ఆన్లైన్ షాపింగ్ షాకింగ్ అనుభవాన్నిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖరీదైన గాడ్జెట్లు ఆర్డర్ ఇస్తే.. ఇటుకలు, సోప్లు వచ్చిన సంఘటనలు గతంలో అనేకం చూశాం. అయితే జరిగిన మోసం పట్ల సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం చాలా మంచిదని చాటి చెప్పే సంఘటన ఇది. అలా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) కు భారీ షాక్ తగిలింది.
అసలు ఏం జరిగిందంటే...ఆన్లైన్ ద్వారా ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) ఆర్డర్ చేస్తే దానికి బదులుగా Beard Growth Oil పార్శిల్ పంపింది ఫ్లిప్కార్ట్. ముంబైలోని పవాయ్కు చెందిన వినియోగదారుడు 2023 ఏప్రిల్ 22న ఫ్లిప్కార్ట్లో రూ. 1,11,793 విలువైన 'ఆపిల్ ఐఫోన్ 14 ప్రో (128 GB)'ను నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI) ద్వారా ఆర్డర్ చేశారు. బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఫోన్కు బదులుగా గడ్డం పెరిగే నూనె సీసా ఉంది.
తొలుత పట్టించుకోని ఫ్లిప్కార్ట్
దీనిపై కస్టమర్ కేర్కు పదే పదే ఫిర్యాదు చేసినా, అవసరమైన ఆధారాలు అందించినా సమస్య పరిష్కరించకుండానే ఫ్లిప్కార్ట్ ఆ కస్టమర్ కంప్లైంట్ను రిసాల్వ్డ్ అని క్లోజ్ చేస్తూ వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా క్లోజ్ చేయడంపై వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించారు. దీన్ని విచారించిన ముంబైలోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమీషన్ కోర్టు వస్తువు విక్రయించాక ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లు తమ బాధ్యతల నుంచి తప్పించుకోలేవని తేల్చి చెప్పింది. అతనికి తగిన పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
పరిహారం ఎంతంటే:
ఫోన్ ధర రూ. 1,11,793కు 2023 నుంచి ఏప్రిల్ 22 నుండి 9శాతం వార్షిక వడ్డీతో కలిపి వెనక్కి చెల్లించాలి. అలాగే మానసిక వేదనకు గాను రూ. 50,000 బాధితుడికి చెల్లించాలి. ఇంకా కోర్టుల ఖర్చుల కింద కేసు ఖర్చుల కింద రూ. 20వేలు చెల్లించాలని ఆదేశించింది మొత్తంగా ఫ్లిప్కార్ట్ , సెల్లర్ ఉమ్మడిగా రూ. 1.81 లక్షల పైచిలుకు పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని తీర్పునిచ్చింది.
ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీ
ఈ కేసులో ఆపిల్ ఇండియా (Apple India) ను కూడా కస్టమర్ బాధ్యులను చేస్తూ చేర్చారు. అయితే, తమ ఉత్పత్తులను స్వతంత్ర డీలర్ల ద్వారా విక్రయిస్తామని, ప్యాకింగ్ లేదా డెలివరీలో తమ పాత్ర ఏమీ ఉండదని ఆపిల్ వాదించింది. ఈ వాదనను అంగీకరించిన వినియోగదారుల ఫోరమ్ ఆపిల్ ఇండియాపై ఉన్న ఫిర్యాదును కొట్టివేసి, లోపమంతా ఫ్లిప్కార్ట్, సెల్లర్దేనని తీర్పు ఇచ్చింది.
ఇదీ చదవండి: నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం


