వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో డ్రోన్లు కలకలం సృష్టించాయి. అత్యంత కీలక సైనిక స్థావరం ‘ఫోర్ట్ మెక్నైర్’ (Fort McNair) వద్ద గుర్తు తెలియని డ్రోన్లు తిరుగుతుండటం అమెరికా యంత్రాగాన్ని హడలెత్తిస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్లు నివసించే ప్రాంతంలో డ్రోన్లు కనిపించడం అగ్రరాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో వైట్హౌస్ అత్యవసర చర్యల్లోకి దిగింది.
యుద్ధ మేఘాల మధ్య..
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో ఈ డ్రోన్ల సంచారం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపారు? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. భద్రతా పరమైన ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో అమెరికా తన విదేశీ రాయబార కార్యాలయాలను హై అలర్ట్లో ఉంచడంతో పాటు, స్వదేశంలోని పలు సైనిక స్థావరాలను లాక్డౌన్ చేసింది.
ట్రంప్ మాస్ వార్నింగ్
మరోవైపు, ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగడంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. దీనికి ప్రతీకారంగా ఖతార్లోని ఇంధన ప్లాంట్లపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఖతార్పై మళ్లీ దాడికి దిగితే, ఇరాన్ ఇంధన వనరులను పూర్తిగా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు.
మండిపోతున్న చమురు ధరలు
ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 5 శాతం పెరిగి, మరింత భారంగా మారింది. చమురు రవాణాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ భీకర పోరులో ఇప్పటివరకు ఇరాన్లో 1,300 మంది, లెబనాన్లో 960 మంది, అమెరికా సైనికులు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షిపణి దాడుల కారణంగా ఖతార్లోని కీలక గ్యాస్ ప్లాంట్లు భారీగా దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి: గల్ప్కు మరిన్ని భారత యుద్ధ నౌకలు


