‘టీఎంసీ పతనం ఖాయం.. మే 4న మళ్లీ వస్తున్నా’ | Modi's Final Roar in Bengal, Vows to Return for BJP Oath Ceremony | Sakshi
Sakshi News home page

‘టీఎంసీ పతనం ఖాయం.. మే 4న మళ్లీ వస్తున్నా’

Apr 27 2026 1:56 PM | Updated on Apr 27 2026 2:01 PM

Modi's Final Roar in Bengal, Vows to Return for BJP Oath Ceremony

బరాక్‌పూర్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమరంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రెండో విడత పోలింగ్‌కు ముందు బరాక్‌పూర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇది రాష్ట్రంలో తన చివరి ఎన్నికల ప్రచారమని ప్రకటించిన ఆయన, మే 4న ఫలితాల తర్వాత బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవానికి తాను  తిరిగి వస్తానంటూ ప్రదర్శించిన అచంచల విశ్వాసం అందరి దృష్టిని ఆకర్షించింది.

బరాక్‌పూర్‌లో జరిగిన ఈ సభకు ప్రజలు పోటెత్తారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర దారిపొడవునా బారులు తీరిన జనసందోహం తన ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఉదయాన్నే వేలాదిగా తరలివచ్చి తనను ఆశీర్వదించిన ప్రజల ఆప్యాయతను ఆయన కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందనడానికి, తనలో ఉన్న అపార నమ్మకానికి ఈ జనప్రభంజనమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.

టీఎంసీపై తీవ్రస్థాయిలో ధ్వజం
అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లక్ష్యంగా ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఎంసీ పాలనలో పరిశ్రమలు మూతపడ్డాయని, రాష్ట్ర అభివృద్ధికి వారి వద్ద ఎలాంటి భవిష్యత్ ప్రణాళిక లేదని మండిపడ్డారు. అధికార పార్టీ నడుపుతున్న ‘సిండికేట్ వ్యవస్థ’ను కూకటివేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నిర్మాణాత్మక పాలనను గాలికొదిలేసి, బెదిరింపులు, దుర్భాషలాడే రాజకీయాలపైనే టీఎంసీ ఆధారపడుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, బెంగాల్‌కు ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ఆవశ్యకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

యువతకు ఐదు కీలక హామీలు
రాష్ట్ర యువతను ఆకర్షించేలా ప్రధాని మోదీ ఉపాధి, సంక్షేమం లక్ష్యంగా ఐదు  గ్యారెంటీలను ప్రకటించారు. సకాలంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఖాళీలన్నింటినీ తక్షణమే పూరించడం, నైపుణ్యాభివృద్ధితో కూడిన ఉపాధి కల్పన, 7వ వేతన సంఘం ప్రయోజనాల అమలు, గ్రామాల్లో ఉపాధి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement