బాంబు బెదిరింపుల కాల్స్ ఈ మధ్య తరచుగా మారాయి. తాజాగా ఛండీగఢ్లోని పలు పాఠశాలలలో బాంబులు పెట్టామంటూ ఈ రోజు ఉదయం బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను ఖాళీ చేయించారు.
ఛండీగఢ్తో పాటు పక్కనే ఉన్న మోహలీ ప్రాంతంలో పాఠశాలలో బాంబులు పెట్టామని బెదిరింపులు రావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. అదే విధంగా కొన్ని పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో వెంటనే పోలీసులు పాఠశాలలకు చేరుకున్నారు. డాగ్స్క్వాడ్ బృందాలతో పాటు జాగీలాలతో గాలింపు చేపట్టారు.
అయితే ఇటీవల పాఠశాలలకు బాంబు బెదిరింపులు తరచుగా మారాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోని తొమ్మిది స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ అఫ్జల్ గురు జ్ఞాపకార్థం ఢిల్లీ ఖలిస్థాన్ గా మార్చబోతున్నామంటూ అందులో ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించారు.
జనవరి 29న రాజధానిలో ఐదు విద్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తీరా అధికారులు తనిఖీలు చేయగా అది బెదిరింపు మెయిల్ అని తేలింది. అదే విధంగా జనవరి 28న ద్వారకా కోర్టు కాంప్లెక్స్ లోనూ పేలుడు పధార్థాలు పెట్టామంటూ మెయిల్ రాగా పోలిసులు తనిఖీలు చేపట్టగా అది అబద్ధమని తేలింది.అయితే ఇలా బెదిరింపు కాల్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


