breaking news
Delhi
-
పెళ్లైన 2 నెలలకే.. నవవధువు అనుమానాస్పద మృతి!
న్యూఢిల్లీ: కొత్త పెళ్లి ముచ్చట్లు తీరకముందే.. ఎనిమిదేళ్ల ప్రేమ బంధం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఆఫీసులో సహోద్యోగులతో కలిసి నవ్వుతూ పార్టీ చేసుకున్న కొన్ని గంటల్లోనే, ఆ నూతన వధువు రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఢిల్లీలో కలకలం రేపిన ఆకృతి సుతార్ అనుమానాస్పద మృతి వెనుక.. రూ. 20 లక్షల అదనపు కట్న వేధింపులు ఉన్నాయంటూ ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారుపెళ్లైన రెండు నెలలకే ఆకృతి సుతార్ (28) అనే వివాహిత ఢిల్లీలోని ఒక నివాస సముదాయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు.. ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ కట్నం కోసం చేసిన హత్యేనని తీవ్రంగా ఆరోపిస్తున్నారు.ఛతర్పూర్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఆకృతి, శనివారం ఉదయమే సెలవు ముగించుకుని తిరిగి విధుల్లో చేరింది. ఆఫీసులో తోటి ఉద్యోగులకు ఆమె ఒక చిన్న పార్టీ కూడా ఇచ్చింది. సాయంత్రం 6 గంటల సమయంలో తన తల్లితో ఫోన్లో మాట్లాడిన ఆకృతి.. ఆఫీస్ పార్టీ ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్నట్లు చెప్పింది.అయితే, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆకృతి భర్త అరస్తు సిక్కా ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఆకృతి కనిపించడం లేదని తెలిపాడు. ఆ తర్వాత సుమారు గంటన్నరకే, లోధి కాలనీలోని పాలికా కుంజ్ నివాస సముదాయంలో ఒక మహిళ మృతదేహం పడి ఉందని పోలీసులు సమాచారం ఇచ్చారు. బిల్డింగ్ పైనుంచి కింద పడటం వల్లే ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.ఎనిమిదేళ్ల ప్రేమ తర్వాత గత ఏప్రిల్ 24న ఆకృతి..నిరుద్యోగి అరస్తు సిక్కాను వివాహం చేసుకుంది. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామలు రూ.20 లక్షల అదనపు కట్నం కోసం ఆమెను తీవ్రంగా వేధించేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అరస్తు గతంలో పలుమార్లు ఆమెను చంపేస్తానని బెదిరించాడని, మరణానికి రెండు రోజుల ముందు కూడా వారి మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని ఆమె సోదరుడు అమయ్ సుతార్ తెలిపాడు. ఆకృతి మానసికంగా చాలా ధైర్యంగా ఉందని, ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కట్నం వేధింపులు, హత్య కోణాలతో పాటు అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
తొమ్మిదేళ్లకే ప్రపంచ గుర్తింపు..! ఏకంగా ఐక్యరాజ్యసమితి ..
తొమ్మిదేళ్ల పిల్ల తన పాఠశాల హోంవర్క్లు, ఆటలతో గడుపుతుంటారు. కానీ ఈ చిన్నారి అందరి పిల్లల్లా కాదు. వయసుకు మించిన పరిణితి, ఆలోచనలతో ఆకట్టుకుంటోంది. చిన్న వయసులోనే ఆవిష్కర్తగా కళాకారిణిగా, రచయిత్రిగా, ప్రపంచ పౌరురాలిగా అద్భుతమైన ప్రతిభ చాటుతోంది. ఆ చిన్నారి సక్సెస్ జర్నీ కేవలం తన ప్రతిభా సామర్థ్యాలనే కాదు, ఆ స్థాయిలో రాణిస్తున్న ఆమె విజయం వెనుక ఉన్న అద్భుతమైన పేరేంటింగ్ విధానం గురించి కూడా నొక్కి చెబుతోంది. ఇంతకీ ఎవరా ఆ చిచ్చరపిడుగు అంటే..ఆ చిన్నారే రితన్యా కౌశిక్. ఢిల్లీకి చెందిన ఆమె సాధించిన విజయాలు పెద్దవాళ్లకే చాలా ఏళ్లు పడతాయి. కానీ ఈ చిచ్చరపిడుగు అలవోకగా సాధించేసింది. చిన్న వయసులోనే రచయిత్రిగా మారి అమెజాన్లో లభించే 'మై విండో టు ది వరల్డ్' అనే పుస్తకం రాసేసింది. అలాగే పదేళ్లు నిండక మునుపే అంతర్జాతీయ ఆవిష్కరణల పోర్ట్ఫోలియోను నిర్మించింది. ఆమె తన మేథా సంపత్తితో బహుళ దేశాలలో గుర్తింపు తెచ్చుకుంది. ఏయే దేశాల్లో అంటే..యునైటెడ్ కింగ్డమ్లో డిజైన్ పేటెంట్జర్మనీలో యుటిలిటీ మోడల్కెనడాలో కాపీరైట్భారతదేశంలో దాఖలు చేసిన పేటెంట్అంతేగాదు ఇటీవలే, ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రత్యేక ఏజెన్సీ ద్వారా రితన్యాని ఆహ్వానిత వక్తగా, ప్యానలిస్ట్గా పరిగణించడం విశేషం. ఆమె ఆవిష్కరణలు అభివృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతికతో ముడిపడి ఉండటం విశేషం. సృజనాత్మకతలో కూడా తగ్గేదేలే అంటూ తన కళాకృతులతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. ఆ విషయంలో యునైటెడ్ కింగ్డమ్లోని 'స్కెచ్ ఫర్ సర్వైవల్'నుంచి సర్టిఫికేట్ అందుకుంది. అక్కడ ఆమె వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడానికి కళను ఉపయోగించింది. అలాగే స్విట్జర్లాండ్లోని 'ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ (IBBY)' కూడా తన కళాకృతులను ప్రదర్శించింది. అక్కడ ఆమె కళాకృతులు వివిధ భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలతో అనుసంధానం కాగల ముఖ్యమైన ఆలోచనలను తెలియజేశాయి. క్రియేటివిటీ పరంగా భారత్లో బ్రిటిష్ లైబ్రరీ నుంచి పొందిన సర్టిఫికేట్, అలాగే ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన అంతర్జాతీయ రచనా పోటీలలో ఒకటైన 'ది క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ 2025'లో పాల్గొనడం వంటివి ఉన్నాయి. దీంతోపాటు విద్యాపరంగా కూడా అత్యుత్తమమైన ప్రతిభ కనబరుస్తోందామె. అక్కడితో ఆమె విజయాలు ఆగలేదు. ఆమె స్పెల్లింగ్ బీ పోటీలో అంతర్జాతీయ అత్యుత్తమ సర్టిఫికేట్ను సంపాదించింది. అలాగే క్రీడాల్లో కూడా రాణిస్తోందామె. వీటి తోపాటు తైక్వాండోలో గ్రీన్ బెల్ట్ నుంచి యుద్ధకళల్లో సైతం జిల్లా స్థాయిలో ప్రతిభను కనబర్చడం వరకు అన్నింటిలో తన సత్తా చాటింది.ఆమె సక్సెస్ జర్నీ వెనుకున్న కుటుంబ మద్ధతు..రితన్యకు ఈ అసాధారణ ప్రతిభ ఆమె కుటుంబం నుంచ వచ్చింది. తల్లి స్మిత శర్మ కౌశిక్, ఢిల్లీ విశ్వవిద్యాలయం టాపర్. తండ్రి, డాక్టర్ భరత్ కౌశిక్, ఒక ఆవిష్కర్త, అలాగే యూఎస్ విద్యాసంస్థల పూర్వ విద్యార్థి. ఆమె అమ్మమ్మ మధు కౌశిక్, ఒక ప్రచురిత రచయిత్రి, కాగా ఆమె తాతయ్య ఇస్రోలో సైంటిస్టు, పైగా చంద్రయాన్ తోడ్పాటుకు తన వంతు సహాయ సహకారాలను అందించారు. కుంటుంబ సభ్యులంతా ఉన్నత విద్యావంతులు కావడం తోపాటు ఆ చిన్నారిని ఎలాంటి ఒత్తిడికి తావివ్వకుండా స్వేచ్చగా ప్రోత్సహించారు. అలాగే ఆమె ఆశక్తులను గమనిస్తూ ఆ దిశగా ప్రోత్సహించారు. ఆమె ఆలోచనలకు అనుగుణంగా సలహాలు, సూచనలందించి..ఆమెలోని అపార ప్రతిభను వెలికి తీశారు. ఇక్కడ రితన్య తల్లిదండ్రులు ఆమె ఆసక్తికి అనుగుణంగా ఉత్సాహం, పట్టుదల, ప్రోత్సాహాలను అందించారు. అందువల్ల రితాన్య అద్భుతమైన ప్రతిభ పాటవాలను కనబర్చింది. ఈ విధంగా మన పిల్లలను ప్రోత్సహిస్తే కచ్చితంగా ఏదో ఒక రంగంలో రాణిస్తారు. అలాగే వాళ్ల ఇష్టాలు ఆసక్తులపై ఒక విధమైన అవగాహన కూడా ఏర్పడటం తోపాటు వాళ్ల అభ్యున్నతికి మార్గం సులభవుతుందనే గొప్ప పేరెంటింగ్ పాఠాన్ని నేర్పిస్తోంది ఈ చిన్నారి సక్సెస్ కథ.(చదవండి: ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్ టిప్స్..! వైరల్గా ఓ తల్లి గైడెన్స్..) -
ఆ రెండు చైనా యాప్లపై కేంద్రం కొరడా : డ్రైవర్లకు ఊరట
చైనా మొబైల్ యాప్లపై ఢిల్లీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఢిల్లీలో ఈ-రిక్షాలను రిమోట్ ద్వారా ఆపేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న రెండు మొబైల్ యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిని గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశించింది. యాప్లోని 'డిశ్చార్జ్ స్విచ్' (Discharge Switch) పై ఒక్కసారి క్లిక్ చేయగానే, నడుస్తున్న వాహనం ఉన్నట్టుండి రోడ్డు మధ్యలోనే అకస్మాత్తుగా ఆగిపోతుండటంతో ఈ-రిక్షా డ్రైవర్లు తీవ్ర గందరగోళానికి, ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ యాప్లపై కఠిన చర్యలు తీసుకుంది.ఢిల్లీలో నడుస్తున్న ఈ-రిక్షాలను (స్థానికంగా 'తిర్రి' అని పిలుస్తారు) కొందరు వ్యక్తులు మొబైల్ యాప్ల ద్వారా రిమోట్గా ఆఫ్ చేస్తూ డ్రైవర్లను వేధిస్తున్నారు. ఈ దుర్మార్గానికి అడ్డుకట్ట వేస్తూ, కేంద్ర ప్రభుత్వం BAT BMS, Epoch Li-ion అనే రెండు మొబైల్ అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ (Android Play Store), ఆపిల్ యాప్ స్టోర్ (Apple App Store) ల నుండి తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: Citizenship16 పత్రాలిచ్చినా; సిటిజెన్షిప్పై గౌహతి కోర్టు సంచలన తీర్పుభారత ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) కార్యదర్శి ఎస్. కృష్ణన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. నిన్ననే ఈ యాప్ల వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, వెంటనే వాటిని యాప్ స్టోర్ల నుండి తొలగించామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి హానికరమైన యాప్లు అందుబాటులోకి రాకుండా యాప్ స్టోర్ల యాజమాన్యాలతో మాట్లాడతామని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీఅసలేంటీ యాప్స్ BAT BMS, Epoch Li-ion అనేవి నిజానికి లిథియం-అయాన్ (Lithium-ion) బ్యాటరీలను పర్యవేక్షించే బ్యాటరీ మేనేజ్మెంట్ యాప్లు. ఇవి బ్లూటూత్ (Bluetooth) ద్వారా బ్యాటరీకి కనెక్ట్ అయ్యి,బ్యాటరీ వోల్టేజ్, ఉష్ణోగ్రత, కరెంట్ వంటి వివరాలను రియల్ టైమ్లో చూపిస్తాయి. అలాగే, బ్యాటరీని రిమోట్గా షట్డౌన్ (ఆఫ్) చేసే సదుపాయం కూడా ఇందులో ఉంటుంది. ఈ చైనా స్మార్ట్ఫోన్ అప్లికేషన్లలో భద్రతకు సంబంధించిన పెద్ద లోపం ఉంది. ఈ యాప్ల ద్వారా బ్యాటరీకి కనెక్ట్ అవ్వడానికి ఎలాంటి పాస్వర్డ్ లేదా అథెంటికేషన్ (Authentication) అవసరం లేదు. దీనిని కొందరు ఆకతాయిలు ఒక "ప్రాంక్" లా వాడుతున్నారు.రోడ్డుపై ఈ-రిక్షా వెళ్తున్నప్పుడు, ఆకతాయిలు తమ ఫోన్లో ఈ యాప్ ఓపెన్ చేస్తారు.బ్లూటూత్ ద్వారా దగ్గర్లోని ఈ-రిక్షా బ్యాటరీకి కనెక్ట్ అయ్యి, 'డిశ్చార్జ్ స్విచ్' క్లిక్ చేయగానే సదరు వాహనం రోడ్డు మధ్యలో అకస్మాత్తుగా ఆగిపోతుంది. దీంతో కారు లేదా బైక్ వెనుక ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే వారు హారన్లు కొడుతూ గొడవకు దిగుతున్నారు. ఆకతాయిలు మళ్లీ అదే యాప్ ద్వారా బ్యాటరీని ఆన్ చేసే వరకు ఆ ఈ-రిక్షా స్టార్ట్ కాదు. ఈ-రిక్షా డ్రైవర్లకు ఇది ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. ఇదీ చదవండి: టోల్గేట్పై దూసుకొచ్చిన ఎల్పీజీ ట్యాంకర్ : నలుగురు మృతి -
సోనమ్ బెయిల్పై సుప్రీం కోర్టు అనుమానాలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అయితే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రాథమికంగా తమకు అభ్యంతరాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ శీల్ నాగు ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రతివాదులకు(సోనమ్కు, ఇతరులకు) నోటీసులు జారీ చేసింది.మేఘాలయ ప్రభుత్వం వాదన ఇదే..మేఘాలయ ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇది ముందే పథకం ప్రకారం జరిగిన హత్య అని, సోనం రఘువంశీ తన ప్రియుడు రాజ్ కుష్వాహా.. మరో ముగ్గురితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసి లోయలో పడేశారని కోర్టుకు తెలిపారు. హత్య అనంతరం సోనం పరారై ఉత్తరప్రదేశ్లో అరెస్టయ్యిందని వివరించారు.అయితే, హత్య కేసుకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) (హత్యకు శిక్ష)కు బదులుగా పొరపాటున సెక్షన్ 403(1)గా అరెస్ట్ మెమోలో టైప్ చేయడాన్ని ఆధారంగా తీసుకుని ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని.. అలాగే హైకోర్టు కూడా ఆ బెయిల్ను సమర్థించిందని కోర్టుకు నివేదించారు. అది కేవలం టైపింగ్ పొరపాటు మాత్రమేనని, ఈ ఒక్క కారణంతో బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించారు.సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై తమకు ప్రాథమికంగా కొన్ని సందేహాలు ఉన్నాయని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. నిందితురాలిపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని.. బెయిల్ విషయంలో మేఘాలయా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారాయన. అలాగే అరెస్టు కారణాలను నిందితురాలికి వివరించారని రికార్డుల్లో ఉందని, గతంలో దాఖలైన బెయిల్ పిటిషన్లలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదని బెంచ్ ప్రస్తావించింది. కేవలం తప్పుగా సెక్షన్ పేర్కొన్నందుకే బెయిల్ ఇవ్వడం సరైందేనా? అని ప్రశ్నించింది.అయితే, సోనమ్ ఇప్పటికే జైలు నుంచి విడుదలైనందున ఈ దశలో బెయిల్పై స్టే విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. ‘‘బెయిల్ రద్దు విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఆమె విడుదల కాకపోయి ఉంటే.. బెయిల్పై కచ్చితంగా స్టే విధించేవాళ్లం’’ అని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో, బెయిల్ ఉత్తర్వుపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని, తదుపరి విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.హనీమూన్ కేసులో జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనం రఘువంశీ 2025 మేలో వివాహం చేసుకున్నారు. అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట మే 23న అదృశ్యమైంది. జూన్ 2న ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని వైసాడాంగ్ జలపాతం సమీపంలోని లోయలో రాజా మృతదేహం లభించింది. కొద్ది రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో సోనం రఘువంశీ కనిపించగా, అనంతరం పలు అనుమానాల నడుమ ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.దర్యాప్తులో భర్త హత్యకు సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కుట్ర పన్నిందని, ఇందుకోసం కిరాయి హంతకులను నియమించిందని మేఘాలయ పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో సోనం, రాజ్ కుష్వాహాతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి 700కు పైగా పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ 27న ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వగా.. జూన్ 29న మేఘాలయ హైకోర్టు సోనం రఘువంశీకి బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ పత్రాల్లో సెక్షన్ను తప్పుగా నమోదు చేయడం సాధారణ టైపింగ్ పొరపాటు కాదని, దర్యాప్తు ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు బెయిల్ను సమర్థించింది. ఇప్పుడు ఆ బెయిల్ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, బెయిల్పై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించినప్పటికీ, హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగించేందుకు అంగీకరించింది. -
యూజర్నేమ్ ఫీచర్ వివాదం.. నోటీసుల వర్షం
వాట్సాప్లో కొత్త ఫీచర్తో ప్రారంభమైన వివాదం మరో మలుపు తిరిగింది. యూజర్నేమ్ ఆధారిత కమ్యూనికేషన్ ఫీచర్ వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన చర్యలను మరింత విస్తరించింది. తాజాగా.. టెలిగ్రామ్, సిగ్నల్ యాప్లకు సైతం కేంద్ర ఐటీ శాఖ (MeitY) నోటీసులు జారీ చేసింది.యూజర్నేమ్ వ్యవస్థ వల్ల వ్యక్తుల ఫోన్ నంబర్ అవసరం లేకుండానే ఎవరైనా సంప్రదించగల అవకాశం ఉండటం.. మోసాలకు దారి తీయొచ్చని భారత ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నకిలీ గుర్తింపులు, సెలబ్రిటీలు లేదా ప్రభుత్వ అధికారుల పేరుతో ఇంపర్సనేషన్, ఫిషింగ్ దాడులు పెరిగే ప్రమాదం ఉందనే హెచ్చరికలను ప్రస్తావిస్తోంది. దీనికి తోడు..ఇటీవలి కాలంలో పెరుగుతున్న “డిజిటల్ అరెస్ట్” మోసాలు, ఆన్లైన్ ఫ్రాడ్ కేసులు కూడా ఈ ఆందోళనలకు అదనపు కారణాలుగా మారాయి. అందుకే యూజర్నేమ్ ఫీచర్ను ఎలా నియంత్రిస్తున్నారో వివరించాలంటూ అన్ని ప్రధాన మెసేజింగ్ ప్లాట్ఫార్మ్లను ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.ఇప్పటికే వాట్సాప్లో ప్రతిపాదించిన యూజర్నేమ్ ఫీచర్పై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసి, మెటా సంస్థకు నోటీసులు పంపింది. ఆ ఫీచర్ను వెంటనే అమలు చేయకూడదని, భద్రతా అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు అదే అంశం టెలిగ్రామ్, సిగ్నల్ వైపు కూడా విస్తరించడంతో వివాదం మరింత తీవ్రతరమైంది.టెలిగ్రామ్, సిగ్నల్ ఇప్పటికే యూజర్నేమ్ ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. దీంతో ఈ ఫీచర్ను కొనసాగించడానికి ఉన్న కారణాలు, దానిపై అమలు చేస్తున్న భద్రతా చర్యలపై స్పష్టత ఇవ్వాలని నోటీసుల్లో కేంద్రం పేర్కొంది. టెలిగ్రామ్ను మరింత కఠినంగా ప్రశ్నిస్తూ, ఈ ఫీచర్ను కొనసాగించాల్సిన అవసరం ఏంటో వివరణ ఇవ్వాలని కూడా కోరింది.మరోవైపు, వాట్సాప్ యూజర్నేమ్ ఫీచర్ ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. దాని ప్రభావంపై ముందుగానే సమీక్ష జరిపిన కేంద్రం, మెటా సంస్థకు నోటీసులు పంపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే వాట్సాప్ మాత్రం యూజర్నేమ్ ఫీచర్ ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదని.. అది పూర్తి భద్రమైందని.. దాని వల్ల ఎలాంటి నష్టం ఉండదని అంటోంది.ప్రభుత్వం తీసుకున్న ఈ వరుస చర్యలతో యూజర్నేమ్ ఫీచర్ చుట్టూ దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు వినియోగదారుల ప్రైవసీని పెంచుతుందని వాదనలు వినిపిస్తుండగా, మరోవైపు సైబర్ మోసాలకు దారి తీస్తుందన్న ఆందోళనలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి. -
జపాన్ ప్రధాని నా అందమైన చెల్లెలు: మోదీ
జపాన్ ప్రధాని సనాయె తకాయిచీని తన అందమైన సోదరిగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ చూపిన ఆప్యాయతకు చిరునవ్వుతో స్పందించిన జపాన్ ప్రధాని.. తనను అందమైన చెల్లెలు అని పిలిచినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ (గురువారం) ఢిల్లీలో ప్రధాని మోదీతో జపాన్ ప్రధాని భేటీ అయ్యారు. భారత్-జపాన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.వచ్చే పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా.. ఫార్మా, ఢిఫెన్స్, ఏఐ టెక్నాలజీ రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం మొదటిసారి భారతదేశాన్ని సందర్శిస్తున్న నా చెల్లెలు, జపాన్ ప్రధాని తకాయిచీకి నేను ఘన స్వాగతం పలుకుతున్నాను. ఆమె జపాన్కు మొదటి మహిళా ప్రధాన మంత్రి, అలాగే దూరదృష్టి గల నాయకురాలిగా ప్రజాదరణ పొందారంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు.జపాన్ ప్రధాని మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం భారత్కు చేరుకున్నారు. భారత్లో ఇదే ఆమె మొట్టమొదటి అధికారిక పర్యటన. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పర్యటనకు వచ్చారు. ఇవాళ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో మోదీతో ఆమె సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. అలాగే 16వ ఇండియా–జపాన్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు.భారత్లో అడుగుపెట్టిన ఫొటోను తకాయిచీ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. భారతదేశంలో తొలి పర్యటన సందర్భంగా తకాయిచీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా గురువారం జరగబోయే సమగ్ర చర్చల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. మన ఉమ్మడి కృషి ద్వారా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్ధిని పెంపొందించడాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. -
ప్చ్.. మూడు నెలలైనా గడవకముందే!
న్యూఢిల్లీ: ఐదేళ్ల పాటు శ్రమించి నిర్మించారు. రూ.12 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిష్ఠాత్మక ఎక్స్ప్రెస్వేను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. అయితే ప్రారంభమై మూడు నెలలు కూడా పూర్తికాకముందే రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.212 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ–డెహ్రాడూన్ ఆరు లేన్ల ఎక్స్ప్రెస్వేను ప్రధాని మోదీ ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభించారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుంచి కేవలం రెండు గంటలకు తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఐదేళ్ల పాటు నిర్మాణం సాగిన ఈ ప్రాజెక్టు ప్రారంభమైన కేవలం 79 రోజుల్లోనే రోడ్డుపై భారీ గుంతలు కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.👋Hello @narendramodi Ji,This is the Delhi–Dehradun Expressway, inaugurated by you just a couple of months ago.It took around 5 years to build, yet it hasn't even seen its first monsoon. Look at the pathetic condition. People are forced to stand in the middle of the… pic.twitter.com/4GZF84Hgia— Manu🇮🇳🇮🇳 (@mshahi0024) July 2, 2026వైరల్ వీడియోలో ఎక్స్ప్రెస్వేపై రెండు పెద్ద గుంతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి కారణంగా తన కళ్ల ముందే నాలుగైదు వాహనాలు అదుపు తప్పాయని, కనీసం రెండు కార్ల అల్లాయ్ వీల్స్ దెబ్బతిన్నాయని వీడియో తీసిన వాహనదారుడు పేర్కొన్నాడు. అనంతరం దెబ్బతిన్న చక్రాలను కూడా వీడియోలో చూపించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటు.. ప్రతిపక్ష కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.This is the video..😰 pic.twitter.com/rbTwggZLbC— bindasspahadi (@bindasspahadi) July 2, 2026ఐదేళ్లపాటు నిర్మించి, తొలి వర్షాకాలం కూడా పూర్తికాకముందే రోడ్డు పరిస్థితి ఇలా మారడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. టోల్ రూపంలో రూ.650 వసూలు చేస్తూ, ప్రయాణికుల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయంగా ఎత్తుకుంది. ఇంత భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో మూడు నెలల్లోనే గుంతలు పడటం నిర్మాణ నాణ్యతలో లోపాలకు, నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
భానుడి భగభగలకు బ్రేక్.. ఎట్టకేలకు ఢిల్లీకి ఊరట
కొన్ని రోజులుగా భానుడి భగభగలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ఢిల్లీ-ఎన్సీఆర్కు ఎట్టకేలకు భారీ వర్షాలు ఊరటనిచ్చాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే పరిస్థితుల తీవ్రత దృష్ట్యా.. అనూహ్యంగా రెడ్ అలర్ట్ను ప్రకటించింది భారత వాతావరణ శాఖ.జూన్ మొత్తం కూడా ఢిల్లీలో తీవ్ర ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు, భరించలేని ఉక్కపోత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. పగటి వేళ బయటకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రతతో పాటు గాలిలో తేమ అధికంగా ఉండటంతో ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వేడి అనిపిస్తూ ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కోసం ఢిల్లీ వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో వరుణుడు కరుణించాడు. గురువారం ఉదయం నుంచి రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు కూడా నమోదయ్యాయి. ఆకాశమంతా మేఘాలు కమ్ముకోవడంతో పగటిపూటే చీకటి వాతావరణం కనిపించింది.భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం మరికొన్ని గంటల్లో.. ఢిల్లీ-ఎన్సీఆర్ అంతటా తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, కొన్ని చోట్ల 100 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ను రెడ్ అలర్ట్గా మార్చి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.दिल्ली NCR के कई इलाकों में लंबे इंतजार के बाद हुई बारिश के बाद लोगों को गर्मी से राहत मिली। #DelhiRains #DelhiNCR #Monsoon #WeatherUpdate pic.twitter.com/qe6bZOvK8O— NBT Hindi News (@NavbharatTimes) July 2, 2026VIDEO | Delhi: Several parts of the national capital received light to moderate rainfall on Thursday morning, bringing relief from the humid conditions. Visuals from near Mayur Vihar.#DelhiRains #Monsoon #WeatherUpdate(Full video available on PTI Videos -… pic.twitter.com/pYciTxQTxg— Press Trust of India (@PTI_News) July 2, 2026VIDEO | Rain lashes parts of Delhi. Visuals from Pandit Pant Marg.#DelhiRains #Monsoon #WeatherUpdate(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/nBKeggeekQ— Press Trust of India (@PTI_News) July 2, 2026ఈ వర్షాలతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. గత కొద్ది రోజులుగా వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చింది. అయితే భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలగొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు చెట్ల కింద, బలహీన నిర్మాణాల వద్ద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
ఢిల్లీ వాయు కాలుష్యం.. ఇక అనుమతులు నో..!
సాక్షి,ఢిల్లీ: వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టనుంది. శీతాకాల కాలుష్య మాస్టర్ ప్లాన్ శాశ్వత నిబంధనలలో భాగంగా నవంబర్ 1 2026 నుండి ఫిబ్రవరి 28, 2027 వరకు రాజధాని పరిసరాల్లో నిర్మాణ పనులకు అనుమతి నిరాకరించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా నవంబర్ 1నుండి జనవరి 31వరకు ఢిల్లీలో కూల్చివేతలు, సివిల్ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం, ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, పీయూసీ (PUC) సర్టిఫికెట్ లేని వాహనాలకు ఇంధనం నిరాకరణ తదితర చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది.పార్కింగ్ ఛార్జీల రెట్టింపు సైతం నవంబర్ 1 నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. శీతాకాల కాలుష్య మాస్టర్ ప్లాన్ శాశ్వత నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం నోటిఫై చేసింది. ఢిల్లీని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ప్రజలు భాగస్వామ్యం వహించాలని ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం రేఖా గుప్తా పిలుపునిచ్చారు. కాగా ఢిల్లీలో ఏటా వాయుకాలుష్యం తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టనుంది. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. వాటికి ఆమోదం
సాక్షి, ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో జరిగిన భేటీలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 14,115 కోట్లతో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 6-లేన్ల సొరంగం నిర్మాణానికి ఆమోదం ప్రకటించింది. కేంద్రం ఆమోదం తెలిపిన రహదారులు1. ఢిల్లీలో ఆరు లెన్ల ద్యారకా ఎక్స్ప్రెస్ హైవే నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్ కనెక్టివిటి కోసం టన్నల్ రోడ్డు నిర్మించనుంది. దీని వ్యయం రూ. 6,970 కోట్లు2.యూపీలో కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు 4-లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
E20 పెట్రోల్ సేఫేనా?.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) పెట్రోల్ పై వినియోగదారులు, ఆటోమొబైల్ రంగంలో వ్యక్తమవుతున్న ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. E20 ఇంధన విధానం ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని, కాబట్టి సురక్షితమా? కాదా? అని తేలడానికి ఇంకా సమయం పడుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది.కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఓ ఉత్తర్వును సవాల్ చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఈ వ్యాఖ్యలు చేశారు. 20 శాతం ఇథనాల్ మిశ్రమం ప్రభుత్వ విధానంలో భాగమైనప్పటికీ, దాని ప్రభావాన్ని నిరంతరం పరిశీలిస్తున్నామని కోర్టుకు తెలిపారు.ఇటీవల E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల ఇంజిన్లకు నష్టం కలుగుతుందా? మైలేజ్ తగ్గుతుందా?.. కాలుష్యం జరుగుతుందా? అనే సందేహాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. అయితే ఈ ఆందోళనలకు శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. E20 ఇంధనం వల్ల వాహనాలకు నష్టం జరుగుతుందనే నిర్ధారిత ఆధారాలు ఇప్పటివరకు లేవని ప్రభుత్వం పేర్కొంది.ఇంకా ఇథనాల్ మిశ్రమం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడం, విదేశీ మారకద్రవ్య ఆదా, రైతులకు అదనపు ఆదాయం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయని కేంద్రం మరోసారి నొక్కి చెప్పింది. ఈ విధానం ద్వారా భారత్ ఇప్పటికే రూ.1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని తెలిపింది.దేశవ్యాప్తంగా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) అమలు లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించిన గడువు(2030) కంటే ముందుగానే సాధించింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ సరఫరా ప్రారంభమైంది. ఇప్పుడు 2030 నాటికి ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.అయితే E20పై వినియోగదారుల సందేహాలు కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి ఈ విధానం ప్రభావంపై స్పష్టమైన అంచనా వస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
మోదీ సరిగా నిద్రపోరు.. ఆయన నా టైపే!
భారత్–అమెరికా సంబంధాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత అనుబంధం ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఆ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF) లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ట్రంప్-మోదీ స్నేహంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం మియామిలో జరిగిన యూఎఫ్సీ ఈవెంట్ సందర్భంగా ట్రంప్తో కలిసి బ్యాక్స్టేజ్లో ఉన్నప్పుడు.. ఒక్కసారిగా "ప్రధాని మోదీకి ఫోన్ చేద్దాం" అని ట్రంప్ చెప్పారన్నారు. అయితే.. అప్పటికే భారత్లో ఉదయం 6 గంటలు అవుతుందని.. బాగా వేకువజామున అని తాను చెప్పగా, ట్రంప్ వెంటనే..‘‘ఆయన(మోదీ) ఈపాటికే లేచి ఉంటారు. ఆయన నాలాగే. నిద్ర తక్కువే (He's like me). సరిగా నిద్రపోరు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చినట్లు గోర్ వివరించారు. అయితే ఆ రోజు కాల్ చేయకపోయినా.. మరుసటి రోజు ఇద్దరూ మాట్లాడుకున్నారని తెలిపారు. అయితే ఈ సంఘటనలో ప్రధాన విషయం ఫోన్ కాల్ కాదని.. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహబంధమేనని గోర్ వ్యాఖ్యానించారు."ఎవరైనా నిజమైన స్నేహితులైతే ప్రతి విషయం ముందుగానే షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ట్రంప్ నిజంగానే ప్రధాని మోదీని తన స్నేహితుడిగా భావిస్తారు" అని ఆయన అన్నారు.భారత్తో బంధానికి ట్రంప్ ప్రాధాన్యంభారత్తో సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ట్రంప్ ఉన్నారని సెర్గియో గోర్ స్పష్టం చేశారు. ఇటీవల వాషింగ్టన్లో ట్రంప్తో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన సందర్భంగా కూడా ఆయన భారత్ గురించి ఎంతో అభిమానంతో మాట్లాడారని చెప్పారు. ట్రంప్కు తన గత భారత పర్యటన ఇప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని, భారత్పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని గోర్ తెలిపారు. రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా ట్రంప్ భారత్ను సందర్శిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది ట్రంప్ భారత్లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే.మొదటి టర్మ్లోనే బలపడిన స్నేహంట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలోనే మోదీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమం, భారత్లో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' సభలు ఆ ఇద్దరి స్నేహానికి ప్రతీకగా నిలిచాయి. అప్పటి నుంచి రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి కీలక రంగాల్లో రెండు దేశాల సహకారం మరింత బలపడిందని అధికారులు చెబుతున్నారు.భవిష్యత్తుపై ఆశలువచ్చే రెండేళ్లు భారత్-అమెరికా సంబంధాలకు అత్యంత కీలకమని సెర్గియో గోర్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతిక రంగాల్లో మరింత స్పష్టమైన ఫలితాలు సాధించడంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాయని చెప్పారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల పాటు ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు. -
టీ దుకాణం పెట్టుకోవడమూ నేరమేనా?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 10 రోజులుగా నిరసన సాగిస్తున్న తమకు పోలీసులు కనీస సౌకర్యాలను కూడా అందనివ్వడం లేదని ఆరోపించారు. తమకు టీ అందజేస్తున్న అనికేత్ పటేల్ అనే వ్యక్తిని సైతం ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారన్నారు. నిరసనకారులకు ఆహారం, దుస్తులు తీసుకువచ్చే వారినీ వదిలిపెట్టడం లేదని దీప్కే చెప్పారు. అనికేత్ పటేల్ ఆహ్వానం మేరకు అతడి టీ దుకాణం వద్దకు, అతడి ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. టీ దుకాణం పెట్టుకోవడమూ నేరమేనా అంటూ పోలీసులను ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిరసన వేదిక వద్ద బందోబస్తు విధుల్లో ఉండే పోలీసులకు తాను గులాబీలు, టీ అందజేస్తానన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతలను నిర్వర్తించాలని వారిని కోరుతానని చెప్పారు. ఇదే వేదికపై నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్చుక్ కోసం పోర్టబుల్ టాయిలెట్ సౌకర్యం కల్పించాలని ఆదివారం రాత్రి నిరసన చేపట్టినట్లు వెల్లడించారు. జంతర్ మంతర్లోని పబ్లిక్ టాయిలెట్లకు నీటి సౌకర్యం లేదని చెప్పారు. పరీక్షపత్రాల లీకేజీలకు కేంద్రమే బాధ్యత వహించాలనే డిమాండ్తో ఆదివారం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించడం తెల్సిందే. సీజేపీ నేతృత్వంలో ఇదే డిమాండ్తో జూన్ 20వ తేదీన దీప్కే సారథ్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రజాస్వామ్య ఉద్యమానికి మచ్చు తునక ఈ సందర్భంగా సోనమ్ వాంగ్చుక్ మాట్లాడుతూ..జంతర్మంతర్లో విద్యార్థులు, వలంటీర్లు శాంతియుతంగా కొనసాగిస్తున్న నిరసన ప్రజాస్వామ్య తరహా ఉద్యమానికి ఓ ఉదాహరణ అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో తమ వంతుగా భాగస్వాములయ్యారని చెప్పారు. పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్న వలంటీర్లు, సహకరిస్తున్న పోలీసులకు వాంగ్చుక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో దేశ వ్యతిరేక అంశమేదీ లేదని చెప్పారు. వీరంతా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మాత్రమే కోరుతున్నారని వివరించారు. ‘మీరు ఇలాగే మొండిగా వ్యవహరిస్తూ పోతే నష్టపోయేదీ మీరే. ప్రజలకు మీపై నమ్మకం పోతుంది. ఆ తర్వాత వారు మిమ్మల్ని తిరస్కరిస్తారు. ప్రజల బాధను మీరు అర్థం చేసుకున్నప్పుడే మిమ్మల్ని అంగీకరిస్తారు’అంటూ వాంగ్చుక్ వ్యాఖ్యానించారు. నీక్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)కి చెందిన ఆరుగురు విద్యార్థి నేతలు ఇక్కడే మరో వేదికపై ఆదివారం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, బృందా కారత్, సీపీఐ నేత డి.రాజా నిరసన చేపట్టిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. -
రూ.7000 కోట్ల బడ్జెట్.. అమల్లోకి 'ఢిల్లీ ఈవీ పాలసీ'!
ఢిల్లీ ప్రభుత్వం 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'ను అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఇది భారత్లో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి తీసుకున్న అన్ని చర్యలలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ విధానం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. దీని ప్రధాన లక్ష్యం అంతర్గత దహన ఇంజిన్ (పెట్రోల్, డీజిల్, సీఎన్జీ) వాహనాలను దశలవారీగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం.ఈ పాలసీకి ప్రభుత్వం సుమారు రూ.7,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీని ద్వారా వినియోగదారులు ఈవీలను కొంత తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు.పాలసీ ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్పై 100 శాతం మినహాయింపు లభిస్తుంది. అయితే.. ఈ ప్రయోజనం రూ.30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తే సాధారణ పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నమాట.ప్రభుత్వం నేరుగా కొనుగోలుదారులకు సబ్సిడీ కూడా అందిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ టూవీలర్లకు రూ.30,000 వరకు, త్రీ-వీలర్లకు రూ.50,000 వరకు, అలాగే చిన్న ఎలక్ట్రిక్ ట్రక్కులకు రూ.1,00,000 వరకు సహాయం అందుతుంది.ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.. ICE వాహనాలపై దశలవారీ నిషేధం. ఇందులో భాగంగానే 2027 జనవరి 1 నుంచి ఆటో రిక్షాలు, చిన్న సరకు రవాణా చేసే వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లు నిలిపివేయనున్నారు. 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్, డీజిల్, సీఎన్జీ టూవీలర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా రద్దు చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో ఢిల్లీలో రోడ్డుపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది.పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. నాలుగు చక్రాల వాహనాలకు రూ.1,00,000, టూవీలర్లకు రూ.10,000, త్రీ వీలర్లకు రూ.25,000 వరకు ప్రోత్సాహం ఇవ్వబడుతుంది.పెద్ద సరకు రవాణా వాహనాల కోసం ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ట్రక్కులకు కొన్ని నగర ప్రవేశ ఆంక్షల నుంచి మినహాయింపు లభిస్తుంది. అంతే కాకుండా పాఠశాల వాహనాలను కూడా దశలవారీగా ఈవీలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడం మాత్రమే కాకుండా.. చార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి చేయడానికి కూడా ప్రభుత్వం కావలసిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఢిల్లీ అంతటా 30,000కు పైగా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీని ద్వారా EV వినియోగదారులకు ఛార్జింగ్ సమస్య తగ్గే అవకాశం ఉంది.The Delhi Cabinet has approved the new Delhi EV Policy 2026, a landmark initiative to curb vehicular pollution and accelerate the transition towards clean, sustainable mobility in the national capital.The policy will come into effect on 1 July 2026 and remain in force until 31… pic.twitter.com/mDvXdhVHTN— CMO Delhi (@CMODelhi) June 29, 2026 -
పోన్లెండి సార్! ఏదో రకంగా పబ్లిసిటీ వస్తుందిగా!
పోన్లెండి సార్! ఏదో రకంగా పబ్లిసిటీ వస్తుందిగా! -
ఢిల్లీలో వాంగ్చుక్ నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ముందుగా ప్రకటించిన విధంగానే ఆదివారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్రమే బాధ్యత వహించాలని, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వాంగ్చుక్ దీక్షకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు తెలిపింది. ఆ పార్టీ కూడా 20వ తేదీ నుంచి ఇదే వేదికపై నీట్ పేపర్ లీకేజీపై ఆందోళన కొనసాగిస్తుండటం తెల్సిందే. దీక్ష ప్రారంభించడానికి ముందుగా వాంగ్చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో కలిసి రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం జంతర్మంతర్లో నిరసన స్థలిలో అంతా కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. వందల సంఖ్యలో హాజరైన విద్యార్థులు, యువకులు తరలివచ్చి వాంగ్చుక్ దీక్షకు మద్దతు ప్రకటించారు. -
రాహుల్ గాంధీ ‘మిస్సింగ్’ పోస్టర్ల కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ కలకలం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ‘కనిపించడం లేదు’ (మిస్సింగ్) అంటూ ఆదివారం ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ తాజా విదేశీ పర్యటనను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్లో ఈ పరిణామం సరికొత్త మలుపు తిప్పింది.అర్ధరాత్రి పోస్టర్ల కలకలంఢిల్లీలోని ఫిరోజ్షా రోడ్డుతో పాటు పలు ప్రధాన కూడళ్లలో రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన ‘మిస్సింగ్’ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. అయితే, ఈ పోస్టర్లను ఎవరు అంటించారనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. పార్లమెంట్ సమావేశాలు, కీలక ఎన్నికలు, లేదా పార్టీ అంతర్గత ప్రాముఖ్యత కలిగిన సమయాల్లో రాహుల్ గాంధీ దేశంలో ఉండరంటూ శనివారం నుంచే బీజేపీ తన విమర్శల పదును పెంచిన మరుసటి రోజే ఈ పోస్టర్లు కలకలం రేపడం గమనార్హం.‘లీడర్ ఆఫ్ పర్యటన్’ఈ అంశంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ ఎంపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత పదవిని @లీడర్ ఆఫ్ పర్యటన్ (టూరిజం) అండ్ పార్టీయింగ్’గా మార్చేశారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లేదా దేశానికి, సొంత పార్టీకి ఆయన అవసరం ఉన్నప్పుడల్లా విదేశాలకు వెళ్లడం రాహుల్కు అలవాటుగా మారిందని, ప్రజల కంటే ఆయన టూరిజానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.మోదీ వర్సెస్ రాహుల్ఇదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుతో రాహుల్ గాంధీని పూనావాలా పోల్చారు. పీఎం మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 9,000 రోజులకు పైగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజాసేవలో ఉన్నారని, కానీ రాహుల్ మాత్రం ఎప్పుడూ వెకేషన్ మూడ్లోనే ఉంటారని విమర్శించారు. రాహుల్ విదేశీ పర్యటనల ఖర్చుల వెనుక ఉన్న మూలాలను ప్రశ్నించిన ఆయన, దేశ వ్యతిరేక ఎజెండాను ప్రోత్సహించే శక్తులు దీని వెనుక ఉన్నాయంటూ ఆరోపించారు. కాగా, ఈ పోస్టర్లు, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
ఆఫ్గానిస్తాన్లో భారీ భూకంపం
ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం రాత్రి శక్తివంతమైన భూప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా పరిసర ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ భూకంప కేంద్రం అఫ్గానిస్తాన్లో ఉన్నట్లు గుర్తించారు. .ఆప్గానిస్తాన్లోని హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్తో పాటు భారత వాయువ్య ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. భూకంపం చాలా లోతులో సంభవించడంతో దీని ప్రభావం చుట్టుపక్కల చాలా దేశాల్లో కనిపించింది.కాగా, ఒక్కసారిగా భూమి కంపించడంతో దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఇళ్లు, ఆఫీసుల్లోని వస్తువులు కదలడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు కంగారుపడ్డారు. నివాసితులు, కార్యాలయ ఉద్యోగులు తమ భవనాల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప కేంద్రం చాలా లోతులో ఉండటం వల్ల ఉత్తర భారత దేశవ్యాప్తంగా ఈ ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయి. -
ఢిల్లీలో దారుణం: పిల్లలు పుట్టలేదనే నెపంతో..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కట్నం కోసం వేధించడంతో పాటు, సంతానం కలగలేదనే నెపంతో అత్తవారింట్లో ఎదురైన వేధింపుల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు.కిటికీ గ్రిల్కు మృతదేహం.. అనుమానాస్పద మృతిపశ్చిమ ఢిల్లీలోని రఘుబీర్ నగర్లో అద్దె ఇంట్లో నివసిస్తున్న 24 ఏళ్ల మహిళ తన నివాసంలో విగతజీవిగా కనిపించింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫోన్ రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి మెడపై ఉరి వేసుకున్నట్లుగా గుర్తులు ఉండటంతో పాటు, కిటికీ గ్రిల్కు ఒక దుపట్టా కట్టి ఉంది. ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఆర్డీఓ విచారణమృతి చెందిన మహిళకు వివాహమై కేవలం మూడేళ్లే కావడం, అలాగే దంపతులకు పిల్లలు లేకపోవడంతో చట్టప్రకారం ఈ కేసును సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. వివాహమైన ఏడేళ్ల లోపు మహిళ అనుమానాస్పదంగా మరణిస్తే ఆర్డీఓ విచారణ జరపడం నిబంధన. దీంతో మృతురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ను ఎస్డిఎమ్ రికార్డు చేశారు. అదనపు కట్నం కోసం వేధించడం, సంతానం కలుగలేదంటూ నిందించడం వల్లే తమ కుమార్తె ఈ నిర్ణయం తీసుకుందని వారు వాంగ్మూలం ఇచ్చారు.నిందితులు అరెస్ట్.. పోలీసుల దర్యాప్తుబాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 80 (కట్నపు చావు), సెక్షన్ 85 (మహిళపై క్రూరత్వం) కింద కేసు నమోదు చేశారు. పాత బట్టలు తీసుకుని గిన్నెలు అమ్మే వీధి వ్యాపారులుగా పనిచేసే నిందితులు (భర్త, మామ) పరారయ్యారు. అయితే సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు గురువారం దిల్లీలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోంది.ఇది కూడా చదవండి: ‘ట్రంప్ కన్నా పుతిన్ బెటర్’.. తేల్చేసిన భారతీయులు -
మత్తు ముఠాలపై యుద్ధమే
న్యూఢిల్లీ: దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. డ్రగ్స్ నెట్వర్క్ను కూకటివేళ్లతో సహా నిర్మూలించడమే లక్ష్యంగా కఠినమైన అణచివేత చర్యలు, చట్టాల అమలు, ఆర్థికపరమైన దర్యాప్తులతో కూడిన నూతన మూడేళ్ల రోడ్మ్యాప్ను ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన నార్కో–కోఆర్డినేషన్ సెంటర్(ఎన్కార్డ్) సదస్సుకు అమిత్ షా నేతృత్వం వహించారు. డ్రగ్ కంట్రోల్(2026–2029) విజన్ డాక్యుమెంట్ను ఈ సందర్భంగా విడుదల చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వార్షిక నివేదిక–2025ను సైతం విడుదల చేశారు. జమ్మూ, గౌహతిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ కార్యాలయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సింథటిక్ డ్రగ్స్, డార్క్నెట్ ఆధారిత అక్రమ రవాణా, సరిహద్దుల గుండా జరిగే స్మగ్లింగ్, డ్రగ్స్ విషయంలో కొత్తగా తలెత్తుతున్న ముప్పులకు వ్యతిరేకంగా సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే ధ్యేయంగా విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు అమిత్ షా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో.. రాబోయే మూడేళ్లలో మాదకద్రవ్యాల వ్యాపార వ్యవస్థను గట్టిగా దెబ్బకొడతామని, రాబోయే కొన్ని దశాబ్దాల పాటు అది కోలుకోలేదని తేల్చిచెప్పారు. మాదకద్రవ్యాల ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి ‘’గుర్తించడం, అడ్డుకోవడం, నాశనం చేయడం’అనే వ్యూహాన్ని అమలు చేయాలని డ్రగ్స్ నిరోధక సంస్థల అధికారులకు సూచించారు. సూత్రధారులు తప్పించుకోవడానికి వీల్లేదు డ్రగ్స్ను కట్టడి చేసే విషయంలో మానవ, సాంకేతిక నిఘా సమాచారాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని అమిత్ షా చెప్పారు. దేశంలోకి డ్రగ్స్ణు తీసుకొచ్చేవారు, సరిహద్దుల నుండి వివిధ రాష్ట్రాలకు వాటిని సరఫరా చేసేవారు, రాష్ట్రాల నుంచి వినియోగదారులకు పంపిణీ చేసేవారు... ఈ మూడు రకాల ముఠాలను అంతం చేసే దిశగా ముందుకు సాగాలని స్పష్టంచేశారు. ‘గుర్తించడం, అడ్డుకోవడం, నిర్మూలించడం’అనే వ్యూహం కింద.. మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను ప్రారంభ దశలోనే లక్ష్యంగా చేసుకోవాలని అన్నారు. మాదకద్రవ్యాల నెట్వర్క్లను ఛేదించడానికి, నేరస్థుల ఆస్తులను జప్తు చేయడానికి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టే ఆర్థిక దర్యాప్తులను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. నేరాలకు సూత్రధారులుగా ఉన్నవారు విచారణ నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని, అందుకు అవసరమైన అధికారాలు ప్రస్తుత చట్టాల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. వ్యసన విముక్తి, పునరావాస కేంద్రాల ఏర్పాటుతో డ్రగ్స్కు డిమాండ్ తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మనం ప్రస్తుతం ఒక కీలక మలుపు వద్ద ఉన్నామని చెప్పారు. మాదకద్రవ్యాల వ్యాపారం మనల్ని ఓడిస్తుందా లేక మనం దానిని ఓడిస్తామా? అనేది రాబోయే మూడేళ్లలో తేలిపోతుందని అమిత్ షా స్పష్టంచేశారు. రాబోయే వందేళ్లలో దేశ భవిష్యత్తు కోసం, ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని, దృఢ సంకల్పం, సమిష్టి కృషితో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. మనం అత్యంత కఠినమైన వైఖరితో నెట్వర్క్–కేంద్రీకృత పోరాటాన్ని సాగించాలని, అప్పుడే ఈ సమస్యపై విజయం సాధించగలమని వెల్లడించారు.బాధితుల పట్ల సానుభూతి చూపాలి డ్రగ్స్ అక్రమ రవాణాలో పాలుపంచుకునే వారి పట్ల కఠిన వైఖరిని, డ్రగ్స్ బాధితుల పట్ల సానుభూతి వైఖరిని కొనసాగించాలని అమిత్ షా సూచించారు. కరుణ, సద్భావన బాధితులను తిరిగి సాధారణ జీవితంతో మమేకం చేయగలవని వివరించారు. వారిని సరైన మార్గంలోకి నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాలపై పోరాటాన్ని ఏ ఒక్క శాఖ, రాష్ట్రం, ప్రభుత్వం లేదా వ్యక్తి మాత్రమే నిర్వహించలేరని తెలియజేశారు. అన్ని రాష్ట్రాలు, శాఖలు ఒకేవేదికపైకి రావాలని పేర్కొన్నారు. నార్కో సిండికేట్లు వాడుకుంటున్న లొసుగులను అరికట్టడానికి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షిస్తోందని వెల్లడించారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వా«దీనం చేసుకున్నామని, 2014 నుంచి 2026 వరకు 1.18 కోట్ల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వా«దీనం చేసుకున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాలపై మనం పోరాటం విజయ దిశగా స్థిరంగా సాగుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అమిత్ షా తేల్చిచెప్పారు. -
బంగ్లాదేశ్కు భారత్ గుడ్న్యూస్
ఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రెండేళ్లుగా నిలిపివేసిన టూరిస్ట్ వీసాల జారీని భారత్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ 28 (ఆదివారం) నుంచి బంగ్లాదేశ్ పౌరుల నుంచి పర్యాటక వీసా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఢాకాలోని భారత హై కమిషన్ ప్రకటించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ మెరుగుపడుతున్నాయనే సంకేతంగా భావిస్తున్నారు.ఢాకాలోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (IVAC) భారత హై కమిషనర్ దినేశ్ త్రివేది సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రారంభ దశలో ఢాకా, రాజ్షాహీ, చిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నా నగరాల్లోని ఐదు వీసా కేంద్రాల ద్వారా టూరిస్ట్ వీసా దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరిన్ని కేంద్రాలకు విస్తరిస్తామని వెల్లడించారు. కాగా, దినేశ్ త్రివేది ఇటీవలే బంగ్లాదేశ్లో భారత హై కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్కు తన అధికార పత్రాలను సమర్పించిన కొద్ది గంటలకే ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని ఆయన తెలిపారు.ఎందుకు నిలిపివేశారు?2024లో బంగ్లాదేశ్లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ విద్యార్థి ఉద్యమాలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో భారత దౌత్య కార్యాలయాలు, వీసా కేంద్రాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవడంతో భారత్ సాధారణ టూరిస్ట్ వీసాల జారీని నిలిపివేసింది. అయితే వైద్య చికిత్స, అత్యవసర కుటుంబ అవసరాలు, విద్య, వ్యాపార అవసరాలకు సంబంధించిన పరిమిత వీసా సేవలు మాత్రం కొనసాగించబడుతున్నాయి.ఇదిలా ఉండగా, భారత్.. బంగ్లాదేశ్ పౌరులకు అత్యధికంగా వీసాలు జారీ చేసే దేశాల్లో ఒకటి. కరోనా తర్వాత కూడా వీసా సేవలు పునరుద్ధరించబడినప్పటికీ 2024 రాజకీయ అశాంతి కారణంగా టూరిస్ట్ వీసాలపై పరిమితులు కొనసాగాయి. తాజాగా ఈ నిర్ణయం కేవలం వీసా సేవల పునఃప్రారంభం మాత్రమే కాదు. భారత్, బంగ్లాదేశ్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయనే సంకేతంగా కూడా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. పర్యాటకం, వాణిజ్యం, వైద్య సేవలు, విద్య, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ నిర్ణయం దోహదపడే అవకాశం ఉంది.అలాగే ఇరు దేశాల మధ్య పెండింగ్లో ఉన్న వాణిజ్య, భద్రత, సరిహద్దు నిర్వహణ అంశాలపై కూడా సహకారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, బంగ్లాదేశ్ పౌరులకు మళ్లీ టూరిస్ట్ వీసాలు జారీ చేయాలన్న భారత్ నిర్ణయం, ఇరు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే పరిణామంగా భావిస్తున్నారు. -
28 నుంచి జంతర్మంతర్లో నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని పక్షంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతానని ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపడుతున్న నిరసనలకు ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఈ నెల 27వ తేదీ వరకు ఎదురుచూస్తానన్నారు. విద్యారంగంలో జవాబుదారీతనం, తన సొంత లద్దాఖ్ పర్యావరణం, సంస్కృతి, అక్కడి ప్రజల సంక్షేమానికి సంబంధించిన విషయాలలో జవాబుదారీతనం అనే రెండు కీలక అంశాలపైనే తన దృష్టి ఉందన్నారు. విద్యను ప్రభావితం చేసే నిర్ణయాల్లో పౌరులకు స్థానం ఉండాలని, అలాగే పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునే విషయాల్లో లద్దాఖ్ ప్రజల అభిప్రాయాలకు విలువివ్వాలని వాంగ్చుక్ స్పష్టం చేశారు. శనివారం కల్లా ఈ రెండింటిపై స్పందన రాకపోతే, సీజేపీ నాయకులతో కలిసి నిరాహార దీక్షకు కూర్చుంటానన్నారు. -
‘నేను ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయట’
ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయంటూ ఉప ప్రధాని అంటోనియో అన్నారంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆసక్తికర విషయాలను తాజాగా తాను రాసిన పుస్తకంలో పంచుకున్నారు. 2023లో భారత్లో పర్యటించిన జార్జియా మెలోని ఆ సందర్భంగా జరిగిన పలు సంగతులను ప్రస్తావించారు. ఢిల్లీలో తనకు స్వాగతం పలకడానికి రహదారుల వెంట భారీ సంఖ్యలో తన ఫొటోలతో పోస్టర్లు ఏర్పాటు చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయానంటూ ఆమె పేర్కొన్నారు.మెలోనీ తన కొత్త పుస్తకం ‘జార్జియా విజన్’లో భారత్ పర్యటన జ్ఞాపకాలను రాసుకొచ్చారు. మెలోనీ 2023 మార్చిలో భారత్కు వచ్చినప్పుడు ఢిల్లీ రహదారుల వెంట తన ఫొటోతో పాటు 'వెల్కమ్' అని ఉన్న పోస్టర్లు కనిపించాయి. తిరుగు ప్రయాణం సమయంలో అదే పోస్టర్లపై ‘థాంక్యూ ఫర్ విజిటింగ్’ అని రాసి ఉండటం ఆమెను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా తనతో పాటు వచ్చిన ఇటలీ ఉప ప్రధానమంత్రి అంటోనియో సరదాగా స్పందిస్తూ ఈ పోస్టర్లన్నీ చూస్తుంటే నువ్వు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కనీసం పది లక్షల ఓట్లు వస్తాయి” అని వ్యాఖ్యానించినట్లు మెలోనీ తన పుస్తకంలో రాశారు. మెలోని 2023లో రెండు సార్లు భారతదేశాన్ని సందర్శించారు. మొదట మార్చిలో జరిగిన 8వ 'రైసినా డైలాగ్' సదస్సు, ఆ తర్వాత సెప్టెంబర్లో జరిగిన జీ20 సదస్సు కోసం ఆమె భారత్కు వచ్చారు.కాగా, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మరోసారి తమ ప్రత్యేక కెమిస్ట్రీతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్లోని ఎవియాన్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలంతా గ్రూప్ ఫొటో కోసం ఒకచోట చేరారు. ఈ సమయంలో మోదీ, మెలోనీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉంది’ అని మెలోనీ చెబుతూ.. ఆ వెంటనే సరదాగా "ఇన్స్టాగ్రామ్లో మనమే అత్యంత ప్రసిద్ధ జంట" అంటూ చమత్కరించారు. దీనికి మోదీ చిరునవ్వుతో స్పందించగా.. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది. -
CUET UG 2026: టాపర్గా ఢిల్లీ మాజీ మంత్రి కుమార్తె!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించిన ఈ ఫలితాల్లో ఢిల్లీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ గహ్లాట్ కుమార్తె దేవీనా గహ్లాట్ అద్భుత ప్రతిభ కనబరిచారు. 1,250 మార్కులకు గానూ 1,232.19 మార్కులు సాధించి, ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ (AIR 1) సొంతం చేసుకున్నారు. 11 లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో ఆమె సాధించిన ఈ విజయం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.మార్కుల సునామీ.. నాలుగు సబ్జెక్టుల్లో రికార్డుదేవీనా గహ్లాట్ ఈ పరీక్షలో మొత్తం ఐదు సబ్జెక్టులకు హాజరై, అత్యుత్తమ స్కోరు సాధించారు. ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ సబ్జెక్టులలో ఆమె ఏకంగా 100 పర్సంటైల్ సాధించగా.. ఇంగ్లీష్ సబ్జెక్టులో 99.99 పర్సంటైల్, ఫైన్ ఆర్ట్స్/విజువల్ ఆర్ట్స్లో 99.91 పర్సంటైల్ దక్కించుకున్నారు. సైకాలజీలో పూర్తి స్థాయిలో 250 మార్కులు సాధించిన దేవీనా, ఇంగ్లీష్లో 241.95, ఎకనామిక్స్లో 249.53, పొలిటికల్ సైన్స్లో 249.58 మార్కులతో మొత్తం 1232.19 మార్కులు సాధించి దేశంలోనే టాపర్గా నిలిచారు.‘ఇది నా తల్లిదండ్రుల కల’ఢిల్లీ వసంత కుంజ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)విద్యార్థిని అయిన దేవీనాకు చిన్నప్పటి నుంచి చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. గతంలో ఆమె తన 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కూడా 99.2 శాతం మార్కులతో టాపర్గా నిలిచారు. ఈ అద్భుత విజయంపై దేవీనా స్పందిస్తూ, ‘ఈ ఫలితం చూడగానే నాకు మొదట మా తల్లిదండ్రులే గుర్తుకొచ్చారు. కష్టకాలంలో వారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ విజయం నా కుటుంబానికే దక్కుతుంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఉన్నత చదువులు చదవడమే తన లక్ష్యమని ఆమె వెల్లడించారు.హోరాహోరీ పోటీ.. ముగిసిన నిరీక్షణఈ ఏడాది CUET UG పరీక్షలు ముగిసిన కేవలం 16 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసి ఎన్టీఏ రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే 12 రోజులు ముందుగానే ఫలితాలు వచ్చాయి. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 15.68 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, 11.64 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, ఈ రేసులో సక్షమ్ గోయల్ 1230.82 మార్కులతో రెండో స్థానాన్ని, హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఉదిత్ చతుర్వేది 1207.21 మార్కులతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. మొదటి రెండు ర్యాంకుల మధ్య ఉన్న స్వల్ప తేడా ఈ ఏడాది పోటీ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.ఇది కూడా చదవండి: బాబా వంగా జోస్యం: వరల్డ్ కప్లో గ్రహాంతరవాసుల దాడి? -
‘ఎయిమ్స్’కి ఊహించని షాక్.. వైద్య సామ్రాజ్యం బీటలు!
న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక వైద్య సంస్థ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ ప్రస్తుతం ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా రోగులకు భరోసానిచ్చే ఈ వైద్యాలయం నుండి అగ్రశ్రేణి వైద్యులు, విభాగాధిపతులు ఒకరి తర్వాత ఒకరు తప్పుకుంటున్నారు. దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు తమ పదవులను వదులుకుని ప్రైవేట్ ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.ఊహించని స్వచ్ఛంద విరమణలు2023- 2025 సంవత్సరాల మధ్య కాలంలో ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన దాదాపు 15 మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు, విభాగాధిపతులు, ప్రొఫెసర్లు తమ పదవుల నుండి స్వచ్ఛంద విరమణ (వీఆర్ఎస్)తీసుకున్నారు. వీరిలో కనీసం 13 మంది ప్రముఖ వైద్యులు తదనంతరం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులలో చేరడం గమనార్హం. 1956లో భారతీయ విద్యార్థులకు విదేశాలకు వెళ్లకుండానే ప్రపంచ స్థాయి పీజీ వైద్య విద్యను అందించే లక్ష్యంతో స్థాపించిన ఈ సంస్థ, ఇప్పుడు తన అమూల్యమైన వైద్య నిపుణులను కోల్పోతోంది.27 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న ప్రముఖ డాక్టర్ఈ వరుస నిష్క్రమణలలో అత్యంత సంచలనంగా మారిన పేరు డాక్టర్ శివ్ కుమార్ చౌదరి. ఎయిమ్స్ న్యూఢిల్లీలో కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ (సీటీవీఎస్) విభాగాధిపతిగా పనిచేసిన ఆయన, సర్వీస్ ఇంకా మిగిలి ఉండగానే 2024లో స్వచ్ఛంద విరమణ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రతిష్టాత్మక సంస్థతో 27 ఏళ్ల అనుబంధాన్ని ముగించుకున్న ఆయన, ప్రస్తుతం న్యూఢిల్లీ ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ఈ నిర్ణయం వైద్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.నిష్క్రమణకు అసలు కారణం ఇదే!తాము ఎయిమ్స్ను వీడటానికి గల ప్రధాన కారణాన్ని డాక్టర్ చౌదరి బహిర్గతం చేశారు. సంస్థలో దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ క్రమానుగత శ్రేణి లేదా అధికార క్రమం దెబ్బతినడమే దీనికి ముఖ్య కారణమని ఆయన పేర్కొన్నారు. తమలాంటి పలువురు సీనియర్ వైద్యులు ఎయిమ్స్ లాంటి వ్యవస్థను వదిలి వెళ్లడానికి ఈ అంతర్గత మార్పులే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంతర్గత విభేదాలు సంస్థ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.ఇది కూడా చదవండి: ముంబైపై వరుణుడి దండయాత్ర.. ఆర్థిక రాజధాని అతలాకుతలం -
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 20 ఫైరింజన్లు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉద్యోగ్ భవన్ సమీపంలోని స్లమ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వెంటనే అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. ఘటనాస్థలికి 20 ఫైరింజన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల కారణంగా పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రిక్ ప్యానల్లో మంటలు చెలరేగి, అక్కడి నుంచి సమీపంలోని గుడిసెలకు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఘటనపై అగ్నిమాపక శాఖ, పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. #WATCH | Delhi | Fire fighting operations underway in the slums near Udyog Bhawan area. 20 fire fighting units present at the scene. Further details awaited. pic.twitter.com/jS18iArG7L— ANI (@ANI) June 23, 2026 VIDEO | Delhi: Fire breaks out in temporary shelter for workers near Udyog Bhawan. Firefighting operations underway. More details are awaited.#DelhiNews #Fire(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/wD9u9ewCeL— Press Trust of India (@PTI_News) June 24, 2026 -
మహిళల విజేత ఢిల్లీ రెడ్స్
సాక్షి, హైదరాబాద్: రగ్బీ ప్రీమియర్ లీగ్ మహిళల తొలి సీజన్ టైటిల్ను ఢిల్లీ రెడ్స్ జట్టు సొంతం చేసుకుంది. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ 22–10 పాయింట్ల తేడాతో చెన్నై బుల్స్పై ఘన విజయం సాధించింది. తొలి క్వార్టర్ ముగిసేసరికి 5–0తో ఆధిక్యంలో నిలిచిన ఢిల్లీ, రెండో క్వార్టర్లోనూ పైచేయి సాధించి 10–5తో ముగించింది. మూడో క్వార్టర్లో ఇరు జట్ల సమ ఉజ్జీలుగా నిలవగా... ఆఖరి క్వార్టర్లో పోరు ఆసక్తికరంగా సాగింది. 15–5తో ముందంజ వేసిన ఢిల్లీ 20–5కు, ఆపై 22–5కు చేరింది.అయితే ఈ దశలో పోరాడిన చెన్నై స్కోరును 10–22 వరకు తీసుకెళ్లినా...చివరకు ఓటమి తప్పలేదు. రెడ్స్ గెలుపులో లావెనా కవారు, ఎడెన్ కిల్గార్, సిలికా ఖాలో, ఇసడోరా లోప్స్ కీలక పాత్ర పోషించగా...చెన్నై తరఫున ముస్కాన్ పిప్లోడా, షీలా షజీరా రాణించారు. మహిళల లీగ్లో 10 దేశాలకు చెందిన 48 మంది ప్లేయర్లు బరిలోకి దిగారు. విజేతగా నిలిచిన ఢిల్లీకు రూ. 25 లక్షలు, రన్నరప్ చెన్నైకి రూ.15 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. జూన్ 28 వరకు పురుషుల లీగ్ కొనసాగుతుంది. -
ఉపన్యాసం లాఫింగ్ స్టాక్తో.. పవన్ మళ్లీ సెల్ఫ్ గోల్!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి తెలుగు ప్రజలు ఏమనుకోవాలి? మంచి జ్ఞాని ఆయనలో ఉన్నారనుకోవాలా? లేక అవగాహన లేకుండా మాట్లాడుతుంటారనుకోవాలా? నిజంగా ఇది ఆసక్తికర అంశమే. కొద్ది రోజుల క్రితం ఆయన సుమతీ శతకంలోని ఒక పద్య భాగాన్ని ఉటంకించి భాష్యం చెప్పిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఆయన పరిజ్ఞానాన్ని ప్రశ్నిస్తూ పలు ప్రశ్నలు వెలువెత్తాయి. ఒకప్పుడు యువత అంతా ప్రశ్నించాలని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే యువత ప్రభుత్వాల అక్రమాలను ప్రశ్నించడాన్ని తప్పుపడుతూ వారిని క్రిములతో, చీమలతో పోల్చడం దారుణంగా ఉంది.ఢిల్లీలో ఆయన జనసేన నేతలతో ఒక సమావేశం పెట్టి చేసిన ఉపన్యాసం లాఫింగ్ స్టాక్గా మారింది. ఆయన ప్రసంగాన్ని గమనించండి.. ఈ మధ్య చూస్తున్నారు.. కాక్రోచ్ అనే పాయింట్ గురించి. చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా బలవంతమైన సర్పాలను చంపేస్తాయి.. కోట్ల మంది చిన్న, చిన్న ఆలోచనలు, ఇండివిడ్యువల్ వక్తులు అందరూ కూర్చుని దేశం తాలూకూ ఘాడతను, దేశం తాలూకూ తీవ్రతను అర్థం చేసుకోకపోతే, దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. డివిజివ్ శక్తులు విభజనవాదాన్ని సృష్టిస్తున్నాయి. దానిలో మనం భాగస్వామ్యులు కారాదు. ఎదిరించి పోరాడాలి.. అంటూ ఆయన ఉపన్యసించారు.అసలు సుమతీ శతక కారుడు ఈ పద్యం చెప్పడంలో అర్థం వేరు. 'బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!' అన్నది ఆ పద్య వ్యాక్యం. దీని అర్థాన్ని గూగుల్లో వెతికితే ఏమి ఉందో చూడండి. 'ఈ పద్యం ద్వారా కవి చెప్పిన సారాంశం ఏమిటంటే: తనను మించిన బలవంతుడు లేడని గర్వించి, ఇతరులను చిన్నచూపు చూస్తూ విరోధాలు కొనితెచ్చుకోవడం మంచిది కాదు. బలమైన పామును కూడా చిన్న చీమలు కలిసి కుట్టి చంపగలవు. ఎంతటి బలవంతులకైనా ఐక్యత ముందు ఓటమి తప్పదు. బలవంతమైన సర్పాన్ని చలిచీమలు చంపుతాయి' అని అర్థం. అంతేకాని సర్పం గొప్పదని, దానిని చీమలు చంపడం కరెక్టు కాదని కాదు. ఇది నెగిటివ్ సెన్స్లో రాసిన పద్యం.పవన్ తనకు తెలియకుండా కేంద్రాన్ని దేనితో పోల్చుతున్నారన్న సందేహం వచ్చింది. ఇది అవగాహనారాహిత్యంగా కనిపిస్తుంది. అలాగే కాక్రోచ్ పేరుతో పోరాడిన యువతను చలిచీమలుగా ఆయన చెబుతున్నారన్నమాట. పాము అంటే విషం సర్పం అని గుర్తుంచుకోవాలి. బలంతో విర్రవీగితే చిన్న, చిన్న కాక్రోచ్లు కూడా రేపటి రోజు చుట్టుముట్టి అంతం చేస్తాయని చెప్పడం. రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాలు తమ తప్పులను తెలుసుకుని జాగ్రత్తపడకపోతే తదుపరి ఎన్నికలలో ఓటమికి గురి కావల్సివస్తుందని అర్థం.కొన్నాళ్ల క్రితం కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో యువకులు చేసిన పోరాటాన్ని తప్పుపట్టాలని ఆయన భావించడమే దారుణం. అందులో కూడా విష సర్పాన్ని సమర్ధించేలా ఆ పద్యాన్ని అవగాహన చేసుకోవడం మరీ చిత్రం. ఆయనకు ఈ స్క్రిప్ట్ రాసినవారికి ఈ విషయం తెలియదా, ఇది సెల్ఫ్ గోల్ వేసుకోవడం కాక ఏమిటి? అని ఒక మహిళా నెటిజన్ వ్యాఖ్యానించారు. విభజన వాదాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఐ యామ్ అన్ అపాలజిటిక్ హిందూ అని, కులం, మతం ప్రస్తావనలు తెచ్చిందెవరు అని ఆమె ప్రశ్నించారు. ఈ దేశం కోసం పోరాడే హక్కు యువతకు ఉంది. వాళ్ల హక్కుల కోసం, జరిగిన అన్యాయాలపై పోరాడుతున్నారు. అది వారి హక్కు అని గుర్తించకుండా పవన్ ఈ మీటింగ్ పెట్టడం ఏమిటో, ఈ విష సర్పం, చలిచీమల గురించి అర్థం, పర్దం లేకుండా మాట్లాడడమేమిటో అని మేధావులు, పండితులు ఆశ్చర్యపోతున్నారు.నీట్ పరీక్ష లీక్ అవడం వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. సీబీఐ విచారణకు అప్పగించింది. పలువురు ఈ కేసులో అరెస్టు కూడా అయ్యారు. కాకపోతే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని అడుగుతున్నారు. ఇందులో రాజకీయం ఎక్కడ ఉంది. ఈ యువత దేశానికి ఏ రకంగా ప్రమాదం?, పవన్ ది రాజును మించి రాజభక్తి ప్రదర్శించడమా? లేక విషయంపై అవగాహన లేకుండా మాట్లాడడమని అనుకోవాలా? ఈ ప్రశ్నలు సహజంగానే బుద్ధి జీవులకు వచ్చాయి.సినిమాలలో వచ్చిన అవకాశాలతో పాటు, కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడం ద్వారా ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ గత పదేళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాటలు మార్చారో చెప్పలేం. ఈయన పరస్పర విరుద్ధమైన డైలాగులు అన్నిటినీ ఒక చోట పేర్చి సోషల్ మీడియాలో ఎవరో పోస్టు చేశారు. తనకు మాత్రమే దేశ భక్తి ఉన్నట్లు, అన్యాయాలను ప్రశ్నించే వారికి లేనట్లుగా పవన్ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు గురైంది. తోచీ, తోయనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్లిందని సామెత. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఈ ఉపదేశాలు ఇవ్వడం ఏమిటి? ఇదే పవన్ కళ్యాణ్ అంతకు కొద్ది రోజుల ముందు తన పార్టీ పక్షాన సేనాదళం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.జన్ జి ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే దాని లక్ష్యం అని కూడా ఆయన చెప్పారు. అది చెప్పిన కొద్ది రోజులకే మాట మార్చేశారు. కొందరు యువకులు ప్రకటించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీని జన్ జి లో భాగంగానే చూడాలి. దీని అర్థం ఎంత అణచివేతకు గురి అవుతున్నా బొద్దింకల మాదిరి తిరగబడాలని చెప్పడం అన్నమాట. దీని గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఒక వ్యాఖ్య చేస్తూ యువత తన ఆకాంక్షల కోసం ఈ ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఏపీలో తాను కూడా ఒక కాక్రోచ్నే అని కామెంట్ చేశారు. అంటే దాని భావం ఏపీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై తాను పోరాడతానని ప్రకటించడమే కదా!రాజకీయాలలో కొందరు వ్యక్తుల తప్పులను వ్యక్తిగత చర్యలుగా కాకుండా వారి కులం, మతం, వర్గాలకు ముడిపెట్టి సామాజిక విభేధాలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ సేనాదళం ప్రకటన సందర్భంలో అన్నారు. విశేషం ఏమిటంటే జగన్ పాలన సాగిన ఐదేళ్లలో ఈ రకమైన ప్రయత్నాలు చేసిందంతా టీడీపీ, జనసేనలే. అధికారం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు కలిసి ఎన్నిసార్లు కుల విభేధాలు, మత వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నించారో తెలియదా? అధికారంలోకి వచ్చాక కూడా తిరుమల లడ్డూ పేరుతో, ఇతరత్రా మతపరమైన అంశాలను ఏ విధంగా వాడుకున్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. కాని సోషల్ మీడియాలో ఆ చరిత్ర అంతా ప్రత్యక్షమవుతూనే ఉంది కదా!కొద్ది రోజుల క్రితం వరంగల్లో ఒక బాలుడి కోరిక ప్రకారం అతనిని కలిసి వచ్చారు. మంచిదే. దానిని స్వాగతించవచ్చు. కాని అదే సమయంలో ఏపీలో తన మద్దతుదారుడైన ఒక యువకుడిని పోలీసులు క్రూరంగా హింసించి చంపేసి, చివరికి కాల్చి బూడిద చేశారన్న అభియోగం వస్తే, ఆ కుటుంబాన్ని పలకరించడానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడాన్ని ఏమనుకోవాలి? ఇలాంటి ఘటనలపై కూడా యువత కాని, ప్రజలు కాని స్పందించరాదన్నది ఆయన ఉద్దేశమా? అధికారం వచ్చింది కనుక ఆయనకు సంతోషంగానే ఉండవచ్చు. కాని ప్రజలకు ఏమి ఒరిగింది? ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ అరాచకాలతో ఏపీ అల్లాడుతుంటే ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే ఏమిటి? కాకపోతే ఏమిటి? అన్న నైరాశ్యానికి ఆయన మద్దతుదారులు గురి అవుతున్నారనిపిస్తుంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కేంద్రమంత్రి ఖట్టర్తో.. సీఎం రేవంత్ భేటీ
సాక్షి, ఢిల్లీ: ఈ రోజు ( మంగళవారం) కేంద్రమంత్రి మనోహార్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ ముగిసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు నిధులు, రెండోఫేజ్కు అనుమతులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం పాల్గొన్నారు.కాగా నిన్న రైల్వేశాఖ మంత్రి అశ్విణీ వైష్ణవ్తో సీఎం రేవంత్, కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో మెట్రో- ఫేజ్- 2 పనులు, ఐఆర్ఏఫ్సీ రుణాల విడుదలపై మాట్లాడారు. చర్చలు సానూకూలంగా సాగాయని విద్యుత్ శాఖ మంత్రితో భేటీ అనంతరం మెట్రో విషయంలో స్పష్టత వస్తుందని రేవంత్ అన్నారు. అయితే ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ రాశారు. కేంద్ర మంత్రులతో భేటీ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి కేంద్రమంత్రితో భేటీ ఏర్పాటు చేశారు.కిషన్ రెడ్డిపై విమర్శలుఇటీవల మెట్రో ఫేజ్-2 పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా లేదా అని కిషన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించడంతో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు ఆపేసిందన్నారు. కిషన్ రెడ్డి పట్ల తనకు వ్యతిరేకత లేదని మెట్రో విషయంలో ఆయన ధైర్యంగా ఉంటే తాను అండగా ఉంటాను. మెట్రో విషయంలో కేంద్రం వెంటనే లోన్ రిలీజ్ చేయకపోతే ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తామన్నారు. -
కాక్రోచ్ పార్టీ సంచలన ఆరోపణలు!
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, అవకతవకల నడుమ మరోసారి పరీక్షను నిర్వహించారు. అయితే దీనిపై కూడా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్రం తీరును ఖండిస్తూ.. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇప్పుడు సంచలన ఆరోపణలకు దిగింది.. నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందిన అభిజిత్ దీప్కే.. నిరసనకారుల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జంతర్మంతర్లోని మరుగుదొడ్లకు వరుసగా రెండో రోజూ నీటి సరఫరా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. నిరసనలకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.అంతేకాకుండా నిరసనకారులకు నీళ్లు, అరటిపండ్లు పంపిణీ చేస్తున్న వారి ఆధార్ కార్డు వివరాలు, చిరునామాలు సేకరిస్తున్నారని ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు చేశారు. ప్రజలకు సహాయం చేస్తున్న వారిని సైతం అనుమానాస్పదంగా చూడటం సరైంది కాదని అభిజిత్ పేర్కొన్నారు.జంతర్మంతర్లో నిరసనకారుల కోసం స్వచ్ఛంద సంస్థలు, మద్దతుదారులు లంగర్ ఏర్పాటు చేసి ఆహారం, లస్సీ పంపిణీ చేస్తున్నారు. అనేక మంది రాత్రంతా అక్కడే బస చేస్తుండటంతో చెప్పులు, సామాన్లు, పాత్రలు అక్కడే కనిపిస్తున్నాయి. పోలీసులు అనుమతి గడువు ముగిసిందని తెలిపినా.. ప్రత్యామ్నాయ వేదిక కేటాయించే వరకు తాము నిరసన కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.నీట్-యూజీ లీక్ వ్యవహారంలో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ ఉద్యమానికి తాజాగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.మరోవైపు మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త జ్ఞానేశ్వర్ రఘునాథ్ థోరట్ఈ నిరసనల్లో చేరడం హైలైట్ అయ్యింది. “విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతారు. కానీ కొందరి లాభం కోసం పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే అది లక్షలాది కుటుంబాలకు అన్యాయం చేసినట్టే” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నీట్-యూజీ పేపర్ లీక్ వివాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు రీ టెస్ట్ను కూడా ఎన్టీఏ సరిగ్గా నిర్వహించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు జంతర్మంతర్ వేదికగా కొనసాగుతున్న నిరసనలు, కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలు మరోసారి ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాయి. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ బాధ్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఉద్యమం ఇంకా ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
NEET రీ-ఎగ్జామ్.. వెలుగులోకి భారీ కుంభకోణం!
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన నీట్-యూజీ రీ-ఎగ్జామ్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అభ్యర్థులకు బదులుగా వేరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడిన వ్యవహారాలు సంచలనంగా మారాయి. ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా, ఒక్క బీహార్లోనే ఇప్పటివరకు 30 మందిని అరెస్ట్ చేశారు. ఈ మోసం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, నెట్వర్క్ను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.బిహార్లో నీట్ రీటెస్ట్-2026 సందర్భంగా భారీ అక్రమాలు వెలుగు చూశాయి. పరీక్ష రాస్తున్న వారి స్థానంలో ఇతరులు హాజరయ్యిన ఘటనలు బయటపడటంతో అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 30 మంది అరెస్టు కాగా, అందులో 9 మంది నకిలీ అభ్యర్థులుగా పరీక్ష రాస్తూ పట్టుబడటం కలకలం రేపింది. లఖిసరాయ్ జిల్లాలో పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన తనిఖీల్లో ఈ మోసం బయటపడింది. కేఆర్కే హైస్కూల్ పరీక్ష కేంద్రం నుంచి ఒకరు, కేంద్రీయ విద్యాలయం నుంచి ఏడుగురు, హసన్పూర్ స్కూల్ నుంచి మరో వ్యక్తి.. నకిలీగా పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. వీరంతా వేరే అభ్యర్థుల స్థానంలో పరీక్షకు హాజరైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో పాటు మరో 21 మందిని కూడా అనుమానితులుగా అరెస్టు చేశారు. వీరి పాత్ర ఈ మోసపూరిత నెట్వర్క్లో ఉందా? అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. మొత్తం అరెస్టుల సంఖ్య 30కి చేరగా.. ఆ సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.అరెస్టయిన వారిని ఎస్డీఎం ప్రభాకర్ కుమార్, ఎస్డీపీవో శివమ్ కుమార్ పర్యవేక్షణలో ప్రశ్నిస్తున్నారు. విచారణలో వెలుగులోకి వస్తున్న సమాచారం ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు సంబంధిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ మోసానికి వెనుక పెద్ద నెట్వర్క్ ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్, ఎస్పీ ప్రేరణ కుమార్ ఈ కేసు విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. మరింత మంది ఈ రాకెట్లో భాగమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే NEET పరీక్షలో ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి నెట్వర్క్ను బయటకు తీసేందుకు విచారణ కొనసాగుతుండగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ స్పందించాల్సి ఉంది. -
ఆకలి ముందు మరణ భయం ఎంత?
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ప్రవహించే యమునా నది కేవలం కాలుష్యానికే కాదు, వందలాది కుటుంబాల ఆకలి కేకలకు కూడా చిరునామాగా మారింది. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటితో నిండిన ఆ నల్లటి నీటిలోకి రోజూ కొందరు ప్రాణాలను పణంగా పెట్టి దూకుతున్నారు. నది అడుగున పూడుకుపోయిన నాణేలు, స్క్రాప్ మెటల్స్ కోసం వారు సాగిస్తున్న ఈ మృత్యుపోరాటం మానవ నాగరికతకు ఒక మాయని మచ్చ. పాలకుల నిర్లక్ష్యం, బతుకుదెరువు లేని దీనస్థితి నడుమ యమున కాయిన్ డైవర్ల జీవితాలు నదిలోని విష రసాయనాల కంటే ఘోరంగా మారుతున్నాయి.యమునా నదిలో ఊపిరి బిగబట్టి..ఢిల్లీలో ప్రవహించే యమునా నది భారతదేశంలోనే అత్యంత కలుషితమైన జలవనరుగా మారింది. అయినప్పటికీ, ఆ విషపు నీటి అడుగున ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా, తమ ఆకలి తీరకపోతుందా అనే ఆశతో రాజ్వీర్ సింగ్, బనార్ సింగ్ వంటి డైవర్లు ప్రతిరోజూ నదిలోకి మునుగుతున్నారు. ఇది వారు నిన్న మొన్న ప్రారంభించిన పని కాదు. కేవలం ఒక గుటక మంచి నీరు తాగి, మళ్లీ ఆ నల్లటి నీటిలోకి దూకడానికి సిద్ధమవుతూ, ‘నేను నా జీవితాన్ని వెళ్లదీయడం కోసం గత నలభై ఏళ్లుగా ఇదే పని చేస్తున్నాను’ అని రాజ్వీర్ సింగ్ తన సుదీర్ఘమైన, బాధాతప్తమైన ప్రయాణాన్ని వివరించాడు.ఆకలి తీర్చే ఆ ఒక్క రూపాయిఈ డైవర్లు నదిలో కేవలం భక్తులు విసిరే నాణేల కోసమే వెతకడం లేదు. వారి చేతులు నది అడుగున పేరుకుపోయిన బురదలో కూరుకుపోయిన పాత ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ సీసాలు.. ఇలా గుజరీ మార్కెట్లో అమ్ముడుపోయే ఏ వస్తువు దొరికినా ఏరుకుంటారు. ఇంత ప్రాణాంతకమైన పని చేస్తే వారికి రోజుకు సగటున లభించే కూలి కేవలం రూ. 600 మాత్రమే. తాము పడుతున్న కష్టానికి దక్కే అల్ప ప్రతిఫలాన్ని చూపిస్తూ, రాజ్వీర్ తన చేతిలో ఉన్న ఒకే ఒక్క రూపాయి నాణేన్ని మీడియాకు చూపించినప్పుడు, అక్కడ వారి దారిద్ర్యం స్పష్టంగా కనిపించింది.నమ్మకమే వారి ఊపిరి‘భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడనే నమ్మకం మాకు ఉంది. యమున మాకు తల్లి లాంటిది, ఇన్నేళ్లుగా ఆమె మాకు అన్నం పెడుతోంది’ అని బనార్ సింగ్ తన అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. సరిగ్గా అదే సమయంలో అతని స్నేహితుడు నల్లటి నీటి నుండి పైకి లేస్తూ, బురదలో పూడుకుపోయిన ఒక చిన్న వినాయకుడి విగ్రహాన్ని బయటకు తీశాడు. ఏటా జరిగే గణేష్ చతుర్థి విగ్రహాల నిమజ్జనాల కారణంగా, యమునా నది అడుగున ఉన్న బురదలో వీరికి ఎక్కువగా వినాయకుడి విగ్రహాలే లభ్యమవుతుంటాయి.రసాయనాల నది.. నరకప్రాయంఈ కాయిన్ డైవర్ల దినచర్య వెనుక ఉన్న అసలు నిజం అత్యంత భయంకరమైనది. యమునా నదిలోకి దిగే పురుషులు అత్యంత ప్రతికూలమైన, ప్రమాదకరమైన పని వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. శుద్ధి చేయని మురుగునీరు, పారిశ్రామిక రసాయనాల వ్యర్థాలు, విషపూరితమైన భారీ లోహాలతో నిండిన ఈ నది, ఇప్పుడు కేవలం ఒక జలమార్గం కాదు; అదొక జీవసంబంధ, రసాయన ప్రమాదకర ప్రాంతంగా రూపాంతరం చెందింది. ఈ పారిశ్రామిక రసాయనాలతో నిరంతరం ఉండే సంపర్కం వారి శరీరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.దెబ్బతింటున్న ఆరోగ్యంఈ విషపూరిత నీటి వల్ల వీరికి దీర్ఘకాలిక, బాధాకరమైన చర్మ వ్యాధులు, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. ‘నా చేతులపై ఉన్న ఈ నల్లటి, గరుకైన చర్మం నదిలోని రసాయనాల వల్లే వచ్చింది’ అని బనార్ సింగ్ తన చేతులను చూపిస్తూ దశాబ్దాలుగా నదిలో గడపడం వల్ల తన శరీరానికి జరిగిన నష్టాన్ని వివరించాడు. 40 డిగ్రీల సెల్సియస్ మండుటెండలో నిలబడి, ఆపై పారిశ్రామిక రసాయనాల కాక్టెయిల్లా మారిన నదిలోకి దూకడం వారి దారుణమైన మనుగడకు అద్దం పడుతోంది.తోడుగా నిలిచిన మూగజీవంజీవితం ఒక నిరంతర పోరాటంగా మారినప్పటికీ, కుటుంబాలను పోషించడానికి, ఆకలి తీర్చుకోవడానికి రాజ్వీర్, బనార్లకు ఈ ప్రమాదకరమైన పనే శరణ్యమైంది. వారు నదిలో నాణేల కోసం వెతుకుతుంటే, వారికి తోడుగా వారి పెంపుడు కుక్క కూడా నిశ్శబ్దంగా వారి పక్కనే ఈదుకుంటూ వెళ్తుంది. వారు ఎప్పుడు సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటారా అని తీరం వైపు ఒకరు నమ్మకంతో ఎదురుచూస్తూ ఉంటారు. ప్రాణాలు పోతాయని తెలిసినా, ఆకలి ముందు ఆ భయం ఓడిపోతోందనే నిజానికి వీరి జీవితాలే సాక్ష్యం.ఇది కూడా చదవండి: నాటి ఇందిర ట్విస్ట్ నుండి నేటి శివసేన చీలిక వరకూ.. -
45 నిమిషాల పాటు ఎయిర్పోర్టులోనే ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ విమానాశ్రయంలోనే 45 నిమిషాల పాటు ఉండిపోయారు. నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్ హాజరయ్యే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడటం కోసం ప్రధాని.. ఢిల్లీ విమానాశ్రయంలోనే కాసేపు వేచి ఉన్నారు.పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాని మోదీ తన తిరుగు ప్రయాణాన్ని కాస్త ఆలస్యం చేసుకున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. ప్రధాని మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు.నీట్ (NEET) పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండటంతో ఆయన విమానాశ్రయం నుండి వెంటనే తన నివాసానికి బయలుదేరడానికి బదులుగా.. అక్కడే వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. విమానాశ్రయం నుండి ప్రధాని కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిలిపివేస్తారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్తో విద్యార్థులు పరీక్షకు ఆలస్యం కాకూడదని.. పరీక్షా ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లారు.దేశంలో వైద్యవిద్య ప్రవేశాల భవిష్యత్ను నిర్ణయించే నీట్–యూజీ 2026 రీ ఎగ్జామ్ ఇవాళ (ఆదివారం) ప్రారంభమైంది. గత నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్ష.. పేపర్ లీక్, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు నీట్ రీఎగ్జామ్ నిర్వహిస్తోంది. తెలంగాణలో సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
‘చాలా చెప్పాలి..కానీ లాభం లేదు’ అంటూ ఆత్మహత్య, ఫేస్బుక్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్లో ఒక 19 ఏళ్ల యువకుడు నివాస భవనం పైనుంచి కిందపడి మరణించిన ఘటన విషాదాన్ని నింపింది. కిందపడిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది.అశోక్ విహార్ ఫేజ్-2లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్లో ఈ ఘటన జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారంబాధితుడిన అనురాగ్గా గుర్తించారు. ఆజాద్పూర్లోని లాలా బాగ్ నివాసి అయిన అనురాగ్ తండ్రి రాజా రామ్, ఢిల్లీ హోమ్ గార్డ్లో పనిచేస్తున్నారు. ఏమైందో తెలియద గానీ శుక్రవారం సాయంత్రం 4:45 గంటల సమయంలో ఒక యువకుడు భవనంపైనుచి దూకేశాడనే సమాచారం అశోక్ విహార్ పోలీస్ స్టేషన్కు తెలిసింది. వెంటనే బాధితుడిని దీప్ చంద్ బంధు ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. కేసు తీవ్రత దృష్ట్యా, ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాలను సేకరించడానికి క్రైమ్ టీమ్ను కూడా పిలిపించారు.పోస్ట్మార్టం , తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం మృతదేహాన్ని బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ (BJRM) ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.ఫేస్బుక్ వీడియోదర్యాప్తులో భాగంగా ఘటనకు కొద్దిసేపటి ముందు అనురాగ్ తన ఫేస్బుక్ ఖాతాలో ఒక వీడియోను అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. "ఇది నా మొదటి వీడియో చివరిdr కూడా. నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే వాందరికీ సారీ. అలాగే నా వల్ల తమ జీవితాలు సరిగ్గా సాగడం లేదని భావించే వారికి క్షమాపణలు. చాలామందితో చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ దానివల్ల మారేదేమీ లేదు" అని వీడియోలో పేర్కొన్నాడు.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఆత్మహత్య కేసు కావచ్చునని తెలుస్తోంది. అయితే, ఏదైనా కుట్ర లేదా ఇతర కారణాల కోణంతో సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులు ఇంకా తెలియరాలేదని, పోస్ట్మార్టం నివేదిక, తదుపరి దర్యాప్తు తర్వాత మరణానికి గల కారణంపై స్పష్టత వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే! -
ఢిల్లీలో సీజేపీ నిరసనలు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ధర్నాకి దిగింది. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహించాలని, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరసనల్లో పాల్గొంటూ, కేంద్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీక్, సీబీఎస్సీ మూల్యాంకన వివాదాలు, నియామక పరీక్షల్లో అవకతవకలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీజేపీ నిరసనల సందర్భంగా భారీ ఎత్తున నిరుద్యోగులు అక్కడికి చేరుకున్నారు. 20 जून को कॉकरोचो के सरदार ने जंतर मंतर के रंगारंग कार्यक्रम के लिए चम्मच और थाली लाने के लिए कहा है ताकि आते जाते राहगीर अपने घर का बासी खाना इनके थाली में डाल जाए और यह चम्मच चाट कर खाएं pic.twitter.com/GFTHnG1xVo— Kikki Singh (@singh_kikki) June 19, 2026ఇదిలా ఉండగా.. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందిన కాక్రోచ్ జనతా పార్టీ, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా మారింది. జూన్ 6న ఢిల్లీలో నిర్వహించిన తొలి భారీ నిరసనకు వందలాది మంది విద్యార్థులు, యువత హాజరయ్యారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. సీజేపీ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసి, పరీక్షల అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న విద్య, ఉద్యోగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకున్న సీజేపీ ఉద్యమం రాబోయే రోజుల్లో మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
మళ్లీ నిర్లక్ష్యం?.. నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్
నీట్ రీటెస్ట్కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థికి ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన అభ్యర్థి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోగా.. పరీక్షా కేంద్రం ఏకంగా యూఏఈలోని అబుదాబిగా కనిపించింది. పాస్పోర్టే లేని విద్యార్థికి విదేశంలో పరీక్షా కేంద్రం కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..రేపు(జూన్ 21న) జరగనున్న రీ-నీట్ యూజీ 2026 పరీక్ష కోసం నాగ్పూర్కు చెందిన అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకున్నాడు. అయితే అందులో పరీక్షా కేంద్రంగా భారత్లోని నగరం కాకుండా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబుదాబిలోని ఓ భారతీయ పాఠశాల పేరు కనిపించింది. నాగ్పూర్ నుంచి దరఖాస్తు చేసుకున్న తాను విదేశీ పరీక్షా కేంద్రం ఎలా పొందానని విద్యార్థి, అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.పాస్పోర్టే లేదు.. పరీక్ష ఎలా?..ఈ ఘటనలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అబ్దుల్లా వద్ద పాస్పోర్టు కూడా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అబుదాబికి వెళ్లి పరీక్ష రాయడం అసాధ్యమని పేర్కొన్నారు. అడ్మిట్ కార్డులోని వివరాల స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం మరింత చర్చనీయాంశమైంది.ఎన్టీఏ స్పందనఈ విషయాన్ని విద్యార్థి కుటుంబ సభ్యులు వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఇది టెక్నికల్ గ్లిచ్ (సాంకేతిక లోపం) కారణంగా జరిగిందని అంగీకరించినట్లు సమాచారం. అలాగే తప్పును సరిదిద్ది, సరైన పరీక్షా కేంద్రంతో కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఏ నుంచి ఈ-మెయిల్ కూడా వచ్చినట్లు వెల్లడించారు.ఇదేకాదు.. రేపటి రీటెస్ట్ నేపథ్యంలో ఎన్టీఏ నిర్లక్ష్యం బయటపడుతోంది. హాల్ టికెట్స్, ఎగ్జామ్ టైమింగ్.. సెంటర్లలో గందరగోళం నెలకొంది. మరో విద్యార్థికి సాయంత్రం 4గం.ఎగ్జామ్ అని సమాచారం. అయితే కంగారుపడక్కర్లేదంటూ ఆయా విద్యార్థులకు ఎన్టీఏ సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. #UPDATE | Responding to reports of a Nagpur student being allotted an Abu Dhabi examination centre for the NEET UG 2026 re-exam, NTA DG Abhishek Singh tells ANI that the issue has been resolved and the “candidate has now been allotted a centre in Nagpur.”(File photo) https://t.co/dvlYNBdYPN pic.twitter.com/Q6S5l8g1SL— ANI (@ANI) June 20, 2026నీట్ యూజీ పరీక్ష కోసం విదేశాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఉంటాయి. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, NRIలు, OCI అభ్యర్థుల కోసం ఎన్టీఏ కొన్ని అంతర్జాతీయ నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. గత కొన్నేళ్లుగా అబుదాబి, దుబాయ్, దోహా, కువైట్ సిటీ, మస్కట్, మనామా, రియాద్, షార్జా, సింగపూర్, కౌలాలంపూర్ వంటి నగరాల్లో NEET పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.నాగ్పూర్లో దరఖాస్తు చేసిన విద్యార్థికి పొరపాటున అబుదాబి కేంద్రం కేటాయించడమే ఈ వివాదానికి కారణమైంది.జూన్ 21న రీ-నీట్పేపర్ లీకేజీ నేపథ్యంలో రద్దైన నీట్ పరీక్షను.. రేపు మధ్యాహ్నాం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పెన్-అండ్-పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రం తదితర అంశాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఎన్టీఏ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మాక్డ్రిల్ కూడా నిర్వహించబోతోంది. -
పసిడి ధరల పతనం.. ఒకే రోజులో భారీ తగ్గుదల!
