మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక | Tumati madhava Rao Elected As AP Legislative Council Deputy Chairman | Sakshi
Sakshi News home page

మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక

Aug 19 2026 11:25 AM | Updated on Aug 19 2026 12:04 PM

Tumati madhava Rao Elected As AP Legislative Council Deputy Chairman

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్‌ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని మండలి చైర్మన్‌ కోరారు. అయితే కూటమి పార్టీలకు చెందిన సభ్యులు చైర్మన్‌ సీటు వద్దకు రాలేదు. దీంతో వారి తీరుపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాగా, అన్ని పార్టీల సభ్యులు కలిసి కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం సభా సంప్రదాయంలో భాగమని చైర్మన్‌ మోషేన్‌ రాజు పేర్కొన్నారు. అయితే కూటమి సభ్యులు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటంపై మండలిలో చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మాధవరావు డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బొత్స సత్యనారాయణతో పాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో డిప్యూటీ చైర్మన్‌గా మాధవరావు ఎన్నిక కావడం పట్ల వైఎస్సార్‌సీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మాధవరావు ఎన్నికతో మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవి వైఎస్సార్‌సీపీకి దక్కింది. 

అనంతరం సభలో బొత్స మాట్లాడుతూ..‘అన్ని పక్షాలను సమదృష్టితో చూడాలని కోరుకుంటున్నా. డిప్యూటీ చైర్మన్‌ను చైర్‌పై కూర్చోబెట్టడానికి అధికార పార్టీ రాకపోవడం దురదృష్టం. మంత్రులు సభ రూల్స్ గురించి  చెప్తున్నారు.. డిప్యూటీ చైర్మన్‌కి గౌరవం ఇవ్వరా?. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదు. ప్రజలు చూస్తున్నారు.. చైర్ పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి సహజం. సభా సాంప్రదాయాలు, గౌరవాలు శాశ్వతం. వెన్నుపోటు పార్టీ తీరు మరోసారి రుజువైంది. రాబోయే రోజుల్లో ఇలాంటి అగౌరవ ఘటనలు జరగకూడదు. మంత్రులు రూల్స్ బుక్స్ పట్టుకుని నీతులు చెప్పడం కాదు. విలువలు, సాంప్రదాయాలు పాటించాలి’ అని చురకలు అంటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement