గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): జనాభాలో మూడు శాతం ఉన్న రజక సామాజిక వర్గంలో ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె.పూర్ణచంద్రరావు అన్నారు. రజకులకు సామాజిక న్యాయం జరగాలంటే జనాభా నిష్పత్తి ప్రకారం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ హనుమాన్పేటలో రజక సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎీస్టీ, మైనారిటీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగితే రాజకీయ సమీకరణాలు మారుతాయన్నారు. బీసీలు, ముస్లింలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్రంలో సమగ్ర కుల గణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు పానుగుపాటి శ్రీనివాస్, దాచేపల్లి మోహన్రావు, పేట శ్రీనివాస్, బైరవరపు శ్రీనివాస్, నమ్మి అప్పారావు పాల్గొన్నారు.


