హాహాకారాలు.. ఆర్తనాదాలు | Relatives of Samarlakota fireworks explosion are confused to identify the bodies | Sakshi
Sakshi News home page

హాహాకారాలు.. ఆర్తనాదాలు

Mar 1 2026 4:56 AM | Updated on Mar 1 2026 4:56 AM

Relatives of Samarlakota fireworks explosion are confused to identify the bodies

రోదిస్తున్న మృతుడు గంపల నాగరాజు బంధువులు

పేలుడు ధాటికి శరీరాలు ఛిద్రం.. ఒక్కో అవయవం ఒక్కో చోట

ఏది ఎవరిదో తెలీక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు

వివరాలు చెప్పేవారు లేక అంతా అయోమయ స్థితి

పిఠాపురం: తల ఒకచోట.. మొండెం మరోచోట.. కాలు ఒకచోట.. చెయ్యి మరోచోట.. ఇలా ఏ అవయవం ఎక్కడుందో.. అది ఎవ­రిదో తెలీనంత అతి దారుణంగా బాణాసంచా పేలుడులో మృతుల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఏది ఎవరి అవయవమో కూడా తెలీనంతగా కాలిపోయాయి. తమ వారి మృతదేహం ఎక్కడుందో తెలుసుకోడానికి మృతుల బంధువులు పడుతున్న వేదన.. చేస్తున్న ఆర్తనాదాలు అంతాఇంతా కాదు. 

కాకినాడ జిల్లా సామర్ల­కోట మండలం వేట్లపాలెంలో శనివారం సంభవించిన బాణసంచా పేలుడు ఘటనలో అసలు అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు.. ఎంతమంది చనిపోయారు అనేది కూడా చెప్పడానికి ఎవరు లేకపోవడంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది.

మా వాళ్లు బతికుండేలా చూడు దేవుడా..
సంఘటన స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు తమ వాళ్లు బతికున్నారో చనిపోయారో తెలీక ‘మా వాళ్లు బతికుండేలా చూడు దేవుడా’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒక­పక్క అధికారులు, సిబ్బంది మృతదేహాల భాగాలను పోగుచే­స్తు­ంటే.. ఆ పోగులో తమ వారెవరైనా ఉన్నారా అంటూ వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. 

బాణసంచా తయారీ పనికి వెళ్లిన వారి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తమ వారి జాడకోసం కాలువలు, చెట్లు, పుట్టలు, పొలాల్లో వెతుక్కుంటూ కనిపించారు. సంఘటన స్థలానికి దూరంగా ఉన్న కాలువల్లోనూ మృతదేహాల భాగాలు దొరక­డంతో ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు గాలింపు చేపట్టారు. మొత్తం మీద 20 మృతదేహాలను గుర్తించినట్లు అధికారికంగా వెల్లడించగా.. తమవారి ఆచూకీ తెలీ­లేదంటూ కొందరు అధికారులకు సమాచారం ఇస్తున్నారు.

అప్పుడు తప్పించుకుని.. ఇప్పుడు కాలిపోయాడు..
గతంలో గ్రామంలో జరిగిన కొట్లాటలో గంపల నాగరాజు (55)ను కత్తులతో చంపడానికి కొందరు ప్రయత్నించగా అతను ఎలాగోలా తప్పించుకున్నాడు. బతుకు జీవుడా అంటూ మళ్లీ తన బతుకు తాను బతుకుతుంటే మృత్యువు పేలుడు రూపంలో అతడ్ని దహించేసిందని నాగరాజు బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. సామర్ల­కోట మండలం మేడపాడుకు చెందిన గంపల నాగరాజు, గంపల మంగ భార్యాభర్తలు. 

వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో వీరు పనిచేస్తున్నారు. శనివారం జరిగిన విస్ఫోటంలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. అంత పెద్ద గొడవలోనూ బతికి బయటపడ్డాడ­నుకుంటే ఇప్పుడు మంటల్లో ఆహుత­య్యా­డని.. తండ్రితో పాటు తల్లి కూడా కాన­రాని లోకాలకు వెళ్లిపోయిందని.. ఇక తమకు పెద్ద దిక్కెవరంటూ నాగరాజు కుమారుడు వెంకటన్న రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

నా మాట వినుంటే అల్లుడు బతికేవాడు..
ఆ పని ప్రమాదకరమైంది.. ఆ పనిలోకి వెళ్లొద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా బాణసంచా తయారీకి వెళ్లి చివరకు మృత్యువాతపడ్డాడని.. తన మాట వినుంటే తన అల్లుడు బతికేవాడని బాణసంచా ప్రమాదంలో మృతిచెందిన వల్లూరి రవి అత్త ముప్పిడి భద్రమ్మ కన్నీరుమున్నీరవుతోంది. పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన భద్రమ్మ కుమార్తె లక్ష్మికి, వేట్లపాలేనికి చెందిన రవితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె సోఫియా ఉంది. 

రోదిస్తున్న మృతుడు రవి అత్త భద్రమ్మ 

అయితే, మృతుడు రవికి కుట్టు మెషీన్, పెయిటింగ్‌ వంటి పనులు వచ్చు. కానీ, ఆ పనులు చేయకుండా బాణసంచా తయారీకి మాత్రమే వెళ్లేవాడు. దీంతో, ఆ పనికి వెళ్లొద్దంటూ తాను చాలాసార్లు వారించానని భద్రమ్మ రోదిస్తూ చెప్పింది. కావాలంటే కొత్త మెషీన్‌ కొనిస్తానని, దానిని కుట్టుకుని బతకమని ఎన్నోసార్లు చెప్పానని, అయినా తన మాట వినకుండా ఆ పనిలోకి వెళ్లి, తన అల్లుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడని, ఇక తన కూతురుకు మనవరాలికి దిక్కెవరంటూ భద్రమ్మ గుండెలవిసేలా రోదిస్తుంటే ఆపడం ఎవ్వరి తరం కాలేదు.

మా అమ్మను చూపించండి..
‘మా అమ్మ మందుగుండు సామగ్రి తయారుచేయడానికి వెళ్లింది. అందరూ  చనిపోయారంటున్నారు.. మా అమ్మ కనిపిస్తే చూపించండి’.. అంటూ ఈ దుర్ఘటనలో అసువులు బాసిన వేట్లపాలేనికి చెందిన దూకెళ్ల దేవి కుమార్తె చంద్రకళ శోకతప్త హృదయంతో దీనంగా అడుగుతోంది. దీంతో ఏం చెప్పాలో తెలీక ఆమె బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 

మరోవైపు.. పేలుడులో మృతిచెందిన దేవి మృతదేహాన్ని సామర్లకోట ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచడంతో అక్కడ తన తల్లిని చూపించడంటూ చంద్రకళ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement