Crime
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శ తర్వాతే ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగంలో కదలిక రావడం గమనార్హం. గురువారం రాత్రి 11గం. సమయంలో బాధితుడి తల్లికి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి పిలుపు వెళ్లింది. ఆ తర్వాతే సీఐ నాగరాజుపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా.. అప్పటికప్పుడే నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఫిర్యాదును కమిషనర్ స్వయంగా స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదు కాపీని విజయలక్ష్మికి అందజేశారు.ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్ను విచారణ అధికారిగా నియమించినట్లు విజయలక్ష్మితో సీపీ రాజశేఖర్ చెప్పినట్లు సమాచారం. అలాగే సీఐ నాగరాజుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం గమనార్హం. క్రైమ్ నంబర్ 107/2026గా నమోదైన ఈ కేసులో .. బీఎన్ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1)తో పాటు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 238 కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఒక పోలీసు అధికారిపైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ పరిణామం కేసు విచారణను మరింత కీలక దశకు తీసుకెళ్లింది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లడంతోనే ఉలిక్కిపడ్డ కూటమి ప్రభుత్వం.. ఆగమేఘాల మీద పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు చర్చ నడుస్తోంది.ఇదీ చదవండి: సీఐ నాగరాజు.. మాములోడు కాదు! -
దూసుకొచ్చిన లారీ.. అదుపుతప్పిన కారు
లింగాల ఘణపురం/మేడ్చల్ రూరల్: రాష్ట్రంలోని రెండు హైవేలపై బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. అతివేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ ఓ సరుకు రవాణా వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా అదుపుతప్పి డివైడర్ పైనుంచి దూసుకెళ్లిన ఓ కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.సాయం కోసం వచ్చి.. రోడ్డు ప్రమాదానికి బలై..సహచర వాహనదారుడికి సాయం చేసేందుకు అర్ధరాత్రి లారీ ఆపిన ఒకరు.. సోదరుడి మాటను కాదనలేక వచ్చిన తమ్ముడు.. రోడ్డుపై వాహనాన్ని మరమత్తు చేస్తూ ఇంకొకరు.. ఇలా ముగ్గురూ జనగామ జిల్లా నెల్లుట్ల బ్రిడ్జి వద్ద హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. మృతులను దేవరుప్పులకు చెందిన రోహిత్ (22), యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లికి చెందిన ననబాల మహేశ్ అలియాస్ మధు (23), మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టి గూడానికి చెందిన డినికెని రాజేందర్ (27)గా గుర్తించారు.హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా..ప్రత్యక్ష సాక్షులైన లారీ డ్రైవర్ హరీశ్, దిలీప్ల కథనం ప్రకారం.. దేవరుప్పులకు చెందిన కిరాణా వ్యాపారి దిలీప్ బుధవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి తన సరుకు రవాణా వాహనంలో కిరాణా సామానుతో స్వగ్రామానికి బయలుదేరాడు. అర్ధరాత్రి దాటాక నెల్లుట్ల బ్రిడ్జి సమీపం వద్దకు రాగానే టైర్ పంక్చర్ కావడంతో టైర్ విప్పేందుకు జాకీ కోసం రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపడం మొదలుపెట్టాడు. ఎవరూ వాహనాలు ఆపకపోవడంతో దేవరుప్పులలోని తన తమ్ముడు రోహిత్కు ఫోన్ చేసి జాకీ తీసుకురావాలని చెప్పాడు. అతను జాకీ తీసుకొని రాత్రి 1:30 గంటలకు వాహనం వద్దకు చేరుకున్నాడు. ఈలోగా హరీశ్ అనే లారీ డ్రైవర్ లారీని ఆపి జాకీ ఇచ్చాడు. దీంతో సరుకు రవాణా వాహన డ్రైవర్ మహేశ్ వాహనం కింద జాకీ పెట్టి టైర్ విప్పే ప్రయత్నం చేస్తుండగా రోహిత్ రోడ్డుపై కర్ర పట్టుకొని నిలబడి వచ్చిపోయే వాహనాలను అప్రమత్తం చేస్తున్నాడు. హరీశ్తోపాటు వచ్చిన అతని బావమరిది డినికెల రాజేందర్ తిరిగి లారీ ఎక్కేందుకు వెళ్తున్నాడు. లారీ డ్రైవర్ హరీష్, దిలీప్ ఇద్దరు రోడ్డు పక్కన డివైడర్పై కూర్చున్నారు. ఇంతలో ఒక్కసారిగా అతివేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ రోహిత్ను, ఆ తర్వాత సరుకు రవాణా వాహనాన్ని ఢీకొట్టడంతో దాని కింద ఉన్న డ్రైవర్ మహేశ్, లారీ ఎక్కేందుకు వెళ్తున్న రాజేందర్పై సరుకు రవాణా వాహనం పడటంతో ముగ్గురూ దుర్మరణం చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ శ్రావణ్కుమార్.. మృతదేహాలను జనగామ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఇసుక లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.అదుపుతప్పి డివైడర్ దాటి.. లారీని ఢీకొని..మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరిపల్లిలో బుధవారం అర్ధరాత్రి దాటాక రాజీవ్ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి, పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని మల్కాజ్గిరి న్యూ మిర్జల్గూడలో నివసించే చంద్రశేఖర్ (33) రైల్వే శాఖలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు. బుధవారం గోదావరిఖనిలో తన అత్తగారి ఇంటి నుంచి చంద్రశేఖర్ తన కుటుంబం, అతని బావమరిది కుటుంబం రెండు కార్లలో హైదరాబాద్ బయల్దేరారు. రాజీవ్ రహదారిలో అలియాబాద్ మున్సిపల్ పరిధి మురహరిపల్లి వద్దకు రాగానే చంద్రశేఖర్ నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను దాటి కుడి పక్కకు వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో చంద్రశేఖర్ (33)అక్కడికక్కడే మృతిచెందగా ఆయన భార్య రేఖ (30), కుమారుడు లోహిత్, రేఖ అక్క కుమారుడు నిహాల్ (2) తీవ్రంగా గాయపడ్డారు. వారి వెనుకగా మరో కారులో వస్తున్న రేఖ సోదరుడు రాజశేఖర్ ప్రమాదాన్ని గమనించి వెంటనే 108, పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్సు రాగానే సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేఖ, నిహాల్ మృతిచెందగా లోహిత్ పరిస్థితి విషమంగా ఉంది. -
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు
అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో రేగుపాలెం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.యలమంచిలి బైపాస్ వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న తులసి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో వెంటనే ప్రయానికులంతా బస్సు నుంచి దిగిపోయారు. దాంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అందరూ బయటపడ్డారు. బస్సు యలమంచిలి బైపాస్ చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే, డ్రైవర్ , సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. కాగా ఈ ప్రమాదంలో తులసీ ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. -
ఇసుక మైనింగ్ : బీజేపీ నేత కారుకు నిప్పు, ముగ్గురు సజీవ దహనం
ఛత్తీస్గఢ్లోని కోరియా (Koriya) జిల్లాలో ఇసుక మైనింగ్ వివాదం అత్యంత ఘోరమైన నరమేధానికి దారితీసింది. ఒక ఫార్చ్యూనర్ (Fortuner) కార్ను ట్రక్కుల మధ్య లాక్ చేసి, దానిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో బీజేపీ నేత, నాయకుడు, మాజీ జన్పద్ పంచాయతీ అధ్యక్షుడు భరత్ సింగ్ (లల్లా సింగ్) సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు.ఏం జరిగింది?ప్రాథమిక సమాచారం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోన్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌగైన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇసుక క్వారీ నిర్వహణ వివాదాన్ని పరిష్కరించు కోవడానికి, చర్చల కోసం భరత్ సింగ్ను పిలిచారు ప్రత్యర్థులు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆయన ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారు చుట్టుముట్టారు. అనంతరం అటూ ఇటూ ట్రక్కులను అడ్డుగా పెట్టి, కారు కదలకుండా లాక్ చేశారు. ఆపై కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో భరత్ సింగ్ కారులోనే సజీవ దహనమయ్యారు. మరణించిన వారిలో భరత్ సింగ్ బంధువులు, వీరేంద్ర సింగ్, నాగేంద్ర సింగ్ ఉన్నారు. వీరేంద్ర సింగ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో బంధువు మయాంక్ సింగ్ తీవ్ర గాయాతో బిలాస్పూర్లోని అపోలో ఆసుపత్రిలో అత్యంత విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఇదీ చదవండి: జాతీయ స్థాయి బాడీబిల్డర్ : జిమ్ చేసి వచ్చి అంతే కుప్పకూలిపోయాడుగతంలో కాంగ్రెస్లో ఉండి, భూపేష్ బఘేల్ ప్రభుత్వ హయాంలో బీజేపీలో చేరారు. భరత్ సింగ్కు ఇసుక మైనింగ్లో స్థానికంగా మంచి పట్టు ఉంది. ఆ ప్రాంతంలోని ఇసుక క్వారీ కాంట్రాక్టు భరత్ సింగ్ కుటుంబానికి దక్కింది. ఆ తర్వాత, సోన్హట్, కైలాష్పూర్, తెలిముడ, బెలియా , ఛింగురా ప్రాంతాలలో ఇసుక రవాణా, తవ్వకాలకు సంబంధించిన వసూళ్లపై ఆధిపత్య పోరు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. భరత్ సింగ్ వర్గానికి , మరో మనోజ్ త్రిపాఠి కుటుంబానికి మధ్య ఈ వివాదం గత కొన్ని నెలలుగా రగులుతోంది. త్రిపాఠి కుటుంబానికి చెందిన టిప్పర్ ట్రక్కుల ద్వారా ఇసుక రవాణా చేసే విషయంలో పేమెంట్లు, వర్గ ఆధిపత్య పోరు పెరిగి పెద్దదై మంగళవారం రాత్రి ఈ ఘోర కలికి దారి తీసింది. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అని, దీనిపై సీబీఐ (CBI) దర్యాప్తు జరిపించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి : ఎస్ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యాడు!ఈ హింసాత్మక ఘటనతో కోరియా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులను (అక్షత్ త్రిపాఠి, విశాల్ త్రిపాఠి, సత్యప్రకాష్ త్రిపాఠి, మన్ను త్రిపాఠి) అరెస్ట్ చేశారు. మొత్తం తొమ్మిది మందిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అడిషనల్ ఎస్పీ సురేషా చౌబే తెలిపారు. -
అమ్మా నీ బిడ్డ.. జ్ఞానేశ్వరి ఇంటి వద్ద జ్యోతిష్యుడి హల్చల్
సాక్షి, కాకినాడ: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో కేసు మిస్టరీ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో ఓ జ్యోతిష్కుడు హల్ చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ గద్వాల్ నుంచి వచ్చినట్లు చెప్పుకున్న ఓ అజ్ఞాత వ్యక్తి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద హడావిడి చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను జ్యోతిష్యుడినని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, ‘‘పాప భూదేవతలో ఉంది.. త్వరలో తిరిగి వస్తుంది’’ అంటూ చెప్పాడట. అదే సమయంలో.. కుటుంబ సభ్యులను భయపెట్టేలా, అలాగే ఆశ కలిగించేలా మాటలు చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.జ్ఞానేశ్వరి ఇంటి వద్ద గత రెండు రోజులుగా అతను అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో అతని ప్రవర్తనపై అనుమానాలు పెరిగాయి. “అమ్మా నీ బిడ్డ ఎక్కడ ఉంది చెప్పు” అంటూ జ్యోతిష్యుడు తరహాలో వ్యాఖ్యలు చేస్తూ కుటుంబాన్ని మరింత భావోద్వేగానికి గురిచేసినట్లు సమాచారం. దీంతో ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి తల్లి భవాని, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకోకుండా ఇలా భయపెట్టే మాటలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది.మరోవైపు, యువతి అదృశ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జ్యోతిష్యుడి హావభావాలు, అతని నేపథ్యంపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఒక్కసారిగా జ్యోతిష్యుడి హడావిడితో కొత్త మలుపు తిరిగి, స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. -
నాకు పెళ్లైంది.. ఇలాంటి మెసేజ్లు పంపవద్దు..!
తమిళనాడు దిండుక్కల్ జిల్లా నత్తం సమీపంలోని వేలాయుధంపట్టికి చెందిన అరవిందన్ (22) కూలీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నాగలక్ష్మితో అతడు గతంలో సన్నిహితంగా మాట్లాడేవాడు. అయితే మూడు నెలల క్రితం నాగలక్ష్మికి సిరుమలై తాళకడై ప్రాంతానికి చెందిన వీరమణి (24)తో వివాహమైంది. వివాహం అనంతరం కూడా అరవిందన్ నాగలక్ష్మికి తరచూ ఫోన్ సందేశాలు పంపుతూ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నాగలక్ష్మి, తనకు పెళ్లైందని, ఇకపై ఇలాంటి సందేశాలు పంపవద్దని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆమె తన భర్త వీరమణికి కూడా తెలిపింది. అయినప్పటికీ అరవిందన్ తన ప్రవర్తన మార్చుకోలేదు.దీంతో నాగలక్ష్మి పేరుతో వీరమణి అరవిందన్కు సిరుమలైకి రావాలని సందేశం పంపినట్లు సమాచారం. నాగలక్ష్మిని కలుసుకోవచ్చన్న ఉద్దేశంతో అరవిందన్ అక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా వీరమణి, "నా భార్యను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు" అంటూ అరవిందన్తో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో వీరమణి కత్తితో దాడి చేసి అరవిందన్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.హత్య అనంతరం జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో వీరమణి మృతదేహాన్ని ఇంటి సమీపంలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. అనంతరం చెత్తతో కప్పి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ విషయాన్ని వీరమణి తన స్నేహితుడికి చెప్పగా, అతడు గ్రామ పెద్దలకు సమాచారం అందించాడు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ డీఎస్పీ శంకర్, ఇన్స్పెక్టర్ ఉలగనాథన్ నేతృత్వంలోని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.అరవిందన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దిండుక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
గుండెపోటుతో ఒకటో తరగతి బాలుడు మృతి
బెంగళూరు: గుండెపోటుతో బాలుడు మృతిచెందిన సంఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణంలో బుధవారం జరిగింది. గుండె నొప్పి వచ్చిందని చెప్పి విలవిలలాడుతుండగా ఆస్పత్రికి తరలించేలోగానే చిన్నారి మరణించాడు. హిరియూరు బీజేపీ తాలూకా అధ్యక్షుడు అభినందన్ కుమారుడు వైష్ణవ్ (4), తనకు గుండెల్లో మంటగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తీసికెళ్లారు. పిల్లాడు అల్లాడిపోవడం చూసి వారు భయపడిపోయారు. దారిలోనే బాలుడు తుదిశ్వాస విడిచాడు. ఒకటో తరగతి చిన్నారి ఇక శివమొగ్గ జిల్లాలో సాగర తాలూకా హలసి గ్రామంలో మరో ఘోరం జరిగింది. సాయంత్రం ప్రభుత్వ పాఠశాల వదిలిన తరువాత ఒకటో తరగతి బాలుడు త్రిలోక్ జైన్ (6) ఇంటికి వెళ్లాలని బయట నిలబడి ఉన్నాడు. అయితే కళ్లు తిరిగి కిందపడిపోయాడు. స్థానికులు, ఉపాధ్యాయులు అతని ముఖం మీద నీళ్లు చల్లగా స్పృహలోకి వచ్చాడు. తరువాత నీరు తాగించి కూర్చోబెట్టగా, టాయ్లెట్కు వెళ్తానని పాఠశాలలోని మరుగుదొడ్డికి వెళ్లాడు.ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు తీసి చూడగా బాలుడు చనిపోయి ఉన్నాడు. బాలునికి చిన్నప్పటి నుంచి గుండె సమస్య ఉన్నట్లు తల్లిదండ్రులు గౌతం జైన్, శిల్ప తెలిపారు. ఈ ఘటన గత శనివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పసిపిల్లల గుండెపోటు మరణాలపై ఆందోళన నెలకొంది. -
ప్రేమించిన వ్యక్తిని మరువలేక.. యువతి ఆత్మహత్య
అల్లూరి సీతారామరాజు జిల్లా: చోడవరం మండలం అంబేరపురం గ్రామానికి చెందిన యువతి కోడూరు దివ్య (26) దేవరాపల్లిలోని తన బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వి. సత్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంబేరుపురం గ్రామానికి చెందిన కోడూరు సన్నిబాబు కుమార్తె దివ్య విశాఖలోని బంగారు ఆభరణాల దుకాణంలో కొంత కాలంగా పని చేస్తోంది. అక్కడ ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారంతా మాట్లాడుకొని వారి ప్రేమ వ్యవహారాన్ని ఇకపై కొనసాగించకుండా అంగీకారం కుదుర్చుకున్నారు. అప్పటి నుంచి దివ్య మానసిక ఒత్తిడికి గురైంది. ఆమె పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు వారం రోజులు క్రితం కుమార్తె దివ్యను దేవరాపల్లిలోని బంధువుల ఇంటికి తీసుకువచ్చారు. ప్రేమ వ్యవహారం విఫలమవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దివ్య మంగళవారం సాయంత్రం తన బంధువుల ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నితో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి సన్నిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
పానీపూరి ఫుడ్ పాయిజన్ ఘటన.. మోహన్లాల్పై కేసు!
సిరిసిల్లటౌన్: పానీపూరి తిని పిల్లలు సహా పాతిక మంది అస్వస్థతకు గురైన ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వాళ్లంతా ఇంకా జిల్లా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో.. ఆ పానీపూరి అమ్మిన వ్యక్తి ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. దీంతో అతనిపై కేసు నమోదు అయ్యింది.మూడు రోజుల క్రితం.. మోహన్లాల్ అనే వ్యక్తి బండి వద్ద పానీపూరి తిన్న పిల్లలు, పెద్దలు అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా వైద్యం చేయించుకున్న ఆరోగ్యం కుదుట పడకపోవడంతో జిల్లా ఆస్పత్రికి క్యూ కట్టారు. వీరికి కలెక్టర్ పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతోంది. వైద్య అందుతున్న తీరును జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రైడ్ బుధవారం పర్యవేక్షించారు. తంగళ్లపల్లి మండలం కేసీఆర్నగర్లో మోహన్ లాల్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా పానీపూరి బండితో వచ్చి వ్యాపారం చేస్తున్నాడు. గత సోమవారం కూడా ఎప్పటిలాగే కాలనీల్లో తిరిగి పానీపూరి విక్రయించాడు. చాలా మంది తినగా 22 మంది పిల్లలు, ముగ్గురు పెద్దలకు ఆహారం వికటించింది. మంగళవారం ఉదయం నుంచి ఒక్కొక్కరిగా వాంతులు, విరోచనాలు,, తీవ్రజ్వరం, తలనొప్పితో జిల్లా ఆస్పత్రికి వరుస పట్టారు. రాత్రి 9.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 25 మంది చేరారు. వారు తిన్న ఆహారం, నీరు కలుషితంతోనే ఫుడ్పాయిజన్ అయి ఉంటుందని వైద్యాధికారులు చెబుతున్నారు. పానీపూరి విక్రేతపై కేసు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. పానీపూరి విక్రేత మోహన్లాల్ ఇంటి వద్ద తనిఖీలు జరిపారు. ఫుడ్పాయిజన్ అయ్యేందుకు అవకాశం ఉండటంతో సెక్షన్ 56 కింద అతనిపై కేసు నమోదు చేశారు. అతను వేటితో పానీపూరి తయారు చేస్తున్నాడో పరిశీలించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ శాంపిల్స్ను ల్యాబ్లకు పరీక్ష నిమిత్తం పంపారు. ప్రత్యేక వైద్య శిబిరంఈ ఘటన నేపథ్యంలో బుధవారం అక్కడ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఆశకార్యకర్తలు, వైద్య సిబ్బంది కాలనీలో ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. అవసరమైన వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులను పంపిణీ చేశారు. డీఎంహెచ్వో డాక్టర్ ఏంజెల్ ఆల్ఫ్రెడ్, డాక్టర్ నాగేంద్రబాబు, వైద్యాధికారి డాక్టర్ స్నేహ పరిస్థితిని సమీక్షించారు. హెచ్ఈవో బాలయ్య, హెచ్ఎస్ ప్రమీల, సతీశ్కుమార్, ఎంఎల్హెచ్పీ ఆరీఫ్, నవీన్, సంతోష్ పాల్గొన్నారు. సిరిసిల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు.నిరంతర పర్యవేక్షణలో చికిత్సఒకేసారి 25 మంది ఫుడ్పాయిజన్తో ఆస్పత్రికి రావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాలతో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్బాబు ఆస్పత్రికి వచ్చి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నా రు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించి వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశా రు. బాధితులను నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్ట ణాధ్యక్షుడు జిందం చక్రపాణి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జాలుగం ప్రవీణ్ పరామర్శించారు. బాధితులు కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందిస్తామని డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఆ భర్త బాత్రూంలోనూ సీసీ కెమెరా పెట్టాడు!
అనుమానం అతడిని మృగంలా మార్చింది.. అదనపు కట్నం డిమాండ్లు ఆమె జీవితాన్ని భారంగా మార్చాయి. ప్రతి కదలికపై నిఘా, ప్రతి మాటపై అనుమానం, అత్తింటి వేధింపులు.. ఇలా 48 రోజుల కాపురమే ఓ నవవధువుకు నరకయాతనగా మారింది. చివరకు ఆ మానసిక వేదనను తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడి.. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది.పుణే వైష్ణవి హగ్వానే కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అరకేజీ బంగారం, నగదు, కాస్ట్లీ కారు కట్నంగా ఇచ్చినప్పటికీ.. సరిపోలేదంటూ అత్తింటి కుటుంబం వైష్ణవిని బలి తీసుకుంది. ఈ ఘటన తర్వాత.. వరకట్నం విషయంలో కొన్ని కులాల పెద్దలు ‘తల్లిదండ్రులు తమకు ఉన్నంతలోనే వివాహం చేయాలి’ అని తీర్మానాలు కూడా చేశారు. అయితే ఆ ఘటన మరువక ముందే.. అదే తరహాలో మహారాష్ట్రంలోనే మరో వరకట్న వేధింపులకు నవవధువు బలైన ఘటన చోటు చేసుకుంది. అంబర్నాథ్లో పెళ్లైన 48 రోజుల్లోనే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు.. దీనికి తోడు ప్రతీ చిన్న విషయానికి భర్త అనుమానించడం విశాఖ తిల్కర్(26)ను దారుణంగా కుంగదీశాయి. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు చెబుతోంది ఏంటంటే.. విశాఖకు ఈ ఏడాది ఏప్రిల్ 30న వైద్యుడు నితిన్ తిల్కర్తో వివాహమైంది. అడిగినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. అయితే అత్తింట అడుగు పెట్టిన మరుసటి రోజు నుంచే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. తాము అనుకున్నంత కట్నకానుకలు రాలేదని తల్లి, మరిది సూటిపోటి మాటలతో వేధించసాగారు. ఇటు నితిన్ కూడా చీటికి మాటికి విశాఖను అనుమానించడం మొదలుపెట్టాడు. ఇంటి లోపల, బయట.. ఆఖరికి బాత్రూమ్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విశాఖ ప్రతి కదలికను గమనించాడట.... ఎవరితో మాట్లాడినా ప్రశ్నించడం, అనుమానించడం, దాడి చేయడం తరచూ జరిగేది. విశాఖ బలవన్మరణానికి పాల్పడే రెండు రోజుల ముందు పొరుగును ఉన్నవాళ్లతో మాట్లాడిందని నితిన్ తీవ్రంగా కొట్టాడు. అప్పటిదాకా మౌనంగా భరిస్తూ వచ్చిన ఆమె.. పుట్టింటికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. దీంతో ఆమెను ఆ నరకం నుంచి బయటపడేయాలని తల్లిదండ్రులు భావించారు. ఈలోపే.. ఏం జరిగిందో ఏమోగానీ జూన్ 16న ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త నితిన్ తిల్కర్తో పాటు అతని తల్లి ఛాయా, సోదరుడు నినాద్పై మానసిక, శారీరక వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాల కింద కేసులు పెట్టారు. నితిన్ను అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. పెళ్లై రెండు నెలలు కూడా పూర్తికాకముందే అనుమానం, నిఘా, వేధింపుల మధ్య తమ బిడ్డ జీవితం అర్థాంతరంగా ముగిసిందంటూ ఆ తల్లిదండ్రులు పెట్టిన కన్నీళ్లు పలువురిని కదిలించాయి. -
ఆరు నెలల సహజీవనం.. ఒక్క క్షణంలో విషాదాంతం
కర్ణాటక: యువతీ యువకుడు సహజీవనం చేస్తుండగా, యువతి హత్యకు గురైంది. ఈ ఘటన బెంగళూరు మల్లేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్డీ అనుషా (20)ను ఆమె ప్రియుడు శరత్ (25) హత్య చేశాడు. ఇద్దరూ కూడా హాజన్ జిల్లాలోని సకలేశపురకు చెందినవారు. శరత్ వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పని చేస్తున్నాడు, ఆమె ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేదని సమాచారం. ఇన్స్టాలో పరిచయం పెరిగి 6 నెలల నుంచి ఒకే గదిలో సహజీవనం ప్రారంభించారు. అయితే 13వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆమెను తీవ్రంగా కొట్టి గొంతు పిసికి చంపి పారిపోయాడు. తరువాత మరుసటి రోజున తనకు తెలిసిన న్యాయవాదికి చెప్పాడు. పోలీసులు వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉండడం బద్ధలు కొట్టి లోపలకు వెళ్లారు. అనుషా నేలపై విగతజీవిగా పడి ఉంది. ఇంటి నిర్వహణ, పనుల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని యజమాని మహాదేవ తెలిపాడు. నిందితుని కోసం గాలింపు చేపట్టారు. -
రూ.4 కోట్ల నగల దోపిడీ వెనుక అసలు కథ..
గాజియాబాద్: యూపీలోని గాజియాబాద్ తనిష్క్ షోరూమ్ చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుకాణంలో పనిచేస్తోన్న వ్యక్తే.. తన ప్రియురాలితో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. పెళ్లి కోసం ఆ వ్యక్తి.. గర్ల్ఫ్రెండ్తో కలిసి రూ.4కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లాడు. ఈ చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారుతనిష్క్ ఉద్యోగి నితిన్ వర్మ (23), అతని ప్రియురాలు కాజల్ వర్మ (22), అతని తండ్రి సంజయ్ వర్మ (52). జూన్ 12న రాజ్ నగర్ డిస్ట్రిక్ట్ సెంటర్లోని తనిష్క్ షోరూమ్ నుండి రూ. 4 కోట్లకు పైగా విలువైన నగలను దొంగిలించినట్లు పోలీసులు నిర్థారించారు. పెళ్లి ఖర్చుల కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.నితిన్ ఆ షోరూమ్లో చేరి కేవలం నెల పదిహేను రోజులు మాత్రమే అయింది.. కానీ ఈ కొద్ది సమయంలోనే అతను స్టోర్ భద్రతా ఏర్పాట్లు, అత్యంత విలువైన నగలు ఎక్కడ ఉంచుతారనే విషయాలను తెలుసుకున్నాడు. ఘటనకు ఒక రోజు ముందే కాజల్తో తన పెళ్లి నిశ్చయమైందని చెబుతూ స్టోర్ సిబ్బందికి పార్టీ ఇచ్చాడు. ఆ వేడుకలో షోరూమ్ తాళాలు తన వద్దే ఉంచుకునే క్యాషియర్ గౌతమ్ రాజ్తో ఎక్కువగా మద్యం తాగిపించాడు. అనంతరం అతన్ని ఇంటి దగ్గర దింపుతానని చెప్పి.. అతని బ్యాగ్ నుండి షోరూమ్ మెయిన్ ఎంట్రన్స్ తాళాన్ని దొంగిలించాడు.మరుసటి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో నితిన్ తన అనుచరుడితో కలిసి షోరూమ్కు వచ్చాడు. వారు దొంగిలించిన తాళంతో షట్టర్ తెరిచి.. ఎలాంటి అనుమానం రాకుండా లోపలికి వెళ్లడం సీసీటివి ఫుటేజీలో రికార్డయింది. డీసీపీ ధవళ్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ దొంగతనం పూర్తి చేయడానికి కేవలం 25 నిమిషాలు పట్టింది. వారు గ్రౌండ్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లను వదిలేసి.. బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలు పొదిగిన నగలు ఉన్న ఫస్ట్ ఫ్లోర్ను టార్గెట్ చేశారు. నితిన్ లోపలికి వెళ్లినప్పుడు ఓ అనుచరుడు బయట నిలబడి నిఘా ఉంచాడని పోలీసులు తెలిపారు. వారు సుమారు రూ. 4 కోట్ల విలువైన నగలను సర్దుకుని, ఎవరికీ దొరక్కుండా దూరంగా పార్క్ చేసిన వాహనంలో పరారయ్యారు.ఈ దర్యాప్తులో షోరూమ్లోని తీవ్రమైన భద్రతా లోపాలు కూడా బయటపడ్డాయి. రూ.50 కోట్లకు పైగా విలువైన నగలు ఉన్నప్పటికీ.. అక్కడ ఎలాంటి అలారం సిస్టమ్ లేదు. రాత్రి వేళల్లో కేవలం ఒకే ఒక్క సెక్యూరిటీ గార్డును నియమించారు. అతను కూడా ఉదయం 7 గంటలకే డ్యూటీ నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీ విజువల్స్ను కంపెనీ హెడ్ ఆఫీస్ నుండి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ.. నిందితులు 25 నిమిషాలకు పైగా లోపలే ఉన్నా ఈ చొరబాటును ఎవరూ గమనించలేకపోయారు.నితిన్, కాజల్ కలిసి ఈ దొంగతనానికి ప్లాన్ చేయగా.. దొంగిలించిన నగలను అమ్మడంలో సంజయ్ వర్మ సహాయం చేశాడు. తమకు వైద్య ఖర్చుల కోసం డబ్బు కావాలని అబద్ధాలు చెప్పి నిందితులు కొన్ని నగలను తక్కువ ధరలకే విక్రయించారు. ప్రస్తుతం అధికారులు రూ. 3.1 కోట్ల విలువైన దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ. 6.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
గుండెల్ని పిండేసే దారుణ ఘటన
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరంలో గుండెల్ని పిండేసే ఓ దారుణమైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. భార్యపై ఉన్న కోపం, అనుమానంతో తన కుమార్తెను ఉరి తీసి చంపాడో కిరాతకుడు. వివరాల్లోకెళ్తే.. నేపాల్కు చెందిన లక్ష్మణన్ ప్రసాద్ చెన్నైలోని చింతాద్రిపేటలో ప్రభుత్వ పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె గీత 4వ తరగతి, చిన్న కుమార్తె 1వ తరగతి చదువుతున్నారు. భార్యపై అనుమానంతో లక్ష్మణన్ తరచూ గొడవ పడడంతో మనస్తాపం చెందిన భార్య తన చిన్న కుమార్తెను తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద కుమార్తె గీతను తన వద్దే ఉంచుకున్నాడు.సోమవారం రాత్రి సమయంలో తన భార్యకు వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. భార్య, చిన్న కూతురు చూస్తుండగానే.. పెద్ద కుమార్తె గీత మెడకు తాడు బిగించి ఉరితీసి హత్య చేశాడు. వెంటనే తానూ అదే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తాడు తెగిపోవడంతో కిందపడి తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మంగళవారం ఉదయం మరణించాడు. -
మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది!
NEET UG Re-Exam 2026 ప్రతిష్టాత్మక నీట్ యూజీ రీ ఎగ్జామ్కు సంబంధించి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె 23 ఏళ్ల రియా కుమారి థాపా తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇంటర్లో 97 శాతం, విషాదంజూన్ 21న జరగబోయే నీట్ పునఃపరీక్ష (re-examination) కోసం రియా సిద్ధపడుతోంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం రాసే NEET-UG పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఆమె ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయితే ఈ సారి ఫలితం ఎలా ఉంటుందో అనే ఒత్తిడి మధ్య ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి ఎవరూ కారణం కాదంటూ ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో హిందీలో "ఐ లవ్ యూ, మమ్మీ, పాపా. ఇందులో ఎవరి తప్పూ లేదు" అని పేర్కొనడంతో తల్లిదండ్రుల శోకాన్ని ఆపడం ఎవరి తరమూ కావడంలేదు. రియా గతంలో 12వ తరగతిలో 97 శాతం మార్కులతో స్కూల్ టాపర్గా నిలవడం గమనార్హం. ఇదీ చదవండి: షాకింగ్ : ఐఏఎఫ్ ఆఫీసర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..! రాత్రంతా చదువుకుని ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం రియాకు అలవాటు. మంగళవారం మధ్యాహ్నం భోజనానికి పిలవడానికి తల్లి ఆమె గది తలుపు తట్టింది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో, తండ్రి సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా రియా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అయితే, చదువుల్లో ఆశించిన విజయం సాధించలేకపోతున్నాననే తీవ్ర నిరాశ, తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడమే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రాథమిక కారణాలని సీనియర్ పోలీస్ అధికారి అంకిత్ కండారీ తెలిపారు.ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్నోట్ : చదువుల ఒత్తిడి, పరీక్షల భయం వల్ల ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు నిపుణుల లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం ఎంతో అవసరం. ఇదీ చదవండి: ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి -
కారు బీభత్సం
ఒంగోలు టౌన్: ఒంగోలు దక్షిణ బైపాస్పై అదుపు తప్పిన కారు బీభత్సం సృష్టించింది. పాదచారులతో సహా ఒక మోటారు బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఒక మహిళ, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో మహిళ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వస్తున్న కారు దక్షిణ బైపాస్లోకి రాగానే జంక్షన్కు కొద్ది దూరంలో అదుపుతప్పి అటుగా వెళ్తున్న ఒక మోటారు బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగులుప్పలపాడు మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన కవిలా సజనా (21) అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న కొమ్ము ప్రేమ్కుమార్కు, బాలిక కవిలా ఉజ్వలకు గాయాలయ్యాయి. అయితే కారు డ్రైవర్ ఆపకుండా అదే వేగంతో వెళ్లి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాత్లావత్ బుజ్జిబాయి (50)ని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. గుంటూరు జిల్లా శ్రీరాంపురం తాండాకు చెందిన బుజ్జిబాయి ఒంగోలు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటూ బైపాస్లోని ఒక హోటల్లో పనిచేస్తోంది. కారు డ్రైవర్ పరారయ్యాడు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో చూపించుకుని వెళ్తుండగా.. నగరంలోని దక్షిణ బైపాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కవిలా సజన మరణంతో ఇద్దరు చిన్నారులు తల్లి లేని బిడ్డలయ్యారు. నాగులప్పలపాడు మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన సజనా ప్రేమ్ కుమార్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగ లేకపోవడంతో మంగళవారం భర్త, చెల్లి ఉజ్వలతో కలిసి ఒంగోలుకు వచ్చింది. ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో వర్మ హోటల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచి్చన కారు ఢీకొట్టింది. టీడీపీ నాయకుడే కారు డ్రైవర్? రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు తూర్పునాయుడుపాలెం గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడిదిగా ప్రచారం జరుగుతోంది. అయితే మృతుల బంధువులు కొందరు కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నం చేయగా యజమాని వివరాలు అందుబాటులో లేవని తెలుస్తోంది. ప్రమాదం తరువాత డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు చెబుతున్నా.. పోలీసుల అదుపులోనే ఉన్నాడని మరికొందరు చెబుతున్నారు. మద్యం తాగి కారు నడిపాడా ? లేక నిద్రమత్తులో ప్రమాదం చేశాడా ? అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
షాకింగ్ : ఐఏఎఫ్ ఆఫీసర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..!
మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగపూర్లో భారత వైమానిక దళ (IAF) అధికారి భార్యపై ఆమె పాత క్లాస్మేట్ దారుణానికి పాల్పడిన వైనం దిగ్భ్రాంతి రేపింది. మత్తుమందిచ్చి అత్యాచారం చేశారని, అసభ్యకరమైన వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేశారని, అలాగే మతం మారేలా ఒత్తిడి చేశారని బాధిత ఆరోపించారు. దీనికి సంబంధించి వీడియో కీలక సాక్ష్యంగా మారింది.బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం 24 ఏళ్ల బాధిత మహిళను ఆమె పాత క్లాస్మేట్ అయిన అయాజ్ తాజ్ మదారే (26) ఆస్తి కొనుగోలు నెపంతో నాగపూర్లోని వార్ధా రోడ్డులో ఉన్న ఒక హోటల్కు పిలిపించాడు. అక్కడ ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను అశ్లీల వీడియోలుగా, ఫోటోలుగా రికార్డు చేశాడు. ఆ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ, ఆమెపై నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె నుండి రూ. 3.09 లక్షలు వసూలు చేశాడు. ఇదీ చదవండి: ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లిఅంతేకాదు బాధితురాలిని ఇస్లాం మతంలోకి మారాలని నిందితుడు ఒత్తిడి చేశాడు. మే నెలలో ఆమెను ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అమీన్ షేక్, హజ్రత్ మౌలానా అనే మరో ఇద్దరి సహాయంతో మతమార్పిడి ఆచారాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది, అందులో మహిళ తనను వదిలేయమని అరుస్తున్నప్పటికీ నిందితుడు బలవంతంగా పట్టుకుని మంత్రాలు చదువుతూ కనిపించాడు. ఆ తర్వాత ఆమెకు అయాజ్తో పెళ్లయిందని చెప్పి, మళ్లీ అత్యాచారానికి ప్రయత్నించారు.🚨Nagpur police arrests two men after Air Force personnel's wife accused them of rape, blackmail, forced religious conversion, and occult practices pic.twitter.com/7WuOn51lDL— The Tatva (@thetatvaindia) June 16, 2026ఈ ఘటన 2025 ఫిబ్రవరిలో జరిగినప్పటికీ, భయంతో మౌనంగా ఉన్న మహిళ ఇటీవల తన భర్తకు విషయం చెప్పింది. జూన్ 13న నాగపూర్లోని సోనేగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు అయాజ్ తాజ్ మదారే, అమీన్ షేక్లను అరెస్ట్ చేశారు. కోర్టు వారికి 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. మూడో నిందితుడు మతమార్పిడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మౌలానా (మత గురువు) కోసం మధ్యప్రదేశ్కు ఒక బృందాన్ని పంపారు.మహిళ తన ఫిర్యాదులో అత్యాచారం, బెదిరింపులు, మతమార్పిడి, క్షుద్రపూజలు జరిగినట్లు ఆరోపించిదని సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ సురేష్ రెడ్డి వెల్లడించారు.ఇదీ చదవండి: అఫ్గాన్లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా! -
సీక్రెట్ పెళ్లి, ఫస్ట్ యానివర్శరీ ఇన్స్టా స్టోరీ: తీరా ఆరా తీస్తే..!
బెంగళూరులో వరుస ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. అనుమానాస్పద స్థితిలో 22 ఏళ్ల యువతి శవమై కనిపించగా, స్పృహతప్పి పడివున్న ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఇద్దరూ కలిసి చేసుకున్న ఆత్మహత్యా ప్రయత్నమా లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నమా? మిస్టరీగా మారింది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, భవాని (22) ఒక మొబైల్ షోరూమ్లో పనిచేస్తూ పశ్చిమ బెంగళూరులోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తోంది. భవానీ, చంద్రశేఖర్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుమారు ఏడాది క్రితం తమ కుటుంబాలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అయితే చంద్రశేఖర్కు అప్పటికే పెళ్లయ్యి, ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.ఇన్స్టాగ్రామ్ స్టోరీతో వెలుగులోకిజూన్ 13న భవాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక స్టోరీ పెట్టింది. హ్యాపీ యానివర్సరీ అంటూ చంద్రశేఖర్ కలిసి ఉన్న ఒక ఫోటో స్టోరీగా ప్రత్యక్షమైంది. తమ తొలిపెళ్లి రోజు సందర్భంగా చంద్రశేఖరే ఆ ఫోటోను అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు భవాని కుటుంబ సభ్యులను ఈ పోస్ట్ అలర్ట్ చేసింది. అనుమానంతో వారు వరుసగా భవానికి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఎన్నిసార్లు చేసినా ఆమె ఎత్తకపోవడంతో అనుమానం వచ్చింది. అందోళనతో ఆమె తండ్రి ఇంటి యజమానికి సమాచారం అందించారు. యజమాని, చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా ఇల్లు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా భవాని మృతి చెంది ఉంది, చంద్రశేఖర్ అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.భవాని తండ్రి సమాచారం ప్రకారం, భవానికీ ఇటీవల పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. వచ్చే వారమే నిశ్చితార్థం కూడా చేయాలని భావించారు. బహుశా ఈ విషయం భవాని చంద్రశేఖర్కు చెప్పడం వల్లే ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఇద్దరూ కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకుందామని చంద్రశేఖర్ ఆమెను ఒప్పించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే విషం తాగిన తర్వాత భవానికి వాంతులు అవ్వడంతో, చంద్రశేఖర్ ఆమె గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఆ తర్వాత అతడు కూడా ఎక్కువ మొత్తంలో విషం తాగి ఉంటాడే అనేది ప్రాథమిక అంచనా.ప్రస్తుతం చంద్రశేఖర్ కోలుకోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భవాని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఫొరెన్సిక్, మెడికల్ రిపోర్టులు వస్తే తప్ప ఇది ముందే ప్లాన్ చేసి చేసిన హత్యా, లేక ఆత్మహత్యా ప్రయత్నం విఫలమై చేసిన హత్యా అనేది తెలిసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..! -
వాట్సాప్ స్టేటస్ విప్పిన గుట్టు!
ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణాలు చేసుకున్నారు. కానీ ఆ బంధం చివరికి ఓ ఊహించని క్రైమ్ కథగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. చిన్న రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స.. ఆ తర్వాత ఒక్కసారిగా భర్త గుండెపోటుతో మృతి చెందాడు. కన్నీళ్లతో కుప్పకూలిన ఆమె… ఆ క్షణం అది ముగింపు అనుకుంది. కానీ అదే ముగింపు కాదు. అసలు కథ మొదలు.ఈ కేసులో మలుపు తిప్పింది ఒక వాట్సాప్ స్టేటస్. సాధారణంగా కనిపించిన ఆ ఒక్క మెసేజ్ పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది. అదే ఆధారంగా సాగిన దర్యాప్తు… చివరికి ఇది ప్రమాదం కాదు పక్కా ప్లాన్తో చేసిన హత్యగా అని బయటపెట్టింది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో మాజీ ఆర్మీ జవాన్ శాండీప్ మంజర్గి మృతి కేసు.. సంచలన మలుపు తీసుకుంది. ప్రియుడితో కలిసి భార్యే ఆయన్ని.. అదీ ఆస్పత్రిలోనే హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. మొదట ఇది గుండెపోటు వల్ల జరిగిన సహజ మరణమని వైద్య నివేదికలు పేర్కొన్నప్పటికీ.. తర్వాతి దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసులు తెలుసుకుని కంగుతిన్నారు. ఈ కేసులో అతని భార్య సుమ మంజర్గి, ఆమె ప్రేమికుడు పుండలిక్ దొంబార్ సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆస్పత్రి సిబ్బంది కూడా ఉండడం గమనార్హం.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 13న శాండీప్ రోడ్డు మీద యాక్సిడెంట్ కావడంతో స్వల్పంగా గాయపడ్డాడు. మొదట ఆయన్ని హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రిలో, తరువాత జీ.జె. ఆసుపత్రికి తరలించారు. చిన్న గాయమే కావడంతో ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అవుతారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే రెండ్రోజుల తర్వాత.. హఠాత్తుగా ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో భార్య సుమ గుండెలు పగిలేలా రోదించడం అక్కడున్నవాళ్లను కంటతడి పెట్టించింది. అయితే.. శవ పరీక్షలో అతని శరీరంలో తీవ్రమైన గాయాలు లేకపోవడం.. అప్పటిదాకా సాధారణంగా ఉన్న ఆరోగ్యం హఠాత్తుగా విషమించడంతో వైద్యులు పోలీసుల వద్ద అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో.. సుమ మంజర్గి స్నేహితుడిగా చెలామణి అవుతున్న పుండలిక్ దొంబార్ తీరుపై పోలీసులకు అనుమానం మొదలైంది. ఫోన్ కాల్ డాటా ఆధారంగా.. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటున్నారని గుర్తించారు. అలాగే ‘‘యాక్సిడెంట్ తర్వాత ఇలా ఎలా జరుగుతుంది?’’ అంటూ అతను పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఆ అనుమానాల్ని మరింత బలపరిచింది. వైద్యులు ఏం చెప్పారో తెలియకుండానే.. అతను శాండీప్ మరణంపై అలా ఎలా పూర్తి వివరాలను తెలుసుకోగలిగాడు అని ఆశ్చర్యపోయారు. విచారణకు పిలిచారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. సుమ, పుండలిక్కు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే శాండీప్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ యాక్సిడెంట్ను అవకాశంగా మల్చుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే అతడికి సెలైన్ బాటిల్ ద్వారా విషం ఇచ్చారు. తీసుకునే జ్యూస్లో నిద్ర మాత్రలు కలిపారు. అలా నిద్రలోనే శాండీప్ కన్నుమూశాడు. ఆ తర్వాత.. మరణాన్ని సహజ గుండెపోటుగా చూపించేందుకు వైద్య రికార్డులు, ఫోరెన్సిక్ రిపోర్టులు డబ్బు ఎర వేసి మార్చేశారు. దర్యాప్తులో బయటపడ్డ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. శాండీప్ పేరు మీద రూ.2 కోట్ల ఇన్సూరెన్స్లు ఉండడం, ఆయన చనిపోయాక వాటిని త్వరగా క్లెయిమ్ చేసుకోవాలని సుమ చేసిన ప్రయత్నాలు. ఇక హత్య కుట్రలో ఆసుపత్రి సిబ్బంది, ల్యాబ్ సిబ్బంది, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వాములైనట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షలపై ప్రభావం చూపేందుకు రూ.3 లక్షలకు పైగా లంచాలు ఇచ్చినట్లు కూడా అనుమానం వ్యక్తమవుతోంది. ఆధారాలు చెరిపివేయడం, టాక్సిక్ పదార్థాలు రిపోర్టుల్లో కనిపించకుండా చేయడం కోసం పెద్ద నెట్వర్క్ పనిచేసినట్లు తెలుస్తోంది.ఇన్వెస్టిగేషన్లో పోలీసులు సిరింజ్లు, విష పదార్థాల కంటైనర్లు, మొబైల్ ఫోన్లు సహా కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసు కేవలం ఓ భార్య తన పప్రియుడితో కలిసి భర్తకు రాసిన మరణశాసనమే కాదు.. వ్యవస్థలోని లోపాలను బయటపెడుతూ పెద్ద చర్చకు దారి తీసింది. అన్నట్లు తెలంగాణలోని కామారెడ్డిలోనూ ఈ తరహా నేరమే ఒకటి బయటపడడం తెలిసిందే. కామారెడ్డి కేసులో ఓ వ్యక్తి హత్యను మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, అది యాక్సిడెంట్ కాదని పక్కా ప్లాన్తో చేసిన హత్యగా తేలింది. భార్యకు తన భర్తను తొలగించాలనే ఉద్దేశం ఉండగా, ఆమెకు సహకరించిన ప్రియుడి పాత్ర కూడా బయటపడింది. ఇద్దరూ కలిసి హత్య చేసి, దాన్ని ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలు, పోస్టుమార్టం రిపోర్ట్లు అసలు నిజాన్ని బయటపెట్టాయి. చివరికి భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
నేవల్ అధికారి భార్య బలవన్మరణం
మల్కాపురం: ఒక నేవల్ ఉన్నతాధికారి భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేవల్ కమాండర్ విశాల్ దాబీ, ఆయన భార్య ధర్తి దాబీ గత కొంతకాలంగా నేవల్ పార్కులోని క్వార్టర్ నంబర్–3లో నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి భర్త విశాల్ విధులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ధర్తి దాబీ తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఐఎన్ఎస్ కల్యాణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు సోమవారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసి ఆమె మరణానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త ఫోన్.. కొత్త బైకు.. ప్రాణం తీసిన ఫోటోషూట్!
కీసర: బంధువులైన ముగ్గురు యువకుల్లో ఒకరు కొత్తగా స్కూటీ, మొబైల్ కొన్నారు. ఆ సంతోషంలో కలిసి ఫోటోలు దిగాలనుకున్నారు. అనుకుందే తడవుగా కొత్త బైకుపై ముగ్గురు కలిసి తిమ్మాయిపల్లి చెరువు వద్దకు వెళ్లారు. ఉత్సాహంగా నీటిలోకి దిగి ఫొటోలు దిగుతుండగా.. ఓ యువకుడి ఇయర్ బడ్స్ నీటిలో పడిపోయాయి. వాటిని తీసుకునే క్రమంలో నీట మునగగా.. మరో యువకుడు కాపాడేందుకు ప్రయతి్నంచి బురద నీటిలో మునిగిపోయాడు. వీరిని కాపాడేందుకు మూడో యువకుడు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఇద్దరూ చెరువులో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి చెరువు వద్ద చోటు చేసుకుంది.కీసర సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం బొల్లారం ఆదర్శ్నగర్కు చెందిన కెవిన్ ఆంటోని(19) కొత్త స్కూటీ, మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. బంధువులైన వాలెంటైన్ టోని(20), యాప్రాల్కు చెందిన అమోస్ జోసఫ్లతో కలిసి ఫొటోషూట్ చేయాలని భావించి కొత్త స్కూటీపై తిమ్మాయిపల్లి సమీపంలోని పెద్ద చెరువుకు వచ్చారు. ఈత కొట్టేందుకు ముగ్గురు చెరువులోకి దిగారు. సెల్ఫోన్తో ఫొటోలు దిగుతుండగా చెవికి పెట్టుకున్న ఇయర్ బర్డ్స్ నీటిలో పడిపోయాయి. వాటిని తీసుకునేందుకు వాలెంటైన్ టోని వెళ్లాడు. అతని వెనకాలే కెవిన్ ఆంటోని వెళ్లాడు. ఇద్దరు నీట మునిగిపోవడం గమనించిన అమోస్జోసఫ్ వారిని కాపాడేందుకు ప్రయతి్నంచాడు. అక్కడ బురదతో పాటు లోతుగా ఉండటంతో వారిద్దరూ నీట మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని స్థానికుల సహాయంతో కెవిన్ ఆంటోని మృతదేహాం వెలికితీశారు. గల్లంతైన వాలెంటైన్ టోని కోసం తీవ్రంగా గాలించారు. సాయంత్రం పొద్దుపోయి చీకటిగా ఉండటంతో గాలింపు కష్టమైంది. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపడుతామని సిఐ తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతిచెందిన కెవిన్ ఆంటోని తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. కాగా ముగ్గురు యువకులు ఇటీవలే ఇంటర్ పూర్తి చేశారు. మృతిచెందిన కెవిన్ ఆంటోని, కాపాడేందుకు యతి్నంచిన అమోస్ జోసఫ్లు ఇద్దరు అక్కాచెల్లెళ్ల పిల్లలు కాగా, గల్లంతైన వాలెంటైన్ టోని వీరికి వరుసకు బాబాయి అవుతాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
అమావాస్య రోజు పూజల కలకలం.. కంట్లో కారం కొట్టిన మహిళ!
మణికొండ: అమావాస్య రోజు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేశారనే అనుమానంతో ఎదురెదురు నివాసాల వారు ఘర్షణకు దిగారు. పోలీసులు తెలిపిన మేరకు.. మణికొండ శివాజీనగర్ కాలనీలో ప్రభాకర్, నర్సింహాల కుటుంబాలు ఎదురెదురుగా ఉంటాయి. ప్రభాకర్ తోబుట్టువులు సోమవారం తమ ఇంటి ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఎందుకు వేశారని నర్సింహా కుటుంబ సభ్యులు నిలదీశారు.అయితే తాము వేయలేదని వాగ్వాదానికి దిగారు. ఇంతలో ప్రభాకర్ సోదరి ఉమారాణి కారం తెచ్చి నర్సింహా కుటుంబ సభ్యుల కంట్లో చల్లింది. దాంతో ఓ మహిళ తీవ్ర అస్వస్థకు గురైంది. రాయదుర్గం పోలీసులకు సమాచారం అందడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలను చూడనివ్వడం లేదని.. తండ్రి సెల్ఫీ సూసైడ్!
కంటోన్మెంట్: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఓల్డ్ బోయిన్పల్లి ఘోరీ నగర్కు చెందిన గయాజుద్దీన్ ఘోరీ (30) రెండేళ్ల క్రితం వరకు ఓ కిరాణాషాపు నిర్వహించాడు. ఆ తరువాత నుంచీ ఖాళీగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులకు తోడు భార్యతో గొడవలు మొదలయ్యారు.ఈ క్రమంలో భార్య పిల్లలను తీసుకుని ఉప్పుగూడలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. భార్య, భర్తల నడుమ విభేదాలు ముదరడంతో కౌన్సెలింగ్కు హాజరవుతున్నారు. తన పిల్లలను చూసేందుకు కూడా భార్య అనుమతించడం లేదంటూ గయాజుద్దీన్ కుటుంబసభ్యులతో వాపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గయాజుద్దీన్ సోదరుడు రియాజుద్దీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లిదండ్రుల పరువు తీశారు.. మీకు రక్షణ ఇవ్వాలా?
ప్రేమలో పడిన ఓ యువతీ–యువకుడు.. పెద్దల ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇద్దరూ కలిసి కొత్త జీవితం మొదలుపెట్టారు. అయితే పెద్దలు తమను ఏమైనా చేస్తారేమోనని భయపడ్డారు. పోలీసులను ఆశ్రయిస్తే పని జరగలేదు. దీంతో రక్షణ కోరుతూ కోర్టు తలుపు తట్టారు. కానీ అక్కడ వారికి ఊహించని తీర్పు ఎదురైంది. “కుటుంబ గౌరవం, సామాజిక విలువలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి” అంటూ కోర్టు పోలీసు రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.పంజాబ్కు చెందిన ఈ జంట తాము పరస్పర అంగీకారంతో కలిసి జీవిస్తున్నామని, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి, బెదిరింపులు ఎదురవుతున్నాయని చెబుతూ కోర్టును ఆశ్రయించింది. తమకు భద్రత కల్పించాలని అభ్యర్థించింది. అయితే కేసును విచారించిన జస్టిస్ సందీప్ మౌద్గిల్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.లివ్-ఇన్ రిలేషన్షిప్ అనేది కొంతమంది ఎంచుకుంటున్న ఆధునిక జీవనశైలి అయినప్పటికీ.. ప్రతి సందర్భంలో దానిని చట్టబద్ధ సంబంధంగా గుర్తించలేమని కోర్టు స్పష్టం చేసింది. కేవలం కొంతకాలం కలిసి ఉండటంతోనే ఇది చట్టబద్ధ సంబంధమని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఇంకా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. తల్లిదండ్రుల ఇల్లు వదిలి వెళ్లిపోవడం కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తుందని పేర్కొంది. ఇది తల్లిదండ్రుల గౌరవంతో జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పటికీ, సామాజిక విలువలు, కుటుంబ వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.విచారణలో కోర్టు గమనించిన విషయం ఏమిటంటే, ఈ జంట భవిష్యత్తులో వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. తామిద్దరం లివింగ్ రిలేషన్లో ఉండేందుకు అర్హులమని వాదించింది. అయితే.. యువకుడు ఇంకా చట్టబద్ధ వివాహ వయస్సుకు చేరుకోలేదని కోర్టు గుర్తించింది. మొత్తంగా.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి కలిసి జీవితం మొదలుపెట్టిన ఈ ప్రేమ జంటకు చివరికి హైకోర్టులో షాక్ తీర్పు ఎదురైంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉందన్న వాదన ఉన్నప్పటికీ, ప్రతి కేసులో కోర్టు జోక్యం చేసుకుంటే సామాజిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని భావించిన హైకోర్టు, పోలీసు రక్షణ ఇవ్వడానికి నిరాకరించి పిటిషన్ను కొట్టివేసింది. -
తీవ్ర విషాదం: ఆస్తుల్ని పంచేసి.. బలవన్మరణం
ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి కుటుంబం అంతిమ నిర్ణయం.. అనంత విషాదంగా మారింది. మండలంలోని దువ్వూరు గ్రామంలో ఉపాధ్యాయుడిగా కొంత కాలం క్రితం ఉద్యోగ విరమణ చేసిన చీర్ల మధుసూదన్రావు (65), ఆయన భార్య రత్నావళి (60), కుమారుడు సాయి సుకృత్ (25) బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం సోమవారంజిల్లాలో సంచలనంగా మారింది.సాయిసుకృత్ తిరుపతిలో ఉద్యోగం చేస్తుండగా, తల్లిదండ్రులు సైతం అక్కడే ఉంటూ శనివారం స్వగ్రామానికి రావడం, ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడడం వెనుక మానసిక మనోవేదన బలీయంగా మారడంతో శారీరకంగా బలహీనులయ్యారు. ముగ్గురు ఒకేసారి మరణించాలనే నిశ్చయంతో చేతులు, కాళ్లను కట్టేసుకుని మరీ ఫ్యాన్ ఇనుప రాడ్కు ఉరేసుకున్నారు. దీనికి ముందు తన అక్క కు ఫోన్ చేసి సోమవారం దువ్వూరుకు రావాలని, మరో అక్కకు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపడం, ఆస్తులు, బంగారానికి సంబంధించి తన అక్కలు, వారి పిల్లలకు పంపకాలు చేస్తూ వీలునామా రాయడం చూస్తే ఆ దంపతులు అంతులేని మానసిక మనోవేదనకు గురయ్యారనేది స్పష్టమవుతోంది. ఆయన విశ్రాంత ఉపాధ్యాయుడు కావడంతో నెల నెలా పెన్షన్ సైతం వస్తోంది. స్వగ్రామంలో సొంతింటితోపాటు ప్లాట్లు, బంగారం, నగదుకు ఏ లోటు లేదు. కానీ కుటుంబం మొత్తం ఏకకాలంలో ఆత్మహత్యకు పాల్పడడంతో ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు.ఆస్తులను పంపకాలు చేస్తూ వీలునామా..మృతులు ముగ్గురు తమ మరణానికి కారణం చెబుతూ రాసిన లేఖలో మానసికంగా, శారీరకంగా గట్టిగా లేమని, తమ కుమారుడి పరిస్థితి కూడా అలాగే ఉందంటూ చనిపోవాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఆ లేఖలో తమ ఆస్తుల పంపకం చేస్తూ ఓ వీలునామా కూడా రాశారు. తమకు బుచ్చిరెడ్డిపాళెంలో రెండు ప్లాట్లు ఉన్నాయని తన భార్య రత్నావళి కోరిక మేరకు ఒక ప్లాటును నెల్లూరులోని రెడ్క్రాస్కు, మరో ప్లాట్ను తన అక్క భువనేశ్వరికి ఇవ్వాలని రాశారు. దువ్వూరులోని తన ఇంటిని మరో అక్క మంజులకు ఇవ్వాలని, తమ ఇంట్లోని 17 సవర్ల బంగారాన్ని చనిపోయిన పెద్దక్క పిల్లలకు ఇవ్వాలని కోరారు. అయితే చావులో కూడా తమ ఆస్తిలో కొంత రెడ్క్రాస్కు ఇవ్వాలని సామాజిక బాధ్యతగా మధుసూదన్రావు కుటుంబం తీసుకున్న నిర్ణయంపై బంధుమిత్రులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.కలవరపడిన దువ్వూరు..అందరితో కలివిడిగా ఉండే మధుసూదన్రావు కుటుంబం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో దువ్వూరు గ్రామం ఒక్కసారిగా కలవర పడింది. ఎన్నడూ ఎవరితోనూ వివాదాలు, మనస్పర్థలు లేని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడంపై గ్రామం మొత్తం విషాద వదనాలతో కనిపించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు ఏమి లేకపోయినా వారు ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను కలిచి వేసింది. వీరు ఆత్మహత్య చేసుకోవాలని తిరుపతిలోనే నిర్ణయించుకుని శనివారం దువ్వూరుకు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. గూడూరు సబ్ డివిజన్ డీఎస్పీ గిరిధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్పెషల్ బ్రాంచ్ సీఐ దశరథరామారావు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, క్లూస్ టీం వివరాలు సేకరించారు.చివరి శ్వాసలోనూ సేవా సంకల్పంభావిభారత పౌరుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు తన కుటుంబంలో చీకట్లను నింపుకున్నారు. ఉన్నతమైన ఆదర్శమైన ‘గురువు’గా ఖ్యాతి గడించి విశ్రాంత జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఆస్తులకు కొదవ లేదు. అనుబంధాలకు కొరత లేదు. అంతకంటే ఆర్థిక సమస్యలూ లేవు. తాను కన్న బంగారు భవిష్యత్ కలలు కల్లలుగా మారడంతో మానసికంగా, శారీరకంగా కుంగిపోయారు. బతుకులు భారంగా వెళ్లదీస్తూ.. బంధాలను జ్ఞాపకాలుగా మిగుల్చుతూ.. మరణశయ్య ఎక్కారు. ఆ కుటుంబం అంతిమ నిర్ణయం.. అనంతమైన విషాదంగా మారింది. అంతిమ ప్రయాణంలోనూ తోబుట్టువులపై ఆప్యాయతలను వీలునామా రూపంలో కనబరిచారు. చివరి కోరికలతో కన్నీరు పెట్టించి.. బతుకులను ముగించారు. -
చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైనట్టో?
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ నేటికీ తెలియరాలేదు. చిన్నారి అదృశ్యమై సోమవారానికి పదోరోజు కావడం గమనార్హం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ టీమ్, ఫారెస్టు, పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగించాయి. సాయంత్రం నాలుగు గంటలకు భారీ వర్షం కురవడంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది.ఆయిల్పామ్ తోటలో పచ్చిగడ్డి తొలగిస్తే ఏమైనా ఆనవాళ్లు లభిస్తాయేమోనని గడ్డి తొలగిస్తున్నారు. పెద్దాపురం డీఎస్పీ ఘటనా స్థలంలో ఉండి గాలింపు చర్యలను సమీక్షిస్తున్నారు. అనుమానితులను, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా స్థానికులను, అటుగా రాకపోకలు సాగించిన వ్యక్తులను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. తమ కుమార్తె క్షేమంగా ఇంటికి వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు, బంధువులు ఎదురు చూస్తున్నారు. థర్మల్ డ్రోన్ల ప్రవేశంఅటవీ ప్రాంతంలో జంతువుల కదలికలను గుర్తించేందుకు ఫారెస్టు అధికారులు «థర్మల్ డ్రోన్లు, ట్రాకర్లను వినియోగించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కాకినాడ రేంజర్ శ్రీదీప్తి ఆధ్వర్యంలో శ్రీశైలం నుంచి వచ్చిన హనుమాన్ టీమ్, ఫారెస్టు అధికారులు నాలుగు ప్రదేశాల్లో ట్రాకర్లు అమర్చారు. మరోపక్క పెంపుడు కుక్కకు పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు వారం రోజులు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ నివేదికపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కిడ్నాప్ కోణంలో లభించని ఆధారాలుకాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గ్రామాన్ని పరిశీలించి, చిన్నారి తల్లిదండ్రులైన సుంకర గణేష్ , భవానీని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిన్నారి కిడ్నాప్కు గురైందనేందుకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని చెప్పారు. పెంపుడు కుక్క మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ జరుగుతోందన్నారు. చిన్నారి ఆచూకీని గుర్తించేందుకు అన్ని కోణాల్లోనూ ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలతో జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు, బంధువుల్లో మరింత ఆందోళన, అభద్రతా భావాన్ని పెంచుతున్నారన్నారు. ప్రజలు, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించి, అధికారిక సమాచారాన్ని చేరవేయాలన్నారు. -
ట్విన్స్ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్!
ఐవీఎఫ్ పేరుతో కొంతమంది వైద్యుల ఆగడాలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కేసు సంచలనం రేపుతోంది. తమకు పుట్టిన పిల్లల డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో గురుగ్రామ్కు చెందిన దంపతులు లబోదిబో మన్న వైనం వెలుగులోకి వచ్చింది.గురుగ్రామ్కు చెందిన రాహుల్ రాథోడ్, అతని భార్య మీనూ రాథోడ్ సంతానంకోసం గత ఏడాది ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పద్ధతిని ఎంచుకున్నారు. జనవరిలో మీనూ ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఆ పిల్లలు తమ పోలికలతో అస్సలు సరిపోలకపోవడంతో అనుమానం వచ్చి, పిల్లల డీఎన్ఏ (DNA) పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నారు. టెస్ట్ రిపోర్ట్స్లో వారు షాకయ్యే నిజం తెలియడంతో పిల్లలు పుట్టారన్న సంతోషం కాస్తా పీడకలగా మారిపోయింది. మరొక జంటకు చెందిన పిండాన్ని (embryo) మీనూ రాథోడ్ గర్భాశయంలో ప్రవేశపెట్టారని ఆరోపిస్తూ భర్త పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ఆరోపణపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఢిల్లీ కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది.ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?दिल्ली में IVF से जन्मे जुड़वां बच्चों का DNA माता-पिता से नहीं हुआ मैच, FIR दर्ज #Delhi | @PallavMishra11 pic.twitter.com/sxyWJZSH5T— NDTV India (@ndtvindia) June 14, 2026ఏం జరిగింది?ద్వారకాలోని ఒక ఆసుపత్రి తమను ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లో ఉన్న ఒక ఇన్ఫెర్టిలిటీ (సంతానలేమి) క్లినిక్కు ఐవీఎఫ్ చికిత్స కోసం పంపిందని, అక్కడ డాక్టర్ శివానీ సచ్దేవ్ ఈ కేసును పర్యవేక్షించారని రాహుల్ రాథోడ్ తెలిపారు. గత ఏడాది జనవరి 9న వైద్యులు ఆ మహిళకు ఐవీఎఫ్ సంబంధిత పరీక్షలు నిర్వహించి, భర్త వీర్యం, అండం ఉపయోగించే పిండాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలా అభివృద్ధి చేశామని చెప్పిన పిండాన్ని మే 14న మీనూ గర్భాశయంలో ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 5న ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే ట్విన్స్ పోలీకలపై అనుమానంతో టెస్ట్ చేయించారు. చివరికి వారు అనుమానించినట్టుగానే ఆ పిల్లలు బయోలాజికల్గా వారిద్దరికీ పుట్టినవారు కాదని ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లో తేలింది. దీంతో క్లినిక్ వాళ్లే ఏదో మాయ చేశారని మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రాహుల్ రాథోడ్ డిమాండ్ చేశారు. దర్యాప్తు కోసం ఆసుపత్రిలోని ఐవీఎఫ్ రికార్డులు, పిండానికి సంబంధించిన పత్రాలు, ల్యాబ్ రికార్డులు, ఎలక్ట్రానిక్ డేటా, సీసీటీవీ (CCTV) ఫుటేజీలను భద్రపరచాలని ఆయన కోరారు. తమలాగే ఐవీఎఫ్ క్లినిక్ల వల్ల మోసపోయిన పలు దేశాలలోని దంపతులనుండి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని మీనూ రాథోడ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్కి! -
పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్కి!
కట్టుకున్న భర్త వేధింపులకు గురిచేసి, అత్యంత దారుణంగా హింసించిన కేసు ఒకటి కలకలం రేపుతోంది. ఎర్రగా కాలిన ఇనుప రాడ్తో వాతలు పెట్టి హింసించాడు. మధ్యప్రదేశ్ లోని రాజ్గఢ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చేతనైతే పోలీసుల దగ్గరకు వెళ్లమని సవాలు విసిరాడు. కట్ చేస్తే...క్రైమ్ థిల్లర్లా సాగిన ఈ కథలో చివరికి ఆమె పోలీసుల వద్దకు చేరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.బాధితురాలు మాంగీబాయి తన్వర్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం...జూన్ 10వ తేదీ సాయంత్రం ఆమె భర్త మద్యం సేవించి ఇంటికి రావడంతో ఈ హింస మొదలైంది. రాత్రి భోజనం తర్వాత తిట్టడం ప్రారంభించాడు. దీన్ని వ్యతిరేకించడంతో ఆమెపై క్రూరంగా దాడి చేశాడు.కర్రతో బాదాడు, చెంపదెబ్బలు కొట్టాడు, బెదిరించాడు. ఆ హింసను భరించలేక, మాంగీబాయి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి బయటకు వచ్చింది.మొదటిసారి దొరికిపోయిందిగంటల తరబడి నడుచుకుంటూ ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్ వైపు వెడుతుండగానే, ఒక గుడి సమీపంలో ఆమె భర్త ఆమెను అడ్డుకుని, మళ్లీ దాడి చేసి, బలవంతంగా గ్రామానికి తీసుకువెళ్లాడు. మరింత క్రూరంగా మారిపోయాడు. దాదాపు 24 గంటల పాటు ఆమె మెడకు ఇనుప గొలుసులేసి, ఇంట్లోని ఒక స్తంభానికి కట్టేసి,తాళం వేసేశాడు. ఇప్పుడు చూస్తాను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎలా ఫిర్యాదు చేస్తావో, ఎవడితో చెప్పుకుంటావో, చెప్పుకో అంటూ బెదిరిస్తూ పదేపదే కొట్టాడు. అంతటితో ఆగకుండా, గ్యాస్ స్టవ్ మీద ఇనుప రాడ్ను వేడి చేసి, ఆమె శరీరంపై కాల్చాడు. ఆమె నడుము, నడుము కింది భాగం, కుడి తొడపై ఈ వాతలు పెట్టాడు. ఆమె నొప్పితో కేకలు వేసినా, ఎవరూ సాయం చేసేవారే లేకపోయారు. 24 గంటలు బయటకు వెళ్ల నివ్వలేదు, ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. పోలీసుల వద్దకు వెళ్లే ఆలోచనను విరమించుకునేలా ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు, ఊరి పెద్దలను పిలిపించి పంచాయితీ పెట్టాలని తాళం వేసి బయటకు వెళ్లాడు. అతగాడి క్రూరత్వం, జరగబోయే హింసను ఊహించి భయంతో, రాజీకి అంగీకరించినట్లు నటించింది. కానీ మనసులో మాత్రం తప్పించుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూసింది.దారి చూపిన రాయిపంచాయతీ కోసం భర్త బయటికి వెళ్లగానే చుట్టూ సాయంకోసం వెదికింది. మాంగీబాయి కళ్ళు అక్కడ ఉన్న ఒక రాయిపై పడ్డాయి. అంతే దాన్నితీసుకుని తాళంపై ఒకటి, రెండుసార్లు పదే పదే తాళం పగిలే దాకా కొడుతూనే ఉంది. చివరకు తాళం విరిగింది. గొలుసు తెగిపోయింది, బందీఖానానుంచి విముక్తి లభించింది. క్షణం కూడా వృధా చేయకుండా, ఆమె ఇంటి నుండి పరుగులు తీసి ఖిల్చిపూర్ వైపు నడవడం ప్రారంభించింది.తీవ్ర అలసట,, ఒళ్లంతా గాయాలు,, ముళ్ళు గుచ్చుకుని తెగి రక్తమోడుతున్న పాదాలు, అయినా సరే తనను బంధించడానికి వాడిన ఇనుప గొలుసు ఇంకా మెడలోనే వేలాడుతుండగానే తన విముక్తి కోసం పయనం మొదలు పెట్టింది. చివరికి పోలీసు స్టేషన్ గడప తొక్కింది. ఆమె సాహసోపేత ప్రయత్నం, తెగింపు కారణంగా చివరకు ఆమె భర్త సర్దార్ సింగ్ తన్వర్ దుర్మార్గానికి తెర పడేలా చేసింది. ఇదీ చదవండి: నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్ చీకట్లో ఆరు కిలోమీటర్ల ప్రయాణంచుట్టూ చీకటి.. మెడలోఇనుప గొలుసు, తెగిన తాళం అలాగే వేలాడుతుండగా.. మాంగీబాయి నిర్మానుష్యమైన ప్రాంతాలు, పొలాలు, గరుకు మార్గాల గుండా నడక మొదలు పెట్టింది. దారిలో వెళ్లేవారు ఆమె మెడలోని గొలుసును చూసి ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని అనుకున్నారు. కానీ ఎవరూ కనీసం ఆగి ప్రశ్నించలేదు. అయితే, ఒక బాటసారి ఆమె పరిస్థితిని గమనించి తినడానికి ఏదైనా ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కు తన ప్రయాణాన్ని కొనసాగించింది.ఇదీ చదవండి: స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్కు చేదు అనుభవంషాక్కు గురైన పోలీసులురాత్రి 10 గంటల ప్రాంతంలో మాంగీబాయి ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించగానే అక్కడున్న పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. మెడలో తాళం వేసిన గొలుసు, శరీరంపై వాతలు , తీవ్ర భయాందోళలో గజ గజ వణికిపోతూ స్టేషన్కు చేరుకున్న ఆమె కన్నీరుమున్నీరై, జరిగినదంతా వివరించింది. పోలీసులు వెంటనే ఆమె మెడలోని గొలుసును తొలగించి, వైద్య పరీక్షల కోసం పంపించారు. పరీక్షల్లో ఆమె శరీరంపై గాయాలు, వాతలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే ఒక పోలీసు బృందం గ్రామానికి వెళ్లి నిందితుడైన భర్తను అరెస్టు చేశారు. -
కీచక ఎస్ఐ: భర్తతో విడాకులు ఇప్పించి నాలుగేళ్లుగా..!
వరంగల్ క్రైం: ఓ వివాహితకు న్యాయం చేస్తానని నమ్మించి, పెళ్లి పేరుతో మోసం చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన సీసీఎస్ విభాగ ఎస్సై రాజ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆదివారం వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన ఓ యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అనంతరం వారికి ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో 2022 మార్చిలో బాధితురాలు తన భర్తపై హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై రాజ్కుమార్ బాధితురాలికి న్యాయం చేస్తానని నమ్మించాడు. తనకు పరిచయం ఉన్న న్యాయవాది ద్వారా ఆమెకు భర్త నుంచి విడాకులు ఇప్పించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి నమ్మకం సంపాదించుకున్నాడు.ఈ క్రమంలో బాధితురాలితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంబంధం కారణంగా ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా, అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా రాజ్కుమార్ నిరాకరించినట్లు బాధితురాలు ఆరోపించింది.తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ప్రాథమిక ఆధారాలు లభించడంతో నిందితుడు రాజ్కుమార్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. -
లైంగిక వేధింపులు భరించలేక.. బంధువునే చంపేశారు..!
అనంతపురం జిల్లా: బళ్లారి తాలూకా మోకా సమీపంలో ఎల్ఎల్సీ కాలువ వద్ద అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ ఈనెల 7వ తేదీన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు వారంలోనే ఛేదించారు. ఆదివారం జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డ గ్రామానికి చెందిన బసవన గౌడ బళ్లారిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో పని చేస్తున్నాడు. మోకా గ్రామానికి చెందిన సమీప బంధువు అయిన శ్వేతతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్లు పెట్టేవాడు. ఏడాది పాటు లైంగికంగా కూడా వేధించినట్లు సమాచారం. బసవన గౌడ చేష్టలతో విసిగిపోయిన శ్వేత.. ఈ విషయాన్ని తన భర్త అయిన దొడ్డ బసవన గౌడ దృష్టికి తీసుకెళ్లింది. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్ కలసి బసవన గౌడను చంపేయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీన రాత్రి మోకా సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్దకు బసవన గౌడ (27)ను పిలిపించారు. అక్కడికి రాగానే తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం ఎటువంటి ఆధారాలు లభించకుండా మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పటించి కాల్చి వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ముగ్గురూ బెంగళూరుకు పారిపోయారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపడంతో ఈనెల 8వ తేదీన మోకా పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన యువకుడుని ఎవరు చంపారన్న దానిపై తీవ్రంగా చర్చానీయాంశమైంది. జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ దిశానిర్దేశంతో స్థానిక డీవైఎస్పీ, సీఐలు, ఎస్ఐలు రంగంలోకి దిగి హత్య కేసు మిస్టరీని ఛేదించారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టడంతో బసవన గౌడ హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవన గౌడ, సోదరుడు విజయ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. లైంగికంగా వేధించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను వదిలి రా.. మనం పెళ్లి చేసుకుందాం..!
హైదరాబాద్: తనను పెళ్లి చేసుకోవాలంటూ వివాహితను వేధిస్తున్న ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా అంకిరావుపల్లె గ్రామానికి చెందిన డేగరాజు (25), ఫిలింనగర్లో నివాసముంటున్న ఒక వివాహిత (24)ను కొంతకాలంగా ఫోన్ ద్వారా వేధిస్తూ అసభ్యకర మెసేజ్లు పంపుతున్నాడు. భర్తను వదిలి తనతో రావాలని, పెళ్లి చేసుకోవాలని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన కదలికలను గమనిస్తూ, దారిపొడవునా అడ్డగిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. నిందితుడి వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు డేగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లైన ఆటో డ్రైవర్తో సహజీవనం.. చివరికి విషాదం..!
బెంగళూరు: యువతితో సహజీవనం చేస్తూ ఆమెను గొంతు నులిమి కడతేర్చిన ఆటో డ్రైవర్ ఉదంతం బ్యాడరహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. చిక్కగొల్లరహట్టి నివాసి చంద్రశేఖర్కు వివాహమై కుమారుడు ఉన్నాడు. ఇతను ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తిగరపాళ్యలో సెల్ఫోన్ షోరూమ్లో పనిచేస్తున్న మాగడి ప్రాంతానికి చెందిన భవానీ(22) అనే యువతి ఆటోలో ఎక్కిన సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో తిరగపాళ్యలోని అద్దె ఇంటిలో సహజీవనం చేస్తున్నాడు. అయితే చంద్రశేఖర్కు పెళ్లయ్యిందని తెలియడంతో అతన్ని దూరం పెట్టింది. మరో వైపు ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇకపై తనవద్దకు రావద్దని భవానీ చంద్రశేఖర్కు సూచించింది. దీంతో ఈ నెల 12న ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో చంద్రశేఖర్ ఆమెకు విషం తాపించి తానూ తాగాడు. అనంతరం భవానీ గొంతునులిమి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. అనంతరం తమ ఇద్దరి ఫొటోలను ఇన్స్టాలో అప్లోడ్ చేసి వివాహవార్షికోత్సవం అని పోస్ట్పెట్టాడు. గమనించిన భవాని కుటుంబసభ్యులు ఫోన్లో ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించగా స్పందన లేకపోయింది. అనుమానం వచ్చి తిగరపాళ్యలకు వెళ్లి చూడగా భవానీ మృతి చెందింది. పోలీసులు వచ్చి స్పృహలోలేని చంద్రశేఖర్ను ఆసుపత్రికి తరలించారు. -
విహారంలో విషాదం
అచ్చంపేట/సాక్షి, అమరావతి: కృష్ణానదిపై పడవలో సరదాగా తిరిగేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని కోనూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులుకాగా వీరిలో ఇద్దరు బాలికలు. ఈ దుర్ఘటన నుంచి ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సంబంధిత వర్గాల కథనం ప్రకారం కోనూరుకు చెందిన గంధం గంగయ్య వ్యవసాయం చేస్తుంటారు. వేర్వేరు ప్రాంతాలలో నివసిస్తున్న గంగయ్య రక్తసంబందీకులు, బంధువులు ప్రార్థనల కోసం శనివారం రాత్రి ఆయన ఇంటికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం భోజనాల అనంతరం వీరిలో 14 మంది సమీపంలోని కృష్ణానది విహారానికి వెళ్లారు. వీరిలో పది మంది చేపలు పట్టే చిన్న పడవెక్కి కృష్ణానదిలో సరదాగా తిరిగేందుకు వెళ్లారు. నదిలో కొద్ది దూరం వెళ్లిన తర్వాత పడవ అటు ఇటు ఊగడం ప్రారంభమైంది. చూస్తుండగానే పడవ బోల్తా కొట్టింది. వీరిలో ఈత వచ్చిన వేముల ముత్యాలు కూడా ఉండటంతో ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగాడు. అంతలోనే నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన వచ్చి పడవల్లో గాలింపు చేపట్టారు. కొద్దిసేపటికి నలుగురి మృతదేహాలు నదిలో లభ్యమయ్యాయి. పడవలో మృతదేహాలను ఒడ్డుకు తీసుకు రాగలిగారు. మృతుల్లో పిడుగురాళ్లలో ఉంటున్న గంగయ్య కుమారుడు సత్యానందం రాజ్యలక్ష్మి కుమార్తెలు గంధం సంధ్య (11), గంధం షైని (9), మర్రిచెట్టువారిపాలెంలో నివసిస్తున్న గంగయ్య దగ్గరి బంధువు లక్ష్మణరావు, పూర్ణకుమారి కుమారుడు బత్తుల కార్తిక్ (14), చిలకలకూరిపేటలో ఉంటున్న గంగయ్య కుమార్తె అరుణ, శ్రీనివాసరావు కుమారుడు కొణతల చైతన్య (20) ఉన్నారు. అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇసుక గుంతలే కారణం! స్థానికుల కథనం ప్రకారం, గత ఏడాది కృష్ణానదిలో ఇసుక తవ్వకాల కోసం ఇష్టారీతిన తీసిన లోతైన గోతులు ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అంటున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన లోతైన గుంతలు ప్రమాదకరంగా మారాయని, నలుగురి మరణానికి కారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా కోనూరు వద్ద కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతిచెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. పడవ బోల్తా ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారుల బృందంతో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి ఈ విషాద ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆరి్థక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కళ్ళుమరి సమీపంలోని త్రిమూర్తి ఆగ్రో ఫార్మ్ వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఈ ఘటనలో క్యాంపురం గ్రామానికి చెందిన ఆది (30), మహేంద్ర (23) అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు టిల్లు (24) తీవ్ర గాయాలతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డాడు.ఈ ప్రమాదంతో మడకశిర ప్రాంతంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ, గాయపడిన యువకుడి ఆరోగ్యం కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం!
మహబూబాబాద్ రూరల్ : టిప్పర్ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కేసముద్రం మండలం బడితండాకు చెందిన భూక్య సేవియా, లలిత దంపతులకు ముగ్గురు కుమారులు భరత్, నవీన్ (22) గణేష్ ఉన్నారు. రెండో కుమారుడు నవీన్ శుభకార్యాల డెకరేషన్లు, ఈవెంట్ ఆర్గనైజింగ్ పనులతోపాటు కూలి పనులు చేస్తుంటాడు.ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని మూడు కోట్ల సెంటర్ వైపు నుంచి కోర్టు సెంటర్ వైపు బైక్ పై వస్తున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం సెంటర్ వద్దకు నవీన్ చేరుకుంటుండగా వెనుకనుంచి టిప్పర్ వాహనం అతడిని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. నవీన్ మృతదేహాన్ని పోస్ట్మార్టం గదికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు. -
ప్రియురాలితో కలసి జిమ్ ట్రైనర్ వల.. మహిళా పైలట్ను
సనత్నగర్: ప్రియురాలితో పాటు జిమ్కు వచ్చే మహిళా పైలట్ను ఒకేసారి లైంగికంగా కలుసుకోవాలని జిమ్ ట్రైనర్ పథకం వేశాడు. అందుకు ప్రియురాలిని ఒప్పించడమే కాకుండా ఆ మహిళా పైలట్ను ఒప్పించే బాధ్యతను కూడా ఆమెపై పెట్టాడు. ఇందుకు మహిళా పైలట్ నిరాకరించడంతో ఫేక్ అకౌంట్లతో సోషల్ మీడియా వేదికగా ఆమె పట్ల అసభ్యకర సందేశాలు పంపిస్తూ మానసిక క్షోభకు గురిచేశాడు. దీంతో బాధితురాలు సనత్నగర్ పోలీసులను ఆశ్రయించగా జిమ్ ట్రైనర్తో పాటు అతని ప్రియురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ చౌరస్తా సమీపంలోని కల్ట్ ఫిట్నెస్ జిమ్ మేనేజర్, ట్రైనర్గా సంతోష్గౌడ్ వ్యవహరిస్తున్నాడు. ఇదే జిమ్కు వచ్చే మహిళా పైలట్పై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకునేందుకు తన ప్రియురాలు రజనితో కలిసి పథకం వేశాడు. ప్రియురాలి ద్వారా మహిళా పైలట్పై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇందుకు బాధితురాలు నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న సంతోష్గౌడ్ ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతాలను సృష్టించి అసభ్యకర సందేశాలు పంపించాడు. వేధింపులు భరించలేక మహిళా పైలట్ సనత్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సంతోష్గౌడ్, అతని ప్రియురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
పిల్లల్ని నాతోనే తీసుకెళ్తున్నా..
కుల్కచర్ల: ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో తెలియదు కానీ పేగు తెంచుకు పుట్టిన ఇద్దరు పిల్లలను కడతేర్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన నవనీత (28) శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొడుకు విఘ్నేశ్ (7), కూతురు మధుప్రియ(5)కు ఉరి వేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తానూ ఉరేసుకుని తనువు చాలించింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. నేను చనిపోతే పిల్లలు అనాథలుగా మారుతారు. అందుకే నా పిల్లల్ని నాతోనే తీసుకెళ్తున్నా.. నన్ను ఎవరూ ఏమనలేదు. నాభర్తను ఏమనొద్దు’అని నవనీత రాసిపెట్టిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. భర్త జంబుల మల్లేశ్తోపాటు అతని కుటుంబ సభ్యుల కారణంగానే తమ బిడ్డ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకుందని మృతురాలి పుట్టింటి తరఫు బంధువులు ఆందోళన వ్యక్తంచేశారు. భార్యాపిల్లలు మృతిచెందినా రాత్రి పది గంటల వరకూ మల్లేశ్ ఇంటికి రాకపోవడం గమనార్హం. బతుకంతా కష్టాలే..: నవనీత జీవితమంతా కష్టాల్లోనే సాగింది. కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్కు చెందిన ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పట్లో వీరు కూడా ఉరేసుకుని చనిపోయారు. దీంతో పెద్దనాన్న, బాబాయిలే నవనీతను పెంచారు. ఎనిమిదేళ్ల క్రితం మల్లేశంకు ఇచ్చి పెళ్లి చేయగా, కొన్నాళ్లపాటు సాఫీగానే సాగిన సంసారంలో నాలుగేళ్లుగా కలహాలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె చావే శరణ్యమని భావించినట్లు తెలుస్తోంది. -
ప్రేమలో వేరై... చావులో ఒక్కటై!
కొల్లాపూర్ రూరల్: వారిద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. వారి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అడ్డుచెప్పారు. యువతిని మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆమె.. ప్రేమించిన యువకుడు ఇద్దరూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ఎల్లూరుకు చెందిన తెలుగు శ్రీను కుమారుడు శివ (25), అదే గ్రామానికి చెందిన గొల్ల కర్రెన్న కూతురు రేణుక (21) కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయం ఇరువురి కుటుంబాలకు తెలియడంతో పలుమార్లు మందలించారు. రెండేళ్ల క్రితం రేణుకను కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన సమీప బంధువు గొల్ల కృష్ణకు ఇచ్చి పెళ్లి చేశారు. శివకు పెళ్లి కాలేదు. ఏడాది క్రితం రేణుకకు కూతురు జన్మించింది. అయితే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకోవడంతో కొంతకాలం హైదరాబాద్కు వలస వెళ్లారు. ఇటీవలే ముక్కిడిగుండం గ్రామానికి వచ్చారు. ఈక్రమంలోనే వారం రోజుల క్రితం రేణుక ఎల్లూరుకు వచ్చింది. శుక్రవారం రాత్రి అందరూ నిద్రించాక ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు గ్రామ సమీపంలోని మామిడి తోటలో రేణుక, శివ ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మెడికల్ షాప్ సిబ్బందిపై బుల్లెట్ల వర్షం.. క్యాషియర్ మృతి
చంఢీగడ్: మెడికల్ షాప్లోకి చొరబడి దుండగులు కాల్పులు జరిపిన ఘటన చంఢీగఢ్లో చోటు చేసుకుంది. మెడికల్స్టోర్లోకి ప్రవేశించిన పలువురు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ముఖాలకు మాస్క్లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు.. ఒక్కసారిగా మెడికల్ షాప్లో ఉన్నవారిపై కాల్పులకు తెగబడ్డారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. దాదాపు 13 రౌండ్లు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్యాషియర్ మృత్యువాత పడ్డారు. మెడికల్ షాపులో చొరబడి కాల్పులు జరపడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెడికల్ షాపులోకి చొరబడి కాల్పులు జరపడం వెనుక పాత విభేదాలు కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా బుల్లెట్ల వర్షం కురిపించడంతో పాత గొడవలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. -
మైనర్పై ఫుట్బాల్ కోచ్ లైంగిక దాడి : వీడియోలతో బ్లాక్మెయిల్
పాల్ఘర్, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక ఫుట్బాల్ కోచ్, మైనర్ క్రీడాకారిణిపై లైంగిక దాడికి పాల్పడిన వైనం కలకలం రేపింది. అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలపై ప్రైవేట్ ఫుట్బాల్ కోచ్ను 36 ఏళ్ల అభిజిత్ మెండల్పై పోక్సో కింద కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం దిగ్భ్రాంతికరమైన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2023లో వసాయిలోని తన ఫుట్బాల్ శిక్షణా అకాడమీలో చేరిన 17 ఏళ్ల బాలికపై మెండల్ పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. గత మూడేళ్లుగా, పలుమార్లు లైంగిక దాడిచేయడంతోపాటు కొన్ని అభ్యంతరకరమైన వీడియోలను తీసి, బెదిరించి, తద్వారా తన కోరికలను తీర్చుకునేవాడు. ఈ మానసిక వేధింపులను తట్టుకోలేక ఆ బాలిక, చివరకు తన కుటుంబం సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ అనంతరం మెండల్ను అరెస్టు చేశారు.ఫుట్బాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, ప్రలోభపెట్టాడని బాధితురాలు వాపోయింది. వేధింపులతో విసిగి, అతడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. దీంతో వీడియోలు, ఫోటోలతో తనను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడని ఆరోపించింది. తనకు లొంగకపోతే, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతాననిబెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి, కస్టడీకి అప్పగించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: డేంజరస్ స్టంట్ : యెమెన్ స్పైడర్ మ్యాన్ దుర్మరణం -
ఏంటి నాన్నా..! పిక్నిక్ అని చెప్పి.. బిర్యానీ తినిపించి.. చివరికి మమ్మల్ని?
నిజాంసాగర్: సాగర తీరంలో ఘోరం పిల్లలను తోసేసి తనువు చాలించిన తండ్రి ‘‘ నాన్నా.. ఇంటి దగ్గర ఆడుకుంటున్న మమ్మల్ని పిక్నిక్కు వెళ్దామని నిజాంసాగర్ ప్రాజెక్టుకు తీసుకొచ్చావు. హోటల్ నుంచి బిర్యానీ తెచ్చి ఆప్యాయంగా తినిపించావు. నీళ్లలో సరదాగా ఆడించావు. ఫోన్లో సెల్ఫీ ఫొటోలు తీశావు. తెప్పపై జలాశయం మధ్యలోకి తీసుకొచ్చావు. అప్పటి వరకు మాతో బాగానే ఉన్నావు. ఏమైంది నాన్న.. అంతలోనే మా ఇద్దరినీ నీళ్లలోకి తోసేశావు. నోట్లోకి నీళ్లు పోతున్నాయ్ నాన్న.. మునిగిపోతున్నాము నాన్న.. అమ్మకు, నీకు మధ్య గొడవలైతే మేమేం పాపం చేశాం.. నీ దగ్గర డబ్బులు లేకపోతే కారం బువ్వ పెట్టినా తింటాం..మీ కడుపున పుట్టడమే మేము చేసిన నేరమా?’’ అని ఎంత వేడుకున్నాయో ఆ పసి హృదయాలు. వారి వేదన వినిపించుకోలేని స్థితిలో ఉన్నా ఆ తండ్రి.. క్షణికావేశంలో తాను సైతం నీళ్లలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.పిల్లలను తోసేసి తనువు చాలించిన తండ్రి..నిజాంసాగర్ ప్రాజెక్టు 20 గేట్ల ప్రాంతంలో ఇద్దరు పిల్లలను నీటిలో తోసేసి, తండ్రి సైతం తనువు చాలించిన ఘటన కలకలం రేపింది. పిల్లల ఆలనా, పాలన చూసుకోవాల్సిన తండ్రి తనతోపాటు తన పేగుబంధం లేకుండా చేశాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన బోయి కృష్ణ (34), సవిత దంపతులకు కుమారుడు రక్షిత్(9), కూతురు అనన్య(5) ఉన్నారు. సరైన ఉపాధి లేక దంపతులిద్దరూ పిల్లలతో కలిసి నాలుగు నెలల క్రితం రామచంద్రాపురానికి వలస వెళ్లారు. కృష్ణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా సవిత హోటల్లో లేబర్ పనిచేస్తోంది. కృష్ణ మద్యం సేవించడం, సరిగా పనిచేయకపోవడంతో భార్య, భర్తలు తరుచూ గొడవలు పడేవారు.ఆర్థిక ఇబ్బందులు, పిల్లలకు చదువులకు చేతిలో డబ్బులు లేకపోవడంతో కృష్ణ జీవితంపై విరక్తి చెందాడు. గురువారం పిల్లలను పిక్నిక్కు వెళ్దామని బైక్పై నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చాడు. మత్స్యకారులు ఉపయోగించే తెప్పపై ప్రాజెక్టు మధ్యభాగంలోకి వెళ్లి పిల్లలను తోసేసి, తాను సైతం నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వరకు పిల్లలతోపాటు భర్త ఇంటికి రాకపోవడంతో సవిత బంధువులకు ఫోన్ చేయగా ఆత్మహత్య విషయం తెలిసింది. నిజాంసాగర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై శివకుమార్ ఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూటీం, జాలర్లు కలిసి నీటిలో గాలించి ముగ్గురి మృతదేహాలు బయటికి తీశారు.ప్రాజెక్టు నీటిలో నుంచి పిల్లలు, తండ్రి మృతదేహాలను బయటికి తెస్తున్న సమయంలో కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసెలా విలపించారు. ఆత్మహత్యకు ముందు పిల్లలతో కలిసి తండ్రి తీసిన సెల్ఫీ ఫొటోలు, మృతదేహాలను చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. -
తల్లిదండ్రులూ దూరం.. ప్రియుడి ఇంటి వద్ద ఏమైందో ఏమో?
కాకినాడ క్రైం: ఏమైందో ఏమో.. ప్రియుడి ఇంటి వద్ద ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కంపా లాఫీ (17) అనే బాలిక తల్లిదండ్రులు పీతా నాగదేవి, కంపా బంగారయ్యలు విడిపోయి కుమార్తెను స్థానిక తారకరామ నగర్లో పిన్ని జయవాణి వద్ద వదిలేసి వెళ్లిపోయారు.మూడేళ్ల క్రితం నరసింహ రోడ్డుకు చెందిన తన వయసున్న బాలుడితో లాఫీకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పిన్ని, బాబాయ్లకు తెలియడంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన బాలిక ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది నెలలుగా అక్కడే ఉంటోంది.ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఆ బాలుడితో పాటు అతని తల్లి లోవలక్ష్మి ఓ టైలరింగ్ షాప్లో, తండ్రి శివకుమార్రాజు దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరితో పాటే లాఫీ నివసిస్తోంది. గురువారం రాత్రి శివకుమార్రాజు ఇంటికి వచ్చి చూసేసరికి అప్పటికి కుమారుడు, భార్య ఇంటికి చేరలేదు. లాఫీ ఇంట్లో ఉండడంతో తలుపు కొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి వంట గది కిటికీ లోంచి చూస్తే ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని లాఫీ వేలాడుతోంది.కంగారు పడిన శివకుమార్రాజు స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూసేసరికి బాలిక అచేతనంగా ఉంది. ఆమెను జీజీహెచ్కు తరలించాడు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. లాఫీ మృతికి ఆ బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులు, మరో వ్యక్తి కారణమని బాబాయ్, పిన్ని ఆరోపించారు. మృతురాలి బాబాయ్ నూకరాజు ఫిర్యాదుతో కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎనిమిది నెలల క్రితమే హత్యకు కుట్ర..
సాక్షి, సిటీబ్యూరో: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డ్ ప్యానెల్ సభ్యుడు ఖాజా మొయిజుద్దీన్ హత్యకేసులో ముజాహిద్ ఆలంఖాన్తో పాటు కీలక నిందితులు కిషన్ సింగ్, అభిజీత్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం నుంచి మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించగా... రెండు రోజుల విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు హసన్, మునీర్లపై నగర పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేశారు.ముజాహిద్ ఆలంఖాన్ గతంలోనూ ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయాలంటూ పలుమార్లు కిషన్ సింగ్కు చెప్పాడు. అయితే అది సాధ్యం కాలేదు. ఓ దశలో ముజాహిద్ ఆలంఖాన్ ఓ మహిళ ద్వారా ఖాజా మొయిజుద్దీన్పై దాడి చేయించారు. ఆయన్ను తీవ్రంగా భయపెట్టాలనే ఈ పని చేయించారు. అబిడ్స్ పోలీసుల వరకు వెళ్లిన ఈ విషయం ఠాణాలో సెటిల్ అయింది.ఏడాది క్రితం ముజాహిద్, మహబూబ్ ఆలంఖాన్లు కిషన్ను పిలిచి ఖాజా మొయిజుద్దీన్తో మాట్లాడాలని, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించాలని కోరారు. న్యాయవాది హత్య జరగడానికి దాదాపు ఎనిమిది నెలల ముందు కిషన్ సింగ్ను ఆలంఖాన్లు తమ కార్యాలయానికి పిలిచారు. ఖాజా మొయిజుద్దీన్ను హత్య చేయాలని, అయితే అది రోడ్డు ప్రమాదంలా కనిపించాలని చెప్పారు. అందుకు అవసరమైన డబ్బుతో పాటు పని పూర్తి అయిన తర్వాత కిషన్ సింగ్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఆలంఖాన్లు హామీ ఇచ్చారు.ఖాజా మొయిజుద్దీన్ హత్య కుట్ర అమలును పర్యవేక్షించే బాధ్యతల్ని ముజాహిద్ ఆలంఖాన్ తన వద్ద పని చేసే హసన్ అలీతో పాటు మునీర్కు అప్పగించారు. హత్య చేయడానికి స్కార్పియో వాహనం కావాలంటూ కిషన్ గత ఏడాది డిసెంబర్లో ముజాహిద్కు చెప్పాడు. దీంతో ఆ వాహనం ఖరీదు చేయడానికి హసన్, మునీర్ ద్వారా రూ.2 లక్షలు కిషన్కు పంపారు.మలక్పేటలో ఉన్న పది వేల గజాల వక్ఫ్ భూమి కొత్త కమిటీ గత ఏడాది డిసెంబర్లో ఆటో ఫిన్ కంపెనీకి లీజుకు ఇచి్చంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆలంఖాన్లు సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనికి కొనసాగింపుగా ఏప్రిల్లో ఆటోఫిన్ కంపెనీ యజమాని గౌతం చాంద్జైన్పై ఆలంఖాన్లు కేసు పెట్టగా... ఆ కంపెనీ మేనేజర్ ఎన్.నర్సింగ్రావు వీరి పైన కేసు పెట్టారు. ఈ కేసును ముజాహిద్ ఆలంఖాన్ కోర్టులో సవాల్ చేశారు. దీని విచారణ సందర్భంలో నర్సింగ్రావు తరఫున ఖాజా మొయిజుద్దీన్ హాజరుకావడాన్ని ఆలంఖాన్లు జీరి్ణంచుకోలేకపోయారు. దీంతో ఆయన హత్య కుట్ర అమలును వేగవంతం చేశారు.అప్పటికే స్కారి్పయో వాహనాన్ని అభిజిత్ తాకట్టు పెట్టగా దాన్ని వినిపించడానికి కిషన్ సింగ్ రూ.లక్ష ఇచ్చారు. న్యాయవాది ఖాజా మెహిజుద్దీన్ను మే 23 తెల్లవారుజామున హత్య చేయగా.. దానికి ఒక రోజు ముందే అభిజీత్, వినయ్, మణిదీ్వప్లు స్కారి్పయో వాహనం నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేశారు. దీనికోసం దానిపై గ్రేజు, మట్టి పూశారు. ఈ వాహనాన్ని వినియోగించే అభిజీత్ మే 23న ఖాజా మొయిజుద్దీన్ను ఆయన ఇంటి వద్దే ఢీ కొట్టి చంపాడు.ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న హసన్, మునీర్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్న పోలీసులు విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా ఎల్ఓసీ జారీ చేశారు. దీని ప్రతుల్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు పంపారు. ముజాహిద్, కిషన్, అభిజీత్ పోలీసు కస్టడీ గడువు ముగియనుండటంతో వీరిని శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు. -
కుక్కే క్లూ అనుకున్నారు.. కానీ!
రెండేళ్ల చిన్నారి. పెంపుడు కుక్కతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ వారమైనా తిరిగి రాలేదు. తల్లిదండ్రుల కన్నీళ్లు, బంధవులు.. గ్రామస్తుల ఆందోళన, పోలీసుల విస్తృత గాలింపు.. ఏదీ ఇప్పటివరకు జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. పెంపుడు కుక్క తిరిగి వచ్చినా.. దానికి హైటైక్ టెక్నాలజీ తగిలించి ఆచూకీ కనిపెట్టాలని ప్రయత్నించినా.. పాప జాడ మాత్రం దొరక్కపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ వారమైనా చిక్కలేదు. తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు..చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే 10 పోలీసు టీంలు, 40 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం.. మరికొందరు అధికారులు పాప కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో భాగమయ్యారు. అడవులు, కొండలు, గ్రామాలన్నీ నిర్విర్వామంగా జల్లెడ పడుతున్నారు. దీంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది.ఈ నెల 6న ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఈ కేసులో పెంపుడు కుక్క కీలక ఆధారంగా మారొచ్చని పోలీసులు భావించారు. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత కుక్క గ్రామానికి తిరిగి వచ్చింది. అయితే ఇంటి వద్ద ఉన్న హడావుడి చూసి మళ్లీ పారిపోయింది. ఈ క్రమంలో అది పలువురిపై దాడి చేసింది. అనంతరం డాగ్ క్యాచర్ సాయంతో అతికష్టం మీద దానిని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఓ తాడుతో కట్టేసి.. దానికి పోలీసును కాపలా ఉంచారు. నీరసంగా ఉన్న దానికి.. వెటర్నరీ సిబ్బంది వైద్య సేవలు అందించి కోలుకున్న తర్వాత పోలీసులు ప్రత్యేక చర్యలకు దిగారు.పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, ఏఎన్ఎస్, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు!.ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డంప్ డేటా, కాల్ డిటైల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి క్షేమంగా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి ఆయురారోగ్యాలతో ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. -
మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్.. యువతిని వెంబడిస్తూ.. వేధిస్తూ
శ్రీనగర్కాలనీ: యువతితో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలతో మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్ చేసిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. విజయవాడ కృష్ణలంకకు చెందిన యువతి టెలీకాలర్గా పనిచేస్తూ రహమత్నగర్లో నివాసముంటోంది.ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకుంటానని జహీర్ అబ్బాస్ అనే యువకుడు నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు. పెళ్ళికి యువతి కుంటుంబీకులు అంగీకరించారు. మరో యువతితో నిశ్చితార్ధం జరిగిన విషయాన్ని తెలుసుకున్న యువతి జహీర్ను దూరం పెట్టింది. అయితే జహీర్ యువతిని వెంబడిస్తూ.. వేధిస్తూ గతంలో సన్నిహితంగా దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్మీడియాలో పోస్ట్చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. ఆమెకు తెలిసిన వారికి ఫొన్ చేసి, మెసేజులు పంపి దుష్ప్రచారం చేశాడు. దీంతో యువతి తనకు ప్రాణహాని ఉందని మదురానగర్ పోలీసులకు పిర్యాదుచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాటేదాన్లో.. అస్థి పంజరం కలకలం!
మైలార్దేవ్పల్లి: మైలార్దేవ్పల్లి ఠాణా పరిధిలోని కాటేదాన్ ఓల్డ్ కర్నూలు రోడ్డులో శుక్రవారం అస్థిపంజరం కలకలం సృష్టించింది. జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్హోల్స్ శుభ్రపరుస్తుండగా కుళ్లిపోయిన స్థితిలో అస్థి పంజరం కనిపించింది.దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సమాచారం అందించడంతో మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అస్థిపంజరాన్ని పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం పురుషుడిదా, మహిళదా? అనే విషయం ఫోరెన్సిక్ పరీక్షలు, దర్యాప్తు తర్వాత తేలుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. -
మేం జీహెచ్ఎంసీ అధికారులం.. మమ్మల్నే ఆపుతావా?
బంజారాహిల్స్: రహదారిపై అపసవ్య దిశలో రావడాన్ని నిలువరించిన ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–36 ఉద్యోగులిద్దరినీ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని లూసిడ్ ఆస్పత్రి రోడ్డులో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కార్లు, ట్యాంకర్లు, లారీలు వెళ్లకుండా నిషేధం విధించి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. గురువారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–36 శానిటేషన్ ఇన్స్పెక్టర్ అమిత్కుమార్, ఏఈ పుప్పాల ఆనంద్ కారులో ఇటువైపు వెళ్లేందుకు యత్నించారు. విధుల్లో ఉన్న బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలం ఇలా వెళ్లడానికి వీల్లేదని మర్యాదగా చెప్పాడు. జీహెచ్ఎంసీ ఆఫీసర్లం.. మమ్మల్నే అడ్డుకుంటావా? అంటూ ఆనంద్ దుర్భాషలాడుతూ కానిస్టేబుల్ శ్రీశైలంపై దాడికి దిగాడు. మేం జీహెచ్ఎంసీ అధికారులం.. మమ్మల్ని ఆపే దమ్ము ఎవరికీ లేదంటూ హెచ్చరించాడు. నీ అంతుచూస్తాం.. నిన్ను ఇక్కడి నుంచి బదిలీ చేస్తామంటూ అమిత్కుమార్ సదరు కానిస్టేబుల్ను ఫొటోలు తీస్తూ బారికేడ్లను తొలగించి కారులో ఉడాయించారు. శ్రీశైలం ఫిర్యాదు మేరకు అమిత్కుమార్, ఆనంద్లపై బంజారాహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 121 (1), 132, 352, 351 (2) కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఠాణాలోనూ వీరు ప్రతాపం చూపేందుకు యత్నించడం కొసమెరుపు. -
మొరాయించిన స్టీరింగ్.. లోయలో పడ్డ బస్సు
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి వందల అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయాలు కాగా.. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.కవ్రేపలాంచోక్ జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. బనేపా నుంచి రోషి గ్రామీణ మున్సిపాలిటీ వైపు వెళ్తున్న ప్రయాణికుల బస్సు నమోబుద్ధ మున్సిపాలిటీ పరిధిలోని సెల్ఫీ డాండా ప్రాంతంలో అదుపుతప్పి సుమారు 300 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే.. నేపాల్ సైన్యం, పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోయిన బస్సు నుంచి క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.జిల్లా పోలీసు కార్యాలయం వివరాల ప్రకారం.. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొందరిని గుర్తించగా.. మరికొందరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన 16 మందిని ధులిఖేల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. #Nepal | Eight dead and 15 injured in bus accident in KavreThe bus fell some 200 m off the road in Namobudhha municipality. The 15 injured are undergoing treatment at the Dhulikhel hospital.A passenger bus heading to Sungure of Roshi Rural Municipality from Banepa had met… pic.twitter.com/aWrSS4U1Wu— DD News (@DDNewslive) June 12, 2026ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు స్టీరింగ్లో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ ప్రయాణికుడు.. బస్సు సాధారణ వేగంతోనే ప్రయాణిస్తోందని చెప్పాడు. అయితే ఓ మలుపు వద్ద ఎదురుగా వచ్చిన వాహనానికి దారి ఇవ్వడానికి ప్రయత్నించే సమయంలో బస్సు రోడ్డు నుంచి జారి లోయలోకి దూసుకెళ్లిందని చెప్పాడు.దీంతో స్టీరింగ్ జామ్ కావడం వల్లే.. డ్రైవర్ వాహనంపై కంట్రోల్ తప్పి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏమిటన్నది దర్యాప్తు అనంతరమే వెల్లడించనున్నారు. మరోవైపు.. నిన్న నేపాల్లోని ధన్కుటా జిల్లాలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. రహదారిపై బస్సు బోల్తాపడటంతో 12 మందికి గాయాలయ్యాయి. -
ఆర్నెల్ల కూతురితో కలిసి.. ఆరో అంతస్తు నుంచి దూకి
హైదరాబాద్: ఆరు నెలల చిన్నారితో కలిసి ఓ సాఫ్ట్వేర్ మహిళ తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ ఆరవ అంతస్తుపై నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా ప్రహరీ గోడపై ఉన్న ఇనుప కంచెకు డ్రెస్ చిక్కుకొని గాయాలతో చిన్నారి బయటపడింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన భూపేంద్ర సాహు, మధ్యప్రదేశ్లోని భూత్గావ్కు చెందిన ఈషా సాహు (37)లకు 2015లో వివాహం జరిగింది.గత ఎనిమిదేళ్లుగా వీరు మియాపూర్ మయూరీనగర్లోని ఓ అపార్ట్మెంట్ రెండవ అంతస్తులో ఉంటున్నారు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురుకు ఎనిమిదేళ్లు, మరో చిన్నారికి ఆరు నెలలు. ప్రస్తుతం ఈషా సాహు ప్రసూతి సెలవులో ఉంది. కొన్ని నెలలుగా ఈషా సాహు తల్లిదండ్రుల ఊళ్లోనే ఉంది. నెల రోజుల క్రితం నాగపూర్లోని అత్తారింటికి వెళ్లింది. పెద్ద కూతురుకు స్కూళ్లు ప్రారంభం కావడంతో గత నెల 30న ఆమె తన భర్త, పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది.సరుకులు తీసుకురమ్మని.. కాగా, శుక్రవారం మధ్యాహ్నం ఈషా సాహు తన భర్త భూపేంద్ర సాహు, పెద్ద కూతురు విధిని సరుకులు తీసుకురావాలని చెప్పి డీమార్ట్కు పంపించింది. సాయంత్రం సమయంలో ఆరు నెలల కూతురు వాణితో కలిసి ఆమె ఓ బకెట్ తీసుకొని ఆరవ ఫ్లోర్కు వెళ్లింది. బకెట్ పైకి ఎక్కి గోడ మీద నుంచి చిన్నారితో కలిసి ఆమె కిందికి దూకింది. తీవ్ర గాయాలతో ఈషా సాహు అక్కడికక్కడే మృతి చెందగా అపార్ట్మెంట్ ప్రహరీగోడపై ఉన్న ఇనుప కంచెకు చిన్నారి డ్రెస్ చిక్కుకొని స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గమనించి భర్త భూపేంద్ర సాహు, మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా ఈషా సాహు మృతి చెందగా, పక్కనే ఉన్న ప్రహరీగోడ ఇనుప కంచెకు గౌను చిక్కుకొని చిన్నారి వేలాడుతూ కనిపించింది. పోలీసులు చిన్నారిని కంచె నుంచి తొలగించి ఆస్పత్రికి తరలించారు. ‘ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నా.. మీరందరూ సంతోషంగా ఉండండి.. నన్ను క్షమించండి’అంటూ ఈషా సాహు ఓ నోట్లో రాసిందని పోలీసులు తెలిపారు. కాగా ఆరు నెలలుగా ఆమె డిప్రెషన్తో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర బంధం విషాదాంతం
హాలహర్వి: వివాహేతర బంధం విషాదాంతమైంది. ఓ మహిళ, ఆమె మూడునెలల పసికందును బలితీసుకుంది. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలివీ.. గూళ్యం గ్రామానికి చెందిన మహేష్(39) కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సంగనకల్లు గ్రామానికి చెందిన దివ్యాంగురాలిని రెండో పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. అదే గ్రామంలో వివాహిత లీలావతి(36)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో లీలావతిని ఆమె భర్త పలుమార్లు దండించాడు. ఈ విషయాన్ని లీలావతి తన ప్రియుడు మహేష్ తో చెప్పింది. తమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని లీలావతి, మహేష్, మూడు నెలల చిన్నారితో నాలుగు రోజుల క్రితం గూళ్యం గ్రామానికి చేరుకున్నారు. వీరిని గ్రామంలో ఎవరూ చేరదీయకపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున గ్రామశివారులోని వంకలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఘటనలో లీలావతి, మూడు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మహేష్ కొన ఊపిరితో ఉన్నాడు. పొలం పనులకు వెళ్లిన రైతులు చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. హాలహర్వి ఎస్ఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. లీలావతి, మూడు నెలల చిన్నారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి బళ్లారికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు. -
ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు.. సైబర్ ఉచ్చులో పడ్డాడు..
సాక్షి, విశాఖపట్నం: ఓ మాజీ సైనికోద్యోగి తన ప్రాంత సమస్యపై పెట్టిన ఫేస్బుక్ పోస్టు అతడిని సైబర్ నేరగాళ్ల బుట్టలో పడేలా చేసింది. విశాఖలోని పాత రేసపువానిపాలెంకు చెందిన మాజీ సైనికోద్యోగి బి. శ్రీనివాసరెడ్డి సీతంపేట, రాజేంద్రనగర్లోని రూ.20 కోట్ల విలువైన 1,843 గజాల జీవీఎంసీ ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కోరుతూ ఈ నెల 3న మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి, టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజీలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. దీన్ని చూసిన సైబర్ నేరగాళ్లు.. శ్రీనివాసరెడ్డి సమస్యను ఆసరాగా చేసుకుని పక్కా ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 7న శ్రీనివాసరెడ్డికి ఓ వాట్సప్ కాల్ వచి్చంది. దానికి మాజీ మంత్రి దేవినేని ఉమా ఫొటో డీపీగా ఉంది. ఫోన్ చేసిన అగంతకుడు తాను దేవినేని ఉమను మాట్లాడుతున్నానని, పార్కు స్థలం సమస్యను రష్యా పర్యటనలో ఉన్న లోకేశ్ తన దృష్టికి తెచ్చారని, దాన్ని పరిష్కరించే బాధ్యత తనకు అప్పగించారని చెప్పాడు. బాధితుడికి అనుమానం రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తున్నట్లు నటించాడు. అంతేకాకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ తదితరులతో తాను వాట్సాప్లో చాట్ చేసినట్లుగా ఫేక్ స్క్రీన్ షాట్లని సృష్టించి బాధితుడికి పంపాడు. నేరుగా జీవీఎంసీ కమిషనర్తో మాట్లాడి పార్కు సమస్యతో పాటు, బాధితుడికి ఉన్న ఖాళీ స్థలాల పన్ను (వీఎల్టీ) సమస్యను కూడా పరిష్కరిస్తానని మభ్యపెట్టాడు. అనుకున్న పనులు పూర్తి కావాలంటే జీవీఎంసీ కమిషనర్కు ముందుగా కొంత ‘ఫార్మాలిటీ అమౌంట్’ ఇవ్వాలని షరతు పెట్టాడు. దీన్ని నమ్మిన బాధితుడు 7న సైబర్ నేరగాడు పంపిన ‘రాథోడ్ సంతోష్’ అనే పేరుతో ఉన్న యూపీఐ క్యూ ఆర్ కోడ్కు ఫోన్ పే ద్వారా రూ.80 వేలు పంపించాడు. ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, వాట్సాప్ డీపీ కూడా తొలగించడంతో తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు. వెంటనే విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. -
టెక్సాస్లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి!
అమెరికాలోని టెక్సాస్లోని మిడ్ల్యాండ్లో ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కాల్పులు ఉదయం సుమారు 8 గంటల సమయంలో నగరంలోని ఒక ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. తరువాత ఘటన మరింత విస్తరించి ఒక వెటర్నరీ హాస్పిటల్ సమీపానికి చేరుకుంది. పరిస్థితి తీవ్రమవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వెంటనే చర్యలు ప్రారంభించారు.🚨 UPDATE: Midland Texas shooter contained. 11 Injured, 1 killed. pic.twitter.com/U0sjuiyFPJ— Juanita Broaddrick (@atensnut) June 12, 2026ఈ ఘటన సమయంలో కనీసం 40 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయని సమీపంలోని ఒక ఆటోమొబైల్ బాడీ షాప్లో పనిచేసే ఆండ్రియా మెండియాస్ తెలిపారు. ఆమె తీసిన వీడియోల్లో ఆర్మర్డ్ పోలీస్ వాహనాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అలాగే డ్రోన్లు, రోబోట్లు కూడా ఘటన స్థలంలో ప్రవేశపెట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.మిడ్ల్యాండ్ మెమోరియల్ హాస్పిటల్ ప్రకారం, గాయపడిన తొమ్మిది మందిలో నలుగురు ఆపరేషన్ థియేటర్లో చికిత్స పొందుతుండగా, మిగతా ఐదుగురు స్థిరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ ఘటనతో నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
రూ. 12 కోట్ల గంజాయి : అడ్డంగా బుక్కైన కేరళ బ్యూటీ
పేరుకే అందాల సుందరి. చేసేది మాత్రం గలీజ దందా. 28 ఏళ్ల మోడల్, 'మిసెస్ కేరళ' 2025 పోటీదారు హర్ష సన్నీ దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా బుక్కైంది. బ్యాంకాక్ నుండి విమానంలో ముంబైకి వస్తూ పోలీసులకు చిక్కింది.కస్టమ్స్ అధికారుల ప్రకారం, హర్ష సన్నీ జూన్ 10-11 తేదీల రాత్రి ఎయిర్ ఇండియా విమానం TG-351లో బ్యాంకాక్ నుండి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. బ్యాంకాక్నుంచి 11 కిలోలకు పైగా హై క్వాలిటీ 'హైడ్రోపోనిక్ గంజాయి'ని గుట్టుచప్పుడు కాకుండా బాగానే తీసుకొచ్చింది. కానీ ఆమె ప్రవర్తనను గమనించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU), కస్టమ్స్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా అసలు గట్టు రట్టైంది. ఇదీ చదవండి: ఒకే ఒక్కడు మృత్యుంజయుడు.. ఇపుడెలా ఉన్నాడు?ఆమె ట్రాలీ బాగ్లో 12 వాక్యూమ్-సీల్డ్ ప్లాస్టిక్ ప్యాకెట్లు లభించాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) కిట్ను ఉపయోగించి అక్కడికక్కడే జరిపిన రసాయన పరీక్షలో, ఆ పదార్థం'హైడ్రోపోనిక్ గంజాయి' అని నిర్ధారణ అయింది. విలువ రూ. 11.82 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఆమెను ఎన్డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ సరుకును ముంబైలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కడకు చేరవేయాలనుకున్నారనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ! -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య..
కురవి: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని నల్లెల్ల శివారు గాజ తండా జీపీ పరిధి టేకుల తండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇదే మండలం కంచర్లగూడెం తండా గ్రామానికి చెందిన భూక్య శాంతి కుమార్తె కల్యాణి(27)తో టేకుల తండాకు చెందిన గుగులోత్ నరేశ్కు పరిచయడం ఏర్పడింది.2017లో ప్రేమించుకున్న వీరు 2018లో వివాహం చేసుకున్నారు. ఇటీవల కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. దీంతో కల్యాణి బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్న క్రమంలో గుర్తించిన కుటుంబీకులు, భర్త నరేశ్ హుటాహుటిన మానుకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే కల్యాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సంతోశ్ గురువారం తండాకు చేరుకుని పరిస్థితి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. మృతురాలికి నాలుగేళ్ల బాబు, 11 నెలల పాప ఉంది. -
ఉత్తీర్ణత సాధించలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
మహబూబ్నగర్ క్రైం: ఇంటర్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసు కుంది. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య కథనం ప్రకారం.. నగరంలోని మదీ నా మజీద్ ఏరియాకు చెందిన హాబీబ్ ఉమేద్(18) నగరంలో ఓ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివాడు.ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఇటీవల మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. కాగా గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కూడా ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తానికి గురై ఉమేద్ మధ్యాహ్నం సమయంలో ఇంట్లో దుప్పటితో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతుడి తండ్రి మక్సూద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మక్సూద్కు ఇద్దరు కూతుర్తెలతో పాటు కొడుకు హాబీబ్ ఉమేద్ ఉన్నారు. -
రూ.20 కోసం హత్య.. ట్యాక్సీ డ్రైవర్ మృతి!
రాప్తాడు రూరల్: రూ.20 కోసం గొడవ.. ఒకరి హత్యకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో ట్యాక్సీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పాపంపేట జుడియో షోరూం పక్కన శేఖర్ అనే వ్యక్తి కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి కూరగాయలు కొనుగోలు చేశారు. బిల్లు రూ.120 అయ్యింది. రూ.500 నోటు ఇవ్వడంతో శేఖర్ రూ.380 వెనక్కు ఇచ్చాడు. అయితే ఇంకా రూ.20 వెనక్కు ఇవ్వాలని ఆ ఇద్దరు యువకులు అడిగారు. ఇందుకు వ్యాపారి ఇవ్వలేదు. మాటామాటా పెరిగి శేఖర్పై దాడి చేశారు.సర్దిచెప్పేందుకు వస్తే ప్రాణం తీసేశారుకూరగాయల దుకాణం వద్ద పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అక్కడే ఉన్న పాపంపేటకు చెందిన ట్యాక్సీ డ్రైవర్ బెస్త చంద్ర (55) జోక్యం చేసుకున్నాడు. ఇద్దరినీ సముదాయించి గొడవను ఆపాలని ప్రయత్నించాడు. కానీ మద్యం మత్తులో ఉన్న యువకులు విచక్షణ కోల్పోయి ముఖం, ఛాతీపై పిడిగుద్దులు గుద్దడంతో చంద్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. రూ.20 చిల్లర విషయంలో మొదలైన వాగ్వాదం చివరకు ఒక కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. సమాచారం అందుకున్న చంద్ర భార్య, పిల్లలు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘గొడవ ఆపడానికి వెళ్లిన మా మనిషిని ఇలా పొట్టన పెట్టుకున్నారు‘ అంటూ భార్య రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.నిందితుల కోసం గాలింపుఅనంతపురం రూరల్ సీఐ శ్రీకాంత్యాదవ్, ఎస్ఐ ధరణిబాబు సమాచారం అందగానే హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కూరగాయల వ్యాపారితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికే అక్కడి నుంచి పరారైన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిసింది. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి
లక్నో నుంచి ఢిల్లీ వెళ్లే 'స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్' (Swarn Shatabdi Express) రైలుపై ఫిరోజాబాద్ సమీపంలో గురువారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైల్లో ఈ ఘటన జరగడంతో ఆందోళన రేగింది. అయితే ఈ ప్రమాదంలో మోహన్ భాగవత్ సురక్షితంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఏ జరిగిందంటే..గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ నుండి ఢిల్లీ వెళ్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెం. 12003) రాత్రి 7:20 గంటల ప్రాంతంలో మఖన్పూర్ స్టేషన్ను దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. కదులుతున్న రైలుపై రాయి పడటంతో E-1 కోచ్ కిటికీ అద్దం దెబ్బతింది. దీంతో రైల్వే అధికారులు ఉత్తరప్రదేశ్ ఫేరోజాబాద్ జిల్లాలోని తుండ్లా జంక్షన్ వద్ద వద్ద రైలును నిలిపివేశారు.మోహన్ భగవత్ టార్గెట్?అయితే రాయి తగిలిన కోచ్లోనే మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నట్లు GRP ఇన్స్పెక్టర్ షేర్ సింగ్ ధృవీకరించారు. కోచ్లోని అవతలి వైపు (ఆపోజిట్ సీట్లో) కూర్చోవడంతో ఆయనకు ఎలాంటి హాని జరగలేదు. అలాగే ఆయనతో పాటు, ఇతర ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నారని సింగ్ తెలిపారు. అధికారుల తనిఖీల అనంతరం రైలు తిరిగి ఢిల్లీకి బయలుదేరింది.ఘటనా స్థలానికి ఉన్నతాధికారులుఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఫిరోజాబాద్లోని ఘటనా స్థలాన్ని సందర్శించారు. రైలులో మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఎస్ఎస్పీ ఆదిత్య లాంగే చెప్పారు. విచారణ నిమిత్తం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.గతంలోనూ రాళ్ల దాడులు ఫిరోజాబాద్ గుండా వెళ్లే ఈ రైల్వే ట్రాక్ పరిసరాల్లో గతంలోనూ పలుమార్లు రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గతంలో జరిగిన ఘటనలను, ప్రస్తుత కేసును పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని ఎస్ఎస్పీ లాంగే స్పష్టం చేశారు. -
అక్కకు స్వీట్ ఇచ్చి.. తిరిగి వెళ్తుండగా..
మూసాపేట: కొత్త ఫోన్ కొన్న తరువాత అక్కకు స్వీట్లు ఇచ్చి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఒరిస్సాకు చెందిన రాజేష్ (30) ఇందిరానగర్లో నివాసముంటూ అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం కొత్త మొబైల్ ఫోన్ కొనడంతో మూసాపేటలో ఉన్న తన అక్కకు స్వీట్ బాక్స్ ఇచ్చి బైక్పై అర్ధరాత్రి బయలుదేరాడు. ఐడీఎల్ చెరువు నుంచి జాతీయ రహదారిపైకి వెళుతుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఫిబ్రవరి నెల నుంచి రాజేష్ శివమాలలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చెంబులో 'కీ'... అదే కలిసొచ్చింది దొంగలకి
గచ్చిబౌలి: ఇంటి యజమాని నిర్లక్ష్యంతో కలశం చెంబులో లాకర్ కీ పెట్టడంతోనే హిల్రిడ్జ్ విల్లాస్లో భారీ చోరీ చోటు చేసుకుందని, ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 7.837 కిలోల బంగారు నగలు, 1.367 కిలోల వెండి, నగదు స్వా«దీనం చేసుకున్నట్లు సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్ తెలిపారు. గురువారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. నేపాల్లోని కైలాలి జిల్లా మోహన్యాల్కు చెందిన దంపతులు కమల్ షాహీ (32), విమల్ షాహీ (30)లు నగరంలోని గచ్చిబౌలి హిల్రిడ్జ్ విల్లా నంబర్ 73లో నివసించే ప్రకాశ్ పాయ్ వద్ద వాచ్మన్, సర్వెంటుగా చేరారు.ఇంట్లోంచి వెళ్లిన కొద్దిసేపటికే.. ఈ నెల 6న ప్రకాశ్, ఆయన భార్య వందన, కుమారుడు అభిజిత్లు ముంబై వెళ్లారు. సహ నిందితుడు సురేష్ షాహీ కొద్ది సేపటికే కిటికీ యూపీవీసీ లాక్ బ్రేక్ చేసి ఇంటి లోపలికి వెళ్లాడు. సెంట్రల్ లాక్ తీశాడు. బెడ్రూంలో లాకర్పై ఉన్న కలశం చెంబులో కీతో లాకర్ ఓపెన్ చేసి బంగారు ఆభరణాలు బయటకు తీశాడు. కమల్, విమల్ వద్ద నగలు పెట్టాడు. ఆ సమయంలోనే పక్కనున్న వారు గమనించి సురే‹Ùను సమీప విల్లాలో ఉండే ప్రకాశ్ పాయ్ కూతురు వద్దకు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి సురేష్ మాత్రం విల్లాలో ఉన్నాడు. కమల్, విమల్ ఎన్బీటీ నగర్లోని విమల్ సోదరి కల్పన షాహీని తీసుకొని సికింద్రాబాద్ నుంచి రైలులో పరారయ్యారు. మరునాటి ఉదయం సురేష్ కూడా విల్లా నుంచి పరారయ్యాడు. ఇంటికి తిరిగి వచి్చన ప్రకాష్ పాయ్ లాకర్లో నగలు చోరీకి గురైనట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్ నంబర్ ఆధారంగా.. ఆరు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితులు ఎన్బీటీ నగర్కు ఆటో వెళ్లినట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. కొత్త సిమ్ కార్డు కవర్పై ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని ఉదంపూర్లో నిందితులు ఉన్నట్లు గుర్తించారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఎస్టీఎఫ్ పోలీసుల సహకారంతో కమల్, విమల్, కల్పన, పనిలో చేరి్పంచిన బిశ్వ కర్మను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. ప్రధాన సూత్రధారి సురేష్ షాహీ పరారీలో ఉన్నట్లు చెప్పారు. -
ఇల్లు దక్కలేదని.. నడిరోడ్డుపైనే 82 ఏళ్ల తండ్రి హత్య
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. కోర్టులో తండ్రికి వ్యతిరేకంగా ఆస్తి కేసు ఓడి పోయాననే ఆగ్రహంతో ఒక వ్యక్తి తన 82 ఏళ్ల తండ్రిని నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది.ఛత్రపతి సంభాజీనగర్లో ఉంటున్న జలవనరుల శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి జాఫర్కమరుద్దీన్ సయ్యద్ పటేల్కు, మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న కుమారుడు అబ్దుల్ రెహమాన్తో చాలాకాలంగా వివాదం నడుస్తోంది. నిత్యం కుటుంబ సభ్యులతో గొడవపడుతూ, వారిపై దాడిచేసేవాడు. దీంతో బాధితుడు జాఫర్ కొడుకు ప్రవర్తనతో విసుగు చెంది, ఇంటి కోసం కేసు వేయడానికి ముందు పూణేలోని తన కుమార్తె ఇంటికి వెళ్లిపోయాడు.కుమారుడి ప్రవర్తనతో వేగలేక, అతడిని ఇల్లు ఖాళీ చేయించడానికి కోర్టును ఆశ్రయించాడు. రెండేళ్లపాటు న్యాయపోరాటం చేశాడు. చివరికి కోర్టు తండ్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చి, కుమారుడిని ఇల్లు ఖాళీ చేయించాలని ఆదేశించింది. ఆస్తి యాజమాన్యాన్ని తండ్రికి పునరుద్ధరించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో విచక్షణ మరిచిన కొడుకు ఉత్తర్వులతో కోర్టు నుండి ఇంటికి తిరిగి వస్తుండగా జాఫర్పై ఎటాక్ చేశాడు. తండ్రి ప్రయాణిస్తున్న ఆటోరిక్షాను ఆపి, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి చంపాడు. పటేల్తో పాటు ఆయన కుమార్తె కూడా ఈ దాడిలో గాయపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
పనిమనిషి ఖాతాలో 52 లక్షలా?
