breaking news
Delhi
-
సిక్కుల ఊచకోత కేసు దోషి, కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి
ఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసు దోషి, కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (80) మృతి చెందారు. జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ అనారోగ్యపాలైన ఆయనను తిహార్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో (1984) ఐదుగురు వ్యక్తుల హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కుమార్ను తిహార్ జైలు అధికారులు సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన మరణానికి కారణాన్ని ఆసుపత్రి ఇంకా వెల్లడించలేదు. 3 పర్యాయాలు లోక్సభ సభ్యుడిగా ఉన్న సజ్జన్ కుమార్ ఔటర్ ఢిల్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడిగా ఉండేవారు. 2018లో దోషిగా తేలిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు.మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియంత్ సింగ్ 1984 అక్టోబర్ 31న హత్య చేసిన తర్వాత అల్లర్లు చెలరేగాయి. సాయుధ గుంపులు ఢిల్లీ అంతటా సిక్కులను లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లు, దుకాణాలపై దాడులు చేశాయి. దేశవ్యాప్తంగా 3,000 మందికి పైగా సిక్కులు హతమయ్యారు. వారిలో ఎక్కువ మంది దేశ రాజధానిలోనే మరణించారు.దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కుమార్ ఈ హింసకు సంబంధించిన పలు క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నారు. వివిధ న్యాయస్థానాల్లో కొన్ని కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదల కాగా, మరికొన్ని కేసుల్లో దోషిగా తేలారు. 2013లో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పును 2018 డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అనంతరం కుమార్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.ఈ కేసు పాలం కాలనీలోని రాజ్ నగర్ పార్ట్-1లో ఐదుగురు సిక్కుల హత్యతో పాటు హింస సమయంలో ఒక గురుద్వారాను దహనం చేసిన ఘటనకు సంబంధించినది. క్రిమినల్ కుట్ర, నేరానికి ప్రేరేపించడం వంటి అభియోగాల్లో కుమార్ను హైకోర్టు దోషిగా తేల్చింది. ఆయన జీవితాంతం జైలులోనే ఉండాలని ఆదేశించింది. 1984 సిక్కు వ్యతిరేక హింసను కోర్టు తన తీర్పులో "మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలు"గా పేర్కొంది. కుమార్ తన శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది. -
వందేమాతరం: కాంగ్రెస్పై అమిత్ షా ఆగ్రహం
వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కాంగ్రెస్ తిరస్కరించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పార్టీ విధానం వల్లే దేశం రెండు ముక్కలైందంటూ మండిపడ్డారాయన. గురువారం ఆయన మాట్లాడుతూ.. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ వైఖరి దేశాన్ని అవమానించడమే. రెండు చరణాలే పాడాలని సీడబ్ల్యూసీలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం జాతికి వ్యతిరేకం. ఆ పార్టీ వైఖరికి నిరసనగా ప్రజలు ఉద్యమించాలని షా పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ 1937లో వందేమాతరాన్ని రెండు భాగాలుగా విభజించడం వల్లే దేశ విభజనకు బీజాలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ముస్లిం మైనారిటీలను సంతృప్తిపరిచేందుకు అప్పటి కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఆ తర్వాత ద్విజాతి సిద్ధాంతం బలపడి చివరకు దేశ విభజన, పాకిస్థాన్ ఆవిర్భావానికి దారితీసిందని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని చెప్పారు.స్వాతంత్య్ర సమరయోధులను అవమానించారువందేమాతరం ఆలపిస్తూ జైళ్లకు వెళ్లిన, ఉరికంబాలు ఎక్కిన లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కాంగ్రెస్ అవమానిస్తోందని షా విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంకించంద్ర ఛటర్జీ రచనను కూడా అవమానిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మరోసారి బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. దేశ ప్రజలు దీనిపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ కౌంటర్.. 1937 నిర్ణయానికే కట్టుబడి ఉంటాంఅమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ తదితర అగ్రనేతల సమక్షంలో ఆనాడు తీసుకున్న నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే ఆలపిస్తామని తెలిపారు.ఇదంతా రాజకీయ రగడే: జైరాం రమేశ్1937 అక్టోబర్ 28న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందేమాతరంపై తీర్మానం ఆమోదించారని జైరాం రమేశ్ గుర్తుచేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం వందేమాతరం అంశాన్ని బీజేపీ రాజకీయ వివాదంగా మారుస్తోందని, యువత, పరీక్షల పేపర్ లీకులు, చందా సేకరణ, విదేశాంగ వైఫల్యం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి గీతంమరోవైపు కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి ఆరు చరణాల వెర్షన్ను ఆలపించనున్నారు. దీని వ్యవధి సుమారు 3 నిమిషాల 10 సెకన్లు కాగా, జాతీయ గీతం ‘జనగణమన’ వ్యవధి 52 సెకన్లు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి గీతం.. కాంగ్రెస్ కార్యక్రమాల్లో తొలి రెండు చరణాలకే పరిమితం చేయాలన్న నిర్ణయం మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. -
జల్ బోర్డు స్కామ్లో చద్దా పేరు.. జైన్ అరెస్ట్ ఎపిసోడ్తో ట్విస్ట్!
ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ‘జల్ బోర్డు’ మంటలు రాజుకున్నాయి. సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయన్న కేసులో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ కావడంతో.. ఇప్పుడు చర్చ అంతా ఎంపీ రాఘవ్ చద్దా చుట్టూనే తిరుగుతోంది. గతంలో DJB వైస్ చైర్మన్గా పనిచేసిన చద్దాను ఈ కేసుతో ఎందుకు ముడిపెడుతున్నారన్నది హాట్టాపిక్గా మారింది. అయితే చద్దా వర్గాలు మాత్రం ఒక్క టైమ్లైన్తోనే ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నాయి. “అక్రమాలు జరిగినట్లు చెబుతున్న సమయానికి ఆయన పదవిలోనే లేరు” అనేది వారి వాదన.అయితే చద్దా సన్నిహిత వర్గాలు మాత్రం ఆరోపణలను ఖండించాయి. చద్దా 2020 మార్చి 2 నుంచి 2022 మార్చి 3 వరకు ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్గా పనిచేశారని తెలిపాయి. ఆ పదవికి రెండేళ్ల కాలపరిమితి ఉంటుందని, 2022 మార్చిలోనే ఆయన ఢిల్లీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారని పేర్కొన్నాయి. అంటే.. చద్దా DJB వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న దాదాపు ఏడు నెలల తర్వాత ఈ వ్యవహారం జరిగినట్లు పేర్కొన్నాయి. ఈ టైమ్లైన్ చూస్తే చద్దాను కేసుతో ముడిపెట్టే ప్రయత్నం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆరోపించాయి.ఆప్ ఆరోపణలు.. కాగా, ఆప్ నేత ప్రియాంక కక్కర్ మాత్రం.. “ఈ అక్రమాలకు రాఘవ్ చద్దానే కారణమని గతంలో బీజేపీ ఆరోపించింది. మరి ఆయనను ఎందుకు విచారించలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు?” అని ప్రశ్నించారు. బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీంతో సత్యేంద్ర జైన్ అరెస్ట్ వ్యవహారం కాస్తా.. రాఘవ్ చద్దా పాత్రపై పొలిటికల్ వార్గా మారిపోయింది. ఇక, దర్యాప్తు సంస్థ వివరాల్లో అప్పటి జలవనరుల మంత్రి, DJB ఎక్స్-అఫీషియో చైర్మన్, అప్పటి CEO, కన్సల్టెంట్, చీఫ్ ఇంజినీర్, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల పాత్రను ప్రస్తావించినట్లు చద్దా వర్గాలు చెబుతున్నాయి. అయితే రాఘవ్ చద్దాకు ఎలాంటి పాత్రను కేటాయించలేదని పేర్కొంటున్నాయి. రాజకీయ ఆరోపణల్లో పేరు ప్రస్తావించడం వేరు.. దర్యాప్తులో నిందితుడిగా తేలడం వేరు అని చద్దా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.అసలు DJB కేసులో ఏముంది?ఢిల్లీ జల్ బోర్డు పరిధిలోని సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల విస్తరణ, ఆధునికీకరణకు సంబంధించిన టెండర్లలో నిబంధనలను మార్చడం, టెండర్ ప్రక్రియను ప్రభావితం చేయడం, అధికారులు-కన్సల్టెంట్లు-ప్రైవేటు సంస్థల మధ్య కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ డైరెక్టరేట్ ఫిర్యాదుతో 2024 మే 11న కేసు నమోదైంది. ఈ కేసులో ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ ఆరుగురిని అరెస్ట్ చేసింది. వారిలో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, మాజీ డీజీబీ CEO ఉదిత్ ప్రకాశ్ రాయ్ కూడా ఉన్నారు.రూ.60 వేల కోట్ల స్కామ్? ఇక ఈ కేసును బీజేపీ మరింత పెద్ద రాజకీయ అంశంగా మార్చింది. డీజేబీ ఖాతాలను పదేళ్లుగా ఆడిట్ చేయలేదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా ఆరోపించారు. దాదాపు రూ.60 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ పూర్తి దర్యాప్తు నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, బాన్సురీ స్వరాజ్ సహా పలువురు నేతలు గత ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యమునా ప్రక్షాళన కోసం ఖర్చు చేయాల్సిన ప్రజాధనం అవినీతికి గురైందని ఆరోపించారు. అయితే, చివరకు సత్యేంద్ర జైన్ అరెస్ట్తో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు రాఘవ్ చద్దా చుట్టూ కొత్త రాజకీయ మలుపు తీసుకుంది. దర్యాప్తులో బయటకు వచ్చే ఆధారాలే ఈ వివాదానికి అసలు సమాధానం చెప్పాల్సి ఉంది. -
ఆప్ సత్యేందర్ జైన్ అరెస్ట్.. ఢిల్లీలో రాజకీయ దుమారం
ఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలపై గతంలో రెండేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి అరెస్టయ్యారు. ఢిల్లీ జల్బోర్డు(డీజేబీ) మురికి నీటి శుద్ధి ప్లాంట్ల టెండర్లలో భారీ అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై సత్యేంద్ర జైన్, డీజేబీ మాజీ సీఈవో ఉదిత్ రాయ్ సహా ఆరుగురిని ఏసీబీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.ఇందులో భాగంగా జైన్, ఉదిత్ ప్రకాశ్ రాయ్తో పాటు మాజీ కాంట్రాక్టు కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాస్తవ, ప్రైవేట్ వ్యక్తులు నాగేంద్ర యాదవ్, రాజా కుమార్ కుర్రా, పంకజ్ వర్మలను కూడా అరెస్ట్ చేసినట్లు ఏజెన్సీ వెల్లడించింది. కాగా, డీజేబీ టెండర్లలో అవకతవకల ఆరోపణలకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ 2024 మేలో కేసు నమోదు చేసింది. మురికి నీటి శుద్ధి ప్లాంట్లకు సంబంధించిన ఎలాంటి పైలట్ ప్రాజెక్టు చేపట్టలేదని, నిర్దేశించిన పరామితులకు అనుగుణంగా టెండర్లు లేనేలేవని ఏసీబీ అంటోంది.#WATCH | Delhi | Satyendar Kumar Jain, former Minister of Water, GNCTD, was taken to Aruna Asaf Ali Hospital for a medical examination following his arrest by the Anti-Corruption Branch (ACB). He has been arrested in a case involving large-scale irregularities, manipulation of… pic.twitter.com/ywKOdDhF6v— ANI (@ANI) August 18, 2026గతంలో సత్యేంద్ర జైన్కు సంబంధించిన నాలుగు కంపెనీలు మనీ లాండరింగ్కు పాల్పడిన ఆరోపణలపై 2022 మేలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయన్ను అరెస్ట్ చేసింది. జైలులో ఉండగానే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బెయిల్, ఎటువంటి విచారణ లేకుండానే రెండేళ్లకు పైగా జైలులోనే గడిపారు. చివరకు కోర్టు ఆయనపై మనీ లాండరింగ్ కేసును కొట్టేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు.బీజేపీ తీవ్ర ఆరోపణలుఈ వ్యవహారంపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా అప్పటి ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గత పదేళ్ల పాలనలో ఒక్క డ్రెయిన్పైనా STP ఏర్పాటు చేయకపోవడం వల్ల యమునా కాలుష్యం మరింత పెరిగిందని ఆరోపించారు. STP టెండర్లలో అవకతవకలకు సంబంధించి స్పష్టమైన నగదు లావాదేవీల మార్గాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారని, అక్రమంగా మళ్లించిన నిధులు మాజీ మంత్రి, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య పంపిణీ అయ్యాయని మల్హోత్రా పేర్కొన్నారు.ఆప్ ఖండన.. అయితే ఆప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ ఒత్తిడితోనే సత్యేందర్ జైన్ను మరోసారి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ కేసు కూడా చివరకు తప్పుడు కేసుగా తేలుతుందని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అతిషి కూడా అరెస్టులను ఖండించారు. అధికార బలంతో బీజేపీ అబద్ధాలు, అణచివేతను కొనసాగించవచ్చని భావించినా, నిజాన్ని శాశ్వతంగా అణచివేయలేరని అన్నారు. -
వందేమాతరం వివాదం.. సోనియాకు బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: వందేమాతరం గీతం ఆలాపనపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సోనియా వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. బీజేపీ తీవ్రంగా స్పందించింది. వందేమాతరం ఆలాపన విషయంలో కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నలు సంధించారు.ఆగస్టు 15న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వందేమాతరం ఆలాపన సందర్భంగా సోనియాగాంధీ వ్యవహరించిన తీరు తమకు తీవ్రంగా అభ్యంతరకరంగా అనిపించిందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వందేమాతరం మొత్తాన్ని ఆలపించడాన్ని ఆమె వ్యతిరేకించినట్లుగా కనిపించిందని వ్యాఖ్యానించారు. జాతీయ గీతం వంటి అంశంపై కాంగ్రెస్ కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామం అవమానకరమని విమర్శించారు.కాంగ్రెస్ మీడియా విభాగం దీనిపై ఇచ్చిన వివరణను కూడా రవిశంకర్ ప్రసాద్ తప్పుబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోసం కుర్చీ ఏర్పాటు చేస్తున్నందుకే ఆ సమయంలో అలా జరిగిందన్న వివరణను ఆయన కొట్టిపారేశారు. అది సరైన వివరణ కాదని, వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా కనిపించిందని అన్నారు.గోవాలోనూ రెండు చరణాలే..ఆగస్టు 15న గోవాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమాన్ని కూడా బీజేపీ నేత ప్రస్తావించారు. అక్కడ కూడా వందేమాతరంలోని రెండు చరణాలనే ఆలపించారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనలపై కాంగ్రెస్ పార్టీ మొత్తం వైఖరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.‘స్వాతంత్య్ర ఉద్యమంపై గుత్తాధిపత్యం చెప్పుకోవద్దు’వందేమాతరం విషయంలో కాంగ్రెస్ ఇదే విధమైన వైఖరిని కొనసాగిస్తే.. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి తామే ఏకైక వారసులమని చెప్పుకోవడం మానుకోవాలని రవిశంకర్ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశభక్తికి ప్రతీకగా భావించే వందేమాతరంపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు.సోనియా వ్యాఖ్యల నేపథ్యంలో..ఇదిలా ఉండగా.. తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వందేమాతరం వివాదాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ కాంగ్రెస్పై దాడి చేసింది. -
‘ఉరి చాలా బాధాకరమే కానీ’.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మరణశిక్ష అమలు చేసే విధానంపై చాలా దేశాలు పునరాలోచన చేస్తున్నాయి. ఇంజెక్షన్లు, ఛాంబర్లు.. ఇలా కొత్త తరహా మార్గాలను ఎంచుకుంటున్నాయి. ఈ తరుణంలో భారత్లో అనాదీగా వస్తున్న ఉరిశిక్షను మార్చాలంటూ పిటిషన్ దాఖలు కాగా.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది ఎంతో బాధాకరమైనదే అయినప్పటికీ.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని చెబుతూ ఆ పిటిషన్ను కొట్టేసింది. మరణశిక్షలో ఉరిశిక్షను తొలగించాలంటూ సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా ఓ పిటిషన్ వేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లోని సెక్షన్ 354(5) ప్రకారం మరణశిక్ష పడిన ఖైదీని “మెడకు ఉరి బిగించి మరణించే వరకు వేలాడదీయాలి” అని నిబంధన ఉంది. ఈ నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి.. ఉరి విధానాన్ని రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. దీనిని పరిశీలించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రస్తుతానికి ఆ విధానమే కొనసాగుతుందని చెబుతూ.. పిటిషన్ను కొట్టేసింది. అయితే భవిష్యత్తులో బలమైన వైద్య, శాస్త్రీయ ఆధారాలు అందుబాటులోకి వస్తే ఈ అంశాన్ని మరోసారి రాజ్యాంగపరంగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.‘ఉరి చాలా బాధాకరం’..రిషి మల్హోత్రా దాఖలు చేసిన ఈ పిటిషన్లో.. ఉరి తీసే ప్రక్రియలో ఖైదీ తీవ్రంగా, ఎక్కువసేపు బాధపడే అవకాశం ఉందని వాదించారు. అందువల్ల ఉరికి బదులుగా లెథల్ ఇంజెక్షన్, కాల్చి చంపడం, విద్యుదాఘాతం లేదంటే గ్యాస్ ఛాంబర్ వంటి ప్రత్యామ్నాయ విధానాలను పరిశీలించాలని కోరారు. ఉరిశిక్ష అమలులో ఖైదీ వెంటనే చనిపోడని.. మరణాన్ని నిర్ధారించేందుకు కొంత సమయం పడుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనికి భిన్నంగా కొన్ని ప్రత్యామ్నాయ విధానాల్లో మరణం తక్కువ సమయంలోనే సంభవించే అవకాశం ఉందని వాదించారు.కేంద్రానికి ఆ స్వేచ్ఛ ఉందిఅయితే ప్రస్తుతానికి ఉరి విధానాన్ని రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ఈ తీర్పుతో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అవకాశాలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. ఉరిశిక్ష అమలు ద్వారా కలిగే బాధ, ఖైదీ గౌరవం, రాజ్యాంగ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని మెరుగైన ప్రత్యామ్నాయం ఉందా? అనే అంశాన్ని నిపుణుల కమిటీ ద్వారా సమగ్రంగా పరిశీలించేందుకు కేంద్రం స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. 2023లోనే మొదలైన చర్చఉరిశిక్ష అమలు విధానంపై ఈ చర్చ ఇప్పటిది కాదు. 2023 మార్చిలో ఇదే పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. ఉరి వల్ల కలిగే నొప్పి, మరణానికి పట్టే సమయం, అమలులో ఎదురయ్యే సమస్యలపై వివరాలు సేకరించాలని అటార్నీ జనరల్ను కోరింది. అదే ఏడాది మేలో కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి.. మరణశిక్ష అమలుకు మెరుగైన ప్రత్యామ్నాయ విధానం ఉందా? అనే అంశాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కోర్టుకు తెలిపారు.‘లెథల్ ఇంజెక్షన్’పై భిన్నాభిప్రాయాలువిచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదులు అమెరికా సహా ఇతర దేశాల్లో అమల్లో ఉన్న లెథల్ ఇంజెక్షన్ విధానాన్ని ప్రస్తావించారు. ఖైదీకి ఉరి లేదా లెథల్ ఇంజెక్షన్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కూడా వాదించారు. అయితే లెథల్ ఇంజెక్షన్ పూర్తిగా నొప్పిలేని, మానవీయ విధానమేనన్న అభిప్రాయాన్ని ప్రాజెక్ట్ 39A సైతం పూర్తిగా సమర్థించలేదు. ఇతర దేశాల్లో ఈ విధానం అమలైన అనుభవాలను పరిశీలిస్తే.. అది కూడా అనేక సమస్యలకు దారితీసిన సందర్భాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రత్యామ్నాయాలపై మరింత శాస్త్రీయ ఆధారాలు సేకరించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయవచ్చని సూచించింది.ఉరి వేసేవారి మానసిక పరిస్థితిపైనా..విచారణలో మరో ఆసక్తికర అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మరణశిక్ష అమలు చేసే జైలు సిబ్బంది, ఉరివేసే వ్యక్తుల(తలారీ)పై పడే మానసిక ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ సందీప్ మెహతా సూచించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రస్తుత ఉరి విధానాన్ని రద్దు చేయకపోయినా, మరణశిక్షను ఏ విధంగా అమలు చేయాలి? ఖైదీకి కనీస బాధతో, గౌరవాన్ని కాపాడుతూ శిక్షను అమలు చేయగలమా? అనే అంశంపై భవిష్యత్ చర్చకు మార్గం తెరిచి ఉంచింది. -
మనసున మనసై
నిరుత్సాహం కమ్ముకున్నప్పుడు, ఒంటిరితనం శాపంగా మారినప్పుడు, పీల్చే శ్వాస కూడా బరువెక్కుతుంది. బతుకు భారమవుతుంది. కాని ఆశ అనే దీపం వెలిగిస్తే ఎన్ని నిరాశల నిశీధులనైనా దాటవచ్చని నిరూపించిందో యువతి. ఆమె సెహర్ హష్మీ... స్వయంగా తానే మానసిక అంతర్మధనంలో ఎన్నో రోజులు నరకాన్ని చవిచూసింది.. ఆపై ఒక దృఢ నిశ్చయంతో నరకాన్ని దాటి తనలాంటి ఎంతోమంది మానసిక రోగులకు ఉపశమనం కలిగిస్తోంది.ఢిల్లీలో జన్మించిన సెహర్ హష్మీ, చిన్నప్పటి నుంచే సృజనాత్మకతపై ఆసక్తి పెంచుకుంది. తల్లి షబ్నం హష్మీ, తండ్రి గౌహర్ రజా. అన్నయ్య సాహిర్ రజా బాలీవుడ్లో దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిన సెహర్, ముంబయిలో ఓ డిజైనర్తో కలిసి పలు షూట్లలో పనిచేసింది. బయటికి అందమైన, సృజనాత్మక ప్రపంచంగా కనిపించే ఫ్యాషన్ రంగం వెనుక ఎన్నో సవాళ్లున్నాయని తెలిశాక ఆమె మొదట్లో ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత తేరుకుని అంతర్గతంగా తీవ్రమైన పోరాటం సాగించింది. బోర్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ), డిప్రెషన్ తో బాధపడింది. తీవ్రమైన ఒత్తిడి, మూడ్లో మార్పులు, ఆత్మవిశ్వాసంలో హెచ్చుతగ్గులు, స్వీయ హింస, ఒంటరితనం, తరచూ కోపం రావడం ఇవన్నీ బీపీడీ లక్షణాలు.. ఓ దశలో పరిస్థితి తీవ్రంగా మారి రెండేళ్లపాటు దాదాపు తన గదికే పరిమితమయింది. ఆ చీకటి దశను దాటడం ఆమె జీవితంలోనే అతిపెద్ద పోరాటంగా మారింది. ఆ తర్వాత పెయింటింగ్ ఆమెకు ఆధారమైంది. తల్లి ప్రోత్సాహంతో చిత్రాలను ప్రదర్శనకు పెట్టడంతోబాటు, అక్కడి నుంచే తన అనుభవాలను ప్రజలతో ధైర్యంగా పంచుకోవాలనే ఆలోచన కూడా మొదలైంది.ప్రాజెక్ట్ బ్రేకింగ్ స్టిగ్మా...సెహర్ తనలాంటి వారికి ధైర్యం ఇవ్వడానికి ‘బ్రేకింగ్ స్టిగ్మా – ఒన్మైల్ ఎట్ ఎ టైం’ పేరుతో క్యాంపెయిన్ మొదలు పెట్టింది. ఢిల్లీలో మొదలు పెట్టి దాదాపు 22 నగరాలు, 30 గ్రామాలలో ఎంతోమందికి ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించింది. కోవిడ్ సమయంలో ఫేస్బుక్ లైవ్ల ద్వారా కూడా ఎంతోమందికి చేరువైంది. మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత పోరాటం వంటి అంశాలను బహిరంగంగా మాట్లాడటం ద్వారా ఎన్నో కుటుంబాలకు ధైర్యాన్ని కల్పించింది. ఒకసారి బెంగళూరులో ఓ మహిళ సెహర్ తల్లి షబ్నం హష్మీని కలిసి.. ‘‘సెహర్ నా ప్రాణాన్ని కాపాడింది’’ అని చె΄్పారు. సెహర్ వీడియోలు చూసిన తర్వాత తన లైంగిక గుర్తింపును కుటుంబానికి చెప్పే ధైర్యం వచ్చిందని, ఒకప్పుడు జీవితం ముగించుకోవాలనుకున్న స్థితి నుంచి ఇప్పుడు తన గుర్తింపుతో స్వేచ్ఛగా జీవిస్తున్నానని ఆమె వివరించింది.రాయల్ ఎన్ ఫీల్డ్ టూర్మానసిక ఆరోగ్యంపై అవగాహన కోసం 7 వేల కిలోమీటర్లకు పైగా చేసిన ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు.. కాని సెహర్ వెనకడుగు వేయలేదు. ఈ ప్రయాణం రహదారులపై దూసుకెళ్లడం మాత్రమే కాదు. చిన్న పట్టణాలు, గ్రామాలు, దూర ప్రాంతాలు, కమ్యూనిటీ కేంద్రాల్లోకి నేరుగా వెళ్లి మానసిక ఆరోగ్యంపై చర్చకు అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా ఇలాంటి అంశాలపై మాట్లాడని ప్రాంతాల్లోనూ మాట్లాడుకునేలా చే స్తూ తన గమనాన్ని కొనసాగిస్తోంది.విద్యలో భాగం కావాలినా గురించి నేను మాట్లాడినప్పుడు నన్ను చాలామంది సంప్రదించారు. అప్పుడు నేను ఒంటిరిదాన్ని కాదని నాకు అర్థమైంది. మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది ఏదో ఒక్కసారి మొక్కుబడిగా నిర్వహించే కార్యక్రమం కాకూడదు. అది విద్యావ్యవస్థలో నిరంతర భాగం కావాలి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘మానస్’ హెల్ప్లైన్ అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉండటం చాలా మంచి విషయం. – చైతన్య వంపుగాని, సాక్షి న్యూఢిల్లీ -
రూ.36 లక్షల జీతం ఇస్తానన్నా నో చెప్పాడు.. ఎందుకంటే?
ఢిల్లీకి చెందిన ఓ వ్యవస్థాపకుడు దుబాయ్లో రూ.36 లక్షల వార్షిక జీతంతో వచ్చిన ఉద్యోగ ఆఫర్ను వదులుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. 7 ఏళ్లు గడిచినా ఆ నిర్ణయం పట్ల తనకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని ఆయన తెలిపారు. ఫిన్గ్రోత్ మీడియా వ్యవస్థాపకుడు కనన్ బహల్ తన కెరీర్ జర్నీని ఎక్స్లో ఓ పోస్టు ద్వారా పంచుకున్నారు. విదేశీ ఉద్యోగ ఆఫర్లో పన్ను మినహాయింపు ఉన్న జీతం ఉందని, ఆ సమయంలో ఐసీఏఐ క్యాంపస్ నియామకాల్లో అదే అత్యధిక ఉద్యోగ ప్రతిపాదన అని ఆయన తెలిపారు.“7 ఏళ్ల క్రితం దుబాయ్లో రూ.36 లక్షల ఉద్యోగ ఆఫర్ను నేను తిరస్కరించాను. అది పన్ను మినహాయింపు ఉన్న జీతం. ఆ సమయంలో ఐసీఏఐ క్యాంపస్ నియామకాల్లో అదే అత్యధిక ఉద్యోగ ఆఫర్” అని బహల్ తన పోస్టులో రాశారు.ఖర్చులను లెక్కలోకి తీసుకున్న తర్వాత ఆ ఉద్యోగం తీసుకుని ఉంటే ఏడాదికి దాదాపు రూ.20 లక్షలు ఆదా చేయగలిగేవాడినని ఆయన చెప్పారు. భారత్లో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని, ఆ సమయంలో ఏడాదికి రూ.12 లక్షలకు మించి జీతం ఇచ్చే ఉద్యోగం తనకు దొరకలేదని తెలిపారు.అయినా ఎందుకు వద్దన్నారు?జీతంలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ బహల్ భారత్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. “నేను దాన్ని తిరస్కరించాను. నా కుటుంబానికి, సంస్కృతికి దగ్గరగా ఉండటం నాకు ఎక్కువ ముఖ్యం” అని ఆయన రాశారు.ఆ నిర్ణయం సరైనదేనని తేలిందని ఆయన తెలిపారు. 7 ఏళ్ల తర్వాత తన పరిస్థితిని గుర్తు చేసుకుంటూ, “ఈ రోజు నాకు ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు” అని పేర్కొన్నారు. భారత్లో తాను నిర్మించుకున్న కెరీర్ దుబాయ్ ఉద్యోగం ద్వారా వచ్చేదానికంటే ఎంతో ఎక్కువ లాభదాయకంగా మారిందని తెలిపారు.అదే పోస్టులో బహల్ జీతంతో పోలికను పక్కనపెట్టి దేశంతో తనకున్న అనుబంధం గురించి, భవిష్యత్తుపై తన నమ్మకం గురించి కూడా మాట్లాడారు. “భారత్ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు. కానీ మనం దాన్ని పరిపూర్ణంగా మార్చాలి” అని రాశారు.తన కుటుంబ చరిత్ర గురించి కూడా ఆయన ప్రస్తావించారు. 1947లో తమ పూర్వీకులను హింసకు గురై ఇళ్ల నుంచి వెళ్లగొట్టాక తర్వాత భారత్ వారికి ఆశ్రయం ఇచ్చిందని తెలిపారు. “మన స్వాతంత్య్ర సమరయోధులకు, మాతృభూమి భారత్కు మనమంతా ఎంతో రుణపడి ఉన్నాం” అని బహల్ చెప్పారు. చివరగా “స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!” అని పేర్కొన్నారు.యూజర్ల స్పందనలుఈ పోస్టుకు భారీగా స్పందనలు వచ్చాయి. దుబాయ్ ఉద్యోగ ఆఫర్ను పక్కనపెట్టి భారత్లోనే ఉండటాన్ని పలువురు ప్రశంసించారు. “చాలా బాగుంది. భారత్ ఎదుగుదలపై నాకు ఎలాంటి సందేహం లేదు. మీలాంటి యువత ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. మీ తల్లిదండ్రులకు కూడా అభినందనలు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి” అని ఓ యూజర్ రాశారు. “గొప్ప పని చేశారు. ఇతరులను కూడా ప్రోత్సహించండి. స్ఫూర్తిదాయకం” అని మరో వ్యక్తి కామెంట్ చేశారు.7 yrs back, I rejected a ₹36 Lakh job offer in Dubai.It was a tax-free salary and it was the highest ICAI campus placement offer at that time.After all expenses, I would've saved ₹20 lakhs.I couldn't find a job in India that paid more than ₹12 lakhs p.a. at that time.I… pic.twitter.com/7PYlraI7nl— Kanan Bahl (@BahlKanan) August 15, 2026 -
మోదీగారూ.. చూడండి ఏం జరిగిందో!
న్యూఢిల్లీ: యూజీసీ-నెట్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. వాటిని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వైఫల్యాల భారాన్ని విద్యార్థులపై మోపుతున్నారని ఆరోపించారు. ‘‘మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.‘‘ఏళ్ల తరబడి చదివిన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దరఖాస్తులు, ఫీజులు, దూర ప్రాంతాలకు ప్రయాణాలు.. అన్నీ మరోసారి చేయాల్సి వస్తోంది. తప్పు చేసింది ఎన్టీఏ.. కానీ శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. జూన్ 22 నుంచి 30 వరకు జరిగిన యూజీసీ-నెట్ పరీక్షలను దాదాపు రెండు నెలల తర్వాత రద్దు చేయడంపై ఆయన ప్రశ్నించారు. పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా? అనే అసలు ప్రశ్నకు NTA సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు.Modi ji, look at what your NTA has just done.UGC-NET exams for Sociology, English and Commerce were held between 22 and 30 June. Nearly two months later, NTA has cancelled all three because it set faulty papers and repeated old questions.Thousands of candidates who prepared… https://t.co/TUMhhMhjvL— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2026‘విద్యా వ్యవస్థ కాదు.. వసూళ్ల యంత్రం’దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది ఇక విద్యా వ్యవస్థ కాదు.. ఒక ఎక్స్ట్రాక్షన్ మెషీన్గా మారింది. ఇది విద్యార్థుల డబ్బు, సమయం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుంటోంది. కానీ తిరిగి ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు’’ అని విమర్శించారు. పేపర్ లీక్ వ్యవహారాలపై బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం తొలి అడుగు మాత్రమేనని.. NTA నాయకత్వంపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.సెప్టెంబర్లో రీటెస్ట్NTA ప్రకారం.. ఇంగ్లిష్, కామర్స్ అభ్యర్థులకు సెప్టెంబర్ 9న, సోషియాలజీ పరీక్షకు సెప్టెంబర్ 10న రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు అదనపు ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు షెడ్యూల్ ప్రకారమే విడుదల చేస్తామని తెలిపింది. నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న NTAపై తాజాగా యూజీసీ-నెట్ రీటెస్ట్ నిర్ణయం మరింత ఒత్తిడి పెంచింది. -
ఆర్థిక ఇబ్బందులతోనే బీజేపీని వీడుతున్నా: షెహజాద్ పూనావాలా
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. మరోసారి తన రాజీనామాను ఉద్ఘాటించారు. ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. అదే సమయంలో.. పార్టీలో కొందరి వైఖరి కూడా తన నిర్ణయాన్ని బలపరచాయని తాజాగా పార్టీకి రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను పూనావాలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.తొలుత తన నిర్ణయాన్ని బీజేపీ నాయకత్వం గౌరవించి, రాజీనామా స్వీకరించకుండా పునరాలోచించాలని కోరిందని తెలిపారు. అయితే అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు క్రియాశీల సభ్యత్వం నుంచి తప్పుకోవాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో సమర్పించిన రాజీనామాను పార్టీ అంగీకరించకపోవడంతో.. మరోసారి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్కు లేఖ రాసి తనను బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. వీలైనంత త్వరగా ఆ పని చేయాలంటూ ఆయన కోరుతున్నారు.వ్యవస్థను వీడుతున్నా..తన నిర్ణయం వెనుక ప్రత్యేకమైన కారణాలేవీ లేవని పూనావాలా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని తెలిపారు.‘‘నేను బీజేపీ వ్యవస్థ నుంచి మాత్రమే బయటకు వస్తున్నాను.. సిద్ధాంతాల నుంచి కాదు’’ అని పేర్కొన్నారు. తాను ఎప్పటికీ మోదీ వీరాభిమానినేనని.. భవిష్యత్లోనూ సాధ్యమైనంత వరకు బీజేపీ ఆలోచనా విధానానికి మద్దతుగా ఉంటానని చెప్పారు.ఆ కొందరు ఎవరు?గత కొన్ని రోజులుగా జరిగిన కొన్ని పరిణామాలు తన నిర్ణయాన్ని మరింత బలపరిచాయని పూనావాలా లేఖలో పేర్కొనడం గమనార్హం. అయితే ఆ వ్యక్తులు ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. వారికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకత్వంతో తాను చర్చలు కూడా జరిపినట్లు ఆయన చెప్పినట్లు తెలిపారు.అలాగే భవిష్యత్తులో ఏ పార్టీలో చేరబోనని.. రాజకీయాలను వదిలి ప్రైవేటు రంగంలోకి వెళ్లనున్నట్లు చెప్పారు. ‘‘అత్యవసర ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని వివరించారు.కాంగ్రెస్ నుంచి బీజేపీకి..మహారాష్ట్రకు చెందిన 38 ఏళ్ల షెహజాద్ పూనావాలా న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. తొలుత కాంగ్రెస్లో ఉన్న ఆయన.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే ప్రక్రియను బహిరంగంగా ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. అనంతరం కాంగ్రెస్ను వీడి 2021లో బీజేపీలో చేరారు.బీజేపీలో చేరిన తర్వాత ఆయన పార్టీకి చెందిన ప్రముఖ ముస్లిం ముఖంగా ఎదిగారు. టీవీ చర్చలు, మీడియా సమావేశాల్లో పార్టీ తరఫున తరచూ ప్రాతినిధ్యం వహించారు. హిందుత్వాన్ని బాగా ప్రచారం చేయడంతో.. అధినాయకత్వం ఆయన్ని చేరదీసింది. 2021లో బీజేపీ ఢిల్లీ ఐటీ, సోషల్ మీడియా విభాగం బాధ్యతలు కూడా నిర్వహించారు.ఆ తర్వాత.. టీవీ డిబేట్లో పార్టీ తరఫున ప్రతినిధిగా పాల్గొనేవారు. పార్టీలో తనకు లభించిన అవకాశాలను గుర్తుచేసుకుంటూ.. గత ఐదేళ్లుగా అందించిన వేదిక, గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే తాజాగా ఆయన తీసుకున్న రాజీనామా నిర్ణయం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
నేడు బీజేపీ కొత్త టీమ్ ప్రకటన.. జాతీయ కార్యవర్గంపై ఉత్కంఠ
సాక్షి, ఢిల్లీ: బీజేపీలో కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నేడు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త టీమ్ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ పదాధికారులతో పాటు కీలకమైన పార్టీ కమిటీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కొత్త కార్యవర్గంలో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు కూడా చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్టానం కొత్త టీమ్ను రూపొందించినట్లు తెలుస్తోంది.అదే సమయంలో పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, మార్గదర్శక మండలి వంటి కీలక సంస్థల్లో కూడా మార్పులు, కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, మణిపూర్, హిమాచల్ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, యువతకు అవకాశం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త టీమ్కు తుది రూపు ఇచ్చినట్లు సమాచారం.నెల రోజులుగా కసరత్తు..జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ సంస్థాగత వ్యవహారాల కీలక నేత బీఎల్ సంతోష్ నెల రోజుల క్రితమే కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ కార్యక్రమాలు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం నేపథ్యంలో కొత్త కార్యవర్గం ప్రకటన కొంత ఆలస్యమైనట్లు తెలుస్తోంది.కేంద్ర కేబినెట్లో మార్పులు?బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన తర్వాత కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన కూడా జరిగే అవకాశం ఉందనే చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొత్త పార్టీ టీమ్, కేంద్ర కేబినెట్లో మార్పులు.. రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త కార్యవర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది? కీలక పదవుల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి? కేంద్ర మంత్రుల్లో ఎవరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు? అన్నదానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
రెండో ఉద్యమం మొదలు పెట్టిన సీజేపీకి బిగ్ షాక్.. ఒకరి మృతి
న్యూఢిల్లీ: ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం చేపట్టిన రెండో రోజే సీజేపీకి భారీ షాక్ తగిలింది. పాఠశాల సమస్యలను అందరి దృష్టికి తీసుకురావాలనుకున్న సీజేపీ మద్దతుదారుడి తండ్రిని కొందరు కొట్టి చంపారు. పశ్చిమ బెంగాల్లోని బంకురాకు చెందిన కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారుడి తండ్రి ఆగస్టు 15న మృతి చెందారు. సీజీపీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా తన చిన్నతనంలో చదువుకున్న పాఠశాల పరిస్థితులను అతడి కుమారుడు వీడియో తీసినందుకు ఆగ్రహించిన కొందరు వ్యక్తులు ఇంట్లోనే ఆయనపై దాడి చేశారని పోలీసులు, కుటుంబ సభ్యులు ఆదివారం జాతీయ మీడియాకు తెలిపారు.మృతుడి కుమారుడి పేరు అబ్దుల్ హఫీజ్. దాడికి బీజేపీ కార్యకర్తలే కారణమని ఆరోపించిన అబ్దుల్ హఫీజ్.. దాడిలో గాయపడిన తన తండ్రి బంకురాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. “ఈ బీజేపీ స్థానిక నేతలు దారుణంగా దాడి చేసిన తర్వాత నా తండ్రి శనివారం మృతి చెందారు” అని హఫీజ్ చెప్పారు.బంకురా ఎస్పీ వీజీ సతీష్ పసుమర్తి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. “హఫీజ్ తల్లి ఫిర్యాదు చేసేందుకు వస్తున్నట్లు మాకు సమాచారం అందింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు.ఇదిలా ఉండగా, తమ కార్యకర్తలకు ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు తేలి, వారిపై పేర్లతో పోలీసులకు ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ తెలిపింది.“అయితే, టీఎంసీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి సామాజిక తనిఖీ చేసే ధైర్యం చేశారా? కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీని చెడుగా చూపించేందుకు టీఎంసీ, వామపక్షాలు చేస్తున్న పద్ధతి ఇది మాత్రమే” అని బీజేపీ బెంగాల్ అధికార ప్రతినిధి కేయా ఘోష్ చెప్పారు.జంతర్ మంతర్లో జరిగిన సీజీపీ నిరసనల్లో కూడా పాల్గొన్న హఫీజ్.. పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు సామాజిక తనిఖీలో భాగస్వామి కావాలని అనుకున్నట్లు తెలిపారు. తాను చదువుకున్న కరిసుంద ప్రాథమిక విద్యాలయానికి వెళ్లి కొన్ని వీడియోలు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చానని చెప్పారు.రాత్రి 8 గంటల సమయానికి కొందరు వ్యక్తులు తన ఇంటికి వచ్చి చుట్టుముట్టారని, తనపై కూడా దాడి చేయడంతో పాటు వృద్ధుడైన తన తండ్రిని కొట్టారని హఫీజ్ తెలిపారు. తన ఫోన్ను లాక్కుని, పాఠశాలకు సంబంధించిన వీడియోలు, జంతర్ మంతర్లో తాను తీసిన వీడియోలను తొలగించాలని బలవంతం చేశారని చెప్పారు.నా రక్తం మరిగిపోతోంది: దీప్కేఅబ్దుల్కు కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అబ్దుల్కు మద్దతు తెలిపారు. అతడి తండ్రి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై మాట్లాడిన తర్వాత అబ్దుల్ ఆ పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లారని దీప్కే ఎక్స్లో చేసిన పోస్టులో తెలిపారు. అబ్దుల్, ఆయన కుటుంబంపై బీజేపీతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు దాడి చేసిన తర్వాత ఆయన తండ్రి హత్యకు గురయ్యారని దీప్కే ఆరోపించారు.“మెరుగైన పాఠశాలలు కావాలని డిమాండ్ చేసినందుకు ప్రజలను హత్య చేస్తున్నారంటే నా రక్తం మరిగిపోతోంది” అని దీప్కే పోస్టులో పేర్కొన్నారు. సీజీపీ బృందం పశ్చిమ బెంగాల్కు వెళ్లి అబ్దుల్, ఆయన కుటుంబంతో కలిసి న్యాయం కోసం పోరాడుతుందని దీప్కే తెలిపారు. బెదిరింపులు, భయపెట్టే ప్రయత్నాలు ఎదురైనా.. మెరుగైన ప్రభుత్వ పాఠశాలల కోసం తమ ప్రచారాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్న ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని దీప్కే ప్రారంభించిన తర్వాత ఆయన ఈ పోస్టు చేశారు. -
వందేమాతరం ఆపండి! సోనియా సైగలపై.. BJP ఫైర్
-
ఆర్కైవ్ అద్భుతః
‘ఆర్కైవ్లు అనేవి వ్యవస్థలు, ప్రభుత్వాల పని’ అనే అభిప్రాయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో వ్యక్తిగత స్థాయిలో ఆన్లైన్ ఆర్కైవ్లు ప్రజాదరణ పొందుతున్నాయి. ‘నా రాష్ట్ర చరిత్రను మహిళల కోణం నుంచి చూడాలి’ అనే లక్ష్యంతో ఒక ఇంజినీర్ ఆన్లైన్ ఆర్కైవ్ మొదలు పెట్టాడు. హిట్! ‘పాత వస్తువులు చరిత్రకు అద్దాలు. మీ ఇంట్లోని పా...త వస్తువుల గురించి మీ జ్ఞాపకాలను పంచుకోండి’ అంటూ ప్రారంభమైన ఆర్కైవ్ సూపర్ హిట్!!దిల్లీలో పుట్టి టొరంటోలో స్థిరపడ్డాడు హర్లిన్ సింగ్. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన ఈ ఇంజినీర్ దేశవిభజన రోజుల నాటి ఎన్నో విషయాలను పెద్దల నోటి నుంచి విన్నాడు. అయితే తాను విన్న వాటిలో మహిళలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉన్న విషయాన్ని గ్రహించాడు. ఈ నేపథ్యంలో తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ‘ది సింగింగ్సింగ్’లో పంజాబ్ చరిత్రను మహిళల కోణం నుంచి చూసే ఆర్కైవ్కు శ్రీకారం చుట్టాడు. అదే...ది లాస్ట్ హీర్.పంజాబీ జానపద కథల్లోని సాహసవంతురాలైన వీర వనిత హీర్. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి వీర వనితకు ప్రతీకగా నిలుస్తుంది హీర్. ఆ వీరవనితను గుర్తుకు తెచ్చేలా తన ఆర్కైవ్కు ‘ది లాస్ట్ హీర్’ అని పేరు పెట్టాడు హర్లిన్ సింగ్.వెలుగులోకి...1936లోనే పైలట్ లైసెన్స్ పొందిన మొట్ట మొదటి పంజాబీ మహిళ సర్లా థక్రాల్. ఎప్పుడూ వినని ఇలాంటి అరుదైన మహిళల గురించి సమాచారాన్ని సేకరించి ‘ది లాస్ట్ హీర్ ప్రాజెక్ట్: విమెన్ ఇన్ కలోనియల్ పంజాబ్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చాడు హర్లిన్సింగ్. ప్రసిద్ధ పెంగ్విన్ సంస్థ ద్వారా ఈ పుస్తకాన్ని విడుదల చేశాడు.లాహోర్లో నిరసనల హోరుభగత్సింగ్ అరెస్ట్ను నిరసిస్తూ ఆనాటి లాహోర్ రాజకీయ ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఆసియా నలుమూలల నుంచి వచ్చిన మహిళా కార్యకర్తలు, నాయకులతో ఒక సమావేశం ఏర్పాటైంది.ఈ సమావేశంలో పురుషాధిపత్య భావజాలానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ...ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో ఎన్నో ‘ది లాస్ట్ హీర్’ ఆర్కైవ్లో కనిపిస్తాయి.బ్రౌన్ హిస్టరీటొరంటోకు చెందిన ఇంజినీర్ అహ్సున్ జాఫర్ తమ కుటుంబ మూలాలను అన్వేషించే క్రమంలో ఇన్స్టాగ్రామ్లో ‘బ్రౌన్ హిస్టరీ’ పేరుతో పేజీ క్రియేట్ చేశాడు. తన కుటుంబ ఆర్కైవ్గా ప్రారంభమైన ‘బ్రౌన్ హిస్టరీ’ తన పరిధిని విస్తృతం చేసుకొంది. తమ బంధువులకు మాత్రమే కాదు ఎంతో మంది ప్రజలకు ఈ ఆర్కైవ్ చేరువైంది. ‘బ్రౌన్ హిస్టరీ’కి వేలాదిమంది ఫాలోవర్లు ఉన్నారు. ‘మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలనే ఆసక్తితోనే ఈ ఆర్కైవ్ మొదలు పెట్టాను’ అంటున్న జాఫర్ ఒక న్యూస్లెటర్ను నిర్వహిస్తున్నాడు. రచయితలు, మేధావులతో పాడ్కాస్ట్ షోలు చేస్తున్నాడు.ఒక వ్యక్తి తన సొంత చరిత్ర కోసం చేసిన అన్వేషణ, వేలాది మంది వ్యక్తులు తమ సొంత చరిత్రను అన్వేషించుకునే వేదికగా రూపుదిద్దుకుంది.చీరకట్టుతో...బ్రిటిష్ చెస్ పోటీల్లో (1930 ప్రారంభంలో) పాల్గొన్న అతికొద్దిమంది భారతీయ మహిళల్లో పెరిన్ ముర్సా ఒకరు. 1932లో లండన్లో జరిగిన బ్రిటిష్ చెస్ ఛాంపియన్షిప్లో ఆమె చీర కట్టుకొని పోటీలో పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఇది అప్పుడెప్పుడో తీసిన ఫొటో అయినప్పటికీ ఇప్పటికీ చెస్ అభిమానులు, చరిత్రకారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.చెస్ ఆటలో యూరోపియన్లు, పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఆ కాలంలో ప్రతిష్ఠాత్మకమైన ఒక టోర్నమెంట్లో భారతీయ మహిళ పాల్గొనడం అరుదైన విశేషంగా నిలిచింది. విషాదం ఏమిటంటే, ఆమె గురించి పెద్దగా వివరాలు తెలియవు. పెరిన్ ముర్సా ఏ ప్రాంతానికి చెందిన వారు, ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి? ఈ టోర్నమెంట్ తరువాత కూడా చెస్ ఆడడం కొనసాగించారా లేదా... మొదలైన వివరాలు తెలియవు. అయితే ఈ ఆర్కైవ్కు ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తుంటుంది కాబట్టి ఏదో ఒకరోజు ఆమె గురించి చాలా సమాచారం తెలిసే అవకాశం ఉంది. మనం ఎప్పుడూ వినని పెరిన్ ముర్సాలాంటి ఎంతోమంది ప్రతిభావంతులు ‘బ్రౌన్ హిస్టరీ’లో కనిపిస్తారు.వస్తువుల్లో చరిత్ర!‘చరిత్ర అనేది మాటల్లో మాత్రమే జీవించదు. కొన్నిసార్లు అది ఒక వస్తువు రూపంలో, మసకబారిన ఛాయాచిత్రంలో కూడా జీవించవచ్చు. వస్తువులు, ఫొటోలు వాటి సొంతదారుల కంటే ఎక్కువ కాలం జీవించి చారిత్రక ఆనవాళ్లుగా మిగిలిపోతాయి’... ఈ మాటలే ‘మ్యూజియం ఆఫ్ మెటీరియల్ మెమొరీ’ ఆవిర్భావానికి కారణం అయ్యాయి. వారసత్వ సంపద, కుటుంబ చరిత్రలను అన్వేషించడానికి ప్రజల సహకారంతో ఆంచల్ మల్హోత్రా, నవధా మల్హోత్రా డిజిటల్ ఆర్కైవ్ ‘మ్యూజియం ఆఫ్ మెటీరియల్ మెమొరీ’ని ప్రారంభించారు. వివిధ కుటుంబాలకు సంబంధించిన వస్తువులతో ముడిపడిన జ్ఞాపకాలను వారి మాటల్లో రాసుకునే అవకాశం కల్పిస్తోంది ఈ ఆర్కైవ్.....ఈ స్టోరీ చదివిన తరువాత మీకు కూడా సరికొత్త ఆర్కైవ్ ఆలోచన వస్తే సంతోషమే కదా! -
మోదీ ప్రసంగం.. దద్దరిల్లిన ఎర్రకోట
-
స్వాతంత్ర్య వేడుకలకు రెండోసారి రాహుల్ డుమ్మా.. కారణం అదేనా?
ఢిల్లీ: ఎర్రకోటలో జరుగుతున్న 80 వ స్వాతంత్ర్య వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం గైర్హాజరైంది.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వరుసగా రెండో ఏడాది ఎర్రకోటలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకాలేదు. 2024లో ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై వివాదం చెలరేగింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా, కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ.. కార్యక్రమంలో రెండో చివరి వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. ఇది అప్పట్లో సంప్రదాయం, ప్రొటోకాల్కు భిన్నంగా ఉందంటూ చర్చకు దారితీసింది.రాహుల్ గాంధీకి వెనుక వరుసలో సీటు కేటాయించడం కాంగ్రెస్ ఎంపీని మాత్రమే కాకుండా ప్రజలను అవమానించడమేనని ప్రతిపక్షం విమర్శించింది. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఒలింపియన్లకు వేదికపై చోటు కల్పించాల్సి రావడంతో సీట్ల కేటాయింపులో మార్పులు చేసినట్లు వివరణ ఇచ్చింది.ప్రొటోకాల్ ప్రకారం అధికారిక, ఆచారబద్ధమైన కార్యక్రమాల్లో లోక్సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది కూడా ఖర్గే, రాహుల్ గాంధీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గైర్హాజరు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ గైర్హాజరుపై ఎటువంటి ప్రకటన చేయలేదు.కాగా దేశవ్యాప్తంగాభారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ‘వందే మాతరం’ 150 ఏళ్ల వార్షికోత్సవం, అలాగే ‘యువ శక్తి–వికసిత్ భారత్@2047’ ప్రధాన అంశాలుగా వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటలో వేడుకలకు సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నట్లు సమాచారం. -
80 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా.. ఎర్రకోటపై సరికొత్త చరిత్ర
ఢిల్లీ: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలోని ఎర్రకోటపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా జాతీయ గేయం ‘వందే మాతరం’ను పూర్తిస్థాయిలో ఆలపించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. ఈ ఏడాది ‘వందే మాతరం’ 150 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వందేమాతరంపై ప్రత్యేక చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే.ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘వందే మాతరం’కు అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించే మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న (శుక్రవారం) స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ముందు, ముగింపులోనూ ‘వందే మాతరాన్ని గేయాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వదేశీ ఉద్యమ కాలంలో ‘వందే మాతరం’ ప్రజల గీతంగా మారిందని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ‘వందే మాతరం’ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులను ఏకం చేసిన ప్రధాన దేశభక్తి గీతాల్లో దీని ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దేశభక్తి, మాతృభూమిపై గౌరవం, స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా ఈ గీతం ప్రజల్లో విశేష ఆదరణ పొందింది. 2026లో 150 ఏళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో దీని చారిత్రక ప్రాధాన్యాన్ని దేశవ్యాప్తంగా గుర్తుచేస్తున్నారు. ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ‘వందే మాతరం’కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. -
సమయం.. అవసరం.. సంకల్పం మనది: ఎర్రకోటపై ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: మన దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని.. ఆ అభివృద్ధిని ఆపడం ఎవరి వల్ల కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రక ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఎగరేసిన అనంతరం.. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది వేడుకల్లో ‘వందేమాతరం’ 150 ఏళ్ల వారసత్వం, ‘యువశక్తి–వికసిత్ భారత్ 2047’ అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ప్రధాని.. వారి కలలు, ఆశయాల స్ఫూర్తితో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఇవాళ ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని.. ప్రతీ భారతీయుడి గుండెలో వందేమాతరం ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు. దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని, పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘‘సమయం.. అవసరం.. సంకల్పం మనది. సామర్థ్యం పెంచుకుని విజయం సాధిద్దాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.వికసిత్ భారత్ కోసం సప్తధార ప్రణాళికతయారీ శక్తిఫుడ్ ప్రొడక్షన్టెక్నాలజీగతిశక్తిరక్షణ రంగంగ్రీన్ ఎకానమీ.. బ్లూ ఎకానమీయువశక్తి25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారుతమ హయాంలో దేశ వికాసం కోసం కృషి చేశామని.. వివిధ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందినట్లు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడి తమ జీవితాలను మెరుగుపర్చుకున్నారని ప్రధాని తెలిపారు. రక్షణ ఉత్పత్తులు పెరిగాయని, అనేక రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కరోనా నుంచి యుద్ధాల వరకు సవాళ్లు ఎదుర్కొన్నాంగత 12 ఏళ్లలో భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని ప్రధాని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల మధ్య కూడా దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగిందన్నారు. యూపీఏ హయాంలో ప్రజలు భయాందోళనతో గడిపారని.. ఆ తర్వాత కూడా ప్రజల్ని భయపెట్టడమే పనిగా కొందరు పెట్టుకున్నారని అన్నారు. యుద్ధాలతో పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్లు దొరకవని జనాలకు భయపెట్టారని.. కానీ, అడ్డంకులు అధిగమించామని ప్రధాని అన్నారు. దేశ ప్రగతిని ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు.సంస్కరణలు మరింత వేగంగా..ఇక ఆగేదే లేదని.. తగ్గేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశాభివృద్ధికి ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేస్తామని ప్రధాని తెలిపారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతిక రంగంలో ముందంజ వేయడమే లక్ష్యమన్నారు. రైల్వే విద్యుద్దీకరణ, మెట్రో విస్తరణ, హైడ్రోజన్ రైలు, సెమీకండక్టర్ రంగం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇంధన భద్రతను అత్యవసర అంశంగా పరిగణించి.. దాని కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించాలని అభిప్రాయపడ్డారు.ఆత్మనిర్భర్ భారత్.. మేడిన్ ఇండియానే లక్ష్యంభారత్ స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో భారత్ ప్రపంచానికి కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ‘‘మన ఉత్పత్తుల ఆధారంగానే ప్రపంచంలో మనకు గుర్తింపు రావాలి. ప్రతి మార్కెట్కు భారత ఉత్పత్తులు చేరాలి’’ అని అన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భారత కంపెనీల సంఖ్య పెరగాలని, ప్రపంచ స్థాయి ఫార్మా సంస్థలు భారత్ నుంచి రావాలని లక్ష్యాలను వివరించారు.ఉగ్రవాదం, నక్సలిజంపై పోరాటం కొనసాగుతుందిదేశ భద్రతపై మాట్లాడుతూ.. సరిహద్దుల అవతల, ఇవతల భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం అనేక కుటుంబాలను నాశనం చేసిందని, నక్సలిజం వల్ల కూడా ఎంతో నష్టం జరిగిందని పేర్కొన్నారు. దేశాన్ని మావోయిజం నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.యువత తోడుంటేనే..దేశం ముందున్న అతిపెద్ద లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని స్పష్టం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలబెట్టాలంటే యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. యువతే దేశానికి వెన్నెముక అని పేర్కొన్న ప్రధాని.. ఏఐ, సాంకేతికత, క్రీడలు, ఆవిష్కరణల రంగాల్లో యువత సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువశక్తితోనే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందని చెప్పారు. అందుకోసం యువత తనకు మద్దతు నిలవాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనే మాటే వినిపించడం లేదని.. ప్రతీ దేశం దాని సంక్షోభాల మీదే దృష్టిసారిస్తున్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో భారత్ గ్లోబల్ లీడర్షిప్, సప్లై చైన్గా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తే ప్రపంచం మనవైపు చూస్తుందని అన్నారాయన. మహిళా బిల్లుకు ముందుకు రండిమహిళా సాధికారతపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వారి హక్కు అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాజకీయాలను పక్కన పెట్టి మహిళల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే క్రెడిట్ వారే తీసుకోవాలంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను ‘లక్పతి దీదీ’లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.తొలిసారి ఎర్రకోటపై వందేమాతరంఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ప్రత్యేకంగా నిలిచింది. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ తొలిసారి ఎర్రకోట అధికారిక కార్యక్రమంలో ఆలపించారు. ప్రతి భారతీయుడి హృదయం వందేమాతరం నినాదంతో మారుమోగుతోందని ప్రధాని అన్నారు. వేడుకలు ఇలా.. స్వాతంత్య్ర వేడుకలకు ముందు ప్రధాని మోదీ రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం 21 గన్ సెల్యూట్, సైనిక గౌరవ కార్యక్రమాలు జరిగాయి. ఎర్రకోట ప్రాంగణంలో పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత, మహిళలు, స్వయం సమృద్ధి, ఆవిష్కరణలే కీలకమని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా దేశానికి సందేశం ఇచ్చారు. -
సమస్యలపై మాట్లాడితే సస్పెన్షన్ వేటు
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల విశాల ప్రయోజనాలను కాపాడటం కోసం గొంతెత్తడం వారి తప్పయ్యింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను మినహాయించాలని కోరడం వారి నేరమైంది. డీఎస్సీ అక్రమాలపై ఇప్పటికే వణికిపోతున్న చంద్రబాబు సర్కారు అన్యాయంగా ముగ్గురు ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. టెట్ సమస్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సీకే వెంకటనాథరెడ్డి (ఏపీవైఎస్ఆర్టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్), ఎస్.అమరనాథ్ (ఏపీవైఎస్ఆర్టీఏ కడప జిల్లా అధ్యక్షుడు), ఎన్.సంగమేశ్వర్ (ఎస్టీయూ కడప జిల్లా అధ్యక్షుడు, ఫ్యాప్టో కడప జిల్లా అధ్యక్షుడు)లపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారని, దానిపై ఫిర్యాదు చేసేందుకే ఢిల్లీకి వెళ్లారనే నెపంతో జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా ఈ ముగ్గురిపై శుక్రవారం సస్పెన్షన్ వేటు వేయించింది. దీంతో విద్యాశాఖ మంత్రి లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని టీచర్లపై కూడా ప్రయోగిస్తున్నారని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. వెళ్లింది ‘టెట్’ కోసం మాత్రమే..ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష ఉత్తీర్ణత కావడం తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఈ ముగ్గురు ఉపాధ్యాయులు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రికి వీరు డీఎస్సీ అక్రమాలపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అదేదో పెద్ద నేరం, ఘోరంలా భావించిన చంద్రబాబు ప్రభుత్వం టెట్ అంశాన్ని దాచిపెట్టి, డీఎస్సీని తెరపైకి తెచ్చింది. పెండ్లిమర్రి మండలం ఎంపీపీఎస్ భారతి (వెంపల్లె)లో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎన్. సంగమేశ్వరరెడ్డి, వేంపల్లి మండలం రాజీవ్నగర్ ఎంపీపీఎస్లో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్.అమరనాథరెడ్డి, పులివెందుల మండలం అహోబిలాపురం ఎంపీపీఎస్లో ఎస్జీటీగా పనిచేస్తున్న సి. వెంకటనాథరెడ్డిలను సస్పెండ్ చేసింది. ఈ ముగ్గురు డీఎస్సీ నియామకాలపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన ప్రతినిధి బృందంలో ఉన్నారని కడప జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే వాట్సాప్లో వచ్చిన సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకోవడం విస్తుగొలుపుతోంది. కాగా, 20–30 ఏళ్లుగా పని చేస్తున్న టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడంపై ఇటీవల ఉపాధ్యాయులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను కలవడం.. ఓ వైపు న్యాయ పోరాటం చేసూ్తనే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన వారికి భరోసా ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీలు, ఎమ్మెల్సీలు కేంద్ర మంత్రిని కలిశారు. ఇదిలా ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. -
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ : ఖలిస్తాన్ బెదిరింపుల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీ 80వస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఢిల్లీలోని ప్రధాన ప్రదేశాలకు బాంబు బెదరింపు కలకలం రేపింది. శుక్రవారం నాడు ఢిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా అనేక ఇతర ప్రదేశాలకు ఖలిస్తాన్ పేరుతో బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఢిల్లీని ఖలిస్తాన్గా మారుస్తామని ఆ బెదిరింపు ఇమెయిల్లో పేర్కొన్నారు.సిక్కుల కోసం ఖలిస్తాన్ అనే పేరుతో ఒక స్వతంత్ర సార్వభౌమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకునే వేర్పాటువాద ఉద్యమ ఖలిస్తాన్ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారని ఆ ఇమెయిల్లో పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 2:11 గంటలకు ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుతుంది, ఆ తర్వాత గంటకే జిల్లా కోర్టులలో పేలుళ్లు జరుగుతాయి. ఢిల్లీ కోర్టులు సిక్కులకు వ్యతిరేకంగా ఉన్న కేసులను మాత్రమే వింటాయంటా విమర్శలు గుప్పించడం గమనార్హం. జామ్నగర్ హౌస్, ఝండేవలన్ భవనం, సాకేత్ కార్యాలయం, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) టెర్మినల్ 3, ఢిల్లీ కంటోన్మెంట్లోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) కార్యాలయంతో సహా మరో ఆరు ప్రదేశాలకు కూడా బెదిరింపులొచ్చినట్టు సమాచారం. ఢిల్లీ మెట్రో, అంబాలా వెళ్లే రైళ్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారును భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రాంతాలకు అగ్నిమాపక వాహనాలను పంపారు. అయితే ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇదీ చదవండి: 12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్ -
సీజేపీకి బార్ కౌన్సిల్ చైర్మన్ చురక!
నల్సర్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ వివాదంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెనకడుగు వేసినా.. వేడి ఇప్పుట్లో చల్లారేలా కనిపించడం లేదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ మిశ్రా రాజీనామాకు కాక్రోచ్ జనతా పార్టీ పట్టబడుతోంది. అవసరమైతే ధర్నాలకు దిగుతామని హెచ్చరిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై, సీజేపీ ఆరోపణలపై మనన్ మిశ్రా కాస్త భిన్నంగా స్పందించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు చేసిన వాళ్లకు ఆయన సమాధానం ఇచ్చారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ విషయంలో తమ లక్ష్యం కూడా అదే అని స్పష్టం చేశారు. ‘‘అభిజీత్ దీప్కే అయినా, సౌరవ్ దాస్ అయినా.. వారికి చెప్పదలచుకున్నది ఒక్కటే. విద్యార్థుల హక్కులను కాపాడటమే మా ఉద్దేశం. ఈ విషయంలో మా ప్రయోజనాలు, వారి లక్ష్యం ఒకటే’’ అని మనన్ మిశ్రా తెలిపారు.వివాదానికి కారణం ఇదేహైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యే ప్రతిపాదనపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం నేపథ్యంలో బీసీఐ.. 2026లో నాల్సార్ నుంచి న్యాయ విద్య పూర్తి చేసే విద్యార్థుల ఎన్రోల్మెంట్పై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు విద్యార్థుల చర్యలకు మొత్తం బ్యాచ్ను బాధ్యులను చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.‘‘తొందరపాటులో నిర్ణయం తీసుకున్నాం’’తొలుత ఇచ్చిన ఆదేశాలపై మనన్ మిశ్రా వివరణ ఇచ్చారు. విద్యార్థులకు నష్టం కలిగించాలనే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదన్నారు. ‘‘ఆ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నదే. విషయం కౌన్సిల్ దృష్టికి వచ్చిన వెంటనే నిలిపివేశాం. సీనియర్ సభ్యులతో చర్చించిన తర్వాత పూర్తిగా ఉపసంహరించుకున్నాం. దీనిపై ఎలాంటి విచారణ అవసరం లేదు’’ అని తెలిపారు.‘‘బీసీఐకి, సీజేపీకి ఘర్షణ లేదు’’విద్యార్థుల ప్రయోజనాల విషయంలో బీసీఐ, సీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మనన్ మిశ్రా స్పష్టం చేశారు. ‘‘ఎవరైనా అపార్థంలో ఉంటే స్పష్టం చేయాలనుకుంటున్నాను. దేశ యువత ప్రయోజనాలను కాపాడటం మనందరి బాధ్యత. అభిజీత్ దీప్కే కోరేది కూడా అదే.. మేము కోరేది కూడా అదే. కాబట్టి ఎలాంటి ఘర్షణ లేదు’’ అని పేర్కొన్నారు.రూ.14 కోట్ల ఆరోపణలపై స్పందనబీసీఐ సమావేశాలు, సదస్సుల కోసం రూ.14 కోట్లు ఖర్చు చేసిందన్న సౌరవ్ దాస్ ఆరోపణలపైనా మనన్ మిశ్రా స్పందించారు. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని, అలాంటి భారీ ఖర్చులు ఏవీ జరగలేదని చెప్పారు. బీసీఐ వివిధ అంశాలపై సెమినార్లు నిర్వహిస్తుందని, వాటిని రూ.14 కోట్ల వ్యయంతో నిర్వహించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.సీజేపీ మాత్రం విజయంగా..బీసీఐ ఆదేశాల ఉపసంహరణను సీజేపీ నేతలు తమ విజయంగా అభివర్ణించారు. సౌరవ్ దాస్ సోషల్ మీడియాలో ‘‘ఇట్స్ డన్ బ్రో’’ అంటూ స్పందించారు. గతంలో తమ ఉద్యమ సమయంలో వైరల్గా మారిన నినాదాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. అయితే మనన్ మిశ్రా రాజీనామా కోసం ఉద్యమిస్తామని ప్రకటించారు.సుప్రీం నోటీసులుఇదిలా ఉంటే.. ఇది పూర్తిగా సీజేఐకి, విద్యార్థులకు సంబంధించిన అంశమని సుప్రీం కోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్.. విద్యార్థులు తప్పు చేసినా, నిరసన తెలిపే హక్కు వాళ్లకు ఉంటుందని చెప్పింది. బార్ కౌన్సిల్ జోక్యం అనవసరమని వ్యాఖ్యానించింది. అసలు అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ బీసీఐకు నోటీసులు పంపింది. మరోవైపు.. నిరసన తెలిపిన విద్యార్థులను విచారించాలంటూ గత ఆదేశాల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించడంపైనా నల్సార్ స్పందించింది. అది తమకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. -
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు తరలించారు. వైద్యులు ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో భాగంగా కరోనరీ యాంజియోగ్రఫీ పరీక్ష కూడా చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఎయిమ్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జేపీ నడ్డాకు ఆగస్టు 13న(గురువారం) అస్వస్థత కారణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు కరోనరీ యాంజియోగ్రఫీతో పాటు పలు పరీక్షలు చేపట్టారు.కార్డియాలజీ విభాగంలో పరిశీలనప్రస్తుతం జేపీ నడ్డా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. “జేపీ నడ్డాకు అసౌకర్యంగా అనిపించడంతో పరీక్షలు నిర్వహించాం. కరోనరీ యాంజియోగ్రఫీ సహా పలు పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కార్డియాలజీ విభాగంలో పరిశీలనలో ఉన్నారు” అని ఎయిమ్స్ తన ప్రకటనలో వెల్లడించింది.ఇంకా వైద్యుల పర్యవేక్షణలో..నడ్డా ఆరోగ్య పరిస్థితిపై అధికారిక వర్గాలు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నాయి. వైద్యుల సూచనల మేరకు ఆయనకు చికిత్స, పర్యవేక్షణ కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా గతంలో బాధ్యతలు నిర్వహించిన నడ్డా(65).. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన.. అటు జంతర్ మంతర్ నిరసనల సమయంలో సీజేపీ ప్రతినిధులతోనూ కేంద్రం తరఫున చర్చల్లో పాల్గొన్నారు. బీజేపీ శ్రేణులు, అభిమానులు నడ్డా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. -
ఆగస్టు 15.. ఢిల్లీలో హైఅలర్ట్
సాక్షి, ఢిల్లీ: రేపు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట చుట్టూ బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎర్రకోట చూట్టూ వెయ్యి కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోకి వచ్చే వాహనాలన్నిటినీ తనిఖీ చేపడుతున్నారు.భారత్ రేపు తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. రేపు ఆగస్టు 15 సందర్భంగా ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తారు. మన జాతీయ గేయం 'వందేమాతరం' రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య దినోత్సవ చరిత్రలోనే మొదటిసారిగా ఎర్రకోటపై వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు.ఎర్రకోట నుండి ప్రధాని చేసే ప్రసంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత 'భాషిణి' అనువాదకం ద్వారా దేశంలోని 22 అధికారిక భాషల్లోకి ఒకే సమయంలో అనువదించి ప్రసారం చేస్తారు. దీనివల్ల ఎవరి మాతృభాషలో వారు ప్రసంగాన్ని స్పష్టంగా వినవచ్చు. -
‘ఆపండి.. ప్లీజ్’.. క్షణక్షణానికీ పెరిగిన భయం.. ర్యాపిడో బైక్ నుంచి దూకిన యువతి
ఆఫీసుకు వెళ్లేందుకు బుక్ చేసుకున్న ర్యాపిడో బైక్.. కొద్దిసేపటికే ఆమెకు భయానక ప్రయాణంగా మారింది. తెలిసిన రోడ్డు కాస్తా నిర్మానుష్యమైన మార్గంగా మారింది. గమ్యం వైపు వెళ్తున్నామా.. లేక ఎక్కడికో తీసుకెళ్తున్నారా అన్న అనుమానం మొదలైంది. ‘బైక్ ఆపండి.. మరో రూట్లో వెళ్లండి’ అంటూ ఆమె ఎంత చెప్పినా డ్రైవర్ ఆపలేదని బాధితురాలు ఆరోపించారు. చివరకు ప్రాణాలపై భయంతో కదులుతున్న బైక్ నుంచే దూకేశారు. అనంతరం, ఓ వీడియో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది.వీడియో ప్రకారం.. బాధితురాలు ఆయేషా శ్రీవాస్తవ ఆఫీసుకు వెళ్లేందుకు ర్యాపిడో బైక్ను బుక్ చేసుకున్నారు. తొలుత ప్రయాణం సాధారణంగానే సాగింది. కానీ కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ తాను గుర్తించలేని, నిర్మానుష్యంగా కనిపించే మరో మార్గంలోకి బైక్ను మళ్లించడంతో ఆమెకు అనుమానం వచ్చింది. చుట్టూ చూస్తే పెద్దగా జనసంచారం కనిపించకపోవడంతో భయపడినట్లు ఆమె తెలిపారు. డ్రైవర్ను ప్రశ్నించగా.. అది విశ్వవిద్యాలయానికి వెళ్లే నేరుగా ఉన్న దారేనని చెప్పినట్లు ఆయేషా పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమెకు నమ్మకం కలగలేదు. మరో మార్గంలో వెళ్లాలని, లేదంటే బైక్ను ఆపాలని పలుమార్లు కోరినప్పటికీ డ్రైవర్ స్పందించలేదని ఆరోపించారు.Gig worker shcoker: A Terrifying Ride: Demand for Accountability In Delhi Ayesha Srivastav had to jump off a moving Rapido bike. The driver ignored her requests, took an isolated route and refused to stop. She suffered injuries from the jump.Shockingly Rapido took action… pic.twitter.com/J463SCdg0B— Ramesh Tiwari (@rameshofficial0) August 12, 2026పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన ఆమె.. డ్రైవర్ను ఆపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. దీంతో తన భద్రతపై తీవ్ర భయానికి గురై.. చివరకు కదులుతున్న బైక్ నుంచి దూకేశారు. రోడ్డుపై పడిపోవడంతో ఆయేషా చేతులు, కాళ్లు, తలకు గాయాలయ్యాయి. వైద్య చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ ఘటన తర్వాత కూడా తనకు సరైన స్పందన లభించలేదని ఆమె ఆరోపించారు. ర్యాపిడో కస్టమర్ సపోర్ట్ను సంప్రదించినా సకాలంలో స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాను ఆశ్రయించారు. View this post on Instagram A post shared by ✩⋆ 🖤 𝒜𝓎𝑒𝓈𝒽𝒶 𝓈𝓇𝒾𝓋𝒶𝓈𝓉𝒶𝓋 🖤 ⋆✩ (@ayesha_srivastav96) ‘వేలాది మంది మహిళలు ప్రతిరోజూ ర్యాపిడోలో ప్రయాణిస్తున్నారు. మహిళల భద్రత విషయంలో మీరు ఏం చేస్తున్నారు? డ్రైవర్ వివరాలు ఇవ్వండి. అతడిపై చర్యలు తీసుకోండి’ అంటూ ఆమె సంస్థను ప్రశ్నించారు. ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ర్యాపిడో స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపిన సంస్థ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్ను తమ ప్లాట్ఫామ్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. డ్రైవర్ వివరాలను ఆయేషాకు అందజేసినట్లు, అవసరమైన న్యాయపరమైన చర్యల్లో ఆమెకు సహకరిస్తామని తెలిపింది. వైద్య లేదా చట్టపరమైన సహాయం అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. -
పార్లమెంట్ ఫైనల్ షో.. చర్చా? చిచ్చా?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నా.. అధికార, విపక్షాల మధ్య నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి నుంచి.. నిన్నటి వరకు ఉభయ సభల్లో వాయిదాల పర్వమే కొనసాగింది. 18 రోజుల పాటు విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు.. మరోవైపు సభలను నడిపేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు.. వెరసి పార్లమెంట్ వేదికగా రాజకీయ వేడి కొనసాగింది.లోక్సభ, రాజ్యసభల కార్యకలాపాల సమయం కంటే వాయిదాలు, నిరసనలకే ఎక్కువ సమయం పోయింది. చివరి దశలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ఆసక్తి రేపినా.. ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. నిరసనల మధ్యే పలు కీలక బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందగా.. సభ వెలుపల కూడా అధికార, విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఇక వర్షాకాల సమావేశాల ఇవాళ చివరి రోజు కూడా అదే ఉత్కంఠ కొనసాగుతోంది. చర్చకు ప్రభుత్వం సిద్ధమంటోంది.. బాధ్యతపై నేరుగా సమాధానం కావాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ ఫైనల్ షోలో చర్చకు తెరలేస్తుందా?.. లేక మరోసారి చిచ్చు రగులుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.చర్చకు సిద్ధం: అమిత్ షావిద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ఏ అంశాన్నైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తానేం పారిపోలేదని.. రోజూ పార్లమెంట్కు వచ్చి తన ఛాంబర్లోనే కూర్చుకుంటున్నానని.. ఉద్దేశపూర్వకంగా విపక్షాలు సభల్ని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు సుదీర్ఘ చర్చ కొనసాగించేందుకు సిద్ధమని స్పీకర్కు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని.. ప్రభుత్వానికి దాచాల్సింది ఏమీ లేదని అమిత్ షా స్పష్టం చేశారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని తెలిపారు. అయితే అమిత్ షా ప్రతిపాదనకు విపక్షాలు అంగీకరించలేదు. చర్చకు ముందు బాధ్యతపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.‘ఆదేశాలు ఎవరివి?’.. రాహుల్ ప్రశ్నఇన్నాళ్లు సభకు రాకుండా భయపడి.. ఇప్పుడు అభూత కల్పన కథలు చెబితే వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్, బలప్రయోగానికి ఆదేశాలు ఎవరు ఇచ్చారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదేశాలు ఇచ్చింది అమిత్ షా అయితే రాజీనామా చేయాలన్నారు. ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ హోంశాఖ పరిధిలోనే ఉంటాయని గుర్తుచేస్తూ.. ఈ అంశంపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని ఆయన అన్నారు.తప్పించుకుంటోంది ఎవరు?విపక్షాల తీరును ప్రభుత్వం తప్పుబట్టింది. చర్చకు డిమాండ్ చేసిన వారే ఇప్పుడు చర్చకు రావడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. హోంమంత్రి స్వయంగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. నినాదాలు, ఆందోళనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. అయితే.. హోం మంత్రి ఇన్నాళ్లపాటు సభకు వచ్చేందుకు భయపడ్డారని.. ఆయన ఇప్పుడు ఇచ్చే సమాధానం ఎవరికి కావాలని, విద్యార్థులపై పోలీసు చర్యలకు ఆదేశాలిచ్చింది ఆయనో కాదో తేల్చాలని, కారకుడు ఆయనే గనుక అయితే రాజీనామా చేయాలని విపక్షాలు మండిపడుతున్నాయి.విద్యార్థుల ఆందోళనలే ప్రధాన అజెండానీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై పోలీసుల చర్యలే ఈ సమావేశాల్లో ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వినియోగంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి.అయితే.. మొత్తం సమావేశాల్లో ఒకే అంశంపై సభ సజావుగా సాగింది. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన పరీక్షా సవరణ బిల్లుపై జరిగిన చర్చ ప్రశాంతంగా జరిగింది. ఈ బిల్లుపై అధికార, విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించగా.. ఎలాంటి తీవ్ర అంతరాయం లేకుండా సభ కార్యకలాపాలు కొనసాగాయి. ఆ తర్వాత మాత్రం మళ్లీ విద్యార్థుల ఆందోళనలు-పోలీసుల చర్యల అంశంపై రాజకీయ రగడ కొనసాగింది.నిరసనల మధ్య కీలక బిల్లులుపార్లమెంట్లో రాజకీయ రగడ కొనసాగినప్పటికీ.. శాసనపరమైన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోలేదు. అధికార, విపక్షాల నినాదాల మధ్యే పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది.వందేమాతరం గౌరవం, జాతీయ చిహ్నాల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసే సవరణలకు ఆమోదం లభించింది. వందేమాతరం అవమానాన్ని కూడా నేరంగా పరిగణించేలా చట్టంలో మార్పులు చేశారు.విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. విదేశీ నిధులపై పర్యవేక్షణ, నిబంధనల కఠినతరం ఈ బిల్లులో ప్రధాన అంశాలు.మరోవైపు కేరళ రాష్ట్ర పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అలాగే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది.చివరి రోజైనా తెరపడేనా?వర్షాకాల సమావేశాల చివరి రోజు ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతుండగా.. విపక్షాలు మాత్రం బాధ్యతపై స్పష్టమైన సమాధానం కోసం పట్టుబడుతున్నాయి. 18 రోజులుగా సాగుతున్న పార్లమెంట్ పోరుకు చివరి రోజు అయినా ముగింపు లభిస్తుందా?.. లేదంటే ఫైనల్ షో కూడా మరో రాజకీయ చిచ్చుతోనే ముగుస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
మోదీని ఆటపట్టించిన ఖర్గే.. సరదా సన్నివేశం
ఢిల్లీ: ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతల మధ్య ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ వేదిక వద్దకు రాగానే అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తదితరులు నిలబడి ఉన్నారు. ప్రధాని మోదీ మొదట రాహుల్ గాంధీకి కరచాలనం చేశారు.ఆ తర్వాత ప్రధాని మోదీ నమస్కరిస్తూ ప్రియాంకా గాంధీ వైపు దృష్టి సారించారు. ప్రియాంకా జీ ఎలా ఉన్నారంటూ ప్రధాని పలకరించారు. ‘‘నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?" అంటూ ప్రియాంక బదులిచ్చారు. ‘‘నేను అలాగే ఉన్నాను’’ అని ప్రధాని నవ్వుతూ ముందుకు నడిచారు. ఈ సంభాషణను గమనిస్తున్న మల్లికార్జున ఖర్గే వెంటనే జోక్యం చేసుకున్నారు. ‘‘అలా ఏమీ లేరు.. కాస్త మారారు’’ అని ఖర్గే చమత్కరించారు. ‘‘అవునా’’ అంటూ నవ్వుతూ ప్రధాని మోదీ.. ఖర్గే చేతిపై తట్టారు. చిరునవ్వుల మధ్య ఇద్దరు నేతలు ఒకరికొకరు హై-ఫైవ్ ఇచ్చుకున్నారు.ఢిల్లీలో సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే, నాగ్పూర్కు చెందిన పారిశ్రామికవేత్త సారంఘ్ లఖానీల వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ జంట జూన్లో ముంబైలో వివాహం చేసుకోగా.. ఢిల్లీలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్ జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, గజేంద్ర సింగ్ షెకావత్, రాందాస్ అథవాలే, చిరాగ్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు.मौका और दस्तूर यही होता है सुप्रिया सुले की बेटी के विवाह समारोह कार्यक्रम में कांग्रेस के वरिष्ठ नेता मल्लिकार्जुन खड़गे जी ने मोदी जी के मजे ले लिए।खड़गे जी - भाई साहब थोड़ा सा बदल गए हैं।नरेंद्र मोदी जी - अच्छाखड़गे जी ने अपने दिल की बात कह दी जो सदन में कहते नहीं बनता था। pic.twitter.com/dDgzLbWO3V— Krishnadev Yadav (@krishna_news) August 12, 2026 -
అందుకే నేను ఝార్ఖండ్ ఆందోళనలకు వెళ్లట్లేదు: దీప్కే
న్యూఢిల్లీ: సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేపర్ లీకులకు వ్యతిరేకంగా పోరాడి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన విషయం తెలిసిందే. అయితే, ఝార్ఖండ్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమంలో మాత్రం పాల్గొనడం లేదు. దీనిపై మీడియా ఆయనను ప్రశ్నించింది. ‘‘మీరు ఇప్పుడు ఝార్ఖండ్కు ఎందుకు వెళ్లడం లేదు?’’ అన్న ప్రశ్నకు దీప్కే స్పందిస్తూ.. ‘‘ఎందుకు సర్? నా బృందం ఇప్పటికే వెళ్లింది’’ అని సమాధానమిచ్చారు.‘‘కానీ మీరు ఎప్పుడు వెళ్తారు? మీరే ఎందుకు వెళ్లడం లేదు?’’ అని మీడియా మళ్లీ ప్రశ్నించింది. దీప్కే స్పందిస్తూ.. ‘‘దృష్టి అంతా దేవేంద్ర మహతోపైనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆయనే నిరసనకు నాయకత్వం వహిస్తున్నారు. నా గురించి నేను ప్రచారం చేసుకోవాలని అనుకోవడం లేదు’’ అని తెలిపారు.కాగా, రాంచీ ఉద్యమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ జరుగుతున్న నిరసనల మధ్య దీప్కే ఇటీవల విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మాహ్తోతో వీడియో కాల్లో మాట్లాడారు. రాంచీలో జరుగుతున్న ఉద్యమానికి సీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని దీప్కే తెలిపారు. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), ఝార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (జేఎస్ఎస్సీ) నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు రాంచీలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టగా, భారీగా చేరుకున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, వాటర్ కానన్లు వినియోగించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ గత 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్ర మాహ్తో కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయనను రాంచీ సదర్ ఆసుపత్రికి తరలించారు. -
అప్పుడు పావురాల రెట్టలు.. ఇప్పుడిలా!.. నాకేం అర్థం కావట్లేదు!
సుదీర్ఘ విరామం తర్వాత భారత్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్నకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు పదిహేడేళ్ల తర్వాత తొలిసారి న్యూఢిల్లీ వేదికగా ఈ మెగా టోర్నీని నిర్వహించనున్నారు. ఇందుకు ఆగష్టు 17- 23 మధ్య షెడ్యూల్ ఖరారైంది. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ను నిర్వహించనుండగా.. కోతుల బెడద సమస్యగా మారింది.కొండముచ్చుల మాదిరిఈ నేపథ్యంలో కోతులు స్టేడియంలోకి రాకుండా, వాటిని భయపెట్టేందుకు నిర్వాహకులు వింత పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమయ్యారు. కోతులను తరిమేందుకు కొండముచ్చుల మాదిరి అరుస్తూ, ఈలల వేసేందుకు ముగ్గురు మనుషులను నియమించారు.నాడు పావురాల రెట్టల వల్ల పోయిన పరువు!మరోవైపు.. ఇండియా ఓపెన్ సమయంలో పిట్టల రెట్టల కారణంగా పరిశుభ్రతకు సంబంధించి విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్ సమయంలో పావురాలు రెట్టలు వేశాయనే ఆరోపణలు వచ్చాయి. ఇక డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫీల్డ్ అయితే.. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆడే పరిస్థితులు లేవని.. ప్రాక్టీస్ కోర్టులన్నీ దుమ్మూ ధూళితో నిండిపోయానని మండిపడింది.ఇప్పుడు అదే స్టేడియంలో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ నిర్వహించనుండగా.. మరోసారి పాత సంగతులు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలంపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు ఘాటుగా స్పందించింది.కౌంటర్ ఇచ్చిన పీవీ సింధు‘‘వందకు వంద శాతం. అసలు ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయో నాకైతే నిజంగా అర్థం కావడం లేదు. మన అందరికీ వింబుల్డన్ అంటే ఎంతో ఇష్టం. అక్కడ పావురాలను తరిమేందుకు రఫూస్ను ఉపయోగిస్తారు. చాలా ఏళ్లుగా అక్కడ ఇదే కొనసాగుతోంది.ప్రతీ ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్కు సంబంధించి స్థానికంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ కొండముచ్చుల మాదిరి శబ్దాలు చేయడం అదనంగా తీసుకున్న ఒక చర్య. అంతకుమించి ఎన్నో మంచి సదుపాయాలు, ఏర్పాట్లు చేశారు.భారత ఆతిథ్యం ఎలా ఉండబోతుందో ప్రపంచానికి తెలియబోతోంది. వరల్డ్ చాంపియన్షిప్స్లో వరల్డ్ క్లాస్ ఆతిథ్యం ఉంటుందని నేను వంద శాతం నమ్ముతున్నా’’ అని పీవీ సింధు ఎక్స్ వేదికగా ట్రోల్స్కు కౌంటర్ ఇచ్చింది.వింబుల్డన్లో పావురాలను తరిమేందుకుకాగా ఐకానిక్ ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో 2000 సంవత్సరం నుంచి రఫూస్ (హ్యారిస్ హాక్) అనే పక్షి సేవల్ని వినియోగించుకుంటున్నారు. మ్యాచ్లు మొదలు కావడానికి ముందే ఇది పావురాలు, ఇతర పక్షులను తరిమికొడుతుంది. తద్వారా అంతరాయం లేకుండా మ్యాచ్ల నిర్వహణ సాధ్యమవుతుంది.అయితే, రఫూస్ ఇతర పక్షులపై దాడి చేయదు. వాటిని వెంటాడదు. కానీ దీనిని చూస్తేనే చాలు మిగతా పక్షులు భయంతో అక్కడి నుంచి పారిపోతాయి. చాలా ఏళ్లుగా రఫూస్ వింబుల్డన్లో భాగమైపోయాడు. అభిమానుల ఫేవరెట్ మస్కట్గా మారిపోయాడు. అయితే, 2012లో రఫూస్ను ఎవరో ఎత్తుకెళ్లారు. అదృష్టవశాత్తూ వాడి జాడ దొరకడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: రొనాల్డోకు వేల కోట్ల ఆస్తి.. అతడి భార్య నెట్వర్త్ ఎంతంటే? -
జస్టిస్ వర్మకు షాక్.. ఆ మూడు ఆరోపణలు నిజమే!
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించిన ‘క్యాష్ ఎట్ హోమ్’ కేసులో మూడు ఆరోపణలూ రుజువైనట్లు లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ తేల్చింది. ఆయన అధికారిక నివాసంలోని స్టోర్రూమ్లో భారీగా రూ.500 నోట్ల కట్టలు, నగదు ఉన్నప్పటికీ.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది, అక్కడ ఎందుకు ఉందన్న విషయాలను జస్టిస్ వర్మ సంతృప్తికరంగా వివరించలేకపోయారని కమిటీ పేర్కొంది. అయితే ఆ నగదు వ్యక్తిగతంగా జస్టిస్ వర్మదేనని క్రిమినల్ చట్టపరమైన నిర్ధారణను మాత్రం కమిటీ చెప్పలేదు.నగదుకు సంబంధించిన కీలక ఆధారాలను సరిగా భద్రపరచలేదని కమిటీ పేర్కొంది. 2025 మార్చి 14న ఆయన ఢిల్లీ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగిన అనంతరం స్టోర్రూమ్ను వెంటనే సీల్ చేయకుండా శుభ్రపరిచే పనులు జరిగాయని, అధికారిక తనిఖీ సమయానికి అక్కడున్న నగదు కనిపించకుండా పోయిందని తెలిపింది. దీంతో నగదును స్వాధీనం చేసుకుని లెక్కించలేకపోవడంతో అసలు ఎంత మొత్తం ఉందో కూడా ఖచ్చితంగా నిర్ధారించలేకపోయింది.జస్టిస్ వర్మ ఇచ్చిన వివరణలు తప్పించుకునే ధోరణిలో, అసంపూర్తిగా ఉన్నాయని కమిటీ అభిప్రాయపడింది. స్టోర్రూమ్ తన నియంత్రణలో లేదని, తాను ఘటన జరిగిన సమయంలో అక్కడ లేనని ఆయన వాదించారు. నగదు ఎవరో కావాలనే పెట్టి ఉండొచ్చని, కుట్ర జరిగి ఉండొచ్చని కూడా ఆయన తరఫు వాదనలు వినిపించాయి. అయితే వీటికి మద్దతుగా తగిన సాక్ష్యాలు సమర్పించలేదని కమిటీ పేర్కొంది.ఈ మూడు ఆరోపణలు రుజువైనట్లు కమిటీ నివేదికను బుధవారం లోక్సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టింది. అయితే ఇది క్రిమినల్ కోర్టు ఇచ్చిన నేర నిర్ధారణ లేదా శిక్ష కాదు. ఇదిలా ఉండగా, పార్లమెంట్ ద్వారా తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే జస్టిస్ వర్మ 2026 ఏప్రిల్లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేయడంతో ఆయనపై చేపట్టిన తొలగింపు ప్రక్రియకు ఇక ప్రయోజనం లేకుండా పోయింది.జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 2025 ఆగస్టు 12న ముగ్గురు సభ్యులతో కూడిన జడ్జెస్ ఇన్క్వైరీ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, అప్పటి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ బి.వి. ఆచార్య ఉన్నారు. అయితే విచారణ పూర్తయ్యేలోపు కమిటీలో మార్పు జరిగింది. జస్టిస్ శ్రీవాస్తవ స్థానంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ వచ్చారు.ఈ విచారణ కమిటీ తన నివేదికను 2026 మే 18న తన నివేదికను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ఈ రోజు ఆగస్టు 12నపార్లమెంట్ ఉభయ సభల్లో అధికారికంగా ప్రవేశపెట్టారు. -
నీట్ వ్యవహారం.. సీబీఐ ఛార్జ్షీట్లో మరిన్ని సంచలన విషయాలు
న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం ప్రణాళికాబద్ధంగా చేసిన కుట్ర అని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పేర్కొంది. ఇందులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు చెందిన సబ్జెక్ట్ నిపుణులు, కోచింగ్ నిర్వాహకులు, మధ్యవర్తులు, అభ్యర్థులు ఉన్నారని, అనేక రాష్ట్రాల వారు ఈ నేర కుట్రలో భాగమని తెలిపింది. ఈ కేసులో వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రానికి చెందిన సబ్జెక్ట్ నిపుణులతో పాటు మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొంది.న్యూఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక సీబీఐ కోర్టులో జూలై 28న దాఖలు చేసిన చార్జ్షీట్ ప్రకారం, ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు తమ అధికార హోదాను దుర్వినియోగం చేసి పరీక్షా సామగ్రిని పొందడంతో పాటు భారీ మొత్తంలో డబ్బు తీసుకుని మధ్యవర్తులకు పంపినట్టు సీబీఐ అంటోంది. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), అవినీతి నిరోధక చట్టం, ప్రజా పరీక్షలు (అక్రమ మార్గాల నిరోధక) చట్టం, 2024 నిబంధనలను అమలు చేసింది. ఛార్జిషీట్లో ఆ ముగ్గురు ఎన్టీఏ సబ్జెక్ట్ నిపుణుల పేర్లను సీబీఐ పేర్కొంది. ప్రశ్నపత్రం లీక్ పరీక్షకు కొన్ని నెలల ముందే అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిగిందని, ఇది చివరి నిమిషంలో చేపట్టిన చర్య కాదని చార్జ్షీట్లో పేర్కొంది. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు, డిజిటల్ పరికరాల నుంచి పీడీఎఫ్ ఫైళ్లు, ఫొటోలు, ప్రశ్నపత్రాలు, చాట్లు, ఇతర పత్రాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.లీకైన ప్రశ్నలు పరీక్షకు కొన్ని రోజుల ముందే టెలిగ్రామ్, వాట్సాప్ తదితర ప్లాట్ఫాంల ద్వారా పంపిణీ అయినట్టు సీబీఐ ఆరోపించింది. పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ ఆధారంగా లీకైన సమాచార ప్రయాణాన్ని మొత్తం నెట్వర్క్లో తిరిగి గుర్తించినట్టు పేర్కొంది.దర్యాప్తు సమయంలో ప్రశ్నించిన అభ్యర్థుల వాంగ్మూలాలు కూడా చార్జ్షీట్లో నమోదు చేసింది. ఒక సందర్భంలో, ఓ అభ్యర్థికి, ఆమె తండ్రికి నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం అందిస్తామని చెప్పి రూ.4 లక్షలు కోరినట్టు ఆరోపించింది. ఈ ప్రతిపాదనలో కోచింగ్ సాయం, నిందితుల్లో ఒకరైన ఎన్టీఏ సబ్జెక్ట్ నిపుణుడు నిర్వహించిన ఆఫ్లైన్ రివిజన్ తరగతులు కూడా ఉన్నట్టు తెలిపింది. ఈ పరిచయాలు 2025 చివరి భాగం, 2026 ప్రారంభ నెలల్లో జరిగినట్టు సీబీఐ గుర్తించింది. ఇవి విస్తృత కుట్రలో భాగమని వివరించింది.మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, ఇతర అక్రమాల నేపథ్యంలో మే 12న రద్దు చేశారు. అనంతరం అన్ని అభ్యర్థుల కోసం జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించారు. -
అమిత్ షా బండారం బయటపడింది: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నీట్ నిరసనల అంశంపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ.. ఆయన సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.“అమిత్ షా బండారం బయటపడింది. ఆయన సభకు ఎందుకు రావడం లేదు? సభకు రావడానికి ఆయన భయపడుతున్నారా?” అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. నీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలు, ఆందోళనకారులపై జరిగిన దాడులపై హోంమంత్రి సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు.విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆందోళనకారులపై కాల్పులకు ఆదేశించింది ఎవరు? పోలీసుల కర్కశ చర్యలపై అమిత్ షా నోరు విప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ ఘటనలకు బాధ్యత హోంమంత్రిదేనని ఆరోపించారు.VIDEO | Delhi: Lok Sabha LoP Rahul Gandhi says, "Kharge ji and I have held press conferences, and the other Opposition parties have also made it clear that we are not interested in listening to Amit Shah's imagination. We are interested in one simple thing. And when we say 'we',… pic.twitter.com/sjkm33QjZ9— Press Trust of India (@PTI_News) August 12, 2026రాజీనామాకు డిమాండ్నిరసనల సమయంలో కాల్పులకు ఆదేశాలు ఇచ్చి ఉంటే అమిత్ షా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమిత్ షా ఏం మాట్లాడతారన్నది తమకు అవసరం లేదని, బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.“చర్చకు సిద్ధం”: షామరోవైపు, విపక్షాల ఆరోపణలపై అమిత్ షా స్పందిస్తూ.. నీట్ అంశంతో పాటు విపక్షాలు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చకు రావాలని, సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని కోరారు. విపక్షాలు చర్చకు రాకుండా కేవలం ఆందోళనలు చేస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, చర్చకు వస్తారా? లేదంటే ఆందోళనలు కొనసాగిస్తారా? అనేది విపక్షాలు తేల్చుకోవాలని అన్నారు.నీట్ నిరసనల అంశంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం చర్చకు సిద్ధమంటూ చెబుతోంది. దీంతో పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. -
నేను రెడీ..: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు విపక్షాల ఆందోళనలతో అట్టుడుకుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. విపక్షాలు లేవనెత్తుతున్న అన్ని అంశాలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభలో చర్చకు సిద్ధంగా ఉంటానని తెలిపారు.బుధవారం పార్లమెంట్కు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన అమిత్ షా.. ఇటీవల రాజకీయ, పార్లమెంటరీ చర్చల్లో “లాపతా”, “భాగ్ గయే” వంటి పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని అన్నారు. తాను పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా వస్తున్నానని, తన ఛాంబర్లోనే ఉంటున్నానని చెప్పారు.అయితే లోక్సభ, రాజ్యసభల్లో విపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ప్రశ్నించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ విపక్షాలే చర్చకు ముందుకు రావడం లేదని ఆరోపించారు.నీట్ అంశంపై చర్చకు సిద్ధంనీట్ నిరసనల సమయంలో పోలీసుల చర్యపై విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్ షా తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా దీనిపై స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.“చర్చకు సమయం కేటాయించాలని, విపక్షాలు సిద్ధంగా ఉండాలని కోరాం. అదే వారి మొదటి డిమాండ్. దానికి ప్రభుత్వం అంగీకరించింది. నేను కూడా సభలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను” అని అమిత్ షా పేర్కొన్నారు.ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయిస్తారువిపక్షాలు చర్చకు రాకుండా కేవలం ఆందోళనలు చేస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. “ఎవరు పారిపోతున్నారో ప్రజలే నిర్ణయిస్తారు” అంటూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు 3 గంటల వరకు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తాను సభలో కూర్చొని అందరి అభిప్రాయాలు వింటానని, ప్రతి అంశానికి సమాధానం ఇస్తానని తెలిపారు.దాచాల్సింది ఏమీ లేదుఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రభుత్వానికి దాచాల్సింది ఏమీ లేదని, పార్లమెంట్ సజావుగా నడవడానికి విపక్షాలు సహకరించాలని కోరారు.సజావుగా సాగని సమావేశాలునీట్ నిరసనల అంశంపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. అమిత్ షా సమాధానం చెప్పాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కొందరు నేతలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జులై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సజావుగా సాగలేదు. విపక్షాల నిరసనల మధ్యే కేంద్రం పలు కీలక బిల్లులను ఆమోదించుకుంది. ఇప్పటివరకు ఏడు బిల్లులు ఆమోదం పొందినట్లు తెలుస్తోంది.రేపటితో సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో అమిత్ షా చర్చకు సిద్ధమన్న ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం-విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనకు చివరి రోజైనా తెరపడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
క్యాబ్ డ్రైవర్పై ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?
ఢిల్లీ : ప్రయాణాల్లో పొరపాటున వస్తువులు మర్చిపోతే అవి తిరిగి దొరకడం గగనమైన ఈ రోజుల్లో ఓ క్యాబ్ డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ప్రయాణికుడు క్యాబ్లో వదిలేసిన ఖరీదైన 'ఐఫోన్ 16'ను స్వయంగా వెళ్లి అప్పగించి అందరి మనసులనూ గెలుచుకున్నాడు.ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిధిలో రైడ్ ముగిసిన తర్వాత మీర్ షేక్ అనే డ్రైవర్కు తన క్యాబ్ వెనుక సీట్లో ఐఫోన్ 16 కనిపించింది. ఆ ఫోన్ ఎవరిదో గుర్తించడానికి, యజమానిని సంప్రదించడానికి అతనికి ఎలాంటి ఆధారం లభించలేదు. సదరు ప్రయాణికుడు ఒక సీనియర్ సిటిజన్ అని మాత్రమే అతనికి గుర్తుంది. ఫోన్కు ఎలాంటి ఇన్కమింగ్ కాల్స్ రాకపోవడం, క్యాబ్ యాప్ ద్వారా నేరుగా కస్టమర్ను సంప్రదించే వీలు లేకపోవడంతో షేక్ ఈ విషయాన్ని వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు.ఫోన్ను ఎవరికీ ఇవ్వకుండా భద్రంగా తన వద్దే ఉంచుకుని, యజమాని నుంచి కాల్ వచ్చే వరకు ఎదురుచూశాడు. కాసేపటికి ఫోన్ రింగ్ కావడంతో యజమానితో మాట్లాడాడు. వారు మలబార్ హిల్లో ఉన్నారని తెలుసుకున్న మీర్ షేక్, స్వయంగా అక్కడికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి ఆ ఫోన్ను సురక్షితంగా వారికి అందజేశాడు.ఫోన్ తిరిగి అందిన ఆనందంలో సదరు ప్రయాణికుడు డ్రైవర్ నిజాయితీని, శ్రమను అభినందిస్తూ అతనికి రూ. 2,500 నగదును బహుమతిగా అందించారు. దీనిపై మీర్ షేక్ స్పందిస్తూ.. నిజాయితీకి తగిన గౌరవం, ప్రతిఫలం దక్కడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు డ్రైవర్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
‘చిన్న విషయాన్ని పెద్దది చేయకండి’.. ఎయిరిండియా ఘటనపై ప్రత్యక్ష సాక్షి
ఢిల్లీ: గత వారం గాల్లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు పడిపోయిన ఫుకెట్-ఢిల్లీ ఎయిరిండియా విమాన కెప్టెన్పై ప్రయాణికుడు తీవ్ర ఆరోపణలు చేశారు. విమానం టేకాఫ్ కావడానికి ముందే పైలట్ మత్తులో ఉన్నాడని, ప్రమాదం జరిగిన తర్వాత ఎవరూ వీడియోలు తీయవద్దని, చిన్న విషయాన్ని పెద్దది చేయవద్దంటూ హెచ్చరించాడని ఆయన తెలిపారు.ఆగస్టు 4న 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో ఫుకెట్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా (AI-2379) విమానం మార్గమధ్యంలో ఒక్కసారిగా తీవ్ర కుదుపులకు గురై 300 అడుగుల మేర కిందికి పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం నిర్వహించిన రెండు డోప్ పరీక్షల్లోనూ కెప్టెన్ ఫెయిల్ అయ్యాడని, అతను మత్తు పదార్థాలు తీసుకున్నట్లు తేలిందని సమాచారం. ఈ క్రమంలో ఆ విమానంలో ప్రయాణించిన ఒక ప్రత్యక్ష సాక్షి జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.‘నేను, నా సోదరుడు విమానం ఎక్కే చివరి ప్రయాణికులం. పైలట్ కూడా మాతోనే విమానం ఎక్కాడు. ‘విమానం సరైన సమయానికే బయలుదేరుతుందా? లేదా మేము ఆలస్యమయ్యామా?’ అని నేను అతనిని అడిగాను. దానికి అతను చాలా నిదానంగా స్పందించాడు. అతని కళ్లు ఎర్రగా ఉన్నాయి. మత్తులో ఉన్నాడని నేను అప్పుడే నా సోదరుడికి చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే’ అని ఆయన చెప్పారు.‘పైలట్ మొదటి డోప్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడని తెలిసిన వెంటనే నేను నా సోదరుడికి ఫోన్ చేసి చెప్పాను. అంతకుముందు విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే సమయంలో మీడియాతో మాట్లాడుతూ పైలట్ మత్తులో ఉన్నాడని చెప్పినప్పుడు చాలామంది నా మాటలను ఎగతాళి చేశారు. మీమ్స్ కూడా వేస్తూ, మత్తులో ఉన్న వ్యక్తి విమానాన్ని ఎలా నడుపుతాడంటూ ప్రశ్నించారు’ అని ఆ ప్రయాణికుడు గుర్తు చేసుకున్నారు.విమానం అకస్మాత్తుగా కిందకు పడిపోయిన భయానక క్షణాలను వివరిస్తూ.. ‘టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత అల్పాహారం పూర్తయి అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను, నా సోదరుడు పక్కపక్కనే కూర్చుని కళ్లు మూసుకున్నాము. అకస్మాత్తుగా ఫైటర్ జెట్ లాంటి తీవ్రమైన శబ్దం వచ్చింది. మరుసటి క్షణంలోనే నా సోదరుడు మూడు నాలుగు సార్లు విమానం పైకప్పును బలంగా ఢీకొట్టడం చూశాను. లగేజీ, వస్తువులన్నీ గాల్లోకి ఎగిరిపడ్డాయి. ప్రయాణికులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. అంతా హాహాకారాలు చేస్తూ, ఏడుస్తూ విమానాన్ని సురక్షితంగా ఆపాలని పైలట్ను వేడుకున్నారు.నా జీవితంలో మొదటిసారి ఒక పైలట్ కాక్పిట్ నుండి బయటకు వచ్చి, ప్రయాణికులు వీడియోలు రికార్డ్ చేయవద్దని బ్రతిమలాడటం చూశాను. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. అందులో అతను 'చిన్న విషయాన్ని పెద్దది చేయకండి' అని స్పష్టంగా అన్నాడు. తీవ్ర భయాందోళనల్లో ఉన్న సమయంలో రికార్డింగ్ గురించి ఎవరు ఆలోచిస్తారు? గాయపడిన వారికి సత్వర వైద్య చికిత్స అందించడం అతని ప్రధాన ఉద్దేశం కాదు. విచారణ తప్పించుకోవడానికే లక్నోలో సరైన వైద్య సదుపాయాలు లేవనే సాకుతో విమానాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఆ ప్రయాణికుడు ఆరోపించారు. -
చర్చకు నో.. నినాదాలకు ఓ.. లోక్సభలో గందరగోళం!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లడంతో లోక్సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సభ సజావుగా సాగనివ్వాలని, దేశ ప్రజలు చర్చ జరగాలని కోరుకుంటున్నారని స్పీకర్ ఓం బిర్లా సభ్యులను సముదాయించే ప్రయత్నం చేసినా.. విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు.నీట్ అంశం, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుతో పాటు పలు అంశాలపై విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ మధ్యలోకి రావడంతో పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.VIDEO | Delhi: Lok Sabha session begins amid Opposition protests.(Source: Sansad TV)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/zFYtvhkZs7— Press Trust of India (@PTI_News) August 11, 2026అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ నిరసనలు జరిగాయి. విపక్షాల ఆందోళనలకు కౌంటర్గా ఎన్డీయే ఎంపీలు మకర్ ద్వార్ వరకు ర్యాలీ నిర్వహించారు. సభను అడ్డుకుంటున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఎన్డీయే నేతలు పేర్కొన్నారు. రాహుల్ గాంధీనే సభ జరగనీయకుండా అడ్డుపడుతున్నారని.. ఆయన చర్చలో పాల్గొనాలంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో జార్ఖండ్లో విద్యార్థులపై లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్డీయే ఎంపీలకు కౌంటర్గా మరోవైపు ఇండియా కూటమి ఎంపీలు జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్య, నీట్ అంశం, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై కేంద్రాన్ని నిలదీశారు. కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు కలిసి నీట్ అంశంపై నినాదాలు చేశారు. జార్ఖండ్ పేపర్ లీక్ వ్యవహారానికి రాహుల్ గాంధీ బాధ్యుడు కాదని.. జంతర్ మంతర్ లాఠీ ఛార్జికి మాత్రం అమిత్ షా బాధ్యుడంటూ వాదించారు.సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న వేళ.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. కీలక బిల్లుల ఆమోదం నేపథ్యంలో సభ సజావుగా సాగాలని ప్రభుత్వం కోరుతుండగా.. తమ డిమాండ్లపై చర్చ జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పార్లమెంట్లో రాజకీయ వేడి మరింత పెరిగింది. -
‘నవ్వులాటగా ఉన్నా వారి చర్యలు హర్షనీయం’
ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రతిష్టాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్కు వేదిక కానుంది. అయితే ఈ మైదానానికి చుట్టు పక్కల కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఇదే వేదికలో జరిగిన ఇండియా ఓపెన్లోనూ కోతుల వీరంగంతో అభిమానులు, నిర్వాహకులు చాలా ఇబ్బంది పడ్డారు.ప్రేక్షకుల గ్యాలరీల్లోకి కూడా కోతులు దూసుకురావడంతో పలు విమర్శలు వచ్చాయి. ఈసారి ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్షిప్ జరుగుతుండడంతో, మునుపటి పరిస్థితులు ఎదురుకావొద్దని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నంలో నిర్వాహకులు కొత్తగా వింత పద్ధతిని అనుసరించబోతున్నారు.కోతులను భయపెట్టి వాటిని తరిమేసేందుకు కొండముచ్చు శబ్దాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవి అసలైనవి కాదు. కొండముచ్చు తరహాలో అరుస్తూ, ఈలలు వేస్తూ హడావిడి చేసేందుకు ముగ్గురు మనుషులను ప్రత్యేకంగా నియమించారు. తాము చేసే శబ్దాల వల్ల కోతులు పారిపోతాయని, గతంలోనూ ఢిల్లీలోని పలు కీలక ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాగే చేశామని వారు చెబుతున్నారు. దీంతో కోతులను బెదరగొట్టేందుకు వీరిని ప్రత్యేకంగా నియమించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక తాజా పరిణామంపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్పందించింది. "వీళ్లు చేస్తుంది చూస్తుంటే నవ్వు రావచ్చు. మన పరిష్కార మార్గాలు వింతగా అనిపించవచ్చు. కానీ టోర్నీని సమర్థంగా నిర్వహించేందుకు తెర వెనక కూడా ఇలాంటి ఎంతో మంది పని చేస్తున్నారు. వీరి శ్రమకు హ్యాట్సాఫ్" అని సింధు వ్యాఖ్యానించింది. కాగా ఢిల్లీ వేదికగా ఆగస్టు 17 నుంచి 23 వరకు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ జరగనుంది. You can laugh at the solution, but you have to love the effort 😂❤️🇮🇳So many people are working behind the scenes to make sure India is ready to welcome the world. Our solutions may be uniquely Indian, but so are our warmth, our spirit and our hospitality.Can’t wait for the… https://t.co/ORDFuAkITL— PV Sindhu (@Pvsindhu1) August 10, 2026Meet Zafar, the monkey whisperer part of BAI and SAI's plan to keep the BWF World Championships free of intruders.He mimics a langur's call to chase monkeys away from the venue. 📹#BWFWorldChampionships https://t.co/AND76rNUnK pic.twitter.com/us9HhKjZe6— India Today Sports (@ITGDsports) August 10, 2026చదవండి: రషీద్ మెరుపులు.. వన్డే ప్రపంచకప్కు అఫ్గానిస్తాన్ అర్హత -
‘సంగక్కర బూతులు తిట్టాడు’
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. 2005 నాటి ఢిల్లీ టెస్టు సందర్భంగా సంగక్కర బూతులు తిట్టాడని.. తాను కూడా అందుకు గట్టిగానే బదులిచ్చానని తెలిపాడు.కాగా 2005లో మూడు టెస్టులు ఆడేందుకు శ్రీలంక క్రికెట్ జట్టు భారత్కు వచ్చింది. ఇందులో భాగంగా చెన్నైలో తొలి మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.సెంచరీ మిస్ఓపెనర్ గౌతం గంభీర్కు జోడీగా బౌలింగ్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ను పంపింది. అయితే, గంభీర్ మూడు పరుగులకే నిష్క్రమించగా.. ఊహించని రీతిలో ఇర్ఫాన్ పఠాన్ 93 పరుగులు సాధించాడు. సెంచరీకి కేవలం ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇర్ఫాన్ ఇన్నింగ్స్ కారణంగా భారత్ మెరుగైన స్కోరు సాధించింది. ఆ తర్వాత లంకను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి జయభేరి మోగించింది.మురళీధరన్ బౌలింగ్లో సిక్సర్లునాటి సంగతులను ఇర్ఫాన్ పఠాన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. చీకీ సింగిల్స్లో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో టెస్టు మ్యాచ్. రెండో ఇన్నింగ్స్లో నేను ఓపెనర్గా వచ్చి 93 పరుగులు చేశాను. అపుడు శ్రీలంక ఆటగాళ్లు ఎందుకో అసంతృప్తిగా కనిపించారు.సంగక్కర బూతులు తిట్టాడుముఖ్యంగా సంగక్కర కోపంగా ఉన్నాడు. నేను బ్యాటింగ్ చేయడానికి వెళ్లినపుడు అసలేం జరిగిందో తెలియలేదు. ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్లో నేను రెండు సిక్సర్లు బాదాను. కొత్త బంతిని ఎదుర్కొంటూ మురళీధరన్ బౌలింగ్లో షాట్లు కొట్టగానే వారి ముఖాలు మారిపోయాయి.దీనర్థం మేము వారి ప్రణాళికలను ఛిన్నాభిన్నం చేశాము. ఆ వెంటనే సంగక్కర.. ‘మీరు మోసగాళ్లు. మీ తల్లిదండ్రులు మీకు ఏం నేర్పారు?’ అంటూ బూతులు అందుకున్నాడు. వ్యక్తిగతంగానూ నన్ను మాటలు అన్నాడు. నేనూ ఊరుకోకుండా.. తిరిగి అతడిని తిట్టాడు. ఏదేమైనా ముందైతే అతడు మొదలుపెట్టాడు.మంచి స్నేహితులమయ్యాముఆ తర్వాత మేము ఐపీఎల్లో పంజాబ్కు కలిసి ఆడాల్సి వచ్చింది. ఇద్దరి కుటుంబాలు కలిసి కూర్చుని తినాల్సిన పరిస్థితి. అప్పుడు నేను సంగక్కర దగ్గరికి వెళ్లి సారీ చెప్పాను. అతడు కూడా క్షమాపణ కోరాడు.అప్పటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాము. మ్యాచ్ సమయంలో మా భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆరోజు అలా తిట్టుకున్నాము. మనుషులు పొరపాట్లు చేయడం సహజం. అయితే, పరిణతితో వాటిని ఎలా సరిదిద్దుకున్నామనేదే ముఖ్యం’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. కాగా ఆనాటి మూడో టెస్టులోనూ శ్రీలంకపై గెలిచి టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. చదవండి: చరిత్ర సృష్టించనున్న టీమిండియా -
విపక్షాల ఒత్తిళ్లతో దిగొచ్చిన కేంద్రం!
నీట్ అభ్యర్థుల నిరసనలు, ఢిల్లీలో చోటుచేసుకున్న పోలీసుల చర్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించేందుకు సిద్ధమైంది. ఈ అంశంపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటన చేయనున్నారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఆయనకు స్పీకర్ సమయం కేటాయించినట్లు తెలుస్తోంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమయ్యాయి. అదే రోజు నీట్ అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సంసద్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేయడం తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ క్రమంలో పెలెట్ గన్స్ సైతం ప్రయోగించారనే విమర్శలు వెల్లువెత్తాయి.మొదట రాజీనామా డిమాండ్నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో తొలుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే మంత్రి రాజీనామా తర్వాత కూడా నిరసనలు ఆగలేదు. విద్యార్థులపై పోలీసుల చర్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనజంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీస్ యాక్షన్పై హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. “అమిత్ షా ఎక్కడ?” అంటూ పార్లమెంట్ లోపల, బయట నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టాయి. కేంద్రం పరిధిలో ఉన్న ఢిల్లీలో ఆయన ఆదేశాల మేరకే విద్యార్థులపై లాఠీలు ఝులిపించారని రాహుల్ గాంధీ సైతం ఆరోపణలు గుప్పించారు. ఆయన(షా) సభకు రావడానికి భయపడుతున్నారని.. ఈ అంశంపై కేంద్రం మౌనం వీడాలని ప్రతిపక్షాలు పదేపదే డిమాండ్ చేశాయి.ఆగస్టు 13తో ముగియనున్న సమావేశాలువర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై స్పందించేందుకు ముందుకొచ్చింది. విద్యార్థుల నిరసనలు, ఢిల్లీలో పోలీసుల వ్యవహారశైలి, ప్రభుత్వ చర్యలపై అమిత్ షా ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
బీజేపీకి సంతోషం కలిగించే మాటలొద్దు!
కాంగ్రెస్లో జెన్జీ రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది. పార్టీ లైన్ను దాటి కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయన పేరును ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని సంతోష పెట్టేలా మాట్లాడడం మానుకుంటే మంచిదంటూ సూచనలు చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన ‘యువత కార్యక్రమం’ కంటే.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు జెన్జీ యువతను ఎక్కువగా ఆకర్షించాయని థరూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. కేరళ కాంగ్రెస్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీ నేతల వ్యాఖ్యలు బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడేలా ఉండకూడదని పరోక్షంగా హెచ్చరించారు.థరూర్ వ్యాఖ్యలపై స్పందించిన వేణుగోపాల్.. ఆ వ్యాఖ్యలను తాను పూర్తిగా వినలేదని, మీడియా కథనాల ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. “కాంగ్రెస్ నేతలు పార్టీ విధానాలకు ఎప్పుడూ కట్టుబడి ఉండకపోయినా.. బీజేపీని సంతోషపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి” అని అన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు వస్తే బీజేపీకి అది రాజకీయంగా లాభిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే థరూర్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారని తాను భావించడం లేదని స్పష్టం చేశారు.జెన్జీపై రాహుల్ ప్రచారాన్ని సమర్థించిన కాంగ్రెస్ఇదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన యువత కార్యక్రమాలను వేణుగోపాల్ గట్టిగా సమర్థించారు. ప్రయాగ్రాజ్లో జరిగిన ఛాత్రోంకీ గూంజ్ కార్యక్రమానికి వచ్చిన వారు సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలు కాదని.. నిజమైన జెన్జీ యువతేనని పేర్కొన్నారు. కోటా, డెహ్రాడూన్లలోనూ ఇదే తరహా స్పందన వచ్చిందని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై రాహుల్ నిరంతరం పోరాడుతున్నారని అన్నారు.అసలు థరూర్ ఏమన్నారు?మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్.. రాహుల్ గాంధీ “ఛాత్రోంకీ గూంజ్” కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కార్యక్రమం లేవనెత్తిన అంశాలే CJP నిరసనల్లోనూ ఉన్నాయని.. అయితే జంతర్ మంతర్ వద్ద జరిగిన CJP ఆందోళన స్థాయిలో కాంగ్రెస్ కార్యక్రమం ఎందుకు ప్రభావం చూపలేకపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. “మనం యువత గొంతు విన్నామా? జెన్జీ నాడిని పట్టుకోగలిగామా?” అంటూ థరూర్ ప్రశ్నించారు.అయితే తన వ్యాఖ్యలు పార్టీపైనో, లేదంటే రాహుల్ గాంధీపై దాడి కాదని తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. యువతకు రాజకీయాల్లో మరింత భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరాన్ని మాత్రమే చెప్పానని తెలిపారు.సీజేపీ ప్రభావంపై రాజకీయ చర్చనీట్ పరీక్ష అంశాలు, విద్యార్థుల సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అదే సమయంలో యువత సమస్యలను రాజకీయ పార్టీలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాయన్న ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్లో అంతర్గత చర్చకు దారితీయగా.. వేణుగోపాల్ స్పందనతో పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ యువత కార్యక్రమాలకు పూర్తి మద్దతుగా నిలిచినట్లు స్పష్టమైంది. -
ఉన్నత విద్యలో అసలు సవాలు
జూలై 27న విడుదలైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2027 భాగస్వామ్య లేదా ప్రాతి నిధ్య నివేదిక భారత ఉన్నత విద్యకు ఒకేసారి ఆశాజనకమైన చిత్రాన్నీ, ఆందోళన కలిగించే వాస్తవాన్నీ చూపించింది. ప్రపంచంలోని 118 దేశాల నుంచి రికార్డు స్థాయిలో 2,297 విశ్వవిద్యాల యాలు ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో పాల్గొనగా, 143 విశ్వవిద్యాల యాలతో భారత్ ప్రపంచంలో రెండో అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన దేశంగా నిలిచింది.ఎక్కువ విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్లో పాల్గొ నడం ఒక విషయం అయితే, ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి స్థానాలను సాధించడం మరో విషయం. అందుకే ఈ సందర్భంలో ‘రాశి కంటే వాసి ముఖ్యం’ అనే సామెత సరిగ్గా సరిపోతుంది. ప్రాతినిధ్యం పెరగడం మాత్రమే కాదు, ప్రపంచ నాణ్యతా ప్రమాణాలను అందు కోవడమే నిజమైన విజయానికి కొలమానం.గత ఐదేళ్లుగా భారతీయ విశ్వవిద్యాలయాలు టీహెచ్ఈ ర్యాంకింగ్స్లో చురుకుగా పాల్గొంటున్నాయి. అయితే ఈ సంఖ్య పెరుగుతున్నా, నాణ్యతలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రపంచ టాప్–100లో మనం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఒక్క భారతీయ విశ్వవిద్యాలయంగానీ, ఉన్నత విద్యా సంస్థగానీ స్థానం సంపాదించలేక పోవడం ఆలోచించాల్సిన విషయం. ఎక్కువ శాతం 300–500 బ్యాండ్లలో లేదా అంతకంటే దిగువనే నిలుస్తున్నాయి.ఎక్కడ వెనుకబడ్డాం?భారతీయ విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా మూడు అంశాల్లో గణనీయంగా వెనుకబడి ఉన్నాయి. మొదటిది అంతర్జాతీయీ కరణ– విదేశీ విద్యార్థులు, విదేశీ అధ్యాపకుల సంఖ్య అత్యల్పంగా ఉండడం వల్ల ప్రపంచ అనుసంధానం పరిమితమవుతోంది. రెండవది ఫ్యాకల్టీ–విద్యార్థుల నిష్పత్తి. ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యా లయాల్లో ఒక్కో అధ్యాపకుడికి తక్కువ మంది విద్యార్థులు ఉండగా, మన దేశంలో పరిస్థితి అందుకు విరుద్ధం. మూడవది పరిశోధన ప్రభావం– పరిశోధనా పత్రాల సంఖ్య పెరుగుతున్నా, వాటికి అంత ర్జాతీయ సైటేషన్లు రావడం, పేటెంట్లు, పరిశ్రమలతో భాగస్వా మ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి అంశాల్లో ఇంకా గణనీయ మైన లోటు ఉంది. దీనికి తోడు దేశం మొత్తం పరిశోధన–అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై జీడీపీలో కేవలం 0.6–0.7 శాతం మాత్రమే వ్యయం చేస్తుండగా, అందులో ఉన్నత విద్యా సంస్థల వాటా 8–9 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రపంచ స్థాయి పరిశోధనా విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దడం అంత సులభం కాదు.తూర్పు ఆసియా దేశాల అనుభవం భారత్కు విలువైన పాఠాన్ని చెబుతోంది. చైనా తక్కువ సంఖ్యలో విశ్వవిద్యాలయాల తోనే త్సింగ్వా, పెకింగ్ యూనివర్సిటీ వంటి వాటిని ప్రపంచ అగ్రశ్రేణి స్థానాలకు చేర్చింది. సింగపూర్ వంటి చిన్న దేశం కేవలం రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలతోనే ప్రపంచ టాప్–20లో స్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ దేశాలు ప్రాతినిధ్య సంఖ్యల కంటే నాణ్యత, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వా మ్యాలు, ప్రతిభావంతులైన అధ్యాపకులు, దీర్ఘకాలిక ప్రభుత్వ పెట్టు బడులకు ప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్లే ప్రపంచ ర్యాంకింగ్స్లో స్థిరమైన విజయాలను అందుకుంటున్నాయి.భారత్ కూడా ఇదే దిశగా మరింత దృఢమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మన జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలు సాకారం కావాలంటే, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు అధిక నిధులు కేటాయించడం, అంతర్జాతీయ అధ్యాపకులను, విదేశీ విద్యార్థులను ఆకర్షించడం, పరిశ్రమ–విశ్వవిద్యాలయ భాగస్వా మ్యాలను బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయి పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం అత్యవసరం.– ఏటూరి శేఖర్ శర్మ, రిటైర్డ్ జిల్లా విద్యాధికారి -
మెట్రోలో అమ్మాయిలకు అంకుల్ చేతిలో భయానక అనుభవం
న్యూఢిల్లీ: మెట్రోలో ప్రయాణిస్తున్న పలువురు అమ్మాయిలకు ఓ మధ్య వయస్కుడైన వ్యక్తి చేతిలో భయానక అనుభవం ఎదురైంది. తమను ఆ వ్యక్తి రహస్యంగా వీడియో తీస్తున్నాడని ఇద్దరు యువతులు గుర్తించారు. లోక్ నాయక్ భవన్ మెట్రో స్టేషన్ వద్ద, గ్రీన్ పార్క్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్టు సమాచారం. యువతుల్లో ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. తమ సమీపంలో కూర్చున్న ఆ వ్యక్తి తమకు తెలియకుండా ఫొటోలు తీస్తున్నాడనే అనుమానం వచ్చింది.తాము గమనించామని అతనికి తెలిసిన తర్వాత కూడా తమ వైపే చూస్తూ ఉండటంతో పరిస్థితి మరింత అసౌకర్యంగా మారిందని ఆమె ఆరోపించారు. దీంతో మహిళలు అతడిని నిలదీసి, ఫోన్ చూపించాలని కోరారు. తమ ఫొటోలు తీయలేదని అతడు చెప్పాడు. అయితే వారు చూస్తుండగానే తన ఫోన్లోని చిత్రాలు, వీడియోలను తొలగిస్తున్నట్టు కనిపించాడు.ఆ తర్వాత ఫొటోలు తొలగిపోయాయని భావించి వారికి ఫోన్ చూపించాడు. అయితే మహిళలు తర్వాత ఫోన్లోని రీసైకిల్ బిన్ను పరిశీలించగా, అందులో వీడియో కనిపించింది. అనుమతి లేకుండా ఎవరి ఫొటోలు లేదా వీడియోలు తీయడం సరికాదని ఆ యువతులు అతడికి చెప్పారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియోను తర్వాత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, అది విస్తృతంగా దృష్టిని ఆకర్షించింది.“మహిళలు నిజంగా సురక్షితమేనా?” అనే శీర్షికతో ఆ వీడియోను పోస్ట్ చేశారు. అనేక మంది సామాజిక మాధ్యమ యూజర్లు ఆ వ్యక్తి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ ప్రయాణాల్లో మహిళలు ఇలాంటి అసౌకర్యకర పరిస్థితులను ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రశ్నించారు. అనుమతి లేకుండా అపరిచితుల ఫొటోలు తీసే లేదా వీడియోలు రికార్డు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు కోరారు. View this post on Instagram A post shared by praveenya (@praveenyaaaa) -
మోదీతో తొలి భేటీ.. రాఘవ్ చద్దా ఎమోషనల్
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో తొలిసారి భేటీ అయిన ఆయన.. ఆ భేటీ సారాంశాన్ని సోషల్ మీడియాలో భావోద్వేగంగా ప్రదర్శించారు. ఈ సమావేశం తనకు ఎంతో విలువైన అనుభూతిని ఇచ్చిందని.. ఈ ఉదయాన్ని తన జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటానని వ్యాఖ్యానించారు."ఎప్పటికీ గుర్తుండిపోయే ఉదయం ఇది. ప్రధాని నరేంద్ర మోదీ జీని కలిసే అవకాశం లభించింది. సుదీర్ఘమైన, ఎంతో ఉపయోగకరమైన చర్చ జరిగింది. ఆయన విలువైన సమయం కేటాయించినందుకు, ఆయన ఆలోచనలు, మార్గదర్శకత్వం పొందే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు" అంటూ రాఘవ్ చద్దా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.A morning I will cherish.Had the privilege of meeting Hon’ble Prime Minister Shri @narendramodi Ji. A detailed and enriching interaction. Deeply grateful for his generous time and for the opportunity to benefit from his insights and guidance. 🇮🇳 pic.twitter.com/4A5cEwVCNg— Raghav Chadha (@raghav_chadha) August 8, 2026ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా.. మోదీని కలిసిన ఈ ఉదయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పేర్కొనడం గమనార్హం. ప్రధానితో జరిగిన ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీనా? లేదంటే రాఘవ్ చద్దాకు పార్టీలో మరింత కీలక బాధ్యతలు దక్కే సంకేతమా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది.రాఘవ్ చద్దా.. ఒకప్పుడు ఆప్లో ఉన్నప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లతో నెటిజన్ల దృష్టిని.. మరీ ముఖ్యంగా జెన్జీ దృష్టిని ఆకర్షించారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ల అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు ఆయన మద్దతుగా మాట్లాడారు.నీట్ నిరసనలపై ఎందుకు మౌనంగా ఉన్నాడో అనేదానిపైనా ఆయన పార్లమెంట్లో వివరణ ఇచ్చుకున్నారు. తన రోల్ మారిందని.. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో తాను లేనని చెప్పుకొచ్చారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే పేపర్ లీక్ వ్యవస్థపై కఠిన చర్యలు అవసరమని, ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల పారదర్శకత కోసం కఠిన చట్టాలు, వ్యవస్థలో సంస్కరణలు అవసరమన్న ప్రభుత్వ వైఖరికి ఆయన మద్దతు తెలిపారు.బీజేపీలో చద్దా పాత్రపై ఆసక్తిరాఘవ్ చద్దా–మోదీ భేటీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీలో చేరిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొంటున్నారు. కీలక విధాన అంశాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఏదేమైనా.. ఒకప్పుడు భిన్న రాజకీయ వేదికపై ఉన్న రాఘవ్ చద్దా ఇప్పుడు బీజేపీ నేతగా ప్రధాని మోదీని కలవడం ఆయన రాజకీయ ప్రయాణంలో మరో కీలక మలుపుగా కనిపిస్తోంది.యువతకు మోదీ భరోసామరోవైపు, ఇవాళ ఢిల్లీలోని ఐఐటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతపై విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించడంలో యువత శక్తి, ప్రతిభ కీలకమని అన్నారు. యువతలో ఉన్న ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని ప్రధాని పేర్కొన్నారు. -
2011 రికార్డు బద్దలు.. ఆగస్టు మొదట్లోనే కుండపోత వర్షాలు!
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం కురిసిన కుండపోత వర్షాలకు రాజధానిలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం కాగా, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2011 తర్వాత ఆగస్టు తొలి వారంలో ఢిల్లీలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెల మొదటి ఏడు రోజుల్లో నగరంలో ఏకంగా 127 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి ఉత్తరప్రదేశ్ మీదుగా ఏర్పడిన ఆవర్తనం, పశ్చిమ ద్రోణి ప్రభావం వల్లే ఈ భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. #WATCH | Heavy rain batters Delhi; Commuters face challenge as they wade through waterlogged roads in Sainik Farms area pic.twitter.com/6DnGGb3iUo— ANI (@ANI) August 7, 2026శనివారం నుంచి వర్షాల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆగస్టు 10 వరకు ఈ వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీతో పాటు దేశంలోని మరో 14 రాష్ట్రాల్లోనూ వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. హర్యానాలోని గురుగ్రామ్లో రెడ్ అలర్ట్ నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ సూచించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, కేరళలోని కాసర్కోడ్, కన్నూర్, వాయనాడ్, కోజికోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లోనూ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.ఇది కూడా చదవండి: ఇక మటన్ ముక్కలు కాదు.. ఆకులు! -
మీరు చేస్తారా.. మేము ఎంటర్ కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: ‘తెలంగాణలో పార్టీని అన్ని విధాలా ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యేలా మీరు నడుం బిగిస్తారా? లేక మొత్తం మేమే కంట్రోల్లోకి తీసుకొని నడిపించాలా ? దీనిపై త్వరగా తేల్చుకొని స్పష్టమైన రోడ్మ్యా ప్, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోండి. లేనిపక్షంలో మా పద్ధతిలో పార్టీని ముందుకు నడిపిస్తాం’అని తెలంగాణ ముఖ్య నేతలకు బీజేపీ అధినాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షం బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాల్సిందేనని, అందుకు అవసరమైన అన్నిరకాల కార్యక్రమాలను చేపట్టాలని సూచించినట్టు తెలిసింది.మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో బీఆర్ఎస్ నేతలను చేర్చుకునేందుకు వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించి అమలు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయంలో ఎంపీలు ఏమాత్రం క్రియాశీలంగా వ్యవహరించకపోయినా, వెంటనే జాతీయ నాయకత్వం ఎంటరై తమ ప్రతినిధుల ద్వారా చేరికల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొస్తుందని హెచ్చరికలు జారీచేసినట్టు సమాచారం. మరోవైపు బుధవారం నుంచి నాలుగు రోజులుగా రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో వరుస సమావేశాలు జరిగాయి. 3 నెలలకు ఓసారి వస్తా...పరిస్థితి సమీక్షిస్తా ప్రతీ మూడునెలలకు ఒకసారి తెలంగాణకు వచ్చి రాష్ట్రంలో పార్టీ వాస్తవ పరిస్థితి ఏమిటి..వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర పార్టీ నేతల వ్యూహాలు, చేస్తున్న కృషిని సమీక్షిస్తానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేసినట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన రాజకీయ కార్యాచరణపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.శుక్రవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బంyì సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు డీకే అరుణ, అరి్వంద్ ధర్మపురి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎం.రఘునందన్రావు, గోడెం నగేశ్లతో నితిన్ నబీన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఇప్పటికే రాష్ట్రంలోని పార్టీ వ్యవహారాలు, ముఖ్య నేతల మధ్య నెలకొన్న వాతావరణం, సమన్వయం, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు తదితరాలపై అభయ్పాటిల్ జాతీయపార్టీకి సవివరమైన నివేదిక సమరి్పంచినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకత, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది వంటి అంశాలపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు మరో నివేదికను అందజేసినట్టు సమాచారం. డబుల్ ఇంజిన్ సర్కార్ దిశగా : బండి సంజయ్ రాష్టంలో పార్టీ కార్యకర్తల సమష్టి కృషితో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దిశగా స్థిరంగా అడుగులు వేస్తోందని తాను విశ్వసిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. నితిన్ నబీన్తో సమావేశం అనంతరం ఆయన ఎక్స్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ఎవరితోనూ పొత్తు లేదు’ తెలంగాణలో జనసేన పార్టీతో సహా ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు ఉండబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు స్పష్టంచేశారు. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికార సాధనే లక్ష్యంగా పార్టీ ముందు కెళుతోందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు చేయడమే బీజేపీకి నిజమైన రోడ్ మ్యాప్ అని నితిన్ నబీన్ స్పష్టం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కోర్ కమిటీ సభ్యులతో చర్చించి పాదయాత్రలు, బస్సు యాత్రలు వంటి ప్రజా చైతన్య కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్తామని వెల్లడించారు. సెపె్టంబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. -
వాన బీభత్సం.. జలమయమైన ఢిల్లీ
న్యూఢిల్లీ,సాక్షి: దేశ రాజధాని ఢిల్లీలో వర్షం దంచికొడుతుంది. కురిసిన భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో వాతావరణ శాఖ రాత్రి 11 గంటల వరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.వర్షం నిరంతరం కురుస్తుండటంతో అనేక మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. క్యాబ్లు గంటల తరబడి అందుబాటులో లేకపోవడంతో పలువురు కార్యాలయాల్లోనే చిక్కుకుపోయారు. ఇంటికి బయలుదేరిన వారు కూడా భారీ ట్రాఫిక్లో చిక్కుకున్నారు. మెహ్రౌలి-బడర్పూర్ రోడ్, వజీరాబాద్ రోడ్, పటేల్ రోడ్, రోహ్తక్ రోడ్, శంకర్ రోడ్, కిర్తి నగర్, ఢిల్లీ-జైపూర్ హైవే, పీరాగఢి, షాహీన్ బాగ్ వంటి కీలక మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.నిరంతర వర్షాల కారణంగా ఛత్తర్పూర్ ఫార్మ్ ప్రాంతం,టెర్మినల్-1 సమీపంలోని మెహ్రామ్ నగర్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఢిల్లీ-జైపూర్ హైవేలోని శంకర్ విహార్ వద్ద వాహనాలు భారీ క్యూల్లో నిలిచిపోయాయి. అలాగే గురుగ్రామ్ నుంచి ధౌలా కువాన్ వెళ్లే మార్గంలో కూడా పలుకిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నమోదైంది.ఇక నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై కూడా తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. తూర్పు ఢిల్లీలోని శకర్పూర్, మండావలి ప్రాంతాల్లో కాలువలు పొంగిపొర్లడం, గుంతలు నీటిలో మునిగిపోవడంతో ప్రమాదాలు పెరిగాయని ఈ-రిక్షా డ్రైవర్లు తెలిపారు. నీటిలో కనిపించని గుంతలు, మ్యాన్హోల్ల కారణంగా ఈ-రిక్షాలు, స్కూటర్లు, మోటార్సైకిళ్లు సహా కనీసం మూడు నుంచి నాలుగు వాహనాలు బోల్తాపడ్డాయి. -
మూడు రోజులు భారీ వర్షాలు IMD హెచ్చరిక
-
మై హూ నా.. కొత్త మిత్రులకు మోదీ అభయం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభనతో కొనసాగుతున్న వేళ.. ఎన్డీయేలో కొత్తగా చేరిన ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ ఉదయం కొత్త మిత్రులతో ప్రత్యేక అల్పాహార సమావేశం నిర్వహించిన ప్రధాని.. వారిలో నెలకొన్న సందేహాలు, ఆందోళనలకు తెరదించే ప్రయత్నం చేశారు. “ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎన్డీయే ఒక కుటుంబం.. మీకు మేమంతా అండగా ఉంటాం” అంటూ భరోసా ఇచ్చారు.ఇటీవల ప్రతిపక్ష పార్టీల నుంచి విడిపోయి ఎన్డీయేలో చేరిన 26 మంది ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలు, సభా చర్చల్లో చురుగ్గా పాల్గొనే విధానం, తమ నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. వీరిలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి షిండే వర్గంలో చేరిన ఆరుగురు ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి బయటకు వచ్చి ఎన్డీయేలో చేరిన 20 మంది ఎంపీలు ఉన్నారు.ముఖ్యంగా ఉద్ధవ్ శివసేన నుంచి షిండే శివసేనలోకి వచ్చిన ఎంపీలకు ప్రధాని ప్రత్యేక భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లతో మరాఠీలో పలకరించిన ఆయన.. కొత్తగా కూటమిలోకి వచ్చిన వారంతా ఎన్డీయేలో సమాన భాగస్వాములేనని, వారికి పూర్తి గౌరవం, అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం.పార్లమెంట్ చరిత్రపై అవగాహన పెంచుకోండికొత్తగా ఎన్డీయేలోకి వచ్చిన ఎంపీలను ఉద్దేశించి ప్రధాని.. సభా చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పార్లమెంట్ చరిత్ర, సంప్రదాయాలు, విధివిధానాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. “పార్లమెంట్ చరిత్రకు సంబంధించిన అపారమైన సమాచారం అందుబాటులో ఉంది. దానిని చదివి చర్చలకు సిద్ధం కావాలి” అని ఎంపీలకు సూచించారు.టీఎంసీ నుంచి వచ్చిన ఎంపీలకు కూడా.. టీఎంసీ నుంచి విడిపోయి ఎన్డీఏలో చేరిన 20 మంది ఎన్సీపీ(ఐ) ఎంపీలతో కూడా ప్రధాని మాట్లాడారు. కొత్తగా వచ్చిన సభ్యులు కూటమిలో భాగమని, వారికి తగిన గౌరవం, అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలు, నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ వనరులను వినియోగించుకోవాలని చెప్పారు.ఎన్డీయే బలం పెంచుకునే వ్యూహంకీలక రాజ్యాంగ సవరణ బిల్లులకు రెండు సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం ఉండటంతో బీజేపీ ఎన్డీయే విస్తరణపై దృష్టి పెట్టింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల తొలగింపు నిబంధనలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రతిపాదిత బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కొత్త మిత్రుల చేరిక కీలకంగా మారింది. ఇటీవల ప్రతిపక్ష పార్టీల నుంచి 26 మంది ఎంపీలు ఎన్డీయేలో చేరడంతో లోక్సభలో ఎన్డీఏ బలం 293 నుంచి 319కి పెరిగింది. అయినప్పటికీ ప్రత్యేక మెజారిటీకి ఇంకా 41 స్థానాల కొరత ఉంది.‘కొత్తవారూ మా కుటుంబ సభ్యులే’కొత్తగా చేరిన ఎంపీలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చూపించేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా ఉన్న కాకోలి ఘోష్ దస్తిదార్కు ప్రధాని మోదీ.. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో పాటు ముందు వరుసలో స్థానం కల్పించడం కూడా ఈ వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. -
పాపులర్ క్రైమ్ సిరీస్ ప్రేరణతో భార్య హత్య, రూ. 13 లక్షలతో పరార్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఒక దారుణ హత్యోదంతం కలకలం రేపింది. పాపులర్ హాలీవుడ్ క్రైమ్ సిరీస్ 'ది స్టేర్కేస్' (The Staircase) చూసి, దాని ఆధారంగా భార్యను హత్య చేసిన ఘటన దిగ్భ్రాంతి రేపింది.62 ఏళ్ల సాఫ్ట్వేర్ కన్సల్టెంట్, ఆస్తి వివాదం కారణంగా భార్యను దారుణంగా హత్య చేశాడు. రియల్ స్టోరీ ఆధారంగా తీసిన ఈ సిరీస్ మరో హత్యకు దారి తీసింది. అయితే సాక్ష్యాలను తుడిచిపెట్టి పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.ఒక భర్త, ఒక భార్య, ఒక దారుణమైన మరణం, ఆపై శాశ్వతంగా మాయమైన హత్యాయుధం. చివరికి న్యాయం అస్పష్టంగా మిగిలిపోవడం... ఇదీ HBO'ది స్టేర్కేస్'. సరిగ్గా ఇదే స్టోరీ తూర్పు ఢిల్లీలోని ఒక ఇంట్లో, ఇదే కథనం నిజ జీవితంలో మరోసారి పునరావృతమైంది.ఈ ఘటన జూలై 30న జరిగిందిపోలీసుల వివరాల ప్రకారం62 ఏళ్ల సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ కమల్ సింగ్, ఆయన భార్య కోమల్ సింగ్ దంపతుల మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు తలెత్తాయి. ఒకే ఇంట్లో ఉంటున్నా వీరిద్దరూ విడివిడిగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారంటే వీరి విభేదాల స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అయితే తాను అనుకున్న పథకాన్ని అమలు చేయడానికి సమయం కోసం ఎదురు చూస్తున్న నిందితుడికి అవకాశం చిక్కింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి (కుమారుడు లైబ్రరీకి, కుమార్తె ఆఫీసుకు, పనిమనిషి పని ముగించుకుని వెళ్లిన తర్వాత) మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో బాల్కనీలో బట్టలు ఆరేస్తున్న భార్యపై కమల్ కత్తితో వెనుక నుంచి దాడి చేశాడు. దెబ్బ గట్టిగా తగలక పోవడంతో కోమల్ కేకలు వేస్తూ కిచెన్లోకి పరుగెత్తింది. కమల్ ఆమెను జుట్టు పట్టుకుని లివింగ్ రూమ్లోకి ఈడ్చుకొచ్చి, కత్తెరతో దారుణంగా పొడిచి చంపేశాడు. పొరుగువారికి కేకలు వినిపించినా ఎవరూ కలగజేసుకోకపోవడం మరో విషాదం.అనంతరం కమల్ రక్తం మరకల బట్టలు, కత్తిని బ్యాగ్లో పెట్టి, స్నానం చేసి స్కూటర్పై పారిపోయాడు. మార్గమధ్యంలో ఆ బ్యాగ్ను పారేశాడు. అలాగే భార్య గదిలోని రూ. 5 లక్షలతో పాటు, రెండు బ్యాంక్ ఖాతాల నుంచి రూ. 7 లక్షలు ఉపసంహరించి మొత్తం రూ. 12.75 లక్షల నగదుతో పరారయ్యాడు. రాత్రి కుమారుడు ఇంటికొచ్చేసరికి తల్లి రక్తపు మడుగులోపడి ఉంది. మృతదేహం వద్ద కత్తెర మాత్రమే దొరికింది,కత్తి కనిపించలేదు.అతని ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని ట్రాక్ చేశారు. కమల్ మొదట తన ఫోన్ ఆన్ చేసి గోరఖ్పూర్ వైపు వెళ్లాడు. నేపాల్ పారిపోతున్నట్లు బిల్డప్ ఇవ్వాలని చూశాడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మథుర వైపు వెళ్లాడు. ఎట్టకేలకు మూడు రోజుల గాలింపు తర్వాత ఢిల్లీ పోలీసులు మథుర రైల్వే స్టేషన్ వద్ద కమల్ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి స్కూటర్ ,పూర్తి నగదును స్వాధీనం చేసుకున్నారు. 'ది స్టేర్కేస్' సిరీస్లో చూపించినట్లుగానే, ఆయుధాన్ని దొరక్కుండా పారేస్తే తనపై బలమైన ఆధారాలు ఉండవని భావించి ఆయుధాన్ని దాచేశానని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.ఇదీ చదవండి : ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్గా ఘనతజగత్పురిలో ఒక ఆస్తిని తన తండ్రి పేరిట కొనాలని కమల్ భావించగా, అందులో వాటా కావాలని భార్య కోమల్ పట్టుబట్టింది. దీనికి తోడు కమల్కు ముంబైలో మరొక మహిళతో ఉన్న సంబంధం వీరి మధ్య ఘర్షణలకు కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. -
ఆ ముగ్గురే సూత్రధారులు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఏ)కు చెందిన ముగ్గురు సబ్జెక్టు నిపుణులు పి.వి.కులకర్ణి(కెమిస్ట్రీ), మనీషా సంజయ్ హవల్దార్(ఫిజిక్స్), మనీషా గురునాథ్ మంధారే(బోటనీ, జువాలజీ) కీలక సూత్రధారులు అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో తాజాగా 94 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ప్రశ్నపత్రాల అనువాదం లేదా పునరనువాదం సమయంలో రఫ్ వర్క్ (ప్రాథమిక పని) కోసం ఈ ముగ్గురు నిపుణులకు ఖాళీ కాగితాలను అందించినట్లు విచారణలో తేలింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు పి.వి.కులకర్ణి రసాయన శా్రస్తానికి సంబంధించిన మొత్తం 135 ప్రశ్నలను, వాటి సమాధానాల ఆప్షన్లను చిన్న కాగితం ముక్కలపై క్లుప్తంగా రాసుకుని, వాటిని రహస్యంగా బయటకు తీసుకెళ్లాడని చార్జ్షీట్లో సీబీఐ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ ఎన్టీఏ ఆఫీసులోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోకి ప్రవేశించేటప్పుడు లేదా నిష్క్రమించేటప్పుడు సబ్జెక్టు నిపుణులను తనిఖీ చేయడం గానీ, సోదా చేయడం గానీ జరగలేదని తెలియజేశారు. కులకర్ణి సులభమైన కొన్ని ప్రశ్నలను కంఠస్థం చేసి, తన హోటల్ గదికి తిరిగి వచ్చిన తర్వాత వాటిని ఒక కాగితంపై రాసుకున్నాడని పేర్కొన్నారు. సీబీఐ చార్జిషీట్లో ఇంకా ఏం ప్రస్తావించారంటే.. నిందితులకు కలిసొచ్చిన పరిస్థితులు ఎన్టిఏలో బోటనీ పేపర్ను ఇంగ్లిష్ నుంచి మరాఠీ భాషలోకి అనువాదకురాలిగా, జువాలజీ పేపర్ పునరనువాదకురాలిగా పనిచేసిన మనీషా మంధారే ఆ రోజు తన పని ముగించుకుని హోటల్ గదికి తిరిగి వచ్చిన తర్వాత ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సంబంధిత పేరాలను మార్క్ చేసేవారు. ఆయా సబ్జెక్టులపై ఆమెకు ఉన్న దశాబ్దాల అనుభవంతో నీట్ ప్రశ్నలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలోని సంబంధిత అంశాలతో సులభంగా అనుసంధానించగలిగారు. మార్క్ చేసిన పేరాల ఆధారంగా ఆయా ప్రశ్నలు, వాటి జవాబులను గుర్తించారు. ఇక ఫిజిక్స్ ప్రశ్నల అనువాదకుడిగా పనిచేసిన మనీషా సంజయ్ హవల్దార్ రోజువారీ పని ముగించుకుని ఢిల్లీలోని తన బసకు తిరిగి వచ్చిన తర్వాత ప్రశ్నలను క్లుప్తంగా రాసుకునేవారు. ఎన్టీఏ కార్యాలయంలో సీసీటీవీ లైవ్ ఫీడ్ను పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ లేకపోవడం నిందితులకు బాగా కలిసొచ్చింది. వారి నిర్వాకం ఎవరి దృష్టికీ రాలేదు. నీట్ పేపర్లోని తుది ప్రశ్నలు ఆయా నిపుణుల నుంచి మధ్యవర్తులకు, సమన్వయకర్తలకు చేరాయి. అభ్యర్థులతో సంప్రదింపులు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, కన్సల్టెన్సీలను నడిపించే తేజస్ హర్షద్కుమార్ షా, డాక్టర్ మనోజ్ భగవాన్రావ్ షిరూరే, శివరాజ్ మోతేగాంకర్, ధనంజయ్ నివృత్తి లోఖండే, శివరాజ్ రఘునాథ్ మోతేగాంకర్లకు నీట్ ప్రశ్నలు చేరాయి. ఈ మొత్తం ప్రక్రియలో చివరి దశగా రాజస్తాన్లోని శుభమ్ మధుకర్ ఖైర్నార్, మంగిలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, హరియాణాలోని యశ్ యాదవ్ ద్వారా నీట్ అభ్యర్థులకు చేరాయి. శుభమ్ మధుకర్ ఖైర్నార్ డబ్బు కోసం అభ్యర్థులతో సంప్రదింపులు జరిపాడు. సెక్యూరిటీ కోసం వారి విద్యా పత్రాలు, ఖాళీ చెక్కులను సేకరించాడు. మధ్యవర్తులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వ్యవహారం చక్కబెట్టాడు. మంగిలాల్ బివాల్ మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన ఆడియో ఫైళ్లు ఈ కుట్రకు సంబంధించిన ప్రణాళికను బట్టబయలు చేశాయి. -
అమిత్ షాను కలిసిన YSRCP ఎంపీలు.. జగన్ భద్రత, DSC అంశంపై ఫిర్యాదు
-
సీజేపీ కొత్త మిషన్.. నేడు భారీ ప్రకటనపై దేశవ్యాప్త ఉత్కంఠ!
పరీక్షల పేపర్ లీకుల ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ప్రధాన స్వరంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన తదుపరి కార్యాచరణపై కీలక ప్రకటనకు సిద్ధమవుతోంది. ఉద్యమ భవిష్యత్ దిశ, దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికలను గురువారం వెల్లడించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో గత రెండు రోజులుగా జరిగిన కీలక సమావేశాల అనంతరం ఈ ప్రకటన రానుంది. సంస్థ నాయకత్వం ఉద్యమం తదుపరి దశకు సంబంధించి సమగ్ర రోడ్మ్యాప్ సిద్ధం చేసినట్లు సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా తెలిపారు.ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన వీడియో సందేశంలో రంకా మాట్లాడుతూ.. ‘దేశంలో వ్యవస్థాగత మార్పు కోసం మేము భారీ పోరాటాన్ని ప్రారంభించాం. ఈ ఉద్యమంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి’ అని అన్నారు. మద్దతుదారుల నుంచి సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా వచ్చిన వేలాది సూచనలు, అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. గురువారం చేయబోయే ప్రకటనలో ఉద్యమం ఎటువైపు సాగుతుందనే దానిపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు.కాగా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నివాసంలో దాదాపు ఏడు గంటల పాటు వ్యూహాత్మక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించడం, విద్యార్థి సంఘాలతో బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేయడం, వివిధ రాష్ట్రాల్లో విద్యా సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, సీజేపీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా మారే ఆలోచనలో లేదని నాయకత్వం స్పష్టం చేసింది. విద్యా రంగ సమస్యలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే సామాజిక, ప్రజా ఉద్యమ వేదికగా కొనసాగాలని నిర్ణయించినట్లు తెలిపింది.‘మేము రాజకీయ పార్టీ ప్రారంభించడం గురించి ఆలోచించడం లేదు. ప్రజలకు న్యాయవ్యవస్థ, రాజకీయ నాయకులు, మొత్తం వ్యవస్థపై నమ్మకం తగ్గింది. మేము ఒక సమూహంగా పనిచేస్తాం’ అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. విద్యా సంస్కరణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పేపర్ లీకుల నివారణ, విద్యార్థుల సంక్షేమం, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం వంటి అంశాలే తమ ఉద్యమ ప్రధాన లక్ష్యాలని సీజేపీ నాయకత్వం వెల్లడించింది. తమ ఉద్యమం మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాల ఆధారంగా కొనసాగుతుందని, అహింసా మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోరాటం చేస్తామని సంస్థ తెలిపింది. సంప్రదాయ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ విద్యా రంగ మార్పుల కోసం పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తమ పేపర్ లీక్ వ్యతిరేక ఉద్యమంలో కీలక మైలురాయిగా సీజేపీ అభివర్ణించింది. అయితే తమ పోరాటం ఒక్క సంఘటనతో ఆగిపోదని, దేశ విద్యా వ్యవస్థలో విస్తృత మార్పులు వచ్చే వరకు కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చింది. గురువారం సీజేపీ చేయనున్న ప్రకటనలో దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికలు, కొత్త కార్యక్రమాలు, విద్యార్థి ఉద్యమాలతో అనుసంధానం వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పేపర్ లీకుల అంశంతో ప్రారంభమైన ఈ ఉద్యమం భవిష్యత్తులో ఎంతటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
విద్యార్థులను చూస్తే గర్వంగా ఉంది
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీకేజీపై నిరసన తెలియజేసిన విద్యార్థులపై జరిగిన హింసాకాండకు ముమ్మాటికీ అమిత్ షా బాధ్యుడని ఆరోపించారు. విద్యార్థుల విషయంలో ఏం జరిగిందో పార్లమెంట్లో వివరించే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు. జూలై 20న పోలీసుల దాడికి గురైన విద్యార్థుల బృందంతో రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ నిరసనకారులను ఇప్పుడే కలిసి చర్చించానని తెలిపారు. రాజ్యాంగం, విద్యా వ్యవస్థ, భారతదేశ భవిష్యత్తు కోసం పోరాడిన వేలాది విద్యార్థులను చూస్తే తనకు చాలా గర్వంగా ఉందన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తమపై జరిగిన దాడి, తగిలిన దెబ్బలు, ఎదురవుతున్న బెదిరింపుల గురించి వారు వివరించారని పేర్కొన్నారు. వారు రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం సాగించారని, భారతదేశం అనే భావనను, దేశ భవిష్యత్తును కాపాడారని రాహుల్ ప్రశంసించారు. లోపభూయిష్టమైన, కుప్పకూలిపోతున్న, నిష్ప్రయోజనమైన విద్యా విధానం గురించి ఫిర్యాదు చేయడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వ్యవస్థనే మార్చాలని విద్యార్థులు కోరుతున్నారని చెప్పారు. వారు హింసకు పాల్పడలేదని, దురుసుగా ప్రవర్తించలేదని గుర్తుచేశారు. అయినప్పటికీ వారిపై దాడి చేసి, కొట్టి, బెదిరించారని ధ్వజమెత్తారు. ఆన్లైన్లో వేధిస్తున్నారు: రియా ఆహిర్ విద్యార్థుల బృందాన్ని కలిసిన ఫొటోలను రాహుల్ గాంధీ ఇన్స్టా గ్రామ్లో షేర్ చేశారు. ‘‘భారతదేశ భవిష్యత్తును చూడండి. యువత నిర్భయులు, నిర్మొహమాటంగా మాట్లాడుతారు. వారికి దేశభక్తి ఉంది. మరి ప్రధానమంత్రి, హోంమంత్రి సంగతి ఏంటి? పార్లమెంట్కు వచ్చే ధైర్యం గానీ, సమాధానాలు చెప్పే తెగింపు గానీ వారికి లేవు’’అని తన పోస్ట్లో పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ పక్కన సీజేపీకి చెందిన రియా ఆహిర్, నూతన్ టోపో, భరత్, ఫర్హానాజ్, ముస్కాన్ ఉన్నారు. వీరిలో మోడల్ రియా ఆహిర్ ముంబైలో విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసు వ్యాన్ను అడ్డుకున్న సంగతి తెలిసిందే. తనకు ఆన్లైన్లో వేధింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. గాంధీ పక్కన నిల్చొని ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను 20 మంది పిల్లలను అక్రమ అరెస్టుల నుంచి కాపాడనని, ఇప్పుడు తనను ఆన్లైన్లో వేధిస్తున్నారని చెప్పారు. తాను ఎదుర్కొంటున్నది ట్రోలింగ్ కాదని, అది ఒక నేరమని స్పష్టం చేశారు. -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భవిష్యత్తు తరాలు క్షమించవు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించడం దురదృష్టకరమని, బాధ్యత గల నాయకులు యువతకు ఆదర్శంగా నిలవాలని, కానీ రాహుల్ గాంధీ ఆ దిశగా వ్యవహరించడం లేదని అన్నారు.పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం బాధ్యత అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనుకేసుకురావడం సరికాదని, రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇదే విధంగా దూషిస్తే ఆయన అదే విధంగా స్పందిస్తారా అని ప్రశ్నించారు.అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు వచ్చినప్పటికీ ఆయన హుందాగా స్పందించారని, చిన్నారులు తప్పులు చేయడం సహజమని, వారిని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదేనని మోదీ సూచించారు. ఆయన స్పందనలో క్షమాగుణం, బాధ్యత మాత్రమే కనిపించగా, విద్యార్థిని స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పడం భారతీయ సంస్కృతి, విలువలకు నిదర్శనమని మంత్రి అన్నారు.అలాగే, భారతీయ సంప్రదాయాలు పెద్దలను గౌరవించడం, తప్పు చేసిన వారిని క్షమించి సరైన మార్గంలో నడిపించడం వంటి విలువలను బోధిస్తాయని వారు గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకుడిగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా వ్యవహరించాల్సిన సమయంలో రాహుల్ గాంధీ బాధ్యతాయుత రాజకీయాలను విస్మరించారు. అయితే, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అవమానకరమైన భాషను ప్రోత్సహించే నాయకులను భవిష్యత్తు తరాలు తిరస్కరిస్తాయని, దేశ ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యువత మద్దతు ఎప్పటికీ ఉంటుందని మంత్రి కిషన్రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
గాల్లో నరకం.. ఒక్క క్షణం ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం!
ప్రశాంతంగా సాగుతున్న విమాన ప్రయాణం.. అంతలోనే ఒక్కసారిగా భారీ కుదుపులు. క్షణాల్లోనే ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడ్డారు. లగేజీ బిన్లు తెరుచుకున్నాయి.. క్యాబిన్ ప్యానెల్స్ ఊడిపోయాయి.. కేకలు, ఆందోళనలతో విమానం భయానక దృశ్యంగా మారింది. ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికులకు జీవితాంతం గుర్తుండిపోయే భయాన్ని మిగిల్చింది.ఎయిర్ ఇండియాకు చెందిన విమానం మంగళవారం థాయ్లాండ్లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణం మధ్యలో క్రూజింగ్ దశలో ఉన్న సమయంలో విమానం ఒక్కసారిగా తీవ్ర టర్బులెన్స్కు(కుదుపు) గురైంది. దీంతో గాయాల పాలైన ప్రయాణికులు.. ప్రాణభీతితో వణికిపోయారు. కొందరు ప్రయాణికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎలాంటి ముందస్తు హెచ్చరిక జారీ కాలేదు. హఠాత్తుగా విమానం భారీగా ఊగిపోయింది. ఒక్కసారిగా విమానం కిందకు పడిపోయినట్లు అనిపించింది. కొందరు ప్రయాణికులు సీట్ల నుంచి పైకి ఎగిరి పైభాగాన్ని ఢీకొన్నారు. క్యాబిన్లో లగేజీ కిందపడటం, ఓవర్హెడ్ బిన్లు దెబ్బతినడం, ప్యానెల్స్ ఊడిపోవడం వంటి పరిస్థితులు కనిపించాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేయగా.. కొందరు ప్రార్థనలు చేస్తూ కనిపించారు.మేము బతకమని అనుకున్నాంఇటలీకి చెందిన వివియానా అనే ప్రయాణికురాలు తన అనుభవాన్ని వివరిస్తూ.. “ఒక్కసారిగా టర్బులెన్స్ మొదలైంది. నా సోదరి సీటు నుంచి గాల్లోకి ఎగిరిపోయింది. నా తల్లి తలకు గాయమైంది. వెనుక కూర్చున్న పలువురికి గాయాలయ్యాయి. ఓ ప్రయాణికుడి ముఖంపై రక్తం కనిపించింది. మేము చనిపోతామని అనుకున్నాం” అంటూ ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంది.మరో ప్రయాణికుడు మాట్లాడుతూ.. తన తండ్రి సీటు నుంచి పైకి ఎగిరి విమానం పైభాగానికి తగిలి కిందపడ్డారని తెలిపాడు. తన భార్య, రెండేళ్ల చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపడి గాయపడ్డారని, ఈ ఘటన తమకు “పునర్జన్మలా అనిపించింది” అని చెప్పాడు.వీడియోలు తీయొద్దన్నారుఈ ఘటనపై విమానంలో ప్రయాణించిన కంటెంట్ క్రియేటర్ శిల్పి జైన్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. విమానం కూలిపోతుందేమోనని భయపడ్డామని, ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని సిబ్బంది కోరారని, ఎయిర్లైన్ ప్రతిష్ఠ దెబ్బతింటుందని చెప్పినట్లు ఆరోపించారు. ల్యాండింగ్ తర్వాత కూడా వెంటనే వైద్య సాయం అందలేదని, కొంతమంది ప్రయాణికులు సహాయం కోసం వేచి చూడాల్సి వచ్చిందని శిల్పి జైన్ పేర్కొన్నారు. 17 మందికి గాయాలుఈ ఘటనలో మొత్తం 17 మంది గాయపడగా.. వారిలో నలుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత గాయపడిన వారిని వైద్య పరీక్షల కోసం తరలించారు. కొందరిని ఆస్పత్రుల్లో చేర్చారు. ఎయిర్ ఇండియా స్పందిస్తూ.. ప్రయాణ సమయంలో కొద్దిసేపు తీవ్ర టర్బులెన్స్ ఎదురైందని, ప్రయాణికులు, సిబ్బందికి అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపింది. తీవ్రమైన ప్రాణాపాయం లేదని పేర్కొంది. ఘటనపై స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఢిల్లీలోని ఆసుపత్రికి వెళ్లి గాయపడిన ప్రయాణికులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.టర్బులెన్స్ ఘటనలు పెరుగుతున్నాయా?ఇది ఇటీవలి కాలంలో నమోదైన మరో తీవ్రమైన టర్బులెన్స్ ఘటన. 2026లోనే ఆస్ట్రేలియా నుంచి హాంకాంగ్ వెళ్తున్న క్యాథే పసిఫిక్ విమానం తీవ్ర టర్బులెన్స్కు గురై 10 మంది గాయపడ్డారు. అంతకుముందు 2025లో డెల్టా ఎయిర్లైన్స్ విమానం తీవ్ర టర్బులెన్స్ కారణంగా అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. ఆ ఘటనలో 25 మంది వరకు గాయపడ్డారు. వాతావరణ మార్పులు, గాలి ప్రవాహాల్లో అనూహ్య మార్పుల కారణంగా తీవ్రమైన టర్బులెన్స్లు మరింత తరచుగా ఎదురవుతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ప్రయాణికులకు మరోసారి హెచ్చరికఈ ఘటన మరోసారి విమానంలో ఉన్నప్పుడు సీటు బెల్ట్ ధరించడం ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. సాధారణంగా విమానం గాల్లో ఉన్నప్పుడు చిన్న కుదుపులు సహజమే అయినా.. ఇలాంటి ఆకస్మిక టర్బులెన్స్లు ఊహించని ప్రమాదాలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని నిమిషాల గందరగోళం.. 145 మందికి పైగా ప్రయాణికుల జీవితాల్లో మాత్రం మరచిపోలేని భయానక అనుభవంగా మిగిలిపోయింది. -
భారత్ నుంచి హసీనా ప్రసంగం.. బంగ్లా మీడియాకు బెదిరింపులు!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరోసారి రాజకీయ కేంద్రబిందువుగా మారారు. దేశం విడిచి భారత్లో ఉంటున్న ఆమె.. బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రసంగించనున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హసీనా ప్రసంగాన్ని ప్రసారం చేయడం, ప్రచురించడం చట్టవిరుద్ధమని దేశీయ మీడియాను హెచ్చరించింది.2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె భారత్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్లోనే ఉంటున్నారు. 2025లో నిరసనల అణచివేతకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును హసీనా చట్టబద్ధం కాదంటూ కొట్టిపారేశారు.ఈ నేపథ్యంలో.. తాను స్వదేశం విడిచి రెండేళ్లయిన సందర్భంగా ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె వీడియో లింక్ ద్వారా ప్రసంగించనున్నారు. తన కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్తో పాటు ఇతర వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. హసీనా ప్రధానంగా ఏ అంశాలపై మాట్లాడతారన్న వివరాలు వెల్లడికాలేదు.అయితే హసీనా ప్రసంగంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ఆడియో, వీడియో సందేశాలను ప్రసారం చేయడంపై గతంలో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విధించిన నిషేధాన్ని గుర్తుచేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మీడియాను హెచ్చరించింది.మరోవైపు హసీనా వర్గం మాత్రం ప్రభుత్వ వైఖరిని ఖండించింది. దేశ సరిహద్దులు దాటి కూడా భిన్నాభిప్రాయాలను అణచివేయలేరని వ్యాఖ్యానించింది. హసీనా, ఆమె పార్టీ నేతలు డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటారని గతంలో ప్రకటించారు.ఈ పరిణామాలపై భారత్ స్పందిస్తూ.. ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమమని స్పష్టం చేసింది. ఇందులో భారత ప్రభుత్వం ఎలాంటి ప్రమేయం లేదని, అక్కడ వ్యక్తమయ్యే అభిప్రాయాలకు తాము బాధ్యత వహించబోమని భారత విదేశాంగ శాఖ తెలిపింది.ఇదిలా ఉంటే.. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను కోరుతూనే ఉంది. హసీనా భారత భూభాగం నుంచి రాజకీయ ప్రకటనలు చేయడంపై ఢిల్లీకి తమ అభ్యంతరాలను తెలియజేసినట్లు బంగ్లాదేశ్ అధికారులు చెబుతున్నారు.హసీనా అధికారం కోల్పోయిన తర్వాత భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆమె వర్చువల్ ప్రసంగం నేపథ్యంలో మరోసారి రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలకు తెరలేచింది. **భారత్ వేదికగా హసీనా గళం వినిపించనుండటం.. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
మోదీ వీడియో.. క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు!
సోషల్ మీడియా దిగ్గజం మెటా చుట్టూ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన ఘటనపై ఇప్పటికే వివరణ ఇచ్చిన మెటా.. దీనిని “టెక్నికల్ ఎర్రర్”గా పేర్కొంటూ క్షమాపణలు చెప్పింది. అనంతరం వీడియోను పునరుద్ధరించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా.. మెటా పనితీరు, అల్గారిథంల నిర్ణయాలపై మరిన్ని వివరాలు కోరుతోంది.ఈ క్రమంలో మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ జోయెల్ కప్లాన్ను కేంద్రం మరోసారి వివరణ కోసం పిలిచినట్లు సమాచారం. వారం రోజుల్లోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. బుధవారం జరిగే సమావేశానికి ఇన్స్టాగ్రామ్ టెక్నికల్ టీమ్ ప్రతినిధులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మెటా అల్గారిథంలు ఎలా పనిచేస్తున్నాయి? ఏ కంటెంట్ను తొలగించాలనే నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు? ప్రముఖ వ్యక్తుల ఖాతాలకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి? అనే అంశాలపై కేంద్రం వివరణ కోరే అవకాశం ఉంది. అలాగే ప్రధాని వీడియో తొలగింపునకు కారణమైన “టెక్నికల్ గ్లిచ్”పై మెటా నుంచి లిఖితపూర్వక వివరణ, క్షమాపణ కోరనున్నట్లు సమాచారం.అసలు వివాదం ఏంటి?జూలై 23న ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. జెన్-జెడ్ యువతను ఉద్దేశించి మాట్లాడిన ఈ వీడియోలో పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనల సమయంలో పోస్టు చేసిన ఈ వీడియోను కొంతకాలం తర్వాత ఫేస్బుక్ నుంచి తొలగించారు.దీనిపై స్పందించిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని, ఆటోమేటెడ్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగానే వీడియో తొలగించబడిందని వివరణ ఇచ్చింది. అనంతరం వీడియోను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దేశ ప్రధాని స్థాయి వ్యక్తికి సంబంధించిన కంటెంట్ కూడా అల్గారిథంల నిర్ణయాల్లో చిక్కుకోవడం టెక్ సంస్థల జవాబుదారీతనంపై కొత్త చర్చకు దారితీసింది.‘టెక్నికల్ ఎర్రర్’తో సరిపెట్టుకోవద్దుసోషల్ మీడియా సంస్థలు కోట్లాది పోస్టులను పరిశీలించేందుకు ఆటోమేటెడ్ అల్గారిథంలను ఉపయోగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్ను గుర్తించి తొలగించడం వీటి ప్రధాన ఉద్దేశం. అయితే కొన్నిసార్లు సరైన కంటెంట్ కూడా పొరపాటున తొలగించబడుతోందనే విమర్శలు ఉన్నాయి. 2016లో వియత్నాం యుద్ధానికి సంబంధించిన పులిట్జర్ అవార్డు పొందిన ప్రసిద్ధ ఫొటోను ఫేస్బుక్ తొలగించింది. నగ్నత్వ నిబంధనల ఉల్లంఘనగా అల్గారిథం గుర్తించడంతో ఈ చర్య తీసుకుంది. తీవ్ర విమర్శల తర్వాత ఫేస్బుక్ తన నిర్ణయం తప్పని అంగీకరించింది. తాజాగా మోదీ వీడియో ఘటనలోనూ మళ్లీ “టెక్నికల్ సమస్య”నే కారణంగా చెప్పడం.. అల్గారిథంల పారదర్శకతపై ప్రశ్నలు పెంచుతోంది.పార్లమెంట్ కమిటీ కూడా ప్రశ్నలుమరోవైపు ఈ వ్యవహారంపై పార్లమెంట్ సమాచార సాంకేతిక వ్యవహారాల కమిటీ కూడా మెటా ప్రతినిధులను ప్రశ్నించింది. సోమవారం జరిగిన సమావేశంలో మెటా అధికారులు వీడియో తొలగింపుపై క్షమాపణలు తెలిపారు. అయితే కేవలం క్షమాపణలు చెప్పడం సరిపోదని, ఇలాంటి నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహిస్తారనే అంశంపై స్పష్టత అవసరమని కమిటీ సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం.ఐటీ కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఈ ఘటనపై స్పందిస్తూ.. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ స్వయంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని వీడియోను తొలగించడం తీవ్రమైన అంశం. అవసరమైతే మెటాకు లభిస్తున్న “సేఫ్ హార్బర్” రక్షణపై కూడా పునరాలోచించాల్సి ఉంటుంది. మూడు రోజుల్లో జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పాలి. బాధ్యులైన వాళ్లందరిపైనా చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.మెటా కొత్త భద్రతా చర్యలుఈ వివాదం నేపథ్యంలో ప్రముఖ ఖాతాల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటామని మెటా కేంద్రానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రధాని వంటి హైప్రొఫైల్ ఖాతాలకు సంబంధించిన పోస్టులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులపై చర్య తీసుకునే ముందు సీనియర్ అధికారులు సమీక్షించే విధానాన్ని అమలు చేయనున్నట్లు మెటా వెల్లడించింది. కనీసం ఇద్దరు సీనియర్ అధికారుల పరిశీలన తర్వాతే తుది నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపింది.అల్గారిథంల వెనుక దాక్కోవద్దుటెక్ సంస్థలు తమ అల్గారిథంలను ఒక “బ్లాక్ బాక్స్”లా ఉంచుతున్నాయనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఏ పోస్టు ఎందుకు తొలగించబడుతుంది? ఏ కంటెంట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు? అనే విషయాల్లో పారదర్శకత తక్కువగా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధాని వీడియో తొలగింపు ఘటనను కేవలం సాంకేతిక లోపంగా కాకుండా.. డిజిటల్ వేదికలపై జవాబుదారీతనం పెంచేందుకు వచ్చిన అవకాశంగా భారత్ చూస్తోంది. క్షమాపణలతో సమస్య ముగియదని.. అల్గారిథంల నిర్ణయాలకు టెక్ సంస్థలు బాధ్యత వహించాల్సిందేననే డిమాండ్ బలపడుతోంది. -
ఢిల్లీకి సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయి అనుమతుల సాధనే ఎజెండాగా ఆయన ఈ దఫా ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్. పాటిల్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్లతో భేటీ కానున్నారు.సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు నేపథ్యంలో అటవీ, పర్యావరణ అనుమతులు కోరుతూ ఇరువురు మంత్రులకు ఆయన వినతిపత్రాలు సమర్పించనున్నారు. అదే విధంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున వీలును బట్టి పలు శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను, పార్టీ పెద్దలను కలిసే అవకాశముందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
విమానం గాల్లో ఉండగా కుదుపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కుదుపులకు గురయ్యింది. దీంతో ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయని అది మినహా ప్రయాణికులు, సిబ్బంది సేఫ్ అని విమానయాన సంస్థ ప్రకటించింది. పెనుప్రమాదం తప్పడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. అయితే విమానం ఎందుకు కుదుపులకు గురయింది అనే విషయం తెలియాల్సి ఉంది. -
వినేశ్ ఫొగాట్ సంచలన ఆరోపణలు
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో అతడికి క్లీన్చిట్ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో బ్రిజ్భూషణ్తో పాటు సహ నిందితుడిగా ఉన్న రెజ్లింగ్ సమాఖ్య మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ను కూడా నిర్దోషిగా తేల్చింది.ఈ నేపథ్యంలో భారత స్టార్ రెజ్లర్, ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ ఘాటుగా స్పందించింది. మొదటి నుంచీ వ్యవస్థ బ్రిజ్భూషణ్ సింగ్ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు.. ‘‘బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించేందుకు మేము ఢిల్లీ వీధుల్లో పోరాడాల్సి వచ్చింది.అతడు తన అధికారం, పలుకుబడిని ఉపయోగించి కొంత మంది అమ్మాయిలను ఈ కేసు నుంచి ఉపసంహరించుకునేలా బలవంతం చేశాడు. అయితే, మరికొందరు మాత్రం తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా బ్రిజ్భూషణ్పై న్యాయస్థానంలో పోరాడేందుకు సిద్ధమయ్యారు.కానీ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో కోర్టు బ్రిజ్భూషణ్ను నిర్దోషిగా ప్రకటించడం అత్యంత విచారకరం. మొదటి నుంచి అతడిని కాపాడేందుకు వ్యవస్థ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో హైకోర్టుకు అప్పీలు చేసేలా ఇప్పటికే చాలా మంది మహిళా రెజ్లర్లు తమ న్యాయవాదులకు సందేశం ఇచ్చారు.ఇప్పటికీ మేము ఆశను కోల్పోలేదు. బ్రిజ్భూషణ్ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా రెజ్లర్ల పోరాటం కొనసాగుతుంది’’ అని వినేశ్ ఫొగాట్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంది. కాగా బ్రిజ్భూషణ్ తమను లైంగికంగా వేధించాడంటూ ఆరుగురు మహిళా రెజ్లర్లు ఆరోపించారు.అయితే, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం లేదని రాజధానిలో రెజ్లర్లు నిరసనకు దిగారు. సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ వారికి మద్దతుగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.ఆరోపణలు చేసిన ఆరుమంది రెజ్లర్లలో ఓ మైనర్ కూడా ఉండటంతో.. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే, ఆ తర్వాత ఆమె కేసును ఉపసంహరించుకోవడంతో బ్రిజ్భూషణ్కు భారీ ఊరట దక్కింది. తాజాగా.. మిగిలిన కేసుల్లోనూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించడం గమనార్హం. అయితే, రెజ్లర్లు హైకోర్టులో అప్పీలు చేసేందుకు సిద్ధమైనట్లు వినేశ్ ఫొగాట్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. -
జంతర్ మంతర్ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆందోళనలు, నినాదాలు, ప్రజా ఉద్యమాలు. ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయాలన్నా.. తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నా.. అనేక వర్గాలకు ఇది దశాబ్దాలుగా కీలక వేదికగా మారింది. తాజాగా నీట్ పరీక్షల అక్రమాలపై విద్యార్థుల నిరసనలకు కూడా ఇదే ప్రాంతం వేదికైంది. ఇలాంటి చరిత్ర ఉన్న జంతర్ మంతర్ను నిరసనల కోసం వినియోగించడంపై పునరాలోచించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం, కేంద్రం–ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడంతో ఈ చారిత్రక ప్రాంతం మరోసారి చర్చలోకి వచ్చింది.అయితే జంతర్ మంతర్ పుట్టుక నిరసనల కోసం కాదు. ఖగోళ పరిశోధనల కోసం నిర్మించిన ఈ ప్రదేశం.. కాలక్రమేణా ప్రజల సమస్యలు ప్రతిధ్వనించే ప్రజాస్వామ్య వేదికగా మారింది. ఒకప్పుడు సూర్యుడు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత పాలకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రజలు తమ గళాన్ని వినిపించే వేదికగా పరిణామం చెందింది. మరి ఈ మార్పు ఎలా జరిగింది? జంతర్ మంతర్ చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు ఏవి? ఆ లోతులోకి వెళ్తే. ఖగోళ కేంద్రం నుంచి ఉద్యమాల వేదిక వరకుజంతర్ మంతర్ను 18వ శతాబ్దంలో జైపూర్ మహారాజు సవాయి జైసింగ్-2 నిర్మించారు. 1724లో నిర్మించిన ఈ ఖగోళ పరిశోధనా కేంద్రంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసేందుకు భారీ పరికరాలను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో భారతదేశ శాస్త్రీయ ఆలోచనలకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది.జంతర్ మంతర్ అనే పేరు కూడా దాని చరిత్రతో ముడిపడి ఉంది. సంస్కృతంలోని ‘యంత్ర’ (పరికరం), ‘మంత్ర’ (సూత్రం లేదా లెక్కింపు) అనే పదాల నుంచి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఖగోళ గణనలకు ఉపయోగించే ప్రత్యేక యంత్రాల కారణంగా ‘యంత్ర మంత్ర’ కాలక్రమంలో ‘జంతర్ మంతర్’గా ప్రాచుర్యంలోకి వచ్చింది.కానీ కాలం మారింది. ఢిల్లీ నగరం విస్తరించడంతో పాటు జంతర్ మంతర్ చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు సమీపంగా ఉండటం వల్ల తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం మొదలైంది. అలా ఖగోళ పరిశోధనలకు వేదికగా ప్రారంభమైన ఈ ప్రదేశం.. క్రమంగా దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిరసన వేదికల్లో ఒకటిగా మారింది.అన్నా ఉద్యమంతో దేశవ్యాప్త గుర్తింపుజంతర్ మంతర్కు భారీ గుర్తింపు తెచ్చిన ఉద్యమాల్లో 2011లో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒకటి. బలమైన లోక్పాల్ చట్టం కోసం జరిగిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో భాగమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని దేశం మొత్తం చూసేలా చేసిన ఈ ఉద్యమం తర్వాత జంతర్ మంతర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.అయితే అన్నా ఉద్యమంతోనే జంతర్ మంతర్ నిరసనల చరిత్ర ప్రారంభం కాలేదు. అంతకుముందు నుంచే ఉద్యోగాలు, కార్మిక హక్కులు, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అనేక సంఘాలు, రాజకీయ పార్టీలు ఇక్కడ ఆందోళనలు నిర్వహించాయి. అన్నా ఉద్యమం మాత్రం ఈ ప్రాంతాన్ని ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా నిలిపింది.నిర్భయ ఘటనతో యువత కదిలి..2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. న్యాయం కోసం, కఠిన చట్టాల కోసం జరిగిన నిరసనల్లో జంతర్ మంతర్ కీలక కేంద్రంగా మారింది. యువత ఒక్కటిగా పోరాటానికి దిగింది. ఈ ఉద్యమం ఒక ఘటనకు వ్యతిరేకత మాత్రమే కాదు.. దేశంలో మహిళల భద్రత, న్యాయ వ్యవస్థ, చట్టాలపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల ఆగ్రహం ప్రభుత్వాలను స్పందించేలా చేసిన సందర్భాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.రైతు ఉద్యమాలకు సాక్ష్యంజంతర్ మంతర్ చరిత్రలో రైతు ఉద్యమాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయ సమస్యలు, కనీస మద్దతు ధర, రైతుల ఆదాయం వంటి అంశాలపై రైతు సంఘాలు ఎన్నోసార్లు ఇక్కడ తమ గళాన్ని వినిపించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020–21లో జరిగిన రైతు ఉద్యమ సమయంలో జంతర్ మంతర్ మరోసారి కీలకంగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఆందోళనలు సాగినప్పటికీ.. రైతు సంఘాలు ఇక్కడ ప్రత్యేక నిరసనలు నిర్వహించి తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యవసాయ విధానాలపై పెద్ద చర్చకు దారితీసింది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది.రెజ్లర్ల ఆందోళనతో మరోసారి చర్చలోకి2023లో మహిళా రెజ్లర్ల నిరసనలతో జంతర్ మంతర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఆరోపణలకు సంబంధించి సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు క్రీడా రంగంలో మహిళల భద్రత, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై పెద్ద చర్చకు కారణమయ్యాయి.నీట్ నిరసనలు.. కొనసాగుతున్న గళంఇటీవల నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై విద్యార్థులు కూడా జంతర్ మంతర్ను ఆశ్రయించారు. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్ వంటి అంశాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం, వివిధ ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలపై కూడా అనేక వర్గాలు ఇక్కడ నిరసనలు చేపట్టాయి. ఇలా జంతర్ మంతర్ కేవలం ఒక ప్రాంతంగా కాకుండా.. ప్రజల సమస్యలు దేశవ్యాప్తంగా వినిపించే వేదికగా మారింది.ఇబ్బందులు కూడా ఉన్నాయా?అయితే జంతర్ మంతర్ నిరసనల వల్ల సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. తరచూ జరిగే ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని, స్థానిక ప్రజలు, అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్కు బదులుగా ప్రత్యేక నిరసన వేదిక ఏర్పాటు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నుంచి వివరాలు కోరింది.ప్రజాస్వామ్యానికి ప్రతీక.. మార్పు అవసరమా?జంతర్ మంతర్ భారత ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించే హక్కుకు ఇది ప్రతీకగా నిలిచింది. అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రజల గొంతు పాలకుల వరకు చేరే అవకాశం కల్పించింది. అయితే నగర నిర్వహణ, సాధారణ ప్రజల సౌకర్యాలు కూడా అంతే ముఖ్యమని న్యాయస్థానం పరిశీలిస్తోంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న.. జంతర్ మంతర్ ఉద్యమాల వేదికగా కొనసాగుతుందా? లేక కొత్త నిరసన కేంద్రానికి మారుతుందా? అనేది. -
అమిత్ షా ఎక్కడ?!
జంతర్ మంతర్ వద్ద నీట్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య వ్యవహారం పార్లమెంట్ను కుదిపేస్తోంది. ఘటనపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాల్లో వరుసగా వాయిదాల పర్వం(ఇవాళ కూడా) కొనసాగుతోంది. అయితే అమిత్ షా గైర్హాజరీని కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రధాన అస్త్రంగా చేసుకోగా.. బీజేపీ మాత్రం ఆరోపణలను ఖండిస్తోంది.విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు అనవసర బల ప్రయోగం జరిపారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా చలో సంసద్ ర్యాలీ సమయంలో లాఠీలు, పెల్లెట్ గన్స్ వినియోగించారనే ఆరోపణలపై కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా బలగాలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటాయని, అందుకే ఘటనకు బాధ్యత హోంమంత్రి అమిత్ షాదేనని విపక్ష నేతలు అంటున్నారు.“అమిత్ షా సమాధానం చెప్పాలి”పరీక్షల సంస్కరణ బిల్లు చర్చ సందర్భంగా లోక్సభలో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై పోలీసు చర్యకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించిన ఆయన.. హోంమంత్రి అనుమతి లేకుండా ఇలాంటి పరిణామాలు ఎలా చోటుచేసుకున్నాయని నిలదీశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. వారిపై బలప్రయోగం చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత అమిత్ షాపై ఉందని పేర్కొంటూ.. ఆయన సభకు రాకపోవడంపై కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.కేంద్రం వాదన ఏంటి?అయితే ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. నిరసనల సమయంలో పోలీసులు సంయమనం పాటించారని, ఎలాంటి అనవసర బలప్రయోగం జరగలేదని చెబుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు.. రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండిస్తూ ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా విపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.మళ్లీ రంగంలోకి CJPమరోవైపు నీట్ నిరసనలకు నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కూడా తన డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ ఇంకా నెరవేరలేదని ఆ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న కీలక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కేంద్రానికి మరో సవాల్గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసుల ఉపసంహరణ, విద్యార్థులపై చర్యలపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలను మళ్లీ ఉధృతం చేసే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.షా మౌనం చర్చనీయాంశంనీట్ నిరసనల వ్యవహారంలో ఇప్పటివరకు అమిత్ షా ప్రత్యక్షంగా స్పందించకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆయన గైర్హాజరీని విపక్షాలు ప్రశ్నిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక కారణాన్ని వెల్లడించలేదు. మరోవైపు CJP తదుపరి కార్యాచరణ ప్రకటించనున్న నేపథ్యంలో.. ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.విద్యార్థులపై పోలీసు చర్యల ఆరోపణలు.. అమిత్ షా మౌనం.. కేసుల ఎత్తివేత డిమాండ్.. ఈ మూడు అంశాలు కేంద్రంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్లో హోంమంత్రి స్పందిస్తారా? రాజకీయ రగడ మరింత కొనసాగుతుందా?? అన్నదే ఆసక్తికరంగా మారింది. -
ఇక కేసు లేనట్లే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మైనర్ బాలికకు ఊరట లభించింది. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. జంతర్ మంతర్లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల్లో భాగంగా వైరల్ అయిన వీడియోలో బాలిక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.తొలుత నోయిడా పోలీసులు ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆ ఫిర్యాదులో ఆమెను 25 ఏళ్ల మహిళగా పేర్కొన్నారు. అనంతరం సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియోలో తాను కేవలం 15 ఏళ్ల బాలికనని, ఇతరుల ప్రభావంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె వెల్లడించింది. “నేను చేసినది క్షమించరాని తప్పు. చాలా చెడ్డ మాటలు మాట్లాడాను. ఇది నా మొదటి, చివరి తప్పు. దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెబుతున్నాను” అంటూ ఆ బాలిక వీడియోలో పేర్కొంది.మోదీ క్షమాభిక్ష.. మారిన పరిణామాలుఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. తనను దూషించిన వారిని క్షమిస్తున్నట్లు తెలిపారు. “అలాంటి పిల్లలను కోర్టుల చుట్టూ తిప్పడం, శిక్షించడం వల్ల పరిస్థితులు మారవు. వారిని క్షమించాలని కోరుకుంటున్నాను” అని మోదీ పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలోనూ బాలికపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ పలువురు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కూతురిని క్షమించాలని తల్లి విజ్ఞప్తిబాలిక తల్లి కూడా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తన కుమార్తెపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. “మోదీ గారు గొప్ప మనసుతో నా కుమార్తెను క్షమించారు. ఆమెకు కొత్త జీవితం ఇచ్చారు. చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నాను” అని ఆమె తెలిపారు. అంతేకాకుండా 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించాలని ప్రధానిని కోరారు. చిన్నారులు సులభంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.CJP నిరసనల నేపథ్యంలో ఘటననీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఐదు వారాలకు పైగా నిరసనలు నిర్వహించింది. ఎక్కువగా విద్యార్థులు ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడంతో గత నెలలో ఈ నిరసనలను విరమించారు. అయితే నిరసనల సమయంలోనే నోయిడాకు చెందిన బాలిక.. రెచ్చిపోయి మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఓ సుప్రీం కోర్టు లాయర్ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆపై ప్రధాని క్షమాభిక్ష.. పోలీసుల నిర్ణయం.. మైనర్ బాలికకు భారీ ఊరట లభించినట్లయింది. -
నిరసనలపై బీజేపీ మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ: జంతర్మంతర్లో ఇటీవల జరిగిన విద్యార్థులు, సీజేపీ నిరసన కార్యక్రమంపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. నిరసనలో పాల్గొన్న వారిలో విద్యార్థుల కంటే "పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు" ఎక్కువ మంది ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైనా తీవ్ర విమర్శలు చేశారు.తాజాగా మీడియాతో మాట్లాడిన బిధూరి మాట్లాడుతూ.. ‘జంతర్మంతర్లో జరిగిన నిరసనలో విద్యార్థుల కంటే పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు. పంక్చర్ వేసేవాళ్లు, తాళాల మేస్త్రీలు ఎవరనేది మీకు తెలుసు’ అని అన్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిని ఉద్దేశిస్తూ.. "ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను దేశ ప్రధాని గురించి అలాంటి భాష మాట్లాడమని ప్రోత్సహించరు. మోదీ జీని దూషించే వారు పంక్చర్ వేసేవాళ్ల పిల్లలు లేదా వారి కుటుంబాలకు చెందినవారే" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.నీట్ (NEET) అంశాన్ని అడ్డం పెట్టుకుని కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జనరేషన్-జెడ్ (Gen Z) యువతను తప్పుదోవ పట్టించాయని బిధూరి ఆరోపించారు. ‘నీట్ సమస్య పేరుతో కొందరు సంఘ వ్యతిరేక శక్తులు జంతర్మంతర్ వద్ద యువతను సమీకరించాయి. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం, పార్లమెంట్పై దాడికి ప్రయత్నించడం, దేశంలో అశాంతి సృష్టించడమే వారి లక్ష్యం’ అంటూ ఆయన అన్నారు.జెన్-జెడ్కు అవగాహన కల్పించాలి..గత 12 ఏళ్లలో దేశంలో జరిగిన మార్పులు, అభివృద్ధి, అంతకుముందు 12 ఏళ్ల పరిస్థితుల గురించి యువతకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బిధూరి పేర్కొన్నారు. తప్పుదోవ పట్టిన జనరేషన్-జెడ్ను సరైన మార్గంలోకి తీసుకురావాలి. గత 12 ఏళ్లలో దేశంలో ఏం జరిగిందో, అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో వారికి వివరించాలని అన్నారు. అయితే, రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. గతంలో కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈసారి కూడా నిరసనలో పాల్గొన్న వారిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చే అవకాశముంది. -
రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్.. ఉదయం లేవగానే భారీ షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఒక మురికివాడలో నివసించే మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు. అయితే, అంతలోనే ఆయన ఖాతాను యూట్యూబ్ తొలగిచింది. దీనిపై యూట్యూబ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అయితే ఇర్ఫాన్ పేజీ ‘మెయిన్ ఇర్ఫాన్’ను తెరవడానికి ప్రయత్నిస్తే.. “గూగుల్ సేవా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ ఖాతాను తొలగించాం” అనే సందేశం కనిపిస్తోంది.ఇర్ఫాన్ కూడా ఎక్స్లో స్పందించారు. ఖాతా తొలగింపు “ఏదో పొరపాటు” వల్ల జరిగి ఉంటుందని చెబుతూ, దానిని సరిచేయాలని యూట్యూబ్ను కోరారు. “నా ఛానల్ పూర్తిగా కొత్తది. యూట్యూబ్ మార్గదర్శకాలను నేను నిజాయితీగా పాటించాను” అని ఇర్ఫాన్ పేర్కొన్నారు. “ప్రజలు నా కంటెంట్ను ఎంతో ఇష్టపడ్డారు. అందుకే సబ్స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. మీ ఆటోమేటిక్ వ్యవస్థ వల్ల పొరపాటు జరిగి ఉండొచ్చు. దయచేసి నా ఛానల్ను మరోసారి పరిశీలించి పునరుద్ధరించండి” అని అన్నారు.ఇర్ఫాన్ ఛానల్కు సీనియర్ జర్నలిస్టు అజిత్ అంజుమ్ బహిరంగంగా మద్దతు తెలిపారు. ఛానల్ యాక్టివ్గా ఉన్న సమయంలో, అది తొలగించిన తర్వాత కూడా ఆయన ఎక్స్లో పలుసార్లు పోస్టులు చేశారు.“ఢిల్లీలోని ఒక మురికివాడలో నివసించే మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు మా సహకారంతో నిన్ననే తన యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు” అని అజిత్ అంజుమ్ ఆదివారం ఎక్స్లో పోస్టు చేశారు. “నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకూ అతని ఛానల్కు 70,000 మందికి పైగా సబ్స్క్రైబర్లు వచ్చారు. ఈ ఉదయం అకస్మాత్తుగా అతని యూట్యూబ్ ఛానల్ను తొలగించారు. ఆ యువకుడు ఇంత తక్కువ సమయంలో ఇంతమంది సభ్యులను ఎలా సంపాదించాడు? అదే ఒక అసాధారణ విజయం. మరి యూట్యూబ్ అతని ఛానల్ను ఇంత హఠాత్తుగా ఎందుకు తొలగించింది?” అని ప్రశ్నించారు.ఇంకా పలువురు సోషల్ మీడియా యూజర్లు కూడా ఇర్ఫాన్ పేజీకి మద్దతుగా పోస్టులు చేశారు. ఆ కంటెంట్, ఛానల్ నిజమైనవేనని, గూగుల్కు చెందిన యూట్యూబ్ ఆటోమేటెడ్ వ్యవస్థల పొరపాటు వల్లే ఖాతా తొలగింపు జరిగిందని పేర్కొన్నారు. ఈ సమస్యను సరిచేయాలని యూట్యూబ్ను కోరారు.A young man named Mohammad Irfan, who lives in a slum in Delhi, started his YouTube channel just yesterday with our support. From yesterday evening until this morning, his channel gained more than 70,000 subscribers.suddenly this morning, his YouTube channel was terminated.How… https://t.co/AoQeeMKEog— Ajit Anjum (@ajitanjum) August 2, 2026 -
ఢిల్లీలో తెల్లవారుజామున భూకంపం.. ఉలిక్కిపడిన జనం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, నగరంలోని ఉత్తర జిల్లాలో ఉదయం 4:14 గంటలకు ఈ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూ అంతర్భాగంలో 8 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. తెల్లవారుజామున అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. EQ of M: 2.9, On: 02/08/2026 04:14:01 IST, Lat: 28.721 N, Long: 76.957 E, Depth: 8 Km, Location: North District, Delhi. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @DrNKalaiselvi @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/zY2wLZ1Sqi— National Center for Seismology (@NCS_Earthquake) August 1, 2026అయితే ఈ భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఇదే సమయంలో దేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భూకంపాలు నమోదైనట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆదివారం ఉదయం ఈ వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన భూకంపాల తీవ్రత చాలా తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 700 కిలోమీటర్ల లోతు వరకు ఎక్కడైనా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది కూడా చదవండి: పెరూ: కూలిన విమానం.. 13 మంది దుర్మరణం -
మోదీ మంచి మనసు.. రుచికా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జంతర్ మంతర్ నిరసనల్లో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు.. కేసు ఎదుర్కొంటున్న రుచికా సింగ్ తాజాగా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేసింది. తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని అంటోంది. అదే సమయంలో రుచికా వ్యవహారంపై పరోక్షంగా ప్రధాని మోదీ స్పందించడమూ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వెంటనే ఈ ఎపిసోడ్లో మరికొన్ని ట్విస్టులు వెలుగు చూశాయి.. ఢిల్లీలోని జంతర్ మంతర్లో నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా నోయిడాకు చెందిన రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. కొందరు యువకులు వీడియో తీస్తుండగా రెచ్చిపోతూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్ప్రెస్వే పోలీస్ స్టేషన్లో రుచికా సింగ్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 352, 353(1), 356(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ప్రజా శాంతికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. జంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు.మోదీ ఏమన్నారంటే..ఈ వివాదం మధ్య ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తనపై, తన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చెప్పిన ఆయన.. యువత చేసిన తప్పులకు మార్పు అవకాశం ఇవ్వాలని సూచించారు. “నన్ను దూషించిన వారిని క్షమించాలనుకుంటున్నాను. పిల్లలు తప్పులు చేస్తారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపించడం సమాజం బాధ్యత” అని మోదీ అన్నారు. అవమానాలు ఏ సమస్యను పరిష్కరించవని, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాతే రుచికా క్షమాపణ వీడియో బయటకు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.Abuses never solve anything. Let’s guide the misguided. Let’s work together. Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL— Narendra Modi (@narendramodi) July 31, 2026చేతులు జోడించి రుచికా క్షమాపణలుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రుచికా సింగ్ చేతులు జోడించి దేశ ప్రజలకు క్షమాపణలు కోరింది. “నేను చేసినది తప్పు. దేశం మొత్తానికి క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇది నా మొదటి, చివరి తప్పు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయను” అని ఆమె చెప్పింది. తాను అక్కడ ఉన్న కొందరి ప్రభావానికి లోనై ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొంది. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారనేది స్పష్టత రావాల్సి ఉంది.Ruchika Singh, a CJP protester who made abusive remarks against PM Narendra Modi, has issued an apology to the entire country.She claims that other people at the protest influenced and encouraged her to use abusive language. She has promised never to repeat such an act again.… pic.twitter.com/hNQULRZ8r1— Mukesh (@mksh_kgp) July 31, 2026వయసుపై వివాదంఈ వ్యవహారంలో మరో కీలక అంశంగా రుచికా వయసు మారింది. క్షమాపణ వీడియోలో ఆమె తన వయసు 15 ఏళ్లు అని చెప్పింది. అయితే పోలీసుల ఎఫ్ఐఆర్లో ఆమె వయసు 25 ఏళ్లుగా పేర్కొనడం గమనార్హం. దీంతో ఆమె అసలు వయసు ఎంత? అనే ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు ఆమె కుటుంబ వివరాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.నేపథ్యంపై సోషల్ మీడియాలో చర్చఇదే సమయంలో రుచికా వ్యక్తిగత నేపథ్యంపై సోషల్ మీడియాలో పలు వాదనలు వైరల్గా మారాయి. ఆమె గతంలో ఓ సెలూన్లో నెయిల్ ఆర్ట్ శిక్షణ కోసం వెళ్లేదని, ఆధార్ కార్డు అడిగిన తర్వాత అక్కడికి వెళ్లడం ఆపేసిందని ఆ సెలూన్ యజమాని చెప్పినట్లు కొన్ని పోస్టుల్లో పేర్కొన్నారు. అలాగే ఆమె తన పేరు వేరుగా చెప్పిందని, ఆధార్ వివరాలు ఇవ్వలేదని కూడా కొన్ని వాదనలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అంశాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. వాస్తవాలు పోలీసు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.భావ ప్రకటనా స్వేచ్ఛపై చర్చరుచికాపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రశ్నించారు. అభ్యంతరకర వ్యాఖ్యలను సమర్థించలేమని చెబుతూనే.. కేవలం వ్యాఖ్యల ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని అన్నారు. అలాంటి సందర్భాల్లో పరువునష్టం వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించవచ్చని సూచించారు. అదే సమయంలో నిరసనకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని కూడా కోరారు.రుచికా క్షమాపణలు, మోదీ స్పందన, ఆమె వయసుపై వివాదం, సీజేపీ స్పందన పోలీసుల దర్యాప్తు.. ఈ పరిణామాలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. యువతకు మార్పు అవకాశం ఇవ్వాలన్న మోదీ సందేశం ఒకవైపు చర్చకు దారితీస్తుండగా.. చట్టపరమైన ప్రక్రియ మరోవైపు కొనసాగుతోంది. -
పెల్లెట్ గన్స్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జంతర్మంతర్లో జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్ వినియోగంపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతున్న వేళ.. ఈ అంశంపై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పోలీసులు పెల్లెట్ గన్స్ను ఉపయోగించడంలో తప్పేం లేదని స్పష్టం చేసింది. అయితే..పెల్లెట్ గన్స్ను పూర్తిగా బ్యాన్ చేయాలన్న డిమాండ్ను కోర్టు అంగీకరించలేదు. బదులుగా, అసాధారణ (exceptional), అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటి వినియోగం సమంజసమే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే జూలై 20న జంతర్మంతర్లో విధుల్లో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) ఉపయోగించిన మందుగుండు సామగ్రికి సంబంధించిన పూర్తి రికార్డును (అమ్యూనిషన్ లాగ్) భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. నిరసనల్లో గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.పోలీసుల అధికారాలపై కోర్టు వ్యాఖ్యలుపెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని మాజీ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. నిరసనలు హింసాత్మకంగా మారి, దుండగులు చొరబడి పరిస్థితి అదుపు తప్పినప్పుడు పోలీసులు చట్టబద్ధంగా బలప్రయోగం చేయాల్సి వస్తుందని పేర్కొంది. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వంటి చర్యలు ఫలించకపోతే, అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో పోలీసులు బుల్లెట్లను కూడా ఉపయోగించేందుకు చట్టం అవకాశం ఇస్తుందని.. అలాంటప్పుడు ప్రాణాంతకం కాని (Non-lethal) పెల్లెట్ గన్స్ను పూర్తిగా నిషేధించాలని ఎలా చెప్పగలమని ధర్మాసనం ప్రశ్నించింది. అదే సమయంలో.. వాటి వినియోగంపై స్పష్టమైన ప్రోటోకాల్ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయమూ వ్యక్తం చేసింది.గాయపడిన వారికి చికిత్స తప్పనిసరినిరసనల సమయంలో ఎవరైనా గాయపడితే వారికి తక్షణమే నాణ్యమైన వైద్య చికిత్స అందించడం ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జంతర్ మంతర్ ఘటనలో గాయపడిన నిరసనకారులందరికీ అవసరమైన వైద్య సేవలు అందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.సీఆర్పీఎఫ్ నివేదిక ఏమంటోంది?ఇదిలా ఉండగా, జంతర్మంతర్ వద్ద పోలీసు చర్యపై సీఆర్పీఎఫ్ అంతర్గత విశ్లేషణలో అన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) పాటించినట్లు పేర్కొంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మొదట ప్రజలను చెదరగొట్టేందుకు హెచ్చరికలు జారీ చేయడం, అనంతరం టియర్ గ్యాస్, లాఠీచార్జ్ వంటి చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతోనే పంప్ యాక్షన్ గన్ ద్వారా పెల్లెట్ గన్స్ను వినియోగించినట్లు నివేదిక వెల్లడించింది.ఇద్దరికీ గాయాలుఈ ఘటనలో ముగ్గురి నుంచి ఐదుగురు నిరసనకారులు పెల్లెట్ల కారణంగా గాయపడినట్లు సమాచారం. మరోవైపు, 47 మంది RAF సిబ్బంది కూడా గాయపడగా, వారిలో ఆరుగురికి తలకు తీవ్ర గాయాలు అయినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది.సిబ్బందికి అండగా డీజీసీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జీ.పీ. సింగ్ తన సిబ్బందికి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజల భద్రత, దేశ ప్రయోజనాల దృష్ట్యా విధి నిర్వహణలో అధికారులు తీసుకున్న నిర్ణయాలకు తానే బాధ్యత వహిస్తానని, చట్టబద్ధంగా విధులు నిర్వర్తించే సిబ్బంది ఎలాంటి భయాందోళనలు లేకుండా పనిచేయాలని ఆయన సూచించారు.కాగా, నీట్ నిరసనల్లో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారంటూ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాయపడిన ఓ విద్యార్థిని చూపిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మండిపడ్డారు. దీంతో ఈ అంశం పార్లమెంట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ రాజకీయ వివాదం నడుమే సుప్రీంకోర్టు అసాధారణ పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా తప్పుబట్టలేమని, వాటిపై సంపూర్ణ నిషేధం అవసరం లేదని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
‘విద్యార్థులకు న్యాయం జరగాలి’
పార్లమెంట్ సమావేశాలు అప్డేట్స్.. రాహుల్కు కౌంటర్..నిశికాంత్ దూబే వ్యాఖ్యలుఅమిత్ షాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను దూబే తీవ్రంగా ఖండించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరికి భయపడరు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే అమిత్ షాకు భయపడుతున్నారు.దేశాన్ని విభజించాలని కోరుకునే దేశ వ్యతిరేక శక్తులే అమిత్ షాకు భయపడుతున్నాయి.ప్రజలు, ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసంతోనే అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్పెల్లెట్ గన్స్పై చర్చించాలని పట్టుఅమిత్ షా సభకు రావాలంటూ నినాదాలు.చర్చకు అంగీకరించని ప్రభుత్వంవిద్యార్థులకు న్యాయం చేయాలి: రాహుల్రాహుల్ గాంధీ కామెంట్స్..విద్యార్థులకు న్యాయం జరగాలి.విద్యార్థులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ ఉన్నత స్థాయి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి.రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి.విద్యార్థుల హక్కులు, భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.Students deserve justice. An independent SC monitored high powered committee must be constituted to probe brutalities against our students. pic.twitter.com/pZATUeAjwC— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2026 కాంగ్రెస్ వాయిదా తీర్మానం..రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై చర్చించాలని డిమాండ్ పార్లమెంట్ వద్ద ప్రతిపక్ష పార్టీల ధర్నా..కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంపార్లమెంటు ద్వారం వద్ద ప్రతిపక్ష పార్టీల ధర్నా అయోధ్య విరాళాల చోరీ పైన దర్యాప్తు చేయాలని నినాదాలుఉభయసభల్లో చర్చకు నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీఅయోధ్య విరాళాల చోరీపై స్వతంత్ర ఆడిటింగ్ దర్యాప్తు జరగాలని నినాదాలుచందా చోర్.. అధికారం నుంచి గద్దె దిగాలని ప్రతిపక్ష నేతల నినాదాలు#WATCH | Delhi: Congress MPs including Priyanka Gandhi Vadra and others hold a protest at Makar Dwar of the Parliament, against Union Home Minister Amit Shah over 'police action' against CJP protestors on 20th July. pic.twitter.com/zmuqaWOt6n— ANI (@ANI) July 30, 2026 -
సీజీపీ రీఎంట్రీ హెచ్చరిక.. జంతర్మంతర్ వద్ద హైఅలర్ట్
ఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరిగిన నిరసనల్లో నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించకపోతే మరోసారి ఆందోళన చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రదర్శనల సమయంలో నిరసనకారులు నిర్ణీత ప్రాంతం దాటి వెళ్లకుండా ఉండేందుకు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన మెటల్ బ్యారికేడ్లను ఇనుప కడ్డీలతో వెల్డింగ్ చేసినట్లు సమాచారం.భవిష్యత్తులో ఆందోళనలు జరిగితే బ్యారికేడ్లను తొలగించడం లేదా ముందుకు కదలడం సాధ్యం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు, ఇతర భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. సీజీపీ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది.36 రోజుల ఆందోళన.. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజీపీ గతంలో జంతర్ మంతర్ వద్ద 36 రోజుల పాటు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం జూలై 25న ఆందోళన విరమించింది. అయితే నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమన్న హామీని కేంద్రం ఉల్లంఘించిందని సీజీపీ ఆరోపించింది. అన్ని ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరోసారి రోడ్డెక్కుతామని హెచ్చరించింది.సీజీపీ ప్రతినిధి ఆశుతోష్ రంకా తాజాగా మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిగా ఉల్లంఘించిందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారని, అరెస్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, అదుపులో ఉన్న నిరసనకారుల విడుదల, కొత్త క్రిమినల్ కేసుల నమోదును నిలిపివేయడం, ఒప్పంద వివరాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారా?సీజీపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే మరో ఉద్యమానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల్లో అసంతృప్తి ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు సహాయం చేసేందుకు దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ సెల్ ఏర్పాటు చేసినట్లు సీజీపీ ప్రకటించింది. అలాగే సాక్ష్యాల సేకరణ కోసం ‘సాక్షి’ అనే ఆన్లైన్ వేదికను ప్రారంభించింది. రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ కూడా కేసులు ఎదుర్కొంటున్న నిరసనకారులకు న్యాయ సహాయం అందించేందుకు రూ.1 కోటి నిధిని ప్రకటించినట్లు సమాచారం. -
బస్సులోకి వరద నీరు.. ఇరుక్కుపోయిన జనం.. వైరల్ అవుతున్న వీడియో
-
జంతర్ మంతర్ లో లాఠీ ఛార్జ్.. పోలీసులకు సుప్రీం నోటీసులు
-
కాక్రోచ్ నిరసనల ఎఫెక్ట్.. ఢిల్లీ వీధుల్లో టెన్షన్!
నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ముగిసిన తర్వాత ఢిల్లీలో కొత్త వివాదం మొదలైంది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం, భద్రతా సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరికొన్ని వీడియోలు చర్చకు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు నీట్ పేపర్ లీక్, పరీక్షా వ్యవస్థలో లోపాలపై ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలు తీవ్రతరం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అనంతరం నిరసనలపై భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న వారిపై దాడులు జరిగినట్టు తాజాగా వీడియోలు బయటకు వస్తున్నాయి. పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.As Soon as Dharmendra Pradhan’s Resignation is Confirmed……• Sonam Wangchuk has left.• Abhijeet Deepke and Saurabh Das are celebrating.Meanwhile, in Delhi, the Sangh Parivar has put their most Notorious and Riotous Group, the Bajrang Dal, out on the Streets.They are… pic.twitter.com/yLa72eEdBA— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) July 28, 2026ఇటీవల సత్యం పండిట్ అనే వ్యక్తి ఇద్దరు నిరసనకారులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చిన వీడియో చర్చకు వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు చూపించే మరికొన్ని వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో చిత్రీకరించినట్లు చెబుతున్న ఓ వీడియోలో, మైక్ పట్టుకున్న ఓ వ్యక్తి కొందరు నిరసనకారులను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నిస్తూ నిలదీసినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అతడి మెడపై చేయి వేసి మాట్లాడుతున్నట్లు, క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆ వ్యక్తి క్షమాపణ చెప్పినట్లు వీడియోలో కనిపిస్తుంది.जो काॅकरोच जंतर-मंतर पर सनातन धर्म और मोदी जी को गाली दे रहे थे उनकी दिल्ली मेट्रो में जमकर धुलाई हो रही है...🤣😏 pic.twitter.com/XHtgERs9Hx— राजपूत सवित सिंह (@Savit12) July 29, 2026 మరో వీడియోలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు వెంబడించి కొట్టినట్లు, తన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకొక వీడియోలో ఓ మహిళను పలువురు వ్యక్తులు చుట్టుముట్టి ప్రశ్నిస్తూ, ఆమెను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలపై నిరసనలకు మద్దతు ఇస్తున్న వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని లేదా విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగమని, నిరసనకారులను బెదిరించడం, దాడి చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొంటున్నారు.బీజేపీ అనుకూల వర్గాల వాదనమరోవైపు, బీజేపీకి మద్దతు ఇస్తున్న వర్గాలు నిరసనల్లో పాల్గొన్న కొందరు వ్యక్తులు హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, పోలీసులపై అనుచిత నినాదాలు చేసినట్లు చూపించే కొన్ని వీడియోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిరసనల పేరుతో చట్టపరమైన, సామాజిక పరిమితులు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నిరసనల్లో పాల్గొన్న వ్యక్తుల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేశాయి. అయితే, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవాల్సింది చట్టపరమైన వ్యవస్థ మాత్రమేనని, వ్యక్తులు లేదా ప్రైవేట్ గుంపులు స్వయంగా చర్యలకు దిగడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.THIS IS SHAMEFUL !!!If this is what young Indians have to face simply for supporting a protest then what kind of democracy are we becoming?This video appears to show Satyam Pandit confronting and slapping two youths on their way to the Jantar Mantar protest has sparked… pic.twitter.com/8zDPBMb1at— Ravi Prakash Official (@raviprakash_rtv) July 26, 2026ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం పౌరుల హక్కు. అదే సమయంలో నిరసనల సమయంలో హింస, బెదిరింపులు, దాడులు లేదా చట్ట ఉల్లంఘనలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు, న్యాయ వ్యవస్థలపై ఉంటుంది. కాగా, నీట్ నిరసనలు ముగిసినా, వాటి చుట్టూ రాజకీయ వాదోపవాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఒకవైపు నిరసనకారులపై దాడుల ఆరోపణలు, మరోవైపు నిరసనల్లో జరిగిన అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. The police have started their job. The Students movement is over. Now who will come forward to help these students?Unity of students is required. #cjpprotesters #india #arrested #students #police pic.twitter.com/6o7LxWowhb— भारतीय (@ramanswall) July 27, 2026 -
నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులపై సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసింది. చార్జ్షీట్లో ఉన్న నిందితుల్లో ముగ్గురు ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సబ్జెక్ట్ నిపుణులు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్లో యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్, దినేశ్, వికాస్, శుభమ్, ధనుంజయ్, ప్రహ్లాద్ సహా మొత్తం 13 మంది పేర్లు ఉన్నాయి. ప్రశ్నపత్రం లీక్కు సంబంధించిన కుట్ర, ప్రశ్నపత్రాల అక్రమ సేకరణ, పంపిణీ తదితర అంశాలపై సీబీఐ విస్తృతంగా దర్యాప్తు జరిపి ఈ చార్జ్షీట్ను సమర్పించింది. ఈ కేసును నేడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణకు తీసుకోనుంది. చార్జ్షీట్పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో కేసులో మరికొంతమందిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. -
హ్యాట్సాఫ్ మేడం..! ఆ ఐడియాకి మాటల్లేవ్ అంతే..
వృత్తి కొందరికీ ఒక ప్యాషన్ అయితే..వాళ్లు అందులో చూపించే క్రియేటివీ మాములగా ఉండదు. ఏ పనిచేసినా..అది అద్భుతంగా ఆలోచనాత్మకంగా ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ ఉపాధ్యాయురాలు. పెద్ద పెద్ద క్రియేటివిటీలతో పనిలేదు. కాస్త అభిరుచితో చాలా సింపుల్గా కూడా అద్భుతం సృష్టించొచ్చు. అదే చూపించింది ఈ ఢిల్లీ ఉపాధ్యాయురాలు. విద్యార్థులు రెగ్యులర్గా క్లాస్కి వచ్చేలా చేసేందుకు ఆమె సృజనాత్మకంగా ఆలోచించిన తీరు తెలిస్తే నోటమాటరాదు. అందుకోసం ఏం పెద్ద పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులేం ఉపయోగించలేదు. జస్ట్ ఒక పేపర్ బోర్డు, చిన్న చిన్న అగ్గిపెట్టెలతోటే అంతా చేశారామె. వాళ్లంతా తమ హాజరును తామే వేసుకునేలా అవకాశం ఇచ్చి..బాధ్యతగా వ్యవహరించేలా చేసింది. ముఖ్యంగా రోజూ వచ్చేలా నిబద్ధతను మెదళ్లులో నాటినట్లుగా చేసిన పని అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో మొదట ఉపాధ్యాయురాలు తరగతి గదిలోకి ప్రవేశించగా..వెనుక విద్యార్థులు ఒక్కొక్కరుగా లోపలికి వచ్చారు.లోపలికి ప్రవేశించిన వెంటనే, ఆమె చేసిన మొదటి పని, చేతితో తయారు చేసిన ఆ స్వీయ-హాజరు బోర్డుపై తన హాజరును గుర్తించడం. ఆ టీచర్నే అనుసరిస్తూ..మిగతా విద్యార్థులంతా స్వీయంగా తమ హాజరును నమోదు చేసుకున్నారు. అందుకోసం ఒక పెద్ద బోర్డుపై చిన్న అగిపెట్టెలను పెట్టి..వాటిపై ప్రతి విద్యార్థి ఫోటో ఉండేలా చేశారు. దానిలోపల బాక్స్లో పీ "P" అనే అక్షరాన్ని ఉంచారు. క్లాస్కి వచ్చిన వాళ్లంతా ఆ బోర్డుపై ఉన్న అగ్గిపెట్టెని ఓపెన్ చేసి P" అనే అక్షరాన్ని బయటకు కనిపించేలా పెడతారు. రానివాళ్లు పెట్టేపై ఆటోమేటిగ్గా కనిపిస్తున్న "O" అనే అక్షరం కనిపిస్తుంది. ఆమె ఈ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంటూ నా చిన్నారులు బాధ్యత తీసుకుంటున్నారు అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా అద్భుతమైన ఆలోచన..బాధ్యతా భావాన్ని పెంచేలా ప్రోత్సహిస్తున్నారంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..) -
జంతర్ మంతర్ వద్ద జులై 31న మరో నిరసన
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ సమయంలో పోలీసులపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ మాజీ పోలీసు అధికారులు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో సంఘ వ్యతిరేక శక్తులు చొరబడి పోలీసు సిబ్బందిపై దాడి చేశాయని, ఆ ఘటనలో 100 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. భద్రతా సిబ్బంది హద్దులు దాటారని నిరసనకారులు ఆరోపిస్తుండగా, సంఘ వ్యతిరేక శక్తులు తమపై దాడి చేశాయని పోలీసులు చెబుతున్నారు.ఇప్పుడు.. పదవీ విరమణ చేసిన అధికారుల సంఘం ఢిల్లీ పోలీసు ఫెడరేషన్ జులై 31న జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ అనురాగ్ కుమార్కు లేఖ రాసింది. తమ దరఖాస్తులో ఫెడరేషన్ ఇలా పేర్కొంది.. ‘‘జూలై 20న జంతర్ మంతర్ పరిసరాల్లో చట్టబద్ధ విధులు నిర్వహిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసు, పారామిలిటరీ దళాల అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. పోలీసు దళానికి సంఘీభావం తెలియజేసేందుకు జులై 31న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేపట్టేందుకు అనుమతి ఇవ్వండి’’ అని కోరింది. శాంతి భద్రతలు కాపాడే సమయంలో భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలను ప్రస్తావించేందుకు ఈ ధర్నాకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ధర్నాను పదవీ విరమణ చేసిన ఢిల్లీ పోలీసు సిబ్బంది అంతా కలిసి చట్టాన్ని గౌరవించే పౌరుల తరఫున నిర్వహిస్తున్నామని, ఇది పూర్తిగా శాంతియుతంగా, అహింసాత్మకంగా సాగుతుందని ఫెడరేషన్ తెలిపింది.మరోవైపు, జులై 20న జరిగిన పోలీసు చర్యపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. "నిరసనల సమయంలో పోలీసులకు కొత్త ప్రోటోకాల్ అవసరం" అని సుప్రీంకోర్టు పేర్కొంది. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలోని విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసులు గతంలో నిర్దేశించిన నిబంధనలు పాటించలేదని కోర్టు సూచించింది. -
NEET నిరసన కేసుల్లో సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: నీట్ నిరసనల కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జంతర్ మంతర్తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల్లో అరెస్టైన, అదుపులోకి తీసుకున్న మైనర్లను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. 18 ఏళ్లలోపు వాళ్లతో పాటు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేని వారిని తక్షణమే విడుదల చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల విషయంలో తదుపరి బలవంతపు చర్యలు (coercive action) తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.వాళ్లకు వర్తించదుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే క్రిమినల్ నేపథ్యం ఉన్నవారికి ఈ రక్షణ వర్తించదని స్పష్టం చేసింది. నిరసనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఒకే విధంగా చూడలేమని, మైనర్లు, గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థుల విషయంలో ప్రత్యేకంగా పరిశీలన అవసరమని కోర్టు అభిప్రాయపడింది.FIRలపై తాత్కాలిక రక్షణజంతర్ మంతర్లో CJP నేతృత్వంలో జరిగిన నిరసనలు, ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులపై కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటికే అరెస్టులు, నిర్బంధాలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ ఆదేశాలు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించనున్నాయి.పోలీసుల చర్యలపై విచారణకు సంకేతాలువిద్యార్థులపై పోలీసులు అతిగా బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు జరిపించే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ విచారణలో పోలీసులపై వచ్చిన ఆరోపణలతో పాటు.. నిరసనకారుల నుంచి పోలీసులపై జరిగిన దాడుల ఆరోపణలను కూడా పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.కేంద్రం, ఏడు రాష్ట్రాలకు నోటీసులుఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల నిరసనల సమయంలో నమోదైన కేసులు, పోలీసు చర్యలు, అరెస్టులపై ఆయా ప్రభుత్వాల నుంచి వివరణ కోరింది.విద్యార్థి ఉద్యమానికి కీలక మలుపునీట్ పేపర్ లీక్ ఆరోపణలపై ప్రారంభమైన ఉద్యమంలో పలువురు విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు, పోలీసు చర్యలపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు విద్యార్థులకు కొంత ఊరటనిచ్చాయి. అయితే క్రిమినల్ నేపథ్యం ఉన్నవారిపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేయడంతో.. ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. -
CJP సంబరాలపై వాంగ్చుక్ రియాక్షన్ ఇదే..
నీట్ ఉద్యమం నేపథ్యంలో తెరపైకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుల సంబరాల వీడియోలపై ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ స్పందించారు. సీజేపీ నిరసనలకు మద్దతుగా ఆయన 26 రోజులపాటు దీక్ష కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాక CJP సభ్యులు పార్టీ చేసుకున్న వీడియోలు వైరల్గా మారిన వేళ.. వాంగ్చుక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.సీజేపీ పార్టీ సంబురాలపై వాంగ్చుక్ స్పందించారు. విజయాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. దాన్ని గౌరవం, నియంత్రణ, బాధ్యతతో స్వీకరించడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. “విజయానికి వినయం తోడవ్వాలి” (Victory must be accompanied by humility) అని సోనమ్ వాంగ్చుక్ పేర్కొన్నారు. CJP నిర్వహించిన నెల రోజులకుపైగా సాగిన నీట్ నిరసనల అనంతరం ఈ సంబరాలు జరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఈ వేడుకలపై విమర్శలు చేయగా.. మరికొందరు ఇది యువత నిరసన వ్యక్తీకరణలో భాగమని సమర్థించారు.సోనమ్ వాంగ్చుక్ పాత్రఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమానికి సోనమ్ వాంగ్చుక్ మద్దతుగా నిలిచారు. నిరాహార దీక్ష చేపట్టిన ఆయన.. పోలీసులు ఆసుపత్రికి తరలించే వరకు నిరసనకారులతోనే ఉన్నారు. అనంతరం ప్రభుత్వం నుంచి హామీలు రావడంతో 26 రోజుల దీక్షను విరమించారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై నమోదైన కేసులు, బాధిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై జరిగిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన దీక్ష విరమణను స్వాగతిస్తూనే.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్షతో తమకు సంబంధం లేదని.. తమ డిమాండ్లు నెరవేరే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. అదే సమయంలో.. Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026CJP సంబరాలపై విమర్శలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన తర్వాతి దీప్కే ప్రసంగంలో సోనమ్ వాంగ్చుక్ పేరు ప్రస్తావనకు రాకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు.. ఎక్స్ ఖాతా నుంచి సోనమ్ వాంగ్చుక్ సపోర్ట్గా వేసిన డీపీని దీప్కే తొలగించగా.. అధికార ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలు అలాగే కొనసాగించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై ఢిల్లీలోని అభిజిత్ దీప్కే నివాసానికి సమీపంలోని ఓ హోటల్లో CJP సభ్యులు డ్యాన్స్లు చేస్తూ సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉద్యమం వెనుక విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యల విషాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వేడుకలు సరైన సందేశం ఇవ్వవని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం కొత్త తరం పోరాట విధానంలో ఉత్సాహం, సృజనాత్మకత కూడా భాగమేనని పేర్కొన్నారు.“ఇదే జెన్ జీ స్టైల్”.. విమర్శలపై CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ.. తమ వేడుకలు యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అంతేకాదు పోరాటంలో పాల్గొన్న ఎవరీని తాము విస్మరించలేదని.. వలంటీర్ల గౌరవార్థమే ఈ పార్టీ ఇచ్చామని చెప్పారు. “ఎంతకాలమైనా రోడ్డుపై కూర్చొని పోరాడగలం.. అదే సమయంలో పాటలు పాడుతూ నిరసన చేయగలం. కాఫీ తాగుతూ ఉద్యమాన్ని నిర్వహించగలం. ఇదే కొత్త తరం శైలి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజకీయ విమర్శకులను అంకుల్స్, ఆంటీస్ అంటూ ఎద్దేవా చేశారు. ఫైవ్ స్టార్ హోటల్ ఆరోపణలుసంబరాల వీడియోలపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందిస్తూ.. CJP నాయకత్వం ఫైవ్ స్టార్ హోటల్లో విజయోత్సవం చేసుకుందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఖర్చులు ఎవరు భరించారంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఆరోపణలను సౌరవ్ దాస్ ఖండించారు. అది ఖరీదైన వేడుక కాదని, సాధారణ హాల్లో జరిగిన కార్యక్రమమని తెలిపారు. వాంగ్చుక్ వ్యాఖ్యలతో కొత్త చర్చCJP సంబరాలపై కొనసాగుతున్న వివాదం మధ్య సోనమ్ వాంగ్చుక్ చేసిన “విజయానికి వినయం తోడవ్వాలి” అనే వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఇది విమర్శలా? లేదంటే ఉద్యమానికి ఇచ్చిన సూచనా? అనే అంశంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
చివరి నిమిషంలో కేంద్రం ప్లాన్ బెడిసి కొట్టిందా?
నీట్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం.. మరో ఆసక్తికర మలుపు తిరిగింది. రాజీనామా కంటే ముందే కేంద్రం మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తప్పించకుండా.. ఆయన శాఖను మార్చే ప్రతిపాదనను కేంద్రం చేసిందట. ఇదే విషయాన్ని ఆ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా ద్వారా ప్రకటించగా.. అది వాస్తవమేనన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం, సీజేపీ మధ్య జరిగిన చర్చల్లో కీలక ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్లు సమావేశమైన సమయంలో.. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించినట్లు సమాచారం. మిగతా రెండు డిమాండ్లను ఎలాంటి షరతుల్లేకుండా అంగీకరిస్తూ.. ఈ ఒక్క డిమాండ్ విషయంలోనే పంతం వీడాలని కోరినట్లు సమాచారం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు దాన్ని తిరస్కరించినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలుగులోకి వచ్చింది.ఒక మంత్రిని కొనసాగించాలా? లేదంటే శాఖ మార్చాలా? అన్నది ప్రధానమంత్రి పరిధిలోని నిర్ణయమని కేంద్ర ప్రతినిధులు వివరించినట్లు తెలుస్తోంది. అయితే సీజేపీ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని సమాచారం. కేవలం శాఖ మారిస్తే సరిపోదని.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తమ డిమాండ్ అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.రాజీనామా తప్ప మరో మార్గం లేదన్న సీజేపీనీట్ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని సీజేపీ మొదటి నుంచీ డిమాండ్ చేసింది. విద్యార్థుల్లో నమ్మకం పునరుద్ధరించాలంటే నాయకత్వ మార్పు అవసరమని వాదించింది. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అంగీకరించలేదని తెలుస్తోంది. ఇటు రాహుల్ కూడా.. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక. ఆయన రాజీనామా చేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం అనైతికం. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఆయన శాఖను మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది. కానీ, ఆయన్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందే. లేకుంటే ఆందోళనలను విరమించం అని రాహుల్ గాంధీ ఆ సమయంలో మీడియా ద్వారా వెల్లడించారు. అటు నిరసనకారులు.. ఇలా విపక్షాలు . రాజీనామాపైనే పట్టుబట్టడంతో చివరకు ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.రాజీనామా తర్వాత రాజకీయ వేడిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్డీయే నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. పార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అదే సమయంలో ప్రతిపక్షాలు.. ఆయన రాకపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా ప్రసంగం ఇచ్చారు. ఉద్యమం తర్వాత కొత్త దశధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరినప్పటికీ.. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశం మరో వివాదంగా మారింది. దీనిపై కేంద్రంతో చర్చలు జరిపిన సీజేపీ.. కేసుల ఉపసంహరణ, విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరుతోంది. మొత్తంగా నీట్ వివాదం కేవలం పరీక్షల నిర్వహణ అంశానికే పరిమితం కాకుండా.. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాల వరకు ప్రభావం చూపింది. -
నీట్ ఉద్యమంలో మిడ్నైట్ ట్విస్ట్!
న్యూఢిల్లీ: నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరో కీలక మలుపు తిరిగింది. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశంపై కేంద్రంతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులతో ప్రభుత్వం అర్ధరాత్రి కీలక చర్చలు జరిపింది. ఈ సమావేశం అనంతరం నిరసనకారులకు రక్షణ కల్పించేలా మరిన్ని రాష్ట్రాల నుంచి అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని సీజేపీ వెల్లడించింది.“ఏ ఒక్క నిరసనకారుడిని ఒంటరిగా వదిలిపెట్టం. అందరం కలిసి ఉన్నాం” అని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై తమకు ఉన్న అనుమానాలను చర్చల్లో ప్రస్తావించామని, వాటిపై స్పష్టమైన హామీలు లభించాయని పేర్కొన్నారు.#Important: 1 AM update.Hours after our press conference, Government’s representatives met us. The meeting lasted for 2-3 hours. They shared copies of the Bihar and Assam notifications guaranteeing FIR withdrawals, no action in future, and release of all detainees and… pic.twitter.com/G7WcHHcfAs— Saurav Das (@SauravDassss) July 27, 2026 2–3 గంటల పాటు సాగిన అర్ధరాత్రి భేటీసోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సౌరవ్ దాస్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమ ప్రెస్మీట్ తర్వాత ప్రభుత్వ ప్రతినిధులు తమను కలిశారని, దాదాపు 2–3 గంటల పాటు చర్చలు సాగాయని తెలిపారు. బిహార్, అస్సాం ప్రభుత్వాలు నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవన్న హామీలకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులను ప్రభుత్వం తమకు అందించిందని చెప్పారు. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం, ఇతర బీజేపీ–ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి కూడా ప్రకటనలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.“హామీలు అమలవుతాయా?”చర్చల అనంతరం విడుదల చేసిన వీడియో సందేశంలో సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీల అమలుపై తమకు ఆందోళన ఉందని స్పష్టం చేశారు. “చర్చల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతాయేమోనన్న భయాన్ని ప్రభుత్వ ప్రతినిధుల ముందు పెట్టాం. అందుకు ప్రతిగా బిహార్ హోం శాఖ జారీ చేసిన ప్రకటనను వారు చూపించారు. అందులో నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లు ఉపసంహరిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవని పేర్కొన్నారు” అని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా రక్షణ కల్పించేలా నోటిఫికేషన్లు జారీ చేయడంపై చర్చ జరిగినట్లు వెల్లడించారు.మళ్లీ ఉద్యమం హెచ్చరికతో కదిలిన ప్రభుత్వంకేంద్రంతో చర్చలకు ముందు సీజేపీ మరోసారి ఆందోళన బాట పట్టే హెచ్చరికలు చేసింది. ఒప్పందం ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు కొనసాగుతున్నాయని పేర్కొంది. బిహార్, బెంగాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారని సీజేపీ ఆరోపించింది. వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలని, అరెస్టైన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించింది.బిహార్, అస్సాం తర్వాత రాజస్థాన్ హామీఇప్పటికే బిహార్, అస్సాం ప్రభుత్వాలు నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన కేసులపై ఉపశమనం కల్పించే నిర్ణయాలు ప్రకటించాయి. అరెస్టైన వారిని విడుదల చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చర్యలు ఉండవని హామీ ఇచ్చాయి. తాజాగా రాజస్థాన్లోనూ నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ లభించిందని సీజేపీ తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదని, ఇకపై కూడా నమోదు చేయబోమని అధికారులు స్పష్టం చేసినట్లు పేర్కొంది.నీట్ పోరాటం ముగిసినట్లే!నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తాత్కాలికంగా ముగిసింది. అయితే నిరసనకారులపై కేసులు, అరెస్టుల అంశం కొత్త వివాదానికి దారితీసింది. తాజా చర్చలతో తాత్కాలికంగా ఆందోళన సద్దుమణిగినప్పటికీ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేసుల ఉపసంహరణ, విద్యార్థుల రక్షణపై అధికారిక ప్రకటనలు రావడమే కీలకంగా మారింది. -
ఢిల్లీ నిరసనలపై ఫేస్ స్కాన్ ఆపరేషన్
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన పార్లమెంట్ ‘చలో సంసద్ ర్యాలీ’లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జంతర్ మంతర్ దగ్గర గత వారం జరిగిన ఉద్రిక్త ఆందోళనలకు సంబంధించిన వందలాది గిగాబైట్ల సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ.. సీజేపీ నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో పోలీసులకు, సీజేపీ మద్దతుదారులకు మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే.సుమారుగా 100 సీసీటీవీ వీడియో క్లిప్లలో నిరసనకారులు.. భద్రతా వలయాలను ఛేదించడం, పోలీసు సిబ్బందిపై దాడి, రాళ్లు రువ్వి ఆస్తులను ధ్వంసం చేయడం రికార్డయింది. ఇప్పటివరకు ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్) ద్వారా 2,873 మంది నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించారు. వీరిలో 989 మందిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ, పోక్సో చట్టం కింద నమోదైన కేసులతో సహా పలు తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇందులో 101 మంది హత్య కేసుల్లో, 284 మంది దొంగతనం కేసుల్లో.. మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్న 92 మంది పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు.పోలీసులు, భద్రతా సిబ్బందిపై దాడులు చేయడం, బారికేడ్లను బద్దలు కొట్టడం, రాళ్లు రువ్వడం, పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, వాహనాలను ధ్వంసం చేయడం, వాహనాల లోపల ఉన్న పోలీసులపై దాడి చేయడం, నిరసన మార్గంలో ఉన్న ప్రజా ఆస్తులను, దుకాణాలను ధ్వంస చేయడం వంటి ఘటనలు పలు ప్రదేశాల్లో సీసీటీవీలలో రికార్డయ్యాయి. కొన్ని ఫుటేజీలలో గుంపుగా బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగడం, జూలై 20న సంసద్ మార్గ్ వద్ద పలు చోట్ల రాళ్లు రువ్విన దృశ్యాలు ఉన్నాయి.అదే రోజు.. జంతర్ మంతర్ సమీపంలో పోలీసులు లోపల కూర్చున్నప్పటికీ, గుంపు పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేసి, ఒక పోలీసు వాహనాన్ని బోల్తా కొట్టించడానికి ప్రయత్నించింది. టాల్స్టాయ్ మార్గ్ వద్ద ఒక వాహనానికి నిప్పు పెట్టడం, బస్సు టైర్లను పంక్చర్ చేయడం సీసీటీవీలో రికార్డయ్యింది. పోలీసు సిబ్బందిపై ప్రత్యక్ష దాడులు జరిగినట్లు పలు వీడియోలు స్పష్టంగా చూపుతున్నాయని వర్గాలు తెలిపాయి. గాయపడిన ఒక మహిళా పోలీసు అధికారిని ఆమె సహచరులు సురక్షిత ప్రాంతానికి తరలించడం కనిపించింది.సంసద్ మార్గ్ వద్ద గుంపు ఒక పోలీసును చుట్టుముట్టి దాడి చేసింది. గాయపడిన పోలీసు సిబ్బంది యూనిఫామ్లపై రక్తం కారుతున్న అనేక క్లిప్లు ఉన్నాయి. ఢిల్లీ పోలీసుల ప్రకారం సుమారు 200 మంది పోలీసులు గాయపడ్డారు. జూలై 22న రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్లో పోలీసు అధికారులు నంద్కిషోర్, వివేక్ భగత్లపై జరిగిన దాడులు నమోదయ్యాయి. కొంతమంది నిరసనకారులు కెమెరా ముందు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను సేకరించి తదుపరి చర్యల నిమిత్తం విశ్లేషిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. వీటిలో కన్నాట్ ప్లేస్లో ఓ మహిళ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, సంసద్ మార్గ్ వద్ద ఓ వ్యక్తి పార్లమెంటు గురించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోలీసులపై ఒక మహిళ బూతులు తిట్టిన దృశ్యాలు ఉన్నాయి. -
ఇవాళే డెడ్లైన్! కేంద్రానికి సీజేపీ మరో వార్నింగ్
నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరోసారి ఉత్కంఠకు దారితీస్తోంది. కేంద్రంతో చర్చల అనంతరం ఆందోళనను విరమించిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు ఆ హామీలు అమలు కావడం లేదని ఆరోపణలకు దిగింది. ఈ క్రమంలో కేంద్రానికి మరోసారి అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను నెరవేరుస్తూ ఇవాళ గనుక రాతపూర్వక హామీ ఇవ్వకుంటే.. మళ్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించింది. నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం జులై 25న తాత్కాలికంగా ముగిసింది. అదే సమయంలో ఈ నిరసనలకు మద్దతుగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యమించారు. అయితే వాళ్లపైనా ఆయా చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా నీట్ నిరసనలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మళ్లీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసింది.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో జరిగిన చర్చల్లో.. నిరసనకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇచ్చారని సీజేపీ పేర్కొంది. ఆ తర్వాత కూడా బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం.. మరికొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల అరెస్టులు కొనసాగుతున్నాయని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారంటూ ఆరోపించింది.‘‘హామీ ఉల్లంఘిస్తే నమ్మకద్రోహమే’’సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా, సౌరవ్ దాస్లు కేంద్రానికి డిమాండ్లు పెట్టారు. నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చిన హామీలపై లిఖితపూర్వక స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు కాకపోతే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఆందోళన ప్రారంభిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు చర్చలను నమ్మి ఉద్యమాన్ని విరమించారని.. ఇప్పుడు మాట తప్పడం లక్షలాది మంది యువత నమ్మకాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.వార్నింగ్ ఎఫెక్ట్.. బిహార్ ప్రభుత్వ హామీసీజేపీ హెచ్చరికల తర్వాత బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 26 సాయంత్రం 6 గంటల వరకు నిరసనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకునే ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించింది. అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేస్తామని, భవిష్యత్తులోనూ వారిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది.బిహార్లో నిరసనల సందర్భంగా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. మొత్తం 335 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఆందోళనల సమయంలో హింస, ఆస్తుల నష్టం, పోలీసులపై దాడుల ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.ఏకే-47 ఘటనపై దుమారంబిహార్లోని సివాన్లో నిరసనల సందర్భంగా ఓ కానిస్టేబుల్ ఏకే-47తో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. జేపీ చౌక్ వద్ద భారీగా చేరుకున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఆందోళనల్లో మొత్తం 694 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో 339 మందిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసనల్లో పోలీసు అధికారులు సహా 91 మంది గాయపడ్డారని, 14 ప్రభుత్వ వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.బెంగాల్లోనూ కేసులు.. 16 మంది అరెస్టుఇటు పశ్చిమ బెంగాల్లో నిరసనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోల్కతాలోని డొరినా క్రాసింగ్ వద్ద అనుమతి లేకుండా గుమిగూడి, పోలీసులపై రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరారని పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 16 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసుల ఉపసంహరణపై బెంగాల్ ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. వ్యక్తిగత ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కొన్ని కేసుల విషయంలో నేరుగా ఉపసంహరణ సాధ్యం కాకపోవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.అసోంలోనూ అరెస్టులు.. కేసుల ఉపసంహరణకు నిర్ణయంఅసోంలోనూ నిరసనలకు సంబంధించి చర్యలు తీసుకున్నారు. ప్రజా శాంతికి భంగం కలిగించారన్న ఆరోపణలతో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. లఖింపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ద్వారా నిరసనకు మద్దతుగా ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే.. సీజేపీ హెచ్చరికల నేపథ్యంలో అసోం ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన ఐదు కేసులను ఉపసంహరించేందుకు చర్యలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అరెస్టైన 13 మందిని విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టామని తెలిపింది. నిరసనల్లో పాల్గొన్న వారిపై భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చట్టపరమైన చర్యలు ఉండవని స్పష్టం చేసింది.ఢిల్లీ, మధ్యప్రదేశ్లో సోషల్ మీడియాపై నిఘాఇదిలా ఉండగా.. నిరసనల సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపినట్లు సమాచారం. మధ్యప్రదేశ్లోని నివారీ జిల్లాలో ఓ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్పై మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ, ఢిల్లీ పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైంది.ముంబైలో కొనసాగుతున్న పోలీసుల నోటీసులుసీజేపీ ప్రకటన తర్వాత కూడా.. ముంబైలో కొంతమంది నిరసనకారులకు పోలీసుల నోటీసులు కొనసాగుతున్నాయి. కేసుల దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే నోటీసులు ఇస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అధికారికంగా కేసుల ఉపసంహరణ ఉత్తర్వులు వచ్చే వరకు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.విద్యార్థుల న్యాయ పోరాటానికి సిబల్ చేయూతనీట్ నిరసనల్లో కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ముందుకొచ్చారు. సీజేపీ ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ ఫండ్కు రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయవాదులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.పైన పేర్కొన్న రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కేరళ సహా పలు ప్రాంతాల్లో నీట్ నిరసనలకు సంబంధించి కేసులు, అరెస్టుల ప్రక్రియ కొనసాగింది. అయితే కేవలం ప్రకటనలతోనే ఈ వివాదం ముగిసిపోతుందా? కేసుల ఉపసంహరణ, అరెస్టయిన విద్యార్థుల విడుదల అంత సులువైన ప్రక్రియేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు, దర్యాప్తు దశలో ఉన్న కేసులు, రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు కీలకంగా మారాయి.తమ డిమాండ్లు నెరవేరకపోతే మళ్లీ జంతర్ మంతర్ వేదికగా ఆందోళనకు దిగుతామని సీజేపీ స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతాయి? విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? లేక ఈ వ్యవహారం మరోసారి దేశవ్యాప్త ఉద్యమానికి దారితీస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేంద్రం తదుపరి చర్యలపైనే నీట్ ఉద్యమం భవిష్యత్ ఆధారపడి ఉంది. -
మరో సంచలనం.. సీజేపీ కీలక నిర్ణయాలు.. మళ్లీ ఆందోళనలు?
న్యూఢిల్లీ: విద్యార్థులపై దాడులు చేసిన పోలీసులపై కేసులు పెడతామని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తెలిపింది. న్యూఢిల్లీలో ఆ పార్టీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆందోళన సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చర్చల సమయంలోనూ కేసులు ఎత్తేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తమకు తెలిపారని చెప్పారు.ఒప్పందం అమలు చేయకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని కేంద్రానికి సీజేపీ వార్నింగ్ ఇచ్చింది. ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్కు ఉద్దేశించి ఎక్స్లో కూడా సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా ఓ పోస్ట్ చేశారు. బిహార్, పశ్చిమ బెంగాల్లో విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో పోలీసులు దాడులు చేయడాన్ని ప్రస్తావించారు."జేపీ నడ్డా, జితేంద్ర సింగ్.. ఆందోళనకారులపై పోలీసు చర్యలు ఉండవని జరిగిన ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని మేము గమనిస్తున్నాం. బిహార్, బెంగాల్లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో వందలాది మందిపై నిఘా పెట్టి వేధిస్తున్నారు. ఆందోళనకారులకు లాజిస్టిక్స్ సాయం అందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలను ఢిల్లీలో అదుపులోకి తీసుకుంటున్నట్టు ఎన్నో నివేదికలు వస్తున్నాయి. ఆందోళనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించాలి. విద్యార్థులను విడుదల చేయాలి. ఇకపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, భాజపా మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదు. మా ఒప్పందానికి అనుగుణంగా ఇదంతా అమలు కావాలి. లేదంటే మేము మళ్లీ ఆందోళనలో కూర్చోవాల్సి వస్తుంది. చట్టపరమైన కేసులపై రాతపూర్వక ఒప్పందాన్ని భారత ప్రభుత్వంతో నిర్ణయించిన గడువులతో పాటు రేపటిలోగా మాకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం" అని రాంకా తెలిపారు.జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఈ ఆందోళన విరమించారు. ఆ సమయంలో సీజేపీ, ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్తో జరిగిన ఒప్పందంలో కేసులు ఎత్తివేయడం, పోలీసుల వేధింపులు అడ్డుకోవడం, ప్రశ్నపత్రాల లీక్లను అరికట్టే చట్టం తీసుకురావడం వంటి అంశాలకు ప్రభుత్వం అంగీకరించింది.అంతకుముందు రోజే సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్.. అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్లో విద్యార్థులు, ఇతర ఆందోళనకారులను అరెస్టు చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడుదల చేసి, ఎఫ్ఐఆర్లను ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరారు."అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్లో విద్యార్థులు, ఇతర ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం జరుగుతోందని మాకు ఎన్నో నివేదికలు వస్తున్నాయి. ఇది మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది" అని దాస్ తెలిపారు. -
జంతర్మంతర్ .. ఢిల్లీలో మునిగితే ముస్సోరిలో తేలాడు
సాక్షి, ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు ఆహరం పంపిణీ చేసిన వ్యక్తిని పోలీసులు విచారించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జునైద్ అనే వ్యక్తి అక్కడి నిరసన కారులకు ఆహరం సరఫరా చేశారు. దీనిని గమనించిన పోలీసులు అతనిని భిన్న విధాలుగా ప్రశ్నించి చివరికి కళ్లకు గంతలు కట్టి ముస్సోరిలో వదిలేశారు. ఈ వివరాలను ఆ బాధితుడు సోషల్ మీడియావేదికగా పంచుకున్నారు.వివరాల్లోకి వెళితే గత శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులకు జునైద్ ఆహరం సరఫరా చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు అతని వద్దకు వచ్చి ప్రశ్నించడం మెుదలు పెట్టారు. నువ్వు ఈ ఆహరం ఎందుకు పంపిణీ చేస్తున్నావు. దీనికోసం నీకు ఎవరు సహాయం చేస్తున్నారు. రాత్రంతా పోలీసుల అదుపులో ఉంచుకొని ఆ బాధితుడు కళ్లకు గంతలు కట్టి క్యాబ్లో తీసుకెళ్లి ముస్సోరిలో వదిలివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ వివరాలు తెలుసుకున్న విద్యార్థుల న్యాయ సహాయ బృందం తనను సంప్రదించిందన జునైద్ తెలిపారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ధర్నా చేయగా ఎట్టకేలకు మంత్రి రాజీనామా చేశారు. దీంతో సీజేపీ నిరసన ముగిసింది.Mohammad Junaid Used and Thrown by CJP Founders!!Mohammad Junaid who played the biggest part in CJP Protest by supplying Non Stop Bread Pakodas, Samosas, Biryani and various other dishes for 40 days is now feeling cheated by CJP Founders!!During an Interview the reporter… pic.twitter.com/L9j8qiwyaa— Rohit (@Iam_Rohit_G) July 26, 2026 -
ఢిల్లీలో పెల్లెట్ గన్స్ బీహార్ లో AK-47 తో కాల్పులు.. రాహుల్ గాంధీ సూటి ప్రశ్న
-
నిరసన చేస్తే కొట్టడం ఏంటి? లాఠీ ఛార్జ్ పై సుప్రీంకోర్టు సీరియస్
-
లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపుతూ పోలీసులు మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించలేరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.కాగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ నిరసనల సందర్భంగా వారిపై పోలీసుల చర్యల విషయమై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సోమవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కేవలం నిరసన జరుగుతోందనే కారణంతోనే లాఠీచార్జ్ చేయలేరు. ఎక్కడైనా పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి పాల్పడితే దానిని అరికట్టాల్సిందే. ప్రతి పౌరుడి హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రానిదే.ఈ విచారణలో జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి మాట్లాడుతూ..‘విద్యార్థుల భద్రత ఎంత ముఖ్యమో, పోలీసుల భద్రత కూడా అంతే ముఖ్యం. నిరసనకారులు పోలీసులపై కూడా దాడులకు పాల్పడకూడదు. పోలీసుల చర్యలకు సంబంధించి తగిన ఎస్ఓపీలు ఎందుకు లేవో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరవచ్చు" అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో నిరసనల్లోకి ఆకతాయిలు, సామాజిక విద్రోహ శక్తులు చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేసింది. శాంతియుత నిరసనలు, పోలీసుల చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిరసనకారులు కూడా హింసకు తావులేకుండా ఆత్మనియంత్రణ, క్రమశిక్షణ పాటించడం అత్యంత కీలకమని పేర్కొంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల వ్యవహార శైలిపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. -
విద్యార్థులపైకి తూటాలా.. మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్
ఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కార్ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్, బీహార్లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారని రాహుల్ మండిపడ్డారు. విద్యార్థుల పట్ల మొత్తం వ్యవస్థ అత్యంత కఠినంగా, అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్.. ‘బీహార్లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారనే వార్తలు వస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.छात्रों के ख़िलाफ़ पूरा का पूरा सिस्टम ही जानलेवा है।खबर आ रही है कि बिहार में प्रदर्शन कर रहे छात्रों पर AK-47 से गोलियाँ चलाई गई हैं और सैकड़ों छात्रों को गिरफ़्तार करके उनपर FIR की जा रही है।मोदी जी, कहाँ गया आपका वादा कि छात्रों पर कोई FIR नहीं की जाएगी और उन्हें रिहा कर… https://t.co/c7zdyyeLA0— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2026ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, బీహార్లో ఏకే-47లు ప్రయోగించారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ.. ఎక్కడ చూసినా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించడం లేదని, సంస్కరణలు చేపట్టే సామర్థ్యం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. దేశంలోని విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి కానీ విద్యార్థులపైన కాదు అని డిమాండ్ చేశారు.అయితే, పోలీసుల చర్యలు చట్టపరమైన పరిస్థితుల నేపథ్యంలోనే జరిగాయని, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. బీహార్లో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసులు అధికారి ఏకే-47 పట్టుకుని నిరసనకారులపైకి ఎక్కుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసింది. -
‘కాక్రోచ్’ ఉద్యమం కుదిపేసిన రాజకీయాలు.. అమరావతి వరకు సెగ!
రాజకీయాలలో ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్నది ఒక అభిప్రాయం. అన్నిసార్లు కాకపోయినా, కొన్నిసార్లు బొద్దింకలు కూడా తిరగబడతాయన్న సత్యాన్ని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పక్షాన యువత రుజువు చేసింది. ఎంత బలాఢ్యుడైనా ఆ తిరుగుబాటుకు తలొగ్గక తప్పదని రుజువైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పర్వం దేశానికే ఒక స్పూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. ఇలాంటి లీక్లు జరిగినా, లేదా స్కామ్ల ఆరోపణలు ఆధారాలతో సహా బయటపడినా సంబందిత బాధ్యులు పదవి నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ యువత ఆందోళన తేల్చి చెప్పింది.కేంద్రంలోనేనా ఇలా రాజీనామాలు జరగవలసింది? మరి రాష్ట్రాలలో జరిగే లీక్లు, ఇతర కుంభకోణాల పరిస్థితి ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా తెరపైకి వచ్చింది. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణ, టీచర్ల ఎంపికలో అవకతవకలు, స్పోర్ట్ కోటా టీచర్ల ఎంపికలో అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారసహింతంగా ఆరోపణలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. బహుశా ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యమం చేస్తున్న యువతపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శకు గురయ్యారు.కాక్రోచ్ ఉద్యమానికి కాంగ్రెస్ తదితర విపక్షాలు రంగంలోకి దిగడంతో తీవ్రరూపం దాల్చింది. ఒకరకంగా రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలు ప్రధాని ఇంటిముందు ధర్నాకు దిగడంతో బీజేపీ కంగుతిన్నట్లనిపించింది. సీజేపీతో చర్చలకు సిద్దమని బీజేపీ కూడా చెప్పవలసి వచ్చింది. రాహుల్ గాంధీపై విమర్శలు చేసినా, బీజేపీ కొంత డిఫెన్స్లో పడినట్లయింది. కాక్రోచ్ ఉద్యమంతో పాటు, కాంగ్రెస్ ధర్నా ప్రభావం వివిధ రాష్ట్రాలలో కూడా పడింది. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యాయి. వారికి పోటీగా బీజేపీ కూడా ఎదురుదాడి చేయడానికి యత్నించింది.ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇదో గొడవగా మారింది. తెలంగాణలో రెండు పార్టీలు కర్రలతో ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్పై బీజేపీ దాడికి యత్నించడం ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం లేకపోయినా, ఈ అవకాశం ద్వారా తమ ఉనికి కోసం ప్రయత్నించినట్లు అనిపిస్తుంది.23 లక్షల మంది విద్యార్ధులు మెడికల్ కాలేజీలలో సీట్ల నిమిత్తం రాసిన నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వైనం, ఆ తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ చేసిన ఒక అనవసర వ్యాఖ్యతో దేశంలో కొత్తగా పుట్టుకువచ్చిన క్రాకోచ్ జనతాపార్టీ యువతను ఆకర్షించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్కు సంబంధించి కొందరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కాని తొలి నీట్ పరీక్ష రద్దు కావడంతో సుమారు ఇరవైమంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది. మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించినప్పటికీ, నీట్ ప్రశ్నాపత్రాల లీక్కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ను కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వీరు కోరారు.ఇలా వివిధ డిమాండ్లతో సాగుతున్న వీరి ఉద్యమం ఒక దశలో ముగిసిపోయిందని అనుకున్నారు. కాని వాంగ్ చుక్ అనే ఉద్యమకారుడు నిరాహారదీక్షకు దిగడంతో తిరిగి ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. వేలాదిగా తరలివచ్చిన యువత పార్లమెంటు ముట్టడికి వెళ్లడం, ఆ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడం వంటివి పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. పోలీసులు విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు పలువురిని లాఠీలతో కొట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది సంబంధం లేని పిల్లలను కూడా పోలీసులు కొట్టిన తీరు విమర్శలకు గురి అయింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.ప్రధాని మోదీ తొలిసారిగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్పై స్పందించి అది మహాపాపమని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో గట్టిగా స్పందిస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి యత్నించారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ఇతరత్రా ఆరోపణలు చేసినా, ప్రధాని ఆ యువతను స్నేహితులు అని అడ్రస్ చేయడం విశేషం. ఈ కేసులో నిందితులకు సత్వరమే శిక్ష పడడానికి వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. వాంగ్ చుక్ దీక్ష విరమించినా, ఉద్యమం కొనసాగడం, దేశం అంతటా దీని ప్రభావం పడుతుండడం గమనించి మోదీ స్పందించారు. వెంటనే డామేజ్ కంట్రోల్కు చర్యలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరించినట్లు కేంద్ర మంత్రులు ప్రకటించారు. దాంతో కాక్రోచ్ సంబరాలు అంబరాన్ని అంటాయి.నిజానికి కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మొదట తేలికగా తీసుకున్నట్లుగా ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కొన్ని వందలమంది దేశ యువతకు ప్రతినిధులుగా కేంద్రం ఆలోచించలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల ఇంటర్నెట్ బంద్ చేశారంటే, 18 మెట్రో రైల్వేస్టేషన్లను బంద్ చేశారంటేనే ఈ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఇదంతా యువత స్వచ్చందంగా చేసిందే.కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో రైతుల ఆందోళన కుదిపేసింది. వారు కోరినట్లు కొన్ని చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. అయినా ఆనాడు సమర్థంగా హాండిల్ చేశామన్న భావన కేంద్ర పెద్దలకు ఉండి ఉండవచ్చు. ఆ పరిస్థితి వేరు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి వేరు. ఒక్కసారి యువతలో గూడుకట్టిన అసంతృప్తి ఎగసిపడితే, అది దేశ వ్యాప్తంగా పాకితే ఎంత ప్రమాదమో బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. అందులోనూ పలు ఇతర దేశాలలో యువత ఈ మధ్యకాలంలో ఎంతటి క్రియాశీలకపాత్ర పోషించి ప్రభుత్వాలే మారిపోయేలా చేసిందో ఇటీవలి చరిత్రే.ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాలలో సహజంగానే విపక్షం దీనిని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. మంత్రి ప్రధాన్ రాజీనామాకు విపక్షం కూడా పట్టుబట్టింది. ఎప్పుడో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం సంచలనం అయింది. తర్వాతకాలంలో కొందరు కేంద్ర మంత్రులు వివిధ కారణాలతో రాజీనామాలు చేయకపోలేదు. రైల్వే ప్రమాదాల కారణంగానే నితీష్ కుమార్, మమత బెనర్జీ వంటివారు రాజీనామా చేశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ శివరాజ్ పాటిల్ పదవి నుంచి తప్పుకున్నారు.అలాగే, ఆయా స్కామ్ల ఆరోపణలపై దయానిది మారన్, ఎ.రాజా తదితరులు రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్కు బాధ్యత వహిస్తూ అప్పటి విద్యా మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజీనామా చేశారు. క్యాబినెట్ ఎజెండాను లీక్ చేశారన్న కారణంగా 31 మంది మంత్రుల నుంచి ఎన్టీరామారావు రాజీనామాలు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్లో వివిధ ఆరోపణలు వచ్చినా ఆయన నైతిక బాధ్యత వహించడానికి సిద్దపడలేదు. గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట కారణంగా 29 మంది మరణిస్తే, చంద్రబాబు ఎదురు బుకాయించారు తప్ప బాధ్యత తీసుకోలేదు. పూరి జగన్నాథ రథయాత్రలో జరగలేదా? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో మరణించడం లేదా అంటూ డబాయించారు. ఆ ఘటనలో ఒక్క కానిస్టేబుల్పై కూడ కేసు రాకపోవడం చిత్రంగానే అనిపిస్తుంది.తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్ కౌంటర్కు గురి కావడం వివాదాస్పదం అయినా, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడలేదు. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినా, ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసే లేకుండా చేసుకోగలిగారు. ఒకప్పుడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో హౌసింగ్ స్కామ్ జరిగితే అప్పటి మంత్రి కోనేరు రంగారావుతో రాజీనామా చేయించారు. తదుపరి ఆ ఆరోపణలు రుజువు కాలేదని తిరిగి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలకు వైఎస్సార్సీపీ ఎన్నో ఆధారాలు చూపి సీబీఐ విచారణ కోరుతోంది. వాటికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా నేరుగా జవాబు ఇవ్వలేదు. టీడీపీ ఇతర నేతలతో ఎదురుదాడి చేయించారు.ఈ నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలపై ఉద్యమించాలని వైఎస్సార్సీపీ తలపెట్టింది. దీనికి యువత కూడా తోడైతే అది సీరియస్గా మారవచ్చు. అయితే వారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇది ఏ రూపు దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోకేష్పై ఒత్తిడి పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమం చేసిన కాక్రోచ్ యువతపై కక్ష కట్టకుండా ఉండాలని ఆశిద్దాం. ఏది ఏమైనా కాక్రోచ్లే కదా అని తేలికగా చూడరాదన్న విషయం అర్థం అవుతోంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రగిలిన నిప్పురవ్వ.. చరిత్రాత్మక GEN-Z ఉద్యమం.. మోదీ నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
-
మీమ్ నుంచి మహా ఉద్యమంగా..
-
బోసిపోయిన జంతర్ మంతర్
-
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ!
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థి ఆందోళనల నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సీజేపీ విధించిన 72 గంటల డెడ్లైన్, యువత నుంచి పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత.. మోదీ ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసింది.నిన్న శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో జరిగిన రెండో విడత చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అయితే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ తేల్చిచెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకునేందుకు 72 గంటల గడువు ఇస్తున్నామని.. లేనిపక్షంలో జూలై 20 నాటి తరహాలో మరోసారి పార్లమెంట్ ముట్టడికి దిగుతామంటూ సీజేపీ హెచ్చరించింది.నడ్డా, జితేంద్ర సింగ్ తాము నాయకత్వాన్ని సంప్రదించి ప్రభుత్వ నిర్ణయాన్ని తర్వాత తెలియజేస్తామని మాత్రమే బదులిచ్చారు. విఫలమైన చర్చల అనంతరం.. నడ్డా, జితేంద్ర సింగ్లు పరిణామాలపై హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్లు వర్గాలు తెలిపాయి. తెరవెనుక చర్చలు జరుగుతుండగానే, నిరసనకారులకు గట్టి సంకేతం పంపే ప్రయత్నంగా విద్యాశాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చెందిన 47 మంది అధికారులను తొలగించింది.ఎన్టీఏ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని నియమించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేయడం, పేపర్ లీక్ కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం సహా పరీక్షా విధానంలో సంస్కరణలను కూడా కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చర్యలేవీ నిరసనకారులను సంతృప్తి పరచలేకపోయాయి.శనివారం మధ్యాహ్నం కేంద్రం సీజేపీతో చర్చల ముందు.. నడ్డా, జితేంద్ర సింగ్లు మళ్లీ అమిత్ షాను కలిశారు. అదే సమయంలో ప్రధాన్ తన రాజీనామాను ప్రధాని మోదీకి పంపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త ప్రసారం కావడం ప్రారంభమైన తర్వాతే నడ్డా, జితేంద్ర సింగ్.. సీజేపీ ప్రతినిధులను మళ్లీ కలిశారు. మూడో విడత చర్చలు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో జరిగాయి.ఒక వైపు, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనలు, మరోవైపు దేశవ్యాప్తంగా బలపడుతున్న యువత ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. ఈ కేవలం రాజకీయ ఆందోళన కాకుండా భవిష్యత్ తరానికి సంబంధించిన యువ ఉద్యమం కావడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం వెనుకాడింది. శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను సమర్పించారు. ప్రధాన్ నిష్క్రమణతో సీజేపీ పట్టువీడింది. తన ఆందోళనను విరమించింది.ఆందోళనకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని.. నీట్ పేపర్ లీక్ ఉదంతం తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నరేంద్ర మోదీ హయాంలో ప్రజా వ్యతిరేకతతో ఒక సీనియర్ మంత్రి పదవి కోల్పోవడం అత్యంత అరుదైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని చాలామందిని ఇది ఆశ్చర్యపరిచింది. శుక్రవారం వరకు తమ సీనియర్ మంత్రుల్లో ఒకరిని వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు ఏమాత్రం లేవు. అయినప్పటికీ కేవలం 24 గంటల్లోపే ప్రధాన్ రాజీనామా చేశారు. ఆందోళనకారులతో ప్రభుత్వం మళ్లీ చర్చలు ప్రారంభించింది. చర్చలు సఫలం కావడంతో సీజేపీ తన నిరసనను ముగిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ సమయంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
ఆందోళన విరమించిన సీజేపీ
ఢిల్లీ: కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. జంతర్మంతర్ దగ్గర ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. చర్చల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సీజేపీ తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని.. మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని అశుతోష్ పేర్కొన్నారు.ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందన్న సీజేపీ.. ఆందోళన విరమించాలని నిర్ణయించింది. జంతర్మంతర్ దగ్గర నుంచి విద్యార్థులు వెళ్లిపోవాలని పిలుపునిచ్చింది. విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్న సీజేపీ.. నాలుగు వారాల తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని పేర్కొంది. సీజేపీ 3 డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు ఒప్పుకుంది. త్వరలోనే పరిహారం కూడా చెల్లిస్తామని వెల్లడించింది.వాంగ్చుక్ మాట్లాడుతూ.. నవభారత్కు ఇదొక శుభపరిణామంగా అభివర్ణించారు. యువతకు అభినందనలు తెలిపిన ఆయన.. విద్యారంగంలో సమూల మార్పులు రావాలన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని వాంగ్చుక్ కోరారు. -
ప్రజా ఉద్యమాలకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వాలు
ప్రజా ఉద్యమాలు.. ప్రభుత్వాల నిర్ణయాలను మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన జన్ లోక్పాల్ ఉద్యమం నుంచి, నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఏడాదికిపైగా సాగిన చారిత్రాత్మక పోరాటం వరకు.. ప్రజల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి. తాజాగా.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై దేశవ్యాప్తంగా ఉద్ధృతమవుతున్న నిరసనలు మరోసారి ప్రజా ఉద్యమాల శక్తిపై చర్చకు తెరలేపుతున్నాయి.👉2011లో అన్నా హజారే చేపట్టిన ఉద్యమం జన్ లోక్ పాల్ బిల్లు అవినీతి వ్యతిరేక పోరాట చేశారు. రామ్ లీలా మైదానంలో 13 రోజుల పాటు నిరవధిక నిరహార దీక్ష చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తలొగ్గి జన్ లోక్ పాల్ బిల్లు తీసుకోచ్చింది.👉2012 డిసెంబర్ 15 ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక ఆత్యాచార ఘటన దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా ఆందోళన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి నిర్భయ చట్టాన్ని తీసుకోచ్చింది👉కేంద్ర ప్రభుత్వం 2020లో తెచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఏడాది పాటు సాగిన ఈ చారిత్రాత్మక పోరాటానికి తలొగ్గి, నవంబర్ 2021లో కేంద్ర ప్రభుత్వం ఆ మూడు చట్టాలను అధికారికంగా రద్దు చేసింది.👉నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విద్యావ్యవస్థలో పారదర్శకత, బాధ్యత కోరుతూ జంతర్ మంతర్ వేదికగా నిరసనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం తలొగ్గడంతో చివరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసింది. -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి పంపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. సీజేపీ ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. ఆయన రాజీనామాతో సీజేపీ పోరాటం ఫలించింది. సీజేపీ విధించిన డెడ్లైన్లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశా. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు’’ అని పేర్కొన్నారు.‘‘భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు.. వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. భారత యువశక్తే దేశానికి అసలైన బలం. దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదన్నదే నా సంకల్పం...జంతర్-మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి, కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించాను...నరేంద్ర మోదీ మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశసేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకితభావంతో ఉంటాను’’ అని లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.pic.twitter.com/VSArqS98OJ— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026 -
ఢిల్లీ షట్ డౌన్..! ఇంటర్నెట్ కట్... మెట్రో స్టేషన్లు క్లోజ్
-
ఢిల్లీ నిరసనల్లో పెల్లెట్ గాయాల భయానక నిజాలు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యా వ్యవస్థ సంస్కరణలను కోరుతూ ఇటీవల జరిగిన విద్యార్థుల ఆందోళన సందర్భంగా పోలీసులు జరిపిన పెల్లెట్ గన్ కాల్పుల్లో పలువురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గురుగ్రామ్లో ఉద్యోగం చేస్తున్న 25 ఏళ్ల షేక్ ఇర్షాద్ మన్సూరి, ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సాహిల్ లోచ్బ్ (20) తదితరులు ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలయ్యారు.జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా పెల్లెట్ గన్ తో కాల్పులు జరిపినట్లు బాధితుల స్నేహితులు ఆరోపించారు. ఈ ఘటనలో ఇర్షాద్ ముఖం, మెడ భాగంలో వందలాది చిన్న సీసపు గుళికలు (పెల్లెట్లు) దూసుకెళ్లాయి.ప్రాణాపాయం ఉన్నందున మెడలోని ప్రధాన రక్తనాళం దగ్గరున్న ఒక పెల్లెట్ను వైద్యులు తొలగించలేకపోయారు. దీంతో అతను జీవితాంతం ఆ లోహపు గుళికతోనే జీవించాల్సి ఉంటుంది. అలాగే సాహిల్ లోచ్బ్ తన కుడి కంటి చూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే తమ బలగాలు పెల్లెట్ గన్లను ఉపయోగించలేదని ఢిల్లీ పోలీసులు ఖండించగా, సీఆర్పీఎఫ్ మాత్రం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది. -
నీట్ లీకేజీ రచ్చ.. హీరోయిన్ జ్యోతిక ఆసక్తికర పోస్ట్!
నీట్ పేపర్ లీక్ వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సినీ తారలు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, అదితిరావు హైదరీతో పాటు పలువురు సినీ తారలు విద్యార్థులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా దక్షిణాది స్టార్ హీరో సూర్య సతీమణి, హీరోయిన్ కూడా విద్యార్థుల ఆందోళనకు తన మద్దతు తెలిపారు. నీట్ పేపర్ లీక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు.‘నేను విద్యార్థులు, దేశ భవిష్యత్తు తరపున నిలబడతా. నేను ప్రజాస్వామ్య భారతదేశానికి మద్దదు ఇస్తున్నా. విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలని కోరున్నా. తల్లులుగా మా పిల్లలను ‘సోనమ్ వాంగ్చక్, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్లా గా పెంచాలని కోరుకుంటున్నాం. జెన్ జీ చేస్తున్న పోరాటం చూసి గర్వంగా ఉంది. భయం లేకుండా ఉద్యమం చేస్తున్న సీజేపీకి ధన్యవాదాలు. జైహింద్’అని జ్యోతిక తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
‘జంతర్ మంతర్’ ఎఫెక్ట్: మందుబాబులకు షాక్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వారాంతపు రోజుల్లో మద్యం దుకాణాల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని మద్యం దుకాణాలను వారాంతం వరకు రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండే ఈ దుకాణాలు, భద్రతా కారణాల రీత్యా ముందుగానే మూతపడనున్నాయి.పోలీసుల నుంచి అందిన భద్రతా సమాచారం ప్రకారం నిఘా వర్గాల నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గురువారం నాడు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా నోటీసు ఇవ్వకుండానే దుకాణాలు అకస్మాత్తుగా ముందుగానే మూసివేయడంతో కొనుగోలుదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వారాంతం ముగిసే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.విద్యార్థులు చేపట్టిన ఈ ఆందోళనల కారణంగా నగరంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మద్యం దుకాణాల సమయాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో వారాంతంలో మద్యం ప్రియులకు నిరాశ ఎదురుకానుంది.ఇది కూడా చదవండి: గుండెకు సొంత ‘మెదడు’.. సరికొత్త అధ్యయనంలో వెల్లడి! -
కాక్రోచ్ ఉద్యమం వెనుక పూర్తి కథ ఇదే !
-
సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ నిర్ణయం వల్లనే ఈ ఉద్యమం మొదలయింది..! కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది...?
-
మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీ
సీజేపీ ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. సీజేపీ విధించిన డెడ్లైన్లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించామంటూ సీజేపీ వ్యాఖ్యానించింది. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదని.. ఈ విజయం విద్యార్థులందరిందని సీజేపీ పేర్కొంది. సీజేపీ నిరసనలు.. అప్డేట్స్..విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావాలి: రాహుల్విద్యావ్యవస్థను బీజేపీ భ్రష్ఠు పట్టించిందివిద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాల్సిందేదేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించిందివిద్యా రంగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారువిద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలి నీట్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం: జేపీ నడ్డాత్వరలోనే పరిహారం ఇస్తాంనిబంధనలకు లోబడే పరిహారం చెల్లిస్తాంసీజేపీ ప్రతిపాదించిన సంస్కరణలను పరిశీలిస్తాంమూడు డిమాండ్లకు కేంద్రం అంగీకారం: సీజేపీవిద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిప్రధాన్ రాజీనామాతో మా మొదటి డిమాండ్ నెరవేరిందివిద్యార్థులపై కేసు ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందిపరిహారంపై కూడా స్పష్టత ఇచ్చిందివిద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలిఆందోళన విరమించిన సీజేపీసీజేపీ, కేంద్ర మధ్య ముగిసిన చర్చలుసీజేపీ ప్రతినిధులతో చర్చించిన నడ్డా, జితేంద్రసింగ్దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన చర్చలు కేంద్రంతో సీజేపీ మూడో విడత చర్చలుచర్చల్లో పాల్గొన్న జేపీ నడ్డా, జితేంద్ర సింగ్సీజేపీ నుంచి హాజరైన సౌరవ్ దాస్, అశుతోష్లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరిన సీజేపీసెంట్రల్ ఢిల్లీలో తెరుచుకున్న మెట్రో స్టేషన్లువిద్యార్థుల ఆందోళన విరమణతో మెట్రో స్టేషన్లు రీఓపెన్ఢిల్లీలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాలుఢిల్లీకి బయల్దేరి రావాలని ఫడ్నవీస్, షిండేలకు పిలుపుమరికొంతమంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పిలుపుఇది ప్రజాస్వామ్య విజయం మల్లికార్జున ఖర్గేఇప్పటికైనా విద్యా వ్యవస్థను సరిదిద్దాలియువత ధైర్యంగా పోరాడిందిఢిల్లీ:ప్రధాని మోదీతో అమిత్ షా భేటీతాజా పరిణామాలపై మోదీ, అమిత్ షా చర్చలు కాసేపట్లో కేంద్రంతో సీజేపీ ప్రతినిధుల చర్చలుమిగతా రెండు డిమాండ్లను నెరవేర్చాలంటున్న సీజేపీప్రజాస్వామ్యం గెలిచింది: వాంగ్చుక్శాంతికి, సహనానికి చెందిన విజయం ఇదిఇప్పటికైనా విద్యారంగంలో సంస్కరణలు తేవాలిఇకపై కేంద్ర బాధ్యతాయుతంగా వ్యహరించాలిసీజేపీ, జెన్ జీలకు ధన్యవాదాలు జంతర్మంతర్ దగ్గర విద్యార్థుల సంబరాలుఒక డిమాండ్ నెరవేరింది: సీజేపీమిగతా 2 డిమాండ్లు నెరవేరే వరకు వేచి ఉందాంవిద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యం గెలిచింది: సీజేపీకేంద్రానికి మా సత్తా ఏంటో చూపించాం: సీజేపీవిద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఉద్యమం ఆగదుఈ విజయం విద్యార్థులందరిదికేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాజీనామాసీజేపీ ఉద్యమంతో దిగొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్సీజేపీ విధించిన డెడ్లైన్లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామారాజీనామా లేఖను ప్రధానికి పంపిన ధర్మేంద్ర ప్రధాన్జంతర్మంతర్ సమీపంలో ఉద్రిక్తతపోలీసులపై రాళ్లురువ్విన ఆందోళనకారులుఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగంజంతర్మంతర్లో కొనసాగుతున్న సీజేపీ నిరసనలు ఢిల్లీ పోలీసులకు సీజేపీ డిమాండ్జంతర్ మంతర్ను ముట్టడించడం ఆపండిదీక్షా స్థలికి వచ్చే ప్రజలను అడ్డుకోవద్దునిరసనకారులకు ఆహారం, మందులు చేరనివ్వాలిజంతర్ మంతర్ ముట్టడిని ఎత్తివేయాలని డిమాండ్ఢిల్లీ పోలీసుల సంచలన ప్రకటనజంతర్మంతర్ హింసాత్మక ఘటనలపై పోలీసుల ప్రెస్మీట్అందులో చాలా వరకు ఫేక్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయిసోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలు చేశారుదీని వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉందిపాక్ నుంచి ఏఐ వీడియోలను క్రియేట్ అయ్యాయి400కి పైగా పాక్ హ్యాండిల్స్ను బ్లాక్ చేశాంఏఐ కట్టడికి కృషి చేస్తున్నాంఏఐ ద్వారా ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయిరేపు దేశవ్యాప్త నిరసనలను సీజేపీ పిలుపుమరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చిన సీజేపీరేపు సాయంత్రం 6గం. క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని పిలుపుఇవాళ చర్చలు ఉంటాయా? ఉండవా? అనేదానిపై నెలకొన్న అనిశ్చితిధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్న సీజేపీధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించకలేకపోతే.. మోదీనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్కేంద్రంతో చర్చకు ముందు సీజేపీ కీలక ట్వీట్రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదునిర్ణయం తీసుకోకపోతే.. చర్చలు కొనసాగించడంలో అర్థం లేదు“వాళ్లు అడిగే పరిస్థితి రాకముందే.. ఇప్పటికి బాధ్యత తీసుకుని స్వయంగా రాజీనామా చేసి ఉండాల్సింది.” అంటూ మరో ట్వీట్మధ్యాహ్నం 3.30గం. కు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ భేటీ!నిన్న గంటన్నరపాటు జరిగిన చర్చలుకీలక డిమాండ్పై కొలిక్కి రాని చర్చలుఇవాళ ఏ నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రులుమంత్రి రాజీనామాపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతి చేస్తామని ప్రకటనजिम्मेदारी लेकर बिना मांगे ही अब तक इस्तीफा दे देना चाहिए था 🥺— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026 సీజేపీ నిరసనలకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతుసీజేపీ నిరసనలకు ప్రొఫెసర్, తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం మద్దతువిద్యార్థులు చేస్తున్న ఆందోళన సరైందిపేపర్ లీకేజీకి ధర్మేంద్ర ప్రధానే కారణంకచ్చితంగా ఆయన రాజీనామా చేయాలిసీజేపీ నిరసనలకు రాహుల్ గాంధీ సంఘీభావంశనివారం.. మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్ ప్రధాని అర్ధరాత్రి పూట వీడియోలు చేస్తున్నారు.. ఏం లాభం?ఢిల్లీ పోలీసులు విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారులాఠీలతో తలలు పగలకొట్టారుపిల్లలపై దాడి చేసిన వాళ్లు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేధర్మేంద్రను ప్రధాని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలినీట్ లీక్పై విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలిఅవినీతికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతీకధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు అంటున్నారుఆయన్ని మరో శాఖకు మార్చాలని అనుకుంటున్నారుఆయన శాఖ మార్చడం కూడా ఆమోద యోగ్యం కాదుఎంత బెదిరించినా.. జంతర్ మంతర్నుంచి విద్యార్థులు కదలరుయువతకు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు టైఫాయిడ్తో బాధపడుతున్ను కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేచికిత్స తీసుకుంటున్న సీజేపీ చీఫ్శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న యువతకు ధన్యవాదాలుఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తే కేంద్రం తప్పకుండా దిగి వస్తుందిధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి తప్పకుండా రాజీనామా చేస్తారుపోరాటం ఇలాగే కొనసాగించాలని సూచనకోలుకోగానే తాను చేరతానని వ్యాఖ్యమోహన్ భగవత్ పరోక్ష వ్యాఖ్యలుఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలునేటి యువత దారితప్పిన వారు కాదని, వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న భగవత్యువతకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా.. వారితో చర్చలు జరపాలని సూచనకొత్త తరం ఎక్కువగా ప్రశ్నలు అడుగుతోందని, వారికి సరైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని వ్యాఖ్యయువతకు మార్గనిర్దేశం చేయాలే తప్ప.. వారి అభిప్రాయాలను అణచివేయకూడదన్న ఆరెస్సెస్ చీఫ్“ఆదేశాలు కాదు.. చర్చలు, నియంతృత్వం కాదు.. ఏకాభిప్రాయం” అనే సందేశం ఇచ్చిన మోహన్ భగవత్యువత విశ్వాసాన్ని గెలుచుకోవాలంటే సంభాషణ(మాటలు, చర్చల) ద్వారానే సాధ్యమని ఆసక్తికర వ్యాఖ్యరాజీనామా లేకుండానే దీక్ష విరమణ.. వాంగ్చుక్ వివరణధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ మినహా మిగతా వాటికి అంగీకరించిన సోనమ్ వాంగ్చుక్కేంద్ర మంత్రుల సమక్షంలో మొన్న దీక్ష విరమణప్రధాన డిమాండ్ నెరవేరక ముందే దీక్ష విరమించడంపై విమర్శలునిన్న రాత్రి వీడియోలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన వాంగ్చుక్కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ.. 26 రోజుల నిరాహార దీక్షను విరమించినట్లు సోనమ్ వాంగ్చుక్ తెలిపారు.రాజీనామా తనకు ప్రధాన అంశం కాదని.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు కాకుండా చూడటమే తన ప్రాధాన్యత అని చెప్పారు.ఢిల్లీలోని ‘సీజేపీ’ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో జరిగిన ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చిందని వెల్లడించారు.పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్లపై పార్లమెంట్లో చర్చిస్తామని.. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని తాను చర్చల్లో ప్రస్తావించానని.. కానీ కేంద్రం మరింత సమయం కోరిందని వాంగ్చుక్ తెలిపారు.ప్రధాన్ రాజీనామా చివరికి జరిగే అవకాశం ఉందని తాను భావిస్తున్నానని.. అందుకే దానిపై పట్టుబట్టలేదని చెప్పారు."నా లక్ష్యం విద్యార్థులు నష్టపోకూడదనేది. వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు కాకుండా చూడటమే అత్యంత ముఖ్యమైన విషయం" అని స్పష్టం చేశారు.దీక్ష విరమణపై వచ్చిన ‘డీల్ కుదిరింది’ అనే ఆరోపణలను వాంగ్చుక్ ఖండించారు."డీల్ చేసుకోవాలనుకుంటే 26 రోజులు ఆకలితో ఉండాల్సిన అవసరం ఏముంది? ఏసీ గదిలో కూర్చునే ఒప్పందం చేసుకునేవాడిని" అని వ్యాఖ్యానించారు.కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆస్పత్రికి వచ్చి హామీలు ఇచ్చారని.. అయితే రాతపూర్వక హామీ వచ్చే వరకు దీక్ష విరమించలేదని తెలిపారు.తనతో పాటు పోరాడిన విద్యార్థులు, ఎంపీలు, లద్దాఖ్ ప్రతినిధులు దీక్ష ముగింపు సమయంలో తన వద్ద లేకపోవడం బాధ కలిగించిందని వాంగ్చుక్ అన్నారు. AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk pic.twitter.com/6CO3tjZsSD— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026సమగ్ర కథనం కోసం👉 ఎలాంటి డీల్ లేదు: ఐసీయూ నుంచి వాంగ్చుక్ చర్చల వేళ సీజేపీ కీలక వ్యాఖ్యలుకేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కీలక ప్రకటన.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పష్టత లేకుండా చర్చలు కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టీకరణ.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పనిసరి డిమాండ్ (నాన్-నెగోషియబుల్) అంటూ సీజీపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా వ్యాఖ్య ప్రభుత్వం రాజీనామాకు అంగీకరించకపోతే.. తదుపరి చర్చలకు వెళ్లడంలో ప్రయోజనం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు.కేంద్రం, సీజీపీ ప్రతినిధుల మధ్య మూడో విడత సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని సీజీపీ డిమాండ్ చేస్తోంది.సమగ్ర కథనం కోసం👉 కేంద్రానికి సీజేపీ సంచలన షరతువాంగ్చుక్ వైరల్ వీడియోపై సఫ్దర్జంగ్ ఆస్పత్రి వివరణసోనమ్ వాంగ్చుక్ను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో రికార్డైన దృశ్యాలు బయటకు వైరల్గా మారిన వీడియో‘‘నేను వెళ్తున్నా.. నన్ను అరెస్ట్ చేయండి’’ అని పోలీసులకు సవాల్ విసిరిన వాంగ్చుక్వైరల్ వీడియోపై స్పందించిన సఫ్దర్జంగ్ ఆస్పత్రి జూలై 21న ఆస్పత్రిలోని నో-వీడియోగ్రఫీ జోన్లో రికార్డు చేసినట్లు వెల్లడించింది.వాంగ్చుక్ అనుచరులు ఈ వీడియోను చిత్రీకరించారని స్పష్టీకరణరికార్డు చేసిన వెంటనే కాకుండా శుక్రవారం విడుదల చేశారని స్పష్టం చేసింది.ఆస్పత్రి నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరించారంటూ వివరణ ఇచ్చిన సర్దర్జంగ్ ఆస్పత్రికేంద్రం–సీజేపీ చర్చలు 3.0.. కీలక పరిణామాలుకేంద్రం, సీజేపీ మధ్య మూడో విడత చర్చలు నేడు జరగనున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పైనే ప్రధానంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.శుక్రవారం జరిగిన దాదాపు రెండు గంటల చర్చల్లో ఎలాంటి తుది నిర్ణయం రాలేదు.సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లలో రెండింటికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు సమాచారం.శాంతియుత నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అంశాలపై సానుకూలత వ్యక్తం చేసింది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం కేంద్రం మరింత సమయం కోరింది.ఇవాళ మధ్యాహ్నం 3గం.లకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ జరగనుందినీట్ నిరసనలు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలుపేపర్ లీక్ నేరాలకు కఠిన శిక్షలు విధించే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.పేపర్ లీక్ మాఫియాకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష ప్రతిపాదించారు.నేర తీవ్రత ఆధారంగా శిక్షను 10 ఏళ్ల వరకు పెంచే అవకాశం కల్పించారు.వ్యవస్థీకృత పేపర్ లీక్ రాకెట్లకు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు చేర్చారు.పేపర్ లీక్ కేసుల దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు.కేసుల విచారణను వేగంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ చేపట్టనున్నారు.ఈ బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.మంత్రి రాజీనామాపై ఉత్కంఠ..విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాన్ని ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి.రాజీనామా చేయడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని కేంద్ర వర్గాల వాదన.ఎన్టీఏ సంస్కరణలు, పరీక్షల వ్యవస్థలో మార్పులే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం చెబుతోంది.సీజేపీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేస్తోంది.సీజేపీ హెచ్చరికలు..రాజీనామాపై స్పష్టమైన నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వం స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అశుతోష్ రాంకా తెలిపారు.కేంద్రం వైఖరిలో మార్పు లేకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు.డిమాండ్లపై అశుతోష్ రాంకా కీలక వ్యాఖ్యలునిన్న జరిగిన సమావేశంలో పరిహారం, చట్టపరమైన కేసులకు సంబంధించిన అంశాలపై సానుకూల స్పందన వచ్చిందన్న రాంగాఈ అంశాలపై ప్రభుత్వం నుంచి సూత్రప్రాయ అంగీకారం లభించిందని, ఈరోజు లిఖితపూర్వక ఒప్పందం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాలేదన్నారు.మీడియా కథనాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని సమాచారం వస్తోందని, అదే జరిగితే సమావేశాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని రాంకా అన్నారు.ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్ను పట్టించుకోకుండా రాజీనామాకు నిరాకరిస్తే, తదుపరి వ్యూహాన్ని ప్రకటిస్తామని తెలిపారు.ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే సీజేపీ కూడా మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.తమ డిమాండ్పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని అశుతోష్ రాంకా కోరారు.VIDEO | Delhi Jantar Mantar Protest: CJP spokesperson Ashutosh Ranka, says, "In yesterday's meeting, we received a positive response regarding compensation and legal cases. We got an in-principle agreement, and we hope to receive the written agreement today as well. However,… pic.twitter.com/BFvGHOZWBm— Press Trust of India (@PTI_News) July 25, 2026సమగ్ర కథనం కోసం👉: నీట్ టైం బాంబ్.. ఎప్పుడైనా పేలొచ్చుజంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం..సీజేపీ ఆందోళన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద కట్టుదిట్టమైన భద్రతఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలను పెంచారు.నిరసనలకు ప్రధాన వేదిక అయిన జంతర్ మంతర్ ప్రాంతం చుట్టూ అదనపు బారికేడ్ల ఏర్పాటు.బారికేడ్లను భారీ స్థాయి గొలుసులతో ఒకదానికొకటి అనుసంధానించారు.బారికేడ్లు కదలకుండా ఉండేందుకు వాటిని వెల్డింగ్ చేసి మరింత బలోపేతం.పెద్ద సంఖ్యలో ప్రజలు చేరే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు.జంతర్ మంతర్ పరిసరాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.శాంతియుతంగా ఆందోళన కొనసాగించేలా పోలీసులు చర్యలు చేపట్టారుPolice Fortifies Jantar Mantar,A six-layer barricade setup is now in place on the road near Jantar Mantar and Jai Singh Marg. An attempt is being made to restrict the protesters to the area. The barricades have been anchored to the ground using iron rods and welding pic.twitter.com/NmwjZOfNPN— Amit Bhardwaj (@AmmyBhardwaj) July 24, 2026ఇంటర్నెట్ నిలిపివేత..సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సర్వీస్ నిలిపివేతపని చేయని మొబైల్ డేటా సర్వీసెస్బుకింగ్ కానీ క్యాబ్ సర్వీసులు, పని చేయని యూపీఐ పేమెంట్స్ యాప్సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు#WATCH | Security intensified around Jantar Mantar as Delhi Police set up additional barricades that have been interlinked with heavy duty chains and reinforced through welding. pic.twitter.com/I9tNCvGp6X— ANI (@ANI) July 25, 2026 మెట్రో మూసివేత..సీజేపీ నిరసనల నేపథ్యంలో మళ్ళీ మెట్రో స్టేషన్లు మూసివేత18 మెట్రో స్టేషన్లు క్లోజ్ లోక్ కల్యాణ్ మార్గ్రాజీవ్ చౌక్పటేల్ చౌక్రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్బారఖంబా రోడ్సుప్రీం కోర్ట్సేవా తీర్థ్జనపథ్మండి హౌస్సెంట్రల్ సెక్రటేరియట్ఐటీఓఢిల్లీ గేట్ఇంద్రప్రస్థఖాన్ మార్కెట్జోర్ బాగ్శివాజీ స్టేడియంఝండేవాలాన్న్యూ ఢిల్లీకేంద్రం, సీజేపీ చర్చల్లో ప్రతిష్టంభన..రాజీనామా చేయాల్సిందేనన్న కాక్రోచ్ జనతా పార్టీ24 గంటల్లో చెబుతామన్న మంత్రులు, నేడు మళ్లీ చర్చలు47 మంది ఎన్టీఏ సిబ్బందికి ఉద్వాసనధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరంటున్న ప్రభుత్వ వర్గాలుకేంద్ర ప్రభుత్వం, సీజేపీ చర్చలు శుక్రవారం అసంపూర్తిగా ముగిశాయి.ఏమీ తేల్చకుండా శనివారానికి ఉత్కంఠను మిగిల్చాయి.విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే ప్రధానంగా చర్చ నడిచింది.మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ పట్టుబట్టగా.. ప్రభుత్వం 24 గంటల సమయం కోరింది.శనివారం మధ్యాహ్నం ఏ విషయం చెబుతానంటూ వాయిదా వేసింది. -
ప్రశ్నపత్రాల లీకేజీ దోషులకు పదేళ్ల జైలుశిక్ష.. పది కోట్ల రూపాయల జరిమానా... ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
-
జోమాటో నుండి అంత ఫుడ్ ఏవరు పంపారంటే? CJP కి అంతమంది సపోర్ట్ ఎందుకు ?
-
దద్దరిల్లిన జంతర్ మంతర్.. బొద్దింకల దెబ్బ.. ఢిల్లీ అబ్బ
-
నిరసనకారులపై ఏఐ నజర్!
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావాలని, పేపర్ లీకేజీలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద యువత, విద్యార్థు లు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అయితే, ఉద్యమకా రులపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. జంతర్మంతర్ వద్ద నిరసనకు సంబంధించిన వీడియోలను చాలామంది ‘ఎక్స్’లో పోస్టు చేస్తున్నారు. నిరసన కారులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనేది కచ్చితంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ముఖ గుర్తింపు(ఫేసియల్ రికగ్నిషన్) వ్యవస్థలను ఉపయోగిస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ‘ఎక్స్’లో పోస్టుచేసిన వీడియో క్లిప్లలో 360 డిగ్రీల కెమెరాలతో కూడిన లైవ్ సీసీటీవీ నిఘా వాహనం ద్వారా తీసిన దృశ్యాలు కనిపిస్తు న్నాయి. వాహనం లోపల ఉన్న స్క్రీన్ మీద కొందరు నిరసనకారుల పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలు కూడా దర్శనమి స్తున్నాయి. ఆ వీడియో ల్లో ఎక్కడా ఆధార్ కార్డు వివరాల ప్రస్తావన లేదు. అయితే, వ్యక్తుల ముఖాలను స్కాన్ చేసిన తర్వాత వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇచ్చే వ్యవస్థను పోలీసులు ఉపయో గిస్తున్నట్లు నిరసనకారులు అనుమానిస్తున్నారు. ఇది ఆధార్తో లేదా మరేదైనా ప్రభుత్వ డేటా బేస్తో అనుసంధానమై ఉండొచ్చని అంటున్నా రు. పోలీసులు ఆధార్ డేటాను ఉపయోగిస్తున్నట్లు అధికారిక ధ్రువీకరణ లేదు. తమ సాంకేతిక వ్యవస్థను ఆధార్ డేటాబేస్తో అనుసంధానించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పడం లేదు. జంతర్మంతర్ వద్ద నిరసన ప్రదేశానికి సమీపంలో ఢిల్లీ పోలీసులు రెండు నిఘా వాహనాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి మొబైల్ పర్యవేక్షణ యూనిట్గా పనిచేస్తూ, ఆ ప్రాంతం చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాల నుండి ప్రత్యక్ష ప్రసారాలను స్వీకరిస్తుంది. రెండో వాహనం కృత్రిమ మేధను ఉపయోగించి ఆ వీడియో ఫీడ్లను విశ్లేషించి, కెమెరాలో బంధించిన ముఖాలను పోలీసుల డేటాబేస్లో అందుబాటులో ఉన్న చిత్రాలతో పోల్చి చూస్తుంది. నిరసనకారులను ప్రత్యక్షంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ వ్యాన్లను మోహరించారని, వారు అక్కడికక్కడే బయో మెట్రిక్ వివరాలను సేకరించి, వ్యక్తిగత డేటాను వెలికితీస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించింది. అయితే, తమ ఉద్దేశశం నిరసనకారులందరినీ గుర్తించడం కాదని పోలీసు అధికారులు చెబుతున్నారు. జన సమూహంలో నేర చరిత్ర ఉన్నవారు ఎవరైనా కనిపిస్తే పోలీసులను అప్రమత్తం చేయడమే దీని లక్ష్యమని పేర్కొంటున్నారు. ‘‘నేరగాళ్ల ఫొటోలతో కూడిన ఒక పెద్ద డేటాబేస్ మా దగ్గర ఉంది. అందువల్ల జంతర్మంతర్ ప్రాంతంలోని వివిధ సీసీటీవీ కెమెరాల నుంచి మాకు అందిన ఫుటేజ్ ఆధారంగా ముఖ గుర్తింపు చేస్తాం. తద్వారా అక్కడ నేరగాళ్లు ఉంటే అదుపులోకి తీసుకోవడం సాధ్యమవుతుంది’’ అని పోలీసులు స్పష్టంచేశారు. -
సీజేపీ నిరసనలు.. మద్యం షాపులపై కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ :ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుతుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (శని, ఆదివారాలు) నుంచి ఆదివారం వరకూ రాజధాని నగరంలోని మద్యం షాపులన్నింటినీ రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.సాధారణంగా ఢిల్లీలో మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకూ వైన్ షాపులు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలు శాంతిభద్రతల దృష్ట్యా, నగరంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన ఢిల్లీ పోలీసులు మద్యం షాపుల వేళలను కుదించాలని ప్రభుత్వానికి సూచించారు.కాగా ఇటీవలే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గురువారం రాత్రి కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే మద్యం షాపులను త్వరగా మూసివేయడంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రభుత్వం రాత్రి ఎనిమిది గంటలకే మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
నీట్ నిరసనల్లో బిగ్ట్విస్ట్.. 400 మంది క్రిమినల్స్ ?
సాక్షి, ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలపై ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జూలై 20 నుండి జూలై 24 మధ్య జంతర్ మంతర్ దాని పరిసర ప్రాంతాలలో నేర చరిత్ర ఉన్న సుమారు 400 మంది వ్యక్తులను ఢిల్లీ పోలీసుల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ గుర్తించినట్లు తెలిపారు. వీరిలో కొందరికి జూలై 20న జరిగిన హింసాత్మక ఘటనలు, విధ్వంసంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.నీట్ లీకేజ్పై నిరసనలతో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జులై 20 న భారీగా హింస చేలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు దానిపై విచారణను ముమ్మరం చేశారు. ఆ రోజున జరిగిన హింసాత్మక ఘటనల్లో నేరస్థులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గుర్తించిన నేర చరిత్ర కలిగిన వ్యక్తులలో సాహిల్, మనోజ్ కుమార్, రూబల్ సాహిల్ సైఫీ ఉన్నారు. నిరసన సమయంలో వీరు ఏవైనా వ్యవస్థీకృత ముఠాలలో భాగస్వాములుగా ఉన్నారా లేదా అనే అంశాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున, 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన 'చలో సన్సద్' మార్చ్లో వేలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. విద్యా సంస్కరణలు చేపట్టాలని మరియు పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. హై-సెక్యూరిటీ జోన్లోని బారికేడ్లను బద్దలు కొట్టడానికి నిరసనకారులు ప్రయత్నించడంతో జూలై 20న హింస చెలరేగింది. తాజాగా దీనిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? చేయరా?
కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు కొలిక్కిరాలేదు.. కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన సీజేపీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు కేంద్రం గడువు కోరింది. ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. డిమాండ్లపై రేపు మధ్యాహ్నం వరకు వేచి చూస్తామన్న సీజేపీ.. జంతర్మంతర్లో ఆందోళనలు కొనసాగుతాయని పేర్కొంది.అయితే.. ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తప్పించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. సమస్యలకు రాజీనామా పరిష్కారం కాదని.. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్కు పూర్తి మద్దతుగా నిలుస్తోందని, ఆయన రాజీనామా చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రి రాజీనామా నిర్ణయం సులభమే.. కానీ దాంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చారని.. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనతా పార్టీ (సీజేపీ) ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలను విరమించబోమని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం సమస్యల మూలాలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో, ఒకవైపు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా, మరోవైపు వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెబుతోంది. -
అర్థరాత్రి ఎలా ఉంది ? రాత్రి 12 గంటలకు.. జంతర్ మంతర్ వద్ద యువతులు
-
CJP నిరసనలపై ఉక్కుపాదం NSA చట్టం అమల్లోకి
-
సోషల్ మీడియాని ఊపేస్తున్న కాక్రోచ్... GEN-Z కొత్త ట్రెండ్
-
సీజేపీతో చర్చలు.. ఆ డిమాండ్పై రేపటిదాకా గడువు కోరిన కేంద్రం
ఢిల్లీ: సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు ముగిశాయి. ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామన్న సీజేపీ ప్రతినిధులు.. ఈ డిమాండ్లకు నెరవేరేవరకు ఆందోళన విరమించేదిలేదని తేల్చి చెప్పారు. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ చర్చించారు. రెండు గంటలపాటు చర్చలు కొనసాగాయి.కాన్ట్సిట్యూషన్ క్లబ్లో జరిగిన ఈ చర్చల్లో డిమాండ్ల నోట్ కేంద్ర మంత్రులకు సీజేపీ నేతలు సమర్పించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 3 డిమాండ్లు కేంద్ర మంత్రుల ముందు ఉంచాం.. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు పరిహారం ఇవ్వాలని కోరాం. నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సౌరవ్ దాస్ తెలిపారు.‘‘మూడింటిలో రెండు డిమాండ్లకు కేంద్రం పాజిటివ్గా ఉంది. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరాం. మరోసారి కేంద్రం చర్చలు జరుపుతాం. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు గడువు కోరారు. రేపటిలోగా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తారని ఆశిస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించకపోతే మరోసారి ఆందోళనకు పిలుపునివ్వాల్సి వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదు’’ అని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. -
ప్రధాని వీడియో సందేశం ఏంటీ? కాక్రోచ్ ఉద్యమం వెసక ఉన్నదెవరు?
-
ఓవైపు చర్చలు.. మరోవైపు పార్లమెంట్ స్ట్రీట్లో హైటెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పార్లమెంట్ స్ట్రీట్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా.. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని శుక్రవారం సీజేపీ చెబుతోంది. నిరసనకారులపై కేసులు తప్పవని, జాతీయ భద్రతా చట్టం (NSA) ప్రయోగిస్తామని, పాస్పోర్టులు సీజ్ చేస్తామని.. అఖరికి అరెస్టులు చేస్తామని హెచ్చరికలు వచ్చినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. విద్యా వ్యవస్థలో మార్పులు, తమపై జరిగిన పోలీసుల చర్యలపై బాధ్యులపై చర్యలు, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో కేంద్రంతో సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.కేంద్రం ప్రయత్నాలుమరోవైపు ఆందోళనను ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సీజేపీ ప్రతినిధులతో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో రెండో దఫా చర్చలు జరుగుతున్నాయి. సీజేపీ తరఫున ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు భేటీ అయ్యారు. ఎలాగైనా ఆందోళనలు విరమింపజేయాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం తమ ప్రధాన డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయాన్ని ప్రతినిధులు చర్చలకు వెళ్లే ముందు మీడియాకు స్పష్టం చేశారు. ‘‘మా డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. మాపై లాఠీ చార్జి చేసింది పోలీసులు కాదు.. ఆ ముసుగులో ఉన్న గూండాలు. వాళ్లకు శిక్ష పడాల్సిందే. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకు వెళ్తాం. మా డిమాండ్లు నెరవేరే దాకా పోరాటం ఆపం’’ అని ఆ ఇద్దరు ప్రకటించారు. దీంతో చర్చలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.పార్లమెంట్ వైపు వెళ్లేందుకు యత్నం.. పోలీసుల అప్రమత్తంఇదిలా ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నాం జంతర్ మంతర్ నుంచి కొందరు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్ స్ట్రీట్ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని పోలీసులు ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.కేబినెట్ భేటీఅటు చర్చలు.. ఇటు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. పేపర్ లీకుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పిన ప్రధాని మోదీ.. అందుకు అవసరమైన చర్యలకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు కఠిన శిక్షలతో చట్టం అమలయ్యేలా సంస్కరణల రూపకల్పన దిశగా ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాంగ్చుక్ దీక్ష విరమించినా.. పోరాటం కొనసాగింపుప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ నేతలు తెలిపారు. వ్యక్తుల దీక్షతో సంబంధం లేకుండా.. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ముందుగా ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్సీజేపీ తమ ప్రధాన ఎజెండాను స్పష్టం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. నీట్ సహా పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న వివాదాలు, విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చింది. మంత్రి రాజీనామా తర్వాతే విద్యా సంస్కరణలు, ఆందోళనకారులపై లాఠీచార్జి చేసిన అధికారులపై చర్యలు వంటి అంశాలపై చర్చిస్తామని సీజేపీ పేర్కొంది.ఒకవైపు ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తుండగా.. మరోవైపు సీజేపీ మాత్రం తమ డిమాండ్ల సాధన వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో పార్లమెంట్ స్ట్రీట్లో కొనసాగుతున్న ఈ నిరసన దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రం–సీజేపీ మధ్య జరగనున్న చర్చల ఫలితంపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. -
బొద్దింకలతో పోలుస్తారా..? అధికారిణికి కాక్రోచ్ కౌంటర్
-
ఆగని విపక్షాల ఆందోళనలు
-
సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!
టీమిండియా విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. సొంతగడ్డ మీదే పర్యాటక జట్టుగా మ్యాచ్లు ఆడనుంది. అవును.. మీరు చదివింది కరెక్టే!.. ఇంతకీ సంగతి ఏమిటంటే.. అఫ్గానిస్తాన్కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే పరిస్థితులు లేవు.ఇప్పటికే పలు మ్యాచ్లు ఈ నేపథ్యంలో భారత్ అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ACB)కు అండగా నిలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సహకారంతో ఏసీబీ భారత్లో ఆతిథ్య దేశంగా తమ మ్యాచ్లు నిర్వహించుకుంటోంది. డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నోలను తమ హోంగ్రౌండ్లుగా గతంలో ఎంచుకుంది. అంతేకాదు.. న్యూజిలాండ్తో ఏకైక టెస్టుకు కూడా షెడ్యూల్ను ఖరారు చేసుకుంది. అయితే, ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. తాజాగా టీమిండియాకే భారత్లో ఆతిథ్యం ఇచ్చేందుకు అఫ్గాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఢిల్లీలో అఫ్గాన్- భారత్ సిరీస్టీమిండియా- శ్రీలంక టెస్టు సిరీస్ ... ఆసియా క్రీడలు-2026 మధ్య విరామంలో టీమిండియా- అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 27 నుంచి భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుండగా.. ఆసియా క్రీడలకు సెప్టెంబరు 24న తెర లేవనుంది.ఈ క్రమంలో సెప్టెంబరు 13 నుంచి టీమిండియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గాన్ బోర్డు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక అని తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది.గెలుపు బోణీఇదిలా ఉంటే.. ఇటీవలే అఫ్గాన్ జట్టు భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో ఏకైక టెస్టులో ఓడిపోయిన అఫ్గాన్.. మూడు వన్డేల సిరీస్లో 0-3తో క్లీన్స్వీప్ అయింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో చాంపియన్గా నిలిచిన తర్వాత విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి టీ20 సిరీస్ ఆడిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయిన శ్రేయస్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది. తాజాగా జింబాబ్వే గడ్డ మీద గురువారం నాటి తొలి టీ20లో గెలిచి ఎట్టకేలకు.. ఏడు మ్యాచ్ల తర్వాత తొలి విజయం సాధించింది.చదవండి: విజయానికి క్రెడిట్ నాకు ఇవ్వొద్దు.. ఆ అర్హత లేదు: వైభవ్ -
ఈరోజు రాత్రి మేమంతా అరెస్ట్.. సీజేపీ దీప్కే సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు అని చెప్పుకొచ్చారు. తాము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీంతో, ఈరోజు ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే...‘ఈ రాత్రికి సీజేపీ టీమ్ మొత్తాన్ని అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసి మరో తప్పు చేయవద్దని ప్రభుత్వానికి చెబుతున్నా. అరెస్ట్తో ఆందోళన మరింత ఉధృతం అవుతుంది. మేము అరెస్ట్ అయినా ఉద్యమం శాంతియుతంగా సాగాలి. అలాగే, సోనమ్ వాంగ్చుక్ 26 రోజుల నిరాహార దీక్షను విరమించడం శుభపరిణామం. ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఆరోగ్యం పట్ల మాకు ఆందోళన ఉండేది. 26 రోజులకు పైగా ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. సోనమ్ వాంగ్చుక్ జీవితం ఈ దేశానికి ఎంతో విలువైనది” అని వ్యాఖ్యలు చేశారు.VIDEO | Delhi: “According to new input, CJP team members may be arrested tonight”, says CJP Founder Abhijeet Dipke, urging protesters to continue movement across nation even after arrest.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/6AW7aACtxQ— Press Trust of India (@PTI_News) July 24, 2026అయితే, తమ ఉద్యమం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ ధర్నా కొనసాగుతుందని ప్రకటించారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మాకు మరే పరిష్కారం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని దీప్కే తేల్చి చెప్పారు.కేంద్ర మంత్రులతో జరగనున్న సమావేశంపై స్పందిస్తూ... చర్చలు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తటస్థ వేదికలోనే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ వివాదం, పోటీ పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "Our dharna at Jantar Mantar will continue until Dharmendra Pradhan resigns. We are very relieved that Sonam Wangchuk has broken his hunger strike as it had been more than 26 days. His life is… pic.twitter.com/SSyJANfcXA— ANI (@ANI) July 24, 2026మరోవైపు.. సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జేపీ నడ్డా గారితో సమావేశం ఉంది. ఈ సమావేశానికి జితేంద్ర సింగ్ గారు కూడా హాజరయ్యే అవకాశం ఉందని మాకు సమాచారం. చర్చల్లో ఏం జరిగిందో మీడియాకు వెల్లడిస్తాం” అని తెలిపారు.సోనమ్ గారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో దీక్ష విరమించాలని మేము నిరంతరం కోరుతున్నాం. మా రెండు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చింది. శాంతియుత నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, అలాగే బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఈ హామీలతో పోరాటం ముగిసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై కూడా ఆయన స్పందించారు. ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెరిగిందని వ్యాఖ్యానించారు. ‘మొదటిసారి ప్రధానమంత్రి అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ద్వారా పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. యువత భవిష్యత్తుపై ప్రభుత్వం నిజంగా సీరియస్గా ఉంటే, అత్యంత కఠినమైన చర్యగా ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలి’ అని రంకా అన్నారు. -
దీక్షను అడ్డుకోవద్దంటూ పోలీసుల కాళ్లపై పడ్డ CJP అభిజిత్
-
దేశాన్ని కదిలించిన CJP.. రాజీనామా చేసి నిరసనలో పాల్గొన్న పోలీస్ ఉద్యోగి..
-
CJPతో కేంద్రం చర్చలు
-
CJP నిరసనలో చిన్నారి వీడియో వైరల్
-
వినీత్ జోషి బదిలీ.. అంతటి సమర్థుడ్ని ఎలా తప్పించారు?!
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిని బదిలీ చేసి.. ఆయన స్థానంలో నరేశ్ పాల్ గంగ్వార్ను నియమించింది. వినీత్ జోషికి మాత్రం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ బదిలీపై ఇప్పుడు చర్చ మొదలైంది.విద్యా వ్యవస్థలో కీలక ముఖం.. 1992 బ్యాచ్కు చెందిన మణిపూర్ క్యాడర్ ఐఏఎస్ అధికారి వినీత్ జోషి.. కేంద్ర విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో ఒకరు. పరిపాలనలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన.. పరీక్షల నిర్వహణ నుంచి విద్యా విధానాల అమలు వరకు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలకు కేంద్ర బిందువైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తొలి డైరెక్టర్ జనరల్గా వినీత్ జోషి పనిచేశారు. నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలను నిర్వహించే సంస్థ ప్రారంభ దశలో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర విద్యాశాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.CBSE ఛైర్మన్గా మరో కీలక బాధ్యతను చేపట్టిన ఆయన.. దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానాలు, విద్యా ప్రమాణాల రూపకల్పన వంటి అంశాల్లో పనిచేశారు. అంతకుముందు మణిపూర్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తృత పరిపాలనా అనుభవం ఉన్న వినీత్ జోషి.. విద్యా రంగంలో కీలక సంస్థలకు నాయకత్వం వహించిన అధికారిగా గుర్తింపు పొందారు.అనుభవజ్ఞుడి స్థానంలో మరో సీనియర్వినీత్ జోషి స్థానంలో నియమితులైన నరేశ్ పాల్ గంగ్వార్ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి. 1994 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఆయన.. కేంద్రంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన గంగ్వార్.. అంతకుముందు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.పరీక్షల నిర్వహణ, విద్యా రంగంలో ప్రత్యేక అనుభవం ఉన్న వినీత్ జోషి స్థానంలో.. పరిపాలనా అనుభవం ఉన్న మరో సీనియర్ అధికారిని కేంద్రం నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నీట్ వివాదం వేళ మార్పునీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులు, ప్రతిపక్షాలు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో ఈ బదిలీ జరిగింది. ఈ నేపథ్యంలోనే వినీత్ జోషి రూపంలో తొలి వికెట్ పడిందా?అనే చర్చ జోరుందుకుంది. బాధ్యతను అధికారులపైకి మళ్లించే చర్యగా కొందరు ఈ ‘ట్రాన్స్ఫర్’ను విమర్శిస్తున్నాయి. అయితే వినీత్ జోషితో పాటు మరికొందరి మార్పు జరగడంతో పరిపాలనా మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటే.. కేంద్ర వర్గాల నుంచి దానికి కూడా సరైన సమాధానం ఇంకా రాలేదు.ఎందుకిలా?వినీత్ జోషి సుదీర్ఘ అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారి. అయితే పరీక్షల నిర్వహణ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వచ్చిన సమయంలో ఆయన బదిలీ కావడం చర్చకు కారణమైంది. నీట్ వివాదానికి అసలు బాధ్యత ఎక్కడ ఉంది? వ్యవస్థలో లోపాలా? అధికారుల నిర్లక్ష్యమా? లేదంటే విధానపరమైన సమస్యలా? అన్నది భవిష్యత్తు పరిణామాలు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం నీట్ వివాదం మధ్య జరిగిన ఈ ఉన్నత స్థాయి అధికార మార్పు రాజకీయంగా కొత్త చర్చకు తెర తీసే అవకాశం లేకపోలేదు. -
కేంద్రంతో చర్చలకు సీజేపీ గ్రీన్సిగ్నల్.. వేదిక ఫిక్స్
ఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమం కీలక మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని ఇప్పటికే ప్రకటించిన సీజేపీ నాయకత్వం, తటస్థ వేదికలోనే సమావేశం నిర్వహించాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించినట్లు పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఇరు పక్షాల మధ్య చర్చలు జరగనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా గురువారం అర్ధరాత్రి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రేపు చర్చలకు పిలుపు వచ్చింది. తటస్థ వేదికలో సమావేశం నిర్వహించాలని మేము కోరాం. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది. చర్చలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను వేదికగా ఎంపిక చేశారు’ అని తెలిపారు. ఈ చర్చలు సానుకూలంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.#WATCH | Delhi: Saurav Das, Chief Spokesperson, Cockroach Janta Party, says, "... Tomorrow, a discussion has been called for, we are very happy that the government has agreed to our request that it be at a neutral venue. The Constitution Club of India has been chosen..." (23.07) pic.twitter.com/MoK1DgdgJ5— ANI (@ANI) July 24, 2026కాగా, నిరసనల వేళ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చర్చల కోసం పలుమార్లు ఆహ్వానం పంపినప్పటికీ, కేంద్ర మంత్రుల నివాసాల్లో సమావేశాలకు తాము హాజరుకాబోమని సీజేపీ స్పష్టం చేసింది. జంతర్ మంతర్లోనే లేదా అందరికీ ఆమోదయోగ్యమైన తటస్థ వేదికలోనే చర్చలు జరగాలని పట్టుబట్టింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం తటస్థ వేదిక ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు, యువతలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో పారదర్శకత వంటి అంశాలపై ఈ ఉద్యమం ప్రారంభమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, బాధ్యులపై కఠిన చర్యలు, బాధిత కుటుంబాలకు న్యాయం వంటి డిమాండ్లతో సీజేపీ ఉద్యమం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ప్రధానమంత్రి మోదీ పరీక్షా పేపర్ లీకుల కేసులపై ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ, అది తమ ప్రధాన డిమాండ్లకు పూర్తి పరిష్కారం కాదని సీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జరగనున్న శుక్రవారం చర్చలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ సమావేశంలో ప్రభుత్వం ఉద్యమకారుల డిమాండ్లపై ఎలాంటి హామీలు ఇస్తుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
జంతర్ మంతర్ లో మీమ్స్.. రీల్స్
-
విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్
నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా ఆగ్రహం రాజుకుంటోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. ఢిల్లీ నుంచి కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో జంతర్మంతర్కు తరలివస్తూ ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు లాఠాచార్జీ చేసినప్పటికీ విద్యార్థులు ఏమాత్రం బెదరకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతూ వస్తోంది . తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విద్యార్థుల నిరసనలకు మద్దతు పలికాడు. ఎంతో కష్టపడి చదివినా ఫలితం దక్కనప్పుడు విద్యార్థులు ఆవేదన చెందడం అర్థం చేసుకోదగిన అంశమేనని పేర్కొన్నాడు. విద్యార్థులు మరోసారి ఇలా నిరాశకు లోనవ్వకుండా చూసే బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సచిన్ గురువారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. స్వతహాగా తన తండ్రి ప్రొఫెసర్ కావడంతో చిన్నప్పుడే తనకు నూరి పోసిన మాటలను సచిన్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ‘ఓటములు ఎదురైనా పర్వాలేదు, కానీ మోసం మాత్రం చేయకూడదు. విజయం కోసం ఎప్పుడూ అడ్డదారులు తొక్కవద్దని మా నాన్న నాకు చెప్పేవారు. సమాజంలో పెద్దలుగా, మన సంస్కృతిని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని విద్యార్థులు నిరాశ చెందడం సహజం. భవిష్యత్తులో వారికి మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా మనమందరం సమష్టిగా కృషి చేయాలి. జైహింద్’ అని సచిన్ టెండూల్కర్ ఎక్స్లో రాసుకొచ్చాడు.కేవలం ఫలితాలకే ప్రాధాన్యమిచ్చే సమాజం, ప్రతిభ కంటే అక్రమ మార్గాలనే ఎక్కువగా ఆశ్రయిస్తుందని అని సచిన్ అభిప్రాయపడ్డాడు. యువత ఆకాంక్షలను పరిరక్షించే దిశగా త్వరలోనే సరైన పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.సచిన్తో పాటు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్తో పాటు కోహ్లి, శుబ్మన్ గిల్ కూడా తమ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసనలకు మద్దతు ప్రకటించారు. ఇదిలాఉంటే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై అటు పార్లమెంట్ కూడా అట్టుడుకుతోంది. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతాపార్టీ తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. pic.twitter.com/3a8WRHhWIK— Sachin Tendulkar (@sachin_rt) July 23, 2026 -
ఢిల్లీలో CJP తుఫాన్.. లాఠీ దెబ్బలకు భయపడని Gen-Z.. దద్దరిల్లిన జంతర్ మంతర్
-
ప్లకార్డ్లో పంచ్లైన్... నిరసనలో రీల్ వైబ్
లాఠీలతో కొడితే థ్యాంక్యూలు చెప్తున్నారు. చెదరగొట్టడానికి వాటర్ కానన్ వాడితే రెయిన్ డాన్స్ చేస్తున్నారు. వాళ్ల పాటే నినాదం. వాళ్ల వ్యంగ్యమే ప్రశ్న. సెల్ఫోన్ పట్టుకున్న సైన్యంలా ఉంటున్నారు. జెన్ జి నిరసనకు ఫార్మాట్ మారింది. సీరియస్ ఇష్యూ + సినిమా పంచ్ + సోషల్ మీడియా... అదే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’.ఢిల్లీ జంతర్ మంతర్లో ‘నీట్’ ప్రశ్నాపత్రానికి సంబంధించి తాజా నిరసనలో టియర్ గ్యాస్ గుప్పుమంది. అది చూసిన ఒక కుర్రాడు వెంటనే ప్లకార్డ్ మీద ఇలా రాశాడు. ‘గురూ... నేను యమునకు ఆ వైపున ఉంటా. ఇంతకన్నా కంపు రోజూ తెలుసు. ఇదసలు లెక్కే కాదు’....అక్కడే ఉన్న మరో కుర్రాడు ఇంకో ప్లకార్డ్ పట్టుకున్నాడు. దాని మీద గాంధీగారి బొమ్మ ఉంది. కింద కామెంట్– ‘ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే సీజన్1 హీరోని రంగంలో దించాల్సి వచ్చింది’... అంటే అహింసామార్గ ప్రదాతనే రంగంలోకి దించాల్సి వచ్చిందని అర్థం.మరో ప్లకార్డ్ ఒకమ్మాయి పట్టుకుంది. దాని మీద కామెంట్– ‘నాకు ఎవరూ ఫండింగ్ చేయలేదు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఉచితానికే అసహ్యించుకుంటున్నా’...తమ నిరసనకు స్పందించని పెద్దలకు చురక వేస్తూ మరో పోస్టర్. దానిపై మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్లోని సర్క్యూట్ పాత్ర. కింద కామెంట్– ఓయ్ సర్క్యూట్. రాంగ్ పర్సన్ని ఎత్తుకొచ్చావ్ స్వామీ.మామూలుగా నిరసనల్లో లాఠీచార్జీ జరిగితే పారిపోతారు. కాని నిరసనకు దిగిన జెన్ జి తరం వెనక్కి తగ్గలేదు. వాటర్ కానన్ కొట్టినా బదులుగా ‘రెయిన్ డాన్స్’ చేశారు. ‘Fitness plan: Running from police’ అని బోర్డు పట్టుకున్నారు.జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్ఒకప్పుడు నిరసన అంటే నల్ల జెండాలు, గొంతు చించుకునే నినాదాలు. కానీ 2026లో జెన్ జి ఆ డెఫినిషన్ను చెరిపేసింది. వాళ్లకు ఆగ్రహం ఉంది. కానీ ఆ ఆగ్రహాన్ని మీమ్గా, రీల్గా, పాటగా మారుస్తున్నారు. పేపర్ లీక్, నిరుద్యోగం, అవినీతి– సీరియస్ ఇష్యూలే. కానీ చెప్పే తీరు మాత్రం క్రియేటివ్. ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, జైపూర్ కావచ్చు... జెన్ జికి కోపం వస్తే స్టయిల్ ఇదే. స్పందించని వ్యవస్థను ఎద్దేవా చేస్తూ ‘నా ఎక్స్ (బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్) కూడా నన్ను ఇంతగా బాధించ లేదు’ అని ప్లకార్డు పట్టుకొని నిలబడుతున్నారు. ఇలా డిజిటల్ కల్చర్ను, మీమ్స్ భాషను నిరసనకు వాడుకోవడాన్నే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’ అంటున్నారు. బాలీవుడ్ పాటలు పాడటం, సంగీత కచ్చేరీలు, ప్రబోధ గీతాల ఆలాపన.. అన్నీ అలౌడ్.గెట్ రెడీ విత్ మీ (G-RWM)జెన్ జి యువతీ యువకులు ఒక దగ్గరకు కూడటానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీ ‘చలో సంసద్’ నిరసన కోసం ప్రిపరేషన్ అంతా సోషల్ మీడియా రీల్స్ నుంచే ప్లాన్ అయింది. ‘గెట్ రెడీ విత్ మీ’ అంటూ రీల్స్ చేస్తూ యువతను సమీకరించారు. టియర్ గ్యాస్ను తట్టుకోవడానికి స్విమ్మింగ్ గాగుల్స్, ఢిల్లీ ఉక్కపోతను తట్టుకోవడానికి మినీ యూఎస్బీ ఫ్యాన్లు, విసనకర్రలు దగ్గర పెట్టుకుని బయలుదేరి వచ్చారు. ఎయిర్పోర్టుల నుంచి, రైలు కంపార్ట్మెంట్లలో నుంచి స్టోరీలు పెడుతూ ఏదో మ్యూజిక్ కాన్సెర్ట్కు వెళ్తున్నంత ఊపుతో దేశ రాజధానికి తరలివచ్చారు. ‘మా గుండెల్లో ఇంక్విలాబ్.. మా చేతుల్లో ఇన్ స్టాగ్రామ్!’ అనే వన్–లైనర్ ఈ తరం నిరసన తత్వం. ధర్మాగ్రహం కలిగి, శాంతియుతంగా మార్పు తేవాలని ప్రయత్నిస్తున్న ఈ తరాన్ని, వ్యంగ్యమనే బాణాలతో ప్రత్యర్థి మనసు మార్చాలని చూస్తున్న ఈ భావితరం స్వరాన్ని ‘నో’ అని నొక్కేస్తే రేపు వాళ్లు మాట్లాడటమే మానేస్తారు. ‘మేమున్నాం’ అని భుజం తడితే ఈ దేశానికి క్రియేటివ్, కరేజియస్ లీడర్స్ దొరుకుతారు. పంచ్లైన్ తో మొదలైన ఈ నిరసన రేపు పాలసీతో అంతం కావాలి. అప్పుడే ఈ ‘సెల్ఫోన్ సైన్యం’ నిజమైన దేశభక్తి సైన్యంగా మారుతుంది. వారి దారి వినూత్నంఢిల్లీలో పోలీసుల లాఠీచార్జి జరిగి, సాయంత్రం వాళ్లు డ్యూటీ దిగుతుంటే లాఠీ దెబ్బలు తిన్న యువతీ యువకులంతా ‘థ్యాంక్యూ సర్... చాలా బాగా డ్యూటీ చేశారు’ అని రోడ్డు పొడుగునా నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇలా చేయడం తిట్టడం కంటే చాలా ఎక్కువ. ‘ఇంటికెళ్లి గర్వంగా ముఖం చూపించండి’ అని కూడా అన్నారు. తమను కొట్టిన వారికే మంచి నీళ్లు అందించడం, గులాబీపూలు ఇవ్వడం జెన్ జి ప్రొటెస్ట్ స్టయిల్. పోలీసులు కొడుతుంటే జాతీయ జెండాను చుట్టుకుని నిలబడటం, సారే జహాసే అచ్ఛా పాడటం.... జనగణమన ఆలపించడం.... కచ్చితంగా గాంధీ మార్గం.– కె -
నేటి యువత చూపుతున్న నైతిక శక్తి
ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరుగుతున్న విద్యార్థుల నిరసన... శాంతియుతంగా వ్యవస్థలను ప్రశ్నించే ధైర్యం ఉన్న వారే ఒక దేశపు ప్రజాస్వామ్య గాథను రాస్తారనే చిరస్థాయి సూత్రాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. బ్రిటిష్ పాలనలో జరిగిన స్వదేశీ ఉద్యమం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు; స్వాతంత్య్రం తరువాత గుజరాత్లోని నవనిర్మాణ ఉద్యమం నుంచి 1970ల జేపీ (జయప్రకాశ్ నారాయణ్) జేపీ ఉద్యమం వరకు... వ్యవస్థ న్యాయమార్గం నుంచి తప్పిపోతోందని భావించిన ప్రతిసారీ విద్యార్థులు సవాలు విసిరారు. వారి పాత్ర తరగతి గదులకే పరిమితం కాలేదు. జంతర్ మంతర్ నిరసన ఆ సంప్రదాయానికి కొనసాగింపు మాత్రమే.సత్యాగ్రహ శక్తిసామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన అనేక వీడియోల్లో, పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు హింసతో ప్రతిస్పందించకుండా నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. తమపై ఏమి జరిగినా శాంతియుతంగానే ఉంటామని కొందరు పోలీసుల ఎదుట నిలబడి చెప్పారు. వారు తెలుసుకుని చేసినా, తెలియక చేసినా అది మహాత్మా గాంధీ ‘సత్యాగ్రహం’గా అభివర్ణించిన సత్యశక్తినే ప్రతిబింబించింది. ‘మానవాళి చేతిలో ఉన్న అత్యంత శక్తిమంతమైన ఆయుధం అహింస’ అని గాంధీజీ అన్నారు. ఆయన దృష్టిలో సత్యాగ్రహి లక్ష్యం ప్రత్యర్థిని ఓడించడం కాదు, సమాజ అంతరాత్మను మేల్కొల్పడం. జంతర్ మంతర్ నిరసన ద్వారా విద్యార్థులు సరిగ్గా ఇదే చేశారు. విద్య అంటే అసలు ఏమిటన్న మరింత లోతైన ప్రశ్నను కూడా ఈ నిరసన లేవనెత్తుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావప్రకటన స్వేచ్ఛతో పాటు శాంతియుతంగా సమావేశ మయ్యే హక్కును హామీ ఇస్తోంది. ఎందుకంటే భయపడకుండా అధికారాన్ని ప్రశ్నించగల విజ్ఞానవంతులైన పౌరులపైనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి. అందువల్ల భిన్నాభిప్రాయం ప్రజాస్వామ్యానికి మినహాయింపు కాదు; దాని ప్రాథమిక అవసరాల్లో అది ఒకటి. ఏ రాజకీయ సిద్ధాంతం అధికారంలో ఉన్నా, ప్రజా శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వ బాధ్యతే కావచ్చు. కానీ అదే సమయంలో శాంతియుత నిరసనను దేశానికే ముప్పుగా పరిగణించకుండా చూడటం కూడా ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత అనేది గుర్తెరగాలి.ధర్మబద్ధమైన కార్యాచరణ‘ప్రభుత్వాలు తాత్కాలికమైనవి; ప్రజాస్వామ్య సంస్థలు శాశ్వ తమైనవి’ అని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని దేశాన్ని విమర్శించినట్టుగా భావించడం... భారత స్వాతంత్య్ర ఉద్యమం నెలకొల్పాలనుకున్న రాజ్యాంగ సంస్కృతినే బలహీన పరుస్తుంది. ఇది ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న ‘సనాతన ధర్మం’ వైపునకు తీసుకువెళుతుంది. ప్రస్తుత రాజకీయ చర్చల్లో సనాతన ధర్మాన్ని కేవలం మతపరమైనదిగా చిత్రీకరిస్తున్నారు. కానీ భారతీయ శాస్త్రీయ తాత్విక సంప్రదాయంలో దానికి ఎంతో విస్తృతమైన అర్థం ఉంది. ‘ధర్మం’ అంటే సమాజాన్ని నిలబెట్టేది– న్యాయం, సత్యం, కరుణ, కర్తవ్యం, నైతిక క్రమం. అది కేవలం ఆచారాలు, కర్మకాండలు కాదు; నైతిక ప్రవర్తన.ధర్మం లేని అధికారానికి చెల్లుబాటు ఉంటుందా అనే ప్రశ్న మహాభారతంలో చాలాసార్లు కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు అధికారంపై మమకారంతో అన్యాయాన్ని చూడలేకపోయాడు. దుర్యోధనుడి దురాశ ఒక రాజ్యాన్నే నాశనం చేసింది. భీష్ముడు జ్ఞానవంతుడూ, నిష్కళంకుడూ అయినప్పటికీ, చక్రవర్తి పట్ల తన విధేయత కారణంగా అధర్మాన్ని ఎదిరించలేక విషాదపాత్రగా మిగిలాడు. న్యాయాన్ని వదిలిపెట్టిన పాలకులు చివరకు తమను తామే నాశనం చేసుకుంటారని విదురుడు పదేపదే హెచ్చరిస్తాడు. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన ఉపదేశం అధికారాన్ని సమర్థించడం కాదు; ధర్మ బద్ధమైన కార్యాచరణకు మద్దతు ఇవ్వడం. ఈ సందేశం శాశ్వత మైనది. ధర్మం రాజకీయ అధికారానికి మించినది. పాలకుల చెల్లు బాటు నైతిక పాలన పట్ల వారి నిబద్ధతపైనే ఆధారపడి ఉంటుంది.ఈ అవగాహన భారత రాజ్యాంగంతో కూడా సారూప్యత కలిగి ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, న్యాయం వంటి విలువలు భారతీయ నాగరికతపై పాశ్చాత్య ప్రపంచం రుద్దినవి కావు. ఉప నిషత్తుల నుంచి బుద్ధుడి వరకు, అశోకుని నుంచి బసవన్న వరకు, కబీర్ నుంచి అంబేడ్కర్ వరకు... భారతీయ తాత్విక సంప్రదా యాల్లో ఇవి లోతుగా ప్రతిధ్వనిస్తాయి. భారత రాజ్యాంగ నైతికత, భారత నాగరికత నైతిక సంప్రదాయం పరస్పర విరోధాలు కావు; అత్యుత్తమ రూపంలో అవి ఒకదానిని మరొకటి బలోపేతం చేస్తాయి.పూర్తికాని స్వాతంత్య్ర పోరాటంభారతదేశం 1947లో రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే ఆ స్వేచ్ఛకు నైతిక పునాదులను కాపాడుకునే పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులు ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారా మాత్రమే నిలవదనీ, ప్రజా అంతరాత్మ ద్వారానూ నిలుస్తుందనీ గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సమాధానం కేవలం అధికార కేంద్రాల్లో దొరకదు. స్వతంత్ర ఆలోచనను పెంపొందించే తరగతి గదుల్లో, జవాబుదారీతనాన్ని ఆహ్వానించే సంస్థల్లో, భయానికి సత్యాన్ని బలివ్వని పౌరుల్లో అది కనిపిస్తుంది. అధికా రాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు; గణతంత్రంపై విశ్వాసాన్ని వ్యక్తపరిచే చర్య అని జంతర్ మంతర్లో యువత గుర్తుచేస్తోంది. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు నిరసన స్వరం కాదు, పౌరుల మౌనం!డా‘‘ రఘు చలిగంటివ్యాసకర్త ఫ్రౌన్హోఫర్ హెచ్హెచ్ఐ (జర్మనీ)సీనియర్ పరిశోధకుడు, ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ’ వ్యవస్థాపకుడు -
సీజేపీ ఆందోళనకారులకు పోలీసులు బిగ్ షాక్.. ఆ పని చేస్తే పాస్పోర్ట్లు రద్దు!
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనల్లో.. హింసకు పాల్పడిన వారి పాస్పోర్ట్లను రద్దు చేసే యోచనలో ఢిల్లీ పోలీసులు ఉన్నట్లు పీటీఐ నివేదిక పేర్కొంది. నీట్ పేపర్ల లీకేజీలో ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థికి రూ.కోటి చెల్లించాలని సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చలో సంసద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వారి నిరసనలకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష,ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ,ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు తోడవ్వడంతో ఉద్యమం ఊపందుకుంది.పలు చోట్ల ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం, పోలీసులపై ఆందోళన కారులు తిరగబడడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. యితే, ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు శాంతియుతంగా కాకుండా హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగా దాడులకు తెగబడిన వారి పాస్పోర్టులు రద్దు చేసే దిశగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఢిల్లీ పోలీసుల వివరాల మేరకు.. ఆందోళనకు నిబంధనలు ఉల్లంఘించి పార్లమెంట్ వీధుల్లో ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో 118మంది పోలీసులకు గాయాలయ్యాయి. 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలు ధ్వంసం కాగా.. 60మంది ఆందోళనకారులు గాయపడ్డారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65మందికి చికిత్స కొనసాగుతోంది. మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ గెజిట్ ప్రకారం.. జూలై 19 నుండి అక్టోబర్ 18 వరకు మూడు నెలల పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్కు జాతీయ భద్రతా చట్టం, 1980 కింద ముందస్తు నిర్బంధ అధికారాలను కల్పిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని విచారణ లేకుండానే 12 రోజుల నుండి 12 నెలల వరకు నిర్బంధించవచ్చు.అయితే, ఈ ఉత్తర్వులు ప్రతి మూడు నెలలకొకసారి జారీ చేసే సాధారణ ప్రక్రియేనని, జూలై 7నే దీనికి సంబంధించిన ఫైల్ ప్రాసెస్ అయిందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుత సీజేపీ నిరసనలకు, ఈ ఆర్డర్కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వివరించారు.శాంతిభద్రతలను కాపాడేందుకు నిరసనకారులు సహకరించాలని, సమస్యపై చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కాగా, ఈ పోలీసుల కఠిన చర్యలకు నిరసనగా జూలై 24, శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాంతియుత నిరసనలు చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది. -
కోట్ల ఆస్తులు.. లక్షల ఆదాయం.. ధర్మేంద్ర ప్రధాన్ నెట్వర్త్!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారారు. నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఆస్తులు, ఆదాయం, పెట్టుబడులపై కూడా ప్రజల్లో ఆసక్తి పెరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2024 లోక్సభ ఎన్నికల అఫిడవిట్లో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబం మొత్తం ప్రకటించిన ఆస్తుల విలువ రూ.6.92 కోట్లు కాగా, అప్పులు రూ.2.30 కోట్లు ఉన్నాయని తెలుస్తోంది.2022-23 ఆర్థిక సంవత్సరంలో ధర్మేంద్ర ప్రధాన్ వార్షిక ఆదాయం రూ.12.75 లక్షలు. ఆయన భార్య మృదులా ఠాకూర్ మాత్రం అదే ఏడాది రూ.49.92 లక్షల ఆదాయం పొందారు. చేతిలో నగదు విషయానికి వస్తే.. ధర్మేంద్ర ప్రధాన్ వద్ద రూ.35 వేలు, ఆయన భార్య వద్ద రూ.40 వేలు ఉన్నాయి. ఇద్దరు పిల్లల వద్ద కలిపి మరో రూ.17 వేలు నగదు ఉండటంతో కుటుంబం మొత్తం చేతిలో ఉన్న నగదు రూ.92 వేలుగా నమోదైంది.పెట్టుబడుల విషయానికి వస్తే.. బ్యాంక్ డిపాజిట్లు, పీపీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర ఆర్థిక పెట్టుబడులు కలిపి కుటుంబం వద్ద సుమారు రూ.2.47 కోట్లు ఉన్నట్లు సమాచారం. మ్యూచువల్ ఫండ్లలో రూ.80.40 లక్షలు, బీమా పాలసీల్లో రూ.67.72 లక్షలు పెట్టుబడిగా ఉన్నాయి. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల నుంచి రూ.31.38 లక్షల లోన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.స్థిరాస్తుల విషయానికి వస్తే.. ఒడిశాలో రూ.12 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.20.50 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి ఉన్నాయి. అలాగే ఘాజియాబాద్లోని ఇందిరాపురంలో ఒక అపార్ట్మెంట్, భువనేశ్వర్లో మరో నివాస గృహం కలిపి సుమారు రూ.1.98 కోట్ల విలువైన ఇళ్లను ధర్మేంద్ర ప్రధాన్, ఆయన భార్య కలిగి ఉన్నారు.2011 మోడల్ హోండా సిటీ కారు, 200 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి కూడా తమ వద్ద ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.13.5 లక్షలు. ఆయన భార్య వద్ద 500 గ్రాముల బంగారం, 10 కేజీల వెండి ఉండగా, వాటి విలువ సుమారు రూ.35 లక్షలు. కంప్యూటర్, గృహోపకరణాలు వంటి ఇతర వస్తువులు కలిపి మరో రూ.6 లక్షల విలువైన ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: స్కూల్లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు! -
సీజేపీ నిరసనలకు మద్దతుగా అన్నా హజారే ‘మౌన ఆందోళన్’
ముంబై: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే గురువారం మహారాష్ట్రలోని అహిల్యానగర్లో 2 గంటల పాటు మౌన ఆందోళన్ చేపట్టారు. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.ఉదయం 11 గంటలకు అహిల్యానగర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరసన మొదలుపెట్టి, మధ్యాహ్నం ఒంటి గంటకు ముగించారు. ఆ తర్వాత అదే జిల్లాలోని తన గ్రామం రాలేగణ్ సిద్ధికి వెళ్లిపోయారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అన్నా హజారే లేఖ రాసిన విషయం తెలిసిందే. "హింస, పోలీసుల చర్యల వార్తలు తీవ్రంగా కలచివేస్తున్నాయి" అని అందులో పేర్కొన్నారు. నిరసనకారుల ఆగ్రహాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా, సమాజం అనుభవిస్తున్న వేదన, ఆశల ప్రతిబింబంగా చూడాలని లేఖలో తెలిపారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తే ప్రభుత్వం కూలిపోదని, దాంతో ప్రభుత్వ పని తీరు మరింత జవాబుదారీతనంతో, సమర్థంగా మారుతుందని ఆయన చెప్పారు. నిరసనకారుల మాటలను ఓర్పుగా వినాలని, నమ్మకం పెంచే వాతావరణం కల్పించాలని, సానుకూల చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.మౌన ఆందోళన్ తర్వాత విలేకరులతో మాట్లాడిన హజారే.. "ప్రజల సమస్యలు ప్రధానమంత్రికి తెలియాలి. అందుకే ఆయనకు లేఖ రాశాను" అని చెప్పారు.మరోవైపు, గురువారం జంతర్ మంతర్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. క్లిష్ట పరిస్థితుల కారణంగా సాయంత్రం 6.30 గంటలకల్లా కన్నాట్ ప్లేస్లోని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.నిరసన ప్రాంతం బయట పూర్తిగా ధ్వంసమైన కారును ఢిల్లీ పోలీసులు ఉంచారని సీజేపీ ఆరోపించింది. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ముందు అద్దం ఉన్న ఆ కారు దృశ్యాలు షేర్ చేస్తూ.. "ఈ కారును ఇక్కడికి ఈ స్థితిలో తీసుకొచ్చారు. తర్వాత శాంతియుత నిరసనకారులపై నెపం మోపకుండా ముందే నమోదు చేసుకోవాలి" అని పేర్కొంది. -
దద్దరిల్లిన జంతర్ మంతర్.. ఢిల్లీలో బొద్దింకల నిరసన
-
భారత్లో అంత బాగా నిరసనలు.. మనమేమో చేతగానోళ్లలా..
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనను గమనిస్తున్న పాకిస్థానీయుల్లో ఆసక్తితో పాటు అసూయ కనిపిస్తున్నాయి. "పాకిస్థాన్లో ఇలా నిరసనలు ఎందుకు జరగవు?" అని వాళ్లకు వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు.నీట్ ప్రశ్నపత్రం లీకులపై జరుగుతున్న నిరసనలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. యువత ముందుండి నడిపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఈ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దు అవతల పాకిస్థానీయులు ఆశ్చర్యంతో వీటిని గమనిస్తున్నారు. పాటలు, నినాదాలు, ఉద్యమ లక్ష్యం అన్నింటినీ విశ్లేషిస్తున్నారు.క్రికెట్ కోసమైతే వస్తారు.. పాకిస్థాన్ యువత ఎందుకు వీధుల్లోకి రావడం లేదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు ఆ దేశీయులు. ఇస్లామాబాద్లోని డీ-చౌక్ వద్ద లైవ్ క్రికెట్ మ్యాచ్లు చూసే జనం.. అక్కడ ఇతర కారణాలపై (సమస్యలపై) మాత్రం ఎందుకు గుమిగూడడం లేదని ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సమాధానం ఏంటంటే "పాకిస్థాన్లో అసలు ప్రజాస్వామ్యమే లేదు" అని కంటెంట్ క్రియేటర్ మహ్మద్ వలీద్ చెప్పిన మాటతో చాలామంది ఏకీభవిస్తున్నారు.‘‘డాన్’’ పత్రిక మాజీ సంపాదకుడు సిరిల్ అల్మీడా జంతర్ మంతర్ నిరసనలను "రావల్పిండీకి హెచ్చరిక"గా అభివర్ణించారు. రావల్పిండి నగరంలోనే పాకిస్థాన్ సైన్య ప్రధాన కార్యాలయం ఉంది. తమ దేశంలో ఇలాంటి విప్లవం రావడం లేదని నిరాశ చెందుతున్నారు.పోలీసుల దౌర్జన్యానికి వస్తే రెండు దేశాల్లోనూ పరిస్థితి ఒకేలా ఉంటుందని అంటున్నారు. వలీద్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోలో భారత యువత నుంచి పాకిస్థాన్ యువత నేర్చుకోవాల్సిన విషయాలను వివరించారు. నిరసన చేయాలంటే పెద్ద స్థాయిలో చేయాలని ఆయన అన్నారు. "పాకిస్థానీయులు తమ సంకల్పాన్ని ఎప్పుడూ చూపలేరు. 'నాకు ఏమాత్రం పట్టదు' అనే ధోరణితో ఉంటారు. డిగ్రీ తీసుకుని దేశం వదిలి వెళ్లడంపైనే మాట్లాడుతుంటారు. ఇది ఓడిపోయిన వారి ప్రవర్తన" అని చెప్పారు.బంగ్లా, భారత్లోనే నిరసనలు మరో పాకిస్థాన్ కంటెంట్ సృష్టికర్త నోమీ సయ్యద్ మాట్లాడుతూ.. "ఈ ఉపఖండంలో బంగ్లాదేశీయులు మార్పు తీసుకురాగలుగుతున్నారు. భారతీయులు నిరసన చేయగలుగుతున్నారు. పాకిస్థాన్లో మాత్రం అలాంటి వారు లేరు. మా దేశంలో ఇలాంటి విప్లవం ఎప్పుడూ రాదు" అని ఆయన అన్నారు.మరో ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ మహ్వాష్ అజాజ్ మాట్లాడుతూ.. భారత్లోని నిరసనలకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని చెప్పారు. "వందే మాతరం పాడుతూ దేశ అభివృద్ధి కోసం నిరసన చేస్తారు. కానీ, పాకిస్థానీయులను మాత్రం ఇక్కడ వేర్పాటువాదులుగా ముద్ర వేస్తారు" అని అన్నారు.అయితే అందరూ ఇదే అభిప్రాయంతో లేరు. మానవ హక్కుల పాత్రికేయురాలు అలిఫియా సోహైల్ మాట్లాడుతూ.. "పాకిస్థాన్ నిరసనల గురించి మీరు మాట్లాడే తీరు, భారత మీడియా భారత్లోని నిరసనల గురించి మాట్లాడే తీరులానే ఉంది" అని అన్నారు."భారత కంటెంట్ సృష్టికర్తలు, ఇన్ఫ్లూయెన్సర్లు తమ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంటున్నారు. ఇక్కడ మాత్రం అణచివేతకు పాల్పడేవారి గొంతుకగా మారేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. వెన్నెముక లేని వర్గం" అని అబ్దుల్లా అనే ఎక్స్ యూజర్ పేర్కొన్నారు. -
యూనిఫాంలో ఉన్నంత మాత్రాన..!
ఢిల్లీ: సీజేపీ నిరసనల్లో 118 మంది పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సంచలన ట్వీట్ చేశారు. తమ సిబ్బందిపై జరిగిన దాడులను ఖండిస్తూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు కూడా తమ బాధ్యతలను నెరవేర్చే క్రమంలో బాధను అనుభవిస్తారని చెబుతూ.. పోలీసు వ్యవస్థలోని మానవీయ కోణాన్ని ఎక్స్ వేదికగా ఢిల్లీ పోలీసులు ఎత్తిచూపారు.‘‘యూనిఫాం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తికి నొప్పి తక్కువగా అనిపించదు. ప్రతి బ్యాడ్జ్ వెనుక స్పందించే గుండె.. ఒక కుటుంబం, సేవ చేస్తామనే హామీ ఉంటాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి జరగడం తీవ్రంగా కలిచివేస్తోంది. అభిప్రాయ భేదాలుంటే గళం వినిపించొచ్చు కానీ.. హింసకు మాత్రం చోటు ఉండకూడదన్న ఢిల్లీ పోలీసుల పోస్ట్.. వైరల్గా మారింది.సీజేపీ ఉద్యమం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్మంతర్కు తరలివస్తున్నారు. బుధవారం సాయంత్రం అక్కడ ఉన్న పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జై ప్రకాశ్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘర్షణల అనంతరం ఢిల్లీ పోలీసులకు, సీజేపీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది.హింసను రెచ్చగొట్టారని ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. నిరసనకారులు రాళ్ళు రువ్వడం, పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతో సీనియర్ అధికారులతో సహా 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఏసీపీ (పంజాబీ బాగ్) జై ప్రకాష్, ఏసీపీ (కన్నాట్ ప్లేస్) వివేక్ భగత్, ఇన్స్పెక్టర్ నంద్ కిషోర్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు. -
ఇతను ఎవరు? సీజేపీ ర్యాలీలో ఇంతగా వైరల్ అయ్యాడేంటి?
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలకు చెందిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో వార్తల్లో నిలిచిన వారిలో ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ నకుల్ ధుల్ ఒకరు. నిరసన స్థలం నుంచి ఆయన విడుదల చేసిన భావోద్వేగ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో 'చలో సంసద్' ర్యాలీ సమయంలో పోలీసుల చర్యలో తనతో పాటు తన స్నేహితులపై దాడి జరిగిందని నకుల్ ఆరోపించారు.నకుల్ ధుల్ ఎవరు?నకుల్ ధుల్ ఢిల్లీకి చెందిన డిజిటల్ క్రియేటర్. సామాజిక అంశాలు, విద్య, యువత సమస్యలు, సమకాలీన పరిణామాలపై వీడియోలు రూపొందిస్తుంటారు. ప్రజా విధానాలు, విద్యా అంశాలు, పౌర సమస్యలపై అభిప్రాయాలు, లైవ్ రిపోర్టింగ్, వ్యక్తిగత అనుభవాలు పంచుకుంటూ మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన వీడియోలు ఎక్కువగా ప్రజా విధానాలు, విద్య, పౌర అంశాలపై ఉంటాయి. సామాజిక, రాజకీయ పరిణామాలను దగ్గరగా గమనించే ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు.ఎందుకు ట్రెండింగ్లో ఉన్నారు?ఇటీవల ఢిల్లీలో జరిగిన 'చలో సంసద్' నిరసన నుంచి నకుల్ ఒక వీడియో షేర్ చేయడంతో ఆయన ట్రెండింగ్లోకి వచ్చారు. ఆ వీడియోలో.. పార్లమెంట్ వైపు సాగిన నిరసనలో పోలీసులు తీసుకుంటున్న చర్యలో భాగంగా తనతో పాటు తన స్నేహితులను కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది. చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నకుల్ చేసిన ఆరోపణలకు స్వతంత్రంగా ధ్రువీకరణ జరగలేదు. ఆయన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, నిరసనకారులు హెచ్చరికలను పట్టించుకోకుండా నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని, దూకుడుగా వ్యవహరించారని, అందువల్ల వారిని చెదరగొట్టే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.నటి అయేషా ఖాన్కు ఏమైంది?నిరసనలో పాల్గొనకముందే, నినాదాలు చేయకముందే నటి, మోడల్, కంటెంట్ క్రియేటర్ అయేషా ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను సాయంత్రం 4 గంటలకు తన స్నేహితులతో కలిసి నిరసన స్థలానికి చేరుకున్నానని ఆ నటి తెలిపారు. తాను మాట్లాడకముందే, నిరసనలో పాల్గొనకముందే, ఆ ప్రాంతంలో నిరసన చేయడానికి అనుమతి లేదని ఓ పోలీసు అధికారి చెప్పారని ఆమె ఆరోపించారు."బతా దిజియే దూస్రా ఔర్ క్యా రాస్తా హైం? (దయచేసి మరో మార్గం ఏమిటో చెప్పండి?)" అని ప్రశ్నించానని అయేషా తెలిపారు. సమాధానం చెప్పే బదులు పోలీసులు తనను, తన స్నేహితులను పోలీసు వాహనంలోకి ఎక్కాలని కోరారని ఆమె ఆరోపించారు.కాగా, విద్యా రంగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, జవాబుదారీతనం, విద్యా సంస్కరణల డిమాండ్లతో ఈ నిరసనలు మొదలయ్యాయి.ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకత్వం వహిస్తోంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ వైపు ర్యాలీ జరిగిన సమయంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి దూకుడుగా వ్యవహరించారని ఢిల్లీ పోలీసులు చెబుతుండగా, లాఠీచార్జి, టియర్ గ్యాస్ వాడారని నిరసనకారులు ఆరోపించారు.గత కొన్ని రోజులుగా షబానా ఆజ్మీ, వేదాంగ్ రైనా, అనుపమ్ ఖేర్, ప్రకాశ్ రాజ్ సహా పలువురు ప్రముఖులు విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. మంగళవారం నిరసనకారులు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను కలిసినా ఉద్యమం కొనసాగుతోంది. -
ఢిల్లీలో ఉద్రిక్తతలు.. TCS లొకేషన్ చేంజ్!
జాతీయ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు, సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అప్రమత్తమైంది. ఢిల్లీ క్యాంపస్లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రత, ఆటంకం లేని కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని వారిని నోయిడా లేదా గురుగ్రామ్లోని సమీప కార్యాలయాల నుంచి పనిచేయాలని సూచించింది.సురక్షిత ప్రయాణం కోసం ముందస్తు అడ్వైజరీఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసరాల్లో కొనసాగుతున్న నిరసనలు, పార్లమెంట్ వైపు చేపట్టిన 'సంసద్ చలో' మార్చ్ కారణంగా ఢిల్లీ పరిధిలో రాకపోకలు ప్రభావితమయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, మండి హౌస్, ఐటీఓ సహా కీలకమైన 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది.దీనికి తోడు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించడంతో రోడ్డు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు ఆఫీసులకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో టీసీఎస్ హెచ్ఆర్ విభాగం ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది.ఈ పరిస్థితికి కారణం..జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన పరీక్షల నిర్వహణ వివాదాలు, నీట్ అక్రమాలపై జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో విద్యార్థులు, యువజన సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పార్లమెంట్ ముట్టడి పిలుపుతో పోలీసు బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, లాఠీచార్జీలు జరగడంతో రాజధానిలోని వ్యాపార, ఐటీ రంగాలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి.ఇదీ చదవండి: మామిడి రసంలో పల్ప్ ఉంటేనే ట్యాక్స్ బెనిఫిట్ -
సీజేపీ నిరసనలపై ఉక్కుపాదం.. కేంద్రం సంచలన నిర్ణయం
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై ఉక్కుపాదం మోపడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ జాతీయ భద్రతా చట్టం అమలు చేయనుంది. నిరసనకారులను ఏడాది పాటు నిర్బంధించేందుకు పోలీసులకు అధికారం ఇచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా ఎటువంటి విచారణ లేకుండా ఏడాదిపాటు నిర్బంధించే అవకాశం ఉంది. మూడు నెలల వరకు ఢిల్లీలో చట్టాన్ని అమలు చేస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.. పోలీసు కమిషనర్కు విశేష అధికారం కల్పించారు. ఢిల్లీలో కాకరోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు భారీ అదనపు అధికారాలు ఇచ్చింది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) కింద నిర్భందించే అధికారం ఉంది. అసాధారణ ఢిల్లీ గెజిట్ నోటిఫికేషన్ను హోం శాఖ విడుదల చేసింది. ఈ ప్రత్యేక అధికారాలను పరిమిత కాలం (మూడు నెలలు) వరకు వినియోగించే అధికారం ఉంది.అయితే, జాతీయ భద్రత చట్టంపై ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ భద్రత చట్టం మూడు నెలలకొకసారి రొటీన్గా రెన్యువల్ అవుతుందని.. సీజేపీ ఉద్యమాలకు ముందే ఈ ఆదేశం జారీ అయిందని పేర్కొన్నారు. ఇటీవల ఘటనలతో సంబంధం లేదని.. సాధారణ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు మాత్రమేనని స్పష్టం చేశారు. దీనిపై పై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వెళుతోందన్న ఢిల్లీ పోలీసులు.. సీజేపీ ఉద్యమాలను అణచివేయడానికి అధికారాలు ఇచ్చారన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఇది రొటీన్ త్రైమాసిక ఎన్ఎస్ఏ పునరుద్ధరణ మాత్రమేనని వెల్లడించారు.కాగా, జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీజేపీ నిరసనలకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. పార్లమెంట్ పరిసరాల్లో ఉద్యమకారులపై పోలీసులు జులుం తర్వాత విద్యార్థుల ఉద్యమం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్మంతర్కు తరలివస్తున్నారు. -
కాక్రోచ్ నిరసనపై PM మోదీ రియాక్షన్
-
పేపర్ లీకులకు చెక్! కేంద్రం సంచలన నిర్ణయం
పేపర్ లీకేజీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పవిత్రతను కాపాడేందుకు.. అక్రమాలకు పాల్పడే వారికి త్వరగతిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే తమకు ఏదీ ముఖ్యమైనది కాదని స్పష్టం చేశారు.ఈ మేరకు గురువారం ఉదయం ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులపై కఠిన, వేగవంతమైన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, విభాగాలకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.“యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదు. పేపర్ లీకులకు పాల్పడి యువత భవిష్యత్తును దెబ్బతీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.Nothing is more important than the welfare and future of our youth!We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this…— Narendra Modi (@narendramodi) July 23, 2026విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలుపరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోందని ప్రధాని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పేపర్ లీకులు, పరీక్షల్లో అక్రమాలు లక్షలాది మంది విద్యార్థుల శ్రమను దెబ్బతీస్తాయని కేంద్రం భావిస్తోంది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది.నీట్ వివాదం వేళ ప్రధాని ప్రకటననీట్–యూజీ పరీక్షలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న సమయంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పరీక్షల నిర్వహణపై విశ్వసనీయతను పునరుద్ధరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న వేళ.. కేంద్రం వేగవంతమైన న్యాయ ప్రక్రియపై దృష్టి సారించింది.ఇటీవల పేపర్ లీకేజీ కేసుల్లో పలువురిపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇకపై ఇలాంటి వ్యవహారాల్లో విచారణ, శిక్షల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక న్యాయ వ్యవస్థను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.“యువత భవిష్యత్తుతో ఆటలాడితే క్షమించం”పేపర్ లీకుల వ్యవహారాన్ని మహా పాపంగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నాలను సహించబోమని ఇదివరకే స్పష్టం చేశారు. పరీక్షల వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వం నిరంతరం చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు. అయితే పేపర్ లీకేజీ అంశంపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం.. నీట్ నిరసనకారులను శాంతింపజేస్తుందా? అనేది చూడాలి. -
బీజేపీపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉత్కంఠగా మారాయి. గత రాత్రి జరిగిన ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ నిరసనలను ఉద్దేశపూర్వకంగా హింసాత్మకంగా మార్చేందుకు బీజేపీకి చెందిన వ్యక్తులు చొరబడ్డారని ఆయన ఆరోపించారు.తాజాగా అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘కొందరు బయటి వ్యక్తులు మా నిరసనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి చెందిన వ్యక్తులు మా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారి వల్లే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సీజేపీకి చెడ్డపేరు తీసుకురావడమే వారి లక్ష్యం. కొందరు సివిల్ డ్రెస్సుల్లో వచ్చి విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. జంతర్ మంతర్ ఎప్పుడూ ప్రజాస్వామ్య నిరసనలకు అందుబాటులో ఉండే ప్రదేశమే’ అని వ్యాఖ్యానించారు.#WATCH | Delhi: Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "I have already spoken about the lathi charge. It was very brutal, and we will take the police officers who carried it out to court, and today is the 34th day of our protest. Sonam Sir's hunger… pic.twitter.com/LuZgdavsIr— ANI (@ANI) July 23, 2026అలాగే, నిరసనల సందర్భంగా పోలీసులు చేపట్టిన లాఠీచార్జ్పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లాఠీచార్జ్ అత్యంత దారుణంగా జరిగింది. ఈ చర్యకు బాధ్యులైన పోలీసు అధికారులపై కోర్టును ఆశ్రయిస్తాం. మా ఉద్యమానికి ఇవాళ 34వ రోజు. మా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు.లడఖ్కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కొనసాగిస్తున్న నిరాహార దీక్షపై కూడా దీప్కే స్పందించారు. ‘వాంగ్చుక్ సర్ నిరాహార దీక్షకు ఇవాళ 26వ రోజు. ఆయన ఆరోగ్యం మాకు ఆందోళన కలిగిస్తోంది. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లకూడదని భావిస్తున్నాం. అందుకే దీక్ష విరమించాలని కోరుతున్నాం. అయినప్పటికీ మా డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు.Jantar Mantar: men in civvies walking the street with sticks. Students ask who they are. No answer. Riot police standing nearby.Police? Another agency? Someone private? That’s not a detail you shrug off. This needs a real investigation, not silence. pic.twitter.com/GX8vEnehdt— Dilip Ray 🇮🇳 (@dilipray) July 21, 2026 Sarthak Goswami covering a protest near New Delhi Railway Station. Video shows Delhi Police pushing and handling him in the crowd — arm yanked, phones out, total chaos. pic.twitter.com/Bw3feKQwij— Dilip Ray 🇮🇳 (@dilipray) July 22, 2026 -
'ఆహా'ర హైదరాబాదీ జంతర్ మంతర్!
సాక్షి, హైదరాబాద్: నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నిరసనకు దిగిన ఆందోళనకారులకు హైదరాబాదీలు ఫుడ్ సపోర్ట్ అందిస్తున్నారు. తమ దాతృత్వంతో సంఘీభావం చాటుతున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్కతా తదితర నగరాల యువత బాటలోనే హైదరాబాదీలు కూడా ఇక్కడినుంచే స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీప రెస్టారెంట్లకు ఆర్డర్లు ఇస్తున్నారు.ఆ పదార్థాలు అక్కడి నిరసనకారులకు అందేలా చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక స్క్రీన్ షాట్లలో ‘ప్లీజ్ డి్రస్టిబ్యూట్ దిస్ ఫుడ్ టు ఎనీ వన్ హంగ్రీ ఎట్ జంతర్ మంతర్’ వంటి సందేశంతో ఆర్డర్లు ఇవ్వడం కనిపిస్తోంది. ఇలాంటివారిలో ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన వినియోగదారులు ఉన్నట్లు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఆన్లైన్ సేవలను వేగంగా స్వీకరించే నగరంగా పేరొందిన హైదరాబాద్ నుంచి కూడా ఈ తరహా సంఘీభావం వ్యక్తమవడం చర్చనీయాంశమైంది. మున్ముందు నగరంలోనూ...! ‘‘డిజిటల్ యుగంలో నిరసనలకు మద్దతు తెలిపే విధానం కూడా మారిపోతోంది. ఒక ఉద్యమానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి కేవలం మొబైల్ ఫోన్తో కొన్ని నిమిషాల్లో భోజనం పంపగలగడం సాంకేతికత తీసుకొచి్చన సామాజిక అనుసంధానత’’ అని సామాజిక విశ్లేషకులు అభివరి్ణస్తున్నారు. డబ్బు విరాళం ఇవ్వకుండా, నేరుగా అవసరమైన సమయంలో ఆహారం అందించడం అంటే నిరసనకారులకు ప్రత్యక్ష సహకారం అందజేసినట్లేనని పేర్కొంటున్నారు. మున్ముందు... మన నగరంలో ఏదైనా భారీ ఆందోళన కొన్ని రోజుల పాటు సాగితే ఇదే విధానం (ఆన్లైన్లో ఆందోళనకారులకు ఫుడ్ డెలివరీ ఆర్డర్) అవలంబించే అవకాశం లేకపోలేదని వివరిస్తున్నారు. -
గాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న సీజేపీ. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు నిరసనలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజా పరిణామాలు ఇవే..Live Updates08: 14 PMగాంధీ స్మృతివనం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శనఇండి కూటమి ఎంపీల కొవ్వొత్తుల ప్రదర్శనగాంధీ స్మృతి కేంద్రం వద్ద నివాళులర్పిస్తున్న ఇండి కూటమి నేతలుమొదట ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భావించిన నేతలుప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ స్మృతి కేంద్రానికి వచ్చిన నేతలునీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇండికూటమి నేతల నివాళి 07: 30 PMవిద్యార్థులకు అండగా ప్రతిపక్ష ఎంపీలంతా రోడ్డెక్కాలని భావించాం: రాహుల్ఇండియాగేట్కు వెళ్దామంటే అనుమతి ఇవ్వలేదువిద్యార్థులంతా రోడ్డుపై ఉన్నారురాజ్ఘాట్కు వెళ్దామని అనుకుంటున్నాంమా బస్సును పోలీసులు అడ్డుకున్నారుబస్సును వదిలి డ్రైవర్ వెళ్లిపోయాడు07:18 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల ర్యాలీరాజ్ఘాట్కు ర్యాలీగా వెళ్తున్న రాహుల్, ఇండి కూటమి నేతలురాజ్ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్న ఇండి కూటమి నేతలువిద్యార్థులు ఒంటరి వారు కాదు.. బాసటగా నిలుస్తాం: రాహుల్07:08 PMఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసనలురాహుల్ నివాసంలో ముగిసిన ఇండి కూటమి ఎంపీల భేటీరాజ్ ఘాట్ బయల్దేరిన రాహుల్, ఇండి కూటమి నేతలువిద్యార్థులకు అండగా ఉంటాం: రాహుల్06:13 PMరాహుల్ గాంధీ నివాసంలో విపక్షాల కీలక భేటీవిద్యార్థుల ఆందోళనలు, తాజా పరిణామాలపై చర్చసమావేశం అనంతరం రాజ్ఘాట్కు వెళ్లే యోచనరాహుల్ గాంధీ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు04:50PMరేపు దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపుశాంతియుతంగా నిరసనలు చేపట్టాలన్న సీజేపీ 03:21 PMనీట్ పేపర్ లీక్ కేసుపై కేంద్రం కీలక నిర్ణయంనాలుగు రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుబాంబే హైకోర్టులోని రెండు బెంచ్ల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులుపేపర్ లీక్ చట్టం కింద ప్రతిరోజూ విచారణ03:13 PMసీజేపీని మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంఅన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమన్న కేంద్రం..జంతర్మంతర్లోనే చర్చలు జరగాలని పట్టుబడుతున్న సీజేపీ02:03 PM | కేంద్రం సంచలన నిర్ణయంఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం అమలునిరసనకారుల్ని మూడు నెలల బంధించే అధికారంసీజేపీ నిరసనల నేపథ్యంలో పోలీస్ కమిషనర్కు విశేష అధికారాలిచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధుసీజేపీ ఆందోళనలతో ఢిల్లీ పోలీసులకు అదనపు అధికారాలునేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిర్బంధించే అవకాశంగెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ1:58 PM | నిరసనకారుల్ని బెదిరించిన పోలీస్పై చర్యలుముంబైలో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసు డ్రైవర్ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు.‘‘డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’’ అంటూ విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్.వీడియోపై స్పందించిన ముంబై పోలీస్ శాఖ.. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.నిరసనకారులపై తప్పుడు కేసులు పెట్టడం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.01:18 PM | సీజేపీకి అనూహ్యంగా పెరుగుతున్న మద్దతుజంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుఅంతకంతకు పెరుగుతున్న మద్దతు కమల్ హాసన్, నసీరుద్దీన్ షా లాంటి దిగ్గజ నటుల మద్దతుమొదటి విద్యార్థి మరణం దగ్గరే ప్రభుత్వం స్పందించి ఉండాల్సిందేన్న కమల్బాలీవుడ్ మద్దతు ప్రకటించకపోవడం సిగ్గుచేటన్న షాఆందోళనలకు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్న బాలీవుడ్ తారలుఇటు సౌత్లోనూ పలువురి సపోర్ట్12:21 PM | మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు దృష్టిసీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో మూసివేసిన మెట్రో స్టేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది.సెంట్రల్ ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లు మూసివేయడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు.సుప్రీంకోర్టు సమీప మెట్రో స్టేషన్ మూసివేత వల్ల కేసులకు హాజరయ్యే వారికి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.ఎంట్రీ పాస్లు ఉన్న న్యాయవాదులు, రిజిస్ట్రీ సిబ్బందిని భద్రతా తనిఖీల తర్వాత అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే మధ్యాహ్నం తర్వాత తాను జోక్యం చేసుకుంటానని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.ఇప్పటికే మెట్రో అధికారులతో మాట్లాడాలని సుప్రీంకోర్టు పరిపాలన విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 11:33 AM | ముంబైలో పోలీస్ వాహనం నుంచి నిరసనకారుల పరార్చెంబూర్లో జరిగిన CJP నిరసనల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.అదుపులోకి తీసుకున్న విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వ్యాన్ తలుపును ఓ వ్యక్తి తెరిచినట్లు వైరల్ వీడియోలో కనిపించింది.దీంతో పలువురు విద్యార్థులు వాహనం నుంచి బయటకు వచ్చి పరారైనట్లు సమాచారం.నిషేధాజ్ఞలు ఉల్లంఘించి నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు.దాదాపు 700–800 మంది ఆందోళనలో పాల్గొన్నట్లు వెల్లడించారు.సుమారు 200 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.11:31 AM | రాళ్ల దాడిలో ఢిల్లీ ఏసీపీకి గాయాలుజంతర్ మంతర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రాళ్ల దాడిలో ఢిల్లీ పోలీస్ ఏసీపీ వివేక్ భగత్ గాయపడ్డారు.తలకు గాయం కావడంతో పాటు చేతులు, కాళ్లు, భుజంపై గాయాలైనట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి అధికారులు తెలిపారు.చెవి నుంచి రక్తస్రావం, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.11:14 AM | ప్రధాని మోదీ ట్వీట్పై CJP చీఫ్ సెటైర్పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మరోసారి డిమాండ్ చేశారు.ప్రధాని ట్వీట్లోని “యువత భవిష్యత్తు, సంక్షేమమే ముఖ్యం” అన్న వ్యాఖ్యలపై సెటైరికల్గా పోస్టు చేశారు.‘‘Hi, my name is Nothing’’ అంటూ గ్రాఫిక్ను షేర్ చేశారు. https://t.co/mo44rK6tNc pic.twitter.com/kEeHWUMouF— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026 11:08 AM | బిహార్ అసెంబ్లీలో నీట్ నిరసనల సెగవిద్యార్థులపై లాఠీచార్జ్ అంశం బిహార్ అసెంబ్లీని కుదిపేసింది.విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యను ప్రశ్నించారు.మరోవైపు తమ వాహనంపై దాడి చేసిన వారిని అధికార కూటమి ఎమ్మెల్యేలు ‘గూండాలు’గా అభివర్ణించారు.అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతపార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు యువత ప్రయత్నంఅడ్డుకున్న పోలీసులు.. భారీగా మోహరింపుయువతను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటుఇవాళ పార్లమెంట్ సమావేశాలు నాలుగో రోజు భేటీఉభయ సభల్లోనూ విపక్షాల నిరసనలతో కొనసాగుతున్న వాయిదాల పర్వంశాంతియుతంగానే నిరసనలు కొనసాగుతాయన్న సీజేపీచలో సంసద్ మళ్లీ ఉండబోదన్న సీజేపీజంతర్ మంతర్ వద్దే దీక్ష చేస్తున్న మద్దతుదారులునిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని సీజేపీ ఆరోపణఅప్రమత్తంగా ఉండాలని వలంటీర్లకు ప్రతినిధుల పిలుపు11:04 AM | అభిజిత్ దీప్కేకు అస్వస్థతCJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు అస్వస్థతనిరసనలకు దూరంగా ఇవాళ రెస్ట్ తీసుకోనున్న దీప్కే గత కొన్ని రోజులుగా జ్వరం, తీవ్ర ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు సీజేపీ వెల్లడి.నొప్పి నివారణ మందులతో ఇప్పటివరకు కొనసాగానని.. విశ్రాంతి కోసం కొంత సమయం పాటు నిరసన స్థలం నుంచి దూరంగా ఉంటాడని వెల్లడితిరిగి సాయంత్రానికి తిరిగి జంతర్ మంతర్కు వచ్చే చాన్స్.10:50 AM | పోలీసుల చర్యలపై ప్రియాంక గాంధీ ప్రశ్నలునిరసనకారులపై లాఠీఛార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిజంగా శ్రద్ధ చూపిస్తే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు.విద్యార్థులతో నేరుగా చర్చలు జరిపి వారి సమస్యలు వినాలని కేంద్రాన్ని కోరారు.10:46 AM | ‘విద్యార్థుల మాట వినండి’నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో విద్యార్థులు వ్యవస్థపై నమ్మకం కోల్పోయారని ప్రియాంక గాంధీ అన్నారు.సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వినాలని సూచించారు.10:43 AM | జంతర్ మంతర్కు అలఖ్ పాండేఫిజిక్స్ వాలా సీఈవో అలఖ్ పాండే జంతర్ మంతర్ వద్ద CJP నిరసనల్లో పాల్గొన్నారు.ఆందోళనకారులను ‘పాక్ ఫండెడ్’, ‘చైనా మద్దతుదారులు’గా చిత్రీకరించడాన్ని తప్పుబట్టారు.పోలీసుల చర్యల్లో గాయపడిన విద్యార్థుల అంశాన్ని ప్రస్తావించారు.10:34 AM | చండీగఢ్కు విస్తరించిన నిరసనలుధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో చండీగఢ్లోనూ నిరసనలు జరిగాయని CJP తెలిపింది.దేశవ్యాప్తంగా ఆందోళనలు విస్తరిస్తున్నాయని పేర్కొంది.10:31 AM | చర్చలు ఉంటాయా? ఉండవా?!మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్న విపక్షాలు, నిరసనకారులురాజీనామా తర్వాతే పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగాలంటున్న ప్రతిపక్షాలుఅప్పటిదాకా సమావేశాలను ముందుకు వెళ్లనివ్వబోమని స్పష్టీకరణఇటు.. జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలుమంత్రి రాజీనామా చేస్తేనే ఆందోళనలు విరమిస్తామని స్పష్టీకరణఇదివరకే మంత్రి జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులురాజీనామా సహా మూడు డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తిడిమాండ్లపై ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయని కేంద్రంచర్చలు ఉంటాయంటూనే.. ముందుకు అడుగు వేయని వైనంచర్చలకు కేంద్రమే దిగి రావాలని.. తాము వెళ్లబోమని సీజేపీ కుండబద్ధలులీక్కు కారకులైన వాళ్లను వదలమని.. కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటనమంత్రి రాజీనామాపై మాత్రం మౌనం!ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ముడిపడి ఉన్న నీట్ నిరసనల వ్యవహారంకేంద్రం నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠచర్చలు ఉంటాయా? ఉండవా? అనే సందిగ్ధం10:00 AM | నిరసనల్లోకి చొరబడ్డ అసాంఘిక శక్తులు!కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ఆరోపణలు సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. నిరసనల్లోకి కొందరు అసాంఘిక శక్తులు చొరబడ్డారని తెలిపారు. వారిని నియంత్రించేందుకు వాలంటీర్ల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. రాత్రి సమయంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని, టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు.09:49 AM | ‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’పేపర్ లీక్లపై ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. యువత భవిష్యత్తుకు అత్యధిక నష్టం చేసింది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు.09:49 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: CJP పేపర్ లీక్ కేసుల్లో ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై స్పందించిన CJP.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ను మరోసారి తెరపైకి తెచ్చింది.09:42 AM | పోలీస్పై దాడి వీడియో వైరల్జూలై 20న జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో కొందరు ఆందోళనకారులు ఢిల్లీ పోలీస్ సిబ్బందిని వెంబడించి దాడి చేసినట్లు కనిపిస్తోంది.09:28 AM | ముంబైలోనూ CJP నిరసనలు.. 1,500 మందికి పైగా పాల్గొనడంNEET పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబై శివాజీ పార్క్లో భారీ నిరసన చేపట్టారు. ఇందులో నటులు, కమెడియన్లు కూడా పాల్గొన్నారు.09:17 AM | NEET పేపర్ లీక్పై ఫాస్ట్ట్రాక్ కోర్టులు: ప్రధాని మోదీ ప్రకటనపరీక్షల పేపర్ లీక్లకు పాల్పడిన వారిపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.09:05 AM | ముంబైలో నిరసనలు.. 200 మంది అదుపులోకిఅనుమతి లేకుండా నిరసన చేపట్టారని పోలీసులు తెలిపారు. శివాజీ పార్క్లో జరిగిన ఆందోళనలో సుమారు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.08:59 AM | నిరసనల్లో గాయపడిన పోలీస్ అధికారి ఫొటో వైరల్CJP ఆందోళనల్లో ఇన్స్పెక్టర్ నందకిశోర్పై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఫొటో బయటకు వచ్చింది.08:21 AM | కేంద్రంపై ఆప్ నేత అతిషి విమర్శలుఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేతపై ఆప్ నేత అతిషి స్పందించారు. సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కానీ విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు.08:21 AM | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుంది: CJP చీఫ్CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని కోరారు.08:21 AM | గాయపడిన పోలీసులను పరామర్శించిన సీనియర్ అధికారిఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ దేవేశ్ చంద్ర శ్రీవాస్తవ ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన పోలీసులను పరామర్శించారు.07:55 AM | పోలీస్ అధికారి చర్యలపై CJP స్పందననిరసనకారిణిని కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ADCPను విధుల నుంచి తప్పించడంపై CJP స్పందించింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.🔴 08:21 AM | ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేతCJP నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు. రాజీవ్ చౌక్, మండీ హౌస్, ఐటీవో వంటి కీలక స్టేషన్ల వద్ద రాకపోకలను నిలిపివేశారు. జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి.🔴 08:13 AM | మంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం: CJPకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. నిరసన 34వ రోజుకు చేరిందని, సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష 26వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.🔴 07:55 AM | పోలీస్ అధికారిపై చర్యలకు CJP డిమాండ్జంతర్ మంతర్ వద్ద మహిళా నిరసనకారిపై పోలీస్ అధికారి చేయి చేసుకున్న వీడియో వైరల్ కావడంతో.. సదరు అధికారిని సస్పెండ్ చేసి, విచారణ జరపాలని CJP డిమాండ్ చేసింది.🔴 07:24 AM | భద్రత కట్టుదిట్టం.. మెట్రో సేవలపై ప్రభావంకేంద్ర ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు.🔴 07:13 AM | ఇంటర్నెట్ నిలిపివేతపై కాంగ్రెస్ ఆరోపణలుజంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. యువత నిరసన గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.🔴 05:01 AM | ముంబైలో 13 ఎఫ్ఐఆర్లు నమోదుCJPకి మద్దతుగా జరిగిన అనుమతి లేని నిరసనలపై ముంబై పోలీసులు చర్యలు చేపట్టారు. గత ఐదు రోజుల్లో 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. దాదాపు 400 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.🔴 03:46 AM | నాగ్పూర్లో నిరసనకారుల తరలింపునాగ్పూర్లోని సంవిధాన్ స్క్వేర్ వద్ద కొనసాగిన నిరసనను పోలీసులు రాత్రివేళ తొలగించారు. గడువు ముగిసినా ఆందోళన కొనసాగించడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్య సమయంలో కొందరు యువకులు జాతీయ గీతం ఆలపించారు.🔴 02:44 AM | మరో పోలీస్ చర్యపై CJP ఆరోపణలుజంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని CJP ఆరోపించింది. మరోసారి పోలీస్ చర్యకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? అంటూ ప్రశ్నించింది.🔴 02:04 AM | షరతులతో దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్చుక్నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇస్తే దీక్ష విరమించేందుకు సిద్ధమని సోనమ్ వాంగ్చుక్ తెలిపారు. విద్యార్థులు కూడా తాత్కాలికంగా ఆందోళన విరమించి చర్చలకు రావాలని కోరారు.🔴 01:45 AM | నిరసనలో నేరస్తుడి హల్చల్!జూలై 20న జంతర్ మంతర్ నిరసనలో చరిత్ర కలిగిన నేర చరిత్ర కలిగిన హాజీ అఫ్జల్ కనిపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.🔴 01:18 AM | బ్యారికేడ్లు దాటేందుకు మళ్లీ ప్రయత్నంజంతర్ మంతర్ వద్ద కొందరు నిరసనకారులు బ్యారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గతంలో రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే.🔴 11:16 PM | దేశవ్యాప్తంగా నిరసనలపై కేంద్రం సమీక్షCJP ఆందోళనలు పలు రాష్ట్రాలకు విస్తరించడంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. మహారాష్ట్రలో అత్యధికంగా నిరసనలు నమోదయ్యాయని, ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ, అసోం, హర్యానాల్లోనూ ఆందోళనలు జరిగాయని అధికారులు తెలిపారు.🔴 10:30 PM | ఢిల్లీలో రాళ్ల దాడి ఘటనకనాట్ ప్లేస్ సమీపంలోని టాల్స్టాయ్ మార్గ్ వద్ద పోలీసులు, RAF సిబ్బందిపై కొందరు రాళ్లు, బాటిళ్లు విసిరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ గాయపడినట్లు వెల్లడించారు. -
సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, పోలీసుల చర్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన ఆయన, విద్యార్థుల సమస్యలను చట్టం, వ్యవస్థ అంశంగా కాకుండా సామాజిక సమస్యగా చూడాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు.జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సీజేపీ నిర్వహించిన ‘చలో సంసద్’ ర్యాలీ.. పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకులు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి డిమాండ్లతో జరిగింది. అనంతరం ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ద్వారా నిరసనకారులను చెదరగొట్టారు.ఈ నేపథ్యంలో స్పందించిన అన్నా హజారే తన లేఖలో ప్రజాస్వామ్యంలో హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, అవసరం లేని బలప్రయోగానికి స్థానం లేదని పేర్కొన్నారు. పేపర్ లీకులు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, నిరుద్యోగం వంటి అంశాలపై యువత వ్యక్తం చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించాలని కోరారు. నీట్ (NEET) పరీక్ష వివాదాన్ని ప్రస్తావించిన హజారే, ప్రభుత్వ వ్యవస్థలో లోపాలు బయటపడినప్పుడు కేవలం కింది స్థాయి ఉద్యోగులపైనే బాధ్యత మోపడం సరికాదన్నారు. సంబంధిత శాఖకు రాజకీయ బాధ్యత వహించే మంత్రులు కూడా జవాబుదారీతనం చూపాలని సూచించారు. అవసరమైతే శాఖా వైఫల్యాలపై మంత్రిని తప్పించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినదని, బాధ్యతాయుత పాలనకు అది సంకేతంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.‘ప్రజాస్వామ్యంలో ఘర్షణ కంటే సంభాషణే ఉత్తమ మార్గం. ప్రజల గొంతును ప్రతిపక్ష స్వరంగా మాత్రమే చూడకూడదు. విభేదాలు సహజం. వాటిని చర్చలు, పరస్పర గౌరవంతో పరిష్కరించాలి’ అని హజారే లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సీజేపీ ఆందోళనల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. మరోవైపు లడఖ్కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ నిరాహార దీక్ష విషయంలో కూడా ప్రభుత్వం చర్చలకు ముందుకు రావాలని అన్నా హజారే మరోసారి విజ్ఞప్తి చేశారు. -
భద్రత కట్టుదిట్టం.. మెట్రో బంద్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను గురువారం ఉదయం 7:30 గంటల నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, అదనపు భద్రతా చర్యలు చేపట్టారు.ఇక, మెట్రో మూసివేత నిర్ణయం కారణంగా ప్రతిరోజూ మెట్రో సేవలపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. బుధవారం కూడా 16 మెట్రో స్టేషన్లను మూసివేసిన విషయం తెలిసిందే.తాత్కాలికంగా మూసివేస్తున్న మెట్రో స్టేషన్లు: లోక్ కల్యాణ్ మార్గ్ రాజీవ్ చౌక్ పటేల్ చౌక్ రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్ బరఖంబా రోడ్ సుప్రీం కోర్ట్ సేవా తీర్థ్ జనపథ్ మండీ హౌస్ సెంట్రల్ సెక్రటేరియట్ ఐటీఓ ఢిల్లీ గేట్ ఇంద్రప్రస్థ ఖాన్ మార్కెట్ జోర్ బాగ్ శివాజీ స్టేడియం -
ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారా?: సూర్య భార్య పోస్ట్ వైరల్
ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమంపై టీమిండియా స్టార్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే, భారత టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.దేవిశా, సంజనా వైఖరి పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కాగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు మరింత ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేపట్టిన ‘చలో సంసద్’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సంజన ఇలా...ఈ నేపథ్యంలో సంజనా గణేషన్ స్పందిస్తూ.. ‘‘నిరసనకు దూరంగా ఉన్న ఆరేళ్ల పసి ప్రాణానికి టియర్ గ్యాస్ వల్ల ఇబ్బంది కలిగినప్పుడు.. ఎవరికైనా సరే ఇది ఇబ్బందిని కలిగిస్తుంది కదా!..చిన్నారులు టియర్ గ్యాస్ బారిన పడటాన్ని ప్రజాస్వామ్యంలో సాధారణ విషయంగా మార్చకండి. తమను రక్షించడం కోసమని రక్షణ పేరుతో భయపెట్టడాన్ని ఏ పౌరుడు కూడా కోరుకోడు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంజనకు పలువురు నెటిజన్లు మద్దతుగా నిలుస్తూ పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తున్నారు.పోరాటాలు చేయండి అంటూనే...ఇక దేవిశా శెట్టి మాత్రం మరింత తీవ్రంగా, కాస్త భిన్నంగా స్పందించింది. ‘‘ఇది స్పాన్సర్ చేసిందే అనుకోండి. రాజకీయ ఉద్దేశాలు ఉన్న పోస్టు అనుకోండి. మీరు దీనికి ఏ పేరు పెట్టినా నిజం మాత్రం మారదు. భారతీయ యువత అగ్నిపంథాను ఎంచుకుంది. సవాళ్లకు ఎదురు నిల్చుంది.పోలీసులు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిస్థితులను చక్కదిద్దాలి. ప్రభుత్వం కూడా వారి సమస్యకు గల కారణం ఏమిటో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వాన్ని విమర్శించండి. ప్రధానిని ప్రశ్నించండి.రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తండి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నడపండి. ఓటుతో సమాధానం చెప్పండి. దానినే ప్రజాస్వామ్యం అంటారు. పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వ ఆస్తులు కావు.ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారా?మీరు ధ్వంసం చేసిన ప్రతీ బస్సు, విరగొట్టిన ప్రతీ బారికేడ్, తగలబెట్టిన ప్రతీ వాహనం, మీరు నాశనం చేసిన రోడ్డు.. ఇలా ప్రతీదీ భారత పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన డబ్బు ద్వారా నిర్మితమైనవి. ఇందులో మీరు కూడా ఉంటారు.ఏదేమైనా హింస అనేది ఎప్పుడూ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మీరు రాళ్లు విసిరినపుడు, పోలీసులపై దాడి చేసినపుడు.. బారికేడ్లను తోసుకుని వెళ్తూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే దీనిని ఎవరూ నిరసన అనరు. మీరు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు’’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు దేవిశాను విమర్శిస్తున్నారు.ఆస్తుల కంటే ప్రాణాలు విలువైనవి కాదా?‘ఓవైపు విద్యార్థులు ప్రాణాలకు తెగించి న్యాయం కోసం పోరాడుతుంటే.. మీరేమో మీ భర్తను తిరిగి టీమిండియాలోకి చేర్చాలనే ఉద్దేశంతో రాజ్యానికి వంతపాడుతున్నారు. మీరన్నది నిజమే. ప్రభుత్వ ఆస్తుల్ని నష్టపరిచే హక్కు ఎవరికీ లేదు.మరి ఆస్తుల కంటే ప్రాణాలు మరింత విలువైనవి కదా! పేపర్ లీకేజీ వ్యవహారంతో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థులకు మద్దతుగా మీరు ఏనాడైనా రాజ్యాన్ని ప్రశ్నించారా? ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మన వరకూ వస్తేనే ఏదైనా అర్థమవుతుంది’ అని విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో దేవిశా సరిగ్గా చెప్పిందంటూ సమర్థిస్తున్నారు.చదవండి: వైఫల్యాలపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ -
అమిత్ షా నివాసంలో కీలక భేటీ
-
నిరసనకారులకు ఆహార మద్దతు..!
-
LIVE: రణరంగంగా ఢిల్లీ..! హై అలర్ట్


