సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి రేపు(ఫిబ్రవరి 04, బుధవారం) గుంటూరులో పర్యటించనున్నారు. టీడీపీ గూండాల చేతిలో దాడితో భయబ్రాంతులకు గురైన సీనియర్నేత, మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. టీడీపీ గూండాలు అంబటి నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
గుంటూరులో ఇటీవల రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తిరుపతి లడ్డూ ప్రచార నేపథ్యంలో టీడీపీ దుష్ప్రచారానికి దిగడం.. దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అంబటి రాంబాబుపై కర్రలతో దాడికి యత్నం.. ఆ క్రమంలో చోటుచేసుకున్న వాగ్వాదాలు.. చివరకు అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలో అంబటితో వైఎస్ జగన్ మాట్లాడారు కూడా. అయితే.. ఆ తర్వాతే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రాత్రిపూట పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయగా.. సీఎంను దుర్భాషలాడారన్న కేసులో మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. అయితే.. ఈ సంఘటనతో చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంబటి, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిందని దాడి కాదని.. హత్యాయత్నమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైనా పెట్రోల్ బాంబ్ దాడి జరిగింది.
ఈ పరిణామాల నేపథ్యంలో బాధిత కుటుంబాలకు పరామర్శించి దైర్యం చెప్పాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. బుధవారం అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అలాగే.. శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు. అంబటి, జోగితో పాటు టీడీపీ రౌడీ మూకల చేతుల్లో దాడులకు గురైన పార్టీ నేతలు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులతో వైఎస్ జగన్ ఇప్పటికే ఫోన్లో మాట్లాడి.. ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే.


