ఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసుల సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఐదు మంది ప్రయాణిస్తున్న ఒక కారుపై గుర్తు తెలియని వ్యక్తులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు.
జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రేంజ్) మధుర్ వర్మ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనను ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఐదు మంది సియాజ్ కారులో ప్రయాణిస్తుండగా వెనుక నుంచి దాడి జరిగింది. సీటు వెనుక కూర్చున్న సందీప్ అనే వ్యక్తి భుజం దగ్గర బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తోంది.
కారులో ఉన్న మరో వ్యక్తి దీపక్ ఖత్రి, తాను గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు అడ్వకేట్ అని పోలీసులకు తెలిపాడు. అయితే విచారణలో ఆయన భార్య రాజ్ని ఖత్రి బిష్ణోయ్కు న్యాయవాది అని, సందీప్ ఓ ఎన్జీవోలో పనిచేస్తున్నట్లు తేలింది.
ప్రాథమిక దర్యాప్తులో ముగ్గురు వ్యక్తులు స్కూటర్పై వచ్చి కాల్పులు జరిపినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.ప్రస్తుతం కారులో ఉన్నవారి వాంగ్మూలాలు, స్థానికుల స్టేట్మెంట్లు నమోదు చేస్తున్నారు. క్రైమ్, ఫోరెన్సిక్ టీమ్ను సంఘటనా స్థలానికి తరలించారు. స్థానికి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.


