గాలి నుంచి నీరు! | water extracted from air is exceptionally pure: Nobel-winning scientist Omar Yaghi | Sakshi
Sakshi News home page

గాలి నుంచి నీరు!

Feb 25 2026 3:47 AM | Updated on Feb 25 2026 3:47 AM

water extracted from air is exceptionally pure: Nobel-winning scientist Omar Yaghi

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రొఫెసర్‌ యాగీ

అద్భుత యంత్రం రూపొందించిన నోబెల్‌ గ్రహీత 

రోజుకు 1,000 లీటర్ల నీటిని అందిస్తుంది 

భారీ ప్లాంట్లు, పరికరాల అవసరమే లేదు 

ఎడారి ప్రాంతాల్లో కూడా పని చేస్తుంది 

ప్రపంచ దాహార్తికి చెక్‌ పెట్టగల పరిణామం

నీరు. సకల జీవరాశులకు ప్రాణాధారం. అలాంటి నీటి లభ్యత ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. ముఖ్యంగా స్వచ్ఛమైన తాగునీటికి దేశాలన్నీ కటకటలాడే రోజు ఎంతో దూరంలో లేదని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత స్వచ్ఛమైన నీటిని నేరుగా గాలి నుంచే సులువుగా తయారు చేసుకునే టెక్నాలజీని నోబెల్‌ గ్రహీత ప్రొఫెసర్‌ ఒమర్‌ యాగీ అభివృద్ధి చేశారు.

భారీ ప్లాంట్లు, పరికరాల అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత. ఇందుకోసం కేవలం ఒక షిప్పింగ్‌ కంటైనర్‌ పరిమాణంలో ఉండే యంత్రాన్ని యాగీ రూపొందించారు. ఒక్కో యంత్రం సాయంతో రోజుకు కనీసం 1,000 లీటర్ల నీటిని నేరుగా గాలి నుంచే ఒడిసిపట్టవచ్చు! అంతేకాదు, అత్యంత పొడి వాతావరణంతో కూడిన ఎడారి ప్రాంతాల్లో కూడా ఈ పరిజ్ఞానం భేషుగ్గా పని చేస్తున్నట్టు తేలింది! దీన్ని ప్రపంచపు దాహార్తిని తీర్చగల కీలక పరిణామంగా భావిస్తున్నారు. 

రెటిక్యులర్‌ కెమిస్ట్రీతో... 
గాలి నుంచి నీటిని సేకరించడంపై చేసిన పరిశోధనలకు ప్రొఫెసర్‌ యాగీకి 2025లో రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. కాలిఫోరి్నయాకు చెందిన ఆయన సొంత డీప్‌టెక్‌ కంపెనీ అటోకో గాలి నుంచి నీటిని సేకరించే టెక్నాలజీపై చాలాకాలంగా పరిశోధనలు చేస్తోంది. ఎడారుల వంటి అత్యంత పొడి వాతావరణంలో కూడా గాలి నుంచి అతి సులువుగా నీటిని తయారు చేయగల పారిశ్రామిక యంత్రాన్ని అటోకో తాజాగా రూపొందించింది. రెటిక్యులర్‌ కెమిస్ట్రీగా పిలిచే సాంకేతికత సాయంతో ఈ అద్భుతాన్ని సాధించింది. ఇందుకోసం అత్యంత శక్తిమంతమైన మెటల్‌ ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ (ఎంఓఎఫ్‌)లను రూపొందించింది. నానో టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ ఎంఓఎఫ్‌లను ఒకరకంగా నీటిని పీల్చుకునే స్పాంజీలతో పోల్చవచ్చు.

కాకపోతే ఇవి అత్యాధునిక అణు స్పాంజీలన్నమాట. గాలిలోని తేమను, కనిపించని వాయువులను ఇవి శోషించుకుంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంప్రదాయిక అటా్మస్పియరిక్‌ వాటర్‌ జనరేటర్ల (ఏడబ్ల్యూజీ) ద్వారా గాలి నుంచి నీటిని సేకరించే ప్రక్రియ అత్యంత వ్యయ ప్రయాసలతో కూడినది. అందులో గాలిలోని తేమను నీటి బిందువులుగా మార్చే శీతలీకరణ స్థాయిని రాబట్టేందుకు సమీప వాతావరణం మొత్తాన్నీ కూలింగ్‌ ప్రక్రియ సాయంతో చల్లబరచాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ యంత్రాలు భారీగా విద్యుత్‌ను వాడుకుంటాయి. కానీ ఎంఓఎఫ్‌లకు ఇలాంటివేమీ అవసరముండవు. అధిశోషణంగా పిలిచే సహజ ప్రక్రియ ద్వారా గాలిలోని నీటి అణువులను అవి నేరుగా ఆకర్షిస్తాయి.

గాలిని బలవంతంగా చల్లబరిచే అవసరం లేకుండా గాలిలోని నీటి అణువులను ఎంఓఎఫ్‌లు నేరుగా తమకేసి ఆకర్షించుకుంటాయి. మరోలా చెప్పాలంటే అవి రసాయనిక అయస్కాంతాల్లా పని చేస్తాయి. దాంతో నీటి అణువులు వాటి ఉపరితలాలపైకి వచ్చి అతుక్కుపోతాయి. యాగీ సరికొత్త రెటిక్యులర్‌ కెమిస్ట్రీ టెక్నాలజీకి మొత్తానికీ ఇదే అత్యంత కీలకం. అలా అతుక్కున్న నీటి అణువులను కొద్దిపాటి వేడి సాయంతో వాటిని ఎప్పుడు కావలిస్తే అప్పుడు కంటైనర్‌లోకి ఒడిసిపట్టుకోవచ్చు. అలా ఎలాంటి కాలుష్యమూ లేని అత్యంత స్వచ్ఛమైన నీరు సమకూరుతుంది.

అంతేకాదు, ఈ ప్రక్రియంతా భారీ యంత్రాల బాదరబందీ లేకుండా అత్యంత సులువుగా, సహజంగా జరిగిపోతుంది. పైగా సూర్యుని నుంచి వచ్చే వేడి సాయంతోనే పని పూర్తవుతుంది. కనుక విద్యుత్కేంద్రాలు, భారీ పైపుల వంటివాటి అవసరమే ఉండదు! నీటికొరత ఉన్న ప్రాంతాల్లో షిప్పింగ్‌ కంటైనర్‌ పరిమాణంలో ఉండే ఎంఓఎఫ్‌ యంత్రం బిగించుకుంటే చాలన్నమాట. 

ఎడారి నేలల్లోనూ... 
సాంప్రదాయిక పద్ధతుల్లో గాలి నుంచి నీటిని తయారు చేయాలంటే తేమ శాతం కనీసం 45కు మించి ఉండాల్సిందే. లేదంటే అవి చేతులెత్తేస్తాయి. కనుక ఎడారుల వంటి అత్యంత పొడి ప్రదేశాలకు అవి పనికిరావు. కానీ గాల్లో తేమ 20 శాతం కంటే తక్కువగా ఉన్నా యాగీ టెక్నాలజీ భేషుగ్గా పని చేస్తుందని తేలింది. అంటే ఎన్నడూ వర్షమే కురవని, అత్యంత వేడి గాలులతో కూడిన ప్రాంతాల్లో కూడా దాని సాయంతో నీటిని తయారు చేసుకోవచ్చన్నమాట. ఎడారుల్లో గాలిలో నీటి అణువులు చాలా తక్కువగా ఉంటాయి. అటోకో రూపొందించిన ఎంవోఎఫ్‌లు రసాయన అయస్కాంతాలు తేమ 10 శాతం మాత్రమే ఉండే అత్యంత పొడి వాతావరణంలో కూడా నీటి అణువులను తమకేసి ఇట్టే ఆకర్షిస్తాయి. 

భారత్‌లోనూ... 
భారత్‌లో కూడా గాలి నుంచి నీటి తయారీకి అక్వో అనే దేశీయ కంపెనీ అట్మాస్పియరిక్‌ వాటర్‌ జనరేటర్ల (ఏడబ్ల్యూజీ)ను తయారు చేసింది. ఇవి అధునాతన సంక్షేపణ పరిజ్ఞానం సాయంతో పని చేస్తాయి. అవి గాలిని లోనికి పీల్చుకుంటాయి. అందులోని దుమ్ము, ధూళి వంటివాటిని తొలగించి శీతలీకరణ స్థాయికి చల్లబరిచి నీటిని సేకరిస్తాయి. దాన్ని కార్బన్‌ ఫిల్టరేషన్, యూవీ స్టెరిలైజేషన్‌ వంటి పలు దశల్లో శుభ్రపరిచి వినియోగానికి అనువుగా మారుస్తారు. అక్వో ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని హర్దువా మంగ్రా ప్రాంతంలో 1,500 మంది దాహార్తిని తీరుస్తోంది. హల్దియా రిఫైనరీకి ఈ పద్ధతిలో నీటిని సరఫరా కూడా చేస్తోంది. కాకపోతే ఈ విధానంలో నీటి ఉత్పత్తి ఉష్ణోగ్రత, గాల్లో తేమపై ఆధారపడి ఉంటుందని అక్వో వ్యవస్థాపకుడు, సీఈఓ నవ్‌కరణ్‌ సింగ్‌ బగ్గా వివరించారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

..ఆ నేపథ్యమే ప్రేరణ
ప్రొఫెసర్‌ యాగీది అత్యంత దయనీయమైన నేపథ్యం. ఆయన జోర్డాన్‌లోని శరణార్థి శిబిరాల్లో పెరిగారు. నీటికి తీవ్ర కటకట అక్కడ అత్యంత సాధారణ దృశ్యం. దాంతో పెరిగి పెద్దవాడయ్యే క్రమంలో యాగీ నిత్యం దాహార్తినే చవిచూస్తూ వచ్చారు. తర్వాతి తరాలు తనలా గొంతెండి అల్లాడకుండా ఏదో చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని చెబుతారాయన. ఆ తపనతోనే రసాయన శాస్త్రంలో విశేషమైన కృషి చేస్తూ వచ్చారు. తన కెరీర్‌ను దానికే అంకితం చేశారు.

ఎన్నెన్ని ఉపయోగాలో...!
యాగీ రూపొందించిన వినూత్న ఎంఓఎఫ్‌ యంత్రాన్ని ప్రపంచానికి నీటి కొరతను సమూలంగా తీర్చగల వరదాయినిగా చెప్పవచ్చు...
నీటికొరత ఇప్పటికే అతి పెద్ద ప్రపంచ సమస్యల్లో ప్రధానమైనదిగా మారుతోంది.
ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది సురక్షిత తాగునీటి సౌకర్యానికి దూరమైనట్టు ఐరాస చెబుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎంఓఎఫ్‌ యంత్రాలు గేమ్‌చేంజర్లు కాగలవు. ఎందుకంటే గాలిలోని నీటి పరిమాణం ప్రపంచంలోని అన్ని నదుల్లోని నీటి కంటే ఏకంగా ఆరు రెట్ల అధికమని పలు అధ్యయనాలు తేల్చాయి. కనుక గాలి నుంచే నేరుగా నీటిని ఒడిసిపట్టుకోగలిగితే దాహార్తి సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టవచ్చు.
పైగా ఈ పద్ధతి ద్వారా అత్యంత స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వస్తుంది.
పాతాళాన్ని తాకిన భూగర్భ జలాలపై, వాటర్‌ ట్యాంకులపై ఆధారపడటం తగ్గిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement