ఏ చాయ్.. చటుక్కున తాగరా భాయ్ అని పాడుకుంటూ ఆనందంగా ఉదయాన్నే ఆస్వాదిస్తుంటా. టీ అనేది నిత్యజీవితంలో ఒక భాగం అనేలా స్థిరపడిపోయింది. ఒక పూట సిప్ చేయకపోతే ఏదో వెలితి. ఆఫీస్ బాయ్ నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు అంతా మెచ్చే ఈ చాయ్లో అత్యంత విలాసవంతమైన రకం కూడా ఉందన్న విషయం తెలుసా!. అత్యంత ఖరీదు అంటే వేలల్లో ఉందనుకుంటున్నారేమో కాదు..ఏకంగా కోట్లు పైమాటే. గ్రాముల్లో కొనాలంటే లక్షలు వెచ్చించాల్సిందే. ఇంతకీ ఏంటా ఆ చాయ్ ప్రత్యేకత, ఎక్కడ పండిస్తారు తదితర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన 'టీ' చైనాలోని మాండరిన్లో లభిస్తుంది. ఈ 'టీ' పేరు డా హాంగ్ పావో. దీని అర్థం ఎర్రని వస్త్రం. ఇదేం పేరు అనుకోకండి. ఎందుకంటే ఈ పేరు వెనుక గమత్తైన కథతో పాటు ఇది ఎక్కడ పండిస్తారో తెలిస్తే కంగుతింటారు. దీన్ని ఊలాంగ్ టీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే చైనాలో ఫుజియాన్ ప్రావిన్స్లో అద్భుతమైన వుయి పర్వతాల్లో పండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ టీకి శతాబ్దాల నాటి చరిత్ర, రాజరిక వారసత్వం ఉంది.
ఈ డా హాంగ్ పావో రుచి సాధారణంగా అర్థం కాదట. నెమ్మదిగా ఆస్వాదిస్తేనే దాని రుచి తెలుస్తుందట. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీలా కాకుండా, ఈ రెండింటి రుచులకు మధ్యస్థంగా గాఢతను కలిగి ఉంటుందట. తాజా ఆర్కిడ్లతో పోల్చబడే పూల సువాసనలతో పాటు, వేయించిన, పండ్ల వంటి పొగ వాసనలతో మిళితమై ఉంటుంది. దీనికి సహజమైన తీపితో కూడిన రుచి ఉంటుందట. టీ ప్రియులు దీన్ని ఎంతో విలువైనదిగా అపురూపమైనదిగా చూస్తారట.
ఎందుకంత ఖరీదు అంటే..
వుయి పర్వతాల కొండచరియల మధ్య, పురాణ మాతృ వృక్షాలుగా ప్రసిద్ధి చెందిన ఆరు అసలైన డా హాంగ్ పావో పొదలు మాత్రమే ఉన్నాయి. ఈ పురాతన మొక్కలు వందల ఏళ నాటివని అక్కడ ప్రజలు విశ్వసిస్తారు. అంతేగాదు చైనా వీటిని వెలకట్టలేని జాతీయ సంపదగా అభివర్ణిస్తుంది. ఇవి కేవలం ఆరు మాత్రమే ఉండటం కారంణంగా తేయాకు ఉత్పత్తి కూడా పరిమితమే కావడంతో అత్యంత ఖరీదైనదిగా మారిందట.
కిలో టీ ధర వచ్చేసి రూ. 9 కోట్లు పై మాటే. ఇప్పటివరకు జరిగిన అత్యంత ప్రసిద్ధ టీ వేలంపాటలలో ఒకదానిలో, 20 గ్రాముల అసలైన డా హాంగ్ పావో సుమారు రూ. 20 లక్షలు. ఒక గ్రాము అసలైన టీ ధర వచ్చేసి రూ. 1.2 లక్షలు. చెప్పాలంటే. ఇది బంగారం కంటే 30 రెట్లు విలువైనది. అయితే చైనా ప్రభుత్వం ఈ టీపై నిషేధం విధించింది.
నిషేధం ఎందుకంటే..
భవిష్యత్ తరాల కోసం ఆరు అసలైన మాతృ వృక్షాలను రక్షించడానికి, 2006లో చైనా ప్రభుత్వం వాటి నుంచి ఆకులను వాణిజ్యపరంగా సేకరించడాన్ని శాశ్వతంగా నిషేధం విధించింది. ఈ పురాతన పొదలు ఇప్పుడు చైనా సాంస్కృతిక వారసత్వంలో భాగంగా సంరక్షిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ టీని సేకరించడానికి ఎవ్వరి అనుమతి లేదు. వాటి అపారమైన చారిత్రక, సాంస్కృతిక విలువ కారణంగా చైనా ప్రభుత్వం ఆ చెట్లకు సుమారు ₹142 కోట్లు బీమా కూడా చేయించిందట.
అంతేగాదు ఈ మాతృ వృక్షాల నుంచి వచ్చిన చివరి పంటను బీజింగ్ ప్యాలెస్ మ్యూజియంలో భద్రపరిచారట. ప్రస్తుతం మార్కెట్లో లభించే డా హాంగ్ పావో, అసలైన మాతృ వృక్షాల నుంచి సేకరించిన టీ కాదట. ఆ గొప్ప రుచిని పునః సృష్టించడం కోసం అసలైన మాతృ వృక్షాల నుంచి జాగ్రత్తగా పెంచిన కృత్రిమ సంతతి (క్లోన్ల) నుంచి ఉత్పత్తి చేయబడుతుందట.
ఈ చాయ్ వెనకున్న ఆసక్తికర కథనం..
ఒక యువ పండితుడు చక్రవర్తి పరీక్షల కోసం బీజింగ్కు వెళ్లే మార్గంలో వుయి పర్వతాల గుండా ప్రయాణిస్తుండగా, అతను అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సమీపంలోని ఒక ఆలయానికి చెందిన సన్యాసి కొండలపై పెరుగుతున్న ఒక ప్రత్యేకమైన టీ పొద నుంచి ఆకులను ఉపయోగించి టీ తయారు చేయగా, ఆ పండితుడు త్వరగా కోలుకున్నాడు. ఆ తర్వాత చక్రవర్తి పరీక్షలలో ప్రథమ స్థానం సాధించాడు. కొన్నేళ్లకు చక్రవర్తినే స్వయంగా అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో ఆ పండితుడు అదే టీని తయారు చేసి ఇవ్వగా చక్రవర్తి కూడా ఆ యువకుడిలానే కోలుకున్నారట.
బహుమతిగా, చక్రవర్తి ఆ పండితుడికి ఒక అద్భుతమైన ఎర్రటి ఉత్సవ వస్త్రాన్ని బహూకరించారు. తమ ఇద్దరి ప్రాణాలను కాపాడిన ఆ తేయాకును గౌరవించాలనే ఉద్దేశ్యంతో, ఆ పండితుడు ఆ వూయి పర్వతాల వద్దకు వెళ్లి, చక్రవర్తి ఇచ్చిన వస్త్రాన్ని తేయాకు పొదలపై కప్పాడు. అప్పటి నుంచి, ఆ తేయాకును డా హాంగ్ పావో, లేదా “పెద్ద ఎర్ర వస్త్రం” అని పిలుస్తున్నారని చైనా జానపద కథనం.
ఎలా తయారు చేస్తారంటే..
సాధారణం 95-100°C వద్ద అప్పుడే మరిగించిన నీటిలో చాలాసారు నానబెట్టి తీసిని డా హాంగ్ పావో ఆకులను వేస్తారట. కనీసం మూడు సార్లు నానబెట్టి.. మరిగే నీటిలో వేస్తే అత్యంత గాఢమైన రుచులు బయటకు వస్తాయట. ప్రతిసారి నానబెట్టగానే పూల వంటి తీపిదనం వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: ఒత్తైన జుట్టు కోసం..! గాయని అరుణా సాయిరామ్ హెయిర్ టిప్స్)


