breaking news
Congress Party
-
అధిష్టానం కోర్టులోకి!
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోర్టులోకి చేరింది. ఈ విషయంలో ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయంపైనే ఆమె భవితవ్యం ఆధారపడి ఉంటుందని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు తగినట్టుగానే సోమవారం రెండు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్రెడ్డి అటు విలేకరుల సమావేశంలోనూ ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీలోనూ సురేఖ అంశంపై స్పందించారు. అంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని విలేకరుల సమావేశంలో చెప్పిన ఆయన.. ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని సూచించారు. ‘పాజిటివ్ వద్దు.. నెగెటివ్ వద్దు.. సురేఖ ఎపిసోడ్ గురించి మాట్లాడొద్దు.. ఫుల్స్టాప్ పెట్టండి... విషయం హైకమాండ్ దగ్గరకు వెళ్లింది కదా. వారు నిర్ణయం తీసుకోవాలి.’అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మరోవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసులకు సురేఖ సమాధానంపై ప్రాథమిక నివేదికను పార్టీకి అందజేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్లకు కమిటీ చైర్మన్ మల్లురవి సోమవారం ప్రాథమిక నివేదికను అందజేశారు. సుస్మిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్టను వ్యక్తిగతంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. కాగా, ఈ నివేదిక ఆధారంగా సుస్మిత, సురేఖల అంశంపై పీసీసీ నుంచి కూడా ఏఐసీసీకి ఓ నివేదిక వెళుతుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత రాష్ట్ర పార్టీ పెద్దలకు హస్తిన నుంచి పిలుపు వస్తుందని, అక్కడ జరిగే చర్చలో సీఎం, పీసీసీ చీఫ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆ వర్గాల్లో జరుగుతోంది. నాడు అడ్డుకున్నదెవరు? ఈ ఎపిసోడ్లో మరో ఆసక్తికర అంశం వెలుగులోనికి వచ్చింది. గతంలో కూడా సురేఖ కుమార్తె సుస్మిత తననుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీఎం రేవంత్ చాలా సీరియస్గా తీసుకున్నారని, ఈ అంశంపై అధిష్టానం దగ్గర చర్చ జరిగినప్పుడు కొండా కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అడ్డుకున్నారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. అప్పుడు చర్యలు తీసుకోకపోవడంతోనే మరోమారు సుస్మిత సీఎం మీద మాట్లాడగలిగారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి తాను కూడా కాపాడలేనని ఇటీవల మహేశ్గౌడ్ నిజామాబాద్లో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనమని వారంటుండడం గమనార్హం. కాగా, కొండా సురేఖ ఎపిసోడ్ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిల మధ్య కూడా చర్చకు వచ్చింది. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో తెలంగాణ రైజింగ్–2027 సమీక్షకు ముందు తాజా రాజకీయ వివాదం గురించి ఇద్దరూ మాట్లాడుకున్నట్టు సమాచారం. సురేఖ విఫలమయ్యారు: క్రమశిక్షణ కమిటీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రి కొండా సురేఖపై చర్యలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. సురేఖ కుమార్తె సుస్మిత పదేపదే సీఎంను కించపరిచేలా, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతుంటే ఆమెను నియంత్రించడంలో సురేఖ విఫలమయ్యారని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. తాము సుస్మిత మాట్లాడిన మాటలు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలను క్షుణ్ణంగా పరిశీలించామని, సురేఖ సమాధానాలను కూడా పరిశీలించామని, అన్నింటినీ పరిశీలించిన మీదట క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సురేఖ అర్హురాలని, ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఏఐసీసీ నిర్ణయమని టీపీసీసీ ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. -
Reventh Reddy: నన్ను కాదు 4 కోట్ల మందిని అవమానించారు
-
LIVE: సీఎం రేవంత్ సంచలన ప్రెస్ మీట్
-
భయపడాల్సిన అవసరం లేదు వాళ్లకు డబ్బులు వాపస్
-
అలాగైతేనే విజయ్ టీవీకే ఇండియా కూటమిలో చేరొచ్చు: కాంగ్రెస్
చెన్నై: తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు పార్లమెంట్లో సొంతగా ప్రాతినిధ్యం ఉండాలని, ఆ తర్వాతే ఇండియా కూటమిలో చేరేందుకు ఆ పార్టీని ఆహ్వానిస్తామని టీఎన్సీసీ అధ్యక్షుడు, ఎంపీ బి.మాణిక్కం ఠాగూర్ తెలిపారు. “తమిళగ వెట్రి కళగానికి సొంత ఎంపీలు వచ్చిన తర్వాత వారిని ఇండి కూటమిలో చేరాలని మేము కోరుతాం. ఎంపీలు లేని పార్టీలను పదేపదే ఆహ్వానిస్తూ ఉండలేం. వారికి ఎంపీలు ఉంటేనే ఇండియా కూటమిలో చేర్చుకుంటాం” అని అన్నారు.టీవీకే ఎమ్మెల్యే, సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత శాఖ మంత్రి జగదేశ్వరితో పాటు రెవెన్యూ మంత్రి కె.ఎ.సెంగోట్టయ్యన్ సహా కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలకు ఠాగూర్ స్పందించారు. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ భవిష్యత్ ప్రధానమంత్రి అని, ఆయన ప్రధానమంత్రి పదవికి అర్హుడని టీవీకే నేతలు వ్యాఖ్యానించారు.విజయ్, రాహుల్, కాంగ్రెస్పై ఠాగూర్ వ్యాఖ్యలుఈ వ్యాఖ్యలపై ఠాగూర్ వ్యంగ్యంగా స్పందిస్తూ, “టీవీకే నేతలు ఇప్పటికీ అభిమాన సంఘం తరహాలోనే వ్యవహరిస్తున్నారు. కాబట్టి అభిమాన సంఘం తరహాలో ఉన్న వారిని మీరు మౌనం వహించేలా చేయలేరు” అని అన్నారు. 2029 ఎన్నికల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ముందుకు తెస్తున్న వేళ ఠాగూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత టీవీకేకు మద్దతు తెలుపుతూ లేఖ ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్ అని ఆయన చెప్పారు.“మొదటగా విజయ్ గురించి చెప్పాలంటే, ఆయన పార్టీ 108 స్థానాల్లో గెలిచిన వెంటనే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు కోరుతూ మొదటగా రాహుల్ గాంధీకి ఫోన్ చేసిన వ్యక్తి విజయ్. కాబట్టి ప్రస్తుతం తమిళగ వెట్రి కళగంలో మంత్రులుగా ఉన్న వారందరికీ ఈ విషయం తెలుసు” అని ఆయన పేర్కొన్నారు.ఇండియా కూటమిలో చేరడంపై టీవీకేఠాగూర్ వ్యాఖ్యలకు స్పందించిన టీవీకే ఉప ప్రధాన కార్యదర్శి, ఇంధన వనరులు, న్యాయ శాఖ మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో ప్రాతినిధ్యం సాధించిన తర్వాత పార్టీ ఇండియా కూటమిలో చేరుతుందని చెప్పారు.“ప్రస్తుతం ఏయే పార్టీలకు ఎంపీలు ఉన్నారో, ఆ పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాతే మేము చేరతాం. ఎంపీలు ఉన్న పార్టీలే ఇండియా కూటమిలో ఉంటాయి” అని కుమార్ అన్నారు.ఎంపీలులేని పార్టీలను కూడా చేర్చుకుంటే ఇండియా కూటమిలో 1,000కు పైగా పార్టీలను చేర్చాల్సి వస్తుందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. “కాబట్టి ఎన్నికల తర్వాత టీవీకేకు ఎంపీలు వచ్చిన వెంటనే మేము కచ్చితంగా ఇండియా కూటమిలో చేరి కలిసి పనిచేస్తాం” అని ఆయన అన్నారు.ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయం సాధించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 118 స్థానాలను ఆ పార్టీ సాధించలేకపోయింది. ఆ తర్వాత వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఐ(ఎం)తో టీవీకే ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకుంది. ఆ రెండు పార్టీలు చెరో 2 స్థానాలు గెలుచుకున్నాయి. వామపక్ష పార్టీలు టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్నాయి.వామపక్ష పార్టీలతో పాటు విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్), కాంగ్రెస్తో కూడా టీవీకే పొత్తు కుదుర్చుకుంది. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో కాంగ్రెస్కు ప్రాతినిధ్యం ఉంది.ఇదీ చదవండి: 22ఏ బాధితులకు న్యాయం చేసి తీరుతాం.. మంత్రి పొంగులేటి -
ఎస్పీలోకి కాంగ్రెస్ నేత అల్లుడు.. కూతురిని వెళ్లగొట్టారంటూ..
లక్నో: యూపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కుటుంబంలో రాజకీయ విభేదాలు తీవ్రస్థాయి కుటుంబ కలహాలకు దారితీశాయి. ఆయన అల్లుడు షయాన్ మసూద్ కాంగ్రెస్ను వీడి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరిన కొద్ది రోజులకే ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఎంపీ కుమార్తె సుబియాపై ఆమె భర్త షయాన్ దాడి చేసి, ఇంటి నుంచి గెంటేశాడని ఇమ్రాన్ మసూద్ మేనల్లుడు హంజా నోమన్ మసూద్ తీవ్ర ఆరోపణలు చేశారు.శనివారం నిర్వహించిన ఫేస్బుక్ లైవ్లో హంజా మాట్లాడుతూ.. షయాన్, ఆయన తండ్రి షాదాన్ మసూద్లు సుబియాపై భౌతిక దాడికి పాల్పడటంతో పాటు దూషించి ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు. సంబంధాలు, కుటుంబ పరువు కోసం దాదాపు ఐదేళ్లుగా మౌనంగా ఉన్నామని, రాజకీయ విభేదాల కారణంగానే సుబియాను వేధించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సంభాషణల ఆడియోలు, వీడియో రికార్డింగ్లు తమ వద్ద ఉన్నాయని, వివాదం ఇలాగే కొనసాగితే వాటిని బహిర్గతం చేస్తామని హెచ్చరించారు.చిన్నారి ప్రాథమిక అవసరాలు, డైపర్ల ఖర్చులను కూడా షయాన్ భరించలేదని విమర్శించారు. అంతేకాకుండా తనను, ఇమ్రాన్ మసూద్ను అంతమొందించేందుకు జరిగిన సంభాషణల రికార్డింగులు కూడా ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు రుజువులు చూపించలేదు. ఈ ఆరోపణలపై షయాన్ స్పందిస్తూ.. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను బహిరంగ పరచడం సరికాదన్నారు. రాజకీయ పోరాటం చేయాలనుకుంటే ప్రత్యక్షంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. కుటుంబ విషయాలను రచ్చకెక్కించడం ఇష్టం లేదని, ప్రైవేట్గా చర్చిస్తే, అన్ని ఆరోపణలకూ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆగస్టు 20న లక్నోలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సమక్షంలో షయాన్ ఎస్పీలో చేరారు. -
రేవంత్ సర్కార్పై రాంచందర్రావు తీవ్ర ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తీవ్రంగా ఆరోపించారు. విద్యార్థులు, కాలేజీల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం ఒత్తిడికి గురిచేస్తోందని ఆరోపించారు. ఫీజు బకాయిలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పినా.. ఆ హామీ కూడా అమలు కాలేదని ఆయన అన్నారు. బకాయిల కోసం విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తుంటే వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.రాహుల్ గాంధీకి సవాల్ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా రాంచందర్రావు టార్గెట్ చేశారు. “రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణకు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్పై మాట్లాడాలి” అంటూ సవాల్ విసిరారు. దేశంలో యువతను రెచ్చగొట్టి ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీకి ప్రయోజనాలు అందుతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. విద్యార్థులకు మాత్రం ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ను గద్దె దించాలిదేశ వ్యతిరేక శక్తులతో సీఎం రేవంత్రెడ్డి చేతులు కలుపుతున్నారని రాంచందర్రావు ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా తమ ప్రయోజనాల కోసం పరస్పరం పోటీ పడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల శక్తి ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: సెల్ఫీ కోసం వచ్చి రాహుల్కి ముద్దుపెట్టిన యువతి.. వేదికపై హైడ్రామా! -
కొండా సురేఖ ఇష్యూ.. రేవంత్ కీలక భేటీ!
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటన రద్దు తర్వాత హైదరాబాద్కు తిరిగొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న పరిణామాలపై దృష్టి సారించారు. సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం, పార్టీలో క్రమశిక్షణ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్రెడ్డి తన విదేశీ పర్యటనను కుదించుకుని లండన్ నుంచి తిరిగి వచ్చారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించగా.. కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై తిరిగి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం రేవంత్ అన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్(చిట్టక్క) సీఎం రేవంత్ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తట్టుకోలేకపోతున్నారు. కూతురి వ్యాఖ్యలను ఖండించకపోగా.. నాకేం సంబంధం అన్నట్లు సురేఖ మాట్లాడటాన్ని కూడా అంగీకరించడం లేదు. ఇప్పటికే ఈ విషయమై క్రమశిక్షణా కమిటీకి వాళ్లంతా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంతో తమ అభిప్రాయాలను పంచుచుకోనున్నారు. మరోవైపు.. కొండా సురేఖ ఎపిసోడ్తో పాటు వనపర్తిలో చిన్నారెడ్డి-ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆదిలాబాద్ నేతలు కంది శ్రీనివాస్రెడ్డి-అల్లూరి సంజీవరెడ్డి గొడవ, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇటు.. కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖ చిక్కుల్లో పడ్డారు. వివరణ కోరుతూ పీసీసీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె నిన్న బెంగళూరు వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. గంట పాటు వీళ్ల మధ్య భేటీ జరిగింది. మరోవైపు ఈ పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ ఇవాళ సీఎంను కలుస్తారనే ప్రచారం సాగుతోంది. తన శాఖ సమీక్ష కోసం ఆమె సచివాలయానికి చేరుకునే అవకాశం ఉంది.దీంతో ఈ వరుస భేటీలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సాయంత్రం ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఫ్యామిలీ వ్యవహారం.. ఏం చేస్తే ఏమవునో? -
కాంగ్రెస్ మహిళా నేతపై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: చెందిన కాంగ్రెస్ మహిళా నేతను ఉద్దేశించి ఆన్లైన్లో మార్ఫింగ్ వీడియోలతో అనుచిత పోస్టులు చేసిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాచిగూడకు చెందిన ఓ స్టాఫ్ట్వేర్ ఉద్యోగి (30) ఇన్స్ట్రాగామ్లో నకిలీ ఖాతా సృష్టించాడు. గతేడాది అక్టోబర్లో ‘పూరా లోకల్’ పేరుతో ఉన్న ఆ ఖాతా ద్వారా నగరానికి చెందిన ఓ మహిళా నాయకురాలి వీడియోను మార్ఫింగ్ చేసి పోస్టు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని అరెస్టు చేశారు. -
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కోసం గాలింపు
హైదరాబాద్: హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేయగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. గత నెల 30న జూబ్లీహిల్స్ లోని తన కార్యాలయానికి సుమంత్ సహచరులు రాము డబ్బు వ్యవహారంలో మాట్లాడేందుకు చెంగిచెర్ల కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ ని పిలిపించారు. అక్కడే ఉన్న సుమంత్ ఆయన అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము తదితరులు ఇనుపరాడు తో తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితులు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న సుమంత్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ఆయన డ్రైవర్ నవీన్ ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
Ayodhya: శ్రావణ మాసంలో చేపల కూరా?
పవిత్రమైన శ్రావణ మాసంలో అందునా.. అయోధ్య నగరంలో చేపల వంటకాల భోజనాలు ఏర్పాటు చేయడంపై కొందరు సాధువులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాముడు కొలువై ఉన్నచోట ఇలాంటి పనులు చేయడం ఘోర పాపమేనని తిట్టిపోస్తున్నారు. అయితే కార్యక్రమ నిర్వాహకుడు మాత్రం వ్యక్తిగత ఆహార స్వేచ్ఛ, సంప్రదాయాల పేరుతో ఈ ఏర్పాటును సమర్థించారు.అయోధ్య రామ మందిర విరాళాల గోల్మాల్ వివాదం కొనసాగుతున్న వేళ.. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆదివారం అయోధ్యలో పర్యటించారు. తొలుత ఆయన శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గఢీ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తరుణ్ ప్రాంతంలో కాంగ్రెస్ నేత రామ్ నిహాల్ నిషాద్ ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అజయ్ రాయ్తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ రాజ్పాల్ గౌతమ్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అఖిలేశ్ ప్రతాప్ సింగ్, పూర్వాంచల్ ఇన్చార్జ్ అభిషేక్ దత్ తదితరులు హాజరయ్యారు.అయితే ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అతిథుల కోసం రకరకాల వంటకాలు సిద్ధం చేయించారు. అందులో.. చేపల వంటకాలు స్పెషల్కాగా.. అదే వివాదానికి దారి తీసింది.వీడియోతో మొదలైన వివాదంకార్యక్రమ వేదిక వద్ద చేపలు వండుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలు కొందరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. భారీ వర్షం పడుతున్న సమయంలోనే అక్కడ చేపలను తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయోధ్యలో చేపల కూర వడ్డింపుపై కొందరు స్థానిక సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రావణ మాసంలో అయోధ్య వంటి పవిత్ర ప్రాంతంలో చేపల విందు ఏర్పాటు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీస్తుందని వారు పేర్కొన్నారు.A Major Controversy at a Congress Event in AyodhyaA fish feast is allegedly being prepared in Ayodhya for the welcome of Uttar Pradesh Congress President Ajay Rai.Ajay Rai is scheduled to visit Arpit Lawn near the Hanuman Garhi temple, where fish is reportedly being prepared… pic.twitter.com/nY5K2SkTcy— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) August 23, 2026ఏం తినాలో మీరే చెప్తారా?అయితే కార్యక్రమ నిర్వాహకుడు రామ్ నిహాల్ నిషాద్ ఈ విమర్శలను తోసిపుచ్చారు. రాజ్యాంగం ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన ఆహారం తీసుకునే హక్కును కల్పించిందని అన్నారు. సమాజంలో చేపల వేట, చేపలు తినడం సంప్రదాయంలో భాగమని పేర్కొన్న ఆయన.. శ్రావణం, భాద్రపదం వంటి నెలల పేరుతో వ్యక్తుల ఆహార అలవాట్లను ప్రశ్నించకూడదని వ్యాఖ్యానించారు.రాజకీయ దుమారంతన అయోధ్య పర్యటనలో చెలరేగిన ఈ దుమారంపై అజయ్ రాయ్ స్పందించారు. దేశంలో అణచివేత, అన్యాయం కొనసాగుతోందని యూపీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రామాలయంలో సమర్పించిన కానుకల విషయంలోనూ ఆయన ఆరోపణలు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని జైలుకు పంపాలని హనుమంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అయితే అయోధ్యలో చేపల విందు వివాదం ప్రస్తుతం ఆహార స్వేచ్ఛ, మత విశ్వాసాలు, రాజకీయ విమర్శల చుట్టూ కొత్త చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: అతను సీఎం పదవికి అన్నివిధాల అర్హుడు! -
రూ.40 లక్షల జీతం.. ఆ సంబంధం వద్దన్నా
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభిమానినని చెప్పుకున్న యువకునికి అమ్మాయి నుంచి తిరస్కారం ఎదురైంది. అతడు నెలకు రూ.40 లక్షలు సంపాదిస్తున్నా కూడా పెళ్లికి ససేమిరా అంది. బెంగళూరులో ఆరూహి రెడ్డి అనే అమ్మాయి వివరాలను ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఆమెకు ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉన్నారు, ఇటీవల ఓ సంబంధం తీసుకువచ్చారు. యువకుడు అందగాడు, నెలకు రూ.40 లక్షలు సంపాదిస్తాడు, మంచి కుటుంబమని బంధువులు తెలిపారు. అయితే ఆ అబ్బాయి అతని ప్రొఫైల్లో రాహుల్గాంధీ అభిమానినని రాసుకున్నాడు. ఇది చూసిన ఆరూహిరెడ్డి ఈ ఒక్క కారణంతో మూడుముళ్ల బంధానికి నిరాకరించినట్టు తెలిపింది. వరుసగా అపజయాలు మూటగట్టుకుంటున్న రాహుల్గాం«దీని రోల్ మోడల్గా చెప్పుకునే వ్యక్తి ఐక్యూ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని పలు తీవ్ర విమర్శలు చేసింది. నీలాంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోలేనని, అందం,అంతస్తు, డబ్బు కంటే దేశభక్తి, మతం మీద ప్రేమ, భక్తి ఉండడం ఎంతో అవసరమని తేల్చిచెప్పింది. ఈ పోస్టుతో నెటిజన్లు కొందరు ఆరూహిరెడ్డిని అభినందిస్తుంటే మరికొందరు దూషిస్తున్నారు. -
ఖర్గేను కలిసిన సురేఖ.. నేడు రేవంత్ ప్రెస్మీట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొనసాగుతున్న కొండా కుటుంబ వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ నిన్న బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆమె రాత్రి 8.45 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.బెంగళూరులో ఖర్గేతో భేటీ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను మంత్రి సురేఖ.. ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిన తర్వాత అన్ని విషయాలను ఆయనతో మాట్లాడతానని కొండా సురేఖ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే, ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్గౌడ్లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్పై పీసీసీ చీఫ్ రియాక్షన్ఇదిలా ఉండగా, లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రాకతో కొండా కుటుంబ వ్యవహారంపై తదుపరి పరిణామాలపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ సీఎంను కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉందని, ఈ వ్యవహారంపై పార్టీ పరంగా కీలక నిర్ణయం వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికా పర్యటన రద్దు కావడానికి గల కారణాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కారణంగానే తన పర్యటన రద్దయిందన్న అంశంపై కూడా సీఎం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్ దగాపై సమరభేరి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సమరభేరికి సిద్ధమైంది. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, వంద రోజుల్లో వాటిని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ వేయి రోజులు పూర్తయినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. బాకీ కార్డులతో హామీల వైఫల్యం రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువత తదితర వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ‘బాకీ కార్డుల’రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. ఆయా వర్గాలకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పేరుకుపోయిన బకాయిల వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కేవలం హామీలు అమలు కాలేదనే అంశానికే పరిమితం కాకుండా, 1,000 రోజుల పాలనలో ప్రభుత్వం వివిధ రంగాల్లో ఎదుర్కొన్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామాలు, వార్డు స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను వివరించాలని పిలుపునిచ్చారు. కొత్త తరానికి చేరువయ్యేలా సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించి వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, మాజీ ప్రజాప్రతినిధులు సహా అన్ని స్థాయిల నాయకులు వారం రోజుల కార్యక్రమాల్లో పాల్గొని వాటిని విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు. -
మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరింది. ఆదివా రం మధ్యాహ్నం ఆమె బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. దాదాపు 15 నిమిషాలపాటు ఇద్దరి భేటీ జరిగిందని సమాచారం. అయితే బెంగళూరుకు వెళ్లి ఖర్గేను కలిసిన విషయంలో మంత్రి సురేఖ గోప్యత పాటించడం.. సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్న ముందు రోజే ఆమె ఏఐసీసీ అధ్యక్షుడితో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అన్ని విషయాలపై వివరణ ఖర్గేను కలిసిన సందర్భంగా మంత్రి సురేఖ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై మాట్లాడినట్టు తెలిసింది. ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్గౌడ్లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం. బీజేపీ చీఫ్ రాంచందర్రావుకు తారసపడిన సురేఖ మంత్రి కొండా సురేఖ బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురూ పలకరించుకున్నారని, ఆ సమయంలోనే బెంగళూరు నుంచి వస్తున్నానని సురేఖ వెల్లడించారని సమాచారం. -
కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ఆలిండియా ఓబీసీ సంఘం మద్దతు ప్రకటించింది కొండా సురేఖకు అండగా ఉంటామని స్పష్టం చేసింది. కొండా సురేఖ బీసీ మంత్రి కాబట్టే కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని ఓబీసీ సంఘం విమర్శించింది. కొండా సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా నోటీసులిచ్చారని మండిపడింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, చిన్నారెడ్డిలు వ్యతిరేకంగా మాట్లాడినా నోటీసులు ఇవ్వలేదని, అదే కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన దానికి మాత్రం నోటీసులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి కొండా సురేఖకు అన్యాయం జరిగితే మాత్రం రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది. కాంగ్రెస్లో కొందరు చెంచాలున్నారని, అందుకే ఈ తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని దుయ్యబట్టింది. కొండా సురేఖ రెండో లేఖపై సమీక్షిస్తాంకావాలనే కొందరు తనను టార్గెట్ చేశరని, కుమార్తె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా కావాలనే కొంతమంది నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ మరో లేఖ రాసింది. దీనిపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందిస్తూ.. కొండా సురేఖ రెండో లేఖపై సమీక్షిస్తామన్నారు. తెరవెనుక ఎవరున్నారనేది చెప్పాల్సిన అవసరం లేదని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్పై టీపీసీసీ చీఫ్ రియాక్షన్కొండా సురేఖ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. చర్యలకు కాంగ్రెస్ సిద్ధం -
నేడు రేవంత్ రాక.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్పై బిగ్ సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సీరియల్ ఎపిసోడ్లా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్టాపిక్గా మారింది. సొంత పార్టీ నేతలే తనపై విమర్శలు చేస్తున్నా పార్టీ అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖాస్త్రం సంధించడం చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ, కొండా మురళి వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణ కమిటీ మరోసారి ఈ అంశాన్ని చర్చించనుంది. తదుపరి సమావేశంలో కొండా వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.మరోసారి లేఖాస్త్రం..తనపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేస్తున్న తనపై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనపై వస్తున్న విమర్శల విషయంలో పార్టీ నాయకత్వం స్పందించాలని ఆమె కోరినట్లు సమాచారం.ఇది కూడా చదవండి: కొండా సురేఖపై చర్యలు.. కాంగ్రెస్లో తర్జనభర్జనకొండాపై గరం..మరోవైపు కొండా కుటుంబం తీరుపై కాంగ్రెస్లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు కొండా కుటుంబం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు మరో అడుగు ముందుకేసి పార్టీ నుంచి బయటకు వెళ్లాలని అల్టిమేటం ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వివాదం వ్యక్తిగత విమర్శల స్థాయి దాటి పార్టీ అంతర్గత క్రమశిక్షణ అంశంగా మారింది.సీఎం రాగానే కీలక పరిణామాలు?ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉండగా.. నేడు రాత్రి ఆయన హైదరాబాద్కు తిరిగి రానున్నారు. సీఎం రాకతో కొండా వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో.. సీఎం సమక్షంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూపులు.. ఇంకోవైపు మంత్రి కొండా సురేఖ వరుస లేఖలు.. ఇలా కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతోంది. క్షమాపణ చెబుతారా? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. సీఎం హైదరాబాద్కు తిరిగొచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. -
ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించండి..
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలపై తెలంగాణ ఉద్యోగ జేఏసీ (టీఈజేఏసీ) రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులకు నోటీసులను సమర్పించింది. ఈనెల 27లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు, నిరసనలకు దిగుతామని ఇటీవల విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, జేఏసీ ప్రతినిధులు ఆందోళనలకు సంబంధించిన నోటీసులు సమర్పించారు. వాటి పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను కూడా అందులో ప్రస్తావించారు. ఆందోళనలపై తగ్గేదే లేదు... ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఈసారి వెనక్కు తగ్గేది లేదని టీఈజేఏసీ స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఉద్యోగులంతా ముక్తకంఠంతో ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో జేఏసీ సైతం వెనక్కు తగ్గొద్దని, ప్రభుత్వంతో చర్చలు జరిపేది లేదని, సమస్యల పరిష్కారం అయినప్పుడే నిరసనలకు బ్రేక్ పడుతుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ముందుగా నల్లబ్యాడ్జీలతో నిరసనలు, ఆ తర్వాత క్రమంగా ఆందోళనలను తీవ్రతరం చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా కాకుండా ఐక్యంగా ఉద్యమించాలని నిర్ణయించిన టీఈజేఏసీ... ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమాలు ఇలా... –ఈ నెల 27న అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక రోజు మహాధర్నా నిర్వహించనుంది. –ఈ నెల 27నుంచి పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించే వరకు ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కానున్నారు. –టీఈజేఏసీ జిల్లాల్లో పర్యటించనుంది. ఉద్యోగులు చేపట్టే ఆందోళనలకు సంబంధించిన అంశాలతో సన్నాహక సదస్సులు నిర్వహించనుంది. –సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించింది. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్తో సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. –సెప్టెంబర్ 10న ఉద్యోగుల చలో హైదరాబాద్ నిర్వహించనుంది. అనంతరం ఉద్యోగులతో హైదరాబాద్లో మహా ధర్నా నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది. డిమాండ్లు ఇవీ... –ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను సమర్థవంతంగా అమలు చేయాలి. –ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు, ఆరోగ్య కార్డుల వినియోగంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. –పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని ఫిట్మెంట్ను ప్రకటించి అమలు చేయాలి. –ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 6 డీఏలను ఏకకాలంలో విడుదల చేయాలి. –ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తున్న రూ.2వేల ప్యాకేజీని బకాయిలు పూర్తయ్యే వరకు ప్రతినెలా కొనసాగించాలి. –సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. –ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించాలి. –317 జీఓ బాధితులకు న్యాయం చేయాలి. 190 జీఓను విద్యాశాఖ, పోలీసుశాఖతో పాటు అన్ని శాఖల్లో అమలు చేయాలి. -
ఓట్ల కోసం వందేమాతరానికి అవమానమా?
సాక్షి, న్యూఢిల్లీ: బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వందేమాతర గీతాన్ని అవమానిస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. వందేమాతరాన్ని రెండు చరణాలకే పరిమితం చేస్తూ ఆగస్టు 19న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయాన్ని ఖండించింది. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతనంగా ఏర్పాటైన జాతీయ పదాధికారుల తొలి సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో వందేమాతరం ప్రతిష్టను, చారిత్రక ప్రాముఖ్యతను పరిరక్షించేందుకు 10 అంశాలతో కూడిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. వందేమాతరం గేయ విశిష్టతను చాటేలా, దాని ప్రాముఖ్యతపై యువతలో అవగాహన పెంచేలా దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించింది. వందేమాతరాన్ని రెండు చరణాలకే పరిమితం చేస్తూ కాంగ్రెస్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం దశాబ్దాల క్రితం ఆ పార్టీ చేసిన చారిత్రక తప్పిదాలకు కొనసాగింపేనని పదాధికారుల భేటీ అభిప్రాయపడింది. మరోవైపు, వందేమాతరానికి గేయం గౌరవాన్ని పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేసిందని బీజేపీ వెల్లడించింది. ఇటీవల ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై పూర్తి వందేమాతరాన్ని ఆలపించారు. కానీ అదే రోజు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం పాడుతుండగా, రెండో చరణం తర్వాత ఆపేయాలని సోనియా గాంధీ సైగ చేసినట్లు బీజేపీ ఆరోపించింది. 1937 నాటి నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తూ రెండు చరణాలు మాత్రమే పాడే సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆగస్టు 19న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానించడాన్ని బీజేపీ విమర్శించింది. ముస్లిం లీగ్ లాంటి శక్తుల అభ్యంతరాలకు తలొగ్గిన నాటి మనస్తత్వమే కాంగ్రెస్లో నేటికీ ఉందని మండిపడింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా, జాతీయ గీత పరిరక్షణ కోసం పదాధికారుల సమావేశంలో బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 19న సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా ఖండిస్తూ, పూర్తి వందేమాతరం గౌరవాన్ని పరిరక్షిస్తామని తీర్మానించింది. వందేమాతరం ఒక శక్తిమంతమైన సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదమని, శుద్ధమైన జాతీయ భావనకు ప్రతీక అని నాడు మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించింది. జాతీయ స్ఫూర్తిని రగిలించిన ఈ గీతాన్ని సంకుచిత రాజకీయాలకు వాడుకోవడాన్ని అడ్డుకుంటామని తీర్మానంలో స్పష్టం చేసింది. నూతన పదాధికారులతో ప్రధాని భేటీ న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికైన జాతీయ పదాధికారులతో ప్రధాని మోదీ శనివారం భేటీ అయ్యారు. కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథాల సమ్మేళనంగా పార్టీని మార్చేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా పదాధికారులను ఎంపిక చేసినట్లు వారితో మోదీ చెప్పారు. ‘‘సంస్థాగత సమావేశాలు అనేవి కొత్త ఆలోచనల సమ్మేళనంగా జరుగుతాయి. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు, ప్రజలతో మరింతగా మమేకమయ్యేందుకు కొత్త నాయకులు ఇచ్చే సలహాలు, సూచనలను వినేందుకు పార్టీ సమావేశాలు జరుగుతుంటాయి. పారీ్టలో కొత్త బాధ్యతలు భుజాలకెత్తుకున్న నూతన పదాధికారులతో భేటీ అద్భుతంగా సాగింది’’అని వాళ్లతో భేటీ తర్వాత ప్రధాని మోదీ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. -
ఏం చేస్తే.. ఏమవునో!
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా అటవీ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ కుటుంబమే కేంద్రంగా అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయం చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సృష్టించిన వ్యాఖ్యల కలకలం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో ఉంది. సురేఖను బర్తరఫ్ చేస్తారని, మంత్రి పదవి నుంచి తీసేస్తారని, ఇందుకు అధిష్టానంతో రేవంత్ సంప్రదింపులు జరుపుతున్నారని, లేదంటే ఆమెతో రాజీనామా చేయిస్తారని సీఎం వర్గం ప్రచారం చేస్తున్నా... అసలు ఏం చేయాలనే విషయంలో మాత్రం అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వం తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. బీసీ వర్గాలకు చెందిన మహిళా మంత్రి కావడం, ఇదే సమయంలో మరికొందరు ముఖ్య నేతలు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందోననే చర్చ జరుగుతోంది. రేవంత్ విదేశీ పర్యటనలో ఉండగా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చే నెల 2 వరకు అందుబాటులో ఉండరన్న ఢిల్లీ వర్గాల సమాచారం నేపథ్యంలో ఈ ఎపిసోడ్ మరికొన్ని రోజులు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం వర్గం అప్రమత్తం సీఎం రేవంత్రెడ్డి సన్నిహితులైన ఎమ్మెల్యేలు, నేతలు కొండా ఎపిసోడ్లో తమ వంతు పావులు కదుపుతున్నారు. రేవంత్ సన్నిహితుడైన ఎంపీ వేం నరేందర్రెడ్డి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కుటుంబ ఎపిసోడ్ను ఎలా ముగించాలన్న దానిపైనే ఎక్కువగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఆమెను తప్పించేలా అధిష్టానాన్ని ఒప్పించాలా లేదంటే ఆమెతో రాజీనామా చేయించాలా లేదా మరో మార్గంలో అంతర్గతంగా ఏదైనా సర్దుబాటు చేయాలా అనే కోణంలోనే ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే, రేవంత్ ఆదివారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్కు రానుండటంతో ఆయన వచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్లో ఎలాంటి సంకేతాలిస్తారన్నది కీలకంగా మారనుంది. ఆయన్ను కలిసి మాట్లాడతానని సురేఖ చెప్పిన నేపథ్యంలో ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తారా లేదంటే అధిష్టానం పెద్దలతో మాట్లాడతారా? తనకు బహిరంగంగా మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యేలకు ఆయన ఏం చెప్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేవంత్కు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. సురేఖతో పాటు రాజగోపాల్రెడ్డి, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుపడుతున్నారు. కానీ, రేవంత్ కేబినెట్ సహచరులెవరూ ఇప్పటివరకు బహిరంగంగా ఈ అంశంపై మాట్లాడకపోవడం రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అన్నీ పరిశీలించాకే తుది నిర్ణయం: క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ శనివారం గాం«దీభవన్లో సమావేశమైంది. చైర్మన్ మల్లురవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులు శ్యాంమోహన్ తదితరులు పాల్గొని కమిటీ ముందు పెండింగ్లో ఉన్న పలు అంశాలపై చర్చించారు. రేవంత్నుద్దేశించి సుస్మితా పటేల్ మాట్లాడిన వీడియోను పరిశీలించారు. వనపర్తి నియోజకవర్గం విషయంలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మాట్లాడిన వీడియోలను కూడా పరి«శీలించారు. అనంతరం మల్లురవి మీడియాతో మాట్లాడుతూ.. తమ నోటీసుకు సురేఖ ఇచ్చిన సమాధానాన్ని, సుస్మిత మాట్లాడిన వీడియోను కమిటీ పరిశీలించిందని చెప్పారు. ‘ముఖ్యమంత్రిని ఒక మామూలు వ్యక్తి కంటే తక్కువగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఈ వీడియోలో కనపడుతోంది. సురేఖ ఇచ్చిన వివరణ చదివిన తర్వాత మరోమారు సమావేశమై పరిశీలించాం. ఎమ్మెల్యేలు కూడా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు ఇస్తామని చెప్పారు. కాబట్టి తుది నిర్ణయం తీసుకోకుండా, అందరి ఫిర్యాదులు స్వీకరించి వాటిపై కమిటీలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సీఎం గురించి ఎవరు మాట్లాడినా ఖండించాల్సిన బాధ్యత సురేఖపై ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఆమె మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది’అని వెల్లడించారు. వనపర్తి విషయంలో కూడా ఇద్దరు నేతలు మాట్లాడిన మాటలను కూడా పరిశీలించామన్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు, ఎమ్మెల్యే ఫిర్యాదుకు తేడా ఉందని, మరోమారు ఎమ్మెల్యేను పిలిచి వివరణ తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్లో జరిగిన పీఏసీ సమావేశం ఘటన గురించి కంది శ్రీనివాస్రెడ్డి వివరణ ఇచ్చారని, డీసీసీ అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎల్బీనగర్ నేత జక్కిడి ప్రభాకర్రెడ్డి సస్పెన్షన్ గురించి తప్పనిసరి పరిస్థితుల్లోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో వచ్చిన ఫిర్యాదులపై షోకాజ్ ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మాకు ఎవరిపై ప్రేమ ఉండదు... తమకు పార్టీ నేతలెవరిపై వ్యక్తిగతంగా ప్రేమ, వ్యతిరేకత ఉండవని మల్లురవి స్పష్టం చేశారు. ‘మేం తీసుకునే ప్రతి చర్య కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు దిశలోనే ఉంటుంది. పార్టీకి నష్టం జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ , కేబినెట్ హోదాలో ఉన్న చిన్నారెడ్డిలకు నోటీసులిచ్చాం. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రస్తావన ఎమ్మెల్యేల మాటల్లో వచ్చింది కానీ ఫిర్యాదు మా దగ్గరకు రాలేదు. రాజగోపాల్రెడ్డి మాట్లాడింది నాకు తెలియంది కాదు కానీ పద్ధతి ప్రకారం నాకు ఫిర్యాదు రాలేదు. సుమోటోగా తీసుకోవాలా వద్దా అన్నది పరిశీలిస్తున్నాం. ఎవరైనా సరే క్రమశిక్షణ కమిటీ దృష్టిలో వ్యక్తులు ముఖ్యం కాదు. పార్టీనే ముఖ్యం. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా పార్టీ వల్లనే. పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా ఎవరూ మాట్లాడకూడదు’అని ఆయన స్పష్టం చేశారు. మరో లేఖ రాసిన సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ శనివారం మరో లేఖ రాశారు. ‘క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు నేను వివరణ ఇచ్చాను. అయినా కొందరు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా అవమానించేలా మాట్లాడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే నాపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, నాపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలి. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది’అని లేఖలో పేర్కొన్నారు. పార్టీ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సురేఖ కోరడం కొసమెరుపు. చిన్నారెడ్డి వివరణ వనపర్తి ఎమ్మెల్యే కారణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న అంశాలను మాత్రమే తాను గోపాల్పేట సమావేశంలో ప్రస్తావించానే తప్ప ఎవరినీ కించపర్చలేదని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీకి నివేదించారు. కాంగ్రెస్ పార్టీ దేవాలయమని, నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గేలు తనకు దేవుళ్ల లాంటి వారని, తాను పార్టీని, పార్టీ నాయకులను ఎక్కడా విమర్శించలేదని పేర్కొన్నారు, ఎమ్మెల్యే ఒంటెత్తుపోకడలతో 40 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలు పడుతున్న బాధలనే ప్రస్తావించానని అన్నారు, తనకు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలని కోరారు. -
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసుకు చిన్నారెడ్డి సమాధానం ఇదే..
హైదరాబాద్: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తనకు ఇచ్చిన నోటీసుకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సమాధానం ఇచ్చారు. ఆగస్టు 16న చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.‘‘ఏఐసీసీ, టీపీసీసీ కార్యాలయాలను పవిత్ర దేవాలయాలుగా భావించాను. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గే నాకు దేవుళ్లతో సమానం. అలాంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రశ్నే లేదు, అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఈ రెండేళ్ల 8 నెలల్లో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అనుభవిస్తున్న బాధలు చెప్పాను. 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న నాయకుల మనోభావాలను వ్యక్త పరిచాను. ఎవరిపైనా అనుచిత వాఖ్యలు చేయలేదు. నాకు ఆ అలవాటు, అవసరం లేదు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించి ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని చిన్నారెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: ‘సీఎం రేవంత్ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు’ -
సీజేపీ ఎఫెక్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి!
కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఉద్యమంతో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులపై కొత్త చర్చ మొదలైంది. స్కూల్ ఠీక్ కరో పేరిట చేపట్టిన ఆ కార్యక్రమం.. నిన్న రాజస్థాన్లో తీవ్ర దుమారం రేపింది. జైపూర్ శివారులోని బాగ్రు గ్రామానికి వెళ్లిన ఆ బృందంపై దాడి జరిగింది. ఇది బీజేపీ చేయించిన పనేనని సీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. తమపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డెడ్లైన్ కూడా విధించింది. ఈలోపు.. అక్కడి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీజేపీ తనిఖీ ఎఫెక్ట్ ఇప్పుడు అక్కడ రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు రాష్ట్ర విద్యా వ్యవస్థలోని లోపాలను బయటపెట్టాయి. రాష్ట్రంలోని వందల ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవని ప్రభుత్వం స్వయంగా అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే బాగ్రు స్కూల్ గురించి కూడా ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. అక్కడి ప్రభుత్వ పాఠశాల భవనం ప్రమాదకరంగా మారడంతో గతంలో అధికారులు దానిని వినియోగానికి అనర్హంగా ప్రకటించారట. దీంతో విద్యార్థులను తాత్కాలిక ఏర్పాట్లలోకి తరలించారు. అయితే తరగతులు పశువుల కొట్టం తరహా ప్రదేశంలో కొనసాగుతున్నాయన్న ఆరోపణలతోనే CJP బృందం అక్కడికి వెళ్లింది. ఈ ఘటన తర్వాతే సంచలన విషయాలు బయటపడ్డాయి. సమగ్ర శిక్షా అభియాన్ కింద యూడీఐఎస్ఈ (UDISE) 2025–26 గణాంకాల ప్రకారం.. రాజస్థాన్లో 611 ప్రభుత్వ పాఠశాలలు సొంత భవనాలు లేకుండా కొనసాగుతున్నాయి. అందునా.. రాజధాని జైపూర్లోనే 38 పాఠశాలలకు భవనాలు లేవు. జలావర్ జిల్లాలోని అక్లేరా బ్లాక్లో అత్యధికంగా 23 పాఠశాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఖాన్పూర్లో 16, ఝల్రాపటన్లో 11 పాఠశాలలు భవనాల కోసం ఎదురుచూస్తున్నాయి. మొత్తం బడులలో.. 10 బాలికల పాఠశాలలకు భవనాలు లేవని తేలింది. భవనాలు ఉన్నా.. సదుపాయాల కొరతకేవలం భవనాల కొరత మాత్రమే కాకుండా.. ఉన్న పాఠశాలల్లోనూ మౌలిక వసతుల లోపాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని 64,484 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ.. 2,047 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. మరో 1,049 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో బన్స్వారా జిల్లా ముందంజలో ఉంది. అక్కడ 188 పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యం లేదు. దుంగర్పూర్లో 124, ఉదయ్పూర్లో 98 పాఠశాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. తాగునీటి సౌకర్యం లేని పాఠశాలలు దౌసా జిల్లాలో అత్యధికంగా 96 ఉన్నాయి.దిద్దుబాటు చర్యలుపాఠశాలల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మరమ్మతులు, పునరుద్ధరణ కోసం రూ.550 కోట్లు, భవనాలు లేని లేదంటే శిథిలావస్థలో ఉన్న పాఠశాలల నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా వివిధ పథకాల ద్వారా వచ్చే ఐదేళ్లలో పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.12,500 కోట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.బీజేపీ సర్కార్పై ఆగ్రహంభజన్లాల్ శర్మ సర్కార్పై ప్రతిపక్షం మండిపడుతోంది. వివరాలు దాస్తూ ప్రభుత్వం నీళ్లు నములుతోందని మండిపడింది. ఆడిట్ వివరాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేత టీకారామ్ జూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల పరిస్థితిపై సర్కార్కు స్పష్టమైన కార్యాచరణ లేదని విమర్శించారు. రాష్ట్రంలో 3,768 ప్రభుత్వ పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని, 83,783 తరగతి గదులు వినియోగానికి అనర్హంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల పరిస్థితి కారణంగా కొన్ని చోట్ల తరగతులు నిలిపివేయాల్సి వచ్చిందని, విద్యార్థుల చేరికలపై ప్రభావం పడుతోందని ఆరోపించారు.అయితే ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భద్రత, పాఠశాలల ప్రమాణాల మెరుగుదల తమ ప్రాధాన్య అంశాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారం CJP తనిఖీల ఘటన నేపథ్యంలో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్ తనిఖీలపై సర్కారీ ఆంక్షలుఇంతేకాదు.. కొద్ది రోజుల ముందే రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఓ ఉత్తర్వు కూడా చర్చకు దారితీసింది. ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. పాఠశాలలను సందర్శించాలంటే ప్రధానోపాధ్యాయుడి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా పాఠశాల ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా రాతపూర్వక అనుమతి అవసరమని స్పష్టం చేసింది.విద్యార్థుల భద్రత, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. అనుమతి లేకుండా ఎవరూ పాఠశాలల్లోకి ప్రవేశించకుండా, అనధికారిక చిత్రీకరణను నియంత్రించేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే ఈ ఉత్తర్వులపై ప్రతిపక్షాలు, విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సీజేపీ తనిఖీల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు ఆగమేఘాల మీద తీసుకొచ్చారని మండిపడ్డారు. పాఠశాలల వాస్తవ పరిస్థితులను పరిశీలించే అవకాశం తగ్గించేలా ఈ ఆదేశాలు ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే CJP ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం, బాగ్రు ఘటన, ఆ తర్వాత బయటపడిన 611 పాఠశాలల గణాంకాలు మరింత చర్చకు దారితీశాయి. దీంతో వివాదాస్పద ఉత్తర్వులను సైతం ప్రభుత్వం వెనక్కి తీసుకునే నిర్ణయంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ మీటింగ్.. కొట్టుకున్న స్టూడెంట్ యూనియన్లు -
పండుగల వేళ ‘షుగర్’ షాక్.. కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: పండుగల సీజన్ మొదలు కాకముందే దేశంలో చక్కెర ధరలు పెరుగుతుండటంపై రాజకీయ దుమారం రేగుతోంది. పెరుగుతున్న ధరలు, తక్కువగా ఉన్న చక్కెర నిల్వలు, ఇథనాల్ ఉత్పత్తి విధానాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అదే సమయంలో దేశంలో చక్కెర కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.చక్కెర నిల్వలు తగ్గడం, ధరలు పెరగడం, ఇథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లించడం వంటి అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించింది. కేంద్రం చెబుతున్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు ప్రస్తుత పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయని ప్రశ్నించింది. ముఖ్యంగా పండుగల సీజన్కు ముందు ధరలు పెరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రతిపక్షం నిలదీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. పండుగల సీజన్ ప్రారంభానికి ముందే చక్కెర ధరలు పెరగడం, దేశంలో చక్కెర నిల్వలు తగ్గిపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ విధానాల చేదు.. చక్కెర తీపిలోకి కూడా చేరింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకును మళ్లించడం వల్ల చక్కెర ఉత్పత్తి, నిల్వలు ప్రభావితమయ్యాయా? దేశంలో చక్కెర నిల్వలు తొమ్మిదేళ్ల కనిష్ఠానికి చేరాయా? ధరలు పెరుగుతున్న వేళ చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇదేనా ఆత్మనిర్భర్ భారత్? అంటూ కేంద్ర విధానాలపై విమర్శలు గుప్పించారు.ఇది కూడా చదవండి: రేవంత్ ఒక్కడే కాదు.. కేంద్రం ‘నో’ చెప్పిన సీఎంలు వీరే!అయితే ఖర్గే ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కారణం కాదని స్పష్టం చేసింది. 2022-23లో ఇథనాల్కు మళ్లించిన చక్కెర వాటా సుమారు 12 శాతం ఉండగా.. 2025-26లో అది దాదాపు 9 శాతానికి తగ్గిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల పెరుగుదలకు తక్కువ దేశీయ ఉత్పత్తి, వాతావరణ ప్రభావం, పండుగల డిమాండ్, ఊహాజనిత ట్రేడింగ్, నిల్వ దాచడం వంటి కారణాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్రం అక్టోబర్ 31 వరకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. అలాగే హోర్డింగ్ను అరికట్టేందుకు స్టాక్ పరిమితులను కూడా కఠినతరం చేసింది. మొత్తానికి పండుగల వేళ చక్కెర ధరలు పెరగడం, దేశీయ నిల్వలు, ఇథనాల్ ఉత్పత్తి, దిగుమతులు.. ఈ నాలుగు అంశాలు ఇప్పుడు కేంద్రం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. పండుగల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో చక్కెర ధరలు ఎలా ఉంటాయన్నదే వినియోగదారుల్లో ఆసక్తిని రేపుతోంది. -
చిట్టక్క పంచాయితీ.. కొండా మురళి రియాక్షన్పై ఉత్కంఠ
సాక్షి, వరంగల్: తెలంగాణ కాంగ్రెస్లో కొండా కుటుంబం చుట్టూ నెలకొన్న వివాదం మరింత వేడెక్కుతోంది. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గాంధీభవన్లో ప్రెస్మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో అసంతృప్తిని ఒక్కసారిగా బయటపెట్టేశాయి. ఈ క్రమంలో కొండా దంపతుల స్పందనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ అలియాస్ చిట్టక్క చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపాయి. పరకాలకు కాబోయే ఎమ్మెల్యే తానేనంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, ఆపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా పార్టీ నేతలపై ఆమె చేసిన విమర్శలపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూతురి వ్యాఖ్యలను ఖండించకుండా.. ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూ కొండా సురేఖ ఇచ్చిన నామమాత్రపు వివరణపైనా భగ్గుమన్నారు. ప్రతిపక్షాలకు సహకరించేలా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. కొండా ఫ్యామిలీ తక్షణమే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలని.. లేని పక్షంలో అధిష్టానమే క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద గెంటేయాలని డిమాండ్ చేశారు.చర్యలపై ఉత్కంఠఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. వివాదం ముదిరుతున్నా.. ఇప్పటివరకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా స్పందించకపోవడం కూడా చర్చకు దారితీసింది. మంత్రులు సైతం ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అమెరికా పర్యటన రద్దుతో సీఎం రేవంత్ రేపు తిరిగి హైదరాబాద్ రానున్నారు. వచ్చిరాగానే అత్యవసరంగా ఆయన ఈ అంశంపై చర్చలు జరుపుతారని సమాచారం. ఈ క్రమంలో హైకమాండ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతుందా? లేదంటే చర్యలకు దిగుతుందా? అనే అంశం ఉత్కంఠగా మారింది.టికెట్ దక్కలేదనే అలా..ఇదిలా ఉండగా.. తన వ్యాఖ్యలపై సుస్మిత కాస్త టోన్ మార్చింది. తన తండ్రికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం వల్లే తాను ముఖ్యమంత్రిపై విమర్శలు చేశానని పేర్కొంది. వ్యక్తిగత అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆమె వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.నేడు కొండా మురళి స్పందించే అవకాశంఈ వివాదంపై కొండా కుటుంబం వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు మౌనం పాటించిన కొండా సురేఖ భర్త కొండా మురళీధర్రావు నేడు(శనివారం) మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన స్పందనతో ఈ వివాదంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.మొత్తంగా.. వరంగల్ కాంగ్రెస్లో మొదలైన ఈ అంతర్గత కలకలం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అధిష్ఠానం నిర్ణయం, కొండా కుటుంబ స్పందనపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.ఇదీ చదవండి: నా టార్గెట్ ఆయనే.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్య -
సీఎం ‘విదేశీ’ అనుమతులపై కాంగ్రెస్ది అనవసర రాజకీయం
సాక్షి, హైదరాబాద్: సీఎం అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు హితవు పలికారు. ఈ పర్యటన నిరాకరణ వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టంచేశారు. సీఎం ప్రతినిధి బృందానికి పెట్టుబడుల సమావేశాలకు వెళ్లేందుకు అనుమతులిచ్చినా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్రావు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా సీఎంలు లేదా మంత్రులు విదేశీ పర్యటనలకు అధికారిక ఆవశ్యకత, ఆహ్వానించిన సంస్థల నేపథ్యం, హాజరయ్యే వ్యక్తుల స్థాయి, అంతర్జాతీయ ప్రొటోకాల్, డిప్లొమాటిక్ అంశాలు, భద్రతా ఏర్పాట్లు, ఎఫ్సీఆర్ఏ నిబంధనలు తదితర కీలక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని వివరించారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నపుడు అమెరికా వీసా రాకుండా కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు లేఖలు రాశారని రాంచందర్రావు గుర్తుచేశారు. రేవంత్ పెట్టిన అప్లికేషన్లో ఎక్కడో లోపాలు ఉండి ఉంటాయన్నారు. బీజేపీలో చేరిన ప్రముఖ కేన్సర్ నిపుణుడు, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్, కేన్సర్ రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుడు విజయేందర్, ఎల్బీ నగర్ మేఘనా హాస్పిటల్ చైర్మన్ ప్రమోద్, ఇతర వైద్యులను రాంచందర్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నీట్ ద్వారా ప్రవేశాలు పొందిన ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేయడాన్ని ఖండించారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జోక్యం చేసుకుని విద్యార్థులకు ఫీజులు రీఫండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే
-
కొండా సురేఖ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. చర్యలకు కాంగ్రెస్ సిద్ధం
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సురేఖపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. మరోసారి నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోంది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా నేతలు నిన్న తీర్మానం చేశారు. కొండా సురేఖను భర్తరఫ్ చేయాలని శుక్రవారం సీఎం, పీసీసీ, హైకమాండ్కు 20 మంది ఎమ్మెల్యే లు లేఖ రాశారు. మరోసారి నోటీసులు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ సిద్ధమైంది.ఇప్పటికే కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఓ సారి నోటీసులు జారీ చేసింది. ఆమె కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పింది. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి.తాను త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని కొండా సురేఖ అంటున్నారు. పార్టీపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, రేవంత్ రెడ్డిపైనే తాను టార్గెట్ చేశానని కొండా సుస్మిత తెలిపారు. టికెట్ ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరని సుస్మిత ప్రశ్నించారు.ఇదీ చదవండి: మాట్లాడతా అన్ని విషయాలూ చెబుతా: కొండా సురేఖ -
‘సురేఖ.. సుస్మిత వ్యాఖ్యలను ఖండించాలి కదా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత రాజకీయం మరోసారి వేడెక్కింది. సీఎం రేవంత్రెడ్డిని టార్గెట్ చేస్తూ సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలపై ప్రభుత్వ విప్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లో కొత్త వివాదానికి దారితీశాయని వారు మండిపడ్డారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించాలని, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు.సీఎల్పీలో ప్రభుత్వ విప్లు బల్మూరి వెంకట్, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కొండా సుస్మిత వ్యాఖ్యలపై నేతలు ఘాటుగా స్పందించారు. ‘సీఎంను టార్గెట్ చేయడం క్రమశిక్షణా రాహిత్యమే’ అని వ్యాఖ్యానించారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఖండించాలని, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటున్నప్పుడు.. కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డిపై ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరుతున్నామని వారు తెలిపారు. సీఎం నిర్ణయాలను వ్యతిరేకించే వ్యక్తులు పార్టీలో అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు.. ఇలాంటి వారిని కేబినెట్లో ఉంచొద్దని సీఎంను కోరుతున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత విషయాలను పార్టీలోనే మాట్లాడుకోవచ్చని, కానీ కొండా సురేఖ కుటుంబం పదేపదే బహిరంగ విమర్శలు చేయడం సరికాదన్నారు. సీనియర్ ఎమ్మెల్యేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చివరగా మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు.. ఇదే సమయంలో తెలంగాణలో 22A భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని బల్మూరి వెంకట్ ఆరోపించారు. అధికారుల తప్పిదాలను సరిదిద్దుతున్నామని, పేదలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందకూడదనే ఉద్దేశంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. అలాగే, సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక కూడా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఉందని వెంకట్ ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. అయితే స్వపక్షంలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. -
గో బ్యాక్ సీజేపీ.. తరిమికొట్టిన గ్రామస్తులు!
కాక్రోచ్ జనతా పార్టీ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్ జైపూర్లో ఓ ప్రభుత్వ పాఠశాల పరిశీలనకు వెళ్లిన ఆ సంస్థ సభ్యుల్ని కొందరు అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పిడిగుద్దులతో తరిమి కొట్టారు. వాహనంలో వెళ్తున్న సమయంలో రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది.సీజేపీ దేశవ్యాప్తంగా స్కూల్ ఠీక్ కరో పేరిట ఓ ఉద్యమం నడుపుతోంది. ఇందులో భాగంగా.. జైపూర్ రాంపురా–కన్వర్పురా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితులను పరిశీలించేందుకు ఆ సంస్థ బృందం వెళ్లింది. గత కొంతకాలంగా ఆ స్కూల్లో పశువుల పాక నడుస్తోందన్నది సీజేపీ ప్రధాన ఆరోపణ. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల పరిస్థితి, బోధనా సౌకర్యాలను పరిశీలించాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టినట్లు పార్టీ తెలిపింది. ఈ కార్యక్రమంలో సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా కూడా పాల్గొనాల్సి ఉంది.Very satisfying face off 🤣🤣🤣Rajasthan showing the way. Dipke got taste in Jaipur and now Ranka and team again in Rajasthan 🔥🤲🏻 pic.twitter.com/37rDnrgPov— Lala (@FabulasGuy) August 21, 2026VIDEO | Jaipur, Rajasthan: Cockroach Janata Party (CJP) co-convenor Ashutosh Ranka and others chased away by locals as they tried to visit Bagru village. Shivangi Sharma, CJP worker, says, "They attacked our workers, saying we are terrorists, Naxals. What is this outsider...… https://t.co/MqgiMSCt8R pic.twitter.com/U3VjdVgrl4— Press Trust of India (@PTI_News) August 21, 2026🇮🇳 #Breaking: #Villagers reportedly chased #CJP protestors down and beat them, while their vehicles were also attacked and car windows were smashed during the confrontation in #Jaipur .The incident reportedly took place during a CJP team’s visit to a government #school .… pic.twitter.com/XyAY8uHGzV— pradhyumn sharma (@pradhyu78651514) August 21, 2026అయితే.. ఆ సమయంలో కొందరు వాళ్లను అడ్డుకుని దాడికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ పరిణామాలపై రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటనపై అశుతోష్ రాంకా స్పందిస్తూ.. తమను అడ్డుకున్న వారు గ్రామస్తులు కాదని, బీజేపీ పంపించిన వ్యక్తులని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. "బీజేపీ పంపించిన గూండాలు" అంటూ విమర్శలు చేశారు.#WATCH | Jaipur, Rajasthan: CJP National Spokesperson Ashutosh Ranka says, "The entire country saw BJP's hooliganism live today. Stone pelting was already happening there but the Police remained mute spectators. Police said that they won't do anything. This has been done at the… pic.twitter.com/pYPCh3UCOP— ANI (@ANI) August 21, 2026ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికే తాము తనిఖీలు చేపడుతున్నామని సీజేపీ నేతలు తెలిపారు. అయితే సమస్యలను బయటకు రానివ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. పాఠశాలల పరిస్థితిపై ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.అబ్బే జరిగింది అది కాదు: స్థానికులుఅయితే స్థానికుల్లో కొందరు మాత్రం సీజేపీ ఆరోపణలను ఖండించారు. పాఠశాలను కూల్చివేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానంతోనే తాము వ్యతిరేకించామని తెలిపారు. ‘‘వాళ్లు 250 మంది వచ్చారు. వాళ్లు చెబుతున్న దాంట్లో నిజం కూడా లేదు. ఆ పాఠశాలలో 20 నుంచి 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరమ్మతుల కోసం రూ. 12 లక్షల నిధులు కూడా మంజూరయ్యాయి. బీజేపీనో, కాంగ్రెస్సో, మరేయితర రాజకీయ పక్షమో ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు. మా ఊరి అంశాన్ని రాజకీయం చేయొద్దని మేం అనుకుంటున్నాం. వాళ్లు నిరసన పేరిట స్కూల్కు నష్టం కలిగిస్తే ఎలా? విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పాఠశాల రక్షణ కోసం నిలబడ్డాం’’ అని స్థానికులు పేర్కొన్నారు. అంతేకాదు.. తాము దాడి చేశామన్న దాంట్లో నిజం లేదని కూడా అంటుఉన్నారు.#WATCH | Jaipur, Rajasthan: A villager, Anu Sharma, says, "We opposed them because they are attempting to teardown this school...About 20-25 students come here to study. Where will they go?..We won't let them teardown the school. Funds (for repair) have already been… pic.twitter.com/kk86lCPUS4— ANI (@ANI) August 21, 2026స్కూల్ తనిఖీలపై సర్కారీ ఆంక్షలుఈ వివాదానికి కొద్ది రోజుల ముందే రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం.. ఓ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు బయటి వ్యక్తుల ప్రవేశంపై కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. పాఠశాలలను సందర్శించాలంటే ప్రధానోపాధ్యాయుడి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా రాతపూర్వక అనుమతి అవసరమని ఆదేశించింది. విద్యార్థుల భద్రత, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. అనధికారికంగా ఎవరూ పాఠశాల ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.ప్రతిపక్షాల విమర్శలుప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించింది. రాజస్థాన్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత టీకారామ్ జూల్లీ.. ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించకుండా అడ్డుకునేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చారని ఆరోపించారు. ఆదేశాలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఇదీ చదవండి: మంత్రుల కుక్కలకు మెరుగైన వసతులున్నాయి! -
సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు.. కారణం అదేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ఈ నెల 24 నుంచి 29 వరకు అమెరికాలో పర్యటించేందుకు సీఎం షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రేవంత్రెడ్డి ఈ నెల 23న హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఆ తర్వాత 24 నుంచి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో అమెరికాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పెట్టుబడులు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది.అయితే, చివరి నిమిషంలో విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి నిరాకరణ రావడంతో అమెరికా పర్యటనకు బ్రేక్ పడింది. దీంతో సీఎం పర్యటన రద్దు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే లండన్ పర్యటనలో ఉన్న సీఎం.. 23న హైదరాబాద్ చేరుకున్న తర్వాత రాష్ట్రంలో పలు కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. అమెరికా పర్యటన రద్దుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ పర్యటన రద్దు కావడంతో కేవలం అధికారులు మాత్రమే అమెరికా పర్యటనకు వెళ్లున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో విద్యాసంస్థలతో ఎంవోయూలు చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హార్వర్డ్, MIT, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్తో భాగస్వామ్యాలపై చర్చలు జరగనున్నాయి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి..‘ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యం. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతాం. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రయోజనాలు రాజకీయాలకు అతీతం. విద్య, నైపుణ్యాలు, శిక్షణలో ప్రపంచ అత్యుత్తమ సంస్థలను తెలంగాణకు తీసుకొస్తాం. పిల్లలను విదేశాలకు పంపడం కాదు.. ప్రపంచ అత్యుత్తమ విద్యను తెలంగాణకు తీసుకురావాలి. తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరు’ అని చెప్పుకొచ్చారు.ఇక, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ సహా బ్రిటన్లోని ప్రముఖ విద్యాసంస్థలతో సీఎం భేటీ అయ్యారు. LSE, London Business School, University of London ప్రతినిధులతో సమావేశాలు జరిగాయి. బ్రిటన్లో ప్రముఖ స్పోర్ట్స్, స్కిల్లింగ్ సంస్థలతోనూ సీఎం చర్చలు జరిపినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు -
పార్టీలో నాకు మద్దతేదీ?.. ఖర్గే ఆవేదన
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో తన సభ తర్వాత జరిగిన ‘శుద్ధీకరణ’ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను అవమానించిన ఈ ఘటనపై పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో బహిరంగంగా స్పందించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశం బయట రాజకీయ వివాదానికే పరిమితం కాకుండా.. ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత చర్చలోనూ చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.అలాగే సామాజిక న్యాయం, కుల వివక్షకు సంబంధించిన అంశాలపై పార్టీ నాయకులు దూకుడుగా వ్యవహరించాలని ఆయన కోరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బుధవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఖర్గే శుద్ధీకరణ అంశాన్ని లేవనెత్తారు. తనకు మద్దతు తెలపని సీనియర్ నాయకులపై ఖర్గే సరదాగా ఒక వ్యాఖ్య చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ‘బాగా రాసేవారు, చూడటానికి బాగుండేవారు ఈ విషయంలో గట్టిగా గళం విప్పలేదని ఖర్గే ఆవేదన చెందారు’ అని వెల్లడించాయి.పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం కాంగ్రెస్ ఇప్పటికే ఈ ఘటనను ఖండించిందని చెప్పారు. ఈ ఘటన ‘ఆమోదయోగ్యం కాదు, ఖండించదగినది’ అని ఆయన పేర్కొంటూ, ఇది బీజేపీ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. అయితే సమావేశంలో ఉన్న నేతల ప్రకారం, ఖర్గే మాత్రం పార్టీ స్పందనపై పూర్తిగా సంతృప్తి చెందినట్లు కనిపించలేదని సమాచారం. అంటే ఈ ఘటనను కేవలం ఉత్తరాఖండ్లో జరిగిన ఒక రాజకీయ వివాదంగా వదిలేయకుండా.. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం అంశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ అధ్యక్షుడు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.అసలేం జరిగింది?కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగస్టు 8న ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో రామలీలా మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. 2027 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాల్లో భాగంగా ఈ సభ జరిగింది. ఆయన సభ ముగిసిన రెండు రోజుల తర్వాత, అదే రామలీలా మైదానంలో ఖర్గే ప్రసంగించిన వేదికను కొందరు వ్యక్తులు ‘శుద్ధీకరణ హవన్’ పేరుతో శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ్ సేనకు సంబంధించిన వారుగా చెప్పబడుతున్న వ్యక్తులు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఖర్గే స్వయంగా రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఏ కులం లేదా మతాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రసంగించలేదని, ప్రజలకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించానని చెప్పారు. తన ప్రసంగం తర్వాత వేదికకు ‘శుద్ధీకరణ’ చేయడం తనను అవమానానికి గురిచేసిందని, అంటరానితనం వల్ల కలిగే బాధను గుర్తు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ వైఖరి ఏంటి..ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగడంతో బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా ఈ ఘటనను విచారకరమని పేర్కొంటూ, బీజేపీకి దీనితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఖర్గే చేసిన ఆరోపణలపై విచారణ చేస్తామని కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఘటనను కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానంగా కాకుండా కుల వివక్ష, సామాజిక న్యాయం, అంటరానితనం వంటి అంశాలతో ముడిపెట్టింది. ఈ అంశాన్ని రాజకీయంగా కూడా బలంగా ప్రస్తావిస్తోంది.ఇదీ చదవండి: డీకే ఎదుట విజయ్ సరెండర్.. డీఎంకేకు చిక్కిన అస్త్రంమొత్తానికి.. హల్ద్వానీలో జరిగిన ‘శుద్ధీకరణ’ ఒక వేదికను శుభ్రం చేసే కార్యక్రమంగా మొదలైనా.. అది ఇప్పుడు కుల వివక్ష, సామాజిక న్యాయం, రాజకీయ సిద్ధాంతాలపై పెద్ద చర్చగా మారింది. అంతేకాదు.. ఆ ఘటనపై బయట బీజేపీతో పోరాడుతున్న కాంగ్రెస్.. లోపల మాత్రం తన సొంత నేతల స్పందనపైనే అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నలు సంధించడం కొత్త రాజకీయ కోణాన్ని తెరపైకి తెచ్చింది. -
కాంగ్రెస్లో భూకంపం.. తన వ్యాఖ్యలపై సుస్మితా పటేల్ వివరణ
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ చెప్పారు. తన వ్యాఖ్యలతో కొండా సురేఖకు ఎటువంటి సంబంధమూ లేదని తెలిపారు. రాజకీయంగా ఒకే కుటుంబంలో కూడా అభిప్రాయభేదాలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ హై కమాండ్పై తనకు నమ్మకం ఉందని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే గౌరవమని చెప్పారు.కాగా, రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అంతకుముందు, రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో ఒక్కసారిగా మంటలు రేగాయి. మళ్లీ పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్రెడ్డిని ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.దీంతో కొండా సుస్మితా పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. రేవూరి ప్రకాశ్రెడ్డితో రేవంత్రెడ్డి రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా తాను పరకాల నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. -
నా కూతురు మాటలకు నాకు సంబంధం లేదు సంచలనం రేపుతున్న కొండా సురేఖ లేఖ
-
కాంగ్రెస్ లో నేతల నోటి దూకుడుకు చెక్..! క్రమశిక్షణ కమిటీ యాక్షన్
-
‘నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశిస్తూ తన కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం, తన నుండి వివరణ కోరడం ఎంతమాత్రం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ మేరకు మంత్రి కొండా సురేఖ అధికారిక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మంత్రి స్పందిస్తూ.. ‘సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకానీ ఆ వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా నియమావళిపై నాకు పూర్తి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ నాకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కొండా సురేఖ కోరారు.కుటుంబ సభ్యుల వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలకు పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులను ముడిపెట్టడం సరికాదని, ఈ విషయంలో తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ను ఉద్దేశిస్తూ కొండా సుష్మిత ఏమన్నారంటే? 'సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదు. టీడీపీ నుంచి వచ్చిన వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోంది. అచ్చ కాంగ్రెస్కు స్థానం లేకుండా చేస్తున్నారు'అని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్లో కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడారు.‘ఎప్పుడూ ఏం మాట్లాడతారో సీఎంకు తెలియదు. సంగారెడ్డికి వెళ్లినపుడు జగ్గారెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం.. పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎలా కోరతారు’అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే సీఎం కాదన్నారు. తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా, రాహల్, ప్రియాంకలను గౌరవిస్తామన్నారు.పరకాలనుంచి తాను ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని చెప్పారు. ‘బీసీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వారు వచ్చి చెబుతున్నారు. మంత్రులు సంతకాలు పెట్టిన పనులూ జరగటం లేదు. టీపీసీసీ అధ్యక్ష పదవికి నా తల్లిదండ్రులే రేవంత్ రెడ్డిని ప్రతిపాదించారు. అధ్యక్షుడైన తర్వాత మా ఇంటికి వచ్చి నా తండ్రి మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మరచిపోయారు’అని పేర్కొన్నారు.కోటమైసమ్మ, ఎల్లమ్మ గుడి వద్దకు వచ్చి ఆ మాట అనలేదని ప్రమాణం చేస్తారా అని సీఎంకు సవాల్ విసిరారు. తన తండ్రి తిరిగి ప్రచారం చేస్తే రేవూరి గెలిచాడని, అలాంటి నాయకుడు నీకు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. సీఎంకు కళ్లు నెత్తికె క్కాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం పనిచేసే దాన్నని,చావుకు కూడా భయపడనన్నారు.నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవరు'సీఎంతోపాటు ఒక 'పొంగు ఉంది. ఆ పొంగు ఎక్కువ సేపు ఉండదు. వీరిలో ఎవరూ సీఎం అనేది తెలియడం లేదు. హైదరాబాద్ ఇన్చార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటో పెట్టకుండా అక్కడి ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం, పొంగు ఫొటోలు పెట్టుకున్నారు. బీసీలంటే అంత చులకనా. రేవంత్రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ప్రయత్నించిన దయాసాగర్, షబ్బీర్ అలీ ఆయన సీఎం అయిన తర్వాత కలవడానికి వెళితే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు'అని సుస్మితా ఆగ్రహం వ్యక్తంచేశారు.మూడేళ్లలో వేం నరేందర్రెడ్డి ఇచ్చిన సలహాలు ఏమిటో, వాటిని పాటించి సీఎం చేసిన పనులేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. సీఎం తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే రూ.200 కోట్ల విలువైన భూమిని అతడికి ధారాదత్తం చేశారని మండిపడ్డారు. అన్నా, తమ్ముడు రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము కాపోళ్లమని తమకు వ్యవసాయం చేయడం తప్ప ఊడిగం చేయడం రాదని, తాము పద్మశాలీలమని తమకు నేత చేయడం తప్పితే మోసం చేయడం రాదని అన్నారు. -
సిక్కుల ఊచకోత కేసు దోషి, కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి
ఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసు దోషి, కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (80) మృతి చెందారు. జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ అనారోగ్యపాలైన ఆయనను తిహార్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో (1984) ఐదుగురు వ్యక్తుల హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కుమార్ను తిహార్ జైలు అధికారులు సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన మరణానికి కారణాన్ని ఆసుపత్రి ఇంకా వెల్లడించలేదు. 3 పర్యాయాలు లోక్సభ సభ్యుడిగా ఉన్న సజ్జన్ కుమార్ ఔటర్ ఢిల్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడిగా ఉండేవారు. 2018లో దోషిగా తేలిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు.మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియంత్ సింగ్ 1984 అక్టోబర్ 31న హత్య చేసిన తర్వాత అల్లర్లు చెలరేగాయి. సాయుధ గుంపులు ఢిల్లీ అంతటా సిక్కులను లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లు, దుకాణాలపై దాడులు చేశాయి. దేశవ్యాప్తంగా 3,000 మందికి పైగా సిక్కులు హతమయ్యారు. వారిలో ఎక్కువ మంది దేశ రాజధానిలోనే మరణించారు.దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కుమార్ ఈ హింసకు సంబంధించిన పలు క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నారు. వివిధ న్యాయస్థానాల్లో కొన్ని కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదల కాగా, మరికొన్ని కేసుల్లో దోషిగా తేలారు. 2013లో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పును 2018 డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అనంతరం కుమార్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.ఈ కేసు పాలం కాలనీలోని రాజ్ నగర్ పార్ట్-1లో ఐదుగురు సిక్కుల హత్యతో పాటు హింస సమయంలో ఒక గురుద్వారాను దహనం చేసిన ఘటనకు సంబంధించినది. క్రిమినల్ కుట్ర, నేరానికి ప్రేరేపించడం వంటి అభియోగాల్లో కుమార్ను హైకోర్టు దోషిగా తేల్చింది. ఆయన జీవితాంతం జైలులోనే ఉండాలని ఆదేశించింది. 1984 సిక్కు వ్యతిరేక హింసను కోర్టు తన తీర్పులో "మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలు"గా పేర్కొంది. కుమార్ తన శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది. -
వందేమాతరం: కాంగ్రెస్పై అమిత్ షా ఆగ్రహం
వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కాంగ్రెస్ తిరస్కరించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పార్టీ విధానం వల్లే దేశం రెండు ముక్కలైందంటూ మండిపడ్డారాయన. గురువారం ఆయన మాట్లాడుతూ.. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ వైఖరి దేశాన్ని అవమానించడమే. రెండు చరణాలే పాడాలని సీడబ్ల్యూసీలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం జాతికి వ్యతిరేకం. ఆ పార్టీ వైఖరికి నిరసనగా ప్రజలు ఉద్యమించాలని షా పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ 1937లో వందేమాతరాన్ని రెండు భాగాలుగా విభజించడం వల్లే దేశ విభజనకు బీజాలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ముస్లిం మైనారిటీలను సంతృప్తిపరిచేందుకు అప్పటి కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఆ తర్వాత ద్విజాతి సిద్ధాంతం బలపడి చివరకు దేశ విభజన, పాకిస్థాన్ ఆవిర్భావానికి దారితీసిందని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని చెప్పారు.స్వాతంత్య్ర సమరయోధులను అవమానించారువందేమాతరం ఆలపిస్తూ జైళ్లకు వెళ్లిన, ఉరికంబాలు ఎక్కిన లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కాంగ్రెస్ అవమానిస్తోందని షా విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంకించంద్ర ఛటర్జీ రచనను కూడా అవమానిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మరోసారి బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. దేశ ప్రజలు దీనిపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ కౌంటర్.. 1937 నిర్ణయానికే కట్టుబడి ఉంటాంఅమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ తదితర అగ్రనేతల సమక్షంలో ఆనాడు తీసుకున్న నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే ఆలపిస్తామని తెలిపారు.ఇదంతా రాజకీయ రగడే: జైరాం రమేశ్1937 అక్టోబర్ 28న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందేమాతరంపై తీర్మానం ఆమోదించారని జైరాం రమేశ్ గుర్తుచేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం వందేమాతరం అంశాన్ని బీజేపీ రాజకీయ వివాదంగా మారుస్తోందని, యువత, పరీక్షల పేపర్ లీకులు, చందా సేకరణ, విదేశాంగ వైఫల్యం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి గీతంమరోవైపు కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి ఆరు చరణాల వెర్షన్ను ఆలపించనున్నారు. దీని వ్యవధి సుమారు 3 నిమిషాల 10 సెకన్లు కాగా, జాతీయ గీతం ‘జనగణమన’ వ్యవధి 52 సెకన్లు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి గీతం.. కాంగ్రెస్ కార్యక్రమాల్లో తొలి రెండు చరణాలకే పరిమితం చేయాలన్న నిర్ణయం మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. -
‘సుస్మిత వల్ల సురేఖ తలదించుకోవాల్సి వస్తోంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితపై కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “సుస్మిత వల్ల సురేఖ తలదించుకోవాల్సి వస్తోంది.. ఆమె వల్లే మంత్రి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కొండా సుస్మిత వ్యాఖ్యలపై తాజాగా ఇందిరా శోభన్ స్పందించారు. ఈ సందర్భంగా సుస్మిత ఆలోచనలు “డైపర్ల దగ్గరే ఆగిపోయాయి” అంటూ తీవ్ర విమర్శలు చేసిన ఇందిరా శోభన్.. “సుస్మిత చదువు, సంస్కారం ఇదేనా?” అని ప్రశ్నించారు. కొండా సురేఖ పేరు లేకపోతే సుస్మిత ఎవరో కూడా తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై విమర్శలు చేయడానికి సుస్మితకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. సుస్మిత వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ముందు చులకన అవుతోందని ఇందిరా శోభన్ ఆరోపించారు. “సురేఖ పేరును సుస్మిత దిగజారుస్తోంది. సుస్మిత రెచ్చిపోతే పుచ్చిపోతది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు.. సుస్మిత వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయన్న అనుమానం కలుగుతోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుస్మిత ఏం చేశారని ప్రశ్నించిన ఇందిరా శోభన్.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడ్డది రేవంత్రెడ్డి అని అన్నారు. ఇదే క్రమంలో “చాలా మంది నాయకులకు సన్స్ట్రోక్ ఉంటుంది.. కొండా సురేఖకు డాటర్స్ట్రోక్ ఉంది” అంటూ ఇందిరా శోభన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారాయి. కుమార్తె వ్యాఖ్యలు, వ్యవహారశైలే సురేఖకు ఇబ్బందులు తెస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. -
హరీష్, కేటీఆర్ తో నీకు పోలికేంటి రేవంత్ పై జీవన్ రెడ్డి సెటైర్లు..
-
సీఎం రేవంత్ పై కొండా సుస్మిత తీవ్ర విమర్శలు.. కాంగ్రెస్ లో అసమ్మతి గళం పెరుగుతోందా..?
-
తెలంగాణలో 22A దందా.. రాహుల్కు హరీష్రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ శాఖలో ‘22A’ చుట్టూ భారీ అవినీతి జరుగుతోందా? నిషేధిత భూముల జాబితా నుంచి ఆస్తులను తొలగించేందుకు ఏకంగా 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.22A నిబంధన ఉద్దేశం నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడమేనని హరీష్రావు పేర్కొన్నారు. అయితే ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడేందుకు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న వేలాది ప్రైవేటు ఆస్తులను కూడా ఏకపక్షంగా 22A జాబితాలో చేర్చి యజమానులను వేధిస్తున్నారని విమర్శించారు.రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ రాకెట్ నడుస్తోందన్నది హరీష్రావు చేసిన మరో సంచలన ఆరోపణ. నిషేధిత జాబితా నుంచి ఆస్తులను తొలగించుకునేందుకు దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30 శాతం వరకు కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇవి ఆరోపణలేనని, వీటిపై స్వతంత్ర దర్యాప్తుతో నిజానిజాలు తేలాల్సి ఉందని పేర్కొనడం సముచితం.యాదాద్రి జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాలను 22A జాబితాలో చేర్చినట్లు నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారని హరీష్రావు తన లేఖలో ప్రస్తావించారు. ఇంత పెద్ద స్థాయిలో భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయి? వాటి వెనుక కారణాలేంటి? అన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపైనా హరీష్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. భూములపై వివాదాలు సృష్టించి, రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాలు చేసుకునేలా భూ యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని విమర్శించారు.ఈ మొత్తం వ్యవహారంపై 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 22A జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలని హరీష్రావు డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ ఆరోపణలతో కాకుండా.. ఎవరి ఆదేశాలతో ఏ ఆస్తిని జాబితాలో చేర్చారు? ఎందుకు తొలగించారు? అనే అంశాలను తేల్చాలని కోరారు. అంతేకాదు.. 30 శాతం కమీషన్లు, 50:50 జాయింట్ డెవలప్మెంట్ ఒప్పందాల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? దళారులు, బినామీ సంస్థలను నడిపిస్తున్న రాజకీయ శక్తులు ఏవి? అనే విషయాలను దర్యాప్తులో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి ఆస్తుల జాబితాలో మార్పులు చేసిన అధికారులు, మధ్యవర్తుల ప్రమేయం, జరిగిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని హరీష్రావు కోరారు. మొత్తంగా 22A వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణకు సిద్ధమవుతుందా? లేక ఆరోపణలు-ప్రత్యారోపణలకే పరిమితం అవుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
కాంగ్రెస్లో అంతే..!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజుకో తీరుగా బహి ర్గతమవుతున్నాయి. మంత్రుల మధ్య సమన్వయ లేమి, తమ శాఖలో జరిగే అంశాలు తమకు తెలియకుండానే జరిగి పోతున్నాయనే అసంతృప్తి, ఒకరి శాఖపై మరో మంత్రి వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలు వర్సెస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ఇన్చార్జీలతో సమన్వయ లేమి, పార్టీ కేడర్తో ఎమ్మెల్యేల గిల్లి కజ్జాలు, పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ గొడవలు నిరంతరాయంగా వెలుగులోకి వస్తున్నాయి. వీటికి తోడు ఏకంగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, అధిష్టానాన్ని వేలెత్తి చూపుతున్న ఘటనలు, నేరుగా వారికే సవాల్ విసిరే ప్రసంగాలు కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తుంగతుర్తి, పాలకుర్తి, గజ్వేల్, మునుగోడు, జడ్చర్ల, వనపర్తి, ఎల్బీనగర్... ఇలా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించడం, పార్టీ నేతలను సమన్వయం చేయడంలో రాష్ట్ర పార్టీ పక్షాన ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అసమ్మతి స్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పుకునే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఏదో నియోజకవర్గంలో తలనొప్పులు బహిరంగంగానే బయటపడుతున్నాయి. ఇప్పటికే పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ పేరుతో సతమతమవుతున్న కాంగ్రెస్లో తాజా గొడవలు మరింత చిచ్చు రేపుతున్నాయి. వనపర్తి అసెంబ్లీ పరిధిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయంలో ఏకంగా చిన్నారెడ్డికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. మరోవైపు తుంగతుర్తిలో ఎమ్మెల్యే వర్సెస్ స్థానిక నాయకత్వం పంచాయతీ ఇంకా సమసిపోలేదు. ఇప్పటికే పాలకుర్తి, గజ్వేల్ నియోజకవర్గాల్లోని అంతర్గత గొడవలతో ఫిర్యాదుల మీద ఫిర్యాదులు గాం«దీభవన్కు చేరాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోని నేతలతో పార్టీ క్రమశిక్షణా కమిటీ పలుమార్లు భేటీ అయి విచారణ జరిపింది. అయినా ఇక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. ఆదిలాబాద్లో బాహాబాహి ఎల్బీనగర్ నియోజకవర్గంలో అయితే ఈశ్వరమ్మ యాదవ్, జక్కిడి ప్రభాకర్రెడ్డి వర్గాలు ఏకంగా ఇళ్ల ముందు ఆందోళనల వరకు వెళ్లాయి. వీటితోపాటు ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగిన జిల్లా పీఏసీ సమావేశంలో ఆదిలాబాద్ స్థానిక నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో ఇరువర్గాలకు పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. మరోవైపు అసలు తమకు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ప్రాధాన్యతే లేదని ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు వాపోతున్నారు. బీజేపీ నేతలు చెప్పిన మాట వింటున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బహిరంగ వేదికపైనా వ్యాఖ్యానించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటికితోడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల ఈ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు బయటపడుతున్నాయి. ఇటీవల పోచారం శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుధవారం బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే రవీందర్రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య విభేదాలు ఇలా ఉంటే పార్టీ అధిష్టానం నియమించిన డీసీసీ అధ్యక్షుల్లో కొంత మందికి స్థానిక పార్టీ నాయకత్వం అసలు సహకరించడమే లేదు. ఇటీవల కాలంలో ముగ్గురు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన డీసీసీ అధ్యక్షులను మార్చాలనే నిర్ణయం తీసుకున్నారనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు తాజాగా తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ ధిక్కారం ఇటీవలి కాలంలో షరా మామూలే అయిపోయిందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సీఎంకు నేరుగా అసమ్మతి సెగ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి సహజమే అయినా ఇటీవలి కాలంలో సీఎం రేవంత్రెడ్డికి కూడా ఈ సెగ నేరుగానే తగులుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన వైఖరిని ఖండిస్తూ, పాలనను వేలెత్తి చూపుతూ, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ కొందరు పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండగా, మరికొందరు పార్టీలోనే అంతర్గతంగా చక్రం తిప్పుతూ రేవంత్కు చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సీఎం రేవంత్ టార్గెట్గానే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నవారు వేలకోట్లు సంపాదించుకుంటూ ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5లక్షలు ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది బహిరంగ రహస్యమేనని పార్టీ వర్గాలంటున్నాయి. ఇక, తనకు తెలియకుండానే రైస్మిల్లులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం గురించి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అంతర్గతంగా పావులు కదిపారని, అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో జరిగిన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగిందనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యలు కూడా ఈ కోవలోనే చర్చనీయాంశమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిన ప్రభుత్వమని, కీలక నిర్ణయాల్లో పార్టీ జోక్యం ఉంటుందని స్పష్టం చేయడం ద్వారా రేవంత్కు చెక్ పెట్టే జాబితాలోకి ఆయన కూడా చేరారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కూడా అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే తాజాగా వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ కుమార్తె నేరుగా సీఎం పేరును ఉటంకిస్తూ ఆయనకే నేరుగా సవాల్ విసిరిన నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పార్టీలో ఎవరికీ సరైన పట్టు లేదన్న చర్చ సాగుతోంది. మంత్రికి నోటీసులు సుస్మితా పటేల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె తల్లి, దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండాసురేఖకు పీసీసీ క్రమశిక్షణకమిటీ నోటీసులు జారీ చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా క్రమశిక్షణ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల వనపర్తిలో చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అనుచిత ప్రసంగాల గురించి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో పార్టీ ఆదేశించింది. ఎల్బీనగర్ నియోజకర్గంలో బీసీ మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్నుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ నేత జక్కిడి ప్రభాకర్రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం. -
అందుకే నిర్బంధాలు, హౌస్ అరెస్టులు: తలసాని
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నిర్బందాలు, హౌస్ అరెస్ట్లకు పాల్పడుతుందని మాజీమంత్రి,బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బుధవారం మాజీమంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. హాస్పిటల్ సందర్శనకు వెళ్తామంటే ఈ ప్రభుత్వానికి భయమెందుకు అని, అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైపు ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ మరోవైపు అక్రమ నిర్బందాలు, తప్పుడు కేసులు నమోదు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని మండిపడ్డారు. హాస్పిటల్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమం అనే విషయాన్ని మరిచి వైద్యులు, నర్సింగ్ విద్యార్థుల ముందు ఉపయోగించిన భాషను తీవ్రంగా తప్పుబట్టారు. అక్రమ నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతునొక్కాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
కొండా సుస్మిత వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్గా దృష్టి
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై కొండా మురళి-సురేఖ దంపతుల కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్గా దృష్టి సారించింది. ఇప్పటికే కాంగ్రెస్ క్రమశిక్షన కమిటీ ఆగ్రహం వ్యక్తం నేపథ్యంలో అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. అదే సమయంలో టీపీసీసీ నుంచి పూర్తి నివేదిక కోరారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం..కొండా సుస్మిత కామెంట్ పై స్పందించిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉన్నాయన్నారు. పార్టీ లక్ష్మణ రేఖను ఎవరు అతిక్రమించిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీలో ఉన్న మల్లు రవి వ్యాఖ్యానించారు. పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్న తర్వాత కొండా సుస్మిత పై చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కూడా షబ్బీర్ అలీ, కొండా మురళి వివాదంలో వారితో చర్చించి సమస్యను పరిష్కరించామని, ఇటీవల రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే నోటీసులు ఇచ్చామని కూడా ఆయన తెలిపారు.‘నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవరు?’ -
పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో దీదీ క్లీన్ స్వీప్.. బీజేపీకి షాక్!
కోల్కతా: మూడు దశాబ్దాల తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి భారీ ఊరట దక్కింది. పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో టీఎంసీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు క్లీన్స్వీప్ చేశారు. అయితే, ఈ ఎన్నికలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగి ఉంటే టీఎంసీ ఇన్ని స్థానాల్లో గెలిచేవారు కాదని బార్ కౌన్సిల్లో బీజేపీ మద్దతు దారులు వ్యాఖ్యానిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 23 స్థానాల్లో 15 స్థానాల్ని కైవసం చేసుకుంది. బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ చెరో మూడు స్థానాలను, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. మహిళల కోసం రిజర్వ్ చేసిన ఐదు స్థానాల్లో టీఎంసీ నాలుగు, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. గెలిచిన తృణమూల్ అభ్యర్థులను మమతా బెనర్జీ సిఫార్స్ల మేరకే పోటీ జరిగినట్లు సమాచారం.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా అభ్యర్థుల నుండి అదనంగా ఇద్దరు మహిళా సభ్యులను నామినేట్ చేయనుంది. ఈ నామినేషన్లతో, పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ మొత్తం సభ్యుల సంఖ్య 25కు పెరుగుతుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 75 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీఎంసీ 23 మంది అభ్యర్థులను, బీజేపీ 22 మందిని, లెఫ్ట్ ఫ్రంట్ 12 మందిని, 18 మంది స్వతంత్రులను బరిలోకి దింపాయి. ఫలితాల్లో బీజేపీ తన మునుపటి మూడు సీట్ల స్థానాన్ని నిలబెట్టుకోగా, కాంగ్రెస్ తన రెండు సీట్లను నిలుపుకుంది. అయితే, లెఫ్ట్ ఫ్రంట్ ప్రాతినిధ్యం గత ఎన్నికల్లోని నాలుగు సీట్ల నుండి ఈసారి మూడు సీట్లకు పడిపోయింది. బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత టీఎంసీ న్యాయవాదుల విభాగం సభ్యుడు సంజయ్ బర్ధన్ మాట్లాడారు. అన్ని జిల్లా కోర్టులలో ప్రాక్టీసింగ్ న్యాయవాదులు పాల్గొనడంతో ఈ ఎన్నికలు జరిగాయి. అన్ని జిల్లా కోర్టులలో ప్రాక్టీసింగ్ న్యాయవాదులు వేసిన ఓట్ల ద్వారా గత మార్చిలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏర్పడింది. కొత్త నిబంధనల ప్రకారం, 23 సీట్లలో ఐదు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ మహిళా సీట్లలో నాలుగు సీట్లను తృణమూల్ దక్కించుకుంది అని బర్ధన్ అన్నారు.అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, మార్చి 9న పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఫలితాలు వెలువడటంతో టీఎంసీ త్వరలో పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ కొత్త బోర్డును ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ న్యాయవాద వర్గంలోని కొన్ని వర్గాలలో పార్టీ సంస్థాగత ప్రభావం చెక్కుచెదరలేదనడానికి ఈ ఫలితం ఒక సంకేతంగా పార్టీలో భావిస్తున్నారు.2011 నుండి వరుసగా మూడు సార్లు ఘనవిజయాలు సాధించి, 15 ఏళ్ల పాటు బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలయ్యారు. కేవలం 80 స్థానాలకే పరిమితమై ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్లో మూడు దశాబ్దాల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అంతర్గత తిరుగుబాటు మొదలైంది.పార్టీలోని మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నాయకత్వాన్ని కాదని తిరుగుబాటు పక్షాన నిలిచారు. అసెంబ్లీలోనే కాకుండా పార్లమెంటులో కూడా మమతకు గట్టి షాక్ తగిలింది. టీఎంసీకి ఉన్న 28 మంది లోక్సభ సభ్యులలో 20 మంది ఎంపీలు పార్టీకి దూరమై, కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రాభవం ఇంకా ఉందని బార్ కౌన్సిల్ ఎన్నికలు నిరూపించాయి. -
‘నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవరు?’ కొండా బిడ్డ.. గూస్ బంప్స్ స్పీచ్
-
రేవంత్ రెడ్డికి కొండా సురేఖ కుమార్తె కౌంటర్..?
-
కొండా సుస్మిత ఎఫెక్ట్.. ఎమ్మెల్యే రేవూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, వరంగల్: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తాజాగా స్పందించారు. సుస్మిత వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే పార్టీ అధిష్ఠానం తగిన దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. వ్యక్తిగతంగా తాను దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని, పార్టీ నిర్ణయమే అందరికీ శిరోధార్యమని పేర్కొన్నారు.వరంగల్లో నిర్వహించిన చిట్చాట్లో రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. పరకాల నియోజకవర్గంలో కొందరు కావాలనే డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అందుకే ప్రజలకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగిందని చెప్పారు. అనేక సర్వేల ఫలితాల ఆధారంగానే పరకాల సభలో ముఖ్యమంత్రి తన పేరును ప్రకటించారని తెలిపారు.పచ్చ కాంగ్రెస్.. తెల్ల కాంగ్రెస్ అంటూ ఏమీ లేదు..కాంగ్రెస్ పార్టీలో ‘పచ్చ కాంగ్రెస్.. తెల్ల కాంగ్రెస్’ అంటూ వర్గాలు ఏమీ లేవని రేవూరి స్పష్టం చేశారు. తాను అయినా, మంత్రి అయినా పార్టీ లైన్కు కట్టుబడి పనిచేయాల్సిందేనని అన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పార్టీలో ఏదైనా అంశంపై భిన్నాభిప్రాయాలు ఉంటే అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే, పరకాలలో జరిగిన సభకు మంత్రి కొండా సురేఖను తాను ఆహ్వానించానని రేవూరి తెలిపారు. అయితే ఆమె సభకు ఎందుకు హాజరుకాలేదో తనకు తెలియదని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడికి ఏ ప్రోటోకాల్ ఉంటుందన్న అంశంపైనా స్పందిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘనగా పేర్కొనడం సరికాదన్నారు.సీఎం ప్రకటనతో మరింత బాధ్యతతాను సమర్థవంతంగా పనిచేస్తున్నందుకే తనకు అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయని రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పరకాల సభలో తన పేరును ప్రకటించడం తనపై మరింత బాధ్యత పెంచిందని చెప్పారు. నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు.సుస్మిత వ్యాఖ్యల కలకలం..ఇదిలా ఉండగా.. అంతకుముందు కొండా సుస్మితా చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన ఇన్స్టాగ్రామ్లో “అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ సుస్మిత పోస్టు చేయడంతో.. పరకాల రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. అయితే, కొండా కుటుంబానికి పరకాల నియోజకవర్గంతో రాజకీయంగా బలమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో సుస్మితను పరకాల నుంచి రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. తాజాగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆ చర్చకు మరింత బలం చేకూర్చింది. అయితే, మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గ పరిధిలో భారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గీసుకొండ మండలంలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుస్మిత పటేల్ రాజకీయంగా కీలక ప్రకటన చేస్తారా? అన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. -
పరకాల పవర్ పాలిటిక్స్.. కొండా సుస్మిత పోస్టుతో కాకరేపిన రాజకీయం!
సాక్షి, వరంగల్: పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్టాపిక్గా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన ఇన్స్టాగ్రామ్లో “అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ సుస్మిత పోస్టు చేయడంతో.. పరకాల రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. మరోవైపు.. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో, రాజకీయం మరో టర్న్ తీసుకుంది. కాగా, రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రస్తుతం పరకాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో.. సుస్మిత తాజా పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో అధికార కాంగ్రెస్లోనే రేవూరి, కొండా కుటుంబం మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతోందన్న చర్చ మొదలైంది.పరకాలపై కొండా ఫ్యామిలీ కన్ను?కొండా కుటుంబానికి పరకాల నియోజకవర్గంతో రాజకీయంగా బలమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో సుస్మితను పరకాల నుంచి రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. తాజాగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆ చర్చకు మరింత బలం చేకూర్చింది. అయితే, మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గ పరిధిలో భారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గీసుకొండ మండలంలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుస్మిత పటేల్ రాజకీయంగా కీలక ప్రకటన చేస్తారా? అన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.ఒకవైపు రేవూరి ప్రకాశ్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి మద్దతు, మరోవైపు పరకాల నుంచి పోటీకి సుస్మిత పటేల్ ఆసక్తి.. ఈ రెండు పరిణామాలతో పరకాల కాంగ్రెస్లో రాజకీయ వేడి పెరిగింది. ప్రస్తుతం ఇది పార్టీ అంతర్గత రాజకీయంగా కనిపిస్తున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. రేవూరి వర్సెస్ కొండా ఫ్యామిలీగా మారుతున్న ఈ పవర్ పాలిటిక్స్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. -
జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,జగిత్యాల: కాంగ్రెస్ అంటే ‘రేవంత్ రెడ్డి లిమిటెడ్ కంపెనీ’లా మారిందని బీఆర్ఎస్ నేత జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతాను’అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి స్పందించారు.ఆ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లు మిగలకపోవచ్చు. చిన్నారెడ్డిది ధిక్కార స్వరం కాదు.. ఆవేదన అనుకోవాలి. కాంగ్రెస్లో డబ్బులిచ్చినవాళ్లకే టికెట్ అన్నట్టు మారింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్రెడ్డి లిమిటెడ్ కంపెనీలా మారింది’అని వ్యాఖ్యానించారు. -
రేవంత్ పై కోపమా అక్కా.. CM టూర్ లో మంత్రి మిస్సింగ్
-
రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా మండల స్థాయి ప్రజావాణి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం విజయవంతమైంది. ప్రజల సమస్యలను వారి మండల స్థాయిలోనే నేరుగా స్వీకరించి, వాటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.రాష్ట్రంలోని మొత్తం 565 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించగా, సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 566 మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించినట్లయిందని ప్రజావాణి రాష్ట్ర ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ తెలిపారు.5,410 వినతుల స్వీకరణమండల స్థాయి ప్రజావాణికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మొత్తం 5,410 వినతులు (పిటిషన్లు) అందాయి. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకువచ్చి, వాటి పరిష్కారం కోసం వినతులను సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని అధికారులు స్వీకరించి, సమస్య స్వభావాన్ని పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకునే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల ప్రజావాణి కోసం అధికారులు శాఖ వారిగా డెస్క్ లు, హెల్ప్ డెస్క్ ను, మంచినీటి సౌకర్యాలు కల్పించారు.10,753 మంది అధికారులు హాజరుమండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,753 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజలు సమర్పించిన వినతులను నేరుగా స్వీకరించడంతో పాటు, ఆయా సమస్యలకు సంబంధించిన వివరాలను తెలుసుకుని పరిష్కారానికి అవసరమైన చర్యలపై అధికారులు దృష్టి సారించారు.జిల్లాల వారీగా వినతుల స్వీకరణరాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాకు సగటున 164 వినతులు అందాయి. జిల్లాల వారీగా అత్యధికంగా వినతులు అందిన జిల్లాగా కరీంనగర్ జిల్లా నిలిచింది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 704 వినతులు స్వీకరించబడ్డాయి. అలాగే, ఒక మండలానికి సగటున అత్యధిక వినతులు అందిన జిల్లాగా కూడా కరీంనగర్ జిల్లా ముందంజలో ఉంది. కరీంనగర్ జిల్లాలో ఒక్కో మండలానికి సగటున 47 వినతులు అందాయి.ప్రజలకు మరింత చేరువగా ప్రజావాణిమండల స్థాయిలోనే ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించడం ద్వారా సమస్యల పరిష్కార ప్రక్రియను ప్రజలకు మరింత చేరువ చేయడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా లేదా రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానిక స్థాయిలోనే సంబంధిత అధికారులకు తమ సమస్యలను వివరించే అవకాశం మండల స్థాయి ప్రజావాణి ద్వారా లభించింది.ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత శాఖలకు పంపించి, వాటిని పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.ప్రజలు, అధికారుల నుంచి విశేష స్పందనమండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి, అధికారుల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతులు సమర్పించగా, అధికారులు కూడా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేశారు.మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 566 మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడి, 5,410 వినతులు స్వీకరించబడ్డాయి. ప్రజలు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. మండల స్థాయిలోనే ప్రజల సమస్యలను స్వీకరించి, వాటికి వేగవంతమైన పరిష్కారం అందించడమే ప్రజావాణి ప్రధాన లక్ష్యం. -
కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలే కాంగ్రెస్ అసలైన బలం
సాక్షి,భువనగిరి: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయాల వెనుక నిలిచేది కార్యకర్తేనని.. ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో పార్టీ జెండా నేలవాలకుండా కాపాడేదీ కార్యకర్తేనని.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల గడపకు చేర్చే వారధి కూడా కార్యకర్తేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కాంగ్రెస్ సిద్ధాంతాన్ని విశ్వసించి, పార్టీ జెండాను భుజాన మోసి, ప్రజల మధ్య నిలిచిన నిబద్ధత కలిగిన కార్యకర్తల త్యాగాలను పార్టీ ఎన్నటికీ విస్మరించదని స్పష్టం చేశారు.భువనగిరిలో సోమవారం ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్న రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.తాను సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, పీసీసీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించిన అనుభవంతో గ్రామస్థాయి కార్యకర్తల కష్టాన్ని అత్యంత దగ్గరగా చూశానని చెప్పారు. రాజకీయంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ సామాన్య కార్యకర్తలు కాంగ్రెస్ జెండాను వీడలేదని, అధికారానికి దూరంగా ఉన్న సమయంలోనూ ప్రజల మధ్య పార్టీ ఉనికిని కాపాడారని గుర్తు చేశారు. “ప్రభుత్వాలు వస్తాయి... పదవులు వస్తాయి... పోతాయి. కానీ ప్రజల మధ్య పార్టీ జెండాను మోస్తూ, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలిచి, కాంగ్రెస్ను గ్రామస్థాయిలో సజీవంగా ఉంచేది కార్యకర్తే. కాంగ్రెస్ కార్యకర్తే మన అసలైన బలం” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, అయితే వాటి అసలైన ప్రయోజనం ప్రజలకు పూర్తిస్థాయిలో తెలియాలంటే పార్టీ యంత్రాంగం, కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఉచిత సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అందిస్తున్న విస్తృత సహాయం వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని చెప్పారు.“ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తుంది... కార్యకర్త దాని సందేశాన్ని ప్రజల గుండెల్లోకి తీసుకెళ్తాడు. ప్రభుత్వం పథకాన్ని రూపొందిస్తుంది... దాని ఫలం అర్హుడి గడపకు చేరిందో లేదో తెలుసుకునేది కార్యకర్త. ప్రభుత్వం–ప్రజల మధ్య సజీవమైన వారధి కాంగ్రెస్ కార్యకర్త” అని ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు మండల, గ్రామ, బూత్ స్థాయి కార్యకర్తలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని కోరారు.తెలంగాణలో ఆహార భద్రతకు కొత్త నిర్వచనంకాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆహార భద్రతా విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 85 శాతం మందికి సమానమైన 3.42 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెలా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. “నా ఇంట్లో నేను తినే నాణ్యమైన బియ్యమే నిరుపేద కుటుంబం కూడా తినాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. పేదరికం కారణంగా ఆహార నాణ్యతలో తేడా ఉండకూడదు. ఇది కేవలం బియ్యం పంపిణీ కాదు... పేదవాడి ఆత్మగౌరవానికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం” అని అన్నారు.గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో అందించే దొడ్డు బియ్యానికి బదులుగా సన్నబియ్యం అందించడం ద్వారా ఆహార భద్రతకు నాణ్యత, గౌరవాన్ని జోడించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి సుమారు 2.80 కోట్ల మందికి ఉన్న ఆహార భద్రతా పరిధిని 3.42 కోట్ల మందికి విస్తరించామని తెలిపారు. దేశంలో హక్కుల ఆధారిత ఆహార భద్రతా వ్యవస్థకు బాటలు వేసింది సోనియా గాంధీ అని గుర్తు చేస్తూ, ఆహార భద్రతా చట్టం ఆమె దూరదృష్టికి ప్రతిరూపమన్నారు. ఆ స్ఫూర్తినే తెలంగాణ ప్రభుత్వం మరింత విస్తృతంగా అమలు చేస్తోందని చెప్పారు. “నా రాజకీయ జీవితంలో నాకు అత్యంత సంతృప్తినిచ్చే అంశాల్లో 3.42 కోట్ల మందికి నాణ్యమైన ఆహార ధాన్యాలు అందించడం ఒకటి. సమ్మిళిత సంక్షేమానికి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది” అని పేర్కొన్నారు.1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు -పారదర్శకతకు కొత్త చిరునామాతెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థలో సుమారు 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశం మరో చారిత్రాత్మక సంస్కరణ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 15న సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. QR కోడ్తో కూడిన ఈ కార్డుల ద్వారా పారదర్శకత పెరగడంతో పాటు కుటుంబ వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. తెలంగాణ పరిధిలో పోర్టబిలిటీ సౌకర్యం ఉండడం వల్ల ఉపాధి కోసం హైదరాబాద్తో పాటు ఇతర పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, చౌకధరల దుకాణాల వారీగా దశలవారీగా కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు.ధాన్యోత్పత్తిలో తెలంగాణ శక్తిమంతమైన రాష్ట్రంఒకవైపు పేదలకు నాణ్యమైన ఆహార భద్రత కల్పిస్తూనే మరోవైపు ఆ అన్నాన్ని పండించే రైతుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ దేశంలోనే అగ్రశ్రేణి వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందన్నారు. ఇటీవల సీజన్లో సుమారు 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సుమారు రూ.90 వేల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. మధ్యవర్తులకు తావులేకుండా రైతు పండించిన ప్రతి గింజకు తగిన ప్రతిఫలం నేరుగా రైతుకే అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.వర్షాభావంపై అప్రమత్తం... తాగునీటికే తొలి ప్రాధాన్యంరాష్ట్రంలో నెలకొన్న వర్షపాతం లోటు పరిస్థితులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వర్షపాతం, జలాశయాల్లో నిల్వలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రజల తాగునీటి అవసరాలను పూర్తిస్థాయిలో భద్రపరిచిన తర్వాతే అందుబాటులో ఉన్న నీటి లభ్యత ఆధారంగా సాగునీటి విడుదలపై శాస్త్రీయ నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. “ప్రజల గొంతు తడపడం ప్రభుత్వ ప్రథమ బాధ్యత. వచ్చే వేసవికి అవసరమైన తాగునీటిని పూర్తిగా భద్రపరచాలన్నది మా విధాన నిర్ణయం. ఆ తర్వాత మిగిలిన నీటి లభ్యతను బట్టి సాగునీటిని సమతుల్యంగా, శాస్త్రీయంగా ప్రణాళిక చేస్తాం” అని తెలిపారు.ప్రస్తుత జల పరిస్థితులను రైతులకు వివరించడంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో తక్కువ నీటితో సాగయ్యే పప్పుధాన్యాలు, పత్తి తదితర ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని కోరారు. రాబోయే వారాల్లో మెరుగైన వర్షాలు కురిస్తే పరిస్థితి ఆశాజనకంగా మారుతుందని, అయినప్పటికీ నీటి నిర్వహణలో శాస్త్రీయ దృక్పథం, ముందు జాగ్రత్తే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.బస్వాపూర్ నుంచి డిండి వరకు... సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తాంబస్వాపూర్, గంధమల్ల, ఎస్ఎల్బీసీ సొరంగం, డిండి సహా కీలక సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రాధాన్యతా పనులను వేగవంతం చేస్తామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కచ్చితమైన సమాచారం, శాస్త్రీయ విశ్లేషణ ఆధారంగా సాగునీటి నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని చెప్పారు.తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృతంగా సమావేశమవుతూ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను తెలుసుకుంటున్న ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అగ్రనాయకత్వం నేరుగా సామాన్య కార్యకర్త వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను వినడం పార్టీ శ్రేణుల్లో నూతన విశ్వాసాన్ని నింపుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వం, క్షేత్రస్థాయి కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగితే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందని అన్నారు. “గౌరవం పొందిన కార్యకర్త... ఉత్సాహంతో పనిచేసే కార్యకర్త... ప్రజల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్ద రాయబారని, కార్యకర్తను గౌరవిస్తే పార్టీ బలపడుతుందని, పార్టీ బలపడితే ప్రజలతో ప్రభుత్వ బంధం మరింత దృఢమవుతుంది” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ కె. రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్. పద్మావతి రెడ్డి, మందుల సామేల్తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్
-
కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?
-
మీనాక్షి సమావేశానికి రాజగోపాల్ రెడ్డి డుమ్మా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా నేతల మధ్య సఖ్యత కోసం భువనగిరిలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ రోజు (సోమవారం) సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశానికి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఈ మ్యాటర్ హాట్ టాఫిక్గా మారింది.కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం టార్గెట్గా రాజగోపాల్ రెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నానని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేస్తూనే.. పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులు, పాత కాంగ్రెస్ నాయకులు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన గౌరవం దక్కాలని అన్నారు. కాంగ్రెస్ను ప్రజల్లో మరింత బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.దీనికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా బదులిచ్చారు. రాజగోపాల్రెడ్డిని ఉద్దేశించి “రాజగోపాల్రెడ్డి హద్దుల్లో ఉండాలి” అని స్పష్టం చేశారు. ఆయన బాధను తాము అర్థం చేసుకోగలమని.. అయితే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.పార్టీకి ఎవరూ అతీతులు కాదని సీఎం అయినా, సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్లో ఒకే నిబంధన వర్తిస్తుందని అన్నారు. పార్టీ గీత దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరాన్ని బట్టి ఎవరి సేవలను ఎప్పుడు వినియోగించుకోవాలో పార్టీ నాయకత్వానికి తెలుసని వ్యాఖ్యానించారు. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని ఆశచూపి క్యాబినెట్లోకి తీసుకోకపోవడంతో ఆయన అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే తన అసంతృప్తిని బహిరంగంగానే తెలియజేస్తూ పార్టీని ఇరకాటంలో పెట్టే యత్నం చేస్తున్నారు. -
విద్యార్థుల ఆందోళనల వేళ సీఎం సోరెన్కు రాహుల్ లేఖ
సాక్షి, ఢిల్లీ: జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు లేఖ రాశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో సీఎం స్వయంగా మాట్లాడాలని ఆయన సూచించారు. అలాగే, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నియామక పరీక్షల్లో అక్రమాలు, విద్యా వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. దీంతో, రాహుల్ లేఖపై చర్చ నడుస్తోంది.లేఖలో భాగంగా.. రాజ్యాంగం కల్పించిన శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని రాహుల్ గాంధీ అన్నారు. జార్ఖండ్ రాష్ట్ర రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు, వారి డిమాండ్లు న్యాయమైనవేనని పేర్కొన్నారు. విద్యార్థులతో ప్రభుత్వం కమిటీ ద్వారా చర్చలు ప్రారంభించడం, వారి కొన్ని డిమాండ్లను అంగీకరించడం అభినందనీయమని రాహుల్ కొనియాడారు. అయితే కొందరు విద్యార్థులు ఇంకా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు.విద్యా వ్యవస్థపై బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శలు..భారతీయ విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ ఆధీనంలోకి తీసుకుని.. విద్యార్థుల శ్రమను దోచుకునే సాధనంగా మార్చాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరింత సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను వినాలని, వారి డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. -
‘భరిస్తున్నా అంతే.. మరో జీవన్రెడ్డిని అయ్యేవాడిని’.. చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గోపాల్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ‘భరిస్తున్నా కాబట్టే పార్టీలో కొనసాగుతున్నా.. లేదంటే మరో జీవన్రెడ్డిని అయ్యేవాడిని’ అంటూ చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్లో కొన్ని తప్పులు జరుగుతున్నాయని, పార్టీకి అన్యాయం చేస్తున్న వారిని బయటకు పంపించాల్సిన అవసరం ఉందని అన్నారు. వనపర్తిలో కొందరు పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. “డబ్బులకు ఆశపడి అధిష్ఠానం నాకు టికెట్ ఇవ్వలేదు” అంటూ ఆరోపించారు. పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం అవసరమని.. ఇందుకోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి సూచించారు. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.అయితే, కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేదికగా చిన్నారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వనపర్తి కాంగ్రెస్లో అంతర్గత విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. ఆయన వ్యాఖ్యలపై పార్టీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఇప్పటికే హైకమాండ్పై తీవ్ర విమర్శలు చేస్తుండగా.. చిన్నారెడ్డి కూడా ఆ లిస్టులో చేరిపోయారు. -
సొంతింటి యజమానులకు ‘22–ఏ’ పిడుగు..!
సాక్షి, హైదరాబాద్: సొంతింటి యజమానులపై రాష్ట్ర ప్రభుత్వం ‘22–ఏ’ పిడుగు వేసింది. ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చింది. గ్రేటర్ వ్యాప్తంగా లక్షలాది అపార్ట్మెంట్లు, స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్లను అకస్మాత్తుగా ‘22–ఏ’లో చేరాయి. దీంతో పిల్లల పెళ్లిళ్లు, విదేశీ చదువులు, వైద్యం, ఇతర ఆర్థిక అవసరాల కోసం ప్రాపర్టీలను విక్రయించుకోలేని నిస్సహాయ స్థితిలో యజమానులు కొట్టుమిట్టాడుతున్నారు. తమ ప్రాపర్టీని ‘22–ఏ’ నుంచి తొలగించండి అంటూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా.. ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఇంటికి ఉన్నట్టుండి ’నిషేధిత’ ముద్ర పడటంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దరఖాస్తులు పట్టుకుని కలెక్టరేట్లు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగలేక, అధికారుల నుంచి సరైన సమాధానం రాక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచి్చబౌలి, షేక్పేట, అమీర్పేట, ఖైరతాబాద్, పంజగుట్ట, శ్రీనగర్కాలనీ, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, బహుదూర్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ వంటి ప్రాంతాల్లోని ఆస్తులు, భూములు ఎక్కువ నిషేధిత జాబితాలో ఉన్నాయి. 54 శాతానికి మించి ఇక్కడే.. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులు, భూముల్లో దాదాపు 54 శాతం కన్నా ఎక్కువ కేవలం మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో లక్ష కంటే ఎక్కువ ఇళ్లు, ఖాళీ ప్లాట్లు, బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లను రెవెన్యూ రికార్డుల్లో 22–ఏ జాబితాలో ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ రూ. లక్ష కోట్ల పైమాటేనని పరిశ్రమ వర్గాల అంచనా. బ్యాంక్లు వీటిపై ఇప్పటికే ఇంటి రుణాలు, మార్ట్గేజ్ రుణాలు మంజూరు చేశాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బ్యాంకింగ్ రంగంలో కూడా ఆందోళన మొదలైంది.అసలు సమస్య ఇదీ.. రిజిస్ట్రేషన్ల చట్టం–1908 లోని ‘సెక్షన్ 22–ఏ’ అనేది క్రయ విక్రయాలకు అర్హత లేని నిషేధిత భూములు/ఆస్తుల జాబితా. ప్రధానంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, సీలింగ్ మిగులు భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులు ఈ సెక్షన్ కింద ఉంటాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల నవీకరణ ప్రక్రియలో భాగంగా ఆస్తులను 22–ఏ జాబితాలో చేర్చడంతో సమస్యగా పరిణమించింది. -
‘మమ్మల్ని ఏపీలో కలిపేయండి’.. కర్ణాటక ఎమ్మెల్యే వ్యాఖ్యల దుమారం
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.వై. గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. తన నియోజకవర్గమైన మోళకల్మూరుకు ప్రభుత్వాలు వరుసగా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఈ ప్రాంతాన్ని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో కలిపేయడం లేదా చల్లకెరె తాలూకాలో విలీనం చేయడం మంచిదని వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.మోళకల్మూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన గోపాలకృష్ణ..‘మోళకల్మూరు ఎవరికీ కనిపించడం లేదు. ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యం లభిస్తున్నా ఈ పట్టణం ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా తిరిగి ఎన్నిక కావడం లేదు. ఈ పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపినా లేదా చల్లకెరె తాలూకాలో చేర్చినా బాగుంటుంది. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది’ అంటూ ఆవేదనతో కామెంట్స్ చేశారు. కాగా, మోళకల్మూరు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో ఆయన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.ఖండించిన ఎమ్మెల్యే..అయితే తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన కొద్ది గంటల్లోనే గోపాలకృష్ణ వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. మోళకల్మూరు తాలూకాకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని, ముఖ్యంగా సాగునీటి సౌకర్యాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మాత్రమే తాను కోరినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలని తాను డిమాండ్ చేసినట్లు వచ్చిన ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేదని స్పష్టం చేశారు.పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగోపాలకృష్ణ తాజా వ్యాఖ్యలకు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కకపోవడంపై ఆయన ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ, సీనియర్ నేతలను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము తీవ్రంగా బాధపడుతున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 1997 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గోపాలకృష్ణ, 2018 నుంచి 2023 వరకు బీజేపీలో ఉన్నారు. అనంతరం తిరిగి కాంగ్రెస్లో చేరారు. తన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటానని ఆయన గతంలో పేర్కొన్నారు. -
కల్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపి పథకాలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి అంశంపై హైకోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి, మంత్రుల కేసుల్లో ప్రైవేటు న్యాయవాదులకు భారీగా చెల్లించే ప్రభుత్వం.. పేద ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన ఈ పథకాన్ని కాపాడేందుకు ఎందుకు కౌంటర్ వేయలేదని నిలదీశారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులతో ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో కేటీఆర్ మాట్లాడారు.తులం బంగారం హామీ ఏమైంది?కేసీఆర్ ప్రభుత్వం 2014లో ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా సుమారు 13 లక్షల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర సాయం అందించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఎన్నికల్లో కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఆ హామీని అమలు చేయాల్సి వస్తుందనే భయంతోనే పథకాన్ని రద్దు చేసేందుకు చూస్తోందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి సాయం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కుట్రను అడ్డుకునేందుకు రేపు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, వార్డులో ‘కల్యాణలక్ష్మి ఏమైంది? షాదీ ముబారక్ ఏమైంది? తులం బంగారం ఎప్పుడు ఇస్తారు?’అంటూ కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీసేలా ప్రచారం నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. -
‘దిమాగీ’పై దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మావోయిస్టు తీవ్రవాదం అంతమైనప్పటికీ దిమాగీ నక్సల్స్(మేధో నక్సలైట్లు) మాత్రం సమాజానికి ముప్పుగా మారారని, వారిని గుర్తించి, ఏకాకులని చేయాలని, పూర్తిగా పక్కనపెట్టాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు పట్ల అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మోదీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అసమ్మతిని అణచివేయడానికే విపక్షాలపై దిమాగీ నక్సలైట్ అంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలను అధికార బీజేపీ నాయకులు సమర్థించారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుల గురించి కాకుండా.. కేవలం మావోయిస్టులకు, వేర్పాటువాదులకు మద్దతునిస్తూ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వ్యక్తుల గురించి మాత్రమే ప్రధానమంత్రి మాట్లాడారని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను దిమాగీ నక్సల్స్ అనలేదు. 1.మావోయిస్టులకు మద్దతు ఇస్తూ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారు. 2.వేర్పాటువాదులతో అండగా నిలుస్తూ ఆరి్టకల్ 370కి మద్దతిచ్చే వారు. 4.భారతదేశం నుంచి ఈశాన్య ప్రాంతాన్ని వేరు చేయడానికి కోడి మెడ(చికెన్ నెక్)ను కత్తిరించాలని కుట్రలు సాగించేవారు మాత్రమే దిమాగీ నక్సల్స్’’ అని కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు. 3 వస్తుంది, 4 కాదు: పవన్ ఖేరా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన ట్వీట్పై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా ‘ఎక్స్’లో వ్యంగ్యంగా స్పందించారు. ‘‘సోదరా కిరణ్ రిజిజు.. ముందు మీ లెక్కింపును సరిచేసుకోండి. అప్పుడు మేము సమాధానం ఇస్తాము. 1, 2 తర్వాత 3 వస్తుంది, 4 కాదు’’ అని పోస్టుచేశారు. పవన్ ఖేరా ట్వీట్పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత జైరామ్ రమేశ్ ప్రతిస్పందించారు. ‘‘సమస్త రాజకీయ శాస్త్రపు అద్భుతం’’ అని పేర్కొన్నారు. ‘‘నేను దిమాగీ నక్సలైట్ అయినందుకు గర్విస్తున్నాను’’ అంటూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సైతం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. చిదంబరంపై బీజేపీ నేతల ఆగ్రహం పి.చిదంబరం పోస్టుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి.ఎల్.సంతోష్ విమర్శలు గుప్పించారు. ‘‘ఇందులో ఆశ్చర్యం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చిదంబరం కాషాయ ఉగ్రవాదానికి ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశారు’’ అని పోస్టుచేశారు. చిదంబరం తీరుపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆగ్రహం వ్యక్తంచేశారు. అణ్వాయుధాల అవసరంపై దేశంలోనూ, పార్లమెంట్లోనూ పూర్తి స్థాయి, సరైన చర్చ జరిగేంత వరకు వాటిని సమకూర్చుకోవడాన్ని, భారత సాయుధ దళాలలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ చిదంబరం మాట్లాడినట్లుగా ఉన్న ఒక పాత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘నేటి ప్రపంచ పరిస్థితులను గమనిస్తే సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పారీ్టకి చెందిన చిదంబరం చేసిన ఈ వ్యాఖ్య దిమాగీ నక్సల్ వ్యాఖ్య అవునా కాదా.. మీరే చెప్పండి?’’ అని దూబే పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సైతం చిదంబరంపై తీరుపై మండిపడ్డారు. ఆయన దిమాగీ నక్సల్ అనే బిరుదు తగిలించుకోవడం ఆలస్యమైనా, అది మంచి పరిణామమేనని అన్నారు. ‘‘చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు, యూపీఏ ప్రభుత్వ హయాంలో నక్సలిజం ఎందుకు బలపడిందో ఇప్పుడు అర్థమైంది. 2004–2014 మధ్య నక్సలిజంపై పోరాడుతూ దాదాపు 2,000 మంది పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఎందుకు ప్రాణాలు కోల్పోయారో ఇప్పుడు మాకు తెలిసింది. యూపీఏ ప్రభుత్వ పాలనలో నక్సల్స్ దాడుల వల్ల 5,000 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. చిదంబరం హోం మంత్రిగా ఉన్నప్పుడు పోలీసు ఆయుధాగారాల నుంచి నక్సలైట్లు ఆయుధాలు దోచుకుపోవడానికి అనుమతించారు’’ అని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ చెప్పిన ‘దిమాగీ నక్సల్స్’ అంటే ఢిల్లీ, ముంబై, పట్నా, కోల్కతాల్లోని ఏసీ గదుల్లో కూర్చుని మావోయిస్టు భావజాలాన్ని పోషించే వ్యక్తులని అర్థమని బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘‘వారు (నక్సలైట్లు) ఉద్యమానికి నిధులు, మద్దతు సమకూర్చుకోవడానికి తమ నెట్వర్క్లను ఉపయోగించుకుంటారు. మావోయిస్టుల దురాగతాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నప్పుడు, దిమాగీ నక్సల్స్ వారిని సమర్థిస్తూ ఆంగ్ల వార్తాపత్రికలలో వ్యాసాలు రాస్తారు’’ అని ఆరోపించారు. -
భారతీయులకే అవమానం.. సోనియా క్షమాపణలు చెప్పాలిందే: అమిత్ షా
ఢిల్లీ: వందేమాతరం వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దేశ ప్రజలను అవమానించిందని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన అవమానాన్ని 140 కోట్ల మంది భారతీయులు కళ్లారా చూశారని అన్నారు. దేశభక్తికి ప్రతీకగా భావించే ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15 సందర్బంగా శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల జరిగాయి. ఈ సందర్భంగా ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని ఆలపించారు. ఆ సమయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు వేదికపై ఉన్నారు. వందేమాతరం పాట ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ ఖర్గేతో మాట్లాడటం, కొన్ని సంజ్ఞలు చేయడం కనిపించిన వీడియో బయటకు రావడంతో వివాదం మొదలైంది. బీజేపీ ఆరోపణ ఏమిటంటే.. పూర్తి ‘వందేమాతరం’ ఆలాపనపై సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసి, దాన్ని ఆపేలా సంకేతాలు చేశారని మండిపడుతున్నారు.కాంగ్రెస్ ఏం చెబుతోంది?కాగా, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పూర్తిగా ఖండించింది. సోనియా గాంధీ పాటను ఆపాలని సూచించలేదని, ఆమె ఖర్గేకు కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సూచించారని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. దీంతో, రాజకీయం దుమారం రేగింది. ఇక్కడ ఒక చారిత్రక అంశం ఉంది. 1937లో కాంగ్రెస్ వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే బహిరంగ కార్యక్రమాల్లో పాడే విధానాన్ని అనుసరించింది. అయితే, 2026లో వందేమాతరం పూర్తి రూపంపై కేంద్రం కొత్తగా ప్రాధాన్యత ఇవ్వడంతో, పూర్తి ఆరు చరణాల ఆలాపనపై రాజకీయ చర్చ మళ్లీ మొదలైంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యక్రమంలో పూర్తి రూపం పాడుతున్న సమయంలో సోనియా గాంధీ చేసిన సంజ్ఞల వీడియో బీజేపీ చేతికి రాజకీయ ఆయుధంగా మారింది. బీజేపీ ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం తమ నేతలు వందేమాతరాన్ని అవమానించారనే ఆరోపణను తిరస్కరిస్తోంది. -
బెంగాల్లో దారుణం: కాంగ్రెస్ నేత, కుమారుని కిరాతక హత్య!
నదియా: పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రాత్రి వేళ నకాషిపారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెతువాడహరి రైల్వే గేట్ సమీపంలో దుండగులు జరిపిన హింసాత్మక దాడిలో సీనియర్ కాంగ్రెస్ నేత అనిసుర్ రెహమాన్, ఆయన కుమారుడు అబు సుఫియాన్ ప్రాణాలు కోల్పోయారు. గుర్తు తెలియని వ్యక్తులు వారి కారును అడ్డగించి తొలుత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత వాహనాన్ని ఆపి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అధిక రక్తస్రావం కావడంతో తండ్రీకొడుకులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నకాషిపారా పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ హత్యల వెనుక స్థానిక ఆధిపత్య పోరు, కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. జైలులో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత జుబ్బార్ షేక్ ఆదేశాల మేరకే ఈ దారుణం జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రజలకు రక్షణ కరువైందని సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. ఈ కిరాతక హత్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ పాటిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ట్రాక్పై తోడేలు తల.. పట్టాలు తప్పిన స్పెషల్ ట్రైన్! -
బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో విద్వేష వ్యాప్తి
న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్లు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల మధ్య విభేదాలను పెంచుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో శాంతి, ఐక్యతలను పెంపొందించేందుకు తమ పార్టీ ప్రేమ దుకాణం తెరిచిందని చెప్పారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఖర్గే ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాం«దీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు పేర్లు మారుస్తూ వాటిని ప్రధాని మోదీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే, మున్ముందు మోదీ మన జాతీయ జెండాను సైతం ఎగురవేయబోరంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రపంచాన్ని తానే సృష్టించానంటూ మోదీ చెప్పుకోలేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా సలహా ఇచ్చి ఈ ప్రపంచాన్ని తానే రక్షించానంటూ చెప్పుకునే ఉండేవారన్నారు. అది మోదీ ఏర్పాటు చేసిన ట్రస్ట్ అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఆరోపణల అంశాన్ని ఖర్గే ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేద ప్రజలు భక్తితో ఇచ్చిన రూ. 50 విరాళానికి కూడా భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విరాళాల దొంగతనానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘తన ఘనతగా చెప్పుకునేందుకే ప్రధాని మోదీ రామాలయ ట్రస్ట్ను ఏర్పాటు చేసి, అందులోకి సొంతవాళ్లను నియమించుకున్నారు. సాధుసంతులతో పనిలేకుండా ఒంటరిగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నిజంగాదేశభక్తుడే అయితే ఆధ్యాతి్మకవేత్తలను, రామభక్తులను కలుపుకుని ఈ కార్యక్రమం పూర్తి చేసేవారు’అని ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం ఎంతకైనా తెగించే ఇలాంటి ధోరణి వల్ల, భవిష్యత్తులో మోదీ జాతీయ జెండాను కూడా కిందకు దింపేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉంది’అని ఆయన వ్యాఖ్యానించారు. నిరసన రాజ్యాంగ హక్కు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకో వడం అంటే ఆనాటి యోధులు కలలుగన్న దేశాన్ని సాకారం చేసే క్రమంలో ఆత్మ విమర్శ చేసుకునేందుకు వచ్చిన ఓ అవకాశమని ఖర్గే చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిర, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్, మన్మోహన్ వంటి కాంగ్రెస్ ప్రధానులు తమ హయాంలోని సవాళ్లకు అనుగుణంగా దేశాన్ని ముందుకు నడిపారని, భవిష్యత్ భారత్కు బలమైన పునాది వేశారని ఖర్గే అన్నారు. నేటి యువత ఆశలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలతో యువత తీవ్ర నిరాశకు గురై దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు. వారికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని, హక్కుల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడటం ఎంతమాత్రం దేశద్రోహం కాదని ఖర్గే స్పష్టం చేశారు. హక్కుల కోసం గొంతు విప్పుతున్న నేటి యువతను దేశద్రోహులుగా చిత్రీకరించవద్దని, స్వాతంత్య్ర పోరాటంతో సాధించిన హక్కులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. -
‘ఉర్దూమే తిరంగా పెహనాహై’
న్యూఢిల్లీ: స్వాతంత్య్రోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ కోటు జేబులోని ఒక వస్త్ర విశేషం శనివారం సామాజిక మాధ్యమంలో పెద్ద దుమారమే రేపింది. మూడు రంగులున్న ఈ పాకెట్ స్క్వెర్పై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. జాతీయ జెండా రంగుల్లోనే ఉన్నప్పటికీ వాటి క్రమం తిరగేసి ఉండటం విమర్శలకు కారణమైంది. ఆ పాకెట్ స్క్వెర్ భారత జాతీయ జెండాలా లేదని, ఐర్లాండ్ పతాకంలా ఉందని కాంగ్రెస్ నేతలు కొందరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే... ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ‘‘లగ్తా హై సాహిబ్ నే ఉర్దూ మే తిరంగా పెహనా హై. యా ఫిర్ భారత్ కి జగా ఐర్లాండ్గా ఇండిపెండెన్స్ డే మనా రహా హై’’(బహుశా ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఉర్దూలో ధరించినట్లు ఉన్నారు. లేదంటే ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్నారేమో) అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ఉర్దూ భాషను కుడి నుంచి ఎడమకు రాస్తారన్న విషయం తెలిసిందే. పవన్ ఖేరా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేథ్ సమర్థించడమే కాకుండా... ఆ పాకెట్ స్క్వెర్లోని రంగులు కాషాయం, తెలుపు, పచ్చలుగా కాకుండా తిరగేసి ఉన్నాయని ఎత్తి చూపారు. ‘‘ఇది ఏ శైలి త్రివర్ణ పతాకం. తిరగేసి ఉంది. భారతదేశానిది కాకుండా ఐర్లాండ్దిలా ఉంది’’అని ఆమె ఎక్స్ పోస్టులో తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు కాంగ్రెస్ను విమర్శిస్తే మరికొందరు మోదీ జాతీయ పతాకాన్ని వేసుకుని తిరగడం లేదని అశోక చక్రం లేని విషయాన్ని ఎత్తి చూపారు. మరికొందరు జాతీయ జెండాకు సంబంధించిన నిబంధనలు పాటించి ఉండాల్సిందని సలహా ఇచ్చారు. ఇంకొందరైతే త్రివర్ణం ధరించడం వెనుక ఉద్దేశాన్ని చూడాలని దీన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. -
ఈ స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ఓ ప్లాస్టిక్ కార్డు కాదు..: రేవంత్ రెడ్డి
