తమిళనాడులో ఫ్లెక్సీ కలకలం రేగింది. సేలం జిల్లా ఆత్తూర్లో ఏర్పాటు చేసిన ఓ ఆలయ ఉత్సవ బ్యానర్ వివాదానికి దారితీసింది. ఆ బ్యానర్లో ప్రముఖ నటి త్రిషను అమ్మవారి రూపంలో చిత్రించడం, ఆ పైన తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్ ఫొటోను కూడా ‘సిగ్నేచర్ ఫోజు’తో ఉంచడంపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
పెరియా మారియమ్మన్ ఆలయ ఆడి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఫ్లెక్సీలో త్రిష అమ్మవారి గెటప్లో కూర్చున్నట్లు ఉంది. ఆ పైన విజయ్ అసెంబ్లీలో చేసిన సిగ్నేచర్ ఫోజుతో ఉన్నారు. ఆ పక్కనే ఇద్దరు అభిమానుల ఫొటోలు చెరో వైపు ఉన్నాయి. కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినీ నటిని దేవతా రూపంలో చూపించడం సరైంది కాదన్నారు.
వివాద నేపథ్యంలో రాత్రికి రాత్రే బ్యానర్ను అక్కడి నుంచి తొలగించారు. ఆ ప్లేస్లో మరొకటి ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే తమ దాకా విషయం రావడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేయడం, అందునా అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యానర్ ఏర్పాటు చేసిన దుకాణ యజమాని గోకుల్, దానిని అమర్చిన చంద్రుపై చర్యలకు సిద్ధమయ్యారు. వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం.

విజయ్-త్రిష ఫొటోలపై చర్చ
ఇటీవల తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి. ఎన్నికల ముందే వీళ్ల బంధం బయటపడడం, ఎన్నికల విజయంపై విజయ్కు త్రిష అభినందనలు తెలియజేయడం, ప్రమాణస్వీకారం నాడు చేసిన హడావిడి.. పుట్టినరోజు వేడుక జరపడం ఇలా ఉండగానే ఈ నేపథ్యంలో ఆలయ ఉత్సవ బ్యానర్లో ఇద్దరి ఫొటోలు కలిసి కనిపించడం మరోసారి ఆసక్తిని రేపింది. అదే సమయంలో ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల ఫొటోలను విచ్చలవిడగా వాడడం, అభిమానుల బ్యానర్ సంస్కృతిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.


