పట్నా: బిహార్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి.. ఈ తరహా చర్యలను తన సొంత ఇంటి నుంచే ప్రారంభించి, అందరినీ ఆశ్యర్యానికి గురిచేశారు. ముఖ్యమంత్రి ఇంటి మీదకు బుల్డోజర్లు వెళ్లడం సంచలనంగా మారింది.
సీఎం సొంత ఇంటిపైకే బుల్డోజర్
ముంగేర్ జిల్లా తారాపూర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం సామ్రాట్ చౌదరి సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన తన సొంత ఇంటి మెట్లను సైతం అధికారులు కూల్చివేస్తున్నారని ఆయన వెల్లడించారు. ‘వ్యక్తిగత భూమిలో ఇల్లు కడితే ఎలాంటి ఇబ్బందీ లేదు, కానీ ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడితే అది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన, అందమైన బిహార్ నిర్మాణానికే ఈ కఠిన చర్యలని స్పష్టం చేశారు
అధికారులకు అల్టిమేటం
సామాన్యుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా పంచాయతీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. అదే సమయంలో ప్రభుత్వ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏ అధికారి అయినా ఒక ఫైలును నెల రోజులకుపైగా పెండింగ్లో పెడితే, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్లాక్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలో పెండింగ్ పనులపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, ఇకపై సీఎంవో నేరుగా ఆయా కార్యాలయాలను పర్యవేక్షిస్తుందని చెప్పారు.
మోదీ కలల ప్రాజెక్టు.. నితీష్ కుమార్కు ప్రశంసలు
బీహార్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చాలన్న ప్రధానమంత్రి కలను నెరవేర్చి తీరుతామని సామ్రాట్ చౌదరి ఉద్ఘాటించారు. 20 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసి ఏప్రిల్ 14న రాజీనామా చేసిన నితీష్ కుమార్ గతంలో చేసిన అభివృద్ధి పనులను ఆయన ప్రశంసించారు. అయితే ఆ అభివృద్ధి వేగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని కొత్త సీఎం అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 15న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, తొలి సభలోనే తన మార్క్ పరిపాలనను చూపారు.
ఇది కూడా చదవండి: బీజేపీ అభ్యర్థి ఇంటివద్ద బాంబుల మోత


