ఆటోలోనే.. అటూ ఇటూ | Hyderabad police form special teams to probe Koti SBI ATM robbery | Sakshi
Sakshi News home page

ఆటోలోనే.. అటూ ఇటూ

Feb 2 2026 7:31 AM | Updated on Feb 2 2026 7:31 AM

Hyderabad police form special teams to probe Koti SBI ATM robbery

పాతబస్తీలో ప్రయాణం మొదలెట్టి మళ్లీ అక్కడికే.. 

ఎక్కడికెళ్లారో ఇప్పటికీ అంతుచిక్కని వ్యవహారం 

 కోఠి ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద దోపిడీ ఘటన 

పథకం ప్రకారం వ్యవహరించిన ఇద్దరు దొంగలు 

ఉత్తరాదిలోనూ ముమ్మరంగా గాలిస్తున్న స్పెషల్‌ టీమ్స్‌ 

బాధితుడి నుంచి వివరాల సేకరణకు అడ్డంకిగా మారిన భాష

సాక్షి, హైదరాబాద్: కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద శనివారం ఉదయం చోటుచేసుకున్న దోపిడీ కేసు దర్యాప్తును నగర పోలీసులు ముమ్మరం చేశారు. నిందితుల కోసం టాస్‌్కఫోర్స్, సీసీఎస్‌లకు చెందిన ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే స్పెషల్‌ టీమ్స్‌ ఉత్తరప్రదేశ్‌తో పాటు హరియాణాకు వెళ్లి ఆరా తీస్తున్నాయి. ఈ నేరం చేయడానికి ముందు రెక్కీ చేసిన దుండగులు పక్కా పథకం ప్రకారం వ్యవహరించారు. తాము ఎక్కడి నుంచి వచ్చామో.. ఎటు వెళ్లామో.. పోలీసులకు అంతు చిక్కకుండా వాహనాలు మారుతూ ప్రయాణించారు.

 ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ దుండగులు పాతబస్తీలో షెల్టర్‌ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. నాంపల్లిలోని జనతా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కోజికోడ్‌కు చెందిన రిన్షాద్‌పై దాడికి దిగిన దోపిడీ దొంగల ద్వయం.. ఆయన కాళ్లకు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. రిన్షాద్‌ చేరుకునే సమయానికే వీళ్లు ఏటీఎం వద్ద కాపు కాసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడిని చంపడం దుండగుల లక్ష్యం కాదని.. కేవలం భయపెట్టి దోచుకోవాలన్నదే పథకం అని పోలీసులు చెబుతున్నారు. ఈ కారణంగానే కాళ్లకు గురిపెట్టి కాల్చారని వివరిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయిన దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను బట్టి ఇప్పటి వరకు సేకరిచిన సమాచారం ప్రకారం దుండుగులు పాతబస్తీలో షెల్టర్‌ తీసుకున్నట్లు తేల్చారు.  

మరోసారి కోఠికి.. 
అక్కడి నుంచి ఒక ఆటోలో బయలుదేరిన ద్వయం.. మార్గంమధ్యలో మరోసారి కోఠికి చేరుకుంది. దోపిడీ తర్వాత రిన్సాద్‌ వచి్చన ద్విచక్ర వాహనంపై ఉమెన్స్‌ కాలేజ్, చాదర్‌ఘాట్‌ జంక్షన్, నింబోలిఅడ్డా మీదుగా కాచిగూడ వైపు వెళ్లారు. అక్కడి శ్యామ్‌బాబా దేవాలయం వద్ద ద్విచక్ర వాహనాన్ని వదిలేసి, తమ దుస్తులు మార్చుకున్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌లోకి వెళ్లి.. తిరిగి బయటికి వచ్చేసిన ద్వయం చౌరస్తా వైపు కాలినడకన వెళ్లింది. అక్కడ నుంచి మరో రెండుమూడు ఆటోలు మారుతూ అఫ్జల్‌గంజ్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్టకు చేరుకున్నారు. అట్నుంచి ఎక్కడకు వెళ్లారన్నది తేల్చడానికి ప్రత్యేక బృందాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను జల్లెడపడుతున్నాయి.  

క్లిష్టతరంగా దర్యాప్తు.. 
సంబంధిత ఆటోడ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రయాణంలో వీళ్లు ఎక్కడా ఆటో బుకింగ్, నగదు చెల్లింపు కోసం యాప్స్‌ వాడకపోవడంతో దర్యాప్తు మరింత క్లిష్టతరంగా మారింది. బాధితుడు రిన్షాద్‌ నుంచి పూర్తి సమాచారం పోలీసులు సేకరించలేకపోతున్నారు. ఇతడికి మలయాళం మినహా మరో భాష రాకపోవడం అడ్డంకిగా మారింది. మలయాళం, తెలుగు తెలిసిన వ్యక్తిని ట్రాన్స్‌లేటర్‌గా పెట్టుకుని విచారిస్తున్నా పూర్తి స్థాయిలో సమాచారం రావట్లేదు. తాను షాక్‌లో ఉన్నానని, భయంగా ఉందని చెబుతున్న అతడు కీలక సమాచారం అందించట్లేదని అధికారులు పేర్కొంటున్నారు. వస్త్ర వ్యాపారం చేస్తున్న రిన్షాద్‌ వ్యవహారంలో హవాలా కోణాన్నీ అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement