సమాజంలో ఉండే అసమానతలకూ, అంతరాలకూ చట్టాల ద్వారా, మధ్యవర్తిత్వంతో సహా ఇతరేతర మార్గాల ద్వారా సామరస్యపూర్వకమైన పరిష్కారం సాధించటం రాజ్యం చేయాల్సిన పని. అందుకు రాజ్యాంగం, దాని ద్వారా ఏర్పడే భిన్న వ్యవస్థలు పనిచేస్తుంటాయి. కుటుంబాల్లో తరాల మధ్య తలెత్తే సమస్యలకు కూడా ఆ పరిధిలోనే పరిష్కారాలుంటాయి. ఇతరత్రా సమస్యల మాటేమో గానీ, పెళ్లి విషయంలో మాత్రం అదేం కుదరదంటున్నది గుజరాత్ ప్రభుత్వం. వివాహం గురించి తల్లిదండ్రులకు చెప్పి, వాళ్ల అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించటానికి సిద్ధపడుతోంది. ఇందుకోసం 2006 నాటి వివాహ నమోదు చట్టాన్ని సవరించదల్చుకున్నట్టు ప్రకటించింది. పరస్పరం ఇష్టపడి పెళ్లాడాలనుకునే జంటలకు ఇప్పటికే అనేకానేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్థిక అసమానతలు అందులో కొన్ని. ఈ గోదాలోకి తాను కూడా జొరబడి గుజరాత్ సర్కారు ఏం సాధించదల్చుకున్నదో అనూహ్యం.
ప్రజాస్వామ్యంలో 18 ఏళ్ల వయసు నిండినవారు ఓటేయటానికి, పోటీ చేయటానికి అర్హులు. ప్రభుత్వాలను మార్చవచ్చు. జనం ఆమోదం పొంది ఎన్నికైతే ప్రభుత్వంలో భాగమై విధానాలు రూపొందించవచ్చు. కానీ ఆ వయసువారు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవటానికి వీల్లేదని, అందుకు మరొకరి ఆమోదముద్ర తప్పనిసరని అనటం ఆశ్చర్యకరం. ఇలాంటి తలకిందుల ఆలోచనలు చేయటం గుజరాత్తోనే మొదలు కాలేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లు ఈ పనే చేశాయి. ఎనిమిదేళ్ల క్రితం కేరళకు చెందిన హదియా అనే యువతి కేసులో... తనకు నచ్చిన జీవితభాగస్వామి ఎవరో నిర్ణయించుకునే స్వేచ్ఛ మైనారిటీ తీరిన ప్రతి ఒక్కరికీ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ బంధంలో తల్లిదండ్రులు గానీ, కుల మత పెద్దలు గానీ జోక్యం చేసుకోవడం చెల్లదని చెప్పింది. నచ్చిన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవటం రాజ్యాంగం 21వ అధికరణం ద్వారా ప్రసాదించిన జీవించే హక్కులో భాగమని కూడా తెలిపింది. 2021లో అలహాబాద్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టులు సైతం ఈ సంగతినే స్పష్టం చేశాయి.
గత వారం గుజరాత్ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి వివాహ నమోదు చట్టాన్ని సవరించాలనుకోవటానికి చూపిన కారణాలు హాస్యాస్పదమైనవి. పెళ్లిళ్ల నమోదు నిబంధనల్ని కఠినతరం చేయాలని వివిధ సామాజిక సంస్థల నాయకుల నుంచి వినతులొచ్చాయట. బాధ్యతాయుతమైన ప్రభుత్వమైతే అది అసాధ్యమని వారికి నచ్చజెప్పాలి. వివాహాల నమోదు చట్టం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది. దాన్ని సవరించే హక్కు కూడా ఉంటుంది. కానీ అది రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అసలు ఇప్పుడు తీసుకురాదల్చుకున్న సవరణల్లో స్పష్టత లేదు. పెళ్లి గురించి తల్లిదండ్రులకు చెప్పారా లేదా అని అడగటం, వారికి చెప్పాలని నిబంధన విధించటం తప్ప వారు అంగీకరించని పక్షంలో చట్టం ఏం చేస్తుందో, పర్యవసానాలెలా ఉంటాయో చెప్పటం లేదు. పెళ్లి నమోదు చేస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇది అతి తెలివి. ఏదో రకంగా పెళ్లి సంగతి తల్లిదండ్రుల చెవినబడితే చాలు... ఆ తర్వాత వాళ్లూ వాళ్లూ పడతారని చేతులు దులుపుకోవటం!
ఇలాంటి సందర్భాల్లో మన దేశంలో ఏమవుతున్నదో కనబడుతూనే ఉంది. తమ కులంవాడు కాదని, ‘తక్కువ’ కులస్థుడని అనుకున్న మరుక్షణం హంతకులుగా మారు తున్న తల్లిదండ్రులు కోకొల్లలు. కనీసం ఇప్పుడైతే కొంత కాలం గడిచాకనో, బిడ్డ పుట్టాకనో ఆవేశం తగ్గించుకుని అక్కున చేర్చుకుంటున్నవారు అక్కడక్కడ కనబడు తున్నారు. ఈ చట్టం కనీసం అందుకు కూడా అవకాశం ఇవ్వదల్చుకున్నట్టు లేదు. కొన్నేళ్ల క్రితం ‘లవ్ జిహాద్’ మాట తెగ ప్రచారం చేశారు. ప్రేమ పేరిట మతాంతీకరణ జరుగుతున్నదని భూమ్యాకాశాలు ఏకం చేశారు. ‘కేరళ ఫైల్స్’ చిత్రం దాని ఆధారంగానే నిర్మించారు. కానీ ఆ వంకన మతాంతర వివాహాలను వివాదాస్పదం చేయటం తప్ప సాధించిందేమీ లేదు. రాజకీయపక్షాలు తమ ప్రయోజనాల కోసం ఏమైనా చెబుతాయి. రాజ్యం అలాంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉన్న సమస్యల్ని పెంచకూడదు. తానే సమస్యగా మారకూడదు.


