సాక్షి,బెంగళూరు: బతుకుతెరువు కోసం చిత్రదుర్గ జిల్లా నుంచి విజయనగర జిల్లాకు వచ్చి కొట్టూరులో స్థిరపడిన భీమరాజ్ కుటుంబాన్ని కన్న కొడుకే కాలయముడై హత్య చేశాడు. కొట్టూరు పట్టణంలో తల్లిదండ్రులు భీమరాజ్ (50), (45) సోదరి అమృత (17) కాళ్లు నరికేసి, ఇంట్లో పాతిపెట్టినట్లు అక్షయ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఆదివారం ఇంట్లో పాతిపెట్టిన మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. కర్కోటక తనయుడు అక్షయ్ కుమార్ పోలీసుల విచారణలో పలు విషయాలు చెప్పినట్లు సమాచారం. ఈ హత్యలు పరువు కోసమా లేదా డబ్బు కోసం చేశాడా అనేది తెలియాల్సి ఉంది.
చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకాకు చెందిన భీమరాజ్, జయలక్ష్మి, కుమారుడు అక్షయ్ కుమార్, కుమార్తె అమృతతో కలిసి కొట్టూరులో నివసిస్తున్నారు. అమృత ఓ యువకుడితో ప్రేమలో పడి గర్భవతి అయినట్లు తెలిసింది. ఈ విషయమై కుమారుడు అక్షయ్.. తల్లిదండ్రులు, చెల్లి అమృతతో గొడవ పడ్డాడు. అమృతకు అబార్షన్ చేయించాలని ఒత్తిడి చేశాడు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడంతో కక్ష పెంచుకుని ఈ హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో అక్షయ్ నోరు విప్పినట్లు తెలుస్తోంది.
డబ్బు కోసమేనా?
అయితే ఇది పరువు హత్య కాదని.. డబ్బు కోసమే తల్లిదండ్రులు, సోదరిని అక్షయ్ కుమార్ హత్య చేసి ఉంటాడనే మరో కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఇటీవల భీమరాజ్ పొలం విక్రయించగా వచ్చిన డబ్బు తనకు ఇవ్వాలని అక్షయ్ పట్టుబట్టాడు. అయితే చెల్లి పెళ్లికి డబ్బు అవసరం అవుతుందని కొడుకుకు నచ్చజెప్పాడు. డబ్బు ఇవ్వలేదని కక్ష పెంచుకున్న అక్షయ్.. జనవరి 26వ తేదీన ముందుగా తల్లి, సోదరిని హత్య చేశాడు.
ఆ తర్వాత తండ్రిని హతమార్చాడు. బాడుగ ఇంట్లో గుంత తవ్వి ముగ్గురిని ఒకే గుంతలో పాతిపెట్టే క్రమంలో తండ్రి కాళ్లు పొడవు ఉండటంతో రెండు కాళ్ల నరికి పక్కన పడేశాడు. మృతదేహాలను గుంతలో ఒకటిపై ఒకటి వేసి పూడ్చాడు. ఎవరికి అనుమానం రాకుండా టైల్స్తో కప్పేశాడు. అనంతరం బెంగళూరుకు వెళ్లిపోయాడు. తల్లీదండ్రులు, సోదరి కనబడటం లేదని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్షయ్ కుమార్పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.


