లండన్‌ రెచ్చగొడుతోందా.. పుతిన్‌ రివేంజ్‌ తట్టుకోగలదా? | Why Russia threatened the UK what happens next Here Story | Sakshi
Sakshi News home page

లండన్‌ రెచ్చగొడుతోందా.. పుతిన్‌ రివేంజ్‌ తట్టుకోగలదా?

Aug 19 2026 9:15 AM | Updated on Aug 19 2026 9:17 AM

Why Russia threatened the UK what happens next Here Story

ఉక్రెయిన్‌ యుద్ధం మరో ప్రమాదకర మలుపు తిరుగుతోంది. రష్యా భూభాగంపై కీవ్‌ దాడులు పెంచుతున్న వేళ.. ఆ దాడుల్లో బ్రిటన్‌ తయారీ డ్రోన్లు ఉపయోగించారన్న సమాచారం మాస్కో ఆగ్రహానికి కారణమైంది. దీంతో రష్యా నేరుగా లండన్‌నే టార్గెట్‌ చేసింది. “బ్రిటన్‌ ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.. దీనికి పరిణామాలు ఉంటాయి” అంటూ హెచ్చరించింది. అయితే ఆ ‘పరిణామాలు’ ఏ రూపంలో ఉంటాయన్నది మాత్రం చెప్పలేదు. దీంతో ఇప్పుడు రష్యా తదుపరి అడుగు ఏంటన్నదే అసలు ఉత్కంఠగా మారింది.

అసలు వివాదం ఏంటి?
ఇటీవలి వారాల్లో ఉక్రెయిన్‌ రష్యా భూభాగంపై డ్రోన్‌ దాడులను మరింత పెంచింది. మాస్కోతో పాటు పలు ప్రాంతాల్లో చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, గిడ్డంగులు వంటి వ్యూహాత్మక లక్ష్యాలను కీవ్‌ టార్గెట్‌ చేసింది. రష్యాకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైలర్‌ వైల్డ్‌బెర్రీస్‌కు సంబంధించిన కొన్ని గిడ్డంగులు కూడా దాడుల పరిధిలోకి వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ దాడుల్లో ఉపయోగించిన కొన్ని డ్రోన్లు బ్రిటన్‌లో తయారైనవేనన్న సమాచారం బయటకు రావడంతో వివాదం మొదలైంది. అయితే బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఈ డ్రోన్లను రష్యాపై దాడులకు ఉపయోగించారన్న నిర్దిష్ట నివేదికలను ధృవీకరించలేదు.

రష్యా హెచ్చరిక..
లండన్‌లోని రష్యా రాయబార కార్యాలయం బ్రిటన్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఉద్దేశపూర్వకంగా మరింత తీవ్రతరం చేసే మార్గాన్ని లండన్‌ ఎంచుకుందని మండిపడింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, డ్రోన్లు, ఇతర సైనిక సహాయం అందించడం ద్వారా రష్యాతో ఘర్షణలో బ్రిటన్‌ మరింత లోతుగా జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. అంతేకాదు.. బ్రిటన్‌ “పరిణామాలను” ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే అవి ఎలాంటి చర్యలుగా ఉంటాయో మాత్రం మాస్కో వెల్లడించలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్‌ లావ్రోవ్‌ కూడా బ్రిటన్‌ సైనిక సహాయంపై తీవ్ర విమర్శలు చేశారు. పాశ్చాత్య దేశాల మద్దతు పెరిగే కొద్దీ.. యుద్ధంలో వాటి ప్రమేయం కూడా పెరుగుతోందని రష్యా వాదిస్తోంది.

బ్రిటన్‌ వెనక్కి తగ్గుతుందా?
మాస్కో హెచ్చరికకు లండన్‌ మాత్రం తలొగ్గలేదు. ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ మద్దతు “100 శాతం” కొనసాగుతుందని ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌ స్పష్టం చేశారు. కష్టకాలంలో కీవ్‌కు అండగా నిలుస్తామని తేల్చిచెప్పారు. బ్రిటన్‌ ఇప్పటికే ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో డ్రోన్లు, ఇతర సైనిక పరికరాలను అందిస్తోంది. 2026 చివరి నాటికి ఉక్రెయిన్‌కు 1.5 లక్షల డ్రోన్లు అందించే ప్రణాళికలో భాగంగా భారీ సైనిక సహాయ ప్యాకేజీని లండన్‌ ప్రకటించింది.

రష్యాకు ఇంత ఆగ్రహం ఎందుకు?
ఇక్కడ అసలు సమస్య ఒక్క డ్రోన్‌ కాదు. ఉక్రెయిన్‌ రష్యా భూభాగంలోకి మరింత లోతుగా దాడులు చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇంధన కేంద్రాలు, సైనిక స్థావరాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మాస్కోపై ఒత్తిడి పెంచాలని కీవ్‌ ప్రయత్నిస్తోంది. ఇలాంటి దాడుల్లో పాశ్చాత్య దేశాల తయారీ పరికరాలు, సాంకేతికత ఉపయోగిస్తున్నట్లు రష్యా భావిస్తే.. ఈ యుద్ధం కేవలం రష్యా–ఉక్రెయిన్‌ మధ్యే కాకుండా రష్యా–పాశ్చాత్య దేశాల మధ్య పరోక్ష యుద్ధంగా మారుతోందన్న తన వాదనకు మాస్కో మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది.

‘పరిణామాలు’ఏంటి?
ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. రష్యా హెచ్చరించిన “పరిణామాలు” ఏంటో స్పష్టత లేదు. అవి దౌత్యపరమైన చర్యలుగా ఉండొచ్చు.. ఆంక్షలకు ప్రతిచర్యగా ఉండొచ్చు.. సైబర్‌ లేదా ఇతర హైబ్రిడ్‌ చర్యల రూపంలోనూ ఉండొచ్చు. అయితే ప్రస్తుతం రష్యా బ్రిటన్‌పై ప్రత్యక్ష సైనిక దాడి చేయబోతోందని చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ ఉక్రెయిన్‌కు లండన్‌ సైనిక మద్దతు కొనసాగించడం, కీవ్‌ రష్యా భూభాగంలో దాడులను మరింత పెంచడం జరిగితే.. మాస్కో స్పందన మరింత కఠినంగా మారే అవకాశం మాత్రం ఉంది.

ఒకవైపు కీవ్‌ రష్యాపై డ్రోన్‌ దాడులు పెంచుతోంది. మరోవైపు లండన్‌.. “ఉక్రెయిన్‌కు 100 శాతం మద్దతు” అంటోంది. మధ్యలో మాస్కో మాత్రం.. “పరిణామాలు తప్పవు” అంటూ హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరిక కేవలం మాటల యుద్ధంగానే మిగిలిపోతుందా? లేక రష్యా నిజంగానే తదుపరి అడుగు వేస్తుందా? ఇప్పుడు ప్రపంచం చూపు ఈ పరిణామంపైనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement