న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాలుగో రోజైన నేడు (సోమవారం) ఉభయ సభలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టనున్నాయి. ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, నేటి నుంచి ఈ కీలక చర్చ ప్రారంభం కానుంది. గడిచిన జనవరి 28న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము.. జాతీయ భద్రత, 'వికసిత్ భారత్' లక్ష్యం, ‘స్వదేశీ' ఉద్యమం వంటి అంశాలపై ఎంపీలందరూ ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ధన్యవాద తీర్మానంపై జరగనున్న చర్చలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎంపీలు తారిక్ అన్వర్, అమరీందర్ రాజా వారింగ్, ఆంటో ఆంటోనీ, జోతిమణి కూడా ఈ చర్చలో తమ గళాన్ని వినిపించనున్నారు. ఈ చర్చకు సంబంధించి లోక్సభలో మొత్తం 18 గంటల సమయాన్ని కేటాయించారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ చర్చ కొనసాగనుంది. విపక్షాల విమర్శలు, ప్రశ్నలకు ఫిబ్రవరి 11న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన అంతర్జాతీయ నివేదికలలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావనకు వచ్చిందని ఆరోపిస్తూ, దీనిపై తక్షణమే చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో వెలువడిన ఈ నివేదికలు అత్యంత తీవ్రమైనవని, దీనిపై సభలో సమగ్రంగా చర్చించాలని ఆయన తన నోటీసులో పేర్కొన్నారు. ఈ అంశం సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఏఐ ‘దొంగ’ ఫొటోలు.. కంగుతిన్న పర్యాటకులు


