National
-
అహ్మాదాబాద్ ప్రమాద ఘటన దర్యాప్తులో పురోగతి
సాక్షి,అహ్మదాబాద్: గతేడాది సరిగ్గా ఇదే రోజు భారత దేశ విమాన చరిత్రలోనే అత్యంత తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన 32 సెకన్లకే అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మందితో పాటు, మరో 19 మంది దుర్మరణం పాలయ్యారు. సరిగ్గా ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక విషయాలను దర్యాప్తు సంస్థ ప్రకటించింది.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప్రమాద దర్యాప్తులో తాము గణనీయమైన పురోగతి సాధించామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) (శుక్రవారం) ప్రకటించింది. దర్యాప్తుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది.ఆ సంస్ధ విడుదల చేసిన వివరాలు. "గత ఏడాది కాలంగా, దర్యాప్తు బృందం ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని సాంకేతిక, కార్యాచరణ సంస్థాగత మానవ తప్పిదాలకు సంబంధించిన కోణాలను అత్యంత నిశితంగా, కఠినంగా పరిశీలించింది. ఈ ప్రక్రియలో గుర్తింపు పొందిన ప్రతినిధులు, సాంకేతిక సలహాదారులు, సంబంధిత సంస్థలకు చెందిన నిపుణుల సహాయం తీసుకున్నాం. విమాన వ్యవస్థలు, ఫ్లైట్ రికార్డర్ డేటా (బ్లాక్ బాక్స్), ఇంజిన్కు సంబంధించిన విడిభాగాలు, నిర్వహణ, కార్యాచరణ రికార్డులతో పాటు ఈ విచారణకు అవసరమైన ఇతర కీలక ఆధారాలను విశ్లేషించడంలో సమాచార సేకరణ పరంగా గణనీయమైన పురోగతి లభించింది." అని ప్రకటన విడుదల చేసింది.ఆ రోజు ఏం జరిగింది?2025 జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 (బోయింగ్ 787 డ్రీమ్లైనర్), టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లకే కుప్పకూలింది. అయితే, విమానంలో ఉన్న ప్రయాణికులలో ఒకరు మాత్రం ఈ ప్రమాదం నుండి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు.AAIB, గతేడాది జూలైలో తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు "RUN" పొజిషన్ నుండి "CUTOFF" పొజిషన్కు మారిపోయాయని, దీనివల్ల ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. అయితే, ఆ స్విచ్లు అలా మారడానికి గల అసలు కారణం ఏమిటనేది మాత్రం ఆ నివేదికలో స్పష్టం చేయలేదు. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి ఇది వరకూ ఎవరినీ బాధ్యులుగా ప్రకటించలేదు. -
వాణిజ్య నౌకలపై అమెరికా వరుస దాడులు
సాక్షి, ఢిల్లీ: హర్ముజ్ జలసంధిలో 20 మంది భారతీయ నావికులతో వెళ్తున్న 'గినియా-బిస్సావు' పతాకం గల నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇటీవల భారత్కు చెందిన చమురు నౌకలపై అమెరికా తరచుగా దాడులు చేస్తోంది. ఒమన్ సమీపంలోని హర్మూజ్ సముద్ర జలాల్లో చమురు రవాణా నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పూర్తై రెండురోజులైన గడవక ముందే మరోసారి భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడులు చేసింది. దీంతో ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది..ఈ ఘటనను నిరసిస్తూ (శుక్రవారం) భారత్లోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి , అమెరికా రాయబారితో ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు బుధవారం నాడు 'పలావు' పతాకంగల MT సెట్టెబెల్లో నౌకపై జరిగిన దాడికి సంబంధించి కూడా జేసన్ మీక్స్ను MEA పిలిపించి మాట్లాడింది. మూడు రోజుల్లో అమెరికా దౌత్య కార్యాలయానికి సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి.భారతీయ నావికులే టార్గెట్గా జరుగుతున్న ఈ దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి సమీపంలో భారత నౌకాదళం అత్యున్నత నిఘాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. "వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు తక్షణమే ముగియాలి. అంతర్జాతీయ చట్టాలకు లోబడి అంతర్జాతీయ జలమార్గాలలో స్వేచ్ఛా వాణిజ్యం, నౌకల రాకపోకలను పునరుద్ధరించాలి. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల భారతీయ నావికులకు ముప్పు వాటిల్లడం తీవ్ర ఆందోళనకరం." అని తెలిపింది.కాగా ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో 18,000 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, క్షేమం, దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఒకే ఒక్క తప్పుతో అథఃపాతాళానికి..
సాక్షి, బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుని హత్య శాండల్వుడ్లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రమే కాదు, దేశమంతటా వార్తలకెక్కింది. చాలెజింగ్ స్టార్గా లక్షలాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు దర్శన్ ఈ హత్య కేసులో జైలు పాలయి గురువారంతో రెండేళ్లు పూర్తి అయింది. ఆయన కెరీర్ అగమ్యగోచరమైంది.2024, జూన్ 11న మైసూరులోని ఒక హోటల్లో ఉండగా దర్శన్ను, ఆయన సన్నిహితులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో అనేకానేక మలుపులు తీసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మధ్యలోనే ఒక్కసారి బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ను రద్దు చేయడంతో మళ్లీ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. అన్నీ మిస్.. మిస్ బెయిలు మధ్యలో దర్శన్ తన ప్రతిష్టాత్మక ‘ది డెవిల్’ సినిమా షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ఆ సినిమా విడుదల సమయంలో కటకటాల్లోనే ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది తన 49వ పుట్టినరోజు, 23వ పెళ్లి రోజును కూడా అభిమానులు, కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోయారు.దర్శన్ జీవితంలో చీకటిదినం 2024, జూన్ 9 నటుడు దర్శన్ పాలిట ఒక చీకటి రోజు.. బెంగళూరు సుమ్మనహళ్లి రాజకాలువలో రేణుకాస్వామి శవం లభ్యం అయింది. ఈ కేసులో దర్శన్ పేరు వినిపించడంతో పోలీసులు జూన్ 11న అరెస్టు చేశారు. జూన్ 7న కిడ్నాప్ అయిన రేణుకాస్వామి రెండు రోజుల తర్వాత రాజకాలువలో శవమై కనిపించాడు. దర్శన్ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యంగా సందేశాలు పంపించాడనే కారణంతో దర్శన్ అనుచరులు చిత్రదుర్గ నుంచి అతన్ని బెంగళూరుకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హత్య చేశారన్నది అభియోగం. తరచూ మలుపులు ఈ కేసు నిరంతరం మలుపులు తిరుగుతూనే ఉంది. బెంగళూరు జైలులో దర్శన్కు రాచ మర్యాదలు కల్పిస్తున్నారని కొన్నాళ్లు బళ్లారి జైలుకు తరలించారు. కొన్ని నెలల తర్వాత వైద్య సేవల కారణంతో బెయిల్ పొందారు. దర్శన్ బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిలు రద్దయింది. గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ దర్శన్ జైలు పక్షి అయ్యారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన దర్శన్కు తీవ్ర నిరాశే మిగిలింది. దర్శన్, పవిత్రతో పాటు 7 మంది నిందితులు కారాగారంలోనే ఉండగా, అభిమానులు విచారంలో మునిగారు. -
రూ. 12 కోట్ల గంజాయి : అడ్డంగా బుక్కైన కేరళ బ్యూటీ
పేరుకే అందాల సుందరి. చేసేది మాత్రం గలీజ దందా. 28 ఏళ్ల మోడల్, 'మిసెస్ కేరళ' 2025 పోటీదారు హర్ష సన్నీ దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా బుక్కైంది. బ్యాంకాక్ నుండి విమానంలో ముంబైకి వస్తూ పోలీసులకు చిక్కింది.కస్టమ్స్ అధికారుల ప్రకారం, హర్ష సన్నీ జూన్ 10-11 తేదీల రాత్రి ఎయిర్ ఇండియా విమానం TG-351లో బ్యాంకాక్ నుండి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. బ్యాంకాక్నుంచి 11 కిలోలకు పైగా హై క్వాలిటీ 'హైడ్రోపోనిక్ గంజాయి'ని గుట్టుచప్పుడు కాకుండా బాగానే తీసుకొచ్చింది. కానీ ఆమె ప్రవర్తనను గమనించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU), కస్టమ్స్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా అసలు గట్టు రట్టైంది. ఇదీ చదవండి: ఒకే ఒక్కడు మృత్యుంజయుడు.. ఇపుడెలా ఉన్నాడు?ఆమె ట్రాలీ బాగ్లో 12 వాక్యూమ్-సీల్డ్ ప్లాస్టిక్ ప్యాకెట్లు లభించాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) కిట్ను ఉపయోగించి అక్కడికక్కడే జరిపిన రసాయన పరీక్షలో, ఆ పదార్థం'హైడ్రోపోనిక్ గంజాయి' అని నిర్ధారణ అయింది. విలువ రూ. 11.82 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఆమెను ఎన్డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ సరుకును ముంబైలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కడకు చేరవేయాలనుకున్నారనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.ఇదీ చదవండి: కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ! -
ఒకే ఒక్కడు మృత్యుంజయుడు.. ఇపుడెలా ఉన్నాడు?
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి రేపిన ఎయిరిండియా ప్రమాదం జరిగిన ఏడాది గడిచినా ఆ విషాదం అందరి గుండెల్లోనూ ఇంకా పచ్చిగానే ఉంది. ఆప్తులను కోల్పోయిన గుండెకోతను ఒక్కో కుటుంబంజీవితకాలం మోయాల్సి రావడం అత్యంత విషాదకరం. అయితే ఈ ప్రమాదంనుంచి బతికి బట్టకట్టిన ఒకే ఒక్కడు విశ్వాస్కుమార్ రమేష్ (Vishwash Kumar Ramesh) ఇపుడు ఆయన ఆరోగ్య, మానసిక పరిస్థితి ఎంటి? ఎలా ఉన్నారు?ప్రమాద స్థలం నుండి 12 మంది సిబ్బందితో సహా 241 మందిలో టీ-షర్ట్పై రక్తపు మరకలతో, చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని నడుచుకుంటూ వచ్చిన మృత్యుంజయుడు రమేష్. అంతటి విషాదంలోనూ అనూహ్యంగా మృత్యుముఖంనుంచి బైటపడిన రమేష్ చిత్రాలు అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా వైరలయ్యాయి. ఈ ప్రమాదం జరిగి ఏడాది పూర్తైనా తానింకా పూర్తిగా నిద్రపోలేక పోతున్నానని, తీవ్రమైన ఆందోళన (యాంగ్జైటీ) ఆనాటి చేదు జ్ఞాపకాలతో నరకం అనుభవిస్తున్నాను అంటూ విశ్వాస్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.బతికే ఉన్నా.. కానీప్రస్తుతం యూకేలోని లెస్టర్ (Leicester) లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న 39 ఏళ్ల రమేష్, ఈ ప్రమాదంలో తన సోదరుడు అజయ్ను కోల్పోయారు. ఈ విపత్తు ఒక వ్యక్తిగా తనను పూర్తిగా మార్చేసిందని ఆయన చెప్పారు. "నేను ప్రాణాలతో బయటపడ్డానని అనుకుంటున్నారు కానీ మూసి ఉన్న తలుపుల వెనుక నేను అనుభవిస్తున్న బాధ ఎవరికి తెలియదు. నేను బతికున్నందుకు గ్రేటే. కానీ బతికి ఉన్నాను అన్నది కథలో ఒక భాగం మాత్రమే. ఆ తర్వాత అనుభవిస్తున్న నరకాన్ని మాటల్లో చెప్పలేను. శారీరకంగా, మానసికంగా , ఆర్థికంగా బాధపడుతూనే ఉన్నాను" అని రమేష్ పేర్కొన్నారు."సోదరుడిని కోల్పోవడం, తీవ్రమైన మానసిక గాయాలు, అసలు ఇది ఎలా, ఎందుకు జరిగిందనే దానిపై నిరంతరం వేధించే సమాధానం లేని ప్రశ్నలతో జీవిస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆవేదన బాధితులైన ప్రతి కుటుంబాల్లోనూ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రజలకు నిజాయితీ, నిష్పాక్షికమైన సమాధానాలు అవసరం. జరిగిన దాన్ని మార్చలేం, కానీ బాధిత కుటుంబాలకు సమాధానం తెలియాలి. న్యాయం జరగాలి’’ అని డిమాండ్ చేశారు.భయం గుప్పిట్లో జీవితంరమేష్ కుటుంబ సలహాదారు, లెస్టర్కు చెందిన కమ్యూనిటీ లీడర్ సంజీవ్ పటేల్ రమేష్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అతను ప్రస్తుతం ఎవరి సాయం లేకుండా గడద దాటి బైటికి రాలేకపోతున్నాడు. అతను తీవ్రమైన మానసిక గాయానికి (ట్రామా) గురయ్యాడు. బహుశా ఆ గాయాల గుర్తులు అతని జీవితాంతం ఉండిపోవచ్చు అని చెప్పారు. ఈ ప్రమాదానికి గురైన ప్రతి కుటుంబం నరకాన్ని అనుభవిస్తోంది. కానీ విశ్వాస్, అతని కుటుంబానికి జరిగిన నష్టం ఊహించలే నిదన్నారు.ఇదీ చదవండి: కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ!ఆ 32 సెకన్లలో ఏం జరిగింది?గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లడానికి బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ (విమానం) టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లకే, అక్కడే మెడికల్ కాలేజీ హాస్టల్ మరియు క్యాంటీన్ భవనాన్ని బలంగా ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో విమానంలో ఉన్న 12 మంది సిబ్బందితో సహా 241 మంది ప్రయాణికులు కాగా, విమానం పడిన భవనంలో మరో 19 మంది ఉన్నారు. ఇదీ చదవండి : 90 నిమిషాల్లో రూ. 30 కోట్లు : ఈ లెక్కలతో మతిపోవాల్సిందే! -
కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ!
Air India Crash గతేడాది గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వందలాది కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చిన AI-171 అత్యంత ఘోర విమాన ప్రమాదంతో వందలాది మంది జీవితాలు తలకిందలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒకే ఒక్కడు'విశ్వాస్ కుమార్ రమేష్' సజీవంగా బతికి బయటపడినప్పటికీ, ఒక్కొక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ. అలాంటి వారిలో తన తండ్రిని, సోదరిని ఎప్పటికీ చూడలేని ఒక పసిబాలుడు ఒకడుబయలుదేరిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోతుందని, అది తన జీవితంలో అంతులేని అగాథాన్ని మిగులుస్తుందని మొబ్బషెరా వహోరా అస్సలు ఊహించి ఉండరు. అప్పటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయివారిలో మొబషెరా భర్త పర్వేజ్ వహోరా, నాలుగేళ్ల కుమార్తె జువేరియా కూడా ఉన్నారు. ఇండియాలోని కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చి, తిరిగి లండన్కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తండ్రీకూతుళ్లు ఇద్దరూ చనిపోయిన ఘటనతో ఇరు కుటుంబాలు ఆ షాక్ నుండి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి.మరోవైపు అప్పటికే గర్భవతిగా ఉన్న లండన్లో ఉన్న జువేరియా తల్లి మొబషీరా, ఈ ఊహించని గుండె కోతను తట్టుకోలేకపోయారు. లండన్లో భర్త, బిడ్డ తిరిగిన ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయింది. వారి జ్ఞాపకాలను, కడుపులో బిడ్డను మోస్తూ ఆమె మహారాష్ట్రలోని తారాపూర్లో ఉన్న తన స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. అంతటి తీవ్రమైన బాధలోనూ ఆమె గర్భాన్ని మోస్తూ భారతదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారి రాక ఒక మధుర క్షణమే అయినా, అదొక చేదు నిజాన్ని కూడా గుర్తు చేస్తోంది.సర్వస్వం కోల్పోయి, ఒంటరిదైపోయిన తమ సోదరిని తిరిగి స్వదేశానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నామని ఆమెబంధువు షారూఖ్ గుర్తు చేసుకున్నారు. తమ జీవితాలకు బాబు జననం ఆశాకిరణమే అయినప్పటికీ, ఏ పాపం తెలియని పసివాడు తన తండ్రిని, చెల్లిని చూడలేడనే నిజాన్ని నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటుందని కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇంతటి ఘోర విషాదానికి ఏడాది పూర్తయినప్పటికీ, 'ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (AAIB) ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు, విమానంలో ఉన్న ప్రయాణికుల కుటుంబాలలో దాదాపు 96 శాతం మందికి తాత్కాలిక పరిహారం చెల్లించినట్లు ఎయిరిండియా తెలిపింది. బాధిత కుటుంబాలు ఇప్పటికీ ఈ ప్రమాదానికి గల కారణాలేంటో తెలియదు. ఇంకా న్యాయం కోసం వేచి చూస్తున్నాయి. ఇదీ చదవండి : 90 నిమిషాల్లో రూ. 30 కోట్లు : ఈ లెక్కలతో మతిపోవాల్సిందే! -
సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. మధ్యప్రదేశ్ నుంచి ఆమె దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి (Returning Officer) తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన ఆమె నామినేషన్ను, పెండింగ్లో ఉన్న ఒక క్రిమినల్ కేసును(తెలంగాణలో నమోదు అయ్యింది) వెల్లడించలేదన్న కారణంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ్టి విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, సంబంధిత కేసులో ఇప్పటివరకు చార్జీలు (charges) ఫ్రేమ్ కాలేదని తెలిపారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం చార్జీలు నమోదు కాకుండా నామినేషన్ను తిరస్కరించడం సరైనది కాదని ఆయన కోర్టుకు వివరించారు. అయితే ధర్మాసనం ఈ వాదనపై స్పందిస్తూ, నామినేషన్ ప్రక్రియ అనంతరం రిటర్నింగ్ అధికారి ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసి నామినేషన్ను అంగీకరించిన ఏమైనా తీర్పులు ఉన్నాయా చూపించాలని సింఘ్వీని ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ఏ కేసులోనైనా వాస్తవాలు వచ్చినప్పుడు మాత్రమే కోర్టు చట్టాన్ని వర్తింపజేస్తుందని.. చట్టం ఇప్పటికే స్పష్టంగా ఉందని.. తగిన సందర్భంలో కోర్టు దాన్ని అమలు చేస్తుందని తెలిపారు.మధ్యప్రదేశ్ ఆర్వో తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. నామినేషన్ తిరస్కరణ అంశం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని, అందువల్ల ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ నిలవదని వాదించారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాల జోక్యానికి ఆర్టికల్ 329 అడ్డుకట్ట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు న్యాయ సమీక్ష పరిధికి బయట ఉంటుందని, ఏదైనా తప్పు జరిగితే అది ఎన్నికల ట్రైబ్యునల్లోనే సవాలు చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మోహిందర్ సింగ్ గిల్ కేసు సహా పలు తీర్పులను ఆయన ప్రస్తావించారు.విచారణ సందర్భంగా సాంకేతిక లోపం కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు నిలిచిపోయాయి. ఆ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. అయితే ఈ జోక్యంపైనా సింఘ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికల సంఘం అభ్యర్థి తరఫున వాదనలు వినిపించకూడదని ఆయన పేర్కొన్నారు. అయితే.. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఆర్వో నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఇలాంటివి జరిగినప్పుడు ఈసీని ఆశ్రయించాలని సూచిస్తూ.. పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు తెలిపింది. కాగా.. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ స్పందించారు. ఇది తన వ్యక్తిగత పరాజయం కాదని, భారత ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి జరిగిన నష్టమని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం స్వతంత్రతపై తాను మొదటి నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్నానని, అవి మరోసారి నిరూపితమయ్యాయని ఆమె అన్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం వెనుక పారదర్శకత లేకపోవడాన్ని తాము ఎత్తిచూపామని, అయితే తమ వాదనలను సరైన విధంగా పరిగణనలోకి తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు, తమ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించినందుకు మాత్రం ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ధర్మస్థళ కేసులో సంచలనం.. ప్రకాష్ రాజ్ పేరు చెప్పిన చిన్నయ్య!
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చిన్నయ్య జూన్ 11న కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరును ప్రస్తావించారు.ధర్మస్థళ కేసులో తాము చెప్పినట్లుగా వాంగ్మూలాలు ఇవ్వాలని పలువురు తనను ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. వారిలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారని ఆరోపించారు. గిరీష్ మట్టన్నవర ద్వారా ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడి, జూన్ 29న కలుస్తానని చెప్పారని చిన్నయ్య పేర్కొన్నారు.పిటిషన్లో ధర్మస్థళపై ప్రచారం కోసం రూ.200 కోట్లు కేటాయించారని ఆరోపించారు. మహేష్ శెట్టి తిమరోడి తనకు సహకరిస్తే రూ.50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని చిన్నయ్య పేర్కొన్నారు. అలాగే, ఈ కుట్రకు కావలసిన నిధులు కేరళ నుంచి వచ్చాయని, చిత్రదుర్గకు చెందిన రామ నాగరాజ్ కూడా ఆర్థిక సహాయం అందించారని ఆరోపించారు.చిన్నయ్య తన భార్య ఖాతాకు జరిగిన బ్యాంకు ట్రాన్సాక్షన్లు, నగదు చెల్లింపుల వివరాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ కుట్రకు భాగస్వాములైన మహేష్ శెట్టి తిమరోడి, గిరీష్ మట్టన్నవర, విఠల్ గౌడ, జయంత్ అని ఆయన ఆరోపించారు. వీరి పేర్లు వెల్లడించినప్పటికీ సిట్ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని చిన్నయ్య ఫిర్యాదు చేశారు. చిన్నయ్య దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు స్వీకరించింది. ధర్మస్థళ కేసు వివరాలు కోరింది. తదుపరి కేసు విచారణను జూన్ 29కి వాయిదా వేసింది.ఈ కేసులో తన పేరు ప్రస్తావన రావడంపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ‘ధర్మస్థళ అంశం కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ముడిపడి ఉంది. ప్రస్తుతం నేను చాలా దూరంలో ఉన్నాను. మరో రెండు రోజుల్లో నేనే స్వయంగా వచ్చి మీడియా ఎదుట స్పందిస్తాను. అప్పటి వరకు నా మీద వస్తున్న కల్పిత కథనాలు, జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని’ అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Actor and film director Prakash Raj tweets, "Greetings to all.. In the media… On social networks, some news regarding me about the Dharmasthala case has come to my attention being discussed. Since this is an extremely sensitive matter.. and one that has hurt the faith of… pic.twitter.com/YYpoVB5UfR— IANS (@ians_india) June 12, 2026 -
టీఎంసీలో తిరుగుబాటు తుపాను.. ఇదేం ట్విస్ట్ బాబోయ్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టించే పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఇప్పుడు పార్టీ చీలిక అంచుల దాకా వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన రెబల్స్ రాసిన సీక్రెట్ లేఖ ఒకటి బయటకు రావడం కలకలం రేపుతోంది. అంతేకాదు.. అసలైన తృణమూల్ కాంగ్రెస్ తమదేనని, పార్టీ ఎన్నికల గుర్తుపై కూడా హక్కు తమకే ఉందని వారు వాదిస్తున్నట్లు సమాచారం.ఏకంగా 19 మంది లోక్సభ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేసి, ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా గుర్తింపు ఇవ్వాలని లోక్సభ స్పీకర్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. మే 18 తేదీతో స్పీకర్కు పంపిన ఆ రహస్య లేఖ.. కొన్ని మీడియా సంస్థల స్టింగ్ ఆపరేషన్ తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో మెజారిటీ ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. వాళ్లలో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్, నటి-ఎంపీ రచనా బెనర్జీ, సయోనీ ఘోష్, శతాబ్ది రాయ్, కాకోలి ఘోష్ దస్తిదార్ తదితరులు ఉన్నారు. ఈ పరిణామంతో.. తృణమూల్లో కేవలం తొమ్మిది మంది మాత్రమే మమతా శిబిరంలో మిగిలినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రెబల్ ఎంపీలకు ఏ పార్టీనో, కూటమిలోనే చేరే ఉద్దేశం లేదని వాళ్ల లేఖను బట్టి అర్థమవుతోంది. స్వతంత్ర పార్లమెంటరీ గ్రూప్గా పనిచేస్తామని వాళ్లు స్పీకర్కు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే వారి తదుపరి వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వంటి కీలక అంశాలపై కేంద్రం తీసుకునే నిర్ణయాలను కూడా ఈ వర్గం పార్టీ అధినాయకత్వం ఆదేశాలను పాటిస్తుందా? లేదా? అనే కుతూహలం నెలకొంది.ఇప్పటికే మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యవహార శైలిపై కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఆ అసంతృప్తే ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలోనూ మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడం, ఇప్పుడు ఎంపీలు కూడా వేరు దారి పట్టడం.. తృణమూల్ 28 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత సంక్షోభంగా కనిపిస్తోంది.ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా ఉంది. తిరుగుబాటు ఎంపీలు స్పీకర్కు లేఖ రాసిన తేదీ మే 18. అయితే పార్టీ చీఫ్ విప్గా సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ నియామకం మే 19న జరిగింది. దీంతో సాంకేతికంగా ఈ వర్గానికి గుర్తింపు ఇవ్వాలా? వద్దా? అన్నది స్పీకర్ పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే.. పార్టీ గుర్తుపై కూడా రెబల్ వర్గం హక్కు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ వద్దే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారని వాదిస్తూ వారు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే అవకాశముంది. మరోవైపు నటుడు.. సీనియర్ ఎంపీ శతృఘ్న సిన్హా మాత్రం తిరుగుబాటు వర్గానికి దూరంగా ఉంటూ మమతా బెనర్జీకే తన మద్దతు ప్రకటించారు. మహువా మెయిత్రా సైతం దీదీ పక్షాన నిలిచి అధికారిక శిబిరంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే పార్టీపై పట్టు కోల్పోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న మమతకు.. రెబల్స్ తాజా ఎత్తుగడలు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక వర్గం, పార్టీ గుర్తు, ఎన్నికల సంఘం పోరు.. ఇలా ఒక్కో అడుగు ముందుకేస్తున్న తిరుగుబాటు నేతలు దీదీ శిబిరంలో ఆందోళన పెంచుతున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే.. ఈ వివాదం ఎన్నికల సంఘం నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి
లక్నో నుంచి ఢిల్లీ వెళ్లే 'స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్' (Swarn Shatabdi Express) రైలుపై ఫిరోజాబాద్ సమీపంలో గురువారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైల్లో ఈ ఘటన జరగడంతో ఆందోళన రేగింది. అయితే ఈ ప్రమాదంలో మోహన్ భాగవత్ సురక్షితంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఏ జరిగిందంటే..గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ నుండి ఢిల్లీ వెళ్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెం. 12003) రాత్రి 7:20 గంటల ప్రాంతంలో మఖన్పూర్ స్టేషన్ను దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. కదులుతున్న రైలుపై రాయి పడటంతో E-1 కోచ్ కిటికీ అద్దం దెబ్బతింది. దీంతో రైల్వే అధికారులు ఉత్తరప్రదేశ్ ఫేరోజాబాద్ జిల్లాలోని తుండ్లా జంక్షన్ వద్ద వద్ద రైలును నిలిపివేశారు.మోహన్ భగవత్ టార్గెట్?అయితే రాయి తగిలిన కోచ్లోనే మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నట్లు GRP ఇన్స్పెక్టర్ షేర్ సింగ్ ధృవీకరించారు. కోచ్లోని అవతలి వైపు (ఆపోజిట్ సీట్లో) కూర్చోవడంతో ఆయనకు ఎలాంటి హాని జరగలేదు. అలాగే ఆయనతో పాటు, ఇతర ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నారని సింగ్ తెలిపారు. అధికారుల తనిఖీల అనంతరం రైలు తిరిగి ఢిల్లీకి బయలుదేరింది.ఘటనా స్థలానికి ఉన్నతాధికారులుఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఫిరోజాబాద్లోని ఘటనా స్థలాన్ని సందర్శించారు. రైలులో మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఎస్ఎస్పీ ఆదిత్య లాంగే చెప్పారు. విచారణ నిమిత్తం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.గతంలోనూ రాళ్ల దాడులు ఫిరోజాబాద్ గుండా వెళ్లే ఈ రైల్వే ట్రాక్ పరిసరాల్లో గతంలోనూ పలుమార్లు రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గతంలో జరిగిన ఘటనలను, ప్రస్తుత కేసును పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని ఎస్ఎస్పీ లాంగే స్పష్టం చేశారు. -
ఇల్లు దక్కలేదని.. నడిరోడ్డుపైనే 82 ఏళ్ల తండ్రి హత్య
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. కోర్టులో తండ్రికి వ్యతిరేకంగా ఆస్తి కేసు ఓడి పోయాననే ఆగ్రహంతో ఒక వ్యక్తి తన 82 ఏళ్ల తండ్రిని నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది.ఛత్రపతి సంభాజీనగర్లో ఉంటున్న జలవనరుల శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి జాఫర్కమరుద్దీన్ సయ్యద్ పటేల్కు, మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న కుమారుడు అబ్దుల్ రెహమాన్తో చాలాకాలంగా వివాదం నడుస్తోంది. నిత్యం కుటుంబ సభ్యులతో గొడవపడుతూ, వారిపై దాడిచేసేవాడు. దీంతో బాధితుడు జాఫర్ కొడుకు ప్రవర్తనతో విసుగు చెంది, ఇంటి కోసం కేసు వేయడానికి ముందు పూణేలోని తన కుమార్తె ఇంటికి వెళ్లిపోయాడు.కుమారుడి ప్రవర్తనతో వేగలేక, అతడిని ఇల్లు ఖాళీ చేయించడానికి కోర్టును ఆశ్రయించాడు. రెండేళ్లపాటు న్యాయపోరాటం చేశాడు. చివరికి కోర్టు తండ్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చి, కుమారుడిని ఇల్లు ఖాళీ చేయించాలని ఆదేశించింది. ఆస్తి యాజమాన్యాన్ని తండ్రికి పునరుద్ధరించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో విచక్షణ మరిచిన కొడుకు ఉత్తర్వులతో కోర్టు నుండి ఇంటికి తిరిగి వస్తుండగా జాఫర్పై ఎటాక్ చేశాడు. తండ్రి ప్రయాణిస్తున్న ఆటోరిక్షాను ఆపి, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి చంపాడు. పటేల్తో పాటు ఆయన కుమార్తె కూడా ఈ దాడిలో గాయపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
పనిమనిషి ఖాతాలో 52 లక్షలా?
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వలలు విసురుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎంత అవగాహన పెరిగినా.. ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారైనా ఇలాంటి మోసాలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ డేటింగ్ యాప్లో మొదలైన పరిచయం.. సంచలన కేసుగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ హనీట్రాప్ తరహా మోసంలో చిక్కుకున్నది సామాన్య వ్యక్తి కాదు.. ఓ మహిళా జడ్జి.హర్యానాలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు న్యాయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళా జడ్జి ఇంట్లో పని మనిషి తాను డేటింగ్ యాప్లో మోసపోయానని పోలీసులను ఆశ్రయించింది. జడ్జి రిఫరెన్స్ కావడంతో ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కానీ కేసు కోర్టుకు చేరిన తర్వాత అసలు కథ బయటపడింది. టిండర్ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో రూ.52 లక్షలకు పైగా మోసపోయింది పనిమనిషి కాదు.. సదరు మహిళా న్యాయమూర్తి అని తేలింది.దర్యాప్తు వివరాల ప్రకారం.. గత ఏడాది నవంబర్లో టిండర్ యాప్లో "అభిమన్యు వశిష్ఠ్" పేరుతో ఓ వ్యక్తి మహిళా జడ్జికి పరిచయమయ్యాడు. తాను కేంద్ర ప్రభుత్వంలోని ఓ రహస్య విభాగంలో పనిచేస్తున్నానని చెప్పి ఆమె నమ్మకం సంపాదించాడు. క్రమంగా ఇద్దరి మధ్య సన్నిహిత పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికాడు.అతని మాటలు నమ్మిన జడ్జి.. వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.52 లక్షలకు పైగా బదిలీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే చెప్పినట్టుగా లాభాలు రాకపోవడం, అతని ప్రవర్తనపై అనుమానాలు రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించారు.అయితే ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఫిర్యాదు నమోదైన తీరు. అసలు డబ్బు జడ్జి ఖాతాల నుంచి వెళ్లినా.. ఫిర్యాదు మాత్రం ఆమె ఇంటి పనిమనిషి పేరుతో నమోదైంది. దీంతో విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు బాధితురాలు ఎవరో స్పష్టంగా పేర్కొనకుండా కేసు నమోదు కావడంపై ప్రశ్నలు లేవనెత్తింది.బెయిల్ పిటిషన్ను విచారించిన అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ లాలేర్.. రొమాన్స్ లేదా హనీట్రాప్ తరహా మోసాల బాధితులు ఇబ్బందిగా భావించడం సహజమేనని, కానీ అందుకోసం దర్యాప్తు పారదర్శకతను పక్కనపెట్టలేమని వ్యాఖ్యానించారు.ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని కోర్టు గుర్తించింది. టిండర్ చాట్లు, పూర్తి వాట్సాప్ సంభాషణలు, కాల్ డీటెయిల్ రికార్డులు వంటి కీలక ఆధారాలు ఇంకా సేకరించలేదని పేర్కొంది. నిందితుడు కూడా తన మొబైల్ను పూర్తిగా పరిశీలనకు ఇవ్వకుండా, తనకు అనుకూలమైన కొన్ని సందేశాలు మాత్రమే సమర్పించాడని కోర్టు వ్యాఖ్యానించింది.దీంతో నిందితుడి ప్రవర్తనను "దాగుడుమూతల ఆట"గా అభివర్ణించిన కోర్టు.. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. టిండర్, వాట్సాప్ రికార్డులను పూర్తిగా సేకరించాలని, డబ్బు బదిలీల వెనుక ఉన్న ఖాతాలు, సంస్థలను పరిశీలించాలని, నిందితుడి ఫోన్పై ఫోరెన్సిక్ విశ్లేషణను వేగవంతం చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది.డేటింగ్ యాప్లో మొదలైన ఈ పరిచయం.. ప్రేమ, పెట్టుబడులు, నమ్మకం పేరుతో సాగి.. చివరకు రూ.52 లక్షల మోసం, ఫిర్యాదు చుట్టూ కొత్త ప్రశ్నలు, కోర్టు వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇంకా రహస్యమేనా?
న్యూఢిల్లీ: దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. అయితే ఈ ప్రమాదం ఎందుకు? ఎలా? జరిగిందనే కారణాలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ తరుణంలో తాజాగా ఉన్నతాధికార వర్గాలు స్పందించాయి. మరో రెండు నెలలు ఒపిక పెడితే అన్ని విషయాలు బయటపెడతాయని కీలక ప్రకటన చేశాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ కొనసాగిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే తుది నివేదిక విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని, అనవసర ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని వర్గాలు సూచించాయి. అలాగే దర్యాప్తులోని ఏ అంశాన్నీ దాచిపెట్టబోమని, అన్ని వివరాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చాయి.ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలపై కూడా అధికారులు స్పందించారు. వాటిలో ప్రచారంలో ఉన్న కొన్ని అంశాలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన విమాన ఇంజిన్లను తయారు చేసిన జీఈ ఏరోస్పేస్ సంస్థ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికీ.. విచారణలో వెలుగుచూస్తున్న అంతర్గత అంశాల్లో మాత్రం జోక్యం చేసుకోవడం లేదని సమాచారం. తుది నివేదిక సిద్ధం చేసే ప్రక్రియపై మాత్రమే అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.తుది నివేదిక విడుదలకు ముందుగా ఒక మధ్యంతర స్థితిగతుల నివేదిక (స్టేటస్ రిపోర్ట్) విడుదల చేసే అవకాశాన్ని కూడా ఏఏఐబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనల ప్రకారం అలాంటి నివేదిక తప్పనిసరి కాదని అధికారులు గుర్తుచేస్తున్నారు.మరోవైపు.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కూడా దర్యాప్తు వేగంపై ప్రభావం చూపినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఈ దర్యాప్తుకు సంబంధించిన పలు అంతర్జాతీయ భాగస్వాములు, సాంకేతిక నిపుణులు, సంస్థలపై ఆ పరిస్థితుల ప్రభావం పడిందని, అందువల్ల జాప్యానికి దర్యాప్తు బృందాన్ని తప్పుబట్టడం సరికాదని అభిప్రాయపడ్డాయి.గత ఏడాది విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో మాత్రం కీలక విషయాన్ని వెల్లడించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే బోయింగ్ 787 విమానంలోని రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు దాదాపు ఒకేసారి "రన్(RUN)" స్థితి నుంచి "కటాఫ్(CUTOFF)" స్థితికి మారినట్లు గుర్తించారు. దీంతో రెండు ఇంజిన్లకూ ఇంధన సరఫరా నిలిచిపోయి ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తేల్చారు.అయితే ఆ స్విచ్లు ఎందుకు మారాయి? సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? లేదంటే మరేదైనా కారణమా? అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం తుది నివేదిక వచ్చిన తర్వాతే లభించనుంది. అందుకే ఇప్పుడు విమానయాన రంగం మాత్రమే కాదు.. దేశమంతా ఆ నివేదిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
ప్రియుడి ఘరానా మోసం.. అప్పటికే కన్నతల్లి ఘాతుకం!
కట్టుకున్న భర్తను, కన్నబిడ్డలను వదిలి ప్రియుడితో కొత్త జీవితం ప్రారంభించాలని భావించిన ఓ మహిళ.. చివరకు ఊహించని రీతిలో జైలు పాలైంది. తన సహజీవనానికి అడ్డుగా ఉందనే అనుమానంతో ఆరేళ్ల చిన్నారిని హత్య చేయడమే కాదు.. ప్రియుడి మాయమాటలకు నమ్మి జీవితాన్నే నాశనం చేసుకుంది. బెంగళూరులో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంక దంపతులకు 2007లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ విద్యాసంస్థ నిర్వహిస్తుండగా, ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2025 చివర్లో కుటుంబానికి చెందిన 25 ఎకరాల భూమి వివాదానికి సంబంధించిన కేసు పనిమీద బెంగళూరు వెళ్లిన ప్రియాంక.. కాలేజీ రోజుల స్నేహితుడు, ఒకప్పుడు ప్రేమించిన మోహన్ను మళ్లీ కలిసింది.తాను రూ.1,000 కోట్ల ఆస్తులున్న రియల్ ఎస్టేట్ వ్యాపారినని మోహన్ నమ్మబలికాడు. అంత ఆస్తి ఉందని చెప్పడంతో ఆమె అతనికి ఆకర్షితురాలైంది. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన తర్వాత భర్త ప్రవీణ్పై విడాకుల కోసం ఒత్తిడి తెచ్చిన ప్రియాంక.. చివరకు ఇంటిని విడిచి వెళ్లిపోయింది.విడిపోయిన తర్వాత పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉండగా, చిన్నారి వెన్నెల మాత్రం ప్రియాంకతో కలిసి బెంగళూరులోని సీగేహళ్లిలో అద్దె విల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో మార్చి 24న వెన్నెల పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. బిర్యానీ, ఐస్క్రీం తినిపించిన తర్వాత చిన్నారిని కారులోనే వదిలేసి ప్రియుడు మోహన్తో కలిసి కాఫీ షాప్కు వెళ్లినట్లు చెప్పింది. మరుసటి రోజు వెన్నెల నిద్రలేవకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అనారోగ్యంతో చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులకు చెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే బిడ్డ మృతిపై అనుమానంతో ప్రవీణ్ పోస్ట్మార్టం నివేదికను పరిశీలించాడు. ఆ నివేదికను విదేశాల్లో పనిచేస్తున్న తన డాక్టర్ సోదరికి చూపించగా, అందులో అనేక లోపాలు ఉన్నాయని ఆమె గుర్తించింది. దీంతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు.దర్యాప్తులో వెన్నెలది సహజ మరణం కాదని, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమ భవిష్యత్తుకు చిన్నారి అడ్డుగా మారిందనే కారణంతో ప్రియాంక, మోహన్ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్ను అరెస్టు చేశారు. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రియాంకను గురువారం హాసన్లో అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రియాంక, మోహన్లు కాశీలో రహస్యంగా వివాహం చేసుకున్నారట. ఆ తర్వాత దుబాయ్లో నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకున్నారని తెలుస్తోంది. వెన్నెల కేసు దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. తాను కోటీశ్వరుడినని చెప్పిన మోహన్ వాస్తవానికి పెద్ద వ్యాపారి కాదని, అద్దె ఇళ్ల బ్రోకర్గా పనిచేస్తున్నాడని తేలింది. అతని మాటలు నమ్మి కుటుంబాన్ని వదిలేసిన ప్రియాంక.. చివరకు కన్నకూతురి హత్య కేసులో నిందితురాలిగా కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. -
వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్ బంకులకు కేంద్రం కొత్త ఆదేశాలు
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మళ్లింపులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ‘మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (టెంపరరీ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై త్రూ రిటైల్ అవుట్లెట్స్) ఆర్డర్–2026’ను జారీ చేసింది.కొత్త నిబంధనల ప్రకారం వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు ఇకపై సాధారణ రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేయరాదు. వారు తమ అవసరాలను సొంత వినియోగ పంపుల ద్వారానే తీర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పెట్రోల్ బంకులు డీజిల్ను కేవలం వాహనాల ట్యాంకుల్లో లేదా PESO (Petroleum and Explosives Safety Organisation) అనుమతించిన కంటైనర్లలో మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అలాగే, ఒక వినియోగదారుడు లేదా ఒక వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ విక్రయించరాదని కేంద్రం స్పష్టం చేసింది. కొనుగోలు చేసిన డీజిల్ను తిరిగి విక్రయించడం కూడా పూర్తిగా నిషేధించింది.ఈ ఆంక్షలు ప్రారంభ దశలో గరిష్ఠంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయి. పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు ద్వారా ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది. నిబంధనల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలు ప్రత్యేక నిఘా పెట్టాలని కేంద్రం ఆదేశించింది. నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ కొనుగోళ్లు, ఇంధన మళ్లింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిత్యవసర వస్తువుల చట్టం–1955 (Essential Commodities Act, 1955) కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
AIతో కాదు… రూ.370 బిర్యానీతో ఉద్యోగం ఊడింది
ఢిల్లీ: ఏఐ యుగంలో ఉద్యోగం కాపాడుకోవడం ఎంత కష్టమో సోషల్ మీడియాలో ప్రతిరోజూ ధీనగాధలు వినిపిస్తున్నాయి. అలాంటి ఓ యువకుడు తన నోటి దురుసు వ్యాఖ్యలతోనే ఉద్యోగాన్ని కోల్పోయాడు. రూ.370 బిర్యానీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.జూన్ 8న హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ కేంద్రంగా స్టాండప్ కామెడీ షో జరిగింది. ఈ షోకి బిగ్ బాస్ ఫేమ్ ప్రణిత్ మోరే స్టాండప్ కమెడియన్గా హాజరయ్యారు. ఈ షోలో కమెడియన్ ప్రణిత్ మోరే.. ప్రేక్షకులకు ప్రశ్నలు వర్షం కురిపిస్తుంటే.. ఆడియన్స్ సమాధానాల ఆధారంగా వెంటనే జోకులు వేయడం దీని ఉద్దేశం.అయితే, ఈ కామెడీ షోలో హిమాన్షు జాంగ్రా తన డేట్ అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. నేను ఇటీవల ఓ యువతితో డేటింగ్కు వెళ్లాను. డేటింగ్ వెళ్లే సమయంలో రూ.370 పెట్టి చికెన్ బిర్యానీ కొనుగులో చేశాను. డేటింగ్ పూర్తయి ఇంటికి వెళ్లే సమయంలో ఆ యువతి నన్ను తన ఇంటి వద్ద డ్రాప్ చేయమని అడిగింది. అందుకు నేను కాదనలేకపోయా. అయితే, డేటింగ్ వచ్చే ముందు రూ.370 బిర్యానీ కొనుగోలు చేశాను. ఆ డబ్బులు వృధా కాకూడదంటూనే అతని మాటలలో రూ.370 బిర్యానీ కొనుగులో చేసినందుకు శారీరక సంబంధం ఆశించినట్లు చెప్పాడు. అంతే హిమాన్షు మాటలకు చప్పట్లతో ఆ ప్రాంతం హోరెత్తింది. భళ్లున నవ్వుకున్నారు.హిమాన్షు చేసిన రూ.370 బిర్యానీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.హిమాన్షు నోటి దురుసుపై మహిళా సంఘాలు, ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.పలువురు పోలీసులకు ఫిర్యాదుతో మహరాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే, ఆడియన్ హిమాన్షు జాంగ్రాపై భారత న్యాయ సంహిత చట్టంలో పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. తమ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ఓ టెక్ సంస్థలో వెబ్డెవలపర్గా విధులు నిర్వహిస్తున్న హిమాన్షు జాంగ్రాపై సదరు యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. హిమాన్షును విధుల నుంచి తొలగించింది. తాను చేసిన వ్యాఖ్యలకు హిమాన్షు క్షమాపణలు చెప్పినా వ్యాఖ్యల వివాదం ఇంకా చల్లారలేదు. -
ఆ కారణంగానే టీవీకేకు మద్దతు.. చిదంబరం కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ స్పష్టత నిచ్చింది. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం పూర్తిగా సమర్థించారు. ‘మతసామరస్యం , రాష్ట్ర హక్కుల పరిరక్షణ అనే రెండు ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నంత వరకు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.గురువారం చైన్నెలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఊహించని మహా విజయంమీడియా, రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందకుండా టీవీకే పార్టీ ఎన్నికల్లో ఏకంగా 35 శాతం ఓట్లను కొల్లగొట్టిందని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే ఇంతటి ఘనవిజయం సాధించడం అద్భుతమని విజయ్ను అభినందించారు. తమిళనాడు ప్రజలు ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికలను కోరుకోవడం లేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే, రాష్ట్రపతి పాలన నెపంతో బీజేపీ దొడ్ది దారి గుండా అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని, అందుకే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ప్రజాస్వామ్యబద్ధంగా సరైన నిర్ణయమని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా 31 మంది మంత్రులకు అసెంబ్లీలో ఎలాంటి ముందస్తు అనుభవం లేదన్నారు. అలాగే 101 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టారని వివరించారు. వీరందరికీ కొంత సమయం ఇవ్వాలని చిదంబరం కోరారు. బీజేపీ నుండి బయటకు వచ్చి అన్నామలై ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించడం గురించి స్పందిస్తూ, అది రాజకీయ పార్టీగా మారుతుందో లేదో నాకు తెలియదన్నారు. అయితే, బీజేపీలో ఆయనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదనే విషయం పలు ఇంటర్వ్యూలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తాను ఇటీవల మాజీ సీఎం స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిశానని, ఆయన ఇండియా కూటమి నుండి వైదొలుగుతున్నట్లు తనతో ఏమీ చెప్పలేదని వివరణ ఇచ్చారు. -
ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని మరో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.తుగ్లకాబాద్లోని మాధ్యమ్ మార్గ్, నయా తారా అపార్ట్మెంట్ సమీపంలోని ఓ ఐదంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం లోపల పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.అర్ధరాత్రి 2.35 గంటల నుంచి 2.37 గంటల మధ్య అగ్నిమాపక శాఖకు ప్రమాదంపై సమాచారం అందింది. మూడు ఫైర్ టెండర్లు, రెండు వాటర్ బౌజర్లు, శ్వాస సహాయక యూనిట్, క్విక్ రెస్పాన్స్ వాహనాలను రంగంలోకి దించారు. అనంతరం పరిస్థితి తీవ్రత దృష్ట్యా అదనపు అగ్నిమాపక వాహనాలను కూడా పంపించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది గాయపడిన వారిని ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.Delhi: A fire broke out in a multi-storey building in Tughlakabad Extension during the early hours of the day. The blaze reportedly started in the ground-floor parking area, where 7–8 motorcycles and scooters caught fire, before spreading through the building. The fire department… pic.twitter.com/rHgTcXvG8T— IANS (@ians_india) June 12, 2026అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనం లోపల పార్క్ చేసిన వాహనాల వద్ద నుంచి మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం 3.45 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగా, నాలుగు గంటలకు అగ్నిమాపక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.ఇటీవలి కాలంలో ఢిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న భవన ప్రమాదాలు, అగ్నిప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. గత నెలలో మాలవీయనగర్లో మూడు అంతస్తుల వాణిజ్య భవనం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందగా, జూన్ 3న హౌజ్రాణిలోని ఐదు అంతస్తుల బిల్డింగ్లో జరిగిన అగ్నిప్రమాదంలో విదేశీయులతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో.. జూన్ 5 నుంచి 10 దాకా 607 ప్రదేశాలను అధికారులు తనిఖీ చేయగా, గురువారం ఒక్కరోజే మరో 47 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో మొత్తం తనిఖీ చేసిన ప్రదేశాల సంఖ్య 654కు చేరింది. ఇదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు ఆరు భవనాలను సీజ్ చేసింది. అలాగే 61 షోకాజ్ నోటీసులు, 8 సీలింగ్ నోటీసులు, 16 కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుంచి 11 వరకు మొత్తం 179 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, 206 భవనాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు, అగ్నిమాపక నిబంధనల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
భారత్, పాక్, బంగ్లాదేశ్ల నుంచి గల్ఫ్కు 1.90 కోట్ల మంది వలస
న్యూఢిల్లీ: 2010వ సంవత్సరం తర్వాత భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి సుమారు 1.90 కోట్ల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినట్లు ఓ అధ్యయనం గుర్తించింది. ఏడాదికి సరాసరిన 13.5 లక్షల మంది చొప్పున సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యూఏఈలకు బతుకుదెరువు కోసం వెళ్లారని ఈ సర్వే తేల్చింది. పశ్చిమాసియా దేశాలకు ప్రధానంగా వలసలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, దక్షిణాసియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన వారే ఈ ప్రాంతానికి ఎక్కువగా వలస వెళ్లినట్లు గుర్తించామని సర్వే చేపట్టిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లయిడ్ సిస్టమ్స్ అనాలిసిస్, పాపులేషన్ అండ్ జస్ట్ సొసైటీస్ ప్రోగ్రామ్కు చెందిన గై అబెల్ తెలిపారు. ముఖ్యంగా బంగ్లాదేశీయులు 2010 తర్వాత ఏడాదికి 3 లక్షల మంది చొప్పున సౌదీ వెళ్లినట్లు ఇటీవల జర్నల్ నేచర్లో ప్రచురితమైన ఇందుకు సంబంధించిన కథనం పేర్కొంది. అకస్మాత్తుగా తలెత్తిన సంక్షోభం వంటి పరిస్థితుల వల్ల కాకుండా ఈ వలసలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయని వివరించింది. -
టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో తలెత్తిన సంక్షోభం గురువారం మరింత ముదిరింది. ఆ పార్టీకి చెందిన మూడో రాజ్యసభ ఎంపీ రాజీనామా చేశారు. ఎంపీ ప్రకాశ్ చిక్ బరాయిక్ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు, మమతా బెనర్జీ వెన్నంటే ఉంటామంటూ సీనియర్ నేతలు బాబుల్ సుప్రియో, శత్రుఘ్న సిన్హా, సౌగతా రాయ్ బహిరంగంగా ప్రకటించారు. పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. సీనియర్ నేత, లోక్సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మమత మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. అభిషేక్ను పార్టీ నుంచి తొలగిస్తేనే తాను టీఎంసీలో కొనసాగు తానని స్పష్టం చేశారు. ఇలా ఉండగా, తమ పక్షంలో చేరిన ఎమ్మెల్యే సంఖ్య 64కు చేరుకుందని తిరుగుబాటు టీఎంసీ నేత రితబ్రత బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. కాకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో 20 మందికి పైగా టీఎంసీ లోక్సభ ఎంపీలు వేరుకుంపటి పెట్టుకోవడం తెల్సిందే. గుడ్ బై చెప్పిన మూడో ఎంపీరాజ్యసభ ఎంపీ ప్రకాశ్ చిక్ బరాయిక్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్ తర్వాత రాజ్యసభ సీటును వదులుకున్న మూడో ఎంపీ ప్రకాశ్. బీజేపీ నేత నిశికాంత్ దుబే నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బెంగాల్ ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే నేను టీఎంసీ నుంచి వైదొలిగా. కేంద్రంతో సమన్వయం లేకపోవడంతో వామపక్షం హయాంలో 34 ఏళ్లు, టీఎంసీ హయాంలో 15 ఏళ్లు రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు. రాజకీయ విభేదాల వల్ల ప్రజలు బలయ్యారు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది’అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం సువేందు మార్గదర్శకత్వంలో ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు.మమత బాటలోనే నడుస్తాంపార్టీలో సంక్షోభం కొనసాగుతుండగా, కొందరు ఎంపీలు తాము టీఎంసీ అధినేత్రి మమత వెంటే ఉంటామంటూ బహిరంగంగా ప్రకటించారు. తిరుగుబాటు పక్షాన చేరారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం సీనియర్ సినీ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా గళం విప్పారు. కష్టకాలంలో పార్టీ, మమతా బెనర్జీని వదిలి వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. తనకు అలాంటి ఉద్దేశమే లేదన్నారు. కొందరు తమ సొంత కారణాలు, భయాందోళనలతో పార్టీని వీడుతున్నారన్నారు. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీకి ఆయన ఎక్స్లో అభినందనలు తెలపడంతో, పార్టీ మారుతారంటూ ఊహాగానాలు వెలు వడ్డాయి. బీజేపీ నుంచి టీఎంసీలో చేరిన రాజ్యసభ ఎంపీ బాబుల్ సుప్రియో కూడా మమతకు మద్దతు ప్రకటించారు. ‘ఏ వర్గంలోనూ, ఏ పార్టీలోనూ చేరబోను. కష్టకాలంలో పార్టీని వీడటం సరైన చర్య కాదు’అని ఆయన ఎక్స్లో వ్యాఖ్యానించారు. టీఎంసీ లోక్సభ ఎంపీ ప్రతిమా మండల్కూడా తిరుగుబాటువర్గంలో చేరడం లేదని స్పష్టం చేశారు. తిరుగుబాటువర్గంనుంచి తనకు ఆహ్వానం అందినప్పటికీ తిరస్కరించినట్లు మరో సీనియర్ నేత సౌగతా రాయ్ వెల్లడించారు. మమతా బెనర్జీకి తన మద్దతు కొనసాగిస్తానన్నారు.అభిషేక్ అహంకారి..చంచల స్వభావిలోక్సభలో టీఎంసీ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీ మాత్రం పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. తన వంటి విధేయులైన సీనియర్లు కావాలో, లేక మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలో తేల్చుకోవాలని మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చారు. అభిషేక్ను ఆయన అహంకారి, చంచల స్వభావి అంటూ తిట్టిపోశారు. టీఎంసీకి సంబంధించిన చట్టపరమైన అంశాలు, కేసుల విషయంలో అభిషేక్ జోక్యం కొనసాగించిన పక్షంలో తాను వాటి నుంచి వైదొలుగుతానంటూ సీనియర్ లాయర్ కూడా అయిన కల్యాణ్ హెచ్చరించారు. అభిషేక్ను పార్టీలో అన్ని రకాల బాధ్యతల నుంచి తప్పిస్తేనే తాను పార్టీలో కొనసాగుతానని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో దర్యాప్తు చేసేందుకు వచ్చిన సీఐడీ అధికారులపై తనకు తెలియకుండా కలకత్తా హైకోర్టులో అభిషేక్ వేరుగా కేసు వేయడం కల్యాణ్కు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని పరిశీలకులు అంటున్నారు. దీంతో, ఇప్పుడు మమతా బెనర్జీ తీవ్ర సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. -
ఆడ శిశువుపై తొలగని వివక్ష
న్యూఢిల్లీ: మన పితృస్వామ్య వ్యవస్థలో మగ సంతానంపై ఇప్పటికీ తగ్గని ఆసక్తిని, తెరవెనుక గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలను సుప్రీంకోర్టు తీవ్రంగా నిరసించింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రానంతవరకు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధ (ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్, పీసీపీఎన్డీటీ) చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిందేనని పేర్కొంది. పితృస్వామ్య పోకడలున్న మన వ్యవస్థలో బాలికలు ఎదుర్కొంటున్న వివక్షను పూర్తిగా రూపుమాపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేందుకు వారి కోసం అమలవుతున్న.. బేటీ బచావో బేటీ పఢావో, జనని సురక్షా యోజన, లాడ్లీ లక్ష్మీ యోజన వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలే నిదర్శనమని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ల ధర్మాసనం గురువారం తెలిపింది. ఇలాంటి పథకాలతో అభివృద్ధి జరిగినప్పటికీ, ఆశించిన ప్రయోజనాలు ఇంకా రావాల్సి ఉందని అభిప్రాయ పడింది. ‘మహిళలను చులకనగా చూడటం మానేసి, వారిని కూడా సమానులుగా భావించే పరిస్థితి వచ్చినప్పుడు, ఇలాంటి ప్రత్యేక ప్రయత్నాలు/ పథకాల అవసరం ఇక ఎంతమాత్రం లేదు అనే స్పృహ సమాజంలో కలిగినప్పుడే సంపూర్ణ మార్పు వచ్చినట్లు భావించాలి. అంటే ఐపిసి, బిఎన్ఎస్ వంటి చట్టాల ద్వారా మహిళలకు కల్పిస్తున్న రక్షణలు ఇకపై అవసరం లేదని కాదు. కనీసం పుట్టిన ఆడబిడ్డను స్వాగతించే పరిస్థితి రావాలి’అని ధర్మాసనం పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఆడ శిశువులు నమోదువుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో జాతీయ బాలల లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి మంది బాలురకు 1991లో 945 కాగా, 2011 నాటికి 919కి పడిపోవడాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. గర్భస్థ శిశు లింగ నిర్థారణ చట్టం పీసీపీఎన్డీటీని కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి చెప్పకనే చెబుతోందని వ్యాఖ్యానించింది. ‘ప్రస్తుత పరిస్థితి ఫరవాలేదు. ఇంకా మెరుగుపర్చేందుకు ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం చేస్తున్న ప్రయత్నాల ఫలితమే. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మన ఆర్టీసీ బస్సులపై ఆడబిడ్డ విద్య, అభ్యున్నతి, ఆర్థిక భద్రతకు సంబంధించిన పోస్టర్లతో ప్రచారాలు కొనసాగించాల్సి వస్తోంది’అని వ్యాఖ్యానించింది. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధ చట్టం ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కోర్టు దర్యాప్తును సవాల్ చేస్తూ ఓ వైద్యుడు వేసిన అప్పీల్ను కొట్టివేస్తూ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. -
పీవోకేలో మళ్లీ కాల్పులు.. 16 మంది మృతి
రావల్కోట్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) లో నిరాయుధులైన ఆందోళనకారులపై భ ద్రతా బలాలు మరోసారి తుపాకులు ఎక్కు వపెట్టాయి. గురువారం జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోగా, 37 మంది గాయాల పాలయ్యారు. పెరుగుతున్న ధర లను నిరసి స్తూ సుమారు 70 వేల మంది రావల్కోట్ లోని ఈద్గా మైదానంలో జరి గిన ర్యాలీకి తరలివచ్చారు. పాక్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. తక్కువ ధరలకే నిత్యావసరల వస్తువులను పంపిణీ చేయాలని, విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మంగళవారం నిరసనకా రులపై జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పో యిన 30 మందికి, క్షతగాత్రులుగా మారిన మరో 200 మందికి న్యాయం చేయాలని వారు గర్జించారు. బందోబస్తు విధుల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ వారిపైకి యథేచ్ఛగా కాల్పు లు జరిపింది. దీంతో, జనం భయభ్రాంతు లకు గురై పరుగులు తీశారు. కాల్పులపర్వం అనంతరం ఈద్గా మైదానం రక్తమోడగా, రోడ్లనిండా రక్తపు మరకలే కనిపించాయి.సైనిక హెలికాప్టర్ కూలి 22 మంది మృతి: పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ సమీపంలో బుధవారం ఎంఐ–17 రకం ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు అధికారులు సహా 22 మంది సైనికులు చనిపోయారు. సాంకేతిక లోపం తలె త్తడంతోనే ఈ ప్రమాదం చోటుచేసు కున్నట్లు ఆర్మీ తెలిపింది. -
ధరల పెరుగుదల, పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం
న్యూఢిల్లీ: పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకేజీలు, ఎన్నికల్లో అవకతవకలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రభుత్వం తీరును ఎండగడుతూ జూన్ చివర్లో దేశవ్యాప్త నిరసన ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గురువారం ఇందిరా భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. సమావేశంలో రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ జైరాం రమేశ్, భూపేశ్ బఘెల్లతోపాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల పార్టీ ఇన్చార్జులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ భేటీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘నీట్, సీబీఎస్ఈ వంటి పరీక్షల పత్రాల లీకేజీలను అరికట్టేందుకు రెండేళ్ల క్రితమే చట్టం చేసిన కేంద్రం పకడ్బందీగా అమలు చేయలేకపోయింది. ఫలితంగానే లీకయ్యాయి. అదేవిధంగా, ఈ నెల 22న అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నిటినీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు’అని జైరాం రమేశ్ చెప్పారు. ‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న డబుల్ ఇంజన్. ఇందులో ఒక ఇంజన్ ఓట్ చోరీ కాగా, మరోటి సీట్ చోరీ’అని ఆయన పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పరీక్షల కుంభకోణాలు, సామాజిక అసమానతలు వంటి తీవ్ర సమస్యలను దేశం నేడు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన వ్యవస్థలను మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చిందని ఆరోపించారు. దేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం రాజకీయ పోరాటం సాగించడటం తమ బాధ్యతని ఖర్గే వివరించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో మొదలయ్యే తమ దేశవ్యాప్త పోరాటం రెండు, మూడు నెలలపాటు కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలకు దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
ఎదురెదురుగా వచ్చిన రెండు ఖాళీ రైళ్లు ఢీ
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయ స్టేషన్ భువనేశ్వర్లో గురువారం రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శుభ్రత పనుల నిర్వహణలో భాగంగా ఖాళీ రైళ్లను ఒకే ట్రాక్పై నడిపించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఖాళీ రైళ్లు కావడంతో ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదు. లోకో పైలెట్లు క్షేమంగానే ఉన్నారు. రైళ్ల రాకపోకల్లో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదు. ఝరపడా వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే రైల్వే యంత్రాంగం ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగే శుభ్రత కార్యకలాపాల్లో ఒకే ట్రాక్పైకి రెండు రైళ్లను ఎలా అనుమతించరనేది చర్చనీయాంశమవుతోంది. -
14న మాక్రాన్తో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: శనివారం నుంచి ప్రధాని మోదీ ఫ్రాన్స్, స్లొవేకియాల్లో వారం రోజులపాటు పర్యటించనున్నారు. పారిస్లో జరిగే జీ–7 శిఖరాగ్రంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్తో విస్తృత చర్చలు జరపునున్నారు. నీస్ నగరంలో 14న మేక్రాన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్ కంపెనీలతో మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరే అవకాశముంది. అదేవిధంగా, ఫ్రెంచి కంపెనీలు భారత్లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అవగాహన కుదుర్చుకునే వీలుందని సమాచారం. ఫ్రాన్స్తో కనీసం 12 ఒప్పందాలు కుదిరేందుకు ఛాన్సుందని చెబుతున్నారు. అనంతరం ప్రధాని జీ 7 దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. శిఖరాగ్రానికి హాజరయ్యే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తోనూ ప్రధాని భేటీ అవుతారని భావిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు షెడ్యూల్ ఖరారు కాలేదు. -
ఏఐపై పట్టుసాధించండి
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ 11వ పాలకవర్గ సమాశంలో రాష్ట్రాలకు దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్లు, రాబోయే సువర్ణావకాశాలపై ప్రధాని మోదీ దిశానిర్దేశంచేశారు. 28 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో గంటల తరబడి సుదీర్ఘంగా మోదీ సమావేశమై పలు అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించి ఫిర్యాదులు, అభిప్రాయాలను స్వీకరించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. వార్షిక సమావేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సీఎంలనుద్దేశించి ఆయా రాష్ట్రాల్లో చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై మోదీ ప్రసంగించారు. ‘‘గోప్యత, పారదర్శకత, సామాజిక విలువలను పాటిస్తూనే కృత్రిమ మేధను విరివిగా ఉపయోగించండి. ఏఐతో అందివచ్చే అవకాశాలను ఒడిసిపట్టండి. అత్యంత తీవ్రమైన ఎల్ నినో వాతావరణ ఉపద్రవాన్ని తట్టుకునేలా విధానపర నిర్ణయాలు తీసుకోండి. నీటి సంరక్షణ చర్యలు చేపట్టండి. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూనే పలు రంగాల్లో దేశం ఆత్మనిర్భరత సాధించేందుకు కృషిచేయండి. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో స్వావలంబనకు బాటలువేయండి. పలు దేశాలతో భారత్ కొత్త వాణిజ్య ఒడంబడికలు చేసుకుంది. ఈ మేరకు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల పునరుజ్జీవనానికి పాటుపడండి. తద్వారా ఆయా రంగాల భాగస్వామ్యంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించండి. సమాఖ్య స్ఫూర్తిని మరోసారి చాటండి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయానికి పాటుపడండి. అప్పుడే రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెంది అభివృద్ధి చెందిన దేశంగా సాకారమవుతుంది. ‘వికసిత్ భారత్’ఆవిర్భావం కోసం అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్లు, గ్రామాల సంకల్పం తీసుకోవాలి. పౌర అవగాహన, సుపరిపాలన ద్వారా మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు వంటి వాటిని కట్టడిచేయండి. చక్కటి పరిపాలన, పారదర్శకత, మౌలిక వసతుల కల్పనతో పెట్టుబడులను ఆకర్షించవచ్చు. స్థానిక వస్తూత్పత్తుల బ్రాండింగ్పై దృష్టిపెట్టండి. సులభతర వాణిజ్యానికి తగ్గట్లు విధానపర నిర్ణయాలు తీసుకోండి. డేటా సెంటర్లు, కృత్రిమ మేధ వంటి రంగాల్లో కొత్త అవకాశాలను ఒడిసిపట్టండి. నవతరం ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతనివ్వండి. భవిష్యత్ ఆర్థికవ్యవస్థకు నిపుణ మానవవనరుల అవసరం అత్యావశ్యకం. ఏఐను ఆ కోణంలో అవకాశాల గనిగా భావించండి. మన 70 కోట్ల యువత మనకు అతిపెద్ద ఆస్తి. ఇంతపెద్ద ఆస్తిని దేశాభివృద్ధి ఫలాలిచ్చే ఆదాయ వృక్షాలుగా మార్చండి. దేశంలో రక్షణరంగ ఉపకరణాల తయారీ రంగం వేగంగా విస్తరిస్తోంది. తగు మౌలికవసతుల్ని కల్పించి ఈ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచండి. జిల్లాకో విభిన్న ఉత్పత్తి తరహాలో ఎగుమతులే లక్ష్యంగా వ్యూహాలు రచించండి’’అని రాష్ట్రాలకు మోదీ సూచించారు. సమ్మిళిత మానవాభివృద్ధి ఇతివృత్తంతో సమావేశం జరిగిందని తర్వాత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ లాహిరి తెలిపారు. ‘‘ప్రాథమిక మానవ వనరులు, నవ్యనూతన నైపుణ్యాలు, ఫలవంతమైన ఉపాధి, పరిశ్రమలను స్థాపించే సత్తా, వికేంద్రీకరణ అభివృద్ధి, ఆరోగ్యం, పోషణ, సమానత్వం, అందరికీ గౌరవమర్యాదలు లక్ష్యసాధనగా ఈ సమావేశం జరిగిందని లాహిరి తెలిపారు. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, జమ్మూకశీ్మర్ ముఖ్యమంత్రులతో మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల సమస్యలపై ఆయా రాష్ట్రాల సీఎంలు చెప్పిన విషయాలను మోదీ విన్నారు. -
లీక్ అయితే పరీక్షార్థికి పరిహారం
పుణె: ప్రతిష్టాత్మక నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీలు, సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్లో వైఫల్యాలు, క్యూట్ పరీక్ష నిర్వహణలో అసమర్థత వంటి పలు దారుణోదంతాలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) గురువారం దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలి దఫాలో పుణెలో తొలి నిరసన కార్యక్రమాన్ని గురువారం మొదలెట్టింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సారథ్యంలో పుణెలోని సావిత్రీభాయ్ ఫూలే పుణె విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు, పార్టీ అభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీజేపీ తమ ‘పరీక్షల మేనిఫెస్టో’ను విడుదలచేసింది. మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయకపోతే జూన్ 20వ తేదీన పుణె విద్యార్థులంతా ఢిల్లీకొచ్చి ఉద్యమిస్తారని దీప్కే స్పష్టంచేశారు. హిందూ–ముస్లిం విభజన అంశాలపై రాజకీయాలు నడుస్తున్నాయి. వీటి నుంచి దృష్టి మరలిస్తేనే స్తంభించిన దేశ ప్రగతి రథాలు ముందుకు కదులుతాయని దీప్కే అన్నారు. ‘‘హిందూ–ముస్లిం విభజన రాజకీయాలతో యువత విసిగెత్తిపోయారనేందుకు మా కాక్రోచ్ నిదర్శనం. ఇలాంటి రాజకీయాలతో సమాజం కంపుకొడుతోంది. ఈ కంపు పోగొట్టేందుకే బొద్దింకలొచ్చాయి. ప్రభుత్వంతో చర్చలకు మేం సిద్ధం. మాతో చర్చలకు ముందుకురాకుండా ప్రభుత్వం మా సోషల్మీడియా ఖాతాలను స్తంభింపజేయడంలో బిజీగా మారింది’’అని ఆయన వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు... → ఇకమీదట ప్రభుత్వాలు నిర్వహించే కోర్సులు, ఉద్యోగ సంబంధ పరీక్షల్లో ఒక ప్రశ్నపత్రం లీక్ అయినా సరే ఆ పరీక్ష రాసిన అభ్యర్థి/విద్యార్థికి రూ.10,000 నష్టపరిహారం ఇవ్వాలి → లక్షలాది మంది రాసే పరీక్షల వేళ అభ్యర్థులు వేగంగా, సమయానికి పరీక్షాకేంద్రానికి చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలి → పరీక్ష రద్దయితే ఆ రద్దయిన పేపర్ మాత్రమే 72 గంటల్లోపు మళ్లీ నిర్వహించేలా ‘షెడ్యూల్ చేసిన తేదీ’లను ముందే నిర్ణయించుకోవాలి. ఆ తేదీల్లో పరీక్ష కచ్చితంగా నిర్వహించాలి → ఆన్లైన్లో పేపర్లను దిద్దడం మానేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు స్వయంగా పేపర్లను దిద్దాలి. → రాసిన పరీక్ష రద్దయి తర్వాత పరీక్ష రాసేలోపు వయోపరిమితి దాటిపోయే అభ్యర్థులకు చివరి అవకాశం ఇవ్వాలి → కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాలను ఆడిటింగ్ చేయాలి → పరీక్షలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడో సంస్థకు ఇస్తే వాళ్ల గత చరిత్రను క్షుణ్ణంగా తనిఖీచేయాలి -
ఖర్గే, ఖేరా, పునియా, తరుణ్ చుగ్ సహా రాజ్యసభకు 24 మంది ఏకగ్రీవం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ మీడియా విభాగం చీఫ్ పవన్ ఖేరా, బీజేపీ నేతలు సతీశ్ పునియా, తరుణ్ చుగ్ సహా 24 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నామినేషన్ల పరిశీలన ముగియగా, ఈ స్థానాలకు బరిలో ఒక్కొక్కరు మాత్రమే బరిలో ఉండటంతో వీరు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇందులో ఎన్డీయేకి 19 దక్కగా, ఐదు సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. విజేతలకు రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కాగా, తీవ్రమైన పోటీ నెలకొన్న జార్ఖండ్లోని రెండు స్థానాలు, మిజోరంలోని ఒక స్థానానికి ఈ నెల 18వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, పవన్ ఖేరాతోపాటు బీజేపీ నేత ఎం.నాగరాజా గెలిచారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ అక్కడ మూడు సీట్లలో బీజేపీ అభ్యర్థులు తరుణ్ చుగ్. రజనీశ్ అగర్వాల్, మహేశ్ కేవత్ గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. గుజరాత్లో బీజేపీకి చెందిన రాజుభాయ్ శుక్లా, మాన్సిన్హ్ పర్మార్, ముకేశ్ భాయ్ రథ్వా, జితేంద్ర కంజారియా, ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి చెందిన బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, సానా సతీశ్ బాబు, జనసేనకు చెందిన లింగమనేని రమేశ్ గెలిచారు. రాజస్తాన్లో బీజేపీకి చెందిన అల్కా గుర్జార్, సతీశ్ పునియా, కాంగ్రెస్ అభ్యర్థి నీరజ్ దాండి, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ నేత జేమ్స్ కె.సంగ్మా, మణిపూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అధికారిమయుమ్ శారదా దేవి విజేతలుగా నిలిచారు. అదేవిధంగా, అరుణాచల్లో బీజేపీ నేత టాయ్ తగక్, మహారాష్ట్రలో ఎన్సీపీ నేత రాజేంద్ర జైన్, ఒడిశాలో బీజేపీ నుంచి దేబాశీష్ సామంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ చక్రవర్తి ఏకగ్రీవ విజయం సాధించారు. -
అమెరికా దుశ్చర్య!
దుబాయ్/న్యూఢిల్లీ/విశాఖపట్నం/ఐరాస: ఇరాన్పై ముమ్మర దాడులకు తెగించిన అమెరికా బుధవారం ఒమన్ సమీప హార్మూజ్ జలసంధి సముద్రజలాల్లోని ఎంటీ సెటెబె చమురురవాణా నౌకపై జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించారు. వరసబెట్టి భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్యనౌకలపై అమెరికా దాడులు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛావాణిజ్యానికి భంగం కల్గించేలా కాల్పులు జరపడం చట్టవ్యతిరేకమని భారత్ పునరుద్ఘాటించింది. తక్షణం కాల్పుల పర్వానికి ఫుల్స్టాప్ పెట్టాలని భారత్ సూచించింది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్డిఅఫైర్స్ జేసన్ను పిలిపించి భారత్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మృతదేహాల స్వా«దీనం ఎంటీ సెటెబె నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు గల్లంతైనట్లు బుధవారం వార్తలొచ్చాయి. అయితే వాళ్లు ప్రాణాలు కోల్పోయారని, వాళ్ల మృతదేహాలను స్వా«దీనంచేసుకున్నామని భారత నౌకాయాన మంత్రి శర్బానంద సోనోవాల్ గురువారం ప్రకటించారు. వాళ్ల కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ అన్నివేళలా అండగా ఉంటారని మంత్రి భరోసా ఇచ్చారు. సెటెబెపై దాడిలో మిగతా 21 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ తీరగస్తీ బలగాలు కాపాడాయని మంత్రి వెల్లడించారు. 24 మంది భారతీయ సిబ్బంది ఉన్న మరో చమురు రవాణా నౌక మారీవెక్స్పై అమెరికా దాడిలో మొత్తం 24 మందినీ కాపాడటం తెల్సిందే. మూడో నౌక మీదా దాడి భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడులపర్వం గురువారమూ కొనసాగింది. ఒమన్లోని షినాస్ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎంటీ జల్వీర్ నౌక పైనా అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావూ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధవిమానం నుంచి రెండు హెల్ఫైర్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించింది. ఇవి నౌక ఇంజిన్ రూమ్ను నాశనం చేశాయి. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది. ఒమన్ రాయల్ నేవీ దళాల సాయంతో నౌకలోని 22 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా తీసుకొస్తున్నామని మస్కట్ నగరంలోని భారతీయ రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో స్పష్టంచేసింది. గత నాలుగు రోజుల వ్యవధిలో భారతీయులున్న నౌకపై అమెరికా దాడి చేయడం ఇది మూడోసారి అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైశ్వాల్ తెలిపారు. భారతీయ సిబ్బంది ఉన్నారని తెలిసీ దాడిచేశామని అమెరికా గురువారం తొలిసారిగా ఒప్పుకుంది. ‘‘ఎంటీ జల్వీర్ ఇరాన్ చమురును అనుమతిలేకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా తరలిస్తోంది. దిశ మార్చుకోవాలని పదేపదే హెచ్చరించినా బేఖాతరు చేశారు. అందుకే నౌకపై దాడిచేశాం’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ తన చర్యను సమర్థించుకుంది. 2 వారాల్లో 15వ వివాహ వార్షికోత్సవం అమెరికా దాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు వ్యక్తి 44 ఏళ్ల పటా్నల సురేశ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారని ఢిల్లీలోని ఆంధ్రభవన్ గురువారం ప్రకటించింది. భార్య భార్గవితో కలిసి జూన్ 24వ తేదీన 15వ వివాహ వార్షికోత్సంకోసం స్వస్థలానికి వచ్చేందుకు సురేశ్ అధికారుల అనుమతి తీసుకుని ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో సురేశ్ మృతి వార్త తెలిసి అతని కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. ఆయనకు 12, 10 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మరణించాడన్న వార్త తెలిసి పిల్లలిద్దరూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘గత ఐదు నెలలుగా సముద్రంలో విధినిర్వహణలో ఉండిపోయారు. మ్యారేజ్డే కోసం త్వరలో ఇంటికొస్తున్నా అని చెప్పారు. కానీ ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మెరైన్ ఇంజనీరింగ్ను ఆయన వృత్తిలా భావించరు. ఎంతో తపనతో పనిచేస్తారు’’అని భార్య భార్గవి వాపోయారు.ఐరాస వేదికగా భారత్ నిరసన అమెరికా దాడి సంస్కృతిపై భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా ధ్వజమెత్తింది. ఏకపక్ష దాడులను తక్షణం నిలిపేయాలని డిమాండ్చేసింది. ఐరాస భద్రతా మండలిలో ‘అంతర్జాతీయ శాంతి,భద్రత: మధ్యవర్తిత్వం ద్వారా పశ్చిమాసియా సమస్యకు పరిష్కారం’’అంశంపై జరిగిన చర్చలో ఐరాసలో భారతరాయబార శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. ‘‘పశ్చిమాసియా దేశాలపై దాడులు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై దాడులు జరుగుతున్నాయి. సముద్రగర్భ కేబుళ్లూ ధ్వంసమవుతున్నాయి. పశ్చిమాసియాలో సుస్థిరత కొనసాగాలంటే వాణిజ్యం, ఇంధన సరఫరా గొలుసులు అస్సలు తెగిపోకూడదు. అగ్రరాజ్యం(అమెరికా) దాడులు ఆపాల్సిందే’’అని హరీశ్ గట్టిగా డిమాండ్చేశారు. -
నిందితుడి మృతి.. నకిలీ రిజిస్ట్రేషన్ల కేసు క్లోజ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నకిలీ భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో నిందితుడైన కూకట్పల్లి మాజీ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మృతి చెందడంతో సుప్రీంకోర్టు ఆ కేసు విచారణను ముగిస్తూ కేసును మూసేసింది. అయితే ఇదే భూ వివాదానికి సంబంధించి దాఖలైన మరో క్రిమినల్ కేసును పెండింగ్లో ఉన్న సివిల్ అప్పీల్తో జత చేసి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ఇదీ కేసు నేపథ్యం.. మైలార్దేవ్పల్లి పరిధిలోని సర్వే నం. 156/1/2లో ఉన్న టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ కో–ఆపరేటివ్ సొసైటీ స్థలాలను నకిలీ పత్రాలతో విక్రయించిన కేసులో మాజీ జాయింట్ సబ్–రిజి్రస్టార్ రచ్చకొండ శ్రీనివాసరావు ఏకైక నిందితుడిగా ఉన్నారు. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అయితే శ్రీనివాసరావు ఈ ఏడాది మే 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కానీ ఇదే భూముల ఆక్రమణ, నకిలీ సేల్ డీడ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి శంకరమంచి సత్యనారాయణ తదితరులపై నమోదైన మరో ఎస్ఎల్పీపైనా కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులోని ఏడుగురు నిందితుల్లో ఇద్దరు మరణించారని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి బండారి రామచందర్ వర్సెస్ మైత్రీ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరుతో 2013 నుంచి భూ ఆక్రమణల నిరోధక చట్టం కింద ఒక సివిల్ అప్పీల్ సుప్రీంలో పెండింగ్లో ఉందని గుర్తుచేశారు. టైటిల్ వివాదానికి సంబంధించిన ఆ సివిల్ కేసుతోపాటే ఈ క్రిమినల్ కేసును కూడా విచారించాలని కోరారు. దీనిపై ప్రతివాదుల తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22–ఏకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగాయనేది క్రిమినల్ ఆరోపణ అని, దానికి అసలు యాజమాన్య హక్కుల వివాదంతో ముడిపెట్టి సివిల్ కేసుతో జత చేయడం సరికాదని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనకు మొగ్గుచూపుతూ క్రిమినల్ ఎస్ఎల్పీని పెండింగ్లో ఉన్న సివిల్ అప్పీల్తో జత చేసింది. ఈ రెండు కేసులపై వేసవి సెలవులు ముగిశాక తుది విచారణ జరుపుతామని తెలుపుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
జీ రామ్ జీ కోసం రూ.3,825.31 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్న వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ స్కీమ్ (గ్రామీణ్) (వీబీ జీ రామ్జీ) పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి రూ.3,825.31 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు.గురువారం ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయి పథకం అమలు, రాష్ట్రానికి అందాల్సిన సహకారం తదితర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ గ్రామీణ ప్రజల కోసం 8.50 కోట్ల పనిదినాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, జూన్ 9 నాటికి ఇందులో 4.38 కోట్ల పనిదినాలు పూర్తవగా, రూ.1,163.64 కోట్ల నిధులను ఖర్చు చేసి 11,684 పనులను పూర్తి చేసినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపినట్లు కిషన్రెడ్డి వెల్లడించారు.60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు చేయనున్న ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్ను విడుదల చేయాల్సి ఉందని, దీంతోపాటే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను కూడా కేటాయించాల్సి ఉందని కిషన్రెడ్డి తెలియజేశారు. వ్యవసాయ పనుల విరామానికి సంబంధించిన నోటిఫికేషన్ను కూడా వ్యవసాయదారులందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. జీ రామ్ జీ పథకాన్ని రాష్ట్రంలో అనుకున్న సమయానికి సజావుగా, సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సమీక్షలు జరుపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
ఈగ.. యముడి మెరుపు తీగ!
ఒక అడవి జాతి ప్రాణాంతక మాంసాహార ఈగ అమెరికాను వణికిస్తోంది. దీంతో అత్యవసర పరిస్థితులు, ఎగుమతులపై నిషేధాలు విధించారు. క్వారంటైన్ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. సాధారణ ఈగ గుడ్ల నుంచి పుట్టే తెల్లని పురుగులు(మ్యాగట్స్/లార్వాలు) చనిపోయిన కణజాలాలను తింటే ఈ ఈగ లార్వాలు సజీవ మాంసాన్నే తింటున్నాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ లార్వా పేరు ‘న్యూ వరల్డ్ స్రూ్కవార్మ్’(ఎన్డబ్ల్యూఎస్). ఇది సోకితే పశువులు, పందులు, మేకలు, పెంపుడు జంతువులే కాకుండా మనుషులకు కూడా ముప్పే.టెక్సాస్లో ఎమర్జెన్సీకొద్దిరోజుల క్రితం టెక్సాస్లోని పశువులు, మేకలతోపాటు న్యూమెక్సికోలోని ఒక పెంపుడు కుక్కలో స్రూ్కవార్మ్ కేసులను గుర్తించినట్లు అధికారులు నిర్ధారించారు. టెక్సాస్ వ్యవసాయ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టెక్సాస్లో పశువులు, గుర్రాల దిగుమతిని కెనడా నిషేధించింది. అంతకుముందు మెక్సికోలో ఈ కేసులు రావడంతో అమెరికా కూడా మెక్సికో నుంచి పశువుల ఎగుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది.మాంసాన్ని కొరికి తింటాయి గాయాలు, తెగిన గాట్లు, పేలు కుట్టిన చిన్న రంధ్రాలు లేదా చర్మం తెరుచుకున్న భాగాలపై ఆడ ఈగ వందల గుడ్లు పెడుతుంది. కొన్ని గంటల్లోనే ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలు బయటకు వచ్చి, బతికున్న జీవుల ఆరోగ్యకర మాంసాన్ని కొరికి తింటాయి. సకాలంలో చికిత్స అందించకపోతే.. తీవ్ర గాయాలు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల జంతువులు 7 నుంచి 14 రోజుల్లో చనిపోతాయి. కొత్తదేమీ కాదు.. అమెరికాకు స్క్రూవార్మ్ కొత్తదేమీ కాదు. అయితే దశాబ్దాల క్రితమే అమెరికా, మెక్సికోలు మాంసాన్ని తినే ఈ ఈగ జాతిని నిర్మూలించాయి. ఉత్తర అమెరికా సరిహద్దుల్లోకి ఇటీవల తిరిగి ప్రవేశించిన ఈ ప్రమాదకర పరాన్నజీవి.. పశుసంవర్థక రంగానికి పెనుముప్పుగా మారింది. గతంలో స్టెరైల్ ఇన్సెక్ట్ కెక్నిక్ ద్వారా అమెరికాలో దీన్ని నిర్మూలించారు. ఇందులో భాగంగా ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన మిలియన్ల కొద్దీ సంతానోత్పత్తి చేయలేని మగ ఈగలను ప్రకృతిలోకి వదిలారు. తద్వారా వాటి సంతానోత్పత్తి ఆగిపోయింది. అయితే తూర్పు పనామాలోని డారియన్ గ్యాప్ బయోలాజికల్ బారియర్ క్వారంటైన్ జోన్ నుంచి ఈ ఈగలు తప్పించుకొని మధ్య అమెరికా మీదుగా ఉత్తర దిశగా వ్యాపించడంతో ఇప్పుడు మళ్లీ ఈ ముప్పు వచ్చింది. దీంతో టెక్సాస్లో కొత్తగా భారీ స్థాయిలో స్టెరైల్ ఫ్లై ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మనుషులకు సోకిన కొన్ని కేసుల్లో శస్త్రచికిత్స ద్వారా పురుగులను తీసేసి యాంటీ పారాసిటిక్ మందులతో నయం చేశారు. -
అండగా నిలవండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతోపాటు రాష్ట్రంలో చేపట్టనున్న కీలక ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం ఢిల్లీలో ప్రధానితో సమావేశమైన సీఎం రేవంత్.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఎం–6’ నిధికి రూ. 6 లక్షల కోట్లు తెలంగాణ రైజింగ్ దార్శనికతను ప్రధానికి వివరించిన రేవంత్రెడ్డి.. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో తాను చేసిన ఎం–6 టాస్్కఫోర్స్ ప్రతిపాదనను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. దేశంలో ఆర్థిక వృద్ధికి ఇంజిన్లలా పనిచేస్తున్న ఆరు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల అభివృద్ధికి ప్రధాని నేతృత్వంలో ఈ టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో నగరానికి రూ. లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ. 6 లక్షల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మెట్రో రెండో దశకు చేయూతనివ్వండి రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో 122.9 కిలోమీటర్ల మేర 7 కారిడార్లలో చేపట్టనున్న హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశకు కేంద్రం ఆమోదం తెలపాలని సీఎం రేవంత్రెడ్డి ప్రధానిని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుగా దీన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మక మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుతోపాటు సస్టెయినబుల్ అర్బన్ హబ్గా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. రోడ్లు, రైల్వేల విస్తరణకు ఊతం హైదరాబాద్ రీజనల్ రింగ్రోడ్డు (ఉత్తర, దక్షిణ కారిడార్లు), ప్రతిపాదిత హైదరాబాద్–అమరావతి–బందరు పోర్టు ఎక్స్ప్రెస్ వే, మన్ననూర్–శ్రీశైలం (ఎన్హెచ్–765) మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలిపి అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే రీజనల్ రింగ్రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోపాటు శంషాబాద్లో సెంట్రల్ హైస్పీడ్ రైల్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ను చెన్నై, బెంగళూరు, పుణే నగరాలతో అనుసంధానిస్తూ హైస్పీడ్ రైల్ కనెక్టివిటీని అభివద్ధి చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని.. ఇందుకోసం హైదరాబాద్ పరిధిలో 200 ఎకరాల వివాదరహిత భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. టెక్నాలజీ, సాగునీటి ప్రాజెక్టులకు దన్నుగా నిలవండి టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో గమ్యస్థానంగా తెలంగాణ దూసుకుపోతోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద రాష్ట్రానికి ప్రాజెక్టులు కేటాయించాలని ప్రధానిని కోరారు. ఫ్యూచర్ సిటీలో ఎల్రక్టానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ 2.0) ఏర్పాటుకు గ్రాంట్–ఇన్–ఎయిడ్ కింద కేంద్రం మద్దతివ్వాలని కోరారు. సాగునీటి రంగంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్రతో నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేలా ప్రధాని చొరవ తీసుకోవాలని ప్రధానిని సీఎం కోరారు. విద్య, వైద్యమే పునాదిగా.. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే అంశాలను సీఎం రేవంత్రెడ్డి ఈ భేటీలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దేశాభివృద్ధి వ్యూహంలో నాణ్యమైన విద్య, వైద్యం పునాదిగా ఉండాలని సీఎం నొక్కిచెప్పారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీ, టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఐటీఐల ఆధునీకరణ వంటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను మోదీకి వివరించారు. మెట్రో రెండో దశకు సత్వరమే అనుమతులివ్వండి కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో భేటీలో సీఎం విజ్ఞప్తి హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టుకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఖట్టర్తో సీఎం సమావేశమయ్యారు. మెట్రో ఫేజ్–2 ఆవశ్యకతను ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. మెట్రో ఫేజ్–2 డీపీఆర్లో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ గతంలో చేసిన సూచనల మేరకు మార్పులు చేసి ఇప్పటికే సమర్పించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి కూడా త్వరితగతిన అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శి మాణిక్రాజ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ప్రత్యేక కార్యదర్శి (సమన్వయం) అద్వైత్కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
వైరల్ వీడియోలే వరుడికి విలన్లయ్యాయి..
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్కు చెందిన ఓ వరుడు తన పెళ్లికి బుల్డోజర్పై రావాలని వింత నిర్ణయం తీసుకున్నాడు. బరాత్ సమయంలో బుల్డోజర్పై కూర్చొని పొగ తాగుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. అతని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.ఉమ్రీ కలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరుడు ఉస్మాన్ గ్రామంలో పెళ్లి ఊరేగింపునకు సంప్రదాయంగా గుర్రం లేదా కారు బదులు బుల్డోజర్ను వాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందరికంటే ప్రత్యేకంగా తన బరాత్ చేసుకోవాలని అనుకున్నాడు.వైరల్ వీడియోలో ఉన్న దారి ప్రకారం ఉస్మాన్ తన స్నేహితులతో కలిసి బుల్డోజర్పై కూర్చొని గ్రామంలో ఊరేగింపులో పాల్గొంటూ కనిపించాడు. ఒక వీడియోలో అతను సిగరెట్ తాగుతూ పొగ రింగు రింగులుగా వదులుతూ వెళ్లిన దృశ్యాలు కనిపించాయి.మరో వీడియోలో పెద్ద శబ్దంతో వినిపించిన డీజే సంగీతానికి అనుగుణంగా బుల్డోజర్పై ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా పెళ్లి అతిథులు అతడిని ప్రోత్సహిస్తూ కనిపించారు. వేడుకల సమయంలో మరికొందరు బరాత్ సభ్యులు కూడా బుల్డోజర్పైకి ఎక్కినట్లు వీడియోల్లో కనిపించింది. కదులుతున్న బుల్డోజర్పై డజన్కు పైగా అతిథులు నిలబడి డ్యాన్స్ చేస్తూ హ్యాపీగా గడిపారు.ఈ విభిన్న పెళ్లి ఊరేగింపును కొందరు నెటిజన్లు వినోదాత్మకంగా భావించినా, మరికొందరు భద్రతాపరమైన ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రద్దీగా ఉన్న ఊరేగింపులో బుల్డోజర్పై డ్యాన్స్ చేయడం ప్రమాదాలకు దారి తీయవచ్చని అభిప్రాయపడ్డారు.వీడియోలు మరింత వైరల్ అవుతుండడంతో స్థానిక అధికారులు ఈ విషయాన్ని గమనించారు. వీడియోల్లో కనిపించిన బుల్డోజర్ను గుర్తించామని, దానిపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.ఈ విషయంపై మాట్లాడిన కాంత్ పోలీస్ స్టేషన్ అధికారులు.. ఊరేగింపులో వినియోగించిన జేసీబీ యంత్రాన్ని గుర్తించామని, చలాన్ జారీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అయితే భారీ యంత్రాలు, ప్రమాదకర విన్యాసాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో జరిగే వేడుకలు చట్టపరమైన చర్యలకు దారి తీస్తాయని, ముఖ్యంగా ప్రజల భద్రత ప్రమాదంలో పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు పలుమార్లు హెచ్చరించారు.ఉస్మాన్ పెళ్లి బృందం సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమైనా, పెళ్లి తర్వాత ఊహించని గుర్తుగా ట్రాఫిక్ చలాన్ను కూడా పొందింది. -
ఆ విషయంలో తగ్గేదేలే.. నీతి ఆయోగ్ భేటీలో సీఎం విజయ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ కీలక డిమాండ్లు లేవనెత్తారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్.. 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య సీట్లను భర్తీ చేసేందుకు అనుమతించాలని కోరారు. దీంతో పాటు కోయంబత్తూరులో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు, పెండింగ్లో ఉన్న రూ.3,284 కోట్ల విద్యా నిధుల విడుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం, శ్రీలంక, పాకిస్తాన్లలో బందీలుగా ఉన్న తమిళ మత్స్యకారుల విడుదల కోసం కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష వల్ల గ్రామీణ, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటును కోరుతూ.. కోయంబత్తూరులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని సీఎం విజయ్ కేంద్రానికి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వైద్య విద్యను, అత్యాధునిక ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని ఆయన వివరించారు.పాక్ జలసంధి ప్రాంతంలో భారతీయ మత్స్యకారుల సాంప్రదాయ చేపల వేట హక్కులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ కోరారు. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్ దేశాల జైళ్లలో మగ్గుతున్న తమిళనాడు మత్స్యకారులను, వారి బోట్లను విడిపించేందుకు అత్యవసర దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర రోడ్డు రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలు కింది ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారుసమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.3,284 కోట్ల పెండింగ్ నిధులను ముందస్తు షరతులు లేకుండా విడుదల చేయాలన్నారు. అలాగే, ఆధునిక భారతదేశ లౌకిక విలువల చాటిచెప్పే ప్రాచీన తమిళ గ్రంథం 'తిరుక్కురళ్' (Thirukkural)ను జాతీయ సాహిత్యంగా ప్రకటించాలని కౌన్సిల్ ముందు ప్రతిపాదించారు. -
ఓటు చోరీ.. ఇప్పుడు సీటు చోరీ: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశాన్ని మోదీ సర్వనాశనం చేశారని చెప్పారు. ఆయన పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే మిగులుతున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ ఖూనీ చేస్తోందని చెప్పారు.అలాగే, కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయంపై రాహుల్ స్పందిస్తూ.. ‘‘ఓటు చోరీ, సర్కార్ చోరీ తర్వాత బీజేపీ-ఈసీ జుగల్బందీ, సీటు చోరీతో పోటీ మొదలుకాకముందే ముగించేసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ఏం జరిగిందో చూడండి.కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ ప్రతి పత్రాన్ని సమర్పించారు. పెండింగ్ కేసులు లేవు. బీజేపీ చేసిన చిన్న అభ్యంతరం ఆధారంగా ఈసీ ఆమె నామినేషన్ను రద్దు చేసింది. బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ దరఖాస్తు పత్రంలో తన పేరునే తప్పుగా రాశారు. తప్పనిసరిగా వెల్లడించాల్సిన ఎన్నో వివరాలు ఇవ్వలేదు. వాటన్నింటినీ సరిచేసుకునేందుకు ఈసీ ఆయనకు గడువు పొడిగించింది.ఒకరిని కనీసం విచారణ కూడా లేకుండానే అనర్హురాలిగా ప్రకటించారు. మరొకరికి మాత్రం నిబంధనలు పాటించకపోయినా ప్రోత్సాహం లభించింది. కాంగ్రెస్ నేతలు కలుస్తామని చెప్పినప్పుడు ఈసీ మొదట మమ్మల్ని తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరకు సమావేశం జరిగినప్పుడు, వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటివి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే బీజేపీకి ఎన్నికల్లో గెలవడం కంటే, ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవడం చాలా సులభం’’ అని అన్నారు. After Vote Chori and Sarkar Chori - the BJP-EC jugalbandi has finished the contest before it has even begun with Seat Chori.Look at what happened in the recent Rajya Sabha elections.Congress candidate Meenakshi Natarajan ji submitted every document. No pending cases. The EC…— Rahul Gandhi (@RahulGandhi) June 11, 2026 -
ఎదురెదురుగా దూసుకొచ్చిన రైళ్లు..
భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలో భారీ రైలు ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ సమీపంలోని జార్పడా బ్రిడ్జి దగ్గర ఇవాళ (గురువారం) రెండు ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఒకే ట్రాక్పైకి రావడం కలకలం రేపింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదాన్ని నివారించగలిగారు.ప్రాథమిక సమాచారం ప్రకారం.. భువనేశ్వర్ నుంచి మంచేశ్వర్ వైపు వెళ్తున్నఓ రైలు.. ఎదురుగా వస్తున్న మరో రైలు ఒకే ట్రాక్పైకి చేరాయి. ఈ విషయాన్ని సకాలంలో గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై రెండు రైళ్లను సురక్షితంగా నిలిపివేశారు. ఈ ఘటన భువనేశ్వర్లోని అత్యంత రద్దీగా ఉండే జార్పడా వంతెన మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై తూర్పు తీర రైల్వే (ఈసీఓఆర్) అధికారులు విచారణ ప్రారంభించారు. ట్రాక్ కేటాయింపులో జరిగిన పొరపాటు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. -
టీఎంసీ సంక్షోభం: మమతకు భారీ ఊరట
తృణమూల్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న తరుణంలో, తిరుగుబాటు ఎంపీల జాబితాతో తన పేరును ముడిపెడుతున్న వార్తలను టీఎంసీ సీనియర్ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఖండించారు. తాను పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎప్పటికీ విధేయుడిగానే ఉంటానని స్పష్టం చేశారు.లోక్సభ స్పీకర్కు తృణమూల్ "అసమ్మతి" వర్గం సమర్పించిన లేఖపై సంతకం చేసిన వారిలో శతృఘ్న సిన్హా కూడా ఉన్నారనే వార్తల నడుమ, ఎక్స్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన భారత ప్రధానిగా రికార్డు సృష్టించినందుకు ప్రధాని మోదీని అభినందించడంతో పాటు, ఈ పోస్ట్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని కూడా ట్యాగ్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఊహాగానాలకు తెరలేపింది. అయితే ఈ వార్తలను నటుడు శతృఘ్న సిన్హా గురువారం కొట్టిపారేశారు.ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని అసమ్మతి వర్గంలో తాను ఉన్నట్లు వస్తున్న పుకార్లను ఖండించారు. కష్టకాలంలో మమతా తనకు అండగా నిలిచారు, ఈ కష్ట సమయాల్లోమమతకు అండగా ఉంటానని ప్రకటించారు. నిజానికి ఆమె ఒత్తిడి మేరకే తాను అసన్సోల్ నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశానని చెబుతూ.. తాను "దీదీని ఎప్పటికీ వీడను" అని సిన్హా స్పష్టం చేశారు. అటు తాను మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతోనే ఉంటానని, తిరుగుబాటు శిబిరంలో చేరబోనని గాయకుడు, టీఎంసీ ఎంపీ బాబుల్ సుప్రియో స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న ఓడను వదిలేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు మరే ఇతర పార్టీలోనూ చేరడం లేదని కూడా స్పష్టం చేశారు.కాంగ్రెస్లో విలీనం లేదు మరోవైపు, టీఎంసీలో విలీనం అవుతోందన్న వార్తలు నిరాధారమైనవని కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీతో సహా ఇండియా బ్లాక్ నాయకులను కలిసిన మమతా బెనర్జీ, తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని పశ్చిమ బెంగాల్కు తిరిగి వచ్చారు. నకిలీ సంతకాల వివాదంపై పశ్చిమ బెంగాల్ సీఐడీ సమన్లు జారీ చేసినప్పటికీ, అభిషేక్ బెనర్జీ ఢిల్లీలోనే ఉన్నారు, ఆయన కోల్కతాకు ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.ఎన్నికల సంఘమే తేలుస్తుందితిరుగుబాటు టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్, తమ గ్రూపుకు 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మద్దతు ఉందని, ఎన్డీఏకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. అయితే, తిరుగుబాటు ఎమ్మెల్యే రీటాబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గంతో తమ తిరుగుబాటు ఎంపీలకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఏ వర్గం అసలైన టీఎంసీనో ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందన్నారు.ఇదీ చదవండి: తాలిబన్ల అరాచకం : నిరసనకారులపై బుల్లెట్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తతశతృఘ్న సిన్హా రాజకీయ ప్రస్థానం:కాగా బాలీవుడ్ హీరోశతృఘ్న సిన్హా తన రాజకీయ జీవితం బీజేపీతోనే ప్రారంభమూంది. దశాబ్దాల పాటు ప్రముఖ బీజేపీ నేతగా, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన సైద్ధాంతిక విభేదాలతో పార్టీని వీడారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2022లో, ఆయన మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. అనంతరం జరిగిన అసన్సోల్ లోక్సభ ఉపఎన్నికలో విజయం సాధించారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ టిఎంసి అభ్యర్థిగా పోటీ చేసి అసన్సోల్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.ఇదీ చదవండి: రూ. 954 కోట్ల స్కాం : భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్ -
మమతా బెనర్జీకి కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ గురువారం పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. సంతకాల ఫోర్జరీ కేసులో తనను న్యాయవాదిగా చివరి క్షణంలో తొలగించారని, అది తనకు తీవ్ర అవమానంగా అనిపించిందని ఆరోపించారు.ఇటీవల పలువురు టీఎంసీ నేతలు, ప్రజాప్రతినిధులు మమతా బెనర్జీకి గుడ్ బై చెప్పేసినప్పటికీ ఆమెకు విధేయుడిగా కొనసాగిన కల్యాణ్ బెనర్జీ ఇప్పుడు అంతర్గత విభేదాలను మరింత తీవ్రం చేస్తూ అల్టిమేటం జారీ చేశారు. “అభిషేక్ కావాలా? లేక నేను కావాలా?” అని ఆయన ప్రశ్నించారు. దీంతో పార్టీ నాయకత్వంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు మరోసారి బయటపడ్డాయి.ప్రస్తుతం జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. కల్యాణ్ బెనర్జీ కూడా టీఎంసీని వీడే అవకాశం ఉంది. ఆయన బహిరంగంగానే మమతా బెనర్జీకి "నన్నా? అభిషేక్ బెనర్జీనా? ఎవరిని ఎంచుకుంటారో తేల్చండి" అని చెప్పడంతో పాటు, "పార్టీ అభిషేక్ లేకుండా నడవదని మమతా భావిస్తే నేను నా నిర్ణయం తీసుకుంటాను" అని హెచ్చరించారు.అసలు ఆ ఫోర్జరీ కేసు ఏంటంటే.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సోవందేబ్ చటోపాధ్యాయ నియామకానికి సంబంధించి టీఎంసీ తీర్మానం పంపించారు. ఆ తీర్మానంపై కొంతమంది టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలు నకిలీవని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆరోపించారు. వీరు తమ సంతకాలు అనుమతి లేకుండా తీర్మానంలో చేర్చారని అసెంబ్లీ సచివాలయానికి ఫిర్యాదు చేశారు.కాగా, సంతకాల ఫోర్జరీ కేసు విచారణలో కలకత్తా హైకోర్టులో అభిషేక్ బెనర్జీ తరఫున వాదిస్తున్న న్యాయవాదిగా కల్యాణ్ బెనర్జీ స్థానంలో మరొకరిని నియమించడంతో ఈ వివాదం మొదలైంది.ఆ కేసులో అభిషేక్ బెనర్జీకి హైకోర్టు తాత్కాలిక అరెస్టు రక్షణ ఇచ్చింది. అదే రోజు సాయంత్రం 6 గంటలలోపు పశ్చిమ బెంగాల్ సీఐడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ప్రస్తుతం అభిషేక్ ఢిల్లీలో ఉన్నారు.కేసు కోసం తాను రాత్రంతా శ్రమించి, అత్యవసర విచారణ కోసం న్యాయమూర్తి ఎదుట వాదించానని కల్యాణ్ బెనర్జీ చెప్పారు. అయితే మరో పిటిషన్ దాఖలైందని, ఇంకొక న్యాయవాది కేసు చూస్తారని తనకు తెలియజేశారని అన్నారు.“ఇతరులను అగౌరవపరచే వారి అలవాటు మారలేదు. అతడు (అభిషేక్ బెనర్జీ) అందరూ తనకంటే తక్కువవారనే భావనలో ఉంటాడు. కామాక్ స్ట్రీట్లోని ఉద్యోగుల్లా అందరినీ చూస్తాడు. నేను 45 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను” అని కల్యాణ్ బెనర్జీ చెప్పారు.“అతడు ఎంతో అహంకారిగా మారిపోయాడు. ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదు. అందుకే నేను తప్పుకున్నాను. ఈ ఉదయం దీదీకి కూడా చెప్పాను. నన్ను లేదా అభిషేక్ బెనర్జీలో ఎవరు కావాలో తేల్చుకోండి” అని కల్యాణ్ బెనర్జీ అన్నారు.టీఎంసీని వీడిన మరో నేతమమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న సమయంలో ఈ భిన్నాభిప్రాయ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా అభిషేక్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేలు టీఎంసీని వీడుతున్నారు. గురువారం ప్రకాశ్ బారిక్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతకుముందు సుష్మితా దేవ్, సుకేందు శేఖర్ రాయ్ కూడా రాజీనామా చేశారు.పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత ముదురుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత వారం 58 మంది ఎమ్మెల్యేలు మమతకు ఎదురు తిరిగారు. ప్రతిపక్ష నేత పదవికి రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించారు. ఈ తిరుగుబాటును మమతా బెనర్జీ, ఆమె పార్టీ ఇటీవలి సంవత్సరాల్లో ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన అంతర్గత సవాళ్లలో ఒకటి. -
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు షాక్
భోపాల్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు బిగ్షాక్ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. తరుణ్చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ పేర్లను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నామినేషన్ తిరస్కరణతో కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యప్రదేశ్లో రాజ్యసభకు ఖాళీగా ఉన్న మూడు స్థానాలను బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. బీజేపీ తరఫున తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్ పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించబడటంతో ఎన్నికలు అవసరం లేకుండా పోయాయి. జూన్ 11న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా.. ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉండటంతో రిటర్నింగ్ ఆఫీసర్ వారిని ఏకగ్రీవంగా ప్రకటించి సర్టిఫికెట్లు అందజేశారు.కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను బీజేపీ అభ్యంతరాల ఆధారంగా రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఒక కేసును అఫిడవిట్లో వెల్లడించలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే నటరాజన్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా కొట్టి పారేశారు. ఆమె ఇప్పటికే హైదరాబాద్ కోర్టులో ఆ కేసుపై పిటిషన్ వేసి, దాన్ని వ్యతిరేకిస్తున్నారు.కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ తిరస్కరణను.. తప్పు, పక్షపాతపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. చట్ట విరుద్ధం’అని సుప్రీం కోర్టులో వాదించారు. మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్కు రిటర్నింగ్ ఆఫీసర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహ్గతి వాదనలు వినిపించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సరైన నిర్ణయం, చట్టబద్ధమైనదే అని కోర్టులో వాదించారు. అంటే, రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆ పిటిషన్ను అంగీకరించకూడదని కోర్టులో ప్రతిపాదించారు. పిటిషన్లో ఎన్నికల ఫలితాలపై స్టే కోరినా.. జూన్ 12న కోర్టులో విచారణ జరగనుందని, అప్పటివరకు స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. మీనాక్షి నటరాజన్ పిటిషన్పై రేపే సుప్రీంకోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ శర్మ, అతుల్ ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
కామెడీ షోలో లేడీ డాక్టర్ వల్గర్ కామెంట్లు
కామెడీ పేరుతో వేసే వెగటు జోకులు ఒక్కోసారి జనాలకు కోపం తెప్పిస్తుంటాయి. అలా ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో జరిగిన ఒక ఇంటరాక్షన్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ప్రణీత్ మోర్ నిర్వహించిన షోలో ఒక యువ డాక్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.ముంబైలోని కేఈఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న సీజల్ పవార్ అనే డాక్టర్, శవాలపై నిర్వహించే శిక్షణ (అటాప్సీ/కాడేవర్ స్టడీ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ మృతదేహాల ప్రైవేట్ పార్ట్ల గురించి తాను, తన తోటి మహిళా డాక్టర్లు జోకులు వేసుకుంటామంటూ ఆమె మాట్లాడారు. ఆ సమయంలో ప్రణీత్ సహా అంతా సరదాగా నవ్వులు చిందించారు. అయితే ఆమె అనుచితంగా మాట్లాడారంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో వైద్య వర్గాలు, విద్యార్థులు తీవ్రంగా స్పందించారు. వైద్య విద్యలో కాడేవర్ స్టడీ అనేది ఒక గౌరవప్రదమైన శాస్త్రీయ ప్రక్రియ అని, దానిపై జోకులు చేయడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఈ అంశంపై నైతిక బాధ్యత, మాటల పరిమితులు, పబ్లిక్ ఫిగర్ల బాధ్యతపై కూడా చర్చ మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఒకరిపై ఎంత స్థాయిలో చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్న కూడా సోషల్ మీడియాలో లేవనెత్తబడింది.వివాదం పెరుగుతుండటంతో సీజల్ పవార్ తన వ్యాఖ్యలపై ఇన్స్టాగ్రామ్లో క్షమాపణలు తెలిపారు. తన మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, బాధ్యత తనదేనని ఆమె పేర్కొన్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. ఇక ఈ షోలో పాల్గొన్న కామెడియన్ ప్రణీత్ మోర్ కూడా విమర్శల మధ్య సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.Sejal pawar doctor by profession talking about how she and her friends make fun of dead bodies about their dick size and made several nasty comments about male reproductive organ pic.twitter.com/q7rfQoi6DJ— Aarohi (@hamlakroo) June 10, 2026 -
మీనాక్షికి దక్కని ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ నామినేషన్ రద్దు వ్యవహారంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్కు సుప్రీంకోర్టులో ఇవాళ ఊరట లభించలేదు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున తాము తక్షణ జోక్యం చేసుకోలేమని గురువారం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఆమె పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు అంశం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్నికల ఫలితాల ప్రకటనపై తాత్కాలిక నిలుపుదల (స్టే) ఇవ్వాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది.అయితే మిగిలిన వాదనలు, వివరణలు శుక్రవారం వింటామని తెలిపింది. అలాగే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం సాధారణంగా తగదని అభిప్రాయం బలంగానే వ్యక్తి చేసింది. దీంతో ఈ కేసు రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు, రెండు ఉప స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ (4), గుజరాత్ (4), కర్ణాటక (4) మధ్యప్రదేశ్ (3), రాజస్థాన్ (3), జార్ఖండ్ (2), మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఒక్కో స్థానం చొప్పున మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే.. మహారాష్ట్ర, తమిళనాడులో చెరో స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి. -
పోలీస్ రిక్రూట్మెంట్ ఉందని వెళితే పొలంలో పనిష్మెంట్!
