ఢిల్లీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతర్మంతర్లో లాఠీఛార్జ్పై సీరియస్ అయిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్రం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సీజేపీ నిరసన వీడియోలు భద్రపర్చాలని ఆదేశించింది. పబ్లిసిటీ కోసమే పిటిషన్ల వేశారన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ASG) వ్యాఖ్యలపై హైకోర్టు మండిపడింది. పబ్లిసిటీ అని ఎలా అంటారు? అంటూ ప్రశ్నించింది.
సీజేపీ నిరసనకారులపై క్రూరంగా బలప్రయోగం చేశారనే ఆరోపణలపై కేంద్రం, పోలీసులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. సీసీ టీవీ, ఇతర వీడియో ఫుటేజీ సహా అవసరమైన రికార్డులను భద్రపరచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 11కు కోర్టు వాయిదా వేసింది.
విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు-ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన ఏఎస్జీ ఎస్.రాజు కోర్టుకు తమ వాదనలు వినిపించారు. నిరసనల్లో పాల్గొన్న మహిళలపై వేధింపులకు పాల్పడ్డారని.. వారి మర్మంగాలపై దాడులు చేశారని.. మేకులు ఉన్న లాఠీలను ఉపయోగించారని, పోలీసుల వద్ద నేమ్బేడ్జీలు కూడా లేవని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆరోపించారు. తమ ఆరోపణలను రుజువు చేసేలా 110 వీడియోలు ఉన్నాయని తెలిపారు.
అయితే, ఏఎస్జీ రాజు ఈ వాదనలను ఖండిస్తూ... నిరసనకారులు తీవ్ర హింసాత్మకంగా ప్రవర్తించారని పలువురు పోలీసులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పిటిషన్లు కేవలం ప్రచార ఆర్భాటం కోసం పబ్లిసిటీ పొందేందుకే వేశారని వ్యాఖ్యానించారు. అయితే, చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యను ప్రశ్నిస్తూ... "ఇది పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్ అని మీరు ఎలా చెప్పగలరు? అంటూ నిలదీసింది.
విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్లు ఎన్.హరిహరన్, వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. నిరసనకారులు రాజ్యాంగం ప్రసాదించిన శాంతియుత నిరసన, సమావేశమయ్యే హక్కులనే ఉపయోగించుకున్నారని తెలిపారు.


