అంబర్పేట పోలీసుస్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం
హోటల్ వ్యాపారంలో నష్టపోయిన తండ్రీకొడుకులు
అప్పుల భారం పెరిగిపోవడంతోనే ఈ దారుణం
అంబర్పేట: ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలితీసుకున్నాయి... హోటల్ వ్యాపారం చేసిన తండ్రీకొడుకులు తీవ్రంగా నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక సామూహిక బలవన్మరణాలకు పాల్పడాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున తల్లిని హత్య చేసిన కుమారుడు తండ్రితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యను చంపడానికి ఆమె భర్త కూడా సహకరించడం గమనార్హం. ఈ విషాద ఘటన నగరంలోని అంబర్పేట పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న బాపూనగర్లో చోటు చేసుకుంది.
ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ కథనం ప్రకారం...కాకతీయలైన్లో నివసించే వ్యాపార కుటుంబానికి చెందిన రామరాజు (54)కు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. ఈయన గత కొన్నేళ్లుగా హోటల్ వ్యాపారం చేస్తున్నాడు. కుమారుడు శశాంక్ రాజ్ (27) సైతం తండ్రితో కలిసి అదే వ్యాపారం చూసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా వ్యాపారంలో నష్టాలు రావడంతో వీరికి అప్పుల భారం పెరిగింది. ఆర్థిక ఇబ్బందులకు తోడు అప్పు ఇచ్చిన వారి నుంచి తిరిగి చెల్లించమంటూ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో రామరాజు, శశాంక్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. దీన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయమై సోమవారం రాత్రి చాలాసేపు వీరిద్దరూ చర్చించుకున్నారు. చివరకు అంతా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరు నివసిస్తున్న భవనంలోనే కింది పోర్షన్లో ఉంటున్న రామరాజు సోదరుడి ఇంటికి వెళ్లిన వీరి కుటుంబం అక్కడ కొద్దిసేపు గడిపి వచ్చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు శశాంక్ రాజ్ తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన మిత్రుడు రవికి ఫోన్ ద్వారా సందేశం పంపారు. ఆపై తాము ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ సైతం రాయగా... దీనిపై అతడి తండ్రి రామ రాజు సంతకం చేశారు.
అయితే వీళ్లు తీసుకున్న నిర్ణయం రామరాజు భార్య మాధవికి (50) తెలుసా? లేదా? అన్నది స్పష్టత రాలేదు. తాము లేకపోతే తన తల్లి మాధవి (50) జీవనం సాగించడం కష్టమని శశాంక్ భావించినట్లు తెలిసింది. దీంతో తండ్రితో కలిసి బెడ్రూమ్లో నిద్రిస్తున్న తల్లి ముఖంపై దిండుతో అదిమిపట్టి చంపేశాడు. అక్కడి పరిస్థితుల్ని బట్టి పోలీసులు ఈ అంచనా వేస్తున్నారు. ఆపై తండ్రి రామరాజు అదే గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయారు.
మరో బెడ్రూమ్లోకి వచ్చిన కుమారుడు శశాంక్ ముందు కత్తితో చేతి నరాల్ని కోసుకుని చనిపోయే ప్రయత్నం చేశారు. కొన్ని గాట్లు పెట్టుకున్న తర్వాత తన నిర్ణయం మార్చుకుని అక్కడే ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శశాంక్ పంపిన సందేశాన్ని రవి మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో చూశాడు. వెంటనే వారింటికి వచ్చి చూసే సరికి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
శశాంక్ను కిందకు దింపి పరిశీలించగా అతడు మృతి చెందినట్లు తేలింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్ టీంను సైతం పిలిపించి పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు రాసిన సూసైడ్ నోట్ను స్వాదీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
రామరాజు కుమార్తె అమూల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి రామరాజు సోదరులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెద్ద అన్న జగదీశ్వర్ 2009లో బీఆర్ఎస్ తరపున అంబర్పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తన తమ్ముడు ఎప్పుడూ చెప్పలేదని, విషయం తెలిస్తే తాము ఆదుకునేవారమంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు.


