న్యూఢిల్లీ: జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలాపన విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ గీతంలోని మొత్తం ఆరు చరణాలను ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాడాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నెహ్రూ ప్రభుత్వం ‘సెక్యులర్’ అంశాలను కారణంగా చూపి, ఈ గీతంలోని చివరి నాలుగు చరణాలను తొలగించింది. అయితే, తాజా ఆదేశాల ప్రకారం పూర్తి గీతాన్ని ‘అధికారిక వెర్షన్’గా పరిగణించాలని, ఈ పూర్తి గీతం ఆలపించడానికి మూడు నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుందని హోం శాఖ తెలియజేసింది. వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నూతన మార్గదర్శకాలను తీసుకువచ్చారు.
ఈ ఉత్తర్వులలోని వివరాల ప్రకారం ఈ జాతీయ గీతం ఆలపించేటప్పుడు లేదా ప్లే చేస్తున్నప్పుడు సభికులందరూ తప్పనిసరిగా లేచి నిలబడి, గౌరవ వందనం సమర్పించాలి. అయితే సినిమా థియేటర్లలో సినిమా ప్రదర్శనలో భాగంగా గానీ లేదా న్యూస్ రీల్స్లో గానీ ఈ గీతం వచ్చినప్పుడు నిలబడటం తప్పనిసరి కాదని కేంద్రం మినహాయింపునిచ్చింది. ప్రేక్షకులు నిలబడటం వల్ల సినిమా చూసేందుకు అంతరాయం కలగడమే కాకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
అధికారిక రాష్ట్ర వేడుకలు, పౌర సన్మాన కార్యక్రమాలకు రాష్ట్రపతి వచ్చినప్పుడు, అలాగే ఆయన తిరిగి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వందేమాతర గీతాన్ని ఆలపించాలి. ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ముందు, ప్రసంగం ముగిసిన తర్వాత కూడా ఈ గీతాన్ని ప్రసారం చేయాలి. రాష్ట్ర స్థాయిలో గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో కూడా ఇదే ప్రోటోకాల్ వర్తిస్తుంది.
జాతీయ జెండాను ఎగురవేసే అన్ని సందర్భాల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ వందేమాతరం ఆలపించడం ఇకపై తప్పనిసరిగా మారుతుంది. మంత్రులు పాల్గొనే అనధికారిక కార్యక్రమాల్లో కూడా సామూహికంగా ఈ గీతాన్ని ఆలపించవచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో ప్రతిరోజూ ఉదయం జరిగే ప్రార్థనా సమావేశాల్లో (అసెంబ్లీ) విద్యార్థులందరూ సామూహికంగా ఈ ఆరు చరణాల పూర్తి గీతాన్ని పాడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.


