సాక్షి, చెన్నై : ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుచ్చేరిలో ప్రత్యేక ఆఫర్గా వైన్ కొంటే బీర్ ఫ్రీ అన్న ప్రచారం హోరెత్తింది. దీంతో ఎక్సైజ్ అధికారులు కన్నెర్ర చేసే పనిలో పడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మద్యం ధరలు తక్కువ. ఇక్కడ వివిధ రకాల బ్రాండ్లు లభిస్తుంటాయి.
తమిళనాడుతో పోలిస్తే తక్కువ ధరలకు ఇక్కడ విస్తృత శ్రేణి మద్యం బ్రాండ్లు లభించడం జరుగుతుంది. అందమైన సాగర తీరప్రాంత నగరం కావడంతో పుదుచ్చేరికి నిత్యం పర్యాటకులు హోరెత్తుతుంటారు. తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి మద్యపాన ప్రియులు తరచుగా పుదుచ్చేరికి వస్తుంటారు. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో మద్యం వ్యాపారం ఇక్కడ జోరుగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో పుదుచ్చేరిలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది.
గత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,100 కోట్ల ఆదాయం లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా పుదుచ్చేరి నిలవడంతో, మద్యం దుకాణాలు ఇప్పుడు పండుగ సీజన్కే పరిమితం కాకుండా ప్రత్యేక రోజుల సందర్భంగా కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో, వాలెంటైన్స్ డే సందర్భంగా ‘‘వైన్ కొనుగోలు చేస్తే బీరు ఉచితం’’ అంటూ కొన్ని మద్యం దుకాణాలు ప్రకటించిన ఆఫర్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులను ఆకర్షించి, తర్వాత విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పలువురు వినియోగదారులు తాము మోసపోయినట్లు అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.దీంతో ఎక్సైజ్ అధికారులు కన్నెర్ర చేసే పనిలో పడ్డారు. అలాగే ఇక్కడి హోటల్స్, రిసార్ట్స్లు సైతం ప్రేమికుల దినోత్సవ ఆఫర్లు అంటూ సోమవారం నుంచి ప్రత్యేక ప్రకటనలను ఇచ్చుకునే పనిలో పడ్డాయి. ఫిబ్రవరి 14వ తేదీకి మరో మూడు రోజులే సమయం ఉండటంతో ఇక్కడి ఆఫర్లపై దృష్టి పెట్టే వాళ్లు పెరిగారు. అదే సమయంలో మద్యం దుకాణాలలో ఆఫర్ల ఘటనపై సంబంధిత శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆఫర్లు ప్రకటించినట్లు తేలితే, సంబంధిత మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


