నీట్‌ లీక్‌పై ‘సుప్రీం’ సీరియస్‌.. కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు | NEET Paper Leak Row: Supreme Court Puts Centre NTA Under Scanner | Sakshi
Sakshi News home page

నీట్‌ లీక్‌పై ‘సుప్రీం’ సీరియస్‌.. కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు

Jul 24 2026 12:47 PM | Updated on Jul 24 2026 1:41 PM

NEET Paper Leak Row: Supreme Court Puts Centre NTA Under Scanner

సాక్షి, న్యూఢిల్లీ: నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణలో వరుస లోపాలను ఇకపై కొనసాగించలేమని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచి సమగ్ర నివేదికలు కోరింది.

నీట్‌ పేపర్‌ లీక్‌ కేసును శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరాధే ధర్మాసనం.. ఈ అంశాన్ని అత్యంత దగ్గరగా పర్యవేక్షిస్తామని తెలిపింది. పరీక్షల వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చి, వాటిని సంస్థాగతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో నీట్‌ను నిర్వహించే ఎన్టీఏకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

సంస్కరణలపై అఫిడవిట్లు దాఖలు చేయాలి
నీట్‌ పేపర్‌ లీక్‌ తర్వాత పరీక్షల నిర్వహణలో తీసుకున్న చర్యలు, భవిష్యత్‌ సంస్కరణల పురోగతిపై కేంద్రం, ఎన్‌టీఏ వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా పరీక్షలను పూర్తిగా కంప్యూటర్‌ ఆధారిత విధానానికి మార్చే అవకాశాలు, డేటా భద్రత వంటి అంశాలపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని ధర్మాసనం కోరింది. “కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలకు మారితే డేటాను ఎలా రక్షిస్తారు?” అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

‘ఇక ఇలా కొనసాగనివ్వం’
నీట్‌ వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “వరుస తప్పిదాలను ఇక కొనసాగించలేం. ఈ అంశాన్ని చాలా దగ్గరగా పర్యవేక్షిస్తాం” అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సమగ్ర ప్రణాళికను కోర్టు ముందు ఉంచేందుకు మరింత సమయం కావాలని కోరారు.

ఇటు హైకోర్టులోనూ.. 
మరోవైపు నీట్‌ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ ప్రాంతంలో ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత అంశం కూడా కోర్టు ముందుకు వచ్చింది. ఇంటర్నెట్‌ నిలిపివేతను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. నిరసనల సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమేనా? అనే అంశంపై కోర్టు పరిశీలించనుంది.

ఆందోళనలు.. రాజకీయ వేడి
నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనల్లో ఉద్రిక్తత చోటుచేసుకోవడం, పోలీసులు బలప్రయోగం చేశారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఇప్పటికే నీట్‌ లీక్‌ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో పలువురిని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో.. నీట్‌ పరీక్షల భవిష్యత్‌ విధానం, భద్రతా ప్రమాణాలు, సంస్కరణలపై కేంద్రం తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement