సాక్షి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె కేశినేని స్నిగ్ధ చేసిన సోషల్ మీడియా పోస్టులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, విద్యార్థుల నిరసనలకు మద్దతుగా ఆమె చేసిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఇటీవల దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, వాటిపై పోలీసుల చర్యల నేపథ్యంలో స్నిగ్ధ తన సోషల్ మీడియా ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాత్మక పోస్టులు చేశారు. "కాక్రోచ్ జనతా పార్టీ" పేరుతో జరుగుతున్న నిరసనకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తీసుకున్న ఫొటోలను ఆమె పంచుకోవడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ఒక కేంద్ర మంత్రిని ఉద్దేశిస్తూ "రాజీనామా లేఖ డ్రాఫ్ట్ చేయాలా?" అంటూ చేసిన సెటైరికల్ పోస్టు కూడా నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ పోస్టులను కొందరు ప్రభుత్వంపై విమర్శగా చూస్తుండగా, మరికొందరు రాజకీయ వ్యంగ్యంగా అభివర్ణిస్తున్నారు.
కేశినేని స్నిగ్ధ చేసిన పోస్టులు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం టీడీపీ ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉండటమే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా కొనసాగుతుండగా, ఆ పార్టీ ఎంపీ కుమార్తె కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
అయితే, ఇవి కేశినేని స్నిగ్ధ వ్యక్తిగత సోషల్ మీడియా పోస్టులు మాత్రమే. ఈ పరిణామంతో టీడీపీ అధికారిక వైఖరి ఏమిటనే అంశంపై కూడా చర్చ సాగుతోంది. అయితే, ఇప్పటివరకు ఈ పోస్టులపై టీడీపీ పార్టీ గానీ, ఎంపీ కేశినేని చిన్ని గానీ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అలాగే, బీజేపీ నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు.


