ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో అధికార పంపిణీకి సంబంధించి బీజేపీ- ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒక ప్రాథమిక ఒప్పందం కుదిరింది. రెండు పార్టీలు వేర్వేరు బృందాలుగా దీనిపై రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, పదవుల కేటాయింపుపై తెర వెనుక బేరసారాలు జరుగుతున్నాయని సమాచారం. కాగా అత్యంత ప్రతిష్టాత్మకమైన మేయర్ పీఠంపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం దేశంలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన బీఎంసీ మేయర్ పదవిని బీజేపీ దక్కించుకోనుంది. దీనికి ప్రతిగా షిండే నేతృత్వంలోని శివసేనకు డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించేందుకు ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉన్నా, ఈ పదవుల పంపకంపై మహాయుతి కూటమిలో ఇప్పటికే ఒక ఫ్రేమ్వర్క్ సిద్ధమైనట్లు సమాచారం.
అయితే ఇప్పుడు అసలైన పేచీ ‘స్టాండింగ్ కమిటీ’ చైర్మన్ పదవి వద్ద మొదలైంది. మున్సిపల్ నిధులు, కీలక ప్రాజెక్టుల నిర్ణయాలను నియంత్రించే ఈ కమిటీ పీఠాన్ని వదులుకునేందుకు బీజేపీ ససేమిరా అంటోంది. ఆర్థిక పరమైన అధికారాలు కలిగి ఉండే ఈ పదవిని తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ పట్టుబడుతుండగా, షిండే సేన కూడా దీని కోసం గట్టిగానే ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: దగ్గు మందు కలకలం: నాలుగేళ్ల బాలుడు మృతి


