సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా యువత అద్భుత పోరాటం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోదీ పెట్టుకున్నారు. యువత.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రాజ్యామా ఉలిక్కిపడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో యువత కదం తొక్కుతున్నారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీలకు అతీతంగా యువత పోరాడుతున్నారు. మీడియా రాకున్నా యువత ఒంటరిగా ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసింది. యువతపై జరుగుతున్న దాడులు దారుణం. ఢిల్లీలో జరిగిన ఘటనలు అమానుషం.. పిల్లలపై పోలీసులు దాడులు చేశారు. విద్యార్థులు న్యాయం అడిగితే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. యువకులను దారుణంగా కొట్టారు. యువత జవాబుదారీతనం కోరుతున్నారు. ఉద్యమ పార్టీగా మాకు ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం ఉంది.
ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోదీ పెట్టుకున్నారు. ప్రధాని మోదీ కొరివితో తల గోక్కుంటున్నారు. విద్యార్థులు మంత్రి పదవి అడగలేదు. న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నారు. ఢిల్లీలో ఇటీవల ఘటనలు చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఈ జనరేషన్ చావుకు భయపడే రకం కాదు. యువతకు పొట్టు పొట్టు ఆకలి ఉంది.. మోదీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రాజ్యామా ఉలిక్కిపడు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.
12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి.. వచ్చాయా?. ఈ జనరేషన్ ఐటీ, ఈడీ సోదాలకు భయపడే వారు కాదు. మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా ఇచ్చారు. నేను మోదీని ప్రశ్నిస్తే ఇక్కడున్న కేడీకి ఎందుకంత భయం?. పేపర్ లీక్కు, నాకు సంబంధం ఉందని రేవంత్ అంటున్నాడు. మోదీని ఎదిరించే దమ్ము రేవంత్కు లేదు. పాత కేసులు చూపించి జైల్లో పెడతారని రేవంత్కు భయం ఉంది. ఢిల్లీలో గల్లా పట్టి అడిగే దమ్ము మాకుంది ’ అని వ్యాఖ్యలు చేశారు.


