కోల్కతా: వాహనదారులు డ్రైవింగ్ చేసే అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలంతో అయితే మరింత జాగ్రత్తగా బండి నడపాలి. కొండ ప్రాంతాలు, ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు తప్పవు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రమాదానికి గురైన బైక్ రైడర్.. చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో వైరల్ అయింది.
పశ్చిమ బెంగాల్లోని సిలిగురి-డార్జిలింగ్ మార్గంలో కుర్సియాంగ్ వ్యూ పాయింట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నీలం రంగు రెయిన్కోట్ ధరించిన ఓ యువకుడు వర్షంతో తడిసిన ఘాట్ రోడ్లో వేగంగా బైక్పై వేగంగా దూసుకుపోతున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మలుపు వద్ద అతడు వెనక్కి చూడడంతో బైక్ అదుపు తప్పింది. రైడర్ బైక్పై నియంత్రణ కోల్పోయి రహదారి పక్కనున్న రాయిని ఢీకొట్టాడు. ప్రమాదం తీవ్రతకు రైడర్ ధరించిన చెప్పు కూడా గాల్లోకి ఎగిరిపోయినట్లు వీడియోలో కనిపించింది. అనంతరం అతడు కొంతవరకు బైక్ను అదుపులోకి తెచ్చుకున్నప్పటికీ రహదారి మరోవైపు పడిపోయాడు.
బైక్ కిందపడగా, రైడర్ పక్కనే ఉన్న గడ్డిపై నిలబడగలిగాడు. వెనుకే వస్తున్న మరో బైక్ రైడర్కు అతడికి సహాయం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అతడికి ఎలాంటి గాయాలు అయ్యాయన్న వివరాలు వెల్లడికాలేదు. బైక్ లోయలోకి పడిపోయివుంటే పరిస్థితి దారుణంగా ఉండేదని వీడియో చూసిన వారు అభిప్రాయడుతున్నారు. బైక్ ఆ క్షణంలో ఆగకపోయి ఉంటే రైడర్ నేరుగా లోయలో పడిపోయేవాడని అంటున్నారు.
చదవండి: డింపుల్ వీడియోలు వైరల్.. అఖిలేశ్ యాదవ్ అరెస్ట్
నెటిజన్ల స్పందన
"సేఫ్ డ్రైవ్.. సేవ్ లైఫ్" పేరుతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోపై పలువురు నెటిజనులు హస్యధోరణిలో స్పందించారు. ఈ రోజు యమధర్మరాజు సెలవులో ఉన్నట్టున్నారు అనే అర్థం వచ్చే హిందీ వ్యాఖ్యను జత చేశారు. షయమధర్మరాజు నుంచి మిస్డ్ కాల్ వచ్చింది.. కానీ రిసీవ్ కాలేదంటూ కామెంట్ పెట్టారు. మరికొందరు నెటిజనులు.. రైడర్ నిర్లక్ష్య డ్రైవింగ్ను తప్పుబట్టారు. "రైడర్ పూర్తిగా తప్పు చేశాడు. ముందు మలుపు ఉండగా వెనక్కి చూస్తూ ప్రయాణించాడు. బాధ్యతగా డ్రైవ్ చేయాలి" అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. "ఘాట్ రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు తలను వెనక్కి తిప్పి చూడకూడదు అనేది మొదటి నియమం" అని మరొకరు తెలిపారు. రీల్స్ చేయబోయి ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నాడని మరికొంత మంది అన్నారు. వర్షాకాలంలో జాగ్రత్తగా వాహనాలు నడపాలని పలువురు హితవు పలికారు.


