జనతంత్రం
ఊపిరాడనివ్వని అవినీతి కంపు నేడు ఆంధ్రావనిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. పాలనా యంత్రాంగం లంచాల మత్తులో జోగుతున్నదని కూటమి నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. చిన్నాచితకా పనులు కూడా చేతులు తడపందే కావడం లేదని లోకవాణి కోడై కూస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, కాణీ ఖర్చు లేకుండా ప్రభుత్వ సేవలను ఇంటికి చేర్చిన సచివాలయ వ్యవస్థ ఇప్పుడు కోమాలోకి జారి పోయింది. రెండున్నర లక్షల మంది వలంటీర్లను నమ్మించి గొంతులు కోసింది కూటమి ప్రభుత్వం. సర్వేల పేరుతో పనిభారం పెంచి సచివాలయ సిబ్బందిని ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారు. ఉద్యోగాలు వదిలేసి పారిపోయేలా ప్రేరేపిస్తు న్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో వారి ఆత్మహత్యలు, అకాల మరణాలు రికార్డయ్యాయి.
నిస్సంకోచంగా, యథేచ్ఛగా, బరితెగించి సాగుతున్న లంచ గొండి దర్బార్లకు ప్రజాప్రతినిధులే గాడ్ఫాదర్లుగా వ్యవహ రించడం సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నది. కీలక శాఖల్లో పనిచేసే అధికారులను ఏరికోరి నియమించుకొని వారి నుంచి నెలవారీ వాటాలను ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారన్న వార్తలు పదేపదే వినవస్తున్నాయి. అందుకు సంబంధించి కొందరు అధికారుల ఆడియోలు కూడా అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహార శైలితో ప్రజాప్రతినిధులే స్వయంగా ఉద్యోగస్వామ్యాన్ని అనినీతి మేత కోసం ఉసిగొల్పు తున్నారు. ఈ పని చేస్తున్న సదరు ప్రజాప్రతినిధులకు నదురూ లేదు... బెదురూ లేదు. ‘ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా?’ అన్న సామెతను వారు శిరోధార్యంగా స్వీకరిస్తున్నారు.
‘ఉద్యోగాల కల్పన’ అనే దేవతావస్త్రం పేరు చెబుతూ ఉర్సా, లుల్లూ అండ్ అదర్స్కు ఖరీదైన భూముల్ని కట్టబెడు తున్న ప్రభుత్వ పెద్దల దూకుడు నుంచి ప్రజాప్రతినిధులు స్ఫూర్తి పొందుతున్నారు. పెద్దల కనుసన్నల్లోనే నడుస్తున్న కల్తీ మద్యం కార్ఖానాల నుంచి పారుతున్న కరెన్సీ చూసి ఉత్తేజం పొందుతున్నారు. అధినాయకుడు తమ బంధుత్వాలను గౌరవించి వేలకోట్ల విలువైన భూముల్ని చుట్టబెట్టడం క్షేత్రస్థాయి నాయకత్వాన్ని పులకింపజేస్తున్నది. సొంత పాల కంపెనీ, దాని అనుబంధ సంస్థల లాభాల కోసం దేవదేవుడినే రాజకీయాల్లోకి లాగగలిగిన ఆ లాఘవం జూనియర్ నాయకులకు నిజంగా ఒక పాఠ్యాంశమే!
పై స్థాయి నుంచి పొంగిపారిన స్ఫూర్తిని కింది స్థాయి కూడా అందిపుచ్చుకోవడంతో అవినీతి ప్రవాహం రాష్ట్ర మంతటా కట్టలు తెంచుకున్నది. దాని ఫలితమే కల్తీ పాల చావులు, కలుషిత జలాల మరణాలు, కృత్రిమ మద్యపు మరణ మృదంగం! పోషక బలాన్నిచ్చే పాలే కాటేస్తాయని ఎప్పుడైనా ఊహించామా? ప్రాణావసరమైన మంచినీళ్లే ప్రాణాలు తీస్తా యని కలగన్నామా? పాలూ, నీళ్లే కాదు. నేడు ఆంధ్ర రాష్ట్రంలో తింటున్నదీ, తాగుతున్నదీ సమస్తం కల్తీయేనని పాలక కూటమి నేతలే చెబుతున్నారు. గుంటూరు జిల్లా ‘జనసేన’ అధ్యక్షుని వీడియో ఒకటి ఈ మధ్యనే సంచలనం సృష్టించింది.
