ముంబై: ఎద్దు స్థానంలో భార్యను ఉంచి నాగలి లాగుతున్న ఓ రైతు వీడియో ఇటీవల వైరల్ అయింది. ఇటీవల అకాల వర్షాల సమయంలో పిడుగు పడి ఒక ఎద్దు చనిపోవడంతో రైతు కాశీనాథ్ గైక్వాడ్ తన భార్య హౌసాబాయిని నాగలి లాగేందుకు ఎద్దు స్థానంలో ఉపయోగించిన దృశ్యాలు కనిపించాయి. కొత్త ఎద్దును కొనుగోలు చేసే స్తోమత లేకపోవడం, కీలకమైన విత్తనాల సీజన్ కోల్పోతామనే భయంతో ఆ దంపతులు కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేయడం కొనసాగించేందుకు ఈ సాహసం చేశారు.
మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లా, దేవోని తహసీల్ పరిధిలోని బోంబ్లీ ఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీని గురించి తెలుసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెంటనే లాతూర్ జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి కుటుంబ పరిస్థితిపై సమగ్ర నివేదిక కోరారు. రైతుకు ఆలస్యం లేకుండా ప్రత్యామ్నాయ ఎద్దు అందించాలని, అత్యవసర సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి జోక్యం తర్వాత జిల్లా యంత్రాంగం స్థానిక గోశాల నుంచి ఒక ఎద్దును వెంటనే ఏర్పాటు చేసింది. దీంతో ఆ కుటుంబానికి తక్షణ ఉపశమనం లభించింది. కాశీనాథ్, హౌసాబాయి గైక్వాడ్ దంపతులు ఎన్నో ఏళ్లుగా పంటలో వాటా పద్ధతిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం వారు ఒక జత ఎద్దులను కొనుగోలు చేసేందుకు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే ఇటీవల తుపాను సమయంలో పిడుగు పడి ఒక ఎద్దు చనిపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. మరో ఎద్దు కొనుగోలు చేసే స్థితిలో లేకపోయింది.
జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎద్దు మరణంపై అధికారిక అంచనా ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబానికి త్వరలో రూ.32,000 పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
పరిహార ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వేగంగా స్పందించడం, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవడం పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. సంక్షోభ సమయంలో ఇబ్బందులు పడుతున్న రైతు కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వ సున్నిత వైఖరి, తక్షణ చర్యలను లాతూర్ ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు ప్రశంసిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నేరుగా డబ్బు ఇచ్చి కొత్త ఎద్దు కొనుగోలు చేయకపోయినా ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత పశుసంవర్ధక శాఖ ప్రత్యామ్నాయంగా ఎద్దును ఏర్పాటు చేసి గైక్వాడ్ కుటుంబానికి అప్పగించింది.


