సాక్షి, వరంగల్: పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్టాపిక్గా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన ఇన్స్టాగ్రామ్లో “అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ సుస్మిత పోస్టు చేయడంతో.. పరకాల రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. మరోవైపు.. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో, రాజకీయం మరో టర్న్ తీసుకుంది.
కాగా, రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రస్తుతం పరకాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో.. సుస్మిత తాజా పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో అధికార కాంగ్రెస్లోనే రేవూరి, కొండా కుటుంబం మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతోందన్న చర్చ మొదలైంది.
పరకాలపై కొండా ఫ్యామిలీ కన్ను?
కొండా కుటుంబానికి పరకాల నియోజకవర్గంతో రాజకీయంగా బలమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో సుస్మితను పరకాల నుంచి రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. తాజాగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆ చర్చకు మరింత బలం చేకూర్చింది. అయితే, మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గ పరిధిలో భారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గీసుకొండ మండలంలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుస్మిత పటేల్ రాజకీయంగా కీలక ప్రకటన చేస్తారా? అన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.

ఒకవైపు రేవూరి ప్రకాశ్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి మద్దతు, మరోవైపు పరకాల నుంచి పోటీకి సుస్మిత పటేల్ ఆసక్తి.. ఈ రెండు పరిణామాలతో పరకాల కాంగ్రెస్లో రాజకీయ వేడి పెరిగింది. ప్రస్తుతం ఇది పార్టీ అంతర్గత రాజకీయంగా కనిపిస్తున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. రేవూరి వర్సెస్ కొండా ఫ్యామిలీగా మారుతున్న ఈ పవర్ పాలిటిక్స్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.


