. కొత్త బియ్యం కార్డుల జారీతో పాటు కార్డులో సభ్యుల చేర్పులు, కార్డుల విభజన, సభ్యుల తొలగింపు, కార్డు సరెండర్, చిరునామా మార్పు, ఆధార్ సీడింగ్ సర్దుబాటు సేవలు పొందొచ్చని పేర్కొన్నారు. సమీపంలోని సచివాలయాల ద్వారా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందించి వారికి కావాల్సిన సేవలు పొందాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. -
కోటిరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం
వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పామర్రు: ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఏరువ కోటిరెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ సీపీ ఉమ్మడి కృష్ణా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కోటిరెడ్డి లేని లోటు తీరనిదన్నారు. ఏరువ కోటిరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్తో కలిసి సుబ్బారెడ్డి బుధవారం పరామర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రారంభం నుంచి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి కోటిరెడ్డి అని సుబ్బారెడ్డ కొనియాడారు. అనంతరం కోటిరెడ్డి భార్య విజయలక్ష్మి, కుమా రుడు అజయ్కుమార్రెడ్డి, కుమార్తె ఫణిప్రియను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభకే పట్టం సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి లక్ష్మణరావు పెనమలూరు: సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకే సీట్లు కేటాయిస్తామని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు అన్నారు. కానూరులో సిద్ధార్థ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష(ఎస్ఈఈఈ) 2025 ఫలితాలను ఆయన బుధవారం ప్రకటించారు. ఉత్తమ మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులకు పూర్తి ఫీజు రాయితీ ఇచ్చామని, 470 మంది విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా రూ.3 కోట్ల స్కాలర్షిప్లిస్తామని తెలిపారు. అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య మాట్లాడుతూ.. అకాడమీ పరిధిలోని విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నా మని తెలిపారు. వైస్ చాన్స్లర్ పి.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ఎస్ఈఈఈ ప్రవేశ పరీక్షలో ఎం.రేష్మశ్రీ, అబ్దుల్ కౌసర్, మల్లినేని మణి తేజ ర్యాంకులు సాధించగా వీరితో పాటు జేఈఈలో ప్రతిభ చాటిన బొప్పన హర్షిత, ఎం. జె.సుమతో కలిపి ఐదుగురి పూర్తి ట్యూషన్ ఫీజు రాయితీ ఇచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి 17 వరకు 900 ర్యాంకుల వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్, డైరెక్టర్ బావినేని పాండురంగారావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవి చంద్ర, డీన్లు జి.ఎన్.స్వామి, డి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
అనుక్షణం.. అప్రమత్తం
కోడూరు: ఉగ్రవాదుల పీచమణిచేందుకు పాకిస్తాన్పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన నేపథ్యంలో పోలీసు, మైరెన్ శాఖలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలోని సముద్ర తీరప్రాంత గ్రామాల వెంట పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దివిసీమలోని కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సముద్రం వెంట ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్ఐలు చాణిక్య, పూర్ణమాధురి సూచించారు. అపరిచిత వ్యక్తులు, అక్రమ చొరబాటుదారులు, బోట్లు సముద్రం వెంట కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలని ఆదేశించారు. పాలకాయతిప్ప సముద్ర శింకు వద్ద నిలిపి ఉన్న బోట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోస్టల్ సెక్యూరిటీ అధికారులు కూడా తీరం వెంట ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారని, అత్యవసర సమయంలో మత్స్యకారులు కూడా వారికి సహకరించాలని ఎస్ఐలు కోరారు. నిరంతర పర్యవేక్షణ.. పాలకాయతిప్ప బీచ్తో పాటు పవిత్ర సాగర సంగమ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాను సముద్రం వెంట కూడా పంపి, అనుమానాస్పద బోట్లపై ఆరా తీశారు. తీరం వెంట ఉన్న మడ చెట్లు, బోట్లతో పాటు కరకట్ట వెంట కూడా డ్రోన్తో పర్యవేక్షించారు. ప్రతి రోజు ఈ డ్రోన్ నిఘా ఉంటుందని ఎస్ఐలు చెప్పారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా అప్రమత్తమైన పోలీసు, మైరెన్ శాఖలు తీరప్రాంత గ్రామాల వెంట ప్రత్యేక నిఘా -
రైతన్నకు కంటి మీద కునుకు కరువు
భయం.. భయం.. కంకిపాడు: ధాన్యం లోడులు కదలటం లేదు. నిన్నటి వరకూ గోనె సంచుల కొరతతో ఇబ్బందులు పడ్డ రైతులు.. ప్రస్తుతం రవాణా వాహనాల సమస్యతో అష్టకష్టాలు పడుతున్నారు. ఫలితంగా ధాన్యం రోడ్ల పక్కనే నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో పంట ఏమవుతుందో అన్న ఆందోళన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు విన్నవిస్తున్నారు. మెండుగా దిగుబడులు.. ఈ ఏడాది రబీ సీజన్లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా 12,285 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. వాతావరణం అనుకూలించటం దిగుబడులు గణనీయంగా వచ్చాయి. ఎకరాకు 45–50 బస్తాల వరకూ దిగుబడులు చేతికొచ్చాయి. 43 వేల టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు చెబుతున్నాయి. గత ఖరీఫ్ సీజన్లో మిగులు ధాన్యంతో కలిపి ఈ దఫా 75వేల టన్నులు ధాన్యం సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 50వేల టన్నులకు పైగా ధాన్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు సేకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటుగా, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతా ల్లో మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ధాన్యం బస్తాలు రోడ్డు మార్జిన్లలో నిల్వ చేసి ఉంచారు. రవాణా వాహనాలు ఏవీ? జిల్లా వ్యాప్తంగా రవాణా వాహనాల సమస్య జటిలంగా ఉంది. అష్టకష్టాలు పడి రైతులు ఆర్ఎస్ కేలు, మిల్లుల వద్ద నుంచి గోనె సంచులు తీసుకుని ఆరబోసిన ధాన్యాన్ని బస్తాలకు ఎత్తుకున్నారు. అయితే రవాణా వాహనాలు సమృద్ధిగా లేకపోవటంతో ధాన్యం ఎక్కడిదక్కడే పేరుకుపోయింది. లారీలు రాకపోవటంతో బస్తాలు మిల్లులకు కదలటం లేదు. అధికారులు, మిల్లర్ల చుట్టూ పదే పదే తిరిగినా సమస్య అరకొరగానే తీరుతుంది తప్ప, పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచటం లేదని రైతులు వాపోతున్నారు. దళారులకు వెంటనే లారీలను పంపే మిల్లర్లు రైతుల పక్షాన నిలవటం లేదన్న ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కంకిపాడు మండలానికే సుమారు 30 లారీలకు పైగా అవసరం ఉందంటే సమస్య తీవ్రత ఇట్టే అవగతమవుతుంది.అకాల వర్షాలు రైతులను పట్టి పీడిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు కుదేలవుతున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని సంతోషించే లోపే, అకాల వర్షాలు తమ పాలిట శాపంగా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి వేళల్లో ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలీక, కల్లాలు, రోడ్డు మార్జిన్లలోనే పడిగాపులు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కాపాడుకున్న పంట ఎక్కడ వర్షం బారిన పడి నష్టపోవాల్సి వస్తుందోనన్న భయంతో అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. -
రైతులను ఆదుకోవడంలో కూటమి విఫలం
రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పామర్రు: ప్రస్తుతం రాష్ట్రంలో రైతులందరూ అకాల వర్షాల కారణంగా ఇబ్బందుల్లో ఉన్నారని, వీరిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ ఉమ్మడి కృష్ణా జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. కృష్ణాజిల్లా పామర్రులో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ధాన్యం, మినుములు, మొక్క జొన్న తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు అయిన కాడికి పంటను తెగనమ్ముకుని నష్ట పోతున్నారని వివరించారు. రోజురోజుకీ మినుముల ధర తగ్గిపోతున్నా కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం రైతుల పట్ల కూటమి నేతలకు ఉన్న శ్రద్ధ అర్థమవుతోందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడూ అండగా ఉంటూ పండిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించామని గుర్తు చేశారు. స్పందించకపోతే ఉద్యమమే.. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రైతుల తరఫున వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను నిర్వహించేందుకు వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి శ్రీనివాసరావు, ఎంపీపీ దాసరి అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు కోనేరుసెంటర్: భద్రతా దళాల ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషపూరితమైన సమాచారాన్ని షేర్ చేసినా, పోస్ట్ చేసిన ఆడియో, వీడియో మెసేజ్ల రూపంలో గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్రావు హెచ్చరించారు. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు అది వాస్తవమైనదా కాదా నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే గ్రూపుల్లో షేర్ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకు విరుద్ధంగా జరిగితే మెసేజ్లు ఫార్వర్డ్ చేసిన వ్యక్తులతో పాటు సంబంధిత గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడమని హెచ్చరించారు. జగదీష్ నల్లూరికి లెజెండరీ అవార్డు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటీఎస్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట జగదీష్ నల్లూరికి లెజెండరీ అవార్డు లభించింది. హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్–2025లో ఈ అవార్డు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చేతుల మీదుగా వెంకట జగదీష్ నల్లూరి ఈ అవార్డు అందుకున్నారు. మీడియా, ప్రకటన రంగానికి చేసిన అసాధారణ సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. నలభై ఏళ్లకు పైగా అనుభవంతో, వెంకట జగదీష్ ప్రాంతీయ ప్రకటన రంగంలో కీలక పాత్ర పోషించారు. జాతీయ, ప్రాంతీయ ప్రాధాన్యం కలిగిన అనేక ప్రభావవంతమైన ప్రచారాలను ఆయన నడిపారు. ఈ సందర్భంగా వెంకట జగదీష్ మాట్లాడుతూ హైబిజ్ టీవీ నుంచి ఈ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. క్రికెట్ అండర్–19 ఉమ్మడి జిల్లా జట్లు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్–19 పురుషులు వన్డే, మల్టీ డేస్ జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి తెలిపారు. 2025–26 సీజన్ కోసం మల్టీ డేస్ జట్టుకు రాజేష్ (కెప్టెన్), కార్తికేయ, కార్తికేయవర్మ, హర్షసాయిసాత్విక్, భానువరప్రసాద్, హరిదుర్గామణికంఠ, నిఖిల్, అఖిల్, ఆకర్ష్, ధీరుడు, గోవతం, యశ్వంత్, లలిత్, శ్రేయేష్, ఆదర్శ్, బవానీప్రసాద్.. వన్డే జట్టుకు రాజేష్(కెప్టెన్), కార్తికేయ, హేమంత్, హర్షసాయిసాత్విక్, భానువరప్రసాద్, రెనేష్, నిఖిల్, విఘ్నేష్, ధీరుడు, గోవతం, యశ్వంత్, లలిత్, ఆదర్శ్, శ్రేయేష్, రణధీర్, అవినాష్లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. -
ఆపరేషన్ సిందూర్కి సంఘీభావం
నాగాయలంక: పాకిస్తాన్ భూ భాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి విజయవంతంగా దాడి జరిపి, ఉగ్రవాదుల పీచమణిచిన భారతీయ సైనిక దళాలకు వందనం చేస్తూ నాగాయలంకలో బుధవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుదర్శి మానవతా సేవాసంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 60అడుగుల భారీ జాతీయ పతాకం చేతబూనిన వివిధ వర్గాల ప్రజలు, సంస్థల ప్రతినిధులతో మానవహారం నిర్మించి.. జైహింద్ నినాదాలతో జేజేలు పలికారు. సంస్థ నిర్వాహకులు తలశిల రఘుశేఖర్, కనిగంటి నారాయణ పర్యవేక్షణలో తొలుత ప్రధాన మార్గంలో ర్యాలీగా ట్రాఫిక్ ఐలెండ్ కూడలికి చేరుకుని అక్కడ మానవహారం నిర్మించారు. డీసీ మాజీ చైర్మన్ బీసాబత్తిని ప్రసాద్, చన్నగిరి లతామోహన్, అమ్మారావు తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ‘సాక్షి’పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, విజయవాడ: ఏపీలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారు. సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం ఉదయం.. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండానే ధనుంజయ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. కాసేపటికే ఇంటి తలుపులు మూసివేసి గంటల తరబడి సోదాలు చేశారు. అయితే, గతంలోనూ ధనుంజయ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసిన పలువురు సాక్షి విలేకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.ఏసీపీ ప్రవర్తన దుర్మార్గం: ధనుంజయ రెడ్డి అనంతరం, సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 9:45కి పది మంది పోలీసులు ఇంటికి వచ్చారు. సోదాలకు సంబంధించి నోటీసులు లేకుండా ఇంట్లోకి దూసుకొచ్చేశారు. ఏసీపీ మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. నోటీస్ కూడా ఇవ్వకుండా సోదాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తాయి. ప్రజల గొంతుకై ‘సాక్షి’ నిలుస్తుంది అని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కేసులు పెట్టారు. ప్రస్తుతం హైకోర్టు పరిధిలో కేసు ఉంది. సంబంధం లేదని వాళ్లే చెబుతారు. మళ్లీ వారే సోదాలు చేస్తారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా మేము ఫిర్యాదు ఇస్తాం. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ పద్ధతిని ఖండించాలి’ అని అన్నారు. ఖండించిన పాత్రికేయులుఏపీలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయని పాత్రికేయులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నందుకే సాక్షిపై చంద్రబాబు సర్కారు కక్ష సాధిస్తోందని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజాసంఘాలతో పాటు ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను నిగ్గదీసి అడుగుతున్నందుకు, కక్ష గట్టి ప్రజల గొంతును నొక్కాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే కూటమి సర్కారు ఇదంతా చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామన్నారు. సాక్షిపై కక్ష సాధింపు చర్యలను పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా పాత్రికేయులు పేర్కొన్నారు. ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా నడుచుకోవాలని కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. -
పరిహారానికి ‘మంగళ’మేనా!
కంకిపాడు: అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టం నమోదుకు మార్గదర్శకాలు జారీ చేయలేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం నమోదు చేయలేదు. అసలు పంట నష్టం అంచనాలపై పూర్తి స్థాయిలో నివేదికలు రూపొందించలేదు. కానీ, ప్రభుత్వం మాత్రం ‘మంగళవారం సాయంత్రానికే పరిహారం’ అంటూ ప్రచారం చేయటంపై రైతన్నలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం గడిచిపోయింది పంట నష్టపరిహారం ఏదీ... అని ప్రశ్నిస్తున్నారు. అకాల వర్షంతో అన్నదాతకు కష్టం పంట చేతికొచ్చేన తరుణంలో ఇటీవల ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణాజిల్లా వ్యాప్తంగా గాలి, వాన బీభత్సం సృష్టించింది. మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిచిపోయింది. మొక్కజొన్న కండెలు, గింజలు వర్షానికి తడిచి నానిపోయాయి. పొలాల్లో ఉన్న మొక్కజొన్న పంట నేలవాలింది. పెనమలూరు నియోజకవర్గంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలాయి. అరటి, బొప్పాయి, తమలపాకు, మునగ పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో ప్రభుత్వం పంట నష్టం నమోదుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. కానీ మంగళవారం సాయంత్రం వరకు ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ముఖ్యంగా అధికారులు ప్రాథమిక అంచనాలను సేకరించుకుని తమ వద్ద భద్రపర్చుకున్నారు.ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా పంట నష్టం నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే, వ్యవసాయశాఖ మాత్రం కృష్ణా జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరగలేదని తేల్చేసింది. ఉద్యానశాఖ అధికారులు మాత్రం 127 మంది రైతులకు చెందిన 231 ఎకరాల్లో బొప్పాయి, అరటి, మునగ, కూరగాయలు, తమలపాకు పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాలను నమోదు చేశారు. ఇందుకు గానూ రూ.1.04 కోట్లు పరిహారం అవసరమని అంచనాలను సిద్ధం చేశారు. అంతే తప్ప తుది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపలేదు. కానీ, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించి మంగళవారం నాటికి పరిహారం అందించాలంటూ అధికారులను ఆదేశించడంతో రైతులు ఆశ్చర్యపోతున్నారు. అసలు పంట నష్టం తుది నివేదిక తయారు చేయకుండా ఎలా పరిహారం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. -
‘ఉపాధి’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ కంచికచర్ల: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకి లక్షమంది కూలీలకు పనులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. కంచికచర్ల మండలం పరిటాలలో జరుగుతున్న ఉపాధిహామీ పథకం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం ద్వారా పనిచేసే కూలీలకు రోజుకు రూ. 307 వచ్చేలా కొలతలు ఇచ్చి పనులు చేయిస్తున్నామని చెప్పారు. ప్రతి కూలీ 100రోజులు పని పూర్తి చేసేలా ఉపాధిహామీ పథకం అధికారులు చూడాలన్నారు. పథకం ద్వారా రైతులు తమ పొలా ల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు ఫార్మ్ పాండ్(నీటి కుంట)లను తీయించుకోవాలని కలెక్టర్ అన్నారు. నందిగామ ఆర్డీఓ కే బాలకృష్ణ, ఎంపీడీఓ బీఎం విజయలక్ష్మి, ఏఓ కె. విజయకుమార్, ఏపీఓ రమాదేవి, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు. -
‘ఉపాధి’ కూలీలకు 80 లక్షల పని దినాలు లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఇబ్రహీంపట్నం: ఉపాధి హామీ పథకం కింద ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది కూలీలకు 80 లక్షల పనిదినాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో కలెక్టర్ మంగళవారం పర్యటించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న అమృత సరోవర్ పనులను పరిశీలించారు. ఉపాధి పనులు అత్యంత నాణ్యతగా, పారదర్శకంగా జరగాల న్నారు. ఇప్పటి వరకు 25 వేల పనిదినాలు కల్పించామన్నారు. ప్రతి కూలీకి రూ.307 దినసరి కూలి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండు వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలు తెల్లవారుజామున పని ప్రదేశానికి చేరు కుని ఉదయం పది గంటలకు పని ముగించి ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ పలుగు చేతబట్టి కూలీలతో పాటు మట్టిని తవ్వారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధిహామీ పీడీ ఎ.రాము, ఏపీఓ ప్రమీల, పంచాయతీ కార్యదర్శి మునేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీ
బస్సులో మర్చిపోయిన రూ. 1.29 లక్షల నగదు అప్పగింత బస్టాండ్(విజయవాడపశ్చిమ): బస్సులో మర్చిపోయిన నగదును తిరిగి ప్రయాణికులకు అందించి ఆర్టీసీ ఉద్యోగులు తమ నిజాయితీని చాటుకున్నారు. వివరాలు ఇవి.. సోమవారం రాత్రి కాళేశ్వరరావు మార్కెట్ నుంచి మంగళాపురం వెళ్తున్న రూట్ నెంబర్ 49ఎం బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రూ.1,29,800 నగదు ఉంచిన బ్యాగును మర్చిపోయి మంగళాపురంలో దిగి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన అనంతరం గుర్తించిన ప్రయాణికులు గవర్నరుపేట–2 డిపో వద్దకు వెళ్లారు. అప్పటికే బస్సులో మర్చిపోయిన బ్యాగును గుర్తించిన కండక్టర్ కుమారి, డ్రైవర్ రాజారావు నగదు కలిగిన బ్యాగును ఇన్చార్జ్ డిపో మేనేజర్ కె. బసవయ్యకు అప్పగించారు. ప్రయాణికుల నుంచి వివరాలు తీసుకున్న మేనేజర్ సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో బ్యాగును అందజేశారు. -
కృష్ణా జిల్లా కలెక్టర్కు రెడ్ క్రాస్ రాష్ట్ర అవార్డు
మచిలీపట్నంఅర్బన్: మానవీయ సేవల్లో అత్యుత్తమ కృషికి గుర్తింపుగా కృష్ణా జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షుడు డి.కె.బాలాజీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారని జిల్లా కార్యదర్శి శంకర్నాథ్ భవిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది బుడమేరు, కృష్ణా నది వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో కలెక్టర్ చూపిన నాయకత్వం, సేవా కార్యక్రమాల నిర్వహణకు గుర్తింపుగా ఈ అవార్డు వరించిందని పేర్కొన్నారు. వరదబాధితులకు ఆహారం, అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పని కూడా చురుకుగా నిర్వహించారని వివరించారు. ప్రపంచ రెడ్ క్రాస్, తలసీమియా దినోత్సవాల సందర్భంగా ఈ నెల ఎనిమిదో తేదీన రాజ్ భవన్ దర్బార్లో నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ అవార్డు ప్రదానం చేస్తారని తెలిపారు. దుర్గగుడి ఈఓగా శీనానాయక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈఓగా శీనానాయక్ను నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. బుధవారం సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. ‘భద్రతేది... భవానీ?’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల రెండో తేదీన దుర్గగుడి భద్రతపై కథనం ప్రచురితమైంది. ఆలయంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ పనులు, ఈఓ అందుబాటులో లేకపోవడం, అన్ని విభాగల్లో చోటు చేసుకుంటున్న వైఫల్యాలను ఈ కథనం వివరించింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి దుర్గగుడి ఈఓగా ఉన్న రామచంద్ర మోహన్కు ఆ తర్వాత దేవదాయ శాఖ కమిషనర్గా, అదనపు కమిషనర్గా బాధ్యతలు అప్ప గించింది. రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయాల్లో రెండో స్థానంలో ఉన్న దుర్గగుడికి శాశ్వత ఈఓ లేకపోవడం కూటమి పాలనకు నిదర్శనంగా నిలవడమే కాకుండా భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం దుర్గగుడి ఈఓగా శీనా నాయక్ను నియమించింది. 10న డయల్ యువర్ ఎస్పీకోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్రజా సమ స్యల పరిష్కారం కోసం ఈ నెల పదో తేదీన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు మంగళవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు తమ సమస్యలను స్వయంగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే చర్యలు తీసుకుంటా నని పేర్కొన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని బాధితుల కోసం ఈ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు 94407 96400 నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు.దక్షిణ ఆసియా వైద్య సదస్సులో సిద్ధార్థ వైద్యుల ప్రతిభ లబ్బీపేట(విజయవాడతూర్పు): మంగుళూరులో ఈ నెల రెండు నుంచి నాలుగో తేదీ వరకు జరిగిన 13వ దక్షిణ ఆసియా దేశాల చర్మ వ్యాధి వైద్యుల సదస్సులో విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల వైద్యులు ప్రతిభ చూపారు. ఆ సదస్సులో పాల్గొన్న చర్మవ్యాధుల విభాగాధిపతి డాక్టర్ టి.వాణి సమర్పించిన పరిశోధన పత్రానికి పోస్టర్ విభాగంలో అవార్డు లభించింది. ఆమె పర్యవేక్షణలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు పలు పరిశోధన పత్రాలు సమర్పించారు. స్కాలర్ షిప్ పోటీల్లో డాక్టర్ టి.వాణితో పాటు మరో నలుగురు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని మంగళవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు అభినందించారు. కలెక్టర్ బాలాజీ -
పంట సంరక్షణలో అన్నదాతలు
● తడిచిన మొక్కజొన్న, ధాన్యం ఆరబెట్టే పనిలో నిమగ్నం ● పల్లపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలింపు ● దెబ్బతిన్న పంట.. మద్దతు ధరపై ఆందోళన కంకిపాడు: రైతులు పంట సంరక్షణ పనులపై దృష్టి పెట్టారు. భారీ వర్షానికి తడిసిన మొక్కజొన్న, ధాన్యాన్ని ఎండబెట్టి నాణ్యతను కాపాడుకునేందుకు సంరక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. వర్షంతో తడిసిన ధాన్యం, మొక్కజొన్న నాణ్యత దెబ్బతిని మద్దతు ధరపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలి వాన బీభత్సం కారణంగా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కల్లాలు, ఖాళీ స్థలాల్లో ఆరబోసి రాశులు మీద ఉన్న ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది. మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు సైతం వర్షానికి తడిశాయి. పంట చేతికొచ్చిన తరుణంలో భారీ వర్షం ఊహించని ఉపద్రవంలా రైతులపై విరుచుకుపడింది. మద్దతుపై ఆందోళన.. భారీ వర్షం రైతులకు అకాల నష్టాన్ని తెచ్చిపెట్టినట్లయ్యింది. వర్షానికి ధాన్యం తడవటంతో మళ్లీ తేమశాతం పెరగటంతో మద్దతు ధర దక్కే విషయంలో నష్టపోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 75 కిలోల బస్తాకు బయటి దళారులు రూ. 1,350 ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆర్ఎస్కేల ద్వారా సంచులు, రవాణా వాహనాలను సమకూర్చి మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలన్న వాదన దాళ్వా రైతుల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో పాటు సుమారు 4 వేల ఎకరాల్లో కల్లాల్లో ఉన్న మొక్కజొన్న పంట తడవటంతో గింజలు నలుపెక్కుతాయని వాపోతున్నారు. క్వింటా రూ. 2 వేలు పలుకుతుందని, నాణ్యత దెబ్బతింటే ధర ఎంత పలుకుతుందో తెలీటం లేదని ఆవేదన చెందుతున్నారు. కష్టకాలంలో మొక్కజొన్న రైతులు మునిగిపోయారు. ఇప్పటికై నా వర్ష ప్రభావ ప్రాంతాలను గుర్తించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను స్థానికంగా తెరిచి మద్దతు ధర అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చలిగాలుల నుంచి.. సోమవారం, మంగళవారం ఉదయం వేళల్లో తీవ్రమైన ఎండ, వడగాల్పులు కారణంగా పంటను ఆరబెట్టేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడింది. దీంతో తడిసిన ధాన్యం రాశులు, మొక్కజొన్న రాశులను పూర్తి స్థాయిలో తిరగబెట్టి ఎండగట్టారు. కూలీలు, దంతిల సాయంతో రాశులను ఎండబెట్టి కాటాలు వేయించారు. పల్లపు ప్రాంతాలైన డొంకరోడ్లలో ఉన్న మొక్కొజొన్న, ధాన్యం రాశులను మెరక ప్రాంతాల్లో ఉన్న ఖాళీ వెంచర్లలోకి తరలించి సంరక్షించుకున్నారు. సాయంత్రం వేళల్లో చలిగాలులకు తేమ పెరగకుండా చుట్టూ పరదాలు, టార్పాలిన్లు కట్టి పంటను జాగ్రత్త చేసుకుంటున్నారు. -
‘ఏఎన్ఎంలకు ఏబీసీడీలు రావు’
● సోషల్ మీడియాలో ఓ సీహెచ్ఓ పోస్టు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏఎన్ఎంలు ● నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు ● వైద్యశాఖ సిబ్బంది మధ్య కొరవడిన సమన్వయం లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వంలో వైద్యశాఖ అస్తవ్యస్తంగా మారుతోంది. ఆ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల మధ్య సమన్వయం లోపించడంతో పేదలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. ఏడాదిగా వీరి మధ్య చాపకింద నీరులా ఉన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బహిర్గతం అయ్యింది. సిబ్బంది ప్రత్యక్ష ఆరోపణలకు దిగుతున్నారు. అంతేకాక నల్ల బ్యాడ్జిలతో నిరసనలు తెలుపుతూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ పరిష్కరించాల్సిన వైద్యశాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుతో.. ఇటీవల తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్లు పలు డిమాండ్లతో నిరవధిక సమ్మెకు దిగారు. వారి సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ తరుణంలో ఓ సీహెచ్ఓ.. ‘ఏబీసీడీలు రాని ఏఎన్ఎంలకు రూ.50 వేలు, సూపర్వైజర్లకు రూ.70 వేలు, రూ.లక్ష జీతాలు.. గ్రాడ్యుయేషన్ చేసిన మాకు తక్కువ జీతాలా.. ఏఎన్ఎంల యాప్లు అన్నీ మేమే చూస్తున్నాం, మెడికల్ ఆఫీసర్స్ యాప్లు కూడా మేమే చేస్తున్నాం’ అంటూ పెట్టిన పోస్టు వివాదానికి దారి తీసింది. ఎప్పటి నుంచో ఏఎన్ఎంలు, సీహెచ్ఓల మధ్య వివాదం నడుస్తుండగా, ఇప్పుడు ఈ పోస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది. ఏఎన్ఎంల నిరసన.. తమకు ఏబీసీడీలు రావంటూ సీహెచ్ఓలు అవమానించడంపై ఏఎన్ఎంలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా దీనిపై నిరసనలు తెలుపుతున్నారు. సోమవారం నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరైన ఏఎన్ఎంలు, మంగళవారం ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సీహెచ్ఓల తీరు బాగా లేదని, తమకు ఏబీసీడీలు రావనడం ఏమిటని మండిపడుతున్నారు. ప్రస్తుతం వారి మధ్య వివాదం నడుస్తుండగా, ఇది ఎక్కడి వరకూ కొనసాగుతుందోనని ఆ శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. -
ప్రజారోగ్యంపై సమ్మెట