లక్నో: ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్, గూగుల్ మ్యాప్స్ తోడు లేకుండా అడుగు బయటకు అడుగువేయలేం. అయితే అదే టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే జీవితాలే తలకిందులవుతాయని నిరూపించే ఒక ఘటన వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్లో యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష రాయడానికి బయల్దేరిన నలుగురు అభ్యర్థులు, గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో వెళ్లి, పరీక్షా కేంద్రానికి బదులు పంట పొలాల్లోకి చేరుకున్నారు. తప్పు తెలుసుకుని పరీక్షా కేంద్రానికి పరుగులు తీసేసరికి సమయం దాటిపోవడంతో, వారి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైంది.గూగుల్ మ్యాప్స్ మాయవిశాల్, ధర్మేంద్ర మాలిక్, అరుణ్ కుమార్, నకుల్ కుమార్ అనే నలుగురు అభ్యర్థులు ముజఫర్నగర్లోని ‘దీప్చంద్ గ్రెయిన్ ఛాంబర్ ఇంటర్ కాలేజ్’లో పరీక్ష రాయాల్సి ఉంది. వారు తమ అడ్మిట్ కార్డ్లోని సెంటర్ కోడ్ను గూగుల్ మ్యాప్స్లో ఎంటర్ చేసి ప్రయాణమయ్యారు. అయితే, ఆ మ్యాప్ వారిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సింది పోయి, షామ్లీ జిల్లాలోని జాంధేరి గ్రామంలోని వ్యవసాయ పొలాల మధ్యకు తీసుకెళ్లింది. చుట్టూ చూస్తే కాలేజీ కాకుండా పంట పొలాలు కనిపించడంతో వారు షాక్కు గురయ్యారు. తాము తప్పుడు లొకేషన్కు వచ్చామని గ్రహించేసరికే జరగకూడనంత నష్టం జరిగిపోయింది.సమయంతో పోరాటం.. చేజారిన అవకాశంసమయం మించిపోతుండటంతో ఆ నలుగురు అభ్యర్థులు తీవ్ర ఆందోళనతో ముజఫర్నగర్ వైపు పరుగులు తీశారు. స్థానికులను దారి అడుగుతూ, పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎలాగోలా ముజఫర్నగర్ చేరుకునేసరికి పరీక్షా కేంద్రం గేట్లు మూతపడ్డాయి. పరీక్ష ప్రారంభ ప్రక్రియ ముగిసిపోవడంతో అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు. దీనితో రాత్రింబవళ్లు కష్టపడి చదివినా పరీక్ష రాయకుండానే వారు వెనుదిరగాల్సి వచ్చింది. -
70 ఏళ్ల నా భర్త నాతో కాపురం చేయడం లేదు..!
తమిళనాడు: కోర్టు ఆదేశాల మేరకు భార్యకు జీవనాంశం ఇవ్వని 70 ఏళ్ల వృద్ధుడికి 17 నెలల జైలుశిక్ష విధిస్తూ పళ్ళిపట్టు న్యాయస్థానం ఆదేశించింది. ఆంధ్రాలోని తిరుపతి జిల్లా నారాయణవనంకు చెందిన అన్నాదురై(70)కు మొదటి భార్య మృతితో పళ్ళిపట్టు సమీపంలోని సొరకాయపేటకు చెందిన నిర్మల(45) అనే ప్రత్యేక ప్రతిభావంతురాలిని వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు అమ్మాయిలు వున్నారు. గత కొన్నేళ్ల కిందట భార్యను ఆన్నాదురై విడిచిపెట్టడంతో సొరకాయపేటలోని పుట్టింట్లో ఇద్దరు ఆడ బిడ్డలతో నిర్మల వుంటున్నారు.తన భర్త తనతో కాపురం చేయకుండా విడిచిపెట్టినట్లు దీంతో తనకు బిడ్డలకు జీవనం కష్టంగా మారిందని బాధితురాలు 2022లో పళ్లిపట్టు మున్సిల్ జ్యుడిషియల్ కోర్టులో కేసు దాఖలు చేసారు. నిర్మల తరపున న్యాయవాధి భరత్కుమార్ వాదనలు వినిపించారు. భార్య బిడ్డలను విడిచిపెట్టిన అన్నాదురై వారి జీవనాంశంగా ప్రతినెలా రూ. 20 వేలు చెల్లించాలని 2022లో న్యాయస్థానం ఆదేశించింది. అయితే అన్నాదురై నిర్మలకు జీవనాంశం చెల్లించపోవడంతో 2024లో మళ్లీ కోర్టు మెట్లెక్కారు. ఈ కేసుకు సంబందించి అన్నాదురైకు న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీచేసింది. దీంతో పొదటూరుపేట పోలీసులు అన్నాదురైను మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసుకు సంబందించి న్యాయస్థానం ఆదేశాలు ఎందుకు పాటించలేదని, జీవనాంశం ఎందుకు చెల్లించలేదని న్యాయమూర్తి వెంకటేశన్ ప్రతివాదిని ప్రశ్నించగా సమాదానం లేక పోవడంతో అన్నాదురైకు 17 నెలల జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు అన్నాదురైను అరెస్టు చేసి పుళళ్ సెంట్రల్ జైలుకు తరలించారు. -
కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం : హై అలర్ట్
కేరళలో మరో సారి నిపా వైరస్ (Nipah Virus) కలకలం రేపుతోంది. కోజికోడ్లోని ఫెరోక్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కేరళ ఆరోగ్య అధికారులు అప్రమత్త మయ్యారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగానే ఉందని పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు.ప్రాథమిక పరిశీలన ప్రకారం, రోగికి మొదట మామూలు జ్వరం వచ్చి తగ్గింది, ఆ తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. నిపా అనుమానిత కేసుగా గుర్తించడానికి ముందు పలు ఆసుపత్రిలను సందర్శించిన తరువాత సదరు రోగి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్పేషెంట్ విభాగానికి వచ్చారు. దీంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక గిడ్డంగిని శుభ్రం చేస్తున్నప్పుడు అతనికి ఈ ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశంలో వైరస్ సోకిన గబ్బిలాలు ఉండటమే వైరస్ వ్యాప్తికి ప్రాథమిక కారణమని దర్యాప్తు అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన మూలాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇదీ చదవండి: రూ. 954 కోట్ల స్కాం : భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకోనేందుకు గురువారం తిరువనంతపురంలోని ఆరోగ్యమంత్రి కె. మురళీధరన్ కార్యాలయంలో సీనియర్ ఆరోగ్య అధికారులతో సమావేశం కానున్నారు. ఆరోగ్య అధికారులు ఇప్పటికే కాంటాక్ట్-ట్రేసింగ్ చర్యలను ప్రారంభించారని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ఆందోళన వద్దు : కేరళ ఆరోగ్య మంత్రిబాధిత వ్యక్తి చాలా మందిని కలిసినప్పటికీ, ప్రస్తుత దశలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. సంబంధిత రోగి చికిత్స కోసం వెళ్లిన ప్రైవేట్ ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించారని, దీనివల్ల ఇతరులకు కూడా వైరస్ వ్యాపించి ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా, ఆ రోగి వెళ్లినఆసుపత్రి సిబ్బందిని క్వారంటైన్లోకి వెళ్లాలని ఆదేశించినట్లు చెప్పారు.ఇదీ చదవండి: వాహనదారులకు గుడ్ న్యూస్, ఆ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం రద్దు -
Kerala: చొరబాట్ల కలకలం.. 10 వేల మంది నకిలీ పౌరులు?
తిరువనంతపురం: కేరళలో వలస కూలీల ముసుగులో భారీ ఎత్తున బంగ్లాదేశ్ పౌరులు అక్రమంగా నివసిస్తున్నారనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొల్లాం జిల్లాలోని కొట్టారక్కరలో ఇటీవల పోలీసులు పది మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకోవడంతో ఈ నకిలీ గుర్తింపు పత్రాల రాకెట్ గుట్టురట్టయింది. కేవలం 700 రూపాయలకే అసలైన వాటిని పోలిన నకిలీ ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను సృష్టిస్తూ, సుమారు 10,000 మందికి పైగా బంగ్లాదేశీయులు భారతీయ పౌరులుగా చలామణి అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామం దేశ రక్షణ, ఇంటెలిజెన్స్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.రూ.700లకే గుర్తింపు పత్రాలుపోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, అక్రమ వలసదారులు మొదట పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ సరిహద్దు ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ ప్రాథమిక నకిలీ పత్రాలను సంపాదించిన తర్వాత, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కేరళకు చేరుకుంటున్నారు. కేరళలోని స్థానిక చిరునామాలను ఉపయోగించుకుని, పూర్తి స్థాయి నకిలీ ఐడీలను సృష్టిస్తున్నారు. దీని వెనుక బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలించి, వాటిలో బంగ్లాదేశ్ పాస్పోర్ట్ల కాపీలను కనుగొనడంతో వారి అసలు పౌరసత్వం బయటపడింది.గొలుసుకట్టు వలసల గుట్టుఈ అక్రమ వలసల్లో గొలుసుకట్టు (చైన్ మైగ్రేషన్) విధానం సాగుతున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. 13 ఏళ్ల క్రితం కేరళకు వచ్చిన ముగల్ ఖాతూన్ అనే బంగ్లాదేశ్ మహిళ, ఇక్కడ ‘మామ్దాస్’ అనే నకిలీ పేరుతో అన్ని రకాల గుర్తింపు పత్రాలను పొందింది. ఆ తర్వాత ఆమె తన బంధువులను కూడా ఇక్కడికి రప్పించింది. అరెస్ట్ కావడానికి రెండు నెలల ముందే ఆమె బంగ్లాదేశ్ పాస్పోర్ట్ ఉపయోగించి ఇద్దరు పిల్లలతో కలిసి స్వదేశానికి వెళ్లివచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ కూలీలకు, బంగ్లాదేశీయులకు మధ్య ఉన్న స్వల్ప భాషా వ్యత్యాసాల ద్వారా వీరిని గుర్తించవచ్చని, అయితే భయం కారణంగా స్థానికులు సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది.భద్రతా ఆందోళనలు ఈ వ్యవహారాన్ని కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థలు అత్యంత తీవ్రమైన భద్రతా సమస్యగా పరిగణిస్తున్నాయి. దేశ వ్యతిరేక శక్తులు లేదా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కూడా ఈ నకిలీ పత్రాలను వాడుతున్నారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, పోలీసుల నిఘా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశీయులు కేరళను విడిచి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో కేరళలోని వలస కార్మికులందరి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్రమ చొరబాటుదారులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు.ఇది కూడా చదవండి: సువేందు దూకుడు.. 2,980 అక్రమ వలసదారుల ఏరివేత! -
జిమ్ ఓనర్పై బుల్లెట్ల వర్షం.. స్పాట్లోనే మృతి
హన్సి: హర్యానాలోని హన్సి జిల్లాలో ఒక జిమ్ యజమానిని గుర్తుతెలియని దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపి పారిపోయారు. కేవలం ఐదు సెకన్ల వ్యవధిలోనే పది రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఫవ్వారా చౌక్ సమీపంలో గురువారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. మృతుడిని కపిల్గా గుర్తించారు.ఆయన తన ఫిట్నెస్ సెంటర్ వెలుపల వ్యాయామం చేయిస్తున్న సమయంలో, బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. హెల్మెట్లు, మాస్కులు ధరించిన ఆ నిందితులు అత్యంత సమీపం నుండి కేవలం ఐదు సెకన్లలో 10 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో కపిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో శిఖ అనే మహిళ కూడా గాయపడగా, ఆమెను చికిత్స నిమిత్తం హిసార్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుల ఆనవాళ్లను గుర్తించేందుకు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు సైతం ఆధారాలు సేకరించాయి. ఈ కేసు దర్యాప్తును హర్యానా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ)కి అప్పగించారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నామని, అయితే ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.ఢిల్లీలో కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ కలకలంఇదిలావుండగా గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ఏరియాలో ఉన్న ఒక జిమ్ వెలుపల కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు జిమ్పై సుమారు ఏడు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఢిల్లీ దాడికి తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. -
వాహనదారులకు గుడ్ న్యూస్, ఆ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అధిక స్థాయిలో ఇథనాల్ కలిపిన పెట్రోల్కు ఎక్సైజ్ సుంకం నుండి మినహాయింపు నిచ్చింది. బధవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 22 శాతం నుండి 30 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్పై ఇకపై ఎలాంటి ఎక్సైజ్ సుంకం ఉండదు. భారతదేశ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 లక్ష్యాన్ని చేరుకునే దశలో ఇదొక కీలక అడుగు. ఈ మినహాయింపు E22, E25, E27 , E30 వంటి ఇంధన రకాలకు వర్తిస్తుంది. E20 కి పైన ఉన్న ఇథనాల్ బ్లెండ్స్కు ఇంత పెద్ద వెసులు బాటు కల్పించడం ఇదే తొలిసారి.ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్న మూడో అతిపెద్ద దేశమైన ఇండియా, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, అలాగే దేశీయంగా తయారయ్యే స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించడం తోపాటు, తన బయో ఫ్యూయల్ ప్రణాళికలను శరవేగంగా విస్తురిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా మిడిల్ ఈస్ట్ ఉద్రికత్తలు మళ్లీ రాజుకుంటున్న తరుణంలో భారతదేశం తన ముడి చమురు సరఫరా సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇథనాల్ను ఒక వ్యూహాత్మక సాధనంగా చూస్తోంది. ఈ క్రమంలోనే ఇథనాల్ కలిపిన పెట్రోల్ను, బయో డీజిల్ను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రిటైల్ అవుట్లెట్లలో అమ్మే సాధారణ పెట్రోల్కు సంబంధించి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఇదీ చదవండి: ప్రతీ ఆదివారం రెండు బిర్యానీలు ఫ్రీ : అవాక్కయ్యారా? -
CBSE లోపాల ఎపిసోడ్: జాక్పాట్ కొట్టిన కుర్రాడు
ప్రభుత్వ వెబ్సైట్ల జోలికి పోవడం నేరం. అలా ఎవరైనా వెళ్తే.. కేసులు పెడతారు. కానీ 19 ఏళ్ల కుర్రాడు మాత్రం అదే పనితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సీబీఎస్ఈ మార్కుల అప్లోడ్ పోర్టల్లో భద్రతా లోపాలను గుర్తించిన నిసర్గ అధికారి.. అటు ప్రముఖుల నుంచి, ఇటు నెటిజన్ల నుంచి శెభాష్ అనిపించుకున్నాడు. అయితే ఇప్పుడు అతనికి మరో ‘ప్రతిష్టాత్మక’ అవకాశం దక్కింది.దేశంలోని పాఠశాలలు విద్యార్థుల మార్కులను అప్లోడ్ చేసే సీబీఎస్ఈ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ మార్క్స్ (OSM) పోర్టల్లో భద్రతా లోపాలు ఉన్నాయని తొలిసారిగా గుర్తించింది 19 ఏళ్ల సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి. అయితే చాలామంది చేసేలా ఆ లోపాలను దుర్వినియోగం చేయకుండా, బాధ్యతాయుతంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సీబీఎస్ఈ డిజిటల్ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇటీవల మరోసారి సీబీఎస్ఈ డిజిటల్ వ్యవస్థలపై దృష్టి సారించిన నిసర్గ.. మరో సంచలన ప్రకటన చేశాడు. "బ్యాడ్ ఆపిల్" అనే వైరల్ యానిమేషన్ను ఒక సీబీఎస్ఈ పోర్టల్లో ప్రదర్శించగలిగానని చెబుతూ భద్రతా లోపాలను ప్రస్తావించాడు. దీంతో సైబర్ భద్రత అంశం మళ్లీ వార్తల్లో నిలిచింది.అయితే.. నిసర్గ ప్రతిభను గుర్తించిన ఐఐటీ కాన్పూర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ పరిశోధనా కేంద్రం సీ3ఐహబ్ ఆ కుర్రాడిని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్గా నియమించింది. ఒక సాధారణ సైబర్ రీసెర్చర్గా ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు దేశంలోని అగ్రశ్రేణి సైబర్ రక్షణ పరిశోధనా కేంద్రంలో ఉద్యోగంగా మారడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.C3iHub అనేది IIT కాన్పూర్లో ఉన్న ఒక ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్. ఇది క్యాంపస్ బయట కాదు.. పూర్తిగా ఐఐటీ కాన్పూర్ లోపలే పనిచేస్తుంది. కానీ ఇది సాధారణ డిపార్ట్మెంట్ ఉద్యోగం కాదు-ప్రత్యేకంగా సైబర్ దాడులు, డేటా భద్రత, హ్యాకింగ్ విధానాలు వంటి అంశాలపై పరిశోధన చేసే ప్రాజెక్ట్ కేంద్రం. అందులో పనిచేసే నిసర్గ లాంటి వారు నేరుగా క్లాస్లు లేదా టీచింగ్ డిపార్ట్మెంట్లో కాకుండా, ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ టీమ్లో ఉంటారు. వారి పని ప్రభుత్వ, బ్యాంకింగ్, రక్షణ వ్యవస్థల డిజిటల్ భద్రతను మెరుగుపరచడం, సైబర్ ముప్పులను ముందే గుర్తించడం వంటి పనులపై ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఇదొక హై-లెవల్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్/సెంటర్.జీతం ఎంతంటే..ఇలాంటి నియామకాలు పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రాజెక్ట్ ఆధారిత కాంట్రాక్ట్ పోస్టులుగా ఉంటాయి. ఐఐటీ కాన్పూర్ వంటి సంస్థల రీసెర్చ్ కేంద్రాల్లో పనిచేసే వారికి నెలవారీ స్టైపెండ్ లేదా జీతం అందుతుంది. జూనియర్ స్థాయి రీసెర్చ్/ఇంజినీర్ పోస్టులకు సాధారణంగా నెలకు సుమారు రూ.50 వేల నుంచి రూ.1,20,000 దాకా వేతనం ఉండొచ్చు. ఇది అభ్యర్థి అనుభవం, సాంకేతిక నైపుణ్యం, ప్రాజెక్ట్ ఫండింగ్పై ఆధారపడి మారుతుంది. నిసర్గ లాంటి ప్రత్యేక ప్రతిభ ఉన్నవారికి మార్కెట్ రేంజ్ కంటే మెరుగైన ప్యాకేజ్ కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన జీతం వివరాలు సాధారణంగా పబ్లిక్గా ప్రకటించరు.ఇన్స్పిరేషన్ కాదంటారా?నేటి డిజిటల్ ప్రపంచంలో సైబర్ దాడులు, డేటా చోరీలు, ర్యాన్సమ్వేర్ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో థ్రెట్ ఇంటెలిజెన్స్ నిపుణుల అవసరం కూడా గణనీయంగా పెరుగుతోంది. హ్యాకర్లు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు? భవిష్యత్తులో ఎలాంటి ముప్పులు ఎదురుకావచ్చు? అనే అంశాలను ముందుగానే గుర్తించి సంస్థలకు హెచ్చరించే బాధ్యత వీరిపై ఉంటుంది. నిసర్గ నియామకం మరో విషయాన్ని స్పష్టం చేస్తోంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో కేవలం డిగ్రీలే కాదు.. ప్రాక్టికల్ నైపుణ్యం, పరిశోధనా దృక్పథం, నైతిక విలువలు కూడా సమానంగా ప్రాధాన్యం పొందుతున్నాయి. ఒక ప్రభుత్వ పోర్టల్లో లోపాన్ని గుర్తించి బాధ్యతాయుతంగా వెల్లడించిన యువకుడు.. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్లో కీలక బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన యువతకు సైబర్ సెక్యూరిటీ రంగంలో కొత్త దిశను చూపుతోంది. -
ప్రధాని అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ 11వ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన, న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి (Governing Council)సమావేశం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు , లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అభివృద్ధి వ్యూహాలు, రాష్ట్రాల ప్రాధాన్యతలు, వికసిత్ భారత్ లక్ష్యసాధన కోసం సమ్మిళిత వృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.ఈ సమావేశంలో వెనుకబడిన జిల్లాలలో అభివృద్ధి, పీఎం ధనధాన్య కృషి యోజన పై నీతి ఆయోగ్ ఒక ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అలాగే ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్, స్కూలింగ్, స్కిల్లింగ్, హయ్యర్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ పై ప్రత్యేక చర్చ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ,హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఈ సమావేశం కోసం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్కు బయలుదేరారు. నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రులు బెంగాల్ సువేందు అధికారి, తమిళనాడు సి. జోసెఫ్ విజయ్, కర్ణాటక డి.కె. శివకుమార్, వీడీ సతీశన్ తదితరులు కూడా రాజధాని నగరానికి చేరుకున్నారు. -
సువేందు దూకుడు.. 2,980 అక్రమ వలసదారుల ఏరివేత!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణకు సంబంధించి సరికొత్త గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అక్రమ వలసదారుల ఏరివేతపై ఉక్కుపాదం మోపుతోంది. గత మార్చి నెల నుంచి ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లోని వివిధ సరిహద్దు అవుట్పోస్ట్ల ద్వారా 2,980 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను తిరిగి వారి దేశానికి పంపించివేసినట్లు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడవుతోంది.సువేందు సర్కార్ యాక్షన్ ప్లాన్పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే, అంటే మే 19 నుండి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1,930 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపారు. మే 19న ముఖ్యమంత్రి సువేందు అధికారి ‘డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్’ (గుర్తించు, తొలగించు, దేశం దాటించు) అనే కఠినమైన విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన నాటి నుండి సరిహద్దుల్లో గస్తీ, తనిఖీలు ముమ్మరమయ్యాయి.ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలుఒకవైపు సరిహద్దుల్లో ఈ విధమైన భారీ బహిష్కరణల పర్వం కొనసాగుతుండగానే, మరోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక చర్చలు జరుగుతున్నాయి. భారత్కు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ , బంగ్లాదేశ్కు చెందిన బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఢిల్లీలో సమావేశమయ్యారు. అక్రమ వలసల నిరోధంతో పాటు ఇరు దేశాల సరిహద్దుల్లో మెరుగైన సమన్వయం, పరస్పర సహకారం పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ ద్వైపాక్షిక చర్చలు సాగుతున్నాయి.రిపోర్టుతో వెల్లడైన నిజాలు‘ది ప్రింట్’ సేకరించిన సరిహద్దు భద్రతా దళాల (బీఎస్ఎఫ్) అంతర్గత వర్గాల డేటా ప్రకారం ఈ షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపూర్ బోర్డర్ అవుట్పోస్ట్తో పాటు బెంగాల్లోని పలు కీలక సరిహద్దు తనిఖీ కేంద్రాల ద్వారా ఈ వలసదారులను గుర్తించి, చట్టపరమైన ప్రక్రియల అనంతరం బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించారు. ఈ సరిహద్దు నియంత్రణ చర్యలు రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం కానున్నట్లు తెలుస్తోంది. -
ఎత్తయిన ఏనుగుపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు!
న్యూఢిల్లీ: కేరళలోనే అత్యంత ఎత్తయిన ఏనుగుగా పేరొందిన ‘రామన్’ సంరక్షణపై దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కీలక నిర్ణయం తీసుకుంది. నోరులేని మూగజీవాల సంక్షేమమే పరమావధి అని స్పష్టం చేస్తూ, రామన్ను తక్షణమే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపి, రామన్ను ఒక సరైన పునరావాస కేంద్రానికి తరలించాలని స్పష్టం చేసింది.కోర్టు ధిక్కరణ..వాణిజ్య దోపిడీ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ రామన్ ఏనుగును వాణిజ్య అవసరాలకు, ఉత్సవాలు, వివిధ ఆచారాల ఊరేగింపుల కోసం విపరీతంగా ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ, ఏనుగును నిర్బంధంలో ఉంచిన కృష్ణన్కుట్టి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ క్రమంలోనే అతనికి రూ. 2,000 జరిమానా కూడా విధించింది. నోరులేని మూగజీవాల పట్ల జరుగుతున్న ఇటువంటి ఉల్లంఘనలపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేమని, మూగ ప్రాణుల సంక్షేమం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.మాతా అమృతానందమయి మఠంతో.. జయకృష్ణ మీనన్ అనే వ్యక్తి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ఆధారంగా ఈ విచారణ జరిగింది. పిటిషనర్ వాదనల ప్రకారం.. ఈ రామన్ ఏనుగు వాస్తవానికి 'మాతా అమృతానందమయి మఠం'నకు చెందినది. దాని సంరక్షణ, నిర్వహణ బాధ్యతల కోసం మాత్రమే తాత్కాలికంగా కృష్ణన్కుట్టి అనే వ్యక్తికి అప్పగించడం జరిగింది. అయితే, కృష్ణన్కుట్టి ఒక వివాదాస్పద విలునామా (ఉయిల్), గిఫ్ట్ డీడ్స్ ఆధారంగా ఈ ఏనుగు చట్టబద్ధంగా తనకే దక్కిందని, గత 10-12 ఏళ్లుగా తానే దాన్ని నిరంతరాయంగా పోషిస్తున్నానని కోర్టుకు తెలిపాడు.కేరళ ప్రభుత్వానికి తాత్కాలిక బాధ్యతలుప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్వాధీన ఆదేశాలు కేవలం తాత్కాలికమైనవని, కోర్టు వెలువరించే తుది తీర్పునకు ఇవి లోబడి ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 లోని చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా కేరళ ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ఈ ఏనుగును తాత్కాలికంగా సంరక్షించాలని, ఇందుకు అవసరమైన పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేయవచ్చని పేర్కొంది. మరోవైపు, ఏనుగుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నించిన కేరళ రాష్ట్ర అధికారులను కోర్టు ధిక్కరణ ఆరోపణల నుండి న్యాయస్థానం విముక్తి కల్పించింది.ఇది కూడా చదవండి: ‘దీదీ’కి భారీ షాక్: ఢిల్లీలో టీఎంసీ ఆఫీస్ ఖాళీ -
ఇద్దరూ కావాలి సార్.. ఎవరినీ వదులుకోలేను!
చెన్నై : దిండుక్కల్ జిల్లాలోని వడమదురై సమీపంలో ఉన్న సెంగురిచికి చెందిన సడైయాండి (28) వెల్డర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి, సుమతి (26)కి వారి తల్లిదండ్రుల అంగీకారంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ విషయాలకు సంబంధించి భార్యాభర్తల మధ్య తరచుగా వివాదాలు జరుగుతూ ఉంటాయి. సడైయాండి ఇంటికి వచ్చినప్పుడల్లా తన సెల్ ఫోన్లో ఒంటరిగా మాట్లాడుకుంటాడు. ఇతని భార్య ఎవరితో మాట్లాడుతున్నావని అడిగినప్పుడు, అతను ఆమెను మందలిస్తాడు. ఈ విషయం ఇలాగే కొనసాగుతుండగా, సడైయాండి అకస్మాత్తుగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో సుమతి వడమదురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తు వచ్చారు. ఈ స్థితిలోసడైయాండి పుత్తూరు పిచంపట్టికి చెందిన నాగేశ్వరి (21) అనే మహిళను వివాహం చేసుకుని ఆమెతో కలిసి జీవిస్తున్నాడని వెల్లడైంది. అతను పెళ్లికానివాడిలా నటించి, ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుని ఆమెతో కలిసి జీవించడం ప్రారంభించాడు. ఈ విషయం పోలీసులు మొదటి భార్యకు తెలియజేశారు. సుమతి బంధువులు అక్కడికి వెళ్లి రెండో భార్యను వడమదురై పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అప్పగించారు. తనకు ఇద్దరు భార్యలూ కావాలని సడైయాండి కోరాడు. రెండో భార్య తాను తన భర్తతో వెళ్తానని పట్టుబట్టింది. దీంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. -
‘దీదీ’కి భారీ షాక్: ఢిల్లీలో టీఎంసీ ఆఫీస్ ఖాళీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సొంత పార్టీ ఎంపీల తిరుగుబాటుతో తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మమతా బెనర్జీకి, ఇప్పుడు హస్తినలో పార్టీ అధికారిక కార్యకలాపాలు సాగించే ప్రధాన కేంద్రం కూడా చేజారిపోయింది. బారక్పూర్ ఎంపీ పార్థా భౌమిక్ తనకు కేటాయించిన ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయడమే ఇందుకు కారణమైంది. పార్టీలో తిరుగుబాటు ముదిరిన తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.చేజారిన హస్తిన నడిబొడ్డు గత కొన్నేళ్లుగా ఢిల్లీలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రోడ్డులో ఉన్న బంగళా నంబర్ 20 తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యాలయంగా సేవలందిస్తోంది. పార్టీ కీలక సమావేశాలు, పార్లమెంటరీ వ్యూహాలు, సమన్వయ చర్చలన్నీ ఈ ప్రాంగణం నుంచే సాగేవి. అయితే, లోక్సభ సెక్రటేరియట్ 2026చ జూన్ 9న జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఎంపీ పార్థా భౌమిక్కు హుగ్లీలో ఫ్లాట్ నంబర్ 501ను రెగ్యులర్ అధికారిక నివాసంగా కేటాయించారు. భౌమిక్ స్వయంగా కోరడం వల్లే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఆయన బంగళాను ఖాళీ చేసి ఫ్లాట్కు మారుతుండటంతో, ఇకపై ఈ ప్రాంగణాన్ని పార్టీ అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం కోల్పోయినట్లయింది.నేతల నివాసాలే పార్టీ ఆఫీసులు ఢిల్లీలో సొంతంగా శాశ్వత పార్టీ కార్యాలయం లేని తృణమూల్ కాంగ్రెస్, మొదటి నుంచి సీనియర్ నేతలకు కేటాయించిన ప్రభుత్వ నివాసాలనే ఆఫీసులుగా వాడుకుంటూ వస్తోంది. గతంలో జాతీయ నాయకుడు ముకుల్ రాయ్ సౌత్ ఎవెన్యూ నివాసం పార్టీకి తొలి ప్రధాన బేస్గా ఉండేది. ఆయన నిష్క్రమణ తర్వాత ఎంపీ నదీముల్ హక్తో పాటు మరికొందరు నేతల ఇళ్లను వాడుకున్నారు. చివరికి పార్థా భౌమిక్ బంగళా పార్టీ కేంద్రంగా మారింది. జాతీయ పార్టీ హోదా ఉన్న క్రమంలో శాశ్వత కార్యాలయ నిర్మాణానికి స్థల కేటాయింపు పొందే అర్హత ఉన్నప్పటికీ, టీఎంసీ మాత్రం ఎంపీల నివాసాలపైనే ఆధారపడుతూ వస్తోంది.ముదురుతున్న తిరుగుబాటు సంక్షోభం పార్టీలో తిరుగుబాటు పరిణామాలు మమతా బెనర్జీ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారాయి. లోక్సభలో టీఎంసీకి చెందిన ఒక అసమ్మతి ఎంపీల బృందం విడిగా ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఈ ఆఫీసు సమస్య వచ్చి పడింది. ఒకవైపు పార్లమెంటరీ వింగ్లో తీవ్ర అనిశ్చితి, మరోవైపు ఢిల్లీలో కార్యాచరణ కేంద్రం చేజారడం పార్టీని మరింత ఆత్మరక్షణలో పడేసింది. ఈ తీవ్ర రాజకీయ తుఫానును తట్టుకుని, హస్తినలో సరికొత్త ఆపరేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు టీఎంసీ అధిష్టానానికి అత్యంత కీలకంగా మారింది.ఇది కూడా చదవండి: ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం -
తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య
కర్ణాటక: ఇంట్లో రివాల్వర్తో కాల్చుకుని మహిళ అనుమానాస్పద రీతిలో చనిపోయిన ఘటన చిక్కమగళూరు నగరంలోని హాళేనహళ్లిలో జరిగింది. వ్యాపారవేత్త రాజేంద్ర భార్య సుమ (55) గృహిణి. బుధవారం ఇంట్లో లైసెన్స్డ్ రివాల్వర్తో ఆమె కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు ముందు డెత్నోట్ రాసి పెట్టారు. ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త బయటకు వెళ్లాడు, కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. తుపాకీ కాల్పుల శబ్ధాలు విని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వచ్చి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.బెయిలు రద్దు అర్జీ తిరస్కృతి యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో విడుదలైన ఐదుమంది నిందితుల బెయిల్ను రద్దు చేయాలని పోలీసుల న్యాయవాది దాఖలు చేసిన అర్జీని హైకోర్టు తిరస్కరించింది. పవన్, ధనరాజు, రాఘవేంద్ర, వినయ్, నందీశ్లకు పెద్ద ఊరట కలిగింది. ఐదుగురికీ గతంలో కింది కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని ప్రాసిక్యూషన్ కోరింది. న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రాచయ్య విచారించి రద్దు చేశారు. దర్శన్ భార్యకు వేధింపులు దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి సోషల్ మీడియా ద్వారా ఆకతాయిలు వేధిస్తున్నారు. ఆమెను కించపరుస్తూ అశ్లీల మెసేజ్లు పెడుతున్నారు. భర్త జైల్లో ఉంటే ఈమె మాత్రం కార్లలో షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తోందని నానా రకాలుగా నిందిస్తున్నారు. దీంతో విసిగిపోయిన విజయలక్ష్మి బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం
భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యోగ వలసల ధోరణిలో ఒక ఊహికందని, సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంటోంది. నిన్నటివరకు మెట్రో నగరాల్లోని భారీ ప్యాకేజీలు, ఆకాశాన్ని తాకే జీతాల కోసం పరుగులు తీసిన యువ ఐటీ, కార్పొరేట్ నిపుణులు.. ఇప్పుడు రూట్ మార్చుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యం, అధిక జీవన వ్యయంతో విసిగిపోయిన యువత.. భారీ జీతాల కంటే ప్రశాంతమైన జీవితానికే (క్వాలిటీ ఆఫ్ లైఫ్) ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘అడెక్కో ఇండియా’ నిర్వహించిన ‘ఎక్స్టర్నల్ డిస్రప్షన్స్ అండ్ వర్క్ఫోర్స్ ప్రొడక్టివిటీ రిపోర్ట్ 2026’ నివేదికలో వెల్లడైన ఈ నిజాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.జీతాల కంటే ప్రశాంతతకే ఓటుభారతదేశంలో ప్రతిష్టాత్మక కంపెనీలకు, మెరుగైన కెరీర్ ఎదుగుదలకు బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తూ వచ్చాయి. అయితే ‘అడెక్కో ఇండియా 2026’ నివేదిక ప్రకారం, 35 ఏళ్లలోపు వయసున్న యువ నిపుణులలో దాదాపు 50 నుంచి 55 శాతం మంది మెట్రో నగరాల్లోని భారీ జీతాల కంటే సొంత ఊర్లకు దగ్గరగా ఉండటం, ప్రశాంతమైన జీవన ప్రమాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా, భారతదేశ ప్రతిభావంతులైన శ్రామిక శక్తి (టాప్ టాలెంట్) ఇప్పుడు మెట్రోల సరిహద్దులు దాటి చిన్న నగరాల వైపు వేగంగా విస్తరిస్తోంది.చిన్న నగరాల్లో భారీగా పెరుగుతున్న ఉద్యోగాలుఈ మార్పు తాత్కాలికమైనది కాదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని మొత్తం ఫార్మల్ హైరింగ్ (ఉద్యోగ నియామకాల) వృద్ధిలో ఏకంగా 70 శాతం చిన్న నగరాల (నాన్-మెట్రోస్) నుంచే వస్తుండగా, మెట్రో నగరాల వాటా కేవలం 30 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం భారతదేశంలోని రిమోట్ ఉద్యోగులలో 30-35 శాతం మంది టైర్-2, టైర్-3 నగరాల నుంచే పని చేస్తున్నారు. ముఖ్యంగా కోయంబత్తూర్, ఇండోర్, సూరత్, వడోదర, లక్నో వంటి నగరాలు నైపుణ్యం కలిగిన నిపుణులను, సరికొత్త ఉద్యోగ అవకాశాలను భారీగా ఆకర్షిస్తూ కొత్త హబ్లుగా అవతరిస్తున్నాయి.రంగాలవారీగా రిమోట్ ఉద్యోగాల జోరుయువత మానసిక స్థితిని అర్థం చేసుకున్న కార్పొరేట్ కంపెనీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. దాదాపు 40 శాతం సంస్థలు ఇప్పటికే ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్ను అమలు చేస్తూ, ప్రధాన నగరాల్లో పెద్ద ఆఫీసులతో పాటు చిన్న పట్టణాలలో శాటిలైట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. రంగాలవారీగా చూస్తే, టెక్నాలజీ (ఐటీ) రంగంలో రిమోట్, హైబ్రిడ్ నియామకాలు ఏడాది ప్రాతిపదికన 30 శాతం పెరిగాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో 20-25 శాతం, హెల్త్కేర్ రంగంలో 15-20శాతం, అలాగే ఈ-కామర్స్ అండ్ రిటైల్ రంగంలో 15-18 శాతం మేర హైబ్రిడ్ ఉద్యోగాలు వృద్ధి చెందాయి.వివిధ ప్రాంతాలకు శ్రామికశక్తి విస్తరణనగరాల్లో నిరంతరం తలెత్తుతున్న మౌలిక వసతుల లోపాలు, ప్రకృతి విపత్తులు ఈ వలసలను మరింత వేగవంతం చేస్తున్నాయి. దేశంలోని 97 శాతం మంది యజమానులు వాతావరణ మార్పులు, మౌలిక సదుపాయాల ఒత్తిడి, ప్రజారోగ్య సమస్యల వంటి బాహ్య అడ్డంకులను నిరంతరం ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది. కేవలం ఒకే నగరంలో కేంద్రీకృతమవ్వడం వల్ల వరదలు, రవాణా వ్యవస్థల స్తంభన వంటి సమయాల్లో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అందుకే సుమారు 95 శాతం కంపెనీలు తమ వ్యాపార కొనసాగింపు కోసం శ్రామిక శక్తిని వివిధ ప్రాంతాలకు విస్తరించడాన్ని (డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ఫోర్స్) ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయి.హైదరాబాద్, బెంగళూరులో..నగరాల్లో పెరుగుతున్న తీవ్ర ఒత్తిడి కారణంగా ఉద్యోగుల మానసిక స్థితి, ఉత్సాహం, ఉత్పాదకత దారుణంగా దెబ్బతింటున్నాయి. ఈ నివేదిక ప్రకారం, 42శాతం కంపెనీలు తమ ఉద్యోగులలో ఉత్సాహం తగ్గిందని, 40శాతం కంపెనీలు అబ్సెంటీయిజం (ఆఫీసులకు రాకపోవడం) పెరిగిందని తెలిపాయి. ఐటీ హబ్ బెంగళూరులో అత్యధికంగా 48శాతం మంది యజమానులు తమ ఉద్యోగుల మోరల్ పడిపోయినట్లు పేర్కొనగా, హైదరాబాద్ 44 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే, కాలుష్యం, వాతావరణ విపత్తుల కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో అత్యధికంగా 44 శాతం కంపెనీలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది.భవిష్యత్ వ్యూహాలు, సవాళ్లుఈ సరికొత్త పరిణామాలపై అడెక్కో ఇండియా కంట్రీ మేనేజర్ సునీల్ చేమంకోటిల్ స్పందిస్తూ, ‘భారతదేశంలోని యజమానులు కేవలం విపత్తులను నిర్వహించడం లేదు, ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన వర్క్ఫోర్స్ మార్కెట్లో రీసైలెన్స్ (స్థిరత్వం) ను తిరిగి నిర్వచిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత విపత్తు నివారణ చర్యలలో కంపెనీలు తమ సామర్థ్యానికి 10 పాయింట్లకు గానూ కేవలం 5 పాయింట్లు మాత్రమే ఇచ్చుకోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో మెట్రో నగరాల ఆర్థిక ప్రాముఖ్యత తగ్గకపోయినప్పటికీ, భారతదేశ ప్రతిభావంతుల భవిష్యత్తు మాత్రం చిన్న నగరాల వైపే నడవబోతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదీలపై కుక్కలను ఉసిగొల్పి.. -
కాంగ్రెస్లో టీఎంసీ విలీనం?.. ఇదిగో క్లారిటీ
మమత-సోనియా ఆలింగనం.. రాహుల్-అభిషేక్ చర్చలు.. ఏదైనా సంచలన ప్రకటన వెలువడబోతోందేమోనని.. గత రెండు రోజులుగా దేశ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు(చీలిక, తిరుగుబాటు.. వగైరా) చోటుచేసుకుంటున్న వేళ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోందన్న ప్రచారం తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో జరిగిన కీలక భేటీలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది.గతంలో..(ఎన్నికల టైంలో) కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్ష పోరాటానికి నాయకత్వం వహించాలని ఆమె అన్నారు. ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతో మమత భేటీ కావడం, ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం మరిన్ని సందేహాలకు తావిచ్చింది.ఈ భేటీ జరిగిన మరుసటి రోజే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమావేశమయ్యారు. దీంతో టీఎంసీ భవిష్యత్, కాంగ్రెస్తో సంబంధాలు, విలీనం అవకాశాలపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.ఇదే సమయంలో టీఎంసీలో అసంతృప్తి నేతల వర్గం పార్టీకి చెందిన 28 మంది లోక్సభ సభ్యుల్లో కనీసం 19 మంది మద్దతు తమకు ఉందని, తామే అసలైన పార్లమెంటరీ విభాగమని ప్రకటించబోతున్నారన్న వార్తలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం, వరుసగా రాజీనామాలు జరగడం కూడా మమతపై ఒత్తిడిని పెంచింది.ముఖ్యంగా రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం మరో షాక్గా మారింది. అంతకుముందు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీని వీడారు. సుష్మితా దేవ్ ఢిల్లీలో హిమంత బిశ్వ శర్మను కలవడం ఆమె బీజేపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలకు దారితీసింది. అయితే దీనిపై ఆమె స్పష్టత ఇవ్వకుండా, సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని మాత్రమే చెప్పారు.ఇక ఈ పరిణామాల వేళ.. ఢిల్లీలో టీఎంసీ నేతల కదలికల నేపథ్యంలో ‘విలీనం’ వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా శివసేన(ఉద్దవ్ వర్గం) కీలక నేత సంజయ్ రౌత్.. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయిన టీఎంసీ, ఎన్సీపీ (ఎస్పీ) వంటి పార్టీలు తిరిగి కాంగ్రెస్లో కలవాలని వ్యాఖ్యానించడం చర్చకు మరింత ఊతమిచ్చింది.అయితే ఈ ప్రచారానికి టీఎంసీ పుల్స్టాప్ పెట్టింది. కాంగ్రెస్తో విలీనం గురించి ఎలాంటి ప్రతిపాదన లేదని, అలాంటి అంశం ఏ సమావేశంలోనూ చర్చకు రాలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అసలీ పుకార్లు ఎలా పుట్టాయో తమకు అర్థం కావడం లేదని అంటోంది. ఇటు కాంగ్రెస్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. మమత-సోనియా, రాహుల్-అభిషేక్ భేటీల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష వ్యూహాలు, ఇండియా కూటమి బలోపేతం, 2029 లోక్సభ ఎన్నికల సన్నాహకాల గురించే చర్చ జరిగిందని పేర్కొన్నాయి.రెండు రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిన విలీనం ప్రచారానికి చివరకు టీఎంసీ స్పందిస్తూ.. "అది పూర్తిగా పుకారు మాత్రమే.. విలీనం అంశంపై అసలు ఎలాంటి చర్చా జరగలేదు" అని తేల్చిచెప్పింది. -
నేడు కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ గురువారం కీలక అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం ‘ఇందిరా భవన్’లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సారథ్యంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జ్లు, పీసీసీ అధ్యక్షులు హాజరవుతారని జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతి కంటే ప్రజలకు జరిగిన నష్టమే ఎక్కువని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఆ అంశాలను చార్జ్ షీట్ రూపంలో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. యువత ఉపాధి అవకాశాలను కోల్పోవడం, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జాప్యంపై దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అంశం సైతం గురువారం నాటి సమావేవంలో చర్చకురానుంది. -
ఆర్ఓ నిర్ణయాన్ని రద్దు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను రిటరి్నంగ్ అధికారి(ఆర్ఓ) తిరస్కరించడాన్ని ఆ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్ఓ నిర్ణయం చట్టవిరుద్ధం అప్రజాస్వామికమని తేల్చిచెప్పింది. నామినేషన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేసింది. కేసీ వేణుగోపాల్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ తంఖా, రణదీప్ సూర్జేవాలా, దీపాదాస్ మున్షీ, భూపేశ్ బఘేల్ల బృందం ఈసీని కలిసి తమ వాదనను విన్పించింది. అనంతరం అభిషేక్ సింఘ్వీ మీడియాతో మాట్లాడారు. ‘‘మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు ఆర్ఓ చూపిన కారణాలకు చట్టపరమైన ఆధారాలు లేవు. ఏదైనా క్రిమినల్ కేసులో నేరాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అది కేసుగా మారుతుందన్న ప్రాథమిక న్యాయ సూత్రాన్ని రిటర్నింగ్ అధికారి విస్మరించారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఓ ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కేసును ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ కోర్టు కేవలం నోటీసు మాత్రమే ఇచ్చింది. మేజిస్ట్రేట్ దీనిపై నిర్ణయం తీసుకోనంత వరకు అది క్రిమినల్ కేసుగా లెక్కలోకి రాదు’’ అని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద కేంద్ర ఎన్నికల సంఘానికి విశేషాధికారాలు ఉన్నాయని కాంగ్రెస్ బృందం వెల్లడించింది. అభ్యర్థికి న్యాయం చేసేందుకు ఆర్ఓ నిర్ణయాన్ని రివర్స్ చేసే అధికారం ఈసీకి ఉందని గుర్తుచేసింది. -
మరో వాణిజ్యనౌకపై అమెరికా దాడి
న్యూఢిల్లీ: ఒమన్లోని సోహర్ నగరానికి సమీప హార్మూజ్ జలసంధి సముద్రజలాల్లో వాణిజ్య నౌక ‘ఎంటీ సెటెబెల్లో’పై బుధవారం అమెరికా సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. అంతే సంఖ్యలో భారతీయులున్న మరో చమురు రవాణా నౌక ‘ఎంటీ మ్యారీవెక్స్’పై అమెరికా రెండ్రోజుల క్రితం దాడి చేయడంపై భారత్ ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న వేళ ‘ఎంటీ సెటెబెల్లో’ నౌకపై దాడి జరగడం గమనార్హం. దాడి ఘటనపై భారత్ బుధవారం ఘాటుగా స్పందించింది. ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్డి అఫైర్స్ జేసన్ మీక్స్ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత్ అధికారిక ప్రకటన వెలువర్చింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని మోదీ సర్కార్ తప్పుబట్టింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇకనైనా ఆపాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ జలమార్గాలల్లో స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని పేర్కొంది. సెటెబెల్లో నౌకలోని 24 మంది భారతీయ సిబ్బందిలో ఇప్పటివరకు 21 మందిని రక్షించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోందని వార్తలొచ్చాయి. -
ఆయన దేశానికి గుదిబండ
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన ఘనతపై బీజేపీ గొప్పలు చెప్పుకుంటోందని కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని మోదీ సాధించింది మైలురాయి కాదని, ఆయన ఈ దేశం మెడకు చుట్టుకున్న గుదిబండ అంటూ విరుచుకుపడింది. ‘సుదీర్ఘకాల ప్రధాని అంటూ ఒక్కరే ఉంటారు. ఎన్నికల ద్వారా, ఎన్నికలు కాకుండా అంటూ రెండు రకాల నిర్వచనాలు ఉండవు. కానీ స్వీయ ప్రకటిత, కొత్తగా సృష్టించిన ‘సుదీర్ఘకాలం పాలించిన ప్రధాని’ అనే మైలురాయిని మోదీ మెడకు తగిలించుకున్నారు. అది మైలురాయికాదు దేశం మెడకు చుట్టుకున్న మోయలేని గుదిబండ’’ అని కాంగ్రెస్ ఎద్దేవాచేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జై రామ్ రమేశ్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్చేశాశారు. ‘‘1947 ఆగస్ట్ 15న స్వతంత్రభారతంలోని దిగ్గజ నేతల సమ్మతితో, నాడు కొలువుదీరిన కేబినెట్కు సారథ్యం వహిస్తూ జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న ప్రధానిగా సేవలు ఆరంభించారు. 1947 నుంచి 1952 దాకా ప్రధానిగా నెహ్రూ హయాంలో భారత్ ఎన్నో ఘనతలు సాధించింది. అంతటికీలక సమయం లెక్కలోకి రాదన్నట్లు నేడు మోదీ వ్యవహరిస్తూ చరిత్రను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. 1952 తర్వాత పాలనే నెహ్రూ ప్రధానిగా లెక్కలోకి వస్తుందని మోదీ కొత్త భాష్యం చెబుతున్నారు. ఇది ఆయన సంకుచిత ఆలోచనకు ప్రబల నిదర్శనం’’ అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ట మసకబారింది’’ అని జైరాం ఆరోపించారు.నెహ్రూతో మోదీని పోల్చలేం: పవార్ మోదీకి సరితూగగల నేత ఎవరూ లేరు అని బీజేపీ చెప్పుకోవడాన్ని ఎన్సీపీ(ఎస్పీ) పార్టీ చీఫ్ శరద్ పవార్ తప్పుబట్టారు. దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో మోదీని పోల్చడం సరికాదని ఆయన తెలిపారు. నెహ్రూ దేశానికి అందించిన అద్వితీయమైన సేవలను ఎన్నటికీ మర్చిపోజాలమని పేర్కొన్నారు. ‘నెహ్రూను మరెవరితోనూ పోల్చలేం. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ ఎన్నో ఏళ్లపాటు జైలు జీవితం గడిపారు’అని పేర్కొన్నారు. -
మోదీ పాలన ప్రశంసనీయం
న్యూఢిల్లీ: స్వతంత్ర భారతదేశంలో ఎన్నికల ద్వారా ఎన్నికై సుదీర్ఘకాలం నిరాటంకంగా ప్రధానమంత్రిగా పనిచేసిన నాయకుడిగా జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధిగమించారు. బుధవారం నాటికి ప్రధానిగా మోదీ 4,399 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. సరికొత్త మైలురాయికి చేరుకున్న మోదీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచాధినేతలు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ పాలన పుష్కరకాలాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మోదీకి అభినందనలు తెలియజేస్తూ ఏకగీవ్రంగా తీర్మానాన్ని ఆమోదించారు. దేశ ప్రజలకు ప్రధానమంత్రి అందించిన సేవలను ప్రశంసిస్తూ మంత్రులందరూ కరతాళ ధ్వనులతో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సమ్మిళిత వృద్ధి, సామాజిక న్యాయం దిశగా మోదీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో దీనిని ఒక చరిత్రాత్మక మైలురాయిగా మంత్రివర్గం అభివర్ణించింది. మోదీని కొనియాడుతూ రాష్ట్రపతి ముర్ము మోదీకి లేఖ రాశారు. ప్రధానిగా మోదీ సుదీర్ఘకాలం కొనసాగడం ప్రజల ఆదరాభిమానాలకు నిదర్శమని, దేశ చరిత్రలో ఇది కనీవినీ ఎరుగని ఘట్టమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బిహార్ సీఎం సమ్రాట్ చౌదరీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఒడిశా సీఎం మోహన్చరణ్ మాఝీ, హరియాణా సీఎం నాయబ్ సైనీ తదితరులు మోదీకి అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి కార్యాలయం సైతం మోదీకి శుభాకాంక్షలు తెలిపింది. ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోని, మాల్దీవుల అధ్యక్షుడు మోహమ్మద్ మెయిజ్జూ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీమ్, భూటాన్ ప్రధాని త్సారింగ్ టోబ్గే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ హయాంలో సర్వతోముఖాభివృద్ధి ఎన్డీఏ భేటీలో ప్రధానిని ప్రశంసించిన కూటమి పార్టీల అగ్రనేతలు బుధవారం ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే కూటమి సమావేశమైంది. 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సైతం ఈ కీలక ఎన్డీఏ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి పార్టీల అగ్రనేతలు మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని ఉద్ఘాటించారు. మోదీ సేవలను కొనియాడుతూ ఒక తీర్మానం ఆమోదించారు. ఎన్డీయే పక్షాల సదస్సులో బెంగాలీ ప్రముఖ అల్పాహారమైన ఝాల్మురీని ప్రధాని∙మోదీ రుచి చూశారు. -
కాంగ్రెస్ వైఫల్యాలకు హిందువులపై నిందలు
న్యూఢిల్లీ: దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతి పాలైందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. విధానపరమైన, పాలనాపరమైన వైఫల్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాన్ని నిస్సహాయతలోకి నెట్టేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో భారతదేశం తక్కువ వృద్ధి రేటు నమోదు చేసిన కాలాన్ని ‘హిందూ వృద్ధి రేటు’గా తప్పుగా అభివర్ణిచారని ఆక్షేపించారు. వాస్తవానికి దానిని ‘కాంగ్రెస్ వృద్ధి రేటు’గా అని పిలవాలని అన్నారు. దేశంలో అభివృద్ధి నెమ్మదిగా జరుగుతుందని, ఇక్కడ వేగవంతమైన ప్రగతి సాధ్యం కాదని ప్రజలు భావించేలా చేశారని మండిపడ్డారు. విధానపరమైన వైఫల్యాల నిందలను హిందువులపై అన్యాయంగా మోపారని, కాంగ్రెస్ను కాపాడే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆ పార్టీ రూ.వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వ్యవస్థలూ కుప్పకూలాయని చిప్పులు చెరిగారు. కాంగ్రెస్ వారసత్వ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించడం ఎన్డీయే ప్రభుత్వ అతిపెద్ద విజయాలలో ఒకటి అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఇనుప సంకెళ్ల నుంచి దేశాన్ని రక్షించామని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో ఎన్డీయే పక్షాల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాజకీయ స్థిరత్వం, స్పష్టమైన సంకల్పంతో భారీ స్థాయిలో అభివృద్ధిని సాధించవచ్చని ఎన్డీయే ప్రభుత్వం నిరూపించిందని అన్నారు. 2014లో తమ ప్రభుత్వం వచి్చనప్పుడు సామాన్య పౌరుడికి ఒక కొత్త ఆశ చిగురించిందని చెప్పానని గుర్తుచేశారు. కాంగ్రెస్ ద్రోహం తర్వాత దేశ ప్రజలు తమపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేశారని తెలిపారు. 12 ఏళ్లలో తమ కూటమి ఆ విశ్వాసాన్ని మరింత బలపరిచిందని వ్యాఖ్యానించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజలే నాకు దేవుళ్లు ‘‘అవినీతికి తావులేని పాలన అందిస్తున్నాం. ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది నిజంగా నా దృష్టిలో అద్భుతమైన క్షణం. ప్రజలే నాకు దేవుళ్లు. అధికారాన్ని సేవగానే ఎల్లప్పుడూ భావించాం. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. గతంలో దశాబ్దాలపాటు జరిగే అభివృద్ధి మేము అధికారంలోకి వచ్చాక కేవలం నెలల వ్యవధిలోనే జరుగుతోంది. స్థిరమైన పాలనతో అభివృద్ధి వేగం పుంజుకుంది. 2014కి ముందు దేశంలో అస్థిరత ఉండేది. 2014 తర్వాత దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం. మా పథకాలు, కార్యక్రమాలను ప్రజలు ఆదరించడం సంతోషంగా ఉంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములే. మా పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి చెందారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 25 కోట్ల నుంచి 100 కోట్లకు చేరింది. ప్రభుత్వ విధానాలు సరైన దిశలో సాగుతున్నాయనడానికి చెప్పడానికి ఇదొక తార్కాణం. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని అన్నారు.ఉగ్ర దాడులపై దేశం మౌనంగా ఉండదు సామాన్యులపై భారం తగ్గించాలన్నదే మా సంకల్పం. పన్ను మినహాయింపులు, పాలనాపరమైన సంస్కరణలతో సహా మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించాం. ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చాం. నేడు దేశం సరళమైన పన్ను విధానంతో ప్రయోజనం పొందుతోంది. దేశమే ప్రథమం(నేషన్ ఫస్ట్) అనే నినాదంతో పనిచేస్తున్నాం. దేశంలో మావోయిస్టుల సమస్యను అంతం చేశాం. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని నెలకొల్పాం. ఇలాంటి నిర్ణయాలను తీసుకొనే సాహసాన్ని గత ప్రభుత్వాలు చేయలేకపోయాయి. ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్తున్నాం. సర్జికల్ దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలతో మన సంకల్పాన్ని, బలాన్ని ప్రదర్శించాం’’ అని అన్నారు.విదేశాలపై ఆధార పడొద్దు నా దృష్టిలో పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యం. దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం వచ్చింది. నేడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ‘2047 నాటికి వికసిత్ భారత్’ మన లక్ష్యం. అందుకోసం మరింత వేగంగా, క్రియాశీలకంగా పని చేయాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ సంకల్పం సాకారమవుతుండడం ఆనందంగా ఉంది. మన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిందే. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకలు తయారు చేస్తున్నాం. సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో భారతదేశం స్వావలంబన సాధిస్తోంది. అదే సమయంలో జాతీయ భద్రత, ఆర్థిక సంస్కరణలపై కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తోంది. మన ఆర్థిక, వ్యూహాత్మక భద్రతతో ముడిపడి ఉన్న అంశాల్లో విదేశాలపై ఆధారపడకూడదు. 2014లో ఉదయించిన ఆశాకిరణం నేడు నూతన ఆత్మవిశ్వాసపు కాంతిరేఖగా మారింది’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. తనను సత్కరించినందుకు ఎన్డీయే మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం వ్యక్తిగతంగా తనది మాత్రమే కాదని, మొత్తం కూటమికి, బీజేపీ కార్యకర్తలందరికీ చెందుతుందని వివరించారు. ఇది తన వ్యక్తిగత విజయంగా కాకుండా.. తమ సమిష్టి కృషికి నిదర్శనంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సుదీర్ఘ పదవీకాలాన్ని ఒక గొప్ప గౌరవంగా అభివర్ణిచారు. దేశ సేవ ఎల్లప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధన వంటిదని అన్నారు. -
తేనెటీగలు,రొయ్యలకూ 'వ్యాక్సిన్లు'!
సాక్షి స్పెషల్ డెస్క్: మానవులు, పశువులు, పక్షుల లాగే ఇప్పుడు తేనెటీగలు, రొయ్యలకు కూడా ప్రత్యేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అమెరికా, కెనడా దేశాల్లో బయోటెక్నాలజీ రంగంలో ఈ దిశగా జరిగిన పరిశోధనలు అద్భుతమైన ఫలితాలను సాధించాయి. తేనెటీగలు ‘అమెరికన్ ఫౌల్ బ్రూడ్’ను తట్టుకునేలా.. తేనెటీగలు, రొయ్యలకు ఇంజెక్షన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, శాస్త్రవేత్తలు ’మెటర్నల్ ఇమ్యూన్ ప్రైమింగ్’అనే ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. తేనెటీగల కోసం మృత బ్యాక్టీరియాతో తయారు చేసిన వ్యాక్సిన్ను చక్కెర పాకంతో కలిపి రాణి ఈగకు ఆహారంగా ఇస్తారు. రాణి ఈగ శరీరంలోని రోగనిరోధక కణాలు ఈ మందును అండాలకు అందిస్తాయి. దీనివల్ల పుట్టబోయే పిల్ల ఈగలకు పుట్టుకతోనే ‘అమెరికన్ ఫౌల్ బ్రూడ్’అనే వ్యాధిని తట్టుకునే శక్తి లభిస్తుంది. రొయ్యలకు ’వైట్ స్పాట్ వైరస్’సోకకుండా.. హేచరీలోని తల్లి రొయ్యలకు వ్యాక్సిన్ను ప్రత్యేక గుళికల రూపంలో మేతగా ఇస్తారు. వ్యాక్సిన్ ద్వారా చేకూరే వ్యాధి నిరోధక శక్తి గుడ్లకు తద్వారా పిల్ల రొయ్యలకు అందుతుంది. ఫలితంగా అవి ’వైట్ స్పాట్ వైరస్’బారిన పడకుండా పెరుగుతాయి. ఇదిలా ఉంటే, ముంబైలోని ఐసీఏఆర్కు చెందిన కేంద్రీయ మత్స్య విద్యా సంస్థ (సీఐఎఫ్ఈ) శాస్త్రవేత్తలు రొయ్యల వైట్ స్పాట్ వైరస్ నివారణకు ఒక స్వదేశీ వ్యాక్సిన్ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ట్నర్షిప్ మోడ్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇది ప్రస్తుతం చివరి దశ పరీక్షల్లో ఉంది. 2027 చివరి నాటికి మన ఆక్వా రైతులకు వ్యాక్సిన్ వేసిన రొయ్య పిల్లలు (సీడ్) అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రధాన ప్రయోజనాలుప్రపంచవ్యాప్తంగా పంటల పరాగ సంపర్కానికి తేనెటీగలు, ప్రొటీన్ ఆహారంగా రొయ్యలు చాలా కీలకం. ఈ వ్యాక్సిన్ల వల్ల రొయ్యలు, తేనెటీగలలో వ్యాధుల నివారణకు వాడే రసాయనాలు, యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుంది.పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలుజరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
యూసుఫ్ పఠాన్, శత్రుఘ్న సిన్హా సహా 19 మంది ఎంపీలు ఎన్డీఏ వైపు
కోల్కతా: టీఎంసీ ఎంపీలు యూసుఫ్ పఠాన్, శత్రుఘ్న సిన్హా, కాకోలి ఘోష్ దస్తిదార్, సయోనీ ఘోష్ సహా 19 మంది లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ సమర్పించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామన్న తమ నిర్ణయాన్ని అందులో వెల్లడించినట్టు సమాచారం.కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో రెబెల్ ఎంపీలు ప్రత్యేక పార్లమెంటరీ వర్గాన్ని ఏర్పాటు చేసి, ఎన్డీఏకు మద్దతు ప్రకటించినట్టు జాతీయ మీడియా తెలిపింది. ఈ వారం ప్రారంభంలో టీఎంసీ సంస్థాగత సంక్షోభం బయటపడింది. తొలుత పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రారంభమైన తిరుగుబాటు ఇప్పుడు పార్లమెంట్ వరకు విస్తరించింది.అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీలు మమతా బెనర్జీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. 1998లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఇంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు. అంతర్గత అసంతృప్తిగా మొదలైన వ్యవహారం ఇప్పుడు ఎమ్మెల్యేల, ఎంపీల సంఖ్యాబలం, సంస్థాగత నియంత్రణ, రాజకీయ చట్టబద్ధతపై పోరాటంగా మారింది.శాసనసభలో మొదలైన చీలిక పార్లమెంట్ వరకు విస్తరించింది. సీనియర్ రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్ తమ రాజ్యసభ సభ్యత్వాలకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.తిరుగుబాటు శిబిరంలో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలుశత్రుఘ్న సిన్హా (ఆసన్సోల్)కాకోలి ఘోష్ దస్తిదార్ (బరాసత్)జగదీశ్ చంద్ర బసునియా (కూచ్ బెహార్)ఖలీ ఉర్ రెహ్మాన్ (జంగీపూర్)యూసుఫ్ పఠాన్ (బెహ్రంపూర్)అబూ తాహిర్ ఖాన్ (ముర్షిదాబాద్)పార్థ భౌమిక్ (బారక్పూర్)బాపి హల్దార్ (మథురాపూర్)సాయోని ఘోష్ (జాదవ్పూర్)మాలా రాయ్ (కోల్కతా దక్షిణ)మితాలి బాగ్ (ఆరాంబాగ్)దీపక్ అధికారి (ఘటాల్)కాలీపద సోరెన్ (ఝార్గ్రామ్)జూన్ మాలియా (మెదినీపూర్)అరూప్ చక్రవర్తి (బాంకురా)షర్మిలా సర్కార్ (వర్ధమాన్ తూర్పు)అసిత్ కుమార్ మాల్ (బోల్పూర్)శతాబ్ది రాయ్ (బీర్భూమ్)రచనా బెనర్జీ (హుగ్లీ) -
సన్నిహితురాలి నుంచి తిరుగుబాటు వరకు..!
బెంగాల్ రాజకీయాలు ఫాలో అయ్యే వారికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సయోనీ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని ఎవరైనా ఒక్క మాట అంటే సివంగిలా విరుచుకుపడే సయాని తాజాగా సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. తిరుగుబాటు ఎంపీలతో చేతులు కలిపి మమతను ఒంటరి చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నటికీ మమత వెంటే ఉంటానని కొద్ది రోజుల క్రితమే బాస చేసిన సయాని ఇంతలోనే మనసు మార్చుకున్నారు. కష్టకాలంలో అధినేత్రిని ఒంటరి చేసి తన దారి తను చూసుకున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు సలాం కొట్టారు!మొన్న ముగిసిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సయోనీ ఘోష్ (Saayoni Ghosh) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తృణమూల్ కాంగ్రెస్ తరపున రాష్ట్రమంతా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నటి, గాయని అయిన ఆమె తన వాగ్దాటి, మేనరిజంతో ప్రజలను ఆకట్టుకున్నారు. దీంతో ఆమె సభలకు జనం పోటెత్తారు. మమతా బెనర్జీ కూడా ఆమెను ఎంతో ప్రోత్సహించారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షురాలి పదవి కట్టబెట్టి నెత్తిన పెట్టుకున్నారు. జాదవ్పూర్ నుంచి లోక్సభకు పంపి అక్కున చేర్చుకున్నారు. సయాని కూడా పార్టీకి ఎంతో విధేయంగా ఉంటూ మమత నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ప్రత్యర్థులపై పదునైన మాటలతో విరుచుకుపడుతూ పార్టీలో కీలకంగా మారారు. పార్లమెంట్ సమావేశాల్లో సమయం దొరికినప్పుల్లా తన వాగ్ధాటితో ఎన్డీఏ సర్కారును ఏకీపారేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు.పరిస్థితి తారుమారుమమతా బెనర్జీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నట్టుగా ఒకాకొక సందర్భంలో ప్రకటించారు. మమత పీఎం అయితే ఆమె బెంగాల్ సీఎం అవుతారు అన్నంతగా ప్రచారం సాగింది. ఇదంతా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోని ముచ్చట. ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. మమతా బెనర్జీ కోట బద్దలయింది.. బీజేపీ అధికారంలోకి వచ్చింది. అధికారం పోవడం కాదు ఏకంగా పార్టీయే మమతా బెనర్జీ చేతుల్లోంచి జారిపోయే పరిస్థితులు తలెత్తాయి. ముందుగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే, తాజాగా ఎంపీలు.. మమతకు చేయిచ్చారు. ఎన్డీఏకు మద్దతుగా లోక్సభ స్పీకర్కు ఇచ్చిన లేఖలో సంతకాలు చేసిన 20 మంది తృణమూల్ రెబల్ ఎంపీల్లో సయోనీ ఘోష్ ఉన్నారన్న సంగతి తాజాగా వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.అప్పుడలా.. ఇప్పుడిలా..తాను ఎన్నటికీ బీజేపీ పంచన చేరనంటూ రాఘవ్ చద్దా పార్టీ మారిన సందర్భంలో వ్యాఖ్యానించిన సయోనీ ఘోష్.. ఇప్పుడిలా ప్లేటు ఫిరాయించడం సంచలనంగా మారింది. బీజేపీ దగ్గర వేల కోట్ల డబ్బు, ఈడీ, సీబీఐ, అధికారం ఉంటే.. తమకు అండగా హవాయి చెప్పులు, తెల్లచీర ధరించిన మమతా బెనర్జీ ఉన్నారని.. ఆ సమయంలో సయోనీ చేసిన వ్యాఖ్యలను జనం గుర్తు చేసుకుంటూ ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు అలా మాట్లాడిన ఆమె.. ఇంతలోనే ఎలా ఎన్డీఏకు ఎలా జై కొడుతుందని చర్చించుకుంటున్నారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా మెలిగిన సయోనీ ఘోష్.. తిరుగుబాటు ఎంపీలతో చేతులు కలుపుతారని అస్సలు ఊహించలేదని జనం అంటున్నారు. ఎన్నికల్లో తేడా కొడితే ముందుగా జంప్ అయ్యేది ఈలాంటి వారే అంటూ సోషల్ మీడియాలో ఆమెపై కొంతమంది చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.కొసమెరుపు: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సయోనీ ఘోష్. "మేము ఓడిపోలేదు. ఓట్ల దోపిడీ వల్ల మమతా బెనర్జీ ఓడిపోయారు. 2029లో దేశ ప్రజలు, 2031లో బెంగాల్ ప్రజలు తగిన సమాధానం ఇస్తారు'' అంటూ వ్యాఖ్యానించారు. అలాగే మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా భావించే ఎంపీ మాలా రాయ్ కూడా రెబల్ శిబిరంలో చేరిపోయారు. -
ఎద్దు లేదని భార్యనే నాగలికి కట్టిన రైతు.. సీఎం స్పందించి..
ముంబై: ఎద్దు స్థానంలో భార్యను ఉంచి నాగలి లాగుతున్న ఓ రైతు వీడియో ఇటీవల వైరల్ అయింది. ఇటీవల అకాల వర్షాల సమయంలో పిడుగు పడి ఒక ఎద్దు చనిపోవడంతో రైతు కాశీనాథ్ గైక్వాడ్ తన భార్య హౌసాబాయిని నాగలి లాగేందుకు ఎద్దు స్థానంలో ఉపయోగించిన దృశ్యాలు కనిపించాయి. కొత్త ఎద్దును కొనుగోలు చేసే స్తోమత లేకపోవడం, కీలకమైన విత్తనాల సీజన్ కోల్పోతామనే భయంతో ఆ దంపతులు కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేయడం కొనసాగించేందుకు ఈ సాహసం చేశారు.మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లా, దేవోని తహసీల్ పరిధిలోని బోంబ్లీ ఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీని గురించి తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెంటనే లాతూర్ జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి కుటుంబ పరిస్థితిపై సమగ్ర నివేదిక కోరారు. రైతుకు ఆలస్యం లేకుండా ప్రత్యామ్నాయ ఎద్దు అందించాలని, అత్యవసర సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి జోక్యం తర్వాత జిల్లా యంత్రాంగం స్థానిక గోశాల నుంచి ఒక ఎద్దును వెంటనే ఏర్పాటు చేసింది. దీంతో ఆ కుటుంబానికి తక్షణ ఉపశమనం లభించింది. కాశీనాథ్, హౌసాబాయి గైక్వాడ్ దంపతులు ఎన్నో ఏళ్లుగా పంటలో వాటా పద్ధతిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం వారు ఒక జత ఎద్దులను కొనుగోలు చేసేందుకు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే ఇటీవల తుపాను సమయంలో పిడుగు పడి ఒక ఎద్దు చనిపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. మరో ఎద్దు కొనుగోలు చేసే స్థితిలో లేకపోయింది.జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎద్దు మరణంపై అధికారిక అంచనా ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబానికి త్వరలో రూ.32,000 పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.పరిహార ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వేగంగా స్పందించడం, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవడం పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. సంక్షోభ సమయంలో ఇబ్బందులు పడుతున్న రైతు కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వ సున్నిత వైఖరి, తక్షణ చర్యలను లాతూర్ ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నేరుగా డబ్బు ఇచ్చి కొత్త ఎద్దు కొనుగోలు చేయకపోయినా ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత పశుసంవర్ధక శాఖ ప్రత్యామ్నాయంగా ఎద్దును ఏర్పాటు చేసి గైక్వాడ్ కుటుంబానికి అప్పగించింది. -
నేను భావోద్వేగానికి లోనయ్యాను: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ అధ్యక్షతన భారత మండపంలో బుధవారం ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరిపారు.ఇందులో మోదీ మాట్లాడుతూ... ‘‘నా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. నా జీవితంలో ఇదో అద్భుతమైన క్షణం. ఈ రోజు ఈ ప్రయాణంలో భాగమైన సహచరులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇది మీ ఆప్యాయతను, ఉదారతను ప్రతిబింబిస్తోంది. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని నేను వ్యక్తిగత విజయంగా చూడను. ప్రతి విధంగానూ ఇది మనందరి విజయం, ఎన్డీఏలోని ప్రతి భాగస్వామ్య పార్టీ సాధించిన ఉమ్మడి విజయం. అందువల్ల ఈ తీర్మానాన్ని మీ అందరికీ, మన ఎన్డీఏ కుటుంబంలోని ప్రతి కార్యకర్తకు అంకితం చేస్తున్నాను. భారతమాతకు ఇంత సుదీర్ఘ కాలం సేవ చేసే అవకాశం లభించడం, ఆమెకు సేవ చేసే భాగ్యం దక్కడం దేవుని ప్రత్యేక కృప వల్లే సాధ్యం. నా దృష్టిలో ప్రజలే దైవ స్వరూపం. అందుకే ఈ సేవను నేను ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధనగా చూశాను. ఈ ఆధ్యాత్మిక సాధన ఎప్పుడూ ఒంటరిది కాదు. ఇది ఒక సామూహిక యజ్ఞం. ఇందులో మీరందరూ, ఇంకా ఎంతోమంది సహచరులు కర్తవ్య భావనతో తమ సేవలు అందించారు. మీ అందరూ ఈ రోజును నాకు నిజంగా చిరస్మరణీయంగా మార్చారు. నేను భావోద్వేగానికి లోనయ్యాను. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 'చరైవేతి, చరైవేతి' అనే మంత్రాన్ని జపిస్తూ, ఈ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ వచ్చిన నేను, ఈ మైలురాయిని ఒక రోజు చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. నిరంతరంగా ఎన్నికైన ప్రధానిగా అత్యంత సుదీర్ఘ కాలం సేవ చేసే అవకాశం దక్కడం నా అత్యున్నత భాగ్యంగా భావిస్తున్నాను" అని తెలిపారు. చరైవేతి, చరైవేతి అంటే నిరంతరం ముందుకు సాగాలని చెప్పే ప్రాచీన సంస్కృత మంత్రం.దేశ అవసరాలే మా విధానాలకు పునాది ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని మోదీ తెలిపారు. "2014లో భారతదేశానికి అవసరమైన మొబైల్ ఫోన్లలో అధిక భాగం దిగుమతుల ద్వారానే వచ్చేవి. ఈ రోజు భారతదేశం దేశీయంగా 330 మిలియన్లకు పైగా మొబైల్ హ్యాండ్సెట్లను తయారు చేస్తోంది. 2014లో సౌర విద్యుత్ సామర్థ్యం కేవలం 2.5 గిగావాట్లు మాత్రమే ఉండేది. ఈ రోజు అది 150 గిగావాట్లను దాటింది. 2014లో ఇథనాల్ మిశ్రమం కేవలం 1.5% మాత్రమే ఉండేది. ఈ రోజు అది 20%కు చేరుకుంది. 2014లో దేశంలో ఒక్క సెమీకండక్టర్ యూనిట్ కూడా లేదు. ఈ రోజు నిర్మాణంలో ఉన్న 10కుపైగా సెమీకండక్టర్ యూనిట్లు భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపిస్తున్నాయి.దేశ అవసరాలనే మా విధానాలకు, నిర్ణయాలకు పునాదిగా చేసుకున్నాం. కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు కొత్త ఆలోచనా విధానాన్ని స్వీకరించాం. యువత కోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను సృష్టించాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక మత్స్యశాఖ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. దివ్యాంగుల కోసం చట్టాన్ని తీసుకొచ్చాం. గిరిజన సమాజాల కోసం 'జనమన్' వంటి పథకాలను ప్రారంభించాం. ఇంతకుముందు పశుపోషకులు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డు ప్రయోజనం అందేది కాదు. ఆ సౌకర్యాన్ని వారికి కూడా విస్తరించాం. అంతేకాకుండా, వీధి వ్యాపారులకు మా ప్రభుత్వం 'స్వనిధి' రుణ కార్డు సౌకర్యాన్ని అందించింది..." అని మోదీ తెలిపారు. -
తమిళనాడు నుంచి దుబాయికి బస్సు టికెట్
చెన్నై: తమిళనాడులో ఓ కండక్టర్ ఇచ్చిన టికెట్ ప్రయాణికున్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. తన సమీపంలోని ఊరికి వెళ్లాలని ప్రయాణికుడు సదరు కండక్టర్ని టికెట్ అడిగారు. దానికి సరే అని తలూపిన కండక్టర్ టికెట్ ఇచ్చారు. తీరా టికెట్ చూస్తే అందులో వేరే దేశానికి టికెట్ ఉంది. అంతే కాకుండా దాని ఖరీదు రూ. 10 వేలుగా ఉంది.అసలేం జరిగిందంటే?దామోదరన్ అనే వ్యక్తితో పాటు అతని స్నేహితుడు కలిసి బెంగళూరు వెళ్తున్న తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ఎక్కారు. వారు తమిళనాడులోని హుసూరు ప్రాంతానికి వెళ్లడానికి టికెట్ అడిగారు. దీంతో కండక్టర్ టికెట్ ఇచ్చారు. అయితే, కండక్టర్ తన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్ ద్వారా ప్రింట్ తీసి ఇచ్చిన టికెట్లను చూసి దామోదరన్ షాక్కు గురయ్యాడు.అందులో అతడు వెళ్లాల్సిన గమ్యస్థానం హుసూరుకు బదులు (దుబాయి, యుఏఈ) అని అని రాసి ఉంది. అంతే కాకుండా టికెట్ ధర రూ. పదివేలుగా ఉంది. దీంతో సదరు ప్రయాణికుడు షాక్కు గురయ్యాడు. దీంతో ఒక సాధారణ అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణం కాస్తా, అంతర్జాతీయ విమాన ప్రయాణంలా మారిపోయిందని ఆశ్చర్యపోయాడు. సాధారణంగా అతను వెళ్లాల్సిన గమ్యస్థానానికి రూ.150 వరకూ టికెట్ ధర ఉంటుంది.సోషల్ మీడియాలో ట్రెండింగ్అయితే ఈ ఘటనను తాలూకా వివరాలతో పాటు ఆ టికెట్ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్తా ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై రకరకాల జోకులు, మీమ్స్తో విరుచుకుపడ్డారు. తమిళనాడు రవాణా సంస్థ గల్ఫ్ దేశాలకు కూడా బడ్జెట్ బస్సు సర్వీసులను ప్రారంభించిందా ఏంటి? అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేశారు. సముద్రాలను దాటి బస్సు ప్రయాణిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.అధికారుల వివరణఈ టికెట్ వైరల్ కావడంతో తమిళనాడు రవాణా సంస్థ (TNSTC) సేలం డివిజన్ అధికారులు వెంటనే స్పందించారు... కండక్టర్ ఉపయోగించిన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్లో ఏర్పడిన ఒక సాంకేతిక లోపం వల్లే టికెట్పై దుబాయ్ అని ప్రింట్ అవ్వడం, అంత భారీ మొత్తంలో ఛార్జీ పడటం జరిగాయి. ప్రయాణికుల నుంచి కేవలం ఛార్జీ రూ. 150 మాత్రమే వసూలు చేశారని, ఈ తప్పు కేవలం టికెట్పై ప్రింట్ అయిన వివరాలకే పరిమితమైందని అధికారులు స్పష్టం చేశారు. -
కాంగ్రెస్లో టీఎంసీ విలీనం? ఏం జరుగుతోందంటే?
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ భవిష్యత్తుపై రాజకీయంగా ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ వ్యక్తిగతంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి, టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.టీఎంసీ అంతర్గత అసంతృప్తి, ప్రముఖ నేతల నిష్క్రమణల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల ముందు పార్టీ స్థిరత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ ఈ ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. సోనియా గాంధీ విలీన ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది.జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీ నుంచి టీఎంసీపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోందనే ఆందోళనను సోనియా గాంధీ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్తో విలీనం జరిగితే ప్రతిపక్ష బలం పెరుగుతుందని, బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం సులభమవుతుందని ఆమె సూచించినట్టు చెబుతున్నారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సోనియా గాంధీ, మమతా బెనర్జీ మధ్య చర్చ జరిగినట్టు సోర్సెస్ పేర్కొన్నాయి. టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తి, వర్గ విభేదాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం.మమత ఏమన్నారు? మమతా బెనర్జీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు కొన్ని రోజుల గడువు కోరినట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్లో టీఎంసీ విలీనం జరిగితే అనుసరించాల్సిన విధానాన్ని కాంగ్రెస్ నాయకత్వం వివరించింది. ఆ ప్రతిపాదన ప్రకారం.. మమతా బెనర్జీకి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి ఇవ్వవచ్చని, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం.అయితే, ఇలాంటి ప్రతిపాదన నిజంగా ఉందా? లేదా? అన్న విషయంపై కాంగ్రెస్, టీఎంసీ నుంచి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. పార్టీ భవిష్యత్ దిశ, అభిషేక్ బెనర్జీ పాత్రపై టీఎంసీలో అసంతృప్తి ఉన్నట్టు వస్తున్న వార్తల మధ్య ఈ ఊహాగానాలు వెలువడ్డాయి.అభిషేక్ బెనర్జీ-రాహుల్ గాంధీ భేటీపై ఆసక్తిఈ రాజకీయ పరిణామాలపై మరింత ఆసక్తి రేపేలా అభిషేక్ బెనర్జీ ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సమావేశం సానుకూలంగా సాగిందని తెలుస్తోంది. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సమావేశం గంటన్నర కంటే అధిక సమయం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతర పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. -
మోదీ అధ్యక్షతన ఎన్డీఏ నేతల కీలక భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరుపుతున్నారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న మోదీని ఎన్డీఏ నేతలు సత్కరించారు. మోదీని అభినందిస్తూ ఎన్డీఏ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.ఎన్డీఏలోని కీలక నేతలు భారత్ మండపానికి చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు.అలాగే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి భవిష్యత్ వ్యూహం, రాజకీయ అజెండాపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.కాగా, 2014 మే 26న తొలిసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ, ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా వరుసగా 4,399 రోజులు పూర్తి చేశారు. ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా జవహర్లాల్ నెహ్రూ పదవీకాలాన్ని అధిగమించారు. అయితే నెహ్రూ 1947 నుంచి 1964లో మరణించే వరకు ప్రధానిగా కొనసాగారు. కానీ ఈ పోలిక ప్రత్యేకంగా తొలి లోక్సభ ఎన్నికల తర్వాతి కాలానికి మాత్రమే సంబంధించింది. -
భర్తను అలా చూసి కారు బోనెట్పైకి భార్య చివరికి.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో గుండె ఝల్లుమనే ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతనిపై నిఘాపెట్టింది. ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూసిన ఆమె వాహనాన్ని ఆపే ప్రయత్నంలో వేగంగా దూసుకెళ్తున్న కారు బోనెట్మీదకు లంఘించింది. ఈ ఘటన భమోరా పరిధిలోని దేవ్చరా చౌరహా (కూడలి) వద్ద శనివారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. ఆమె బోనెట్పై వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గోదావరి (38) , నేత్రపాల్ సింగ్ ఇద్దరూ భార్యాభర్తలు. తన భర్త వేరే మహిళతో కలిసి కారులో ప్రయాణించడం చూసి, అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. కానీ అతను ఆపకుండా,మరింత వేగం పెంచడంతో, బోనెట్పై దూకేసింది. ఆమె బోనెట్పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా 100 మీటర్ల దూరం లాక్కెళ్లిన వైనం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మొత్తానికి అడ్డుకుని, ఆమెను సురక్షితంగా కిందకు దించారు. కారు ముందుకు దూసుకెళ్తుంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మహిళ బోనెట్ను గట్టిగా పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో కనిపించాయి. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్High drama unfolds in #Bareilly as wife catches husband with alleged girlfriend in a vehicle. She climbs onto car bonnet; gets dragged for nearly 100 meters. FIR Filed @uppolice @timesofindia pic.twitter.com/prKxvw3YvB— Sandeep Rai (@RaiSandeepTOI) June 9, 2026 భమోరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గోదావరి తన భర్త నేత్రపాల్ సింగ్కు సాధన అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. ఈ విషయంపై తాను భర్తను ప్రశ్నించినప్పుడల్లా ఆయన తనను తిడుతూ, శారీరకంగా హింసించేవాడని ఆమె తెలిపింది. ఇద్దరూ కారులో వెడుతుండగా, వారిని ఆపడానికే తాను అలా చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.తాను బోనెట్పై ఉన్నప్పటికీ నేత్రపాల్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఈ ఘర్షణలో సాధన తనపై దాడి చేసి, తన మెడలోని బంగారు గొలుసును లాక్కుని అక్కడి నుంచి పారిపోయిందని గోదావరి తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఈ రసాభాసలో తన మామయ్య వాహనం కూడా దెబ్బతిన్నట్లు చెప్పింది.అయితే, సాధన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. తాను బ్లాక్ ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా నేత్రపాల్ కారులో కేవలం లిఫ్ట్ మాత్రమే తీసుకున్నానని, గోదావరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని వాదించింది. పైగా ఈ ఘటనలో తనపైనే దాడి జరిగిందని ఆమె ఆరోపించింది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తభమోరా ఎస్హెచ్ఓ (SHO) పవన్ కుమార్ స్పందిస్తూ, నేత్రపాల్ సింగ్, సాధనలపై ర్యాష్ డ్రైవింగ్, దాడి, ఉద్దేశపూర్వ దాడి లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: హాట్ టాపిక్గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా -
మమత ముందున్న 4 మార్గాలు ఇవే.. ఇలాచేస్తేనా సామిరంగా..
ఒకే ఒక్క ఓటమి.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం, ఆ తర్వాతి నుంచి పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్బై చెబుతుండడంతో ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అసలు ఏం చేయాలో కూడా అర్థంకాని పరిస్థితి తలెత్తుతోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలమైన సంస్థాగత నిర్మాణం కంటే మమతా బెనర్జీ వ్యక్తిగత నాయకత్వంపైనే ఎక్కువగా ఆధారపడింది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో తిరుగుబాట్లు, వలసలు పెరగడంతో ఆ బలహీనత బయటపడింది. అధికారంలో ఉన్నప్పుడు బలంగా కనిపించిన టీఎంసీ.. ఇప్పుడు నిజమైన రాజకీయ పార్టీగా తిరిగి నిలబడుతుందా? లేక క్రమంగా విచ్ఛిన్నమవుతుందా?తృణమూల్ కాంగ్రెస్ సాధారణ రాజకీయ పార్టీలా ఎదగలేదు. అది ముందుగా ఒక భావోద్వేగంగా రూపుదిద్దుకుంది. మమతా బెనర్జీ చుట్టూ ఆవేదన, ప్రతిఘటన, వామపక్ష వ్యతిరేక భావన, వీధి పోరాట స్ఫూర్తి, ప్రాంతీయత వంటి అంశాలు చేరి ఒక రాజకీయ శక్తిగా మారాయి. ఈ విధానం ఎన్నో సంవత్సరాలు విజయవంతమైంది. మమతా ప్రజల అసంతృప్తిని ఉద్యమంగా మార్చి, దాని ద్వారా అధికారంలోకి వచ్చారు. బెంగాల్లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు 2011లో ముగింపు పలికారు. వరుసగా మూడు పర్యాయాలు అధికారాన్ని నిలబెట్టుకున్నారు.అయితే 2026 ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారింది. భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించగా, తృణమూల్ సుమారు 80 స్థానాలకు పరిమితమైంది. మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో ఓడిపోవడం పెద్ద దెబ్బగా మారింది. ఓటమి ఒక్కటే సమస్య కాదు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత బలహీనతలు బయటపడ్డాయి.పార్టీలో పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రారంభమైంది. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు వర్గానికి మద్దతు ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. తిరుగుబాటు నేతలపై చర్యలు తీసుకున్నా పార్టీ నియంత్రణ బలహీనంగా కనిపించింది. మమతా నిర్వహించిన సమావేశాలకు తక్కువ మంది నేతలు రావడం, పలు కమిటీలను రద్దు చేయడం వంటి పరిణామాలు సంస్థాగత సంక్షోభాన్ని సూచించాయి.పార్లమెంటులో తృణమూల్ స్థితి కూడా అస్థిరంగా మారింది. రాష్ట్ర అధికార యంత్రాంగం, స్థానిక రాజకీయ బలం, ఎన్నికల వ్యవస్థపై ప్రభావం లేకపోవడంతో ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచించడం ప్రారంభించారు. తిరుగుబాటు వర్గం నిజమైన తృణమూల్గా నిలిస్తే, చాలామంది తమ రాజకీయ మనుగడ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.మమతా బెనర్జీ వ్యక్తిగతంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎదిగిన నాయకురాలు. కానీ ఆమె చుట్టూ పెరిగిన నాయకత్వంలో చాలామంది అధికార రాజకీయాలకు మాత్రమే అలవాటు పడ్డారు. అధికారం ఉన్నప్పుడు విశ్వాసంగా కనిపించిన నాయకులు, ఓటమి తర్వాత వైఖరి మార్చుకోవడం దీనికి ఉదాహరణ.చేయాల్సినవి ఇవే.. ప్రస్తుతం మమతా ముందు నాలుగు మార్గాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీపై నియంత్రణ కొనసాగించడం, తిరుగుబాటు వర్గంతో రాజీకి రావడం, కింది స్థాయి నుంచి తిరిగి నిర్మాణం చేపట్టడం, లేక కాంగ్రెస్-వామపక్షాలతో పెద్ద కూటమి ఏర్పాటుపై ఆలోచించడం. ఇవి అంత ఈజీ కాదు. అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేయగలిగితేనే పార్టీ మళ్లీ పుంజుకుంటుంది.తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ నిజమైన రాజకీయ పార్టీగా నిలిచి పునర్నిర్మాణం చేసుకోగలదా? లేక నాయకురాలి వ్యక్తిగత ప్రజాదరణపై ఆధారపడిన వ్యవస్థగా క్రమంగా విచ్ఛిన్నమవుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. -
ప్రతీ ఆదివారం రెండు బిర్యానీలు ఫ్రీ : అవాక్కయ్యారా?
లక్షలాది మంది భారతీయులకు ఇష్టమైన వంటకం బిర్యానీ. సందర్భం ఏదైనా బిర్యానీ ఒక ఎమోషన్. అయితే ఒక ప్లేట్ బిర్యానీ చివరకు కోర్టు కేసు వరకు వెళ్తుందని ఎవరైనా ఊహిస్తారా? దీనికి సంబంధించి పుదుచ్చేరిలో జరిగిన ఒక విచిత్రమైన విషయం నెట్టింట సందడిగా మారింది.‘లైవ్లా’ (LiveLaw) నివేదిక ప్రకారం. స్థానిక రెస్టారెంట్లో పి. సుందరకుమార మణికందన్ అనే వినియోగ దారుడు తన స్నేహితుడు మహమ్మద్ నియాజుద్దీన్తో పుదుచ్చేరి ఎంజీ రోడ్డులోని ఎంతో ఇష్టంగా బిర్యానీ ఆర్డర్ చేసి తింటూ ఉండగా, బిర్యానీలో చనిపోయిన పురుగు కనిపించింది. దీని తీవ్రతను గమనించిన అతను వీడియోలు, ఫోటోలు తీశారు. రెస్టారెంట్లో పరిశుభ్రత లోపించిందని, దీనివల్ల తనకు మానసిక ఆందోళన కలగడమే కాకుండా, ఆరోగ్యం పాడవుతుందనే భయం, హోటళ్లపై నమ్మకం పోయిందని ఆరోపించాడు. ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్ఆ తర్వాత, మణికందన్ ఆ రెస్టారెంట్కు లీగల్ నోటీసు జారీ చేశారు. నిర్లక్ష్యం, ఆరోగ్య సమస్యలు, మానసిక వేదన , న్యాయపరమైన ఖర్చులను పేర్కొంటూ, అతను రూ. 1.3 లక్షల పరిహారం కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. దీనికి ఎలాంటి స్పందన రాకపోవడంతో పుదుచ్చేరిలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు ఫిర్యాదు చేశాడు. సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో రెస్టారెంట్ విఫలమైందని, ఇది ‘వినియోగదారుల రక్షణ చట్టం, 2019’ కింద సేవా లోపమేనని ఫిర్యాదు చేశారు.ఈ కేసులో రెస్టారెంట్ చేసిన ఒక పెద్ద తప్పు వారికి మైనస్ అయింది. కోర్టు నుంచి నోటీసులు అందినప్పటికీ 'బిర్యానీ అండ్ కో' ప్రతినిధులు కమిషన్ ముందు హాజరు కాలేదు. దీంతో ఈ కేసును కోర్టు ఏకపక్షంగా విచారించింది. కస్టమర్ ఇచ్చిన ఫోటోలు అంత స్పష్టంగా లేకపోయినా, వీడియో ఫుటేజీని కమిషన్ నిశితంగా పరిశీలించింది. ఆ వీడియోలో బిర్యానీలో చనిపోయిన ఈగ లాంటి పురుగు స్పష్టంగా కనిపించింది. అలాగే గూగుల్ రివ్యూలో కస్టమర్ పెట్టిన పోస్టుకు రెస్టారెంట్ మొదట స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పి, ఇలాంటివి మళ్లీ జరగవని పేర్కొంది. కానీ లీగల్ నోటీసుకు ఇచ్చిన రిప్లైలో మాత్రం తాము తప్పు చేయలేదని బుకాయించింది. ఈ పరస్పర విరుద్ధమైన సమాధానాల వల్ల రెస్టారెంట్ నమ్మకాన్ని కోల్పోయిందని కమిషన్ అభిప్రాయపడింది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తవినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటళ్లకు ఉందని స్పష్టం చేసింది. కస్టమర్కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకపోయినప్పటికీ, ఈ ఘటన వల్ల ఆయన మానసిక వేదనకు, ఇబ్బందులకు గురయ్యారని కోర్టు అంగీకరించింది. దీని ప్రకారం వినియోగదారుడి మానసిక క్షోభ, శారీరక ఇబ్బందులకుగానూ కస్టమర్కు 10వేల రూపాయలు,కోర్టు ఖర్చుల కింద అదనంగా మరో రూ. 3,000 ఇవ్వాలని చెల్లించాలని రెస్టారెంట్ను ఆదేశించింది.అయితే, అందరినీ ఆశ్చర్యపరిచిన అసలైన విషయం మరొకటి ఉంది. ఈ నగదు పరిహారంతో పాటు, ఫిర్యాదు దారుడికి 10 ప్లేట్ల హైదరాబాదీ చికెన్ బిర్యానీని ఉచితంగా అందించాలంటూ వినూత్న ఆదేశాలు జారీ చేసింది. ఐదు వారాల పాటు ప్రతి ఆదివారం రెండు ప్లేట్ల చొప్పున ఈ బిర్యానీని అందించాలని, అది కూడా పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తయారు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉచిత బిర్యానీ పంపిణీ కోర్డు ఆర్డర్ అందిన రెండు వారాల్లోగా ప్రారంభం కావాలని ఆదేశించింది.ఇదీ చదవండి: హాట్ టాపిక్గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా -
నామినేషన్ వివాదం.. ఈసీని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం
ఢిల్లీ: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదం దుమారం రేపుతోంది.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ చట్టవిరుద్ధమని పేర్కొంది. తన విస్తృత అధికారాలతో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఈసీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గతంలో హరియాణా, గుజరాత్లో ఆర్వో నిర్ణయాలు ఈసీ సరిచేసిందని కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మన్వు సంఘ్వీ అన్నారు.కాగా, ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు.కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్
భారత మామిడి రైతులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అధిక స్థాయిలో రసాయన పురుగుమందులు ఉన్నాయనే ఆరోపణలపై భారత మామిడిని నిషేధించిన దేశాల్లో మరో దేశం చేరింది. ఇటీవల జపాన్ ఇండియన్ మామిడి పండ్ల దిగుమతులను నిషేధించగా ఇపుడు నేపాల్ కూడా ఆ బాటలో నడిచింది.అధిక స్థాయిలో పురుగుమందులు ఉన్న భారత మామిడి పండ్ల దిగుమతిని బాలెన్ షా ప్రభుత్వం నిషేధించింది.నేపాల్ వ్యవసాయ మరియు పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ విధించిన ఈ ఆంక్షలు ఏప్రిల్-మే నెలల మధ్య అమలు చేసిందని సమాచారం. నేపాల్ భారతదేశానికి అతిపెద్ద మార్కెట్లలో ఒకటి కానప్పటికీ, ఈ ఆంక్షలు అల్ఫోన్సో, దశేరి, చౌసా, కేసర్, లంగ్రా , బంగనపల్లి వంటి అత్యుత్తమ భారతీయ రకాల ఎగుమతులపై ప్రభావం ఉంటుందని మార్కెట్నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు రసాయన పురుగు మందుల ఆనవాళ్లు ఉండటం భారతదేశపు పండ్ల ఉత్పత్తి విధానంపై సందేహాలను రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తనేపాల్ కూడా పరిమితంగానైనా మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే, స్థానిక డిమాండ్ను తీర్చడానికి దేశీయ ఉత్పత్తి సరిపోవడం లేదు. మే మధ్య నుండి జూలై మధ్య వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. మధేష్ ప్రావిన్స్లోని సిరహా, సప్తరి , ధనుషా జిల్లాలు దేశంలో ప్రధాన మామిడి ఉత్పత్తి కేంద్రాలు. భారతీయ మామిడి పండ్లపై విధించిన ఈ ఆంక్షలు దేశీయ పండ్ల రకాలకు ప్రయోజనం చేకూరుస్తుందని నేపాల్ అధికారులు అంటున్నారు. భారతదేశం ఏటా 24 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది, ఇందులో సుమారు 32,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఎగుమతి చేస్తుండగా, మిగిలినవి దేశీయ వినియోగానికే. ఇదీ చదవండి: హాట్ టాపిక్గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా -
రికార్డుపై స్పందించిన మోదీ.. "వారికే ఇది దక్కుతుంది"
ఢిల్లీ: ప్రధాని మోదీ ఈ రోజుతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రజాస్వామ్య భారత్లో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించారు.. నేపథ్యంలో ఈ రికార్డుపై ప్రధాని మోదీ తొలిసారిగా పెదవివిప్పారు. వినయంతో అంకితభావంతో, కర్తవ్యభావంతో అవిశ్రాంతంగా వ్యక్తి మాత్రమే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాడు. అని అన్నారు.2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. 2019, 2024 లోక్సభ ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టితో ఆయన ప్రధానమంత్రి పదవిలో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు. ఇదివరకూ ఈ రికార్డు దివంగత నేత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉండేది.ఈ అరుదైన ఘనతపై ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ "ప్రజా సేవయే సుపరిపాలనకు గొప్ప కొలమానం. వినయంతో, అంకితభావంతో, కర్తవ్య భావంతో అవిశ్రాంతంగా పనిచేసే వ్యక్తి మాత్రమే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాడు. స్వభావరీత్యా భక్తిపరుడై, ఎల్లప్పుడూ తన ప్రజల సంక్షేమం గురించే ఆలోచించేవాడే అత్యున్నత కీర్తిని పొందుతాడు. వినయశీలి అయిన రాజు నిజంగానే అత్యున్నత కీర్తిని పొందుతాడు." అని అన్నారు. ఈ మేరకు ఒక వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.జవహార్ లాల్ రికార్డును అధిగమించిజవహార్ లాల్ నెహ్రూ మెుదటగా 1947 నుండి 1952 వరకు ప్రధానిగా ఉన్నారు. అయితే అప్పుడు ప్రజలు నేరుగా ఓటువేసి ఎన్నుకోలేదు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో "సార్వత్రిక వయోజన ఓటుహక్కు" హక్కు కల్పించారు. ఆ తర్వాత జరిగిన సాధారణఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే (1952 మే నుండి 1964 మే లో ఆయన మరణించే వరకు) నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా 4,398 రోజులు పదవిలో ఉన్నారు. జూన్ 2026 నాటికి నరేంద్ర మోదీ ప్రధానిగా నిరంతరాయంగా 4,399 రోజులు పూర్తి చేసుకుని, నెహ్రూ రికార్డును అధిగమించారు. जनसेवा ही सुशासन की सबसे बड़ी कसौटी है। विनम्रता, समर्पण और कर्तव्यनिष्ठा के साथ निरंतर कार्य करने वाला व्यक्ति ही जनविश्वास अर्जित करता है।सदानुरक्तप्रकृतिः प्रजापालनतत्परः। विनीतात्मा हि नृपतिर्भूयसी श्रियमश्नुते॥ pic.twitter.com/mn0Ax0F8hs— Narendra Modi (@narendramodi) June 10, 2026 -
మీనాక్షి నామినేషన్ రద్దు.. బీజేపీ చేతికి ఆ పేపర్లు ఎలా?
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వ్యవహారం ఇప్పుడో.. పెద్ద పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుకు సంబంధించిన సమాచారం దాచినట్లు ఆరోపణలతో రిటర్నింగ్ అధికారి ఆర్వింద్ శర్మ ఆమె నామినేషన్ను తిరస్కరించడం.. రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలతో ఈ ఎపిసోడ్ పూటకో మలుపు తిరుగుతోంది.. తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై కేసు ఉందని బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పత్రాలు బీజేపీ చేతికి ఎలా వచ్చాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ నుంచే తమకు ఆ సమాచారం అందిందని బీజేపీ బాంబ్ పేల్చింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక కాంగ్రెస్లోనే అంతర్గత విభేదాలు, లీక్ రాజకీయాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, “ఈ పత్రాలు తెలంగాణ నుంచి వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే సమాచారం కాంగ్రెస్ వర్గాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ముందుకెళ్లి, బీజేపీకి ఈ సమాచారం కాంగ్రెస్ లోపలి వ్యక్తుల నుంచే వచ్చి ఉండొచ్చని కూడా ఆయన అనడంతో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఇదే సమయంలో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్లో అంతర్గత వర్గపోరు వల్లే ఈ లీక్ జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..ఈ వ్యవహారం “యాదృచ్ఛిక లీక్” కాకుండా ఒక ప్రణాళికాబద్ధ రాజకీయ మార్గం ద్వారా బీజేపీకి చేరినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా కథనం ఇచ్చింది. తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ బీజేపీ నేత ఇచ్చిన వివరాల మేరకు.. ఆ పత్రాలు మధ్యప్రదేశ్ బీజేపీకి చేరగా, ఆ పార్టీ వెంటనే చురుకుగా స్పందించిందట. ఆ పత్రాల్లో కోర్టు కేసులు, నోటీసులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం.బోపాల్కు చేరిన తర్వాత బీజేపీ లీగల్ వ్యూహాన్ని సిద్ధం చేసి రిటర్నింగ్ అధికారికి అభ్యంతరం దాఖలు చేసింది. ఈ కేసును బలంగా వాదించేందుకు పార్టీ తరఫున రాహుల్ కొఠారి, మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్యను నియమించినట్లు తెలుస్తోంది. దీంతో నామినేషన్ స్క్రూటినీ సమయంలో బీజేపీ బలమైన సవాలు విసరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మరోవైపు కాంగ్రెస్ ఈ మొత్తం ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్క్రూటినీ సమయంలో మాజీ న్యాయమూర్తి పాల్గొనడంపై కాంగ్రెస్ నేత జేపీ ధనోపియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్లే తమ అభ్యర్థిపై అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది.ఈ వివాదానికి మూలం 2022లో తెలంగాణలో జరిగిన ఒక కేసు అని తెలుస్తోంది. ఒక మహిళ చేసిన ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ఉండగా, ఆ సమయంలో ఆ వ్యవహారంతో మీనాక్షి నటరాజన్కు కూడా సంబంధం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం ఆమెపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, కోర్టు కేవలం షోకాజ్ నోటీసులు.. సమన్లు మాత్రమే ఇచ్చిందని.. చట్టపరంగా నామినేషన్లో ఆ వివరాలు ప్రకటించాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ విషయంలో గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ దిశగా అడుగులు వేయొచ్చని సంకేతాలిస్తోంది.మొత్తానికి ఈ వ్యవహారం కేవలం నామినేషన్ రద్దు ఘటనగా కాకుండా, కాంగ్రెస్–బీజేపీ మధ్య పత్రాల రాజకీయ యుద్ధంగా మారింది. “పేపర్ ఎవరు ఇచ్చారు?”, “లీక్ వెనుక ఎవరు ఉన్నారు?” అనే ప్రశ్నలతో మధ్యప్రదేశ్ రాజ్యసభ పోరు ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్గా మారిపోయింది.ఈసీ ఏం చేయబోతోంది?..ఈ మొత్తం వివాదంపై ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. సాధారణంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా.. చట్టపరమైన ప్రక్రియనే ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ స్క్రూటినీ సమయంలో వచ్చిన అభ్యంతరాలు, సమర్పించిన అఫిడవిట్ వివరాల ఆధారంగానే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నిరసనలు చేస్తేనో.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనో ఈసీ నిర్ణయాలు మారవని.. దాని పరిధి కేవలం ఎన్నికల ప్రక్రియ నిర్వహణకే పరిమితమని, లీక్లు లేదంటే రాజకీయ ఆరోపణలపై స్పందించేది కాదని కూడా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ముందు కోర్టును ఆశ్రయించడమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెబుతున్నారు. -
రాజ్యసభకు సుస్మిత రాంరాం.. అస్సాం సీఎంతో మంతనాలు!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే, మరో కీలక మహిళా నేత, రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీలో తిరుగుబాటు తీవ్రరూపం దాల్చింది. ఈ పరిణామాల మధ్యే సుస్మితా దేవ్ ఢిల్లీలో అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.పతనం దిశగా మమత సామ్రాజ్యం?ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత టీఎంసీని కాపాడుకోవడం మమతా బెనర్జీకి కత్తిమీద సాములా మారింది. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ 58 మంది శాసనసభ్యుల మద్దతుతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవిని కోరుతుండగా, మరో ఎంపీ కాకోలి ఘోష్ 19 మంది అసమ్మతి ఎంపీలతో కలిసి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవడం పార్టీ పతనానికి సంకేతంగా మారింది.అవినీతిపై తిరుగుబాటు బావుటాఈ వారంలోనే మరో ప్రముఖ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీలో అడ్డూఅదుపూ లేని అవినీతి, అరాచకం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి సమావేశానికి కొన్ని గంటల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పార్టీ సంస్థాగత నిర్మాణంలో అవినీతి వేళ్లునుకుపోయిందని, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని రాయ్ మండిపడ్డారు.కాంగ్రెస్ నుండి టీఎంసీ.. ఇప్పుడు బీజేపీ వైపు?గతంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సుస్మితా దేవ్ 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజ్దీప్ రాయ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2021లో కాంగ్రెస్ను వీడి టీఎంసీలో చేరారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వహించిన ఆమె, ఇప్పుడు రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంతో మమతా బెనర్జీ రాజకీయ వ్యూహాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆమె బీజేపీ సీఎం హిమంత బిస్వా శర్మతో భేటీ కావడంతో, ఆమె త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
Tamil Nadu: కాంగ్రెస్ వర్సెస్ టీవీకే
సాక్షి, చెన్నై : కన్యాకుమారి జిల్లా కిల్లియూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే , మంత్రి రాజేష్ కుమార్ ఎన్నికను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు టీవీకే అభ్యర్థి సబీన్ నిర్ణయించారు. ఆయన గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలలో 1,311 ఓట్లతో రాజేష్ కుమార్ సబీన్పై గెలిచారు. సోమవారం సబీన్ స్వయంగా కన్యాకుమారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు లేఖను కిల్లియూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కౌన్సిల్ కార్యదర్శి , ప్రధాన ఎన్నికల కమిషనర్కు కూడా పంపినట్టు ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోస్టల్ ఓట్ల నిర్లక్ష్యం : ఎన్నికల నిబంధనల ప్రకారం లెక్కింపు జరపాల్సిన అనేక పోస్టల్ ఓట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ నిర్దేశిత సమయం కంటే ముందే, అంటే ఉదయం 6 గంటలకే ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారని వివరించారు. సాంకేతిక లోపం పేరిట ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, తాము ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కౌంటింగ్ అధికారులు సరైన వివరణ ఇవ్వకుండా రకరకాల కారణాలు చెబుతూ తుది ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని సబీన్ ఆరోపించారు.నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ లెక్కింపు ఆధారంగా ప్రకటించిన రాజేష్ కుమార్ విజయాన్ని తక్షణమే రద్దు చేయాలని సబీన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే, త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించి ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.కాగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే గెలుపును వ్యతిరేకిస్తూ అధికార పక్షం అభ్యర్థి న్యాయ పోరాటానికి సిద్ధం కావడం చర్చకు దారి తీసింది. -
భార్య, కుమారున్ని హతమార్చి..
కర్ణాటక: కుటుంబాన్ని ప్రాణంలా కాపాడుకోవాల్సిన ఇంటి పెద్ద హంతకుడయ్యాడు. భార్య, కుమారున్ని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మండ్య నగరంలో దుస్తుల వ్యాపారి ఒకరు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. వ్యాపారి ప్రభాకర్ (65), భార్య జ్యోతి (55), కుమారుడు సంతోష్ (30) మృతులు. ఏం జరిగిందంటే.. వివరాలు.. నెహ్రూ నగరలో ప్రభాకర్కు క్లాత్ స్టోర్ ఉంది. కుటుంబ నిర్వహణ, వ్యాపారం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో సోమవారం రాత్రి భోజనం చేసి పడుకున్నాక.. భార్య జ్యోతి గొంతుకు చీర బిగించి చంపబోయాడు. ఆ శబ్ధాలకు మరో గదిలో ఉన్న కుమారుడు సంతోష్ వచ్చాడు. అయినప్పటికీ ప్రభాకర్ భార్యను హతమార్చి, ఆపై కుమారున్ని కూడా అదే మాదిరిగా ప్రాణాలు తీశాడు. పక్క గదిలో నిద్రిస్తున్న కోడలికి ఇదేమీ తెలియదు. తరువాత తన బట్టల అంగడికి వచ్చి ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కోడలు నిద్రలేచి అత్త వద్దకు వెళ్లగా ఘోరం బయటపడింది. తూర్పు పోలీసు స్టేషన్ సిబ్బంది, మండ్య ఎస్పీ శోభారాణి చేరుకుని పరిశీలించారు. పాపం.. కొత్త కోడలు ఈ ఘటనలో మరో విషాదం ఏమిటంటే.. నెల రోజుల క్రితమే సంతోష్కు ఘనంగా పెళ్లి చేయడం. అతని భార్య జీవితం కూడా ఛిన్నాభిన్నమైంది. రాత్రి తన గదినుంచి భర్త బయటకు వెళ్లిన సంగతి ఆమెకు తెలియరాలేదు. ఫ్యాన్ శబ్దం ఎక్కువగా ఉండడం వల్ల ఏ చప్పుళ్లు వినిపించలేదని ఆమె తెలిపింది. డెత్నోట్లో.. వ్యాపారంలో నష్టాలు, అప్పుల వల్ల విరక్తికి గురై ప్రభాకర్ భార్య, కొడుకును చంపేశారని ఎస్పీ శోభ తెలిపారు. ప్రభాకర్ డెత్నోట్ లభించిందని తెలిపారు. ఇంటి రుణం, నష్టాలు, ఉచిత బస్సు పథకం వల్ల తమకు వ్యాపారం బాగా తగ్గిపోయిందని లేఖలో రాశారన్నారు. -
కుప్పలు కుప్పలుగా పాములు
దూరంగా వెళ్లే ఒక్క పామును చూస్తేనే ఒళ్లు భయంతో జలదరిస్తుంది. అలాంటి ఇళ్ల ముందే అనేక సర్పాలు కనిపిస్తే చెమటలు పట్టాల్సిందే. బెంగళూరు సమీపంలో నెలమంగల పట్టణంలో ఇలాంటి సమస్యే ఏర్పడింది. ఇళ్ల మధ్యలో కుప్పలుగా సర్పాలు తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేతెల్లిపోతున్నారు. ఇళ్ల లోపల, ముందు, కాంపౌండ్లలో, చెప్పుల స్టాండ్లలో, పొదల్లో ఇలా ఎక్కడ చూసినా సర్పాలే దర్శనమిస్తున్నాయి. స్నేక్ క్యాచర్ విశ్వనాథ్ ఎవరు ఫోన్ చేసినా వెంటనే వెళ్లి బంధించి దూరంగా వదిలేస్తున్నాడు. ఎక్కువగా ప్రమాదకర రక్తపింజర, నాగుపాములు ఉంటున్నాయి. ఓ ఫాం హౌస్లోనే 20 పైగా రక్తపింజర పాముల పిల్లలు కనిపించగా వాటిని పట్టి బకెట్లో వేశారు. అలాగే నాగుపాము పిల్లలూ దొరికాయి. దేశంలోనే అత్యధిక విషం కలిగిన నాలుగు రకాల పాములు కూడా నెలమంగలో దొరికాయని విశ్వనాథ్ తెలిపాడు. ప్రజలు చాలా జాగ్రత్తా ఉండాలని ఆయన సూచించారు.- కర్ణాటక -
Karnataka: ట్రాఫిక్ ఈ–చలాన్లపై రాయితీ
రాష్ట్రంలో 2026 మే నెలలో పోలీసు శాఖలో నమోదైన ట్రాఫిక్ ఈ–చలాన్లు, రవాణా శాఖలో 1991 నుంచి 2022 వరకు నమోదైన చలాన్లపై 50 శాతం రాయితీని ఇచ్చినందున వాహనదారులు సద్వినియోగపరచుకోవాలని జిల్లా సెషన్స్ జడ్జి ఉషారాణి సూచించారు. నగరంలోని కొత్త కోర్టు సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. 50 శాతం రాయితీతో ప్రజలు ఈ నెల 21 నుంచి జూలై 10వ తేదీలోగా చలాన్లను చెల్లించవచ్చన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి, నగర ఉప పోలీసు కమిషనర్ సుందర్రాజ్, నాగరాజ్ అంకనదొడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శివశంకర్, ఏఎస్పీ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.కర్ణాటక -
ఒకే కశ్మీర్.. రెండు విభిన్న వాస్తవాలు!
శ్రీనగర్: నియంత్రణ రేఖ (LoC)కి ఇరువైపులా ఉన్న కశ్మీర్ ప్రాంతాల్లో ప్రస్తుతం పూర్తిగా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో ప్రజలు ఆర్థిక సమస్యలు, అధిక ధరలు, విద్యుత్ చార్జీల పెంపు, రాజకీయ హక్కుల అంశాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు భారత జమ్మూ-కశ్మీర్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రైల్వే కనెక్టివిటీ, పర్యాటక అభివృద్ధి వేగంగా కొనసాగుతున్నాయి.పీవోకేలో ఇటీవల ముజఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో నిరసనలు ఉధృతమయ్యాయి. పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, విద్యుత్ బిల్లుల భారం, పాలనాపరమైన సమస్యలపై ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కొన్ని చోట్ల నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, కాల్పులు జరిగినట్లు కూడా నివేదికలు వెల్లడించాయి. ఇంటర్నెట్ సేవల నిలిపివేత, పలువురిని అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలు కూడా తీసుకున్నట్లు సమాచారం.అదే సమయంలో భారత్వైపు జమ్మూ-కశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా జోజిల్లా టన్నెల్ నిర్మాణంలో కీలక పురోగతి చోటుచేసుకుంది. కశ్మీర్, లడఖ్ వైపుల నుంచి తవ్వకాలు జరిపిన ఇంజినీర్లు భూగర్భంలో కలుసుకోవడంతో టన్నెల్ నిర్మాణంలో ముఖ్య దశ పూర్తయింది. 13.15 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గం పూర్తయితే ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్లలో ఒకటిగా నిలవనుంది.జమ్మూ-కశ్మీర్లో రైల్వే కనెక్టివిటీ కూడా గణనీయంగా మెరుగుపడుతోంది. చీనాబ్ రైల్వే వంతెన, ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టు, వందే భారత్ రైళ్ల ప్రారంభం వంటి కార్యక్రమాలు ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల పర్యాటకం, వ్యాపారం, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. పర్యాటక రంగంలో కూడా జమ్మూ-కశ్మీర్ రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తోంది. గుల్మార్గ్, పహల్గామ్, సోనమార్గ్ వంటి ప్రాంతాలకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తోంది. స్టార్టప్ రంగంలోనూ యువత ముందుకు వస్తుండగా, కొత్త పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయి.మొత్తంగా చూస్తే, ఎల్వోసీకి ఇరువైపులా ఉన్న కశ్మీర్ ప్రాంతాలు ప్రస్తుతం రెండు విభిన్న దిశల్లో సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. అక్కడి ప్రజలు ఆర్థిక, రాజకీయ సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా, భారత జమ్మూ-కశ్మీర్లో మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడులు, పర్యాటకం, కనెక్టివిటీ అభివృద్ధి ప్రధానంగా కనిపిస్తున్నాయి. దీంతో "రెండు కశ్మీర్ల కథ" మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
సీఎం పదవి మళ్లీ మిస్: డీసీఎం
నాకు గతంలో 3 సార్లు సీఎం పదవి తప్పిపోయింది అని కొత్త డిప్యూటీ సీఎం పరమేశ్వర్ వాపోయారు. తుమకూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలనే తన చిరకాల కోరిక ఇంకా అలాగే ఉందని ఉద్వేగానికి గురయ్యారు. 2013 ఎన్నికల్లో పార్టీ గెలిచినా, తాను ఓడిపోవడం వల్ల ముఖ్యమంత్రి పదవి తప్పిపోయిందని, ఆనాడు తాను గెలిచి ఉంటే సిద్ధరామయ్య సీఎం అయ్యేవారు కాదని తెలిపారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల్లో గెలుపొందినా మైత్రి సర్కార్ కారణంగా హెచ్డీ కుమారస్వామి సీఎం అయ్యారన్నారు. ఈసారి కూడా సీఎం పదవి తనకు రావాల్సి ఉన్నా, వివిధ రాజకీయ కారణాల వల్ల సాధ్యపడలేదని అన్నారు. ఇటీవల ఢిల్లీలో సీఎం పదవి ఇవ్వకపోతే వెంటనే చెప్పేయాలని, తనకు అవతల చాలా పనులు ఉన్నాయని హైకమాండ్కు చెప్పేశానన్నారు. -కర్ణాటక -
టీఎంసీలో తిరుగుబాటు.. దీదీ నెత్తిన పాలు పోస్తున్న రాజ్యాంగ సవరణ!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ తిరుగుబాటు ప్రకంపనలు రేపుతోంది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్సభ సభ్యులు మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గంగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సంఖ్యాబలం చూస్తే ఇది దీదీకి భారీ ఎదురుదెబ్బలా కనిపిస్తున్నా.. చట్టపరంగా మాత్రం రెబల్స్కే షాక్ తగిలే పరిస్థితి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.లోక్సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 20 మంది తమవైపే ఉన్నారని తిరుగుబాటు వర్గం చెబుతోంది. అయితే రెండు మూడొంతుల మంది ఎంపీలు ఉన్నారనే కారణంతోనే అనర్హత నుంచి రక్షణ లభించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రాజకీయ చీలికలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణ ఇప్పుడు మమతా బెనర్జీ వర్గానికే అండగా నిలుస్తోందని విశ్లేషిస్తున్నారు.ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో చీలికలకు చట్టంలో కొంత వెసులుబాటు ఉండేది. శాసనసభ లేదంటే పార్లమెంట్లో మూడింట ఒక వంతు మంది సభ్యులు విడిపోయినా అనర్హత నుంచి రక్షణ పొందే అవకాశం ఉండేది. అయితే 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణతో ఆ నిబంధనను పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి "స్ప్లిట్"(చీలిక) అనే భావనకు చట్టపరమైన గుర్తింపు లేదు. ఇప్పుడు రక్షణ పొందాలంటే "మెర్జర్"(విలీనం) మాత్రమే మార్గంగా మిగిలింది.అక్కడే టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు చిక్కులు మొదలవుతున్నాయి. ఎందుకంటే కేవలం ఎంపీలు విడిపోయి కొత్త బ్లాక్గా ఏర్పడితే అది విలీనంగా పరిగణించబడదు. పార్టీ సంస్థ మొత్తం మరో పార్టీలో విలీనం కావడం.. దానికి కనీసం రెండు మూడొంతుల మంది ప్రజాప్రతినిధులు అంగీకరించడం వంటి షరతులు నెరవేరినప్పుడే అనర్హత నుంచి రక్షణ లభిస్తుంది. లేదంటే పార్టీని స్వచ్ఛందంగా వీడినట్టుగా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇదే కారణంగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరో ప్రశ్న వినిపిస్తోంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అనుసరించిన వ్యూహాన్ని టీఎంసీ తిరుగుబాటు వర్గం అమలు చేయగలదా? శివసేన సంక్షోభంలో షిండే వర్గం కేవలం ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడమే కాదు.. తామే అసలైన శివసేన అని ప్రకటించి పార్టీ సంస్థపై హక్కు కోసం పోరాటం చేసింది. చివరకు ఎన్నికల సంఘం ముందు తమ వాదనను నిలబెట్టి పార్టీ పేరు, గుర్తుపై ఆధిపత్యం సాధించింది.టీఎంసీ తిరుగుబాటు వర్గం కూడా అదే దారిలో నడవాలంటే కేవలం ఎంపీల సంఖ్య సరిపోదు. పార్టీ సంస్థలో, రాష్ట్ర స్థాయి నిర్మాణాల్లో, జిల్లా కమిటీల్లో, ఇతర విభాగాల్లో తమకే మెజారిటీ మద్దతు ఉందని నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే "అసలైన టీఎంసీ మాదే" అనే వాదనకు బలం చేకూరే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రత్యేక బ్లాక్గా ఏర్పడటం మాత్రమే జరిగితే అనర్హత ముప్పు తప్పకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అంటే ప్రస్తుతం తిరుగుబాటు ఎంపీల ముందు రెండు మార్గాలే కనిపిస్తున్నాయి. ఒకటి.. చట్టబద్ధమైన విలీనం దిశగా అడుగులు వేయడం. రెండోది.. తామే అసలైన టీఎంసీ అని ప్రకటించి పార్టీపై హక్కు కోసం పోరాటం చేయడం. ఈ రెండింటిలో ఏదీ చేయకుండా కేవలం ప్రత్యేక వర్గంగా కొనసాగితే యాంటీ డిఫెక్షన్ చట్టం వారి మెడకు చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అందుకే రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేస్తున్నారు. బయటికి చూస్తే ఇది మమతా బెనర్జీకి ఎదురుదెబ్బలా కనిపించినా.. చట్టపరంగా చూస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు ఆమెకే అండగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ చీలికలను ప్రోత్సహించకుండా తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణే ఇప్పుడు టీఎంసీ తిరుగుబాటుదారులకు అతిపెద్ద అడ్డంకిగా మారిందని చెబుతున్నారు.మొత్తానికి టీఎంసీలో జరుగుతున్నది కేవలం ఎంపీల తిరుగుబాటు మాత్రమే కాదు. ఇది పార్టీపై హక్కు కోసం సాగబోయే పెద్ద రాజకీయ, న్యాయపోరాటానికి నాంది కావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 20 మంది ఎంపీలు ఉన్నంత మాత్రాన చట్టం కళ్లలో రక్షణ లభించదు. "అసలైన టీఎంసీ ఎవరిది?" అనే ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ పోరాటం కొనసాగనుంది. -
సైనికులకు ఘోర అవమానం: సాయంత్రం ఐదుకు బ్రేక్ఫాస్ట్.. ఇంకా..
న్యూఢిల్లీ: దేశ రక్షణలో, ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే భద్రతా దళాలకు రైల్వే ప్రయాణంలో నరకయాతన ఎదురైంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వేలాది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాము ప్రయాణించిన ఎన్నికల ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యం కావడమే కాకుండా, కనీస వసతులు లేక, సకాలంలో ఆహారం అందక జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) రైల్వే బోర్డుకు ఘాటుగా లేఖ రాశారు.25 గంటల ఆలస్యం.. సాయంత్రం ఐదింటికి టిఫిన్అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధుల కోసం మొత్తం 230 ప్రత్యేక రైళ్లను కేటాయించగా, అందులో దాదాపు 200 రైళ్లు తీవ్ర జాప్యంతో నడిచాయి. 150కి పైగా రైళ్లు 10 నుండి 15 గంటలు ఆలస్యంగా నడవగా, మరో 50 రైళ్లు ఏకంగా 20 నుండి 25 గంటల ఆలస్యంతో గమ్యస్థానాలకు చేరాయి. ఈ ఘోర జాప్యం వల్ల జవాన్ల భోజన ఏర్పాట్లు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. ఉదయం తినాల్సిన అల్పాహారం (బ్రేక్ఫాస్ట్) కూడా జవాన్లకు సాయంత్రం 5 గంటల సమయంలో అందిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైళ్ల రాకపోకల సమయంపై స్పష్టత లేకపోవడంతో ఐఆర్సీటీసీ సైతం సకాలంలో ఆహారం అందించలేకపోయింది.కిక్కిరిసిన బోగీలు.. నిలవడానికీ లేని చోటురైళ్ల ఆలస్యమే కాకుండా, రైల్వే శాఖ కేటాయించిన బోగీల సంఖ్య కూడా జవాన్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. నిబంధనల ప్రకారం ప్రతి ఎన్నికల ప్రత్యేక రైలుకు 24 బోగీలు కేటాయించాలని సీఆర్పీఎఫ్ డిమాండ్ చేసింది. అయితే, రైల్వే శాఖ కేవలం 19 నుండి 20 బోగీలను మాత్రమే సమకూర్చింది. 10 నుండి 11 కంపెనీల జవాన్లు, వారి భారీ లగేజీ, ఇతర సామగ్రిని ఈ పరిమిత బోగీలలో సర్దడం అసాధ్యంగా మారింది.అపరిశుభ్రత.. మహిళా సిబ్బందికి తప్పని అవస్థలుదీనికి తోడు ప్రయాణంలో కనీస అవసరాలైన నీటి సరఫరా, బోగీల శుభ్రతను రైల్వే శాఖ పూర్తిగా విస్మరించింది. రైలు కాలపట్టిక (ఇటినెరరీ) ప్రకారం నిర్దేశిత స్టేషన్లలో బోగీలను శుభ్రం చేయాల్సి ఉన్నప్పటికీ, అనేక చోట్ల ఆ పనులు చేయలేదు. ఫలితంగా బోగీలు అపరిశుభ్రంగా మారి, దుర్వాసనతో జవాన్ల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విధుల్లో ఉన్న మహిళా సిబ్బంది ఈ అపరిశుభ్రత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ లేఖలో ప్రస్తావించిన సీఆర్పీఎఫ్, తిరుగు ప్రయాణంలోనైనా మెరుగైన ఏర్పాట్లు చేయాలని కోరగా.. దీనిపై స్పందించిన రైల్వే బోర్డు అధికారులు, లోపాలను సరిదిద్దుతామని హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: ముంపు గ్రామాల్లో ముత్యాల సాగుతో కాసుల వర్షం -
ముంపు గ్రామాల్లో ముత్యాల సాగుతో కాసుల వర్షం
దేశంలో వ్యవసాయం అంటే కేవలం వరి, గోధుమలు, ఇతర ధాన్యాలు, కూరగాయలు పండించడమనే భావనలో ఇప్పుడు మార్పు చోటుచేసుకుంటోంది. సరికొత్త సాంకేతికత, వినూత్న ఆలోచనలతో రైతులు నూతన మార్గాలవైపు పయనిస్తూ, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలకే పరిమితమనుకున్న ‘ముత్యాల సాగు’ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ గ్రామాల్లో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. ముంపునకు గురై, ఎందుకూ పనికిరాదనుకున్న భూములను ముత్యాల గనులుగా మార్చుకుంటూ అక్కడి రైతులు, యువత అద్భుతాలు సృష్టిస్తున్నారు.ముంపు భూమే ముత్యాల గనిమురాదాబాద్కు చెందిన రైతు డాక్టర్ దీపక్ మెహ్రోత్రా విజయగాథ ఈ మార్పునకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆయనకు లోతట్టు ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉండేది. చుట్టుపక్కల పొలాల నుంచి వచ్చే వరద నీరంతా ఆయన భూమిలోనే చేరి, నిత్యం జలమయంగా ఉండేది. దీనివల్ల సాధారణ పంటలు పండించడం అసాధ్యంగా మారింది. అయితే ఈ సమస్యను ఆయన ఒక అవకాశంగా మార్చుకున్నారు. నీటి నిల్వలను వాడుకుంటూ ముత్యాల సాగు చేయవచ్చనే సరికొత్త ఆలోచనతో ముందడుగు వేశారు.దేశీయ అవసరాలే పెట్టుబడిగా..డాక్టర్ దీపక్ ముత్యాల సాగుపై పరిశోధన చేస్తున్నప్పుడు ఒక షాకింగ్ నిజం తెలిసింది. భారతదేశానికి అవసరమైన ముత్యాలలో కేవలం మూడు శాతం మాత్రమే దేశంలో తయారవుతున్నాయి. మిగిలిన 97 శాతం ముత్యాలను ఇతర దేశాల నుండి భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. ఈ భారీ మార్కెట్ అంతరాన్ని గమనించిన ఆయన, ముత్యాల సాగును ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. తక్కువ స్థలంలోనే ఎక్కువ లాభాలు సాధించే ఈ రంగానికి శ్రీకారం చుట్టారు.ముత్యం ఎలా తయారవుతుంది?ముత్యాల సాగు ప్రక్రియ వినడానికి ఎంత వింతగా ఉంటుందో, దాని వెనుక ఉన్న సాంకేతికత అంతకంటే ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సాగు కోసం ప్రత్యేకమైన ఆల్చిప్పలను (Oysters) ఉపయోగిస్తారు. ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా చిప్ప లోపల ‘న్యూక్లియస్’ అనే చిన్న కేంద్రాన్ని అమరుస్తారు. ఆ తర్వాత ఈ చిప్పలను చెరువుల్లోని నియంత్రిత వాతావరణంలో భద్రపరుస్తారు. కాలక్రమేణా చిప్ప లోపల సహజంగా ముత్యం రూపుదిద్దుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పడుతుంది. ఈ సమయంలో నీటి నాణ్యత, ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షించడం ఎంతో కీలకం.వ్యవసాయాన్ని మించిన లాభాలుముత్యాల సాగుకు ఎకరాల కొద్దీ భూమి అవసరం లేదు. చిన్న చెరువులు లేదా నీరు నిలిచే చిన్నపాటి లోతట్టు ప్రాంతాలు ఉంటే సరిపోతుంది. సాంప్రదాయ పంటలతో పోలిస్తే ఇందులో పెట్టుబడి తక్కువ, ఆదాయం చాలా ఎక్కువ. మురాదాబాద్లోని విద్యార్థులు, యువత సైతం ఈ రంగాన్ని తమ భవిష్యత్తు వ్యాపారంగా ఎంచుకుంటున్నారు. మార్కెట్లో ముత్యాలకు ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా, ఒకసారి పెంపకం పూర్తయ్యాక రైతులు ఊహించని రీతిలో లాభాలను అందుకుంటున్నారు.మారిన రైతుల తలరాతలుడాక్టర్ దీపక్ సాధించిన విజయం మురాదాబాద్ పరిసర గ్రామాల్లో సంచలనంగా మారింది. ఆయనను చూసి స్థానిక రైతు సుభాష్ చంద్ర, ఆయన భార్య సునీత కూడా ముత్యాల సాగు వైపు ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం వారు తమ సొంత చెరువుల్లో వేలాది ఆల్చిప్పలను పెంచుతున్నారు. వరదలు, నీటి ముంపు సమస్యల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయే రైతులకు ఈ సాగు ఒక వరం లాంటిదని, సాంప్రదాయ వ్యవసాయం కంటే దీని ద్వారా సుస్థిరమైన, అత్యధిక ఆదాయం పొందే అవకాశం ఉందని వారు ఆనందంగా చెబుతున్నారు.సరికొత్త గ్రామీణ ఆర్థిక విప్లవంముత్యాల సాగు కేవలం పాత తరం రైతులకే పరిమితం కాలేదు. గ్రామీణ యువతకు ఇది ఒక అద్భుతమైన ఉపాధి మార్గంగా మారింది. పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం లేకుండా, సరైన శిక్షణ, కాస్త ఓపిక ఉంటే ఎవరైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రస్తుతం డాక్టర్ దీపక్ స్వయంగా స్థానిక యువతకు, రైతులకు ఈ సాగులో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మురాదాబాద్లో మొదలైన ఈ వినూత్న ప్రయోగం, భారతదేశంలోని ప్రతి గ్రామానికి సరికొత్త దిశను చూపిస్తూ, వ్యవసాయ రంగంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది.ఇది కూడా చదవండి: హిమగిరిపై భారత్ హవా.. 3 గంటల ప్రయాణం ఇక 15 నిమిషాల్లో.. -
కాంగ్రెస్కు చెక్.. వ్యూహం మార్చిన స్టాలిన్!
సాక్షి, చెన్నై: జాతీయ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. ప్రస్తుత విపక్షాల ఇండియా కూటమి స్థానంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడానికి ద్రావిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ ఈ మేరకు సరికొత్త వ్యూహానికి అమలు చేసే దిశగా పార్టీ కీలక నేతలైన సీనియర్ ఎంపీలను రంగంలోకి దించనున్నట్టు సమాచారం.ఈ జాతీయ కూటమి ఏర్పాటుకు సంబంధించి చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్లుగా ఉన్న ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కీలక ఎంపీలకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రతిపాదిత కూటమిలో భాగస్వామ్యం కావాల్సిందిగా ప్రాంతీయ పార్టీలకు డీఎంకే ఆహ్వానాలు పంపబోతున్నట్టు చర్చ జరుగుతోంది. నిన్నటి ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్, రాహుల్ తీరును అనేక పార్టీల నేతలు తీవ్రంగా దుయ్యబట్టి ఉండటాన్ని పరిగణించి ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ముఖ్య ప్రతినిధులతో తన ఎంపీల ద్వారా మాట్లాడించే దిశగా స్టాలిన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తమిళనాట చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్కు స్థానం లేదు.. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కానున్న జట్టులో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టాలన్న నిర్ణయానికి స్టాలిన్ రావడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కొత్త జట్టును ఏర్పాటు చేయడంలో భాగంగా పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ, కాంగ్రెస్ రూపంలో నష్టపోయిన పార్టీ నేతలతో సంప్రదింపునకు సన్నద్దం అవుతుండటం గమనార్హం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకం చేయడమే లక్ష్యంగా ఎంకె గ్రూప్ (డీఎంకే) అడుగుల వేగాన్ని మున్ముందు పెంచనున్నట్టు చర్చ జరుగుతున్నది. ‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుండి కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే తాజాగా కాంగ్రెస్కు చెక్ పెట్టడం లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయనున్నడంతో మున్ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి పెరిగినట్లయ్యింది. -
నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం నమోదైంది. వరుసగా మూడు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోదీ.. అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును ఇవాళ్టితో అధిగమిస్తూ మోదీ చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు.2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. 2019, 2024 లోక్సభ ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టితో ఆయన ప్రధానమంత్రి పదవిలో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు.ఇప్పటివరకు ఈ ఘనత స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. తొలి సాధారణ ఎన్నికల అనంతరం 1952లో ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన నెహ్రూ.. 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు ప్రధానిగా కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ అధిగమించారు. ప్రధానమంత్రుల పదవీకాలాల జాబితాలో ఇందిరా గాంధీ 4,077 రోజులతో మూడో స్థానంలో ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 3,652 రోజులు, అటల్ బిహారీ వాజ్పేయి 2,272 రోజులు, పి.వి. నరసింహారావు 1,827 రోజులు ప్రధానమంత్రులుగా కొనసాగారు.ఇదిలా ఉండగా, మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో ఆయన సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా నిలిచారు. ఈ క్రమంలో ఆయనకు సన్మానం చేయాలని ఎన్డీయే పక్షాలు భావిస్తున్నాయి. శుభాకాంక్షల వెల్లువనరేంద్ర మోదీ రికార్డు నేపథ్యంలో ప్రపంచ దేశాల నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయక ఈ ఘట్టాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం తన నాయకత్వంపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించగా, పాపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మారాపే మోదీని ఆదర్శ నాయకుడిగా కొనియాడారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా ప్రసాద్-బిసెస్సర్ సైతం మోదీ హయాంలో భారత్ ప్రపంచ వ్యవహారాల్లో ప్రభావవంతమైన స్వరంగా ఎదిగిందని పేర్కొన్నారు. గత దశాబ్దంలో భారత్ను ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం, గ్లోబల్ సౌత్కు ప్రధాన ప్రతినిధిగా ఎదగడం, అంతర్జాతీయ దౌత్య వేదికలపై కీలక శక్తిగా మారడం వంటి పరిణామాలు మోదీ నాయకత్వంలో సాధ్యమయ్యాయని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో మోదీ సాధించిన ఈ మైలురాయి కేవలం దేశీయ రాజకీయ ఘట్టమే కాకుండా.. ప్రపంచ వేదికపై భారత్ పెరుగుతున్న ప్రాధాన్యానికి ప్రతీకగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
తెలంగాణలో ఒంటరి పోరే
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలపైనా తమకు ఒక స్పష్టత ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని భారత్ మండంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికీ అన్యాయం జరగదు..: డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో తీవ్రత లేదని అమిత్ షా కొట్టిపారేశారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లును ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికీ, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. లోక్సభలో ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతమున్న నిష్పత్తి ప్రకారం అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లును రూపొందించినట్లు చెప్పారు. అందుకు కావాల్సిన మద్దతు లభించగానే బిల్లును ఆమోదింజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. బిల్లుకు అవసరమైన మద్దతు అభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వన్ నేషన్ వన్ బిల్లుపై ప్రస్తుతం కమిటీ అధ్యయనం చేస్తోందని.. నివేదిక రాగానే సబంధింత బిల్లుకు అవసరమైన మద్దతు లభిసుందని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీలు బలంగానే ఉన్నాయని.. తమతో కలిసి నడుస్తున్న ఏ ప్రాంతీయ పార్టీకీ ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరణతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ ఆమె నామినేషన్ పత్రాలను నింపారు కాబట్టే తిరస్కరణకు గురై ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. -
హామీలు తప్ప అమలేదీ?
న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. మోదీ సర్కార్ 3.0కు రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ‘హామీ వర్సెస్ వాస్తవం’ పేరిట మంగళవారం ఒక డాక్యుమెంట్ విడుదల చేసింది. మోదీ ప్రభుత్వం నుంచి గత 12 ఏళ్లుగా అనేక హామీలు, భారీ ప్రకటనలు, గొప్ప మాటలు, వార్తా శీర్షికలు వెలువడినప్పటికీ వాస్తవానికి ప్రజల జీవితాల్లో అర్థవంతమైన మార్పు తెచ్చేలా వాటిలో ఒక్కటీ ఆచరణలోకి రాలేదని విమర్శించింది. ఏఐసీసీ రీసెర్చ్ డిపార్టుమెంట్ రూపొందించిన ఈ 75 పేజీల పత్రాన్ని కాంగ్రెస్ నేతలు రాజీవ్ గౌడ, అమితాబ్ దూబే విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, విదేశాంగ విధానం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, సామాజిక రంగం, పౌర స్వేచ్ఛ, మైనారిటీల హక్కులు, చట్టాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి 12 రాయితీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చి వాటిని 4 సిలిండర్లకు కుదించారని మండిపడ్డారు. మహిళలను, వారి కుటుంబాలను దగా చేశారని ఆరోపించారు. భారత్ను ప్రపంచ ఉపాధి కల్పన కేంద్రంగా మారుస్తామంటూ వాగ్దానం చేశారని తెలిపారు. వాస్తవానికి ప్రతి పది మంది గ్రాడ్యుయేట్లలో నలుగురు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని చెప్పారు. పట్టణ ప్రాంత యువతలో నిరుద్యోగిత రేటు 18.4 శాతంగా ఉందన్నారు. నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్లలో 7 శాతం మంది మాత్రమే ఏడాదిలోపు శాశ్వత వేతన ఉద్యోగాన్ని పొందుతున్నారని చెప్పారు. -
మమత నివాసంలో సీఐడీ సోదా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసంలో రాష్ట్ర సీఐడీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం సోదాలు జరిపారు. కోల్కతా కాళీఘాట్ ప్రాంతంలోని మమతా బెనర్జీ నివాసంలోనే పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది. ఈ భవనంలోనే సీఐడీ అధికారులు సోదాలుచేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి విషయంలో టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీలో చీలిక రావడం తెలిసిందే. ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన సీఐడీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి నోటీసు పంపింది. పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఎమ్మెల్యేల నుంచి సంతకాలను సేకరించినట్లు అభిషేక్ ఇచ్చిన వివరణ ఆధారంగానే ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా తమ ఎదుట హాజరుకావాలని సీఐడీ నోటీసు పంపించగా అభిషేక్ ఢిల్లీ వెళ్లారు. సీఐడీ అధికారుల సోదాల విషయం తెలియగానే టీఎంసీ ఎమ్మెల్యేలు కునాల్ ఘోష్, మదన్ మిత్ర అక్కడికి చేరుకున్నారు. అయితే, అధికారులు వారిని లోపలికి రానివ్వలేదు. అనంతరం టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అక్కడికి వచ్చి సీఐడీ అధికారులతో మాట్లాడారు. సీఐడీ తనిఖీలు చట్టవిరుద్ధం, బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కల్యాణ్ బెనర్జీ విమర్శించారు. సీఐడీ అధికారుల మరో బృందం కోల్కతాలోని కామాక్ వీధిలో ఉన్న అభిషేక్ ఇంటికీ వెళ్లింది. అసెంబ్లీలో పార్టీ నేతను ప్రకటించే విషయంలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వివాదం రాజుకుని చివరకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని శాసనసభలో తమ విపక్షనేతగా ఎన్నుకునేదాకా వెళ్లడం తెల్సిందే. -
మహిళల రక్షణ కోసం ‘సింగప్పెన్’
సాక్షి, చెన్నై: మహిళలపై జరిగే నేరాలను అడ్డుకునేందుకు తమిళనాడు ప్రత్యేకంగా సింగప్పెన్ అనే ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. సీఎం విజయ్ మంగళవారం ఈ యూనిట్ను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలపై నేరాల కట్టడికి డ్రోన్ పెట్రోలింగ్ విధానాన్ని తీసుకువస్తామన్నారు. మహిళల భద్రతకు కొత్త విభాగం మరింత సహాయకారిగా ఉంటుందని సీఎం విజయ్ తెలిపారు. ఈ విభాగం కోసం ప్రత్యేకంగా కాకీ ప్యాంటు, బ్లూ షర్ట్తో యూనిఫాంను రూపొందించారు. ఈ విభాగం లోగోను సీఎం విడుదల చేశారు. సింగప్పెన్ అంటే తమిళంలో ఆడసింహం వంటి ధైర్యశాలి అయిన మహిళ అని అర్థం. సింగప్పెన్ కోసం రూ.354 కోట్లు కేటాయిస్తామని, కొత్తగా 2,500 మందిని నియమిస్తామని ప్రకటించారు. -
ఢిల్లీ అగ్ని ప్రమాదం : మరో తీవ్ర విషాదం
సాక్షి, న్యూఢిల్లీ: గతవారం ఢిల్లీలోని మాలవ్య నగర్లోని హోటల్ అగ్నిప్రమాద ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది.ఎనిమిది మంది కుటుంబ సభ్యుల మరణం గురించి తెలియక ముందే ఆ కుటుంబంలోని చివరి గుండె ఆగిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుత్ను కుటుంబంలోని ఏకైక సభ్యుడు, 80 ఏళ్ల వృద్ధుడు రాధే శ్యామ్ అగర్వాల్ కూడా ఈరోజు కన్నుమూశారు. దీంతో మొత్తం కుటుంబం ఆహుతైపోయిన ఘటన కలచి వేస్తోంది. ఆ ఇంట్లో నవ్వుతూ, ఆనందంగా గడిపిన కుటుంబం ఇప్పుడు సమూలంగా సమాధి అయిపోయింది. ఈ ఘోర కలి వార సమీప బంధువుల్లో ఎప్పటికీ పూడ్చలేని ఒక పెద్ద గాయాన్ని మిగిల్చింది.అగర్వాల్ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకుని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక సభ్యుడు కూడా మృతిచెందడం కూడా కలిచివేసింది.శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న రాధే శ్యామ్ అగర్వాల్ సాకేత్లోని 'మాక్స్ హాస్పిటల్' ఐసీయూ (ICU) లో చికిత్స పొందుతున్నారు.అయితే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం, దేనికైనా సిద్ధంగా ఉండాలని వైద్యులు చెప్పడంతో,దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న 'ఫ్లోరిష్ ఇన్' అనే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ (B&B) హోటల్లో బస చేశారు. వారి ఇల్లు గురుగ్రామ్ సెక్టార్ 46లో ఉండటం, అక్కడి నుండి ట్రాఫిక్ సమస్యల వల్ల రాకపోకలు కష్టమవుతాయని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.అదే ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది.ఈ ప్రమాదంలో రాధే శ్యామ్ కుమారుడు వివేక్ అగర్వాల్, భార్య ప్రేమ్ లత అగర్వాల్, కోడలు తర్జని అగర్వాల్, మనవరాళ్లు జివిషా, వార్యలతో పాటు మరో ముగ్గురు బంధువులు మరణించారు.తన వాళ్ళు ఇకలేరని ..రారని తెలియకుండానేఆసుపత్రిలో ఉన్న రాధే శ్యామ్ అగర్వాల్కు తన కుటుంబం మొత్తం అగ్నిప్రమాదంలో చనిపోయిందనే విషయమే తెలియదు. తనను చూడటానికి ఎందుకు రాలేదని ఆయన నర్సులను, వైద్యులను అడుగుతూనే ఉండేవారు. మనవరాలు జివిషా, బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతూ, తాతగారిని చివరిసారిగా చూద్దామని ఢిల్లీకి వచ్చింది. ఆమె వచ్చినందుకు సంతోషించిన రాధే శ్యామ్, తన మనవరాలు తన కోసమే అంత దూరం నుండి వచ్చిందని నర్సులతో ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. కానీ, తాతయ్యకు వీడ్కోలు పలకడానికి వచ్చిన మనవరాలే ముందుగా అనంత లోకాలకు వెళ్లిపోవడం అత్యంత విచారకరం. -
ఎన్డీఏకు టీఎంసీ ఎంపీల మద్దతు..?
దేశంలో ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. అయితే ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి డబుల్ బోనస్ను తెచ్చిపెట్టాయి. ఒకటేమో ఎంతోకాలంగా అందని ద్రాక్షలా ఉన్న బెంగాల్లో విజయం సాధించడమైతే. మరోటేమే తమ ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న డీఎంకే, టీఎంసీలను మట్టికరిపించి ఇండియా కూటమిని దెబ్బతీయడం.ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెత.. ప్రస్తుతం అధికార ఎన్డీఏ కూటమికి సరిగ్గా సరిపోతుంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఎన్టీయే జయకేతనం ఎగురవేసింది. దానితో పాటు ఎంతో కాలంగా కాషాయ పార్టీకి కొరకరాని కొయ్యలుగా ఉన్న టీఎంసీ మమతా బెనర్జీ, డీఎంకే స్టాలిన్ ఓడిపోవడంతో ఆ పార్టీకి డబుల్ బోనస్ లభించినట్లయింది. దీంతో జాతీయస్థాయిలో ఎన్డీఏకు ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా కూటమిని బలహీనపరిచి జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం లేకుండా చేసుకుంటుంది.టీఎంసీలో చీలికటీఎంసీలో మమతా బెనర్జీకి అసమ్మతి సెగ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు అసమ్మతి గళం ఎగురువేశారు.లోక్సభలో టీఎంసీ చీఫ్ విప్ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి అధికారికంగా మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టీఎంసీ సీనియర్ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి, అలాగే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజా చీలికతో మమతా బెనర్జీ వైపు కేవలం 8 మంది ఎంపీలు మాత్రమే మిగిలారు. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి చీలిపోయారు. దీంతో మమతా బెనర్జీకి వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి.కాంగ్రెస్కు డీఎంకే షాక్మరోవైపు డీఎంకే కాంగ్రెస్కు షాక్ ఇచ్చింది. హస్తం పార్టీ మిత్రధర్మాన్ని పాటించకుండా టీవీకేకు మద్దతిచ్చిందని ఆరోపించింది. దీంతో ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాము ఇకపై ఇండియా కూటమిలో భాగం కాదని స్పష్టం చేసిన డీఎంకే, భవిష్యత్తులో బీజేపీకి వ్యతిరేకంగా మరో కొత్త లౌకిక కూటమి ఏర్పాటయ్యే అవకాశం ఉందని సూచించింది.మెజార్టీ లేక వీగిపోయిన బిల్లు కాగా ఇటీవల కేంద్రం లోక్సభలో ప్రవేశ పెట్టిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ లేక వీగిపోయాయి. ప్రత్యేక మెజారీటీకి 352 మంది ఎంపీల మద్దతు అవసరం ఉండగా 298 సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. దీంతో బిల్లు వీగిపోయింది. కాగా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఎస్పీ తరువాత అత్యధిక ఎంపీ స్థానాలు తృణముల్ 28, డీఎంకే 22 స్థానాలు గెలుపొందాయి.ప్రస్తుతం డీఎంకే ఇండియా కూటమి నుంచి వైదొలగగా, టీఎంసీ ఎంపీలు ఎన్డీఏకు మద్దతిస్తామని స్పీకర్కు లేఖ రాశారు. దీంతో ఇండియా కూటమికి దాదాపుగా 40 మంది ఎంపీల మద్దతు తగ్గినట్లైంది. త్వరలో జరిగే వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో బీజేపీ మరోసారి రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.అయితే డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుండి వైదొలిగినప్పటికీ బీజేపీకి మద్దతివ్వడం అనేది దాదాపు అసంభవం. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాధాన్యత తగ్గుతుందని నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీలలో డీఎంకే ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ బిల్లులకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ప్రకటించదు. అయినప్పటికీ గతంతో పోలిస్తే లోక్సభలో బీజేపీ బలం మరింత పెరిగింది.దీంతో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇటు బీజేపీకి విజయం ఇవ్వడంతో పాటు ప్రధాన ప్రతిపక్షాలను మట్టికరిపించాయనేది కాదనలేని సత్యం. -
పాఠశాలల్లో చివరి బెంచీకి స్వస్తి?
బెంగళూరు: ప్రతి తరగతి గదిలో ఇకపై చివరి బెంచ్ ఉండదు. యూ ఆకారంలో లేదా వృత్తాకారంలో బెంచ్లు ఏర్పాటు చేస్తారు. కేరళలో ఇదే విధానం కొనసాగుతోంది. ఇదేవిధానాన్ని రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. చదువులో వెనుకబడిన విద్యార్థులను వెనుకబెంచ్లో కూర్చొబెడతారనే అపవాదు ఉండేది. దీంతో చివరి బెంచ్లో కూర్చునే విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఉండేది కాదు. దీంతో ప్రతి ఒక్క విద్యార్థిపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టేలా వృత్తాకార, లేదా యూ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంటుందని, ఇన్నాళ్లూ తాము చివరి బెంచీకి పరిమితం అయ్యామనే వేదన వారిలో తొలగిపోతుందని భావిస్తున్నారు. సంప్రదాయ వరుస ఆసనాల వ్యవస్థకంటే కేరళ విధానంలో విద్యార్థులను కూర్చొబెట్టడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచినట్లు అవుతుందని విద్యానిపుణుల అభిప్రాయం. యూ ఆకార ఆసనాల వ్యవస్థలో ఉపాధ్యాయులు తరగతి కేంద్రభాగాల్లో నిల్చొని పాఠాలు చెబుతారు. దీంతో విద్యార్థులందరూ శ్రద్ధగా పాఠాలు వింటారు. పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయి. అంతేగాకుండా విద్యార్థులతో బృంద చర్చలు, పాఠ్యాంశాలలో సందేహాలు తీర్చుకునేందుకు ఈ విధానం అత్యుత్తమమైనదని నిపుణులు భావిస్తున్నారు. -
12 నూక్లియర్ ఆయుధాలు మోహరింపు : ఇండియా వ్యూహాత్మక మార్పు!
సాక్షి, న్యూఢిల్లీ: అణ్వాయుధ విధానానికి సంబంధించి ఇండియా ముఖ్యమైన అణు వ్యూహాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలిసారిగా 12 అణ్వాయుధాలను (Nuclear Warheads) మోహరిం చిందంటూ అంతర్జాతీయ పరిశోధన సంస్థ (సిప్రి) రిపోర్ట్ సంచలనంగా మారింది. అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో ఇప్పటికే దేశం వద్ద 190 అణ్వాయుధాలుఉన్నాయని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆయుధ పర్యవేక్షణ సంస్థ SIPRI ఈ నివేదిక తాజాగా విడుదల చేసింది.స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) తాజా నివేదిక ప్రకారం భారతదేశం మొట్టమొదటి సారిగా 12 అణ్వాయుధాలను మోహరించింది. భారతదేశం తన దశాబ్దాల కాలపు అణువిధానాన్ని పక్కనబెట్టి, తొలిసారిగా 12 అణు వార్హెడ్లను వ్యూహాత్మకంగా మోహరించింది. గతంలో అణు వార్హెడ్లను, వాటిని ప్రయోగించే క్షిపణులను వేర్వేరు నిల్వ కేంద్రాలలో భద్రపరిచే విధానాన్ని (Separate Storage Policy) భారత్ అనుసరించేది. అయితే ఇప్పుడు వాటిని సిద్ధంగా ఉంచడం ద్వారా దేశ రక్షణలో ఉన్నత స్థాయి సంసిద్ధతకు సంకేతమని తెలిపింది.శాంతిసమయంలో కూడా క్షిపణులను సిద్ధంగా ఉంచడం, సముద్రంలో నిరంతర నిఘా లాంటి చర్యలు భారతదేశ రక్షణ సంసిద్ధతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయని SIPRI నివేదిక వెల్లడిస్తోంది. అయితే దశాబ్దాలుగా అణ్వాయుధాలను, వాటిని ప్రయోగించే వ్యవస్థలను వేర్వేరు నిల్వ కేంద్రాలలో ఉంచే విధానానికి బదులుగా ఇది విరుద్ధమైన చర్య అని పేర్కొంది.ఇదీ చదవండి: 10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్నివేదికలోని ముఖ్యాంశాలు భారత అణు చరిత్రలో ఈ వార్హెడ్లను కేవలం నిల్వ ఉంచడమే కాకుండా, ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు (Operationally Deployed) వర్గీకరించడం ఇదే మొదటిసారి. ఈ 12 వార్హెడ్లను క్షిపణులతో అనుసంధానించడం (Mating) లేదా సముద్రగర్భ నిఘా నిర్వహించే అణు జలాంతర్గాములపై (SSBNs) ఉంచడం ద్వారా క్షేత్రస్థాయి దళాల వద్ద సిద్ధంగా ఉంచారు.2026 జనవరి నాటికి భారతదేశం వద్ద ఉన్న మొత్తం అణు ఆయుధాల సంఖ్య 190కి చేరిందని అంచనా (గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది). ఇవి వైమానిక, భూతల మరియు సముద్ర రక్షణ వ్యవస్థలతో అనుసంధానించబడి ఉన్నాయి. ఇదీ చదవండి: 40ల తరువాత అల్ట్రామారథాన్ : తృటిలో తప్పిన ముప్పు"నో ఫస్ట్ యూజ్" (No First Use) విధానంఅణ్వాయుద విధానంలో వ్యూహాత్మక మార్పు జరిగినప్పటికీ, ఇండియా తన ప్రాథమిక అణు విధానమైన "నో ఫస్ట్ యూజ్" (మొదటగా అణు దాడి చేయకూడదు) అనే సూత్రానికే కట్టుబడి ఉంది. శత్రు దేశాలు అణు దాడికి పాల్పడితే మాత్రమే, ప్రతీకార చర్యగా మాత్రమే, భారత్ తన అణు ఆయుధాలను ఉపయోగిస్తుంది. అంతేకాదు భారతదేశం పమర్థవంతమైన అణ్వాయుధాలను కలిగి ఉంది. ఈ సామర్థ్యం ఆయుధ పోటీలో పాల్గొనడానికి కాకుండా, కేవలం దురాక్రమణదారులను నిరోధించడానికే రూపొందించబడింది.భారత్ అణుసామర్థ్యం పరిమితమైనప్పటికీ, దీన్ని ఆయుధాల పోటీ కోసం కాకుండా, దేశ రక్షణ కవచంగా మాత్రమే భావిస్తుంది. -
40ల తరువాత అల్ట్రామారథాన్ : తృటిలో తప్పిన ముప్పు
ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఉద్యోగ ఒత్తిళ్లు, గంటల తరబడి కూర్చునే జాబ్ నుంచి ఫిట్గా మారాలని నిర్ణయించుకుని, తీవ్ర కసరత్తు చేస్తారు. కానీ దీనికి సంబంధించి వైద్యుల సలహాలు, మందస్తు ప్రిపరేషన్ లేకపోతే ముప్పు తప్పదు. బెంగళూరుకు చెందిన ఒక ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం ఈ విషయాన్నే మరోసారి రుజువు చేసింది. పరుగు మంచిదే, కానీ ముందస్తు ప్రిపరేషన్ అవసరం,సురక్షితమైన ఆరోగ్యమే అంతిమ లక్ష్యం కావాలి అనే అంశంపై ఓ కథనం.బెంగళూరుకు చెందిన, 40 ఏళ్ల మధ్య వయసు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని భావించాడు. ఏళ్ల తరబడి ఒత్తిడితో కూడినడెస్క్ జాబ్నుంచి ఫిట్గా మారాలను కున్నాడు. అంతేకాదు లాంగ్-డిస్టెన్స్ రన్నింగ్ను చేపట్టాలని నిర్ణయించుకున్నాడు అమెరికాలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అంతలోనూ ఊహించని ప్రమాదం అతణ్ని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. ఇంతకీ ఏమైందంటే.అల్ట్రామారథాన్కోసం శ్రద్ధగా శిక్షణ పొందాడు. గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సంకేతాలవీ లేకుండా ఆరోగ్యంగా కనిపించాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన అతనికి షాక్ ఇచ్చింది. అతను తన ప్రాక్టీస్ రన్ల సమయంలో ట్రాక్పై కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు ఎమర్జెన్సీ రూమ్కు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలో అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు ప్రధాన కరోనరీ ధమనులలో క్లాట్స్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఆ తరువాత పరీక్షల్లో హై కొలెస్ట్రాల్ స్థాయిలు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్రతో సహా, ఏళ్లుగా గుర్తించడని పలు అంతర్లీన ప్రమాద కారకాలు బయటపడ్డాయి.ఒక విధంగా చెప్పాలంటే అతను చాలా అదృష్టవంతుడు. ఒక పెను ప్రమాదం జరగక ముందే అతని పరిస్థితిని గుర్తించారు. గుండె ఆరోగ్యానికి పరుగు ఉత్తమమైన వ్యాయామమే అయినప్పటికీ, మధ్య వయస్సులో ఎలాంటి ముందస్తు సన్నాహం లేకుండా అకస్మాత్తుగా తీవ్రమైన ఓర్పు శిక్షణను ప్రారంభించడం, సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న అంతర్లీన వ్యాధిని కొన్నిసార్లు బయట పెట్టగలదని ఈ కేసు గుర్తు చేస్తుంది.పరుగు తీయడం వల్ల గుండె జబ్బులు రావు. నిజానికి ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, సుదీర్ఘకాలం పాటు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చాలా కాలం గడిపి, ఒక్కసారిగా 40 ఏళ్ల వయసులో తీవ్రమైన పరుగు పందాలు (మార్గాథాన్లు) ప్రారంభించడం వల్ల, లోపల దాగి ఉన్న గుండె సమస్యలు అకస్మాత్తుగా బయటపడే ప్రమాదం ఉంది. 40 ఏళ్లు పైబడిన వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, ధూమపానం వంశపారంపర్య గుండె జబ్బుల వంటి రిస్క్ ఫ్యాక్టర్లు చాలా సంవత్సరాలుగా లోపల నెమ్మదిగా ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.బయటకు ఎంతో ఫిట్గా కనిపించే వ్యక్తికి కూడా లోపల గుండె ధమనులలో తీవ్రమైన బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది.ఒక్కసారిగాతీవ్రంగా శ్రమించడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి, రక్తపోటు ఎక్కువ అవుతుంది. దీనివల్ల లోపల ఉన్న కొవ్వు పలకలు (plaques) ఊడిపోయి హార్ట్ ఎటాక్కు దారితీయవచ్చు.40 ఏళలు దాటిన తరువాత ముందే కార్డియాక్ స్క్రీనింగ్ అంటే గుండె పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ECG, ఎకోకార్డియోగ్రామ్ , ట్రెడ్మిల్ టెస్ట్ వంటివి చేయించుకోవడం ఉత్తమం. పరుగు, లేదా కఠిన వ్యాయామాలను ఆరంభించే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.ప్రధానంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ పరీక్షలతో ఫ్యామిలీ హిస్టరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి 'కరోనరీ CT యాంజియోగ్రఫీ' ద్వారా లోపల ఉన్న బ్లాక్స్ను ముందే గుర్తించవచ్చు.వ్యాయామాన్ని ఒకేసారి తీవ్రం చేయకూడదుకొన్ని సంవత్సరాలుగా రన్నింగ్ చేయని వారు ఒక్కసారిగా కొన్ని నెలల్లోనే పెద్ద రేసులకు సిద్ధం కాకూడదు.తొలుతసాధారణ నడకతో ప్రారంభించి, ఆపై వేగంగా నడవడం (Brisk Walking), ఆ తర్వాతే రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.వేగం లేదా దూరం కంటే క్రమం తప్పకుండా చేయడం (Consistency) ముఖ్యం. దీనివల్ల గుండె, కండరాలు, కీళ్లకు తగిన సమయం దొరుకుతుంది.మరి ఏం చేయాలి?40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కండరాల సాంద్రత సహజంగానే తగ్గుతుంది. కాబట్టి కేవలం పరుగు మాత్రమే సరిపోదు. స్ట్రెంత్ ట్రైనింగ్ (కండరాల వ్యాయామం) తప్పనిసరివారానికి కనీసం రెండు సార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు (Strength Training) చేయాలి.ఇది మోకాళ్లు, నడుము, తుంటి భాగాలపై ఒత్తిడిని తగ్గించి గాయాలు కాకుండా కాపాడుతుంది.అంతేకాదు భారీ భోజనం వెంటనే రన్నింగ్ చేయకూడదు. ఆహారం తిన్న తర్వాత కనీసం రెండు గంటల సమయం ఇచ్చి, ఆపై రన్నింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావు. శరీరం కూడా బాగా సహకరిస్తుంది. ఇదీ చదవండి: 10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్ -
హిమగిరిపై భారత్ హవా.. 3 గంటల ప్రయాణం ఇక 15 నిమిషాల్లో..
న్యూఢిల్లీ: భారత ఇంజనీరింగ్ చరిత్రలో మరో సరికొత్త మైలురాయి నమోదైంది. అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన సింగిల్-ట్యూబ్ బై-డైరెక్షనల్ టన్నెల్ ‘జోజిలా సొరంగం’ ప్రధాన విభాగం అనుసంధాన ప్రక్రియ (బ్రేక్థ్రూ) విజయవంతంగా పూర్తయింది. సుమారు 11,578 అడుగుల ఎత్తులో, 13.153 కిలోమీటర్ల పొడవునా గుర్రపు నాడా ఆకారంలో రూపుదిద్దుకున్న ఈ అద్భుత కట్టడాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వీక్షించారు. భారతీయ ఇంజనీర్ల అసాధారణ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ కశ్మీర్, లడఖ్ ప్రజల జీవితాల్లో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.3 గంటల ప్రయాణం.. 15 నిమిషాల్లోనే!ప్రస్తుతం సోనామార్గ్ నుంచి ద్రాస్, కార్గిల్, లడఖ్ వెళ్లే ప్రయాణికులు అత్యంత ప్రమాదకరమైన జోజిలా పాస్ గుండా వెళ్లాల్సి వస్తోంది. తీవ్రమైన మంచు తుఫానులు, ప్రమాదకరమైన మలుపులతో కూడిన ఈ మార్గంలో ప్రయాణం ప్రాణాంతకంగా సాగుతుంది. అయితే 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ సొరంగం అందుబాటులోకి వచ్చాక ప్రస్తుతం పడుతున్న 3.5 గంటల సుదీర్ఘ ప్రయాణ సమయం కేవలం 15 నిమిషాలకు తగ్గిపోనుంది. ఇది జమ్ముకశ్మీర్లోని బాల్తాల్ (సోనామార్గ్), లడఖ్లోని మణిమార్గ్ (ద్రాస్) ప్రాంతాలను నేరుగా కలుపుతుంది.ఏడాది పొడవునా నిరంతర రవాణాశీతాకాలంలో భారీ హిమపాతం, మంచు కొండలు విరిగిపడటం వల్ల ప్రతి ఏడాది జోజిలా పాస్ దాదాపు 5 నుండి 6 నెలల పాటు పూర్తిగా మూతపడేది. దీనివల్ల లడఖ్ ప్రాంతానికి దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయి.. రేషన్, మందులు, నిత్యావసర వస్తువుల తీవ్ర కొరత ఏర్పడేది. ఇకపై ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ మెగా టన్నెల్ ద్వారా వాతావరణంతో సంబంధం లేకుండా, ఏడాది పొడవునా కశ్మీర్ నుండి లడఖ్ వరకు వాహనాల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతాయి.సైన్యానికి బలం.. పర్యాటకానికి ఊతంచైనా, పాకిస్తాన్లతో సరిహద్దులు పంచుకునే ఈ అత్యంత సున్నితమైన ప్రాంతంలో భారత సైన్యానికి ఈ టన్నెల్ ఒక రక్షణ కవచంలా మారనుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సరిహద్దులకు సైనికులను, భారీ ట్యాంకులను, యుద్ధ సామగ్రిని వేగంగా తరలించడానికి ఇది దోహదపడుతుంది. దీనితో పాటు, లడఖ్, కార్గిల్, సోనామార్గ్లలో ఏడాది పొడవునా పర్యాటకం వర్ధిల్లుతుంది. శీతాకాలంలోనూ పర్యాటకుల రాక పెరగడం వల్ల హోటళ్లు, రవాణా, స్థానిక హస్తకళల రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.ఇది కూడా చదవండి: ‘కాక్రోచ్’కు పోటీగా ‘సుప్రీం’ మాజీ జడ్జి ‘ఇష్క్’ పార్టీ! -
పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ సమన్లు
తిరువనంతపురం: మనీలాండరింగ్ కేసులో కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె వీణాకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం కొచ్చిలోని తమ కార్యాలయానికి హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. వీణాతో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థకు చెందిన అధికారులు సహా మొత్తం తొమ్మిది మందికి ఈ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.కాగా, గత నెల పినరయి విజయన్ నివాసంలో ఈడీ ఆకస్మిక తనీఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విజయన్ నివాసంతో పాటు ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ భారీ సోదాలు చేసింది. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈడీ దర్యాప్తు కేరళంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.కొచిన్ మినలర్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్ను శాఖ కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో సోదాలు నిర్వహించిన తరువాత.. సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, చెల్లింపుల వివరాలు బయటపడ్డాయి. అందులో అవకతవకలు బయటపడ్డాయి. కొన్ని లావాదేవీలు నిజమైన వ్యాపార సేవలకు సంబంధం లేకుండానే జరిగాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సీపీఎం, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. నిరసనల సమయంలో ఈడీ సిబ్బంది, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడులు జరిగాయని ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే పోలీసుల చర్యను కేరళ ప్రభుత్వం సమర్థించగా, దర్యాప్తును అడ్డుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. -
‘కాక్రోచ్’కు పోటీగా ‘సుప్రీం’ మాజీ జడ్జి ‘ఇష్క్’ పార్టీ!
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) హడావుడి నడుమ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కాట్జూ సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ఇష్క్ కరో పార్టీ’ (ఐకేపీ) పేరిట ఆయన సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇది కేవలం వ్యంగ్యంగా పెట్టిన పేరు కాదని.. దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, బాలల్లో పౌష్టికాహార లోపం వంటి తీవ్రమైన సమస్యలపై పోరాడటమే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.ప్రేమ కాదు.. సామాజిక ఐక్యతఈ విచిత్రమైన పేరు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని జస్టిస్ కాట్జూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. చాలామంది భావిస్తున్నట్లుగా ఇది ‘వాలెంటైన్స్ డే’ తరహా ప్రేమ వ్యవహారం కాదని, దేశంలోని విభిన్న వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించే సామాజిక తత్వమని ఆయన వివరించారు. ప్రజలందరూ తమ విభేదాలను పక్కనబెట్టి ఒకటైనప్పుడే దేశ సమస్యలు అంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ కొత్త పార్టీలోకి రావాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాకు కాట్జూ బహిరంగంగా ఆహ్వానం పలికారు.కాక్రోచ్ పార్టీ వ్యూహంపై కాట్జూ విమర్శలుఇటీవల నీట్ పరీక్షల వివాదంపై జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’, దాని వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే వ్యూహాలను కాట్జూ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న వారి డిమాండ్ అర్థరహితమన్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేసినా, మరో మంత్రి వస్తారని.. దానివల్ల వ్యవస్థలో వచ్చే మార్పు ఏముంటుందని ఎద్దేవా చేస్తూ అభిజీత్ దిప్కేను కాట్జూ విమర్శించారు.ఇండియా కూటమిలో ‘కాక్రోచ్’ చర్చఒకవైపు కాట్జూ ఈ కాక్రోచ్ పార్టీని కొట్టిపారేస్తున్నా, ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ఈ డిజిటల్ ఉద్యమాన్ని గమనిస్తున్నాయి. ఇటీవల జరిగిన ‘ఇండియా’ కూటమి ప్రతిపక్షాల సమావేశంలో ఈ పార్టీ గురించిన చర్చ రావడం విశేషం. కొందరు నేతలు ఈ డిజిటల్ నెట్వర్క్ వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలపై అనుమానం వ్యక్తం చేయగా.. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మాత్రం దీనిని సమర్థించారు. ఈ ఉద్యమం యువతలోని ఆగ్రహానికి ప్రతిరూపమని, వారు సరైన దారిలోనే వెళ్తున్నారని అభిప్రాయపడుతూ, ప్రతిపక్షాలు వారితో కలిసి పనిచేయాలని సూచించారు.ఇది కూడా చదవండి: రిటైర్డ్ జడ్జి ఫ్యామిలీకి కిల్లర్ గ్యాంగ్ బెదిరింపులు -
10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్
కార్పొరేట్ కంపెనీల్లో ఓ పదిరోజులు సెలవు తీసుకోవడం, వెకేషన్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే తిరిగి ఉద్యోగంలో చేరిపోవడం చాలా కామన్. కానీ వచ్చిన వెంటనే ఆఫీస్ పనిలో పడిపోవడం ఎందుకు, ఇంకో రోజు రెస్ట్ తీసుకొని హ్యాపీగా రా అని మేనేజర్ చెప్పడం ఎక్కడైనా విన్నారా? వినలేదు కదా. అలా గొప్పమనసు చాటుకున్న ఒక మేనేజర్ను బాస్ విత్ హార్ట్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. తన అనుభవాన్ని ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దాని ప్రకారం 10 రోజుల సుదీర్ఘ సెలవుల తర్వాత తిరిగి వచ్చిన సదరు ఉద్యోగి, తాను మరుసటి రోజు నుండి విధుల్లో చేరుతున్నట్లు మెసేజ్ చేశాడు. దానికి ఆయన స్పందిస్తే.. వెరీ గుడ్.. రేపు కూడా సెలవు తీసుకో, కాస్త కుదురుకో. బుధవారం నుంచి ఆఫీసుకు రావచ్చులే అని రిప్లై రావడంతో ఆశ్యర్యం పోయాడు. అందుకే తన సంతోషాన్ని నెటిజనులతో పంచకున్నాడు. తన మేనేజర్తో వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ను రెడ్డిట్లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఎంతో కఠినమైన వాతావరణంలో పనిచేసి వచ్చిన తనకు, మేనేజర్ చేసిన ఈ చిన్న సాయం ఎంతో సంతోషాన్ని, సంస్థలో తన విలువను తెలియజేసిందని పేర్కొన్నాడు.ఆశ్చర్యపోతున్న నెటిజన్లుసాధారణంగా కార్పొరేట్ రంగంలో ఇంతటి దయాగుణాన్ని ఊహించలేమని, ఇది నమ్మశక్యంగా లేదని పలువురు నెటిజన్లు రక రకాలుగా స్పందించారు. మానవీయ కోణంలో ఆలోచించే లీడర్షిప్కు ఇదొ అరుదైన ఉదాహరణ అని నెటిజన్లు కొనియాడు తున్నారు. ఇదీ చదవండి: ఎయిరిండియాకు షాక్ : రెట్టింపు ఫైన్ఇదే మెసేజ్ మా బాస్ పెడితే సెటైరిక్గా అంటున్నాడేమో అని భయపడతా, ఎందుకంటే అంత టాక్సిక్ వాతావరణం ఉంటుంది అని ఒకరు, మరొకరైతే ఉద్యోగం నుంచి తీసేయడానికి ఇదొక సంకేతమేమోనని భయపడతా అని వెల్లడించారు."ఒక రోజు సెలవు అడిగితేనే మా మేనేజర్ తన సొంత ఆస్తి అడిగినట్లు ముఖం పెడతాడు" అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా నువ్వు చాలా లక్కీ బ్రో అంటూ మేనేజర్పై ప్రశంసల జల్లు కురిసింది.ఇదీ చదవండి : 51 ఏళ్ల అక్క, 48 ఏళ్ల తమ్ముడు, కన్నీళ్లు తెప్పించే అనురాగం -
దీదీ అంతలా మారిపోతారనుకోలేదు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. టీఎంసీలో భారీ చీలిక, తన గత ప్రభుత్వ అవినీతి ఆరోపణలపై సువేందు సర్కార్ దర్యాప్తు, మరోవైపు మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీబీఐ విచారణతో ఆమె రాజకీయంగా ఒత్తిడిలో ఉన్నారు. దీనికి తోడు ఇన్నాళ్లు వెన్నంటే ఉన్న సీనియర్లు కూడా ఒక్కొక్కరుగా దూరమవుతున్న పరిస్థితి కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే దీదీతో రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న శతాబ్ది రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని మరింత కుదిపేస్తున్నాయి. ఎన్నికల తర్వాత బెంగాల్ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దారుణ ఓటమి తర్వాత.. మమతా బెనర్జీ పార్టీ చీలిక సంకేతాలతో తీవ్ర గందరగోళం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరిందని.. పార్టీ నుంచి వేరుపడిన ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. “దీదీ ఇంతకు ముందులా లేనేలేరు’’ అంటూ టీఎంసీ రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శతాబ్ది రాయ్.. 2009 నుంచి మమతా బెనర్జీతో అనుబంధం ఉంది. అయితే టీఎంసీలో మునుపటి పరిస్థితులు లేవని అంటున్నారామె. “దీదీ మారిపోయారు. ఎంతలా అంటే.. మేమెవరం ఆమె తీరును జీర్ణించుకోలేనంతలా. గత కొన్నేళ్లలో పార్టీ నిర్ణయాల తీరు పూర్తిగా మారిపోయింది. ఎంపీలైనప్పటికీ మా పరిస్థితి దారుణంగా ఉండేది. పార్టీ లోపల మా గొంతుక వినిపించే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు సమస్యలను చెప్పినా.. నాయకత్వం స్పందించేది కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించాలని ప్రస్తావించిన వినిపించుకోలేదు. పైగా నిర్ణయాల్లోనూ కొందరికే ప్రాధాన్యం ఉండేది. ఆ విషయంలో మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేవారు.. .. దీదీతో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. కానీ, ఆమె ఇప్పుడు పాత దీదీ కాదు. కానీ ప్రజల కోసం పని చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం(తిరుగుబాటు) తీసుకున్నాను” అని శతాబ్ధిరాయ్ తెలిపారు. అలాగే.. పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అవినీతి పేరుకుపోయింది. అది చూసి నేనెంతో నిరాశకు లోనయ్యా. వ్యక్తిగతంగా నాకు స్వచ్ఛమైన ఇమేజ్ ఉంది. అందుకే బయటకు వచ్చేశా.. అని అన్నారామె.శతాబ్ది రాయ్(56) ప్రముఖ బెంగాలీ సినీ నటి. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ ఆమె గుర్తింపు పొందారు. 2009లొ టీఎంసీ తరఫున లోక్సభ ఎన్నికల్లో బీర్బూమ్ నుంచి పోటీ చేసిన నెగ్గారు. అప్పటి నుంచి వరుసగా ఆమెనే ఎన్నికవుతూ వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు లోక్సభలో డిప్యూటీ నేతగా ఆమె ఉన్నారు. మమతా బెనర్జీతో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న నేతగా ఆమెను పరిగణిస్తారు. అందుకే ఆమె చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.తృణమూల్ కాంగ్రెస్లోని అటు చీలిక ఎమ్మెల్యేల వర్గం తిరుగుబాటుకు కారణమైంది. ఆ వెంటనే ఇటు పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు ఇటీవల పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు రావడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఈ పరిణామాల మధ్య దాదాపు డజను మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశమై ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రచారం నడుస్తోంది. అయితే ఆ రెబల్ వర్గం సంఖ్య 20కి చేరిందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. -
రిటైర్డ్ జడ్జి ఫ్యామిలీకి కిల్లర్ గ్యాంగ్ బెదిరింపులు
ముంబై: దావూదీ బోహ్రా వారసత్వ వివాదంలో సంచలన తీర్పునిచ్చిన బొంబాయి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ ఎస్. పటేల్ కుటుంబాన్ని ప్రాణభయం వెంటాడుతోంది. ఆ తీర్పు వెలువడినప్పటి నుంచి అంటే గత 10 నెలలుగా భారత్, బ్రిటన్ దేశాలలో ఉంటున్న ఈ కుటుంబానికి వరుస బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే లండన్లో ఉంటున్న జడ్జి కుమార్తెపై ముసుగు ధరించిన దుండగుడు భౌతిక దాడికి తెగబడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి.ముసుగు ధరించిన దుండగుడి దాడిరిటైర్డ్ జడ్జి జస్టిస్ గౌతమ్ పటేల్ కుమార్తె అదితి పటేల్ లక్ష్యంగా లండన్లో గత ఏప్రిల్లో ఒక ఘాతుకం చోటుచేసుకుంది. ముసుగు ధరించిన ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అదితి పటేల్ ముక్కు ఎముక విరిగింది. ప్రస్తుతం బ్రిటిష్ పోలీసులు, కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన అధికారులు ఈ దాడి ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కుటుంబానికి వస్తున్న అంతర్జాతీయ బెదిరింపులతో ఈ దాడికి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.బెదిరింపు లేఖ.. రహస్య ఎస్డీ కార్డ్ఈ దాడి ఘటన మరువక ముందే, జూన్ 5న అదితి పటేల్కు మరో అనామక బెదిరింపు లేఖ అందింది. మీ కుటుంబాన్ని అంతమొందించడానికి కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ఆ లేఖలో హెచ్చరించడం సంచలనంగా మారింది. ఆ లేఖతో పాటు ఒక ఎస్డీ కార్డ్ను కూడా దుండగులు పంపారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఎస్డీ కార్డ్లో ఏముందో చూడకుండానే, న్యాయమూర్తి కుటుంబ సభ్యులు దానిని నేరుగా పోలీసులకు అప్పగించారు. గత ఏడాది సెప్టెంబర్ (2025)లో ముంబైలో జస్టిస్ పటేల్కు కూడా ఇలాంటి బెదిరింపు లేఖే వచ్చింది.దావూదీ బోహ్రా వారసత్వ వివాదం ఏమిటి?ఈ వివాదమంతా ఏప్రిల్ 23, 2024న జస్టిస్ గౌతమ్ పటేల్ ఇచ్చిన తీర్పు చుట్టూ తిరుగుతోంది. దావూదీ బోహ్రా ముస్లిం సమాజానికి చెందిన 53వ ఆధ్యాత్మిక గురువు (దాయ్ అల్-ముత్లక్) వారసత్వ పోరుపై ఆయన తుది తీర్పు ఇచ్చారు. ఈ వివాదంలో ముఫద్దల్ సైఫుద్దీన్ను చట్టబద్ధమైన ఆధ్యాత్మిక అధిపతిగా కోర్టు గుర్తించింది. ఆయన స్థానాన్ని సవాలు చేస్తూ తాహెర్ ఫకృద్దీన్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం ఈ సింగిల్ జడ్జి తీర్పును బొంబాయి హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాలు చేయగా, విచారణ పెండింగ్లో ఉంది. -
ఎయిరిండియాకు షాక్ : రెట్టింపు ఫైన్
విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.‘మహారాజా స్కాలర్ స్కీమ్’ వివాదంలో విద్యార్థినికి అనుకూలంగా వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. ‘మహారాజా స్కాలర్ స్కీమ్’ (Maharaja Scholar Scheme) నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందుకు రూ. 74,131 జరిమానా విధిస్తూ రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల పరిష్కార కమిషన్ (State Consumer Redressal Commission) తీర్పునిచ్చింది.2021లో అదనపు లగేజీ (Excess Baggage) కింద ఒక విద్యార్థిని నుండి రూ. 34,131లను ఎయిర్ ఇండియా అక్రమంగా వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె ఈ పథకానికి అర్హురాలేనని సంస్థ అంగీకరించినప్పటికీ, రీఫండ్ (డబ్బులు తిరిగి ఇవ్వడం) ఇవ్వడంలో ఏళ్ల తరబడి జాప్యం చేసింది. దీంతో ఆ విద్యార్థిని కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సదరు విద్యార్థినికి అనుకూలంగా తీర్పునిచ్చింది.జిల్లా వినియోగదారుల కమిషన్ 2024 ఫిబ్రవరి నాటి ఆదేశాల ప్రకారం తనకు చెల్లింపులు చేయకుండా, ఆలస్యం చేయడంతోపాటు, తనను మానసిక క్షోభ గురి చేశారని జైపూర్ నివాసి లావణ్య మాగన్ ఆరోపించింది. దీనికి అదనంగా మరింత పరిహారం అందించాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జుడీషియల్ మెంబర్ ముఖేష్, మెంబర్ దినేష్ కుమార్లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.ఫిర్యాదుదారైన విద్యార్థినిని అనవసరమైన మానసిక వేధింపులకు గురైందని, కోర్టు చుట్టూ తిరగడం వల్ల ఆమె విలువైన సమయం వృధా అయిందని కోర్టు విశ్వసించింది. కాబట్టి ఆమె పడిన మానసిక ఆవేదన పూర్తిగా సమంజసమైనదేనని మే 29న కమిషన్ వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల మధ్య పలుమార్లు ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత, మాగన్ సదరు స్టూడెంట్ స్కీమ్కు అర్హురాలేనని స్వయంగా సంస్థే అంగీకరించిందని వినియోగదారుల కమిషన్ తన తీర్పులో పేర్కొంది.అసలు వివాదం ఏంటి? ఎయిరిండియా ప్రవేశపెట్టిన “మహారాజా స్కాలర్ స్కీమ్” ద్వారా అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విద్యార్థులకు ప్రత్యేక లగేజీ అలవెన్స్ లభిస్తుంది. ఈ స్కీం కిందే యూకేలో చదువుకుంటున్న విద్యార్థిని లావణ్య మాగన్, లండన్నుంచి ఇండియాకు వచ్చేందుకు జూలై 21, 2021న ఎయిరిండియా టికెట్ బుక్ చేసుకుంది. ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ చేసే సమయంలో ఆమెకు ఈ స్టూడెంట్ లగేజీ స్కీమ్ వర్తించదంటూ అదనపు లగేజీ ఛార్జీల కింద 350 బ్రిటిష్ పౌండ్లు (రూ. 34,131) వసూలుచేయడంతో వివాదం మొదలైంది.అకడమిక్ ప్రోగ్రామ్ (చదువు) కాలపరిమితి ముగిసినందువల్ల ఆమె ఈ పథకానికి అర్హురాలు కాదని మొదట ఎయిరిండియా వాదించి, క్లెయిమ్ను తిరస్కరించింది. అయినా మాగన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. తాను నాలుగేళ్ల కోర్సును మూడేళ్లలోనే పూర్తి చేశానని, తన ప్రయాణం చదువు పూర్తి కావడానికి సంబంధించిందేనని వాదించింది. చివరికి ఎయిరిండియా డబ్బులు చెల్లించేందుకు అంగీకరించింది. కానీ దాన్ని చెల్లించడంలో విఫలం కావడంతో మరోసారి వినియోగరుదారుల కమిషన్ను ఆశ్రయించి విజయం సాధించింది. -
ప్రేమించాడనే కక్షతో ఘోరం: గదిలో బంధించి, కర్రలతో కొట్టి..
తెహ్రీ గర్హ్వాల్: ఉత్తరాఖండ్లోని తెహ్రీ గర్హ్వాల్ జిల్లాలో ఒక విషాద ఘటన వెలుగుచూసింది. తమ ఇంటి అమ్మాయితో స్నేహం చేశాడనే నెపంతో 18 ఏళ్ల ఒక దళిత యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయగా, పోలీసులు నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.అర్ధరాత్రి పిలిచి..మృతుడు కేతన్ లాల్ గత ఆరు నెలలుగా సదరు యువతితో స్నేహంగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో సదరు యువతి నుంచి ఫోన్ రావడంతో, కేతన్ తన స్నేహితుడైన దివాకర్ దిమ్రీతో కలిసి ఆమె నివసించే ఖోల్గఢ్ గ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడకు చేరుకోగానే యువతి కుటుంబ సభ్యులు వీరిద్దరినీ ఒక గదిలో బంధించి, కర్రలతో నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు.రక్తపు మడుగులో కుమారుడుమరుసటి రోజు ఉదయం ఆ యువతి తండ్రి.. కేతన్ తండ్రి ధన్పాల్ లాల్కు ఫోన్ చేసి, నీ కొడుకును వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. ధన్పాల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా, కేతన్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండటం చూసి హతాశుడయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో గాయపడిన కేతన్ స్నేహితుడు దివాకర్ ప్రస్తుతం బౌరారీలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.రంగంలోకి పోలీసులు.. నిందితుడి అరెస్ట్ఈ ఘోర ఉదంతంపై తెహ్రీ గర్హ్వాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్వేతా చౌబే స్పందిస్తూ.. నిందితులపై ఐపీసీ హత్య సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2)(వి) కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి యశ్వీర్ సింగ్ పన్వార్ అనే వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎలుగుబంటి స్వైరవిహారం.. 100 పాఠశాలలు మూసివేత! -
పూరీ జగన్నాథ రథయాత్రకు ముహూర్తం ఖరారు
పూరి: ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ మహా ఘట్టం ఈ ఏడాది జూలై 16న జరగనుంది. జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి శ్రీమందిరం నుండి గుండిచా ఆలయానికి చేసే ఈ దివ్య యాత్రను కళ్లారా వీక్షించేందుకు, ఆ రథాల తాళ్లను తాకేందుకు దేశవిదేశాల నుండి లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి వచ్చేందుకు తహతహలాడుతున్నారు.భక్తి పారవశ్యంలో పూరీ క్షేత్రంప్రస్తుతం పూరీ జగన్నాథుడి చెంత ఆధ్యాత్మిక వాతావరణం తొణికిసలాడుతోంది. ఆలయ రథఖలా (రథాల తయారీ స్థలం) వద్ద సంప్రదాయ హస్తకళాకారులు, శిల్పులు అహోరాత్రులు శ్రమిస్తూ భారీ రథాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ పర్వదినం నుంచే ఈ పవిత్ర రథాల నిర్మాణ పనులు ప్రారంభం కావడం ఇక్కడి శతాబ్దాల నాటి సంప్రదాయం. ఈ అద్భుత రథాల రూపకల్పనలో 100 మందికి పైగా సంప్రదాయ కళాకారులు, ఆలయ సేవకులు భక్తిశ్రద్ధలతో నిమగ్నమై ఉన్నారు.ముగ్గురు దేవుళ్లు.. మూడు దివ్య రథాలుఈ రథయాత్రలో ముగ్గురు దేవతామూర్తులకు ప్రత్యేకంగా మూడు భారీ రథాలను తీర్చిదిద్దుతారు. భగవాన్ జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోష’ అని పిలుస్తారు, దీని ఎత్తు సుమారు 45 అడుగులు కాగా, దీనికి 16 భారీ చక్రాలను అమరుస్తారు. బలభద్రుడి రథమైన ‘తాళధ్వజం’ సుమారు 44 అడుగుల ఎత్తుతో, 14 చక్రాలను కలిగి ఉంటుంది. ఇక దేవి సుభద్ర ప్రయాణించే ‘దర్పదలన’ రథం దాదాపు 43 అడుగుల ఎత్తు, 12 చక్రాలతో రూపుదిద్దుకుంటుంది. ఈ మూడు రథాల నిర్మాణానికి ప్రతి ఏటా సరికొత్త కలపను మాత్రమే ఉపయోగించడం విశేషం.జూలై 16న మహా రథయాత్రఈ ఏడాది జూలై 16వ తేదీన పవిత్ర రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ మహా యాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలు తమ ముఖ్య ఆలయం (శ్రీమందిరం) నుండి బయలుదేరి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకుంటారు. ఈ మూడు కిలోమీటర్ల మార్గంలో స్వామివారి రథాలను లాగడానికి, ఆ పుణ్యాన్ని దక్కించుకోవడానికి భక్తజనం తరలివస్తారు.ఒడిశా సాంస్కృతిక వారసత్వ ప్రతీకపూరీ జగన్నాథ రథయాత్ర అనేది కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు. అది ఒడిశా రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి, అక్కడి అద్భుత శిల్పకళా నైపుణ్యానికి ఒక సజీవ ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఈ కళా నైపుణ్యం రథాల తయారీలో స్పష్టంగా కనిపిస్తుంది. భక్తి, సంప్రదాయం, అద్భుత హస్తకళల కలయికగా ఈ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుఈ మహాత్సవానికి దేశ, విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యం, భద్రత కోసం ఒడిశా రాష్ట్ర యంత్రాంగం, ఆలయ యాజమాన్యం, వివిధ భద్రతా సంస్థలు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. రథయాత్ర సాఫీగా సాగేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎలుగుబంటి స్వైరవిహారం.. 100 పాఠశాలలు మూసివేత! -
ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నీలినీడలు
శబరిమల మందిరంలోకి 10–50 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలను అను మతించే విషయంలో ఇంతక్రితం తీర్పును సుప్రీం కోర్టు పునః సమీక్షించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ‘ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్’ సంస్థ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)లో సుప్రీం కోర్టు స్త్రీలందరూ శబరిమల మందిరంలోకి వెళ్లవచ్చని 2018లో తీర్పు చెప్పింది. శబరిమల ఆలయ పూజారితో సహా పలువురు దాఖలు చేసిన పునఃసమీక్ష పిటిషన్ విచారణ సందర్భంగా, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దుర్విని యోగం చేస్తున్నారనీ, ఇప్పుడు సాంకేతికత పెరిగి న్యాయ ప్రక్రియ అందరికీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యాల లక్ష్యం నెరవేరిందనీ, ఇక ఈ వ్యాజ్యాలకు స్వస్తి పలకా లని భారత సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. సుప్రీం కోర్టు కూడా ‘ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్’ వారు ఇలాంటి వ్యాజ్యాన్ని వేసినందుకు అసహనం వ్యక్తం చేసింది. నిజానికి ఎవరైనా కోర్టులో వ్యాజ్యం వేయాలంటే తనే బాధి తుడు అయ్యుండాలి. అతని తరఫున మరెవరూ వ్యాజ్యం వేయ రాదు. దీన్నే ‘లోకస్ స్టాండయి’ అంటారు. ఏదైనా వ్యాజ్యం విచారించేముందు, ఆ వ్యాజ్యంలో పిటిషనర్ ఏ విధంగా బాధితుడో కోర్టులు తప్పనిసరిగా పరిశీలిస్తాయి. ఒకవేళ పిటిషనర్కు ఆ వ్యాజ్యంతో వ్యక్తిగ తంగా సంబంధం లేకపోతే కోర్టులు ఆ వ్యాజ్యాన్ని కొట్టివేస్తాయి. ఆమెతో మొదలు...అయితే కపిలా హింగోరాని అనే మహిళా న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు ఆద్యురాలిగా నిలిచారు. 1979లో మొదటి సారిగా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి, ఎన్నో ఏళ్లుగా దయనీయమైన స్థితిలో జైళ్ళలో మగ్గుతున్న స్త్రీ, బాల, వృద్ధు లతో సహా వేల సంఖ్యలో ‘అండర్ ట్రైయల్ ఖైదీల’ను విడుదల చేయించారు. సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ వి. ఆర్. కృష్ణ అయ్యర్, జస్టిస్ పి.ఎన్. భగవతి చొరవతో ‘లోకస్ స్టాండయి’ నియ మాన్ని పక్కన పెట్టి న్యాయం వైపు నిలబడ్డారు. తరువాత మరెన్నో కేసుల్లో పిల్ను జస్టిస్ భగవతి అనుమతించారు. ఒక వ్యక్తికిగానీ, ఒక సమూహానికిగానీ హక్కుల భంగం జరిగి... పేదరికం చేతగానీ, సాంఘికంగా వెనుకబాటుతనం వల్లగానీ న్యాయ స్థానాలను ఆశ్ర యించలేనివారి హక్కులను కాపాడేందుకు ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా ఏ నాగరీకుడైనా ముందుకు రావచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. అప్పటినుంచి ఎంతోమంది ప్రజాహితం కోరి ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసి చట్టాల్లో మార్పు కోసం శ్రమించారు. ప్రభుత్వ అధికారుల కార్ల మీద ఉపయోగించే ఎర్ర బుగ్గ కేసు నుంచి, పబ్లిక్ స్థలాల్లో మైకుల ఉపయోగం, సినిమా హాళ్లలో జాతీయ గీతం ఆలపించడం, దీపావళి టపాకాయల నియంత్రణ, పర్యావరణం, వాహనాలకు తప్పనిసరి సీట్ బెల్ట్, బ్లడ్ బాంకులు, వీధి కుక్కల బెడద, పని చేసే ప్రదేశాలల్లో లైంగిక హింస, రహదారి ప్రమాదాలు వంటి ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. పిల్స్ లేకుంటే ఎన్నో విస్తృత ప్రజా ప్రయోజనాలు చేకూరేవి కాదు.అయితే, కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేదా కీర్తి కాంక్షతో వీటిని దాఖలు చేస్తున్నారు. వీటిని ‘పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లు’గా కాక ‘ప్రైవేట్ ఇంటరెస్ట్ లిటిగేషన్లు’గా సుప్రీం కోర్టు అభివర్ణించింది. విచారాణార్హం కాని వ్యాజ్యాలను, సుప్రీం కోర్టు, హైకోర్టులు భారీ జరిమానాలు విధించి తిరస్కరిస్తున్నాయి. కోర్టుల విలువైన సమయం వీటి వలన వృథా అవుతున్నదన్న మాట నిజమే అయినా... కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో ‘పిల్’ను ఉపసంహరించరాదు. – కె.ఎస్.హరీశ్ కుమార్ ‘ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా) రిటైర్డ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
సీఎం విజయ్ రాకతో నెరవేరిన 56 ఏళ్ల కల
తమిళనాడు: బస్సు లేక 56 ఏళ్లుగా అవస్థలు పడుతున్న కొండ గ్రామ ప్రజల కలలో తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో ఆ గ్రామ ప్రజలు పాఠశాల విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. వివరాలు.. తేని జిల్లాలోని మారుమూల కోటగుడి కొండ గ్రామం ప్రాంతం చాలా మంది సినిమాటోగ్రాఫర్లను ఆకర్షించింది. ఈ ప్రాంతంలోని కోటగుడి కొండ గ్రామంలో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇది నీలగిరి పరిధిలో ఉంటుంది.ఈ గ్రామానికి చెందిన 25 మందికి పైగా పిల్లలు పోడి నాయక్కనూరులోని ప్రభుత్వ , ప్రభుత్వ – సహాయక పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కోటగుడి నుండి బస్సు సౌకర్యాలు లేకపోవడంతో, ఇక్కడి నుండి పాఠశాలకు వెళ్లే పిల్లలు రోజూ 2 నుండి 3 కిలోమీటర్లు నడిచి, ఆ తర్వాత పాఠశాలకు వెళ్లడానికి కోటగుడి డివిజన్ సమీపంలోని కురంగానికి బస్సు ఎక్కవలసి వచ్చేది. దీంతో కోటగుడి కొండ గ్రామానికి బస్సు, మినీబస్సు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చాలాసార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా సీఎం ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ తక్షణ చర్యలు తీసుకున్నారు. కోట గుడి కొండకు ప్రభుత్వ బస్సు సర్వీసును ప్రారంభించే విషయంపై అధ్యయనం చేయాలని తేని జిల్లా కలెక్టర్ వైద్యనాథన్ రాష్ట్ర రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం, కోట గుడి రోడ్డుపై బోడి నుండి కురంగణి వరకు ఉదయం 3.30 నుండి సాయంత్రం 5.30 వరకు బస్సును నడపాలని నిర్ణయించారు. మొదటిసారిగా బస్సు గ్రామంలోకి ప్రవేశించడాన్ని చూసి మలై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. -
హమ్మయ్యా అనుకునేలోపే.. కర్ణాటకలో బిగ్ ట్విస్ట్
కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు సర్దుమణిగాయి అనుకునేలోపే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కొత్త తలనొప్పి మొదలైంది. కేబినెట్ కేటాయింపులపై అసంతృప్తి.. ఇంకా చల్లారలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ‘మా మొర ఆలకించండి మహా ప్రభో’.. అంటూ మరో ఇద్దరు సీనియర్లు ఢిల్లీకి పయనమవడం కొత్త చర్చకు దారితీసింది.బెంగళూరు డెవలప్మెంట్ పోర్ట్ఫోలియోపై అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి కృష్ణ బైరేగౌడ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈ కీలక శాఖ నిర్వహణపై స్పష్టత లేకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు సీఎం వద్దే ఉండటం, బీడీఏ, బీఎంఆర్డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలోనే ఉండటంతో అధికార విభజనపై గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన పార్టీ హైకమాండ్తో చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నారని సమాచారం.ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన గతంలోనూ నాయకత్వ మార్పుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇక గత వారం కేబినెట్ విస్తరణలో మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపై తీవ్ర స్థాయిలో లాబీయింగ్ కొనసాగుతోంది. ఒక్కో శాఖ కేటాయింపే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతుండటంతో కాంగ్రెస్లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఇప్పటికే సీనియర్ నేత రామలింగారెడ్డి వ్యవహారం, ఆయన రాజీనామా వెనక్కి తీసుకోవడం.. తదితర పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారింది. అదే సమయంలో సీనియర్ నేత కెహెచ్ మునియప్ప కూడా తనకు ఇచ్చిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేవారు. తన స్థాయికి తగ్గ ప్రాధాన్యం లభించలేదని హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో సహా పార్టీ పెద్దలకు తన అభిప్రాయాలు తెలియజేశానని ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.మొత్తానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలివారాల్లోనే కర్ణాటక కాంగ్రెస్లో కేబినెట్ అసంతృప్తి, శాఖల పంపిణీ వివాదాలు, ఢిల్లీ లాబీయింగ్ రాజకీయ వేడి పెంచుతున్నాయి. పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడలేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
భారత రాజకీయ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నరేంద్ర మోదీ ఖాతాలో జమ కానుంది. అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. తద్వారా.. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఇన్నేళ్ల తర్వాత మోదీ చెరిపేయబోతున్నారు. మోదీ ఇవాళ్టితో.. ప్రధానిగా నెహ్రూ పదవి కాలాన్ని సమం చేయబోతున్నారు. రేపటితో(జూన్ 10) 4,399 రోజులతో అత్యధిక కాలం నిరవధిక ప్రధానమంత్రి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారు. నెహ్రూ తరహాలోనే.. వరుస ఎన్నికల్లో ఎన్నికై మోదీ ఈ రికార్డును నెలకొల్పడం గమనార్హం. 2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ.. 2019, 2024 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి అత్యధిక కాలం నిరవధికంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా నిలిచారు.ఇప్పటివరకు ఈ రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉంది. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత నెహ్రూ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు 4,077 రోజుల పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగి.. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.భారత ప్రధానమంత్రుల పదవీకాలం – టాప్ లిస్ట్జవహర్లాల్ నెహ్రూ – 4,398 రోజులు (ఎన్నికల తర్వాత నిరవధిక పదవీకాలం)నరేంద్ర మోదీ – 4,399+ రోజులు (ప్రస్తుత ప్రధానమంత్రి)ఇందిరా గాంధీ – 4,077 రోజులుమన్మోహన్ సింగ్ – 3,652 రోజులు (2004–2014)అటల్ బిహారీ వాజ్పేయి – 2,272 రోజులు (మూడు విడతలు కలిపి)పి.వి. నరసింహారావు – 1,827 రోజులురాజీవ్ గాంధీ – 1,826 రోజులుమొరార్జీ దేశాయ్ – 857 రోజులులాల్ బహదూర్ శాస్త్రి – 576 రోజులుఅయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 1964 మే 27న మరణించే వరకు మొత్తం 6,131 రోజులు పదవిలో కొనసాగారు. అయితే 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన కొనసాగిన కాలాన్ని మాత్రమే అధికారిక రికార్డుగా పరిగణిస్తారు. అందుకే ప్రస్తుతం నరేంద్ర మోదీ అధిగమిస్తున్నది నెహ్రూ మొత్తం పదవీకాల రికార్డు కాదు.. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా కొనసాగిన ప్రధానమంత్రి రికార్డు మాత్రమే. అంటే.. ఆ రికార్డు ఇంకా నెహ్రూ పేరిటే పదిలంగా ఉందన్నమాట. మోదీ ప్రధానిగా ఇంకో 1,732 రోజులు.. అంటే దాదాపు 4 సంవత్సరాలు 9 నెలలు పూర్తి చేసుకుంటే ఆ రికార్డు కూడా బద్ధలు కానుంది. మరోవైపు మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. గత 12 ఏళ్లలో దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ఆ మార్పుల కేంద్రబిందువు పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమమేనని పేర్కొన్నారు. జన్ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, స్వచ్ఛ భారత్, ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చామని మోదీ తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందని వర్గాలకు చేరేలా పనిచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.అయితే మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వానికి పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. నీట్, సీబీఎస్ఈ పరీక్షల వ్యవహారాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రతిపక్షాల నుంచి విమర్శలకు దారితీస్తున్నాయి. అదే సమయంలో మహిళా రిజర్వేషన్, ఒకే దేశం-ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.మొత్తానికి, ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ కొత్త చరిత్ర సృష్టించడం భారత రాజకీయాల్లో మరో ముఖ్య ఘట్టంగా నిలవనుంది. -
టిఫిన్ బాక్స్లో గొడ్డు మాంసం.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం
గోల్పారా: అస్సాంలోని గోల్పారా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో టిఫిన్ బాక్స్లో గొడ్డు మాంసం (బీఫ్) తీసుకువచ్చిన ఉదంతం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. క్లాస్మేట్స్కు ఈ ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఐదుగురు ముస్లిం విద్యార్థులను పాఠశాల నుండి బహిష్కరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ ఘటన స్థానికంగా మతపరమైన వివాదంగా మారడంతో పోలీసులు, జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగాల్సి వచ్చింది.తల్లి అరెస్ట్.. మైనర్ బాలుడి నిర్బంధంకృష్ణాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు జూన్ 5వ తేదీన తమ టిఫిన్ బాక్స్లోని గొడ్డు మాంసాన్ని ఇద్దరు హిందూ సహచర విద్యార్థులకు తినిపించడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హిందూ విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో, మతపరమైన నమ్మకాలను దెబ్బతీశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే టిఫిన్ తెచ్చిన మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టగా, అతని తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురు బాలురను విచారిస్తున్నారు.స్కూల్ మేనేజ్మెంట్ సంచలన నిర్ణయంమొదట ఈ వివాదాన్ని పాఠశాల పరిధిలోనే పరిష్కరించాలని ఉపాధ్యాయులు భావించినప్పటికీ, విషయం గ్రామంలో తెలియడంతో స్థానిక సంస్థలు, ప్రజలు పాఠశాల వద్దకు భారీగా చేరుకుని నిరసనలు చేపట్టారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ నేపథ్యంలో స్కూల్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు సుబ్రతా దాస్ మాట్లాడుతూ.. మంగళవారం జరిగే ప్రత్యేక సమావేశంలో ఆ ఐదుగురు విద్యార్థులను పాఠశాల నుండి శాశ్వతంగా బహిష్కరించే ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. మెజారిటీ సభ్యులు బహిష్కరణకే మొగ్గు చూపినట్లు ఆయన తెలిపారు.మాంసాహారంపై నిషేధం విధించిన కలెక్టర్ఈ ఘర్షణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రదీప్ తిముంగ్, ఎస్ఎస్పీ నవనీత్ మహంత పాఠశాలను సందర్శించి శాంతిభద్రతలను సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు స్కూల్ టిఫిన్ బాక్సులను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థులు గరిష్టంగా కోడిగుడ్లు మాత్రమే తెచ్చుకోవచ్చని, చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారాలను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.ఇది కూడా చదవండి: యూసుఫ్ పఠాన్కు మహువా స్ట్రాంగ్ వార్నింగ్! -
భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్కేస్లో కుక్కింది.!
పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్పై సూట్కేసులో దొరికిన కుళ్లిపోయిన తల చేతులు కాళ్లు లేని మృతదేహం కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలింది. తల కాళ్లు, చేతులు లేక పోవడం, మొండెం మాత్రం ఉండటంతోకేసు పోలీసులకు సవాలుగా మారింది. అయితే మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ బట్టల బార్కోడ్ ఆధారంగా దర్యాప్తు చేయగా, ఆ దుస్తులను కొనుగోలు చేసిన షాపును గుర్తించారు. దీనిని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలింది. కాల్ డేటా రికార్డ్, వాట్సాప్ లోకేషన్ ఆధారంగా నిందితులు తేనాంపేట, టి.నగర్ పరిసరాలలో ఉన్నట్టు గుర్తించారు. హత్యకు గల కారణాలు.. పోలీసుల విచారణలో మరణించిన వ్యక్తి అస్సాంకు చెందిన అమీర్ గుర్తించారు. నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహమై ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్ అలీని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2022 నుండి తేనాంపేటలోని థామస్ రోడ్ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్లో నివసిస్తున్నారు. అయితే అమీర్ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రోకిమాకు టి.నగర్లో కూరగాయల దుకాణం నడుపుతున్న అస్సాంకు అష్రఫ్ (31)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపుల గురించి రోకిమా అతడికి చెప్పగా పథకం ప్రకారం మట్టుబెట్టినట్టు తేలింది. హత్య తర్వాత తన భర్త అమీర్ అలీ స్వయంగా పెట్టినట్లుగా.. తనకు ఇక బతకాలని లేదు, ఎవరూ వెతకవద్దు అని హిందీలో ఒక నకిలీ సందేశాన్ని అతడి ఫెస్బుక్లో రోకిమా పోస్టు చేసింది. మానసిక క్షోభతో∙అమీర్ ఎక్కడికో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించేందుకే యత్నించింది.శవాన్ని ముక్కలుగా నరికి.. పథకం ప్రకారం, జూన్ 4వ తేదీ రాత్రి అమీర్ అలీ నిద్రపోతున్న సమయంలో రోకిమా, ఆమె ప్రియుడు అష్రఫ్ అతని గొంతు కోసి హత్య చేశారు. అతని తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కవర్లో చుట్టి సూట్కేసులో కుక్కారు. జూన్ 5వ తేదీ రాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్కేసును పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేశారు. కాగా, నరికిన చేతులు, కాళ్లను ఒక కాలువలో వేయగా, తలను మాత్రం చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. కాగా భర్త శరీర బాగాలను నరికేటప్పుడు ఆనందంగా భార్య ఆనందంతో సెల్ఫీలు తీసుకోవడం గమనార్హం.-సాక్షి, చెన్నై -
విజయ్ ఫొటో కోసం.. కుర్చీ ఖాళీ!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రజాదరణ ఇప్పుడు కేవలం రాజకీయ సభలకే పరిమితం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల్లోనూ ఆయన ఫొటోలు ప్రధాన చర్చగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ చిత్రపటాన్ని అన్ని కార్యాలయాల్లో ఉంచి తీరాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే.. తిరునెల్వేలిలో చివరకు మేయర్ ‘కుర్చీ’నే ఖాళీ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు అక్కడ జరిగిందంటే.. తిరునెల్వేలి కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మేయర్ జి. రామకృష్ణన్ కార్యాలయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ ఫొటో ఏర్పాటు చేశారు. అయితే దానిని గదిలో మధ్యభాగంలో, మేయర్ కుర్చీకి నేరుగా పైన ఉంచాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తలు కోరినట్లు సమాచారం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రామకృష్ణన్.. తన నిరసనను మరోలా వ్యక్తం చేశారు. ఆయన తన కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని కార్యాలయ పనులు నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని.. నిరసన తెలిపేందుకే తాను ఇలా చేస్తున్నానని అన్నారాయన. రెండు వారాల క్రితం కార్పొరేషన్ కార్యాలయంలోని అన్ని గదుల్లో విజయ్ ఫొటోలను ఏర్పాటు చేయాలని కోరగా అంగీకరించామని, ఇప్పుడు తన కుర్చీ పైనే ఫొటో ఉండాలని పట్టుబడటం అనవసర వివాదాలకు దారితీస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజా సేవలకు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు.అసలు వివాదం రెండు వారాల క్రితమే మొదలైంది. అప్పట్లో కూడా మేయర్ రామకృష్ణన్ నిరసనగా తన టేబుల్పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఫొటోను ఉంచి సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఇదే తరహా వివాదం కోయంబత్తూరులోనూ చోటుచేసుకుంది. అక్కడ మేయర్ ఆర్. రంగనాయకి తొలుత తనకు కేటాయించిన గదిలో విజయ్ ఫొటో పెట్టడాన్ని వ్యతిరేకించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో చివరకు అంగీకరించారు. అయినప్పటికీ స్టాలిన్ ఫొటోను తొలగించేందుకు మాత్రం నిరాకరించారు.కరూర్లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. విజయ్ ఫొటో పక్కనే స్టాలిన్ ఫొటోను కూడా ఉంచాలని డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి అన్నాడీఎంకే, కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ నేతల ఫొటోలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో సమావేశం రాజకీయ వాగ్వాదాలకు వేదికగా మారింది.కూనూర్లో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విజయ్ ఫొటోతో పాటు స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి చిత్రాలను ఉంచగా, టీవీకే కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆ ఫొటోలను తొలగించడంతో వివాదం చెలరేగింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద మోహరించాల్సి వచ్చింది.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఫొటోల వివాదం మాత్రమే కాదు. స్థానిక సంస్థల్లో టీవీకే ఎమ్మెల్యేలు, డీఎంకే లేదంటే ఇతర పార్టీల కౌన్సిలర్ల మధ్య సమన్వయ లోపానికి ఇది ప్రతిబింబంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ఆధిపత్య పోరు మరింత తీవ్రమవుతోందని వారు భావిస్తున్నారు. అయితే ఈ రాజకీయ పోరులో ప్రజా సమస్యలు పక్కన పడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Polimer News (@polimernews) VIDEO Credits: polimernews -
యూసుఫ్ పఠాన్కు మహువా స్ట్రాంగ్ వార్నింగ్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చోటుచేసుకున్న తిరుగుబాట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 20 మంది లోక్సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) వైపు అడుగులు వేస్తున్నారనే ఊహాగానాల మధ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామాల దరిమిలా టీఎంసీ ఫైర్బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రా తిరుగుబాటుదారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ మ్యాండేట్ను ఉల్లంఘించి ఎన్డీఏతో చేతులు కలపాలని చూస్తున్న వారిని స్వార్థపరులుగా, దేశద్రోహులుగా ఆమె అభివర్ణించారు.‘వెన్నెముక ఉండాలి'.. యూసుఫ్ పఠాన్పై ఆగ్రహంమహువా మోయిత్రా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్' లో చేసిన ఒక పోస్ట్లో మాజీ క్రికెటర్, టీంఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ను నేరుగా టార్గెట్ చేశారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘అమిత్ షా పిలిచారని మీరు ఢిల్లీకి పరిగెడుతున్నారా? కాస్త ధైర్యం ప్రదర్శించండి. మీరు భారతదేశం తరపున ఆడారు. మా జిల్లా ప్రజలు మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. కాస్త సిగ్గు, వెన్నెముక ఉండాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల తీర్పు టీఎంసీకి ఇచ్చినదని, ఎన్డీఏకు కాదని ఆమె స్పష్టం చేశారు.బీజేపీ టికెట్పై గెలవాలని సవాల్పార్టీ మారే ఆలోచనలో ఉన్న అసమ్మతి ఎంపీలకు మహువా మోయిత్రా ఒక బహిరంగ సవాల్ విసిరారు. పసుపు రంగు మరకలున్న ప్యాంట్లు వేసుకున్న స్వార్థపూరిత దేశద్రోహులంతా వెంటనే బీజేపీలో చేరవచ్చని, అయితే ముందుగా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి, తిరిగి బీజేపీ టికెట్పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ వెలుపల వారి ఎన్నికల బలం ఎంతో నిరూపించుకోవాలని, అప్పుడే వారు ఎంతటి వీరులో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.తల వంచేది లేదు: కాకోలి ఘోష్ దస్తీదార్మరోవైపు లోక్సభలో ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లు కోరిన 20 మంది అసమ్మతి ఎంపీల గ్రూపులో ఉన్న రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ ఈ విమర్శలపై ఘాటుగానే స్పందించారు. ‘నా తల తెగినా వంగేది లేదు, నేను ఇప్పటికే చాలా భరించాను’ అని ఆమె మీడియా సంస్థ ‘ఏఎన్ఐ’తో అన్నారు. తానేమీ 2011లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలోకి రాలేదని, గత 40 ఏళ్లుగా ఇక్కడే పోరాడుతున్నానని చెప్పారు. తనకు జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రత మాత్రమే ముఖ్యమని స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: బీపీలకు, టెన్షన్లకు చెక్.. డాంకీలతో మైండ్ బ్లోయింగ్ ట్రీట్మెంట్! -
మోహన్ నా కూతురు అందంగా లేదు.. వేరే సంతానం కావాలి..!
బెంగళూరు: కన్నకూతురినే పొట్టనబెట్టుకున్న తల్లి ఉదంతం అంతటా చర్చనీయాంశమైంది. బెంగళూరు కాడుగోడిలో ఆరేళ్ల బాలిక వెన్నెల అనుమానాస్పద మృతి కేసులో ఆమె తల్లి, ప్రియునిపై అనుమానాలు బలపడ్డాయి. మార్చి 24 తేదీన బాలిక అనుమానాస్పద రీతిలో చనిపోయింది. తల్లి ప్రియాంక పుట్టిన రోజు వేడుకలను కోలారు వద్ద ఓ కెఫెలో జరుపుకొంది, అక్కడ వెన్నెలా కేక్ తిని కారులో నిద్రపోగా ఉదయానికి చనిపోయిందని తెలిపింది. మోహన్ అనే రియల్టర్తో ప్రియాంక జీవిస్తోంది. భర్త ప్రవీణ్ను వదిలేసిన ప్రియాంక లగ్జరీ లైఫ్ కోసం తపించేది. సంతోషానికి అడ్డు అని.. కొన్ని నెలల కిందట మోహన్ను కాశీలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. సంతానం కావాలని అనుకున్నారు. తమ సంతోషాలకు వెన్నెలా అడ్డుగా ఉందని, పైగా బాలిక అంద విహీనంగా ఉందనే కారణంతో బాలిక గొంతు పిసికి చంపారనే అనుమానాలున్నాయి. ప్రియాంక కు హొసకోటే వద్ద ఐదు ఎకరాలు భూమి ఉండగా, అందులో వాటా ఇవ్వాల్సి వస్తుందనేది కూడా హత్యకు కారణమని భావిస్తున్నారు. మోహన్ను కాడుగోడి పోలీసులు అరెస్ట్చేసి విచారిస్తున్నారు. బాలిక చనిపోయిన రోజున ఆమె దుస్తులు మార్చారని సీసీ కెమెరాలలో వెల్లడైంది. కాగా ప్రియాంకను అరెస్టు చేశారా, పరారీలో ఉందా అనేది తెలియడం లేదు. -
మీనాక్షికి అగ్ని పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు బరిలో నిలవడంతో రాజకీయాలు వేడెక్కాయి. మూడో సీటు కోసం కాంగ్రెస్ అభ్యర్థి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్పై బీజేపీ అనూహ్యంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో, తమ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్, తమకు అవసరమైన 10 అదనపు ఓట్లను సమీకరించేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తున్నాయి. రెండు రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, మూడో సీటుపై కన్నేసింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ‘మూడో సీటూ మాదే. ఇంకెక్కడికి వెళ్తుంది?’ అంటూ ఆదివారం చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మత్స్యకార నేత మహేష్ కేవత్ను ఆదివారం రాత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అసెంబ్లీలో మొత్తం 230 మంది ఎమ్మెల్యేలకు గాను ప్రస్తుతం రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో 228 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్కో రాజ్యసభ స్థానం గెలుపునకు 58 ఓట్లు కాగా బీజేపీకి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ లెక్కన రెండు సీట్లు గెలిచిన తర్వాత మిగిలే ఓట్లు 48. మూడో సీటు కూడా దక్కాలంటే మరో పది ఓట్లుంటే సరిపోతుంది. కాంగ్రెస్కు 64 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక ఎమ్మెల్యే ఓటింగ్కు దూరంగా ఉండే అవకాశం ఉండటంతో 63కు ఆ సంఖ్య తగ్గొచ్చు. ఇది గెలుపు కోటా కంటే 6 ఓట్లు మాత్రమే ఎక్కువ. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్, అసంతృప్తి ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తమ ఎమ్మెల్యేలను తెలంగాణ లేదా కర్ణాటకకు తరలించే ఆలోచనలో ఉంది. మీనాక్షీ నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరిస్తుండటంతో ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. మూడో అభ్యర్థిని గెలిపించుకునేందుకు సీఎం అధ్యక్షతన బీజేపీ నేతలు సమావేశమై కాంగ్రెస్లోని అసంతృప్తి వర్గాలను ఆకర్షించే వ్యూహాన్ని ఖరారు చేశారు. గెలుపు అవకాశాలు కాంగ్రెస్కే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ పార్టీలో అంతర్గత అసమ్మతిని బయటపెట్టడమే బీజేపీ లక్ష్యమని అంటున్నారు. -
వీడియో చూసి దోచేశారు
భోపాల్: సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను, సంపదతోపాటు ఇతర అంశాలను అతిగా ప్రదర్శించుకోవడం వల్ల ఎలాంటి పర్యవసానాలుంటాయో హెచ్చరించే తాజా ఉదాహరణ ఇది. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాకు చెందిన యూట్యూబర్ రచనా గుర్జర్ తన ఛానెల్లో హోమ్ టూర్ పేరుతో తమ ఇంట్లో నగదు, బంగారు నగలను చూపుతూ ఓ వీడియో అప్లోడ్ చేశారు. అది జరిగిన కొద్ది రోజులకే ఆమె ఇంట్లో రూ.10 లక్షల విలువైన సొత్తును దొంగలు దోచుకున్నారు. మోహని గ్రామానికి చెందిన గృహిణికి యూట్యూబ్లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. రచన ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్లలో తన లగ్జరీ లైఫ్స్టైల్ను చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేశారు. ఒక వీడియోలో ఇంటి గేట్ నుంచి ఇంట్లో ఉన్న రూముల వరకు చూపించారు. టేబుల్పై నగలు, భారీగా నగదు పెట్టి మరో వీడియో చేశారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. ముందుగా కర్ర సాయంతో ఇంట్లోని సీసీటీవీ కెమెరాల దిశ మార్చేశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా నిద్రపోతున్న గదికి బయట నుంచి గడియ పెట్టారు. ఇల్లంతా వెతికి దాదాపు రూ.10 లక్షల బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు స్థానికులు లేదా చుట్టుపక్కల ప్రాంతానికి చెందినవారై ఉండవచ్చని శివపురి అడిషనల్ ఎస్పీ సంజీవ్ అనుమానం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన వీడియో చూసి దొంగలు ప్లాన్ చేసి దోచేశారని పోలీసులు భావిస్తున్నారు. -
ప్రతి బంధం పెళ్లి పీటలెక్కాలని లేదు
సాక్షి, న్యూఢిల్లీ: పెళ్లికి ముందే శారీరక సంబంధం కలిగి ఉండటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పునిచ్చింది. ఉద్యోగ నియామకాల విషయంలో అధికారులు మారుతున్న సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికింది. ఇద్దరు మేజర్ల మధ్య శారీరక సంబంధం ఉండటం ఒక్కటే వారి వ్యక్తిత్వాలపై వ్యతిరేక అభిప్రాయాలు ఏర్పరచుకునేందుకు ప్రాతిపదిక కారాదని స్పష్టం చేసింది. అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును పునరుద్ధరిస్తూ, తక్షణమే సదరు అభ్యరి్థకి కానిస్టేబుల్గా పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. గాజుల తిరుపతి, రమాదేవి (పేరు మార్చాం) ఇరుగు పొరుగు. నాలుగేళ్లపాటు ఇద్దరూ శారీరక సంబంధమూ నెరిపారు. తర్వాత తిరుపతి ఇంకో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే రమాదేవి క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసు లోక్ అదాలత్లో విచారణకు రాగా ఇద్దరూ రాజీ పడ్డారు. ఈ మధ్యలో తిరుపతి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దరఖాస్తు సమయంలో తిరుపతి తనపై కేసు వివరాలు వివరించారు. అయినా సరే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అతడి నియామకాన్ని రద్దు చేసింది. వ్యక్తిత్వాన్ని సంబంధం ఆధారంగా నిర్ణయించొద్దు ‘ఇద్దరూ మేజర్లు. పెళ్లికి ముందు సంబంధం ఉంది. వారి వ్యక్తిత్వాన్ని, నైతిక విలువలను ఈ సంబంధం ఆధారంగా నిర్ణయించడం సరికాదు’అని చెప్పింది. ప్రతి సంబంధం పెళ్లిదాకా వెళ్లకపోవచ్చు కాబట్టి.. ఒకరు ఇంకొకరిని మోసం చేశారని అనుకునేందుకు ఆస్కారం ఏర్పడదని, పెళ్లి కానంత మాత్రాన మోసం చేసినట్లు కాదని వివరించింది. కాబట్టి పెళ్లి చేసుకుంటానని ఒట్టేసి మోసం చేశాడని తిరుపతిపై లోక్ అదాలత్లో దాఖలైన కేసు అతడు తప్పు చేసినట్టుగా ఒప్పుకున్నట్లు కాదని ఆ కేసు ఆధారంగా అతడికి ఉద్యోగం ఇవ్వకుండా నిలపడమూ సరికాదని తెలిపింది. వక్రబుద్ధితో తీసుకున్న నిర్ణయం ఈ కేసులో వాస్తవాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ... ఇద్దరి మధ్య సంబంధం ఉన్నమాట వాస్తవం. అయితే అత్యాచారం జరిగినట్లు కానీ.. ఎవరి బలవంతంతోనో.. ఒత్తిడితోనో లోక్ అదాలత్లో రాజీ కుదిరిందనేందుకు కానీ ఎలాంటి ఆధారాలూ లేవని గుర్తించింది. అలాంటప్పుడు రిక్రూట్మెంట్ బోర్డు కేవలం లోక్ అదాలత్తో రాజీ పడ్డాడు కాబట్టి తిరుపతి నేరానికి పాల్పడినట్లు అంచనా వేయడాన్ని తప్పు పట్టింది. ఇది నిరాధారమైందని, అతడి సెలెక్షన్ను రద్దు చేయడం వక్ర బుద్ధితో తీసుకున్న నిర్ణయమని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. నైతిక దుర్మార్గానికి పాల్పడ్డాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉండాలని, నిర్దోషిగా విడుదలైనా, కేసు నుంచి విముక్తి పొందినా నేరంలో అభ్యర్థి ప్రమేయం ఉన్నట్లు తేలాలని కోర్టు స్పష్టంచేసింది. ఈ ఉదంతంలో కేసును మరింత ముందుకు నడిపేందుకు రమాదేవి విముఖత చూపడమే కాకుండా లోక్ అదాలత్ వద్ద రాజీ పడిన విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేసింది. -
రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా: సుఖేందు
టీఎంసీ పార్టీకి సీనియర్ నేత సుఖేందు శేఖర్ రే పెద్ద షాక్ ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. మమత హయాంలో అవినీతి చోటుచేసుకుందని, అన్ని వర్గాలకూ పార్టీ దూరమైందని ఆయన ఆరోపించారు. ఆర్జీ కర్ బోధనాస్పత్రిలో వైద్యురాలి హత్యోదంతంలో టీఎంసీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని శేఖర్ రే ఆరోపించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తే పార్టీలో తనను ఒంటరిని చేశారని విమర్శించారు. అప్పట్లో నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని అప్పుడే నిర్ణయించుకున్నానని శేఖర్ రే చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ను కలిసి రాజీనామా లేఖ సమర్పించానని తెలిపారు. ఇకపై రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. రాజ్యసభలో టీఎంసీకి 13 మంది ఎంపీలు ఉండగా, ఆయన రాజీనామాతో ఈ సంఖ్య 12కి పడిపోయింది. రాజ్యాంగ నిపుణుడైన సుఖేందు శేఖర్ రే చాలా ఏళ్లుగా పార్లమెంట్లో టీఎంసీ ప్రధాన వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుగాంచారు. శాసన, రాజ్యాంగపరమైన అంశాలపై గొంతు వినిపించారు. ఆయన రాజీనామాపై టీఎంసీ నాయకత్వం ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా, పలువురు అసమ్మతి ఎంపీలు సుఖేందు శేఖర్ రేతో సమావేశం కావడం గమనార్హం. అనంతరం వీరంతా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా మమతా బెనర్జీ, అభిõÙక్ బెనర్జీ ఢిల్లీలో అసమ్మతి ఎంపీలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొందరు ఎంపీలు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సోమవారం బీజేపీ నేతలను కలిసి ఎంపీల్లో సుఖేందు సైతం ఉన్నారు. -
మమత పార్టీలో మంటలు
సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటికే పార్టీలో 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీ చీఫ్ మమతా బెనర్జీపై ధిక్కార స్వరం విన్పించగా సోమవారం ఏకంగా 20 మంది ఎంపీలు సైతం పార్లమెంట్ వేదికగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీ కోసం మమత ఢిల్లీలో ఉండగానే టీఎంసీ అసమ్మతి ఎంపీలు ఈ తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీని మరింత సంక్షోభ సుడిగుండంలోకి నెట్టేశారు. ఎన్డీయేకు తమ మద్దతు ప్రకటిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు సోమవారం లేఖ రాశారు. పార్టీ చీఫ్ విప్ కకోలీ ఘోష్ దస్తీదార్ నాయకత్వంలో తిరుగుబాటు ఎంపీలు ఏకమయ్యారు. ‘‘నాతో కలిపి 20 మంది పార్టీ ఎంపీలు బెంగాల్ అభివృద్ధి కోసం ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మా నిర్ణయాని్న తెలుపుతూ స్పీకర్ బిర్లాకు ఇప్పటికే లేఖ రాశాం. మమ్మల్ని చీలికవర్గంగా గుర్తించాలని పేర్కొంటూ లోక్సభలో మాకు విడిగా సీటింగ్ కేటాయించాలని లేఖలో విన్నవించుకున్నాం’’ అని నాయకురాలు కకోలీ దస్తీదార్ తెలిపారు. అయితే చీఫ్ విప్ పదవి నుంచి కకోలీని గతంలోనే తప్పించామని, పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీని ఆ పదవిలో నియమించామని పేర్కొంటూ మే 20న స్పీకర్కు మమత రాసిన లేఖను టీఎంసీ పార్టీ సోమవారం బయటపెట్టింది. కకోలీ ప్రస్తుతం పార్టీలో ఏ పదవిలోనూ లేరు అని టీఎంసీ స్పష్టం చేసింది. ఇక ఎన్డీయేతో ప్రయాణం: దస్తీదార్ లోక్సభలో టీఎంసీ చీఫ్ విప్గా తమ నాయకురాలు కకోలీ ఘోష్ దస్తీదార్ను కొనసాగించాలని రెబల్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కోరబోతున్నట్లు తెలిసింది. మేము ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాం. మా భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎన్డీయేతో సాగాలని భావిస్తున్నామని తిరుగుబాటు ఎంపీలు తెలిపారు. లోక్సభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేసి, బీజేపీలో చేరాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదని ఎంపీలు స్పష్టంచేశారు. లోక్సభలో ఎన్డీయేకు మద్దతిస్తూ ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా కొనసాగుతామని చెప్పారు. లోక్సభలో టీఎంసీకి ప్రస్తుతం 28 మంది ఎంపీలు ఉన్నారు. మూడింట రెండొంతుల మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీంతో వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు పడే అవకాశం లేదని తెలుస్తోంది. అసమ్మతి ఎంపీలు ఢిల్లీలో పార్టీ నాయకురాలు శతాబ్దిరాయ్ నివాసంలో బెంగాల్ బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమయ్యారు. బీజేపీ నేతలతో 12 మంది టీఎంసీ ఎంపీలు సమావేశమయ్యారని టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ వెల్లడించారు. టీఎంసీ ఎంపీలు కకోలీ ఘోష్, శతాబ్ది రాయ్, అబూ తాహిర్ ఖాన్, అరూప్ చక్రవర్తి, ఖలీలుర్ రహమాన్, షర్మిల సర్కార్, రచనా బెనర్జీ, అసిత్ మల్, జగదీశ్ చంద్ర వర్మ బాసునీయ, కాలిపద సోరెన్, ప్రసూన్ బెనర్జీ, పార్థ బౌమిక్లు బీజేపీ నేతలతో భేటీ అయినట్లు కథనాలొచ్చాయి. రితబ్రత బెనర్జీతో ఫిర్హాద్ హకీం భేటీ మమతా బెనర్జీకి సన్నిహితుడైన టీఎంసీ సీనియర్ నాయకుడు, కోల్కతా మాజీ మేయర్ ఫిర్హాద్ హకీం సోమవారం బెంగాల్ అసెంబ్లీ ప్రాంగణంలో తిరుగుబాటు ఎమ్మెల్యేల నేత రితబ్రత బెనర్జీతో ఆయన చాంబర్లో సమావేశమయ్యారు. మరో తిరుగుబాటు ఎమ్మెల్యే సాందీపన్ సాహా సైతం హకీం వెంట వచ్చారు. ఇటీవలే మేయర్ పదవికి రాజీనామా చేసిన హకీం.. తిరుగుబాటు వర్గంతో సమావేశంకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన మమత తరఫున మధ్యవర్తిత్వం కోసం వచ్చారా? అనేది తెలియాల్సి ఉంది. కలకత్తా హైకోర్టులో టీఎంసీ పిటిషన్ తిరుగుబాటు వర్గం నాయకుడు రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని టీఎంసీ వ్యతిరేకించింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సోమవారం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని, అందుకే ఈ పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టాలని టీఎంసీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. 11న ఈ పిటిషన్ను విచారిస్తామని జస్టిస్ కృష్ణారావు తెలిపారు. -
ఆడుకుంటూనే మృత్యు ఒడికి..
రాజ్కోట్: గుజరాత్లోని రాజ్కోట్లో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలిక ఆనంది మోదీ పిల్లలతో కలిసి ఆడుకుంటూ కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటు కారణంగా ఆమె మరణించినట్లు చెబుతున్నారు. జామ్నగర్కు చెందిన ఆనంది సెలవుల సందర్భంగా రాజ్కోట్లో బంధువుల ఇంటికి వచి్చంది. ఆదివారం సాయంత్రం భోజనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్కు వెళ్లింది. అక్కడ భోజనం తర్వాత రెస్టారెంట్ ప్రాంగణంలోనే పిల్లలతో కలిసి ఆడుకోవడం ప్రారంభించింది. పరుగు పందెం ప్రారంభించారు. ఇంతలోనే ఆనంది ఒక్కసారి కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. 2024 డిసెంబర్లో ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఇలాంటి సంఘటనే జరిగింది. 14 ఏళ్ల బాలుడు మోహిత్ చౌదరి పాఠశాలలో పరుగు పందెంలో పాల్గొంటూ గుండెపోటుతో మృతి చెందాడు. -
డాక్టర్ గయానాలో పేషెంట్ ఇండోర్లో..
న్యూఢిల్లీ: భారతీయ వైద్యుడొకరు వైద్యరంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు. సుమారు 20 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి రోబో సాయంతో గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత దూరంలో జరిగిన రోబోటిక్ కార్డియాక్ టెలిసర్జరీగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రముఖ రోబోటిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ గయానాలోని జార్జ్టౌన్ పబ్లిక్ హాస్పిటల్ కార్పొరేషన్ నుంచి ఆపరేషన్ చేయగా రోగి మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని ఓ ఆస్పత్రిలో ఉన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ఎస్ఎస్ఐ మంత్ర’ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఈ ఆపరేషన్ చేశారు. శ్రీవాస్తవ గయానాలో కూర్చుని కన్సోల్ ద్వారా రోబోను నియంత్రిస్తుండగా, ఇండోర్లో ఉన్న రోబోటిక్ చేతులు ఆయన చేతుల కదలికలను కచ్చితత్వంతో అనుకరిస్తూ ఆపరేషన్ చేశాయి. భారత్లో ఈ ఆపరేషన్కు జైపూర్లోని మణిపాల్ హాస్పిటల్స్కు చెందిన డాక్టర్ లలిత్ మాలిక్, భండారీ హాస్పిటల్కి చెందిన డాక్టర్ రామ్ శుక్లా, ఇండోర్లోని ఇర్కాడ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోహిత్ భండారీలు సహకరించారు. రికార్డు నమోదవడంపై గయానాæ అధ్యక్షుడుæ మహ్మద్ ఇర్ఫాన్ హర్షం వ్యక్తం చేశారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి గుండెకు శస్త్రచికిత్సతో ప్రపంచ రికార్డ్ -
కేంద్రంపై సమరమే
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’కూటమి సమరశంఖం పూరించింది. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను గట్టిగా తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం సాగించాలని నిర్ణయించింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కూటమి నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో సాగుతున్న ఓట్ల లూటీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.ఇండియా కూటమి సమావేశం రెండేళ్ల విరామం తర్వాత సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్విని యోగం, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలపై భవిష్యత్ పోరాట కార్యాచరణపై రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. విపక్షాల ఐక్యతను చాటుతూ ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్లో జరుగనుంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమా వేశాల్లో సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు. ఐక్యతను బలోపేతం చేసుకోవాలి మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లను ఎదుర్కొనేందుకు కూటమి ఐక్యతను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. దేశంలో రాజ్యాంగంపై దాడి కొనసాగు తోందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి పాల కులు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని ధ్వజమె త్తారు. కూటమి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యా సం చేశారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, కొత్త పెట్టుబడులు రావడం లేదని, నూతన ఉద్యోగాల కల్పన జరగడం లేదని చెప్పారు.పరీక్షల వ్యవస్థలో అక్రమాలు లక్షలాది మంది యువత ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2026 ఏప్రిల్ 17న డీలిమిటేషన్పై మోడీ ప్రభుత్వ బిల్లులను ఓడించడానికి లోక్సభలో ప్రతిపక్షాలు గొప్ప ఐక్యతను ప్రదర్శించాయని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ పేరిట కోట్లాది మంది పౌరుల నుంచి ఓటు హక్కును లాగేసుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.విదేశాంగ విధానంలో ప్రభుత్వం రాజీ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, కొత్త పెట్టుబడులు రాకపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగించిందని కూటమి నేతలు పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పరీక్షల వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని కూటమి పక్షాలు పట్టుబట్టాయి. దశాబ్దాలుగా దేశం పటిష్టంగా పాటిస్తున్న సంప్రదాయ విలువల నుంచి మోదీ సర్కార్ పక్కకు జరిగిందని, విదేశాంగ విధానంలో పూర్తిగా రాజీ పడిందని విపక్షాలు ఆక్షేపించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై దాడులు ఆగడం లేదని మండిపడ్డాయి.హాజరైన 23 పార్టీల నేతలు విపక్ష కూటమి భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, సీపీఐ అగ్రనేత డి.రాజా, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు హాజరయ్యారు.శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ వర్చువల్గా పాల్గొన్నారు. మొత్తం 23 పార్టీల నాయకులు ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు. 2024 జూన్ 1న ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ఆరో సమావేశం జరిగింది. ఆ తర్వాత సోమవారం అగ్రనేతలంతా ఒకే వేదికపైకి వచ్చారు. విపక్షాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఎన్సీపీ(ఎప్పీ) అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ గైర్హాజరు సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా సమావేశమైన విపక్ష కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ కీలక భేటీకి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ హాజరు కాకపోవడం గమనార్హం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, డీఎంకేల మధ్య దూరం పెరిగింది. ఇకపై తాము ఇండియా కూటమిలో భాగస్వామి కాదని డీఎంకే తాజాగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలోనే ఇండియా కూటమికి దూరమైంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.రాహుల్కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో సోమవారం ఉదయం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. రాహుల్ గాంధీకి నిలకడ లేదంటూ శరద్ పవార్ అన్నట్లుగా ఆ పోస్టర్లలో ముద్రించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోస్టర్లను చించివేశారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు.ఐదు అంశాలపై అంగీకారం: ఖర్గే దేశంలో అస్థిర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, ప్రజా సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు. సోమవారం ఇండియా కూటమి భేటీ అనంతరం రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీతోపాటు ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు అంశాలపై తాము అంగీకారానికి వచ్చిననట్లు తెలిపారు. ఎస్ఐఆర్లో అక్రమాలు, ఓట్ల లూటీ, ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తికి లేఖ రాయబోతున్నట్లు చెప్పారు.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి కేంద్రం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. ఇకపై ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను లేవనెత్తబోతున్నామని, దీనికి కూటమి పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించాయని ఖర్గే పేర్కొన్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో సమన్వయంతో పనిచేస్తామని, ప్రతిరోజూ ఉదయం విపక్ష నేత చాంబర్లో తమ భేటీ జరుగుతుందని వెల్లడించారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ 2029 లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సోమవారం సూచించారు. బీజేపీ వ్యతి రేక కూటమి ఐక్యంగా ఉందని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామని తెలి పారు. ప్రధానమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి రాబోయే లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పారు. అవినీతిపరులను, దోపిడీదార్లను అధికారం నుంచి దించేయడమే ప్రజల ఎజెండా అని స్పష్టంచేశారు. -
అర్ధరాత్రి పార్కుల్లో ప్రజలు: ఎందుకంటే?
మెక్సికోకు చెందిన గాబ్రియెల్ అనే యువతి.. ఢిల్లీలో కనిపించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పగటిపూట ఎండలు భారీగా ఉండటం వల్ల దేశరాజధానిలో అర్ధరాత్రి సమయంలో పార్కుల్లో కుటుంబాలతో కలిసి ప్రజలు ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపింది.మెక్సికోలో రాత్రి వేళల్లో కుటుంబాలు బయటకు వచ్చి పార్కుల్లో గడపడం చాలా అరుదు అని గాబ్రియెల్ వీడియోలో వెల్లడించింది. కానీ.. ఢిల్లీలో రాత్రి వేళల్లో కూడా పార్కులు జనంతో కిక్కిరిసిపోవడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ యువత మాత్రమే కాకుండా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మొత్తం కుటుంబాలు కనిపించాయని ఆమె చెప్పింది.ఈ విషయంపై గాబ్రియెల్ భర్త గౌరవ్ వివరిస్తూ.. ఢిల్లీలో వేసవికాలంలో పగటి వేళల ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ప్రజలు రాత్రి సమయంలోనే బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో సమయం గడపడం సాధారణ విషయమని వివరించాడు. ఈ సంస్కృతి తనకు కొత్తగా అనిపించిందని గాబ్రియెల్ పేర్కొంది.వృత్తిరీత్యా గాబ్రియెల్ ఒక సైకాలజిస్ట్.. అయితే ఈమె సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా కూడా గుర్తింపు పొందింది. కాగా ఈమెకు భారతీయుల జీవనశైలి, కుటుంబ విలువలు, సామాజిక బంధాలు అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. View this post on Instagram A post shared by Desi Met Mexi (@desimetmexi) -
రాహుల్ గాంధీ ప్రసంగం.. కూటమికి హెచ్చరిక!
ఇండియా కూటమి సమావేశంలో.. ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించారు. 'ఐక్యంగా ఉంటే బలం, విడిపోతే పతనం' అనే సందేశాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కూటమిలోని అన్ని పార్టీలు పరస్పర విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని సూచించారు.కూటమి భాగస్వాములు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదా బలహీనపరచుకోవడం మానుకోవాలని రాహుల్ గాంధీ హెచ్చరించారు. దేశం, రాజ్యాంగం రక్షణ కోసం ప్రతిపక్షాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కొందరు మిత్రపక్షాలు ఎన్నికల ఓటర్ల జాబితాలపై కాంగ్రెస్ లేవనెత్తిన 'ఓటు చోరీ' ఆరోపణలకు తగిన మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ తరచుగా కాంగ్రెస్ పార్టీని విమర్శించే మమతా బెనర్జీకి చెందిన తృణమూల్, వామపక్షాల వంటి కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.ఈ సమావేశంలో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)పై ఉన్న అనుమానాలు, అక్రమాల ఆరోపణల అంశాన్ని కూడా చర్చించారు. ఈ విషయంపై దేశ ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా లేఖ రాయాలని కూటమి నిర్ణయించింది.బీజేపీని ఓడించడం అంత కష్టమైన విషయం కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2024 లోక్సభ ఎన్నికలలో బీజేపీ 240 స్థానాలను కైవసం చేసుకుంది, ఇది 2019లో గెలుచుకున్న 303 స్థానాల కన్నా చాలా తక్కువ. 2024లో కాంగ్రెస్ 99 స్థానాలకు ఎగబాకిందని తమ బలాన్ని గుర్తు చేశారు. అయితే.. ప్రతిపక్షాలు పరస్పరం పోట్లాడుకుంటూ తమ బలమే తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ సమావేశంలో ఐక్యత ప్రాముఖ్యతను వివరించారు. 2026 ఏప్రిల్లో లోక్సభలో ప్రతిపక్షాలు కలిసి కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అదే ఐక్యతను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశం ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత ఈ సమావేశం జరగడం విశేషం. ఆ ఎన్నికల్లో బీజేపీ అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ కేరళలో విజయం సాధించింది. తమిళనాడులో నటుడు - రాజకీయ నాయకుడు విజయ్ భారీ విజయం సాధించారు. మూడేళ్ల క్రితం ఏర్పడిన ఇండియా కూటమి ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించింది. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్లో జరగనుంది. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక అధికారులు సాధ్యమైనంత సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయలు అందజేస్తామని ప్రధానమంత్రి తెలిపారు.కాగా, ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి. బాధితులకు న్యాయం చయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని అంటున్నారు. అలాగే, కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు, క్షతగాత్రుల్లో ఆరుగురిని గుర్తించారు. వారి పేర్లు రావూరి మల్లికార్జున రావు, పల్లెల శ్రీనివాసరావు, అప్పారావు, సత్యానంద్ బొల్లా, హరిబాబు, రాజు.మృతుల వివరాలుఉద్యోగులుగొంతిన భాను కుమార్ (టెక్నీషియన్)జి.వి. అప్పారావుఎం. కృష్ణ నాగుకె. ప్రభాకర్ (జనరల్ ఫోర్మ్యాన్)గోల్డ్ కుమార్ (మేనేజర్, మెకానిక్-2 ఇన్చార్జ్)కాంట్రాక్ట్ కార్మికులురమణత్రినాథ్ఎన్. అప్పల రాజు -
మమతా బెనర్జీకి మరో బిగ్ షాక్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని 20 మంది టీఎంసీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్కు 20 మంది టీఎంసీ ఎంపీలు లేఖ రాయనున్నారు. కకోలీ ఘోష్ను తమ నాయకురాలిగా టీఎంసీ రెబల్ ఎంపీలు ఎన్నుకున్నారు. రెబల్ ఎంపీలు అందరూ సీఎం సువేందు అధికారి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిశారు. మమతా బెనర్జీ ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న వేళే ఆమెకు తమ పార్టీ నుంచి ఇబ్బందులు మరింత పెరగడం గమనార్హం. విప్ పదవి నుంచి తొలగించిన తర్వాత పార్టీపై అసంతృప్తిగా ఉన్న కాకోలి ఘోష్ దస్తిదార్ మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ప్రకారం తమ “భవిష్యత్ రాజకీయ దిశ ఎన్డీఏతో అనుసంధానమై ఉండాలి” అని నమ్ముతున్నామని చెప్పారు.తనతో పాటు దాదాపు 20 మంది తృణమూల్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసి, ఎన్డీఏలో భాగం కావాలన్న తమ కోరికను అధికారికంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నామని ఘోష్ దస్తిదార్ ఈరోజు విలేకరులతో చెప్పారు.తిరుగుబాటు తృణమూల్ ఎంపీ షర్మిల సర్కార్ మాట్లాడుతూ, “మేము 20 మంది ఎంపీలతో వేరే కూటమిని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్డీఏకు మద్దతు ఇవ్వబోతున్నాం. కాకోలి ఘోష్ దస్తిదార్ మా ప్రధాన విప్, శతాబ్ది రాయ్ మా ఉప నాయకురాలు” అన్నారు.పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు ఒక కూటమిని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో శివసేన అనుసరించిన విధానంలోనే తమది “నిజమైన” తృణమూల్ అని ప్రకటిస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా శోభన్దేబ్ చటర్జీని పార్టీ ఎంపిక చేయడమే వారి అసంతృప్తికి కారణం. -
51 ఏళ్ల అక్క, 48 ఏళ్ల తమ్ముడు, కన్నీళ్లు తెప్పించే అనురాగం
కొన్ని బంధాల్ని, అనుబంధాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. వ్యక్తిగత కోరికల్ని ఆశల్ని, ఆశయాల్ని కూడా తృణ ప్రాయంగా త్యజించే వారి త్యాగం, అంతకుమించిన అంతులేని ప్రేమ నిజంగా అందరి హృదయాల్ని కదిలించక మానదు. అలాంటి కథ ఒకటి ఎక్స్లో విశేషంగా నిలుస్తోంది. ఎక్స్లో సునీల్ కుమార్ షేర్ చేసిన వివరాల ప్రకారం 51 ఏళ్ల శీతల్, మానసిక వికలాంగుడైన 48 ఏళ్ల సోదరుడు అశ్విన్ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశారు. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ, ఒక అక్కగా తన సోదరుడిపై తల్లి ప్రేమకు మించి చూపిస్తున్న ఆమె ప్రేమ నెట్టింట పలువురి ప్రశంసలు దక్కించుకుంటోంది.ఇదీ చదవండి: రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం!తల్లిదండ్రులను కోల్పోయిన తరువాత, శీతల్ ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించలేదు. తన సొంత కలల కంటే తమ్ముడి భవిష్యత్తు గురించి బెంగపడ్డారు. సోదరుడి సంతోషానికి ప్రాధాన్యతనిచ్చి, అనుక్షణం అతనికి చంటి పిల్లాడిలా సపర్యలు చేస్తూ, అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నారు.ఇందుకోసం తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. తాను పెళ్లి చేసుకోని వెళ్లిపోతే తమ్ముడు ఒంటిరి వాడైపోతానే ఆవేదనతో అసలు పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించు కున్నారు.She gave up her job, her marriage,and her dreams... just to become a mother to her brother ♥️🙏एक बहन का प्यार... जो माँ से रत्ती भर भी कम नहीं होता। ❤️51 साल की शीतल... और 48 साल का उनका भाई अश्विन...एक ऐसा अटूट रिश्ता, जिसे देखकर आँखें भर आएँगी। 🥹जब सिर से माँ-बाप का… pic.twitter.com/edMH8G3bZ2— Sunil Kumar (@sunilku20403616) June 8, 2026ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!శీతల్ ప్రేమ, అంకితభావానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ప్రేమ తల్లి ప్రేమకు ఏమాత్రం తీసిపోనిది.వారిద్దరి విడదీయలేని అనుబంధం. వారి ప్రేమ నిజంగా హృదయాన్ని కదిలిస్తోందంటున్నారు. ఇది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఈ ప్రపంచాన్ని అందంగా మార్చే నిస్వార్థమైన ప్రేమ. సోదరి త్యాగానికి, మాతృత్వపు ప్రేమకు జోహార్లు అని కొనియాడుతున్నారు. అందరికీ ఇలాంటి సోదరి ఉండాలని అకాంక్షిస్తున్నారు.ఇదీ చదవండి: 27 ఏళ్లకే భర్త దూరం : రూ. 500తో మొదలై రూ. 75 లక్షల టర్నోవర్ -
27 ఏళ్లకే భర్త దూరం : రూ. 500తో మొదలై రూ.75 లక్షల టర్నోవర్
దృఢ సంకల్పానికి, స్ఫూర్తికి ప్రతీక ఆమె కథ. జీవితంలో అడుగడుగునా కష్టాలే అయినా పట్టుదలతో అద్భుతమైన విజయం సాధించింది. అచంచల కృషితో తన జీవితాన్ని మార్చుకోవడం మాత్రమే కాదు, తన తోటివారికి స్వీయ సాధికారత స్ఫూర్తి నందించిన మహిళ. కేవలం రూ. 500 పెట్టుబడితో ప్రారంభమైన ఆమె వ్యాపారం నేడు ఏటా రూ.75 లక్షల టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది.ఎవరా మహిళ? ఆమె విజయ రహస్యం ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలోఅస్సాంలోని నల్బారి జిల్లాకు చెందిన కనికా తాలూక్దార్ కథ ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక ప్రయాణం. 27 ఏళ్ల వయసులోనే 2008లో ఒక రోడ్డు ప్రమాదంలో తన భర్తను కోల్పోయినప్పుడు ఆమె ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు.ఉన్నత చదువులు లేవు, స్థిరమైన ఆదాయం లేదు. ఉన్నదల్లా నాలుగు నెలల కూతురు, అత్తామామలను పోషించేబాధ్యత. కానీ, ఆమె అధైర్యపడకుండా ఎదురొడ్డి నిలబడాలని నిర్ణయించుకుంది.ఆమె చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. 2014లో ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. స్థానిక స్వయం సహాయక సంఘం (SHG)లో చేరారు. అక్కడ 'జీవిక సఖి'గా బాధ్యతలు చేపట్టడం వల్ల పొదుపు, బృందకృషి, చిన్న తరహా వ్యాపారాలపై ఆమెకు అవగాహన వచ్చింది.రూ.500 పెట్టుబడితో ప్రయోగంనల్బారిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ మనోషి చక్రవర్తి ఇచ్చిన వర్మీకంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారీ శిక్షణ కనికను ఎంతగానో ఆకర్షించింది. దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదని గ్రహించిన ఆమె, కేవలం రూ. 500లతో తన తల్లిదండ్రుల ఇంటి పెరట్లో ఒక కిలో వానపాములతో వర్మీ కంపోస్ట్ వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పట్టుదల, నేర్చుకోవాలనే తపనతో, ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆవు పేడ ,ఆకుల వంటి స్థానికంగా లభించే వనరులను ఉపయోగించుకుంటూ, వర్మీకంపోస్టింగ్ తయారీ పనిని స్వీకరించింది.మొదట్లో అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, కనిక పట్టుదల ఫలించింది. కొనేందుకు డబ్బుల్లేక చుట్టుపక్కల లభించే కూరగాయల వ్యర్థాలు, ఎండిన ఆకులను సేకరించి మొదటి బ్యాచ్ ఎరువును సిద్ధం చేసేది. ఇదే 'జయతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్' సంస్థకు పునాది. రసాయన ఎరువులకు అలవాటు పడిన స్థానిక రైతులు మొదట్లో ఆమె సేంద్రియ ఎరువును కొనేందుకు అస్సలు ఆసక్తి చూపలేదు. కానీ కనిక వెనకడుగు వేయలేదు.2018 నుండి ఆమె స్వయంగా రైతులను కలిసి, చిన్న చిన్న సంఘాలను ఏర్పాటు చేసి వర్మీకంపోస్ట్ వల్ల నేల తల్లికి జరిగే మేలును వివరించడంతో పాటు, స్థానిక రేడియో ఛానళ్ల ద్వారా కూడా దీనిపై అవగాహన కల్పించేది. ఆమె పట్టుదలకు ఫలితంగా మెల్లమెల్లగా రైతులు ఆమె ఉత్పత్తులను నమ్మడం, కొనడం ప్రారంభించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది, తన కార్యకలాపాలను విస్తరించింది. తన ఉత్పత్తులను వైవిధ్యపరిచింది. వర్మీకంపోస్ట్ వ్యాపారం నెలకు రూ. 3.5 లక్షల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి ఎదిగింది. అలా 2017లో 'జయతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్' బ్రాండ్ను అధికారికంగా రిజిస్టర్ చేశారు. 2019లో జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) మద్దతుతో ఆమె తన ఉత్పత్తులను Amazon, Flipkart , ప్రభుత్వ రంగ పోర్టల్ GeM (Government e-Marketplace) లలో విక్రయించడం ప్రారంభించింది. GeM పోర్టల్ ద్వారా ప్రభుత్వ శాఖల నుండి పెద్ద మొత్తంలో వార్షిక కాంట్రాక్టులు రావడంతో వ్యాపారం స్థిరపడింది.ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ (NeedHub), IIM కలకత్తా, NRETP ల నుండి ఆమెకు రూ. 27.50 లక్షల బిజినెస్ గ్రాంట్లు లభించాయి. ఈ నిధులతో ఆమె మౌలిక సదుపాయాలను పెంచుకున్నారు. కేవలం ఒకటిన్నర బిఘాల సొంత స్థలం నుంచే ఈ వ్యాపారాన్ని నడుపుతుండటం విశేషం.ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!నెలకు ఏకంగా 70 టన్నుల వర్మీకంపోస్ట్ను ఉత్పతి చేస్తూ, ఈ విక్రయాల ద్వారా ఆమె ఏడాదికి రూ. 70 లక్షల నుండి రూ.75 లక్షల ఆదాయాన్ని గడిస్తోంది. వర్మీకంపోస్ట్తో పాటు ఆర్గానిక్ పురుగుమందులు, ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్ (గోమయ అగర్బత్తి) కూడా తయారు చేస్తున్నారు. దీనికిగానూ 2019లో ICAR నుంచి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.భవిష్యత్తులో దేశవ్యాప్తంగా తన ఆన్లైన్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని, అలాగే తనలాంటి ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించి, రసాయన రహిత స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కనిక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక సాధారణ మహిళ అనుకుంటే జీరో నుంచే తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలదు అనేందుకు కనికా తాలూక్దార్ జీవితమే ఒక సజీవ సాక్ష్యం.ఇదీ చదవండి: రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం! -
విద్యాశాఖ మంత్రి రాజీనామా?.. ఇండి కూటమి కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: నీట్ పరీక్షపత్రాల లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈరోజు (సోమవారం) ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కూటమి నేతలు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిర్వహించే Sirపై త్వరలోనే భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం కోసం విపక్ష ఇండియా కూటమి ఈ రోజు ఢిల్లీలో సమావేశమైంది. ఈ మీటింగ్లో ఎన్డీఏపై పోరాటానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి 1 ఎన్నికల్లో ఓటు చోరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం. 2 విద్యామంత్రి వెంటనే రాజీనామా చేయాలి . NEET, CBSE పరీక్షలు రాసిన లక్షలాది యువకులను మోసం చేశారు. 3 దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ఇతర సమస్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని పార్టీల సమావేశం పిలవాలి. 4 అన్ని పార్టీలు ప్రతి రెండు నెలలకొకసారి సమావేశం.తదుపరి సమావేశం ఆగస్టు నెలలో హైదరాబాద్లో జరుగుతుందని తెలిపారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో ఇండియా కూటమి ఐక్యత కొనసాగించాలని కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం!
