నడి రోడ్డుపై 15 అడుగుల లోతు గొయ్యి  | Biker dies after falling into open Delhi Jal Board pit | Sakshi
Sakshi News home page

నడి రోడ్డుపై 15 అడుగుల లోతు గొయ్యి 

Feb 7 2026 6:31 AM | Updated on Feb 7 2026 6:31 AM

Biker dies after falling into open Delhi Jal Board pit

అందులోపడి మోటారు సైకిలిస్ట్‌ మృత్యువాత 

గురువారం అర్ధరాత్రి ఘటన.. తెల్లారాక వెలుగులోకి.. 

గుంత చుట్టూ సరైన రక్షణ చర్యలు చేపట్టలేదని వెల్లడి 

ముగ్గురు ఇంజనీర్లను సస్పెండ్‌ చేసిన ఢిల్లీ జల్‌బోర్డు 

న్యూఢిల్లీ: నిర్మాణ పనుల కోసం ఢిల్లీ జల్‌బోర్డు తవ్విన 15 అడుగుల లోతు గుంతలో ఓ మోటారు సైకిలిస్ట్‌ పడి, ప్రాణాలు కోల్పోయారు. గురువారం రాత్రి జనక్‌పురి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం ఉదయం 8 గంటలకు వెలుగు చూసింది. 

కైలాస్‌పురికి చెందిన కమల్‌ భయానీ(25) ఓ ప్రైవేట్‌ బ్యాంకు కాల్‌ సెంటర్‌ ఉద్యోగి. గురువారం అర్ధరాత్రి సమయంలో విధులు ముగించుకుని బయలుదేరిన ఆయన..ఇంటికి చేరుకోలేదు. దీంతో, కుటుంబసభ్యులు భయాందోళనకు గురై ఆ చుట్టుపక్కలున్న జనక్‌పురి, సాగర్‌పూర్, వికాస్‌ పురి, రోహిణి తదితర పోలీస్‌స్టేషన్లకు వెళ్లి, విషయం అక్కడి అధికారులకు వివరించారు. 

పెద్దగా ఎవరూ స్పందించలేదు. కమల్‌ రోజూ ప్రయాణించే రహదారిపై రాత్రంతా గాలిస్తూనే ఉన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల వేళ ఓ మహిళ జనక్‌పురి ప్రాంత పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసి, అధికారులు తవ్విన గుంతలో బైకుతోపాటు ఓ వ్యక్తి చలనం లేకుండా పడిపోయి కనిపించినట్లు తెలిపింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లోపలికి దిగి కమల్‌ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. జనవరి 16వ తేదీ రాత్రి నోయిడాలో యువరాజ్‌ మెహతా(27) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నిర్మాణ ప్రాంతంలో నిలిచిన నీటి గుంతలో కారుతోపాటు పడి ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. 

అన్ని చోట్లా నిర్లక్ష్యమే: బాధిత కుటుంబం 
నిర్మాణ పనుల కోసం ఆ రోడ్డును కొన్ని రోజు లుగా మూసివేశారు. గురువారం భారీ గుంతను తవ్వారు. ఆ విషయం తెలియక కమల్‌ అటుగా వచ్చి ప్రమాదం బారిన పడి ఉంటారని భావిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే కమల్‌ ప్రాణాలు కోల్పోయారని కుటుంబీకులు, సన్నిహితులు ఆరోపించారు. పోలీసులు వెంటనే స్పందించి వెతికి ఉంటే అతడి ప్రాణాలు దక్కించుకోగలిగేవారమన్నారు.  

ముగ్గురు అధికార్ల సస్పెన్షన్‌ 
ఘటన ప్రాంతాన్ని ఢిల్లీ జల శాఖ మంత్రి పర్వేశ్‌ వర్మ స్వయంగా పరిశీలించారు. అధికారులు గుంత చుట్టూ కొంతమేర రక్షణ చర్యలు చేపట్టారని ఆయన చెప్పారు. అయినప్పటికీ, మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఆ మార్గంలో వాహనదారులు రాకపోకలను మాత్రం మానలేదన్నారు. అంతేకాకుండా, అక్కడ జరిగే పనుల్ని పట్టించుకోని జల్‌బోర్డు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ ఇంజనీర్, జూనియర్‌ ఇంజనీర్‌లను సస్పెండ్‌ చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement