సాక్షి, నల్లగొండ: నల్గొండ జిల్లా నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. రూపారెడ్డిని పదో తరగతి విద్యార్థులే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం స్కూల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థికి మరో విద్యార్థి సహకరించినట్టు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక, రూపారెడ్డి హత్య అనంతరం ఆ విద్యార్థులు సుమారు రూ.4 లక్షల నగదు చోరీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీకి చెందిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె.రూపారెడ్డి ఈ నెల 11న దారుణ హత్యకు గురైంది. కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. సుమారు 80 మందిని విచారించిన అనంతరం కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గుర్తించారు.
ఈ దారుణానికి పాల్పడింది పదో తరగతి విద్యార్థి అని పోలీసులు నిర్ధారించారు. పదో తరగతి విద్యార్థికి మరో విద్యార్థి సహకరించినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరిని ఇబ్రహీంపట్నం వద్ద మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసుకు సంబంధించి బుధవారం సాయంత్రం లోగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.