గురువారం ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి భారీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో గోల్డ్ రేటు ఒక్కసారిగా పతనమైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,500 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర, సాయంత్రానికి 1450 రూపాయలు తగ్గి, రూ.1,37,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,51,100 నుంచి 1590 రూపాయలు తగ్గి రూ.1,49,510 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేటు 1,38,650 రూపాయల నుంచి 1,37,200 రూపాయల (రూ.1,450 తగ్గింది) వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 1,51,250 రూపాయల నుంచి 1,49,660 రూపాయల (రూ.1590 తగ్గింది) వద్దకు చేరింది.చెన్నైలో ఈ రోజు (జూన్ 18) స్వల్పంగా తగ్గిన బంగారం రేటు, సాయంత్రానికి మరింత తగ్గింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,40,600 వద్ద నుంచి రూ.1,39,500 వద్దకు (రూ.1100 తగ్గింది) చేరింది. 24 క్యారెట్ల రేటు 1,53,380 రూపాయల నుంచి 1,52,180 రూపాయలకు (రూ.1200 తగ్గింది) చేరింది. -
ఎస్ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యాడు!
ప్రభుత్వం ఉద్యోగం, అదీ ఎస్ఐ ఉద్యోగం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఢిల్లీ పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాన్ని వదిలేసి, ఆస్ట్రేలియా వలస వెళ్లి అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా సెటిల్ అయ్యాడు. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. నిశాంత్ తోమర్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్న స్ఫూర్తిదాయక ప్రయాణ వివరాలేంటో తెలుసుకుదాం.నిశాంత్ తోమర్ భారతదేశంలోఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. అది ఆయనకి తృప్తి నివ్వలేదు. రిస్క్ తీసుకుంటే తప్పజీవితంలో ఏమీ సాధించలేననున్నారు. అంతే జీవితాన్ని మలుపు తీప్పే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ఏంటి ఈ నిర్ణయం పిచ్చా అని అందరూ ఖండించారు. అయినా సరే తన మనసు మాటే విన్నారు. 2023లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆస్ట్రేలియా విమానం ఎక్కేశారు. (రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!)అక్కడ భవిష్యత్తుపై ఎలాంటి గ్యారంటీ లేదు. అయినా రిస్క్ చేశారు. జీరో నుంచే జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ పయనంలో ఎన్నో కష్టనష్టాలు తప్పలేదు. ఒక గౌరవప్రదమైన హోదా ఉన్న ఉద్యోగం నుంచి విదేశాలలో ఎంట్రీ-లెవెల్ జాబ్స్ చేయడం, తన సొంతవాళ్లకు దూరంగా కొత్త వాతావరణం, ఒంటరితనం ఇలాంటి ఎన్నో మానసిక, సామాజిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నిఅడ్డంకులను అధిగమించి ఆస్ట్రేలియాలో సొంత ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా, ప్రస్తుతం అక్కడ ఒక విజయవంతమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారారు. అంతేకాదు ఆస్ట్రేలియాలో వారి మొదటి సొంత ఇంటి కలని సాకారం చేసుకోవాలనుకునే వారు నిశాంత్ను సంప్రదిస్తున్నారు. ఆయన సాయంతో తమ డ్రీమ్ హౌస్ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం.అంత ఈజీగా కాలం కలిసి రాలేదు. అవకాశాలను అందుపుచ్చుకోవడం, కొత్త ప్రదేశానికి అనుగుణంగా తనను తాను మార్చు కోవడం, కష్టాలొచ్చాయని కుంగిపోకుండా, వెనకడుగు వేయకుండా ముంకు సాగడం వల్లే ఇది సాధ్యమైంది అంటారు నిశాంత్. కొన్నిసార్లు మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టే నిర్ణయాల నుండే జీవితంలో అతిపెద్ద అవకాశాలొస్తాయి అని విదేశాల్లో కరియర్ వెతుక్కునే వారికి సలహా ఇస్తారు. View this post on Instagram A post shared by Nishant Tomar Realtor (@nishant.in.australia) నిశాంత్ చేసిన వీడియో నెట్టింట పలువుర్ని ఆకర్షిస్తోంది.విదేశాల్లో స్థిరపడాలని కలలుకుంటున్న ఎంతో మంది భారతీయులకు ఈ కథ బాగా కనెక్ట్ అయింది. నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ, "ఆస్ట్రేలియా వెళ్లాక రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి ఎలాంటి కోర్సులు లేదా ఉద్యోగాలు చేశారు?" అని కామెంట్ల రూపంలో ఆసక్తిగా అడుగుతున్నారు. ఈ వీడియోకి వేలాది లైక్స్ వ్యూస్ వచ్చాయి.ఇదీ చదవండి : అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్ డ్రైవర్గా ఇపుడు లక్ష -
రూ .1,260 కోట్లకు బంగ్లాను అమ్మేసిన మీడియా అధినేత
మీడియా రంగ దిగ్గజం, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ఢిల్లీలోని ప్రతిష్టాత్మక లుటియన్స్ బంగ్లా జోన్ (LBZ)లో ఉన్న తన విలాసవంతమైన బంగ్లాను రూ.1,260 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఈ లావాదేవీ ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అత్యంత విలువైన నివాస ఆస్తి ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది.భగవాన్ దాస్ రోడ్లో కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్ సమీపంలో ఉన్న దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆస్తిని ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ వ్యాపార కుటుంబం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కొనుగోలుదారుడి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. డీల్కు సంబంధించిన తుది ప్రక్రియలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుభాష్ చంద్ర ఈ బంగ్లాను 2015లో సుమారు రూ.304 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు రూ.1,260 కోట్లకు విక్రయించడం ద్వారా దాదాపు పదేళ్లలో ఆస్తి విలువ నాలుగు రెట్లకు పైగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.లుటియన్స్ ఢిల్లీ దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నివాస ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్ రూపకల్పన చేసిన ఈ ప్రాంతంలో సుమారు 3,000 బంగ్లాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, విదేశీ దౌత్యవేత్తలు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు నివసించే ఈ ప్రాంతంలో భూమి లభ్యత చాలా పరిమితంగా ఉండటంతో ఆస్తుల ధరలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.కోవిడ్ అనంతరం ఢిల్లీ లుటియన్స్ జోన్లో, గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్ పరిసరాల్లో భారీ విలువ కలిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందాలు పెరిగాయి. ఇటీవలే భగవాన్ దాస్ రోడ్లోని మరో 3.2 ఎకరాల రాజభవనం సుమారు రూ.1,000 కోట్లకు విక్రయమయ్యే దశకు చేరడం, అలాగే లుటియన్స్ ప్రాంతంలోని ఇతర చారిత్రక బంగ్లాలు కూడా వెయ్యి కోట్లకు పైగా ధరలు పలకడం ఈ మార్కెట్లో డిమాండ్ ఎంత బలంగా ఉందో చూపిస్తోంది. -
‘వాళ్లంతా పరాన్నజీవులు..’
ఢిల్లీ: సైబర్ మోసాలపై కఠినంగా ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సైబర్ నేరగాళ్లు అమాయక ఇన్వెస్టర్లను మోసగించి.. కోట్లు దోచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. సైబర్ నేరగాళ్లను పరాన్నజీవులుగా అభివర్ణించింది. వాళ్లు పరాన్నజీవులు.. కఠినమైన చట్టం తెవాలంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.సైబర్ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. ఇవాళ (బుధవారం) సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు.. వారు అమాయక పౌరుల నుండి భారీ మొత్తంలో డబ్బును మోసం చేస్తున్నారు. అలాంటి నిందితులను జైల్లో ఉంచడం వల్లే సమాజానికి మేలు జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది.భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పుపై సీజేఐ వ్యాఖ్యానిస్తూ.. ‘‘మీరంతా పరాన్నజీవులు. ప్రజల నుండి డబ్బు తీసుకుని వారిని ముంచుతున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల మనం కఠినంగా ఉండాలి. మిమ్మల్ని జైల్లో ఉంచడమే సమాజ హితం. గుజరాత్లో ఒకరి దగ్గర, ముంబైలో మరొకరి దగ్గర.. ఇలా డబ్బులు వసూలు చేస్తారు. గత ఏడాది చివరి నాటికి భారతీయులు డిజిటల్ మోసాల వల్ల రూ.3వేల కోట్లకు పైగా నష్టపోయారని.. దీన్నిబట్టి దేశంలో సైబర్ నేరాల తీవ్రత ఏంటో తెలుస్తుందని సీజేఐ వ్యాఖ్యానించారు. -
షిండేకు షాక్.. ఢిల్లీ ప్లాన్ ఫెయిల్!
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. శివసేన (ఉద్ధవ్ బలాసాహెబ్ ఠాక్రే) వర్గంలో తిరుగుబాటు ఊహాగానాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలు ఒక్కసారిగా ఢిల్లీ కేంద్రంగా కీలక మలుపు తిరుగుతాయని అంతా భావించారు. ఈ తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కీలకంగా భావించిన రాజకీయ భేటీ చివరి నిమిషంలో రద్దు కావడం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. దీంతో షిండే వర్గం వ్యూహానికి ఉద్ధవ్ శిబిరం చెక్ పెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.శివసేన (యూబీటీ)కి చెందిన కొంతమంది లోక్సభ ఎంపీలు ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరతారనే ప్రచారం కొంతకాలంగా కొనసాగుతోంది. “ఆపరేషన్ టైగర్”లో భాగంగా ఉద్ధవ్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆరుగురు ఎంపీలు విలీనం అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్టీ విభజనకు అవసరమైన రెండు మూడవ వంతు మెజారిటీకి ఈ సంఖ్య దగ్గరగా ఉండటంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 19న శివసేన ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి.ఈ నేపథ్యంలో ఢిల్లీలో శ్రికాంత్ షిండే నివాసంలో బుధవారం జరగాల్సిన కీలక భేటీ చివరి క్షణంలో రద్దు కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి ముందు ఎంపీలు లోక్సభ స్పీకర్కు విలీనంపై లేఖ సమర్పిస్తారని లీకులు అందాయి. అలాగే భేటీకి ఏక్నాథ్ షిండే కూడా ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో.. అనూహ్యంగా మొత్తం ప్లాన్ నిలిచిపోయింది. మరోవైపు ఉద్ధవ్ శిబిరం ముందస్తుగా అప్రమత్తమైంది. పార్టీ ఎంపీలకు విప్ జారీ చేస్తూ ఢిల్లీలో జరిగే పార్టీ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే అనర్హత వేటు తప్పదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.ఉద్ధవ్ శిబిరం తరఫున సంజయ్ రౌత్ మాట్లాడుతూ తిరుగుబాటు ప్రయత్నానికి అవసరమైన సంఖ్య ప్రత్యర్థి వర్గానికి లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇది ఒత్తిడి రాజకీయాల భాగమని, ఎంపీలను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు చేశారు. రూ.15 కోట్ల ఆఫర్ అంశం కూడా రాజకీయ వేడిని పెంచింది. మొత్తం 50 కోట్ల రూపాయలతో ఎంపీలకు ఎర వేస్తున్నారని.. అడ్వాన్స్గా 15 కోట్లు చెల్లించారని సంజయ్ రౌత్ ఆరోపించారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడే సమయంలో వెంట కేవలం ముగ్గురు ఎంపీలే ఉండడం గమనార్హం. అంతకు ముందు.. ఉద్ధవ్ ఠాక్రే కూడా ఈ పరిణామంపై స్పందించారు. 2022 శివసేన చీలిక సమయంలోనే పరిస్థితులను అర్థం చేసుకున్నానని, కానీ ఎవరిపైనా ఒత్తిడి చేయడం తన ఇష్టం లేదని అన్నారాయన. మరోవైపు పార్టీ నేతలు అనిల్ దేశాయ్, ఆదిత్య ఠాక్రే మాత్రం పార్టీ ఐక్యతపై నమ్మకం వ్యక్తం చేశారు.మొత్తం పరిస్థితిని చూస్తే ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ రాజకీయ డ్రామాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే కనిపిస్తున్నప్పటికీ, మహారాష్ట్ర రాజకీయాల్లో అస్థిరతపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్ సమీకరణాలను మళ్లీ మార్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ముస్సోరీలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి
ముస్సోరీ: ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోమ్స్టేలో ఢిల్లీకి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పి.రాధా గాయత్రి(27)గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె గురుగ్రామ్లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తూ.. ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్లో నివసిస్తున్నారు. ఆమె తన భర్త సౌమ్య శ్రీచరణ్తో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆయన కూడా పూణేలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రి, ఆమె భర్త జూన్ 13న ఢిల్లీ నుండి రిషికేష్కు ప్రయాణమై.. మరుసటి రోజు (జూన్ 14) అర్ధరాత్రి దాటిన తర్వాత టిప్రి ధార్లోని 'కియానా హోమ్స్టే'కు చేరుకున్నారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో వారు 'బ్లిస్' అనే పేరున్న గదిలోకి చెక్-ఇన్ అయ్యారు. భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రాత్రి వారిద్దరూ మద్యం సేవించి.. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయారు. ఉదయం ఆయన నిద్ర లేచేసరికి.. భర్తకు తన భార్య దుస్తులు లేకుండా.. స్పృహ లేకుండా నేలపై పడి ఉండటం కనిపించింది. ఆమె చుట్టూ మూత్రం, ముక్కు నుండి రక్తం కారుతూ ఉందని తెలిపాడు.రూమ్లో ఓ మహిళ స్పృహ లేకుండా పడి ఉందనే సమాచారం సోమవారం ఉదయం ముస్సోరీ పోలీసులకు అందడంతో వారు 108 అంబులెన్స్తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్కు చెందిన ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి.. ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. వీరికి 2025 నవంబర్ 8న వివాహం జరిగింది. గాయత్రి, శ్రీచరణ్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష నిమిత్తం డెహ్రాడూన్లోని ఆసుపత్రికి తరలించారు. -
నీట్ ఎగ్జామ్.. భారత్లో టెలిగ్రామ్పై బ్యాన్!
ఢిల్లీ: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న నీట్ రీఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేదం విధించింది. జూన్ 22వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ నిషేదించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్లోని ఎడిట్ ఆఫ్షన్ తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఈ పరీక్ష కోసం ఇదివరకే నీట్ కీలక వెసులుబాట్లు కల్పించింది. నీట్ రీటెస్ట్కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్లెట్లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. గతంలో నీట్ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది. పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి మోసాలకు తావు లేకుండా కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రశ్నాపత్రాల తరలింపుకు విమానాలను వాడింది. ఒక పరీక్ష పత్రాలకోసం విమాన సేవలను వినియోగించుకోవడం దేశంలోనే ఇది తొలిసారి.ఎగ్జామ్ రద్దునీట్ ఎగ్జామ్ మే 3న జరగాల్సి ఉండగా, అంతకంటే ముందే పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు.ఈ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో, మే 12న ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.పేపర్ లీక్ బయటపడిందిలారాజస్తాన్లోని జామ్వా రామ్గఢ్కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్ సోదరులు ఏప్రిల్ 26న గురుగ్రామ్లోని ఓ డాక్టర్ నుంచి రూ.30 లక్షలకు నీట్ పేపర్ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తి సికార్ టౌన్లో నీట్కు సిద్ధమవుతున్న తన కుమారుడికి పేపర్ను చేరవేశాడు. సోదరులిద్దరూ ఏప్రిల్ 29న మరికొందరికి ఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించి, సొమ్ము చేసుకున్నారు. జామ్వా రామ్గఢ్ నుంచే పేపర్ సికార్లోని ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేశ్ కుమార్కు చేరింది.అతడు ఈ పేపర్ను రూ.30,000కు కేరళలోని ఎంబీబీఎస్ విద్యార్థికి విక్రయించాడు. తర్వాత ఆ విద్యార్థి సికార్లో హాస్టల్ను నిర్వహిస్తున్న తన తండ్రికి ఇంటర్నెట్ ద్వారా చేరవేశాడు. ఆ తండ్రి ద్వారానే ఈ మొత్తం లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. రాకేశ్ కుమార్ ఈ పేపర్ను 700 మంది నీట్ అభ్యర్థులకు విక్రయించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
అమృతం బదులు విషం.. ఆయనో 'పెద్ద జోక్'!
ఒకప్పుడు కలిసి ఎన్నికలు పోరాడిన మిత్రపక్షాలు.. ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ప్రతిపక్ష ఐక్యతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపుతుండగా.. మాజీ మిత్రపక్షం డీఎంకే ఊహించని స్థాయిలో ఎదురుదాడికి దిగింది. అలాంటి పాఠాలు చెప్పే హక్కు అసలు రాహుల్కు ఉందా?" అంటూ ప్రశ్నించిన డీఎంకే.. 'ఇండియా' కూటమిలో ఏర్పడిన విభేదాలకు కాంగ్రెస్నే బాధ్యురాలిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.డీఎంకే-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. రాహుల్ గాంధీపై ఆ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇటు డీఎంకే సోషల్ మీడియా విభాగం.. అటు అధికార పత్రిక మురసొలిలో వచ్చిన సంపాదకీయం కాంగ్రెస్ అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసింది. రాజకీయంగా బలహీన స్థితిలో ఉన్నప్పుడు తమ పార్టీ కాంగ్రెస్కు అండగా నిలిచిందని, కానీ అవకాశం దొరకగానే కాంగ్రెస్ తమను వదిలేసిందని డీఎంకే సోషల్ మీడియా పేజీలు వరుస పోస్టులు పెడుతున్నాయి. అంతేకాకుండా రాహుల్ గాంధీని "పెద్ద జోక్.. రాజకీయ అపరిపక్వుడు"గా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేసింది.ఇక డీఎంకే అధికార పత్రిక మురసొలి సంపాదకీయంలో ఆ డోస్ మరింత ఎక్కువే కనిపించింది. ఇటీవల ఇండియా కూటమి సమావేశం అనంతరం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష ఐక్యత గురించి మాట్లాడే ముందు వివిధ రాష్ట్రాల్లో ఆ ఐక్యతను దెబ్బతీసింది ఎవరో ఆలోచించాలని సూచించింది. ముఖ్యంగా కేరళలో వామపక్షాలపై కాంగ్రెస్ వైఖరిని ప్రస్తావిస్తూ.. అక్కడి నేతలు గతంలో రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేసింది. అలాగే.. తమిళనాడులో ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలను కూడా డీఎంకే ప్రస్తావించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్.. అనంతరం ఆ కూటమి నుంచి బయటకు వచ్చి నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో భాగస్వామి కావడాన్ని డీఎంకే "ద్రోహం"గా అభివర్ణించింది. ఈ నిర్ణయానికి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా ఆమోదం తెలిపిందని ఆరోపించింది. అలాగే ప్రస్తుతం ఇండియా కూటమిలో ఏర్పడుతున్న విభేదాలకు బీజేపీ కంటే కాంగ్రెస్ వైఖరే ఎక్కువ కారణమని మురసొలి సంపాదకీయం పేర్కొంది. రాహుల్ గాంధీ రాజకీయ పరిపక్వత లోపం, స్థిరమైన వ్యూహం లేకపోవడమే ప్రతిపక్ష శిబిరంలో అసంతృప్తికి దారితీస్తోందని డీఎంకే విమర్శించింది. ప్రతిపక్ష కూటమిలో అమృతం బదులు విషం కలిపింది ఎవరు? అంటూ ఆ వ్యాసాన్ని ముగించింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ వర్గాలు ఖండించాయి. తమిళనాడులో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే విధంగానే పార్టీ నిర్ణయాలు తీసుకుందని, డీఎంకేను గానీ, ఇండియా కూటమిని గానీ బలహీనపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాయి.ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కలిసిన మిత్రపక్షాలు ఇప్పుడు పరస్పరం విమర్శలు చేసుకోవడం.. ఇండియా కూటమి భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను తెరపైకి తెస్తోంది. ప్రస్తుతం డీఎంకే-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ఎంత దూరం వెళ్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారుకు షాక్.. ఇచ్చి పడేసిన భారత్
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్కు దిల్లీ విమానాశ్రయంలో ఉహించని ఘటన ఎదురైంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను రెండు గంటలకు పైగా తనిఖీకోసం ఎదురు చూసేలా చేశారు. దీంతో ఆగ్రహం చెందిన రెహమాన్ ఢిల్లీ విమానాశ్రయంలో నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏం జరిగింది?ఐఓఆర్ఏ (ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్) సీనియర్ అధికారుల కమిటీ 28వ సమావేశంలో పాల్గొనేందుకు జహీద్ ఉర్ రెహమాన్ ఆదివారం (జూన్ 14, 2026) ఎయిర్ ఇండియా విమానంలో దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్ కథనాల ప్రకారం "మొదట ఇమిగ్రేషన్ అధికారులు ఎటువంటి కారణం చెప్పకుండా ఆయన్ను ఆపేశారు. కారణం అడిగినప్పుడు, అంతా బానే ఉందని, కొన్ని వివరాలు సరిచూస్తున్నామని చెప్పారు. వారి ప్రవర్తన, విచారించిన తీరు కనీస మర్యాద లేకుండా సాగింది. ఒక రాష్ట్ర మంత్రి హోదా ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకుండా, సాధారణ ప్రయాణికులతో పాటు సోఫాలో కూర్చోబెట్టారు. రెండు గంటల నిరీక్షణ తర్వాత క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు. కానీ, అప్పటికే నిరాశకు గురైన రెహమాన్ వెనక్కి వెళ్లడానికే మొగ్గు చూపారు." అని ఢాకా పేర్కొంది.అయితే ఈ అంశంపై దౌత్యపరమైన దుమారం చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలూర్ రెహమాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది "విచారకరం" అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై నిరసనగా ఢాకాలోని భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పవన్ బాథేను బంగ్లాదేశ్ ప్రభుత్వం సమన్లు జారీ చేసి వివరణ కోరినట్లు తెలుస్తోంది.భారత్ స్పందన ఏంటి?భారత అధికారులు మాత్రం ఈ చర్యను సమర్థించుకున్నారు. జహీద్ ఉర్ రెహమాన్కు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని, గత కొన్నేళ్లుగా భారత్కు వ్యతిరేకంగా, అలాగే బంగ్లాదేశ్ విషయంలో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారని అధికారులు గుర్తుచేశారు.జాహెద్ ఉర్ రెహమాన్ గతంలో పలుమార్లు భారత్ను కించపరుస్తూ వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఫాసిస్ట్ అని పిలవడంతో పాటు భారత్ హిందూ కార్డు వాడుతోందనే ఆరోపణలు చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలుమార్లు భారత్ను కించపరుస్తూ మాట్లాడారు. భారత్ బంగ్లాదేశ్ను అస్థిరపరచాలని చూస్తోందని, బంగ్లాదేశ్లోని తమ ప్రాజెక్టుల నుండి అదానీ గ్రూప్కు వచ్చే లాభాలు బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వెళ్తున్నాయని కూడా అతను ఆరోపించారు. ఈ చర్యలతో అతని పేరును గతంలోనే ఇమ్మిగ్రేషన్ వాచ్లిస్ట్లో చేర్చామని పేర్కొన్నారు. -
నాడు ఒక్కపూట భోజనం కోసం అల్లాడి.. నేడు అందరూ మెచ్చే చెఫ్గా!
జీవితం ఎప్పుడు అందరికీ ఒకేలాంటి కష్టాలు, సవాళ్లను ఇవ్వదు. ఒక్కోక్కరిది ఒక్కో కన్నీటి గాథ. కొందరికి పెద్దయ్యాక కష్టాలు వెంటాడితే మరికొందరికి పుట్టుకతో కష్టాలు వెంటాడతాయి. అంతేగాదు ఆ దుర్భరమైన జీవితం సాగించలేక కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయ్. అయినా తట్టుకుని నిలబడిన వాడికే మంచిజీవితం లభిస్తుంది, గొప్ప స్థాయికి చేరుకుంటారు అనేందుకు ఈ ఢిల్లీ మహిళ కథే ఉదాహరణ. ఈమె కథ వింటే 'బిచ్చగాడు' మూవీలోని ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడంజానెడంత ఊపిరి కోసం చెయ్యి చాచడంకడుపు కాలి కాలి ఇక్కడ బూడిద అవుతున్నమనిషి అన్న వాడికి మనసే లేకపోయెనన్నా అన్న పాట గుర్తొస్తుంది. మరి ఆమె పడ్డ కష్టాలు..ఎలా వాటిని అధిగమించి ఉన్నతస్థాయి చేరుకుందో సవివరంగా చూద్దామా.!.ఆ మహిళే లిలీమా ఖాన్. ఢిల్లీలోని తైమూర్ నగర్కు చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమెకు ముగ్గురు తోబుట్టువులు ఒక సోదరుడు. తల్లిదండ్రులు కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడేవారు. అయినప్పటికీ..మూడేళ్ల వయసున్న లిలీమా తన తండ్రి ఇరుగుపొరుగు వారి కోసం ప్రేమగా వండే కిచిడీ, రోటీ వంటి సాదాసీదా భోజనం వండటం చూసేది. అలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితం ఆకస్మికంగా కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. మొదట 2001లో, లిలీమాకు కేవలం ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి కన్నుమూశారు. ఆరు నెలల తర్వాత, ఆమె తల్లి క్షయ వ్యాధితో మరణించింది. ఆ తర్వాత తన కళ్లముందే అక్క వైవాహిక సమస్యలతో మరణించడం చూసింది. ఈ వరుస కష్టాలు ఆమెను కుంగదీస్తుంటే..మరోవైపు సోదరుడు డ్రగ్స్కి బానిసై దొంగతనాలకు అలవాటుపడటంతో జైలుపాలయ్యాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో అనాథగా మారిపోయింది లిలీమా. అయితే ఆమె అత్త తన తమ్ముడిని చేరదీసింది గానీ ఆమెను మాత్రం దగ్గరకు తీసుకోలేదు. దాంతో అనాధగా మిగిలిన లిలీమాను తైమూర్ నగర్ మురికివాడలకు చెందిన ఒక మహిళ ఆశ్రయం ఇచ్చినా..ఒక పూట భోజనం కోసంతెల్లవారుజామున ఫ్రెండ్స్ కాలనీ వీధుల్లో చెత్త ఏరడానికి ఇతర పిల్లల తోపాటు పంపేది. అక్కడ మాల్స్, మెక్డొనాల్డ్స్ వంటి ప్రాంతాల్లో చెత్తబుట్టల్లో వెతుకుతూ, మిగిలిపోయిన చికెన్ లేదా మటన్ ఎముకలు, సగం తిన్న బర్గర్లను తింటూ గడిపేది. అలా కష్టాలు పడుతున్న లిలీమాను 11 ఏళ్ల వయసులో ఒక స్వచ్ఛంద సంస్థ (NGO) సహాయం అందించి, చదువు చెప్పించడంతో ఆమె పరిస్థితి మెరుగవ్వడం ప్రారంభమైంది. అయితే కొద్దికాలానికే తిరిగి వచ్చి..తన అత్త, తమ్ముడి వద్దకు వచ్చి..అక్కడే ఉండేందుకు ఇష్టపడింది. అయితే లిలీమా అత్త ఆమెను అక్కడ షుఫ్యాక్టరీలో పనికి పెట్టింది. ఆ వ్యక్తి రాకతో చిగురించిన జీవితం..సరిగా పనిచేయకపోతే అత్త చేతిలో దెబ్బలు తింటూ మళ్లీ కష్టాల కడలిలో చిక్కుకుంది. ఆ తర్వాత ఎన్జీవో కార్యకర్త హర్ష్ మందర్ను సంప్రదించింది. ఆయన కాశ్మీరీ గేట్లోని బాలికల అనాథాశ్రమమైన కిల్కారి రెయిన్బో హోమ్లో చేరడానికి సహాయం చేశారు. అక్కడే ఉన్న సమయంలో లిలీమాకు వంటపై ఆసక్తి కలిగింది. అయితే 2015లో, అనాథాశ్రమానికి తరచుగా వచ్చే ఒక సందర్శకుడు లిలీమా వంట నైపుణ్యాలను గమనించి, ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లో ఆమెకు ఉద్యోగం ఇప్పించారు. అక్కడ సిబ్బందికి భోజనం తయారుచేయడమే లిలీమా ఉద్యోగం. అందుకు రూ. 7000లు జీతం ఇచ్చేవారు. అలా తన వంట నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలనే ఉద్దేశ్యంతో అక్కడుండే హెడ్ చెఫ్ వద్ద మ్యాష్డ్ పొటాటోస్ తయారుచేయడం, బర్గర్లు, సలాడ్లను చేయడం వంటి ప్రాథమిక విషయాలను నేర్చుకుంది. 2019లో, లిలీమా 'డియర్ డోనా'లో చెఫ్ డి పార్టీగా చేరి, ఒక్క ఏడాదిలోనే సూస్ చెఫ్గా పదోన్నతి పొందింది. ఇవాళ ఆమె 35 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె తయారు చేసే ప్రత్యేక వంటకాల్లో రిసోటో, రావియోలీ, సాల్మన్ గ్రావ్లాక్స్, రౌలేడ్, బీఫ్ వెల్లింగ్టన్ తదితరాలు ఉన్నాయి. తన అభిరుచినే బలంగా మార్చుకుని ముందుకు సాగి జీవితాన్ని అందంగా మలుచుకుంది. మన నైపుణ్యం, ఆసక్తులే మనల్ని మందుకు నడిపించే ఆస్తులనే లిలీమా కథ చెప్పకనే చెబుతోంది కదూ..!.(చదవండి: పాతికేళ్ల 'లగాన్' వేడుకలో..స్పెషల్ అట్రాక్షన్గా కరీనా కపూర్! ఏకంగా రూ. 1.3 లక్షల..) -
కావాలనే నిప్పుపెట్టిన బాలిక.. 5 అంతస్తుల భవనం బూడిద
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో ఇటీవల ఐదు అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం కాదని, వ్యక్తిగత కక్షతో ఉద్దేశపూర్వకంగా పెట్టిన నిప్పేనని ఢిల్లీ పోలీసులు ఆదివారం తెలిపారు.తుగ్లకాబాద్లోని టీకేడీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఉన్న నివాస భవనంలో జూన్ 12న మంటలు చెలరేగాయి. తొలుత ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించారు. అయితే, తర్వాత పోలీసులు సేకరించిన ఆధారాలను విశ్లేషించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్టు తేలింది.మంటలు చెలరేగే ముందు ఓ మహిళ భవనంలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించడంతో వాటిని పరిశీలించిన తర్వాత భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.నిప్పు ఎందుకు అంటించింది? దర్యాప్తు సమయంలో గోవింద్పురిలోని నవజీవన్ క్యాంప్కు చెందిన 17 ఏళ్ల బాలికను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గోవింద్పురిలోని గిరినగర్ నివాసి సరిత (27) ప్రేరేపించడంతో తాను ఈ పని చేసినట్టు బాలిక ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.“5వ అంతస్తులో నివసించే దీపక్కు చెందిన స్కూటీకి నిప్పు పెట్టేందుకు సరిత పెట్రోల్, అగ్గిపెట్టె ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. డబ్బు వివాదం కారణంగానే ఇలా చేయాలని చెప్పిందని” ఢిల్లీ పోలీసులు తెలిపారు.తదుపరి దర్యాప్తులో నవజీవన్ క్యాంప్ వాసులు నిరంజన్ (33), అతని సోదరుడు రాజ్కుమార్ (27) సూచనల మేరకు సరిత వ్యవహరించినట్టు తేలింది. వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు ఈ ముగ్గురు కలిసి అగ్నిప్రమాదానికి కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు.నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యం మరణానికి కారణం కావడం, నిప్పుతో నష్టం కలిగించడం, రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించడం వంటి తీవ్రమైన అభియోగాలను కేసులో పోలీసులు చేర్చారు. బాలిక సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.కాగా, ఈ ఘటనపై శుక్రవారం ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ, “జూన్ 11-12 అర్ధరాత్రి దాటాక 2.24 గంటలకు గోవింద్పురి పోలీస్ స్టేషన్కు తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్లోని 5 అంతస్తుల నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్టు పీసీఆర్ కాల్ వచ్చింది. దట్టమైన పొగలో చిక్కుకున్న ఎనిమిది మందిని సహాయక బృందాలు బయటకు తీసి సఫ్దర్జంగ్ ఆసుపత్రి, ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించారు. 22 ఏళ్ల యువకుడు, ఇద్దరు మహిళలతో కలిపి ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది” అని తెలిపారు.అగ్నిమాపక విభాగ అధికారి యశ్వంత్ మీనా మాట్లాడుతూ, “భవనం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ప్రాంతంలో ఉన్న 3 స్కూటీలు, 2 బైకులు, ఓ సైకిల్లో మంటలు చెలరేగాయి. మంటలు, పొగ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 అంతస్తుల వరకూ వ్యాపించింది. గ్రౌండ్, ఒకటో, రెండో అంతస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి.మిగతా అంతస్తులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది డాబాపైకి చేరుకుని, డాబా గేటు తాళం కత్తిరించి భవనంలోకి ప్రవేశించారు. ఇద్దరు బాలికలను రక్షించి క్యాట్స్, పీసీఆర్ సిబ్బంది ద్వారా ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఎనిమిది మందిని రక్షించారు” అని చెప్పారు. -
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కల్కాజీ-గోవింద్ పురి ఫ్లైఓవర్ సమీపంలోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 5:15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి ఆరు ఫైర్ టెండర్లను తరలించి, మంటలను అదుపులోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.రెస్టారెంట్ పైఅంతస్తులో అగ్నికీలలుసౌత్ ఢిల్లీలోని దేశ్బంధు గుప్తా కాలేజీ సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్ కమ్ బ్యాంకెట్ హాల్లోని పై అంతస్తులో నిర్మించిన తాత్కాలిక నిర్మాణంలో ఈ మంటలు ప్రారంభమైనట్లు ఎస్డీఎం వేద్ ప్రకాష్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్ మూసివేసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాథమిక అంచనాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు, అయితే అసలు కారణాలపై పూర్తి విచారణ జరుపుతున్నారు.సురక్షితంగా బయటపడ్డ జనంఅగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి తృటిలో పెద్ద ప్రమాదాన్ని నివారించారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో రెస్టారెంట్ పక్కనే ఉన్న భవనం నుండి ఒక వృద్ధురాలిని సిబ్బంది రక్షించారు. అలాగే పక్క భవనాల్లో ఉన్న మిగతా నివాసితులందరినీ వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న 10-12 మంది సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.వెంటాడుతున్న అగ్ని ప్రమాదాలుకొద్దిరోజుల క్రితమే దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే కల్కాజీ వద్ద మరో ప్రమాదం జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ప్రస్తుతం ప్రమాద స్థలంలో అగ్నిమాపక బృందాలు ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తూ, ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతా చర్యలు చేపడుతున్నాయి. -
వాణిజ్య నౌకలపై అమెరికా వరుస దాడులు
సాక్షి, ఢిల్లీ: హర్ముజ్ జలసంధిలో 20 మంది భారతీయ నావికులతో వెళ్తున్న 'గినియా-బిస్సావు' పతాకం గల నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇటీవల భారత్కు చెందిన చమురు నౌకలపై అమెరికా తరచుగా దాడులు చేస్తోంది. ఒమన్ సమీపంలోని హర్మూజ్ సముద్ర జలాల్లో చమురు రవాణా నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పూర్తై రెండురోజులైన గడవక ముందే మరోసారి భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడులు చేసింది. దీంతో ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది..ఈ ఘటనను నిరసిస్తూ (శుక్రవారం) భారత్లోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి , అమెరికా రాయబారితో ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు బుధవారం నాడు 'పలావు' పతాకంగల MT సెట్టెబెల్లో నౌకపై జరిగిన దాడికి సంబంధించి కూడా జేసన్ మీక్స్ను MEA పిలిపించి మాట్లాడింది. మూడు రోజుల్లో అమెరికా దౌత్య కార్యాలయానికి సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి.భారతీయ నావికులే టార్గెట్గా జరుగుతున్న ఈ దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి సమీపంలో భారత నౌకాదళం అత్యున్నత నిఘాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. "వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు తక్షణమే ముగియాలి. అంతర్జాతీయ చట్టాలకు లోబడి అంతర్జాతీయ జలమార్గాలలో స్వేచ్ఛా వాణిజ్యం, నౌకల రాకపోకలను పునరుద్ధరించాలి. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల భారతీయ నావికులకు ముప్పు వాటిల్లడం తీవ్ర ఆందోళనకరం." అని తెలిపింది.కాగా ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో 18,000 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, క్షేమం, దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి
లక్నో నుంచి ఢిల్లీ వెళ్లే 'స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్' (Swarn Shatabdi Express) రైలుపై ఫిరోజాబాద్ సమీపంలో గురువారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైల్లో ఈ ఘటన జరగడంతో ఆందోళన రేగింది. అయితే ఈ ప్రమాదంలో మోహన్ భాగవత్ సురక్షితంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఏ జరిగిందంటే..గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ నుండి ఢిల్లీ వెళ్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెం. 12003) రాత్రి 7:20 గంటల ప్రాంతంలో మఖన్పూర్ స్టేషన్ను దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. కదులుతున్న రైలుపై రాయి పడటంతో E-1 కోచ్ కిటికీ అద్దం దెబ్బతింది. దీంతో రైల్వే అధికారులు ఉత్తరప్రదేశ్ ఫేరోజాబాద్ జిల్లాలోని తుండ్లా జంక్షన్ వద్ద వద్ద రైలును నిలిపివేశారు.మోహన్ భగవత్ టార్గెట్?అయితే రాయి తగిలిన కోచ్లోనే మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నట్లు GRP ఇన్స్పెక్టర్ షేర్ సింగ్ ధృవీకరించారు. కోచ్లోని అవతలి వైపు (ఆపోజిట్ సీట్లో) కూర్చోవడంతో ఆయనకు ఎలాంటి హాని జరగలేదు. అలాగే ఆయనతో పాటు, ఇతర ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నారని సింగ్ తెలిపారు. అధికారుల తనిఖీల అనంతరం రైలు తిరిగి ఢిల్లీకి బయలుదేరింది.ఘటనా స్థలానికి ఉన్నతాధికారులుఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఫిరోజాబాద్లోని ఘటనా స్థలాన్ని సందర్శించారు. రైలులో మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ఎస్ఎస్పీ ఆదిత్య లాంగే చెప్పారు. విచారణ నిమిత్తం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.గతంలోనూ రాళ్ల దాడులు ఫిరోజాబాద్ గుండా వెళ్లే ఈ రైల్వే ట్రాక్ పరిసరాల్లో గతంలోనూ పలుమార్లు రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గతంలో జరిగిన ఘటనలను, ప్రస్తుత కేసును పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని ఎస్ఎస్పీ లాంగే స్పష్టం చేశారు. -
ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఇంకా రహస్యమేనా?
