షాకింగ్‌ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్‌ సూసైడ్‌! | US based Malayali sisters decision and said Bye we leave happily sorry | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్‌ సూసైడ్‌!

May 2 2026 1:25 PM | Updated on May 2 2026 1:32 PM

US based Malayali sisters decision and said Bye we leave happily sorry

ఆనీ ఫిలిప్ , మీరా ఫిలిప్ వీరిద్దరూ మలయాళీ సిస్టర్స్‌..అమెరికాలో స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం. సౌకర్య వంతమైన జీవితం. కానీ అనూహ్యంగా కన్యాకుమారిలో వీరిద్దదూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అదీ పక్కాగా ప్లాన్‌ చేసుకొని మరీ ఉసురు తీసుకున్నారు. తాము ఈ లోకాన్ని సంతోషంగా వీడుతున్నామంటూ,  కుటుంబానికి క్షమాపణలు చెపుతూ పంపిన  ఈ మెయిల్స్‌ సంచలనంగా మారాయి.

ఆనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా, మీరా ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ అవివాహితులు. ఇటీవల టెక్సాస్ నుంచి కేరళకు వచ్చిన వీరు, కన్యాకుమారి వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం  తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం  ముందుగా అన్నీ ప్లాన్‌ చేసుకుని మరీ, తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎలా ప్లాన్‌ చేసుకున్నారంటే..
అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఆత్మహత్యకు సంబంధించి వారిద్దరూ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కన్యాకుమారి పోలీసులు తెలిపారు. హోటల్ గదిని వదిలి వెళ్లే ముందు, ఒక ఫోన్‌ను అక్కడే వదిలేసి, మరొకటి వెంట తీసుకెళ్లారు. హోటల్‌లో దొరికిన ఫోన్‌లో వారు తమ కుటుంబ సభ్యులకు పంపిన రెండు ఇమెయిల్‌లు లభ్యమయ్యాయి.

ఆ ఇమెయిల్స్‌లో ఏముంది?
 మొదటి మెయిల్‌ : తాము ఈ లోకాన్ని చాలా సంతోషంగా వీడుతున్నామని వారు అందులో పేర్కొన్నారు. తమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రులు పడిన కష్టానికి, త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. చివర్లో వారికి క్షమాపణలు కోరారు.
రెండో మెయిల్: 'బై' (Bye) అనే సబ్జెక్ట్ లైన్‌తో మీరా ఫిలిప్ ఈ మెయిల్ పంపారు. అమెరికాలోని తమ వ్యవహారాలన్నీ చక్కదిద్దామని, అక్కడ ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

చివరి కోరిక
తమను కన్యాకుమారిలోనే దహనం చేయాలని, అస్థికలను సముద్రంలో కలపాలని వారు కోరారు. "ఎటువంటి పూజలు లేదా ఆచారాలు వద్దు, దయచేసి మా కోరికను గౌరవించండి" అని ఆ సందేశంలో బోల్డ్ అక్షరాలతో రాశారు.

సీసీటీవీ (CCTV) దృశ్యాలు
ఏప్రిల్ 26 నాటి సిసిటివి విజువల్స్‌లో సోదరీమణులిద్దరూ చేతులతో రెండు ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని, ఎటువంటి హడావిడి లేకుండా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత వారు సముద్రం వైపు వెళ్తున్న మరో వీడియో కూడా దొరికింది. వారు పంపిన సందేశాలతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, గురువారం నాడు వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి పోస్ట్‌మార్టం  నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. కుటుంబ సభ్యులు ప్రస్తుతం కన్యాకుమారి చేరుకున్నారు.

మరోవైపు సోదరీమణులు వెంట తీసుకెళ్లిన ,సముద్రంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్న మరో ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కన్యాకుమారి డీఎస్పీ జయచంద్రన్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement