లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్పై రాహుల్ అసత్య వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైంది. దీనిపై రాహుల్ సాయంత్రం 5గం లోపు స్పీకర్ కార్యాలయంలోకి హజరై వివరణ ఇవ్వాలని తెలిపింది.
దీనిపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ స్పందించారు. రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందన్నారు. ఆయన చేసినవన్ని నిరాధార ఆరోపణలని తెలిపారు. ఎప్స్టీన్ ఫైల్స్ అంశంలో రాహుల్ గాంధీ చెప్పిన అంశాల్లో అసలు వాస్తవం లేదని దానికి సంబంధించిన చాలా నిజాలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఓటుచోరి అంటూ అంటూ రాహుల్ ఎలక్షన్ కమిషన్పై ఆయన చేసిన డ్రామా విఫలమయ్యిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు.
కాగా అంతకు ముందు రాహుల్ గాందీ పార్లమెంటులో మాట్లాడారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) చేసిన ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం యుద్ధాల యుగంలోకే ప్రవేశిస్తున్నామని దానికి ఉక్రెయిన్, గాజా, ఇరాన్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలను ఆయన ఉదాహరణగా చూపారు. శాంతి స్థాపన జరుగుతుందన్న అంచనాలు ఇక చెల్లవని, నిరంతర సంఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవమని రాహుల్ అన్నారు.
అయితే రాహుల్ ఎప్స్టీన్ ఫైల్స్ అంశం ప్రస్థావించాలని ప్రయత్నించగా స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ అదానీ, అంబానీ, హర్ధీప్ సింగ్ పేర్లను ప్రస్థావించారు. దీనిపై రవిశంకర్ ప్రసాద్ పాయింట్ ఆప్ ఆర్డర్ లేవనెత్తారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు.


