సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో అసెంబ్లీ మూడోరోజు సమావేశాల మూడో రోజూ కూడా దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే చైర్మన్ తిరస్కరణతో ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగడంతో.. గందరగోళం నెలకొంది.
డీఎస్సీ అంశంపై చర్చ జరపాలని వైఎస్సార్సీపీ, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. శాసనసభలో సమాధానం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. మండలికి వచ్చి అదే సమాధానం చెప్పాలని కోరుతోంది. అవకతవకలు జరిగిన మాట వాస్తవమని.. తప్పు ఒప్పుకుని నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని అంటోంది. అదే సమయంలో.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం తరఫున నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం రావడం లేదు. కేవలం దాటవేత ధోరణి మాత్రమే కనిపించింది. దీంతో వైఎస్సార్సీపీ సభ్యుల చైర్మన్ పోడియంను చుట్టుముట్టడంతో.. ఆయన మండలిని కాసేపు వాయిదా వేశారు.
మంత్రులకు చైర్మన్ చురకలు
వైఎస్సార్సీపీ సభ్యుల డీఎస్సీ డిమాండ్తో కూటమి మంత్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. సమాధానం ఇవ్వలేక.. గట్టి గట్టిగా అరుస్తూ ఏవేవో స్టేట్మెంట్లు ఇచ్చారు. చివరకు మండలిని సరిగ్గా నడపాలంటూ చైర్మన్ కొయ్యే మోషేనురాజు మీద అసహనం ప్రదర్శించారు. మంత్రి పార్థసారథి ఓ అడుగు ముందుకేసి వైఎస్సార్సీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఈ కమాండింగ్పై చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభను ఎలా నడపాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదంటూ మంత్రులందరికీ చురకలంటించారు.
అంతకు ముందు.. మండలి సమావేశానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మెడలో నల్ల కండువాలు వేసుకుని ర్యాలీగా వచ్చారు. ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’ అంటూ నినాదాలు చేస్తూ మండలికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్సీల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
మండలి సమావేశం ప్రారంభమైన తర్వాత డీఎస్సీలో జరిగిన అక్రమాలపై చర్చించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్రెడ్డి, కల్పలతారెడ్డి, రామచంద్రారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే మండలి చైర్మన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో డీఎస్సీ అంశంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుబడుతున్నారు.
పొంతన లేని సమాధానాలు: లేళ్ల అప్పిరెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నారు. డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఒకే వ్యక్తిని నియమించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. మంత్రి నారా లోకేశ్ చెబుతున్న మాటలకు విద్యాశాఖ అధికారులు చెబుతున్న విషయాలకు పొంతన లేదని విమర్శించారు.
ఎన్ఓసీ తీసుకోలేదని లోకేశ్ చెబుతుంటే.. ఎన్ఓసీ తీసుకున్నానంటూ నవీన్ కోర్టును ఆశ్రయించారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలను లక్షల రూపాయలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయని, డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అలాగే.. పీవీ సింధు తరహాలోనే మిగతా వాళ్లకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చామని చెబుతున్నారని, నియామకాల ప్రక్రియకు ఈ స్టేట్మెంట్కు సంబంధం ఏమైనా ఉందా? అని నిలదీశారు.
‘లోకేశ్ మండలికి వచ్చి సమాధానం చెప్పాలి’
డీఎస్సీ అక్రమాలపై తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదని అప్పిరెడ్డి విమర్శించారు. లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సవాళ్లు విసరడం తప్ప తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఎవరూ ప్రశ్నించరనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో మాట్లాడుతున్నారని, మండలిలో మాత్రం చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోందని.. అలాంటప్పుడు విద్యాశాఖ, శాప్ అధికారులను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులందరినీ బదిలీ చేసినప్పుడు సంబంధిత మంత్రి లోకేశ్ను కూడా పదవి నుంచి తొలగించాలి కదా అని వ్యాఖ్యానించారు.
డీఎస్సీకి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంత దూరం తప్పించుకున్నా విద్యార్థులు, నిరుద్యోగుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలు, యువతే ప్రభుత్వాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.