‘‘ఉద్యోగులు భయంకరంగా లంచాలు వసూలు చేస్తున్నారు. ఊహించని స్థాయిలో అవినీతి పెరిగింది. పాస్బుక్కులో పొరపాట్లు సరిదిద్దడానికి కూడా వేల రూపాయలు సమర్పించుకోవలసి వస్తున్నది. చిరంజీవి ఠాగూర్ సినిమాను మించి ఇవాళ ఆంధ్ర ప్రదేశ్లో లంచావతారాలున్నాయి. అవినీతి అధికారుల నుంచి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పడానికి సిగ్గేస్తు న్నది. అసలీ రాష్ట్రంలో కల్తీ లేకుండా ఏదైనా తింటున్నామని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలమా?’’ పాలక కూటమి లోని ఓ పార్టీ జిల్లా స్థాయి అధ్యక్షుని మాటలివి!
రాజకీయ నాయకులు – అధికారులు లంచాల కోసం కుమ్మక్కు కావడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ తినేదీ తాగేదీ సమస్తం కల్తీ అయిందనే అభిప్రాయం జన సామాన్యంలో బలపడింది. అదే అభిప్రాయాన్ని జనసేన నాయకుడు బహిరంగంగా ప్రకటించారు. పైస్థాయిలో అవినీతి ఉండకపోతే కింది స్థాయిలో ఇంత బరితెగింపు ఉండేది కాదు. అవినీతి వాటాల ఫలితంగా పాలనా యంత్రాంగంలో జవాబుదారీతనం అట కెక్కింది. ప్రభుత్వ పాలన పూర్తిగా పట్టాలు తప్పింది. శాంతి– భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి దనిపిస్తుంది. రక్షక భటులు పొలిటికల్ పోలీసింగ్కు మాత్రమే పరిమితం కావడంతో సంఘ విద్రోహ శక్తులు చెలరేగు తున్నాయి. ఈ శక్తులకు రాజకీయ నాయకత్వం అండ దండిగా లభిస్తున్నది.
‘పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో...’ అంటూ మురిసిపోయాడు ఒక కవి. ఆ భవితవ్యాన్ని పసితనంలోనే మసి చేస్తున్న కీచకసేనల పదఘట్టనలు పలుచోట్ల వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలో ఓ మైనర్ దళిత బాలికను బెదిరించి 14 మంది యువకులు కొన్ని నెలలపాటు అత్యాచారాలు చేసిన ఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. తండ్రి లేని ఆ బాలిక బయటికి చెబితే చంపేస్తారన్న భయంతో నోరు మెదపలేకపోయింది. బయటపడిన తర్వాత కూడా అధికార పార్టీ మద్దతుదారులైన నిందితులను పట్టుకోవడానికి చట్టం తటపటాయించింది. కర్నూలు జిల్లాలో చిన్నారి బాలికలను బెదిరించి మద్యం తాగించి పాలక పార్టీ యువకులు అత్యా చారాలు చేసి వీడియోలు కూడా తీశారు. చిన్నారులపై జరిగిన ఇటువంటి అత్యాచారాలే డజన్కు పైగా ఇప్పటివరకు వెలుగు చూశాయి. అత్యాచారాలు సగటున రెండు రోజులకొకటి జరుగుతున్నాయని అధికారిక గణాంకాలే చెబు తున్నాయి.
హత్యలైతే సగటున రోజుకొకటి. రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, రెడ్ బుక్ అరాచకాలు నేడు జగమెరిగిన సత్యాలు. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని బాబు సర్కార్ ఎత్తివేసింది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కోరుకున్న చోటుకి, కోరుకున్న సమయంలో డ్రగ్స్, మద్యం డోర్ డెలివరీ చేసే విధానం అమల్లో ఉందట! డబ్బులు వెదజల్లితే జరగని పాడు పని ఏదీ లేదని చెప్పుకుంటున్నారు. పైనున్న అధినేతల స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకూ ఈ దురవస్థకు అందరూ బాధ్యులే. తిలాపాపం తలా పిడికెడు! నిరాటంకంగా సాగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, భూదందాలు, అవినీతి, అసాంఘిక కార్యక్రమాలు దాచేస్తే దాగేవి కాదు. అందుకని వాటిని అంగీకరిస్తూనే అందుకు బాధ్యతను అధికార యంత్రాంగంపైనో, కొందరు ప్రజాప్రతినిధులపైనో నెట్టేయడానికి యెల్లో మీడియా పడరాని పాట్లు పడుతున్నది. అధినేత హెచ్చరించినా అనుచరులు దారికి రావడం లేదంటూ వాపోతున్నది. అసలు అధినేత సుద్దపూసైతే కదా! ఎవరైనా దారిలోకి వచ్చేది.
ఆవు పాలు, గేదె పాలే కాదు... రాష్ట్రంలో ‘మిక్సీ పాలు’ అనే మాట కూడా బాగా పాపులరైంది. అంటే పాలే లేకుండా పాలను తయారు చేయడమన్నమాట! పాల తయారీకి రసాయ నాలను ఉపయోగించడమన్నది విచ్చలవిడిగా జరుగుతున్నదనీ, అవి మోతాదు మించడం వల్లనే రాజమండ్రి దుర్ఘటన జరిగిందనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. అధికార యంత్రాంగం చిత్తశుద్ధి చూపెడితే వీటిని నియంత్రించడం అసాధ్యమేమీ కాదు. కానీ, వ్యవస్థీకృతమైన అవినీతి అందుకు అవకాశమివ్వదు. ఐదుగురు ప్రాణాలు కోల్పోవడానికీ, పలువురు అస్వస్థతకు గురి కావడానికీ ఈ వ్యవస్థీకృత అవినీతే కారణం. మంచినీటి పైపులైన్లు మురుగు నీటితో కలుషితమై, డయేరియా ప్రబలి శ్రీకాకుళంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా ఆందోళన కలిగించింది. రెండొందల మంది వరకు అస్వస్థులయ్యారు. ఇటువంటి దుర్ఘటనలను నివారించే ప్రయత్నం చేయకపోగా ఈ విషాద తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
కల్తీ పాలు, కలుషిత నీటి విషాద ఘటనలపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘మీ నిర్లక్ష్యంతో ఇంకెంత మంది ప్రాణాలు తీస్తార’ని ఆయన ‘ఎక్స్’లో ప్రశ్నించారు. పరిపాలనపై ముఖ్యమంత్రి పట్టుకోల్పోవడం వల్లనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరో పించారు. కలుషిత నీరు, ఆహారం కారణంగా పలుమార్లు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో వందలాది మంది అస్వస్థులయ్యారు. కురుపాంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోయిన విషయాన్ని, రాష్ట్రవ్యాప్తంగా 900 మందికి పైగా అస్వస్థులైన సంగతిని కూడా జగన్ ప్రస్తావించారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడానికి కారణం రాజకీయ నాయకులు – కొందరు అధికారుల అవినీతి మిలాఖతే!
విచ్చలవిడి అవినీతి కారణంగా పాలనా యంత్రాంగానికి పక్షవాతం సోకినా, పైకి మాత్రం బాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదనే భజనను యెల్లో మీడియా యథాశక్తి కొనసాగిస్తూనే ఉన్నది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసి డర్ తానేనంటూ సెల్ఫ్ ప్రమోషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అభివృద్ధి పేరుతో తన ఖాతాలో వేసుకున్న చాలా కార్యక్రమాలు ‘క్రెడిట్ చోరీ’ ద్వారా జగన్ ఖాతాలోంచి తెచ్చుకున్నవేనని జనానికి కూడా బాగా అర్థమైంది. రాష్ట్రం అభివృద్ధి పథంలో కాదు తిరోగమనంలో ఉన్నదని పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తే నిరూపిస్తున్నది. ‘కాగ్’ లెక్కల ప్రకారమే రాష్ట్ర జీఎస్టీ రాబడి నానాటికీ తగ్గుతున్నది.
‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీల్లో అత్యంత ముఖ్యమైన, అధిక వ్యయమయ్యే రెండు పథకాలను (నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి) పూర్తిగా ఎగవేసి మిగతా వాటిని అరకొరగా అమలుచేసి... ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేశారని పదేపదే చెప్పుకోవడం ముఖ్యమంత్రికే చెల్లింది. అత్యున్నత స్థాయిలో జరుగుతున్న అవినీతి కారణంగా పాలనా యంత్రాంగంలో అవినీతి పెచ్చ రిల్లింది. ప్రజాపాలన పడకేసింది. కనీసావసరాల కోసం,వైద్యం కోసం, మెరుగైన విద్య కోసం పేద ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. లేని అభివృద్ధి పేరుతో భజన బృందం చేస్తున్న కృత్రిమ సందడిలో వారి ఆర్తనాదాలు వినిపించక పోవచ్చు. కానీ సరైన సమయంలో అవి దీర్ఘశ్రుతితో శంఖా రావమై వినపడవచ్చు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


