gన్యూఢిల్లీ: మేఘాలయ కేంద్రంగా ఆదివారం సంభవించిన భూకంపం వల్ల గౌహతి దాని పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మేఘాలయలో మధ్యస్థాయి భూకంపం సంభవించింది. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12:00 గంటలకు మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ జిల్లా కేంద్రంగా 4.5 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది.
మధ్యస్థాయిలో వచ్చిన ఈ ప్రకంపనలు గౌహతితో పాటు అసోంలోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో వెల్లడించిన వివరాల ప్రకారం.. మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్లో భూమికి 5 కిలోమీటర్ల లోతులో 4.5 తీవ్రతతో ఈ భూకంపం చోటుచేసుకుంది. దీనిపై కహిలిపారాకు చెందిన తనూజ అనే స్థానికురాలు స్పందిస్తూ.. ‘నేను వంటగదిలో పని చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా భూమి ప్రకంపించింది. ఒకటి రెండు సెకన్ల పాటు భూమి కంపిస్తున్నట్లు అనిపించింది. అంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని న్యూస్ లైవ్కు తెలిపారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాలతో పాటు షిల్లాంగ్లోనూ ప్రకంపనలు వచ్చాయి. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు అందలేదు.


