చాలామంది విద్యార్థులు వైద్య వృత్తి లేదా ఇంజనీరింగ్ కోర్సులలో ఏదో ఒకటి ఎంచుకుంటారు. ఇది సర్వసాధారణం. అలా కాకుండా రెండు నేర్చుకోగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు ఒకదాన్నే ఎందుకు ఎంచుకోవాలి అని ప్రశ్నించి మరీ విభిన్న మార్గంలో ప్రయాణించి సత్తా చాటింది. వైద్య రంగంలో ఓ సరికొత్త ఒరవడిని సృష్టించింది. ఎవరా అమ్మాయ్ అంటే..
ఆ యువతే బీవీఎస్ మాధవి. ఆమె ఆంద్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే ఐఐటీ మద్రాస్లో డేటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్లో బీఎస్ డిగ్రీ కూడా చేశారు. మెడికల్ స్కూల్, ఆసుపత్రి విధులు, కోడింగ్ అసైన్మెంట్లు, పరీక్షలు,పరిశోధనలు సమన్వయం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ వైద్యం, సాంకేతికతను అనుసంధానించగలిగిన వారికే భవిష్యత్తు ఉంటుందని ప్రగాడంగా నమ్మింది మాధవి.
ఆ నమ్మకమే నిజమై ఆమె వృత్తికి సరైన రూపునిచ్చింది. ప్రస్తుతం ఆమె ఎన్ఫరెన్స్లో జూనియర్ క్లినికల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. అక్కడ ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆంకాలజీలో వాస్తవ ప్రపంచ ఆధారాలను వెలికితీస్తున్నారు. ఇది పరిశోధకులు కేన్సర్ను మరింత బాగా అర్థం చేసుకోవడానికి రోగుల సంరక్షణను మెరుగుపరుచడానికి సహాయపడుతుంది. మరి రెండు విభిన్న కోర్సులను ఎలా చదవగలిగిందంటే..
ఏఐని తెలుసుకోవాలని..
చాలా మంది వైద్య విద్యార్థులకు, ఎంబీబీఎస్ పూర్తి చేయడమే ఒక కఠినమైన సవాలు. కానీ మాధవి ఈ జాబితాకు మరో డిగ్రీని జోడించాలని నిర్ణయించుకున్నారు. రాబోయే సంవత్సరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఆరోగ్య సంరక్షణను రూపు మార్చుతాయని దృఢంగా నమ్మి, ఆమె 2021లో ఐఐటి మద్రాస్లోని డేటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్లో బిఎస్ ప్రోగ్రామ్లో చేరారు.
టెక్నాలజీని వైద్యం నుంచి వేరుగా చూడకుండా, రోగ నిర్ధారణలను మరింత కచ్చితంగా చేయడానికి, పరిశోధనను మెరుగుపరచడానికి, రోగులకు మెరుగైన ఫలితాలను అందించడానికి ఒక ఆవశ్యక సాధనంగా భావించారామె. ఆ నిర్ణయం వల్ల ఆమె లెక్చర్లు, క్లినికల్ పోస్టింగ్లు, వార్డ్ డ్యూటీలు, ప్రాక్టికల్ పరీక్షలు,ఐఐటి అసైన్మెంట్లు అన్నింటినీ ఒకే సమయంలో నిర్వహించాల్సి వచ్చింది. ఆ షెడ్యూల్ అలసట కలిగించినప్పటికీ, ఆమె రెండు విభాగాల నిబద్ధతతో సత్తా చాటిందామె.
సాధించిన విజయాలు..
ఆంధ్ర మెడికల్ కాలేజీలో తన క్లినికల్ ఇంటర్న్షిప్ సమయంలో, ఆమె జనరల్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, ప్రసూతి మరియు గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, డెర్మటాలజీ,ఎమర్జెన్సీ మెడిసిన్తో సహా పలు ప్రధాన విభాగాలలో శిక్షణ పొందారు. అదే సమయంలో ఆమె రోగుల సంరక్షణ తోపాటు, మెషిన్ లెర్నింగ్, వైద్య పరిశోధనaలో తన నైపుణ్యాన్ని పెంచుకుంటూనే ఉన్నారు.
స్టార్లైన్ ఏఐలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఇంటర్న్గా, ఆమె ఛాతీ ఎక్స్-రేలు, డీప్ లెర్నింగ్ మోడల్లను ఉపయోగించి ఏఐ ఆధారిత న్యుమోనియా గుర్తింపు వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్ట్ సుమారు 90% కచ్చితత్వాన్ని సాధించి, మహిళల కోసం నిర్వహించిన స్టార్టప్ ఐడియాథాన్లో గుర్తింపు పొందింది.
అంతకుముందు, ఆంధ్ర మెడికల్ కాలేజీలో రీసెర్చ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు, వ్యక్తిగత గుర్తింపులో పెదాల నమూనాలను విశ్లేషించడానికి మెషిన్ లెర్నింగ్ మోడల్లను అభివృద్ధి చేయడం ద్వారా ఫోరెన్సిక్ మెడిసిన్లో కృత్రిమ మేధ వినియోగాన్ని ఆమె అన్వేషించింది.
అంతర్జాతీయ స్థాయికి..
సిడ్నీలో జరిగిన అంతర్జాతీయ వ్యోమగామి కాంగ్రెస్ (IAC) 2025లో, మాధవి సూక్ష్మగురుత్వాకర్షణలో ఇంద్రియ గ్రహణశక్తిపై అంతరిక్ష వైద్యం కోసం 3D బయోప్రింటింగ్ సామర్థ్యంపై తన పరిశోధనను సమర్పించారు. తద్వారా సుదీర్ఘకాల అంతరిక్ష యాత్రల సమయంలో భవిష్యత్ ఆరోగ్య సంరక్షణపై జరిగిన చర్చలకు ఆమె తోడ్పడ్డారు.
నిజానికి మాధవి ప్రయాణం ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో పెరుగుతున్న ఒక కొత్త ధోరణిని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రులు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు వైద్యం, సాంకేతికత రెండింటినీ అర్థం చేసుకోగల నిపుణులపై ఎక్కువగా ఆధారపడుతుండటం విశేషం.
ఇది యువతకు ఒక పాఠం
విద్యార్థులను తరచుగా సైన్స్ లేదా టెక్నాలజీ, వైద్యం లేదా ఇంజనీరింగ్ వంటి ఒకే విభాగాన్ని ఎంచుకోమని ప్రోత్సహిస్తారు. భవిష్యత్తు ఎల్లప్పుడూ ఒకే వర్గంలోకి సరిగ్గా ఇమడదని మాధవి ప్రయాణం చూపిస్తుంది. కృత్రిమ మేధస్సు ఆరోగ్య సంరక్షణను పునర్నిర్మిస్తున్నందున, వైద్యం అంతకంతకూ డేటా-ఆధారితంగా మారుతోంది.
సాంకేతికతను అర్థం చేసుకున్న వైద్యులు, వైద్యశాస్త్రాన్ని అర్థం చేసుకున్న సాంకేతిక నిపుణులు ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ సవాళ్లలో కొన్నింటిని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించగలరని నిరూపించే ఘటన ఇది. అంతేగాదు ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో సీటు సంపాదించడంతోనే ఆగిపోకూడదని మాధవి కథ చెబుతోంది. విభిన్నంగా ఆలోచించి సంప్రదాయ కోర్సులను మిళితం చేసేలా అభ్యసించి మరిన్ని అవకాశాలు సృష్టించుకోగలుగుతామని చెబుతోంది.
(చదవండి: అత్యంత ఖరీదైన 'టీ'.. కిలో రూ. 9 కోట్లా..! ఐతే..)