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వలలు విసురుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎంత అవగాహన పెరిగినా.. ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారైనా ఇలాంటి మోసాలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ డేటింగ్ యాప్లో మొదలైన పరిచయం.. సంచలన కేసుగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ హనీట్రాప్ తరహా మోసంలో చిక్కుకున్నది సామాన్య వ్యక్తి కాదు.. ఓ మహిళా జడ్జి.హర్యానాలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు న్యాయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళా జడ్జి ఇంట్లో పని మనిషి తాను డేటింగ్ యాప్లో మోసపోయానని పోలీసులను ఆశ్రయించింది. జడ్జి రిఫరెన్స్ కావడంతో ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కానీ కేసు కోర్టుకు చేరిన తర్వాత అసలు కథ బయటపడింది. టిండర్ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో రూ.52 లక్షలకు పైగా మోసపోయింది పనిమనిషి కాదు.. సదరు మహిళా న్యాయమూర్తి అని తేలింది.దర్యాప్తు వివరాల ప్రకారం.. గత ఏడాది నవంబర్లో టిండర్ యాప్లో "అభిమన్యు వశిష్ఠ్" పేరుతో ఓ వ్యక్తి మహిళా జడ్జికి పరిచయమయ్యాడు. తాను కేంద్ర ప్రభుత్వంలోని ఓ రహస్య విభాగంలో పనిచేస్తున్నానని చెప్పి ఆమె నమ్మకం సంపాదించాడు. క్రమంగా ఇద్దరి మధ్య సన్నిహిత పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికాడు.అతని మాటలు నమ్మిన జడ్జి.. వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.52 లక్షలకు పైగా బదిలీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే చెప్పినట్టుగా లాభాలు రాకపోవడం, అతని ప్రవర్తనపై అనుమానాలు రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించారు.అయితే ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఫిర్యాదు నమోదైన తీరు. అసలు డబ్బు జడ్జి ఖాతాల నుంచి వెళ్లినా.. ఫిర్యాదు మాత్రం ఆమె ఇంటి పనిమనిషి పేరుతో నమోదైంది. దీంతో విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు బాధితురాలు ఎవరో స్పష్టంగా పేర్కొనకుండా కేసు నమోదు కావడంపై ప్రశ్నలు లేవనెత్తింది.బెయిల్ పిటిషన్ను విచారించిన అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ లాలేర్.. రొమాన్స్ లేదా హనీట్రాప్ తరహా మోసాల బాధితులు ఇబ్బందిగా భావించడం సహజమేనని, కానీ అందుకోసం దర్యాప్తు పారదర్శకతను పక్కనపెట్టలేమని వ్యాఖ్యానించారు.ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని కోర్టు గుర్తించింది. టిండర్ చాట్లు, పూర్తి వాట్సాప్ సంభాషణలు, కాల్ డీటెయిల్ రికార్డులు వంటి కీలక ఆధారాలు ఇంకా సేకరించలేదని పేర్కొంది. నిందితుడు కూడా తన మొబైల్ను పూర్తిగా పరిశీలనకు ఇవ్వకుండా, తనకు అనుకూలమైన కొన్ని సందేశాలు మాత్రమే సమర్పించాడని కోర్టు వ్యాఖ్యానించింది.దీంతో నిందితుడి ప్రవర్తనను "దాగుడుమూతల ఆట"గా అభివర్ణించిన కోర్టు.. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. టిండర్, వాట్సాప్ రికార్డులను పూర్తిగా సేకరించాలని, డబ్బు బదిలీల వెనుక ఉన్న ఖాతాలు, సంస్థలను పరిశీలించాలని, నిందితుడి ఫోన్పై ఫోరెన్సిక్ విశ్లేషణను వేగవంతం చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది.డేటింగ్ యాప్లో మొదలైన ఈ పరిచయం.. ప్రేమ, పెట్టుబడులు, నమ్మకం పేరుతో సాగి.. చివరకు రూ.52 లక్షల మోసం, ఫిర్యాదు చుట్టూ కొత్త ప్రశ్నలు, కోర్టు వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ప్రియుడి ఘరానా మోసం.. అప్పటికే కన్నతల్లి ఘాతుకం!
కట్టుకున్న భర్తను, కన్నబిడ్డలను వదిలి ప్రియుడితో కొత్త జీవితం ప్రారంభించాలని భావించిన ఓ మహిళ.. చివరకు ఊహించని రీతిలో జైలు పాలైంది. తన సహజీవనానికి అడ్డుగా ఉందనే అనుమానంతో ఆరేళ్ల చిన్నారిని హత్య చేయడమే కాదు.. ప్రియుడి మాయమాటలకు నమ్మి జీవితాన్నే నాశనం చేసుకుంది. బెంగళూరులో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంక దంపతులకు 2007లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ విద్యాసంస్థ నిర్వహిస్తుండగా, ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2025 చివర్లో కుటుంబానికి చెందిన 25 ఎకరాల భూమి వివాదానికి సంబంధించిన కేసు పనిమీద బెంగళూరు వెళ్లిన ప్రియాంక.. కాలేజీ రోజుల స్నేహితుడు, ఒకప్పుడు ప్రేమించిన మోహన్ను మళ్లీ కలిసింది.తాను రూ.1,000 కోట్ల ఆస్తులున్న రియల్ ఎస్టేట్ వ్యాపారినని మోహన్ నమ్మబలికాడు. అంత ఆస్తి ఉందని చెప్పడంతో ఆమె అతనికి ఆకర్షితురాలైంది. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన తర్వాత భర్త ప్రవీణ్పై విడాకుల కోసం ఒత్తిడి తెచ్చిన ప్రియాంక.. చివరకు ఇంటిని విడిచి వెళ్లిపోయింది.విడిపోయిన తర్వాత పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉండగా, చిన్నారి వెన్నెల మాత్రం ప్రియాంకతో కలిసి బెంగళూరులోని సీగేహళ్లిలో అద్దె విల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో మార్చి 24న వెన్నెల పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. బిర్యానీ, ఐస్క్రీం తినిపించిన తర్వాత చిన్నారిని కారులోనే వదిలేసి ప్రియుడు మోహన్తో కలిసి కాఫీ షాప్కు వెళ్లినట్లు చెప్పింది. మరుసటి రోజు వెన్నెల నిద్రలేవకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అనారోగ్యంతో చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులకు చెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే బిడ్డ మృతిపై అనుమానంతో ప్రవీణ్ పోస్ట్మార్టం నివేదికను పరిశీలించాడు. ఆ నివేదికను విదేశాల్లో పనిచేస్తున్న తన డాక్టర్ సోదరికి చూపించగా, అందులో అనేక లోపాలు ఉన్నాయని ఆమె గుర్తించింది. దీంతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు.దర్యాప్తులో వెన్నెలది సహజ మరణం కాదని, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమ భవిష్యత్తుకు చిన్నారి అడ్డుగా మారిందనే కారణంతో ప్రియాంక, మోహన్ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్ను అరెస్టు చేశారు. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రియాంకను గురువారం హాసన్లో అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రియాంక, మోహన్లు కాశీలో రహస్యంగా వివాహం చేసుకున్నారట. ఆ తర్వాత దుబాయ్లో నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకున్నారని తెలుస్తోంది. వెన్నెల కేసు దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. తాను కోటీశ్వరుడినని చెప్పిన మోహన్ వాస్తవానికి పెద్ద వ్యాపారి కాదని, అద్దె ఇళ్ల బ్రోకర్గా పనిచేస్తున్నాడని తేలింది. అతని మాటలు నమ్మి కుటుంబాన్ని వదిలేసిన ప్రియాంక.. చివరకు కన్నకూతురి హత్య కేసులో నిందితురాలిగా కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. -
ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని మరో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.తుగ్లకాబాద్లోని మాధ్యమ్ మార్గ్, నయా తారా అపార్ట్మెంట్ సమీపంలోని ఓ ఐదంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం లోపల పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.అర్ధరాత్రి 2.35 గంటల నుంచి 2.37 గంటల మధ్య అగ్నిమాపక శాఖకు ప్రమాదంపై సమాచారం అందింది. మూడు ఫైర్ టెండర్లు, రెండు వాటర్ బౌజర్లు, శ్వాస సహాయక యూనిట్, క్విక్ రెస్పాన్స్ వాహనాలను రంగంలోకి దించారు. అనంతరం పరిస్థితి తీవ్రత దృష్ట్యా అదనపు అగ్నిమాపక వాహనాలను కూడా పంపించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది గాయపడిన వారిని ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.Delhi: A fire broke out in a multi-storey building in Tughlakabad Extension during the early hours of the day. The blaze reportedly started in the ground-floor parking area, where 7–8 motorcycles and scooters caught fire, before spreading through the building. The fire department… pic.twitter.com/rHgTcXvG8T— IANS (@ians_india) June 12, 2026అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనం లోపల పార్క్ చేసిన వాహనాల వద్ద నుంచి మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం 3.45 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగా, నాలుగు గంటలకు అగ్నిమాపక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.ఇటీవలి కాలంలో ఢిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న భవన ప్రమాదాలు, అగ్నిప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. గత నెలలో మాలవీయనగర్లో మూడు అంతస్తుల వాణిజ్య భవనం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందగా, జూన్ 3న హౌజ్రాణిలోని ఐదు అంతస్తుల బిల్డింగ్లో జరిగిన అగ్నిప్రమాదంలో విదేశీయులతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో.. జూన్ 5 నుంచి 10 దాకా 607 ప్రదేశాలను అధికారులు తనిఖీ చేయగా, గురువారం ఒక్కరోజే మరో 47 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో మొత్తం తనిఖీ చేసిన ప్రదేశాల సంఖ్య 654కు చేరింది. ఇదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు ఆరు భవనాలను సీజ్ చేసింది. అలాగే 61 షోకాజ్ నోటీసులు, 8 సీలింగ్ నోటీసులు, 16 కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుంచి 11 వరకు మొత్తం 179 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, 206 భవనాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు, అగ్నిమాపక నిబంధనల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
రూ.5 వేల కోట్ల స్కామ్కు స్కెచ్!
సాక్షి, హైదరాబాద్: గోల్డ్క్వెస్ట్, క్వెస్ట్నెస్ట్, క్యూనెట్–విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో దేశ వ్యాప్తంగా 25 ఏళ్లు మల్టీ లెవల్ మార్కెటింగ్ దందా చేసి, లక్షల మంది నుంచి రూ.వేల కోట్లు కాజేసిన సంస్థ ఈసారి ఇగ్నైట్ పేరుతో వచ్చింది. చండీగఢ్లోని ఆర్వోసీ (రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్)లో ‘ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గత నెల 18న రిజిస్టర్ చేసుకుని, డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో రూ.5 వేల కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా కుట్ర పన్నింది.ఇది రిజిస్టరైన 18 రోజులకే మూలాలు కనిపెట్టిన హైదరాబాద్ పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో దాడులు చేసి ఆరుగురు కీలక నిందితు లను అరెస్టు చేసినట్లు కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనార్ తెలిపారు. అదనపు, సంయుక్త సీపీలు ఎం.శ్రీనివాసులు, ఎస్.చైతన్యకుమార్, ఎస్ఎం విజయ్కుమార్లతో కలిసి తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. హాంగ్కాంగ్ కేంద్రంగా..ఇగ్నైట్ హాంగ్కాంగ్ కేంద్రంగా నడుస్తోంది. దీని వ్యవస్థాపకుడు తమిళనాడు గోల్డ్క్వెస్ట్ కేసులో ప్రధాన నిందితుడు, ఇగ్నైట్ మేనేజింగ్ డైరెక్టర్ అడ్లీ హసన్ గతంలో క్యూనెట్ సంస్థ తరఫున పని చేశాడు. ఇందులో పని చేస్తున్న వాళ్లూ క్యూనెట్కు సంబంధించిన వాళ్లే. కంపెనీ అధికారికంగా రిజిస్టర్ కావడానికి తొమ్మిది రోజుల ముందే దాని వెబ్సైట్ డొమైన్లో రిజిస్టరైంది. ఈ సంస్థ చర్మాన్ని బిగుతుగా మార్చి యవ్వనంగా కనిపించేలా చేస్తుందని చెప్పే ‘సిమెట్రా’ అనే అయస్కాంత పెన్, శరీరంలో శక్తిని సమతుల్యం చేస్తుందని నమ్మించే ‘యాక్టివా’ అనే చతురస్రాకార గాజు ముక్క, భారతీయ రిటైల్ మార్కెట్లో రూ.600 కంటే తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ టూత్బ్రష్ ’బ్రష్–ఓ’లను విక్రయిస్తోంది. గరిష్టంగా రూ.వెయ్యి ఉండే వీటిని 680 అమెరికన్ డాలర్లకు (సుమారు రూ.60 వేలు) విక్రయిస్తున్నారు. తమ సంస్థలో చేరాలంటూ ఆన్లైన్లో ప్రచారం చేస్తున్న ఇగ్నైట్ జూమ్ మీటింగ్ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తోంది. నగరవాసుల ఫిర్యాదుతో..ఇగ్నైట్ మాటలు నమ్మి రూ.1.87 లక్షలు మోసపోయిన ముగ్గురు పంజగుట్ట, ఎస్సార్నగర్, కాచిగూడల్లో ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిలో ఒకరిని ఆఫ్రికాకు చెందిన వాట్సాప్ నంబర్ ద్వారా, మరొకరిని జూమ్ ప్రెజెంటేషన్, ఇంకొకరిని హైదరాబాద్ సెంట్రల్ మాల్లో ముఖాముఖిగా కలిసి నమ్మించారు. ముగ్గురు చెల్లించిన డబ్బు మాత్రం ఒకే బ్యాంకు ఖాతాలోకి వెళ్లింది. కోల్కతాలోని భవానీపూర్ శాఖకు చెందిన ‘పారస్నాథ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్’కు చేరింది. అలా వచ్చిన సొమ్ము అట్నుంచి బెంగళూరుకు చెందిన జ్ఞానేష్ పీఎన్ అనే వ్యక్తికి, ఆపై ఢిల్లీ, చండీగఢ్లకు బదిలీ అవుతోందని గుర్తించారు. అక్కడ నుంచి హవాలా మార్గంలో మలేసియాకు తరలించి, ఆపై ఆఫ్రికా ద్వారా ఈ నిధులను యూఎస్డీటీ క్రిప్టో కరెన్సీ రూపంలోకి మారుస్తున్నారు. చివరగా ఏడో దశలో ఈ సొమ్ము హాంగ్కాంగ్లోని ఇగ్నైట్ ప్రధాన నిర్వాహకుల ఈ–వాలెట్కు చేరుకుంటోంది.ఇది వ్యవస్థీకృత నేరమని నిర్థారించిన పోలీసులు ఈ మూడు కేసుల్నీ సీసీఎస్కు బదిలీ చేశారు. ఏసీపీలు నర్సింహారెడ్డి, హరీశ్ లోతుగా దర్యాప్తు చేసి కేరళ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో సిబ్బందితో దాడులు చేశారు. ఒనియల్ గుప్తా (ఇగ్నైట్ టీమ్ లీడర్ / రిక్రూటర్), దినేశ్ కుమార్ సాహిల్ (డైరెక్టర్), ప్రియాన్షు సక్సేనా (డైరెక్టర్), ప్రవీణ్ కుమార్ దకాలియా (డైరెక్టర్), పరితోష్ కుమార్ దకాలియా (డైరెక్టర్), రియాజ్ (ఫీల్డ్ రిక్రూటర్)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఫేస్బుక్లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
మేడిపల్లి: వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ మహిళతో సహజీవనం చేసి, ఆపై రూ.40 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం తీసుకొని మోసం చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. బోడుప్పల్ ఉదయ్ నగర్కు చెందిన ఒక మహి భర్తతో విభేదాల కారణంగా కొన్నేళ్లుగా వేరుగా నివసిస్తోంది.2019లో ఫేస్బుక్ ద్వారా అస్సాంలో విధులు నిర్వహిస్తున్న షేక్ మహబూబ్ హుస్సేన్ పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె అతనితో కలిసి బోడుప్పల్లో సహజీవనం చేసింది. అయితే, గత ఏడాది కాలంగా మహబూబ్ హుస్సేన్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు బాధితురాలు గుర్తించింది.ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. పెళ్లి పేరుతో తన వద్ద నుండి రూ.40 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. నిందితుడి కుటుంబ న్యాయవాది కూడా తనకు పలుమార్లు ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రూ. 954 కోట్ల స్కాం :భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్
సుమారు రూ. 954 కోట్లకు పైగా కుంభకోణ ఆరోపణలతో 44 ఏళ్ల భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అమెరికాలో అరెస్టు చేశారు. బుధవారం ఉదయం న్యూపోర్ట్ బీచ్లోని అతని విలాసవంతమైన భవనంలో అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే అతనికి గరిష్టంగా 30 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మఖిజాని తన కంపెనీ (క్యాంటర్ గ్రూప్ V LLC) ద్వారా రియల్ ఎస్టేట్ లోన్ల కోసం తాకట్టు పెట్టిన ఆస్తుల విలువను పెంచి చూపారు. టైటిల్ ఇన్సూరెన్స్ పాలసీలను ఫోర్జరీ చేసి, మెటాడేటాను మార్చడం ద్వారా అసలు అప్పులను దాచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.కరోనా డెల్ మార్లో నివసిస్తున్నగ్రీన్ కార్డ్ హోల్డర్ మహేందర్ మఖిజానిని, ఒక బ్యాంకును దాదాపు 100 మిలియన్ డాలర్ల మేర మోసం చేసినట్లు వచ్చిన ఫెడరల్ క్రిమినల్ ఫిర్యాదు ఆధారంగా బుధవారం ఉదయం అరెస్ట్ చేశామని సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా ఫస్ట్ అసిస్టెంట్ యూఎస్ అటార్నీ బిలాల్ ఎస్సాయిలీ తెలిపారు. తమ స్పెషల్ ఏజెంట్లు వివిధ ఖాతాల ద్వారా జరిగిన నిధుల బదిలీలను నిశితంగా పరిశీలించి, ఈ భారీ కుంభకోణాన్ని ఛేదించారు. సొంత లాభం కోసం పత్రాలను తారుమారు చేసి, ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేసే వారిని వదిలిపెట్టేది లేదు. నిజాలను వెలికితీసి, చట్టానికి అప్పగిస్తామన్నారు.Mahender Makhijani, 44, a lawful permanent resident from India living in Corona del Mar, was arrested this morning on a federal criminal complaint charging him with defrauding a bank out of nearly $100 million.Makhijani controlled Cantor Group V LLC, a Newport Beach-based… pic.twitter.com/wEcSe5mQpW— F.A. United States Attorney Bill Essayli (@USAttyEssayli) June 10, 2026ఐఆర్ఎస్ ప్రకారం మఖిజాని టైటిల్ ఇన్సూరెన్స్ రికార్డులను తప్పుగా సృష్టించాడు,నిజమైన తాకట్టు స్థానాలను దాచిపెట్టాడు. ఫెడరల్ ఇన్సూరెన్స్ ఉన్న ఒక బ్యాంకును తప్పుదోవ పట్టించడానికి షెల్ కంపెనీల నెట్వర్క్ను ఉపయోగించాడు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక సంపన్న ప్రాంతంలో హోటళ్లు, ఒక రెస్టారెంట్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి సాయుధ గుండాలను పంపడం, డ్రగ్స్ , సెక్స్ పార్టీలను నిర్వహించడం వంటి తీవ్రమైన ఆరోపణలు కూడా ఇతనిపై ఉన్నాయి. 2024 సెప్టెంబర్- 2025 ఏప్రిల్ 2025 వరకు, మఖిజాని భీమా పత్రాలను ఫోర్జరీ చేసి, తాకట్టు పెట్టిన కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులపై కాంటర్ సంస్థకే మొదటి హక్కు (First Lien Position) ఉన్నట్లు చూపించాడు. ఈ నకిలీ పత్రాలను తన ఉద్యోగి ద్వారా బ్యాంకుకు సమర్పించేలా చేశాడు. అంతేకాకుండా, బ్యాంకు ప్రతినిధులతో ఫోన్ కాల్స్లో మాట్లాడుతూ, బ్యాంకు గుర్తించిన పత్రాల లోపాల గురించి అబద్ధాలు చెప్పి నమ్మించాడు.సెక్స్ వర్కర్లతో ప్రైవేట్ పార్టీలను నిర్వహించేవాడని, ఈ పార్టీలకు కొంతమంది బ్యాంకు ఉద్యోగులు కూడా హాజరయ్యారని కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది. ఆ పార్టీలలో జరిగిన ఉదంతాల ఆధారంగా అతను బ్యాంకు సిబ్బందిని, తన భాగస్వాములను బ్లాక్మెయిల్ చేస్తూ తన నియంత్రణలో ఉంచుకున్నాడు. అంతేకాదు తన కింద పనిచేసే సిబ్బందిని బెదిరిస్తూ, తనకు వ్యతిరేకంగా పనిచేస్తే, చంపేస్తామని, కుటుంబాలను, పిల్లల్ని రోడ్డు పడేస్తానని బెదిరించేవాడు.అలాగే గత నెలలో జరిగిన ఒక మధ్యవర్తిత్వ విచారణలో వ్యాపారవేత్త మొహమ్మద్ హోనార్కర్తో జరిపిన రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మఖిజాని అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. దీనికిగాను సుమారు రూ. 12,391.6 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించడం గమనార్హం. -
హరిణి మృతి.. ఆ రాత్రి ఏం జరిగింది?
శ్రీకాకుళం: లింగాలవలస పంచాయతీ సోర్లిగాం గ్రామానికి చెందిన దుంపల హరిణి(24) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు, పోలీసుల సమాచారం మేరకు.. దుంపల హరిణికి తన మేనమామ వెంకటేశ్వరరావుతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. హరిణి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటోంది. అక్కడ మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ విషయమై కుటుంబ సభ్యులకు, హరిణికి మధ్య గొడవలు జరిగాయి. అయినప్పటికీ వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన బంధువులు హరిణిని గ్రామానికి రప్పించినట్లు తెలిసింది. ఈ క్రమంలో మరోసారి గొడవ జరగడంతో ఈ నెల 1న రాత్రి హరిణి ఆత్మహత్యకు పాల్పడిందంటూ 2వ తేదీ వేకువజామునే రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, హరిణికి కోచింగ్లో పరిచయమైన వ్యక్తి సమాచారం తెలుసుకుని శక్తి టీమ్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వివరాలు సేకరించారు. వీఆర్వో రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. సీన్ రీకన్స్ట్రక్షన్
బంజారాహిల్స్: నగల కోసం ఇంటి యజమానురాలిని దారుణంగా హత్య చేసి పరారైన నేపాలీ గ్యాంగ్లో ఓ కీలక నిందితుడితో పాటు రిసీవర్ను జూబ్లీహిల్స్ పోలీసులు పది రోజల కస్టడీకి తీసుకోగా బుధవారం వీరితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.గత నెల 8వ తేదీన జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో నివసించే విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ ఇంట్లో పనిచేస్తున్న నేపాల్కు చెందిన కల్పన అలియాస్ ధర్మ.. నేపాల్కే చెందిన మరో ఏడు మందిని పిలిపించి నగలు దొంగిలించి ఆయన భార్య తనూజను దారుణంగా హత్య చేసి పరారయ్యారు.నిందితుల్లో ఒకరైన సునీల్ పరియార్ను ముంబాయిలో అరెస్టు చేశారు. ఆభరణాలు కొనుగోలు చేసిన రిసీవర్ దిలీప్ను కూడా అరెస్టు చేశారు. కస్టడీలో భాగంగా వీరిద్దరినీ ప్రశాసన్నగర్లోని తనూజ హత్య చేసిన ఇంటికి తీసుకువచ్చి ఆ రోజు ఏమి జరిగిందో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు.అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పూణె, ముంబాయికి కూడా వెళ్లేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. -
పోలీసులపై గంజాయి స్మగ్లర్ల దాడి
చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చి పోతున్నారు. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లను వెంబడించిన పోలీసులపైనే దాడికి పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. చింతపల్లి మండలంలో గంజాయి స్మగ్లర్లు దాడికి పాల్పడడంతో పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చింతపల్లి మండలం ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు వచ్చి న ముందస్తు సమాచారం మేరకు అన్నవరం పోలీసులు లోతుగెడ్డ వంతెన సమీపంలో రామారావుపాలెం–మేడూరు జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ నిర్వçహించారు. అదే సమయంలో ఏఓబీ సరిహద్దు ప్రాంతం బలపం కోరుకొండ నుంచి రామారావుపాలెం మీదుగా అటుగా వచ్చి న వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లు ఒక్కసారిగా పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలతో పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో స్మగ్లర్లను నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించడంతో మరింత రెచ్చిపోయి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడడంతో అన్నవరం ఎస్ఐ రెండు రౌండ్లు తుపాకీని గాల్లోకి పేల్చారు.తప్పించుకుని పారిపోతున్న నలుగురిని పట్టుకోగా, మరో నలుగురు పారిపోయారు. వారి నుంచి రూ.కోటి విలువైన 290 కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రాజస్థాన్కు చెందిన అర్జున్కుమార్, విశాఖపట్నంకు చెందిన ఇమ్రాన్ఖాన్, మల్కన్జిల్లా(ఒడిశా)కు చెందిన కిసాన్కార్, అల్లూరి జిల్లా బలపం గ్రామానికి చెందిన పాంగి శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. అన్నవరం పోలీసులు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. -
విద్యుత్ తీగలు అమర్చి చంపాలనుకుంది
టేకుమట్ల: కడవరకు నీతోనే ఉంటానని పెళ్లినాటి ప్రమాణాలను మరిచిన ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నానికి పాల్పడింది. విద్యుదాఘాతంతో మృతిచెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో బుధవారం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత, మరో గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, అతన్ని చంపాలనుకుంది. మంగళవారం రాత్రి భర్త పడుకున్న సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. లైట్ ఆఫ్ చేసి, భర్త కాళ్లకు విద్యుత్ తీగలను అమర్చి ఆత్రుతగా స్విచ్ బోర్డ్లో విద్యుత్ సరఫరా లేని ప్లగ్లో పెట్టగా విద్యుత్ సరఫరా కాలేదు. వెంటనే ఇద్దరు కలిసి వేరే ప్లగ్లో పెట్టాలని మాట్లాడుకుంటున్న క్రమంలో భర్తకు మెలకువ వచ్చింది. ఎవరంటూ అరవడంతో ప్రియుడు పరార య్యాడు. వెంటనే లైట్లు ఆన్ చేయగా కాళ్లకు అమర్చిన విద్యుత్ వైర్లు, కరెంటు సరఫరాలేని ప్లగ్లో పెట్టడాన్ని గమనించి గ్రామస్తులకు తెలిపాడు. స్థానిక సర్పంచ్ సదరు మహిళను పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు సమాచారం. -
తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర
నర్మెట (తరిగొప్పుల): నాటు కోడి కూర వివా దం చివరికి తండ్రి ప్రాణం తీసింది. జన గామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జంగిలి రమేష్ (42) నాటుకోడిని తెచ్చి కోస్తా.. కూర వండమని మంగళవారం రాత్రి భార్య అనూషకు తెలి పాడు. ఇప్పటికే చేపల కూర వండాను.. రాత్రి పది దాటింది ఇప్పుడు వద్దు అని భర్తకు నచ్చచెప్పినా వినిపించుకోకుండా బూతులు తిట్టసాగాడు. ఈ క్రమంలో అమ్మను ఎందుకు తిడుతున్నావని కొడుకు గణేశ్ అడ్డుతగిలాడు. కోపంతో కుమారుడిని సైతం బూతులు తిట్టడంతో ఆగ్రహావేశానికిలోనైన గణేష్ పక్కనే ఉన్న రోకలిబండతో తండ్రి తలపై బాదాడు. తీవ్ర గాయమవడంతో స్థానికులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. రమేష్ సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గుగులోతు శ్రీదేవి తెలిపారు. -
దేవికా నం.1.. మోహన్ నం.2
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) జరుప్ల మోహన్ నాయక్ స్థిరచరాస్తుల డాక్యుమెంట్ విలువ రూ.17.94 కోట్లుగా తేలింది. దీంతో ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ‘అవినీతి అనకొండ’గా మోహన్ నాయక్ రికార్డులకెక్కారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికారాణి ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నారు. థర్డ్ శివబాలకృష్ణ..ఫోర్త్ కిషన్ ఈఎస్ఐ మందుల సరఫరా కుంభకోణంలో 2019లో అరెస్టు అయిన దేవికారాణి నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.25,70,84,461గా తేలగా.. మోహన్ నాయక్ రూ.17,94,62,617తో రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ పది నుంచి ఇరవై రెట్లు అధికంగా ఉంటుంది. 2024 జనవరిలో చిక్కిన హెచ్ఎండీఏ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రూ.13.3 కోట్లతో మూడో స్థానంలో, మహబూబ్నగర్ మాజీ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ కిషన్ రూ.12.72 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ‘లంచాల’కోసం ఏడాదికి 30 లక్షలు ఎవరైనా బాధితులు ఓ అధికారి లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే..రహస్య కెమెరాలు, వీడియో రికార్డింగ్ పరికరాలను బాధితుడికి అమర్చి అధికారి వద్దకు పంపి రికార్డు చేయిస్తారు. డిమాండ్ చేసిన మొత్తంలో కొంత ఇన్స్టాల్మెంట్గా ఇస్తానంటూ చెప్పిస్తారు. ఆ మొత్తాన్ని ఫిర్యాదుదారుడే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తం అందుకుంటున్న అధికారిని అప్పటికే మాటు వేసి ఉండే ఏసీబీ బృందాలు పట్టుకుంటాయి. డబ్బును సీజ్ చేసి కోర్టుకు సమరి్పస్తారు. ఆ మొత్తం కేసు తేలేవరకు కోర్టు అ«దీనంలోనే ఉంటుంది. అయితే ఈలోగానే నిర్ణీత సమయంలో డబ్బును ఫిర్యాదుదారుడికి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. దీనికోసం ఏడాదికి రూ.30 లక్షల చొప్పున ఏసీబీకి కేటాయిస్తుంది. వాస్తవానికి ‘రెడ్’కాదు ‘పింక్’ లంచగొండుల్ని ఏసీబీ ట్రాప్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని అంటారు. అయితే వాస్తవానికి ఇది ‘పింక్’హ్యాండెడ్గా పట్టుకోవడం. ఫిర్యాదుదారుడు తీసుకువచ్చిన మొత్తానికి ఏసీబీ అధికారులు ఫినాఫ్తలీన్ అనే రసాయన పొడిని పూస్తారు. లంచం తీసుకునే అధికారి లేదా ఆయన సూచించిన వ్యక్తి ఆ నోట్ల కట్టలు కచ్చితంగా చేత్తో పట్టుకుని ఉండాలి. అలా ముట్టుకున్నప్పుడు ఈ రసాయనం అంటుకుంటుంది. తర్వాత దాడి చేసి పట్టుకునే ఏసీబీ అధికారులు సదరు మొత్తాన్ని స్వాదీనం చేసుకోవడంతో పాటు ఆ అధికారి చేతుల్ని సోడియం బైకార్పొనేట్ ద్రావణంలో ముంచేలా చేస్తారు. అప్పుడు ఆ ద్రావణం పింక్ రంగులోకి మారుతుంది. (ఈ ప్రక్రియ రెడ్హ్యాండెడ్గా వాడుకలోకి వచ్చింది) తద్వారా లంచం తీసుకున్నట్టుగా నిర్ధారిస్తారు. దీన్ని వీడియో రికార్డింగ్ చేశాక అధికారులు న్యాయస్థానానికి సమర్పిస్తారు. గణనీయంగా పెరిగిన కేసులు.. ఏసీబీ అధికారులు మొత్తం 4 రకాలైన ఆపరేషన్లు చేపడతారు. లంచం తీసుకునే వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం (ట్రాప్), ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండటం (అసెట్స్) వ్యవహారాలే మనకు ఎక్కువగా తెలుసు. వీటిని రిజిస్టర్డ్ కేస్ ట్రాప్ (ఆర్సీటీ), రిజిస్టర్డ్ కేస్ అసెట్స్ (ఆర్సీఏ) అంటారు. అలాగే చెక్పోస్టులు, కార్యాలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు (ఎస్సీగా పిలిచే సర్ప్రైజ్ చెక్స్) ద్వారా గుర్తించే అవినీతిపై రిజిస్టర్డ్ కేస్ అదర్స్ (ఆర్సీఓ) నమోదు చేస్తారు. కాగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది (మంగళవారం వరకు) ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ఇలావుండగా మోహన్ నాయక్ను అధికారులు బుధవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించారు. అయితే తదుపరి విచారణ కోసం మోహన్ నాయక్ కస్టడీ కోరుతూ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
భర్తను అలా చూసి కారు బోనెట్పైకి భార్య చివరికి.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో గుండె ఝల్లుమనే ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతనిపై నిఘాపెట్టింది. ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూసిన ఆమె వాహనాన్ని ఆపే ప్రయత్నంలో వేగంగా దూసుకెళ్తున్న కారు బోనెట్మీదకు లంఘించింది. ఈ ఘటన భమోరా పరిధిలోని దేవ్చరా చౌరహా (కూడలి) వద్ద శనివారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ఆమె బోనెట్పై వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గోదావరి (38) , నేత్రపాల్ సింగ్ ఇద్దరూ భార్యాభర్తలు. తన భర్త వేరే మహిళతో కలిసి కారులో ప్రయాణించడం చూసి, అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆపకుండా,మరింత వేగం పెంచడంతో, బోనెట్పై దూకేసింది. ఆమె బోనెట్పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా 100 మీటర్ల దూరం లాక్కెళ్లిన వైనం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మొత్తానికి అడ్డుకుని, ఆమెను సురక్షితంగా కిందకు దించారు. కారు ముందుకు దూసుకెళ్తుంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మహిళ బోనెట్ను గట్టిగా పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపించాయి. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్High drama unfolds in #Bareilly as wife catches husband with alleged girlfriend in a vehicle. She climbs onto car bonnet; gets dragged for nearly 100 meters. FIR Filed @uppolice @timesofindia pic.twitter.com/prKxvw3YvB— Sandeep Rai (@RaiSandeepTOI) June 9, 2026 భమోరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గోదావరి తన భర్త నేత్రపాల్ సింగ్కు సాధన అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. ఈ విషయంపై తాను భర్తను ప్రశ్నించినప్పుడల్లా ఆయన తనను తిడుతూ, శారీరకంగా హింసించేవాడని ఆమె తెలిపింది. ఇద్దరూ కారులో వెడుతుండగా, వారిని ఆపడానికే తాను అలా చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.తాను బోనెట్పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఈ ఘర్షణలో సాధన తనపై దాడి చేసి, తన మెడలోని బంగారు గొలుసును లాక్కుని అక్కడి నుంచి పారిపోయిందని గోదావరి తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఈ రసాభాసలో తన మామయ్య వాహనం కూడా దెబ్బతిన్నట్లు చెప్పింది.అయితే, సాధన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తాను బ్లాక్ ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా నేత్రపాల్ కారులో కేవలం లిఫ్ట్ మాత్రమే తీసుకున్నానని, గోదావరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించింది. పైగా ఈ ఘటనలో తనపైనే దాడి జరిగిందని ఆమె ఆరోపించింది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తభమోరా ఎస్హెచ్ఓ (SHO) పవన్ కుమార్ స్పందిస్తూ, నేత్రపాల్ సింగ్, సాధనలపై ర్యాష్ డ్రైవింగ్, దాడి, ఉద్దేశపూర్వ దాడి లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: హాట్ టాపిక్గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా -
లేడీ డాన్ నీతూభాయ్.. కిరాణా షాపు మాటున..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. కిరాణా షాపు మాటున నీతూ భాయ్ గంజాయి అమ్ముతోంది. గంజాయి కోసం ఆమె ఇంటికి ఐటీ ఉద్యోగులు క్యూకట్టారు. 27 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పట్టుబడ్డారు. గతంలోనే నీతూ భాయ్ను అరెస్ట్ చేసిన అధికారులు పీడీ యాక్ట్ పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన నీతూభాయ్ మళ్లి అదే గంజాయి దందా కొనసాగిస్తోంది.రోజుకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు గంజాయి అమ్మకం సాగిస్తున్నట్లు సమాచారం. నానక్రాంగూడలో గంజాయి డాన్ నీతూ భాయ్ కోసం నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్.. గంట వ్యవధిలో 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారంతో నీతూ భాయ్ పరారైంది. -
భార్య, కుమారున్ని హతమార్చి..
కర్ణాటక: కుటుంబాన్ని ప్రాణంలా కాపాడుకోవాల్సిన ఇంటి పెద్ద హంతకుడయ్యాడు. భార్య, కుమారున్ని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మండ్య నగరంలో దుస్తుల వ్యాపారి ఒకరు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. వ్యాపారి ప్రభాకర్ (65), భార్య జ్యోతి (55), కుమారుడు సంతోష్ (30) మృతులు. ఏం జరిగిందంటే.. వివరాలు.. నెహ్రూ నగరలో ప్రభాకర్కు క్లాత్ స్టోర్ ఉంది. కుటుంబ నిర్వహణ, వ్యాపారం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో సోమవారం రాత్రి భోజనం చేసి పడుకున్నాక.. భార్య జ్యోతి గొంతుకు చీర బిగించి చంపబోయాడు. ఆ శబ్ధాలకు మరో గదిలో ఉన్న కుమారుడు సంతోష్ వచ్చాడు. అయినప్పటికీ ప్రభాకర్ భార్యను హతమార్చి, ఆపై కుమారున్ని కూడా అదే మాదిరిగా ప్రాణాలు తీశాడు. పక్క గదిలో నిద్రిస్తున్న కోడలికి ఇదేమీ తెలియదు. తరువాత తన బట్టల అంగడికి వచ్చి ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కోడలు నిద్రలేచి అత్త వద్దకు వెళ్లగా ఘోరం బయటపడింది. తూర్పు పోలీసు స్టేషన్ సిబ్బంది, మండ్య ఎస్పీ శోభారాణి చేరుకుని పరిశీలించారు. పాపం.. కొత్త కోడలు ఈ ఘటనలో మరో విషాదం ఏమిటంటే.. నెల రోజుల క్రితమే సంతోష్కు ఘనంగా పెళ్లి చేయడం. అతని భార్య జీవితం కూడా ఛిన్నాభిన్నమైంది. రాత్రి తన గదినుంచి భర్త బయటకు వెళ్లిన సంగతి ఆమెకు తెలియరాలేదు. ఫ్యాన్ శబ్దం ఎక్కువగా ఉండడం వల్ల ఏ చప్పుళ్లు వినిపించలేదని ఆమె తెలిపింది. డెత్నోట్లో.. వ్యాపారంలో నష్టాలు, అప్పుల వల్ల విరక్తికి గురై ప్రభాకర్ భార్య, కొడుకును చంపేశారని ఎస్పీ శోభ తెలిపారు. ప్రభాకర్ డెత్నోట్ లభించిందని తెలిపారు. ఇంటి రుణం, నష్టాలు, ఉచిత బస్సు పథకం వల్ల తమకు వ్యాపారం బాగా తగ్గిపోయిందని లేఖలో రాశారన్నారు. -
విశాఖ ప్రమాదం: పైడిరాజు కన్నుమూత
కంటతడి పెట్టిస్తున్న ఆ వీడియో ఇప్పుడు ఒక కుటుంబానికి మాత్రమే కాదు.. మొత్తం సమాజానికి గుండె బరువెక్కే జ్ఞాపకంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు పైడిరాజు, ప్రాణాల కోసం పోరాడుతూ తన కుటుంబానికి చివరిసారిగా చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. అయితే మృత్యువుతో జరిగిన పోరాటంలో చివరకు ఆయన ఓడారు.సాక్షి, విశాఖపట్నం: “వర్మా… తమ్ముడి మీద ఎప్పుడూ చిరాకు పడకే. తమ్ముడిని బాగా చదివించురా… నువ్వు కూడా బాగా చదువుకోమ్మా… అమ్మని బాగా చూసుకోండి… ఉంటాను డాడీ” అంటూ ఆయన చెప్పిన మాటలు వీడియో రూపంలో వైరల్ అయ్యాయి. ఆ మాటలతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒంటినిండా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ క్షణాల్లోనే, భవిష్యత్తుపై భయంతో ఆయన తన పిల్లలకు జాగ్రత్తలు చెప్పిన తీరు ఇటు మీడియాలో, అటు నెట్టింట వైరల్ అయ్యింది.అయితే బతుకుతారేమోనన్న ఆశలు ఎక్కువసేపు నిలవలేదు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పైడిరాజు మృతి చెందారు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రాణాలతో పోరాడుతూనే, తన కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించిన ఆ తండ్రి మాటలు ఇప్పుడు అందరి గుండెల్లో నిలిచిపోయాయి.కూటమి రాజకీయం!విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో కూటమి సర్కార్ కుట్ర రాజకీయాలకు తెర తీసింది. కేజీహెచ్ నుంచి పైడి రాజు మృతదేహాన్ని ఆగమేఘాల మీద తరలించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శకు వస్తున్నారని తెలిసి.. హడావిడిగా బంధవులకు అప్పగించారు అధికారులు. మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లాలని.. త్వరగా అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు ఒత్తిళ్లు చేసినట్లు సమాచారం. నిన్న మృతదేహాలకు 12గంటలకు పైగా సమయం తీసుకున్న పోలీసులు ఇవాళ గంటలోనే పైడి రాజు మృతదేహాన్ని తరలించడం గమనార్హం. -
పిల్లల సమాచారం.. సోషల్గా వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘నా బిడ్డ స్కూల్లో ఫస్ట్ వచ్చింది’, ‘ఇవాళ నా కుమారుడి పుట్టినరోజు.. ‘మా పాప అక్షరాభ్యాసం చేయించాం’, ‘మా పిల్లలను ఫలానా స్కూల్లో చేర్పించాం..’ అంటూ పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పంచుకోవడం ఇప్పటి తరం తల్లిదండ్రులకు సాధారణమైంది.అయితే ఈ చర్యలే పిల్లలను సైబర్ నేరగాళ్ల బారిన పడేలా చేస్తున్నాయని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఆన్లైన్ భద్రతపై స్కూళ్లు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సైతం సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతికి ఒక స్కూల్ వార్షికోత్సవంలో తీసిన ఫొటోలో విద్యార్థి పేరు, స్కూల్ లోగో, తరగతి వివరాలు కనిపిస్తే, సోషల్ మీడియా ద్వారా ఆ బాలుడి పూర్తి డిజిటల్ ప్రొఫైల్ను సేకరించడం సైబర్ నేరగాళ్లకు సులభమవుతుందని చెబుతున్నారు.అనంతరం ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకున్నట్లు దేశంలోని సైబర్ భద్రతా సంస్థలు పలుమార్లు హెచ్చరించాయి.ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ వివరాలు ఇతరులకు కనిపించకుండా ప్రైవేటు సెట్టింగ్లు పెట్టుకోవాలి.లొకేషన్ ట్యాగ్లను నిలిపివేయాలి. సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగ్స్ను కఠినంగా అమలు చేయాలి.పిల్లలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలి. -
రెండో భార్యపై అనుమానం.. మల్కాజ్గిరిలో దారుణం
సాక్షి, హైదరాబాద్/మేడ్చల్: మల్కాజ్గిరిలో కాల్పుల కలకలం రేగింది. మూడు నెలల క్రితం భార్యను హత్య చేసేందుకు స్కెచ్ పోలీసులకు చిక్కిన ఓ భర్త.. చివరకు తన పథకాన్ని అమలు చేశాడు. మరో వ్యక్తి సాయంతో తన రెండో భార్యను తుపాకీతో కాల్చి హతమార్చాడు. బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం, మల్కాజ్గిరి మారుతీనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ్కుమార్కు మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. విడాకులిచ్చి ఆమె సోదరిని మరో వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయని అరుణ్ అనుమానాలు పెంచుకోసాగాడు. ఈ కారణంగా దంపతుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకోవడంతో.. ఆమె దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. దీంతో.. భార్యను ఎలాగైనా అంతం చేయాలనే ఉద్దేశంతో అరుణ్ ముందుగానే హత్య ప్రణాళిక రూపొందించాడు. ఈ ఏడాది మార్చిలోనే బిహార్ నుంచి అక్రమంగా దేశవాళీ తుపాకీ, బుల్లెట్లు తెప్పించుకుని భార్యను చంపేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు, తుపాకీ పేల్చడంపై ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే పక్కా సమాచారంతో చార్మినార్ టాస్క్ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అరుణ్ హత్యాయత్నం విఫలమై వార్తల్లోకి ఎక్కింది.ఆయుధ చట్టం కేసుతో కటకటాల పాలైన అరుణ్.. బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే ఆ తర్వాత కూడా అతడి ఆలోచన మారలేదు. ఈ తెల్లవారుజామున మాట్లాడుకుందామని భార్యను బయటకు పిలిచిన అరుణ్, మరో వ్యక్తితో కలిసి ఆమెపై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లతో కాల్పులు జరపడంతో.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పుల అనంతరం నిందితులు పరారయ్యారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. పాతబస్తీలోని తన స్నేహితుల ద్వారా అరుణ్ తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులకు లీడ్ దొరికింది. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. -
స్నేహితుడే చితకబాది.. చనిపోయాడనుకుని తొట్లో వేసి..
ముండ్లమూరు: స్నేహితుడే చితకబాది చనిపోయాడనుకుని తొట్లో వేసి వెళ్లాడు. తీవ్రగాయాలతో బతికిబయటపడిన బాధితుడు ఆస్పత్రికి చేరాడు. ముండ్లమూరు మండలంలోని సుంకరవారిపాలెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. చిట్టిబోయిన వెంకట్రావు, చిట్టిబోయిన రామబ్రహ్మం స్నేహితులు, బంధువులు కూడా.వారి మధ్య ఏం జరిగిందో ఏమోగానీ.. సుంకరవారిపాలెంలోని తన ఇంట్లో వెంకట్రావు ఉండగా, స్నేహితుడు రామబ్రహ్మం మోటార్ సైకిల్పై వచ్చి నీతో పని ఉంది అంటూ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తీసుకెళ్లాడు. సుమారు ఐదు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి నాయుడుపాలెం పొలాల్లోని ఎత్తిపోతల పథకం వద్ద మద్యం సేవించారు.అనంతరం ఇద్దరూ అద్దంకి వెళ్లి పొద్దుపోయిన తర్వాత నాయుడుపాలెం పొలాల్లోనే ట్యాంకు దగ్గరకు వచ్చారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ.. రామబ్రహ్మం రాయితో వెంకటరావుపై తీవ్రంగా దాడి చేశాడు. చనిపోయాడనుకుని నీటి తొట్టిలో పడేసి వెళ్లిపోయాడు. తెల్లవారేసరికి తీవ్ర గాయాలతో ఉన్న వెంకట్రావుకు మెలకువ వచ్చింది. పూరిమెట్ల వైపు ఒక పశువుల షెడ్డు దగ్గరకి అతి కష్టం మీద వెళ్లి అక్కడున్న వారికి విషయం చెప్పి తన బంధువులకు సమాచారం ఇచ్చాడు.తీవ్రంగా గాయపడిన వెంకట్రావును బంధువులు వెళ్లి చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్కి అతన్ని తరలించారు. దాడి జరిగిన విషయం అద్దంకి పోలీసులకు తెలియజేయగా, కేసు నమోదు చేసి ముండ్లమూరు పోలీసులకు పంపారు. వారి మధ్య ఏం జరిగిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
గుండెపోటుతో విద్యార్థి మృతి!
గుత్తి: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు విగతజీవిగా పడి ఉండడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ‘నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు. మీరంతా అబద్ధాలు చెబుతున్నారు’ అంటూ తడారిన గుండెతో ఆమె మాట్లాడిన మాటలతో అక్కడున్న వారందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘యా అల్లా.. ఎంత పనిచేశావయ్యా’ అంటూ చూసిన వారందరూ కంటతడి పెట్టుకున్నారు.గుండెపోటుతో 7వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన పట్టణంలో విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి. గుత్తిలోని కటిక బజారులో నివాసముండే జలాల్, హసీనా దంపతులకు ఇద్దరు కుమార్తెల తర్వాత మహమ్మద్ యాసిన్ జన్మించాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఏడో తరగతి పూర్తి చేసుకున్న యాసిన్ (13) 8వ తరగతిలోకి అడుగు పెట్టాల్సి ఉంది.మంగళవారం తెల్లవారుజామున తమ ఇంటి వద్ద ఉన్న బాత్ రూమ్లో కాలు జారి కింద పడిన యాసిన్ను వెంటనే తల్లిదండ్రులు అనంతపురం తీసుకెళ్లగా.. కాసేపటికే మృతి చెందాడు. గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిన్నటి దాకా ఎంతో ఆనందంగా తమ ముందు తిరిగిన యాసిన్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
తండ్రి కళ్లెదుటే ముగ్గురు కొడుకులు మృతి..
భైంసా/బాసర: తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు మంగళవారం నిర్మల్ జిల్లా బాసరకు వచ్చిన ఓ కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు.. పుణ్యస్నానాల కోసం గోదావరిలో దిగి గల్లంతై మృత్యువాతపడ్డారు. హైదరాబాద్లోని కాచిగూడ చెప్పల్ బజార్ ప్రాంతంలో నివసించే నీలి నాగభూషణ్కు నీలి చంద్రశేఖర్ (38), రాంచందర్ (36), మల్లేశ్కుమార్ (31) కుమారులు ఉన్నారు.రెండో కుమారుడైన రాంచందర్–అశ్విని దంపతుల కుమారులు వసంత్ (6), విజయ్ (2)కు అక్షరాభ్యాసం చేయించేందుకు మంగళవారం మధ్యాహ్నం వారంతా బాసర చేరుకున్నారు. అధిక మాసం సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి వెళ్లి అక్షరాభ్యాసాలు చేయించాలని అనుకున్నారు.ఈ క్రమంలో నదిలోకి దిగిన చంద్రశేఖర్, రాంచందర్, మల్లేశ్కుమార్ లోతు ఎక్కువగా ఉన్న చోటుకు వెళ్లారు. అయితే తొలుత ఒకరు నీటిలో మునిగిపోతుండటంతో మిగిలిన ఇద్దరు అతన్ని కాపాడే ప్రయత్నంలో వారు కూడా గల్లంతయ్యారు. దీంతో ఒడ్డుపై ఉన్న మిగిలిన కుటుంబీకులు హాహాకారాలు చేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఈ ఘటనపై అధికారులకు సమాచారం ఇచ్చారు. తొలుత రెస్క్యూ సిబ్బంది సుమారు రెండు గంటలపాటు గాలించినా గల్లంతైన సోదరుల జాడ తెలియలేదు.చివరకు బాసరకు చెందిన గంగపుత్రులు నదిలో గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. కళ్లెదుటే ముగ్గురు కొడుకులు గల్లంతు కావడాన్ని చూసిన తండ్రి నాగభూషణ్ కుప్పకూలిపోగా మిగిలిన కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. మృతదేహాలను సీఐ దీపక్ భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు సోదరులు కాచిగూడ రైల్వేస్టేషన్లో చిరు వ్యాపారం చేసుకొనేవారు. -
బాలికపై అఘాయిత్యం చేసి.. పైనుంచి తోసేసి..
ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కీచకుడి దుర్మార్గం బట్టబయలైంది. వేసవి సెలవుల కోసం తాత ఇంటికి వచ్చిన ఓ 12 ఏళ్ల బాలికపై అతను అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆపై ఆ బాలికను హతమార్చేందుకు ప్రయత్నించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు బాధితురాలు అసలు విషయం చెప్పడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేసే వ్యక్తి కుమార్తె తన భర్తతో గొడవపడి తండ్రి వద్దకు వచ్చి ఉంటోంది. ఆమె కుమార్తె అయిన 12 ఏళ్ల బాలిక కూడా తల్లి, తాత వద్దకు వేసవి సెలవుల్లో వచ్చింది. అదే అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఉంటున్న మహ్మద్ గౌస్ (50) బాలికపై కన్నేశాడు. 15 రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె ఈ విషయాన్ని ఓ ఫ్లాట్లోని మహిళకు చెప్పగా బాలికను ఒంటరిగా బయటకు పంపొద్దని సూచించింది. అదే అదునుగా.. : ఈ నెల 6న గౌస్ భార్య ఇంట్లో లేని వేళ తన ఫ్లాట్ ఉన్న అంతస్తులోకి బాలిక రావడాన్ని గమనించిన గౌస్.. ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని బయటపెడుతుందనే ఉద్దేశంతో ఆమెను హతమార్చేందుకు ఐదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. అనంతరం ఏమీ తెలియని వాడిలా కిందకు వచ్చి బాలిక కళ్లు తిరిగి పడిపోయి ఉంటుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సోమవారం సాయంత్రానికి కాస్త కోలుకున్న బాలిక.. అత్యాచారం, హత్యాయత్నం గురించి తన మేనమామకు చెప్పగా ఆయన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి టూటౌన్ పోలీసు స్టేషన్లో గౌస్పై కేసు పెట్టారు. అనంతరం బాధితురాలి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం సేకరించారు. ఈ మేరకు గౌస్పై పోక్సో కేసుతోపాటు హత్యాయత్నం కూడా నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మంత్రి పొంగులేటి భరోసా..: బాలిక వెన్నెముక, పక్కటెముకలు విరిగిపోయాయని.. కోలుకోవడానికి చాలాకాలం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితురాలి తండ్రి, సర్పంచ్తో ఫోన్లో మాట్లాడారు. ‘ముందు పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి.. నేనున్నా’అని ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం వెంటనే హైదరాబాద్లోని నిమ్స్కు తరలించాలని.. వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. నిందితుడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. -
ఢిల్లీ అగ్ని ప్రమాదం : మరో తీవ్ర విషాదం
సాక్షి, న్యూఢిల్లీ: గతవారం ఢిల్లీలోని మాలవ్య నగర్లోని హోటల్ అగ్నిప్రమాద ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది.ఎనిమిది మంది కుటుంబ సభ్యుల మరణం గురించి తెలియక ముందే ఆ కుటుంబంలోని చివరి గుండె ఆగిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుత్ను కుటుంబంలోని ఏకైక సభ్యుడు, 80 ఏళ్ల వృద్ధుడు రాధే శ్యామ్ అగర్వాల్ కూడా ఈరోజు కన్నుమూశారు. దీంతో మొత్తం కుటుంబం ఆహుతైపోయిన ఘటన కలచి వేస్తోంది. ఆ ఇంట్లో నవ్వుతూ, ఆనందంగా గడిపిన కుటుంబం ఇప్పుడు సమూలంగా సమాధి అయిపోయింది. ఈ ఘోర కలి వార సమీప బంధువుల్లో ఎప్పటికీ పూడ్చలేని ఒక పెద్ద గాయాన్ని మిగిల్చింది.అగర్వాల్ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకుని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక సభ్యుడు కూడా మృతిచెందడం కూడా కలిచివేసింది.శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న రాధే శ్యామ్ అగర్వాల్ సాకేత్లోని 'మాక్స్ హాస్పిటల్' ఐసీయూ (ICU) లో చికిత్స పొందుతున్నారు.అయితే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం, దేనికైనా సిద్ధంగా ఉండాలని వైద్యులు చెప్పడంతో,దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న 'ఫ్లోరిష్ ఇన్' అనే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ (B&B) హోటల్లో బస చేశారు. వారి ఇల్లు గురుగ్రామ్ సెక్టార్ 46లో ఉండటం, అక్కడి నుండి ట్రాఫిక్ సమస్యల వల్ల రాకపోకలు కష్టమవుతాయని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.అదే ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది.ఈ ప్రమాదంలో రాధే శ్యామ్ కుమారుడు వివేక్ అగర్వాల్, భార్య ప్రేమ్ లత అగర్వాల్, కోడలు తర్జని అగర్వాల్, మనవరాళ్లు జివిషా, వార్యలతో పాటు మరో ముగ్గురు బంధువులు మరణించారు.తన వాళ్ళు ఇకలేరని ..రారని తెలియకుండానేఆసుపత్రిలో ఉన్న రాధే శ్యామ్ అగర్వాల్కు తన కుటుంబం మొత్తం అగ్నిప్రమాదంలో చనిపోయిందనే విషయమే తెలియదు. తనను చూడటానికి ఎందుకు రాలేదని ఆయన నర్సులను, వైద్యులను అడుగుతూనే ఉండేవారు. మనవరాలు జివిషా, బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతూ, తాతగారిని చివరిసారిగా చూద్దామని ఢిల్లీకి వచ్చింది. ఆమె వచ్చినందుకు సంతోషించిన రాధే శ్యామ్, తన మనవరాలు తన కోసమే అంత దూరం నుండి వచ్చిందని నర్సులతో ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. కానీ, తాతయ్యకు వీడ్కోలు పలకడానికి వచ్చిన మనవరాలే ముందుగా అనంత లోకాలకు వెళ్లిపోవడం అత్యంత విచారకరం. -
ప్రేమించాడనే కక్షతో ఘోరం: గదిలో బంధించి, కర్రలతో కొట్టి..
తెహ్రీ గర్హ్వాల్: ఉత్తరాఖండ్లోని తెహ్రీ గర్హ్వాల్ జిల్లాలో ఒక విషాద ఘటన వెలుగుచూసింది. తమ ఇంటి అమ్మాయితో స్నేహం చేశాడనే నెపంతో 18 ఏళ్ల ఒక దళిత యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయగా, పోలీసులు నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.అర్ధరాత్రి పిలిచి..మృతుడు కేతన్ లాల్ గత ఆరు నెలలుగా సదరు యువతితో స్నేహంగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో సదరు యువతి నుంచి ఫోన్ రావడంతో, కేతన్ తన స్నేహితుడైన దివాకర్ దిమ్రీతో కలిసి ఆమె నివసించే ఖోల్గఢ్ గ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడకు చేరుకోగానే యువతి కుటుంబ సభ్యులు వీరిద్దరినీ ఒక గదిలో బంధించి, కర్రలతో నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు.రక్తపు మడుగులో కుమారుడుమరుసటి రోజు ఉదయం ఆ యువతి తండ్రి.. కేతన్ తండ్రి ధన్పాల్ లాల్కు ఫోన్ చేసి, నీ కొడుకును వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. ధన్పాల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా, కేతన్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండటం చూసి హతాశుడయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో గాయపడిన కేతన్ స్నేహితుడు దివాకర్ ప్రస్తుతం బౌరారీలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.రంగంలోకి పోలీసులు.. నిందితుడి అరెస్ట్ఈ ఘోర ఉదంతంపై తెహ్రీ గర్హ్వాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్వేతా చౌబే స్పందిస్తూ.. నిందితులపై ఐపీసీ హత్య సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2)(వి) కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి యశ్వీర్ సింగ్ పన్వార్ అనే వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎలుగుబంటి స్వైరవిహారం.. 100 పాఠశాలలు మూసివేత! -
60 ఏళ్ల వయసులో జల్సాలు..! స్నేహితుడిని నమ్మించి..
బంజారాహిల్స్: 60 ఏళ్ళ వయసులో జల్సాలకు అలవాటుపడ్డాడు..పేకాటకు బానిసై అప్పులు చేశాడు.. వాటిని చెల్లించేందుకు నమ్మిన స్నేహితుడినే నట్టేట ముంచి బంగారు నగలతో ఉడాయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.పోలీసులు తెలిపిన మేరకు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్నయ్య అలియాస్ రాములు(60) పేకాటకు బానిసై జల్సాలకు అలవాటు పడి అందరి వద్ద అప్పులు చేశాడు. వీటిని తీర్చడానికి మోసాలకు తెగబడ్డాడు. ఈ నేపథ్యంలోనే అమీర్పేట్లోని ఓ హాస్టల్లో ఉంటూ బస్టాప్లలో అపరిచితులను పరిచయం చేసుకొని స్నేహం నటించి వారితో రాకపోకలు సాగిస్తూ వారి కదలికలు గమనిస్తుండేవాడు. గచ్చిబౌలికి చెందిన ఆర్అండ్ బీ రిటైర్డ్ ఉద్యోగి రాజామ్ రాజయ్య ప్రకాశ్ను ఇలాగే పరిచయం చేసుకొని 62 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి 57.66 గ్రాముల బంగారంతోపాటు ఒక మొబైల్ ఫోన్ను రికవరీ చేసి రిమాండ్కు తరలించారు. -
అనుమానాస్పద స్థితిలో తండ్రి, కుమారుడు మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని కనకదుర్గ కాలనీలో సోమవారం తండ్రి, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మిర్లోనిగూడెం గ్రామానికి చెందిన పబ్బతిరెడ్డి లింగారెడ్డి(45) విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య కవిత, ఇద్దరు కుమారులు ప్రశాంత్రెడ్డి, ప్రణీత్రెడ్డి(14) ఉన్నారు. లింగారెడ్డి కుటుంబంతో కలిసి నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో కనకదుర్గ కాలనీలో నివాసముంటున్నారు. లింగారెడ్డి పెద్ద కుమారుడు ప్రశాంత్రెడ్డి ఇటీవల పదో తరగతి పూర్తిచేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటరీ్మడియట్లో చేరాడు. సోమవారం ఉదయం ప్రశాంత్రెడ్డిని హాస్టల్లో వదిలిరావడానికి లింగారెడ్డి భార్య కవిత హైదరాబాద్కు వెళ్లింది. అదే సమయంలో లింగారెడ్డి తండ్రి సత్తిరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామమైన మిర్లోనిగూడెం వెళ్లగా.. ఇంట్లో లింగారెడ్డి, అతడి చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డి మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడు ప్రణీత్రెడ్డికి ఫోన్ చేసి అన్నం తిన్నావా అని అడగగా.. తిన్నానని సమాధానం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకునేసరికి గేటుకు లోపలి నుంచి బేడం వేసి ఉంది. ఎంత పిలిచినా భర్త, కుమారుడు స్పందించకపోవడంతో పక్కింటి బాలుడి సహాయంతో గేటు తెరిపించి లోపలికి వెళ్లి చూడగా భర్త, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కుప్పకూలిపోయింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రణీత్రెడ్డి తలపై తీవ్ర గాయాలు ఉండగా, ఇంట్లో టీవీ స్టాండ్పై సుత్తి కనిపించింది. మరోవైపు లింగారెడ్డి నోటి నుంచి నురగలు రావడంతో పాటు పక్కనే పురుగుల మందు డబ్బా లభించింది. అయితే కొడుకును సుత్తితో కొట్టి హత్య చేసిన అనంతరం లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సుత్తిపై ఉన్న వేలిముద్రలతో పాటు మృతుల వేలిముద్రలను కూడా సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నేరాలు చేసి నేపాలీలు పరార్!
సాక్షి, సిటీబ్యూరో: రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో నిందితులైన ఏడుగురు నేపాలీల్లో ఒక్కరే చిక్కారు. సూత్రధారి, కీలక నిందితురాలు కల్పన సహా మిగతవారు పరారీలోనే ఉన్నారు.ఈ ఒక్క కేసులోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన నేపాలీ సంబంధిత నేరాల్లో నిందితులుగా ఉండి, పరారీలో ఉన్న వారి సంఖ్య 170గా తేలింది. నేపాలీ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిని పట్టుకోవడానికి సమన్వయంతో, సాంకేతికంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.ఈ నేపాలీ నేరగాళ్లు సంపన్నుల ఇళ్లల్లో పని వాళ్లు, వంట వాళ్లు, వాచ్మెన్లుగా చేరుతున్నారు. తొలినాళ్లలో నమ్మకంగా పనిచేసినా.. ఆపై అదును చూసుకుని పంజా విసురుతున్నారు. సరైన సమయంలో తమ ముఠాకు చెందిన మిగిలిన వారిని రంగంలోకి దింపుతున్నారు. అంతా కలిసి తమ ‘పని’ పూర్తి చేసుకున్న తర్వాత ముందు నగరం..ఆపై దేశం దాటేస్తున్నారు. కల్పన కూడా నేపాల్ చేరినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేటుగాళ్లు నేరం చేసిన వెంటనే తమ సెల్ఫోన్లు, సిమ్కార్డులు ధ్వంసం చేసేసి ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్నారు. ఫలితంగా పోలీసులకు వీరి ఆచూకీ కనిపెట్టడం పెద్ద సవాల్గా మారుతోంది.రెండు రకాల వ్యూహంతో ముందుకు..వాంటెడ్గా ఉన్న నేపాలీలను పట్టుకోవడానికి పోలీసులు రెండు రకాలైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సాంకేతిక నిఘా ఉంచడంతో పాటు సరిహద్దుల్లో ఉండే ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టులు, ఇతర విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోపక్క ఈ నేరగాళ్ల వివరాలు, ఆచూకీ చెప్పాల్సిందిగా కోరుతూ ఆయా అసోసియేషన్లు, యూనియన్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినప్పటికీ నేపాల్లోకి ప్రవేశించి, వీరికి అరెస్టు చేసుకురావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.బెయిల్ వస్తే మళ్లీ దొరకరు... ప్రస్తుతం రాష్ట్ర పోలీసులకు వాంటెడ్గా ఉన్న 170 మందీ నేరం చేసిన వెంటనే పరారు కాలేదు. వీరిలో కొందరు అరెస్టయి.. బెయిల్పై వచి్చ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ష్యూరిటీలు ఇచి్చన వారికీ వీరి వివరాలు తెలియట్లేదు. శిక్షల నుంచి తప్పించుకోవడానికి ఈ పంథా అనుసరిస్తుండటంతో వీరిపై కోర్టులు నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నాయి.కీలకంగా వ్యవహరిస్తున్న జీవన్... రాష్ట్రంలో నేపాలీలకు ఉద్యోగాలు ఇప్పించడం, నేరాలు చేయించడంలో జీవన్ అనే నేపాలీ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు ఓ దళారిగా వ్యవహరిస్తూ సంపన్నుల ఇళ్లల్లో నేపాలీలను పనిలో పెడుతున్నాడు. ఆపై పథక రచన చేసి, మిగతవారిని రంగంలోకి దింపి టార్గెట్ చేసిన ఇంట్లో నేరం చేయిస్తున్నాడు. పథకం సిద్ధమైన తర్వాత నేరం జరగడానికి ముందు తొలుత అతగాడే నేపాల్ వెళ్లిపోతాడు. అతని సహచరులు ఇక్కడే ఉండి ప్రణాళికను అమలు చేస్తారు. కొన్నాళ్లకు మరో పేరుతో వస్తున్న జీవన్ నేర పంథా కొనసాగిస్తున్నాడని పోలీసులకు ఆధారాలు లభించాయి. అతడి కోసం ఆరా తీస్తున్నారు. -
బీమా చేయించి.. చంపేశారు!
నారాయణపేట: ఇన్సూరెన్స్ చేయించినవారే..రూ.50 లక్షల జీవిత బీమా సొమ్మును కాజేయాలనే దురాశతో పథకం ప్రకారం హత్య చేసి.. దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.మరికల్ మండల కేంద్రానికి చెందిన రైతు బోడి రాజు (44)కు మక్తల్ పట్టణానికి చెందిన ఆనంపల్లి భాస్కర్ దూరపు బంధువు. మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన అల్లెం నాగరాజు ఇన్సూరెన్స్ ఏజెంట్లతో కమీషన్ ఒప్పందం చేసుకొని అందరితో బీమా చేయిస్తుంటాడు. అదే తరహాలో తనకు పరిచయం ఉన్న ఆనంపల్లి భాస్కర్ సహాయంతో బోడి రాజుతో రూ.50 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు.రాజు వద్ద డబ్బు లేకున్నా.. తర్వాత ఇవ్వమని చెప్పి నిందితుడు నాగరాజే తొలిఏడాది పాలసీ డబ్బులు కట్టాడు. ఫోన్నంబర్ పాలసీదారుడు రాజుది కాకుండా నాగరాజు తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అయితే బీమా డబ్బు సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనంపల్లి భాస్కర్తోపాటు గుడిగండ్ల గ్రామానికి చెందిన సిరిగిరి భాను ప్రకాశ్తో కలిసి పథకం వేశారు. అందులో భాగంగా జూన్ 3న సాయంత్రం రాజును తమ వెంట తీసుకెళ్లారు. ఆయనకు బాగా మద్యం తాగించిన అనంతరం సామన్పల్లి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ ముగ్గురు కట్టెలు, రాళ్లతో దాడి చేశారు.ప్రమాదంగా నమ్మించే యత్నం.. దాడి అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న బోడి రాజును భాను ప్రకాశ్కు చెందిన కారులో హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, దండు చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమా దం జరిగిందని, చికిత్స పొందుతూ మరణించినట్టు సమాచారం ఇచ్చారు.జూన్ 4న కుటుంబ సభ్యులు మక్తల్ పోలీస్స్టేషన్లో రోడ్డు ప్రమాద మరణంగా ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన మక్తల్ పోలీసులు అనుమానాస్పద అంశాలపై దృష్టి సారించారు. కారు డ్రైవర్ సిరిగిరి భానుప్రకాశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా.. దండు చౌరస్తా వద్ద ఎ లాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని తేలింది.అనంతరం నిందితులను లోతుగా విచారించగా, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పన్నిన హత్య కుట్ర వెలుగులోకి వచి్చంది. పోలీసుల విచార ణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అల్లెం నాగరాజు, సిరి గిరి భాను ప్రకాశ్, ఆనంపల్లి భాస్కర్లను అరెస్ట్ చేశారు. -
హైదరాబాద్లో రెచ్చిపోయిన మరో నేపాలీ గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో నేపాల్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న వ్యాపారి ఇంట్లో సుమారు కేజీ బంగారం, వజ్రాలను ఎత్తుకెళ్లారు. ఆ ఇంట్లో పనిచేసే నేపాల్ దంపతులే చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వ్యాపారి ఆ దంపతులను పనిలో పెట్టుకోగా, ఇటీవల వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది.ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించారు. పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు.. నిందితుల కోసం గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.కాగా, గత నెల 8వ తేదీన ప్రశాసన్నగర్లోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ భార్య తనూజరంజన్ను దారుణంగా హత్య చేసి బంగారు నగలతో ఉడాయించిన నేపాలీ గ్యాంగ్లో ఒక నిందితుడిని, నగలు కొనుగోలు చేసిన రిసీవర్ను ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అలియాస్ ధర్మతో పాటు మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి నేపాల్లోకి అడుగుపెట్టారు.చోరీకి గురైన సొత్తులో కొంత మాత్రమే రికవరీ అయ్యింది. మిగతా సొమ్ముతో పాటు ప్రధాన సూత్రధారులైన నేపాలీ గ్యాంగ్ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ సునీల్ పెరియార్తో పాటు రిసీవర్ దిలీప్లను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని మరింత లోతుగా విచారించనున్నారు. ఆ రోజు జరిగిన ఘటనతో పాటు హత్య చేసిన అనంతరం ఎక్కడెక్కడికి వెళ్లారు.. తదితర వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇంతలోనే నగరంలోని . గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో మరో నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడటం కలకలం రేపుతోంది. -
అడవిలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య!
గోవిందరావుపేట: చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని టేకులకుంట గొత్తికోయ గుంపులో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది.స్థానికులు, బంధువుల సమాచారం మేరకు మృతులను కాశపు కోమల (18), కోరం ఇరవయ్య (18)గా గుర్తించారు. వీరిద్దరూ గొత్తికోయ తెగకు చెందినవారని తెలిసింది. ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందట ఇప్పపువ్వు సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన యువతి, యువకుడు తిరిగి ఇంటికి రాలేదని బంధువులు తెలిపారు.కాగా, కర్లపల్లి శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పస్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కచి్చతమైన కారణాలు, ఇతర వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. -
ప్రేమపేరుతో యువకుడి వేధింపులు.. తాళలేక యువతి ఆత్మహత్య
జగిత్యాల క్రైం: ప్రేమపేరుతో ఓ యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై ఉమాసాగర్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సైదు శ్రీలత (20) జగిత్యాల పట్టణంలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది.ఈ క్రమంలో మూడేళ్లుగా జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి గ్రామానికి చెందిన అంకతి రాజు ప్రేమ పేరుతో శ్రీలతను వేధిస్తు న్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా వెంటపడుతుండటంతో శ్రీలత మూడేళ్ల కిందటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. కుటుంబసభ్యులు కాపాడారు.అయినప్పటికీ యువకుడి వేధింపులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. అయినా మార్పు రాకపోగా.. సోమవారం శ్రీలతకు ఫోన్ చేసి తీవ్ర వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. -
భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్కేస్లో కుక్కింది.!
పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్పై సూట్కేసులో దొరికిన కుళ్లిపోయిన తల చేతులు కాళ్లు లేని మృతదేహం కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలింది. తల కాళ్లు, చేతులు లేక పోవడం, మొండెం మాత్రం ఉండటంతోకేసు పోలీసులకు సవాలుగా మారింది. అయితే మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ బట్టల బార్కోడ్ ఆధారంగా దర్యాప్తు చేయగా, ఆ దుస్తులను కొనుగోలు చేసిన షాపును గుర్తించారు. దీనిని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలింది. కాల్ డేటా రికార్డ్, వాట్సాప్ లోకేషన్ ఆధారంగా నిందితులు తేనాంపేట, టి.నగర్ పరిసరాలలో ఉన్నట్టు గుర్తించారు. హత్యకు గల కారణాలు.. పోలీసుల విచారణలో మరణించిన వ్యక్తి అస్సాంకు చెందిన అమీర్ గుర్తించారు. నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహమై ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్ అలీని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2022 నుండి తేనాంపేటలోని థామస్ రోడ్ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్లో నివసిస్తున్నారు. అయితే అమీర్ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రోకిమాకు టి.నగర్లో కూరగాయల దుకాణం నడుపుతున్న అస్సాంకు అష్రఫ్ (31)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపుల గురించి రోకిమా అతడికి చెప్పగా పథకం ప్రకారం మట్టుబెట్టినట్టు తేలింది. హత్య తర్వాత తన భర్త అమీర్ అలీ స్వయంగా పెట్టినట్లుగా.. తనకు ఇక బతకాలని లేదు, ఎవరూ వెతకవద్దు అని హిందీలో ఒక నకిలీ సందేశాన్ని అతడి ఫెస్బుక్లో రోకిమా పోస్టు చేసింది. మానసిక క్షోభతో∙అమీర్ ఎక్కడికో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించేందుకే యత్నించింది.శవాన్ని ముక్కలుగా నరికి.. పథకం ప్రకారం, జూన్ 4వ తేదీ రాత్రి అమీర్ అలీ నిద్రపోతున్న సమయంలో రోకిమా, ఆమె ప్రియుడు అష్రఫ్ అతని గొంతు కోసి హత్య చేశారు. అతని తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కవర్లో చుట్టి సూట్కేసులో కుక్కారు. జూన్ 5వ తేదీ రాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్కేసును పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేశారు. కాగా, నరికిన చేతులు, కాళ్లను ఒక కాలువలో వేయగా, తలను మాత్రం చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. కాగా భర్త శరీర బాగాలను నరికేటప్పుడు ఆనందంగా భార్య ఆనందంతో సెల్ఫీలు తీసుకోవడం గమనార్హం.-సాక్షి, చెన్నై -
బిర్యానీ గొడవ.. దంపతుల ఆత్మహత్య
విశాఖపట్నం: రామాటాకీస్ వెనుక వైపున గల శ్రీనగర్లో నివాసముంటున్న దంపతులు బలరాం (33), ప్రియాంక (27) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ద్వారకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కళింగపటా్ననికి చెందిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని, బతుకుతెరువు కోసం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. వెల్డింగ్ పనులు చేసే బలరాం మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండటంతో ప్రియాంక గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బలరాం బిర్యానీ కావాలని పట్టుబట్టడంతో ప్రియాంక తల్లి బయటకు వెళ్లగా, ఆమె తిరిగి వచ్చేసరికి దంపతులిద్దరూ ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అయితే బలరామే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రియాంక బలవన్మరణానికి పాల్పడటంతో భయపడి బలరాం ఆత్మహత్యకు ఒడిగట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్లెదుటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ ప్రియాంక తల్లి రోదించడం స్థానికులను కలచివేసింది. -
పోక్సో కేసు: డబ్బులు ఇస్తేనే మీకు అనుకూలంగా రాస్తా!
బెంగళూరు: పోక్సో కేసులో పోలీస్స్టేషన్లో లంచం తీసుకుంటూ మహిళా కానిస్టేబుల్ జ్యోతి లోకాయుక్తకు చిక్కగా, ఏఎస్సై శివశరణప్ప పరారయ్యారు. ఈ సంఘటన కలబుర్గిలోని స్టేషన్ బజార్ పోలీస్స్టేషన్లో జరిగింది. వివరాలు.. చెత్త ఏరుకునే మహిళ కుమార్తె (మైనర్) పై అత్యాచారం జరిగింది. ఈ కేసులో చార్జ్షీట్ వేయాలని, మీకు అనుకూలంగా రాయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని జ్యోతి, ఏఎస్సై శివశరణప్ప బాలిక తల్లిని డిమాండు చేశారు. కూతురిపై అఘాయిత్యం జరిగి బాధపడుతుంటే, పోలీసులు డబ్బుల కోసం పీడించడంతో ఆమె వేదనకు గురైంది. దీంతో కొందరు సామాజిక కార్యకర్తల సాయంతో లోకాయుక్తను ఆశ్రయించింది. ఆమె నుంచి జ్యోతి లంచం తీసుకుటుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. అక్కడే ఉన్న ఏఎస్సై పలాయన మంత్రం పఠించాడు. అతని కోసం గాలిస్తున్నారు. -
కాచిగూడాలో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఆత్మహత్య
సాక్షి,ఒంగోలు: కాచిగూడా రైల్వే స్టేషన్ నుంచి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్ ఘటన విషాదంతంగా ముగిసింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతంలో ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 27న రాహుల్ తన కుటుంబ సభ్యులకు టూర్కు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కాచిగూడాలో శబరి ఎక్స్ప్రెస్ ఎక్కిన తర్వాత అతను కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు విస్తృతంగా గాలించినా ఎటువంటి సమాచారం లభించలేదు.తాజాగా ఒంగోలు సమీపంలోని సింగరాయికొండ వద్ద ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రాహుల్ అదృశ్యం, ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
భార్య గొంతు కోసి చంపేశాడు
హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు భర్త. ఈ ఘటన బహదూర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్బాగ్కు చెందిన సులేమాన్ బిన్, నిషాత్ ఫాతిమా (28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులేమాన్ భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే అతడు రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యతో గొడవ పడుతుండడంతో గతంలో మహిళా పోలీస్స్టేషన్లో కేసు నమోదయ్యింది. పెద్దలు సర్దిచెప్పడంతో బాగా చూసుకుంటానని చెప్పిన సులేమాన్ మళ్లీ గొడవ పడుతుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం కిషన్ బాగ్లోని ఇంటికి కత్తితో వచి్చన సులేమాన్, పిల్లలను వేరే గదిలో ఉంచి, భార్య నిషాత్ ఫాతిమా గొంతుకోసి బయటి నుంచి గడియపెట్టి పారిపోయాడు. నిషాత్ పాతిమా తల్లి సాయంత్రం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా కూతురు విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న బహదూర్పురా పోలీసులు ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలాన్ని ఫలక్నుమా ఏసీపీ జావెద్ పరిశీలించారు. నిషాత్ ఫాతిమా తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘కింగ్స్ అండ్ క్వీన్’ ఓ మచ్చుతునక మాత్రమే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొన్ని పబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు, దందాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఈ క్రమంలోనే కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ డెకాయ్ ఆపరేషన్ చేయడంతో మంజీరా మాల్లోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ వ్యవహారం వెలుగులోకి వచి్చంది. స్థానిక పోలీసులతో కుమ్మక్కై తమ వ్యవహారాలు కొనసాగిస్తున్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి దందాలకు వ్యవస్థీకృతంగా నడపటంతో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతడితో పాటు అతడు నడిపిన పబ్స్పై గతంలోనూ అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. యువతులను రప్పించి.. ఈ పబ్స్ దందాలో ఏళ్లుగా ఉన్న ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకువస్తున్నాడని తెలిసింది. అలా వచ్చే వారికి బస, భోజనం తదితరాలన్నీ అతడే సమకూరుస్తుంటాడు. ఇక్కడ ఉన్నన్ని రోజులూ వారు వినియోగించడానికి తాత్కాలిక ఫోన్లు, నెంబర్లు వారిని తీసుకువచి్చన వాళ్లే కేటాయిస్తున్నారు. ఓసారి పబ్కు వచి్చన యువకుల ఫోన్ నెంబర్లు ఈ యువతులు తీసుకుంటారు. తమ వద్ద ఉన్న తాత్కాలిక నెంబర్లకు వారికి ఇస్తారు. ఇలా నిత్యం వారితో చాటింగ్ చేస్తూ పదేపదే అదే పబ్కు వచ్చేలా ఆకర్షిస్తుంటారు. ఇలా చేసిందుకు నిర్వాహకులు వీరికి అదనంగా చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో కస్టమర్ చేసిన బిల్లు నుంచి కమీషన్ కూడా ఇస్తారు. దీనికి అదనంగా ఆయా యువకుల నుంచి ఈ యువతులు కంపెనీ ఇచి్చనందుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తుంటారు. కొన్ని చోట్ల శ్రుతి మించి..ఈ యువతీ యువకుల వ్యవహారాలు పబ్లకు ఆకర్షించడం, మద్యం తాగడం.. తాగించడం, డ్యాన్సులతో ఆగట్లేదు. ఇదే అదనుగా ద్వితీయ, తృతీయ శ్రేణులకు చెందిన కొన్ని పబ్స్లో అసాంఘిక కార్యకలాపాలు శ్రుతి మించుతున్నాయి. దీనికోసం ఆయా చోట్ల ఏకాంత ప్రదేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అదనంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ యువతుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై ఈ దందాలతో పాటు ఓ డ్యాన్సర్తో అసభ్యంగా ప్రవర్తించిన కేసు కూడా నమోదైనట్లు తెలిసింది. అతడి వ్యవహారాలు ఆయా ఠాణాలకు చెందిన అధికారులకు తెలిసినా ‘అనివార్య కారణాల’ నేపథ్యంలో మిన్నకుండిపోతున్నారని సమాచారం. ఇకపైనా టాస్్కఫోర్స్, ఎస్ఓటీలతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు పబ్స్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, అక్రమాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. -
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో..
మెదక్: మరో మహిళతో వివాహేత ర సంబంధం పెట్టుకు న్నాడనే నెపంతో కట్టు కున్న భార్య, ఆమె తల్లి దండ్రులు, తమ్ముడితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా మెదక్ మండలంలో వెలుగులోకి వచ్చింది.ర్యాలమడుగు గ్రామానికి చెందిన పుంటికూర కుమార్గౌడ్ (50) ఆర్మీలో జవాన్గా విధులు నిర్వహిస్తు న్నారు. అతనికి కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన పద్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిద్దరి మధ్య గొడవ కారణంగా కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు. కుమార్గౌడ్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఉంటున్నారు.మరో మహిళతో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో శనివారం రాత్రి అతడి భార్య పద్మ, ఆమె తల్లిదండ్రులు రామకృష్ణగౌడ్–ఎల్లమ్మ, సోదరుడు సంతోష్తో పాటు మరికొందరు కుమార్గౌడ్పై విచక్షణారహితంగా ఇనుప రాడ్స్, కర్రలతో కొట్టి చంపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పద్మతో పాటు ఆమె తల్లిదండ్రులు, తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
కుమార్తెకు పెళ్లి కుదుర్చుకుని వస్తూ అనంత లోకాలకు
సామర్లకోట / పిఠాపురం : కుమార్తెకు పెళ్లి సంబంధం ఖాయమైందన్న ఆనందంతో ఇంటికి వస్తున్న ఆ దంపతులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ జంక్షన్ సత్తెమ్మ ఆలయం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. సామర్లకోట అప్పయ్య చెరువు ప్రాంతానికి చెందిన జూరెడ్డి సూర్యనారాయణ (45) స్థానిక ఎఫ్సీఐ గోదాములో కాంట్రాక్టు లేబర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం భార్య అరుణ కుమారి (40)తో కలిసి స్కూటీపై తుని వద్దనున్న తాళ్లూరికి వెళ్లారు. కుమార్తె ధరణికి వివాహ సంబంధం మాట్లాడేందుకు వెళ్లిన వీరు.. సంబంధం ఖాయం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దుర్గాడ రోడ్డు జంక్షన్లోని సత్తెమ్మ ఆలయం సమీపంలోకి వచ్చేసరికి వారి స్కూటీని లారీ ఢీకొట్టింది. సూర్యనారాయణ హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ లారీ చక్రం తలపై నుంచి వెళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. అరుణకుమారిని కాపాడేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లాలని స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఆమె కూడా చనిపోయింది. దంపతులిద్దరూ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచారు. లారీ డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. తమ ఏకైక కుమార్తెను డాక్టర్ను చేయాలనే ఆశతో సూర్యనారాయణ, అరుణకుమారి చదివిస్తున్నారని బంధువులు తెలిపారు. అయితే నీట్లో సీటు రాకపోవడంతో మరో ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం రాజమహేంద్రవరంలో బీఎస్సీలో చేర్చి హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారని... ఇంతలో మంచి సంబంధం రావడంతో పెళ్లి ఖాయం చేసుకుని వస్తున్న సమయంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని బంధువులు విలపిస్తున్నారు. దంపతుల హఠాన్మరణంతో అయ్యప్పచెరువు ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సెల్ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య
గూడూరు: సెల్ఫోన్ కొనివ్వలేదని క్షణికా వేశంలో ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బొడ్డు రాములు–కరుణశ్రీ దంపతులకు కూతురు బిందు (22), ఇద్దరు కుమారులు న్నారు. కూతురు పీజీ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. శనివారం రాత్రి సెల్ఫోన్ కొనివ్వాలని బిందు తండ్రిని అడగడంతో డబ్బులు లేవన్నాడు. దీంతో క్షణికావేశానికి గురైన ఆమె రాత్రి బయటికి వెళ్లింది. రాత్రి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. తండ్రి బొడ్డు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. -
మహిళను చంపడానికి 1,400 కి.మీ ప్రయాణించి..
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ దంపతులు ఢిల్లీలోని ఓ ప్రొఫెసర్ను హత్య చేసేందుకు 1,400 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దేబోస్మితా పాల్ హత్య కేసును పోలీసులు కేవలం 3 రోజుల్లో ఛేదించారు.తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్లో ఉన్న సత్యం అపార్ట్మెంట్స్లో బుధవారం దేబోస్మితా పాల్ మృతదేహం కనిపించింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు పశ్చిమ బెంగాల్లోని బర్దమాన్ చేరుకుని రామ్ప్రసాద్ దాస్, బంశ్రీ దాస్ను అరెస్టు చేశారు.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. వారి మైనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దంపతులను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ కోరే అవకాశం ఉందని వారు తెలిపారు.అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. నిందితులు బర్దమాన్ లో ఉంటారు. బాధితురాలిని కలవాలనే నెపంతో వారు ఢిల్లీకి వచ్చారు. 2022లో వివాహ జీవితం ప్రారంభమైన ఐదేళ్ల తరువాత దేబోస్మితా పాల్ తన భర్త నుంచి విడిపోయింది. ఆమె ఆ ఫ్లాట్లో ఒంటరిగా ఉండగా, ఆమె భర్త బెంగళూరులో ఉన్నాడు.బుధవారం నిందితులు మాస్కులు ధరించి ఆమె ఫ్లాట్కు వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వారు కొన్ని సంచులతో ప్రైవేట్ క్యాబ్లో వచ్చి, మెట్లు ఎక్కి 6వ అంతస్తుకు చేరుకున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు తమ మైనర్ కుమారుడిని కూడా వెంట తీసుకువచ్చారు. స్నేహపూర్వకంగా ఇంట్లోకి ప్రవేశించి, తమ వెంట తెచ్చుకున్న ఆయుధంతో ప్రొఫెసర్ను హత్య చేసినట్లు అధికారులు తెలిపారు.దుస్తులు మార్చుకున్న తరువాత సుమారు 30 నిమిషాలకే వారు తిరిగి వచ్చి, కింద వేచి ఉన్న క్యాబ్లో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సోర్సెస్ వెల్లడించాయి. క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, ప్రయాణ వివరాల ఆధారంగా ప్రయాణికుల గుర్తింపును పోలీసులు నిర్ధారించారు.బుధవారం ఆ హౌసింగ్ సముదాయాన్ని సందర్శించిన 200 మందిలో 13 మందిని అనుమానితులుగా గుర్తించి ప్రశ్నించారు. 7 పోలీసు బృందాలు 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి, వందల మందిని విచారించాయి. దీంతో కేసు ఛేదించగలిగారు. చివరకు నిందితులను బర్దమాన్లో అరెస్టు చేసి విచారిస్తున్నారు.ఎందుకు చంపారు? బాధితురాలికి పశ్చిమ బెంగాల్లో తన మాతామహుడి మరణం అనంతరం వారసత్వంగా వచ్చిన ఓ ఆస్తి ఉంది. దాన్ని విలువ కోట్లాది రూపాయలు. నిందితులు ఆ ఇంటిలో అద్దెదారులుగా ఉండేవారు. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇల్లు ఖాళీ చేయాలని దేబోస్మితా పాల్ వారిపై ఒత్తిడి తెస్తోంది. ఆస్తిని సొంతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెను హత్య చేయాలని దంపతులు పథకం రచించినట్లు అధికారులు తెలిపారు.దేబోస్మితా సోదరి దేవరతి గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన సోదరి మృతిచెందినట్లు తెలిపింది. ఫ్లాట్కు బయట నుంచి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. సోదరికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో దేవరతి తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించింది.లోపల దేబోస్మితా పాల్ మృతదేహం కనిపించింది. ఆమె తలపై లోతైన గాయం, మణికట్టులో కోసిన రక్తనాళాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో నగలు, నగదు యథాతథంగా ఉండటంతో దోపిడీ ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు. -
భర్తను కాదని.. కాలేజీ ఫ్రెండ్తో వివాహేతర సంబంధం..!
అక్రమ సంబంధం మోజుతో ఓ తల్లి ఎవరూ చేయరాని అకృత్యానికి పాల్పడింది. ప్రియునితో వెళ్లిపోయిన తల్లి.. ఆ తరువాత కూతురిని కడతేర్చింది. ఈ దారుణం బెంగళూరు కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బాలిక హత్యపై భార్య ప్రియాంక, ఆమె ప్రియుడు మోహన్ పై తండ్రి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. దావణగెరెకు చెందిన ప్రవీణ్, బెంగళూరువాసి ప్రియాంకకు 2007లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 17, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, ప్రియాంక కాలేజీ ప్రియుడు మోహన్తో అక్రమ సంబంధం ఏర్పడింది. దీని గురించి భర్త ప్రశ్నించగా, ప్రియాంక విడాకులు కావాలని పట్టుబట్టింది. చివరకు కుమార్తెలతో వెళ్లిపోయింది. హఠాత్తుగా బాలిక మృతి.. మార్చి 24న చిన్న కూతురు ఆకస్మాత్తుగా మరణించింది. ఏమైందని భర్త వెళ్లి ప్రియాంకను అడగ్గా, బిర్యానీ తింటూ చనిపోయిందని ఒకసారి, ఐస్ క్రీమ్ ఇచ్చి, ఏసీ వేసి కారులోనే పడుకోబెడితో మరణించిందని మరోసారి చెప్పింది. బాలిక నల్లగా ఉందని తరచూ తల్లి సతాయించేదని తెలిసింది. కుమార్తెను కొట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రియుడు మోహన్ను అరెస్టు చేయగా, ఇంతలో తల్లి పరారైంది. - బెంగళూరు -
భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రియుడు నిత్యం వేధిస్తుండటంతో ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మొల్లి దుర్గ(23) నానక్రాంగూడలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో టెలీకాలర్గా పని చేస్తోంది. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన సాయి కుమార్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. నెల రోజులనుంచి ఇద్దరూ కేశవ్నగర్లో ఉంటున్నారు. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న సాయి కుమార్ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగుతూ సాయికుమార్ గొడవకు దిగాడు. తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గ ఐదో అంతస్తుపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు సిటిజన్ హస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దుర్గ తల్లి దుబాయ్కి వెళ్లింది. మేనమామ దేవరంపల్లి రవి కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాయి కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. -
‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’
పరకాల: ల్యాబ్ టెక్నీషియన్ షరిఫోద్దీన్ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. రోడ్డు ప్రమాదం కాదు.. హత్య అని తేల్చిన పోలీసులు నిందితుడు టీస్టాల్ నిర్వాహకుడు జట్టబోయిన సందీప్(31)ను అరెస్ట్ చేశారు. షరిఫోద్దీన్ భార్యతో నిందితుడికి ఉన్న వివాహేతర సంబంధం వ్యవహారమే ఈ హత్యకు దారి తీసినట్లు పరకాల ఏసీపీ సతీశ్బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఈ హత్య కేసు వివరాలు వెల్లడించారు. పరకాలలోని ఓ ఇంట్లో ల్యాబ్టెక్నీషియన్ ఎండీ షరిఫోద్దీన్ అద్దెకు ఉంటున్నాడు. హనుమకొండలోని ఓ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. రోజూ డ్యూటీకి వెళ్లే సమయంలో తన భార్యకు టిఫిన్ ఇచ్చిరావాలని సమీపంలోని టీ స్టాల్ నిర్వాహకుడు సందీప్కు చెప్పేవాడు. సందీప్ రోజూ వెళ్లి టిఫిన్లు ఇచ్చే క్రమంలో అతడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. చివరికి తను చెప్పకపోయినా సందీప్ ఇంటికి వెళ్తున్నట్లు తెలుసుకున్న షరీఫొద్దీన్ ఈ నెల2న ఉదయం అతడి దగ్గరికి వెళ్లి ఈ రోజు నీతో మాట్లాడే పని ఉందని, డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పాడు. తమ వివాహేతర సంబంధం తెలిసిపోయిందని గ్రహించిన సందీప్ అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం షరిఫోద్దీన్ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే సందీప్ వేరేవ్యక్తి ఫోన్ నుంచి వాట్సాప్ కాల్ చేసి వెల్లంపల్లి రోడ్డులోని ఓ బ్రిక్స్ షెడ్డు వద్దకు రావాలని చెప్పాడు. అక్కడికి బయల్దేరిన షరీఫోద్దీన్ మార్గమధ్యలో ఓ వైన్స్ వద్ద రెండు బీర్లు కొనుక్కొని వెళ్లగా ఇద్దరు కలిసి తాగారు. మళ్లీ అతనే వెళ్లి ఇంకో రెండు బీర్లను తీసుకురాగా వాటిని తాగుతూ ‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’ అంటూ సందీప్పై షరీఫోద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సందీప్ పక్కనే ఉన్న కర్రతో షరీఫోద్దీన్ తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించేందుకు మృతదేహాన్ని అతడి వాహనంపైనే అడ్డుగా పెట్టుకొని రోడ్డు మీదికి తీసుకొచ్చి ఎవరూ లేని సమయంలో పడేసి వెళ్లిపోయాడు. రక్తపు మరకలతో ఉన్న షర్ట్ను తన ఇంటి పక్కనున్న బాత్రూం వెనుకాల కాల్చిపడేశాడు. మిగతా దుస్తులను పిండిన దుస్తుల్లో కలిపి హత్య వ్యవహారాన్ని దాచే ప్రయత్నం చేశాడు. మృతుడి సోదరుడు రజాక్ ఇది హత్యగా అనుమానిస్తూ విచారణ చేయాలని ఫిర్యాదు చేయడంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. సందీప్ ఈ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసును వేగవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ క్రాంతికుమార్, ఎస్ఐలు రమేశ్, పవన్, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
భర్త చనిపోయిన బాధలో ఉంటే.. ఆమెపై కన్నేశాడు
విశాఖపట్నం: మరణించిన స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.దామోదరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.వి.రమణ తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞానాపురంలో కె.ప్రసాద్ అనే వ్యక్తి భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి జీవించేవాడు. ప్రసాద్ స్నేహితుడైన ధనాల అరుణ్కుమార్ (30) కూడా అదే ప్రాంతంలో నివసించేవాడు. 2019లో ప్రసాద్ అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న లక్ష్మిపై నిందితుడు కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలు నిరాకరించడంతో ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. దీనిపై బాధితురాలు 2021 ఏప్రిల్లో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడు అరుణ్కుమార్కు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి
ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం కబళించింది. అంత్యక్రియలు, అస్థికల నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం బారినపడింది. దీంతో ఆ కుటుంబంలోని తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.పంజాబ్లోని ఫిరోజ్పూర్-ఫజిల్కా రహదారిపై ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జలాలాబాద్కు చెందిన ఓ కుటుంబంలో ఇంటి పెద్ద(మహిళ) మరణించింది. దీంతో అంత్యక్రియలు, అనంతర కర్మలు పూర్తి చేసుకుని ఆ కుటుంబం పికప్ వాహనంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 28 మంది వాహనంలో ఉన్నట్లు సమాచారం.గత అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనం ఫిరోజ్పూర్-ఫజిల్కా మార్గంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రమాదకర కొండ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్తో కొట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పికప్ వాహనం అధిక వేగంతో వెళ్తుండటంతో డ్రైవర్ మలుపు వద్ద వాహనాన్ని అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రైలర్ను తప్పించుకునే అవకాశం లేకపోవడంతో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఢీకొట్టిన తీవ్రతకు పికప్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పురుషులు, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి సమీప ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన పలువురిని ఫరీద్కోట్లోని ప్రత్యేక వైద్య కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అతివేగం, ఇరుకు రహదారి, ప్రమాదకర మలుపు కలిసి ప్రమాదానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఫిరోజ్పూర్-ఫజిల్కా రహదారిలోని ఈ భాగం చాలా కాలంగా ప్రమాదాల కేంద్రంగా మారిందని, రహదారి విస్తరణ చేపట్టాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#BREAKING SEVEN TO NINE killed and 15 injured in Ferozepur, Punjab, when a truck collided with a jeep carrying a family to immerse ashes. SSP Bhupinder Singh confirmed. #Punjab #Ferozepur #RoadAccident @PunjabPoliceInd https://t.co/3CbYUL1g3A pic.twitter.com/k8W1AxtjUP— jarvis ☠️ (@Vishii14) June 6, 2026 -
బుర్ఖాలో వచ్చాడు.. నడకతో దొరికిపోయాడు
స్నేహితుడి మెడలో ఐదు తులాల బంగారంపై కన్నేశాడు. ఎలాగైనా కాజేయాలని నెలల తరబడి ఎదురు చూశాడు. యూట్యూబ్లో వీడియోలు చూసి ఏం చేయాలి.. ఎలా తప్పించుకోవాలి అని స్కెచ్ గీశాడు. ప్లాన్ అమలు చేసే టైంలో.. కంగారుపడడంతో ఊహించనిది జరిగింది. అయినా బెదరలేదు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. చివరకు.. సీసీటీవీలో దొరికిన ఒక చిన్న క్లూ చివరకు అతడిని కటకటాల వెనక్కి నెట్టింది.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ప్రకాశ్ చంద్ర గుప్తా కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతనికి మోహిత్ ద్వివేది అనే వ్యక్తితో 18 ఏళ్ల స్నేహం ఉంది. అయితే ఆ స్నేహానికే చివరికి డబ్బు, బంగారం చిచ్చుపెట్టాయి. ప్రకాశ్ ధరించే సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు గొలుసుపై మోహిత్ కన్నేశాడు. దానిని ఎలాగైనా దోచుకోవాలని నిర్ణయించుకున్న అతడు ముందుగానే పథకం రచించాడు.ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న మే 31 రాత్రి ప్రకాశ్ తన కోచింగ్ సెంటర్లోనే ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బుర్ఖా ధరించడంతో పాటు మహిళలు ఉపయోగించే ఆభరణాలు, చెప్పులు కూడా వేసుకున్నాడు. అనంతరం కోచింగ్ సెంటర్లోకి ప్రవేశించి ప్రకాశ్పై దాడికి దిగాడు. బంగారు గొలుసు లాక్కునే ప్రయత్నంలో ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది.ఈ క్రమంలో ప్రకాశ్ను బలంగా తోసేయడంతో అతడు నేలపై పడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కారణంగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మోహిత్ బంగారు గొలుసుతో పాటు మరో బంగారు బ్రాస్లెట్ను కూడా తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం ప్రకాశ్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని రక్తపు మడుగులో గుర్తించారు. తొలుత పోలీసులు ప్రమాదవశాత్తూ పడిపోవడం వల్ల మరణించి ఉండొచ్చని భావించారు. అయితే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఒక చోట ఒకరు బుర్ఖాలో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ మనిషి నడక మాత్రం తేడాగా కనిపించింది. దీంతో బుర్ఖాలో ఉంది మహిళ కాదేమోనని అనుమానపడ్డారు. అలాగే.. అక్కడి నుంచి సుమారు 100 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ ఆ ముసుగు వ్యక్తి కదలికలను ట్రాక్ చేశారు. చివరకు ఒక కారులో.. బుర్ఖా మార్చుకుంటూ ఆ వ్యక్తి బయటపడ్డాడు. అది మోహిత్ అని గుర్తించి షాక్ తిన్నారు.పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన మోహిత్.. హత్య తర్వాత కూడా ఎలాంటి అనుమానం రాకుండా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు వెల్లడైంది. అంతేకాకుండా నేరం జరిగిన మరుసటి రోజే ఓ పోటీ పరీక్షకు హాజరై, తర్వాత లక్నోకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనతో ప్రకాశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. "18 ఏళ్ల స్నేహాన్ని డబ్బు కోసం బలి చేశాడు. ఇంత దారుణంగా మోసం చేస్తాడని ఊహించలేదు" అని మృతుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
లైంగిక ఆరోపణలు.. లొంగిపోయిన చిన్నమల్లయ్య
సాక్షి, పల్నాడు: ఏపీలో సంచలనం రేపిన వినుకొండ మాజీ సీఐ చిన్నమల్లయ్య వ్యవహారం కీలక మలుపు తిరిగింది. లైంగిక ఆరోపణల కేసు నేపథ్యంలో నెలకు పైగా అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఎట్టకేలకు ఈ వేకువ జామున పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ తనపై అత్యాచారం చేశాడని చిన్నమల్లయ్యపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన కుటుంబం నిర్వహిస్తున్న నాటు కోళ్ల ఫారం వ్యవహారంలో పరిచయం ఏర్పడిన సీఐ చిన్నమల్లయ్య.. తనను బెదిరించి లైంగికంగా వేధించడమే కాకుండా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీస్ శాఖ స్పందించింది. చిన్నమల్లయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభమైంది. ఈలోపు.. చిన్నమల్లయ్య కనిపించకుండా పోవడంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం, పోలీస్ శాఖ తీరు తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా.. ఆయన్ని విధుల నుంచి తొలిగిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటు మొదట హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోర్టుల నుంచి ఊరట లభించకపోవడంతో చిన్నమల్లయ్యపై ఒత్తిడి మరింత పెరిగింది. ఒకవైపు పోలీసుల గాలింపు, మరోవైపు కోర్టుల్లో ఎదురుదెబ్బలు, ఉద్యోగం కోల్పోయిన పరిణామాల మధ్య చిన్నమల్లయ్య చివరకు బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన వినుకొండ పోలీస్ స్టేషన్కు చేరుకుని లొంగిపోయినట్లు స్పష్టమవుతోంది. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించారు. -
చెత్త రోడ్డుమీద పడేశాడని ట్రోలింగ్
పణజి: ఇంట్లో చెత్తను మూటగట్టి రోడ్డు మీద పడేసిన యువకుడు ఆన్లైన్లో వేధింపులు భరించలేక చివరకు తనను తాను షూట్చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోవాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం నార్త్ గోవాలోని మపూసా పట్టణంలో 23 ఏళ్ల కాలేజీ విద్యార్థి శామ్యూల్ గారి్వన్ డీ బ్రాగెన్కా ఇంట్లో పోగైన చెత్తను మూటగట్టి రోడ్డు పక్కన పడేశాడు. దీనిని రోడ్డున పోతున్న ఒక వ్యక్తి వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్చేశాడు. చెత్తను రోడ్డున పడేయకుండా మున్సిపల్ చెత్తకుండీలో పడేయాలనే ఇంగితజ్ఞానం కూడా లేదు అని విమర్శించాడు. ఈ వీడియోకు ఆన్లైన్లో తెగ షేర్లు, లైకులు వచ్చాయి. శామూŠయ్ల్ను తిట్టిపోస్తూ ఆన్లైన్లో వేధింపులు ఎక్కువయ్యాయి. వీడియో విషయం చివరకు పోలీసుల దాకా చేరింది. దీంతో భారతీయ న్యాయసంహితలోని 271 సెక్షన్, గోవా బయోడిగ్రేడబుల్ గార్బేజ్ కంట్రోల్ చట్టాల కింద కేసు నమోదుచేశారు. శామ్యూల్ను పోలీస్స్టేషన్కు పిలించి మందలించారు. కేసు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన శామ్యూల్ గురువారం రాత్రి సొంతింట్లో బాత్రూమ్లో షూట్ చేసుకుని చనిపోయాడు. దీంతో శుక్రవారం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చెత్తను పడేస్తున్నప్పుడు వీడియో తీసిన వ్యక్తిని అరెస్ట్చేయాలని, ఆత్మహత్య చేసుకునేంతగా ఆన్లైన్ వేధింపులకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదుచేయాలని కుటుంబసభ్యులు ఫిర్యాదుచేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దృష్టికెళ్లింది. ఈ మొత్తం ఉదంతంపై దర్యాప్తు జరపాలని పోలీసులకు సీఎం ఆదేశాలిచ్చారు. -
ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్
ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ హ్యాండీ (81) దారుణ హత్య కలకలం రేపింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్లోని టార్జానాలో ఆయన ప్రేయసి కుమారుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు (జూన్ 4)పోలీసులు ప్రాథమికంగానిర్ధారించారు. టాప్ గన్: మావెరిక్', జుమాంజి వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన హ్యాండీహత్యపై హాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. 911 కాల్ రావడంతో అధికారులు అతని ఇంటికి చేరుకున్నారు. ఛాతీపై గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న జేమ్స్ హ్యాండీని వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ కేసులో హ్యాండీ ప్రియురాలి కుమారుడు మైఖేల్ గ్లెడ్హిల్ (44) ను అరెస్టు చేశారు. జేమ్స్ హ్యాండీ ప్రేమికురాలిగా భావిస్తున్న మహిళ గురించి ఎటువంటి వివరాలు తెలియవు. ఆయన వృత్తి జీవితం అందరికీ తెలిసినప్పటికీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియవు.జేమ్స్ హ్యాండీ కరియర్, నెట్వర్త్ దశాబ్దాల నటనాజీవితంలో 1977 నుండి అనేక సినిమాల్లో నటించారు. అలాగే పలే టెలివిజన్ షోలలో నటించారు. ముఖ్యంగా టాప్ గన్: మావెరిక్ చిత్రంలో 'జిమ్మీ' పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2017లో, హ్యూ జాక్మన్ ప్రధాన పాత్రలో నటించిన అమెరికన్ సూపర్ హీరో చిత్రం లోగాన్లో ఆయన నటించారు. జేమ్స్ హ్యాండీ ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆయన నెటవర్త్ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు ఉండేది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో భారీ ఆస్తులనే కూటబెట్టారు. అప్ టర్న్ బిజినెస్ వారి ఒక నివేదిక ప్రకారం, 2026 నాటికి జేమ్స్ హ్యాండీ నికర ఆస్తి సుమారు 2-3 మిలియన్ డాలర్లు(సుమారు రూ.19-28.8 కోట్లు)గా అంచనా.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్తో రోజుకు రూ. 1500 -
అమీర్పేట ప్రమాదం.. స్పాట్కు ‘హైడ్రా’ రంగనాథ్
హైదరాబాద్: అమీర్పేట మైత్రివనం సిగ్నల్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంత భారీ ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఎలా జరిగింది? అనేదానిపై పోలీసులు కచ్చితమైన ఓ అంచనాకు రాలేకపోయారు. ఈ క్రమంలో.. ఫోరెన్సిక్ టీం శుక్రవారం మరోసారి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసింది. మరోవైపు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ‘‘మంటల్లో బిల్డింగ్ దాదాపుగా కాలిపోయింది. కాంప్లెక్స్కు ఎంట్రీ, ఎగ్జిట్లు సరిగ్గా లేవు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. పక్కన మెస్ నుంచి మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని మరికొందరు అంటున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది దర్యాప్తు పూర్తైతేనే తెలుస్తుంది.. .. మెట్రో నిర్మాణం తర్వాతే ఈ కాంప్లెక్స్ కట్టారని అంటున్నారు. ఫుట్పాత్, నాలా ఆక్రమణలు జరిగాయా? అనే దానిపై దృష్టిసారించాం. అలాగే.. బిల్డింగ్ అనుమతలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. నాలా ఆక్రమణ ఉంటే కచ్చితంగా కూల్చేస్తామని అన్నారాయన. ఈ ప్రమాదం నేపథ్యంలో.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలపై హైడ్రా తరఫున ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారాయన. ఇదిలా ఉంటే.. మైత్రివనం చౌరస్తాలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్ను ఆనుకుని ఉన్న కేఎస్సార్ మాల్ కాంప్లెక్స్లో గురువారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి 20కి పైగా దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. సుమారు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే రెండో అంతస్తులో షార్ట్సర్క్యూట్ జరిగి ఈ ఘోరం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. -
లవర్స్ కోసం.. కుళాయిలు కొట్టేశారు
ప్రేమలో పడితే కొన్నిసార్లు ఆలోచనలకన్నా కోరికలే ముందుకు నడిపిస్తాయి. ప్రియురాళ్లకు గిఫ్ట్గా ఐఫోన్ ఇవ్వాలన్న చిన్న ఆశ ఆ యువకులను పెద్ద నేరం వైపు నెట్టేసింది. కానీ వారు వేసిన ప్లాన్ మాత్రం చివరికి ఊహించని మలుపు తిరిగి కటకటాల పాలు జేసింది.ఇద్దరు యువకులు తమ గర్ల్ఫ్రెండ్స్కు ఐఫోన్లు కొనివ్వాలనే ఉద్దేశంతో ఏకంగా రూ.6.5 లక్షల విలువైన లగ్జరీ డిజైనర్ ట్యాప్స్ను ఓ గోడౌన్ నుంచి దొంగిలించారు. కానీ ఆ ఖరీదైన వస్తువులు చివరికి కేవలం రూ.20 వేలకే స్క్రాప్ డీలర్కు అమ్మేయడం ఈ కేసులో మరో ట్విస్ట్గా మారింది.ఓ గోడౌన్ యజమాని ఫిర్యాదుతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. మే 27–28 మధ్య రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గోడౌన్ పైకప్పులోని టిన్ షీట్లు తొలగించి లోపలికి ప్రవేశించి ఖరీదైన సానిటరీ వేర్ను ఎత్తుకెళ్లారు. గోల్డ్ టోన్, రోజ్ గోల్డ్, సిల్వర్ ఫినిష్ ఉన్న ప్రీమియం ట్యాప్స్ సహా మొత్తం రూ.6.5 లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయి.కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు 20కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సమాచారం, టెక్నికల్ ఇన్పుట్స్ ఆధారంగా కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించారు. విచారణలో ఇద్దరు మైనర్లు సహా ఒక ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడు. ప్రశ్నించగా షాకింగ్ నిజం బయటపడింది గర్ల్ఫ్రెండ్స్కు ఐఫోన్లు కొనాలన్న కోరికతోనే ఈ దొంగతనం చేశామని వారు ఒప్పుకున్నారు. దొంగిలించిన ఖరీదైన ట్యాప్స్ను కేవలం రూ.20 వేలకే అమ్మినట్లు కూడా తేలింది. ఆ వస్తువులు కొనుగోలు చేసిన 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ కోసం వేసిన “కాస్ట్లీ స్కెచ్” చివరికి చీప్ బేరంలో ముగిసి, పోలీసులు కేసును ఛేదించడంతో కథ ముగిసింది. నాగ్పూర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ప్రేమలో గొడవ.. ప్రేయసిపై ఘాతుకం
ప్రేమ సంబంధం.. బెడిసి కొట్టి రక్తసిక్తమైంది. ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. ఆఫీస్లో.. అదీ తోటి ఉద్యోగులు చూస్తుండగానే ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఆపై తన గొంతు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్లోని మొహాలీ నగరంలో గురువారం సాయంత్రం ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాలయంలో సహోద్యోగి చేతితో యువతి దారుణ హత్యకు గురైంది. అక్కడే ఉన్న కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆ ఉన్మాది ఆగలేదు. అనంతరం నిందితుడు తన గొంతును తానే పలుమార్లు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డింపుల్ ఓ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. అక్కడే పని చేసే హర్విందర్ మాన్ అలియాస్ హ్యారీతో మూడేళ్లుగా రిలేషస్షిప్లో ఉంది. అయితే.. కొన్నిరోజులుగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. హ్యారీ డింపుల్ను బతిమాలుతూ వచ్చాడు. ఈ క్రమంలో బ్రేకప్ను వెనక్కి తీసుకునేందుకు డింపుల్ అంగీకరించలేదు. పైగా హెచ్ఆర్కు ఫిర్యాదు చేయడంతో అతనికి నోటీసులు ఇచ్చారు. దీంతో.. గురువారం సాయంత్రం సుమారు 7:40 గంటల సమయంలో నిందితుడు ఆఫీస్లోకి వచ్చాడు. అప్పటికే తన డెస్క్ వద్ద పని చేస్తున్న డింపుల్పై వెనుక నుంచి దాడి చేసి కత్తితో పొడిచాడు. ఆమె ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసినా.. నిందితుడు వెంటాడుతూ జుట్టు పట్టుకుని లాగుతూ మరింతగా దాడి చేశాడు.కార్యాలయంలో ఉన్న సిబ్బంది అతడిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. ఈ దాడిలో డింపుల్కు 20 కత్తిపోట్లు పడ్డట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత నిందితుడు అదే కార్యాలయంలోకి వెళ్లి తన గొంతును తానే పలుమార్లు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరినీ సమీపంలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డింపుల్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడి ఒంటిపై 30 కత్తి పోట్లు ఉన్నాయని.. ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డింపుల్ కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు."Rejected Lover Stabs Ex-Girlfriend to Death Inside Mohali Office, Then Attempts Suicide"#Mohali, #Punjab - In a shocking case of suspected rejection-driven violence, a 30-year-old woman named Dimple was stabbed to death by her former boyfriend inside a private Packers & Movers… pic.twitter.com/GRXcNOjG8f— Siraj Noorani (@sirajnoorani) June 5, 2026 -
భార్య బడిత పూజకు భర్త బలి
ఛతర్పూర్: మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో దంపతుల మధ్య జరిగిన ఘర్షణలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు నీలం కుష్వాహ తన భర్తను కర్రతో కొట్టి చంపింది. ఆపై ఎనిమిది గంటల పాటు మృతదేహం వద్దే కూర్చుంది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. నీలం గత నాలుగేళ్లుగా తన భర్త దీన్దయాల్ కుష్వాహకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది.జూన్ 1న దీన్దయాల్ మద్యం మత్తులో భార్య తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు. దీన్దయాల్ బలవంతంగా తలుపులు తెరిచి.. తమ కొడుకును తలకిందులుగా వేలాడదీశాడని నీలం ఆరోపించింది. తన భర్త బిడ్డకు హాని తలపెడతాడేమోనని ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. దీంతో ఆమె కర్రతో దీన్దయాల్పై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన దీన్దయాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నీలం దాదాపు ఎనిమిది గంటల పాటు భర్త మృతదేహం పక్కనే కూర్చుంది.ఆ తర్వాత స్థానిక గుడికి వెళ్లి.. దేవుడి ముందు 10 నిమిషాల పాటు కూర్చుని క్షమాపణలు వేడుకుంది. అక్కడి నుంచి నేరుగా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఆమె.. తానే తన భర్తను చంపినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్కు తెలిపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లోని మంచంపై ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వేధింపులు, దాడి ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని.. అన్ని కోణాల్లోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేగింది. ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఇంకా మరువక ముందే.. తాజాగా నోయిడాలోని ఓ ఎత్తైన అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.నోయిడాలోని ఐవీ కౌంటీ (Ivy County) అపార్ట్మెంట్ సముదాయంలోని 12వ అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో భవనం పైభాగం నుంచి భారీగా పొగలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్ముకుపోవడంతో నివాసితులు భయాందోళనలకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలోని ఇతర ఫ్లాట్లలో ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.A fire broke out at the IVY County residential complex in Sector 75, Noida, raising serious concerns about the city’s firefighting preparedness. According to residents, fire brigade hoses were unable to project water beyond the sixth floor. pic.twitter.com/YnFPXZvW3N— Sanjay Kishore (@saintkishore) June 5, 2026ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై విచారణ కొనసాగుతున్న వేళే, తాజాగా నోయిడాలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం భవనాల అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రస్తుతం మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాపిడో బైక్ ప్రమాదం.. మహిళా ఇంజినీర్ మృతి
తిరువొత్తియూరు: రాపిడోలో వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఇంజినీర్ మృతి చెందారు. ఆవడి సమీపంలోని తిరుముల్లైవాయల్ ప్రాంతానికి చెందిన గోమతి (30) అనే మహిళ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఈమె రామాపురం ప్రాంతంలోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగి. గురువారం ఉదయం ఆమె యధావిధిగా కార్యాలయానికి వెళ్లేందుకు రాపిడో (బైక్ టాక్సీ) బుక్ చేసుకున్నారు. కొద్దిసేపటికే వచ్చిన రాపిడో బైక్ డ్రైవర్, గోమతిని ఎక్కించుకుని మదురవాయల్ బైపాస్ రోడ్డు మీదుగా వెళ్తున్నారు. పోరూర్ టోల్ ప్లాజా సమీపంలో వెళ్తుండగా, ముందు వెళ్తున్న కారును మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఇందులో నియంత్రణ కోల్పోయిన గోమతి, రాపిడో డ్రైవర్ ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో గోమతి తలకి తీవ్ర గాయాలవ్వడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గోమతి వద్ద హెల్మెట్ ఉన్నప్పటికీ, ఆమె దానిని ధరించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రాపిడో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న మదురవాయల్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఇన్స్పెక్టర్ విజయకుమార్, గోమతి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని సేకరించి, ప్రమాదానికి కారణమై పరారైన వాహనం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
ఒంగోలు టౌన్: ఈత సరదా నలుగురు చిన్నారులను బలిగొంది. అప్పటివరకు ఉత్సాహంగా కేరింతలు కొట్టిన చిన్నారులు విగతజీవులుగా మారి.. తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన కరేటి కల్యాణ చక్రవర్తి ఆర్ఎంపీగా పనిచేస్తుంటాడు. అతడి భార్య లక్ష్మి జానకి ఒంగోలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం. కల్యాణ చక్రవర్తి చెల్లెలు నాగరాజ భర్త పొదిలి రవి కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుమారుడు చిన్నుతో కలిసి తల్లి దగ్గర ఉంటోంది. నాగరాజ కూడా ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. కల్యాణ చక్రవర్తి ఇద్దరు కుమారులైన అభిరామ్(14), సుశాంత్ (12), నాగరాజ కుమారుడు చిన్ను(11), ఎదురింట్లో ఉండే ఇల్లా మాలయ్య కుమారుడు దినేశ్ స్నేహితులు. గురువారం ఉదయం ఆడుకునేందుకని ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం కందులూరు డొంక చెరువులో ఈతకు వెళ్లి.. నలుగురూ మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనం సమయం అవుతున్నా పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఊరంతా వెదికారు. చివరికి చెరువు గట్టు మీద పిల్లల దుస్తులు, చెప్పులు కనిపించాయి. ఈతకు దిగిన పిల్లలు చెరువులో గల్లంతైనట్లు భావించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటల తర్వాత అభిరామ్, సుశాంత్, దినేశ్, చిన్ను మృతదేహాలు బయటపడ్డాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు మరణించడంతో.. వారి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీటి కుంటలో మునిగి మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదయ విదారకమని.. బాధిత కుటుంబాల్లో నెలకొన్న విషాదం మాటల్లో వర్ణించలేనిదని అన్నారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ గారాలపట్టీలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం తీరనిదని.. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు. -
చేయని నేరానికి ఒకరు.. చేసిన నేరం వెంటాడి మరొకరు
ధారూరు: వికారాబాద్ జిల్లా స్టేషన్ధారూరు గ్రామంలో ప్రేమ పేరుతో సాగిన వ్యవ హారం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. చేయని నేరానికి ఒకరిని, గతంలో చేసిన నేరం వెంటాడి మరొకరిని బలి తీ సుకుంది. డీఎస్పీ అంజయ్య, స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రమణీబాయి, రాములు దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. కొడుకు రాజు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా, కూతురు తులసీబాయి వికారాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేసేది. అలాగే నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన పద్దుల మౌనిక రాజుతోపాటే ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసేది. ఈ క్రమంలో రాజు, మౌనిక కలిసి తులసికి కేటాయించిన పోలీస్ క్వార్టర్లో ఆమెతోపాటు ఉండేవారు. అయితే ప్రేమ పేరుతో మౌనికకు దగ్గరైన రాజు ఆమెను లోబర్చుకొని ఆపై మొహం చాటేశాడు. కొద్ది నెలల తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీనిపై రాజును నిలదీసిన మౌనిక.. ఆ తర్వాత తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. అనంతరం ఆమెకు సైతం పెళ్లి నిశ్చయమవగా జీర్ణించుకోలేని రాజు.. మౌనికతో తాను కలిసి దిగిన ఫొటోలను ఆమె కాబోయే భర్తకు పంపించి గొడవలు సృష్టించాడు. దీంతో ఏప్రిల్ 27న మౌనిక తన కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్ వచ్చి రాజు, తులసిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తులసిని పీఎస్కు పిలిపించగా మౌనిక కుటుంబ సభ్యులు ఆమెను దూషించి ఉద్యోగం ఊడగొట్టిస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన తులసి ఇటీవల ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంలో మౌనికపై కేసు నమోదైంది. అయితే ఆమె సైతం తాజాగా వివాహం చేసుకుంది. కానీ తనపై నమోదైన కేసు విషయంలో మౌనికతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు పదేపదే బెదిరించడంతో తట్టుకోలేని రాజు గురువారం తన పొలానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు మౌనికతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులే కారణమని సూసైడ్ నోట్ రాశాడు. చనిపోయే ముందు భార్యకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని రోదిస్తూ చెప్పి పెట్టేశాడు. రాజు ఆత్మహత్య నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో తాండూరు–హైదరాబాద్ రోడ్డుపై మూడు గంటలపాటు ధర్నా చేపట్టారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సూసైడ్ నోట్లోని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ అంజయ్య తెలిపారు. -
‘బాలికకు అతికిన ఎముకను మళ్లీ విరగొట్టాడు’
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మంటగలిపే అమానవీయ ఘటన జరిగింది. లంచం ఇవ్వలేదనే కారణంతో 14 ఏళ్ల బాలికకు అతికిన ఎముకను ప్రభుత్వ వైద్యుడు మళ్లీ విరిచేశాడు. గాయపడిన బాలిక చికిత్సకు ఆ డాక్టర్ రూ. 25 వేలు డిమాండ్ చేశాడు. అప్పటికే బాధిత కుటుంబం రూ. 8 వేలు చెల్లించింది. డిమాండ్ చేసిన రూ.25 వేలు ఇవ్వలేదనే కారణంతో బాలికను పరీక్షల నిమిత్తం పిలిచి కాలు విరిచాడు.దీంతో బాధితులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. తక్షణమే ఉచిత చికిత్స అందించాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జరిగిన ఘటనను తెలుసుకున్న కలెక్టర్తో పాటు అక్కడ ఉన్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వ్యవహారంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) స్పందిస్తూ.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. దాదాపు నెలన్నర క్రితం మానసిక వికలాంగురాలైన తన కుమార్తె కుడి కాలు ఎముక విరిగింది. దాంతో ఆమె కూతురిని తీసుకుని జిల్లా ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ ఆపరేషన్ చేయడానికి రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశారు.భర్త మరణించిన తర్వాత ఒంటరిగా పిల్లలను పోషిస్తున్న ఆమె.. అంత డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారు. దీంతో బాధితురాలైన తల్లి జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)ను ఆశ్రయించింది. డీఎం జోక్యం చేసుకుని.. ఉచితంగా చికిత్స అందించాలని సీఎంఓకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది వైఖరిలో మార్పు రాలేదు.డీఎం దగ్గరకు ఎందుకు వెళ్లావంటూ వైద్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి.. చికిత్స చేయడానికి నిరాకరించారు. చివరికి చేసేదేమీ లేక ఆ తల్లి అప్పు చేసి రూ.8 వేలు ఇవ్వడంతో బాలికకు ఆపరేషన్ చేశారు. మిగిలిన డబ్బును తర్వాత ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆపరేషన్ జరిగిన కొన్ని రోజుల తర్వాత బాధిత తల్లి తన కుమార్తెను ఫాలో-అప్ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అక్కడ ఉన్న డాక్టర్ తీవ్ర ఆగ్రహంతో మాట్లాడి.. మిగిలిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.తన వద్ద డబ్బులు లేవని ఆమె చెప్పడంతో.. ఆగ్రహించిన డాక్టర్ ఆ బాలిక మోకాలిని ఎంత ఘోరంగా మెలి తిప్పాడు. ఆ పిల్ల నొప్పితో గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో కాలు ఎముక విరిగిన శబ్దం స్పష్టంగా వినిపించిందని ఆమె తెలిపింది. దీంతో ఆమె నిలదీయగా.. వైద్యులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి.. బలవంతంగా ఆసుపత్రి నుండి బయటకు నెట్టేశారు.ఇంటికి వచ్చిన తర్వాత బాలిక కాలు విపరీతంగా వాచిపోయి.. రాత్రంతా నొప్పితో విలవిలల్లాడటంతో.. తల్లి ప్రైవేట్ ల్యాబ్లో డిజిటల్ ఎక్స్-రే చేయించింది. ఎక్స్-రే రిపోర్టులో బాలిక కాలు ఎముక మళ్లీ విరిగినట్లు స్పష్టంగా తేలింది. దీనిపై నిలదీయడానికి మళ్లీ ఆసుపత్రికి వెళ్లగా.. వైద్యులు న్యాయం చేయడానికి బదులు.. బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసి అక్కడి నుండి తరిమికొట్టారు. -
ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే అధికారుల అవినీతి, వ్యవస్థ విఫలమై ఇలాంటి ఘోర విషాదాలు సంభవించినప్పుడు, సామాన్య పౌరులే హీరోలుగా నిలుస్తారు. అసాధారణమైన ధైర్య సాహసాలతో బాధితులను మృత్యు ముఖం నుంచి బయటపడేస్తారు. ఢిల్లీ ఘటనలో కూడా స్థానిక యువకులే ఎంతోమంది ప్రాణాలును కాపాడారు.బుధవారం ఉదయం, దక్షిణ ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ఫ్లోరిష్ స్టే బి&బిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఆ సమయంలో స్థానిక నివాసితులు ఎలాంటి రక్షణాలు కవచాలు లేకుండానే రంగంలోకి దూకి ప్రాణాలకు తెగించి మరీ ఎంతోమంది బాధితులను కాపాడారు.భవనాన్ని చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు, నలుదిశలా కమ్మేస్తున్న పొగ, బాధితుల హాహాకరాలు, భయాందోళనలు ఇలాంటి నిస్సహాయ వాతావరణంలో, మంటల నుండి తప్పించుకోవడానికి కిటికీల నుండి దూకుతున్న అనేకమందితో సహా, లోపల చిక్కుకుపోయి వారిని రక్షించాలనే తపనతో వారు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారిలో ఒకరు మహమ్మద్ అఫ్జల్, మౌ.షాహరూఖ్, మౌ.అనీష్, మౌ.అమీర్, మౌ.వసీం, రియాజవుద్దీన్ గద్దె వాలా, ఇంకా స్థానికులు ఉన్నారు. VIDEO | Delhi Malviya Nagar Hospital fire: Wasim Raja, one of the first rescuers, says, "As soon as we reached the scene at around 8:50 am, the entire building was already engulfed in flames. Right across from the building, there is a mattress and quilt shop owned by Riyazuddin,… pic.twitter.com/3XGJc3n4uJ— Press Trust of India (@PTI_News) June 4, 2026మహమ్మద్ అఫ్జల్సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే స్థానికులు ఎలా తాత్కాలిక సహాయక చర్యలు చేపట్టారో వివరించారు. తాము అక్కడి చేరుకునేటప్పటికే భారీ అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయనీ, వెంటనే ఎదురుగా ఉన్న అర్మాన్స్' దుకాణం నుండి తెచ్చిన పరుపులను కింద పరిచి, హోటల్ నుంచి వారిని కిందకు దూకమని కోరామని తెలిపారు. కొందరు విజయవంతంగా దూకగా, మరికొందరు దూకలేకపోయారని అఫ్జల్ చెప్పారు. వీరి మాటల ప్రకారం ఆ తర్వాత, పరిస్థితి విషమించడంతో మంటలు తీవ్రమవడంతో హాజీ సాహిబ్ పోలీస్ స్టేషన్కు, అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. చివరికి, అగ్నిమాపక దళం చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. దాంతో వీరు భవనంలోకి ప్రవేశించి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.రూ. 2 లక్షల విలువైన పరుపులుఅగ్నిప్రమాదం నుండి బాధితులను కాపాడటానికి లక్షల విలువైన పరుపులను వినియోగించారు స్థానిక దుకాణ యజమాని. అతను అతని కుమారుడు లేకపోయి ఉంటే ఈ విషాదం మరింత ఘోరంగా ఉండేది. ఆ ఇద్దరూ దాదాపు రూ. 2 లక్షల విలువైన కొత్త పరుపులను త్యాగం చేసి, అనేక ప్రాణాలను కాపాడటానికి సహాయపడిన ఒక తాత్కాలిక రక్షణ వలయాన్ని ఏర్పరిచారు.తన సరుకుకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా, పరుపుల యజమాని తమకు సహాయం చేయడానికి ఏమాత్రం సంకోచించలేదని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రత్యేకమైన రెస్క్యూ పరికరాలేవి అందుబాటులోలేకపోవడంతో అతని షాపులోని దుప్పట్లతోనే బాధితులను పైఅంతస్తుల నుండి జాగ్రత్తగా కిందకు దించి, ఆసుపత్రిలకు తరలించామని అఫ్జల్ చెప్పారు.వసీం రాజామరో హీరో వసీం రాజా. అత్యవసర పరిస్థితిలో తన వృత్తిపరమైన శిక్షణ కీలకమని నిరూపించారు. మాక్స్ హాస్పిటల్లో పనిచేసే రాజా, పొగ పీల్చడం వల్ల బాధపడుతున్న బాధితులకు సహాయం చేయడానికి వెంటనే తన వైద్య శిక్షణను ఉపయోగించాడు. సామూహిక ప్రాణనష్టం జరగకుండా, సీపీఆర్ (CPR) చేసి కొంతమందికి ప్రాణభిక్ష పెట్టారు. నోటి ద్వారా శ్వాస అందించి కొంతమందిని కాపాడగిలిగాం కానీ, దురదృష్టవశాత్తు మరికొందరిని రక్షించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలు -
ఫోన్ చేసి తమ్ముడికి సమాచారమిచ్చి..
ఒంగోలు టౌన్: ఆ యువకుడు ఆ ఇంటికి పెద్ద కుమారుడు. తల్లిదండ్రుల సంపాదన అంతంతమాత్రమే కావడంతో కుమారుడిగా బాధ్యత నెత్తిమీద వేసుకున్నాడు. ఇంకా చదువుకోవాలని ఉన్నా.. పదో తరగతి వరకే చదివాడు. తమ్ముడిని, చెల్లిని చదివించాలని కలలుగన్నాడు. కానీ, ఆ కలలు తీరకుండానే లోకం విడిచాడు. రోడ్డు ప్రమాదం ఆ ఇంటిని అంతులేని విషాదంలో నింపింది.బాధిత కుటుంబం కథనం ప్రకారం... ఒంగోలు నగరానికి చెందిన కడియం గోపి, శ్రావణి దంపతులకు ముగ్గురు సంతానం. గోపి ఆటో డ్రైవర్, శ్రావణి ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. పెద్ద కుమారుడు లోకేష్ (21) పదో తరగతి వరకే చదువుకున్నాడు. తనకు బాగా చదువుకోవాలని ఉన్నప్పటికీ కుటుంబం గడిచే పరిస్థితి లేకపోవడంతో కష్టంగానే చదువు మానుకుని పనులకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు.త్రోవగుంటలోని ఒక మోటారు సైకిల్ కంపెనీలో పనికి చేరాడు. తమ్ముడు, చెల్లెలు చదువుతుంటే సంతోషించేవాడు. ఎప్పుడూ సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటికి వచ్చే లోకేష్.. మంగళవారం పని ఎక్కువగా ఉందని ఇంటికి రాలేదు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తమ్ముడికి ఫోన్ చేశాడు. ఇంటికి వచ్చే దారిలో దశరాజుపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద తనకు ప్రమాదం జరిగిందని, వెంటనే రావాలని చెప్పాడు. ఆ మాటలు పూర్తి కాకుండానే ఫోన్ స్విచాఫ్ అయింది.ఆందోళన చెందిన లోకేష్ కుటుంబ సభ్యులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రోడ్డు మీద లోకేష్ నిర్జీవంగా పడి ఉన్నాడు. దాంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వారి ఆవేదనతో చూపరుల గుండెలు సైతం తరక్కుపోయాయి. లోకేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమీర్పేట అగ్నిప్రమాదం: భారీగా ట్రాఫిక్జామ్
సాక్షి, హైదరాబాద్: అమీర్పేటలో గురువారం మధ్యాహ్నాం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం సిగ్నల్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్ అగ్నికి ఆహుతైంది. అమీర్పేట మెట్రో జంక్షన్కు 100 అడుగుల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంతో అమీర్పేట చుట్టుపక్కల ఏరియాల్లో భారీగా ట్రాఫిక్జామ్ అయ్యింది.అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద పిల్లర్ నెంబర్ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్ను ఆనుకుని ఉన్న కేఎస్సార్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నుంచి మంటలు మొదలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆపై మంటలు వేగంగా వ్యాపిస్తూ చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించడం మొదలుపెట్టాయి. ప్రమాదం ధాటికి షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. రెండు, మూడు అంతస్థుల్లోని సుమారు 20 దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ఓ మెస్కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో అమీర్పేట-మైత్రివనం ఏరియాలో దట్టమైన పొగ అలుముకుంది. సహాయక చర్యల నేపథ్యంలో.. అమీర్పేట నుంచి ఎస్సార్ నగర్ వెళ్లే వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సిటీ బస్సులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వాటర్ ట్యాంకర్లు, ఆరు ఫైరింజన్లు మంటల్ని అదుపు చేసే రెస్క్యూలో పాల్గొంటున్నాయి. ప్రాణ నష్టం తప్పినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది.మెట్రో సేవలకు అంతరాయం!మైత్రివనం దగ్గర అగ్నిప్రమాదంతో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన ప్లేస్ మెట్రో ట్రాక్కు సమీపంలో ఉండడం, పిల్లర్కు సైతం మంటలు అంటుకోవడం.. ఫైరింజన్లతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండడం మెట్రో రైళ్లలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సజ్జనార్ ట్వీట్మైత్రివనం సిగ్నల్ దగ్గరి అగ్నిప్రమాదంపై నగర కమిషనర్ సీవీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అమీర్పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్లో అగ్నిప్రమాదం సంభవించిందని.. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని.. దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరారాయన. ట్రాఫిక్ అలర్ట్!అమీర్పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్లో అగ్నిప్రమాదం సంభవించింది. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్…— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 4, 2026 -
ఢిల్లీ హోటల్ ఘటన: సిలిండర్ పేలుడు కాదంట!
ఢిల్లీ: మాలవీయా నగర్లోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై.. ప్రాథమిక దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూశాయి. అగ్ని ప్రమాదానికి సిలిండర్ బ్లాస్ట్ కారణం కాదని పోలీసులు ధృవీకరించారు. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘోరం జరిగి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.మొదట్లో ఈ అగ్ని ప్రమాదం ఎల్పీజీ సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా? అనుమానం వ్యక్తమైంది. కానీ దర్యాప్తు బృందాలు ఆ కోణాన్ని ప్రస్తుతం పూర్తిగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత సిలిండర్ పేలుడు జరిగినట్లు సూచించే ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో గ్యాస్ ఎక్స్ప్లోషన్ కారణమన్న వాదన బలహీనపడింది.దర్యాప్తులో బయటపడిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. హోటల్లో రెండు వేర్వేరు కిచెన్లు ఉండటం. వాటిలో ఒకటి భవనం బేస్మెంట్లో ఉండగా, మరొకటి పై అంతస్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు కిచెన్లలోనూ అనేక ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉన్నప్పటికీ, అవి ఏదీ పేలిన ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని ప్రాథమిక తనిఖీల్లో తేలింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో మంటలు ఎలా ప్రారంభమయ్యాయి, ఏ ఎలక్ట్రికల్ పాయింట్ నుంచి షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న అంశాలపై దర్యాప్తు బృందాలు మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బ్రేక్ఫాస్ట్ కోసం వంటమనిషి(చెఫ్) ఎలక్ట్రిక్ స్టవ్ వినియోగ సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ కోణమే ప్రధాన అనుమానంగా కొనసాగుతోంది. అయితే, ఇది తుది నిర్ధారణ కాదని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే పూర్తి స్పష్టత రానుందని అధికారులు పేర్కొంటున్నారు.దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ హౌజ్రాణి ప్రాంతంలో ఉన్న ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. బుధవారం ఉదయం 8.50 గంటల సమయంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లో భవనం అంతటా వ్యాపించడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు ఆఫ్రికా, తుర్క్మెనిస్థాన్కు చెందిన విదేశీయులు కూడా ఉన్నారు. గురుగ్రావ్కు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు మరణించారు. మరో 35 మంది గాయపడగా, వారిలో 19 మంది పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. భవనంలో ఒకే ఎగ్జిట్ ఉండటం, అనుమతులకు మించి గదులు నిర్వహించడం, బేస్మెంట్తో సహా అనధికార నిర్మాణాలు ఉండటం వల్ల ఎక్కువ మంది బయటపడలేకపోయారని అధికారులు చెబుతున్నారు. కొందరు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా, ఒక మహిళ తన చిన్నారితో సహా మూడో అంతస్తు నుంచి దూకిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ హోటల్ ప్రభుత్వ B&B పథకం కింద నడుస్తుండగా, కేవలం ఆరు గదుల అనుమతి ఉన్నా 25 గదుల వరకు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న హోటల్ యాజమానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. ప్రమాద సమయంలో తాను అక్కడే ఉన్నానని.. భయంతో పారిపోయానని చెబుతున్నాడతను. -
ఆస్తికోసం తల్లిదండ్రులు, సోదరి హత్య, ఆ తర్వాత షాకింగ్ ఘటన
ప్రయాగ్రాజ్ : డబ్బు, ఆస్తి మీద విపరీమైన వ్యామోహంతో ఎంతటి దారుణానికైనా తెగ బడుతున్నారు మనుషులు. మానవ విలువల్ని, బంధాల్ని బంధుత్వాల్ని మరిచి సొంత తల్లిదండ్రులను, తోగబుట్టిన సోదరిని హత్య చేశాడో దుర్మార్గుడు. చివరికి అతను కూడా అదే అత్యాశకు బలైపోయాడు. ఉత్తర ప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భవనంలోఈ దారుణ ఘటన వెలుగు చూసింది. కర్మ ఎవరిని విడిచిపెట్టదనే సూత్రం వీరి విషయంలో అక్షరాలా నిజమైంది.పోలీస్ కమిషనర్ జోగేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ మలకా ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో వివాదం నెలకొంది. వీరేంద్ర వైశ్య, ఆయన భార్య తమ ఆస్తి నుండి కుమారుడు అభిషేక్కు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో వారి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు అభిషేక్. తల్లిదండ్రులు, సోదరిని చంపడానికి ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే తన స్నేహితుడు సన్నీ గుప్తాను ఇంటికి పిలిపించు కున్నాడు. ప్లాన్ ప్రకారం వారిని మట్టుబెట్టాడు. ఆ తర్వాత, ఇద్దరూ కలిసి ఇంటో దొంగిలించిన విలువైన వస్తువులను పంచుకోవడానికి గ్రౌండ్ ఫ్లోర్లోని దుకాణానికి వెళ్లారు. అయితే ఈ పంపకాల సమయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో ఏరాడ్తో అయితే తల్లిదండ్రులను హత్య చేశాడో అదే రాడ్తో అభిషేక్ను హత్య చేసి, శవాన్ని దుకాణంలోనే వదిలేసి, షాప్కు తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు సన్నీ.రెండు రోజుల తరువాత ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా భయంకరమైన దృశ్యం కనిపించింది. మే 31 సాయంత్రం అభిషేక్, గుప్తాతో కలిసి వీరేంద్ర, అనిత, మీనాక్షిలను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో వీరేంద్ర వైశ్య (70), ఆయన భార్య అనిత (65), కుమార్తె మీనాక్షి (45) మృతదేహాలను స్వాధీనం తీసుకున్నారు.మొదట, అభిషేక్ హంతకుడై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావించి, అతని కోసం గాలించారు.. కానీ మృతదేహాలపై డిటర్జెంట్, శుభ్రపరిచే రసాయనాలుపూసి ఉండటంతో, రక్తపు మరకలున్న టీ-షర్టు, కుటుంబ కలహాలు, ఆభరణాలచోరీ , నకిటీ నోట్ ఆధారంగా హత్య పథకాన్ని వారు వెలికితీశారు. అదే భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తాళం వేసిన దుకాణాన్ని బలవంతంగా తెరిచారు. అక్కడ అభిషేక్ వైశ్య (40) మృతదేహం లభించింది. సిసిటివి ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించి నిందితుడైన సన్నీ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. అతడినుంచి బంగారం, 360 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.ఫ్యామిలీ బిజినెస్ వీరేంద్ర వైశ్య ఆ ప్రాంతంలో పేరున్న వ్యాపారవేత్త. భార్య అనిత, కుమార్తె మీనాక్షి, పెద్ద కుమారుడు అభిషేక్తో కలిసి ఆ భవనంలో నివసించేవాడు. కింది అంతస్తులో సుమారు 15 నుండి 16 దుకాణాలు ఉండేవి, వాటిలో చాలా వరకు అద్దెకు ఇచ్చి, ప్రతి నెలా లక్ష రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆర్జించేవి. లిక్విడ్ డిటర్జెంట్ మరియు టాయిలెట్ క్లీనర్లతో సహా వెస్టిజ్ ఉత్పత్తులను అమ్మే దుకాణాన్ని అభిషేక్ నడిపేవాడు. మరొకటి మీనాక్షికి చెందింది. ఆమె ఇటీవలే ఒక గిఫ్ట్ గ్యాలరీ వ్యాపారాన్ని ప్రారంభించింది.చిన్నకొడుకుతో విభేదాలు, తప్పుడు నోట్కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు, సుమారు 15 ఏళ్ల క్రితం వీరేంద్ర తన చిన్న కొడుకు అశ్వినిని తన కొడుకు కాదని వదిలేశాడని సమాచారం. ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలు పదేపదే తలెత్తుతూ ఉండేవి. వీరిద్దరినీ బంటీ, బబ్లూ అని పిలిచేవారు. ఈ హత్యను తప్పు దారి పట్టించేందుకు బంటీ , కోడలు బబ్లూనే చంపారు అనే నోట్ వదిలారు. అయితే వివాహ వెబ్సైట్ మోసాలకు సంబంధించిన ఒక కేసులో అశ్విని, రితు 2024లో జైలు పాలయ్యారు. -
శివ.. ది ‘గాంజా’ ట్రాన్స్పోర్టర్! నా దారిలో నో టోల్గేట్!
సాక్షి, రంగారెడ్డి: అంతరాష్ట్ర గంజాయి ట్రాన్స్పోర్టర్గా మారిన ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ సరుకు సరఫరాలో తనదైన పంథాను అనుసరిస్తున్నాడు. ఎక్కడా టోల్గేట్ దాటకుండా నాలుగు రాష్ట్రాల్లోని గమ్యాలకు చేరుతున్నాడు. అక్కడ ఉన్న డ్రగ్ పెడ్లర్స్కు సరుకు అప్పగిస్తున్నాడు. ఈ పంథాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుడిని జూబ్లీహిల్స్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.79 లక్షల విలువైన 158 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు.ఇల్లు కట్టి ఇరుక్కుపోయిన వైనం...ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడానికి చెందిన పనగూడు శివకృష్ణ 2009లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో (ఎన్డీఆర్ఎఫ్) డిప్యుటేషన్పై ఉన్న శివ కేరళంలో పని చేసేవాడు. అక్కడి ఉట్టూరులో విలాసవంతమైన ఇల్లు కట్టిన శివ అప్పుల్లో మునిగిపోయాడు. ఇదిలా ఉండగా... మోతుగూడానికి చెందిన కొందరి ద్వారా ఇతడికి సీలేరు కేంద్రంగా గంజాయి పండించే వారితో పరిచయం ఏర్పడింది. అప్పులు తీర్చుకోవడంతో పాటు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం గంజాయి ట్రాన్స్పోర్టర్గా మారాడు. సరుకు తీసుకువెళ్లడానికి డిక్కీ పెద్దగా ఉంటుందనే ఉద్దేశంతో కేరళంలో చేవ్రొలెట్ కంపెనీ కారు ఖరీదు చేశాడు. దాని డిక్కీలో సరుకు సర్దుకుని సీలేరు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న పెడ్లర్స్కు సరఫరా చేస్తున్నాడు.దూరమైనా టోల్గేట్లు దాటడు...ఏదైనా ఓ ప్రాంతానికి గంజాయి తీసుకువెళ్లాలంటే ఆ గమ్యస్థానానికి దారితీసే మార్గాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా అధ్యయనం చేస్తాడు. కాస్త దూరం ఎక్కువైనప్పటికీ ఎక్కడా టోల్గేట్ దాటకుండా జాగ్రత్తపడతాడు. తన కదలికలు బయటపడకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. ఒక్కో ట్రిప్కు రూ.5 నుంచి రూ.6 లక్షలు ఆర్జిస్తున్నాడు. 2023లో ఇతడిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట ఠాణాలో కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మార్చుకోని శివ నెట్వర్క్ మరింత విస్తరించుకుని దందా కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం టాస్క్ఫోర్స్ పోలీసులు అంబర్పేటలో ఓ డ్రగ్ పెడ్లర్ని పట్టుకున్నారు. ఇతడి విచారణలో శివ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ యదేందర్, ఎస్సై డి.రవి రాజ్ నేతృత్వంలోని బృందం బుధవారం ఎస్సార్నగర్ పరిధిలో అతడి పట్టుకుంది. ఈసారి ఇతడు షోలాపూర్ వెళ్తున్నాడని అధికారులు చెప్తున్నారు.ప్రతి నెలా కనీసం మూడు ట్రిప్పులు..తనకు వచ్చే ఆర్డర్స్ ఆధారంగా శివ ప్రతి నెలా కనీసం మూడు ట్రిప్పులు వేసి సరుకు సరఫరా చేస్తుంటాడు. సీలేరుతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి సరుకు తీసుకునే ఇతగాడు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ప్రయాణం ప్రారంభిస్తాడు. మరుసటి రోజు అదే సమయానికి గమ్యానికి చేరుకుంటాడు. ఆయా రహదారుల్లోని టోల్గేట్స్ను తప్పించుకు తిరిగే ఇతగాడు మిగిలిన చోట్ల పోలీసులు ఆపితే తన సీఐఎస్ఎఫ్ గుర్తింపు కార్డు చూపించి బయటపడతాడు. 2023లో కేసు నమోదైన నాటి నుంచి ఇతడు సస్పెన్షన్లో ఉన్నట్లు డీసీపీ రఘునాథ్ చెప్పారు. -
అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్!
ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో జరిగిన ఘోర హోటల్ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తండ్రి చికిత్స కోసం ఆసుపత్రికి దగ్గరగా ఉండాలని గుర్గ్రామ్ నుంచి వచ్చిన ఆ కుటుంబం.. అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. సౌత్ ఢిల్లీలోని ఫ్లారిష్ స్టే బీ అండ్ బీ హోటల్లో మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐదు అంతస్తుల ఇరుకైన భవనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారికి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది మృతి చెందగా, వారిలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మరణించిన భారతీయుల్లో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. గుర్గ్రామ్ సెక్టార్ 46కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ అగర్వాల్ (48), ఆయన భార్య తరణి అగర్వాల్, తల్లి ప్రేమలత అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా (ఏంజెల్), వర్య (పర్ల్)తో పాటు మరో ఇద్దరు బంధువులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రెండు తరాలు ఈ ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయాయి.ఈ కుటుంబం ఢిల్లీకి రావడానికి కారణం అత్యంత హృదయ విదారకం. వివేక్ తండ్రి రాధేశ్యామ్ అగర్వాల్ (80లు) శ్వాస సంబంధిత వ్యాధితో సాకేత్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, ఆయనకు దగ్గరగా ఉండేందుకు కుటుంబం సమీపంలోని హోటల్లో బస చేసింది. తండ్రిని చూసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన ఈ ప్రయాణం ఒక్కసారిగా శాశ్వత విషాదంగా మారింది.తరుణి అగర్వాల్ వైపు నుంచి వచ్చిన మరో ముగ్గురు బంధువులు కూడా అదే హోటల్లో ఉండగా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం ఎనిమిది మంది ఒకే కుటుంబం నుంచి మరణించారు. మరింత హృదయ విదారకంగా, చికిత్స పొందుతున్న రాధేశ్యామ్ అగర్వాల్ వద్దకే తన భార్య, కుమారుడు, కోడలు, మనవళ్లు, బంధువుల మృతదేహాలు చేరిన పరిస్థితి కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది.ఈ ఘటనలో మరణానికి ముందు జరిగిన చివరి క్షణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యుడు పునీత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, మంటల సమయంలో వివేక్ అగర్వాల్ చివరిసారిగా ఫోన్ చేసి “బహుశా మేము బతకలేము” అని చెప్పినట్లు తెలిపారు. తడి రుమాలు ముఖానికి పెట్టుకోవాలని సూచించినా.. పరిస్థితి వేగంగా దారుణంగా మారిందని ఆయన పేర్కొన్నారు.ప్రాథమిక దర్యాప్తులో హోటల్లో తీవ్ర భద్రతా లోపాలు ఉన్నట్లు బయటపడింది. ఒకే ప్రవేశ–నిష్క్రమణ మార్గం ఉండడం, చిన్న కిటికీలు, సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల అనేక మంది బయటకు రాలేకపోయారు. కొన్ని కిటికీలు మూసివేయబడినట్లు కూడా గుర్తించారు.అంతేకాకుండా హోటల్ అనుమతి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి. బీ అండ్ బీ విధానంలో ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉండగా, అక్కడ 25 గదులు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్లో అనుమతి లేకుండా రెస్టారెంట్ నడపడం, బేస్మెంట్లో సరైన ఎగ్జిట్ లేకపోవడం, భవనం చుట్టూ గుంపుగా ఉండటం, విద్యుత్ తీగల అడ్డంకులు కూడా రక్షణ చర్యలకు ఆటంకంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో హోటల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.మొత్తం ఘటనలో గుర్తింపు సమస్యలు కూడా కుటుంబాలను తీవ్రంగా బాధిస్తున్నాయి. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను ఫోటోల ఆధారంగా గుర్తించడం కూడా సాధ్యం కావడం లేదని బంధువులు చెబుతున్నారు. ఆసుపత్రుల వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, కన్నీరు.. హృదయాలను కలిచివేస్తున్నాయి. -
NRI : అమెరికాలో రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు. -
ఐసీయూలో మంటలు.. పలువురి సజీవదహనం!
పాట్నా: దేశ రాజధాని ఢిల్లీలోని హోటల్ అగ్నిప్రమాదం విషాదం మరువకముందే బిహార్లో మరో ఘోర ఘటన చోటుచేసుకుంది. ముజఫర్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు సమాచారం. మరికొందరికి గాయాలు కాగా.. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రసాద్ ఆస్పత్రి ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూ విభాగంలో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. క్షణాల్లోనే దట్టమైన పొగ భవనం అంతటా వ్యాపించడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ కారణంగా పలువురు శ్వాస తీసుకోలేక అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సమాచారం.అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర సేవల బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అత్యవసరంగా ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో ఇప్పటిదాకా ముగ్గురు మరణించినట్లు సమాచారం అందుతోంది.मुजफ्फरपुर के प्रसाद हॉस्पिटल के ICU में लगी भीषण आग ने दिल दहला दिया। हादसे में 3 लोगों की मौत की खबर है, जबकि कई मरीज आग की चपेट में आए। अस्पतालों में सुरक्षा व्यवस्था और फायर सेफ्टी मानकों पर गंभीर सवाल खड़े हो गए हैं।दिवंगतों के परिजनों के प्रति संवेदना। प्रशासन से निष्पक्ष… pic.twitter.com/0gZPFHnnb2— Indian Observer (@ag_Journalist) June 4, 2026ప్రాథమిక విచారణలో.. షార్ట్సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ మాలవీయ నగర్లోని హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మరణించిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన నేపథ్యంలో, తాజాగా బిహార్లో ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ విషాదం మరింత కలకలం రేపుతోంది.కీలకాంశాలుబిహార్లోని ముజఫర్పూర్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదంఐసీయూ విభాగంలో ప్రారంభమైన మంటలుముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం!20 మందికి పైగా రోగులను సురక్షితంగా బయటకు తెచ్చారుపలువురి పరిస్థితి విషమం.. మృతుల సంఖ్య పెరిగే చాన్స్షార్ట్సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానంకొనసాగుతున్న సహాయక చర్యలు.. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం -
ఉపమాక వెంకన్న ఆలయంలో భారీ చోరీ
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం భారీ చోరీ జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న ఈ ఆలయం టీటీడీకి అనుబంధంగా ఉంది. ఆలయంలో సీసీ కెమెరాలు, టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణ ఉన్న సమయంలోనే అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి రెండు హుండీలను పగులగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకుపోయారు. 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని 2015లో టీటీడీ పరిధిలోకి తీసుకున్నారు. ఇంత ప్రసిద్ధి గాంచిన ఆలయంలోకి మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు ఆలయం వెనుక నుంచి ప్రవేశించి ఉత్సవమూర్తులకు ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో హుండీని, ఆండాళ్లమ్మ అమ్మవారి సన్నిధిలో ఉన్న హుండీని కట్టర్లతో పెకిలించారు. ఆస్థాన మండపంలో ఉన్న హుండీలో స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకుపోయారు. అపహరణకు గురైన సొమ్ము సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఆలయ ఇన్స్పెక్టర్ కూర్మేశ్వరరావు చెబుతుండగా, సుమారు రూ.4లక్షలు పైనే ఉంటుందని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉన్నా కూడా చోరీ ..! ఈ ఏడాది మార్చి 5వ తేదీన హుండీల కానుకలను లెక్కించారు. ఏటా స్వామివారికి కానుకల రూపంలో సుమారు రూ.40 లక్షల మేర ఆదాయం లభిస్తుంది. స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలను లెక్కించి తెల్లవస్త్రంలో మూటకట్టి ఆస్థాన మండపంలోని హుండీలో ఉంచినట్టు దేవస్థానం వారు చెబుతున్నారు. అయితే పోలీస్ జాగిలాలు ఆలయం వెనుక కొండ ప్రాంతంలో ఆ ఆభరణాల మూటను గుర్తించాయి. పోలీసులు, దేవస్థానం అధికారుల సçమక్షంలో తూకం వేయగా 56 గ్రాముల బంగారం, 2.70 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. దుండగులు మిషన్తో గర్భగుడి తలుపులు కత్తిరించడానికి యత్నించి రాకపోవడంతో వదిలేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నక్కపల్లి, అడ్డురోడ్డు సీఐలు జె.మురళి, ఎల్.రామకృష్ణ, ఎస్ఐ సన్నిబాబు క్లూస్ టీములను రప్పించి, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. -
లైంగిక దాడి, అశ్లీల ఫోటోలు, వీడియోలు : ఐఐటీ బాబా గలీజు దందా
ఐఐటీ (IIT) గ్రాడ్యుయేట్ మథురై బాబాగా పేరొందిన అభిషేక్ మిశ్రా అలియాస్ అధికార్త నారాయణ్ దాస్ (29) గుట్టు రట్టైంది. ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో 29 ఏళ్ల స్వీయ-ప్రకటిత ఆధ్యాత్మిక గురువు చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆధ్యాత్మిక గురువుగా నటిస్తూ యువతులను లైంగికంగ దోచుకోవడం, వారిని, వారి కుటుంబాలను బ్లాక్మెయిల్ చేయడం లాంటి ఆరోపణలతో పోలీసులు అతగాడిని అరెస్ట్ చేశారు.ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశ చూపి విద్యావంతులైన యువతులను లైంగికంగా దోపిడీ చేస్తున్న ఆరోపణలపై మిశ్రాను సోమవారం రాధా కుండ్లోని అతని ఆశ్రమంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతులను లైంగికంగా వేధించడమే కాకుండా వారి నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులు ఆ ప్రాంగణం నుంచి ఇద్దరు యువతులను, ఒక యువకుడిని కూడా రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు.మే 25న ఛత్తీస్గఢ్కు చెందిన 22 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని గోవర్ధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మిశ్రా తనకు 'ప్రసాదం' అని చెప్పి పాలు ఇచ్చాడని, అందులో మత్తు కలిగించే పదార్థం ఉందని నర్సింగ్ విద్యార్థిని ఆరోపించింది. పాలు తాగిన తర్వాత తాను స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత అతను తనపై అత్యాచారం చేసి, అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశాడని ఆ మహిళ ఆరోపించింది. ఈమె ఫిర్యాదు మేకు కేసు నమోదైంది.ఇదీ చదవండి: విమానయాన, ఇంధన సంస్థలకు గుడ్ న్యూస్: కేబినెట్ కీలక నిర్ణయండీఎస్పీ అనిల్ కుమార్ సింగ్ సమాచారం ప్రకారం నిందితుడు బాధితురాలిని బెదిరించి, డబ్బు చెల్లించకపోతే ఆమె వీడియోలను ప్రచారం చేస్తానని హెచ్చరిస్తూ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. దర్యాప్తులో భాగంగా, నిందితుడి మొబైల్ ఫోన్ నుంచి పోలీసులు వివిధ పురుషులు, మహిళలకు చెందిన డజనుకు పైగా అశ్లీల ఫోటోలను స్వాధీనం చేసుకున్నారు. మిశ్రా ఆన్లైన్లో ప్రసంగాలతో అనుచరులను ఆకర్షించేవాడని, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా అభిషేక్ మిశ్రా మథురలోని రాధాకుంజ్ ప్రాంతంలో నివసిస్తూ, తనను తాను ఒక 'కథావాచక్' (ఆధ్యాత్మిక ప్రవచనకారుడు) గా పరిచయం చేసుకున్నాడు. యూట్యూబ్లో "రాధా కృప అమృత" (Radha Kripa Amrita) అనే ఛానెల్ ద్వారా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రవచనాలు చెబుతూ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ప్రత్యేకంగా విద్యావంతులైన మహిళలను, ముఖ్యంగా ఇంజనీర్లు, పెద్ద కంపెనీలలో పనిచేసే నిపుణులను లక్ష్యంగా చేసుకుని, వారిని లైంగికంగా వేధించి, బ్లాక్మెయిల్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగుతోందని, నిందితుడిని జైలుకు తరలించామని ఎస్పీ (గ్రామీణ) సురేష్ చంద్ర రావత్ తెలిపారు. మిశ్రా నేపథ్యం, బాధితులపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : షాకింగ్ విషయాలు వెలుగులోకివిచారణ సమయంలో మిశ్రా పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, అతను సుమారు ఐదేళ్ల క్రితం ఐఐటి రూర్కీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. మధురకు వెళ్లడానికి ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో సంవత్సరానికి రూ. 20 లక్షల జీతంతో పనిచేశాడు. ఇదీ చదవండి: హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్ -
ఢిల్లీ విషాదం : షాకింగ్ విషయాలు వెలుగులోకి
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిప్రమాదం జరిగిన ప్రతిసారీ పునరావృతమయ్యే విషాద గాథ ఇదే. అంతులేని నిర్లక్ష్యం, నిబంధనలను తుంగలో తొక్కే అధికారుల అవినీతి, అధికారిక పర్యవేక్షణ లోపం వెరసి అమాయక ప్రజల ప్రాణాలు. ఢిల్లీలోని ఒక హెటల్లో జరిగిన అత్యంత విషాదకర ఘటన ఈ విషయాలనే మరోసారి తేటతెల్లం చేస్తోంది. బుధవారం ఉదయం ఢిల్లీలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఎక్కువమంది వైద్య కోసం వచ్చిన విదేశీయులు ఉండటం మరో విషాదం. అయితే ఈ హోటల్కు అనుమతికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఎన్డీటీవీ కథనం ప్రకారం హౌజ్ రాణి ప్రాంతంలోని ఈ హోటల్కు ఢిల్లీ ప్రభుత్వం బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ (బి&బి) పథకం కింద లైసెన్స్ మంజూరు చేసింది. దీని ప్రకారం, ఒక కాంప్లెక్స్ కేవలం ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఫ్లోరిష్ స్టే, బేస్మెంట్లోని కొన్ని గదులతో సహా 25 గదులను నిర్వహిస్తోంది.మరోవైపు ఢిల్లీ పోలీసుల ప్రకారం, ఈ హోటల్కు ఎంట్రీ, ఎగ్జిట్కు ఒకే దారి ఉంది. ఈ హోటల్లో 25 గదులు ఉండటం, ఏ సమయంలోనైనా అనేక మంది అతిథులు బస చేస్తుండటం గమనిస్తే, ఇది మరో నిబంధనల ఉల్లంఘనే. హోటల్కు అవసరమైన అగ్నిమాపక భద్రతా అనుమతులున్నట్టు తెలుస్తోంది. దీనిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.ఇదీ చదవండి: 7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడికాగా ఐదంతస్తుల భవనం బేస్మెంట్లో ఉన్న రెస్టారెంట్లో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మికాసా ఇన్ హోటల్ను కూడా ప్రభావితం చేశాయి. దట్టమైన పొగ, మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో, డజన్ల కొద్దీ అతిథులు లోపల చిక్కుకుపోయారు. దీంతో అత్యవసర సేవల సిబ్బంది భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాటర్ ఇంజన్లు, రెండు వాటర్ బౌజర్లు, ఒక క్విక్-రెస్పాన్స్ వాహనం, ఇతర అత్యవసర వనరులతో సహా పలు అగ్నిమాపక బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి, 40 మందికి పైగా ప్రజలను రక్షించారు. సంఘటన జరిగిన సమయంలో అందులో దాదాపు 40 మంది అతిథులు బస చేస్తున్నారని అధికారులు తెలిపారు. సమీపంలో మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు దగ్గరగా ఉండటం వల్ల చాలా మంది అతిథులు ఈ హోటల్నే ఎంచుకుంటారు. ఇదీ చదవండి: హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్ -
మోనాలిసా దంపతులకు ఊరట
కొచ్చి: కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన మోనాలిసా భోస్లేకు, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్కు ఊరట లభించింది. వాళ్లను అరెస్ట్ చేయొద్దని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.మోనాలిసా మైనర్ అని, ఆమెను కిడ్నాప్ చేశారనే ఆరోపణలు.. అలాగే ఈ వివాహం చట్టబద్ధం కాదనే మధ్యప్రదేశ్ పోలీసుల అభ్యంతరాల నేపథ్యంలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ అభియోగాలను తోసిపుచ్చుతూ అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ మోనాలిసా, ఫర్మాన్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నెలరోజుల పాటు ఫర్మాన్ ఖాన్ను అరెస్ట్ చేయొద్దని మద్యప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఈలోగా.. అక్కడి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఈ జంటకు కోర్టు సూచించింది. 2025 కుంభమేళా సందర్భంగా పూసలు విక్రయిస్తూ వైరల్ అయిన మోనాలిసా భోస్తే Monalisa Bhosle ఈ ఏడాది ప్రారంభంలో కేరళలో మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకుంది. మతాంతర వివాహం కావడంతో ఈ వ్యహారం పెను దుమారం రేపింది. అయితే మోనాలిసా వివాహం సమయంలో కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఉన్నారని ఆరోపణలు రావడంతో వివాహ చట్టబద్ధతపై వివాదం చెలరేగింది. దీంతో పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. ఇక మోనాలిసా తండ్రి పోలీసులకు కిడ్నాప్ ఫిర్యాదు చేయడంతో ఫర్మాన్ ఖాన్పై కేసు నమోదైంది. తాము ఎలాంటి అక్రమానికి పాల్పడలేదని, మోనాలిసా మైనర్ కాదని దంపతులు కోర్టులో వాదించారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు, మోనాలిసా వయస్సుకు సంబంధించిన పత్రాల్లో ఫోర్జరీ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె జననం 2009 డిసెంబర్లో జరిగిందని, దంపతులు చెబుతున్నట్లుగా 2008 జనవరిలో కాదని వాదించారు. అయితే ఈ ఆరోపణలను మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు ఖండించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్.. ఒక నెలపాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.ఇదీ చదవండి: కేరళలో ఉండడం మీ అదృష్టం! -
ఢిల్లీ మృత్యుకేళి: ప్రాణాల కోసం పై నుంచి దూకారు..!
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో బుధవారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. హౌజ్రాణి ఏరియాలోని ఓ హోటల్లో భారీగా మంటలు చెలరేగడంతో 21 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా.. 40 మందికిపైగా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్నవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. ప్రమాద సమయంలో హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి.మంటలు వేగంగా వ్యాపించడంతో రెస్టారెంట్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో లోపల చిక్కుకున్న అతిథులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు భవనం పైఅంతస్తుల నుంచి కిందకు దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలో ఓ విదేశీయుడు, ఓ మహిళ ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటన్నది తెలియరావడం లేదు. మరికొందరు కూడా ప్రాణాలు అరచేత పట్టుకుని భవనం నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు. వాళ్లలో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. కింద నిల్చున్న స్థానికులు తమ ఫోన్లలో ఆ దృశ్యాలు బంధించారు.VIDEO | Death toll in fire in restaurant in south Delhi's Malviya Nagar goes up to 21, many of those killed are foreigners: officials. Latest visuals from incident spot.#DelhiNews #MalviyaNagarHotelFire(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/8QS1kYrx4v— Press Trust of India (@PTI_News) June 3, 2026ఉదయం సుమారు 9 గంటల సమయంలో అగ్నిప్రమాద సమాచారం అందడంతో ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పది కంటే ఎక్కువ ఫైర్ ఇంజిన్లు, ప్రత్యేక రక్షణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పొగతో నిండిపోయిన భవనంలోకి ప్రవేశించి చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు.Delhi hotel fire: woman seen jumping off building#MalviyaNagar #DelhiFire pic.twitter.com/4LoMU1ypqF— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026నిబంధనలకు విరుద్ధంగా..!ఈ ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ 'బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్' పథకం కింద కేవలం ఆరు గదులు నిర్వహించేందుకు మాత్రమే అనుమతి పొందిన లెమన్ గ్రీన్ హోటల్.. నిబంధనలకు విరుద్ధంగా 25 గదులు నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. బేస్మెంట్లో కూడా గదులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో భవన భద్రతా ప్రమాణాలు, అనుమతుల ఉల్లంఘనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Delhi Hotel Fire: Death Toll Rises to 21 in Malviya Nagar Tragedy#MalviyaNagar #DelhiFire pic.twitter.com/3lEpgIKWBM— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026#दिल्ली: मालवीय नगर के होटल में लगी आग पूरी इमारत में फैली, दर्दनाक हादसे में 10 लोगों की जलकर मौत #Malviyanagar #Delhifire #Breaking pic.twitter.com/zymTBTdWQt— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) June 3, 2026అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హోటల్ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించిందా? అనుమతులకు మించి కార్యకలాపాలు నిర్వహించిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ఢిల్లీ ప్రమాదం.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ -
కేరళలో ఉండడం మీ అదృష్టం!
కొచ్చి: కుంభమేళా సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే కేసులో కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోనాలిసా, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ ముగిసింది. బుధవారం(ఇవాళ) ఈ కేసు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న తీర్పు రిజర్వ్ చేసే సమయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.విచారణలో భాగంగా న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ “మీరు కేరళలో ఉన్నందుకు అదృష్టవంతులు” అని వ్యాఖ్యానించారు. దానికి మొనాలిసా తరఫు న్యాయవాది.. అందువల్లే వీళ్లు ఇంకా బతికి ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై నెట్టింట దుమారం రేగింది. జడ్జి వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..న్యాయ వర్గాల ప్రకారం కోర్టు ఉద్దేశం కేసుపై ప్రత్యక్ష అభిప్రాయం వ్యక్తం చేయడం కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ కేసు చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, ఒత్తిళ్లు, భద్రతా పరిస్థితులను పరోక్షంగా సూచించడమేనని భావిస్తున్నారు. కేరళలో న్యాయ ప్రక్రియ తక్కువ ఒత్తిడితో, మరింత నిష్పక్షపాత వాతావరణంలో సాగుతోందన్న సందేశాన్ని ఆ వ్యాఖ్య ద్వారా ఇచ్చినట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఈ కేసు ఒక సాధారణ వివాహ వివాదం నుంచి ఇప్పుడు ఇంటర్ఫెయిత్ వివాహం, వయస్సు నిర్ధారణ(ఆమె మైనర్ అనే ఆరోపణలు), ఫోర్జరీ ఆరోపణలు, కిడ్నాప్ కేసులు వంటి పలు తీవ్రమైన ఆరోపణలతో కేరళ-మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెద్ద న్యాయ వివాదంగా మారింది. మోనాలిసా వివాహం, ఆమె వయస్సు నిర్ధారణ, మతాంతర వివాహ చట్టబద్ధతతో పాటు పలు రాష్ట్రాల్లో నమోదైన క్రిమినల్ కేసులు వంటి పలు క్లిష్ట అంశాలు ఒకేసారి విచారణ జరిగాయి.ఇక మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమపై వివిధ వర్గాల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వయస్సు తప్పుడు నమోదు, ఫోర్జరీ ఆరోపణలు సహా కేసు తీవ్రమని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు కేవలం వ్యక్తిగత వివాదంగా కాకుండా రెండు రాష్ట్రాల అంశంగా మారింది. తీర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. -
కాగితాలు ఏరుకునే వ్యక్తి పేరిట.. బీమా మోసం!
సుల్తాన్బజార్: చనిపోయిన వ్యక్తి పేరు మీద రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని బీమా డబ్బులు కాజేయాలని చూసిన ఓ ముఠా గుట్టును సుల్తాన్బజార్ పోలీసులు రట్టు చేశారు. చాదర్ఘాట్ వద్ద కాగితాలు ఏరుకుంటూ బతికే తలారి వెంకటయ్య అనే వ్యక్తి 2023 జనవరి 9న విద్యుదాఘాతంతో చనిపోయాడు.ఈ మరణాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న బోడ శ్రీకృష్ణ అనే వ్యక్తి స్టార్ హెల్త్ ఏజెంట్ మల్దే మహేష్, సేల్స్ మేనేజర్ మడసిరావార వంశీకృష్ణలతో కుమ్మకై పక్కా స్కెచ్ వేశాడు. 2024 డిసెంబర్లో వెంకటయ్య పేరు మీద స్టార్ హెల్త్ యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకున్నారు. మృతుడి బావమరిదినంటూ శ్రీకృష్ణ నామినీగా నమోదు చేసుకున్నాడు. 2025 ఏప్రిల్ 28న ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల పాత ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం, ఇన్వెస్ట్ రిపోర్టులను ఫోర్జరీ చేశారు.క్లైమ్ కోసం దరఖాస్తు చేయగా స్టార్ హెల్త్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మహ్మద్ అబ్దుల్ బారీ చేసిన అంతర్గత విచారణలో బండారం బయటపడింది. పాలసీ తీసుకోవడాని కంటే ముందే వెంకటయ్య చనిపోయాడని తేలడంతో 2026 మే 14న సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడికి తరలించారు. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ మత్తయ్య పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ నరేష్, ఎస్ఐ వేణు ఈ కేసును ఛేదించారు. -
పశ్చాత్తాపంతో 40 ఏళ్ల తర్వాత లొంగిపోయిన కిల్లర్
తిరువనంతపురం: నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఉదంతం ఇప్పుడు హంతకుడి ఆత్మప్రబోధంతో బయటపడింది. కేరళలో 40 ఏళ్ల క్రితం జరిగిన హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి, ఆ హత్యను తానే స్వయంగా చేశానని తెలియజేసి లొంగిపోయాడు. కోజికోడ్ జిల్లా కూడరంజికి చెందిన 55 ఏళ్ల మహమ్మద్ అలీ గత ఏడాది పోలీసులను ఆశ్రయించాడు. 1980ల కాలంలో తాను రెండు హత్యలు చేశానని, తనను అరెస్ట్ చేయాలని కోరాడు.అవి తాను తెలియక చేసిన తప్పులని, ఇప్పుడు పశ్చాత్తాపంతో లొంగిపోతున్నానని మీడియాకు తెలిపాడు. కోర్టు విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే ఈ వింత కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మహమ్మద్ అలీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. 1986లో కూడరంజి వద్ద బాధితుడు తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం అతడిని నీటిలో ముంచి చంపేశానన్నాడు. ఈ క్లూ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించగా, డిసెంబర్ 1986లో ఒక పత్రికలో వచ్చిన వార్త కీలకమైంది. కూడరంజి మిషన్ హాస్పిటల్ వెనుక పొలాల్లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఆ వార్త సారాంశం.తిరువంబడి పోలీసులు 1980ల కాలంలో మలబార్ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ కేసుల డేటాను పరిశీలించారు. సుదీర్ఘ శాస్త్రీయ విచారణ అనంతరం ఆ మృతుడు కన్నూర్ జిల్లా ఇరిట్టికి చెందిన మోహనన్గా గుర్తించారు. నిందితుడి వాంగ్మూలానికి, ఘటనా స్థలాలకు సరిగ్గా సరిపోలడంతో ఈ కేసును ధృవీకరించారు. కాగా, 1989లో కోజికోడ్ బీచ్లో చేసినట్లు చెబుతున్న మరో హత్యకు సంబంధించిన వివరాలను, బాధితుడి గుర్తింపును కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ‘నీట్’ టెన్షన్: ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తూనే.. -
తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం..!
సాక్షి, చెన్నై: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఒక యువతిపై తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక నేతలు సామూహిక లైంగిక ఒడిగట్టిన ఉదంతం తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. శాంతిభద్రతల వైఫల్యంపై , మహిళల భద్రతపై ప్రస్తుత సీఎం విజయ్ లక్ష్యంగా డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. వివరాలు.. తూత్తుక్కుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలోని ఆరుముగమంగళం ప్రాంతానికి చెందిన టీవీకే తూత్తుకుడి పశ్చిమ జిల్లా యువజన విభాగం నిర్వాహకుడు బాలమురుగన్, రామనాథపురం ప్రాంతానికి చెందిన టీవీకే ప్రతినిధి జయపాల్ ఇద్దరూ కలిసి.. శ్రీవైకుంఠం పరిధిలోని ఒక యువతికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. అనంతరం ఆమెను మోసగించి, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం మంగళవారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. దుమ్మెత్తి పోసిన ప్రతి పక్షాలు ఈ ఘటనను అస్త్రంగాచేసుకుని సీఎం విజయ్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాయి. డీఎంకే మాజీ మంత్రి గీతా జీవన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు అన్నామలైలు వేర్వేరుగా స్పందిస్తూ, శ్రీవైకుంఠం వద్ద యువతిపై టీవీకే నేతలు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తోందని మండిపడ్డారు. ఈ అఘాయిత్యాలకు టీవీకే శ్రేణులే పాల్పడుతుండటం బట్టి చూస్తే రాష్ట్రంలో ప్రజల రక్షణను ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సీఎం విజయ్ కేవలం పేజీల కొద్ది డైలాగులతో వ్యాఖ్యల తూటాలను పేల్చుతున్నారేగానీ, ఆచరణలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో మహిళల రక్షణ గురించి గొప్పగా మాట్లాడిన విజయ్.. ఇప్పుడు తన పార్టీ నేతలే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇదేనా తమరి మార్పు అని నిలదీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చినికి చినికి చివరికి హత్యగా!
