దాదాపు ఏడాది రాష్ట్రపతి పాలన తర్వాత ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటునకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నాం మణిపూర్ భవన్లో బీజేపీ ఎమ్మెల్యేలంతా సమావేశమై శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే.. రేసులో ఇప్పటిదాకా ఇద్దరే ఉన్నారని ప్రచారం జరిగినా.. ఇప్పుడా సంఖ్య ఆరుకు చేరడం గమనార్హం.
మొయితీ-కుకీ తెగల మధ్య ఘర్షణలు.. హింసాత్మక పరిస్థితులు ఏడాదిన్నరపాటు(2023 మే 3న మొదలై..) కొనసాగాయి. ఈ అల్లర్లలో 260 మందికి పైగా మృతి చెందగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ మధ్యలో సీఎం రాజీనామా చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చినా.. అలాంటిదేం జరగలేదు. చివరకు.. 2025 ఫిబ్రవరి 13న బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా.. ఈ మధ్యలో బీజేపీ ఎమ్మెల్యేలు కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నాలు ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి తేవాలంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్కు బీజేపీ బాధ్యతలు అప్పగించింది.
సోమవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డ సమావేశం.. తరుణ్ చుగ్కు బాధ్యతలు అప్పగించింది. అయితే అంతకుముందు.. ఆదివారమే బీజేపీ, మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ వెంటనే బీజేపీ మణిపూర్ అధ్యక్షురాలు శారదా దేవి సహా పలువురు నేతలు హస్తినకు చేరడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే.. ఇవాళో, రేపో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి.
ఇక్కడే మరో ట్విస్ట్!
మణిపూర్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీయే కూటమి భావిస్తోంది. బీజేపీకి 37 ఎమ్మెల్యేలు, మిత్రపక్షాలైన ఎన్పీపీకి 6, ఎన్పీఎఫ్కు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కల్లోల ప్రాంతంగా దేశం దృష్టిలో మణిపూర్ మిగిలిపోవడంతో.. ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఆ పార్టీ నాయకత్వం పర్వత ప్రాంతాలు–లోయ ప్రాంతాల కీలక వర్గాలకు ప్రాతినిధ్యం కలిగిన సమగ్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కానీ ప్రభుత్వ ఏర్పాటునకు కుకీ తెగకు చెందిన ఎమ్మెల్యేలు మోకాలు అడ్డుపెడుతున్నారు.
రాజకీయంగా, మణిపూర్ అసెంబ్లీలో 10 మంది కుకి ఎమ్మెల్యేలు(వీరిలో 7 మంది బీజేపీకి చెందినవారు) ఉన్నారు. జనవరి 13వ తేదీన ఈ వర్గం గువాహటిలో కుకీ సంఘాలతో కలిసి ఓ భేటీ నిర్వహించి.. ప్రత్యేక పరిపాలన (లెజిస్లేటివ్ ఉన్న యూనియన్ టెరిటరీ) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన వేళ.. వ్రాతపూర్వక హామీ కోరుతోంది. మణిపూర్లో ప్రభుత్వ పునరుద్ధరణకు బీజేపీ తొలి అడుగు వేసినా, కుకి వర్గం ప్రత్యేక పరిపాలన డిమాండ్ తీర్చకపోతే ఈ ప్రయత్నం సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఇద్దరు కాదు.. ఆరుగురు
సీఎం రేసులో తొలుత ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అసెంబ్లీ స్పీకర్, మాజీ మంత్రి థోక్చోమ్ సత్యబ్రత సింగ్ తో పాటు మరో మంత్రి థోంగమ్ బిస్వజిత్ సింగ్ పేర్లు ఈ రేసులో తొలుత తెరపైకి వచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా ఆ సంఖ్య ఆరుకి చేరింది. ఆ లిస్ట్లో ఉన్న పేర్లు, వాళ్ల ప్రొఫైల్స్ ఇలా ఉన్నాయి..
థోక్చోమ్ సత్యబ్రత సింగ్ – ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్, యైస్కుల్ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2020–22లో మంత్రి కూడా అయ్యారు.
థోంగమ్ బిస్వజిత్ సింగ్ – 2012 నుంచి ఎమ్మెల్యే, పర్యావరణ మరియు పిడబ్ల్యూడీ శాఖల మంత్రిగా పనిచేశారు.
యుమ్నం ఖేమ్చంద్ సింగ్ – సింగ్జమేయి నియోజకవర్గం ఎమ్మెల్యే, 2017–22లో స్పీకర్, తరువాత మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, విద్యా శాఖల మంత్రిగా ఉన్నారు.
గోవిందాస్ కాంతౌజామ్ – బిష్ణుపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, పీడబ్ల్యూడీ మంత్రిగా పనిచేశారు.
థౌనౌజామ్ బసంత్ కుమార్ సింగ్ – నాలుగు సార్లు ఎమ్మెల్యే, నంబోల్ నియోజకవర్గం ప్రతినిధి. గతంలో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో క్రీడల సహాయ మంత్రిగా పని చేశారు.
థోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్ – హైరోక్ నియోజకవర్గం ఎమ్మెల్యే, రిటైర్డ్ IPS అధికారి. గల్లంట్రీ, మెరిటోరియస్ సర్వీస్ కోసం రాష్ట్రపతి పోలీస్ మెడల్ పొందారు.
మొత్తంగా, బీజేపీ పై ఆరుగురిలో ఒకరిని కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ వారంలోనే ఈ ఉత్కంఠకు తెరపడే చాన్స్ ఉంది.


