అలప్పుజ: కేరళలోని అలప్పుజ జిల్లా హరిపాడ్ బ్లాక్ పంచాయతీ పరిధిలో అత్యంత దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. ఐఫోన్, బైక్ కొనుగోలు కోసం 13 ఏళ్ల బాలిక తన 15 ఏళ్ల బాయ్ఫ్రెండ్, మరో ఇద్దరు మైనర్ స్నేహితుల సహకారంతో తన తాతను హత్య చేయించింది. యూట్యూబ్లో హత్య చేసే విధానాలను చూసి, పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి నిందితులు ఒడిగట్టారు.
బాధితుడు తన భార్య, గర్భిణి అయిన కుమార్తె, మనవరాలితో కలిసి నివసిస్తున్నారు. కూతురు పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరగా, బామ్మ కూడా అక్కడే ఉన్నారు. ఇదే అదనుగా భావించిన మనవరాలు.. పరీక్షల ప్రిపరేషన్ సాకుతో స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తాత తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాయ్ఫ్రెండ్ను నమ్మించి, హత్యకు పురిగొల్పింది. నిందితులు ఇంటి వెనుక వెంటిలేటర్ ద్వారా లోపలికి ప్రవేశించి, తాతను తీవ్రంగా కొట్టి, కాళ్లు చేతులు కట్టేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ బాలిక ఈ దారుణాన్ని వీడియో కాల్ ద్వారా లైవ్లో వీక్షించింది. అనంతరం ఆధారాలు దొరక్కుండా కారం పొడి చల్లి, 4.5 సవర్ల (సుమారు 36 గ్రాములు) బంగారం, నగదుతో ఉడాయించారు.
మొబైల్ వాడవద్దని మందలించిన తాతపై కక్ష పెంచుకున్న ఆ బాలిక.. బంగారం అమ్మి తాను ఐఫోన్ కొనుక్కోవాలని, బాయ్ఫ్రెండ్కు బైక్ కొనివ్వాలని ఈ పథకం వేసింది. పోలీసులు విచారణలో బాలిక పొంతనలేని సమాధానాలు చెప్పడంతో, సాంకేతిక ఆధారాల ద్వారా 24 గంటల్లోనే కేసును ఛేదించారు. కొల్లాంలో విక్రయించిన ఉంగరంతో సహా మిగిలిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.
ఇది కూడా చదవండి: శవం సాయంతో నది దాటి.. తులసీదాస్ జీవితాన్ని మార్చిన ఘటన!


