తిరువనంతపురం: నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనను తాను నియంత్రించే బాధ్యతలో ఉండి ఉంటే విద్యార్థి ఆందోళనకారులపై కాల్పులు జరపాలని భద్రతా బలగాలకు ఆదేశించేవాడినని ఓ ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యాత చెప్పడంతో కేరళలో తీవ్ర వివాదం చెలరేగింది.
పత్రిక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలో టీజీ మోహన్దాస్ మాట్లాడుతూ.. ముందుగా జంతర్ మంతర్ చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో కర్ఫ్యూ విధించేవాడినని చెప్పారు. ఆ తర్వాత ఆందోళనకారులను 3 సార్లు వెళ్లిపోవాలని హెచ్చరించేవాడినని, అయినా వినకపోతే వారిపై కాల్పులు జరపాలని ఆదేశించేవాడినని అన్నారు.
"ప్రజలు చెదిరిపోయి పరుగులు తీస్తారు. కొందరు చనిపోతారు. కొందరు చనిపోరు. ఇంకొందరికి తీవ్రగాయాలు అవుతాయి. 4 గంటల్లో పరిస్థితి ప్రశాంతంగా మారుతుంది. మృతదేహాలను తీసుకుని ఆసుపత్రికి తరలిస్తాం" అని మోహన్దాస్ అన్నారు.
మహిళా ఆందోళనకారులపై కూడా ఆయన అవమానకర వ్యాఖ్యలు చేశారు. వారిని "అత్యాచారాలను ఇష్టపడే మహిళలు" అంటూ వ్యాఖ్యానించారు. "సామూహిక అత్యాచారాలు జరుగుతాయి. దేవుడి దయతో ఎలాంటి ఫిర్యాదులు రావు. ఎందుకంటే అత్యాచారాలను ఇష్టపడే వారు ఉన్నారు. ముఖ్యంగా వామపక్షాలు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారు" అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మహిళా ఆందోళనకారులపై హింసను ప్రోత్సహిస్తున్నారని పలువురు మోహన్దాస్పై నెటిజన్లు ఆరోపణలు చేశారు.
టీజీ మోహన్దాస్ ఎవరు?
టీజీ మోహన్దాస్ కేరళకు చెందిన రచయిత, కాలమిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి. ఇంజనీర్, న్యాయవాదిగా శిక్షణ పొందిన ఆయన పాత్రికేయుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, సామాజిక విమర్శకుడిగానూ పని చేశారు.
గతంలో బీజేపీ మేధావుల విభాగం రాష్ట్ర కన్వీనర్గా పని చేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ విచార కేంద్రంలో కూడా నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. 2012లో ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక కేసరిలో బీజేపీ, సీపీఐ(ఎం) మధ్య రాజకీయ సహకారం సాధ్యాసాధ్యాలపై వ్యాసం రాశారు. ఆ వ్యాసం రెండు వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.
పోలీసులకు ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు
సీపీఐ అనుబంధ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) సోమవారం కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్కు ఫిర్యాదు చేసింది. మోహన్దాస్ వ్యాఖ్యలు హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది.
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరపాలని బహిరంగంగా చెప్పడం రాజకీయ అభిప్రాయ వ్యక్తీకరణ కాదని, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసే హక్కుపై నేరుగా దాడి చేసినట్టేనని విద్యార్థి సంఘం ఆరోపించింది.
డిజిటల్ వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వ్యాఖ్యలు అడ్డుకోకపోతే హింసను రెచ్చగొట్టే అవకాశం ఉందని, ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయవచ్చని, చట్టవ్యతిరేక పరిస్థితులకు దారితీయవచ్చని కూడా పేర్కొంది. విద్యార్థి ఆందోళనకారులను "కాల్చి చంపాలని" మోహన్దాస్ పిలుపునిచ్చారని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. ఆయనపై తగిన చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని పోలీసులను కోరింది.


