మధుర: ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేటి (శనివారం) తెల్లవారుజామున 2:45 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ప్రయాణికుల విరామం కోసం రహదారి పక్కన ఆగింది. ప్రయాణికులు బస్సు దిగి, బయట నిలుచున్నారు. ఇంతలో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కంటైనర్ ట్రక్కు అదుపుతప్పి, ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