నెలకు ఐదెంకల జీతం వస్తున్నా, నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. దయచేసి ఏం చేయాలో సలహా ఇవ్వండి అంటూ ఒక జంట పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. నేటి తరం యువ దంపతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడికి ఇది అద్దం పడుతోంది. నెలకు రూ. 1.7 లక్షల సంపాదన ఉన్నప్పటికీ, నెలాఖరుకు కేవలం రూ. 2,520 మాత్రమే మిగలడం లేదని వాపోయింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంత జీతం వస్తున్నా ఈఎంఐలు,అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆ జంట చెప్పుకు రావడం అనేది నిజంగా ఆందోళనకరమైన విషయమే. నిజానికి మామూలు మధ్యతరగతి కుటుంబానికి దాదాపు 2 లక్ష రూపాయలు జీతం అంటే సౌకర్యవంతంగానే గడిపేయొచ్చు. వీరి ఖర్చులు, కడుతున్న లోన్ల వివరాల ప్రకారం వీరి ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తే లోన్ల భారమే కారణంగా చెప్పవచ్చు. వ్యక్తిగత రుణం (Personal Loan), విద్యా రుణం (education loan), బైక్ రుణం , ఫోన్ రుణం వంటి వాటి కోసం వారి నెలవారీ EMIల మొత్తం రూ. 85,980 అవుతోంది. ఇవి కాకుండా ఆ దంపతులు ఇంటి అద్దె, నిర్వహణ ఖర్చులు, సరుకులు, ప్రయాణం, వైద్య ఖర్చులు , ఇతర వినియోగ బిల్లుల వంటి స్థిరమైన నెలవారీ ఖర్చుల కోసం రూ. 53,500 వెచ్చిస్తున్నారు. అలాగే, వ్యక్తిగత ఖర్చులు, వినోదం , కుటుంబపరమైన అత్యవసర అవసరాల కోసం వారు రూ. 28వేలు కేటాయించారు. అన్ని ఖర్చులు పోను, వారి చేతిలో నెలకు కేవలం రూ. 2,520 మాత్రమే మిగులుతున్నాయి.ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలుసోషల్ మీడియా స్పందనఈ పోస్ట్ ఆన్లైన్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఇతర ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేసుకునే ముందు, ముందుగా తమ అప్పులను తీర్చుకోవడంపై దృష్టి పెట్టాలని చాలా మంది నెటిజన్లు సూచించారు.ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!ఖర్చులు కాదు బాబూ, మీ లోన్లే మీకు అసలు సమస్య: కనీసం పెర్సనల్ లోన్ అయినా తీర్చేంత వరకైనా మీకీ కష్టాలు తప్పవు. మీ బైక్ రుణం పూర్తయ్యే వరకు 4 నెలలు వెయిట్ చేసి, ఆ తర్వాత, ఆ 12 వేల రూపాయల పెర్సనల్ లోన్ చెల్లించేయండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు. అంతేకాదు లోన్ తీసుకొని మరీ ఫోన్ తీసుకోవడం అవసరమా, 3-4 నెలల పాటు వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకుని ఉంటే, ఫోన్ కోసం 20వేలు మిగిలేవి కదా అంటే ఇంకొకరు లెక్కలు చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్అంటే ఈ జంట తమ సంపాదనలో సగానికి పైగా (50.5%) కేవలం అప్పులు తీర్చడానికే ఉపయోగిస్తున్నారు. ఆర్థిక సూత్రాల ప్రకారం ఈఎంఐలు ఆదాయంలో 30-35 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అలాగే అనవరమైన వ్యక్తిగత అవసరాలను కొన్ని త్యాగం చేసి అత్యవసర ఖర్చులకోసం, ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ దాచుకోవడం కుటుంబాలకు చాలా అవసరం.ఏమంటారు? -
‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’
న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతూ, విపక్షాల ‘ఇండియా’ (INDIA) కూటమి విచ్ఛిన్నానికి గల అసలు కారణాలను జనతాదళ్ (యునైటెడ్) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా బహిర్గతం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరే ఈ కూటమిని సర్వనాశనం చేశారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నితీష్ కుమార్కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన సంజయ్ ఝా, ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూటమి అంతర్గత సమావేశాల్లో జరిగిన రాజకీయ కుట్రలను బట్టబయలు చేశారు.‘ఆ ఇద్దరే కూటమిని ముంచేశారు’బీజేపీని ఎదుర్కొనేందుకు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఏర్పడిన ఇండియా కూటమిలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయని సంజయ్ ఝా అన్నారు. ‘ఇండియా కూటమిని ఇద్దరు వ్యక్తులు నాశనం చేశారు, నేను రికార్డు పరంగా చెబుతున్నాను: వారి పేర్లు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్’ అని ఆయన ఆరోపించారు. కూటమిలో ఎటువంటి స్పష్టమైన ప్రణాళిక, దార్శనికత లేదా ఐక్యత లేవని, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న తరుణంలో ఈ ఇద్దరు నాయకులు స్వార్థ రాజకీయాలతో కూటమిని దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు.‘పక్కా ప్లాన్తోనే విధ్వంసం’2023 జూన్లో పట్నాలో జరిగిన ఇండియా కూటమి మొదటి కీలక సమావేశంలో నితీష్ కుమార్ను కూటమి కన్వీనర్గా నియమించేందుకు విస్తృతమైన అంగీకారం కుదిరిందని ఝా వెల్లడించారు. అయితే, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ముందస్తు వ్యూహంతోనే ఆ ప్రతిపాదనను అడ్డుకున్నారని తెలిపారు. దళిత నేతను కన్వీనర్గా చేయాలనే డిమాండ్ను తెరపైకి తెస్తూ మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారని, దీనితో కాంగ్రెస్ వెనకడుగు వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నితీష్ కుమార్ కన్వీనర్ పదవి కోసం ఎప్పుడూ ఆశపడలేదని, అందరినీ ఒకే వేదికపైకి తేవడమే ఆయన లక్ష్యమని, కానీ ఆ ప్రయత్నాన్ని వారు పక్కా ప్లాన్తో దెబ్బకొట్టారని ఆరోపించారు.మారిన రాజకీయ సమీకరణలుఈ పరిణామాల తర్వాతే నితీష్ కుమార్ 2024 జనవరిలో ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే లోకి తిరిగి వెళ్లారని సంజయ్ ఝా గుర్తుచేశారు. ఇటీవల బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కాగా, తాజాగా ఢిల్లీలో విపక్షాల వ్యూహాల పునఃసమీక్ష కోసం 23 రాజకీయ పార్టీల కీలక సమావేశం జరగనున్న తరుణంలో సంజయ్ ఝా చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి.ఇది కూడా చదవండి: ‘దీదీ’కి మరో షాక్: ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా -
ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!
ఉత్తర ప్రదేశ్లో మరో ఊహించని పరిణామం గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. పెళ్లికి ముందు రాత్రే వధువు తన ప్రియుడితో పారిపోయింది. ఎలాగో ఒప్పించి, వధువు చెల్లెల్ని పెళ్లి కూతుర్ని చేశారు. ఇక్కడ మరో ట్విస్ట్ పెళ్లి కొడుకును వెక్కిరించింది. ఇక ఈ తరువాతి పరిణామాలు ఒక్కోటి సినిమా రేంజ్లో చక చకా జరిగిపోయాయి. చివరికి ఈ వివాదం మరింత ఉద్రిక్తమై కాల్పుల దాకా చేరింది.ఉత్తరప్రదేశ్లోని బిత్థ్రి ప్రాంతంలోని షాజహాన్పూర్-బరేలీ రోడ్డుపై ఉన్న ఒక బ్యాంకెట్ హాల్లో శనివారం పెళ్లి వేడుక ఉత్సాహంగా జరుగుతోంది. వధూవరులిద్దరూ అందంగా ముస్తాబయ్యారు. అతిథులందరూ ఎవరి హడావిడిలో వారు తిరుగుతూ, విందు భోజనానికి సిద్దపడుతున్నారు. పెళ్లి కొడుకు తన బృందంతో (ఊరేగింపుగా), అటు వధువు కుటుంబ సభ్యులు కూడా సందడి ఉన్నారు. ఇంతలో కలకలం రేపింది. హాజరైన అతిథులకు భోజనాలకు బదులు దాడులు మొదలయ్యాయి. ఈ గందరగోళం మధ్య కాల్పులుకు దారి తీసింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ట్విస్టుల మీద ట్విస్టులుసరిగ్గా పెళ్లి జరిగే సమయానికి వధువు రాలేదు. పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న నగలతో సహా వధువు రాత్రికి రాత్రే ప్రియుడితో ఉడాయించింది. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఆమె చెల్లెల్ని వధువు స్థానంలోకూర్చోబెట్టడానికి ఒప్పించి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి తంతు ముగిద్దాం అనుకున్నారు. అయితే పెళ్లి కూతురు మారిపోయిందన్న విషయాన్ని గమనించిన పెళ్లి కొడుకు ‘నాకీ పెళ్లి వద్దు పొమ్మన్నా’డు.ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్అయితే ఎలాగోలా పెద్దలంతా సంప్రదింపులు జరిపే వరుడిని పెళ్లికి ఒప్పించాడు. ఇక్కడ మళ్లీ ట్విస్ట్. ఈ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగి, అంతా చక్కబడింది అనుకునే లోపే, వధువు చెల్లెలి ప్రియుడుఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ లొల్లి షురూ. చినికి చినికి గాలివానలా మొదలైన ఈ వ్యవహారం భౌతిక ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో పలువురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు జోక్యం చేసుకున్నట్టు గానీ, ఎవరిపైనా కేసులు నమోదు చేసినట్టు గానీ సమాచారం లేదు. ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు -
190 vs 170.. పాక్పై భారత్ లీడ్
ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరోసారి దక్షిణాసియా కేంద్రంగా చర్చ మొదలైంది. అణు శక్తి, ఆయుధ సామర్థ్యం, పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్య.. భారత్ తన అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో.. పాకిస్థాన్పై ఆధిక్యం సాధించిందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక వెల్లడించింది. సిప్రి ఇయర్బుక్ 2026 ప్రకారం.. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణు వార్హెడ్స్ ఉండగా, పాకిస్థాన్ వద్ద సుమారు 170 మాత్రమే ఉన్నాయని అంచనా వేసింది. ఇరు దేశాలు 2025లో కూడా తమ అణు ఆయుధ వ్యవస్థలను ఆధునీకరించడంపై దృష్టి పెట్టాయని.. ముఖ్యంగా భారత్ తన దీర్ఘశ్రేణి అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ చైనా వరకు చేరగలిగే డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు నివేదిక పేర్కొంది. అదే సమయంలో పాకిస్థాన్ కూడా ఫిషైల్ మెటీరియల్ సేకరణ, కొత్త డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లు తెలిపింది.ఆపరేషన్ సిందూర్ టైంలో.. 2025 మే నెలలో భారత్–పాక్ మధ్య చోటుచేసుకున్న సైనిక ఉద్రిక్తతను సిప్రి “అసాధారణంగా తీవ్రమైన మిలిటరీ క్రైసిస్”గా అభివర్ణించింది. అయితే అణు ఘర్షణ దిశగా వెళ్లకుండా ఇరు దేశాలు నియంత్రణ పాటించినట్లు నివేదిక స్పష్టం చేసింది. అయినప్పటికీ భవిష్యత్తులో ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. ప్రపంచ స్థాయిలో చూస్తే మొత్తం 9 అణు దేశాల వద్ద కలిపి సుమారు 12,241 వార్హెడ్స్ ఉన్నాయని సిప్రి తెలిపింది. వీటిలో అత్యధికంగా అమెరికా, రష్యా వద్దే అధిక భాగం ఉండగా, చైనా వేగంగా తన అణు సామర్థ్యాన్ని విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. చైనా వద్ద ఇప్పటికే సుమారు 620 వార్హెడ్స్ ఉన్నాయని అంచనా. భారత్ విషయానికి వస్తే.. కొత్త తరహా అణు ఆయుధ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి క్షిపణులు అభివృద్ధి చేయడం ద్వారా తన వ్యూహాత్మక స్థాయిని పెంచుకుంటోందని సిప్రి స్పష్టం చేసింది. పాకిస్థాన్ కూడా తన అణు శక్తిని విస్తరించే ప్రయత్నాల్లో ఉందని, వచ్చే దశాబ్దంలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.డేంజర్ జోన్ ఎందుకంటే..సిప్రి నివేదికలో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాలపై ఆధారపడే ధోరణి పెరుగుతోందని, డిసార్మ్మెంట్ ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని స్పష్టం చేసింది. దేశాలు రక్షణ పేరుతో అణు ఆయుధాల వైపు మరింత మొగ్గు చూపుతున్నాయని, ఇది ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది.అణు ఆయుధాలపై పారదర్శకత తగ్గడం, దేశాల మధ్య చర్చలు–ఒప్పందాలు బలహీనపడటం, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల.. భవిష్యత్తులో విపరీతాలు జరగొచ్చని సిప్రి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అవతలి దేశం దాడి చేయబోతుందనుకుని ఇవతలి దేశం పొరపడడం, చిన్న సంఘటనను పెద్ద ముప్పుగా భావించడం, అవసరం లేని సమయంలో సైనిక చర్యలకు వెళ్లడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా జరగొచ్చని అంటున్నారు. పెద్ద దేశాల మధ్య చిన్న పొరపాటు కూడా పెద్ద యుద్ధ ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ గతంలో భారత్–పాక్ మధ్య గతంలో చోటు చేసుకున్న సైనిక ఘర్షణలను ప్రస్తావిస్తున్నారు. -
నీట్ రీటెస్ట్ :‘లాక్డౌన్’లో ప్రశ్నపత్రాల రూపకర్తలు
న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ రీటెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వివాదాల నేపథ్యంలో, ఈసారి ఎలాంటి లీకులకు తావులేకుండా ఉండేందుకు పరీక్షల నిర్వహణ యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా ఒక అసాధారణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. జూన్ 21న జరగబోయే ఈ రీటెస్ట్ పూర్తి పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు సర్వసన్నద్ధమయ్యారు.రహస్య ప్రాంతాల్లో కఠిన నిర్బంధంనీట్ రీటెస్ట్ ప్రశ్నపత్రాలను రూపొందించే ఎగ్జామినర్లతో పాటు, వాటిని వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ట్రాన్స్లేటర్లను కేంద్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన ‘లాక్డౌన్’ తరహా నిర్బంధంలో ఉంచింది. వీరందరినీ ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాలకు తరలించారు. జూన్ 21న పరీక్ష ముగిసేంత వరకు వీరు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి వీల్లేదు. బయటి వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు.గ్యాడ్జెట్లపై నిషేధం.. డేగ కన్నుఈ భద్రతా కేంద్రాల్లో ఉన్నవారెవరూ మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు, స్మార్ట్వాచ్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఉపయోగించడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్నెట్ సదుపాయాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఒకవేళ అత్యవసరంగా ఇంటర్నెట్ వాడాల్సి వచ్చినా, అది పూర్తి నిఘా నీడలోనే సాగుతుంది. ప్రత్యేక అనుమతులు ఉన్న సిబ్బందిని మాత్రమే ఈ రహస్య ప్రాంతాల్లోకి అనుమతిస్తున్నారు.రంగంలోకి భారత వాయుసేనప్రశ్నపత్రాల రూపకల్పనలోనే కాకుండా, వాటి రవాణా విషయంలోనూ ప్రభుత్వం అత్యంత కఠినమైన భద్రతా చర్యలను చేపడుతోంది. ఎలాంటి లీకేజీలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఈసారి భారత వాయుసేన యుద్ధ విమానాల ద్వారా ప్రశ్నపత్రాలను వివిధ రాష్ట్రాలకు సురక్షితంగా తరలించి, పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ భద్రతా వ్యూహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
సీఎం విజయ్తో చెస్ సంచలనం ప్రజ్ఞానంద
భారత చెస్ గ్రాండ్మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద నార్వే చెస్ చాంపియన్షిప్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో సోమవారం తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ని ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ప్రజ్ఞానందను అభినందించడమే గాక అతడితో సరదాగా చెస్ ఆడాడు. అతడి ప్రదర్శనతో తమిళనాడు గర్విస్తోందని పేర్కొన్న విజయ్ ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల చెక్కును రివార్డుగా అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ను రెండుసార్లు ఓడించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఓస్లో వేదికగా జరిగిన టోర్నీలో ప్రజ్ఞానంద ఫైనల్లో జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమర్ను మట్టికరిపించి చాంపియన్షిప్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. టోర్నీ ఆరంభంలో తడబడిన ప్రజ్ఞానంద చివరి దశలో అనూహ్యంగా ఫుంజుకున్నాడు. పదో రౌండ్ ప్రారంభానికి ముందు 15 పాయింట్లతో ప్రజ్ఞానంద ముందు వరుసలో నిలిచాడు. ఆఖరి రౌండ్లో విన్సెంట్ కీమర్ను ఓడించిన ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్ను తొలిసారి సొంతం చేసుకున్నాడు. ఇక నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు అభినందించారు.#WATCH | Chennai | Tamil Nadu CM Vijay meets Indian Grandmaster R Praggnanandhaa and awards him Rs 50 lakh on behalf of the Sports Development Authority of Tamil Nadu after the chess player won the Norway Chess 2026 title.(Source: TNDIPR) pic.twitter.com/Lf4dNgYrEX— ANI (@ANI) June 8, 2026చదవండి: మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియన్స్! -
రహస్య వీడియోలతో వేధింపులు.. అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య
కర్ణాటక: స్నానం చేస్తున్న మహిళ ఫోటో, వీడియోలను చిత్రీకరించుకుని వేధించడమే కాకుండా రూ.17 లక్షల నగదు వసూలు చేసిన నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని ఉణకల్లో జరిగింది. వివరాలు.. సుధ మృతురాలు. సిద్దారూఢ, అరుణ, మీనాక్షి, మల్లికార్జున, వీరప్ప, ప్రకాష్ బసవలింగప్ప, శివానంద, గిరిజాలపై కేసు నమోదైంది. సుధ ప్రస్తుతం ఉణకల్లో నివసిస్తూ సవదత్తి మునవళ్లిలో అంగన్వాడీ టీచర్గా పని చేస్తోంది.రెండేళ్ల క్రితం ఇంట్లో స్నానం చేస్తుండగా ఫొటో, వీడియో తీసుకొని ఆమెపై నిందితులు వేధింపులకు పాల్పడి ఆమె నుంచి క్రమంగా రూ.17 లక్షల మేర వసూలు చేశారు. అంతేగాక చెక్ బౌన్స్ కేసులో సవదత్తి కోర్టు ద్వారా కూడా ఆమెను మనోవేదనకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక ఉణకల్లోని అద్దె ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యానగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
రాహుల్ గాంధీ సింప్లిసిటీ.. చిన్నారికి సర్ప్రైజ్
ఒక సాధారణ రెస్టారెంట్ లంచ్ అనుకోని విధంగా ఓ చిన్నారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చింది. కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుక కోసం బయటకు వెళ్లిన ఆ బాలుడు, అదే రెస్టారెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో పంచుకున్న ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.. డాక్టర్ ఎస్.జె.టి కజ్మీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి లంచ్కు వెళ్లారు. అయితే అదే హోటల్కు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వాళ్లకు దగ్గర్లోనే ఓ టేబుల్ మీద కూర్చున్నారు. ఆ సమయంలో ఉత్సాహంగా ఉన్న చిన్నారి రాహుల్ గాంధీకి చేతులు ఊపగా.. ఆయన స్పందించి బాలుడిని తన వద్దకు పిలిచారు.ఆప్యాయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఆ చిన్నారితో ఫోటో దిగుతూ అతని పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చారని కజ్మీ తన పోస్టులో పేర్కొన్నారు. “నా కుమారుడికి ఇది జీవితంలోనే బెస్ట్ బర్త్డే గిఫ్ట్” అంటూ ఆయన మరో పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనేక మంది వినియోగదారులు రాహుల్ గాంధీ చేసిన ఈ సింపుల్ గెస్టర్ను ప్రశంసిస్తూ స్పందించారు. కొందరు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు.Was out for lunch on my Son’s Birthday today . As luck would have it Rahul Gandhi ji @RahulGandhi and Priyanka ji @priyankagandhi were at nearby table with family . My son waived at him in excitement , Mr Gandhi called him and made his birthday memorable !! Thank you sir ! pic.twitter.com/J6l5AjtwSl— DR.S.J.T.KAZMI (@JAFARKAZMI) June 7, 2026మరో వినియోగదారు డాక్టర్ రాకేష్ బన్సాల్ కూడా తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. రాహుల్ గాంధీ చాలా సాదాసీదాగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. కుటుంబ వేడుకలో భాగమైనట్టే ఆయన ఫోటోలకు పోజ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం హృదయాన్ని హత్తుకునే అనుభవమని అభిప్రాయపడ్డారు. सार्थक 18 साल का है - पर सोच, साहस और सिद्धांत में किसी से कम नहीं।उसने और उसके साथी निसर्ग ने वो कर दिखाया जो देश के बड़े मीडिया हाउस, खोजी पत्रकार नहीं कर पाए - CBSE और COEMPT की मिलीभगत को देश के सामने रख दिया।मोदी जी चाहते हैं हमारे युवा reels बनाते रहें, पकौड़े तलते… pic.twitter.com/vjNNVItc2q— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2026సార్ధక్ ది గ్రేట్!సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో లోపాలను బయటపెట్టిన 18 ఏళ్ల సార్థక్ సిద్ధాంత్, అతని సహచరి నిసర్గపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. తాజాగా వాళ్లు పేరెంట్స్తో కలిసి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా.. ఈ ఇద్దరి ప్రయత్నం వల్ల వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తు కూడా ప్రారంభమైంది. విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఇటు సీబీఎస్ఈ అధికారులు రీవ్యాల్యుయేషన్ ప్రక్రియలో ఉన్న సమస్యలను అంగీకరించి మార్పులు చేస్తామని తెలిపారు. మొత్తం వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగిన ఒక వింత పెళ్లి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఒక వ్యక్తి ఏకంగా పిల్లనిచ్చిన సొంత అత్తనే వివాహం చేసుకున్న ఘటన పలువుర్ని విభ్రాంతికి గురి చేసింది. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, అక్బర్పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో, సదరు వ్యక్తి తన భార్యను వదిలిపెట్టి, ఆమె తల్లిని కోర్టు వివాహం చేసుకున్నారట. అంతేకాదు తమ వివాహ ధృవీకరణ పత్రాన్ని చేతిలో పట్టుకుని, తమ బంధాన్ని అంగీకరించాలని , తమ నిర్ణయాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ జంటకు వివాహానికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కుమార్తె వివాహం జరిగిన తర్వాత అత్తా-అల్లుళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని సమాచారం. అయితే ఆ వ్యక్తి భార్య స్పందన ఏంటి అనేదానిపై స్పష్టతలేదు. ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలుఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకుఎటువంటి పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదు. అలాగే అధికారులు ఎటువంటి చట్టపరమైన చర్యల గురించి వెల్లడించలేదు. दामाद ने बेटी से रिश्ता तोड़ मां से किया शादीयूपी के कानपुर में एक अनोखा मामला सामने आया है, जहां एक युवक ने अपनी पत्नी से अलग होने के बाद अपनी सास के साथ कोर्ट मैरिज कर ली।इस घटना के बाद इलाके में तरह-तरह की चर्चाएं हो रही हैं। pic.twitter.com/fcaNnYNle5— Priya singh (@priyarajputlive) June 8, 2026నెటిజన్ల మాత్రం ఈ వివాహం గురించి తెలిసి బంధాలు, నైతిక విలువలు మంటగలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేయగా, వావి వరుసలు మర్చిపోతున్నారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వివాదాస్పద ప్రేమకథ మాత్రమే కాదు, ఒక కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేసిన పరిస్థితి. మధ్యలో నలిగిపోయే వారే అసలైన బాధితులు, కుటుంబ అనుబంధం హద్దులు దాటింది. కామమే గెలిచింది, కుటుంబం ఓడిపోయిందని మరొకరన్నారు. సొంత రక్తమే వినాశనానికి కారణమైతే, ఇక ఎవరిని నమ్మాలి?" పాపం..ఆమె కుమార్తె పరిస్థితి ఏంటి అని ఆరాతీస్తున్నారు. కాగా 2024లో బీహార్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ ఘటనలో భార్య మరణం తరువాత, అతను అత్తమామల ఇంట్లోనే నివసించడం ప్రారంభించాడు. ఆ క్రమంలో అతను తన 55 ఏళ్ల అత్తగారు గీతా దేవితో సన్నిహితమయ్యాడు. ఒక రోజు, అతను గీతతో ఏకాంతంగా ఉండగా అతని మామగారు వారిని రెడ్-హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత, ఆ వ్యక్తి గ్రామస్తులందరి సమక్షంలో గీతను ప్రేమిస్తున్నట్లు అంగీకరించి, ఆమెను వివాహం చేసుకున్నాడు. -
గ్యాస్ రేట్లు మళ్లీ పెరుగుతాయా?.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులు.. ఈ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంధన ధరలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా.. అటు పెట్రో రేట్లు పెరగడం, అలాగే ఇటు సిలిండర్లపైనా పెంపు అమల్లోకి రావడంతో, భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉండే అవకాశముందా? అనే ప్రశ్న వినియోగదారుల్లో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రం చేసిన వివరణలు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితులు.. ఆ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అదే సమయంలో.. వంటగ్యాస్ (LPG) ధరలపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా.. సిలిండర్పై రూ.29 పెంపు అమల్లోకి రావడంతో, భవిష్యత్తులో మరిన్ని పెంపులు ఉండే అవకాశముందా? అనే ప్రశ్న వినియోగదారుల్లో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రం చేసిన వివరణలు పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి.డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పెంపుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియా ముఖంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ ధరల పెంపు తప్పించలేని నిర్ణయంగా మారిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పెంపుపై విచారం వ్యక్తం చేస్తున్నప్పటికీ, సరఫరా పరిమితులు, రవాణా ఖర్చుల పెరుగుదల, బీమా వ్యయాలు అధికమవడం వంటి కారణాలతో ధరలను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కావడం లేదని వివరించారు.అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ సరఫరా తగ్గడం, కొన్ని పరిమిత దేశాల నుంచే దిగుమతులు జరగడం, అలాగే 40–45 రోజుల ట్రాన్స్షిప్మెంట్ కారణంగా రవాణా వ్యయాలు భారీగా పెరగడం ధరల పెంపుకు ప్రధాన కారణాలుగా కేంద్రం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎల్పీజీ సరఫరా వ్యయం రూ.1,600 దాటినప్పటికీ, ఆ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపకుండా ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఉపశమనం కల్పిస్తోందని తెలిపింది.ఇదే సమయంలో భారత్లో వంటగ్యాస్ ధరలు ప్రపంచంలోనే తక్కువగా ఉన్నాయని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ ధరలు గణనీయంగా చౌకగా ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ వినియోగదారులు సిలిండర్కు సుమారు రూ.942 చెల్లిస్తుండగా, ప్రతి సిలిండర్పై దాదాపు రూ.700 వరకు ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10.58 కోట్లకుపైగా కనెక్షన్లు అందించగా, అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లపై ఒక్కో సిలిండర్కు రూ.300 సబ్సిడీ ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఉజ్వల వినియోగదారులకు సిలిండర్ ధర సుమారు రూ.642కే లభిస్తోందని వివరించింది.మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ సంక్షోభం కొనసాగుతున్నా భారత్లో వినియోగదారులపై భారం తగ్గించేందుకు భారీ సబ్సిడీలు, ప్రత్యామ్నాయ దిగుమతులు, దేశీయ ఉత్పత్తి పెంపు వంటి చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రం చెబుతోంది. అయితే పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో, రాబోయే నెలల్లో ఎల్పీజీ ధరలు ఎలా మారతాయన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది.కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సరఫరా సమస్యలు, రవాణా వ్యయాలు, దిగుమతి ఒత్తిడులు కొనసాగుతున్న నేపథ్యంలో ధరలపై ఒత్తిడి తప్పదని ఆయన పేర్కొనడం భవిష్యత్తులో మరింత పెంపులు ఉండే అవకాశాలపై సంకేతాలుగా రాజకీయ, ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ భారతీయ నర్సింగ్ దుస్తులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నర్సుల యూనిఫాం ఇప్పటికీ బలమైన వలసవాద ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడింది.తన రాబోయే చిత్రం 'భారత్ భాగ్య విధాత' (దర్శకుడు మనోజ్ తపాడియా) ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.బ్రిటిష్ నర్సుల డ్రెస్ కోడ్ ఇప్పటికీ వాడుకలో ఉందని, దీని భారతీయ శైలిలోకి మార్చాలని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. నర్సుల యూనిఫాం విషయంలో ఇప్పటికీ వలస పాలన నాటి ఛాయలు (colonial hangover) ఉండటమే వారిని లైంగిక కోణంలో చూడటానికి ఒక కారణమని కంగనా భావిస్తున్నారు. "నర్సుల డ్రెస్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిది. డాక్టర్లు ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చు, వాటి పైన ఒక కోట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ మన నర్సులు మాత్రం ఎండైనా, చలి అయినా ఆ నిర్దిష్టమైన యూనిఫామ్నే ధరించాలి. అవి విదేశీ స్టయిల్లా అనిపిస్తుందని పేర్కొన్నారు.అందుకే ఈ యూనిఫాంలో మార్పులు రావాలని, అది "భారతీయ శైలిలో"(Indianized) ఉండాలని కంగనా అభిప్రాయపడ్డారు. అలాగే, రోజువారీ విధుల్లో ఎలాంటి యూనిఫాం ధరించడానికి ఇష్టపడతారనే విషయంపై నర్సుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని ఆమె సూచించారు.యూనిఫాంపై పిన్ను, టోపీ లేదా బెల్టు పెట్టుకోవడం అమెరికా నేవీలో ఉంటుందని అన్నారు. మొదటి, రెండవ ప్రపంచ యద్దాల్లో వాళ్లు అలానే కనిపిస్తారని వ్యాఖ్యానించారు. తన సినిమా ఆ దిశగా కొంత మార్పును తీసుకువస్తుందని, భవిష్యత్తులో ప్రేక్షకులు నర్సులను చూసే దృక్పథాన్ని మారుస్తుందని ఆమె ఆశిస్తున్నారు. అలాగే ఇది అంత సులభమైనవృత్తి కాదని, వేతన విధానం నుండి యూనిఫాం వరకు అనేక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.కాగా 2008 నాటి 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో లక్ష్యంగా మారిన ప్రదేశాలలో ఒకటైన 'కామా హాస్పిటల్' నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ 'నర్సెస్ ఆఫ్ కామా' (Nurses of Cama) లో కంగనా నర్సు పాత్ర పోషిస్తోంది. ఉగ్రవాద దాడి జరిగినప్పటికీ, ఆసుపత్రిని నడుపుతూ రోగులను సురక్షితంగా ఉంచడంలో నర్సుల కృషి ఎంత కీలకమో ఈ చిత్రం చూపిస్తుంది. -
పుస్తకాలు పూసే ఊరు
ఒక గ్రామం గొప్పదవ్వాలంటే అక్కడ పెద్ద భవనాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి గ్రంథాలయం ఉంటే చాలు. ఒక దేశం గొప్పదవ్వాలంటే అక్కడ పెద్ద నగరాలు ఉండాల్సిన అవసరం లేదు. పుస్తకాలను ప్రేమించే పౌరులు ఉంటే చాలు. ‘భిలార్’ గ్రామం ఇందుకు నిదర్శనం. ఆ ఊరి వీధుల్లో నడుస్తుంటే గోడలు మాట్లాడతాయి. ఇళ్ల ముందర పూలకుండీలతో పాటు పుస్తకాల అలమారాలు కనిపిస్తాయి. మహారాష్ట్ర, సతారా జిల్లాలోని అందమైన పర్వత విహార కేంద్రాలైన పంచగని, మహాబలేశ్వర్ మధ్యలో ఉన్న ఈ ప్రశాంత గ్రామం చాలాకాలంగా స్ట్రాబెర్రీ సాగుకు ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామంలోని గోడలపై పుస్తకాల నుంచి ఎంపిక చేసిన భాగాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం భిలార్ను భారతదేశపు తొలి ‘పుస్తకాల గ్రామం’గా ప్రకటించడంతో ఈ చిన్న గ్రామం ఒక్కసారిగా పుస్తకాభిమానుల ఆకర్షణ కేంద్రంగా మారింది. సందర్శకులు గంటల తరబడి తమకు నచ్చిన పుస్తకాల్లో మునిగిపోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ, పఠన సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. పుస్తక దుకాణాలు, సాహిత్య ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన బ్రిటన్లోని వేల్స్ ప్రాంతంలోని హే–ఆన్–వై పట్టణం ఈ ఆలోచనకు స్ఫూర్తి. ఈ భావనను మహారాష్ట్ర మరాఠీ భాషా శాఖ, రాష్ట్ర మరాఠీ వికాస్ సంస్థ ప్రతిపాదించాయి. ఈ కాలంలో ఒక గ్రామం తనను తాను పుస్తకాలతో నిర్వచించుకోవడం ఎంత గొప్ప విషయం! ఇవ్వాళ జ్ఞానం విస్తరిస్తోంది. కానీ లోతైన ఆలోచన క్రమంగా అరుదవుతోంది. అలాంటి సమయంలో భిలార్ ఒక ప్రత్యామ్నాయ స్వప్నంలా కనిపిస్తుంది. గ్రామంలోని ఇరవై ఐదు ప్రదేశాలలో ఉన్న ప్రత్యేక పఠన కేంద్రాలలో– కవిత్వం, నవలలు, బాలసాహిత్యం, మహిళల రచనలు, చరిత్ర, పర్యావరణం, జానపద సాహిత్యం, జీవిత చరిత్రలు, ఆత్మకథలు... ఇలా ఒక్కో కేంద్రంలో ఒక్కో విభాగానికి చెందిన పుస్తకాలు ఉంటాయి. ప్రతి కేంద్రం ఒక ప్రత్యేక ప్రపంచం. పాఠకుడు తన ఆసక్తిని బట్టి ఆ ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు. గ్రామంలోని ఇళ్లు, పాఠశాలలు, సమావేశ భవనాలు, విశ్రాంతి స్థలాలు అన్నీ చిన్న చిన్న గ్రంథాలయాలుగా మారిపోయాయి.భిలార్ కథలో అత్యంత అందమైన అంశం ఏమిటంటే... అది ప్రభుత్వ ప్రాజెక్టుగా మొదలై, గ్రామ ప్రజల ఉద్యమంగా మారడం. తమ ఇళ్లలోని గదులను గ్రంథాలయాలుగా మార్చిన గ్రామస్థులు నిజమైన కథానాయకులు. తెలుగు రాష్ట్రాలు ఈ ప్రయోగం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ప్రతి జిల్లాలో ఒక పుస్తకాల గ్రామం ఎందుకు ఉండకూడదు? వేమన గ్రామం. గురజాడ గ్రామం. కాళోజీ గ్రామం. శ్రీశ్రీ గ్రామం. దాశరథి గ్రామం. సినారె గ్రామం... ఒక రచయిత పేరుతో కాదు, ఒక పఠన సంస్కృతి పేరుతో. భవిష్యత్తులో మన పిల్లలు ఏ ప్రపంచంలో జీవిస్తారో మనకు తెలియదు. కృత్రిమ మేధస్సు వస్తోంది. సాంకేతికత మరింత విస్తరిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం మారదు. మనిషిని మనిషిగా నిలబెట్టేది అతని ఊహాశక్తి. ఆ ఊహాశక్తికి మూలం పుస్తకాలే. అందుకే భిలార్ ఒక గ్రామం మాత్రమే కాదు, మన కాలానికి అవసరమైన ఒక సందేశం. రోడ్లు అభివృద్ధిని తీసుకురాగలవు. పరిశ్రమలు సంపదను తీసుకురాగలవు. కానీ పుస్తకాలు మాత్రమే సంస్కృతిని తీసుకురాగలవు. – వారాల ఆనంద్, కవి–అనువాదకుడు -
పోక్సో కేసు: డబ్బులు ఇస్తేనే మీకు అనుకూలంగా రాస్తా!
బెంగళూరు: పోక్సో కేసులో పోలీస్స్టేషన్లో లంచం తీసుకుంటూ మహిళా కానిస్టేబుల్ జ్యోతి లోకాయుక్తకు చిక్కగా, ఏఎస్సై శివశరణప్ప పరారయ్యారు. ఈ సంఘటన కలబుర్గిలోని స్టేషన్ బజార్ పోలీస్స్టేషన్లో జరిగింది. వివరాలు.. చెత్త ఏరుకునే మహిళ కుమార్తె (మైనర్) పై అత్యాచారం జరిగింది. ఈ కేసులో చార్జ్షీట్ వేయాలని, మీకు అనుకూలంగా రాయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని జ్యోతి, ఏఎస్సై శివశరణప్ప బాలిక తల్లిని డిమాండు చేశారు. కూతురిపై అఘాయిత్యం జరిగి బాధపడుతుంటే, పోలీసులు డబ్బుల కోసం పీడించడంతో ఆమె వేదనకు గురైంది. దీంతో కొందరు సామాజిక కార్యకర్తల సాయంతో లోకాయుక్తను ఆశ్రయించింది. ఆమె నుంచి జ్యోతి లంచం తీసుకుటుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. అక్కడే ఉన్న ఏఎస్సై పలాయన మంత్రం పఠించాడు. అతని కోసం గాలిస్తున్నారు. -
‘దీదీ’కి మరో షాక్: ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. టీఎంసీకి చెందిన ఇద్దరు కీలక రాజ్యసభ సభ్యులు సోమవారం (జూన్ 8) తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. జాతీయ రాజకీయాల్లో ఈ పరిణామం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.రాజకీయ సంక్షోభంప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, టీఎంసీ రాజ్యసభ ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, కోయెల్ మల్లిక్ తమ పదవులను వీడనున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బలమైన పట్టున్న ఈ ఇద్దరు నేతలు ఒక్కసారిగా తప్పుకోవాలని నిర్ణయించుకోవడం మమతా బెనర్జీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది.పడిపోనున్న పార్టీ బలంప్రస్తుతం దేశ ఎగువ సభ అయిన రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్కు 13 మంది సభ్యుల బలం ఉంది. అయితే, సుఖేందు శేఖర్ రాయ్, కోయెల్ మల్లిక్ గనుక రాజీనామా చేస్తే, సభలో టీఎంసీ ఎంపీల సంఖ్య 11కు పడిపోనుంది. పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకంగా మారిన ఈ తరుణంలో ఇద్దరు ఎంపీలను కోల్పోవడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విషయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు ఇంకా పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామాకు సిద్ధపడటం గమనార్హం. వారు ఎందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.ఇది కూడా చదవండి: అంతరిక్షంలో దాయాది దొంగ దెబ్బ.. భారత్కు సవాల్! -
అంతరిక్షంలో దాయాది దొంగ దెబ్బ.. భారత్కు సవాల్!
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తుపాకులు తాత్కాలికంగా శాంతించినప్పటికీ, తెరవెనుక దాయాది దేశం భారత్ను దెబ్బతీయడానికి భారీ వ్యూహాన్ని రచిస్తోంది. అంతరిక్షంలో సరికొత్త గూఢచారి ఉపగ్రహాల నెట్వర్క్ను నిర్మిస్తూ, భారత్పై నిరంతర నిఘా పెడుతోంది. ‘ది ప్రింట్’ పరిశోధనాత్మక కథనం ప్రకారం.. గత 16 నెలల వ్యవధిలోనే (జనవరి 2025 నుండి జూన్ 2026 మధ్య) పాకిస్తాన్ ఏకంగా 6 ఎర్త్-అబ్జర్వేషన్ (భూ-నిఘా) ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ఉపగ్రహాలన్నీ భారత భూభాగాన్ని ప్రతి రెండు రోజులకు ఒకసారి క్షుణ్ణంగా మ్యాపింగ్ చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చైనా వెన్నుదన్ను.. అసాధారణ వేగంపాకిస్తాన్ అంతరిక్ష సంస్థ ‘సుపార్కో’ (SUPARCO) 1961లో ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటివరకు కేవలం 15 ఉపగ్రహాలను ప్రయోగిస్తే, అందులో 6 ఉపగ్రహాలను కేవలం ఈ 16 నెలల్లోనే ప్రయోగించడం గమనార్హం. చైనా సాంకేతిక, లాంచ్ మద్దతుతోనే పాక్ ఈ అసాధారణ వేగాన్ని అందుకోగలిగింది. జనవరి 2025లో 'PAUSAT-1', 'PRSC-EO1' ప్రయోగాలతో మొదలైన ఈ సిరీస్, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 'PRSC-EO3' వరకు చేరింది. ఒకప్పుడు నత్తనడకన సాగిన పాక్ స్పేస్ ప్రోగ్రామ్, ఉన్నట్టుండి ఉసేన్ బోల్ట్ వేగంతో దూసుకుపోవడం వెనుక చైనా హస్తం స్పష్టంగా కనిపిస్తోందని మాజీ ఇస్రో అధికారులు అభిప్రాయపడుతున్నారు.కశ్మీర్ లక్ష్యంగా ప్రత్యేక కక్ష్యసాధారణంగా నిఘా ఉపగ్రహాలను సన్-సింక్రోనస్ కక్ష్యల్లో ఉంచుతారు. అయితే, పాకిస్తాన్ ఇటీవల ప్రయోగించిన 'PRSC-EO3' ఉపగ్రహాన్ని అమెరికాకు చెందిన స్పేస్ సంస్థ 'COMSPOC' విశ్లేషించింది. ఇది సాధారణ కక్ష్యలో కాకుండా 38 డిగ్రీల వంపు (Inclined Orbit) ఉన్న ప్రత్యేక కక్ష్యలో తిరుగుతోంది. దీనివల్ల గ్లోబల్ కవరేజ్ తగ్గినప్పటికీ, భారత్, కశ్మీర్ ప్రాంతాలపై ఈ ఉపగ్రహం రోజుకు పలుమార్లు ప్రయాణిస్తూ అత్యంత నిశితమైన నిఘా వేయడానికి వీలవుతుంది. ఈ హైపర్స్పెక్ట్రల్ ఉపగ్రహాల వల్ల భూమిపై ఆర్మీ కదలికలు, దాచి ఉంచిన ఆయుధ సంపత్తిని కూడా పాక్ సులువుగా గుర్తించగలదు.భారత్కు పెరుగుతున్న సవాళ్లుఒకవైపు పాకిస్తాన్ అంతరిక్ష నిఘాను పటిష్టం చేసుకుంటుంటే, మరోవైపు గత ఏడాది కాలంలో భారత్ మూడు వ్యూహాత్మక ఉపగ్రహ మిషన్లలో (EOS-N1, EOS-09, NavIC NVS-02) వైఫల్యాలను ఎదుర్కొంది. సరిహద్దుల్లో సైనిక కదలికలు, హిందూ మహాసముద్రంలో నౌకాదళ ఆస్తులను కాపాడుకోవడానికి భారత్ తన సొంత అంతరిక్ష నిఘా సామర్థ్యాన్ని తక్షణమే పెంచుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
సీఎం విజయ్కి ‘ఇండియా’ కూటమి షాక్!
న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోలీవుడ్ స్టార్, సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు నేడు (జూన్ 8) ఢిల్లీలో జరుగుతున్న కీలక ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశానికి సీఎం విజయ్కు ఆహ్వానం దక్కలేదు. తమిళనాడులో కాంగ్రెస్కు అత్యంత ఆప్తుడిగా మారిన విజయ్ ఈ భేటీకి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.ఈ సమావేశానికి విజయ్ను పిలవకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం లోక్సభ లేదా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీలను మాత్రమే ఈ భేటీకి ఆహ్వానించామని కూటమి నేతలు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుతానికి టీవీకే పార్టీ ఇంకా అధికారికంగా ఇండియా కూటమిలో భాగస్వామి కాలేదనే నెపంతోనే ఆయనకు ఈ మొండిచేయి ఎదురైనట్లు తెలుస్తోంది.అయితే లోపల సఖ్యతగా కనిపిస్తున్న ఈ కూటమిలో విజయ్ అంశం తీవ్ర కలకలానికి దారితీసింది. తమిళనాడు ఎన్నికల అనంతరం దశాబ్దాల మిత్రపక్షమైన డీఎంకేను పక్కనబెట్టి, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై స్టాలిన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంతర్గత విభేదాల నేపథ్యంలో, అటు డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించడం, ఇటు సీఎం విజయ్కు ఆహ్వానం దక్కకపోవడంతో కూటమిలో సరికొత్త రాజకీయ సమీకరణలు చర్చనీయాంశంగా మారాయి.ఇది కూడా చదవండి: మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు! -
‘తమ్ముడూ విజయ్.. ప్రాణం ఒక్కసారే పోతుంది!’
సాక్షి, చైన్నై: తమిళనాడు సీఎం విజయ్పై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు కూటమి కోసం ఎంతగానో మొత్తుకున్నారని, అప్పుడు ఒక చిన్న లెటర్ ప్యాడ్ పార్టీ గానీ, తమర్ని నమ్మి రాలేదరన్నారు. అయితే, ఇప్పుడు ఏదో మాయాజాలం జరిగి అధికారం దక్కేసరికి.. ఆ పవర్ను చూసి అందరూ తమరి వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నారని విజయ్ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. మదురై తెప్పకుళం మరియమ్మన్ ఆలయ కుంభాభిషేకం సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఉదయకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడుతున్న అన్నాడీఎంకే నేతలపై, సీఎం విజయ్ రాజకీయ వ్యూహాలపై ఘాటుగా స్పందించారు. అన్నాడీఎంకే చావలేదు.. మళ్లీ పుంజుకుంటుందిపారీ్టలో కొన్ని విభేదాల వల్ల నేతలు శత్రువుల వైపు వెళ్తున్నారని, గతంలో ఎంజీఆర్, జయలలిత హయాంలోనూ నెడుంచెజియన్, ఎస్టీఎస్ వంటి పెద్ద నేతలు పార్టీని వీడి మళ్లీ తిరిగి వచ్చారని ఉదయకుమార్ గుర్తుచేశారు. సొంత పార్టీ విలువ తెలియక కొందరు ప్రేమ, ఆదరణ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్తుండటం బాధాకరమన్నారు. కొందరు చిల్లర గాళ్లు తమను చూసి నవ్వుతున్నారని, తాము కేవలం ఎన్నికల్లో ఓడిపోయామే కానీ, చచ్చిపోలేదన్నారు. అన్నాడీఎంకే ఎన్నో శోధనలు, వేదనలను తట్టుకుని నిలబడిన పార్టీ అని, కోట్ల మంది కార్యకర్తలే ఈ పార్టీకి బలమైన పునాదిగా పేర్కొన్నారు. విజయ్లు ఎంతమంది వచ్చినా తాము చూస్తాం్ఙ అని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ ఏదేని జరిగిన పక్షంలో అందుకు అన్నాడీఎంకేమాత్రం బాథ్యులు కాదన్నారు. విజయ్ తమ్ముడూ.. నీకు హెచ్చరిక ముఖ్యమంత్రి విజయ్ను ‘తమ్ముడు’ అని సంబోధిస్తూ ఉదయకుమార్ కీలక హెచ్చరికలు చేశారు ‘విజయ్ తమ్ముడూ.. ప్రాణం ఒక్కసారే పోతుంది. నీకు హెచ్చరికగా, ప్రేమతో చెబుతున్నాను. జీవితం అనేది ఒకవృత్తం, పైన ఉన్నది కిందకు రావడం ప్రకృతి నియమం. కష్టపడి నమ్ముకున్న వాళ్లతో పార్టీ నడిపితే ఫలితం ఉంటుంది కానీ, దొరికిన వాళ్లనల్లా చేర్చుకుని పార్టీ నడిపితే లాభం లేదు. భవిష్యత్తులో నీకు ఏమైనా జరిగితే దానికి అన్నాడీఎంకే బాధ్యత వహించదు’ అని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఎందుకు? ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ గతంలో ఏఎంఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే.. ఇప్పుడు టీవీకేలో చేరారని గుర్తుచేస్తూ, రేపు అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిస్తే మళ్లీ ఆయన జంప్ జిలానీ తథ్యమన్నారు. అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలను విజయ్ కలిసి శాలువాలు కప్పడం.. ఆయన తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు విజయ్ వద్దు అని ఓటేశారని ,ఈ విషయం అర్థమైతే ఆయన ఇలా ఆపరేషన్ ఆకర్ష్ పనులు చేయరని ఎద్దేవా చేశారు. లెక్కలు తెలియక కొందరు చేతికూలీలను పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ఆ మంత్రికి పిచ్చి పట్టింది తమ పారీ్టలో 50 శాతం మందిని లాగేసుకున్నామని టీవీకే మంత్రి ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలపై ఉదయకుమార్ మండిపడ్డారు. ఆధవ్ అర్జున అనే ఆ పిచ్చి మంత్రికి నిజంగానే మైండ్ పాడైందా అనిపిస్తుందన్నారు. ఇలాంటి సగం తెలివితేటల ముఖాలను తీసుకెళ్లి కేబినెట్లో కూర్చోబెట్టారని, ఇలాంటి వాళ్లను చూడాల్సి రావడం మన దురదృష్టం అంటూæ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు!
తిరువనంతపురం: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న భారతీయ హెల్త్కేర్ కార్మికులు, ముఖ్యంగా కేరళకు చెందిన నర్సులు, పారామెడికల్ సిబ్బంది ప్రస్తుతం ఊహించని వీసా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అక్కడ నివసిస్తున్న వేలాది మంది నర్సులు, ఇతర వైద్య సిబ్బంది వీసా సమస్యల కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, దేశం విడిచి వెళ్లాల్సిన (డిపోర్టేషన్) పరిస్థితి తలెత్తింది. ఈ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చిత భవిష్యత్తుపై కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మానవీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక అత్యవసర లేఖ రాశారు.ఇరాన్ ఆస్పత్రి ఉద్యోగుల ఆందోళనప్రాంతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ ఉద్రిక్తతల ప్రభావం దుబాయ్లోని ఇరానియన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కేరళ వైద్య సిబ్బందిపై పడింది. ఇక్కడి ఆంక్షల కారణంగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని సీఎం సతీశన్ లేఖలో పేర్కొన్నారు. యూఏఈ నిబంధనల ప్రకారం వీరికి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ముగిసిపోతుండటంతో, గడువులోగా వీసా హోదాను క్రమబద్ధీకరించుకోకపోతే డిపోర్టేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వారి కెరీర్ను దెబ్బతీయడమే కాకుండా, భవిష్యత్తులో ఉద్యోగ, ప్రొఫెషనల్ లైసెన్సింగ్ అవకాశాలను కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించారు.కుటుంబాల భవితవ్యం ప్రమాదంలో..ఈ అకస్మాత్తు వీసా ఇబ్బందుల వల్ల ఉపాధి వీసాలు, విజిట్ వీసాలు, డిపెండెంట్ వీసాలు పొందడం కష్టంగా మారింది. యూఏఈలో స్థిరపడిన అనేక మలయాళీ కుటుంబాలు తమ పిల్లల విద్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో అక్కడి జీవితానికి అలవాటు పడ్డాయి. ఇప్పుడు ఉద్యోగాల ముప్పు, దేశ బహిష్కరణ భయాల నేపథ్యంలో వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వం పూర్తిగా ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి వివరించారు.మానవీయ కోణంలో జోక్యం చేసుకోవాలిఈ సంక్షోభానికి తగిన పరిష్కారం కనుగొనేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తక్షణమే యూఏఈలోని భారత రాయబార కార్యాలయం, అక్కడి అధికారులతో చర్చలు జరపాలని సీఎం కోరారు. కోవిడ్-19 మహమ్మారి వంటి క్లిష్ట సమయాల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఫ్రంట్లైన్ వారియర్లుగా ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించిన భారతీయ వైద్య సిబ్బంది సహకారాన్ని ఆయన గుర్తుచేశారు. కాబట్టి ఈ సమస్యను మానవీయ కోణంలో, న్యాయబద్ధంగా పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు: గగనతలాన్ని మూసేసిన ఇరాక్, సిరియా