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ సభ్యుడు ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, విలువైన స్థిరాస్తులు తమ చేయి దాటిపోతున్నాయనే ఉద్దేశంతోనే ఆలంఖాన్లు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. మలక్పేట, లక్డీకాపూల్ల్లోని ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్తోపాటు మల్లేపల్లిలో ఉన్న మదర్సా ఏ ఎజాజ్ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఖాజా మొహిజుద్దీన్కు తండ్రీకుమారులైన మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్ వర్గాల మధ్య ఏళ్లుగా విభేదాలు నెలకొన్నాయి.13 ఏళ్లుగా వివాదాలు.. ఈ రెండు సంస్థలకు చెందిన స్థిరచరాస్తులు, విద్యాసంస్థల పరిపాలన, నిర్వహణను చేతుల్లోకి తీసుకునే అంశంపై 13 ఏళ్లుగా వివాదాలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే మజ్లిస్ ఏ ఉమ్నాగా పిలిచే ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ మేనేజింగ్ కమిటీ 2013లో మహబూబ్ ఆలంఖాన్ను సెక్రటరీ పోస్టు నుంచి తొలగించింది. దీంతో మహబూబ్ ఆలంఖాన్ 17 మంది సభ్యులతో ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ ప్రెసిడెంట్తో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీలు ఒకదానిపై మరోటి హైకోర్టులో అనేక రిట్ పిటిషన్లు ఫైల్ చేసుకున్నాయి.రాజీ చేసినా.. 2023లో కొందరు ఈ రెండు గ్రూపుల మధ్య రాజీ చేసి క్రిమినల్, సివిల్ పిటిషన్లు ఉపసంహరించునేలా చేశారు. దీంతో మహబూబ్ ఆలంఖాన్ ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్కు సెక్రటరీగా పునర్ నియమితులై 2025 ఫిబ్రవరి వరకు కొనసాగారు. ఆర్థిక అవకతవకలపై మరోసారి మహబూబ్ ఆలంఖాన్కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ మేనేజింగ్ కమిటీని రద్దు చేసింది. ఆ సమయంలో 2025 నుంచి 2027 వరకు చెల్లుబాటు అయ్యేలా ఏర్పడిన కొత్త కమిటీకి ఖాజా మొహిజుద్దీన్ ట్రెజరర్గా నియమితులయ్యారు. దీంతో మరోసారి హైకోర్టులో మహబూబ్ ఆలంఖాన్కు వ్యతిరేకంగా పిటిషన్లు ఫైల్ అయ్యాయి. వాటికి ఖాజా మొహిజుద్దీన్ వకాల్తా తీసుకున్నారు.వకాల్తా.. ఆర్థికంగా దివాలా.. 2013లో ఉస్మాన్ ఖాన్, కిషన్సింగ్ అలియాస్ పప్పుతో కలిసి మహబూబ్ ఆలంఖాన్ లంగర్హౌస్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ద్వారా ఖాజా మొహిజుద్దీన్పై అత్యాచారం కేసు నమోదు చేయించారు. దర్యాప్తు అనంతరం ఈ కేసును పోలీసులు మూసివేశారు. మొహిజుద్దీన్ వకాల్తా కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, అనేక వక్ఫ్ ఆస్తులు చేయి దాటిపోతున్నాయని భావించిన ఆలంఖాన్లు అతడిని అంతం చేయాలని కుట్ర పన్నారు.అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా కనిపించేలా హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ బాధ్యతల్ని తమ వద్ద పని చేసే హసన్ అలీతోపాటు ముజాహిద్ ఆలంఖాన్కు పరిచయస్తుడైన మునీర్లకు అప్పగించారు. కిషన్సింగ్ని కూడా భాగస్వామిని చేశారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసమూ గాలిస్తున్నారు. -
స్పాట్ పెట్టేస్తున్నాయ్.. సైబరాబాద్ పరిధిలో 43 బ్లాక్స్పాట్లు!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 43 ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్) ప్రాణాంతకంగా మారాయి. గత మూడేళ్లలో 320 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 251 మంది మరణించారు. మూల మలుపులు, అసంపూర్ణ రహదారి పనులు, వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల మార్గానికి అడ్డంగా చెట్లు ఉండటం వంటి కారణాలుగా గుర్తించారు. అనేక ప్రమాదకర ప్రాంతాల చుట్టూ నివాస కాలనీలు, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్లు, మెట్రో కారిడార్లు ఏర్పడ్డాయి. దీంతో ఆయా మార్గాలలో పాదచారులు, స్థానిక ప్రయాణికులు నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.ట్రాఫిక్ పోలీసు అధికారులు, శాంతి భద్రతల పోలీసు స్టేషన్లు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, రోడ్ ఇంజినీరింగ్ ఏజెన్సీల బాధ్యులు బ్లాక్ స్పాట్లను తనిఖీ చేసి నివేదిక రూపొందించారు. గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో 90 శాతానికి పైగా మేడ్చల్ జోన్ పరిధిలోకి వస్తాయి. 50 శాతానికి పైగా ప్రమాదకర ప్రాంతాలలో ఎన్హెచ్–65 మార్గం అత్యంత ప్రమాదకరమైందిగా గుర్తించారు. 43 బ్లాక్ స్పాట్లలో 22 ముంబై హైవే (ఎన్హెచ్–65)కి చెందినవే ఉండటం గమనార్హం.అత్యంత ప్రభావిత ప్రాంతాలివీ..పటాన్చెరు శాంతి నగర్ కమాన్ నుంచి బజాజ్ ఎల్రక్టానిక్స్ మార్గం అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ 24 ప్రమాదాలు జరగగా.. 11 మంది మరణించారు.పటాన్చెరులోని ఇస్నాపూర్ క్రాస్ రోడ్లో అలాగే ఆర్సీపురంలోని శ్రీమణికాంత షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఏషియన్ జ్యోతి థియేటర్ వరకు ఒక్కో మార్గంలో 10 మరణాలు సంభవించాయి.పటాన్చెరులోని నోవాపన్ టీ–జంక్షన్ మరో ప్రమాదకర ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ 10 రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు.ఎన్హెచ్–765డీ పై కుత్బుల్లాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మాంగల్య షాపింగ్ మాల్ వరకు ఉన్న మార్గంలో 16 ప్రమాదాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. గండిమైసమ్మ ఎక్స్ రోడ్లో 14 ప్రమాదాల్లో 14 మంది చనిపోయారు.ఎన్హెచ్–65తో పాటు అధికారులు ఎన్హెచ్–44 నాగ్పూర్ రోడ్డుపై 7, ఎన్హెచ్–765డీ మెదక్–నర్సాపూర్ రోడ్డుపై 6, స్టేట్ హైవే (ఎస్హెచ్–1) రాజీవ్ రహదారిపై ఒకటి, నల్లగండ్ల ఫైఓవర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ఓల్డ్ ముంబై హైవే వరకు ఉన్న మార్గంలో 5 ప్రమాదాలతో సహా 7 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు.ఎన్హెచ్–44పై రేకులబాయి క్రాస్ రోడ్, భారత్ పెట్రోల్ మధ్య మార్గంలో 11 ప్రమాదాల్లో 11 మంది చనిపోయారు. మేడ్చల్లోని ఎస్సీ హోటల్, సంప్రదా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మధ్య మార్గంలో 10 యాక్సిడెంట్లలో 8 మంది మృత్యువాత పడ్డారు.కారణాలివీ..అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనుల వల్ల అనేక మార్గాలు ప్రభావితమయ్యాయి. రోడ్లను తవ్వి చాలాకాలం పాటు అసంపూర్తిగా వదిలేశారు. రోడ్లపైనే నిర్మాణ సామగ్రి పెట్టడం, దెబ్బతిన్న క్యారేజ్వేలు, పాక్షికంగా పూర్తి చేసిన రోడ్డు పనులు అనేక ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.రోడ్డు పక్కన ఉన్న చెట్లు క్యారేజ్వేల పైకి చొచ్చుకురావడం, చెట్లు ఎండిపోయి అనేక ప్రాంతాలలో క్యారేజ్వేలకు అడ్డుగా ఉన్నట్లు తనిఖీలలో పోలీసులు గుర్తించారు. మూలమలుపులు, ఎత్తుపల్లాలు ఉండటం, రాత్రి వేళల్లో ఆయా మార్గాలలో వీధి దీపాలు లేకపోవడం, ఉన్నా వెలుతురు సరిగా లేకపోవడం. రాత్రి వేళల్లో అధిక వేగంతో వాహనాలు తిరిగే హైవే మార్గాలలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం. -
వేటాడి పట్టుకున్న స్పెషల్ టీమ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 180కి పైగా చైన్ స్నాచింగ్స్కు పాల్పడి... నగరంలోని నాలుగు ఠాణాల అధికారులకు వాంటెడ్గా ఉండి.. 14 నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన ఘరానా నేరగాడు మహ్మద్ ఫైజల్ షా అలీ జబ్రీని సీసీఎస్ స్పెషల్ టీమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.మురాద్నగర్కు చెందిన ఇతడికి అబ్దుల్లా, సొహైల్, అల్తాఫ్ అనే మారుపేర్లూ ఉన్నాయి. 2023లో ఒకే రోజు సైఫాబాద్, మొగల్పురా, చారి్మనార్, నాంపల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో వరుసగా స్నాచింగ్స్ చేశాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి బెంగళూరు పారిపోయాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్న ఫైజల్ షా ఆపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయచోటి పట్టణానికి మకాం మార్చాడు.అక్కడ నివసిస్తూనే రాయచోటి, చేనూరు పోలీసుస్టేషన్ల పరిధిలో మరో మూడు చైన్ స్నాచింగ్స్కు పాల్పడ్డాడు. ఇతడిని పట్టుకోవడానికి డీసీపీ ఎస్.చైతన్య కుమార్ పర్యవేక్షణలో ఏసీపీ జి.వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. వీరు మంగళవారం ఫైజల్ను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. -
మూడేళ్ల పాటు 6 - 7 వందల మంది అత్యాచారం : బ్రిటీష్ ఎంపీ సంచలన ప్రకటన
గత కొన్ని దశాబ్దాలుగా యునైటెడ్ కింగ్డమ్ (UK) లోని వివిధ ప్రాంతాలలో సంచలనం సృష్టించిన " పాక్గ్రూమింగ్ గ్యాంగ్స్" (Pakistani Grooming Gangs)పై బ్రిటీష్ ఎంపీ రూపెర్ట్ లోవ్ (Rupert Lowe) పార్లమెంట్లో చేసిన ప్రసంగం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దారుణమైన లైంగిక దోపిడీ ముఠాల వెనుక ప్రధానంగా 'పాకిస్తానీ మూలాలు ఉన్న టాక్సీ డ్రైవర్లు , వ్యాపారులు' ఉన్నట్లు యూకే ప్రభుత్వ విచారణలో తేలింది. ఎంపీ రూపెర్ట్ లోవ్ తన వ్యక్తిగత విచారణ ద్వారా బాధితుల నుండి సేకరించిన అత్యంత ఘోరమైన, షాకింగ్ సాక్ష్యాలను బ్రిటీష్ పార్లమెంట్లో చదివి వినిపించారు. అధికారులు, పోలీసులు మరియు వ్యవస్థల వైఫల్యాల వల్ల దశాబ్దాలుగా ఈ దారుణం కొనసాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.600 - 700 మంది అత్యాచారంలోవ్ ప్రకారం, ముఠా ఆధారిత బాలల లైంగిక దోపిడీపై తాను జరిపిన స్వతంత్ర విచారణ సమయంలో బాధితుల హృదయవిదారక సాక్ష్యాలను సేకరించారు. ఒక బాధితురాలు తాను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక నిందితుడు తనపై మద్యం సీసాతో అత్యంత క్రూరంగా దాడి చేశాడని వివరించింది.మరో మహిళ వందల మంది చేతిలోదారుణమైన అత్యాచారానికి గురైంది. 13 ఏళ్ల వయసు నుండి మూడేళ్ల పాటు దాదాపు 600 నుండి 700 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని పేర్కొంది.ముఠా సభ్యులు తమను జంతువుల కంటే హీనంగా చూసేవారని, ఒక వ్యాన్లో 15 నుండి 20 మంది బాలికలను కుక్కల బోనుల్లో బంధించి ఉంచడం చూశానని ఒక బాధితురాలు తెలిపింది. అలాగే తమపై కుక్కలతో కూడా దాడి చేయించి, ఆ దృశ్యాలను రికార్డ్ చేస్తూ నిందితులు నవ్వుకునేవారని మరో మహిళ వాపోయింది.వేధింపుల సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో కొందరు పోలీసు అధికారులు కూడా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక మహిళ ఆరోపించింది. తీవ్ర గాయాలతో 15 ఏళ్ల వయసులో ఆసుపత్రికి వెళ్తే, భయంతో నిజం చెప్పలేకపోయానని, అక్కడి సిబ్బంది కూడా ఎలాంటి ప్రశ్నలు అడగకుండా కేవలం టాబ్లెట్లు ఇచ్చి పంపించేశారని ఒక బాధితురాలు పేర్కొంది.ఈ సాక్ష్యాల ప్రకారం, ఈ ముఠాలు శ్వేతజాతీయులు (White) మైనర్ బాలికలను, క్రైస్తవ బాలికలనే లక్ష్యంగా దశాబ్దాల పాటు సాగించిన లైంగిక దోపిడీ, అత్యాచారాల దారుణాలకు పాల్పడింది. ముస్లిం బాలికలకు గౌరవం, ఉన్నత నైతిక విలువలు ఉంటాయని, కానీ శ్వేతజాతీయులైన క్రైస్తవ బాలికలకు నైతికత తక్కువగా ఉంటుందంటూ నిందితులు వ్యాఖ్యానించేవారని ఒక బాధితురాలు గుర్తుచేసుకుంది. ఈ దారుణానికి గురైన బాలికలంతా దాదాపు శ్వేతజాతీయులే.ఒక ముస్లిం మత గురువు (ఇమామ్) కుమారుడి వల్ల ఒక బాధితురాలు గర్భవతి కాగా, ఆ విషయం తెలిసి కూడా అతని తండ్రి తన కొడుక్కి పెళ్లి చేసి, ఆ బిడ్డను చూడవద్దని ఆదేశించాడని, వారు తమ వర్గాన్ని మాత్రమే కాపాడుకుంటారని ఆమె పేర్కొంది. 'ఈద్' వంటి పండుగల సమయాల్లో మరియు సెలవు రోజుల్లో ఈ ముఠాల హింస, పార్టీలు మరింత ఎక్కువగా, క్రూరంగా ఉండేవని బాధితులు తెలిపారు. గతేడాది ఎంపీ రూపెర్ట్ లోవ్ నేతృత్వంలో జరిగిన ప్రైవేట్ దర్యాప్తులో.. యూకేలోని కనీసం 85 ప్రాంతాలలో ఇటువంటి "రేప్ గ్యాంగ్స్" చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా పాకిస్తానీ మూలాలున్న పురుషులు దశాబ్దాలుగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ సంస్థల తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఇది ఇంతలా విస్తరించిందని ఆగస్టులో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అసలేంటీ పాక్ గ్రూమింగ్ గ్యాంగ్స్ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ స్కాండల్ ఒక దశాబ్దం క్రితమే యార్క్షైర్లోని రోథర్హామ్ (Rotherham) నగరంలో వెలుగుచూసింది. 2001 ప్రాంతంలోనే శ్వేతజాతీయులైన చిన్న పిల్లలపై జరుగుతున్న ఈ క్రమబద్ధమైన లైంగిక దాడుల గురించి అధికారులకు సమాచారం అందినప్పటికీ, సరైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.ర్డ్ వంటి పలు నగరాల్లో దశాబ్దాలుగా వేల సంఖ్యలో బాలికలు ఈ దారుణానికి బలయ్యారు. గతేడాది జరిగిన స్వతంత్ర దర్యాప్తులో యూకేలోని దాదాపు 85 ప్రాంతాలలో ఈ 'రేప్ గ్యాంగ్స్' చురుగ్గా పనిచేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం బ్రిటీష్ పార్లమెంట్లో ఈ ముఠాల క్రూరత్వంపై బాధితులు ఇచ్చిన హృదయవిదారక సాక్ష్యాలను బయటపెట్టడంతో, ఈ 'పాక్ గ్రూమింగ్ గ్యాంగ్స్' వ్యవహారం మరోసారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. -
కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం!
ఉత్తరప్రదేశ్లో అత్యంత ఘోరమైన, కలచివేసే ఘటన వెలుగుచూసింది. ఫిరోజాబాద్లోని యాదవ్ కాలనీలో శనివారం (మే 30) జితేంద్ర పాఠక్ అలియాస్ విరాజ్ (24) అనే వ్యక్తి, ఆరవ్ అనే ఒకటిన్నర ఏళ్ల చిన్నారిని అత్యంత అమానుషంగా నేలకేసి కొట్టి చంపాడు.స్థానిక మహిళను పెళ్లి చేసుకోవాలని భావించాడు నిందితుడు జితేంద్ర. అయితే దీన్ని ఆమె తిరస్కరించడంతో విచక్షణ మరచిన రాక్షసుడిలా మారిపోయాడు. అమాయక బాలుడిని దారుణంగా ఉన్మాదిలా పదే పదే నేలకేసి విసిరి కొట్టాడు. ఎనిమిది సార్లు నేలకేసి కొట్టడంతో, చిన్నారిఅక్కడికక్కడే ప్రాణాలొదొలేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అమానుష ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. The video is sensitive.A woman rejected this monster's proposal, and the beast thrashed her innocent child to death. This incident occurred in #Firozabad, #UttarPradesh.Accused Viraj Alias Jitender Arrested Viraj, also known as Jitender, has been arrested by police. The… pic.twitter.com/bfoGAmACz7— Siraj Noorani (@sirajnoorani) May 30, 2026 నిందితుడు జితేంద్ర పాఠక్ ఒక కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతను తన కజిన్ సుమిత్ భార్య, చిన్నారి తల్లి , రతీ దేవిపై మోహాన్ని పెంచుకున్నాడు. రతి, సుమిత్ గత కొంతకాలంగా విడిగా ఉంటుండగా, రతి విడాకుల వ్యవహారాల్లో జితేంద్ర సహాయం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమెపై ప్రేమను పెంచుకుని పెళ్లి ప్రతిపాదనలు చేయగా, రతి వాటిని నిరంతరం తిరస్కరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి పింకీ దేవితో కలిసి విడాకుల చట్టపరమైన సంప్రదింపుల కోసం షికోహాబాద్ వెళ్లారు. జితేంద్ర వారిని వెంబడించి అక్కడ కూడా పెళ్లి ప్రపోజల్ పెట్టగా, ఆమె నిరాకరించింది. రతి తనను పెళ్లి చేసుకోకపోవడానికి ఆ చిన్నారే ప్రధాన అడ్డంకి అని నిందితుడు భావించి, ఆ దురాగతానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో టాఫీ (చాక్లెట్) కొనిస్తానని చెప్పి చిన్నారి ఆరవ్ను జితేంద్ర లోబరుచుకున్నాడు. తీవ్రమైన ఉన్మాదంతో ఊగిపోయిన జితేంద్ర, ఆ పసికందును పైకెత్తి దాదాపు ఎనిమిది సార్లు కిరాతకంగా నేలకేసి కొట్టాడు. ఈ దారుణమైన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.స్థానికులు గమనించి అడ్డుకునేలోపే ఘోరం జరిగిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదైంది. ఆదివారం (మే 31) మైన్పురి రోడ్డు సమీపంలో పోలీసులకు, నిందితుడికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల (ఎన్కౌంటర్) అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఇదీ చదవండి: ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..! -
సాక్ష్యం చెబితే ఖబడ్దార్.. ట్విషా శర్మ భర్త గూండాగిరీ!
నటి,మోడల్ ట్విషా శర్మ మృతి కేసులో మరో సంచలనం విషయం వెలుగులోకి వచ్చింది. వరకట్నం వేధింపులతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలు రోజు రోజుకు మరింత బలపడుతున్నాయి. ట్విషా అత్త, మాజీ జడ్జ్ బాధితురాలిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికే సంచలనం రేపగా, తాజాగా సాక్షులను బెదరించి, భయపెట్టేందుకు ఆమె భర్త చేసిన ప్రయత్నాలు కలకలం రేపాయి. కీలక సాక్షిపై ట్విషా భర్త ప్రధాన నిందితుడైన భర్త సమర్థ్ సింగ్ స్నేహితులు గుండా గిరీ ప్రదర్శించారు. కట్నం వేధింపుల ఆరోపణలు, ఆమె ఉరివేసుకుందని చెబుతున్న బెల్ట్ మాయం కావడం లాంటి అంశాలపై విచారణ జరుగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.సమర్థ్ సింగ్ ఇంటి సమీపంలో సెలూన్ నడుపుతున్న నీరజ్ దూబే అనే వ్యక్తిపై మే 30న సింగ్ స్నేహితులు మూకుమ్మడిగా దాడి చేశారు. దాదాపు ఆరుగురు వ్యక్తులు తనను చుట్టుముట్టి కోర్టులో సాక్ష్యం చెప్పవద్దంటూఒత్తిడి తెచ్చారని, దుర్భాషలాడారని దూబే వాపోయారు. దీనికి తాను అభ్యంతరం చెప్పడంతో, తనపై దాడి చేశారని దుబే ఆరోపించారు. ఈ దాడి, దూబే, రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు సిసిటివి (CCTV) లో రికార్డయ్యాయి. ఈ విషయంలో తనకు రక్షణ కల్పించాలని, తగిన న్యాయం చేయాలని కోరుతూ దూబే కటారా హిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన ప్రాణానికి ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆయనకు హామీ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు."Law & Order Failure in Bhopal? Key Twisha Murder Witness Attacked by Friends of Prime Accused"#Madhyapradesh #Bhopal - A significant new twist has emerged in the #TwishaSharma murder case after a key witness was allegedly beaten up by friends of the main accused, Samarth… pic.twitter.com/TlpPvfg03u— Siraj Noorani (@sirajnoorani) June 1, 2026ఇదీ చదవండి: ఐపీఎల్ ఫైనల్లోమెరిసిన అనుష్క, స్పెషల్ లగ్జరీ వాచ్, ధర ఎంతో?కాగా ఏప్రిల్ 12న ట్విషా శర్మ తన అత్తవారి ఇంట్లో శవమై కనిపించారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్లపై కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. సీబీఐ ఆధ్వర్యంలో తల్లి, కొడుకు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం పోలీసులు వారిని కటారా హిల్స్ నివాసానికి తీసుకెళ్లి, శర్మ మరణించిన రాత్రి ఏం జరిగిందనే దానిపై క్రైమ్ సీన్ను రీ-క్రియేట్ చేసి విచారించారు. మరోవైపు ట్విషాశర్మ కేసులో అసలు ఏం జరిగింది అనేది మిస్టరీగామారింది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు పార్లర్కు వెళ్లిన దాదాపు గంటసేపు గడిపింది. దీనిపైనా కూడా అత్త గిరిబాల సింగ్ పార్లర్కు వెళ్లి వారిని బెదిరించిందనీ, సీసీటీవీ ఫుటేజ్ను తొలగించాలని కూడా డిమాండ్ చేసిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే! -
మత్తులో 2 హత్యలు..
కంటోన్మెంట్, బంజారాహిల్స్: గంజాయి మత్తులో ఓ యువకుడు కత్తితో పొడిచి మరో యువకుడిని, మద్యం మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిని చంపేశారు. మారేడ్పల్లి సంజీవయ్యనగర్ బస్తీ వాసి, ఫ్లవర్ డెకరేటర్ శ్రావణ్ (22)ను అదే ప్రాంతానికి చెందిన నిఖిల్ (23) అంతమొందించాడు.బీటెక్ ఆపేసి గంజాయికి బానిసైన నిఖిల్... శ్రావణ్ బంధువుల యువతిని అసభ్య సైగలతో వేధిస్తున్నాడు. శ్రావణ్, నిఖిల్ మధ్య 2 నెలల క్రితం గొడవ జరిగింది. ఆదివారం రాత్రి యువతిని నిఖిల్ మళ్లీ వేధించాడు. ఆమె తండ్రి మందలించగా గొడవ మొదలైంది. అప్పుడే ఇంటికి వస్తున్న శ్రావణ్ నిలదీయగా... కోపోద్రిక్తుడైన నిఖిల్ కత్తితో 8 సార్లు పొడిచాడు. గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రావణ్ చనిపోయాడు. నిఖిల్ గంజాయి తాగడంతో పాటు అమ్ముతుంటాడని, ఆ మత్తులోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు బేంగపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు.బంజారాహిల్స్ రోడ్ నం11 లోని బోళానగర్ బస్తీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్ (32), రౌడీషీటర్ అహ్మద్ హుస్సేన్ స్నేహితులు. ఆటో నడుపుతుంటారు. ఖాలిద్ సయీద్ జావీద్, హైదర్ షరీఫ్, అన్వర్, మతీన్తో కలిసి హయత్ ప్లేస్ హోటల్ గల్లీలో ఆటోలోనే ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మద్యం తాగారు. ఖాళీ బీరు సీసాలను హుస్సేన్ రోడ్డు పక్కన పడేశాడు. అలా నిర్లక్ష్యంగా పడేస్తే ఎవరికైనా గుచ్చుకుంటాయని ఇమ్రాన్ మందలించాడు. హుస్సేన్ కోపంతో నాకే నీతులు చెబుతావా? అంటూ దాడికి దిగాడు. అరగంట పాటు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుప్పకూలిన ఇమ్రాన్ మృతి చెందాడు. -
ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను చంపిన భార్య
బెంగుళూరు: హాసన్ తాలూకా బిట్టగోడనహళ్లిలో వ్యక్తి అనుమానాస్పద రీతిలో చనిపోగా, భార్య హడావుడిగా అంత్యక్రియలను పూర్తి చేసింది. చివరకు ఆమే, కొడుకు సూత్రధారులుగా తేలింది. పోలీసులు నమోదు చేసిన కేసు మేరకు... మే 18న ఇంట్లో గురుమూర్తి అనే వ్యక్తి పడుకుని అలాగే చనిపోయాడు. భార్య, కొడుకు గబగబా అంత్యక్రియలను ముగించారు. 17 ఏళ్ల క్రితం మైసూరుకు చెందిన గురుమూర్తికి హాసన్వాసి వీణాతో వివాహం చేశారు. దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. గురుమూర్తి భార్య వద్దే ఉంటూ, ఓ హోటల్ను నడుపుతున్నాడు. హోటల్ కోసం అప్పులు చేశాడు. సీసీ కెమెరాలలో గుట్టు కోడలు, మనవడు కలిసి తన కుమారున్ని చంపేశారని మృతుని తల్లి రేణుకమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇంటిలోని సీసీ కెమెరాలను పరిశీలించగా గుట్టు బయటపడింది. గురుమూర్తిని భార్య వీణా, మైనర్ కొడుకు కొట్టి చంపిన దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి వైద్యులచే పోస్టుమార్టం చేయించగా హత్యగానే నిర్ధారణ అయింది. మరోవైపు భార్య భర్త పేరుతో ఇన్సూరెన్స్లు చేసింది. ఆ డబ్బులు వస్తాయని హత్య చేసినట్లు విచారణలో తెలిపింది. ఆమెతో పాటు మైనర్ను అరెస్టు చేశారు. -
నల్లమాడులో జంట హత్యలు
ఉంగుటూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు ఆయకట్టు ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో మూడు రోజులు క్రితం జరిగిన జంట హత్యలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. మృతులు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన తల్లీ కుమార్తెగా గుర్తించారు. వీరిద్దరినీ శుక్రవారం రాత్రి హతమార్చినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... అనంతపల్లికి చెందిన గంటా అంథోబాయికి నలుగురు పిల్లలు. వీరిలో వెంకటలక్ష్మి అంధురాలు కావడంతో 2009లో బ్యాక్లాగ్ పోస్టులో ఏలూరు మున్సిపాలిటీలో అటెండర్ ఉద్యోగం వచ్చింది.తల్లి అంథోబాయితో కలిసి ఏలూరులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉద్యోగం చేస్తోంది. వెంకటలక్ష్మి సోదరుడు సుదర్శన్ కూడా వీరితోనే ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏలూరులో తల్లీకుమార్తె బయలుదేరి ఫంక్షన్కు వెళ్లేందుకు దూబచర్ల వచ్చారు. రాత్రి 8 గంటల సమయంలో దూబచర్ల చేరినట్టు ఏలూరులో ఉన్న కుమారుడికి తల్లి ఫోన్ చేసి చెప్పింది. 9 గంటల నుంచి వారి ఫోన్ పని చేయలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆలపాటి వేణు అనే రైతు పొలంలోకి వెళ్లగా అక్కడ మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు.దీంతో ఏలూరు డీఎస్పీ శ్రావణకుమార్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుకుని వివరాలు సేకరించారు. జంట హత్యల విషయం తెలియడంతో నల్లజర్ల, ఉంగుటూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మృతులను గుర్తించి అనంతపల్లికి చెందిన వారని చెప్పడంతో వారి బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో హంతకుల కోసం వెతుకుతున్నారు. శుక్రవారం రాత్రి బస్సు దిగిన తర్వాత తల్లీకుమార్తె ఆటో ఎక్కి ఉండవచ్చని... ఆటో డ్రైవర్ వీరిని నల్లమాడు ఆయకట్టు పరిధిలోని జీడితోటలోకి తీసుకెళ్లి బంగారం, నగదు కోసం హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. హంతకులు ఎవరు, హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ధురంధర్’ దెబ్బకు దావూద్ ముఠాలో కలకలం.. మన దేశంలోకి..
ముంబై: డీ-కంపెనీని బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మూవీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. పాకిస్థాన్లో ఉంటూ అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడిపిస్తున్న ఈ ముఠా ధురంధర్ సినిమా విజయానంతరం ముంబైలో తన గ్రౌండ్ నెట్వర్క్ను యాక్టివేట్ చేసినట్లు సోర్సెస్ తెలిపాయి.రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బడే సాహెబ్ అనే పాత్ర కనిపిస్తుంది. మరణశయ్యపై ఉన్న ఆ పాత్రను దావూద్ను పోలి ఉన్నట్లు చూపించారు. దీనివల్ల దావూద్ ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రజలను నమ్మించాల్సిన అత్యవసర పరిస్థితి డీ-కంపెనీకి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.షకీల్ ముఠాకు నియామకాల బాధ్యత కొత్త ఉగ్ర కుట్రలో భాగంగా కొత్త సభ్యులను సమీకరించడం ముఠా ముందున్న తొలి సవాలు. నియామక ప్రక్రియ బాధ్యతను షకీల్ ముఠాకు అప్పగించినట్లు సోర్సులు తెలిపాయి. పాకిస్థాన్ ఐఎస్ఐకి ఈ కొత్త సభ్యులకు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు అందించడం వంటివి చేయనుందని చెప్పాయి. ఉగ్ర ప్రణాళిక అమలు బాధ్యతను షూటర్ మున్నా జింగాడాకు అప్పగించినట్లు తెలిపాయి.ఈ ఆపరేషన్ వెనుక అసలు కారణాన్ని కొత్త సభ్యులకు చెప్పలేదని సోర్సెస్ తెలిపాయి. ముంబై నుంచి జాగ్రత్తగా ఎంపిక చేసిన వీరిని, బాంద్రా గరీబ్ నగర్లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి రెచ్చగొట్టినట్లు వెల్లడించాయి.ఇటీవల ఢిల్లీ పోలీసులు ఒక ఉగ్ర ప్రణాళికను భగ్నం చేసి, ఐఎస్ఐకి ముంబై అండర్వరల్డ్తో ఉన్న సంబంధాన్ని బయటపెట్టిన నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండర్వరల్డ్ కార్యకలాపాలు, వసూళ్ల వ్యవహారాల్లో ప్రభావం క్రమంగా తగ్గుతున్న వేళ, డీ-కంపెనీ ఆకస్మిక కదలికలు మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నమై ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.తమ ప్రభావాన్ని మళ్లీ పెంచుకునేందుకు, ఐఎస్ఐ సాయంతో భారతదేశంలో భారీ దాడి చేయాలని లేదా ఓ వీఐపీని లక్ష్యంగా చేసుకోవాలని దావూద్ ముఠా ప్రణాళికలు రచిస్తున్నట్లు సోర్సెస్ తెలిపాయి.ఇలాంటి ఉగ్ర ప్రణాళికలకు ఆశ్రయం ఇవ్వడంలో పాకిస్థాన్ పాత్ర నిరంతరంగా కొనసాగుతోందని పేర్కొన్నాయి. అయితే కీలక అరెస్టులు సకాలంలో జరుపుతూ భారత దర్యాప్తు సంస్థలు ఇలాంటి ప్రయత్నాలను భగ్నం చేస్తున్నాయని సోర్సెస్ తెలిపాయి. -
వివాహమైన 18 రోజులకే విషాదం!
పటాన్చెరు టౌన్: పెళ్లయిన 18 రోజులకే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, కోట్పల్లి మండలం బీరోల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (28)కు పటాన్చెరుకు చెందిన రేణుకతో మే 13న వివాహం జరిగింది. కాగా ఐదు రోజుల క్రితం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు.ఈ క్రమంలో శనివారం రాత్రి శ్రీకాంత్ సెల్ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డ్ విషయంలో భార్య రేణుక ఇష్టం వచి్చనట్టు అతడ్ని తిట్టింది. దీంతో శ్రీకాంత్ అతని సోదరుడు శ్రీశైలానికి జరిగిన విషయం చెప్పడంతో ఉదయం మాట్లాడుదామని చెప్పాడు. భార్యతో గొడవపడిన శ్రీకాంత్ వేరే రూమ్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఖాకీలో కామాంధుడు..? రైటర్ బాగోతం బట్టబయలు!
ప్రకాశం: ఆమె ఒక మహిళా కానిస్టేబుల్, అతడు అదే పోలీసు స్టేషన్లో రైటర్. ప్రజలకు రక్షణ కలి్పంచాల్సిన సదరు రైటర్ బాధ్యతను విస్మరించి మహిళా కానిస్టేబుల్ తో అనుచితంగా ప్రవర్తించాడు. సాక్షాత్తు పోలీసు స్టేషన్లోనే జరిగిన ఈ ఘటనను ఎంత దాచి పెట్టాలనుకున్నా ఆ నోటా ఈ నోటా పడి గుప్పుమంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని అత్యంత ప్రధానమైన ఒక పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక రైటర్ మూడు రోజుల క్రితం అదే స్టేషన్లో పని చేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో మనోవేదనకు గురైన మహిళా కానిస్టేబుల్ రైటర్ తీరుపై మండి పడటమే కాకుండా ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం బయటకు రాకుండా చూసేందుకు రంగంలోకి దిగిన అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలోని ఒక వర్గం మహిళా కానిస్టేబుల్ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే కొంతకాలంగా రైటర్ వేధింపులతో విసుగు చెందిన కొందరు కానిస్టేబుళ్లు ఇదే అదనుగా ఈ ఘటనపై ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో అసలు విషయం బట్ట బయలైంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎస్పీ రైటర్ తోపాటు మహిళా కానిస్టేబుల్ ను కూడా వీఆర్ కు పంపించారు. అయితే రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని తన మీద వీఆర్ వేటు పడకుండా సదరు రైటర్ మెడికల్ లీవ్ పెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. మహిళల రక్షణ కోసమంటూ ఎస్పీ దండయాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే మరోవైపు పోలీసు స్టేషన్లోనే మహిళా కానిస్టేబుల్ తో ఒక రైటర్ అనుచితంగా ప్రవర్తించడం దారుణమని పోలీసులు చెవులు కొరుక్కుంటున్నారు. తొలినుంచి అదే ధోరణి... మహిళా కానిస్టేబుల్ తో అనుచితంగా ప్రవర్తించిన సదరు రైటర్ పై తొలి నుంచి అనేక ఆరోపణలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మద్దిపాడు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించినప్పుడు అదే పోలీసు స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆయన మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన మీద వీఆర్ వేటు వేసి కొన్నాళ్లకు తాళ్లూరు పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు. అక్కడకు వచ్చిన తర్వాత ఒక సాధారణ మహిళను వేధించడం మొదలు పెట్టాడని, బాధిత మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందని, దాంతో ఆయనను మార్కాపురానికి బదిలీ చేశారు. మార్కాపురంలో ఒక మహిళా హోం గార్డు వెంట పడడం, అది కాస్త రచ్చ కావడంతో ఆయన్ను పామూరుకు బదిలీ చేశారని చెబుతున్నారు. అయితే అతడి వద్ద రైటింగ్ స్కిల్స్ ఉండటాన్ని గమనించిన ఒక సీఐ అతడ్ని సింగరాయకొండకు తెచ్చుకున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా పోలీసు శాఖలో చక్రం తిప్పిన పచ్చ పారీ్టకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ సహకారంతో మెమో మీద ఒంగోలుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇక్కడికే డీఓ తెచ్చుకున్నారు. అధికార పారీ్టలో ఉన్న పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఒంగోలుకు వచ్చినప్పటి నుంచి ఓ మహిళా కానిస్టేబుల్ మీద కన్నేసి వేధిస్తున్నాడని, సీఐని గుప్పిట్లో పెట్టుకొని మిగతా సిబ్బందినీ ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా సదరు రైటర్ వేధింపుల పర్వం కొనసాగుతున్నా స్పెషల్ బ్రాంచి సిబ్బంది ఎస్పీ దృష్టికి తీసుకెళ్లలేదని, దాంతో అతడి ఆగడాలు మితిమీరిపోయాయని పోలీసులు గుసగుసలాడుతున్నారు. ఇప్పుడు కూడా అధికారులు తననేమీ చేయలేరని, త్వరలోనే అద్దంకికి వస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతోంది. -
కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్ఫ్లూయెన్సర్
వరకట్న వేధింపులకు మరో యువతి బలైంది. లక్నోలో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ (మాన్సి) తన అత్తవారింట్లో స్థితిలో కన్నుమూసింది. అదనపు కట్నంగా కార్ ఇవ్వలేదనే అక్కసుతోనే మాన్సి భర్త సాగర్ రాజ్పుత్, అతని కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని ఉరితీశారని మాన్సి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.పోలీసులు నమోదు చేసిన ప్రథమ సమాచార నివేదిక (FIR) ప్రకారం, కాన్పూర్కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ మాన్సికి, 2024లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సాగర్ రాజ్పుత్తో వివాహం జరిగింది. వీరిద్దరూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవారు, రాజ్పుత్కు ఇన్స్టాగ్రామ్లో దాదాపు 8 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.పెళ్లి సమయంలో మాన్సి కుటుంబం రూ. 7 లక్షల నగదు, ఇతర గృహోపకరణాలను ఇలా పలు రకాల బహుమతిలిచ్చింది అయినప్పటికీ, తక్కువ కట్నం తెచ్చిందంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవారని, కారు కావాలని ఒత్తిడి తెచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లైన దగ్గర్నుంచి వేధిస్తూనే ఉండేవారనీ, ఈ వేధింపుల గురించి, తెలిసి పుట్టింటి వారు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు పలుమార్లు లక్నోకు వెళ్లి మాట్లాడి, సర్ది చెప్పి వచ్చేవారు. బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త సాగర్ రాజ్పుత్ సహా, మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అతని తండ్రి రాజేష్, సోదరుడు అను, ఆడపడుచులు బర్ఖా, చాందిని, అత్త ఆశలపై వరకట్న మరణం కేసు నమోదైంది. ప్రస్తుతం రాజ్పుత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు.గత రెండు వారాలుగా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచిన భోపాల్ మోడల్ ట్విషా శర్మ వరకట్న మరణం కేసులొ హై-ప్రొఫైల్ CBI దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే, ఈ వరకట్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. లక్నోలోనే జరిగిన ఇలాంటి మరో కేసులో, శ్వేతా సింగ్ అనే మహిళ మరణానికి సంబంధించి కూడా వరకట్న వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. -
‘వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు
మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో.. అదీ పోలీసుల సమక్షంలోనే జనాలు నిందితుల మీద దాడి చేసే దాకా తీసుకెళ్లింది.. కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగాడ్లో.. ఏడాదిన్నర వయసున్న అర్షిద్ మరణం అందరితో ‘అయ్యో పాపం’ అనిపిస్తోంది. భోజనం చేస్తుండగా.. దగ్గు, వాంతులు చేసుకుంటూ ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడని.. ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ కన్నుమూశాడని తల్లి అఖిల(24) మీడియా ముందు వాపోయింది. అయితే ఆమె కన్నీళ్లంతా కట్టుకథ అని తేలడానికి 24 గంటలు కూడా పట్టలేదు. అర్షిద్ మాములు చిన్నారేం కాదు. కొన్ని నెలల కిందట.. రెండు చేతులకు బ్యాండ్లతో తల్లి చంకలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాడు. ఆడుకుంటుండగా సైకిల్ మీద నుంచి పడిపోయాడని చెబుతూ.. ఆమె పలువురి సాయం కోరడం నెట్టింట వైరల్ అయ్యింది. అలా ఆ తల్లికి చాలామంది డబ్బు కూడా పంపించారు. కట్ చేస్తే.. మే 29వ తేదీన ఆ చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. Tragic incident from God’s own countryHere is a 2-week-old video of 1-and-a-half-year-old Arshad with both hands fractured. In the video, his mother Akhila lies, claiming he broke his hands by falling off a bicycle.Tragically, little Arshad passed away 2 days ago at the… pic.twitter.com/j1WnUTE2fU— Revolutionary Monk (@RevolutionMonk) May 31, 2026అన్నం తింటుండగా ఆ చిన్నారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అఖిల, ఆమె స్నేహితుడు అష్కర్ అర్షిద్ను హుటాహుటిన పనవూర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. ఈలోపు ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానంతో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో షాకింగ్ విషయాలు బయటపెట్టాయి. అర్షిద్ ఒంటిపై సుమారు 50కి పైగా గాయాల గుర్తులు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు.. సిగరెట్లతో ఒంటి నిండా కాల్చిన గాయాలు ఉండడం వైద్యుల్ని విస్మయానికి గురిచేసింది. పైగా ఈ గాయాలు ఒక్కరోజులో జరిగినవి కావని.. చాలా కాలంగా కొనసాగుతున్న హింసకు సంబంధించినవని తేల్చారు.నెలల వయసు నుంచే..అఖిల కడుపుతో ఉన్నప్పుడు ఆమె భర్త అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె అష్కర్(31) అనే వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. ఈ సంబంధం కారణంగానే ఆమె పుట్టిన బిడ్డను తల్లికి అప్పగించింది. అయితే అఖిల భర్త తరఫున బంధువుల అభ్యంతరాలతో తిరిగి చిన్నారిని తన దగ్గరకు తెచ్చుకుంది. అప్పటి నుంచే చిన్నారి అర్షిద్కు వేధింపులు మొదలయ్యాయి. ఆ సమయంలోనూ శరీరంపై తరచూ గాయాలు కనిపించేవని.. అడిగితే గాయాలపాలవుతున్నాడని చెప్పేదని అఖిల తల్లి పోలీసులకు చెబుతోంది. అంతేకాదు.. మే నెలలో వైరల్ అయిన వీడియోను కూడా అర్షిద్ అమ్మమ్మ గుర్తు చేసింది. మనవడి చేతులు విరిగిన సందర్భంలోనూ కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఇక.. చుట్టుపక్కల వాళ్లు చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంపై చాలాసార్లు అఖిలను నిలదీసినట్లు చెబుతున్నారు. ఆగ్రహంతో దంచి కొట్టారు!పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా మార్చారు. కేసు తీవ్రత దృష్ట్యా మే 30న అఖిల, అష్కర్లను అరెస్ట్ చేశారు. చిన్నారిపై నిరంతరం హింస కొనసాగుతున్న విషయం తెలిసినా తల్లి అడ్డుకోలేదని, అధికారులకు సమాచారం ఇవ్వలేదని స్పష్టమైంది. అందుకే ఆమెపైనా హత్య కేసు నమోదు చేశారు. అంతేకాదు.. గతంలో చేతులు విరిగిన ఘటనలోనూ ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఆదివారం అష్కర్ను ఘటనాస్థలికి తీసుకెళ్లి సాక్ష్యాలు సేకరిస్తుండగా.. స్థానికులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు కూడా వాళ్లను నిలువరించలేపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని అర్షిద్ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ అర్షిద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.തിരുവനന്തപുരം നെടുമങ്ങാട് ഒന്നര വയസ്സുകാരൻ കൊല്ലപ്പെട്ട സംഭവത്തിൽ പ്രതികളിൽ ഒരാളായ അഷ്കറുമായി തെളിവെടുപ്പ് നടത്തുന്നതിനിടെ പ്രതിയെ കയ്യേറ്റം ചെയ്ത് നാട്ടുകാർ #nedumangad #ashkar #crime #kerala pic.twitter.com/4MEuPTbAXl— DD News Malayalam (@DDNewsMalayalam) May 31, 2026


