ఈ రోజుల్లో కొందరు యువత ‘నువ్వే నా ప్రాణం’ అంటూ అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా తన ప్రియుడు లేదా ప్రియురాలితో ఆన్లైన్లో చాటింగ్లు చేయడం, భవిష్యత్ను ఆలోచించకుండా దేశాలు పట్టి తిరగడం అనేది కామన్గా మారిపోవడాన్ని చూస్తున్నాం. అయితే ఇలాంటి మోహం మనిషిని ఎంతటి ప్రమాదంలోకి నెడుతుందనేది తులసీదాస్ జీవితంలోని ఒక ఘటన మనకు తెలియజేస్తుంది. శ్రీరాముని కథను సామాన్యుడి గుండెల్లో నిలిపిన గోస్వామి తులసీదాస్ జీవితంలో జరిగిన ఈ ఘటన నేటి యువతకు ఒక కనువిప్పు. ప్రతి ఏడాది శ్రావణ శుక్ల సప్తమి నాడు తులసీదాస్ జయంతిని నిర్వహిస్తుంటారు. అది నేడు (ఆగస్టు 19)న వచ్చింది.
ఒక సాధారణ గృహస్థుడిగా ఉన్న తులసీదాస్కు తన భార్య రత్నావళి అంటే ప్రాణం. ఆమె పుట్టింటికి వెళ్లగా, ఆ విరహాన్ని భరించలేకపోయిన ఆయన భయంకరమైన వాతావరణాన్ని, ఉప్పొంగుతున్న వరదలను కూడా లెక్కచేయకుండా అర్ధరాత్రి బయలుదేరారు. మార్గమధ్యంలో నది దాటేందుకు నీటిలో తేలియాడుతున్న ఒక శవాన్ని చెక్క మొద్దుగా భావించి, దాని సహాయంతో ఒడ్డునకు చేరారు. అత్తగారి ఇంటికి చేరాక.. ఈ సమయంలో వస్తే ఎవరైనా ఏమైనా అంటారనే భయంతో, అక్కడి గోడ ఎక్కేందుకు దానిపై వేలాడుతున్న విషసర్పం తోకను పట్టుకుని భార్య ఉంటున్న గది కిటికీ దగ్గరకు చేరుకున్నారు.
తన కోసం ప్రాణాలను పణంగా పెట్టి వచ్చిన తులసీదాస్ను చూసి రత్నావళి సంతోషించలేదు. పైగా తీవ్రంగా అసహ్యించుకుంది. ‘సిగ్గు లేకుండా నా వెంటే పరిగెత్తుకుంటూ వచ్చారు! ఎముకలు, మాంసంతో కూడిన ఈ నశ్వరమైన దేహంపై ఉన్న ప్రేమలో కొంతైనా శ్రీరామునిపై ఉంటే మీకు భవబంధాల నుంచి విముక్తి లభించేది’ అని కఠినంగా మందలించింది. ఆ మాటలు ఆయన గుండెను బలంగా తాకాయి. ఆ నాడే తులసీదాస్ గ్రహించారు.. మనుషుల మీద పెట్టుకునే గుడ్డి మోహం ప్రమాదాల పాలు చేస్తుందని! ఆ క్షణమే ప్రాపంచిక మోహాలను వీడి, సన్యాస మార్గాన్ని స్వీకరించి, రామనామ అన్వేషణలో తరించారు. ఆ నాడే తులసీదాస్ చెప్పకనే చెప్పారు.. గుడ్డి వ్యామోహాన్ని వదిలి, మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి, జీవితం అప్పుడే సార్థకమవుతుందని.
ఇది కూడా చదవండి: వాట్సాప్లో ఒక్క మెసేజ్ .. నిమిషాల్లో వెబ్సైట్ సిద్ధం!


