న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అయితే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రాథమికంగా తమకు అభ్యంతరాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ శీల్ నాగు ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రతివాదులకు(సోనమ్కు, ఇతరులకు) నోటీసులు జారీ చేసింది.
మేఘాలయ ప్రభుత్వం వాదన ఇదే..
మేఘాలయ ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇది ముందే పథకం ప్రకారం జరిగిన హత్య అని, సోనం రఘువంశీ తన ప్రియుడు రాజ్ కుష్వాహా.. మరో ముగ్గురితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసి లోయలో పడేశారని కోర్టుకు తెలిపారు. హత్య అనంతరం సోనం పరారై ఉత్తరప్రదేశ్లో అరెస్టయ్యిందని వివరించారు.
అయితే, హత్య కేసుకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) (హత్యకు శిక్ష)కు బదులుగా పొరపాటున సెక్షన్ 403(1)గా అరెస్ట్ మెమోలో టైప్ చేయడాన్ని ఆధారంగా తీసుకుని ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని.. అలాగే హైకోర్టు కూడా ఆ బెయిల్ను సమర్థించిందని కోర్టుకు నివేదించారు. అది కేవలం టైపింగ్ పొరపాటు మాత్రమేనని, ఈ ఒక్క కారణంతో బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..
విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై తమకు ప్రాథమికంగా కొన్ని సందేహాలు ఉన్నాయని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. నిందితురాలిపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని.. బెయిల్ విషయంలో మేఘాలయా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారాయన. అలాగే అరెస్టు కారణాలను నిందితురాలికి వివరించారని రికార్డుల్లో ఉందని, గతంలో దాఖలైన బెయిల్ పిటిషన్లలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదని బెంచ్ ప్రస్తావించింది. కేవలం తప్పుగా సెక్షన్ పేర్కొన్నందుకే బెయిల్ ఇవ్వడం సరైందేనా? అని ప్రశ్నించింది.
అయితే, సోనమ్ ఇప్పటికే జైలు నుంచి విడుదలైనందున ఈ దశలో బెయిల్పై స్టే విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. ‘‘బెయిల్ రద్దు విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఆమె విడుదల కాకపోయి ఉంటే.. బెయిల్పై కచ్చితంగా స్టే విధించేవాళ్లం’’ అని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో, బెయిల్ ఉత్తర్వుపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని, తదుపరి విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.
హనీమూన్ కేసులో జరిగింది ఇదే..
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనం రఘువంశీ 2025 మేలో వివాహం చేసుకున్నారు. అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట మే 23న అదృశ్యమైంది. జూన్ 2న ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని వైసాడాంగ్ జలపాతం సమీపంలోని లోయలో రాజా మృతదేహం లభించింది. కొద్ది రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో సోనం రఘువంశీ కనిపించగా, అనంతరం పలు అనుమానాల నడుమ ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
దర్యాప్తులో భర్త హత్యకు సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కుట్ర పన్నిందని, ఇందుకోసం కిరాయి హంతకులను నియమించిందని మేఘాలయ పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో సోనం, రాజ్ కుష్వాహాతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి 700కు పైగా పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ 27న ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వగా.. జూన్ 29న మేఘాలయ హైకోర్టు సోనం రఘువంశీకి బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ పత్రాల్లో సెక్షన్ను తప్పుగా నమోదు చేయడం సాధారణ టైపింగ్ పొరపాటు కాదని, దర్యాప్తు ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు బెయిల్ను సమర్థించింది. ఇప్పుడు ఆ బెయిల్ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, బెయిల్పై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించినప్పటికీ, హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగించేందుకు అంగీకరించింది.


