వినీత్‌ జోషి బదిలీ.. అంతటి సమర్థుడ్ని ఎలా తప్పించారు?! | Vineet Joshi Transfer, Why Was Higher Education Secretary Transferred During The NEET Controversy? Read Story Inside | Sakshi
Sakshi News home page

వినీత్‌ జోషి బదిలీ.. అంతటి సమర్థుడ్ని ఎలా తప్పించారు?!

Jul 24 2026 7:56 AM | Updated on Jul 24 2026 9:56 AM

Vineet Joshi Transfer: Why Was a Key Education Official Moved Amid NEET Row

న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్‌ జోషిని బదిలీ చేసి.. ఆయన స్థానంలో నరేశ్‌ పాల్‌ గంగ్వార్‌ను నియమించింది. వినీత్‌ జోషికి మాత్రం పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ బదిలీపై ఇప్పుడు చర్చ మొదలైంది.

విద్యా వ్యవస్థలో కీలక ముఖం.. 1992 బ్యాచ్‌కు చెందిన మణిపూర్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి వినీత్‌ జోషి.. కేంద్ర విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో ఒకరు. పరిపాలనలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన.. పరీక్షల నిర్వహణ నుంచి విద్యా విధానాల అమలు వరకు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలకు కేంద్ర బిందువైన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తొలి డైరెక్టర్‌ జనరల్‌గా వినీత్‌ జోషి పనిచేశారు. నీట్‌, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలను నిర్వహించే సంస్థ ప్రారంభ దశలో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర విద్యాశాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.

CBSE ఛైర్మన్‌గా మరో కీలక బాధ్యతను చేపట్టిన ఆయన.. దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానాలు, విద్యా ప్రమాణాల రూపకల్పన వంటి అంశాల్లో పనిచేశారు. అంతకుముందు మణిపూర్‌ ప్రభుత్వంలో చీఫ్‌ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృత పరిపాలనా అనుభవం ఉన్న వినీత్‌ జోషి.. విద్యా రంగంలో కీలక సంస్థలకు నాయకత్వం వహించిన అధికారిగా గుర్తింపు పొందారు.

అనుభవజ్ఞుడి స్థానంలో మరో సీనియర్‌
వినీత్‌ జోషి స్థానంలో నియమితులైన నరేశ్‌ పాల్‌ గంగ్వార్‌ కూడా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. 1994 బ్యాచ్‌ రాజస్థాన్‌ క్యాడర్‌కు చెందిన ఆయన.. కేంద్రంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన గంగ్వార్‌.. అంతకుముందు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

పరీక్షల నిర్వహణ, విద్యా రంగంలో ప్రత్యేక అనుభవం ఉన్న వినీత్‌ జోషి స్థానంలో.. పరిపాలనా అనుభవం ఉన్న మరో సీనియర్‌ అధికారిని కేంద్రం నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

నీట్‌ వివాదం వేళ మార్పు
నీట్‌ పరీక్షలో అవకతవకలు, పేపర్‌ లీక్‌ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులు, ప్రతిపక్షాలు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న సమయంలో ఈ బదిలీ జరిగింది. ఈ నేపథ్యంలోనే వినీత్‌ జోషి రూపంలో తొలి వికెట్‌ పడిందా?అనే చర్చ జోరుందుకుంది. బాధ్యతను అధికారులపైకి మళ్లించే చర్యగా కొందరు ఈ ‘ట్రాన్స్‌ఫర్‌’ను విమర్శిస్తున్నాయి. అయితే వినీత్‌ జోషితో పాటు మరికొందరి మార్పు జరగడంతో పరిపాలనా మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే.. కేంద్ర వర్గాల నుంచి దానికి కూడా సరైన సమాధానం ఇంకా రాలేదు.

ఎందుకిలా?
వినీత్‌ జోషి సుదీర్ఘ అనుభవం ఉన్న ఐఏఎస్‌ అధికారి. అయితే పరీక్షల నిర్వహణ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వచ్చిన సమయంలో ఆయన బదిలీ కావడం చర్చకు కారణమైంది. నీట్‌ వివాదానికి అసలు బాధ్యత ఎక్కడ ఉంది? వ్యవస్థలో లోపాలా? అధికారుల నిర్లక్ష్యమా? లేదంటే విధానపరమైన సమస్యలా? అన్నది భవిష్యత్తు పరిణామాలు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం నీట్‌ వివాదం మధ్య జరిగిన ఈ ఉన్నత స్థాయి అధికార మార్పు రాజకీయంగా కొత్త చర్చకు తెర తీసే అవకాశం లేకపోలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement