సాక్షి,చెన్నై: అత్త శశికళ పార్టీకి మేనల్లుడు టీటీవీ దినకరన్ కౌంటర్ ఇచ్చారు. ఇన్స్టెంట్ ఇడ్లీ-సాంబర్లా.. ఇన్స్టెంట్ పార్టీలు రావొచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలో ఉండే కొంత పొట్టుపోవడం వల్ల మాకు నష్టం కలేదు. కాకులు, పిట్టలు కొన్ని గింజలు తిన్నంత మాత్రానా పంటకు వచ్చే నష్టం ఉండుదు’ అని వ్యాఖ్యానించారు.
తమిళనాడు రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ కొత్త పార్టీ పెట్టారు. జయలలిత పుట్టినరోజు సందర్భంగా తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చిత్రాలతో కూడిన, నలుపు–తెలుపు–ఎరుపు రంగుల కలయికలో ఉన్న పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. పార్టీ పేరును త్వరలో ప్రకటిస్తానని శశికళ తెలిపారు.
అన్నాడీఎంకేలో తిరిగి చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో తన అనుచరులతో చర్చించి కొత్త పార్టీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘తొమ్మిది సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్నాను, ఇకపై నిశ్శబ్దంగా ఉండలేను.అన్నాదురై,ఎంజీఆర్ , జయలలిత మార్గంలోనే కొత్త పార్టీని ప్రారంభిస్తున్నాను’ అని ఆమె స్పష్టం చేశారు.
ఈ క్రమంలో శశికళ కొత్త పార్టీపై ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడారు. కొత్తగా పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఏఎంఎంకే,ఏఐఏడీఎంకే కార్యకర్తలలో 99.9శాతం మంది ఇప్పటికే ఒకటిగా ఉన్నారని, మిగతావారు తమ ఇష్టప్రకారం వ్యవహరించవచ్చని అన్నారు. ‘35 సంవత్సరాలుగా నాకు తెలిసిన కొందరి అసలు స్వరూపం ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.