న్యూఢిల్లీ: దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. అయితే ఈ ప్రమాదం ఎందుకు? ఎలా? జరిగిందనే కారణాలపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ తరుణంలో తాజాగా ఉన్నతాధికార వర్గాలు స్పందించాయి. మరో రెండు నెలలు ఒపిక పెడితే అన్ని విషయాలు బయటపెడతాయని కీలక ప్రకటన చేశాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ కొనసాగిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే తుది నివేదిక విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని, అనవసర ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని వర్గాలు సూచించాయి. అలాగే దర్యాప్తులోని ఏ అంశాన్నీ దాచిపెట్టబోమని, అన్ని వివరాలను ప్రజల ముందుకు తీసుకొస్తామని హామీ ఇచ్చాయి.ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలపై కూడా అధికారులు స్పందించారు. వాటిలో ప్రచారంలో ఉన్న కొన్ని అంశాలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన విమాన ఇంజిన్లను తయారు చేసిన జీఈ ఏరోస్పేస్ సంస్థ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికీ.. విచారణలో వెలుగుచూస్తున్న అంతర్గత అంశాల్లో మాత్రం జోక్యం చేసుకోవడం లేదని సమాచారం. తుది నివేదిక సిద్ధం చేసే ప్రక్రియపై మాత్రమే అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.తుది నివేదిక విడుదలకు ముందుగా ఒక మధ్యంతర స్థితిగతుల నివేదిక (స్టేటస్ రిపోర్ట్) విడుదల చేసే అవకాశాన్ని కూడా ఏఏఐబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనల ప్రకారం అలాంటి నివేదిక తప్పనిసరి కాదని అధికారులు గుర్తుచేస్తున్నారు.మరోవైపు.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కూడా దర్యాప్తు వేగంపై ప్రభావం చూపినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఈ దర్యాప్తుకు సంబంధించిన పలు అంతర్జాతీయ భాగస్వాములు, సాంకేతిక నిపుణులు, సంస్థలపై ఆ పరిస్థితుల ప్రభావం పడిందని, అందువల్ల జాప్యానికి దర్యాప్తు బృందాన్ని తప్పుబట్టడం సరికాదని అభిప్రాయపడ్డాయి.గత ఏడాది విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో మాత్రం కీలక విషయాన్ని వెల్లడించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే బోయింగ్ 787 విమానంలోని రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు దాదాపు ఒకేసారి "రన్(RUN)" స్థితి నుంచి "కటాఫ్(CUTOFF)" స్థితికి మారినట్లు గుర్తించారు. దీంతో రెండు ఇంజిన్లకూ ఇంధన సరఫరా నిలిచిపోయి ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తేల్చారు.అయితే ఆ స్విచ్లు ఎందుకు మారాయి? సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? లేదంటే మరేదైనా కారణమా? అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం తుది నివేదిక వచ్చిన తర్వాతే లభించనుంది. అందుకే ఇప్పుడు విమానయాన రంగం మాత్రమే కాదు.. దేశమంతా ఆ నివేదిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని మరో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు.తుగ్లకాబాద్లోని మాధ్యమ్ మార్గ్, నయా తారా అపార్ట్మెంట్ సమీపంలోని ఓ ఐదంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం లోపల పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.అర్ధరాత్రి 2.35 గంటల నుంచి 2.37 గంటల మధ్య అగ్నిమాపక శాఖకు ప్రమాదంపై సమాచారం అందింది. మూడు ఫైర్ టెండర్లు, రెండు వాటర్ బౌజర్లు, శ్వాస సహాయక యూనిట్, క్విక్ రెస్పాన్స్ వాహనాలను రంగంలోకి దించారు. అనంతరం పరిస్థితి తీవ్రత దృష్ట్యా అదనపు అగ్నిమాపక వాహనాలను కూడా పంపించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది గాయపడిన వారిని ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.Delhi: A fire broke out in a multi-storey building in Tughlakabad Extension during the early hours of the day. The blaze reportedly started in the ground-floor parking area, where 7–8 motorcycles and scooters caught fire, before spreading through the building. The fire department… pic.twitter.com/rHgTcXvG8T— IANS (@ians_india) June 12, 2026అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనం లోపల పార్క్ చేసిన వాహనాల వద్ద నుంచి మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం 3.45 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగా, నాలుగు గంటలకు అగ్నిమాపక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.ఇటీవలి కాలంలో ఢిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న భవన ప్రమాదాలు, అగ్నిప్రమాదాల నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. గత నెలలో మాలవీయనగర్లో మూడు అంతస్తుల వాణిజ్య భవనం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందగా, జూన్ 3న హౌజ్రాణిలోని ఐదు అంతస్తుల బిల్డింగ్లో జరిగిన అగ్నిప్రమాదంలో విదేశీయులతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో.. జూన్ 5 నుంచి 10 దాకా 607 ప్రదేశాలను అధికారులు తనిఖీ చేయగా, గురువారం ఒక్కరోజే మరో 47 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. దీంతో మొత్తం తనిఖీ చేసిన ప్రదేశాల సంఖ్య 654కు చేరింది. ఇదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు ఆరు భవనాలను సీజ్ చేసింది. అలాగే 61 షోకాజ్ నోటీసులు, 8 సీలింగ్ నోటీసులు, 16 కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 నుంచి 11 వరకు మొత్తం 179 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, 206 భవనాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు, అగ్నిమాపక నిబంధనల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రత్యేక తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ప్రధాని మోదీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కావాలని కోరారు. గోదావరి జలాల సమర్థవంతమైన వినియోగం కోసం మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం సహాయం చేయాలని.. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2: 123 కి.మీ. విస్తరణకు రూ.38,595 కోట్లు.. వెంటనే అమోదించాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం భూ సేకరణ 90 శాతం పూర్తి అయ్యిందని వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు.ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్-సంగారెడ్డి) కూడా ఏకకాలంలో ఆమోదించాలి. హైదరాబాద్-అమరావతి-బందర్ 12 లేన్ ఎక్స్ప్రెస్వేకు కేంద్ర అనుమతి ఇవ్వండి. తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ.. ఎగుమతులకు గేమ్ ఛేంజర్. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు త్వరగా ప్రారంభించాలి. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు 200 ఎకరాలు సిద్ధంగా ఉందని.. అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్రెడ్డి కోరారు. -
మీనాక్షికి దక్కని ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ నామినేషన్ రద్దు వ్యవహారంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్కు సుప్రీంకోర్టులో ఇవాళ ఊరట లభించలేదు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున తాము తక్షణ జోక్యం చేసుకోలేమని గురువారం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఆమె పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది.మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు అంశం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్నికల ఫలితాల ప్రకటనపై తాత్కాలిక నిలుపుదల (స్టే) ఇవ్వాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది.అయితే మిగిలిన వాదనలు, వివరణలు శుక్రవారం వింటామని తెలిపింది. అలాగే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం సాధారణంగా తగదని అభిప్రాయం బలంగానే వ్యక్తి చేసింది. దీంతో ఈ కేసు రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు, రెండు ఉప స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ (4), గుజరాత్ (4), కర్ణాటక (4) మధ్యప్రదేశ్ (3), రాజస్థాన్ (3), జార్ఖండ్ (2), మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఒక్కో స్థానం చొప్పున మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే.. మహారాష్ట్ర, తమిళనాడులో చెరో స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి. -
AUS vs BAN: ఆసీస్ గడ్డపై ‘మనోడి’ చరిత్ర
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలో సిరీస్లో పాల్గొనే పదిహేడు మంది సభ్యుల పేర్లను తాజాగా వెల్లడించింది. ఈ జట్టులో భారత్కు చెందిన నిఖిల్ చౌదరికి సెలక్టర్లు చోటివ్వడం విశేషం.మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు ఆసీస్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా.. జూన్ 17, 19, 21 తేదీల్లో మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికఈ నేపథ్యంలో సీఏ తాజాగా బంగ్లాతో సిరీస్కు టీ20 జట్టును ప్రకటించింది. బిగ్బాష్ లీగ్లో రాణించిన ఆటగాళ్లకు సెలక్టర్లు ఈ జట్టులో చోటిచ్చారు. హోబర్ట్ హారికేన్స్ తరఫున సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న నిఖిల్ చౌదరి (Nikhil Chaudhary)కి తొలిసారి జాతీయ జట్టులో అవకాశం దక్కింది.ఆల్రౌండ్ నైపుణ్యాలున్న 30 ఏళ్ల నిఖిల్ చౌదరి బంగ్లాదేశ్తో సిరీస్తో గనుక అరంగేట్రం చేస్తే.. 62 ఏళ్ల తర్వాత ఆసీస్కు ఆడిన జన్మతః భారతీయుడైన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. కలకత్తా వేదికగా 1964లో రెక్స్ సెల్లార్స్ అనే భారతీయుడు ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగాడు. గుజరాత్లో జన్మించిన రెక్స్ లెగ్ స్పిన్నర్. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు నిఖిల్కు అవకాశం వచ్చింది.ఎవరీ నిఖిల్ చౌదరి?ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి దేశవాళీ క్రికెట్లో పంజాబ్కు ప్రాతినిథ్యం వహించాడు. భారత టెస్టు, వన్డే జట్ల ప్రస్తుత కెప్టెన్ శుబ్మన్ గిల్ సహా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు.అదే విధంగా టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్దీప్ సింగ్లతో కలిసి పంజాబ్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అతడికి ఆశించినంతగా అవకాశాలు రాలేదు. ఇక 2020లో క్వీన్స్లాండ్లో ఉన్న తన అంకుల్ను చూసేందుకు నిఖిల్ చౌదరి ఆస్ట్రేలియాకు వెళ్లాడు.అయితే, కోవిడ్ కారణంగా ప్రయాణాలపై నిషేధం విధించడంతో నిఖిల్ అక్కడే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోనే ఉండాలని నిర్ణయించుకున్న అతడు.. శాశ్వత నివాస హోదా పొందాడు. గత మూడేళ్లుగా బిగ్బాష్ లీగ్లో సత్తా చాటుతున్న నిఖిల్.. 2024-25లో హోబర్ట్ హారికేన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.అలా దేశీ క్రికెట్లో అవకాశంలెగ్స్పిన్నింగ్ ఆల్రౌండర్ నిఖిల్కు ఊహించని రీతిలో ఆసీస్ దేశీ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం లభించింది. స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ జాతీయ జట్టు విధుల్లోకి వెళ్లగా అతడి స్థానంలో టాస్మేనియా నిఖిల్ను పిలిపించింది.ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్లో టాస్మేనియాకు ఆడుతూ.. న్యూ సౌత్ వేల్స్తో మ్యాచ్లో శతకం (184 బంతుల్లో 163) సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆసీస్ దేశవాళీ రెడ్బాల్ టోర్నీలో శతక్కొట్టిన భారత మూలాలున్న తొలి క్రికెటర్గా నిలిచాడు.ఏదేమైనా భారత్లో అవకాశాలు లేక ఆసీస్కు వెళ్లిన నిఖిల్ చౌదరి.. ఇప్పుడిలా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ ఏకంగా ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికకావడం నిజంగా విశేషమే.బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్(కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, నిఖిల్ చౌదరి, కూపర్ కానొలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రైలీ మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపా.చదవండి: వైభవ్ మారలేదు.. శ్రీలంకలో మెరుపులు -
ప్రధాని అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ 11వ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన, న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి (Governing Council)సమావేశం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు , లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అభివృద్ధి వ్యూహాలు, రాష్ట్రాల ప్రాధాన్యతలు, వికసిత్ భారత్ లక్ష్యసాధన కోసం సమ్మిళిత వృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.ఈ సమావేశంలో వెనుకబడిన జిల్లాలలో అభివృద్ధి, పీఎం ధనధాన్య కృషి యోజన పై నీతి ఆయోగ్ ఒక ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అలాగే ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్, స్కూలింగ్, స్కిల్లింగ్, హయ్యర్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ పై ప్రత్యేక చర్చ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ,హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఈ సమావేశం కోసం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్కు బయలుదేరారు. నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రులు బెంగాల్ సువేందు అధికారి, తమిళనాడు సి. జోసెఫ్ విజయ్, కర్ణాటక డి.కె. శివకుమార్, వీడీ సతీశన్ తదితరులు కూడా రాజధాని నగరానికి చేరుకున్నారు. -
‘దీదీ’కి భారీ షాక్: ఢిల్లీలో టీఎంసీ ఆఫీస్ ఖాళీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సొంత పార్టీ ఎంపీల తిరుగుబాటుతో తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మమతా బెనర్జీకి, ఇప్పుడు హస్తినలో పార్టీ అధికారిక కార్యకలాపాలు సాగించే ప్రధాన కేంద్రం కూడా చేజారిపోయింది. బారక్పూర్ ఎంపీ పార్థా భౌమిక్ తనకు కేటాయించిన ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయడమే ఇందుకు కారణమైంది. పార్టీలో తిరుగుబాటు ముదిరిన తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.చేజారిన హస్తిన నడిబొడ్డు గత కొన్నేళ్లుగా ఢిల్లీలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రోడ్డులో ఉన్న బంగళా నంబర్ 20 తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యాలయంగా సేవలందిస్తోంది. పార్టీ కీలక సమావేశాలు, పార్లమెంటరీ వ్యూహాలు, సమన్వయ చర్చలన్నీ ఈ ప్రాంగణం నుంచే సాగేవి. అయితే, లోక్సభ సెక్రటేరియట్ 2026చ జూన్ 9న జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఎంపీ పార్థా భౌమిక్కు హుగ్లీలో ఫ్లాట్ నంబర్ 501ను రెగ్యులర్ అధికారిక నివాసంగా కేటాయించారు. భౌమిక్ స్వయంగా కోరడం వల్లే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఆయన బంగళాను ఖాళీ చేసి ఫ్లాట్కు మారుతుండటంతో, ఇకపై ఈ ప్రాంగణాన్ని పార్టీ అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం కోల్పోయినట్లయింది.నేతల నివాసాలే పార్టీ ఆఫీసులు ఢిల్లీలో సొంతంగా శాశ్వత పార్టీ కార్యాలయం లేని తృణమూల్ కాంగ్రెస్, మొదటి నుంచి సీనియర్ నేతలకు కేటాయించిన ప్రభుత్వ నివాసాలనే ఆఫీసులుగా వాడుకుంటూ వస్తోంది. గతంలో జాతీయ నాయకుడు ముకుల్ రాయ్ సౌత్ ఎవెన్యూ నివాసం పార్టీకి తొలి ప్రధాన బేస్గా ఉండేది. ఆయన నిష్క్రమణ తర్వాత ఎంపీ నదీముల్ హక్తో పాటు మరికొందరు నేతల ఇళ్లను వాడుకున్నారు. చివరికి పార్థా భౌమిక్ బంగళా పార్టీ కేంద్రంగా మారింది. జాతీయ పార్టీ హోదా ఉన్న క్రమంలో శాశ్వత కార్యాలయ నిర్మాణానికి స్థల కేటాయింపు పొందే అర్హత ఉన్నప్పటికీ, టీఎంసీ మాత్రం ఎంపీల నివాసాలపైనే ఆధారపడుతూ వస్తోంది.ముదురుతున్న తిరుగుబాటు సంక్షోభం పార్టీలో తిరుగుబాటు పరిణామాలు మమతా బెనర్జీ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారాయి. లోక్సభలో టీఎంసీకి చెందిన ఒక అసమ్మతి ఎంపీల బృందం విడిగా ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఈ ఆఫీసు సమస్య వచ్చి పడింది. ఒకవైపు పార్లమెంటరీ వింగ్లో తీవ్ర అనిశ్చితి, మరోవైపు ఢిల్లీలో కార్యాచరణ కేంద్రం చేజారడం పార్టీని మరింత ఆత్మరక్షణలో పడేసింది. ఈ తీవ్ర రాజకీయ తుఫానును తట్టుకుని, హస్తినలో సరికొత్త ఆపరేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు టీఎంసీ అధిష్టానానికి అత్యంత కీలకంగా మారింది.ఇది కూడా చదవండి: ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం -
కాంగ్రెస్లో టీఎంసీ విలీనం?.. ఇదిగో క్లారిటీ
మమత-సోనియా ఆలింగనం.. రాహుల్-అభిషేక్ చర్చలు.. ఏదైనా సంచలన ప్రకటన వెలువడబోతోందేమోనని.. గత రెండు రోజులుగా దేశ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు(చీలిక, తిరుగుబాటు.. వగైరా) చోటుచేసుకుంటున్న వేళ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోందన్న ప్రచారం తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో జరిగిన కీలక భేటీలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది.గతంలో..(ఎన్నికల టైంలో) కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్ష పోరాటానికి నాయకత్వం వహించాలని ఆమె అన్నారు. ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతో మమత భేటీ కావడం, ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం మరిన్ని సందేహాలకు తావిచ్చింది.ఈ భేటీ జరిగిన మరుసటి రోజే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమావేశమయ్యారు. దీంతో టీఎంసీ భవిష్యత్, కాంగ్రెస్తో సంబంధాలు, విలీనం అవకాశాలపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.ఇదే సమయంలో టీఎంసీలో అసంతృప్తి నేతల వర్గం పార్టీకి చెందిన 28 మంది లోక్సభ సభ్యుల్లో కనీసం 19 మంది మద్దతు తమకు ఉందని, తామే అసలైన పార్లమెంటరీ విభాగమని ప్రకటించబోతున్నారన్న వార్తలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం, వరుసగా రాజీనామాలు జరగడం కూడా మమతపై ఒత్తిడిని పెంచింది.ముఖ్యంగా రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం మరో షాక్గా మారింది. అంతకుముందు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీని వీడారు. సుష్మితా దేవ్ ఢిల్లీలో హిమంత బిశ్వ శర్మను కలవడం ఆమె బీజేపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలకు దారితీసింది. అయితే దీనిపై ఆమె స్పష్టత ఇవ్వకుండా, సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని మాత్రమే చెప్పారు.ఇక ఈ పరిణామాల వేళ.. ఢిల్లీలో టీఎంసీ నేతల కదలికల నేపథ్యంలో ‘విలీనం’ వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా శివసేన(ఉద్దవ్ వర్గం) కీలక నేత సంజయ్ రౌత్.. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయిన టీఎంసీ, ఎన్సీపీ (ఎస్పీ) వంటి పార్టీలు తిరిగి కాంగ్రెస్లో కలవాలని వ్యాఖ్యానించడం చర్చకు మరింత ఊతమిచ్చింది.అయితే ఈ ప్రచారానికి టీఎంసీ పుల్స్టాప్ పెట్టింది. కాంగ్రెస్తో విలీనం గురించి ఎలాంటి ప్రతిపాదన లేదని, అలాంటి అంశం ఏ సమావేశంలోనూ చర్చకు రాలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అసలీ పుకార్లు ఎలా పుట్టాయో తమకు అర్థం కావడం లేదని అంటోంది. ఇటు కాంగ్రెస్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. మమత-సోనియా, రాహుల్-అభిషేక్ భేటీల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష వ్యూహాలు, ఇండియా కూటమి బలోపేతం, 2029 లోక్సభ ఎన్నికల సన్నాహకాల గురించే చర్చ జరిగిందని పేర్కొన్నాయి.రెండు రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిన విలీనం ప్రచారానికి చివరకు టీఎంసీ స్పందిస్తూ.. "అది పూర్తిగా పుకారు మాత్రమే.. విలీనం అంశంపై అసలు ఎలాంటి చర్చా జరగలేదు" అని తేల్చిచెప్పింది. -
ఢిల్లీ అగ్ని ప్రమాదం : మరో తీవ్ర విషాదం
సాక్షి, న్యూఢిల్లీ: గతవారం ఢిల్లీలోని మాలవ్య నగర్లోని హోటల్ అగ్నిప్రమాద ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది.ఎనిమిది మంది కుటుంబ సభ్యుల మరణం గురించి తెలియక ముందే ఆ కుటుంబంలోని చివరి గుండె ఆగిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుత్ను కుటుంబంలోని ఏకైక సభ్యుడు, 80 ఏళ్ల వృద్ధుడు రాధే శ్యామ్ అగర్వాల్ కూడా ఈరోజు కన్నుమూశారు. దీంతో మొత్తం కుటుంబం ఆహుతైపోయిన ఘటన కలచి వేస్తోంది. ఆ ఇంట్లో నవ్వుతూ, ఆనందంగా గడిపిన కుటుంబం ఇప్పుడు సమూలంగా సమాధి అయిపోయింది. ఈ ఘోర కలి వార సమీప బంధువుల్లో ఎప్పటికీ పూడ్చలేని ఒక పెద్ద గాయాన్ని మిగిల్చింది.అగర్వాల్ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకుని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక సభ్యుడు కూడా మృతిచెందడం కూడా కలిచివేసింది.శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న రాధే శ్యామ్ అగర్వాల్ సాకేత్లోని 'మాక్స్ హాస్పిటల్' ఐసీయూ (ICU) లో చికిత్స పొందుతున్నారు.అయితే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం, దేనికైనా సిద్ధంగా ఉండాలని వైద్యులు చెప్పడంతో,దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న 'ఫ్లోరిష్ ఇన్' అనే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ (B&B) హోటల్లో బస చేశారు. వారి ఇల్లు గురుగ్రామ్ సెక్టార్ 46లో ఉండటం, అక్కడి నుండి ట్రాఫిక్ సమస్యల వల్ల రాకపోకలు కష్టమవుతాయని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.అదే ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది.ఈ ప్రమాదంలో రాధే శ్యామ్ కుమారుడు వివేక్ అగర్వాల్, భార్య ప్రేమ్ లత అగర్వాల్, కోడలు తర్జని అగర్వాల్, మనవరాళ్లు జివిషా, వార్యలతో పాటు మరో ముగ్గురు బంధువులు మరణించారు.తన వాళ్ళు ఇకలేరని ..రారని తెలియకుండానేఆసుపత్రిలో ఉన్న రాధే శ్యామ్ అగర్వాల్కు తన కుటుంబం మొత్తం అగ్నిప్రమాదంలో చనిపోయిందనే విషయమే తెలియదు. తనను చూడటానికి ఎందుకు రాలేదని ఆయన నర్సులను, వైద్యులను అడుగుతూనే ఉండేవారు. మనవరాలు జివిషా, బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతూ, తాతగారిని చివరిసారిగా చూద్దామని ఢిల్లీకి వచ్చింది. ఆమె వచ్చినందుకు సంతోషించిన రాధే శ్యామ్, తన మనవరాలు తన కోసమే అంత దూరం నుండి వచ్చిందని నర్సులతో ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. కానీ, తాతయ్యకు వీడ్కోలు పలకడానికి వచ్చిన మనవరాలే ముందుగా అనంత లోకాలకు వెళ్లిపోవడం అత్యంత విచారకరం. -
కేంద్రంపై సమరమే
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’కూటమి సమరశంఖం పూరించింది. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను గట్టిగా తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం సాగించాలని నిర్ణయించింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కూటమి నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో సాగుతున్న ఓట్ల లూటీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.ఇండియా కూటమి సమావేశం రెండేళ్ల విరామం తర్వాత సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్విని యోగం, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలపై భవిష్యత్ పోరాట కార్యాచరణపై రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. విపక్షాల ఐక్యతను చాటుతూ ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్లో జరుగనుంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమా వేశాల్లో సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు. ఐక్యతను బలోపేతం చేసుకోవాలి మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లను ఎదుర్కొనేందుకు కూటమి ఐక్యతను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. దేశంలో రాజ్యాంగంపై దాడి కొనసాగు తోందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి పాల కులు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని ధ్వజమె త్తారు. కూటమి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యా సం చేశారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, కొత్త పెట్టుబడులు రావడం లేదని, నూతన ఉద్యోగాల కల్పన జరగడం లేదని చెప్పారు.పరీక్షల వ్యవస్థలో అక్రమాలు లక్షలాది మంది యువత ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2026 ఏప్రిల్ 17న డీలిమిటేషన్పై మోడీ ప్రభుత్వ బిల్లులను ఓడించడానికి లోక్సభలో ప్రతిపక్షాలు గొప్ప ఐక్యతను ప్రదర్శించాయని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ పేరిట కోట్లాది మంది పౌరుల నుంచి ఓటు హక్కును లాగేసుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.విదేశాంగ విధానంలో ప్రభుత్వం రాజీ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, కొత్త పెట్టుబడులు రాకపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగించిందని కూటమి నేతలు పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పరీక్షల వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని కూటమి పక్షాలు పట్టుబట్టాయి. దశాబ్దాలుగా దేశం పటిష్టంగా పాటిస్తున్న సంప్రదాయ విలువల నుంచి మోదీ సర్కార్ పక్కకు జరిగిందని, విదేశాంగ విధానంలో పూర్తిగా రాజీ పడిందని విపక్షాలు ఆక్షేపించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై దాడులు ఆగడం లేదని మండిపడ్డాయి.హాజరైన 23 పార్టీల నేతలు విపక్ష కూటమి భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, సీపీఐ అగ్రనేత డి.రాజా, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు హాజరయ్యారు.శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ వర్చువల్గా పాల్గొన్నారు. మొత్తం 23 పార్టీల నాయకులు ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు. 2024 జూన్ 1న ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ఆరో సమావేశం జరిగింది. ఆ తర్వాత సోమవారం అగ్రనేతలంతా ఒకే వేదికపైకి వచ్చారు. విపక్షాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఎన్సీపీ(ఎప్పీ) అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ గైర్హాజరు సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా సమావేశమైన విపక్ష కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ కీలక భేటీకి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ హాజరు కాకపోవడం గమనార్హం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, డీఎంకేల మధ్య దూరం పెరిగింది. ఇకపై తాము ఇండియా కూటమిలో భాగస్వామి కాదని డీఎంకే తాజాగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలోనే ఇండియా కూటమికి దూరమైంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.రాహుల్కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో సోమవారం ఉదయం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. రాహుల్ గాంధీకి నిలకడ లేదంటూ శరద్ పవార్ అన్నట్లుగా ఆ పోస్టర్లలో ముద్రించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోస్టర్లను చించివేశారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు.ఐదు అంశాలపై అంగీకారం: ఖర్గే దేశంలో అస్థిర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, ప్రజా సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు. సోమవారం ఇండియా కూటమి భేటీ అనంతరం రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీతోపాటు ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు అంశాలపై తాము అంగీకారానికి వచ్చిననట్లు తెలిపారు. ఎస్ఐఆర్లో అక్రమాలు, ఓట్ల లూటీ, ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తికి లేఖ రాయబోతున్నట్లు చెప్పారు.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి కేంద్రం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. ఇకపై ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను లేవనెత్తబోతున్నామని, దీనికి కూటమి పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించాయని ఖర్గే పేర్కొన్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో సమన్వయంతో పనిచేస్తామని, ప్రతిరోజూ ఉదయం విపక్ష నేత చాంబర్లో తమ భేటీ జరుగుతుందని వెల్లడించారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ 2029 లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సోమవారం సూచించారు. బీజేపీ వ్యతి రేక కూటమి ఐక్యంగా ఉందని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామని తెలి పారు. ప్రధానమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి రాబోయే లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పారు. అవినీతిపరులను, దోపిడీదార్లను అధికారం నుంచి దించేయడమే ప్రజల ఎజెండా అని స్పష్టంచేశారు. -
అర్ధరాత్రి పార్కుల్లో ప్రజలు: ఎందుకంటే?
మెక్సికోకు చెందిన గాబ్రియెల్ అనే యువతి.. ఢిల్లీలో కనిపించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. పగటిపూట ఎండలు భారీగా ఉండటం వల్ల దేశరాజధానిలో అర్ధరాత్రి సమయంలో పార్కుల్లో కుటుంబాలతో కలిసి ప్రజలు ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపింది.మెక్సికోలో రాత్రి వేళల్లో కుటుంబాలు బయటకు వచ్చి పార్కుల్లో గడపడం చాలా అరుదు అని గాబ్రియెల్ వీడియోలో వెల్లడించింది. కానీ.. ఢిల్లీలో రాత్రి వేళల్లో కూడా పార్కులు జనంతో కిక్కిరిసిపోవడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ యువత మాత్రమే కాకుండా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మొత్తం కుటుంబాలు కనిపించాయని ఆమె చెప్పింది.ఈ విషయంపై గాబ్రియెల్ భర్త గౌరవ్ వివరిస్తూ.. ఢిల్లీలో వేసవికాలంలో పగటి వేళల ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ప్రజలు రాత్రి సమయంలోనే బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో సమయం గడపడం సాధారణ విషయమని వివరించాడు. ఈ సంస్కృతి తనకు కొత్తగా అనిపించిందని గాబ్రియెల్ పేర్కొంది.వృత్తిరీత్యా గాబ్రియెల్ ఒక సైకాలజిస్ట్.. అయితే ఈమె సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా కూడా గుర్తింపు పొందింది. కాగా ఈమెకు భారతీయుల జీవనశైలి, కుటుంబ విలువలు, సామాజిక బంధాలు అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. View this post on Instagram A post shared by Desi Met Mexi (@desimetmexi) -
రాహుల్ గాంధీ ప్రసంగం.. కూటమికి హెచ్చరిక!
ఇండియా కూటమి సమావేశంలో.. ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించారు. 'ఐక్యంగా ఉంటే బలం, విడిపోతే పతనం' అనే సందేశాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కూటమిలోని అన్ని పార్టీలు పరస్పర విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని సూచించారు.కూటమి భాగస్వాములు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదా బలహీనపరచుకోవడం మానుకోవాలని రాహుల్ గాంధీ హెచ్చరించారు. దేశం, రాజ్యాంగం రక్షణ కోసం ప్రతిపక్షాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కొందరు మిత్రపక్షాలు ఎన్నికల ఓటర్ల జాబితాలపై కాంగ్రెస్ లేవనెత్తిన 'ఓటు చోరీ' ఆరోపణలకు తగిన మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ తరచుగా కాంగ్రెస్ పార్టీని విమర్శించే మమతా బెనర్జీకి చెందిన తృణమూల్, వామపక్షాల వంటి కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.ఈ సమావేశంలో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)పై ఉన్న అనుమానాలు, అక్రమాల ఆరోపణల అంశాన్ని కూడా చర్చించారు. ఈ విషయంపై దేశ ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా లేఖ రాయాలని కూటమి నిర్ణయించింది.బీజేపీని ఓడించడం అంత కష్టమైన విషయం కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2024 లోక్సభ ఎన్నికలలో బీజేపీ 240 స్థానాలను కైవసం చేసుకుంది, ఇది 2019లో గెలుచుకున్న 303 స్థానాల కన్నా చాలా తక్కువ. 2024లో కాంగ్రెస్ 99 స్థానాలకు ఎగబాకిందని తమ బలాన్ని గుర్తు చేశారు. అయితే.. ప్రతిపక్షాలు పరస్పరం పోట్లాడుకుంటూ తమ బలమే తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ సమావేశంలో ఐక్యత ప్రాముఖ్యతను వివరించారు. 2026 ఏప్రిల్లో లోక్సభలో ప్రతిపక్షాలు కలిసి కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అదే ఐక్యతను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశం ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత ఈ సమావేశం జరగడం విశేషం. ఆ ఎన్నికల్లో బీజేపీ అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ కేరళలో విజయం సాధించింది. తమిళనాడులో నటుడు - రాజకీయ నాయకుడు విజయ్ భారీ విజయం సాధించారు. మూడేళ్ల క్రితం ఏర్పడిన ఇండియా కూటమి ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించింది. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్లో జరగనుంది. -
విద్యాశాఖ మంత్రి రాజీనామా?.. ఇండి కూటమి కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: నీట్ పరీక్షపత్రాల లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈరోజు (సోమవారం) ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కూటమి నేతలు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిర్వహించే Sirపై త్వరలోనే భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం కోసం విపక్ష ఇండియా కూటమి ఈ రోజు ఢిల్లీలో సమావేశమైంది. ఈ మీటింగ్లో ఎన్డీఏపై పోరాటానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి 1 ఎన్నికల్లో ఓటు చోరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం. 2 విద్యామంత్రి వెంటనే రాజీనామా చేయాలి . NEET, CBSE పరీక్షలు రాసిన లక్షలాది యువకులను మోసం చేశారు. 3 దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ఇతర సమస్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని పార్టీల సమావేశం పిలవాలి. 4 అన్ని పార్టీలు ప్రతి రెండు నెలలకొకసారి సమావేశం.తదుపరి సమావేశం ఆగస్టు నెలలో హైదరాబాద్లో జరుగుతుందని తెలిపారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో ఇండియా కూటమి ఐక్యత కొనసాగించాలని కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
నీట్ రీటెస్ట్ :‘లాక్డౌన్’లో ప్రశ్నపత్రాల రూపకర్తలు
న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ రీటెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వివాదాల నేపథ్యంలో, ఈసారి ఎలాంటి లీకులకు తావులేకుండా ఉండేందుకు పరీక్షల నిర్వహణ యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా ఒక అసాధారణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. జూన్ 21న జరగబోయే ఈ రీటెస్ట్ పూర్తి పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు సర్వసన్నద్ధమయ్యారు.రహస్య ప్రాంతాల్లో కఠిన నిర్బంధంనీట్ రీటెస్ట్ ప్రశ్నపత్రాలను రూపొందించే ఎగ్జామినర్లతో పాటు, వాటిని వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ట్రాన్స్లేటర్లను కేంద్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన ‘లాక్డౌన్’ తరహా నిర్బంధంలో ఉంచింది. వీరందరినీ ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాలకు తరలించారు. జూన్ 21న పరీక్ష ముగిసేంత వరకు వీరు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి వీల్లేదు. బయటి వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు.గ్యాడ్జెట్లపై నిషేధం.. డేగ కన్నుఈ భద్రతా కేంద్రాల్లో ఉన్నవారెవరూ మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు, స్మార్ట్వాచ్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఉపయోగించడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్నెట్ సదుపాయాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఒకవేళ అత్యవసరంగా ఇంటర్నెట్ వాడాల్సి వచ్చినా, అది పూర్తి నిఘా నీడలోనే సాగుతుంది. ప్రత్యేక అనుమతులు ఉన్న సిబ్బందిని మాత్రమే ఈ రహస్య ప్రాంతాల్లోకి అనుమతిస్తున్నారు.రంగంలోకి భారత వాయుసేనప్రశ్నపత్రాల రూపకల్పనలోనే కాకుండా, వాటి రవాణా విషయంలోనూ ప్రభుత్వం అత్యంత కఠినమైన భద్రతా చర్యలను చేపడుతోంది. ఎలాంటి లీకేజీలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఈసారి భారత వాయుసేన యుద్ధ విమానాల ద్వారా ప్రశ్నపత్రాలను వివిధ రాష్ట్రాలకు సురక్షితంగా తరలించి, పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ భద్రతా వ్యూహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
రాహుల్ గాంధీ సింప్లిసిటీ.. చిన్నారికి సర్ప్రైజ్
ఒక సాధారణ రెస్టారెంట్ లంచ్ అనుకోని విధంగా ఓ చిన్నారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చింది. కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుక కోసం బయటకు వెళ్లిన ఆ బాలుడు, అదే రెస్టారెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో పంచుకున్న ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.. డాక్టర్ ఎస్.జె.టి కజ్మీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి లంచ్కు వెళ్లారు. అయితే అదే హోటల్కు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వాళ్లకు దగ్గర్లోనే ఓ టేబుల్ మీద కూర్చున్నారు. ఆ సమయంలో ఉత్సాహంగా ఉన్న చిన్నారి రాహుల్ గాంధీకి చేతులు ఊపగా.. ఆయన స్పందించి బాలుడిని తన వద్దకు పిలిచారు.ఆప్యాయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఆ చిన్నారితో ఫోటో దిగుతూ అతని పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చారని కజ్మీ తన పోస్టులో పేర్కొన్నారు. “నా కుమారుడికి ఇది జీవితంలోనే బెస్ట్ బర్త్డే గిఫ్ట్” అంటూ ఆయన మరో పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనేక మంది వినియోగదారులు రాహుల్ గాంధీ చేసిన ఈ సింపుల్ గెస్టర్ను ప్రశంసిస్తూ స్పందించారు. కొందరు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు.Was out for lunch on my Son’s Birthday today . As luck would have it Rahul Gandhi ji @RahulGandhi and Priyanka ji @priyankagandhi were at nearby table with family . My son waived at him in excitement , Mr Gandhi called him and made his birthday memorable !! Thank you sir ! pic.twitter.com/J6l5AjtwSl— DR.S.J.T.KAZMI (@JAFARKAZMI) June 7, 2026మరో వినియోగదారు డాక్టర్ రాకేష్ బన్సాల్ కూడా తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. రాహుల్ గాంధీ చాలా సాదాసీదాగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. కుటుంబ వేడుకలో భాగమైనట్టే ఆయన ఫోటోలకు పోజ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం హృదయాన్ని హత్తుకునే అనుభవమని అభిప్రాయపడ్డారు. सार्थक 18 साल का है - पर सोच, साहस और सिद्धांत में किसी से कम नहीं।उसने और उसके साथी निसर्ग ने वो कर दिखाया जो देश के बड़े मीडिया हाउस, खोजी पत्रकार नहीं कर पाए - CBSE और COEMPT की मिलीभगत को देश के सामने रख दिया।मोदी जी चाहते हैं हमारे युवा reels बनाते रहें, पकौड़े तलते… pic.twitter.com/vjNNVItc2q— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2026సార్ధక్ ది గ్రేట్!సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో లోపాలను బయటపెట్టిన 18 ఏళ్ల సార్థక్ సిద్ధాంత్, అతని సహచరి నిసర్గపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. తాజాగా వాళ్లు పేరెంట్స్తో కలిసి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా.. ఈ ఇద్దరి ప్రయత్నం వల్ల వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తు కూడా ప్రారంభమైంది. విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఇటు సీబీఎస్ఈ అధికారులు రీవ్యాల్యుయేషన్ ప్రక్రియలో ఉన్న సమస్యలను అంగీకరించి మార్పులు చేస్తామని తెలిపారు. మొత్తం వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
టార్గెట్ 2029.. ఢిల్లీలో 23 పార్టీల భేటీ
-
నేడే ఇండియా జనబంధన్
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో అధికార ఎన్డీయేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తమ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో ‘ఇండియా జనబంధన్’ పేరిట కూటమి సమావేశం జరుగనుంది. ఈ భేటీకి 23 పార్టీల నేతలు హాజరు కాబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. తమ కూటమిలో వైవిధ్యం ఉన్నప్పటికీ ఐక్యంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. కొన్ని పార్టీలు అనివార్య కారణాల వల్ల ఈ ప్రత్యేక సమావేశానికి హాజరుకాలేమని తెలియజేశాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ‘ఇండియా జనబంధన్’ భేటీ ప్రారంభమవుతుందని, 23 పార్టీల నాయకులు పాల్గొనబోతున్నట్లు నిర్ధారణ అయ్యిందని స్పష్టంచేశారు. ఉమ్మడి లక్ష్యం, స్పష్టమైన ఉద్దేశంతో ఈ సమావేశం జరుగనుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ఇండియా కూటమి ఐక్యంగా ఉందన్నారు. అనేక పార్టీలు ఈ సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశి్చమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, సీపీఎం పార్టీ తదితరులు సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు సైతం భేటీకి వస్తున్నట్లు వార్తలొచ్చాయి . కూటమిలో రచ్చరచ్చ 2029లో జరిగే లోక్సభ ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. సోమవారం నాటి భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజా సమస్యలపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. కూటమిలో కొన్ని భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాలు దిగజారిన నేపథ్యంలో సమావేశం జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ భేటీకి తాము హాజరు కావడంలోని డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. తమిళనాడులో కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందని, పదవుల కోసం తమిళగ వెట్రి కళగంతో చేతులు కలిపిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు కేరళలో వామపక్షాలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ తదితరులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణల పట్ల సీపీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. ఇండియా కూటమి సమావేశానికి సీపీఎం నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ హాజరు కానున్నట్లు సమాచారం. ఐక్యతపై అనుమానాలు: బీజేపీ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయడం చూస్తే ఇండియా కూటమి ఐక్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పేర్కొన్నారు. ఆ కూటమిలో విభేదాలు నానాటికీ పెరుగుతున్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. బేబీ రాసిన లేఖ కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టిందని ఆయన చెప్పారు. విపక్ష కూటమికి ఒక లక్ష్యం, దార్శనికత లేవని ఆరోపించారు. కేవలం గందరగోళం, అనుమానాలు, ఆరోపణలు, పదవుల కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కూటమిలోని పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో పరస్పరం తలపడుతున్నాయని, ఇక ఐక్యత ఎక్కడుందని ప్రశ్నించారు.ప్రతిపక్షాల మధ్యసమన్వయం కోసమే..ఇండియా కూటమిలో కీలక పార్టీలైన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్లు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ప్రతిపక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా ‘ఇండియా జనబంధన్’ సమావేశాన్ని పరిగణిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కొంతకాలంగా ‘ఇండియా’ కూటమికి దూరంగా ఉంటోంది. గతంలో పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి సమావేశమైంది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం గురించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు.కేజ్రీవాల్తో మమత భేటీ భేటీ కోసం మమతా బెనర్జీ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసినట్లు ప్రకటించిన ఆప్ చీఫ్తో టీఎంసీ చీఫ్ మమత భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం ఆతీ్మయంగా జరిగిందని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ పరిణామాలతోపాటు తదుపరి కార్యాచరణపై వారిద్దరూ విస్తృతంగా చర్చించుకున్నారని వెల్లడించాయి. ఈ సందర్భంగా మమతా బెనర్జీ వెంట ఆమె మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ వచ్చారు. -
మహిళను చంపడానికి 1,400 కి.మీ ప్రయాణించి..
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ దంపతులు ఢిల్లీలోని ఓ ప్రొఫెసర్ను హత్య చేసేందుకు 1,400 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న దేబోస్మితా పాల్ హత్య కేసును పోలీసులు కేవలం 3 రోజుల్లో ఛేదించారు.తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్లో ఉన్న సత్యం అపార్ట్మెంట్స్లో బుధవారం దేబోస్మితా పాల్ మృతదేహం కనిపించింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు పశ్చిమ బెంగాల్లోని బర్దమాన్ చేరుకుని రామ్ప్రసాద్ దాస్, బంశ్రీ దాస్ను అరెస్టు చేశారు.పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. వారి మైనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దంపతులను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ కోరే అవకాశం ఉందని వారు తెలిపారు.అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. నిందితులు బర్దమాన్ లో ఉంటారు. బాధితురాలిని కలవాలనే నెపంతో వారు ఢిల్లీకి వచ్చారు. 2022లో వివాహ జీవితం ప్రారంభమైన ఐదేళ్ల తరువాత దేబోస్మితా పాల్ తన భర్త నుంచి విడిపోయింది. ఆమె ఆ ఫ్లాట్లో ఒంటరిగా ఉండగా, ఆమె భర్త బెంగళూరులో ఉన్నాడు.బుధవారం నిందితులు మాస్కులు ధరించి ఆమె ఫ్లాట్కు వచ్చిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వారు కొన్ని సంచులతో ప్రైవేట్ క్యాబ్లో వచ్చి, మెట్లు ఎక్కి 6వ అంతస్తుకు చేరుకున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు తమ మైనర్ కుమారుడిని కూడా వెంట తీసుకువచ్చారు. స్నేహపూర్వకంగా ఇంట్లోకి ప్రవేశించి, తమ వెంట తెచ్చుకున్న ఆయుధంతో ప్రొఫెసర్ను హత్య చేసినట్లు అధికారులు తెలిపారు.దుస్తులు మార్చుకున్న తరువాత సుమారు 30 నిమిషాలకే వారు తిరిగి వచ్చి, కింద వేచి ఉన్న క్యాబ్లో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సోర్సెస్ వెల్లడించాయి. క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని, ప్రయాణ వివరాల ఆధారంగా ప్రయాణికుల గుర్తింపును పోలీసులు నిర్ధారించారు.బుధవారం ఆ హౌసింగ్ సముదాయాన్ని సందర్శించిన 200 మందిలో 13 మందిని అనుమానితులుగా గుర్తించి ప్రశ్నించారు. 7 పోలీసు బృందాలు 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి, వందల మందిని విచారించాయి. దీంతో కేసు ఛేదించగలిగారు. చివరకు నిందితులను బర్దమాన్లో అరెస్టు చేసి విచారిస్తున్నారు.ఎందుకు చంపారు? బాధితురాలికి పశ్చిమ బెంగాల్లో తన మాతామహుడి మరణం అనంతరం వారసత్వంగా వచ్చిన ఓ ఆస్తి ఉంది. దాన్ని విలువ కోట్లాది రూపాయలు. నిందితులు ఆ ఇంటిలో అద్దెదారులుగా ఉండేవారు. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇల్లు ఖాళీ చేయాలని దేబోస్మితా పాల్ వారిపై ఒత్తిడి తెస్తోంది. ఆస్తిని సొంతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెను హత్య చేయాలని దంపతులు పథకం రచించినట్లు అధికారులు తెలిపారు.దేబోస్మితా సోదరి దేవరతి గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన సోదరి మృతిచెందినట్లు తెలిపింది. ఫ్లాట్కు బయట నుంచి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. సోదరికి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో దేవరతి తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించింది.లోపల దేబోస్మితా పాల్ మృతదేహం కనిపించింది. ఆమె తలపై లోతైన గాయం, మణికట్టులో కోసిన రక్తనాళాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో నగలు, నగదు యథాతథంగా ఉండటంతో దోపిడీ ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు. -
కేంద్రంపై గళం ఎత్తిన కాక్రోచ్ జనతా పార్టీ..!
-
ఢిల్లీలో మళ్లీ అగ్ని ప్రమాదం: రంగంలోకి ఫైర్ ఫైటర్స్
న్యూఢ్లిలీ: దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు ప్రాంతంలో ఉన్న కార్కర్దూమా కోర్టు కాంప్లెక్స్లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. కోర్టు కాంప్లెక్స్లోని గేట్ నంబర్ 4 సమీపంలో ఉన్న రెండో అంతస్తులోని స్కానింగ్ రూమ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. స్కానింగ్ రూమ్లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.మాలవీయ నగర్ విషాదం మరువకముందే..ఇటీవలే ఢిల్లీలోని మాలవీయ్ నగర్లోని ఉన్న ఒక హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ విషాదం మరువక ముందే మరో అగ్ని ప్రమాదం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించిన భవనాలపై కఠిన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 12 అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశించారు. -
కదం తొక్కిన కాక్రోచ్
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, నీట్(యూజీ)లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు శనివారం ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద చేపట్టిన ధర్నాకు భారీ స్పందన లభించింది. ఇన్నాళ్లూ సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమైన ఆ పార్టీ తొలిసారిగా క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగింది. పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బొద్దింకల మాస్క్ లు ధరించి, భారత రాజ్యాంగ ప్రతులు, పుస్తకాలు, పువ్వులు, జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతపట్టుకొని కదం తొక్కారు. ప్రవేశ పరీక్షలు, ఉద్యోగాల నియామక ప్రక్రియలో జవాబుదారీతనం కోరుతూ నినాదాలు చేశారు. సంస్కరణలు, పారదర్శకత కావాలని తేల్చిచెప్పారు. ధర్నాకు ఇతర రాష్ట్రాల నుంచి జనం వ్యయ ప్రయాసలను సైతం లెక్కచేయకుండా హాజరు కావడం గమనార్హం. పటిష్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం ప్రారంభమైన ధర్నా సాయంత్రం వరకు కొనసాగింది. నీట్(యూజీ) వాయిదా పడడం వల్ల ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీప్కే శనివారం ఉదయం అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని చేతబూని ఎయిర్పోర్టు నుంచి బయటకు వచ్చారు. అనంతరం జంతర్మంతర్ వద్ద ధర్నా స్థలికి చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా తమ పార్టీని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. అన్నింటికీ సిద్ధపడే వచ్చా.. ‘‘ఇది దీర్ఘకాల పోరాటం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో పోరాటం ప్రారంభించాం. కానీ, సిగ్గులేని పాలకులు ఆయనతో రాజీనామా చేయించకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. మన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశారు. పోస్టులు తొలగించారు. మా పోస్టులను తొలగించవచ్చేమో గానీ ఈ విశ్వం నుంచి మమ్మల్ని ఎవరూ తొలగించలేరు. అన్నింటికీ సిద్ధపడే ఢిల్లీకి తిరిగొచ్చా. ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడే ప్రసక్తే లేదు. విమానం దిగడానికి కొద్ది క్షణాల ముందు.. నా స్వేచ్ఛా జీవితపు చివరి క్షణాలను గడుపుతున్నట్లు నాకు అనిపించింది. ఆశయం కోసం నా స్వేచ్ఛను త్యాగం చేయడానికి సైతం పూర్తిగా సిద్ధమయ్యా. కొంతమంది ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి ఉండవచ్చు. జైలు శిక్ష పడుతుందనే భయంతో విశ్వాసాలను వదులుకున్నారు. కానీ విద్యార్థులు, యువత అలా ఎప్పటికీ లొంగిపోరు. మేము ఎవరికీ భయపడడం లేదు. నేను అమెరికాకు వెళ్లినప్పటి కంటే స్వదేశానికి తిరిగి వచి్చనప్పుడే నా తల్లి ఎక్కువగా బాధపడింది. నన్ను పోలీసులు అరెస్టు చేస్తారని ఆమె ఆందోళన చెందుతోంది. నా తల్లి మాత్రమే కాకుండా.. రాజకీయాల గురించి మాట్లాడే ప్రతి యువతీ యుకుకుడి తల్లి భయపడుతోంది. ఇంకెన్నాళ్లు ఇలా భయపడుతూ బతుకుతారు. ఇకపై భయపడబోమని గట్టిగా చెప్పండి’’అని అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. నిర్మాణాత్మక మార్పు రావాలి పరీక్షల చుట్టూ వివాదాలు, ఫలితాలపై అనిశ్చితి, అధికారుల నుంచి జవాబుదారీతనం లేకపోవడం వంటివి విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని జంతర్మంతర్ ధర్నాలో నిరసనకారులు ఆక్షేపించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు. అధికార బీజేపీతో పాటు ప్రతిపక్షాల పనితీరుపైనా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో లోపాలు కేవలం విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు సైతం ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పారు. తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని వారు భయపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశంలో జనాభా స్థితిగతుల్లో వస్తున్న మార్పుల గురించి తరచుగా మాట్లాడుతున్నారు తప్ప యువత భవిష్యత్తు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసనకారులు మండిపడ్డారు. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎక్కువ మంది కలిసి ఒకేసారి గొంతు విప్పితే అది బలంగా వినిపిస్తుందన్న ఉద్దేశంతో ఈ ధర్నాకు హాజరయ్యామని కొందరు స్పష్టంచేశారు. ఎక్కువ మంది రాజకీయ కోణంలో స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వాల పనితీరు నచ్చడం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రత్యామ్నాయం కావాలని ఆకాంక్షించారు. అవినీతి ప్రతి స్థాయిలోనూ ఉందని, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా విద్య, యువత ఆకాంక్షలు, పరిపాలన రాజకీయ మార్పుపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’పేరిట ఆన్లైన్ పోరాటం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జంతర్మంతర్ వద్ద ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతోనే ముందు జాగ్రత్త చర్యగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాక్రోచ్–ఇన్–చీఫ్ అభిజిత్ దీప్కే జంతర్మంతర్ ధర్నాలో ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ అగ్రనేత ఎ.రాజాతోపాటు పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యారి్థ, యువజన సంఘాల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి ఎన్సీపీ(ఎస్పీ)నేత రోహిత్ పవార్ సైతం మద్దతు పలికారు. యువత శాంతియుత నిరసన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వాంగ్చుక్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించడాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. అభిజిత్ దీప్కేను కాక్రోచ్–ఇన్–చీఫ్గా వాంగ్చుక్ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి దించేయకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ హెచ్చరించారు. వారు శనివారం మీడియాతో మాట్లాడారు. విద్య, పరిపాలన అంశాలపై విస్తృత యువజన ఉద్యమానికి జంతర్ మంతర్ ధర్నా నాంది పలికిందని అన్నారు. ప్రభుత్వానికి వారం రోజులపాటు సమయం ఇస్తున్నామని, ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడమో లేక ఆయనే స్వయంగా రాజీనామా చేయడమో జరగాలని తేల్చిచెప్పారు. గడువులోగా ప్రభుత్వం స్పందించపోతే మహా ఉద్యమం తప్పదన్నారు. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ వివిధ రాష్ట్రాల్లోని మద్దతుదారుల నుంచి తమకు సందేశాలు అందుతున్నాయని తెలిపారు. తదుపరి కార్యాచరణను ప్రకటించే ముందు వారంరోజులపాటు వేచి చూస్తామని పేర్కొన్నారు. శనివారం నాటి నిరసన ప్రదర్శన ఒక ముఖ్యమైన ఘట్టమని వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడానికి యువత సిద్ధంగా ఉందన్నారు. మన విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆ సంస్కరణను తాము మేము ఈ రోజు ప్రారంభించామని ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమేనని, దేశంలో యువతకు ఎన్నో సమస్యలు ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు గుర్తుచేశారు. ఈ దేశంలోని జెన్ జెడ్, యువత రక్తంలో గాం«దీ, అంబేడ్కర్ ఉన్నారని స్పష్టంచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ శనివారం సాయంత్రం 5 గంటల్లోగా పదవి నుంచి దిగిపోవాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తొలుత డెడ్లైన్ విధించారు. తర్వాత ఆ పార్టీ నిర్వాహకులు డెడ్లైన్ను వారం రోజులకు పొడిగించారు. -
కాక్రోచ్ పార్టీ నినాదాలతో దద్దరిల్లిన జంతర్ మంతర్
-
సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్, విద్యామంత్రిగా ఆయన?
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల అనుమతి తరువాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ధర్నా విజయవంతంగా కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో ఆవిర్భవించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజీత్ దిప్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యా విధానంలోని లోపాల వల్ల మరణించిన విద్యార్థులకు సీజేపీ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా మరణించిన విద్యార్థుల పేర్లను అభిజీత్ దిప్కే చదివి వినిపించారు. సామాజికకార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.ఈ నిరసనలో వినిపించిన డిమాండ్ మరిత విశేషంగా నిలిచింది. సోనమ్ తమ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని విద్యార్థులు కోరారు, అయితే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ఆయన తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని న స్పష్టం చేశారు. యువత బాధ్యత తీసుకోవాలని అభిలషించారు. రాజకీయ నాయకులు మరియు ఉన్నతాధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోనమ్ వాంగ్చుక్ కోరారు. తనకు నిరసనలు చేయడం ఇష్టం ఉందనీ, కానీ న్యాయం కోసం ఇలాంటి తప్పవని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు రావాలని కూడా ఆయన పేర్కొన్నారు. Sonam Wangchuk arrives at Jantar Mantar to join the protest.There are more press reporters then cockroachs 🪳#cjp_पार्टी pic.twitter.com/nbYShqORbD— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) June 6, 2026కాగా ఈ నిరసనకు నాయకత్వం వహించేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం ఉదయం అమెరికా నుండి ఢిల్లీకి చేరుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆత్మకథ ప్రతిని చేతిలో పట్టుకుని విమానాశ్రయం నుండి బయటకు రావడం ఆయన అభిమానులను మరింత ఉత్సాహపర్చింది. -
ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ధర్నా.. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
-
నిరసనల వేదిక ‘జంతర్ మంతర్’ అసలు కథ!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్.. నేడు దేశంలో ఏ చిన్న అన్యాయం జరిగినా, హక్కుల కోసం పోరాడాలన్నా గుర్తుకువచ్చే ఏకైక చిరునామా. తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై చేపట్టిన భారీ నిరసనతో ఈ ప్రాంతం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఒకప్పుడు గ్రహాల గమనాన్ని లెక్కించే వైజ్ఞానిక కేంద్రంగా వెలిసిన ఈ కట్టడం, దేశ రాజకీయాలను శాసించే నిరసనల హబ్గా ఎలా మారింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏంటి?ఖగోళ కేంద్రంగా జంతర్ మంతర్ ఆవిర్భావంనిజానికి జంతర్ మంతర్ అనేది రాజకీయాలకు సంబంధించిన స్థలం కాదు. 18వ శతాబ్దంలో అంబర్ మహారాజు సవాయ్ జైసింగ్ II దీనిని నిర్మించారు. సంస్కృతంలోని 'జంత్ర' (ఖగోళ పరికరం) అనే పదం నుండి దీనికి 'జంతర్ మంతర్' అనే పేరు వచ్చింది. ఆ కాలంలో సమయాన్ని, నక్షత్రాలు, గ్రహాల గమనాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి ఒక వైజ్ఞానిక ప్రయోగశాలగా దీనిని ఏర్పాటు చేశారు. దీని చుట్టూ ఉన్న భారీ నిర్మాణాలు శాస్త్రీయ పరికరాలుగా పనిచేసేవి.బోట్ క్లబ్ నుండి జంతర్ మంతర్ రోడ్డుకు మారిన వేదిక1993 కంటే ముందు ఢిల్లీలో నిరసనలు, ధర్నాలకు ప్రధాన వేదిక ఇండియా గేట్ సమీపంలోని 'బోట్ క్లబ్ లాన్స్'గా ఉండేది. అయితే, 1988లో జరిగిన ఒక భారీ రైతు ధర్నా కారణంగా దేశ రాజధానిలో సాధారణ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నగరంలో తీవ్ర ఆటంకాలు కలగడంతో, అధికారులు బోట్ క్లబ్ వద్ద నిరసనలపై ఆంక్షలు విధించారు. దానికి ప్రత్యామ్నాయంగా, పార్లమెంట్కు సమీపంలో ఉంటూ.. ప్రజాస్వామ్య యుతంగా నిరసనలు తెలుపుకోవడానికి వీలుగా ఉండే ‘జంతర్ మంతర్ రోడ్డు’ను అధికారిక నిరసన స్థలంగా ప్రకటించారు. అలా 1993 నుండి ఇది ఉద్యమాల వేదికగా రూపాంతరం చెందింది.దేశాన్ని కదిలించిన చారిత్రక ఉద్యమాలుగడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎన్నో చారిత్రక మరియు సామాజిక మార్పులకు జంతర్ మంతర్ సాక్ష్యంగా నిలిచింది.అన్నా హజారే ఉద్యమం (2011): అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నేతృత్వంలో సాగిన జన లోక్పాల్ ఉద్యమం ఇక్కడి నుంచే దేశాన్ని కదిలించింది. ఈ ఉద్యమ ఫలితంగానే తదనంతరం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ఆవిర్భవించింది.నిర్భయ ఆందోళనలు (2012): దేశవ్యాప్తంగా ప్రజాగ్రహాన్ని రగిల్చిన నిర్భయ హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున యువత, పౌరులు ఇక్కడే చేరి న్యాయం కోసం పోరాడారు.ఇతర ప్రముఖ నిరసనలు: రోహిత్ వేముల మరణం తర్వాత జరిగిన విద్యార్థి ఆందోళనలు, ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ కోసం మాజీ సైనికులు చేసిన సుదీర్ఘ పోరాటాలు ఇక్కడే సాగాయి.నిషేధం.. ఆపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు2017లో పర్యావరణ కారణాలు, స్థానికులకు కలిగే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’జంతర్ మంతర్ వద్ద నిరసనలపై నిషేధం విధించింది. అయితే శాంతియుతంగా నిరసన తెలపడం అనేది పౌరుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేస్తూ 2018లో గౌరవ సుప్రీంకోర్టు ఇక్కడ ధర్నాలు చేసుకునే ప్రజాస్వామ్య హక్కును పునరుద్ధరించింది.ఇది కూడా చదవండి: ‘బొద్దింకలు’ భయపడవు, చావవు: అభిజీత్ దిప్కే -
ఢిల్లీ అగ్నిప్రమాదం: కుక్ నిర్లక్ష్యమే కొంపముంచిందా?
న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలోని మాలవీయ నగర్ ‘ఫ్లరిష్ ఇన్’ హోటల్లో 21 మందిని బలితీసుకున్న అగ్నిప్రమాదం కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ వంటవాడు (కుక్) కేశవ్ నేగిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇతని నిర్లక్ష్యం కారణంగానే మంటలు వేగంగా వ్యాపించడమే కాకుండా, హోటల్లోని ఎలక్ట్రానిక్ తలుపులు లాక్ అయిపోయి, పెను విషాదానికి దారితీసిందని పోలీసు వర్గాల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.ఒకే ఒక్క స్విచ్ కారణంగా..పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కిచెన్లో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన కుక్ కేశవ్ నేగి, హోటల్ మెయిన్ పవర్ స్విచ్ (ఎలక్ట్రిసిటీ సప్లై)ను పూర్తిగా ఆఫ్ చేసి, దట్టమైన పొగల మధ్య నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పారిపోయాడు. ఆయన తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే హోటల్లో ఉన్నవారికి మృత్యుపాశంగా మారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్లోని సెన్సార్ ఆధారిత ఎలక్ట్రానిక్ తలుపులన్నీ జామ్ అయిపోయాయి. లోపల ఉన్న బాధితులు బయటకు వచ్చే మార్గం లేక లోపలే చిక్కుకుపోయారు.బాత్రూమ్లోనే భార్యాభర్తల సజీవ దహనంఈ ప్రమాదంలో అత్యంత దయనీయమైన పరిస్థితులు వెలుగుచూశాయి. పవర్ కట్ కావడంతో తలుపులు తెరుచుకోక, దట్టమైన పొగలు హోటల్ అంతటా కమ్మేశాయి. కేవలం ఒకే ఒక ఎగ్జిట్ పాయింట్ ఉండటం, కిటికీలన్నీ శాశ్వతంగా మూసివేసి (సీల్డ్) ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకోలేక విలవిలలాడారు. ఓ జంట (భార్యాభర్తలు) ప్రాణాలు కాపాడుకోవడానికి బాత్రూమ్లోకి వెళ్లగా, అక్కడ కూడా డోర్ లాక్ అయిపోయింది. బయటకు రాలేక, ఊపిరాడక వారు అక్కడికక్కడే మరణించారు. నేగి చేసిన నిర్లక్ష్యపు పనే ఇంతమంది ప్రాణాలు గాల్లో కలవడానికి ప్రధాన కారణమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు.ముమ్మరంగా సాగుతున్న పోలీసు విచారణఅగ్ని ప్రమాదం జరిగిన ఐదు అంతస్తుల ఈ ఇరుకైన భవనంలో మొత్తం 22 గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ నడుస్తుండగా, బేస్మెంట్, పై అంతస్తులను హోటల్గా ఉపయోగిస్తున్నారు. హోటల్ యజమాని లవకేష్ బజాజ్ను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేయగా, తాజాగా కుక్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయడానికి హోటల్ సిబ్బందిని, ఇతర నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు. -
మన దేశంలోనూ ‘అద్దె ప్రియుళ్లు’.. జాబితాలో హైదరాబాద్!
న్యూఢిల్లీ: జపాన్లో ఎంతగానో ప్రాచుర్యం పొందిన ‘రెంట్-ఎ-బాయ్ఫ్రెండ్’ (అద్దెకు ప్రియుడు) అనే వింత కాన్సెప్ట్ ఇప్పుడు భారతదేశంలోనూ అడుగుపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్, ఒక వెబ్సైట్ ద్వారా బాయ్ఫ్రెండ్ను అద్దెకు తీసుకుని, అతనితో రోజంతా మాల్లో గడిపిన వీడియోను పంచుకోవడంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రారంభ ధర కేవలం రూ. 1,500 లకే లభిస్తున్న ఈ వినూత్న సేవలు ప్రస్తుతం ఇంటర్నెట్లో చర్చకు దారితీశాయి.రూ. 1,500 లతో మొదలు.. షాపింగ్ మాల్లో..ఇషా భల్లా అనే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘Kopartner.in’ అనే ప్లాట్ఫారమ్ నుండి ఆమె ఒక పురుష తోడును (Male Companion) అద్దెకు తీసుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశంలో అతడిని కలిసి, ఆపై మాల్కు వెళ్లినట్లు ఆమె తెలిపారు. అక్కడ అతను తనకు షాపింగ్లో సహాయం చేశాడని, బ్యాగులు మోసాడని, అలాగే తన మాజీ ప్రియుడి గురించి చెబుతూ, ఎమోషనల్ అయినప్పుడు జోకులు వేస్తూ తనను ఓదార్చాడని ఆమె పేర్కొన్నారు. చివరగా ఆ సేవలకు గానూ అతనికి డబ్బులు చెల్లించి వీడ్కోలు పలికినట్లు ఇషా వివరించారు.గంటల లెక్కన రేట్లు.. దేశవ్యాప్తంగా సేవలుఈ అధికారిక వెబ్సైట్ నేరుగా ‘బాయ్ఫ్రెండ్’ అని పేర్కొననప్పటికీ, సామాజిక మద్దతు, విభిన్న జీవనశైలి సేవలను అందిస్తోంది. ఇందులో మూవీ కంపానియన్, క్లబ్బింగ్ వంటి సేవలకు గంటకు రూ. 2,000, షాపింగ్ బడ్డీ సర్వీస్కు గంటకు రూ. 1,200, ట్రావెల్ పార్టనర్కు గంటకు రూ. 2,500 చొప్పున వసూలు చేస్తున్నారు. అలాగే వృద్ధుల సంరక్షణ, గృహ సహాయం వంటి సేవలు గంటకు రూ. 1,000 నుండి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది.ఉద్యోగాల్లేకనే ఈ వింత పోకడలుఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ‘మనం ఏ కాలంలో బతుకుతున్నాం?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు ‘ఇదంతా పచ్చి అబద్ధం, ఎవరూ డబ్బులు వృథా చేయకండి’ అని హెచ్చరిస్తున్నారు. ఇంకొందరైతే దేశంలో ‘నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరింది’ అనడానికి ఇదే నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. కాగా, తాము పూర్తిగా ధృవీకరించిన, సురక్షితమైన ప్రొఫెషనల్స్ ద్వారానే ఈ సేవలను అందిస్తున్నామని సదరు వెబ్సైట్ స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ‘లింగ వివక్ష బస్సులు’.. ఉచిత బస్సులపై రచ్చ! -
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. ఢిల్లీలో ఉత్కంఠ!
సాక్షి, న్యూఢిల్లీ: నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళనపై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. నిరసనను అడ్డుకోవాలని శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ ‘సేవ్ ఇండియా ఫౌండేషన్’ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) తోసిపుచ్చింది.ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆవిర్భవించిన సీజేపీ విదేశీ సర్వర్ల ద్వారా దేశంలో అస్థిరత సృష్టించేందుకు కుట్ర చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. యువతను రెచ్చగొట్టేలా ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, జాతీయ రహదారుల వద్ద ముందు జాగ్రత్తగా భద్రతా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ నిరసనకు అనుమతి నిరాకరించాలని లేదా వేరే ప్రాంతానికి మార్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.వాదనలు విన్న జస్టిస్ సౌరభ్ బెనర్జీ, జస్టిస్ అమిత్ శర్మల వెకేషన్ బెంచ్ ఈ పిల్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. ఆందోళనకు సంబంధించిన ప్రస్తుత దశలో ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పిటిషన్ను విచారణ జాబితాలో చేర్చేందుకు నిరాకరిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనకు తరలి రావాల్సిందిగా దేశంలోని యువతకు దిప్కే సోషల్ మీడియా వేదికగా ఇటీవల పిలుపునివ్వడం తెల్సిందే. అంతేకాదు, 6న ఢిల్లీకి వస్తున్న తనను విమానాశ్రయం వద్దే కలుసుకోవాలని కూడా అతడు కోరాడు. -
ఒంటిపై గాయాలు, గీతలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేసులో ట్విస్ట్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళా ప్రొఫెసర్ తన అపార్ట్మెంట్లో హత్యకు గురైన ఘటన సంచలనం రేపింది. ఫ్లాట్ లోపల నుంచి తాళం వేసి ఉండటం, శరీరంపై గాయాలు కనిపించడంతో పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనపై పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితురాలిని డెవోస్మితా పాల్గా గుర్తించారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె వసుంధర ఎన్క్లేవ్లోని ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పలువురు ఫోన్ కాల్స్కు ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో, ఆమె సోదరి ప్రత్యక్షంగా అపార్ట్మెంట్కు వెళ్లారు. అక్కడ ఫ్లాట్ బయట నుంచి తాళం వేసి ఉండటంతో అపార్ట్మెంట్ సిబ్బంది సహాయంతో తలుపు తెరిచి లోపలికి వెళ్లగా, మహిళా ప్రొఫెసర్ శవమై కనిపించారు.అయితే, ప్రాథమిక విచారణలో శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తలపై బలమైన దెబ్బలు, మణికట్టు వద్ద గాయాలు కనిపించినట్లు ఫోరెన్సిక్ టీమ్ తెలిపింది. దీంతో ఇది సహజ మరణం కాకుండా హత్యగా నిర్ధారించి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇంట్లో నగదు, విలువైన వస్తువులు యథాతథంగా ఉండటంతో దోపిడీ కోణాన్ని పోలీసులు తాత్కాలికంగా పక్కన పెట్టారు. దీని ఆధారంగా ఈ హత్య వ్యక్తిగత శత్రుత్వమా? లేదా తెలిసిన వ్యక్తి ద్వారా జరిగిందా అనే కోణం దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఇక, ఈ కేసులో పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసిన అంశం. ఫ్లాట్ బయట నుంచి తాళం వేసి ఉండటమే. ఘటన అనంతరం నిందితుడు తలుపు వేసి వెళ్లి ఉండవచ్చని లేదా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరిస్తున్నారు. అలాగే, అపార్ట్మెంట్లోకి వచ్చిన వ్యక్తుల వివరాలు పరిశీలించినట్టు తెలిపారు. బాధతురాలు మొబైల్ కాల్ డేటా రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఢిల్లీ యూనివర్సిటీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. -
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేగింది. ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఇంకా మరువక ముందే.. తాజాగా నోయిడాలోని ఓ ఎత్తైన అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.నోయిడాలోని ఐవీ కౌంటీ (Ivy County) అపార్ట్మెంట్ సముదాయంలోని 12వ అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో భవనం పైభాగం నుంచి భారీగా పొగలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్ముకుపోవడంతో నివాసితులు భయాందోళనలకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలోని ఇతర ఫ్లాట్లలో ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.A fire broke out at the IVY County residential complex in Sector 75, Noida, raising serious concerns about the city’s firefighting preparedness. According to residents, fire brigade hoses were unable to project water beyond the sixth floor. pic.twitter.com/YnFPXZvW3N— Sanjay Kishore (@saintkishore) June 5, 2026ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై విచారణ కొనసాగుతున్న వేళే, తాజాగా నోయిడాలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం భవనాల అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రస్తుతం మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘‘నా స్నేహితుల్లో చాలామంది చనిపోయారు’’
ఢిల్లీలోని మాలవీయ నగర్లో ఉన్న ఫ్లోరిష్ స్టేస్లో బస చేసిన గినియా పౌరుడు హోటల్ అగ్నిప్రమాదం తర్వాత హృదయ విదారక అనుభవాన్ని తెలిపాడు. తన స్నేహితుల్లో పలువురిని కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. వారిలో చికిత్స నిమిత్తం భారత్కు వచ్చిన ఓ నైజీరియా రోగి, అతని తల్లి కూడా ఉన్నారని తెలిపాడు.ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘‘నేను 2 నెలల క్రితం ఫ్లోరిష్ స్టేస్కు వచ్చాను. నేను, నా తండ్రి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్స కోసం ఇక్కడికి వచ్చాం. శనివారం మాక్స్ హాస్పిటల్లో చేరాం. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో మేము ఈ హోటల్లో లేము. నేను, నా తండ్రి ఆస్పత్రిలో ఉన్నాం. నిన్న ఈ హోటల్లో ఏమి జరిగిందో నాకు తెలుసు. నా స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు. ఈ హోటల్లో చాలా మంది చనిపోయినట్లు చూశాను. నా స్నేహితుల్లో చాలామంది చనిపోయారు. నైజీరియాకు చెందిన నా ఓ స్నేహితుడు తన తల్లితో కలిసి క్యాన్సర్ చికిత్స కోసం ఇక్కడికి వచ్చాడు. అతను చనిపోయాడు. అతని తల్లి కూడా చనిపోయింది. కాంగోకు చెందిన ఇద్దరు కూడా చికిత్స కోసం వచ్చారు. ఓ వ్యక్తి, అతని భార్య మాక్స్ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చారు. వారు కేవలం ఒక వారం మాత్రమే ఈ హోటల్లో ఉన్నారు. అతను కూడా చనిపోయాడు. నాలుగో అంతస్తులో చాలా మంది చనిపోయారు. కాంగోకు చెందిన ఆ ఇద్దరూ అక్కడే ఉన్నారు. మిగిలిన వారు కూడా నాలుగో అంతస్తులోనే, నా గది పక్కనే ఉన్నారు. నా గది చిన్నది కాదు.. పెద్దదే. వాష్రూమ్ కూడా ఉంది. అన్నీ బాగున్నాయి. కిటికీ కూడా ఉంది. గాజు కిటికీ ఉంది. దానికి తాళం కూడా ఉంది’’ అని చెప్పారు. -
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల
ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, గుజరాత్ నుంచి రాజుభాయ్ శుక్లా, ముకేశ్ భాయ్ రత్వ, మాన్సింగ్, జితేంద్ర మేక్జి భాయ్, మణిపూర్ నుంచి శారదా దేవి, రాజస్థాన్ నుంచి ఆల్క గుర్జర్, సతీష్ పునియా ,ఒడిశా నుంచి దేభాషిస్ సమంతరే, లు పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది.కాగా ఇటీవలే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న పెద్దల సభకు ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదే రోజున ఫలితాలుంటాయి. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నామినేషన్ దాఖలుకు జూన్ 8 చివరితేదీ కాగా జూన్ 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్ 11 వరకూ విత్డ్రాకు సమయముంటుంది. జూన్ 20తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది -
రూల్స్ లేవ్.. ఢిల్లీలో ఇంతే: హోటల్ యజమాని
ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2022లో 60 ఏళ్ల లవ్కేశ్ బజాజ్ దక్షిణ ఢిల్లీలోని హౌజ్ రాణి ఇరుకైన వీధుల్లో ఉన్న మూడు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసి, దాన్ని బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ (బీ అండ్ బీ) సంస్థగా మార్చాలని నిర్ణయించాడు.ఆ భవనానికి త్వరలోనే ఫ్లోరిష్ స్టేస్ బీ అండ్ బీ అనే కొత్త పేరు పెట్టారు. ఆ తర్వాత అది ఐదు అంతస్తులు, ఒక బేస్మెంట్లో 26 గదుల ప్రాంగణంగా మారింది. అయితే, కేవలం 6 గదులకే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు.బుధవారం అదే హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది అతిథులు మరణించారు. వారిలో 12 మంది విదేశీయులు. అదే రాత్రి బజాజ్ను అరెస్టు చేశారు.పోలీసులు ప్రశ్నించగా.. వ్యాపారం మంచి లాభాలు తెస్తుండటంతో హోటల్లో గదుల సంఖ్య పెంచానని, అలాగే ‘ఢిల్లీ మేన్ సబ్ చల్తా హై (ఢిల్లీలో అన్నీ చెల్లుతాయి)’ అనే భావనతో అలా చేశానని బజాజ్ చెప్పినట్టు ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలో నిబంధనలు, పరిమితులు, ఆంక్షలు ఏమీ ఉండవనేలా, ఏదైనా చేసుకోవచ్చనేలా ఆ హోటల్ యజమాని మాట్లాడారు. పూర్తి సమయం హోటల్ నిర్వహణ చూసుకునే అవకాశం తనకు లేకపోవడంతో, అన్ని కార్యకలాపాలు నిర్వహించేందుకు సిబ్బందిని నియమించుకున్నానని కూడా బజాజ్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అంశాలపై బజాజ్ భార్యను కూడా ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు.ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఆరు గదులకే అనుమతి ఉంటే 26 గదులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అలాగే అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) లేదు. అంతేగాక, ఆ ప్రాంగణం అంతటా సులభంగా మంటలు అంటుకునే అలంకరణ సామగ్రి ఉన్నట్లు తేలింది.బుధవారం ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) అధికారి మాట్లాడుతూ.. అలంకరణలో భాగంగా భవనం లోపల, బయట అనేక చెక్క, ప్లాస్టిక్ ఫ్రేమ్లు ఏర్పాటు చేశారని, దీంతో మంటలు వ్యాపించే ప్రమాదం పెరిగిందని చెప్పారు.బజాజ్ ఆ ప్రాంతంలో మరో రెండు ప్రాపర్టీలను కూడా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. భద్రతా, నియంత్రణ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఇప్పుడు వాటినీ పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఢిల్లీ ఘటనలో మరో హృదయ విదారక దృశ్యం
ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో హృదయ విదారక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘ఆమె వీల్ఛైర్లో కూర్చుని ఉంది. ఆమె పక్కనే కుర్చీలో ఉన్న వ్యక్తి ఆమెను గట్టిగా కౌగిలించుకోగా.. ఆమె తన తలను అతని భుజంపై ఆనించింది. రక్షణ కోసం ఎదురుచూస్తూనే.. వారు ఒకరి చేతుల్లో ఒకరు ప్రాణాలు విడిచారు. వీల్ఛైర్లో ఒకరు.. చేతులు గట్టిగా పట్టుకుని మరో జంట.’’ సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బందికి కన్పించిన దృశ్యాలు వారిని కంటతడి పెట్టించింది.బుధవారం ఉదయం ఢిల్లీలోని 'ఫ్లరిష్ స్టే బిఎన్బి' హోటల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ మహిళ టాయిలెట్ సీటుపై కూర్చుని ఉండగా.. ఆ పురుషుడు ఆమె పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఆమెను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. మంటల నుండి తప్పించుకోవచ్చనే ఆశతో వారు లోపల తాళం వేసుకున్నట్లు తెలుస్తోందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మరో గదిలో బెడ్ అంచున కూర్చుని ఉన్న ఒక జంట కనిపించింది. వారిద్దరూ పూర్తిగా కాలి బూడిదయ్యారని లోపల దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయన్నారు. బేస్మెంట్ (భూగర్భ గది) ద్వారా భవనంలోకి ప్రవేశించాం. హోటల్లోకి ప్రవేశించడానికి తాము షట్టర్ను కట్ చేశాం. బేస్మెంట్లోకి ప్రవేశించినప్పుడు, రిసెప్షన్ సమీపంలో పూర్తిగా కాలిపోయిన మొదటి మృతదేహాన్ని చూశాం. అది 20 ఏళ్ల వయసున్న అమ్మాయిది. ఆమె చేతులు, కాళ్లు బిగుసుకుపోయి ఉన్నాయి. ఆమె అక్కడికక్కడే మరణించింది. అక్కడి నుండి కొన్ని అడుగుల దూరంలో, వీల్చైర్పై ఉన్న ఒక వ్యక్తి కూడా కాలి చనిపోయి కనిపించాడు. మేం ముందుకు వెళ్లినప్పుడు.. ముగ్గురు విదేశీయులు స్పృహ తప్పి పడి ఉండటం చూసి వారికి సీపీఆర్ చేశామని రెస్క్యూ సిబ్బంది గుర్తు చేసుకున్నారు. -
ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో సంభవించిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే అధికారుల అవినీతి, వ్యవస్థ విఫలమై ఇలాంటి ఘోర విషాదాలు సంభవించినప్పుడు, సామాన్య పౌరులే హీరోలుగా నిలుస్తారు. అసాధారణమైన ధైర్య సాహసాలతో బాధితులను మృత్యు ముఖం నుంచి బయటపడేస్తారు. ఢిల్లీ ఘటనలో కూడా స్థానిక యువకులే ఎంతోమంది ప్రాణాలును కాపాడారు.బుధవారం ఉదయం, దక్షిణ ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ఫ్లోరిష్ స్టే బి&బిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఆ సమయంలో స్థానిక నివాసితులు ఎలాంటి రక్షణాలు కవచాలు లేకుండానే రంగంలోకి దూకి ప్రాణాలకు తెగించి మరీ ఎంతోమంది బాధితులను కాపాడారు.భవనాన్ని చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు, నలుదిశలా కమ్మేస్తున్న పొగ, బాధితుల హాహాకరాలు, భయాందోళనలు ఇలాంటి నిస్సహాయ వాతావరణంలో, మంటల నుండి తప్పించుకోవడానికి కిటికీల నుండి దూకుతున్న అనేకమందితో సహా, లోపల చిక్కుకుపోయి వారిని రక్షించాలనే తపనతో వారు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారిలో ఒకరు మహమ్మద్ అఫ్జల్, మౌ.షాహరూఖ్, మౌ.అనీష్, మౌ.అమీర్, మౌ.వసీం, రియాజవుద్దీన్ గద్దె వాలా, ఇంకా స్థానికులు ఉన్నారు. VIDEO | Delhi Malviya Nagar Hospital fire: Wasim Raja, one of the first rescuers, says, "As soon as we reached the scene at around 8:50 am, the entire building was already engulfed in flames. Right across from the building, there is a mattress and quilt shop owned by Riyazuddin,… pic.twitter.com/3XGJc3n4uJ— Press Trust of India (@PTI_News) June 4, 2026మహమ్మద్ అఫ్జల్సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే స్థానికులు ఎలా తాత్కాలిక సహాయక చర్యలు చేపట్టారో వివరించారు. తాము అక్కడి చేరుకునేటప్పటికే భారీ అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయనీ, వెంటనే ఎదురుగా ఉన్న అర్మాన్స్' దుకాణం నుండి తెచ్చిన పరుపులను కింద పరిచి, హోటల్ నుంచి వారిని కిందకు దూకమని కోరామని తెలిపారు. కొందరు విజయవంతంగా దూకగా, మరికొందరు దూకలేకపోయారని అఫ్జల్ చెప్పారు. వీరి మాటల ప్రకారం ఆ తర్వాత, పరిస్థితి విషమించడంతో మంటలు తీవ్రమవడంతో హాజీ సాహిబ్ పోలీస్ స్టేషన్కు, అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. చివరికి, అగ్నిమాపక దళం చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. దాంతో వీరు భవనంలోకి ప్రవేశించి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.రూ. 2 లక్షల విలువైన పరుపులుఅగ్నిప్రమాదం నుండి బాధితులను కాపాడటానికి లక్షల విలువైన పరుపులను వినియోగించారు స్థానిక దుకాణ యజమాని. అతను అతని కుమారుడు లేకపోయి ఉంటే ఈ విషాదం మరింత ఘోరంగా ఉండేది. ఆ ఇద్దరూ దాదాపు రూ. 2 లక్షల విలువైన కొత్త పరుపులను త్యాగం చేసి, అనేక ప్రాణాలను కాపాడటానికి సహాయపడిన ఒక తాత్కాలిక రక్షణ వలయాన్ని ఏర్పరిచారు.తన సరుకుకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా, పరుపుల యజమాని తమకు సహాయం చేయడానికి ఏమాత్రం సంకోచించలేదని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రత్యేకమైన రెస్క్యూ పరికరాలేవి అందుబాటులోలేకపోవడంతో అతని షాపులోని దుప్పట్లతోనే బాధితులను పైఅంతస్తుల నుండి జాగ్రత్తగా కిందకు దించి, ఆసుపత్రిలకు తరలించామని అఫ్జల్ చెప్పారు.వసీం రాజామరో హీరో వసీం రాజా. అత్యవసర పరిస్థితిలో తన వృత్తిపరమైన శిక్షణ కీలకమని నిరూపించారు. మాక్స్ హాస్పిటల్లో పనిచేసే రాజా, పొగ పీల్చడం వల్ల బాధపడుతున్న బాధితులకు సహాయం చేయడానికి వెంటనే తన వైద్య శిక్షణను ఉపయోగించాడు. సామూహిక ప్రాణనష్టం జరగకుండా, సీపీఆర్ (CPR) చేసి కొంతమందికి ప్రాణభిక్ష పెట్టారు. నోటి ద్వారా శ్వాస అందించి కొంతమందిని కాపాడగిలిగాం కానీ, దురదృష్టవశాత్తు మరికొందరిని రక్షించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలు -
ఢిల్లీ హోటల్ ఘటన: సిలిండర్ పేలుడు కాదంట!
ఢిల్లీ: మాలవీయా నగర్లోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై.. ప్రాథమిక దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూశాయి. అగ్ని ప్రమాదానికి సిలిండర్ బ్లాస్ట్ కారణం కాదని పోలీసులు ధృవీకరించారు. దీంతో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘోరం జరిగి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.మొదట్లో ఈ అగ్ని ప్రమాదం ఎల్పీజీ సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా? అనుమానం వ్యక్తమైంది. కానీ దర్యాప్తు బృందాలు ఆ కోణాన్ని ప్రస్తుతం పూర్తిగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత సిలిండర్ పేలుడు జరిగినట్లు సూచించే ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో గ్యాస్ ఎక్స్ప్లోషన్ కారణమన్న వాదన బలహీనపడింది.దర్యాప్తులో బయటపడిన మరో ముఖ్య విషయం ఏమిటంటే.. హోటల్లో రెండు వేర్వేరు కిచెన్లు ఉండటం. వాటిలో ఒకటి భవనం బేస్మెంట్లో ఉండగా, మరొకటి పై అంతస్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు కిచెన్లలోనూ అనేక ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉన్నప్పటికీ, అవి ఏదీ పేలిన ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని ప్రాథమిక తనిఖీల్లో తేలింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో మంటలు ఎలా ప్రారంభమయ్యాయి, ఏ ఎలక్ట్రికల్ పాయింట్ నుంచి షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న అంశాలపై దర్యాప్తు బృందాలు మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బ్రేక్ఫాస్ట్ కోసం వంటమనిషి(చెఫ్) ఎలక్ట్రిక్ స్టవ్ వినియోగ సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ కోణమే ప్రధాన అనుమానంగా కొనసాగుతోంది. అయితే, ఇది తుది నిర్ధారణ కాదని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే పూర్తి స్పష్టత రానుందని అధికారులు పేర్కొంటున్నారు.దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ హౌజ్రాణి ప్రాంతంలో ఉన్న ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. బుధవారం ఉదయం 8.50 గంటల సమయంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లో భవనం అంతటా వ్యాపించడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు ఆఫ్రికా, తుర్క్మెనిస్థాన్కు చెందిన విదేశీయులు కూడా ఉన్నారు. గురుగ్రావ్కు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు మరణించారు. మరో 35 మంది గాయపడగా, వారిలో 19 మంది పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. భవనంలో ఒకే ఎగ్జిట్ ఉండటం, అనుమతులకు మించి గదులు నిర్వహించడం, బేస్మెంట్తో సహా అనధికార నిర్మాణాలు ఉండటం వల్ల ఎక్కువ మంది బయటపడలేకపోయారని అధికారులు చెబుతున్నారు. కొందరు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా, ఒక మహిళ తన చిన్నారితో సహా మూడో అంతస్తు నుంచి దూకిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ హోటల్ ప్రభుత్వ B&B పథకం కింద నడుస్తుండగా, కేవలం ఆరు గదుల అనుమతి ఉన్నా 25 గదుల వరకు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న హోటల్ యాజమానిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. ప్రమాద సమయంలో తాను అక్కడే ఉన్నానని.. భయంతో పారిపోయానని చెబుతున్నాడతను. -
ఢిల్లీ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
-
అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్!
ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో జరిగిన ఘోర హోటల్ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. తండ్రి చికిత్స కోసం ఆసుపత్రికి దగ్గరగా ఉండాలని గుర్గ్రామ్ నుంచి వచ్చిన ఆ కుటుంబం.. అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకోవడం గమనార్హం. సౌత్ ఢిల్లీలోని ఫ్లారిష్ స్టే బీ అండ్ బీ హోటల్లో మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐదు అంతస్తుల ఇరుకైన భవనంలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారికి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది మృతి చెందగా, వారిలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మరణించిన భారతీయుల్లో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. గుర్గ్రామ్ సెక్టార్ 46కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ అగర్వాల్ (48), ఆయన భార్య తరణి అగర్వాల్, తల్లి ప్రేమలత అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా (ఏంజెల్), వర్య (పర్ల్)తో పాటు మరో ఇద్దరు బంధువులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రెండు తరాలు ఈ ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోయాయి.ఈ కుటుంబం ఢిల్లీకి రావడానికి కారణం అత్యంత హృదయ విదారకం. వివేక్ తండ్రి రాధేశ్యామ్ అగర్వాల్ (80లు) శ్వాస సంబంధిత వ్యాధితో సాకేత్లోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, ఆయనకు దగ్గరగా ఉండేందుకు కుటుంబం సమీపంలోని హోటల్లో బస చేసింది. తండ్రిని చూసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన ఈ ప్రయాణం ఒక్కసారిగా శాశ్వత విషాదంగా మారింది.తరుణి అగర్వాల్ వైపు నుంచి వచ్చిన మరో ముగ్గురు బంధువులు కూడా అదే హోటల్లో ఉండగా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం ఎనిమిది మంది ఒకే కుటుంబం నుంచి మరణించారు. మరింత హృదయ విదారకంగా, చికిత్స పొందుతున్న రాధేశ్యామ్ అగర్వాల్ వద్దకే తన భార్య, కుమారుడు, కోడలు, మనవళ్లు, బంధువుల మృతదేహాలు చేరిన పరిస్థితి కుటుంబాన్ని పూర్తిగా కుదిపేసింది.ఈ ఘటనలో మరణానికి ముందు జరిగిన చివరి క్షణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యుడు పునీత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం, మంటల సమయంలో వివేక్ అగర్వాల్ చివరిసారిగా ఫోన్ చేసి “బహుశా మేము బతకలేము” అని చెప్పినట్లు తెలిపారు. తడి రుమాలు ముఖానికి పెట్టుకోవాలని సూచించినా.. పరిస్థితి వేగంగా దారుణంగా మారిందని ఆయన పేర్కొన్నారు.ప్రాథమిక దర్యాప్తులో హోటల్లో తీవ్ర భద్రతా లోపాలు ఉన్నట్లు బయటపడింది. ఒకే ప్రవేశ–నిష్క్రమణ మార్గం ఉండడం, చిన్న కిటికీలు, సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్ల అనేక మంది బయటకు రాలేకపోయారు. కొన్ని కిటికీలు మూసివేయబడినట్లు కూడా గుర్తించారు.అంతేకాకుండా హోటల్ అనుమతి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి. బీ అండ్ బీ విధానంలో ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉండగా, అక్కడ 25 గదులు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్లో అనుమతి లేకుండా రెస్టారెంట్ నడపడం, బేస్మెంట్లో సరైన ఎగ్జిట్ లేకపోవడం, భవనం చుట్టూ గుంపుగా ఉండటం, విద్యుత్ తీగల అడ్డంకులు కూడా రక్షణ చర్యలకు ఆటంకంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో హోటల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.మొత్తం ఘటనలో గుర్తింపు సమస్యలు కూడా కుటుంబాలను తీవ్రంగా బాధిస్తున్నాయి. తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలను ఫోటోల ఆధారంగా గుర్తించడం కూడా సాధ్యం కావడం లేదని బంధువులు చెబుతున్నారు. ఆసుపత్రుల వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు, కన్నీరు.. హృదయాలను కలిచివేస్తున్నాయి. -
ఢిల్లీలో ఘోరం
న్యూఢిల్లీ: నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఢిల్లీలోని ఫ్లోరిష్ స్టే బీ అండ్ బీ హోటల్ బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మసిబొగ్గులా మారింది. తమ బంధువుల శస్త్రచికిత్సలు, వైద్యం కోసం విదేశాల నుంచి వచ్చి ఆస్పత్రి సమీప ఈ హోటల్లో బసచేస్తున్న పలువురు విదేశీయులు ఈ అగ్ని ప్రమాదంలో కాలిబూడిదయ్యారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో 11 మంది విదేశీయులు సహా మొత్తంగా 21 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో 9 మంది ఆఫ్రికా దేశస్తులుకాగా ఇద్దరు తుర్క్మెనిస్తాన్ దేశస్తులు. పది మంది భారతీయులూ ఈ ఘటనలో చనిపోయారు. ఉదయంకావడంతో కొందరు నిద్రలోనే శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయారు. అగ్ని ప్రమాదం విషయం తెల్సి అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 35 మందిని కాపాడారు. వీరిలో 16 మందికి స్వల్ప గాయాలుకాగా 19 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. హోటల్లోని అతిథులు, పోలీసులు, స్థానికులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు కలిపి మొత్తంగా 58 మంది ఈ ఘటనలో ప్రభావితమయ్యారు. ఘోర అగ్నిప్రమాదం వార్త తెలిసి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. సెన్సర్తో పనిచేసే తలుపులు మూసుకుపోయి బయటకురాలేక, అగ్నికీలల వేడిమికి తాళలేక హోటల్లోని అతిథులు కాపాడండి అంటూ చేసిన ఆక్రందనలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. హోటల్ జయమాని అరెస్టునిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్వహిస్తూ ఈ ఘటనలో పలువురి మృతికి కారణమయ్యాడంటూ హోటల్ యజమాని లోకేశ్ బజాజ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. పరారీలో ఉన్న అతన్ని పోలీసులు రాత్రి పొద్దుపోయాక అరెస్టు చేశారు. ప్రమాదం వార్త తెలిసి రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు తలో రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. క్షతగాత్రులకు తలో రూ.50,000 మంజూరుచేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ సైతం మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. అసలేం జరిగింది? దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లోని హౌజ్రాణి ప్రాంతంలో ఫ్లోరిష్ స్టే బీ అండ్ బీ హోటల్ ఒక ఐదంతస్తుల భవంతిలో నడుస్తోంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పథకంలో భాగంగా ఈ నివాస భవంతిని పేయింగ్ గెస్ట్ మాదిరిగా నడుపుతున్నారు. ఈ హోటల్లో కేవలం ఆరు గదులకు అనుమతి ఇవ్వగా నిబంధనలకు విరుద్ధంగా 25 గదుల్లో విదేశీయులకు వసతి కల్పించారు. లైబీరియా, మొజాంబిక్, నైజీరియా, బంగ్లాదేశ్లకు చెందిన వ్యక్తులు ఈ హోటల్ గదుల్లో దిగారు. కిక్కిరిసిన హోటల్లో బుధవారం ఉదయం 8.30 గంటలకు ఉదయం హోటల్ కిచెన్లో చెఫ్ ఒక ఎలక్ట్రిక్ వస్తువును స్విచ్ఛాఫ్ చేశాక ఎలక్ట్రిక్ ప్లగ్ నుంచి మంటలొచ్చాయి. ఆర్పేలోపే గది అంతా మంటలు వ్యాపించి చివరకు భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయని స్థానికుడు ఆసిఫ్ వెల్లడించాడు. క్షణాల్లో భవనం మొత్తాన్నీ అగ్నికీలలు చుట్టుముట్టాయి. సీల్ వేసిన కిటికీలు, ప్రతి అంతస్తులో సెన్సార్తో పనిచేసే తలుపులు అగ్నికీలల ధాటికి తెరుచుకోకపోవడంతో హోటల్లోని వాళ్లు తప్పించుకునేందుకు అవకాశం లేకుండాపోయింది. చెలరేగుతున్న మంటల్ని చూసిన స్థానికులు, పరుపులు అమ్మే దుకాణదారు అర్మాన్ వెంటనే హోటల్ ముందు పరుపులు, దుప్పట్లను పరిచారు. కొందరు సాహసించి పైనుంచి వాటిపై దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మూడో అంతస్తు నుంచి ఒక చిన్నారితో మహిళ కిందకు దూకిన వీడియో వైరల్గా మారింది. నాలుగో అంతస్తు నుంచి ఒక విదేశీ జంట కిటికీ అద్దాలు బద్దలుకొట్టి కిందకు దూకేశారు. తీవ్ర గాయాలపాలైన వీళ్లను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రిలో చేరి్పంచారు. పై నుంచి దూకిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దూకిన మొహమ్మద్ సాహిదుల్ ఇస్లాం, ఆరామిన్ జమాన్, రియానాలను ఆస్పత్రుల్లో చేరి్పంచారు. ప్రమాదం విషయం తెల్సి ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పలువురిని కాపాడి క్షతగాత్రులను సమీప ఆస్పత్రుల్లో చేరి్పంచారు. మృతులు, క్షతగాత్రుల్లో చాలా మంది మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాల వాళ్లే ఉన్నారు. ఆయా దేశాల రోగులు శస్త్ర చికిత్సలు, వైద్యం కోసం గతంలో సమీప ఆస్పత్రుల్లో చేరగా వాళ్ల బంధువులు ఈ ఫ్లోరిష్ బీ అండ్ బీ హోటల్లో దిగగా అనూహ్యంగా ఈ అగ్నిప్రమాదం బారిన పడ్డారు.ఆస్పత్రుల్లో విషాద దృశ్యాలు వైద్యం చేయించుకునేందుకు తాము వస్తే తమకు సాయపడేందుకు వెంట వచ్చిన బంధువులు విగతజీవులుగా మారారని తెల్సి సమీప మ్యాక్స్, సఫ్డర్జంగ్, ఎయిమ్స్, పండిత్ మదన్మోహన్ మాళవీయ ఆస్పత్రుల్లోని రోగులు కన్నీటిపర్యంతయ్యారు. తమ వాళ్లు అగ్నికీలలకు బలయ్యారని తెల్సి బంధువులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ‘‘నా అల్లుడు, కూతురు తరిణి అగర్వాల్(42), 17, 20 ఏళ్ల మనవరాళ్లు ఇదే హోటల్లో దిగారు. మంటల్లో అల్లుడు చనిపోయాడు. ఇప్పుడు కుమార్తె, మనవరాళ్ల జాడ తెలీడం లేదు’’అని ఒకతను కన్నీటిపర్యంతయ్యాడు. అగ్నికీలలు అంటుకున్న గంట తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇదే హోటల్లో దిగిన మా బంధువులు ఆరుగురూ చనిపోయారు. నలుగురి మృతదేహాలను గుర్తుపట్టా. మిగతా ఇద్దరి మృతదేహాలు ఎక్కడున్నాయో ఎవరూ చెప్పడం లేదు’’అని నమిత్ గోయల్ అని వ్యక్తి ఏడుస్తూ చెప్పారు.అడుగడుగునా నిబంధనలు బేఖాతరు హోటల్ను తర్వాత ఢిల్లీ ప్రభుత్వంలోని పలు విభాగాల ఉన్నతాధికారులు పరిశీలించగా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన కని్పంచింది. ఇరుకైన దారిలో నిర్మించిన ఈ ఐదంతస్తుల భవనం లోపలికి వెళ్లడానికి బయటకు రావడానికి కేవలం ఒక్కటే ద్వారం ఉంది. ఏడేళ్ల క్రితం ఒక్కటే పై అంతస్తు ఉండగా ఇటీవలే అనుమతుల్లేకుండా మిగతావి కట్టేశారు. ధారాళంగా గాలి వెలుతురు రాకుండా గదుల కిటికీలను సీల్వేసి ఉన్నాయి. పై అంతస్తుల్లో సెన్సర్తో పనిచేసే తలుపులు బిగించారు. అగ్నికీలలకు విద్యుత్ వైర్లన్నీ కాలిపోవడంతో సెన్సార్లు పనిచేయక తలుపులు తెరచుకోలేదు. దీంతో లోపల ఉన్న వాళ్లు మంటలకు, దట్టమైన పొగకు చనిపోయారు. ఆరు గదులకు అనుమతి ఇస్తే పాతిక గదులను నిర్మించి హోటల్ను అతిథులతో నింపేశారు. భవంతికి ఎలాంటి అగ్నిమాపకశాఖ నిరభ్యంతర సరి్టఫికేట్(ఎన్ఓసీ) లేదు అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ అఖిలాష్ మాలిక్ వెల్లడించారు. గ్రౌండ్ఫ్లోర్లో రెస్టారెంట్ నడుపుతున్నారు. బేస్మెంట్ మొదలు పై అంతస్తు, టెర్రస్దాకా మొత్తం గదులతో నింపేశారని స్థానికుడు షేక్ అలీ వెల్లడించారు. మంటలు వ్యాపించడంతో స్థానికులు ప్రధాన ద్వారం, కిటికీలను రాళ్లు, సుత్తితో పగలగొట్టి కొందరిని బయటకు లాగారు. 17 అగ్నిమాపక బృందాలు ఘటనస్థలికి చేరుకుని ఎట్టకేలకు మంటల్ని ఆర్పేశాయి. అతిథులను కాపాడే క్రమంలో 10 మంది పోలీసులు గాయపడ్డారు. వీళ్లను ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చేరి్పంచారు. -
కేంద్రంపై పోరుకు ఉమ్మడి కార్యాచరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, కూటమిలో నెలకొన్న అభిప్రాయ భేదాల నేపథ్యంలో మరోమరు విపక్షాల ఐక్యత చాటేందుకు, కేంద్ర ప్రభుత్వంపై పోరుకు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించేందుకు విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు 8వ తేదీన హస్తినలో భేటీకానున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సహా మొత్తం 15 పార్టీల అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం, ప్రతిపక్ష ఐక్యతను మరింత బలోపేతం చేయడం భేటీ ప్రధాన లక్ష్యాలుగా తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, నిరుద్యోగం, ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, అంతర్జాతీయ పరిస్థితులు వంటి ప్రజా సమస్యలపై సంయుక్త పోరాటానికి భేటీలో వ్యూహాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర పరిణామాలు, వివిధ రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. అయితే ‘ఇండియా’ కూటమిలోని కొన్ని పార్టీల మధ్య ఇటీవల అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు వార్తలు రావడం కూటమిలో గందరోగళం నెలకొంది. ‘ఇండియా’ కూటమితో తెగదెంపులు చేసుకున్న ఆప్ పార్టీ ప్రతి పక్షాల కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. తమిళనాడు ఎన్నికల అనంతరం పరిణాల నేపథ్యంలో కాంగ్రెస్తో తన బంధాన్ని తెంచుకుంటున్నట్లు డీఎంకే ప్రకటించింది. తమిళనాడులో కాంగ్రెస్తో పొత్తు తెగిపోయిన నేపథ్యంలో లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలకు దూరంగా కూర్చోవాలని డీఎంకే నిర్ణయించింది. డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి కొద్ది రోజుల కిందటే లోక్సభ స్పీకర్కు లేఖ రాసి తమ ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో డీఎంకే సమావేశానికి దూరంగా ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో డీఎంకే స్థానంలో విజయ్ జోసెఫ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి ప్రాధాన్యం లభించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
ఢిల్లీ విషాదం : షాకింగ్ విషయాలు వెలుగులోకి
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిప్రమాదం జరిగిన ప్రతిసారీ పునరావృతమయ్యే విషాద గాథ ఇదే. అంతులేని నిర్లక్ష్యం, నిబంధనలను తుంగలో తొక్కే అధికారుల అవినీతి, అధికారిక పర్యవేక్షణ లోపం వెరసి అమాయక ప్రజల ప్రాణాలు. ఢిల్లీలోని ఒక హెటల్లో జరిగిన అత్యంత విషాదకర ఘటన ఈ విషయాలనే మరోసారి తేటతెల్లం చేస్తోంది. బుధవారం ఉదయం ఢిల్లీలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో కనీసం 21 మంది అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో ఎక్కువమంది వైద్య కోసం వచ్చిన విదేశీయులు ఉండటం మరో విషాదం. అయితే ఈ హోటల్కు అనుమతికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఎన్డీటీవీ కథనం ప్రకారం హౌజ్ రాణి ప్రాంతంలోని ఈ హోటల్కు ఢిల్లీ ప్రభుత్వం బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ (బి&బి) పథకం కింద లైసెన్స్ మంజూరు చేసింది. దీని ప్రకారం, ఒక కాంప్లెక్స్ కేవలం ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఫ్లోరిష్ స్టే, బేస్మెంట్లోని కొన్ని గదులతో సహా 25 గదులను నిర్వహిస్తోంది.మరోవైపు ఢిల్లీ పోలీసుల ప్రకారం, ఈ హోటల్కు ఎంట్రీ, ఎగ్జిట్కు ఒకే దారి ఉంది. ఈ హోటల్లో 25 గదులు ఉండటం, ఏ సమయంలోనైనా అనేక మంది అతిథులు బస చేస్తుండటం గమనిస్తే, ఇది మరో నిబంధనల ఉల్లంఘనే. హోటల్కు అవసరమైన అగ్నిమాపక భద్రతా అనుమతులున్నట్టు తెలుస్తోంది. దీనిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.ఇదీ చదవండి: 7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడికాగా ఐదంతస్తుల భవనం బేస్మెంట్లో ఉన్న రెస్టారెంట్లో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మికాసా ఇన్ హోటల్ను కూడా ప్రభావితం చేశాయి. దట్టమైన పొగ, మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో, డజన్ల కొద్దీ అతిథులు లోపల చిక్కుకుపోయారు. దీంతో అత్యవసర సేవల సిబ్బంది భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాటర్ ఇంజన్లు, రెండు వాటర్ బౌజర్లు, ఒక క్విక్-రెస్పాన్స్ వాహనం, ఇతర అత్యవసర వనరులతో సహా పలు అగ్నిమాపక బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి, 40 మందికి పైగా ప్రజలను రక్షించారు. సంఘటన జరిగిన సమయంలో అందులో దాదాపు 40 మంది అతిథులు బస చేస్తున్నారని అధికారులు తెలిపారు. సమీపంలో మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు దగ్గరగా ఉండటం వల్ల చాలా మంది అతిథులు ఈ హోటల్నే ఎంచుకుంటారు. ఇదీ చదవండి: హోమియో Vs అల్లోపతి : అగ్గి రాజేసిన అనుష్క శర్మ పోస్ట్ -
ఢిల్లీ మృత్యుకేళి: ప్రాణాల కోసం పై నుంచి దూకారు..!
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో బుధవారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. హౌజ్రాణి ఏరియాలోని ఓ హోటల్లో భారీగా మంటలు చెలరేగడంతో 21 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా.. 40 మందికిపైగా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్నవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. ప్రమాద సమయంలో హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి.మంటలు వేగంగా వ్యాపించడంతో రెస్టారెంట్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో లోపల చిక్కుకున్న అతిథులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు భవనం పైఅంతస్తుల నుంచి కిందకు దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలో ఓ విదేశీయుడు, ఓ మహిళ ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటన్నది తెలియరావడం లేదు. మరికొందరు కూడా ప్రాణాలు అరచేత పట్టుకుని భవనం నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు. వాళ్లలో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. కింద నిల్చున్న స్థానికులు తమ ఫోన్లలో ఆ దృశ్యాలు బంధించారు.VIDEO | Death toll in fire in restaurant in south Delhi's Malviya Nagar goes up to 21, many of those killed are foreigners: officials. Latest visuals from incident spot.#DelhiNews #MalviyaNagarHotelFire(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/8QS1kYrx4v— Press Trust of India (@PTI_News) June 3, 2026ఉదయం సుమారు 9 గంటల సమయంలో అగ్నిప్రమాద సమాచారం అందడంతో ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పది కంటే ఎక్కువ ఫైర్ ఇంజిన్లు, ప్రత్యేక రక్షణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పొగతో నిండిపోయిన భవనంలోకి ప్రవేశించి చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు.Delhi hotel fire: woman seen jumping off building#MalviyaNagar #DelhiFire pic.twitter.com/4LoMU1ypqF— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026నిబంధనలకు విరుద్ధంగా..!ఈ ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ 'బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్' పథకం కింద కేవలం ఆరు గదులు నిర్వహించేందుకు మాత్రమే అనుమతి పొందిన లెమన్ గ్రీన్ హోటల్.. నిబంధనలకు విరుద్ధంగా 25 గదులు నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. బేస్మెంట్లో కూడా గదులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో భవన భద్రతా ప్రమాణాలు, అనుమతుల ఉల్లంఘనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Delhi Hotel Fire: Death Toll Rises to 21 in Malviya Nagar Tragedy#MalviyaNagar #DelhiFire pic.twitter.com/3lEpgIKWBM— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026#दिल्ली: मालवीय नगर के होटल में लगी आग पूरी इमारत में फैली, दर्दनाक हादसे में 10 लोगों की जलकर मौत #Malviyanagar #Delhifire #Breaking pic.twitter.com/zymTBTdWQt— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) June 3, 2026అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హోటల్ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించిందా? అనుమతులకు మించి కార్యకలాపాలు నిర్వహించిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ఢిల్లీ ప్రమాదం.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ -
రాజీనామా రచ్చ అంతా ఉత్తదేనా?
తమిళనాడు రాజకీయాల్లో హాట్టాపిక్గా మారిన ‘అన్నామలై రాజీనామా’ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. బీజేపీని వీడబోతున్నారన్న ఊహాగానాల మధ్య ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారాయన. అయితే ఆయన తన రాజీనామా లేఖ అందించారనే ప్రచారం జోరుగా జరుగుతుండగా.. అసలు అలాంటి చర్చే జరగలేదన్న సమాచారం బయటకు వచ్చింది. దీంతో అసలు అన్నామలై వ్యూహం ఏమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి గుడ్బై చెప్పనున్నారన్న ప్రచారం ఇటీవల జోరందుకుంది. ఆయన ఢిల్లీలో మకాం వేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లతో భేటీ కావడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. తన అసంతృప్తిని నేరుగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సమావేశాల్లో రాజీనామా అంశం ప్రస్తావనకే రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బదులుగా తమిళనాడులో పార్టీ పరిస్థితి, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఏఐఏడీఎంకేతో పొత్తు ప్రభావం వంటి అంశాలపై అన్నామలై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారన్నది ఉత్త ప్రచారంగా తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలని అన్నామలై ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఏఐఏడీఎంకేతో పొత్తు పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతోందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావడం కూడా ఆయన అసంతృప్తికి కారణమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అంతేకాదు, రాష్ట్ర బీజేపీ నేతలు, మిత్రపక్ష నేతల్లో కొందరి వైఖరిపైనా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తామని, రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తామని పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ను కూడా ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు వచ్చాయి. రేపు అన్నామలై చెన్నైకి వస్తారని ఆయన అనుచర గణం చెబుతోంది. దీంతో ఆయన స్పందిస్తేనే.. ఈ ఉత్కంఠకు తెర పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, అన్నామలై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అది బీజేపీకి అనుబంధంగా ఉంటుందా? లేదంటే కొత్తగా పార్టీ పెట్టడం, లేదంటే పార్టీ కంటే ముందుగా ఒక సామాజిక-ప్రజా వేదికను నిర్మించడంపై ఉంటుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. యువతతో పాటు వివిధ వర్గాల వారిని కలుపుకోవాలన్న వ్యూహంపై ఆయన దృష్టి పెట్టినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు, ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ తిరస్కరించారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో అన్నామలై ఆలోచనలు కేవలం పదవుల చుట్టూ కాకుండా, భవిష్యత్ రాజకీయ ప్రణాళికల వైపు సాగుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది దుర్మరణం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగి 21 మంది దుర్మరణం పాలయ్యారు. రెస్టారెంట్లో పలువురు చిక్కుకుని ఉండడం.. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.హౌజ్రాణి ఏరియాలోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఉదయం 8గం.50ని సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కస్టమర్లు, హోటల్లో బస చేసినవాళ్లు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది. #DELHI-साकेत प्रेस एन्क्लेव के सामने, मालवीय नगर के हौज रानी स्थित एक होटल में लगी भीषण आग ।लाल डोरा क्षेत्र में तेजी से बन रहे बहुमंजिला होटलों की अग्नि सुरक्षा, आपातकालीन पहुंच और नियामक निगरानी पर गंभीर सवाल खड़े कर दिए हैं।#DelhiFire #MalviyaNagar #Saket #FireSafety pic.twitter.com/2gtCHzJfg9— Payall Singhh (@PayallSingh13) June 3, 2026మంటలు భారీగా ఎగసి పడడంతో.. దట్టమైన పొగతో రెస్టారెంట్ అలుముకోవడంతో.. ఊపిరాడక చాలా మంది చనిపోయారు. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించిన పలువురి సాహసాలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి. మృతుల్లో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 21 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన మరో 30 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. రెస్టారెంట్లో మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ఓ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు. మృతుల్లో.. సౌతాఫ్రికా, సోమాలియా, గల్ఫ్ వాసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.दिल्ली के मालवीय नगर में एक रेस्ट्रां में लगी आग हादसे में 10 लोगों की मौत की खबरबेसमेंट में फंसे तीन नाइजीरियन नागरिकों को रेस्क्यू कर बाहर निकाला गया।#DELHIFIRE#MALVIYENAGAR#RESTRAURENTFIRE pic.twitter.com/GVD3yKxmXR— Vivek Shukla (@anchorviveks) June 3, 2026ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అధికారులు అందిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు.The loss of lives due to a fire incident in Malviya Nagar, Delhi is tragic. My condolences to those who have lost their loved ones. Wishing a speedy recovery to the injured. Authorities are providing all possible assistance to those affected. An ex-gratia of Rs. 2 lakh from…— PMO India (@PMOIndia) June 3, 2026 -
బీజేపీకి అన్నామలై రాజీనామా
సాక్షి,ఢిల్లీ: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు ఐదు పేజీల రాజీనామా లేఖ ఇచ్చారు. ఆ లేఖలో తమిళనాడులో బీజేపీ ఫెయిల్యూర్ గల కారణాల్ని వివరించారు. దీంతో పాటు ఐపీఎస్ పదవిని వదులుకొని బీజేపీలో చేరిన పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.మంగళవారం న్యూఢిల్లీలో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్నామలై తన రాజీనామా లేఖ అందించారు. రాజీనామాతో అన్నామలై బీజేపీ, ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా సెక్యులర్, తమిళ్ ఫస్ట్ అనే నినాదంతో వచ్చే వారంలో పార్టీ ప్రకటన ఉండొచ్చని తమిళ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎస్ అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ప్రస్తుతం బీజేపీలో భవిష్యత్తు కనిపించడం లేదనే వాదన ఆయన సన్నిహితుల ద్వారా బయటకొచ్చింది. ఈ క్రమంలో ఆయన అధిష్టానం ఇచ్చిన పలు ఆఫర్లను తిరస్కరించినట్లు సమాచారం. మొదట ఒక సామాజిక-రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి.. అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమాన భావజాలం కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి బలమైన వాలంటీర్ నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగనుంది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ‘వీ ది లీడర్స్’ సంస్థే భవిష్యత్ రాజకీయ ప్రాజెక్టుకు పునాదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
డీమెర్జర్ వేళ, వేదాంతకు ఎదురు దెబ్బ : ఈడీ దాడులు
ప్రముఖ వ్యాపార సంస్థ వేదాంతకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ షాకిచ్చింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత (Vedanta) గ్రూప్ ప్రాంగణాల్లో జూన్ 2న సోదాలు నిర్వహిస్తోంది. రాయల్టీ చెల్లింపులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వేదాంత గ్రూప్ తన ప్రస్తుత వ్యాపారాన్ని ఐదు విభిన్న విభాగాలుగా విభజించే (డీమెర్జర్) ప్రక్రియలో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకొంది. అనిల్ అగర్వాల్ సుప్రీం కోర్టులో అదానీని సవాలు చేసిన ఒక నెల తర్వాత, ఈడీ అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత గ్రూప్పై దాడులు నిర్వహించడం గమనార్హం. వేదాంత తన మాతృ సంస్థ వేదాంత రిసోర్సెస్కు చెల్లించిన రాయల్టీ చెల్లింపుపై జరుగుతున్న దర్యాప్తులో భాగమే ఈ దాడులు. ముంబై, ఢిల్లీలలోని వేదాంత కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. వేదాంత లిమిటెడ్ తన మాతృ సంస్థ అయిన 'వేదాంత రిసోర్సెస్' (Vedanta Resources) కు చేసిన రాయల్టీ చెల్లింపులపై వస్తున్న ఆరోపణల విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ సోమవారం ప్రారంభమై ఇప్పుడు ముగిసిందని ఒక సీనియర్ ఈడీ అధికారి తెలిపారు. దర్యాప్తు అధికారులు ఈ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, రికార్డులను సేకరించారు. ఫెమా కింద ఉన్న విదేశీ మారకపు నిబంధనలకు అవి అనుగుణంగా ఉన్నాయో లేదో అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఉదయం 11:45 గంటల సమయంలో వేదాంత షేరు ధర 0.7 శాతం క్షీణించి రూ. 334.6 వద్ద ట్రేడ్ అయింది.వేదాంత స్పందనఈడీ దాడులపై వేదాంత స్పందించింది. అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నామని, చట్టపరిధిలో అన్ని నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది ప్రస్తుతం ఈ వ్యవహారం నియంత్రణ సంస్థల (Regulatory Process) పరిశీలనలో ఉన్నందున, ఇంతకుమించి వ్యాఖ్యానించలేమని వేదాంత ప్రతినిధి ఒకరు తెలిపారు.వేదాంత vs అదానీమరోవైపు భారతదేశపు ఏకైక ఫార్ములా వన్ సర్క్యూట్తో సహా పలు ఆస్తులను కలిగి ఉన్న దివాలా తీసిన రియల్ ఎస్టేట్ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (JAL) కోసం గౌతమ్ అదానీ గ్రూప్ వేసిన విజేత బిడ్ను, మైనింగ్ బిలియనీర్ అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత లిమిటెడ్ సవాలు చేయగా, కంపెనీ లా అప్పీల్స్ కోర్టు (మే 4, 2026న) తిరస్కరించింది. వేదాంత లేవనెత్తిన అంశాలలో యోగ్యత లేదని భావించిన జాతీయ కంపెనీ చట్ట అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT), దాని రెండు పిటిషన్లను కొట్టివేసింది. ఇలా సవాల్ చేసింనందుకే ఈడీ దాడుల అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా బ్రిటన్కు చెందిన 'వేదాంత రిసోర్సెస్' దీనికి మాతృ సంస్థ (Parent Company). ఈ విదేశీ మాతృ సంస్థ భారీగా అప్పుల్లో మునిగిపోయింది. నివేదికల ప్రకారం.. వేదాంత రిసోర్సెస్ మొత్తం అప్పు రూ. 74,000 కోట్లుగా ఉంది. ఇందుకోసమే భారతీయ అనుబంధ సంస్థ (Vedanta Ltd) తన మాతృ సంస్థకు భారీగా రాయల్టీలు చెల్లిస్తూ వస్తోంది. వేదాంత లిమిటెడ్ అనేది భారతదేశంలో లిస్ట్ అయిన కంపెనీ, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.3 లక్షల కోట్లుగా ఉంది.మే నెలలో ఈ కంపెనీ వ్యాపార విభజనకు సంబంధించి వివిధ నియంత్రణ సంస్థల నుండి అనుమతులు పొందింది. దీని ప్రకారం, కొత్తగా నాలుగు సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఈ ప్రధాన సంస్థ అలాగే కొనసాగుతుంది. ఇందులో హిందుస్థాన్ జింక్, జింక్ ఇంటర్నేషనల్, కాపర్, ఫెర్రో క్రోమ్ మరియు కొత్త టెక్నాలజీ వ్యాపారాలు ఉంటాయి. అల్యూమినియం కార్యకలాపాలు, పవర్ ప్లాంట్లు మరియు బాల్కో (BALCO) లో 51 శాతం వాటాను ఇది నిర్వహిస్తుంది.వేదాంత పవర్ (Vedanta Power) తల్వాండి సాబో ప్లాంట్తో సహా థర్మల్ పవర్ ఆస్తులను పర్యవేక్షిస్తుంది. వేదాంత ఆయిల్ & గ్యాస్ (Vedanta Oil & Gas): కేయిర్న్ ఆయిల్ & గ్యాస్ (Cairn Oil & Gas) బాధ్యతలను ఇది పర్యవేక్షిస్తుంది. వేదాంత స్టీల్ & ఫెర్రస్ (Vedanta Steel & Ferrous): ఇనుప ఖనిజం గనులు మరియు ఈఎస్ఎల్ (ESL) స్టీల్ ప్లాంట్ను ఇది నిర్వహిస్తుంది. -
ముప్పు వాటిల్లనివ్వం
న్యూఢిల్లీ: తమ భూభాగాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారనివ్వబోమని మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ ఆంగ్ హ్లాయింగ్ పునరుద్ఘాటించారు. ఐదురోజుల భారత పర్యటన నిమిత్తం యూమిన్ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. మయన్మార్ పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన రెండు నెలలకే ఆయన భారత్లో పర్యటనకు రావడం విశేషం. ‘‘భారత భద్రతా ప్రయోజనాలకు విఘాతం కల్గించే కార్యకలాపాలకు మయన్మార్ను నెలవు కానివ్వం. పొరుగుదేశంతో మిత్రత్వం మాకు ముఖ్యం’’అని భారత ప్రధాని మోదీతో భేటీలో హ్లాయింగ్ స్పష్టంచేశారు. మోదీ, హ్లాయింగ్లో ద్వైపాక్షిక సమావేశం వివరాలను తర్వాత భారత విదేశాంగ శాక కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో పంచుకున్నారు. ‘‘ఏళ్ల తరబడి జుండా సైనికపాలన తర్వాత మయన్మార్లో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హ్లాయింగ్ మోదీతో వాణిజ్యం మొదలు రక్షణ, సరిహద్దు భద్రత, అభివృద్ధిలో తోడ్పాటు, ఇంధనం, పెట్టుబడులు, వైద్యం, విద్య, కృత్రిమమేధ వంటి సంక్లిష్ట సాంకేతికతలో పరస్పర సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మయన్మార్ సార్వబౌమత్వం, అంతర్గత సమగ్రతకు భారత్ కట్టుబడిఉంది. మయన్మార్లో నెలకొంటున్న శాంతియుత వాతావరణంపైనా మోదీ ఆరాతీశారు’’అని మిస్రీ తెలిపారు. ‘‘1,640 కిలోమీటర్ల మేర సరిహద్దు పంచుకుంటూ మయన్మార్ భారత్కు వ్యూహాత్మకమైన పొరుగుదేశంగా కొనసాగుతోంది. పరస్పర ప్రయోజనాలు, ప్రాంతీయాభివృద్ధి, శ్రేయస్సే పరమావధిగా ఇరుదేశాలు ఇకమీదటా కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి’’అని మిస్రీ పేర్కొన్నారు. -
కన్నప్రేమను పంచిన ‘ఆంటీ’.. కానరాని లోకాలకు!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో భవనం కూలిన ఘటన ఒక కుటుంబంలోనే కాకుండా, అక్కడి విద్యార్థులకూ తీరని విషాదాన్ని పంచింది. ఈ ఘటన అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను కాపాడాలనే ప్రయత్నంలో ప్రమాద స్థలంలోకి వెళ్లిన పార్వతీ ఓజా (50) ప్రాణాలు కోల్పోయారు.విద్యార్థులకు ‘పార్వతీ ఆంటీ’ఢిల్లీలోని సైదులాబాద్ ప్రాంతంలో ‘ఆంటీ వాలా కిచెన్’ నడుపుతున్న పార్వతి అక్కడి విద్యార్థులకు కేవలం ఆహారాన్ని అందించడమే కాకుండా, ఒక తల్లి చూపించే ఆప్యాయతను కూడా పంచేవారు. హోమ్లీ ఫుడ్తో పాటు ఆమె చూపే ప్రేమ కారణంగా పలువురు విద్యార్థులు ఆమెను ‘పార్వతీ ఆంటీ’ అని పిలుచుకునేవారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో కూడా ధరలు పెంచకుండా, విద్యార్థులకు ఆమె చక్కని ఆహారం అందించారని స్థానికులు చెబుతుంటారు.ప్రాణాలకు తెగించి..ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన సమయంలో పార్వతి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ లోపల విద్యార్థులు చిక్కుకున్నారని తెలియగానే, వారిని రక్షించేందుకు ఆమె లోనికి వెళ్ళారు. అదే సమయంలో భవనం పూర్తిగా కుప్పకూలడంతో ఆమె శిథిలాల కింద చిక్కుకుపోయారు. 16 గంటల సుదీర్ఘ సహాయక చర్యల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనలో ఆమెతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ దుర్ఘటన ఢిల్లీలో అక్రమ కట్టడాల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. తనిఖీలు లేని భవనాలు ఎలా మరణశాసనంగా మారుతున్నాయనే దానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. -
ఢిల్లీలో కూప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం ఐదు అంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మందిని సురక్షితంగా రక్షించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారనే అనుమానంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.సాయిదుల్లాజాబ్ ప్రాంతంలోని వెస్ట్రన్ మార్గ్లో ఉన్న ఈ ఐదు అంతస్తుల భవనంలో కోచింగ్ సెంటర్, కేఫ్లు, కార్పొరేట్ కార్యాలయాలు నడుస్తున్నాయి. మూడో అంతస్తులో కొంత నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. శనివారం రాత్రి 7:45 నిమిషాల సమయంలో ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ పక్కనే విద్యార్థులు రాత్రి భోజనం చేస్తున్న ఒక తాత్కాలిక రేకుల షెడ్డు (క్యాంటీన్)పై ఈ భవనం పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది.డీఎఫ్ఎస్, ఎన్డీఆర్ఎఫ్, డీడీఎంఏ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగించడానికి జేసీబీ ఎక్స్కవేటర్లు, హైడ్రాలిక్ కట్టర్లతో పాటు.. లోపల చిక్కుకున్న వారిని గుర్తించడానికి ప్రత్యేక విక్టిమ్-లొకేషన్ కెమెరాలు, ఎర్త్-అగర్ డ్రిల్లింగ్ మిషన్లు మరియు శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ (జాగిలాలు) రంగంలోకి దించారు.#WATCH | Delhi: Rescue operation underway after a five-storey building collapsed in the Mehrauli police station area. Nine people have been evacuated.Morning visuals from the spot. pic.twitter.com/N8OCw44nKi— ANI (@ANI) May 31, 2026స్థానికుల సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో క్యాంటీన్, భవనంలో కలిపి దాదాపు 100 నుండి 150 మంది వరకు ఉండవచ్చని... శిథిలాల కింద నుంచి రక్షించాలంటూ ఆర్తనాదాలు విన్నామంటూ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతానికి 12 మందిని రక్షించాం. శిథిలాల కింద ఎవరూ లేరని భావిస్తున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో రెస్క్యూ పూర్తయ్యే వరకు కచ్చితంగా చెప్పలేం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. -
‘పోక్సో’ దుర్వినియోగం.. స్వార్థం కోసం తప్పుడు కేసులు!
సాక్షి, న్యూఢిల్లీ: దంపతుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కేవలం ఆర్థిక లబ్ధి, భారీ సెటిల్మెంట్లు ఆశించి భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కక్ష సాధింపులో భాగంగా భర్తను దారికి తెచ్చుకునేందుకు మహిళలు గృహహింస, కట్నం వేధింపులతో పాటు ఏకంగా ‘పోక్సో’ వంటి చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.మూకుమ్మడి కేసులు సరికాదుఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వైవాహిక వివాదంలో దాఖలైన 10 క్రిమినల్ కేసుల రద్దు పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ‘దంపతుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, భర్తపై కక్ష తీర్చుకునేందుకు క్రిమినల్ చట్టాలను వాడుకుంటున్నారు. ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండానే క్రూరత్వం, గృహహింస పేరిట అత్తమామలు, వృద్ధులైన కుటుంబ సభ్యులందరిపైనా మూకుమ్మడిగా కేసులు పెడుతు న్నారు’అని ధర్మాసనం పేర్కొంది. ఈ తరహా తప్పుడు కేసుల వల్ల కోర్టుల విలువైన సమయం వృథా కావడమే కాకుండా, న్యాయం కోసం నిరీక్షించే అసలైన బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేలా న్యాయవాదులు తమ క్లయింట్లను ప్రోత్సహించ రాదని కూడా ధర్మాసనం హితవు పలికింది.పావులుగా పిల్లలువైవాహిక వివాదాల్లో సంతానాన్ని కూడా పావులుగా వాడుకుంటున్న ‘అతి దారుణమైన ధోరణి’గురించి కోర్టు ప్రస్తావించింది. తండ్రి తన మైనర్ కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ తల్లులు పోక్సో చట్టం కింద తప్పుడు కేసులు పెట్టిస్తున్న వైనాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎక్కువ భరణం డిమాండ్ చేయడానికి లేదా రాజీకి రావాలని ఒత్తిడి చేయడానికి, పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా వారితోనే కన్నతండ్రిపై అబద్ధపు ఆరోపణలు చేయిస్తున్నారని ధర్మాసనం ఆవేదన చెందింది. కేవలం భార్యాభర్తల గొడవల్లోనే కాకుండా.. ఆస్తి వివాదాలు, వ్యాపార తగాదాలు, అప్పుల వ్యవహారాల్లో సైతం ఎదుటివారిని బెదిరించేందుకు పోక్సోను ఆయుధంగా వా డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.అలహాబాద్ హైకోర్టు తీర్పు కొట్టివేతభర్త, అతడి సోదరుడు తన 14 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఇతర కుటుంబ సభ్యులు భౌతికంగా దాడి చేశారని ఓ మహిళ నమోదు చేసిన క్రిమినల్ కేసులను ధర్మాసనం కొట్టివేసింది. తల్లి ఒత్తిడి, ఆమె నేర్పించిన మాటల మేరకే బాలిక ఈ ఆరోపణలు చేసినట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది. ఫిర్యాదులో తల్లీకూ తుళ్ల వాంగ్మూలాలు అక్షరం పొల్లుపోకుండా ఒకేలా ఉన్నాయని, ఆరోపణలకు ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవని పేర్కొంది. ఇలాంటి సాధారణ, అస్పష్టమైన ఆరోపణలతో క్రిమినల్ విచారణను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెడుతూ.. భర్త, అతని కుటుంబ సభ్యులపై నమోదైన పది కేసులను రద్దు చేస్తూ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. -
భారత్లో ట్రంప్ కుమార్తె.. అబ్బురపోయే అనుభూతి
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు కుమార్తె టిఫానీ ట్రంప్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. తన భర్త మైఖేల్ బౌలోస్తో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన ఆమె.. ఢిల్లీలోని చారిత్రాత్మక బాప్స్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆగ్రాలోని తాజ్ మహల్తో పాటు రాజస్థాన్లోని జైసల్మేర్ వెళ్లారు. టిఫానీ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా తన భర్త మైఖేల్ బౌలోస్, స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ప్రపంచ ప్రసిద్ధ బీఏపీఎస్ స్వామినారాయణ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆలయ నిర్వాహకులు టిఫానీ ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్షరధామ్ ఆలయంలోని అద్భుతమైన శిల్పకళను, కట్టడాలను టిఫానీ దంపతులు మంత్రముగ్దులయ్యారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయ పూలమాలలు ధరించి వారు ఫోటోలు దిగారు. ఆచిత్రాలను టిఫాని తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పంచుకున్నారు. ‘‘భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని అన్వేషించడానికి ఇదొక అద్భుతమైన రోజు’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదొక మరువలేని అద్భుతమైన అనుభూతి అని ప్రశంసించారు. -
ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు.. 8 మంది అరెస్ట్
ఢిల్లీ పోలీసులు పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం, షాజాద్ భట్టి నెట్వర్క్తో సంబంధం ఉన్న ఎనిమిది మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేశారు. వారి వద్ద కీలకమైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం, విజయ్ అలియాస్ షూటర్కు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లలో ఉగ్రవాద, నేర కార్యకలాపాలు నిర్వహించే కీలక బాధ్యతను పాక్ ఉగ్రవాద సంస్థ అప్పగించింది. దీంతో ఢిల్లీ-ఎన్సిఆర్లోయూలో ఉగ్రవాదులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, పంజాబ్, చండీగఢ్లలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు, మంత్రిత్వ శాఖలు, భద్రతా దళాలపై దాడులకు వారు కుట్ర పన్నుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితులందరూ పాకిస్తాన్, దుబాయ్లలోని హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నారన్నారు. వీరిలో ప్రధాన నిందితుడి కోసం గాలింపులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అరెస్టయిన నిందితుల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన విజయ్ అలియాస్ షూటర్, జార్ఖండ్కు చెందిన నితీష్ పాశ్వాన్, మహారాష్ట్రకు చెందిన తౌకీర్ రిజ్వాన్ అహ్మద్ షేక్ మరియు సాజిద్ మెహబూబ్ షేక్ అలియాస్ అర్బాజ్ ఖాన్, పంజాబ్కు చెందిన హర్విందర్ సింగ్, గగన్దీప్ సింగ్, మంజీత్ సింగ్, నేపాల్ పౌరుడు అంగ్ కమీ లామాలు ఉన్నారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఒక పిస్తోల్, మందుగుండు సామాగ్రి, గ్రానైట్లు, బైకులు, మెుబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
సీబీఎస్ఈ టెండర్లో సంచలన ట్విస్టులు?
న్యూఢిల్లీ: దాదాపు 17 లక్షల మంది సీబీఎస్ఈ విద్యార్థుల జవాబు పత్రాల స్కానింగ్.. డిజిటల్ మూల్యాంకన బాధ్యతలు చేపట్టిన సంస్థ ఎంపిక వెనుక అసలు ఏమి జరిగింది? టెండర్ నిబంధనలు ఎందుకు పదేపదే మారాయి? ఒకసారి అనర్హత పొందిన సంస్థ చేతికే మళ్లీ ఎలా వెళ్లాయి? ఒక విద్యార్థి చేసిన పరిశోధన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు విద్యా వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.2025-26 విద్యాసంవత్సరంలో సీబీఎస్ఈ తొలిసారిగా భారీ స్థాయిలో ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని అమలు చేసింది. ఇందుకోసం లక్షలాది జవాబు పత్రాలను స్కాన్ చేసి డిజిటల్గా మూల్యాంకనం చేసే బాధ్యతను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. అయితే ఈ టెండర్ ప్రక్రియపై ఇప్పుడు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.12వ తరగతి విద్యార్థి సార్థక్ చేసిన పరిశోధన ప్రకారం.. ఈ టెండర్ను చివరకు దక్కించుకున్న కోయెంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ పేరుతో పనిచేసింది. 2019 తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంలో ఈ సంస్థ పేరు తీవ్రంగా వినిపించింది. అనంతరం సంస్థ పేరు మారి కోయెంప్ట్గా మారినట్లు సమాచారం.అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టెండర్ ఒకసారి కాదు, మూడుసార్లు జారీ కావడం. తొలి టెండర్ రికార్డులే అందుబాటులో లేకపోవడం, రెండో టెండర్లో పాల్గొన్న అన్ని కంపెనీలు సాంకేతిక అర్హతల్లో విఫలమవడం, ఆ తర్వాత మూడో టెండర్లో నిబంధనలు మారిన వెంటనే కోయెంప్ట్ విజేతగా నిలవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.సీబీఎస్ఈ టెండర్ వివాదం: కీలక అంశాలు🔹 17 లక్షల విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన టెండర్పై వివాదం🔹 2019 తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంతో వార్తల్లో నిలిచిన గ్లోబరెనా టెక్నాలజీస్ (ప్రస్తుత కోయెంప్ట్ ఎడుటెక్)కు కాంట్రాక్ట్🔹 టెండర్ను మూడుసార్లు జారీ చేసిన సీబీఎస్ఈ🔹 చివరి దశలో నిబంధనల మార్పుల తర్వాత కోయెంప్ట్కు టెండర్ దక్కినట్లు ఆరోపణలుసార్థక్ జరిపిన విశ్లేషణ ప్రకారం.. రెండో టెండర్ నుంచి మూడో టెండర్కు వెళ్లే మధ్యకాలంలో అనేక కీలక నిబంధనలు సవరించబడ్డాయి. గతంలో బ్లాక్లిస్ట్ అయిన సంస్థలకు అడ్డుకట్ట వేసే షరతులు సడలించడం, సాఫ్ట్వేర్ నాణ్యత ప్రమాణాలను తగ్గించడం, డేటా సెంటర్ యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను తొలగించడం, అనుభవ ప్రమాణాలను మార్చడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయని ఆ కుర్రాడు పేర్కొన్నాడు. అంతేకాదు, సిస్టమ్ విఫలమైతే సంస్థను భవిష్యత్లో బ్లాక్లిస్ట్ చేసే అధికారాన్ని కూడా చివరి దశలో తొలగించినట్లు ఆరోపించాడు. జవాబు పత్రాల స్కానింగ్లో ఖచ్చితత్వానికి సంబంధించిన తప్పనిసరి ప్రమాణాలను సైతం సడలించారని సార్థక్ చెప్పడంతో.. ఈ మార్పులన్నీ ఒకే సంస్థకు అనుకూలంగా జరిగాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.టెండర్ రూల్స్లో మార్పులు➡️ గతంలో బ్లాక్లిస్ట్ అయిన సంస్థలను అనర్హులుగా ప్రకటించే నిబంధన తొలగింపు➡️ సాఫ్ట్వేర్ నాణ్యత ప్రమాణం CMMI Level-5 నుంచి Level-3కు తగ్గింపు➡️ సొంత డేటా సెంటర్ తప్పనిసరి నిబంధన రద్దు➡️ థర్డ్పార్టీ క్లౌడ్ హోస్టింగ్కు అనుమతి➡️ స్కానింగ్ ఖచ్చితత్వానికి సంబంధించిన కఠిన ప్రమాణాల సడలింపు➡️ CERT-In భద్రతా ఆడిట్ నిబంధన తొలగింపు➡️ పొరపాట్లపై జరిమానాల బదులు ఆలస్యాలపై జరిమానాల విధానంఇటీవల సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ పోర్టల్లో వెలుగుచూసిన సైబర్ భద్రతా లోపాలు, అనధికార యాక్సెస్ ఘటనలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. భద్రతా పరీక్షలు పూర్తయ్యాయా? లేదంటే నిబంధనలను పక్కనబెట్టి వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని, సీఏజీ ఆడిట్ నిర్వహించాలని, పార్లమెంట్లో చర్చ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.లేవనెత్తుతున్న ప్రశ్నలు❓ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?❓ మార్పుల వల్ల ఎవరు లబ్ధి పొందారు?❓ భద్రతా ప్రమాణాలు ఎందుకు తగ్గించారు?❓ తొలి టెండర్ వివరాలు ఎందుకు కనిపించడం లేదు?❓ విద్యార్థుల డేటా భద్రతకు ఎలాంటి హామీ ఉంది? This is an unbelievable piece of work by Sarthak and something that requires amplification. Let me explain what he found, in simple terms.Sarthak is a Class 12 student from the 2025-26 batch, one of the 17 lakh students whose answer sheets went through CBSE's new On-Screen… https://t.co/1wB5ZRx5qO— Malay Krishna (@Malay4Product) May 29, 2026అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలపై సీబీఎస్ఈ లేదా కోయెంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ నుంచి అధికారిక వివరణ వెలువడలేదు. కానీ ఒక విద్యార్థి చేసిన ఈ పరిశోధన ఇప్పుడు దేశంలోని అతిపెద్ద విద్యా బోర్డుల్లో ఒకటైన సీబీఎస్ఈ టెండర్ ప్రక్రియపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. సమాధానాలు ఎప్పుడు వస్తాయన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రెకెత్తిస్తోంది. -
సెక్స్ వర్కర్లను వేధించొద్దు: సుప్రీం కోర్టు
మానవ అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారం కేసుల విషయంలో దేశవ్యాప్తంగా సంచలన ప్రభావం చూపే కీలక మార్గదర్శకాలను సుప్రీం కోర్టు జారీ చేసింది. స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేస్తున్న 18 ఏళ్లు నిండిన వారిని నేరస్తుల్లా చూడొద్దని, వారిపై పోలీసులు దాడులు చేయడం.. కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అదే సమయంలో మహిళలు, మైనర్ల అక్రమ రవాణా మాఫియాపై మాత్రం కఠిన చర్యలు కొనసాగించాలని ఆదేశించింది.సెక్స్ వర్కర్ల హక్కులు, పునరావాసం, పోలీసుల వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు కల్పిస్తోందని, సెక్స్ వర్కర్లు కూడా అదే హక్కులకు అర్హులని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తి చేస్తున్న వయోజన మహిళలు, మైనర్లను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టే అక్రమ రవాణా ముఠాలను ఒకేలా చూడకూడదని కోర్టు పేర్కొంది. సెక్స్ వర్క్ స్వచ్ఛందంగా చేస్తున్నారనే విషయం స్పష్టంగా ఉంటే వారిని వేధించడం, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం, క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని తెలిపింది. ఇకపై రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో సెక్స్ వర్కర్ల ఫొటోలు, వీడియోలు తీసి మీడియాకు ఇవ్వొద్దని కూడా కోర్టు ఆదేశించింది. వారి గుర్తింపును బహిర్గతం చేయడం వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తుందని పేర్కొంది. మీడియా సంస్థలు కూడా బాధితుల వివరాలు, చిత్రాలు ప్రసారం చేయరాదని సూచించింది. ఈ మార్గదర్శకాలను శుక్రవారం జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్ ధర్మాసనం చేసింది. మరో కీలక ఆదేశంగా.. నివాస ధృవీకరణ పత్రాలు లేకపోయినా సెక్స్ వర్కర్లకు వెంటనే ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం, బ్యాంకింగ్, సంక్షేమ పథకాల నుంచి వారు దూరమవుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.అదే సమయంలో మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టే మాఫియా నెట్వర్క్లను అణచివేయాలని.. బాధితుల పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. -
ఒక్కసారిగా పేలిన ఏసీ : మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణం
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఏసీ ఇండోర్ యూనిట్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి మాజీ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ (80) మృతిచెందారు.పోలీసులకు సమాచారం ప్రకారం మే 27 బుధవారం రాత్రి 11:18 గంటల ప్రాంతంలో హౌజ్ ఖాస్లోని ఆర్-15 నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది, ఇంట్లోని ఏసీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తీవ్రంగా గాయపడిన ధనేంద్ర కుమార్కు ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. కానీ దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ట్రామా సెంటర్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ప్రమాద సమయంలో ధనేంద్రకుమార్, ఆయన కుమారుడితోపాటు మరో ముగ్గురు పనివారు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆలస్యమైంది. ఫైర్ సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంట్లో ఉన్న ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ధనేంద్ర కుమార్ పొగ కారణంగా ఊపిరి తీసుకోలేక మరణించగా, ఆయన కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు ఈ ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని, విద్యుత్ లోపంపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.Delhi: Ramesh, domestic helper says, ''Actually, this accident happened last night. The accident happened due to short circuit. The short circuit was in the AC and that's why there was a fire. So, this accident happened...'' pic.twitter.com/5i8y6thXef— IANS (@ians_india) May 28, 2026 షార్ట్ సర్క్యూట్ : ఏసీలో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గృహ సహాయకుడు రమేష్ మీడియాకు వెల్లడించారు. Delhi: In South Delhi’s Hauz Khas area, a massive fire broke out late Wednesday night in house R-15 due to a short circuit. In the incident, 80-year-old retired IAS officer Dhanendra Kumar died of suffocation caused by smoke inhalation. pic.twitter.com/yZEX60EX3N— IANS (@ians_india) May 28, 2026ఎవరీ ధనేంద్ర కుమార్ ? ధనేంద్ర కుమార్ 1946లో జన్మించారు. ఆయన 1968 బ్యాచ్కు చెందిన ప్రతిభావంతుడైన ఐఏఎస్ (IAS) అధికారి. తన సుదీర్ఘ కెరీర్లో కేంద్ర, హర్యానా ప్రభుత్వాలలో పలు కీలక పదవుల్లో సేవలందించారు.ఈయన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తొలి ఛైర్మన్ కూడా. 2009 ఫిబ్రవరి- 2011 జూన్ వరకు పనిచేశారు. మార్కెట్లో పెద్ద కంపెనీల ఏకఛత్రాధిపత్యాన్ని అరికట్టే చట్టాలను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేంద్ర రక్షణ శాఖ, రోడ్డు రవాణా & రహదారుల శాఖ, సాంస్కృతిక శాఖల్లో కార్యదర్శిగా (Secretary) పలు సేవలందించారు.2005, నవంబర్ -2009, జనవరి వరకు వరల్డ్ బ్యాంక్లో భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ దేశాల తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ముఖ్యంగా హర్యానా ముఖ్యమంత్రికి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. అక్కడ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 'నేషనల్ సిటిజన్స్ అవార్డు' లభించింది. పదవీ విరమణ తర్వాత కూడా ఆయన చురుగ్గా ఉన్నారు. COMPAD సంస్థకు వ్యవస్థాపక చైర్మన్గా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో చీఫ్ మెంటార్గా సేవలందించారు. -
తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ దేశ రాజధానిలో తన తొలి అధికారిక పర్యటనను ముగించుకుని గురువారం చెన్నైకి ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవకుండానే ఆయన పర్యటన ముగిసింది. సోనియా, రాహుల్తో విజయ్ సమావేశం రద్దయింది. ముఖ్యమంత్రి తన పర్యటనను కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేసుకున్నారని.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ తిలక్ చెప్పుకొచ్చారు.అయితే, ప్రచారం జరుగుతున్నట్లుగా విజయ్, రాహుల్ గాంధీల భేటీ రద్దు కాలేదని... కేవలం వాయిదా మాత్రమే పడిందని తిలక్ పేర్కొన్నారు. సీఎం నీతి ఆయోగ్ సమావేశం కోసం జూన్ 11 ప్రాంతంలో మళ్లీ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు రాహుల్, సోనియా గాంధీలను కలుస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన మీడియాతో అన్నారు.కాగా, తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి బుధవారం ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీతో విజయ్కి ఇదే తొలి భేటీ కావడం విశేషం. ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం విజయ్ తిరిగి తమిళనాడు భవన్కు చేరుకున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా కలిశారు. రాష్ట్ర నిధులపై చర్చించారు.ఈ క్రమంలో జాతీయ ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ విజయ్ సమావేశమవుతారంటూ ప్రచారం జరిగింది. అటు అధికార పక్ష అగ్రనేతలను, ఇటు ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలనూ సమానంగా కలుస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. చివరికి సోనియా, రాహుల్లతో భేటీ కాకుండానే విజయ్ పర్యటన ముగిసింది. -
యువతికి నరకం అంటే ఏంటో చూపించిన పూజారి
ఢిల్లీకి చెందిన ఓ పూజారి (27) తన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ను తిరస్కరించిన ఓ యువతికి నరకం చూపించాడు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అసభ్యకర, నగ్న మార్ఫింగ్ ఇమేజ్లు, ఫొటోలు రూపొందించాడు. ఆ పూజారి ఆన్లైన్లో మత వీడియోలు చేసేవాడు. సులభంగా దొరికే ఏఐ టూల్స్ వాడి మహిళ ఫొటోలను మార్చి, అనేక నకిలీ సోషల్ మీడియా ఖాతాల్లో అతడు అప్లోడ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.అహ్మదాబాద్ సిటీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అతడిని ఢిల్లీలో గుర్తించి, బుధవారం అరెస్టు చేశారు. మహిళలను ఆన్లైన్ వేధింపుల నుంచి కాపాడే “మిషన్ సైబర్ రక్షిక: #సెక్యూర్ హర్ స్పేస్” కార్యక్రమం కింద ఈ అరెస్టు జరిగింది.ఎలా మొదలైంది? ఆన్లైన్లో మత ప్రవచనాలు చేసే సుమిత్ నేమ్చంద్ శర్మతో గుజరాత్కు చెందిన ఓ మహిళకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. శర్మ మొదట ఇన్స్టాగ్రామ్లో ఆమెతో చాట్చేసి, మత విషయాలపై సంభాషణలు ప్రారంభించినట్టు సమాచారం. తర్వాత అతడు ఆమెతో స్నేహం చేయాలని ప్రయత్నించగా, మహిళ తిరస్కరించింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2025 డిసెంబర్ నుంచి 2026 ఏప్రిల్ 6 వరకు అతడు ఇంటర్నెట్ ద్వారా మహిళను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏఐతో అసభ్యకర కంటెంట్ బాధిత మహిళ శర్మతో ఫ్రెండ్షిప్ను తిరస్కరించడంతో ఆ యువతి, ఆమె తల్లి ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్లోడ్ చేశాడు. ఫొటోల్లో దుస్తులు లేకుండా చేసే ఏఐ టూల్స్ కోసం ఆన్లైన్లో వెతికాడు శర్మ. ఆ టూల్స్ సాయంతో 100కు పైగా అసభ్యకర మార్ఫింగ్ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేశాడు. వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేశాడు.ఆ మహిళ పేరు, ఫొటోలు వాడి శర్మ 3 నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, ఓ యూట్యూబ్ ఛానల్ సృష్టించాడు. ఏఐతో తయారైన కంటెంట్ను వాటిలో అప్లోడ్ చేసి, మహిళ, ఆమె కుటుంబ ప్రతిష్ఠ దెబ్బతినేలా కామెంట్స్ పెట్టాడు. దర్యాప్తులో పోలీసులు, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికల్లో అతడు 8 నుంచి 10 వరకు నకిలీ ఖాతాలు సృష్టించినట్టు గుర్తించారు.“నిందితుడు ఆ యువతితో పాటు ఆమె తల్లి ఏఐ మార్ఫింగ్ నగ్న ఫొటోలు, వీడియోలను నకిలీ ఖాతాల్లో అప్లోడ్ చేశాడు. మహిళను మానసికంగా వేధించి, సమాజంలో ఆమె ప్రతిష్ఠ దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేశాడు” అని అధికారులు తెలిపారు.“యువతి, ఆమె తల్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్లోడ్ చేసి, గూగుల్లో ‘ఏఐ రిమూవ్ క్లోత్స్’ అని వెతికిన తర్వాత అనేక వెబ్సైట్లు వాడి, కృత్రిమ మేధ సాధనాలతో మార్ఫింగ్ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేశాడు” అని అధికారులు తెలిపారు.ఢిల్లీలో దొరికిపోయాడు..బాధిత యువతి అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బృందాన్ని ఆశ్రయించింది. ఇన్స్పెక్టర్ ఎంహెచ్ భేటారియా నేతృత్వంలోని పోలీసు బృందం, డిజిటల్ ట్రాకింగ్, మానవ సమాచార సాయంతో ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్పూర్లో నిందితుడి ఆచూకీని గుర్తించింది. ఆ ప్రాంతంలో పోలీసులు దాడి చేసి శర్మను అరెస్టు చేశారు. -
12ఏళ్ల తర్వాత మోదీని కలిసిన CM విజయ్
-
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్
-
‘స్కూల్ గ్యాంగ్ వార్’.. విద్యార్థి తలలోకి దిగిన బుల్లెట్!
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది. ఒక ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి, తన స్నేహితురాలితో కలిసి ఆహారం తింటుండగా, గుర్తుతెలియని వ్యక్తులు అతడి తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాలుడి మెదడులోకి ఒక బుల్లెట్ దూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు.చిన్నపాటి ఘర్షణతో మొదలై..ఆహారం తీసుకుంటున్న విద్యార్థిని పక్కనే ఉన్న మరో బృందం ఉద్దేశపూర్వకంగా తాకడంతో వివాదం మొదలైంది. కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత ఆ బృందం అక్కడి నుండి వెళ్లిపోయింది. అనంతరం తిరిగి వచ్చి తుపాకీతో కాల్పులు జరపడంతో కలకలం చెలరేగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు అత్యంత సమీపం నుండి కాల్పులు జరిపి, అక్కడి నుండి పరారయ్యారు.చికిత్స కోసం ఎయిమ్స్కు తరలింపుకాల్పుల అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధితుడిని వెంటనే మూల్చంద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు మృత్యువుతో పోరాడుతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న నిందితులు కూడా విద్యార్థులేనని, ప్రేమ వ్యవహారమే ఈ ఘర్షణకు అసలు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.పోలీసుల గాలింపు ముమ్మరంఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఎస్హెచ్ఓ, ఏసీపీ బృందాలు ఆధారాల కోసం గాలింపు చేపట్టాయి. ఘటనా స్థలంలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులు పరారీలో ఉండటంతో, వారి కోసం నగరం అంతటా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఐసోలేషన్కు మహిళ తరలింపు -
క్లైమాక్స్కు చేరిన కర్ణాటక రాజకీయం
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు హస్తినలో వాడీవేడిగా సాగుతున్నాయి. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో.. ఇవాళ ఇందిరాభవన్లో అధిష్టానం పెద్దలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్లు భేటీ అయ్యారు. సమావేశంలో వాళ్లు కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనంతరం బయటకు వచ్చిన వాళ్లిద్దరూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా, గత డిసెంబరు నుంచి(రెండున్నరేళ్లు అధికారం పూర్తి కావడం) సీఎం కుర్చీ కోసం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎడతెగని పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇరువురూ ఢిల్లీకి వెళ్లి మంతనాలు సాగించారు. అయితే.. మే 20తో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తి కానుంది. పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే, తననే కొనసాగించాలని సిద్ధరామయ్య కోరుతున్నట్లు సమాచారం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మరో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వీళ్లిద్దరి నుంచి అభిప్రాయసేకరణ చేశారు. సిద్ధరామయ్యకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నేపథ్యంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మూడేళ్లలో తన ప్రభుత్వ పనితీరు, ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు తదితరు అంశాలను సిద్దరామయ్య ప్రస్తావిస్తున్నారు. మరోవైపు.. ఆయన్ని మారిస్తే ఓబీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనలో అధిష్టానం ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే తనకే సీఎం పదవి ఇవ్వాలని డీకే గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు సమీకరణాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత అనిశ్చితి ఎక్కువకాలం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదని సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో కొనసాగుతున్న అధికారం పోరుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిళ్లు చేయడం ఏమాత్రం మంచిది కాదు. పార్టీ 2028లో మళ్లీ అధికారంలోకి రావాలంటే స్థిరత్వం.. బలమైన టీమ్ అవసరం. అంతర్గత అనిశ్చితి ఎక్కువకాలం కొనసాగితే బీజేపీకి లాభం కలుగుతుంది అని హెచ్చరించారాయన. అదే సమయంలో అధిష్టానం నుంచి త్వరలోనే ఓ ప్రకటన వెలువడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.ఒకవేళ మార్పు గనుక ఉంటే.. ఇప్పుడే చేస్తారా?.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మార్పు ఉంటుందా? ఒకవేళ లేకుంటే అసెంబ్లీ ఎన్నికల వరకు సిద్ధరామయ్యనే కొనసాగిస్తారా?.. డీకేను ఎలా సంతృప్తి పరుస్తారు? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. -
ఎక్కడికి పోవాలి? ఏం చేయాలి? భవిష్యత్తుపై బెంగలో 500 మంది
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నడిబొడ్డునున్న చారిత్రక జింఖానా క్లబ్ను జూన్ 5వ తేదీలోగా తమకు అప్పగించాలంటూ కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగులు రోడ్డెక్కారు. ముందస్తు సమాచారం లేకుండా వచ్చిన ఈ అకస్మాత్తు నోటీసుతో, క్లబ్లో పనిచేస్తున్న దాదాపు 500 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాల విషయంలో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.ఆందోళనలో 500 మందికేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఉన్నపళంగా ఖాళీ చేయాలంటే తమ పరిస్థితి ఏంటీ, ఎక్కడి పోవాలి, తమ భవిష్యత్తు ఏంటి? అని వాపోతున్నారు. ‘మమ్మల్ని జూన్ 5కల్లా క్లబ్ ఖాళీ చేయాలని చెప్పారు. మాకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదు. ఇక్కడ ముప్పై, నలభై ఏళ్లుగా పనిచేస్తున్నాం.. ఇప్పుడు మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు" అంటూ క్లబ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త విన్నప్పటి నుండి సిబ్బంది అంతా షాక్లో ఉన్నారని, తమ భవిష్యత్తు ఏంటో తెలియక నిరంతరం ఫోన్లు చేస్తున్నారని యూనియన్ చీఫ్ నందన్ నేగి తెలిపారు.క్లబ్ యాజమాన్యం స్పందనమరోవైపు నాలుగు ముఖ్యమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ మే 25న ఢిల్లీ జింఖానా క్లబ్ యాజమాన్యం ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్కు లేఖ రాసింది. క్లబ్ నిర్వహణకు ప్రత్యామ్నాయంగా మరెక్కడైనా తగిన స్థలాన్ని కేటాయిస్తారా?, క్లబ్ నమ్ముకుని ఉన్న 500 మంది ఉద్యోగులు, సిబ్బంది భవిష్యత్తుకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు? అని కోరింది. దీనితో పాటు, క్లబ్ గవర్నింగ్ బాడీ ఈ ఖాళీ ప్రక్రియపై ఉన్న ఆందోళనలను చర్చించడానికి ల్యాండ్ డెవలప్మెంట్ ఆఫీసర్తో సమావేశం కావాలని అభ్యర్థించింది.కాగా ప్రధానమంత్రి అధికారిక నివాసానికి సమీపంలో ఉన్న చారిత్రాత్మక 'ఢిల్లీ జింఖానా క్లబ్' భూమిని తక్షణమే ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 27.3 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్థలం అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన ప్రాంతం పరిధిలోకి వస్తుందని ఈ స్థలం రక్షణ మౌలిక సదుపాయాల బలోపేతానికి, భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఎంతో అవసరమని, ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్' మే 22న ఈ నోటీసు జారీ చేసింది.ఇదీ చదవండి: దారుణం : కాఫీలో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారంఢిల్లీ జింఖానా.. దేశంలోని పురాతన, ప్రముఖ క్లబ్లలో ఒకటి. 1913 జులైలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అప్పట్లో దీన్ని ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ గా పిలిచేవారు. స్పెన్సర్ హార్కోర్ట్ బట్లర్ దీనికి మొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1947లో స్వాతంత్య్రానంతరం ఇంపీరియల్ అనే పదాన్ని తొలగించింది అప్పటి ప్రభుత్వం. దీంతో ఢిల్లీ జింఖానా క్లబ్గా మారింది. క్లబ్ ప్రారంభ రోజుల్లో పోలో క్లబ్ జింఖానాలో భాగంగా కొనసాగింది. ప్రస్తుతం 5,600 మందికి పైగా సభ్యులు, సుమారు 500 మంది సిబ్బంది ఉన్నారు.ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ22 ఏళ్లకే ఆరో సారి : ఇంకో కొడుకు కావాలి! నెటిజన్లు ఫైర్! -
దారుణం : కాఫీలో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారం
దేశ రాజధాని నగరానికి సంబంధించి మరో ఘోర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని, కిడ్నాప్ చేసి నాలుగు రోజులు పాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.లక్నోలోని ఒక అద్దె గదికి తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు పదేపదే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ప్రకారం ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్కు చెందిన బాధితురాలు దౌలత్ రామ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతోంది. సెలవుల్లో తన సొంత గ్రామాన్ని సందర్శించి ఢిల్లీకి తిరిగి వస్తుండగా మే 15న జాఫరాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కింది. ఈ ప్రయాణంలో, 20 ఏళ్ల శివం యాదవ్ అనే పాత పరిచయస్తుడికి సందేశం పంపింది. అతను లక్నోలోని చార్బాగ్ రైల్వే స్టేషన్లో 19 ఏళ్ల సన్నీ యాదవ్ అనే మరో వ్యక్తితో కలిసి ఆమెను కలిశాడు. ఆమెను తిరిగి స్టేషన్లో దింపే ముందు ఇక్కడ కొద్ది సేపు ఉండొచ్చు కదా అని ఆమెన బలవంతంగా ఒప్పించారు. ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను క్యాబ్లో సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో ఉన్న అద్దె గదికి తీసుకెళ్లారు. కోల్ట్ కాఫీలో మత్తు మందు కలిపి ఇచ్చారు. మే 15, 16 తేదీల రాత్రి తనపై పలుమార్లు లైంగిక దాడి జరిగిందని ఆమె ఆరోపించింది. తరువాతి రెండు రోజుల పాటు ఇది కొనసాగింది. మే 16న రెండవ వ్యక్తి ఆమెపై మళ్లీ దాడి చేశాడని, ఆ తర్వాత గుర్తుతెలియని మూడవ వ్యక్తిని గదిలోకి తీసుకువచ్చి అతను కూడా ఆమెపై రేప్ చేయించాడు. ఎదురుతిరిగినా, ఎవరికైనా చెప్పినా జరిగిన విషయాన్ని బయటపెడితే చంపేస్తామని బెదిరించారు. ఆ తరువాత మే 18న ఆమెను తిరిగి చార్బాగ్ రైల్వే స్టేషన్కు తీసుకువెళ్లి, ఒక జనరల్ టికెట్ కొని ప్లాట్ఫామ్పై వదిలిపెట్టాడు. ఆమె ఢిల్లీకి వెళ్లే రైలు ఎక్కింది. ప్రయాణంలో ఉండగానే తన కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేసి, రైల్వే హెల్ప్లైన్ 139ని ఫిర్యాదు చేసింది. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను అప్రమత్తం చేశారు.మే 19న ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత, వైద్య పరీక్షల కోసం హెడ్గేవార్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వైద్య నమూనాలను సేకరించి, సీల్ చేసి, సాక్ష్యంగా స్వాధీనం చేసుకున్నారు. సఖి వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్ ద్వారా కౌన్సెలింగ్ సహాయం ఏర్పాటు చేశారు.దక్షిణ జోన్ అదనపు డీసీపీవసంత కుమార్, ప్రాథమికవిచారణలో శివమ్, సన్నీ ఇద్దరూ బాధితురాలు నివసించే జౌన్పూర్లోని అదే గ్రామానికి చెందినవారని తేలిందన్నారు. నిందితుల్లో ఒకడైన శివమ్ కాఫీ షాప్లో పనిచేస్తున్నారని, మరో నిందితుడు సన్నీఈ-కామర్స్ కంపెనీలో డెలివరీ బాయ్గా ఉన్నాడు. నిందితులను అరెస్టు చేయడానికి ఐదు బృందాలను ఏర్పాటు చేశామని, వారు దాక్కునే అవకాశం ఉన్న ప్రదేశాలను తెలుసుకోవడానికి వారి కుటుంబ సభ్యులను విచారిస్తున్నామన్నారు.ఆనంద్ విహార్లో రైల్వే పోలీసులు భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్లు 70(1) (సామూహిక అత్యాచారం), 123 (విషం ద్వారా గాయపరచడం), 127(3) (అక్రమ నిర్బంధం) మరియు 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని నివేదిక పేర్కొంది. ఈ కేసు మే 23న లక్నో పోలీసులకు బదిలీ చేయబడింది మరియు సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో అవే సెక్షన్ల కింద కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఆరోపిత నేరస్థలం లక్నో పరిధిలోకి వస్తుందని, తదుపరి దర్యాప్తు కోసం పత్రాలను పంపినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ -
5 కల్లా ‘జింఖానా’ను అప్పగించండి
న్యూఢిల్లీ: ఢిల్లీ నడిబొడ్డునున్న చారిత్రక జింఖానా క్లబ్ను జూన్ 5వ తేదీలోగా తమకు అప్పగించాలంటూ కేంద్రం నిర్వాహకులను ఆదేశించింది. అత్యంత కీలకమైన ల్యుటెన్స్ ప్రాంతం లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధానమంత్రి అధికార నివాసాన్ని ఆనుకుని 27.3 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్థలం రక్షణ మౌలిక సదుపాయాల బలోపేతానికి, భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఎంతో అవసరమని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. గృహ, పట్టణ వ్యవహారాల శాఖ అధీనంలోని భూ అభివృద్ధి కార్యాలయం(ఎల్ అండ్డీవో) ఈ మేరకు ఈ నెల 22వ తేదీన ఉత్తర్వు జారీ చేసింది. సఫ్దర్జంగ్ రోడ్ నంబర్–2లోని అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన చోట ఉన్న ఈ క్లబ్ స్థలం ప్రజా భద్రత అవసరాల కోసం ఎంతో కీలకమైందని అందులో పేర్కొంది. నేడు ఢిల్లీ జింఖానా క్లబ్ లిమిటెడ్గా అందరికీ పరిచయమైన ఒకప్పటి ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ లిమిటెడ్కు ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం ‘సోషల్ అండ్ స్పోర్టీంగ్ క్లబ్’నిర్వహణ కోసం లీజుకిచ్చిందని అందులో వివరించింది. పరిపాలనాపరమైన, సంస్థాగతమైన తక్షణావసరాల దృష్ట్యా, ప్రజా ప్రయోజనాల కోసం ఈ భూమి ఎంతో అవసరమని, పక్కనే ఉన్న ప్రభుత్వ భూములతో దీనిని అనుసంధానించాల్సిన అవసరముందని ఎల్ అండ్ డీవో తెలిపింది. లీజ్ డీడ్లోని క్లాజ్–4 ద్వారా సంక్రమించిన అధికారం కింద భూ అభివృద్ధి కార్యాలయం ద్వారా భారత రాష్ట్రపతి ఈ భూమిని తిరిగి తక్షణమే స్వా«దీనం చేసుకునేందుకు నిర్ణయించారని తెలిపింది. మొత్తం 27.3 ఎకరాల్లో ప్రస్తుతమున్న అన్ని భవనాలు, శాశ్వత నిర్మాణాలు, లాన్లు, ఇతర అమరికలు అన్నీ లీజు దాత, ఎల్ అండ్ డీవో ద్వారా భారత రాష్ట్రపతికి పూర్తిగా చెందుతాయని పేర్కొంది. ఈ ఉత్తర్వు ప్రకారం జూన్ 5వ తేదీన భూ అభివృద్ధి కార్యాలయం క్లబ్ ఆవరణను స్వా«దీనం చేసుకోనుందని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించని పక్షంలో చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటామని కూడా తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలపై ఢిల్లీ జింఖానా క్లబ్ సభ్యుడు సిద్థార్థ విస్మయం వ్యక్తం చేశారు. క్లబ్ కారణంగా భద్రతకు ముప్పు ఉందనడాన్ని ఆయన తప్పుబట్టారు. అత్యంత భద్రత కలిగిన ఈ ప్రాంతంలో కీలకమైన కేంద్ర ప్రభుత్వ, రక్షణ శాఖ కార్యాలయాలు ఉన్నాయన్నారు. పెద్ద సంఖ్యలో సభ్యులు, ఎంతో చరిత్ర కలిగిన క్లబ్ను కాపాడుకునేందుకు తాము కోర్టుకు వెళతామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. క్లబ్ స్వాధీనం విషయమై మరోసారి ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. సభ్యత్వం కోసం దశాబ్దాల వెయిటింగ్ బ్రిటిష్ జమానాలో 1913లో ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ పేరుతో దీనిని స్థాపించారు. స్వాతంత్య్రం వచ్చాక పేరును ఢిల్లీ జింఖానా క్లబ్గా మార్చారు. ఇప్పుడున్న కట్టడాలన్నీ 1930ల్లో నిర్మించినవే. ఇందులో సభ్యత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవహారంగా మారింది. ప్రస్తుతం ఈ క్లబ్ సభ్యుల సంఖ్య 11 వేలు కాగా ఇందులో కొత్తగా చేరాలనుకునే వారు 30–40 ఏళ్లు వేచి ఉండక తప్పదని జింఖానా సెక్రటరీ తెలిపారు. ప్రస్తుతం 3 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఏటా ఖాళీ అయ్యే స్థానాల్లో 70 మంది వరకు కొత్తగా తీసుకుంటుంటారు. ఇందులో వెయిటింగ్ ఫీజే రూ.7.5 లక్షలు. ప్రభుత్వ అధికారి కేటగిరీ కింద సాధారణ రుసుము రూ.4.5 లక్షలు, ప్రభుత్వేతర కేటగిరీ అయితే రూ.18.91 లక్షల ఫీజు కట్టాల్సి ఉంటుంది. సభ్యత్వానికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
హామీని నిలబెట్టుకున్న విజయ్.. వచ్చే వారం ఢిల్లీకి సీఎం
సాక్షి, చైన్నె: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా, ప్రభుత్వానికి, రాజకీయ వ్యవహారాలకు సంబంధించి తనకు సలహాలు అందించేందుకు ఇద్దరు ప్రత్యేక సలహాదారులను నియమించారు. వీరిలో ఒకరు ప్రముఖ జాతీయ రాజకీయ వ్యూహకర్త జాన్ ఆరోగ్యస్వామి ఉన్నారు. సీఎం విజయ్ తన రాజకీయ సలహాదారుగా ఆయన్ను నియమించుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం గెలుపు వ్యూహాల్లో ఈయన కీలక పాత్ర పోషించారు. ప్రముఖ సలహాదారు విష్ణు రెడ్డిని ఇతర ప్రభుత్వ, పాలనాపరమైన విషయాల కోసం సలహాదారుడిగా నియమించుకున్నారు. కాగా, జ్యోతిష్కుడు, టీవీకే అధికార ప్రతినిధి రతన్ పండిట్ను ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా నియమించగా, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆ నియామకాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు నిపుణులను అధికారికంగా రంగంలోకి దిగారు.వచ్చే వారం ఢిల్లీకి సీఎం విజయ్తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ మొదటిసారిగా వచ్చే వారం ఢిల్లీలో పర్యటించనున్నారు. క్యాబినెట్ విస్తరణ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధి నిధులు, మేఘాదాతు ఆనకట్ట వివాదంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కూడా విజయ్ కలవనున్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించిన రూ. 65 లక్షల ఆర్థిక సహాయంతో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన తిరువళ్లువర్’ విగ్రహాన్ని సీఎం విజయ్ ఆవిష్కరించనున్నారు. అలాగే జూన్ 11న ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఆయన హాజరుకానున్నారు.సీఎంఓ ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీలు విడుదలముఖ్యమంత్రి విజయ్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే ప్రజల వినతిపత్రాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సచివాలయానికి రాకుండానే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించేందుకు అధికారిక ఈ–మెయిల్ ఐడీలను ప్రభుత్వం విడుదల చేసింది.హామీని నిలబెట్టుకున్నసీఎం విజయ్చెప్పింది చేస్తాడు.. చేసింది చెబుతాడు’ అనే నినాదంతో సీఎం విజయ్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు ప్రస్తుతం తమిళనాడులో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విక్రవాండిలో జరిగిన టీవీకే మొదటి రాజకీయ మహానాడులో తాము అధికారంలోకి వస్తే మిత్రపక్షాలకు పరిపాలనలో భాగస్వామ్యం (సంకీర్ణ ప్రభుత్వం) కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మాట ఇచ్చినట్లుగానే, తాజాగా వీసీకే నాయకుడు వన్నియరసు, ఐయూఎంఎల్ నాయకుడు షాజహాన్లను క్యాబినెట్ మంత్రులుగా చేర్చుకుని, తమిళనాడు రాజకీయాల్లో ఒకే పార్టీ సర్వాధికారాల సంస్కృతిని మార్చి, సరికొత్త విప్లవాత్మక సంకీర్ణ యుగానికి విజయ్ తెరలేపారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ పోస్టు వైరల్గా మారింది.620 అమ్మ క్యాంటీన్ల’ పునరుద్ధరణకు ఆదేశంపేద ప్రజల ఆకలి తీర్చేందుకు గతంలో ప్రారంభించబడిన అమ్మ క్యాంటీన్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. చైన్నె కార్పొరేషన్ పరిధిలోని 383 అమ్మ క్యాంటీన్లు,ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 237 అమ్మ క్యాంటీన్లను అత్యుత్తమ వసతులతో పునర్నిర్మించి, పేదలకు నిరంతరాయంగా తక్కువ ధరకే ఆహారం అందించాలని సీఎం ఆదేశించారు -
‘దీదీ కాపాడు’ అని మొరపెట్టుకున్న కొన్ని క్షణాల్లోనే
వరకట్నరక్కసి కోరలు సరికొత్తగా విస్తరిస్తున్న చాయలు ఇటవలికాలంలో బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యం రాజధాని నగరం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిన్న గాక మొన్న ట్విషా శర్మ, దీపికా నాగర్ అనుమానాస్పద మరణం ఘటనలు కలకలంరేపాయి. కట్నం కోసమే తమ బిడ్డల్ని పొట్టనపెట్టుకున్నారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపణల పర్వం కొనసాగుతుండగానే ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నన్ను బతికించండి అని మొరపెట్టుకున్న నిమిషాల వ్యవధిలోనే ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం ఉద్రిక్తతను రాజేసింది.వీణా కుమారి (28) 2022లో రాజు సింగ్తో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన కొద్దిరోజులకే వారు ఉత్తరప్రదేశ్లోని సంభాల్ నుండి ఢిల్లీలోని ఇందర్పురికి మకాం మారారు. మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి జరిగినప్పటి నుండి కట్నం విషయంలో వీణను భర్త రాజు వేధిస్తూ ఉండేవారు. నీకంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడినంటూ నిత్యం పోరు పెట్టేవాడు. మరోవైపు ఇటీవలే పెళ్లి చేసుకున్న మరిది రాజ్కుమార్ తన భార్య తెచ్చిన కట్నంతో (46 ఇంచుల టీవీ, బైక్) వీణ తెచ్చిన కట్నాన్ని (32 ఇంచుల టీవీ) పోల్చుతూ వేధించేవాడు. ఇద్దరూ కలిసి వీణను మానసికంగా, శారీరకంగాహింసించేవారు. ఎంతలా అంటే ఒకసారి కొట్టిన దెబ్బలకు వీణ కర్ణభేరి పగిలిపోయింది.దీంతో పాటు ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్, అదనపు ట్నం వేధింపులు మరింత పెరిగాయి. అయితే కుటుంబం పరువు పోతుందనే భయంతోనే ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సోదరి వీణ ఆపిందని ఆయన పేర్కొన్నారు. ఇంతలోనే అన్యాయం జరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 7 నిమిషాల్లో అంతారాత్రి పదిగంటలకు వీణ తన సోదరి రీనాకి ఫోన్ చేసింది. ఏడుస్తూ.. "దీదీ నన్ను కాపాడు. వీళ్లు నన్ను బాగా కొడుతున్నారు. నన్ను బతకనివ్వరు. చంపేస్తారు" అని చెప్పింది. అంతేకాదు తను చనిపోయాక తన 6 నెలల కొడుకును జాగ్రత్తగా చూసు కోమని వేడుకుంది. అంతలోనే కాల్ కట్ అయింది. ఆందోళన చెందిన రీనా తిరిగి ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. వెంటనే ఆమె వీణ ఇంటికి బయలుదేరింది. బచా లో దీదీ అని ప్రాధేయపడిన కేవలం 7 నిమిషాలకే, వీణ బావ రీనాకు ఫోన్ చేసి, "వదిన మేడ పైనుంచి కింద పడిపోయింది" అని చెప్పాడు. రీనా అక్కడికి చేరేలోపే వీణ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.దీంతో అదనపు కట్నం కోసం ఆమె అత్తవారింటి వారే భవనం పైనుంచి తోసి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ కొనసాగుతోందని పశ్చిమ ఢిల్లీ డీసిపీ శరద్ భాస్కర్ వెల్లడించారు.అత్తవారింటి వాదనవీణ మామ జైపాల్ ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు సహజమేనని, తాము ఒక్క స్పూన్ కూడా కట్నం అడగలేదని చెప్పారు. ఆమె భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయిందని భర్త రాజు సింగ్ వాదిస్తున్నాడు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోం కాదు.. వర్క్ ఫ్రం బీచ్, అదీ గోవాలో -
ఉమర్ ఖాలిద్కు తాత్కాలిక ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టై జైలులో ఉన్న మాజీ జేఎన్యూ విద్యార్థి నేత కార్యకర్త ఉమర్ ఖాలిద్కు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆరు సంవత్సరాల తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు.శుక్రవారం హైకోర్టు ఖాలిద్కు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు ఆయన విడుదల కానున్నారు. అయితే ఈ తాత్కాలిక బెయిల్ ఆయన తల్లి శస్త్రచికిత్స కారణంగా మంజూరైంది. రూ.1 లక్షల ష్యూరిటీ చెల్లించాలని.. అలాగే ఈ మూడు రోజుల సమయంలో ఆయన కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అంటే.. ఆయన ఎక్కడికి వెళ్తారు, ఎవరిని కలుస్తారు అన్న విషయాలు నియంత్రణలో ఉండేలా ఆంక్షలు విధించిందన్నమాట.ఉమర్ ఖాలిద్ 2020లో ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన నిర్దోషి అని వాదిస్తూ పలు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే ఇప్పటివరకు ఆయనకు దీర్ఘకాలిక బెయిల్ లభించలేదు. అయితే ఇటీవలె బెయిల్ నిరాకరణపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కుటుంబ కారణాల వల్ల హైకోర్టు మూడు రోజుల తాత్కాలిక బెయిల్ ఇవ్వడం గమనార్హం.ఢిల్లీ అల్లర్లు.. పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన హింసాత్మక నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ అల్లర్లలో దాదాపు 53 మంది మృతి చెందగా.. 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద ఛార్జిషీట్ నమోదు చేశారు. వీళ్లలో ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ సహా ఏడుగురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు గతేడాది సెప్టెంబరులో ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. దీనిపై జనవరిలో విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఖాలిద్, ఇమామ్కు మాత్రం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసులో మిగతా నిందితులతో పోలిస్తే వీరిద్దరిపై అభియోగాలు బలంగా ఉన్నాయని పేర్కొంది.సుప్రీం ధర్మాసనం అసంతృప్తిఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్లకు బెయిల్ నిరాకరిస్తూ.. ఈ ఏడాది జనవరిలో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అంజారియా ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే ఇటీవల ఈ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉపా కేసులో ఆరేళ్లకు పైగా కస్టడీలో ఉన్న సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీకి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కేసుల విచారణలో తీవ్ర జాప్యం, విచారణకు ముందు సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉంచడం వంటి సమయాల్లో బెయిల్ మంజూరు చేయవచ్చని, 2021లో ఓ కేసులో ముగ్గురు న్యాయమార్తులు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ జడ్జిమెంట్ను జనవరిలో తీర్పు ఇచ్చిన సమయంలో ధర్మాసనం సరిగా అనుసరించలేదని వ్యాఖ్యానించింది. గతంలో ధర్మాసనం అనుసరించిన విధానాన్ని అంగీకరించడం కష్టమని చెబుతూ.. ఉపా కేసులలో సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం, విచారణలో జాప్యం వంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఖాలిద్కు తాత్కాలిక బెయిల్ దక్కడం గమనార్హం.ఫేక్ ఎవిడెన్స్పై విమర్శలు..2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి మొత్తం 695 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ కింది కోర్టుల్లో ఇవి విచారణ జరిగాయి. 116 కేసుల్లో ఇప్పటికే తీర్పులు వెలువడ్డాయి. 97 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ క్రమంలో.. పోలీసులు సమర్పించిన వాటిల్లో నకిలీ ఆధారాలు, కల్పిత సాక్ష్యాలు ఉన్నట్లు కోర్టులు గుర్తించాయి. ప్రత్యేకించి.. 17 కేసుల్లో ఫేక్ ఎవిడెన్స్ను కోర్టులు హైలైట్ చేశాయి. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. -
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న పెద్దల సభకు ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదే రోజున ఫలితాలుంటాయి. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నామినేషన్ దాఖలుకు జూన్ 8 చివరితేదీ కాగా జూన్9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్ 11 వరకూ విత్డ్రాకు సమయముంటుంది. జూన్ 20తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది. -
ఎండ దెబ్బకు... తగలబడిన కారు
-
వీధుల్లో కుక్కలు కనపడ్డానికి వీల్లేదు: సుప్రీం కోర్టు
వీధి కుక్కల అంశం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కల తరలింపు కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పింది. అలాగే తమ గైడ్ లైన్స్ను పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలన్న విజ్ఞప్తులను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేస్తూ.. జంతు ప్రేమికులకు ఝలక్ ఇచ్చింది. వీధి కుక్కల దాడుల వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రతి పౌరుడు సొసైటీలో స్వేచ్ఛగా(ప్రత్యేకించి పబ్లిక్ ప్లేసుల్లోనూ) జీవించాలే తప్ప భయంతో కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో కిందటి ఏడాది నవంబర్ 7న కఠిన ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం.. ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా ప్రదేశాల నుండి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని చెప్పింది. వాటికి స్టెరిలైజ్, వ్యాక్సినులు వేసినా కూడా తిరిగి పబ్లిక్ప్లేసుల్లో వదలొద్దని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే.. ఈ మార్గదర్శకాలను సవరించాలంటూ జంతు సంక్షేమ సంఘాలు, డాగ్ ఫీడర్స్ పిటిషన్లు వేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్-2023కు విరుద్ధమని వాదించారు. ఆ నియమాల ప్రకారం, కుక్కలను స్టెరిలైజ్ చేసి, వ్యాక్సిన్ వేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని గుర్తు చేశారు. అయితే ఈ పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియా.. ఆ వాదనతో ఏకీభవించలేదు. తమ ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించింది.తాజా విచారణలో.. ప్రేక్షక పాత్ర వహిస్తున్న ప్రభుత్వాల తీరును సుప్రీం కోర్టు ఆక్షేపించింది. చిన్న పిల్లలు, వృద్ధులు, విదేశీ పర్యాటకులు కూడా వీధి కుక్కల దాడులకు గురైన ఘటనలను కోర్టు ప్రస్తావించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై దాడులు బాధాకరమని వ్యాఖ్యానించింది. తాము ఆదేశాలిచ్చాక కూడా కుక్క కాట్ల ఘటనలు చోటు చేసుకుంటుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్” అనే డార్వినియన్ సూత్రం వాస్తవంగా అమలవుతున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల వల్ల కలిగే ప్రమాదాలను నిర్లక్ష్యం చేయరాదని కోర్టు ఈ సందర్భంగా హెచ్చరించింది. ప్రజల ప్రాణ భద్రతను కాపాడటం ప్రభుత్వాల కర్తవ్యమని.. ఈ విషయంలో ప్రభుత్వాలు పాసివ్ స్పెక్టేటర్లుగా ఉండకూడదని.. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాబట్టి తమ గైడ్లైన్స్ను కచ్చితంగా పాటించాల్సిందేనని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిర్దేశించిన ప్రాంతాల్లోనే వాటిని ఆహారం పెట్టాలని జంతు ప్రేమికులకు స్పష్టం చేసింది.‘‘వీధుల్లో కుక్కలు కనిపించకూడదు. పిచ్చి కుక్కలకు యుథనేషియా ఇచ్చి చంపేయండి. ప్రమాదకర కుక్కలను సహించొద్దు. రేబీస్ కుక్కలకు కారుణ్య మరణం ప్రసాదించాలి. ప్రతిజిల్లాలో నియంత్రణకు యంత్రాంగం ఉండాల్సిందే. వీధి కుక్కల బెడదను నివారించాల్సిందే. ఇదొక సీరియస్ పబ్లిక్ న్యూసెన్స్. మా ఆదేశాలను పాటించని అధికారులు కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని సుప్రీం కోర్టు తీర్పు సందర్భంగా వెల్లడించింది. -
వారికి బెయిల్ నిరాకరణ సరికాదు
న్యూఢిల్లీ: 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు బెయిల్ నిరాకరిస్తూ జనవరిలో తానిచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తానే అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘బెయిల్ నియమం, జైలు మినహాయింపు’నియమం కేవలం వట్టి నినాదం కాదని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం పేర్కొంది. నార్కో–టెర్రర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జమ్మూకశ్మీర్లోని హంద్వారాకు చెందిన సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీకి బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం పైవిధంగా వ్యాఖ్యానించింది. 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు జనవరి 5వ తేదీన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాల సుప్రీం ధర్మాసనం బెయిల్ నిరాకరించింది. సాక్షుల విచారణ జరుగుతున్నందున ఏడాది తర్వాత మరోసారి బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవాలని వారికి స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు 2021 నాటి కేఏ నజీబ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా లేవని సోమవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. అప్పటి తీర్పులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)కింద నమోదైన కేసుల్లో విచారణలో జాప్యాన్ని బెయిలివ్వడానికి ఒక ప్రాతిపదికగా పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ తీర్పునకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. జాతీయ భద్రత, ఉగ్రవాద నేరాలకు సంబంధించిన, ఉపా చట్టాన్ని ఉద్దేశించిన కేసుల్లో ‘బెయిల్ నియమం..జైలు మినహాయింపు’అనే సూత్రాన్ని వర్తింపజేయాలని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. -
‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’ కామెంట్లపై సీజేఐ సూర్యకాంత్ వివరణ
ఢిల్లీ: ‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వచ్చాయి. శుక్రవారం (మే 15న) జరిగిన విచారణలో సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చి బెంచ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కేసు విచారణ సమయంలో దేశ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.దీనిపై సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. ‘‘మీడియా నా వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసింది. నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియాలోకి వచ్చిన వారిని తప్పుబట్టాను. అలాంటి వారు పరాన్నజీవులని చెప్పాను. యువతను విమర్శించలేదు, భారత యువత గర్వకారణం. భారత యువతే అభివృద్ధికి మూల స్తంభం’’ అని తెలిపారు.ఓ పనికిమాలిన కేసు విచారణ సమయంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా తప్పుగా చూపించిందని సీజేఐ సూర్యకాంత్ చెప్పారు. “నిన్న కేసు విచారణ సమయంలో నేను చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా కొంత భాగం తప్పుగా చూపించిన తీరు చూసి బాధపడ్డాను. బార్ వంటి వృత్తుల్లోకి నకిలీ, బోగస్ డిగ్రీల సాయంతో వచ్చిన వారినే నేను ప్రత్యేకంగా విమర్శించాను. అలాంటి వారు మీడియా, సోషల్ మీడియా, ఇతర గౌరవనీయ వృత్తుల్లోకి చొరబడ్డారు. అందుకే వారిని పరాన్నజీవులతో పోల్చాను” అని సూర్యకాంత్ చెప్పారు.కాగా, నిరుద్యోగ యువ న్యాయవాదులను బొద్దింకలుగా పేర్కొన్నారని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. సీనియర్ హోదా కల్పించే ప్రక్రియపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కాలేదని ఆరోపిస్తూ న్యాయవాది సంజయ్ దూబే ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్పై దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాయి.విచారణ సమయంలో సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం దూబేను ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది హోదా ప్రతిష్ఠకు గుర్తా లేదంటే న్యాయ వ్యవస్థలో భాగస్వామ్యం సాధనమా? అని జోయ్మాల్యా బాగ్చి ప్రశ్నించారు.ఆ సమయంలో “వృత్తిలో.. ఉపాధి దొరకని బొద్దింకల్లాంటి యువకులు ఉన్నారు” అని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. వారు సోషల్ మీడియా, ఆర్టీఐ ఉద్యమాల వైపు వెళ్తున్నారని చెప్పారు. నల్ల కోట్లు వేసుకున్న వేలాది మందిపై వారి డిగ్రీల విషయంలో అనుమానాలు ఉన్నాయని అన్నారు.దీంతో, తన వ్యాఖ్యల భావాన్ని వక్రీకరించారని శనివారం సూర్యకాంత్ స్పష్టం చేశారు. “దేశ యువతను నేను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారం. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మానవ వనరులపై నాకు గర్వంగా ఉంది. భారత యువత నాకు ఎంతో గౌరవం ఇస్తారు. నేనూ వారిని అభివృద్ధి చెందే భారతానికి స్తంభాలుగా చూస్తాను” అని తెలిపారు. -
ఫోన్ పక్కకి పెడతారా.. లేక గన్ తీయమంటారా
ఢిల్లీ: భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రుల సదస్సు ముగిసింది. అయితే ఇందులో పాల్గొనడానికి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు ఊహించని ఘటన ఎదురైంది. సదస్సులో పాల్గొన్న అనంతరం సెర్గీ లావ్రోవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతుండగా ఓ జర్నలిస్టు ఫోన్లో మాట్లాడుతూ తరచుగా అంతరాయం కలిగించారు. దీంతో ఆగ్రహం చెందిన సెర్గీ లావ్రోవ్ మీరు బయిటకి వెళతారా లేక గన్ తీయమంటారా అని హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం నిన్న (మే 15) ముగిసింది. పశ్చిమాసియా లో నెలకొన్న సంక్షోభం, ఇరాన్ వివాదం వంటి అంశాలపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉమ్మడి ప్రకటన లేకుండానే సదస్సు ముగిసింది. ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ని ఒక జర్నలిస్టు ఇబ్బందులకు గురిచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.బ్రిక్స్ సదస్సు అనంతరం సెర్గీ లావ్రోవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలిస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ జర్నలిస్టు ఫోన్లో మాట్లాడడంతో లావ్రోవ్ మాటలకు అంతరాయం కలిగింది. దీంతో ఆయన "మీరు మమ్మల్ని ఒంటిరిగా వదిలేయండి. లేదా ఫోన్ని వదిలేయండి" అని ఆయనతో అన్నారు. దీని తర్వాత సైతం అతని తీరు మారక మరోసారి ఫోన్లో మాట్లాడుతూ ఆయనను ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఆగ్రహం చెందిన లావ్రోవ్ "మీరు మమ్మల్ని వదిలేస్తారా.. నేను జోక్ చేయడం లేదు. మీరు ఫోన్ వదిలేయకపోతే సెక్యూరిటీ సిబ్బంది తుపాకీ తీయాల్సి వస్తుంది" అని తీవ్రంగా హెచ్చరించారు.దీంతో మీడియా సమావేశంలో పరిస్థితులు గంభీరంగా మారాయి. కాగా బ్రిక్స్ సమావేశం కోసం వచ్చిన లావ్రోవ్ కేంద్రమంత్రులతో పలు కీలక సమావేశాలు జరిపారు. మోదీ యూఏఈ పర్యటనకు ముందు గురువారం ఆయనతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలోని పరిస్థితులతో సహా కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణల గురించి చర్చించారు.#Watch | "If you don't surrender your phone, they will pull out a gun": Russian Foreign Minister Sergey Lavrov loses cool at a journalist during the BRICS Foreign Ministers Summits in New Delhi pic.twitter.com/Tpdk5uNzTX— NDTV WORLD (@NDTVWORLD) May 16, 2026 -
ఇది తప్పనిసరి.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం
ఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9,10 తరగతుల భాషా విధానంలో కీలక మార్పులను ప్రకటించింది. 9,10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ ఏడాది(2026) జూలై నుంచి త్రిభాషా విధానం అమలు చేయనుంది. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశాన్ని సీబీఎస్ఈ కల్పించింది.సీబీఎస్ఈ అనుబంధ స్కూళ్ల అన్నింటికి సర్క్యూలర్ జారీ చేసింది. చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఎన్సీఈఆర్టీ 9, 10 తరగతుల సిలబస్ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.ప్రస్తుత విద్యా సంవత్సరం ఇప్పటికే ఏప్రిల్ 2026లో ప్రారంభమైనప్పటికీ, దీని అమలు కోసం ఒక తాత్కాలిక మార్పు విధానాన్ని అనుసరిస్తామని సీబీఎస్ఈ పేర్కొంది. ఈ సవరించిన భాషా విధానం ప్రకారం.. విదేశీ భాషను చదవాలనుకునే విద్యార్థులు.. వారు ఎంచుకునే మిగిలిన రెండు భాషలు కచ్చితంగా భారతీయ దేశీయ భాషలైనప్పుడు మాత్రమే దాన్ని ఎంచుకోవడానికి వీలుంటుంది. లేదా విదేశీ భాషలను అదనపు నాలుగో భాషగా కూడా చదువుకోవచ్చని బోర్డు తెలిపింది. -
ఢిల్లీలో నీట్ అభ్యర్థిని బలవన్మరణం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆజాద్పూర్కు చెందిన నీట్ అభ్యర్థిని(26) ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. కొన్నేళ్లుగా నీట్ కోసం సిద్ధమవుతున్న ఆమె పరీక్ష రద్దుతో మనస్తాపంతో గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె వద్ద ఎలాంటి సూసైట్ నోట్ లభ్యం కాలేదని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గురువారం సాయంత్రం కుటుంబసభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియలు జరిపేందుకు శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడి నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో, పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, పోస్టు మార్టం చేయించారు. ఉరి వేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పొగరాదు.. సెగరాదు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధాని ఢిల్లీలో పర్యావరణహిత హైడ్రోజన్ బస్సులు రంగప్రవేశం చేశాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కేంద్ర సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ వద్ద హైడ్రోజన్ ఆధారిత షటిల్ బస్సు సర్వీసులను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) లాంఛనంగా ప్రారంభించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ, పెట్రోలియం, సహజ వాయువు శాఖల సమన్వయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కింది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి, కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితం.. అత్యాధునిక భద్రత.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) అందించిన రెండు హైడ్రోజన్ బస్సులను డీఎంఆర్సీ నడుపుతోంది. ఒక్కో బస్సులో 35 మంది ప్రయాణించే వీలుంది. ఈ బస్సులు కేవలం రవాణా సౌకర్యాన్ని మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి భద్రతను కూడా కల్పిస్తున్నాయి. ప్రతి బస్సులో జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతతో పాటు బస్సు కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుంటుంది. కాలుష్య రహిత ఇంధనంతో నడిచే ఈ బస్సులు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేయబోయే హైడ్రోజన్ రవాణా వ్యవస్థకు రోల్ మోడల్ కానున్నాయి. ప్రయాణ మార్గాలు ఇవే.... సెంట్రల్ సెక్రటేరియట్ (కేంద్ర సచివాలయం), సేవా తీర్థ మెట్రో స్టేషన్ల మధ్య ఈ బస్సులు నడుస్తాయి. సెంట్రల్ విస్టా పరిధిలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలైన నిర్మాణ్ భవన్, విజ్ఞాన్ భవన్, అక్బర్ రోడ్, బరోడా హౌస్ వంటి ప్రాంతాలను అనుసంధానం చేస్తాయి. వీటితో పాటు ఇండియా గేట్, నేషనల్ స్టేడియం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికీ ఈ సేవలు ఉపయోగపడతాయి. వేళలు, టికెట్ ధరలు... ప్రభుత్వ సెలవు దినాలు మినహాయించి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3.30 నుంచి 6.30 గంటల వరకు 30 నిమిషాలకోబస్సు అందుబాటులో ఉంటుంది. సామాన్యులకు భారం కాకుండా స్టేజీల వారీగా కేవలం రూ. 10, రూ. 15 చొప్పున టిక్కెట్ ధరలను నిర్ణయించారు. ప్రయాణికులు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్, యూపీఐ లేదా నగదు రూపంలో టిక్కెట్ తీసుకునే వెసులుబాటును కల్పించారు. మెట్రో దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి (లాస్ట్ మైల్ కనెక్టివిటీ) ఇబ్బంది పడకుండా ఈ బస్సులు సహాయపడతాయని, రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టే దిశగా ఇదొక కీలక ముందడుగు అని డీఎంఆర్సీ డైరెక్టర్ అమిత్ కుమార్ జైన్ తెలిపారు. -
కారు పార్కింగ్ స్థలంలో అగ్ని ప్రమాదం మంటల్లో కార్లు దగ్ధం
-
వీడియో: చున్నీ కోసం పట్టాలపైకి దిగి..
ఏమరపాటులో.. నిర్లక్ష్యంగా చేసే పనులు ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో తెలియంది కాదు. పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఇందుకు మంచి ఉదాహరణలు. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఓ ఘటనపై నెట్టింట మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ సంప్రదాయ భారత దుస్తుల్లో రైలు ఎక్కింది. డోర్ దగ్గర నిల్చుని సెల్ఫీ వీడియో(టూరిస్ట్ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏమో!) ఆమె దుప్పట్టా జారిపోయి ఫ్లాట్ఫారమ్కు-రైలుకు మధ్య పట్టాల మీద పడింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వృద్ధుడు.. అది గమనించాడు. ఆ యువతికి సాయం చేస్తానని ముందుకు వచ్చాడు. ఫ్లాట్ఫారమ్ నుంచే ఆ చున్నీని అందుకునే ప్రయత్నం చేయగా.. అది వీలుపడలేదు. దీంతో సరాసరి పట్టాలపైకి దూకాడు. అయితే ఆ సమయంలో ఆ ఇండోనేషియా మహిళ అప్రమత్తమైంది. త్వరగా పైకి రావాలంటూ ఆయన్ని కోరింది. ఆ వృద్ధుడు కూడా చున్నీని దొరకబుచ్చుకుని పైకి వచ్చేశాడు. ఆమె చేతికి అందగా థ్యాంక్స్ చెప్పడంతో ఫర్వాలేదని చెయ్యి చూపిస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. “ఆయన హీరోలా వచ్చి సహాయం చేశారు. ఎలాంటి ప్రశంసలు ఆశించకుండా నిశబ్దంగా వెళ్లిపోయారు. నిజంగా గ్రేట్” అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 41 మిలియన్లకుపైగా వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు ఆయనను “జెంటిల్మన్”, “హీరోలా నడిచాడు” అంటూ ప్రశంసించారు. కొందరు తమ అనుభవాలను పంచుకుంటూ, “ఇలాంటి భారతీయ అంకుల్స్ సో స్వీట్” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో హ్యుమాటినీ నా?, సేఫ్టీనా? అంటూ చర్చ నడిచింది. ఆ సమయంలో రైలు కదిలి జరగరానిది జరిగితే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో అంత రిస్క్ అవసరమా అంకుల్? అని సరదాగా ఆ పెద్దాయన్ని మందలిస్తున్నారు. View this post on Instagram A post shared by Indah A.L ᢉ𐭩 (@indaha.l) -
బ్రిక్స్: హర్ముజ్పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: హర్ముజ్ జలసంధి దిగ్భందంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన వేళ బ్రిక్స్ సదస్సు వేదికగా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధి , ఎర్ర సముద్రం వంటి అంతర్జాతీయ జలమార్గాల ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగడం వాణిజ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని జైశంకర్ నొక్కి చెప్పారు.నిన్న మే15 (గురువారం) జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక ప్రసంగం చేశారు."శాంతి ఎవరికో ఒకరికే పరిమితం కాదు స్థిరత్వం అనేది కొందరికే పరిమితం కాకూడదు,శాంతి అనేది ముక్కలు ముక్కలుగా ఉండకూడదు" అంతర్జాతీయ సంబంధాల్లో ప్రతి దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలి, చర్చలు దౌత్యం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి " అని అన్నారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాకు ఆటంకాలు కలగకుండా చూడాలని, అలాగే ఏకపక్ష ఆంక్షల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి బ్రిక్స్ దేశాలు "ఆచరణాత్మక మార్గాలను" వెతకాలని భారత విదేశాంగ మంత్రి బ్రిక్స్ దేశాలకు సూచించారు. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో పరోక్షంగా ఇరాన్కు సూచనలు చేస్తూ జైశంకర్ ప్రసంగించారు. అయితే ఈ సదస్సులో ఇరాన్ ప్రతినిధిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పాల్గొన్నారు.ఇరాన్ - UAE మధ్య వివాదంకాగా ఈసమావేశంలో ఇరాన్ , యూఏఈ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తమ దేశ మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేస్తోందని ఆరోపిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘనలను బ్రిక్స్ ఖండించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్ యుద్ధంపై బ్రిక్స్ దేశాలుఉమ్మడి ప్రకటనను విడుదల చేయలేకపోతున్నాయి.బ్రిక్స్ కూటమి2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE చేరగా.. 2025లో ఇండోనేషియా కూడా బ్రిక్స్లో చేరింది. ఇప్పుడు ఈ కూటమి ప్రపంచ జనాభాలో సుమారు 49.5% కి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
అరవింద్ కేజ్రీవాల్పై కోర్టు ధిక్కరణ చర్యలు
ఢిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మను , కోర్టును లక్ష్యంగా చేసుకుని సందేహాలను రేకెత్తిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారనే ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, మాజీ ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్లపై కోర్టు ధిక్కరణ చట్టం కింద క్రిమినల్ చర్యలను ప్రారంభించాలని కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది.జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ముందు తాము హాజరు కాబోమనే విషయాన్ని కేజ్రీవాల్తో పాటు పలువురు ఆప్ నాయకులు ఆన్లైన్లో లేఖలు షేర్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశించారు. దీనిలో భాగంగా జస్టిస్ స్వర్ణ కాంత శర్మ సైతం.. తనను ఎవరూ బెదిరించలేరంటూ గట్టిగా హెచ్చరించారు.‘ఎడిటెడ్ వీడియోలతో నా కుటుంబ సభ్యులను నిందించారు... ఇది నన్ను మాత్రమే కాకుండా న్యాయవ్యవస్థను భయపెట్టడానికే చేశారు. నన్ను ఎవరూ బెదిరించలేరు’ అని వ్యాఖ్యానించారు.కాగా, ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అనూహ్య నిర్ణయాలతో కోర్టు విచారణకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నేత మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ముందుకు విచారణకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. దాంతో ఈ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజా పరిణామంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. విచారణకు స్వర్ణకాంత శర్మ దూరం..ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టిన నేపథ్యంలో తప్పుకుంటున్నట్లు స్వర్ణకాంత్ శర్మ వెల్లడించారు. న్యాయ క్రమశిక్షణ లో భాగంగా తాను ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి తప్పుకోవాలన్న అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ గతంలోనే కొట్టేసిన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును మరొక న్యాయమూర్తి కి కేటాయించాలని కోరారు. -
ఢిల్లీలో వర్క్ ఫ్రమ్ హోమ్..!
ఢిల్లీ: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఇందన పొదుపు పాటించాలనే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అందుకు శ్రీకారం చుట్టింది ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించి తద్వారా ఇంధనం వాడకాన్ని తగ్గించాలనే యోచనతో రెండు రోజుల వర్క్ ఫ్రమ్ హోమ్కు నడుంబిగించింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఈ మేరకు గురువారం( మే 14వ తేదీ) ఆదేశాలు జారీ చేసిన సీఎం రేఖా గుప్తా.. దీన్ని రేపట్నుంచే(శుక్రవారం) నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇంధన పొదుపు, సమర్థవంతమైన పాలనను ప్రోత్సహించేందుకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ రాజధానిలో ‘మేరా భారత్ మేరా యోగ్దాన్’ (నా భారతదేశం, నా సహకారం) ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. అదే సమయంలో ప్రతి సోమవారాన్ని 'సోమవారం మెట్రో'గా పాటిస్తామని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ మెట్రోలో ప్రయాణిస్తారని ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితుల నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంక్షిప్తంగా..ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్వాహనాల వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయంరేపటి నుంచి నిర్ణయాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశంసీఎం కాన్వాయ్ లో వాహనాలు నాలుగుకు తగ్గింపునాలుగు వాహనాల్లో రెండు ఎలక్ట్రిక్ వాహనాలునా భారతదేశం- నా సహకారం ఉద్యమాన్ని ప్రారంభించిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంప్రతి సోమవారం "మండే మెట్రో " నిర్వహించనున్న ప్రభుత్వంమంత్రులు అధికారులు ఉద్యోగులు అందరూ ఢిల్లీ మెట్రోలోనే రావాలని ఆదేశంసామాన్య ప్రజలు వారంలో ఏదో ఒక రోజును నో వెహికిల్ డే నిర్వహించాలని ఆదేశంఆరు నెలల వరకు పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయొద్దని నిర్ణయంట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 10% పెంపుఏడాది విదేశీ ప్రయాణాలు పూర్తిగా రద్దు90 రోజులపాటు మై ఇండియా మై కాంట్రిబ్యూషన్ ఉద్యమం -
మ్యాగీ అమ్మి రోజుకు రూ. 24 వేలు : నెటిజన్లు షాక్!
కంటెంట్, క్రియేటివిటీ ఉండాలేగానీ కొండల్లో కూడా మ్యాగీ అమ్మవచ్చు. భారీ ఆదాయాన్ని సంపాదించ వచ్చు. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ దేవాన్ష్ త్యాగి సక్సెస్ స్టోరీ తెలిస్తే మీరు కూడా ఔరా అంటారు. అసలేం జరిగిందంటే..కొండ ప్రాంతం.. చల్ల చల్లని గాలులు. అలాంటి టప్పుడు వేడి వేడిగా ఏదైనా తినడానికి దొరికతే, అదీ మ్యాగీ అయితే. ఇంకేముంది అద్భుతమైన కాంబినేషన్తో పర్యాటకులకు పండగే. ఈ ఆలోచననే క్యాష్ చేసుకున్నాడు. అలా అతని ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఛాలెంజింగ్ వీడియోలు చేసే దేవాన్ష్ త్యాగి అనే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్, కొండ ప్రాంతాలలో మ్యాగీ అమ్మితే ఒక రోజులో ఎంత సంపాదించవచ్చో తెలుసుకోవాల నుకున్నాడు. అంతే క్షణ కోసం ఆలస్యం చేయ లేదు. చక్కటి లొకేషన్ను ఎంచుకున్నాడు. అక్కడ తాత్కాలికంగా ఒక బుల్లి కిచెన్ ఏర్పాటు చేశాడు. ‘‘కొండల్లో మ్యాగీ అమ్మి నేను ఎంత సంపాదించగలనో చూద్దాం" అంటూ ఒక వీడియో చేశాడు. కస్టమర్ల కోసం టేబుళ్లు, ప్లాస్టిక్ కుర్చీలతో స్టాల్ను ఏర్పాటు చేసుకున్నాడు.అలా దేవాన్ష్ తన స్టాల్లో రెండు రకాల మ్యాగీలను విక్రయించాడు. సాధారణ మ్యాగీ ప్లేటు రూ. 100, బటర్ మ్యాగీ ప్లేటు రూ. 120 ఇలా రెండు రకాలు అందించాడు. అంతే పర్యాటకులు, హైకర్లు మ్యాగీ లవర్స్ ఎగబడ్డారు. ఆ కొండాకోనల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వేడి వేడి మ్యాగీని ఆరగించడం ఈ వీడియోలో చూడవచ్చు. చూస్తుండగానే స్టాక్ అంతా అయిపోయింది. మొత్తానికి ఒక రోజులో దేవాన్ష్ సంపాదన అక్షరాలా రూ. 24 వేలు. కేవలం ఒక్క రోజులో ఇంత మొత్తం సంపాదించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Devansh Tyagi (@devanshtyagi_)నెటిజన్ల రియాక్షన్ఈ వీడియోకు 4.9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేద్దామా?: "మేము కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి కొండల్లో మ్యాగీ కొట్టు పెట్టుకుంటాం" అని కొందరు సరదాగా కామెంట్ చేశారు. ఆ స్టాల్లో పనిచేయడానికి ఇంటర్న్స్ కావాలా? అని మరికొందరు తమాషాగా అడిగారు.అయితే, కొందరు నెటిజన్లు ఇక్కడ ఒక పాయింట్ లేవనెత్తారు. ఈ రూ. 24,000 అనేది కేవలం వచ్చిన ఆదాయం (Gross Revenue) మాత్రమేనని, అందులో ముడి పదార్థాలు, గ్యాస్, రవాణా ఖర్చులు తీసేస్తే నికర లాభం ఎంతో చెప్పాలని కోరారు. ఒక నెటిజన్ మాత్రం, "వంట చేయడానికి వాగు నీటిని వాడటం బాలేదు" అని విమర్శించారు. ఈ వైరల్ క్లిప్ ఆన్లైన్లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో చర్చను ఆసక్తికరంగా మారింది. -
ఎర్రకోట కారు పేలుడు కేసు.. ఛార్జ్షీట్లో సంచలన విషయాలు
ఢిల్లీ: ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో పాటియాలా హౌస్ కోర్టులో 7,500 పేజీల చార్జ్షీట్ దాఖలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీ సహా 10 మందిని నిందితులుగా ఎన్ఐఏ పేర్కొంది. ఢిల్లీలో గత ఏడాది నవంబర్ 10న బాంబు పేలుడులో 11 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అన్సార్ గజ్వతుల్ హింద్ (AGuH) సంస్థతో ముడిపడినట్టు ఎన్ఐఏ వెల్లడించింది AGuH అనేది అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్ (AQIS) ఆఫ్షూట్.. 2018లో కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.UA(P) యాక్ట్ భారతీయ న్యాయ సంహిత, ఎక్స్ప్లోసివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్తో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితుల్లో పలువురు వైద్యులు.. AQIS/AGuH ఆలోచనలతో ప్రేరణ పొంది దాడి చేసినట్ట ఎన్ఐఏ తెలిపింది. 2022లో శ్రీనగర్లో రహస్య సమావేశం నిర్వహించారని.. AGuHని AGuH ఇంటరిమ్”గా పునరుద్ధరించి “ఆపరేషన్ హెవెన్లీ హింద్” ప్రారంభించినట్టు ఎన్ఐఏ పేర్కొంది. నిందితులు.. వాణిజ్య రసాయనాలతో TATP ఎక్స్ప్లోసివ్ తయారు చేశారు. ఐఈడీలు, రాకెట్, డ్రోన్ మౌంటెడ్ బాంబులు పరీక్షించారు. ఏకే-47, క్రింకోవ్ రైఫిళ్లు, పిస్టల్స్ లాంటి నిషేధిత ఆయుధాలు అక్రమంగా సేకరించారు.డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఫోరెన్సిక్, వాయిస్ అనాలిసిస్తో ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. జమ్మూ కశ్మీర్, హర్యానా, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఎన్సీఆర్లో విస్తృత దర్యాప్తు చేపట్టింది. 88 సాక్షులు, 395పైగా డాక్యుమెంట్లు, 200పైగా ఆధారాలు సేకరించింది. ఇంకా కొందర నిందితుల కోసం ఎన్ఐఏ గాలింపు కొనసాగుతోంది. -
ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదులుతున్న బస్సులో..
ఢిల్లీ: ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. స్లీపర్ బస్సులో ఓ మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ కేసులో బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. బస్సులో ఇద్దరు వ్యక్తులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా.. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బాధితురాలు పీతంపురలోని మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తోంది. మే 11వ తేదీ రాత్రి సదరు మహిళ పని ముగించుకుని ఎప్పటిలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో సరస్వతి విహార్లోని బస్టాప్ వద్ద ఓ స్లీపర్ బస్సు ఆగింది. బస్సు తలుపు వద్ద నిలబడిన వ్యక్తిని ఆమె సమయం ఎంత అని అడిగింది. ఆ సమయంలో నిందితులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు.అనంతరం నిందితులు బస్సును నాంగ్లోయ్ వైపు నడిపారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటన అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. బస్సును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుగుతోందని.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. -
భారత్లో ఇరాన్ విదేశాంగ మంత్రి.. పర్యటన ఫలిస్తుందా..?
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ భారత్ చేరుకున్నారు. ఈ రోజు (మే 14,15) తేదీలలో జరిగే బ్రిక్స్ విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన అరాఘ్చీకి భారత అధికారులు ఘన స్వాగతం పలికారు.ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మెుదలైన తర్వాత ఇరాన్ ప్రతినిధులు అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.ఈ సందర్భంగా ఆయన వినియోగించిన మినాబ్ 168 విమానం ఇప్పుడు చర్చానీయాంశమయ్యింది.ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం నడుస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే యుద్దం ముగిసిందా అనే విషయంపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టత లేదు. ఇటు ఇరాన్ అటు అమెరికా రెండు దేశాలు తగ్గేలా కనిపించడం లేదు. దీంతో యుద్ధం ముగింపుపై స్పష్టత వచ్చే అంశం కనిపించడం లేదు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన ఇప్పుడు ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది.మినాబ్ 168 విమానంలో భారత్ చేరుకున్న అరాగ్చీఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మినాబ్ 168 అనే పేరు గల ఇరాన్ విమానంలో భారత్ చేరుకున్నారు. ఈ విమానానికి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రారంభంలో దక్షిణ ఇరాన్లోని మినాబ్ నగరంలో ఉన్న ఒక పాఠశాల మీద అమెరికా జరిపిన క్షిపణి దాడిలో 168 మంది బాలికలు మరణించారు. అమాయక పౌరులపై జరిగిన దాడులకు గుర్తుగా, ఆ విషాద ఘటనను ప్రతిబింబించేలా ఈ విమానానికి ఆ పేరు పెట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను ఎండగట్టడానికి ఇది చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్పై ఒత్తిడి తెస్తున్న ఇరాన్అయితే ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్పై ఇరాన్ గత కొంతకాలంగా ఇరాన్ ఒత్తిడి చేస్తూ వస్తుంది. అయితే కూటమిలో సభ్యదేశంగా ఉన్న యూఏఈపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో ఈ అంశంలో యుఏఈతో పాటు ఇతర సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగింది. ప్రస్తుత సమావేశంలో యుద్ధంపై ఉమ్మడి ప్రకటన వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.సమావేశ ప్రధాన లక్ష్యాలు"BRICS@20: స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం మరియు స్థిరత్వం" అనే థీమ్తో జరుగుతోంది. గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు మరియు బహుపాక్షిక వ్యవస్థల బలోపేతంపై చర్చలు జరగనున్నాయి. అయితే, సభ్య దేశాల మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ కూటమి ఐక్యతకు పరీక్షగా మారాయి.#WATCH | Delhi: Foreign Minister of Iran, Syed Abbas Araghchi arrives in India for the BRICS Foreign Ministers’ Meeting. pic.twitter.com/l5c8DqzYLc— ANI (@ANI) May 13, 2026 -
ఆగని చంద్రబాబు దుబారా ఖర్చులు
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు దుబారా ఖర్చులు కొనసాగుతున్నాయి. సీఎం ఢిల్లీ ఇంటికి హంగులు కోసం రూ.67 లక్షల మంజూరుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీటింగ్ హాల్, మైనర్ రిపేర్ల కోసం రూ.67 లక్షలు ఖర్చు పెట్టనుంది.గతంలో ఇదే ఢిల్లీ ఇంటికి సౌకర్యాలు, హంగులు కోసం 95 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. మళ్ళీ ఇప్పుడు రూ. 67 లక్షలు మంజూరు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కలిపి.. సీఎం చంద్రబాబు ఢిల్లీ నివాసంలో విలాసవంతమైన సదుపాయలకు ఖర్చు 1.62 కోట్లకు చేరుకుంది.కాగా, అసెంబ్లీ నిర్మాణ వ్యయం చంద్రబాబు సర్కార్ పెంచేసిన విషయం తెలిసిందే. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే. -
గర్భం దాల్చిన ఐదో నెలకు బ్లడ్ కేన్సర్..!చివరికి..
గర్భం దాల్చక ముందు ఏదైన అనారోగ్యం సమస్య బారినపడితే రిస్క తక్కువగా ఉంటుంది. పైగా ఏదోరకంగా చికిత్స పొంది ఆ రోగం బారి నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యొచ్చు. అదే గర్భం దాల్చక అది కూడా క్రిటకల్ స్టేజ్లో అంటే ఏ ఐదు లేదా ఆరో నెలలో ప్రాణాంతక అనారోగ్య సమస్య బయటపడితే..ఇక ఆ బాధ మాటలకందనిది. అను క్షణం ఓ నరకం ఏ జరుగుతోందన్న టెన్షన్ వెంటాడుతూ ఉంటాయి. అలాంటి బాధనే చవిచూసింది ఈ గర్భిణి.ఈ బాధకర ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన మహిళకు గర్భం దాల్చిన ఐదోనెలలో బ్లడ్ కేన్సర్ బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె అక్యూట్ లింఫోబ్లాస్లిక్ లుకేమియాదో బాధపడుతోంది. గర్భధారణ సమయంలో కేన్సర్కి చికిత్స చేయడం అంటే అత్యంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే కీమోథెరపీ వంటి ఇతర చికిత్సలు పుట్టుబోయే బిడ్డకు ప్రమాదకరంగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి. దాంతో ఢిల్లీ వైద్యులు సురక్షితంగా గర్భాన్ని పొడిగిస్తూనే వ్యాధిని నియంత్రించడానికి చికిత్స అందించింది. గర్భధారణ సమయంలో వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అనేది అత్యంత అరుదైన ప్రమాదకరమైన పరిస్థితి. దీనికి తక్షణమే చికిత్స అవసరం. పిండం సంరక్షణ చూస్తూనే తీవ్రమైన ఈ కేన్సర్ని నియంత్రించడం అన్నది భయానక సవాలు అని చెబుతున్నారు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వైద్యులు. ఎట్టకేలకు వైద్యుల ప్రయత్నం ఫలించి 32 వారాల నాలుగు రోజుల సమయంలో అత్యవసర సిజేరియన్ చేశారు. శిశువు బరువు 1.28 కిలోలు అని, ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఇక నవజాత శిశువుకు ప్రత్యేక నియోనాటల్ సంరక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే తల్లికి ల్యుకేమియా కోసం తదుపరి చికిత్స అందిచనున్నట్లు తెలిపారు.అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అంటే..ఎముక మజ్జ (bone marrow) ను ప్రభావితం చేసే వేగవంతమైన కేన్సర్. ఇది తెల్ల రక్త కణాల (lymphocytes) అపరిపక్వ రూపాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లలలో సర్వసాధారణం (ముఖ్యంగా 2-5 ఏళ్లు). అలాగే పెద్దలలో కూడా రావచ్చు.లక్షణాలు: తీవ్రమైన అలసట, జ్వరం, తరచుగా ఇన్ఫెక్షన్లు, సులభంగా గాయాలు కావడం లేదా రక్తస్రావం, ఎముకల నొప్పులు.చికిత్స: కీమోథెరపీతో చికిత్స చేస్తారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే చాలా మంది పిల్లలలో, కొంతమంది పెద్దలలో కూడా ఈ కేన్సర్ పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఎక్కువే. (చదవండి: మెరుగైన ఆరోగ్యం కోసం వంట నూనెలో చిన్న మార్పు) -
జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..
జీవితమంతా వైఫల్యాలు అడగడుగున పలికరిస్తూనే ఉన్నా వదలిపెట్టని ధీరుడి కథ. అదేంటి అన్ని పెయిల్యూర్స్ ఎదుర్కొటే ధీరుడు, శూరుడు అంటారేంటి అనుకోకండి. ఎందుకంటే గెలిస్తే వాట్ నెక్స్ట్ అంటూ సాగిపోతావు..అదే ఆపకుండా ఓటమి హగ్ ఇస్తూ ఉంటే..పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాలంటే అజేయమైన ఓర్పు, ఆత్మ విశ్వాసం కావాలి. ముఖ్యంగా చుట్టూ ఉన్నవాళ్లలో కొందరు జాలిచూపులతో సానుభూతి చూపితే, మరికొందరు నీ వల్ల కాదు అన్న విమర్శల బాణాలు.. అయినా సరే డోంట్ కేర్ అంటూ ముందుకు సాగాలంటే ఆకాశమంత ధైర్యం కావలి. అందుకు ఉదాహరణ ఈ టెకీ. అతడి కథ వింటే..ఫెయిల్యూర్లు, రిజెక్ట్లు చూసినోళ్లే గొప్పోళ్లు అని కచ్చితంగా అంటారు. మరి అతడి కథేంటో చకచక చదివేద్దామా..!.చాలామంది విద్యార్థులకు పోటీ పరీక్షలు ప్రారంభ విద్యా మైలురాళ్లలా విజయానికి అంతిమ కొలమానంగా ఉంటే..హర్యానాలోని రోహ్తక్కు చెందిన రిజుల్ సింగ్ మాలిక్ విషయంలో మాత్రం అలా కాదు. ఎడతెగని ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో అందుకున్న గొప్ప గెలుపు రికార్డు అతడిది. అతడు పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. రిజుల్ తన పాఠశాల విద్యను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వసంత్ కుంజ్లో పూర్తి చేశాడు.ఆ తర్వాత అందరిలానే ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఐఐటీ జేఈఈకి ప్రిపేరయ్యాడు. మొదటిసారి ఓటమి ఎదుర్కొనడంతో మరోసారి ప్రయత్నించాడు. ఈ సారి హోమ్ ట్యూటర్, ఒక ఏడాది వృధా చేసుకుని లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుని మరి ప్రిపేరయ్యాడు. అయినప్పటికీ ఓటమిని ఎదుర్కొనక తప్పలేదు. కానీ ఇంతలా ప్రిపేరైనా..కనీసం కటాఫ్ మార్కులు కూడా సాధించలేకపోయాడు రిజుల్. పైగా ఒక ఏడాది వృధా చేసుకోవడం బంధువులు, మిత్రులు అంతా ఒకటే విమర్శించడం ప్రారంభించారు. పాపం రిజుల్ ఆ అవమానం తట్టుకోవడం సాధ్యం కాక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు కూడా. అయితే 18 ఏళ్ల వయసులో రాసే ప్రవేశ పరీక్ష కెరీర్లో రాబోయే 40 ఏళ్లను నిర్దేశించదని గ్రహించి బీటెక్ ఐటీ చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. అయినప్పటికీ ఆ జేఈఈ ఫెయిల్యూర్ తలుచుకున్నప్పుడల్లా అతడిని బాగా మెలిపెడుతుండేది. ప్రతీదాంట్లో.. రెండు మూడు సార్లు వైఫల్యమేఅయితే 2019లో జరిగిన బర్కిలీ సమ్మర్ స్కూల్ అతని జీవితంలో ఒక ప్రధాన మలుపు. అక్కడ అతనికి డేటా సైన్స్తో మొదటిసారిగా గట్టి పరిచయం ఏర్పడింది. అలా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ (UC Irvine లేదా UCI)అమెరికాలో అకడమిక్ ప్రొబేషన్) ప్రవేశం పొందడం అతడి లక్ష్యంగా మారింది. అందుకోసం జీఆర్ఈఈకి సన్నద్ధమయ్యాడు. అయితే అది కూడా రిజుల్కు చుక్కలు చూపించింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ఆ పరీక్షనురాశాడు. మొదటి ప్రయత్నంలో 303, రెండవ ప్రయత్నంలో 305, మూడవ ప్రయత్నంలో 307 దాటి, చివరకు నాల్గవ ప్రయత్నంలో 308 స్కోర్ చేశాడు. అన్నిసార్లు రాయడంతో మరోసారి జీఆర్ఈకి రెడీ అవుతున్నా అని చెప్పాలంటే భయపడేవాడు. అయితే అనుకోకుండా యూసీ ఇర్విన్ నుండి అంగీకారం రావడంతో ఇది నిజమేనా అని నమ్మలేకపోయాడు. అయితే అక్కడి అధికారి స్కోరు నిజమైన విజయం కాదని, నువ్వు పట్టువదలకుండా రాయడమే అసలైన గెలుపు అని బదులిచ్చాడు. పాపం యూసీ ఇర్విన్లోని ఎంఎస్ ప్రోగ్రామ్ నుంచి కూడా మళ్లీ సవాళ్లు మొదలయ్యాయి. సరిగ్గా అమ్మ పుట్టిన రోజు అని భారత్కు వస్తే..తన GPA (Grade Point Average) అకడమిక్ ప్రతిభ 2.8కి పడిపోవడంతో, ఆ అకడమిక్ ప్రొబేషన్లో ఉంచేశామని, మెరుగుపడకపోతే తదుపరి చర్యలు ఎదుర్కొనక తప్పదని మెయిల్ వచ్చింది. దాంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఉత్సాహం కాస్తా ఉసురుమంది గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చా అటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. పైగా అందరు ఉత్తీర్ణులయ్యారు, తానొక్కడినే పరాజితుడిగా ఉండిపోయానంటూ నాటి సంఘటనను తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అదీగాక అమెరికాలో జాతివివక్ష వంటి పలు సవాళ్లు కూడా తోడవ్వడంతో తనపై ఒత్తిడి ఎక్కువగా ఉండేదని చెప్పుకొచ్చారు. చివరికి తన జీపీఏను మెరుగుపరుచుకుని విజయవంతంగా తన అకడమిక్ని పూర్తి చేశాడు. ఇక తక్షణమే ఉద్యోగ వేట అందరి కంటే ముందు మొదలు పెట్టాను గానీ, ప్రతిది రిజెక్ట్ అయ్యేదని చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడగా చివరికి ఓ ఇంటర్న్షిప్కి అర్హత లబించినట్లు తెలిపాడు. అలా ఈవై, వాల్మార్కట్ కంపెనీల్లో పనిచేశాడు. అక్కడ పనిసంస్కృతి గొప్ప పాఠాలే నేర్పాయి. తన సహోద్యోగులు, మేనేజర్ నుంచి చాలా తక్కవుమద్దతే లభించేదని పేర్కొన్నాడు. ఒక సందర్భంలో, తాను సహాయం కోసం ఒక సీనియర్ను సంప్రదించగా, ఆ విషయాన్ని తన మేనేజర్ వరకు తీసుకెళ్లి చివాట్లు, నిందలు పడేలా చేశాడంటూ నాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. గూగుల్లో జాబ్ కొట్టడం కోసం..ఆ అనుభవం భవిష్యత్ కార్యాలయాల పట్ల ఎలా ఉంటే బెస్ట్ అనేది తెలుసుకోగలిగానని న్నారు. దాంతో మంచి పనిసంస్కృతి ఉండే ఉద్యోగ కోసం అన్వేషించే పనిలో పడ్డట్లు తెలిపాడు. ఆ క్రమంలోనే గూగుల్లో జాబ్ కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడట అందుకోసం ఏ పదో, 20 కాదు ఏకంగా 520 సార్లకు పైగా తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ సమయంలో తనని ప్రోత్సహించింది మాత్రం తన కాబోయే ప్రియురాలు, తల్లిదండ్రులేని అంటున్నాడు. వాళ్లిచ్చిన అండదండలతో వెనక్కి తగ్గకుండా గుగుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లు వివరించాడు. అలా ఓ రోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో, తన వాల్మార్ట్ ఆఫీస్ నుంచి బయటకు వస్తుండగా ఆఫర్ లెటర్ పంపబడుతోందని ఫోన్ కాల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. దాంతో తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు. గూగుల్లో జాబ్ రాగానే తన కాబోయే భార్య ఖుషీకే ఫోన్ చేశానని, ఆ తర్వాత అమ్మనాన్నలకు చేసినట్లు తెలిపాడు. ఎందుకంటే అన్ని రిజెక్షన్లు రావడంతో నాకే ఎందుకు జరుగుతోందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే రిజుల్ ప్రియురాలు ఏంకాదు, కచ్చితంగా గెలుస్తావ్, ఆఫర్ లెటర్ అందుకుంటావ్ అంటూ ధైర్యం చెబుతూనే ఉండేది, ఒక్కసారి కూడా పోనీలే వదిలేయ్ అన్న మాట తన నోటినుంచి రాలేదంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఇతడి కథ చూస్తుంటే హాలీవుడ్ మూవీలోని ఒక కొటేషన్ గుర్తొస్తోంది. జీవితం అంటే "ఎంత బలంగా కొట్టావన్నది కాదు, ఎన్ని ఎదురదెబ్బలు తగలినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగడమే" అన్న వాక్యానికి నిలువెత్తు నిదర్శనం కదూ. ఎన్ని వైఫల్యాలు రానీ పట్టుదలతో సాగేవాడి ఎదురేలేదు, పైగా ఏదో ఒకనాటికి విజయం తథ్యం అనేది జగమెరిగిన సత్యం. View this post on Instagram A post shared by Rijul (@rijulsinghmalik_) (చదవండి: కోటి రూపాయలు శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!) -
చంద్రబాబు 30వ సారి హస్తినబాట
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోమవారం మరోసారి ఢిల్లీకి రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన హస్తినబాట పట్టడం ఇది 30వ సారి. చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి రానున్నారు. ఆయన తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ కానున్నారు. అనంతరం జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలవనున్నారు. ఆ తర్వాత కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సమ్మిట్కు హాజరుకానున్నారు. అయితే, సీఎం తరచూ ఢిల్లీ పర్యటనకు వచ్చి కేంద్ర మంత్రులను కలుస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సాధించింది శూన్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు పరపతితో తెచ్చిందేమీ లేదు! చంద్రబాబు 2024లో సీఎం అయిన తర్వాత ఢిల్లీకి వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇది 13వ సారి. ఆయన ఢిల్లీకి వచి్చన ప్రతిసారి ‘రాష్ట్రం కోసం అది తెస్తాం.. ఇది తెస్తాం’ అని లీకులు ఇవ్వడం, పెద్ద ఎత్తున ప్రచారం చేయడం... కేంద్ర మంత్రులతో భేటీ ముగిశాక మాత్రం ‘కేంద్రం సహకరిస్తోంది. లేఖలు ఇచ్చాం’ అనే పాత పాటే పాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసే సాధారణ స్కీములు మినహా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా చంద్రబాబు తెచ్చిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.కేంద్రం ఇచ్చే నిధులే తప్ప, తనకున్న పరపతితో రాష్ట్రానికి అదనపు బడ్జెట్ కేటాయింపులు సాధించడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఇప్పటికీ నిధుల కేటాయింపులు, సాంకేతిక అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుండటం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘అయినను పోయిరావలె హస్తినకు‘ అన్న చందంగా చంద్రబాబు 30వ సారి ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. ఈసారి అయినా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారా? లేక రాజకీయ అవసరాలే అజెండాగా ఈ పర్యటన ఉంటుందా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఉగ్రదాడుల హెచ్చరికలు.. ఢిల్లీలో హైఅలర్ట్.. !
ఢిల్లీ: దేశ రాజధానిలోని కీలకమైన ప్రదేశాల్లో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల (IEDలు)తో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో హైఅలర్ట్ ప్రకటించారు. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకు నిఘా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాలను IEDలతో లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దాంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అత్యంత సున్నితమైన రద్దగా ఉండే ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. హెచ్చరిక నేపథ్యంలో, నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం బయట కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరొకవైపు పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించి, అదనపు బారికేడ్లను ఏర్పాటు చేశారు.కీలక ప్రదేశాలలో మోహరించిన భద్రతా దళాలు కూడా లక్ష్యంగా మారే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తానీ గ్యాంగ్స్టర్-ఉగ్రవాది షాజాద్ భట్టికి సంబంధించిన ఒక ముఠాను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించిన కొన్ని వారాల తర్వాత ఈ తాజా హెచ్చరిక వెలువడింది. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా, ఈ ముఠా సభ్యులు ఢిల్లీలో హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. -
రియల్ఎస్టేట్లోకి వెల్లువెత్తిన పెట్టుబడులు
దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి గత రెండేళ్లుగా భారీ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2024 నుండి 2026 తొలి త్రైమాసికం వరకు 30.7 బిలియన్ డాలర్లు వచ్చాయి. డిమాండ్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో మరి కొన్నేళ్ల పాటు ఇదే తీరు కొనసాగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. రియల్టీ సేవల సంస్థ సీబీఆర్ఈ, పరిశ్రమల సమాఖ్య సీఐఐ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం రాబోయే రోజుల్లో భారత రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) మార్కెట్ మరింత విస్తరించనుంది. పెద్ద ఎత్తున రీట్స్ లిస్టింగ్కి రానుండటంతో డెవలపర్స్కి నిధుల లభ్యత పెరగనుంది. పరిశ్రమ రుణ రూపంలో సమకూర్చుకున్న నిధుల పరిమాణం 2024–2026 తొలి త్రైమాసికం మధ్య కాలంలో 146 బిలియన్ డాలర్ల స్థాయిని దాటింది. ట్రస్టీ షిప్స్, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతరత్రా సంస్థలు ఈ నిధులను సమకూర్చాయి.రిపోర్ట్లో మరిన్ని విశేషాలు..మొత్తం రుణాల్లో మూడు ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు వాటా 60 శాతం పైగా ఉంది. ప్రథమ శ్రేణిలోకి రాని నిర్దిష్ట నగరాల వాటా 8 శాతంగా ఉంది. మెట్రోల పరిధి దాటి ఇతర ప్రాంతాలపైనా ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. కమర్షియల్ రియల్ ఎస్టేట్కి బ్యాంకు రుణాలు 2025 మార్చి నుంచి 2026 ఫిబ్రవరి మధ్యకాలంలో వార్షిక ప్రాతిపదికన 16 శాతం పెరిగాయి. ఎన్బీఎఫ్సీలు ఇచ్చిన రుణాలు 2025 సెప్టెంబర్ నాటికి అయిదేళ్ల గరిష్ట స్థాయి అయిన రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటాయి. రియల్ ఎస్టేట్ వ్యవస్తకు రీట్స్ కీలకంగా మారుతున్నాయి. దేశీయంగా పెట్టుబడులు స్థిరంగా వస్తుండటం, భౌగోళికరాజకీయ అనిశి్చతుల నడుమ గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా కొంత మేర ఇన్వెస్ట్ చేస్తుండటంలాంటి అంశాలు పెట్టుబడుల రాకకు దోహదపడనున్నాయి. ఆఫీస్, లాజిస్టిక్స్, డేటా సెంటర్స్ మొదలైన వాటిల్లో దీర్ఘకాలికంగా పెట్టుబడుల వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా అనిశి్చతిలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమ నిర్మాణాత్మకంగా పరివర్తన చెందుతుండటం, పారదర్శకత మెరుగుపడుతుండటం, వివిధ వనరుల ద్వారా నిధులు లభిస్తుండటంలాంటి అంశాల వల్ల పెట్టుబడులకు రియల్టీ రంగం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా కొనసాగనుంది. -
ఆమెతో బంధం ఇక చట్టబద్ధం
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇటీవలే తన ప్రేయసి సోఫీ షైన్తో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. ఢిల్లీలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 21న వీరి వివాహం జరిగింది. ఇప్పుడు ఈ జంట తమ బంధాన్ని చట్టపరంగా పదిలం చేసుకుంది.గురుగ్రామ్లోని మ్యారేజ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లిన శిఖర్- సోఫీ తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం గురించి రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసే ఓ అధికారి PTIతో మాట్లాడుతూ..కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య‘‘శిఖర్ ధావన్.. ఆయన భార్య బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మ్యారేజ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి వచ్చారు. దాదాపు ఏడుగురు కుటుంబ సభ్యులు, స్నేహితులు వారితో పాటు ఉన్నారు. దాదాపు 35 నిమిషాల్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైంది. వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చి పంపించాము’’ అని సదరు అధికారి పేర్కొన్నారు.ఆయేషాతో విడాకులుకాగా టీమిండియా ఓపెనర్గా రాణించిన శిఖర్ ధావన్ గతంలో ఆయేషా ముఖర్జీ అనే ప్రవాస భారతీయురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాతో ఫేస్బుక్లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీయగా.. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. డివోర్సీ అయిన ఆయేషాకు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. శిఖర్ ధావన్తో కలిసి ఆమె కుమారుడు జొరావర్కు జన్మనిచ్చారు.అయితే, అభిప్రాయ భేదాల కారణంగా శిఖర్పై తీవ్ర ఆరోపణలు చేసింది ఆయేషా. ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించగా.. 2023లో ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలో చాలాకాలం ఒంటరిగా ఉన్న శిఖర్ ధావన్.. ఐర్లాండ్కు చెందిన సోఫీ షైన్తో ప్రేమలో పడ్డాడు.ఆమెతో బంధం ఇక చట్టబద్ధంకొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట ఇటీవలే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. తాజాగా తమ బంధాన్ని చట్టబద్ధం చేసుకుంది. కాగా శిఖర్ ధావన్ టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2315, వన్డేల్లో 6793, టీ20లలో 1759 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 222 మ్యాచ్లు ఆడిన గబ్బర్ రికార్డు స్థాయిలో 6768 పరుగులు సాధించాడు.చదవండి: ‘నా నిర్లక్ష్యం... తెలివి తక్కువతనం’Gurugram: Cricketer Shikhar Dhawan registered his marriage with his wife Sophie Shine at the marriage registrar office.The couple had earlier tied the knot in a private ceremony held in Delhi on February 21, 2026. pic.twitter.com/reNrML8PHb— Greater Noida West (@GreaterNoidaW) May 6, 2026 -
9 మంది ప్రాణాలను తీసిన AC.. బిల్డింగ్ బూడిద..
-
ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఏసీ పేలడంతో 9 మంది మృతి
-
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది మృతి
ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు జరిగిన ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. వివేక్ విహార్లోని భవనంలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇప్పటివరకు 12 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మంటల్లో చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. ఏసీ పేలడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భవనంలో అపార్ట్మెంట్ వాసులు చిక్కుకుపోయారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న రెండో అంతస్తు నుండి మృతదేహాలను వెలికితీశారు. 2,3,4వ అంతస్తుల్లోని ఫ్లాట్లలో మంటలు వ్యాపించాయి. స్వల్ప గాయాలైన ఇద్దరిని చికిత్స నిమిత్తం గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో 12 ఫైర్ ఇంజన్లు, డీడీఎంఏ సిబ్బంది, ట్రాఫిక్ అధికారులు, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర బృందాలు అక్కడికి చేరుకున్నారు. స్థానిక మునిసిపల్ కౌన్సిలర్ పంకజ్ లూత్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సమాచారం అందగానే నేను అక్కడికి వెళ్లాను. రెండో అంతస్తు వెనుక భాగంలో ఐదు మృతదేహాలు, మరో మృతదేహం వెనుక వైపు, పై అంతస్తులో మూడు మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. డీఎన్ఏ పరీక్షలు చేస్తే తప్ప బాధితుల వివరాలు తెలియవు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని కొందరు అంటున్నారు, కానీ అధికారికంగా నిర్ధారణ కాలేదని తెలిపారు. -
30 ఏళ్ల జడ్జి.. భార్యతో గొడవపడి బలవన్మరణం?
ఢిల్లీ: ‘నాన్నా బ్రతకడం కష్టంగా ఉంది. నేను ఇబ్బందుల్లో ఉన్నాను’ అని తండ్రికి ఫోన్ చేసిన ఓ 30 ఏళ్ల జ్యుడిషియల్ ఆఫీసర్.. ఆ మరుసటి రోజే శవమై పోయాడు. ఎంతటి కష్టమొచ్చిందో తెలియదు కానీ తన ఇబ్బందిని పూర్తిగా తండ్రికీ చెప్పుకోలేక, ఇటు భార్యతోనూ పూర్తిగా ఇమడలేక తనువు చాలించాడు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని, బ్రతకడం చాలా కష్టంగా అనిపిస్తుందని తండ్రితో అన్నాడే కానీ, విషయం మాత్రం చెప్పలేదు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ఆ న్యాయాధికారి దక్షిణ ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన అనుమానిత ఆత్మహత్య క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. అమాన్ శర్మ.. ఉత్తర ఢిల్లీలోని కర్కర్దూమాలో డీఎల్ఎస్ఏ(డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ) సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అయితే శనివారం ఆ అధికారి కాస్తా తన గ్రీన్ పార్క్ ఇంట్లో విగతజీవిగా మారిపోయాడు. తన బావ అమాన్ శర్మ.. బాత్రూమ్లో సూసైడ్ చేసుకున్నాడని బావమరిది పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం బయటకొచ్చింది. చనిపోయే ముందు భార్యతో గొడవ.. కన్నీళ్లుఅతను చనిపోయే ముందు భార్యతో గొడవ పడినట్లు స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల వారు తెలిపిన సమాచారం ప్రకారం.. అతను చనిపోవడానికి కొన్ని గంటల ముందు భార్యతో గొడవ పడి విపరీతంగా ఏడ్చేశాడని పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య ఏం గొడవ జరిగిందో తెలీదు కానీ ఇద్దరు విపరీతంగా అరుచుకున్నారన్నారు. నాకు ఫోన్ చేసి ఇబ్బంది ఉందన్నాడు..తన కొడుకు చనిపోవడానికి ముందు రాత్రి ఫోన్ చేసి మాట్లాడాడని, తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా తెలిసింది. ‘ నేను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా.. “నాకు జీవించడం కష్టంగా మారింది’ అని తండ్రి స్సష్టం చేశారు. అనుమానిత ఆత్మహత్యగా కేసు నమోదుఇది ఆత్మహత్యగా కనిపిస్తోంది, మేము వచ్చేసరికి ఉరి వేసుకుని వేలాడతున్నాడు.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు గుర్తించలేదు, అనుమానిత ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నాం. అన్ని కోణాల్లో విచారణ చేపట్టాం’ అని పోలీసులు తెలిపారు. -
ఆరెంజ్ అలర్.. ఢిల్లీలో వడగళ్ల వాన
-
నో క్రాష్ డైట్, నో షార్ట్కట్ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు
ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్ మృదుల్ అరోరా, క్రమశిక్షణ, పట్టుదలతో తన బాడీ షేప్ను చక్కగా మార్చుకున్నాడు. బిజీ లైఫ్ స్టైల్ తన అస్తవ్యస్తమైన జీవనశైలి, నిరంతరం అలసటతో బాధపడే వ్యక్తి పొరబాటును గ్రహించి, క్రమశిక్షణ, నిలకడ, అంకితభావానికి ప్రాధాన్యతనిచ్చి, అనుకున్నట్టుగా బరువును తగ్గించుకున్నాడు. తన ఫిట్నెస్ను ఒక 'మార్కెటింగ్ క్యాంపెయిన్' లాగా భావించి ఈ లక్ష్యాన్ని సాధించడం విశేషం.మార్కెటింగ్ నిపుణుడు మృదుల్ అరోరా చాలా మంది ఉద్యోగ నిపుణుల మాదిరిగానే గంటల తరబడి కూర్చోవడం, వేళాపాళాలేని ఆహారపు అలవాట్లతో గడిపేవాడు. అయితే ఎలాంటి అనారోగ్యం లేకపోయినా ఉన్నట్టుండి శక్తి తగ్గిపోయినట్టు అనిపించడం మొదలైంది. 97 కిలోలకు చేరుకోవడంతో బాగా అలసటగా అనిపించేది. కానీ హఠాత్తుగా తన శరీరాన్ని మార్చుకోవాలనుకోలేదు మృదుల్. డెడ్ లైన్లు, ఆఫీసు పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నానని గ్రహించిన మృదుల్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. క్రమంగా బరువు తగ్గించుకోవడానికి 45 రోజుల గడువు పెట్టుకున్నాడు. ఇందుకోసం అధిక ప్రోటీన్డ్ఫుడ్, రోజువారీ వ్యాయామాలు, ఇంకా మరెన్నో అంశాలపై దృష్టిపెట్టాడు. అన్నింటి కన్నా ముఖ్యంగా,క్రాష్ డైట్లు లేవు. షార్ట్కట్లు లేవు. ఏం తింటున్నాం, ఎంత తినాలి అనే క్యాలరీ మేనేజ్మెంట్పై దృష్టిపెట్టారు. తీసుకునే ఆహారం కంటే ఖర్చు చేసే క్యాలరీలు ఎక్కువగా ఉండేలా చూసుకున్నాడు.ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారానికి పూర్తిగా దూరంప్రతిరోజూ వ్యాయామం చేయడం.తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం.దీంతోపాటు ప్రతి వారం తన బరువును, ఎనర్జీ లెవల్స్ను గమనిస్తూ రికార్డ్ చేసుకునేవాడు. తద్వారా మరింత ప్రేరణ పొందేవాడు.ఫలితంగా అతని బరువు కేవలం 45 రోజుల్లో 97 కిలోల నుండి 85 కిలోలకు చేరింది. అంటే దాదాపు 12 కిలోల బరువు తగ్గడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెరిగింది, పనిలో మరింత చురుగ్గా ఉండేవాడు.తన వెయిట్లాస్ జర్నీపై మృదులు ఏమంటారంటే.. "తీవ్రత (Intensity) కంటే స్థిరత్వం (Consistency) ముఖ్యం. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులకు దారితీస్తాయి. సమయం కోసం ఎదురుచూడకుండా, బరువు తగ్గాలనుకునే ప్రయాణాన్ని ఇపుడే మొదలు పెట్టండి అని సూచించారు.నోట్ : బరువు తగ్గడానికి ఖరీదైన ప్లాన్లు అవసరం లేదు, కేవలం క్రమశిక్షణ, అంకితభావం ఉంటే చాలు! కానీ ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టే ముందు, మన బరువు ఎంత ఉంది? ఎంత తగ్గాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? అసలు బరువు పెరగడానికి కారణాలను విశ్లేషించుకోవాలి. ఇందుకు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు -
ఆ పోలీస్ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు!
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లుంగి ఎంగిడి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు ఇటీవలే వెల్లడించారు. నిజానికి మైదానంలో ఎంగిడి పరిస్థితి చూసిన అభిమానులు మాత్రం వణికిపోయారు. ప్రాణాలతో బయటపడితే చాలు దేవుడా అంటూ ప్రార్థించారు. ఐపీఎల్-2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం పంజాబ్ కింగ్స్తో తలపడ్డ సంగతి తెలిసిందే.తల బలంగా నేలకు తాకిఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ రికార్డు స్థాయిలో 264 పరుగులు చేయగా.. పంజాబ్ లక్ష్య ఛేదనకు దిగింది. ఈ క్రమంలో పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఢిల్లీ ప్లేయర్ ఎంగిడి గాయపడ్డాడు. మిడాఫ్ ప్రాంతంలో బంతిని క్యాచ్ పట్టే క్రమంలో అతడు కిందపడ్డాడు.దీంతో తల బలంగా నేలకు తాకి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య బృందం అతడిని పరీక్షించింది. అయితే అతడి పరిస్థితి దిగజారినట్లు కనిపించడంతో అంబులెన్స్ను మైదానంలోకి రప్పించి.. మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ట్రాఫిక్ ఏసీపీ సంజయ్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించి.. ఒక రకంగా ఎంగిడి ప్రాణం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.Lungi Ngidi got Injured while going for a catch Looks very serious 😰. Ambulance was called on ground 🚨. pic.twitter.com/GgU9g68Zsw— Jeet (@JeetN25) April 25, 202611 నిమిషాల్లోనే ఢిల్లీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, మ్యాచ్ జరిగిన అరుణ్ జైట్లీ స్టేడియం నుంచి సాయంత్రం 6.16 గంటలకు బయల్దేరిన అంబులెన్స్.. రాజేంద్ర నగర్లో ఉన్న మాక్స్ ఆస్పత్రికి కేవలం 11 నిమిషాల్లోనే చేరుకుంది. సాధారణంగా ఈ ప్రయాణానికి 25-30 నిమిషాల సమయం పడుతుంది.Full marks to Delhi Traffic Police for creating a Green Corridor for seamless travel for the ambulance carrying Lungi Ngidi from Kotla to Max Hospital, Rajendra Nagar in just 11 minutes This was initiated by ACP Traffic Central District Sanjay Singh pic.twitter.com/ZRsZwdVzeZ— Vikrant Gupta (@vikrantgupta73) April 25, 2026అయితే, సంజయ్ సింగ్ చొరవ వల్ల ఎంగిడిని తీసుకువెళ్తున్న అంబులెన్స్ త్వరితగతిన ఆస్పత్రికి చేరుకుంది. గూగుల్ మ్యాప్స్పై ఆధారపడకుండా.. మెయిన్ రోడ్డు నుంచే వెళ్లాలని సంజయ్ సింగ్ అంబులెన్స్ డ్రైవర్కు సూచించారట. మొత్తంగా 60 మంది పోలీసులు వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా సమన్వయం చేసుకుని.. ఎంగిడి వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరడంలో కీలక పాత్ర పోషించారు.ఎవరీ సంజయ్ సింగ్?ఢిల్లీలో ప్రస్తుతం ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్నారు సంజయ్ సింగ్. ఆయనకు క్రికెట్ బ్యాగ్రౌండ్ ఉంది. గౌతం గంభీర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలతో ఆయన దేశీ క్రికెట్ ఆడారు.ఇక ఎంగిడి గురించి మీడియా సంజయ్ సింగ్ను అడుగగా.. ‘‘నేనూ ఓ క్రికెటర్నే. మైదానంలో తగిలే గాయాలు ఎంతటి ప్రమాదానికి దారితీస్తాయో నాకు బాగా తెలుసు. ఎంగిడి అంతర్జాతీయ క్రికెటర్. అతడు కుప్పకూలిన విధానం చూస్తే గాయం ఎంత తీవ్రమైందో నాకు అర్థమైంది’’ అని సహానుభూతి ప్రదర్శించారు.ఇదిలా ఉంటే.. ఢిల్లీ విధించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఊదేసింది. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఇక తాజాగా ఢిల్లీకి మరో పరాజయం ఎదురైంది. ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.చదవండి: మీకసలు బుద్ధుందా?.. వైభవ్ గురించి ఆమెను ఎందుకు అడిగారు?Lungi Ngidi has suffered a serious injury, and for the first time in IPL history, an ambulance has come onto the ground. This looks very serious—possibly a neck fracture, but hopefully it’s nothing that severe. 😱It is also quite shameful for the Arun Jaitley Stadium DJ to play… pic.twitter.com/CrFFc3grvB— Sonu (@Cricket_live247) April 25, 2026 -
వైభవ్ గురించి ఆమెను ఎందుకు అడిగారు?
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్టాపిక్గా ఉన్న పేరు వైభవ్ సూర్యవంశీ. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్న ఈ పదిహేనేళ్ల పిల్లాడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్-2026లోనూ రాజస్తాన్ రాయల్స్ తరఫున ఈ లెఫ్టాండర్ బ్యాటర్ జోరు కొనసాగుతోంది.36 బంతుల్లోనే శతక్కొట్టి.. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్లో మ్యాచ్లో వైభవ్ 36 బంతుల్లోనే శతక్కొట్టి.. విధ్వంసకర బ్యాటింగ్కు తాను పెట్టింది పేరని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లు సైతం అతడి ప్రతిభను కొనియాడుతూ కాబోయే సూపర్ స్టార్ అంటూ కితాబులిస్తున్నారు.వయసు అసలు లెక్కలోకే రాదుఈ నేపథ్యంలో ఒలింపిక్ పతకాల విజేత, భారత షూటర్ మనూ భాకర్కు ఓ కార్యక్రమం సందర్భంగా వైభవ్ సూర్యవంశీ గురించి ప్రశ్న ఎదురైంది. ఢిల్లీలో జరిగిన జాతీయ రైఫిల్ సమాఖ్య 75వ వార్షికోత్సవానికి హాజరైన ఆమె ఇందుకు బదులిస్తూ.. ‘‘అతడి చుట్టూ ఉన్న వాళ్లు.. మార్గదర్శనం చేసే వాళ్లు గొప్పగా ఉంటే.. వయసు అసలు లెక్కలోకే రాదు.అయినా ప్రతిభకు వయసుతో పనిలేదు. కొంతమంది అరవై ఏళ్లలో అద్భుతాలు చేస్తే.. మరికొందరికి ఆరేళ్లకే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్లు సరైన దారిలో నడిపిస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం కాస్త సులువు అవుతుంది. టీమిండియా తదుపరి బిగ్ స్టార్ అతడే’’ అని పేర్కొంది.VIDEO | India's double Olympic medallist shooter Manu Bhaker says, “With the right mentorship, Vaibhav (Sooryavanshi) can be the next big star of Indian cricket.”(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/UZwA8iZwSk— Press Trust of India (@PTI_News) April 27, 2026ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మనూ భాకర్ను ప్రశ్న అడిగిన విలేకరుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ మాజీ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు.ఆమె ఒలింపిక్ పతకాల విజేత‘‘ఆమె ఒలింపిక్ పతకాల విజేత. ఆమె క్రీడ, విజయాల గురించి కాకుండా వైభవ్ సూర్యవంశీ గురించి అడగడం ఎందుకు? మన దేశంలో క్రికెట్నే సర్వస్వంగా భావించేవాళ్లు ఉన్నారని తెలుసు. కానీ ఎక్కడ ఏ ప్రశ్న అడగాలో స్పోర్ట్స్ ఎడిటర్లకు తెలియదా?సూర్యవంశీ గురించి ఆమెను అడగాల్సిన అవసరం ఏముంది?.. హెడ్లైన్ కోసమే కదా ఇదంతా!.. ఒకవేళ మీరు వైభవ్ సూర్యవంశీని కలిస్తే అప్పుడు మనూ భాకర్ గురించి అడగండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి’’ అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.సిగ్గుపడండిమరికొందరు నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘యువ షూటర్ల గురించి దిగ్గజ క్రికెటర్లు ఎప్పుడైనా మాట్లాడారా? మరి మనూ భాకర్ వైభవ్ గురించి ఎందుకు మాట్లాడాలి? మీ ద్వంద్వ ప్రమాణాలకు సిగ్గుపడండి’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా పారిస్ ఒలింపిక్స్లో మనూ భాకర్ రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర భారత్లో ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్గా ఆమె రికార్డు నెలకొల్పింది.చదవండి: సింధు కణతపై ‘టెంపుల్’.. స్పందించిన భర్త