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వ మొండి వైఖరితో పల్లె వైద్యం పడకే సింది. గ్రామీణ ప్రజలకు చేరువగా ఉంటూ, వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీ సర్లు (సీహెచ్ఓలు) నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్స్ (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు)లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకూ అనేక మంది గ్రామీణులు తమ ఇంటికి సమీపంలోనే ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్కు వెళ్లి పలు రకాల వైద్య సేవలు పొందేవారు. పాముకాటు, విషం తాగడం వంటి వాటికి తక్షణ ప్రాథమిక వైద్యం అందించేలా సీహెచ్ఓలు ప్రత్యేక శిక్షణ పొందారు. అవసరమైతే విలేజ్ హెల్త్ క్లినిక్ నుంచే నిపుణులతో టెలిమెడిసిన్లో సంప్రదించి రోగులకు అవసరమైన మందులు అందించేవారు. ఇప్పుడు ఆ సేవలన్నీ నిలిచిపోయాయి. సీహెచ్ఓల న్యాయమైన డిమాండ్లపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చేసేది లేక తమ సమస్యల పరిష్కారం కోసం సీహెచ్ఓలు నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని 257, కృష్ణా జిల్లాలోని 357 వెల్నెస్ సెంటర్లలో వైద్య సేవలు నిలిచిపోయాయి. కీలకంగా వెల్నెస్ సెంటర్లు కరోనా తర్వాత విలేజ్ హెల్త్ క్లినిక్లు వైద్య సేవలు అందించడంలో కీలకంగా మారాయి. అక్కడ బీఎస్సీ నర్సింగ్ చదివిన వారికి సీహెచ్ఓలుగా పోస్టింగ్ ఇచ్చారు. అంతేకాకుండా అత్యవసర సమయంలో అందించాల్సిన ప్రాథమ చికిత్సలపై కూడా వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పాము కాటు, పాయిజన్ వంటి కేసులు వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లే సమయానికి చేయాల్సిన తక్షణ వైద్యంపై వారికి తర్ఫీదు ఇచ్చారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వారికి పరీక్షలు నిర్వహించడం మందులు ఇవ్వడం వంటివి సీహెచ్ఓలు చేస్తున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్కు వైద్యం కోసం వచ్చిన రోగులకు టెలిమెడిసిన్ ద్వారా నిపుణులైన వైద్యులతో సంప్రదించి మందులు అందిస్తున్నారు. ఇలా ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి బుధ, శనివారం గర్భిణులు, బాలింతలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా అక్కడే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ సేవలు నిలిచిపోయాయి. సీహెచ్ఓల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం నిరవధిక సమ్మెబాట పట్టిన సీహెచ్ఓలు వెల్నెస్ సెంటర్లలో నిలిచిన వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో అందని అత్యవసర ప్రాథమిక వైద్యంసీహెచ్ఓల డిమాండ్లు ఇవీ.. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారిని రెగ్యులర్ చేయాలి. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలి. ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలి క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలి నిర్ధిష్టమైన జాబ్ చార్ట్ అందించాలి ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలి హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు వంటివి అమలు చేయాలి.సమస్యలను పరిష్కరించాలి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విలేజ్ హెల్త్ క్లినిక్లకు అత్యాధునిక భవనాలు నిర్మించడమే కాకుండా, అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించ డంతో సేవలు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వైద్య రంగంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
నిషేధిత భూములకు విముక్తి కలిగించాం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంటౌన్: ఎన్నో ఏళ్లుగా 22(ఏ) నిషేధిత జాబితాలోని భూములకు విముక్తి కలిగించి వాటిపై అనుభవదారులకు సర్వహక్కులు కల్పించామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి మంగళవారం నగరంలోని 4, 5 డివిజన్ల పరిధిలోని సర్కారుతోటలో ఉన్న సెక్షన్ 22 (ఏ)లో నమోదైన భూములకు మినహాయింపు ఉత్తర్వులు విడుదల చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నేడు వారి భూములను 22(ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగించి దాదాపు 340 మందికి పూర్తి హక్కులు కల్పించి అందుకు సంబంధించిన ఉత్తర్వులను వారికి అందించామన్నారు. సమస్యలపై ప్రత్యేక దృష్టి.. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం వారి భూములను 22(ఏ) నిషేధిత జాబితా నుంచి చట్టబద్ధంగా తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పూర్తి హక్కులు కల్పించిందన్నారు. బందరు ఆర్డీఓ కె. స్వాతి, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని తదితరులు పాల్గొన్నారు. -
బీచ్ ఫెస్టివల్ బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మంగినపూడి బీచ్లో జరిగే బీచ్ ఫెస్టివల్ను దిగ్విజయంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఆర్.గంగా ధరరావు తెలిపారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే బీచ్ ఫెస్టివల్ను పురస్కరించుకుని మంగినపూడి బీచ్ను ఎస్పీ మంగళవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను పరి శీలించారు. బందోబస్తుకు సంబంధించి అధికా రులు, సిబ్బందికి దిశానిద్దేశం చేశారు. అనంతరం ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ.. ముంగినపూడి బీచ్లో మూడు రోజులు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే బీచ్ ఫెస్టివల్కు పటిష్ట బందోబస్తు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. హెలిప్యాడ్, సభా వేదిక చుట్టుపక్కల ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. వాచ్ టవర్స్ ఏర్పాటు చేసి పర్యాటకులు బీచ్ లోతుకు వెళ్లకుండా పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ద్వారా అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఉత్సవాలు జరిగే మూడు రోజులు గజ ఈతగాళ్లను బీచ్ వద్ద అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ సాయిబాబు, అవనిగడ్డ తహసీల్దార్ హరనాథ్, బందరు డీఎస్పీ సీహెచ్.రాజ, బందరు రూరల్ ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఇంగ్లిష్లో ‘పవర్’ చూపించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముంబైలో ఏప్రిల్ 23న నిర్వహించిన జాతీయ స్థాయి ఇంగ్లిష్ వర్డ్ పవర్ చాంపియన్షిప్ పోటీలలో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు ప్రతిభకనబరిచారు. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో మన రాష్ట్రం నుంచి ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కనిమెర్ల ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీల్లో మొత్తం 2 నుంచి 5వ తరగతి వరకు 4 విభాగాలలో పోటీలు నిర్వహించగా, వీటిలో 4వ తరగతి విభాగంలో రేవంత్ ప్రథమ స్థానం, 2వ తరగతి విభాగంలో సింధు ప్రియ ద్వితీయ స్థానం సాధించింది. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. విజేతలు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. బహుమతులు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మిని సత్కరించారు. కాలువలోకి దూకి యువతి ఆత్మహత్య కోనేరుసెంటర్: ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బందరు మండలం ఎన్. గొల్లపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్. గొల్లపాలెం గ్రామానికి చెందిన కుక్కల విద్య (19) పదో తరగతి వరకు చదువుకుంది. తండ్రి సురేష్ వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఆమెకు సమీప బంధువుకు ఇచ్చి వివాహం చేసేందుకు నిర్ణయించాడు. అయితే ఇంకా చదువుకోవాలకునే విద్య విషయాన్ని తండ్రికి చెప్పింది. అందుకు ఆయన నిరాకరించాడు. అంత స్తోమత కుటుంబానికి లేదంటూ బుజ్జగించాడు. తెచ్చిన సంబంధం చేసుకోవాలంటూ ఆదేశించాడు. దీంతో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని విద్య సోమవారం మధ్యాహ్నం తండ్రి బైక్ వేసుకుని బయటికి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చిన తండ్రి గ్రామంలో ఆరా తీశాడు. అతని బైక్ చిన్నాపురం గ్రామ సమీపంలోని గుండేరు వంతెనపై ఉన్నట్లు పరిచయస్తులు చెప్పారు. అక్కడికి వెళ్లి చూడగా బైక్ కనిపించింది. సురేష్ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. పోలీసులు మంగళవారం గుండేరు కాలువలో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్య కాలువలో శవమై కనిపించింది. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. ట్రావెల్స్ యజమాని బలవన్మరణంతోట్లవల్లూరు: అనుమానాస్పద స్థితిలో కార్ ట్రావెల్స్ యజమాని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రమైన తోట్లవల్లూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన పేర్ల సుధాకర్రెడ్డి(33) స్థానిక కనకదుర్గమ్మ కాలనీలో మూడేళ్లుగా నివాసం ఉంటున్నాడు. పెనమలూరులో పీఎస్ఆర్ ట్రావెల్స్ పేరుతో కృష్ణారెడ్డి అనే వ్యక్తితో కలిసి నిర్వహిస్తున్నాడు. వ్యాపార పనుల నిమిత్తం వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన సుధాకర్రెడ్డి ఈ నెల 5 సోమవారం రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చాడు. సుధాకర్రెడ్డి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఉండటాన్ని మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి పేర్ల రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అవినాశ్ తెలియజేశారు. -
నేరస్తులకు కచ్చితంగా శిక్షలు పడాలి
వర్క్షాప్లో కృష్ణా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: నేరాలకు సంబంధించిన దర్యాప్తుల్లో నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోలీసుల దర్యాప్తు ఉండాలని ఎస్పీ ఆర్. గంగాధరరావు సూచించారు. దర్యాప్తులో నేరాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను సంపూర్ణంగా సేకరిస్తేనే అది సాధ్యపడుతుందని ఆ దిశగా అధికారులు, సిబ్బంది దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ కేసులకు సంబంధించిన దర్యాప్తు చేసే అధికారులకు ఫారెన్సిక్ ఎవిడెన్స్ సేకరించడం, సంరక్షించడం, టెస్టింగ్కు పంపే సమయం, ప్యాకింగ్లో పాటించవలసిన అంశాలపై ప్రత్యేక నిపుణులతో ఒకరోజు వర్క్ షాప్ను నిర్వహించారు. జిల్లా పోలీసు సమావేశపు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పోలీస్ అధికారికి ఏదో ఒక రూపంలో సవాలు ఎదురవుతూనే ఉంటుందన్నారు. నేరానికి దారి తీసిన అంశాలను తెలుసుకునేందుకు ప్రతి పోలీసు అధికారి సంపూర్ణ నిష్ణాతుడై ఉండాలన్నారు. ఈ సదస్సులో నేర్చుకున్న ప్రతి అంశం దర్యాప్తు వేగవంతంగా పూర్తి కావటానికి, నేరస్తులకు వీలైనంత త్వరగా శిక్షపడేలా చేయడానికి, సహాయపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ వి.వి నాయుడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్. శ్రీలత, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎస్.వీర కుమారి, జె. సత్యరాజు, సైంటిఫిక్ ఆఫీసర్ కె. సురేంద్రబాబు, మెడికల్ ఆఫీసర్ డి.హుమేరా జుబేదా ఖానం తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు చర్యలు
కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): మొక్కలు విరివిగా నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్ లో సోమవారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో మొక్కల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావితరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విరివిగా మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, వ్యక్తిగత గృహాలకు మొక్కలను ఉచితంగా పంపిణీ చేసేందుకు మచిలీపట్నం నగరంలో చిన్నాపురం డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ లక్ష్మణస్వామి ముందుకు వచ్చారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణస్వామిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. రానున్న జూలై నాటికి మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆ లోపుగా మొక్కల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్, కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష, జిల్లా అటవీ శాఖ అధికారి సునీత, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి.రమేష్, దేవదాయ, సాంఘిక సంక్షేమ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వృద్ధురాలు మృతి మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు కృష్ణా జిల్లా మోపిదేవిలో 216 జాతీయ రహదారిపై ఎస్.విహార్ సమీపంలో ఆదివారం రోడ్డు దాటుతుండగా సుమారు 65 సంవత్సరాల వయస్సు గల వృద్ధ మహిళను ద్విచక్ర వాహనం ఢీకొన్నట్లు తెలిపారు. గాయపడిన వృద్ధురాలు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వివరించారు. మృతి చెందిన వృద్ధురాలిని గుర్తుపట్టిన వారు సమాచారం పోలీస్ స్టేషన్లో ఇవ్వవలసిందిగా ఎస్ఐ సత్యనారాయణ కోరారు. -
పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి
లబ్బీపేట(విజయవాడతూర్పు): పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డు సచివాలయ ఏఎన్ఎంలు పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వేలు, కార్యక్రమాలతోనే తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, మరోవైపు మునిసిపల్ అధికారులు ఆ పన్ను వసూళ్లు, ఈ పన్ను వసూళ్లు అంటూ సంబంధం లేని పనులు చెబుతుండటంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రతి సచివాలయంలో ఒక్కో ఏఎన్ఎం విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడలో నిత్యం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ పనిచేసినా వారికిచ్చిన టార్గెట్లు పూర్తికావడం లేదు. దీంతో ఇదేమి ఖర్మ అంటూ తమను తామే నిందించుకుంటున్నారు. తమను వైద్యశాఖకే పరిమితం చేయాలంటూ వేడుకుంటున్నారు. నిముషం తీరిక లేక.. ప్రస్తుతం ఏఎన్ఎంలకు దాదాపు 30 రకాల యాప్లు ఇచ్చారు. వాటిలో నిత్యం సమాచారాన్ని నిక్షిప్తం చేయాల్సి ఉంది. ఒక్కోసారి నెట్వర్క్ పనిచేయక చికాకు తెప్పిస్తోంది. గర్భిణుల గుర్తింపు, హైరిస్క్ గర్భిణుల పర్యవేక్షణ, డ్రైడే ఫ్రైడే, ఆశ డే, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ వంటి వాటితో పాటు, ఎన్సీడీ–సీడీ సర్వే ప్రతిరోజూ ఇంత మందిని చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్కరినీ రెండు వందల ప్రశ్నలు అడిగి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక్కొక్కరికీ 45 నిముషాల వరకూ సమయం పడుతుంది. కుటుంబంలో ముగ్గురు, నలుగురు ఉంటే అక్కడే రెండు గంటల సమయం సరిపోతుంది. దీంతో మిగిలిన కార్యక్రమాలు చేయలేక పోతున్నారు. మునిసిపల్ అధికారుల వేధింపులు.. వైద్యశాఖ కార్యక్రమాలతోనే ఏఎన్ఎంలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, మరోవైపు మునిసిపల్ అధికారులు సైతం సచివాలయ ఏఎన్ఎంలకు పలు పనులు అప్పగిస్తున్నారు. ప్రతిరోజూ గంట పాటు వారితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ టార్గెట్లు పెడుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్ను వసూళ్లు కూడా తామే చేయాలంటున్నారంటూ చెబుతున్నారు. ఈ ఉద్యోగం తాము చేయలేమంటూ ప్రత్యామ్నాయం చూసుకుంటున్న వారు ఉంటున్నారు. పట్టణ ప్రాంత ఏఎన్ఎంల ఆవేదన ఒకవైపు సర్వేలు, మరోవైపు పన్ను వసూళ్లు అసలు తాము ఎవరి పరిధిలో పని చేస్తున్నామో తెలియడం లేదంటున్న ఏఎన్ఎంలు విజయవాడలో ఓ ఏఎన్ఎంకు వేధింపులు వైద్యశాఖకే పరిమితం చేయాలి.. ప్రస్తుతం ఏఎన్ఎంలు విధుల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వారికి అనేక రకాల యాప్లు ఇచ్చి వాటిలో సమాచారం అప్లోడ్ చేయమంటున్నారు. అంతేకాదు మునిసిపాలిటీల్లో పనిచేసే ఏఎన్ఎంలకు వారి పనులు కూడా చెప్పడంతో మరింత ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ఏఎన్ఎంలను వైద్యశాఖ పరిధిలోనే పనిచేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. – అంగిరేకుల దుర్గాప్రసాద్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇవే నిదర్శనం.. బాపట్ల జిల్లా రేపల్లెలో వార్డు సచివాలయ ఏఎన్ఎం పని ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానని, ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందంటూ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఉదయం6 నుంచి రాత్రి 10 గంటల వరకూ విధులేనంటూ ఆమె డెత్నోట్లో పేర్కొంది. విజయవాడ సింగ్నగర్ ప్రాంతంలో పనిచేసే ఏఎన్ఎం తమకిచ్చిన టార్గెట్ పూర్తి కాక పోవడంతో రాత్రి 8 గంటల సమయంలో కూడా ఎన్సీడీ– సీడీ సర్వే కోసం ఓ ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో సర్వేలు ఏమిటీ పనిపాట లేదా అంటూ ఒకరు అసభ్యంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇలా నిత్యం ఏఎన్ఎంలు పని ఒత్తిడితో పాటు, టార్గెట్లు రీచ్ అయ్యే క్రమంలో అవమానాలకు గురవుతూనే ఉన్నారు. -
చివరికి కడగండ్లే!
కంకిపాడు సెక్షన్ పరిధిలో బందరు కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో చివరి ఆయకట్టుకు సాగు నీరు చేరడం గగనంగా మారుతోంది. కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులను ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో రైతులకు కష్టాలు, కడగండ్లు తప్పడం లేదు. ఇప్పటికే కాలువలు గుర్రపు డెక్క, తూటి కాడతో నిండిపోయాయి. ఈపాటికే పిచ్చిమొక్కల తొలగింపుతోపాటు, అక్కడక్కడ కాంక్రీట్ పనులు, షట్టర్లకు మరమ్మతులు చేయాల్సింది. అయితే ప్రభుత్వం ఈ పనులు చేసే దిశగా అడుగులు వేయటం లేదు. జూన్ మొదటివారంలోపు పనులు పూర్తి చేయకుంటే, తర్వాత కాలువలకు సాగు నీరు విడుదల చేస్తారు. పనులు చేసే అవకాశం ఉండదు. ఇదే అదునుగా పనులు మంజూరు అయినప్పటికీ, పనులు చేయకుండానే మమ అనిపించి నిధులు మింగేసే అవకాశం కూడా ఉంది. సకాలంలో పనులు చేయకపోతే చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. వర్షాలు వస్తే, డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటకిపోక అల్లాడిపోతున్నారు. డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సింది. పనుల మంజూరులో జాప్యం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సంఘాలకు రూ.10లక్షల వరకు నామినేషన్పై పనులు కట్టబెట్టే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ కాలువల్లో తూటికాడ, పిచ్చిమొక్కల తొలగింపు, షట్టర్ల మరమ్మతులు, కాంక్రీట్ పనులు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మార్చి నెలలోనే ప్రభుత్వానికి పంపా రు. ప్రభుత్వం ఇప్పటికీ పనులు చేసేందుకు అనుమతులు మంజూరు చేయలేదు. దీంతో ఈ నెలలో పనులు పూర్తి కావటం గగనమే. గత ఏడాది పనులకు టెండర్లు ఆలస్యంగా పిలిచి, ఖరారు చేయడంలో జాప్యం జరిగింది. 160 పనులు రూ.32.79కోట్లతో చేపట్టారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని, టెండర్లతో సంబంధం లేకుండానే కొంత మంది కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పారు. వారు 40–48 శాతం లెస్ వేసి పనులు దక్కించుకున్నారు. వీరంతా పనులు చేయకుండానే మమ అనిపించి చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టర్లు, నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మకై ్క బిల్లులు దండుకొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.బుడమేరులో మేటవేసిన గుర్రపుడెక్క కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో ఆయకట్టు కాలువలు, డ్రెయిన్లలో పేరుకుపోయిన తూటికాడ కొద్దిపాటి వర్షానికే పొలాల మునక ఇంకా ప్రతిపాదన దశలోనే పనులు జూన్ మొదటి వారంలోపు పనులు చేయకపోతే కష్టాల సాగేఈ ఏడాది ప్రతిపాదిత పనులు.. డివిజన్ పనుల విలువ సంఖ్య (రూ.కోట్లలో) కృష్ణా తూర్పు 121 8.45 కృష్ణా సెంట్రల్ 144 7.28 డ్రెయినేజి విభాగం 288 9.00 స్పెషల్ 15 1.30 మొత్తం 568 26.03 కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా..(ఎకరాల్లో) కాలువ కృష్ణా ఎన్టీఆర్ బందరు 1.51లక్షలు – కేఈబీ 1.38 లక్షలు – ఏలూరు 0.56 లక్షలు 1,332 రైవస్ 2.17 లక్షలు 425 మొత్తం 5.62లక్షలు 1,757 -
జిల్లాలో 648 మి.మీ వర్షపాతం
గుడివాడరూరల్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం 648 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం కురిసిన వర్షాలకు పంట నష్టం తదితర వివరాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ గుడివాడ ఆర్డీవో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎక్కువగా వర్షం కురిసిందని, బంటుమిల్లి మండలంలో 109.2 మిల్లీమీటర్లు, కంకిపాడు మండలంలో 56.2 మిల్లీ మీటర్లు, ఉయ్యూరు మండలంలో 52.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలో 76 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, అందులో ముఖ్యంగా 64 హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతిన్నాయని, కంకిపాడులో ఒక గేదె చనిపోయిందని కలెక్టర్ సీఎంకు వివరించారు. సీఎం కాన్ఫరెన్స్లో కలెక్టర్ బాలాజీ వెల్లడి -
ఉత్తమ ప్రదర్శనగా ‘27వ మైలురాయి’
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం కొలకలూరులో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 11వ ఆహ్వాన నాటికల పోటీల్లో యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ వారి ‘27వ మైలురాయి’ నాటిక ఉత్తమ ప్రదర్శన బహుమతిని అందుకుంది. ఇదే నాటికలో వైదేహి పాత్రలో నటించిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటి సురభి ప్రభావతి ఉత్తమ నటిగా, రాజన్న పాత్రధారి పవన్కుమార్ ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా, నాటిక రచయిత పీటీ మాధవ్ ఉత్తమ రచయిత బహుమతులను అందుకున్నారు. మూడు రోజులపాటు జరిగిన నాటికల పోటీల్లో విజేతలకు చివరి రోజైన ఆదివారం రాత్రి బహుమతులను అందజేశారు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా చైతన్య కళాస్రవంతి, విశాఖపట్నం వారు ప్రదర్శించి ‘అసత్యం’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికకు మరో నాలుగు బహుమతులు దక్కటం విశేషం. రఘుపతి పాత్రధారి వై.అనిల్కుమార్ ఉత్తమ ప్రతినాయకుడు, నాటిక దర్శకుడు పి.బాలాజీనాయక్కు, సంగీతాన్ని అందించిన పి.లీలామోహన్కు ఉత్తమ సంగీతం, ఉత్తమ లైటింగ్కు థామస్ బహుమతులను అందుకున్నారు. తృతీయ ఉత్తమ ప్రదర్శనగా విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ‘స్వేచ్ఛ’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికలో నటించిన గోవాడ వెంకట్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. న్యాయనిర్ణేతలుగా ఆంజనేయులు నాయుడు (పొన్నూరు), చలసాని కృష్ణప్రసాద్ (విశాఖపట్నం), మానాపురం సత్యనారాయణ (పాలకొల్లు) వ్యవహరించారు. -
జిల్లా స్థాయి ‘మీ కోసం’లో 126 అర్జీలు స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకానికి సంబంధింఛి జిల్లాలో ఎనిమిది గ్రామాల్లో ఈ నెల 10వ తేదీన ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అప్పటికప్పుడే దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు అందిస్తామన్నారు. కోర్టు కేసుల్లో అప్రమత్తంగా ఉండాలి.. కోర్టు కేసులకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కోర్టులు అడిగిన సమాధానాన్ని కౌంటర్ రూపంలో దాఖలు చేయాలన్నారు. అత్యవసర కేసులు ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టిసారించి కోర్టు ఏమి అడిగింది, దానికి ఏ విధమైన సమాధానం చెప్పాలో ప్రభుత్వ న్యాయవాదులను సంప్రదించి ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు 126 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
గుడివాడరూరల్: నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావులతో కలసి నియోజక వర్గంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ప్రధానంగా తాగునీటి సమస్య, ఉపాధి హామీ పథకం పనులు, ఇరిగేషన్, డ్రైనేజీ, వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక, రహదారులు, భవనాలు పీఎం సూర్యఘర్, ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలోని దనియాలపేటతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని ఆదేశించారు. గుడివాడ టిడ్కో గృహ సముదాయంతో పాటు నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే రాము కలెక్టర్కు వివరించగా ఆ శాఖ అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. తాగునీటి సమస్యపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం పనితీరు మార్చుకోవడం లేదని, తీరు మార్చుకుని పని చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నియోజక వర్గంలో గృహ నిర్మాణ పనులపై ఆ శాఖ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిమెంటు, ఇనుము, ఇసుక వంటి సామగ్రి అందుబాటులో ఉన్నప్పటికీ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని గృహ నిర్మాణ శాఖ ఈఈ రామోజీనాయక్ను కలెక్టర్ ప్రశ్నించారు. పనితీరు మార్చుకుని వీలైనంత త్వర గా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల ఖ ర్చులను తగ్గించుకునేందుకు పీఎం సూర్యఘర్ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూ చించారు. సమావేశంలో ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నటరాజన్, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, పశు సంవర్థకశాఖ జిల్లా అధికారి నరసింహు లు, ఏపీ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి, కూటమి నాయకులు బూరగడ్డ శ్రీకాంత్, యలవర్తి శ్రీనివాసరావు, దింట్యాల రాంబాబు, వా సే మురళి, కర్రే వెంకటగిరి, గోవాడ శివ, అన్ని ప్ర భుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి ఎమ్మెల్యే రాముతో కలసి అధికారులతో సమీక్ష -
సకాలంలో సంతృప్తికర పరిష్కారమే లక్ష్యం
గుడివాడరూరల్: ప్రజల నుంచి వచ్చే అర్జీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలసి ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 58 అర్జీలు వచ్చాయని ఆర్డీవో కార్యాలయ అధికారులు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, మునిసిపల్ కమిషనర్ మనోహర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని పంచాయతీ మంచినీటి చెరువులో ఎటువంటి ఆమోదం లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని గ్రామానికి చెందిన గంటా శ్రీను కలెక్టర్కు అర్జీ అందజేశారు. ● పట్టణంలోని 30వ వార్డు ధనియాలపేట కాలనీలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, ఆ కాలనీ మహిళలతో కలసి కలెక్టర్కు అర్జీ సమర్పించారు. ● గుడివాడ మండలం మోటూరు గ్రామానికి చెందిన వనం విజయశాంతి, కె.స్వప్న తాము బీసీ కాలనీలో నివసిస్తున్నామని, ఇంటిపై విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. వీటి వల్ల కొన్నేళ్ల క్రితం ఇద్దరు టాపీ కార్మికులు చనిపోయారని వివరించారు. ఇది అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని కలెక్టర్కు విన్నవించారు. అర్జీదారుల ఇబ్బందులు.. ఆర్డీవో కార్యాలయం వద్ద మీకోసం కార్యక్రమాన్ని ఉదయం 10.30గంటలకు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారని ముందుగానే అధికారులు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీదారులు 10.30గంటలకే రాగా.. కలెక్టర్ రెండున్నర గంటల పాటు ఆలస్యంగా రావడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత తాగడానికి నీరు కూడా లేకపోవడంతో అర్జీదారులు అధికారులను ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ‘మీకోసం’లో కలెక్టర్ బాలాజీ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల దుర్మరణం
మూలపాడు(ఇబ్రహీంపట్నం): రెక్కాడితే గాని డొక్కాడని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. సేకరించిన వివరాల మేరకు.. ఇబ్రహీంపట్నంకు చెందిన తొమ్మిది మంది మహిళా వ్యవసాయ కూలీలు సమీపంలోని కేతనకొండ గ్రామంలో మిరపకాయల కోతకు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. మూలపాడు నుంచి రాంగ్రూట్లో కేతనకొండ వైపు ఆటో వెళ్తున్న క్రమంలో జెడ్పీ పాఠశాల సమీపంలో హైదరాబాద్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న వాహనం కూలీల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూలీలు పదిమీటర్ల దూరంలో గాల్లోకి ఎగిరి చెల్లాచెదురుగా పడ్డారు. వారిలో వేల్పుల మరియమ్మ(45), భూక్యా దుర్గ(49) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన మూఢావత్ గౌరి పరిస్థితి విషమంగా ఉంది. కన్నెగంటి స్వప్న, వేల్పుల మరియమ్మ, చింత వసంత, షేక్ మౌలాబీ, వెంకటకుమారి, తుపాకుల దుర్గ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేల్పుల మరియమ్మ, భూక్యా దుర్గ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్ర శేఖర్ తెలిపారు. కూలీల ఆటోను ఢీకొట్టిన కారు మరో ఏడుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఘటన -
తిరుపతమ్మ ఆలయానికి ట్రాక్టర్ ట్రక్కు బహూకరణ
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయానికి సోమవారం పెనుగంచిప్రోలుకు చెందిన కర్ల భాస్కరరావు, పద్మావతి దంపతుల కుమారులు కర్ల రామకృష్ణారావు, వసుంధర దంపతులు, కర్ల శ్రీనివాసరావు, పద్మావతి దంపతులు రూ.2.50లక్షల విలువైన ట్రాక్టర్ ట్రక్కును బహూకరించారు. గతంలో వీరు ఆలయానికి రూ.10 లక్షల విలువైన ట్రాక్టర్ను కూడా అందించారని అధికారులు తెలిపారు. ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలతో సత్కరించారు. ఈఓ కిషోర్కుమార్, ఆలయ డైరెక్టర్ బెజవాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 8 నుంచి చెస్ ఉచిత శిక్షణ శిబిరం విజయవాడస్పోర్ట్స్: ప్రభుత్వ, మునిసిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గ్లోబల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల ఎనిమిదో తేదీ నుంచి చెస్ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ అకాడమీ కార్యదర్శి షేక్ ఖాసీం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ అకాడమీ పక్కనే ఉన్న తమ అకాడమీలో జూన్ ఎనిమిదో తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 98495 14138 నంబరును సంప్రదించి, పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్ సిబ్బందికి మెమోలు గుంటూరు జీజీహెచ్: గుంటూరు జీజీహెచ్లో సోమవారం అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత గతంలో నర్సింగ్ సూపరింటెండెంట్గా పనిచేసిన ఆషా సజనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించారు. అనంతరం ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్లో తనిఖీలు చేసి, ఆపరేషన్ థియేటర్లో సక్రమంగా ఓటీ డ్రస్సులు ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత వైద్య సిబ్బంది, వైద్యులకు మెమోలు జారీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను ఆదేశించారు. మార్చురీ విభాగంలో తనిఖీలు చేశారు. లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న మనోజ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వర్తిస్తుండటంతో అతని ని అక్కడి నుంచి తొలగించాలని ఆదేశించారు. వైద్య విద్యార్థులకు మార్చురీ విభాగంలో క్లినికల్ తరగతులు నిర్వహించేందుకు వసతులు పరిశీలించారు. నాట్కో క్యాన్సర్ సెంటర్ విభాగంలో వైద్యులు, వైద్య అధికారులతో సమావేశం నిర్వహించి ఆస్పత్రి అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, నర్సింగ్ రిజిస్ట్రారు సుశీల తదితరులు ఉన్నారు. దక్షిణ భారత టెన్నిస్ బాల్ క్రికెట్ చాంప్ రన్నర్గా ఏపీ విజయవాడస్పోర్ట్స్: దక్షిణ భారత టెన్నిస్ బాల్ క్రికెట్ అండర్–14 బాలుర చాంపియన్షిప్లో రాష్ట్ర జట్టు రన్నరప్ ట్రోఫీని కై వసం చేసుకుందని ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.డి. ప్రసాద్ తెలిపారు. నెల్లూరులో ఇటీవల ఈ పోటీల్లో రాష్ట్ర జట్టు అత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిందన్నారు. ప్రతిష్టాత్మకమైన పోటీ ల్లో ట్రోఫీ సాధించిన జట్టును ఆయన అభినందించారు. ఇదే క్రీడా స్ఫూర్తితో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ట్రోఫీ సాధించిన జట్టును ఎన్టీఆర్ జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకృష్ణ, కె.ఎస్.స్వామి అభినందించారు. రేపటి నుంచి తిరుకల్యాణోత్సవాలు వేదాద్రి(జగ్గయ్యపేట): వేదాద్రి గ్రామంలో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మినరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. 14వ తేదీ వరకు జరిగే కల్యాణోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణ మహోత్సవాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చలువ పందిళ్లు వేశారు. -
నష్టం పోతున్నాం..
డ్రెయిన్లు, కాలువల్లో సకాలంలో పూడికతీత పనులు చేయకపోవడంతో పంట పొలాలు నీట మునిగిపోతున్నాయి. చేయాల్సిన సమయంలో పూడిక తీత పనులు చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మకై ్క పనులు చేయకుండా బిల్లులు చేయించేసుకుంటున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. –శ్రీనివాసరావు, రైతు గుడివాడ పూడికతీతీ వెంటనే చేపట్టాలి ప్రధాన కాలువలు, అనుబంధ కాలువలు అన్నీ గుర్రపు డెక్కతో నిండిపోయాయి. మట్టి మేట వేసుకుపోయి వాటి నుంచి సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టకపోతే ఖరీఫ్ నాటికి భూములకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బంది నెలకొంటుంది. – నెరుసు నాని, రైతు ఉప్పులూరు ● -
ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
కోనేరుసెంటర్: మీకోసం కార్యక్రమంలో అందిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను సానుకూలంగా ఆలకించిన ఎస్పీ ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధైర్యపడొద్దు...ప్రతి ఒక్కరికీ పోలీసులు అండగా ఉంటారంటూ భరోసా కల్పించారు. స్టేషన్ల వారీగా అందిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఫిర్యాదుదారుల మన్ననలు పొందేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. అర్జీదారులతో అమర్యాదగా మాట్లాడినా, సూటిబోటి మాటలతో అవమానించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరితోనూ అభిమానంగా మాట్లాడాలని, వారి సమస్యను మన సమస్యగా భావించాలని, ఏ ఒక్కరు అసహనంతో వెనుతిరిగి వెళ్లకూడదని, ఆ విధంగా పోలీసులు పనిచేయాలని ఉద్బోధించారు. ప్రధానమైన అర్జీలు : సోమవారం జరిగిన మీకోసంలో 41 ఫిర్యాదులను ఎస్పీతో పాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ అందుకున్నారు. ● గూడూరు నుంచి వెంకయ్య అనే వృద్ధుడు తన ఇద్దరు కుమారులు వృద్ధాప్యంలో ఉన్న తామిద్దరికీ భోజనం పెట్టకుండా, వైద్య ఖర్చులు, మందులకు డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, వ్యవసాయ పొలం తాలూకు కౌలు డబ్బులు కూడా తీసుకుని ఇబ్బంది పెడుతున్నారని, న్యాయం చేయమని ప్రాధేయపడ్డాడు. ● గుడివాడ నుంచి పుష్ప అనే మహిళ తనకు వివాహం జరిగే నాటికి తన భర్తకు చెడు వ్యసనాలు ఉన్నాయని, ఈ సంగతిని దాచి పెట్టి వివాహం జరిపించారని, ఇటీవల పూటుగా మద్యం తాగుతూ మానసికంగా, శారీరకంగా హింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. బయట వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తూ వారి నుంచి తనకు ప్రాణ హాని కలిగేలా చేస్తున్నాడని తనకు రక్షణ కల్పించి న్యాయం చేయమని కోరింది. ● చల్లపల్లి నుంచి కుమారి అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి 7 సంవత్సరాలు అవుతోందని, ఒక కుమార్తె జన్మించిందని, అప్పటినుంచి తన భర్త మితిమీరిన అనుమానంతో తీవ్ర వేధింపులకు గురి చేస్తూ పుట్టింటికి పంపించేశాడని, కనీసం కుమార్తెను బతికించుకోవడానికి డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని వాపోయింది. ఉద్యోగానికి వెళ్దామన్నా సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఎటువంటి ఆధారం లేకుండా చేస్తున్నాడని న్యాయం చేయమని వేడుకుంది. బాధితుల సమస్యలు ఆలకించిన ఎస్పీ చట్ట పరిధిలో ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మీకోసంలో అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ అర్జీల పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు -
పోలీస్ అధికారులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం..
సాక్షి,విజయవాడ: పోలీస్ అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్రెడ్డి కేసులో అరెస్ట్ సమయం, తేదీపై తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని ఫైరయ్యింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వేసిన అఫిడవిట్లలో సమాచారం తప్పని హైకోర్టు తేల్చింది.వర్రా రవీందర్రెడ్డిని 2024 నవంబర్ 8న అరెస్ట్ చేసి నవంబర్ 10న అరెస్ట్ చేశామని ఎలా చెప్తారు? అని ప్రశ్నించింది. తాము తీసుకోబోయే చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం గతేడాది నవంబర్లో వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. పులివెందుల అర్బన్ పోలీసుస్టేషన్లో పుల్లప్పగారి హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై క్రైమ్ నంబరు 409/24, అండర్ సెక్షన్ 386 ఐపీసీ 196, 351(3), 353(1)(సి), 112(2)(బి) రెడ్విత్ 3(5) బిఎన్ఎస్ 2023 సెక్షన్ 3(1)(ఆర్)(ఎస్), 3(2)(వి)(ఎ) ఎస్సీ ఎస్టీ (పీఓఏ) అమెండ్మెంట్ యాక్టు 2015, 67 ఐటీ యాక్టు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.రవీంద్రారెడ్డితో పాటు అతడికి ఆశ్రయం కల్పించిన కమలాపురం మండలం నల్లింగాయపల్లెకు చెందిన గుర్రంపాటి సుబ్బారెడ్డి అలియాస్ సుబ్బారెడ్డి, ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెకు చెందిన గురజాల ఉదయ్కుమార్రెడ్డిలు కూడా కారులో ఉండటాన్ని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే,ఈ అక్రమ కేసులపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో వర్రా రవీంద్రారెడ్డికి పలు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. -
చిన్నారిని చిదిమేసిన కారు
పామర్రు: కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డోకిపర్రుకు చెందిన ఉప్పలపాటి దుర్గారావు, హారిక దంపతులు తమ కుమార్తె హన్వికను ఒడిలో కూర్చు బెట్టుకుని బైక్పై పామర్రు నుంచి గుడివాడ జాతీయ రహదారిలో వస్తున్నారు. కొండాయపాలెం వద్దకు చేరుకోగానే అదే రహదారిలో మచిలీపట్నం నుంచి గుడివాడ వెళ్తున్న కారు బైక్ను ఓవర్ టేక్ చేస్తూ ఢీకొట్టింది. దీంతో బైక్పై నున్న వాళ్లు కింద పడిపోయారు. వారిని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దుర్గారావు, హారికతో పాటు చిన్నారి హన్వికకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పటల్కు తీసుకెళ్తుండగా హన్విక మార్గ మధ్యలో మృతి చెందింది. దంపతులకు పామర్రులోని వైద్యశాలకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ స్తంభాన్ని సైతం ఢీకొట్టింది. కారులో డ్రైవర్, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్రంపై గంజాయి తరలింపు
వత్సవాయి :గుర్రంపై గంజాయి అమ్మకాన్ని వత్సవాయి పోలీసులు గుట్టరట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణలోని వేరే ప్రాంతాల నుంచి గంజాయిను గుర్రం మీద తీసుకొస్తారు. గుర్రంపై ఉన్న సంచుల్లో గంజాయి ప్యాకెట్లను వేసుకుని వస్తారు. గుర్రం మీద ఒకరు... గుర్రాన్ని అనుసరిస్తూ మరొకరు బైక్పై వస్తారు. అయితే అప్పుడుప్పడు గుర్రం వత్సవాయి ఎస్సీ కాలనీకి రావడాన్ని గమనించిన కొందరు అనుమానంతో పోలీసులకు రహస్యంగా సమాచారం అందించారు. శనివారం రాత్రి సమయంలో ఎస్సీ కాలనీ వద్ద గుర్రాన్ని నిలిపి కొందరు యువకులు మాట్లాడుకుంటుండగా పోలీసులు దాడిచేసి వారిని పట్టుకున్నారు. దీంతో గుర్రంపై నున్న సంచిలో గంజాయి ప్యాకెట్లు ఉండడాన్ని గమనించి వెంటనే గుర్రంతోపాటు నంబర్లేని బైక్, వత్సవాయికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అయితే గుర్రాన్ని తీసుకొని వచ్చిన కొందరు యువకులు మాత్రం పరారయ్యారు. ఎస్ఐ పి. ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపడి యువకుడి మృతి కోసూరు(మొవ్వ): ఉపాధి కోసం పని మాట్లాడుకోవడానికి వెళ్తూ పిడుగుపడి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాతంగి సుప్రదీప్ (22) వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. పని మాట్లాడుకోవడానికి తన మిత్రుడు పాగోలు అనిల్ కుమార్తో కలిసి బైక్ మీద బాపట్ల జిల్లా కొల్లూరు ప్రయాణమయ్యాడు. వీరు కోసూరు నుంచి కొడాలి మీదగా శ్రీకాకుళం కృష్ణానదిలోని బాట నుంచి వెళుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు వచ్చి బైక్ వెళ్తున్న సుప్రదీప్పై పిడుగు పడింది. ఈ ఘటనలో సుప్రదీప్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా అనిల్ కుమార్కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమీపంలో ఉన్న వారు 108కు సమాచారం అందించగా వారు వచ్చి సుప్రదీప్ మృతి చెందాడని నిర్దారించి అనిల్ కుమార్ను ఆసుపత్రికి తరలించారు. కాగా సుప్రదీప్ మృతి వార్త తెలుసుకోవటంతో ఒక్కసారిగా కోసూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు రెండు సంవత్సరాల క్రిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు. -
కలగానే చింతలపూడి ఎత్తిపోతల!
తిరువూరు: చింతలపూడి ఎత్తిపోతల పథకం కలగానే మిగిలేలా ఉంది. ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం సాగర్ జలాల సరఫరా అరకొరగా ఉండటంతో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. 2009లో రూ.5వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు మొదటిదశ పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తికాకముందే 2017లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం మరో రూ.3వేల కోట్లతో రెండో దశ పనులకు శ్రీకారం చుట్టింది. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి సాగర్ ఆయకట్టులో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా నీటి సదుపాయం కల్పించడానికి రెండో దశను చేపట్టారు. పిట్టలవారిగూడెం నుంచి వేంపాడు మేజరుకు గోదావరి జలాలను తెచ్చి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి సాగర్ ప్రధాన కాలువకు సరఫరా చేయడం ఈ పథకం ఉద్దేశం. 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు పలుమార్లు చెబుతున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదని రైతులు వాపోతున్నారు. 8 సంవత్సరాలుగా పూర్తికాని పనులు మెట్టప్రాంత రైతులు సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాధార పంటలు సాగుచేయడం, బోర్లకింద ఆరుతడి పంటలు వేయడంతో ఏడాదికి ఒక పంటకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. రానున్న 2, 3 సంవత్సరాల్లో సాగునీటి కొరత తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నందున త్వరితగతిన చింతలపూడి రెండోదశ ఎత్తిపోతల పూర్తిచేసి సాగర్ కాలువలకు గోదావరి జలాలను సరఫరా చేయాలని కోరుతున్నారు. సాగర్ జలాలకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదన ప్రకటనలకే పరిమితం ఉమ్మడి కృష్ణాలో ఐదు నియోజకవర్గాలకు ప్రయోజనం 18 మండలాలకు ప్రయోజనం.... చింతలపూడి ఎత్తిపోతల రెండో దశతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 5 నియోజకవర్గాల్లోని 18 మండలాలకు సాగు, తాగునీటి కొరత తీర్చవచ్చని భారీ నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ఉమ్మడి కృష్ణాలోని మైలవరం, తిరువూరు, గన్నవరం, నూజివీడు, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని చాట్రాయి, ముసునూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీపట్నం, కంచికచర్ల, వీరులపాడు, గంపలగూడెం, తిరువూరు, ఏకొండూరు, నూజివీడు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, ఆగిరిపల్లి, విజయవాడ రూరల్ మండలాల్లో మెట్టభూములకు గోదావరి జలాలను సాగర్కు ప్రత్యామ్నాయంగా అందే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వేంపాడు మేజరు నుంచి 10 కిలోమీటర్ల కాలువ తవ్వి రామచంద్రాపురం రెగ్యులేటరు వద్ద నూజివీడు బ్రాంచి కాలువకు అనుసంధానం చేయడం ద్వారా మైలవరం బ్రాంచి కాలువకు, మాధవరం, బాపులపాడు, రేపూడి, గానుగపాడు మేజర్లకు గోదావరి జలాలను సరఫరా చేయాలని లక్ష్యంగా ఉంది. రెండోదశ పనుతో లక్ష ఎకరాలకుపైగా పంట భూములకు సాగునీటి సమస్య తీరుతుందని భావించి భారీ నీటిపారుదల శాఖ పనులకు ప్రతిపాదించింది. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
రెడ్డిగూడెం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన రెడ్డిగూడెం మండల పరిధి కుదప గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్లమందల వెంకయ్య(60)కి అదే గ్రామానికి చెందిన బేతు నాగేసు, ఈదురుపాటి చిన్నబ్బాయికి గత కొన్ని రోజులుగా ఆర్థిక లావాదేవీల విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో వెంకయ్యపై నాగేసు, చిన్నబ్బాయి రెడ్డిగూడెం పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ నిమిత్తం వెంకయ్యను స్టేషన్కు రావాలని ఆదేశించారు. తాను ఎవ్వరి దగ్గర డబ్బులు అప్పు తీసుకోలేదని తాను స్టేషన్కు రావాల్సి అవసరం లేదని వెంకయ్య పోలీసులకు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆదివారం ఉదయం పొలంలోకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన వెంకయ్య తిరిగి ఇంటికి రాలేదు. ఈ సమయంలోనే రెడ్డిగూడెం ఎస్ఐతో పాటు కానిస్టేబుల్స్ సైతం వెంకయ్య కోసం ఇంటికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు వచ్చి వెళ్లిన తర్వాత మధ్యాహ్నం దాటినప్పటికీ వెంకయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని పొలంలోకి వెళ్లి చూడగా వెంకయ్య శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. వెంకయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు వెంకయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఘనంగా పంచరత్న కృతుల గోష్టిగానం
విజయవాడ కల్చరల్ : సద్గురు త్యాగరాజ స్వామి జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు ఆదివారం ముగిసాయి. త్యాగరాజ స్వామి రచించిన ఘనరాగ పంచరత్న కీర్తనలను సంగీత విద్వాంసులు, యువ సంగీత కళాకారులు ఆలపించారు. జగదానందకారక, దుడుగల నన్నే, సాధించెనే ఓ మనసా, కనకన రుచిరా, ఎందరో మహానుభావులను మధురంగా ఆలపించారు. మల్లాది సూరిబాబు, మల్లాది సోదరులు, గౌరీనాథ్, గాయత్రి గౌరీనాఽథ్, శ్రీరాం చరణ్ , మోదుమూడి సుధాకర్ అంజనా సుధాకర్ , ఎన్సీహెచ్ కృష్ణమాచార్యులు, చిట్టాకార్తీక్, విష్ణుభొట్ల సొదరీమణులు, లంకా తేజస్విని, మల్లాది కార్తీక త్రివేణి, చారుమతి పల్లవితోపాటు 200 మంది సంగీత విద్వాంసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నాట్యాచార్యుడు చింతారవి బాలకృష్ణ బృందం కూచిపూడి సంప్రదాయంలో త్యాగరాజ స్వామికి నృత్య నీరాజనాలు సమర్పించారు.ముగిసిన త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలు -
ఆర్టీసీ డ్రైవరు, కండక్టరుపై దాడి
బంటుమిల్లి: గుడివాడ ఆర్టీసీ బస్సు డ్రైవరు, కండక్టరుపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 20 రోజుల క్రితం డ్రైవరు బస్సు ఆపకుండా వెళ్లడంతో ప్రయాణికులు, డ్రైవరు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ రోజు డ్రైవరు మద్దా నాగరాజుతో గొడవపడ్డ బంటుమిల్లికి చెందిన సోమిశెట్టి వెంకటనారాయణ తన స్నేహితులు దాసు శ్రీనివాసరావు, రాఘవరపు సతీష్లతో కలసి స్థానిక ఆంధ్రబ్యాంకు సెంటర్లో బస్సును అడ్డుకుని డ్రైవరు నాగరాజుపై దాడి చేశారు. ఈ గొడవను వీడియో తీస్తున్న కండక్టరు పర్వతనేని శ్రీదేవీని కూడా అసభ్యంగా బూతులు తిట్టి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో సెంటర్లో ఇరువైపుల ట్రాఫిక్ స్తంభించింది. ఎస్ఐ గణేష్కుమార్ సంఘటన స్థలం వద్దకు చేరుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు. పెడన మండలం, ఉరిమి గ్రామానికి చెందిన డ్రైవరు మద్దా నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటనారాయణ, శ్రీనివాసరావు, సతీష్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. -
గాలి వానతో ఇబ్బందులు పడినా.. సజావుగానే పరీక్ష
కలెక్టర్ పరిశీలన.. విజయవాడలో జరిగిన నీట్ పరీక్షను కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. నగరంలోని పీఎస్సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, అభ్యర్థుల బయో మెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిటీ కోఆర్డినేటర్, సెంటర్ సూపరింటెండెంట్, డెప్యూటీ సెంటర్ సూపరింటెండెంట్, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు అందరూ సమన్వయంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైనందుకు అభినందనలు తెలిపారు. -
నీట్గా.. ప్రశాంతంగా..
వన్టౌన్(విజయవాడపశ్చిమ): దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)– 2025 ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 13,625మంది విద్యార్థులను కేటాయించగా అందులో 13,455 మంది హాజరయ్యారు. 98.75 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను జిల్లాలో 28 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్ష కొనసాగింది. విద్యార్థులను 11.00 గంటల నుంచి పరీక్ష జరిగే ప్రాంగణాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్రాల ప్రధాన ద్వారాలను మూసివేశారు. అభ్యర్థుల హాల్టికెట్తో పాటుగా ఇతర గుర్తింపు కార్డుల ఉంటేనే లోపలకు అనుమతించారు. పొడవాటి దుస్తులు, బూట్లు, నగలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించి అభ్యర్థులను లోపలకు అనుమతించారు. అనంతరం విద్యార్థులు బయోమెట్రిక్ పరిశీలన చేసి ఆ తదుపరి పరీక్ష గదిలోకి అనుమతించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయా పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. వారి వాహనాలతో పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. మధ్యాహ్నం 1.30 గంటల వరకూ విద్యార్థుల తల్లిదండ్రులు గేట్ల వద్దనే నిలిచి ఉన్నారు. స్థానిక పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించటంతో పాటుగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూశారు. ఆలస్యంగా పేపరు.. మార్కాపురానికి చెందిన బి. మేఘన కిరణ్మయి అనే విద్యార్థికి సత్యనారాయణపురంలోని కేంద్రీయ విద్యాలయం పరీక్ష కేంద్రంగా కేటాయించారు. ఆమెకు బయోమెట్రిక్ హాజరుకు సంబంధించి సమస్య తలెత్తటంతో టాలీ కాలేదని, 2.00 గంటల తర్వాత టాలీ కావటంతో 2.13 నిమిషాలకు తనను పరీక్ష గదిలోకి అనుమతించినట్లు ఆమె పేర్కొంది. సుమారు 20 నిమిషాలు ఆలస్యంగా పేపర్ ఇచ్చారని, ఆ మేర అదనపు సమయం ఇవ్వకుండా పేపర్ తీసేసుకున్నారని ఆమె తన తండ్రి శ్రీనివాసగణేష్తో కలిసి ‘సాక్షి’కి వివరించింది. ఎంతో కష్టపడి చదివిన తన కుమార్తెకు తీవ్ర అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ తండ్రి పేర్కొన్నారు. దీనిపై జిల్లా కోఆర్డినేటర్ ఆదిశేషశర్మను వివరణ కోరగా అటువంటిదేమి లేదని, ఆమె అబద్ధం చెబుతున్నట్లు పేర్కొన్నారు. గాలివానతో అవస్థలు.. పరీక్షకు బయలుదేరిన విద్యార్థులు గాలివానతో తీవ్ర అవస్థలకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురవటంతో బస్సులు రాకపోకలకు సైతం ఇబ్బందులు తలెత్తాయి. తల్లిదండ్రులతో ద్విచక్ర వాహనాల్లో బయలుదేరిన విద్యార్థులు వర్షానికి తడిసిమముద్ధయ్యారు. అలాగే పదకొండు గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచి ఉండటంతో ఆటోలు, ఇతర సర్వీసులు అందుబాటులోకి రాలేదు. దాంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. జిల్లాలో 13,625 మందికిగాను 13,455 మంది హాజరు బయోమెట్రిక్ సమస్యతో ఒక విద్యార్థినికి ఆలస్యంగా పేపర్ జారీ అదనపు సమయం ఇవ్వలేదని ఆ విద్యార్థిని ఆరోపణ పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించిన కలెక్టర్ లక్ష్మీశ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాల్లో నీట్ పరీక్ష జరిగింది. మచిలీ పట్నంలోని కేంద్రీయ విద్యాలయం, కృష్ణా విశ్వవిద్యాలయం కళాశాలతో పాటు గన్నవరంలోని వీఎస్ఎస్టీ జాన్స్ హైస్కూల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఇన్విజిలేటర్ల నియామకంతో పాటు నోడల్ అధికారులు, సహాయ నోడల్ అధికారులను నియమించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1096 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 1073 మంది విద్యార్థులు హాజరయ్యారు. 23 మంది విద్యార్థులు హాజరుకాలేదు. ఎస్పీ ఆర్ గంగాధరరావు కేంద్రీయ విద్యాలయం, కృష్ణా యూనివర్సిటీలోని కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించి విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. కృష్నా జిల్లాలో 1,073 మంది హాజరు -
ముంచేసింది!
అంతటా అస్తవ్యస్తం.. Æ ఈడుపుగల్లులో చెట్లు కూలటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఓ కారులో ప్రయాణిస్తున్న మున్నా అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానిక సంస్థల పర్యవేక్షణలో పొక్లెయిన్లు, కటింగ్యంత్రాలతో చెట్లను నరికించి రాకపోకలను పునరుద్ధరించారు. Æ పెడన, పెనమలూరు ప్రాంతాల్లో విద్యుత్ వైర్లపై చెట్లు కూలటంతో సుమారు 40 విద్యుత్స్తంభాలు నేల కూలాయి. ఆరు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి. Æ కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు, గుడివాడ, బంటుమిల్లి, పెడన పరిసరాల్లోని ప్రధాన రహదారులు వెంబడి వర్షపునీరు నిలిచిపోయింది. Æ పెనమలూరు, కంకిపాడు ప్రాంతాల్లో రోడ్డు మార్జిన్లలో నిర్మించిన పాకలు నేలమట్టం అయ్యాయి. Æ కంకిపాడు, ఉయ్యూరు, గొడవర్రు రోడ్డు, ఈడుపుగల్లు పరిసరాల్లో భారీ వృక్షాలు నేలకూలటంతో రొయ్యూరు–గొడవర్రు, ఈడుపుగల్లు–ఉప్పలూరు, కంకిపాడు–విజయవాడ మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. కంకిపాడు: గాలి వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి జిల్లా చిగురుటాకులా వణికింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం పడింది. వర్షం కారణంగా కల్లాలు, ఖాళీ స్థలాల్లో నిల్వ చేసిన మొక్కజొన్న, ధాన్యం వర్షానికి తడిసిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న మామిడి నేలరాలింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకూ వాతావరణం సాధారణంగానే ఉన్నా, ఆ తర్వాత ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మేశాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అకాల వర్షం.. అన్నదాతకు ఎంతో కష్టం.. జిల్లా వ్యాప్తంగా 12,875 ఎకరాల్లో రబీ సీజన్లో వరి సాగు చేశారు. మొక్కజొన్న 11875 ఎకరాల్లో, మామిడి గన్నవరం పరిసర ప్రాంతాల్లో 10 వేల ఎకరాల్లో సాగు జరిగింది. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కోత కోసిన ధాన్యం కల్లాలు, ఖాళీ స్థలాల్లో నిల్వ చేసి ఉంచారు. గోనె సంచులు, రవాణా వాహనాల కొరత కారణంగా గడిచిన వారం రోజులుగా ధాన్యం మిల్లులకు తరలకుండా నిలిచిపోయింది. దీంతో అధికారుల నిర్లక్ష్యంతో రాశులు, బస్తాల కెత్తి న ధాన్యం వర్షానికి తడిసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బస్తాల కెత్తిన ధాన్యం తిరిగి ఆరబోసి కాటా వేసేందుకు ఎకరాకు రూ. 5 వేలు పెట్టుబడి అదనంగా అవుతుందని, రాశుల మీద ఉన్న ధాన్యం పూర్తిగా ఆరబోసేందుకు ఎకరాకు రూ. 3వేలు పెట్టుబడులు అవుతాయని ఆవేదన చెందుతున్నారు. మద్దతు ధర, మార్కెట్లో మంచి ధర లభిస్తుందని ఆశించి కల్లాల్లో మొక్కజొన్న నిల్వ చేసుకున్న రైతులకు వర్షం నష్టం మిగిల్చింది. జిల్లాలో పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని గ్రామాల్లో 4 వేల ఎకరాల్లో పంట రైతుల వద్ద ఉన్నట్లు సమాచారం. తేమ కారణంగా మొక్కజొన్న గింజలు నలుపు రంగులోకి మారి ధర ఎంతకు పలుకుతుందో కూడా అర్థం కావటం లేదని ఆందోళన చెందుతున్నారు. గన్నవరం పరిసరాల్లోని సూరంపల్లి, గొల్లనపల్లి, మెట్టపల్లి, గోపువారిగూడెం, మాదల వారిగూడెం ప్రాంతాల్లో సాగులో ఉన్న 10 వేల ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న బంగినపల్లి, రసాలు నేలరాలి రైతులు నష్టపోయారు. స్విమ్మింగ్ పూల్ ధ్వంసం.. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పర్యవేక్షణలో నడుస్తున్న ఈడుపుగల్లు స్విమ్మింగ్ పూల్ భారీ వర్షం ధాటికి ధ్వంసమైంది. ప్రధాన గేటు, ప్రహరీపై ఏర్పాటుచేసిన రేకులు, వాటర్ ట్యాంకులు దెబ్బతిన్నాయి. రూ. 5 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు డీఎస్డీఓ కార్యాలయ అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించారు. మరమ్మతులు పూర్తయ్యేందుకు వారం సమయం పడుతుందని, అప్పటి వరకూ క్రీడాకారులు శిక్షణకు రావొద్దని అధికారులు సూచించారు. 370 సారలు కల్లంలో ఉన్నాయి.. నేను 15 ఎకరాల్లో వరి సాగు చేశా. వారం క్రితం 10 ఎకరాల్లో పంటను మిల్లుకు తోలాం. ఇంకా ఐదెకరాలకు చెందిన 370 సారలు కల్లంలో కాటా వేసి ఉంచా. వర్షంతో బస్తాలు తడిసిపోయాయి. ఇప్పటికే ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు పెట్టుబడి అయ్యింది. బస్తాలు తడిసిన కారణంగా ఆరబోతకు ఎకరాకు రూ. 5 వేలు అదనపు ఖర్చు అవుతుంది. లాభం మాట అటుంచితే పంటను కాపాడుకోవటానికి నానా పాట్లు పడాల్సి వస్తుంది. – లుక్కా వెంకటేశ్వరరావు, రైతు, రొయ్యూరు జిల్లాలో గాలి వాన బీభత్సం ఉరుములు, మెరుపులతో అకాల వర్షం తడిసిన ధాన్యం, దెబ్బతిన్న మొక్కజొన్న పల్లపు ప్రాంతాలు జలమయం నేలకూలిన భారీ వృక్షాలు మండుటెండల్లో మహా వర్షంకష్టం అంతా తడిసిపోయింది.. మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. పూర్తిగా పంట ఎండింది. నిన్నటి దాకా రూ. 2వేలకు అడిగారు. ఇంకా ఎండితే రేటు పెరుగుతుందని ఆశించా. వర్షం వచ్చి పంటను పూర్తిగా తడిపేసింది. వర్షం కారణంగా పంట నలుపెక్కుతుంది. రేటు కూడా బాగా తగ్గిస్తారనే భయం వేస్తోంది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – గోపి, కౌలురైతు, గొడవర్రు -
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లాశాఖ దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంబటిపూడి సుబ్రహ్మణ్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా మే 5న పాత తాలూకా కేంద్రాల్లో, మే 9న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మే 14న రాష్ట్ర స్థాయిలో భారీగా ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాథమిక పాఠశాలలు అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకే అయినప్పటికీ, ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడం విద్యావ్యవస్థలో గందరగోళానికి దారితీస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ను నియమించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీగా పాల్గొని నిరసన కార్యక్రమాల విజయవంతం చేయాలని ఆయన కోరారు. భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకోవాలి చిలకలపూడి(మచిలీపట్నం): భగీరథ మహర్షి స్ఫూర్తితో జీవితంలో అనుకున్నది సాధించవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తపస్సుతో గంగను దివి నుంచి భువికి దించిన భగీరథుడు పట్టుదలకు మారుపేరుగా నిలిచారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఏవో సీహెచ్ వీరాంజనేయప్రసాద్, బీసీ సంక్షేమశాఖ అధికారులు, సగర కులసంఘ నాయకులు పాల్గొన్నారు. చదరంగంలో జస్వంత్, మోధిత సత్తా విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–9 చెస్ పోటీల బాలుర విభాగంలో పి.జస్వంత్, బాలికల విభాగంలో వి.మోధితరెడ్డి విజేతలుగా నిలిచారు. విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో గత రెండు రోజులుగా జరుగుతున్న పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. బాలుర విభాగంలో పి.జయసాకేత్ 6/7 పాయింట్లతో, బాలికల విభాగంలో వై.శ్రీనిఖిల 5.5/7 పాయింట్లతో రన్నర్లుగా నిలిచారు. 26 జిల్లాల నుంచి 134 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల బాల, బాలికల విభాగంలో టాప్–8 క్రీడాకారులకు రూ.40 వేల నగదు బహుమతిని మంజూరు చేశారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో మేజర్ కె.ఆర్.శేషాద్రిరావు, స్కాట్స్పైన్ స్కూల్ సీఈవో కొడాలి జాహ్నవి తదితరులు ట్రోఫీలు, నగదు బహుమతిని అందజేశారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశామని, జూన్లో హరియాణాలో జరిగే జాతీయ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని ఆంధ్ర చెస్ అసోసియేషన్ కార్యానిర్వాహక కార్యదర్శి, కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్ తెలిపారు. భక్తజన కోలాహలం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. ఆదివారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. తెల్లవారుజాము నుంచి క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వర ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆది దంపతులైన దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. భక్తుల తాకిడితో అంతరాలయ దర్శనం నిలిపివేసిన ఆలయ అధికారులు, భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.300, రూ.100 టికెట్లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 6 గంటల నుంచే భక్తులతో క్యూలైన్లు నిండిపోగా, మహా మండపం వైపు నుంచి వచ్చే భక్తులను 5వ అంతస్తు వరకే లిఫ్టులో అనుమతించారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తడిసి ముద్దయ్యారు.. ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఘాట్రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు వర్షంతో తడిసి ముద్దయ్యారు. వర్షం కురుస్తున్న తరుణంలో సర్వ దర్శనం క్యూలైన్లో ఉన్న భక్తులను టికెట్ల క్యూలైన్లోకి ఉచితంగా అనుమతించారు. వర్షంతో తప్పని ఇబ్బందులుఘాట్రోడ్డు మూసివేత.. ఆదివారం ఉదయం 8 గంటలకు భారీ వర్షం కురవడంతో దుర్గగుడి ఘాట్రోడ్డును ఆలయ అధికారులు మూసివేశారు. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో కొండ రాళ్లు విరిగిపడే ప్రమాదం ఉందని దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు భావించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్రోడ్డుపైకి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. ఉదయం 11గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడం, భక్తుల తాకిడి అనూహ్యంగా పెరగడంతో ఘాట్రోడ్డుపైకి దేవస్థాన బస్సులతో పాటు ద్విచక్ర వాహనాలను అనుమతించారు. సాయంత్రం వరకు దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. -
నూతన కార్యవర్గం ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఎంప్లాయీస్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణాజిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఆదివారం గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా కల్యాణ్ కుమార్(నూజివీడు), సెక్రటరీగా నాగ పద్మావతి(గన్నవరం), ట్రెజరర్గా నాగమణి(నూజివీడు), వైస్ ప్రెసిడెంట్గా మధుబాబు(గన్నవరం), కమిటీ సభ్యులుగా జయంతి(గుడివాడ), వందన(కృష్ణాజిల్లా), కిరణ్(ఎన్టీఆర్) ఎన్నుకున్నారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రాజు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. -
విజయవాడలో భారీ వర్షం..(వీడియో)
సాక్షి, విజయవాడ: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా ఆదివారం ఉదయం నుంచి విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచే నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. ఈదురు గాలులు బలంగా వీయడంతో పలుచోట్ల రేకుల షెడ్లపై రేకులు ఎగిరిపోయాయి. భారీ వర్షం నేపథ్యంలో దుర్గ గుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసి వేశారు. భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కనకదుర్గా నగర్ మార్గం మీదుగా అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులకు దుర్గ గుడి ఈవో విజ్ఞప్తి చేశారు. #Vijayawada city getting trashed by powerful thunderstorms, unfortunately #Guntur city missed major spell 🌧️Storms from ntr, #Vijayawada will further cover more parts of eluru, krishna, west & east #GODAVARI districts in upcoming hours 🌧️.. Updates to follow stay tuned 👍 pic.twitter.com/XUbvJvEetI— Eastcoast Weatherman (@eastcoastrains) May 4, 2025Sudden climate change in #VijayawadaHeavy rain with thunderstorms 🌧️ ⛈️ Everyone stay home and stay safe 👍 pic.twitter.com/RLz9BV2hsA— Bhargav (@BhargavTweetz) May 4, 2025 Rain rampage @ Vijayawada.Car ye shake aypothundi. pic.twitter.com/sK5UxPHHBc— Cinema Madness 24*7 (@CinemaMadness24) May 4, 2025మరోవైపు.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఏకధాటిగా కురుస్తోంది. అకాల వర్షాల కారణంగా జిల్లాలో వరి, అరటితో పాటు పలు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇదేం భీబత్సం సామి ⛈️⛈️⛈️భోరున వర్షం, గాలి, భీబత్సం#Vijayawada pic.twitter.com/Lq5qlh8iTE— Vineeth K (@DealsDhamaka) May 4, 2025 -
ఏపీటీడీసీలో ఉద్యోగి రాసలీలలు
సాక్షి, విజయవాడ: ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత సదరు అధికారి.. ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆఫీసులో సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.వివరాల ప్రకారం.. విజయవాడలోని బందరురోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్లో ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలల వ్యవహారం బయటకు వచ్చింది. సదరు ఉద్యోగి.. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత ప్రతీ రోజూ రాత్రిపూట తన ద్విచక్రవాహనంపై ఓ మహిళను తీసుకుని ఆఫీసుకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే, పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావటంతో సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.రోజూ ఇలాగే చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారులకు తెలియజేశారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు.. ఆఫీసులో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం, ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా వారిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. రాత్రి సమయంలో ఉద్యోగి బైకుపై ఓ మహిళ రావడం రికార్డు అయ్యింది. ఆఫీసు వద్ద బైక్ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కార్యాలయం తాళం తెరిచి, ఆ మహిళను లోపలికి తీసుకెళ్లి తిరిగి తలుపులు వేయడం, అరగంట తర్వాత బయటకు రావడాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం, వారిద్దరూ బైక్పై వెళ్లిన ఆధారాలను సీసీ ఫుటేజీ ద్వారా సేకరించారు. దీంతో, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గతంలోనూ సదరు అధికారిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. హరిత బెర్మ్పార్క్లోని స్టాఫ్ రూమ్లో కూడా ఇలాంటి వ్యవహారమే నడిపినట్టు తెలిసింది. పార్క్లో వాకింగ్ కోసం వచ్చిన మహిళను తరచూ స్టాఫ్రూమ్లోకి తీసుకెళ్లేవాడు. సిబ్బందిని బయటకు పంపేసి రాసలీలలు సాగించేవాడని సిబ్బంది చెప్పుకొచ్చారు. అనంతరం, సీక్రెట్ కెమెరా పెట్టి మరీ ఈ విషయాన్ని సిబ్బందే వెలుగులోకి తెచ్చారు. ఇక, ఈయన విషయంలో ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025Iజీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ మన్మధరావు మచిలీపట్నం అర్బన్: మచిలీపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ వి.మన్మధరావును నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్లో జనరల్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.బ్యాక్లాగ్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉయ్యూరులోని గిరిజన సంక్షేమశాఖ బాలుర గురుకుల పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి బ్యాక్లాగ్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఎం.ఫణిధూర్జటి శనివారం తెలిపారు. ఈ పాఠశాలలో మూడో తరగతి 40 సీట్లు, నాల్గవ తరగతి 40, ఐదో తరగతి 40, ఆరో తరగతి 29, ఏడో తరగతి 26, ఎనిమిదో తరగతి 26, తొమ్మిదో తరగతి 17 సీట్లు ఉన్నాయన్నారు. ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం లక్ష రూపాయలకు మించి ఉండకూడదన్నారు. దరఖాస్తులను ఉయ్యూరు రాజేంద్రనగర్లోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఈ నెల 28వ తేదీలోగా నేరుగా అందజేయాలన్నారు. లాటరీ పద్ధతి ద్వారా అడ్మిషన్ కమిటీ విద్యార్థులను ఎంపిక చేస్తుందన్నారు. మరిన్ని వివరాల కోసం 99088 39476, 93916 01861 నంబర్లను సంప్రదించాలన్నారు. కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక పెనమలూరు: కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక చేశామని పోరంకి శ్రీకృష్ణవేణి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ వి.భూలక్ష్మి తెలిపారు. ఆమె శనివారం వివరాలు తెలుపుతూ పోరంకిలో జరిగిన జట్టు ఎంపికలో కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్బాల్ జట్టుకు 16 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని చెప్పారు. నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ (పురుషులు) పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని వివరించారు. జట్టు మేనేజర్గా ఎ.వినయ్కుమార్రెడ్డి, కోచ్గా ఆర్.సురేష్ ఉంటారని తెలిపారు. న్యూస్రీల్ -
చోరీలు అరికట్టేందుకు ప్రజలూ సహకరించాలి
ఎస్పీ ఆర్.గంగాధరరావు కోనేరుసెంటర్: వేసవిలో దొంగతనాలను అరికట్టేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు శనివారం కోరారు. వేసవి శెలవులను పురస్కరించుకుని ప్రజలు తమ పిల్లలతో కలిసి తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తున్నవారు తమ ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణ రోజులతో పోల్చితే వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటున్నందున నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసినట్లు తెలిపారు. ఇళ్లకు తాళం వేసుకుని ఊరికి వెళ్లేవారు ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేస్తే ఆయా ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటి పరిసరాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కనబడేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. ఇంటి బయట ఎప్పుడు లైట్ వెలిగేలా చూసుకోవాలన్నారు. తద్వారా చోరులకు ఇంట్లో ఎవరూ లేరనే అనుమానం రాదన్నారు. చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు గమనించినట్లయితే సమీప పోలీసులకు సమాచారం అందజేయాలని ప్రజలను కోరారు. -
ఆర్టీసీ డ్రైవర్పై దాడి
విస్సన్నపేట: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవరుపై శుక్రవారం రాత్రి పుట్రేల శివారు జానలగడ్డలో ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. విజయవాడ గవర్నరుపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ పీఎస్ విష్ణు, జానలగడ్డ నుంచి ప్రజలను అమరావతిలో జరిగిన కార్యక్రమానికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా రామానగరానికి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి బస్సు ఆపారు. డ్రైవర్ను దూషిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డ్రైవరు విష్ణుకు తీవ్ర గాయాలు కాగా విస్సన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అనంతరం అతన్ని విజయవాడ తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయండి
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా అభివృద్ధికి నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం సాయంత్రం 2047 విజన్ ప్రణాళికల తయారీపై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర – 2047 విజన్ ప్రణాళిక అమలుకు జిల్లాలోని క్షేత్ర స్థాయి పరిస్థితులను, అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆయా నియోజకవర్గాల రూపురేఖలు మార్చే విధంగా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ రంగాలుగా గుర్తించిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, ఇన్చార్జ్ సీపీవో పద్మజ, డ్వామా పీడీ శివప్రసాద్యాదవ్, పశుసంవర్థక శాఖాధికారి చిననరసింహులు, డీఆర్డీఏ పీడీ హరిహరనాఽథ్, మార్క్ఫెడ్ డీఎం మురళీకిషోర్ తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించండి చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 4వ తేదీన జిల్లాలో జరగనున్న నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి గూగుల్ మీట్ ద్వారా శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నీట్ పరీక్షలు ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆన్లైన్లో జరుగుతాయన్నారు. మచిలీపట్నంలోని కేంద్రీయ విద్యాలయం, రుద్రవరంలోని కృష్ణా విశ్వవిద్యాలయంతో పాటు గన్నవరంలోని వీఎస్ఎస్టీ జాన్స్ హైస్కూల్లలో మూడు పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్రాల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు మచిలీపట్నం, గుడివాడ ఆర్డీవోలను నోడల్ అధికారులుగా, తహసీల్దార్లను సహాయ నోడల్ అధికారులుగా నియమించామన్నారు. జిల్లాలో 1096 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు విద్యార్థులను లోనికి అనుమతించాలని, మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రం ద్వారాలను మూసివేయాలన్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి నీట్ పరీక్షకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, విద్యార్థులను మాత్రమే అనుమతించాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు పరీక్ష కేంద్రాలను ముందు రోజు తనిఖీ చేసి నీట్ మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు సజావుగా చేశారా, లేదా అనేది గమనించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. సమావేశంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు, అదనపు ఎస్పీ వీవీ నాయుడు, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవోలు కె.స్వాతి, జి.బాలసుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు. -
కూటమి నేతలకు ధనార్జనే ధ్యేయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం వెలువడే బూడిద కూటమి నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వారు బూడిద నిల్వ చేసి అమ్ముకునేందుకు వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతమంతా గాలి, నీటిలో బూడిద కలిసిపోయి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. తమ ఇళ్లు, పొలాల పైకి బూడిద కాలుష్యం వెదజల్లుతోందని ఇటీవల పశ్చిమ ఇబ్రహీంపట్నం స్థానికులు 65వ నంబర్ జాతీయ రహదారిపై బూడిద లారీలను అడ్డుకుని ధర్నాకు దిగారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. గ్రామాలపైకి వెదజల్లుతున్న కాలుష్యం ఎన్టీటీపీఎస్ కాలుష్యంతో పాటు అక్రమ బూడిద డంపింగ్ కేంద్రాలు, లారీల ద్వారా వెదజల్లే కాలుష్యం అనేక గ్రామాల పైకి చేరుతోంది. ముఖ్యంగా పశ్చిమ ఇబ్రహీంపట్నం, జూపూడి, కిలేశపురం, మూలపాడు గ్రామాల్లో బూడిద కాలుష్యం తీవ్రంగా ఉంది. సమీపంలోని బూడిద చెరువు నుంచి గాలి ద్వారా వ్యాపించే కాలుష్యంతో పాటు బూడిద లారీల రాకపోకలతో తీవ్రమైన కాలుష్యం వెదజల్లు తోంది. లోడింగ్తో వచ్చిన లారీలు హైవే మీద ఆపడం వలన నీటితో కలిసిన బూడిద రోడ్డుపై పడుతోంది. ఆరిన తర్వాత గాలికి లేచి ఇళ్లల్లోకి చేరుతోంది. ఇళ్లల్లో ప్లోరింగ్పై పౌడర్ మాదిరిగా పేరుకుపోయి ఇల్లంతా బూడిద మయంగా మారుతోంది. బూడిద కాలుష్యంతో ప్రజలు శ్వాస, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఇళ్లల్లోనే కాకుండా పచ్చని పంట పొలాలు సైతం బూడిద కాలుష్యం బారిన పడ్డాయి. కాలుష్యం సోకిన పొలాల్లో దిగుబడులు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. కూరగాయలు రంగు మారడం వలన మార్కెట్లో ధర పతనమవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆందోళనకు దిగిన స్థానికులు బూడిద కాలుష్య సమస్య భరించలేని స్థానికులు ఇటీవల రోడ్డెక్కారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై బూడిద లారీలను అడ్డుకున్నారు. బూడిద లారీలు రోడ్డుపై ఆపడానికి వీల్లేదని పట్టుబట్టారు. ఎన్టీటీపీఎస్ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుని ప్రజలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాలుష్య నివారణకు ఎటువంటి చర్యలు చేపడతారో చెప్పాలని ప్రజలు పట్టుబట్టగా, ఏమీ చెప్పలేక ఎన్టీటీపీఎస్ అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు నచ్చచెప్పడంతో స్థానికులు ఆందోళన విరమించారు.చర్మ రోగాలు సోకుతున్నాయి ఎన్టీటీపీఎస్ నుంచి ఇళ్లల్లో చేరిన బూడిదతో డస్ట్ ఎలర్జీ, చర్మ సంబంధిత వ్యాధులు సోకుతున్నాయి. ఈ విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి రోడ్డు పక్కన కాలువల ద్వారా బూడిద నీరు ఇళ్లల్లోకి చేరుతున్నాయి. కాలుష్య నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలి. –షేక్ గాలిబ్ సాహీద్, పశ్చిమ ఇబ్రహీంపట్నం తాగునీటిలో బూడిద ఇటీవల కాలంలో తాగునీరులో బూడిద కలుస్తోంది. పైపులు లీకేజీ వలన నీటి కాలుష్యం జరుగుతోంది. బిందెల అడుగు భాగంలో బూడిద పేరుకుపోతోంది. ఎన్టీటీపీఎస్ అధికారులకు సమస్య వివరించినా ప్రయోజనం లేదు. తక్షణం తాగునీటి కాలుష్యం తగ్గించి స్వచ్ఛమైన జలాలు అందించాలి. –పచ్చిగోళ్ల పండు, ఇబ్రహీంపట్నం ●సీఎం చంద్రబాబు వద్దకు పంచాయితీ అక్రమ బూడిద రవాణాలో ప్రజాప్రతినిధి వర్గం, కొండపల్లి మున్సిపాలిటీ పట్టణ టీడీపీ ఉపాధ్యక్షుడి వర్గం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పట్టణ ఉపాధ్యక్షుడి లారీలపై ప్రజాప్రతినిధి వర్గం కేసులు నమోదు చేయించడమే కాక, ఫోన్ చేసి దుర్భాషలాడి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ విషయాన్ని పట్టణ ఉపాధ్యక్షుడి వర్గం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. ఇక్కడ జరుగుతున్న బూడిద అవినీతిలో ఓ సామాజిక వర్గం, ప్రజాప్రతినిధి పెత్తనం వివరిస్తూ వాట్సాప్ మెసేజ్ ద్వారా సీఎంకు చేరవేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఓ సామాజిక వర్గం కింద మిగిలిన సామాజిక వర్గాల వారు మానసికంగా నలిగిపోయి మనోవేదనకు గురవుతున్నట్లు ఆ మెసేజ్లో పేర్కొన్నారు. ఈ పంచాయితీ ఎటువైపు దారి తీస్తుందో వేచిచూడాలి. బూడిదతో నిండిపోతున్న ఇళ్లు, పంట పొలాలు ఇటీవల రోడ్డెక్కి ఆందోళన చేసిన స్థానికులు కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమ బాట సీఎం చంద్రబాబు దృష్టికి బూడిద పంచాయితీ నా దగ్గరేముంది బూడిద అనే నానుడికి కాలం చెల్లింది. బూడిద ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతలకు ధనార్జన వస్తువుగా మారింది. అయితే ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం భస్మం చేస్తోంది. దీనిపై స్థానికులు ధర్నాలు, ఆందోళనలు చేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. చివరకు ఈ బూడిద పంచాయితీ సీఎం చంద్రబాబు దాకా వెళ్లింది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
గుడ్లూరు: ముందు వెళ్తున్న ట్రాలీని వెనుక నుంచి ఆటో ఢీకొట్టడంతో ఓవ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన 16వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి గుడ్లూరు మండలంలోని తెట్టు ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ వి.వెంకట్రావు కథనం మేరకు..విజయవాడలో కృష్ణలంకకు చెందిన పక్కెళ్ల శ్రీనివాసరావు(48) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. ఆటోలో ఫర్నీచర్ సామగ్రిని నెల్లూరు జిల్లా కలిగిరిలో దించి తిరుగు ప్రయాణమయ్యాడు.ఈక్రమంలో తెట్టు ఫ్లైఓవర్ వద్ద యంత్రాలతో వెళ్తున్న ఓ ట్రాలీ లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డగోలుగా అడ్వాన్స్ తరగతులు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం సెలవులు ప్రకటించినప్పటికీ కార్పొరేట్ విద్యాసంస్థలు యథేచ్ఛగా తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులను హింసిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థులు ఇరుకు గదుల్లో ఎండ వేడితో తీవ్ర ఇబ్బందులు పడటమే కాక, ఆయా విద్యాసంస్థల ఒత్తిడితో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు మార్చి నెలలో పరీక్షలు నిర్వహించింది. ఏప్రిల్ లో ఫలితాలను ప్రకటించింది. బోర్డు తమ పరిధిలోని విద్యాసంస్థలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి సెలవులను ప్రకటించింది. కానీ కార్పొరేట్ సెక్టార్లోని అత్యధిక విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా తరగతులను కొనసాగిస్తున్నాయి. ఆనవాయితీకి భిన్నంగా షెడ్యూల్ ప్రతి ఏటా వార్షిక పరీక్షలు పూర్తవగానే విద్యార్థులకు సెలవులు ప్రకటించటం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన తరువాత ద్వితీయ సంవత్సరం తరగతులను వెంటనే మొదలు పెట్టే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. వారికి ఈ నెల 23వ తేదీ వరకూ తరగతులను నిర్వహించి, 24వ తేదీ నుంచి సెలవులు ప్రకటించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు ప్రకటించకుండానే ఇంటర్మీడియెట్ మొదటి ఏడాదికి అడ్మిషన్లు నిర్వహించే విధంగా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇవన్నీ ప్రైవేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయా లంటూ విద్యార్థి సంఘాల నేతలు మండి పడుతున్నారు. అదే రీతిలో సెలవులు ప్రకటించినప్పటికీ ఉమ్మడి కృష్ణాజిల్లాలోని చాలా విద్యాసంస్థలు విద్యార్థులకు యథావిధిగా తరగతులను కొన సాగిస్తున్నాయి. ప్రవేశ పరీక్షల పేరుతో క్లాసులు కార్పొరేట్ విద్యాసంస్థలు నీట్, ఎంసెట్ ప్రవేశ పరీక్షల పేరుతో ఈ తరగతులను కొనసాగిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. అది కూడా ఆయా కోర్సులకు వెళ్లే విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలకు సిద్ధమవుతారు. కానీ సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారికి, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలోకి వచ్చిన వారికి సైతం సెలవులు ఇవ్వకుండా ప్రవేశ పరీక్షల పేరుతో యథేచ్ఛగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సైతం కొన్ని విద్యాసంస్థలు బ్రిడ్జి కోర్సులని, మ్యాథ్స్ అవగాహన తరగతులంటూ ప్రత్యేకంగా తరగతులను కొనసాగిస్తున్నాయి. ఒత్తిడి సరికాదంటున్న నిపుణులు సాధారణంగా వార్షిక పరీక్షలు పూర్తయిన తరువాత ఆ విద్యార్థిపై అప్పటి వరకూ కొనసాగిన ఒత్తిడిని నివారించేందుకు కొన్ని రోజులు సెలవులు ప్రకటించటం పరిపాటి. వేసవి ఎండల్లో సెలవుల పేరుతో వారిని కొద్ది రోజులు ఇళ్లకు పరిమితం చేయటం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఎటువంటి సెల వులు లేకుండా తీవ్ర స్థాయిలో ఒత్తిడిని పెట్టే విధంగా తరగతులు నిర్వహించటం వలన విద్యార్థులు మానసికంగా తీవ్రమైన సంఘర్షణకు లోనయ్యే ప్రమాదముందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం కార్పొరేట్ సంస్థలతో పాటుగా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా తరగతులను నిర్వహిస్తుంటే సంబంధిత అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని విద్యార్థి సంఘాల నేతలు మండి పడుతున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న కళాశాలలతో పాటుగా నగరం నడిబొడ్డున ఉన్న పలు విద్యాసంస్థలు తరగతులను నిర్వహిస్తున్నాయి. తరగతులు నిర్వహిస్తున్న సమాచారం ఉన్నప్పటికీ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ఆ దిశగా దృష్టి సారించకపోవటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికై నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విద్యాసంస్థలపై దృష్టి పెట్టాలని తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు సెలవులిచ్చినా యథేచ్ఛగా తరగతులు ప్రవేశ పరీక్షల పేరుతో సెకండియర్ విద్యార్థులకు క్లాసులు బ్రిడ్జి కోర్సులంటూ ఇంటర్ ఫస్టియర్ తరగతులు బరితెగిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగంపరిశీలించి చర్యలు తీసుకుంటాం కొన్ని విద్యాసంస్థలు నీట్, ఇతర ప్రవేశ పరీక్షలకు తరగతులను నిర్వహిస్తున్నాయి. వారికి కాకుండా ఇతరులకు తరగతులు నిర్వహిస్తే అది నిబంధనలకు విరుద్ధం. అటువంటి విద్యాసంస్థలపై తనిఖీలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. దీనిపై నిఘా ఉంచుతాం. – ప్రభాకరరావు, ఆర్ఐవో, ఎన్టీఆర్ జిల్లా -
వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శనివారం సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి కల్యాణోత్సవాన్ని జరిపించారు. తొలుత స్వామి వారి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాలతో కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేదికపై ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ఆలయ అర్చకులు తలంబ్రాలను అందజేశారు. కల్యాణోత్సవం అనంతరం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆలయానికి తరలించగా, భక్తులు, ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు. అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
పోలీసు సిబ్బంది సేవలు అభినందనీయం
కోనేరుసెంటర్: పోలీసుశాఖలో సుదీర్ఘకాలంపాటు విశిష్ట సేవలను అందించిన సిబ్బంది సేవలు అభినందనీయం జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు (అడ్మిన్), ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ కొనియాడారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన పలువురు పోలీసులను ఏఎస్పీలు శనివారం ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా ఏఎస్పీలు మాట్లాడుతూ పోలీసువృత్తిలో మానసికంగా, శారీరకంగా ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉంటాయన్నారు. వాటన్నింటిని అధిగమిస్తూ సర్వీసులో ఎక్కడ ఎలాంటి రిమార్కు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగ విరమణ పొందడమనేది అదృష్టంగా భావించాలన్నారు. భవిష్యత్లో పోలీసుశాఖ తరుపున ఎలాంటి సహాయం అందించటానికైనా తాము సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన జి.వి.ప్రసాద్ రావు(ఎస్సై, గుడివాడ ట్రాఫిక్) ఎన్.ఎన్.పూర్ణచంద్రరావు(ఏఎస్సై, చల్లపల్లి), డి. వీరరాజు (ఏఎస్సై, ఉయ్యూరు), ఎన్.డి. నాగేశ్వరరావు (ఏఎస్సై, ఉంగుటూరు), డి.ఆంజనేయులు (ఏఎస్సై, నందివాడ)లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బందరు డీఎస్పి సిహెచ్ రాజా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, చిలకలపూడి సీఐ ఎస్కే నభీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సతీష్కుమార్, రవికిరణ్, పోలీసు అధికారులు, పదవీ విరమణ చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బీచ్ ఉత్సవాలపై మంత్రి సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): ఈనెల 15వతేదీ నుంచి 17వ తేదీ వరకు మూడురోజులపాటు జరుగనున్న మంగినపూడి బీచ్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎకై ్సజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో కలెక్టర్ డీకె బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ట్రైనీ కలెక్టర్ జాహెద్ ఫర్హీన్తో కలిసి బీచ్ ఉత్సవాల నిర్వహణపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఏయే ప్రాంతాల్లో ఫుడ్కోర్టులు, ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలో మ్యాప్ ద్వారా స్థలాల కేటాయింపుపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జాతీయ క్రీడలైన కయాకింగ్ కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు ప్రతిబింబించేలా బీచ్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. జలక్రీడలు, సాహసక్రీడలు అద్భుతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులు, పర్యాటకులకు కావాల్సిన వసతి, అతిథిగృహాలను సిద్ధం చేస్తున్నామన్నారు. లక్షలాది మంది ప్రజలు ఉత్సవాల్లో పాల్గొననున్న నేపథ్యంలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. మెప్మా పీడీ పి.సాయిబాబు, నాగాయలంక తహసీల్దార్ ఎం.హరినాఽథ్ పాల్గొన్నారు. -
అక్రమరవాణాకు అడ్డుకట్ట ఏది?
జగ్గయ్యపేట: ఇసుక, గ్రావెల్, బియ్యం అక్రమంగా రవాణ చేస్తే సహించేది లేదంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. కొందరు అక్రమార్కులు పగలూ, రాత్రి తేడా లేకుండా ఏపీ నుంచి యథేచ్ఛగా తెలంగాణకు ఇసుక, గ్రావెల్, బియ్యం రవాణా చేస్తూ పోలీసు, చెక్పోస్టు అధికారులకు పనితీరును ప్రశ్నార్థకంగా మార్చారు. దీంతో ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్పోస్టుల ఏర్పాటు కేవలం అలంకారప్రాయమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు అంతఃరాష్ట్ర చెక్పోస్టులు... ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జగ్గయ్యపేట మండలం గరికపాడు, తిరువూరు మండలం ముత్తగూడెం వద్ద అంతఃరాష్ట్ర చెక్పోస్టులు ఉండగా ప్రస్తుతం గరికపాడు చెక్పోస్టు మాత్రమే పనిచేస్తోంది. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో 13 గ్రామాల్లో సరిహద్దు చెక్పోస్టులు పనిచేస్తున్నాయి. మైలవరం నియోజకవర్గంలోని చెక్పోస్టులు పూర్తిగా పని చేయడం లేదు. అక్రమ రవాణాతో ధ్వంసమవుతున్న రోడ్లు... ముఖ్యంగా గరికపాడు అంతఃరాష్ట్ర చెక్పోస్టు ఉన్నప్పటికి హైదరాబాద్ నుంచి నిషేధిత కోళ్ల వ్యర్థాలు వారంలో మూడురోజులు తెల్లవారుజామున 5 నుంచి 20 లారీలకు పైగా కృష్ణాజిల్లాలోని పలు చేపల చెరువులకు వెళ్తుంటాయి. ఈ నిషేధిత వాహనాలు సరిహద్దు దాటడంలో జగ్గయ్యపేట సర్కిల్లోని కొందరు పోలీసుల అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. ఇక కాకినాడ పోర్టు వద్ద రేషన్బియ్యం రవాణా నిలిపివేయడంతో అక్రమార్కులు లారీల ద్వారా బియ్యాన్ని తెలంగాణకు తరలిస్తున్నారు. చెక్పోస్టు తనిఖీలు తప్పించుకునేందుకు సరిహద్దు గ్రామాల మీదుగా ఈ అక్రమ రవాణా సాగుతోంది. ఇలా ఇసుక, బియ్యం, గ్రావెల్తో వెళ్లే భారీ వాహనాల కారణంగా తమ గ్రామంలోని రోడ్లు దెబ్బతింటున్నాయంటూ జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామస్థులు ఇటీవల నియోజకవర్గ ప్రజాప్రతినిధికి కూడా మొరపెట్టుకోవడం గమనార్హం. నామమాత్రంగా తనిఖీలు... సరిహద్దు చెక్పోస్టుల వద్ద సిబ్బంది నామమాత్రపు తనిఖీలకు పరిమితమవుతుండటంతో అక్రమార్కులు వారి కళ్లుగప్పి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఉదయం సమయాల్లో పాలేరు, మునేరు, కృష్ణానది నుంచి ఇసుకను తీసుకువచ్చి వారికి అనుకూలమైన ప్రదేశాలలో డంపింగ్ చేస్తూ, పది ట్రాక్టర్లు సరిపడా ఇసుక రాగానే రూట్ మ్యాప్ మేరకు తెలంగాణకు తరలిస్తున్నారు. చెక్పోస్టుల్లో పోలీస్ సిబ్బంది ప్రశ్నిస్తే సమీపంలోని పలు గ్రామా ల్లో కర్మాగారాల్లో నిర్మాణాల కోసమంటూ మాస్కా కొడుతున్నారు. ఇలా ముక్త్యాల, రామచంద్రునిపేట, మల్కాపురం, అన్నవరం, వత్సవాయి మండలం పోలంపల్లి, తాళ్ళూరు, పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదుర్రు కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం మధిర ఇసుక భారీగా తరలివెళ్తోంది. గత నెల 25న ముక్త్యాల చెక్పోస్టు మీదుగా సూర్యాపేట జిల్లా చింతలపాలెంనకు చెక్పోస్టు కానిస్టేబుల్ సహకారంతో ఇసుక ట్రాక్టర్ను తరలిస్తుండగా గ్రామంలోని యువకులు అడ్డుకుని పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వగా, ఉన్నతాధికారులు కానిస్టేబుల్ను మందలించి అతన్ని చెక్పోస్టు విధుల నుంచి తొలగించారు. చందర్లపాడు మండలం కాసరాబాద్, కంచికచర్ల మండలం వేములపల్లి ఇసుక రీచ్ల నుంచి గరికపాడు చెక్పోస్టు మీదుగా రాత్రి వేళల్లో హైదరాబాద్కు నిత్యం ఇసుక లారీలు తరలి వెళ్తున్నాయి. చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతుండటం గమనార్హం. ఇకనైనా జిల్లా పోలీసు, తనిఖీ విభాగాల అధికారులు స్పందించి ఈ ఇసుక, గ్రావెల్, బియ్యం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. నామమాత్రంగా చెక్పోస్టులు నిద్రనటిస్తున్న ఉన్నతాధికారులు అక్రమార్కులకు స్థానిక పోలీసుల అండ దండలు తెలంగాణకు జోరుగా ఇసుక, గ్రావెల్, బియ్యం అక్రమ తరలింపు కూటమి నేతల సహకారంతోనే.. జిల్లా వ్యాప్తంగా ఆయా సరిహద్దు చెక్పోస్టులు ఉన్నప్పటికి దర్జాగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక, గ్రావెల్, బియ్యం తరలిపోతుండటం గమనార్హం. అక్రమార్కులకు అధికారపార్టీ నాయకుల పూర్తి అండదండలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అక్రమార్కులు రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమరవాణాను సాగిస్తున్నారు.ముఖ్యంగా వత్సవాయి, తాళ్ళూ రు, పోలంపల్లి, ముక్త్యాల, అన్నవరం, బూదవాడ, జొన్నలగడ్డ, పెద్దాపురం సరిహద్దు చెక్పోస్టుల నుంచి ఉచితం పేరుతో ఇసుక తెలంగాణకు తరలిపోతుంది. అంతేకాకుండా తెలంగాణలోని సూర్యపేట నుంచి రామా పురం క్రాస్రోడ్డు వరకు 69వ నంబర్ జాతీయ రహదారి ఆరు లైన్ల రహదారిగా నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ ప్రాంతం నుంచే గ్రావెల్ను ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. -
దళిత మహిళపై దారుణం
పెడన: రాష్ట్రంలో మరో దళిత మహిళపై దారుణం జరిగింది. దళిత మహిళను చితకబాదటమే కాకుండా దుస్తుల్ని చించిన ఘటన కృష్ణా జిల్లా పెడన మండలం బల్లిపర్రులో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత మహిళ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహిళ కుటుంబం బల్లిపర్రులో నివాసం ఉంటోంది. భర్త ఆర్టీసీ ఉద్యోగి కావడంతో గురువారం డ్యూటీకి వెళ్లారు.అ రోజు రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటిముందు తన కుమారుడితోపాటు నిద్రించేందుకు సిద్ధమవుతుండగా.. ఎవరో విసిరిన కర్ర వచ్చి కుమారుడికి తగిలింది. పిల్లాడికి తగలరాని చోట తగిలితే పరిస్థితి ఏమిటని ఆమె కేకలు వేసింది. దీంతో ఆ ఇంటి సమీపంలో ఉండే గాదె సురేంద్ర, గాదె నరేంద్ర, గాదె నాగ వచ్చి ఆమెను కింద పడేసి చితకబాదారు. ఆమె ధరించిన నైటీని చించివేశారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను కుటుంబ సభ్యులు మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేరి్పంచారు. ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు ఇచి్చన సమాచారం మేరకు పెడన పోలీసులు విచారణ చేపట్టారు.