సంగారెడ్డి: బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని, నాణేనికి బొమ్మ, బొరుసులాంటివని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో ఆయన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ప్లాస్టిక్ కార్డు కాదని, పేదల ఆత్మగౌరవమని తెలిపారు.‘‘కేసీఆర్కు నేను సవాల్ విసురుతున్నాను. రైతులకు మేము చేసిన మేలు ఏంటో మీరు చేసిన అన్యాయమేంటో చర్చకు సిద్ధం. సంక్షేమ పథకాలపై కొందరు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. చర్చిద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం వరి వేసిన రైతులకు బోనస్ ఇచ్చింది’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదలకు బుక్కెడు బువ్వ పెట్టాలని ఆ రెండు పార్టీలు ఏనాడైనా ఆలోచించాయా? అని రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘పేదల కోసం ఇందిరా గాంధీ అహర్నిశలు పాటుపడ్డారు. రైతులకు మేం చేసిన మేలు ఏంటో మీరు చేసిన మేలు ఏంటో చర్చకు సిద్ధం. పేదల కోసమే రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. సంక్షేమ పథకాలపై కొందరు ప్రశ్నిస్తున్నారు. 3.48 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. బీఆర్ఎస్ సన్నబియ్యం ఇవ్వాలని పదేళ్లలో ఏనాడూ ఆలోచించలేదు’’ అని చెప్పారు.2034 వరకు మీ ఆశీర్వాదం ఉండాలివిధ్వంసం అయిన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘అన్నం తిన్నా తినకపోయినా కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కడుతూ అప్పుల ఊబిలో నుంచి బయటికి వస్తున్నా. ఓ పూట ఆలస్యం కావచ్చు మీ హక్కులను భంగం కలగనివ్వం. బీఆర్ఎస్ పాలన, మా పాలనను అంచనా వేయండి. దేశంలో మొదటిసారి కులగణన చేసేంది కాంగ్రెస్. 2034 వరకు మీ ఆశీర్వాదం ఉండాలి. మీ ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది ఏమి లేదు’’ అని చెప్పారు. -
అలా అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది
కామారెడ్డి : జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వి. హనుమంతరావు అన్నారు. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీల కోసం తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజీలేని పోరాటం చేస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీలను ఓట్ల యంత్రాలుగా వాడుకుంటోందని, వారి అభివృద్ధి కోసం ఏమీ చేయడం లేదని విమర్శించారు.బీసీల పేరు ఎందుకు లేదు?జనగణనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయంగా జరుగుతోందని హనుమంతరావు ఆరోపించారు. కుల గణనలో బీసీల పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు. జనాభా ప్రకారం బీసీలకు న్యాయం చేయాలని, పార్లమెంట్లో బీసీలకు ప్రత్యేక బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ''జనగణనతో పాటు కుల గణన జరపాలి. స్వతంత్ర పోరాటం లెక్క బీసీ కులగణన కోసం పోరాటం చేయాలి. కులగణనతోనే బీసీల అభివృద్ధి సాధ్యం. తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంది. అన్ని కులాల వారు ఒక్కటి కావలె.. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంద''ని హనుమంతరావు వ్యాఖ్యానించారు.అంబేద్కర్ అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుతోందని చెప్పుకొచ్చారు వీహెచ్. బీసీలకు అన్యాయం జరుగుతోందని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారని, పార్లమెంట్లోనూ బీసీల కోసం కొట్లాడుతున్నారని అన్నారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. కింది స్థాయి కులాల గురించి ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు.హుషారుగా వీహెచ్ డాన్స్కామారెడ్డిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు హనుమంతరావు. గిరిజన వేషాధారణలో ఉన్న విద్యార్థినులతో కలిసి ఆయన హుషారుగా స్టెప్పులేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ఆయనతో పాటు డాన్స్ చేశారు. వీహెచ్ డాన్స్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదిరిపోయే స్టెప్పులేసిన వీహెచ్ కామారెడ్డిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో పాల్గొని విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసిన ప్రభుత్వ సలహాదారుడు హనుమంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు#Hanumantharao #Kamareddy #TV9telugu pic.twitter.com/oKI63o50ph— TV9 Telugu (@TV9Telugu) August 15, 2026చదవండి: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త -
అన్నం పెట్టే రాష్ట్రాన్ని నాశనం చేశారు.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలు కొత్త పథకాల జాడే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వ తీసుకవచ్చిన కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, రైతుభీమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికిందని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన ఈ రోజు (శనివారం) మీడియా సమావేశం నిర్వహించారు. దేశానికే అన్నం పెట్టిన తెలంగాణను ఈ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. తెలంగాణ మళ్లీ పట్టాలెక్కాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేసీఆర్ రావాల్సిన అవసరం ఉందన్నారు. -
నోరు అదుపులో పెట్టుకో కోమటి రెడ్డిపై కాంగ్రెస్ సీరియస్
-
‘హద్దుల్లో ఉంటే మంచిది’.. రాజగోపాల్కు పీసీసీ చీఫ్ కౌంటర్
యాదాద్రి భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత అసంతృప్తి స్వరం వినిపించింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నానని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేస్తూనే.. పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్.. పార్టీకి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేస్తూ.. సీఎం అయినా, సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్లో ఒకే నిబంధన వర్తిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్రెడ్డి హద్దుల్లో ఉండాలి అని స్పష్టం చేశారు.చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజగోపాల్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాన్ని తాను విమర్శించడం లేదని చెప్పారు. అయితే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నానని తెలిపారు.ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులు, పాత కాంగ్రెస్ నాయకులు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన గౌరవం దక్కాలని అన్నారు. కాంగ్రెస్ను ప్రజల్లో మరింత బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణ ఆత్మగౌరవం అంశాన్ని కూడా రాజగోపాల్రెడ్డి ప్రస్తావించారు. “సీమాంధ్ర పాలకుల మీడియా చెప్పుచేతల్లో తెలంగాణ ప్రభుత్వం నడవకూడదు.. తెలంగాణ ఆత్మగౌరవంతోనే ప్రజాపాలన సాగాలి” అని అన్నారు.ప్రభుత్వ పాలన పేదల కోసం ఉండాలని.. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలహీనపడకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని మరోసారి తేల్చిచెప్పిన రాజగోపాల్రెడ్డి.. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మొత్తంగా.. పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తూనే కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలపై రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? లేక పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారా? అన్న చర్చ మొదలైంది.మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తి వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేస్తూ.. సీఎం అయినా, సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్లో ఒకే నిబంధన వర్తిస్తుందని అన్నారు. పార్టీ గీత దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరాన్ని బట్టి ఎవరి సేవలను ఎప్పుడు వినియోగించుకోవాలో పార్టీ నాయకత్వానికి తెలుసని వ్యాఖ్యానించారు.రాజగోపాల్రెడ్డిని ఉద్దేశించి “రాజగోపాల్రెడ్డి హద్దుల్లో ఉండాలి” అని స్పష్టం చేశారు. ఆయన బాధను తాము అర్థం చేసుకోగలమని.. అయితే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇక రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి హామీ ఉందన్న ప్రచారంపైనా పీసీసీ చీఫ్ స్పందించారు. ఆయనకు మంత్రి పదవి హామీకి సంబంధించిన సమాచారం తనకు ఉందని, అయితే తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “క్రమశిక్షణ ఒక లెవల్ వరకే ఉంటుంది” అంటూ పరోక్షంగా నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, ప్రభుత్వం.. పార్టీ వేరు కాదు. పార్టీ ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది. సమిష్టి నిర్ణయంతోనే అన్ని జరుగుతాయి. కో-ఆర్డినేషన్ కమిటీ ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టేందుకు కాదు. ప్రభుత్వం ఏం చేసినా పార్టీతో చర్చించడం అవసరం అని వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దక్కడం లేదన్న రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమకారులేనని అన్నారు. ప్రతి ఒక్కరి కోరికను ఒకేసారి తీర్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవల రాజగోపాల్రెడ్డి “కాంగ్రెస్లోనే ఉన్నా.. రాహుల్గాంధీ నాయకత్వంలో పనిచేస్తా” అంటూ పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. మహేశ్గౌడ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు మంత్రి పదవిపై హామీ ఉందన్న సంకేతం.. మరోవైపు ‘హద్దుల్లో ఉండాలి’ అంటూ హెచ్చరిక.. దీంతో రాజగోపాల్రెడ్డి విషయంలో తెలంగాణ కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
కర్ణాటకలో కొత్త బిల్లు.. ఆరెస్సెస్కు చెక్ పెట్టేందుకేనా?
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్-ఆరెస్సెస్ మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ భవనాలు, భూములు, పార్కులు, ఆటస్థలాలు, రోడ్లు తదితర ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, సంఘాలు వినియోగించుకునే విధానాన్ని నియంత్రించేందుకు సిద్ధమైన కొత్త బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యం ఆరెస్సెస్ను కట్టడి చేయడమేనా? అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.‘కర్ణాటక రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రెమైసెస్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీ బిల్–2026’ పేరుతో తీసుకొస్తున్న ఈ చట్టం ద్వారా ప్రభుత్వ ఆస్తుల వినియోగానికి స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర కార్యకలాపాల కోసం ప్రభుత్వ స్థలాలను ఉపయోగించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేసినా, వాటికి నష్టం కలిగించినా చర్యలు, జరిమానాలకు అవకాశం ఉండనుంది. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే మాత్రం ఈ బిల్లు ఏ ఒక్క సంస్థను లక్ష్యంగా చేసుకుని తీసుకురావడం లేదని స్పష్టం చేశారు. ప్రజా ఆస్తులను రక్షించడం, వాటి వినియోగంలో జవాబుదారీతనం తీసుకురావడమే ఉద్దేశమని చెప్పారు. ప్రత్యేకంగా ఆరెస్సెస్, ఏదైనా సంస్థ, క్లబ్, యూనియన్ లేదా ఎన్జీవోను అడ్డుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు.అయితే, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం గత కొంతకాలంగా ఆరెస్సెస్ ప్రభుత్వ స్థలాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రజా ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 2025లో ప్రభుత్వం ఇలాంటి వినియోగంపై నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, ఆ ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టులో సవాళ్లు ఎదురయ్యాయి. ఇప్పుడు అదే అంశానికి చట్టబద్ధమైన రూపం ఇవ్వడానికి కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 2026 జూన్లో ప్రియాంక్ ఖర్గే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్కు బహిరంగ లేఖ రాయడం కూడా ఈ పరిణామానికి రాజకీయ నేపథ్యాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఆరెస్సెస్ చట్టపరమైన నమోదు, ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాల్లో పారదర్శకత, పన్నుల నిబంధనలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో తాజాగా కేబినెట్ ఆమోదించిన బిల్లుపై సహజంగానే ఆరెస్సెస్ పేరు చర్చకు వచ్చింది. కొన్ని రాజకీయ వర్గాలు ఇది ఆరెస్సెస్ కార్యకలాపాలపై నియంత్రణ పెంచే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం “నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి” అని చెబుతోంది.ఈ బిల్లు కేవలం ఆరెస్సెస్ కార్యక్రమాలకే పరిమితం కాదు. ప్రభుత్వ భూములు, భవనాలు, పార్కులు, ఆటస్థలాలు, రోడ్లు వంటి ప్రజా ఆస్తులను ఉపయోగించే ప్రైవేటు సంస్థలు, సంఘాలు, అసోసియేషన్లు, సొసైటీలు అన్నింటికీ ఒకే విధమైన అనుమతి వ్యవస్థను తీసుకురావడం ప్రతిపాదనలో ఉంది. అనుమతి లేకుండా వినియోగించడం లేదా ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అంశాలపై కూడా చర్యలు ఉండనున్నాయి. అయితే అసలు రాజకీయ పరీక్ష ఇక ముందే ఉంది. కేబినెట్ ఆమోదించిన బిల్లును శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాల్సి ఉంది. అక్కడ ప్రతిపక్షం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది? ప్రభుత్వం నిబంధనలను ఎలా అమలు చేస్తుంది? ఆరెస్సెస్ సహా ఇతర సంస్థలు దీనిపై న్యాయపరంగా స్పందిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
‘హగ్’ కామెంట్ రచ్చ.. షీలా వీడియోతో బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ నేతలతో కొనసాగించే సాన్నిహిత్యంపై విమర్శలు చేస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త మాటల యుద్ధానికి తెరలేపాయి. మరీ ముఖ్యంగా షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్పై బీజేపీ, మోదీ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గురువారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై విమర్శలు చేశారు. ‘‘మోదీకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వింత ఆలోచనలు వస్తుంటాయి. ఇదే విదేశాంగ విధానం అనుకుంటున్నారు’’ అంటూ వేదికపైనే కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను ఆలింగనం చేసుకున్నారు.RaGa is in full roast mode.🤣🔥Rahul Gandhi just gave the most savage demonstration of “hug diplomacy”.*Runs and hugs Sandeep Dikshit*The hall couldn’t stop laughing. This one will travel. pic.twitter.com/XodlA8MvS8— Rajat Jain (@RajatJain) August 13, 2026ఈ సమయంలో సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘నన్ను మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా?’’ అని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఘోల్లున నవ్వారు. దీనికి రాహుల్ గాంధీ.. ‘‘ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు’’ అంటూ బదులివ్వడంతో సభలో నవ్వులు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రాజకీయ దుమారం మొదలైంది.మోదీ ‘హగ్ డిప్లమసీ’పై రాహుల్ సెటైర్పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ కౌగిలించుకున్న సందర్భాలను ఉద్దేశించే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. విదేశాంగ విధానంలో దౌత్య సంబంధాల కంటే వ్యక్తిగత ఇమేజ్, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెస్ గతంలోనూ మోదీపై విమర్శలు చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రధాని స్థాయిని, అంతర్జాతీయ సంబంధాలను ఎగతాళి చేసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించింది. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడింది.బీజేపీ–ఆర్ఎస్ఎస్పై రాహుల్ విమర్శలుఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత పరిస్థితులపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తన అసలు స్వరూపాన్ని కోల్పోయిందని, పెద్ద పారిశ్రామిక వర్గాల ప్రభావంలోకి వెళ్లిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీ, అంబానీల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.‘‘మోదీ, అమిత్ షాకు నిద్ర లేకుండా చేస్తాం’’కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. అయితే తమ పోరాటం ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పారు.సందీప్ దీక్షిత్ నేపథ్యంసందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక అభివృద్ధి రంగంలో పనిచేసిన ఆయన.. ‘సంకేత్’ అనే సంస్థను నడిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగుతూ ఢిల్లీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. షీలా దీక్షిత్ ప్రస్తావనతో బీజేపీ కౌంటర్ఈ వివాదంలో బీజేపీ నేతలు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చారు. 2024లో ప్రధాని మోదీ.. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ షీలా దీక్షిత్ను గౌరవిస్తూ, ఆమెపై వచ్చిన ఆరోపణల తీరుపై బాధపడ్డానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇప్పుడు అదే మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ విమర్శిస్తోంది. మెలోనీ పేరును ప్రస్తావిస్తూ ఓ మహిళా దేశాధినేతను రాజకీయ వ్యంగ్యంలోకి లాగడం సరికాదని ఆరోపిస్తోంది. మరోవైపు.. పలువురు సీనియర్ జర్నలిస్టులు సైతం ఈ తరహా రాజకీయం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. In 2024, PM Modi publicly said he was PAINED by the way Sheila Dikshit was "INSULTED" with baseless Corruption allegations.Today her own son, Sandeep Dikshit, stands on stage with Rahul & mocks the same Prime Minister 💔> He reduces a diplomatic gesture to a cheap joke by… pic.twitter.com/tALdiFnJhd— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 13, 2026‘‘మెలోనీ పేరు ప్రస్తావించలేదు’’రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించింది. ఆయన ఎక్కడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రధాని మోదీ విదేశాంగ శైలిపై రాజకీయ విమర్శ మాత్రమే చేశారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతలు.. అంతర్జాతీయ దౌత్యంలో వ్యక్తిగత హావభావాలను ఎలా చూపిస్తున్నారనే అంశంపైనే రాహుల్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రధాని మోదీ విదేశీ నేతలతో చేసే కౌగిలింతలను కాంగ్రెస్ గతంలోనూ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు.ట్రెండింగ్లో మెలోనీప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఆ ట్రెండ్ను పసిగట్టిన ఇద్దరూ.. అందుకు తగ్గట్లే మెలోడీ పేరుతో సరదా పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలో యూరప్ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఆమెకు మెలోడీ చాక్లెట్లు బహుకరించడం గమనార్హం. అంతెందుకు కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతోనూ ఈ మధ్య నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. అయితే.. తాజా రాహుల్ గాంధీ హగ్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యంతరాల నేపథ్యంతో నెట్టింట మెలోనీ మరోసారి ట్రెండింగ్లోకి వచ్చేశారు. -
ప్రభుత్వం మారితే సరిపోదు.. అదే నాకు బహుమతి: వాంగ్చుక్
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కేవలం ప్రభుత్వాలు మారడం సరిపోదని.. దేశ రాజకీయ వ్యవస్థలోనే మౌలిక మార్పులు రావాలని ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ అన్నారు. దేశానికి ఇప్పుడు ఒక ‘శాంతియుత విప్లవం’ అవసరమని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి విద్యే పునాది అని వాంగ్చుక్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకుండా దేశం ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో వాంగ్చుక్ భారత్ భవిష్యత్తుపై తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఒకప్పుడు భారత్తో సమానంగా లేదా వెనుకబడి ఉన్న థాయ్లాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు నేడు వేగంగా ముందుకు దూసుకెళ్లాయని ఆయన గుర్తుచేశారు. ‘ఇదే వేగంతో కొనసాగితే 2047 నాటికి భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది’ అని ఆయన హెచ్చరించారు.విద్య వెనుకబడితే.. దేశ అభివృద్ధికి విద్యే పునాది అని వాంగ్చుక్ స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రాకుండా దేశం ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. ఇటీవల మార్పు కోసం ప్రజలు చేపట్టిన ఆందోళనలను ప్రస్తావించిన ఆయన.. కొన్ని సందర్భాల్లో మంత్రుల రాజీనామాలు జరిగినా, కేవలం వ్యక్తుల మార్పుతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఇదే సమయంలో తన విమర్శలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రజల గొంతుకలను అణచివేస్తున్నారనే ఆరోపణలు వివిధ ప్రభుత్వాలపై వస్తున్నాయని అన్నారు.2012-13లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తుచేస్తూ.. ఆ ఉద్యమం తర్వాత ప్రభుత్వం మారినా అవినీతి, అన్యాయం పూర్తిగా అంతం కాలేదని వ్యాఖ్యానించారు. సమస్యలు ఇప్పుడు మరో రూపంలో మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయని అన్నారు. భారత్ రాజకీయ వ్యవస్థలో ప్రధాన సమస్య నాయకులను ఎన్నుకునే విధానమే అంటూ తన అభిప్రాయపడ్డారు. నాయకులు సరైనవారు కాకపోతే.. మొత్తం దేశమే తప్పుదారి పడుతుందని.. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్యపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.THIS INDIPENDENCE DAY, I NEED YOUR HELP...This country needs a peaceful revolution, at least in how we chose our leaders... if we are to remain even a respectable nation by 2047.Close to half of our MPs have criminal cases and a third have serious charges like murder, rape &… pic.twitter.com/10byPuzwtX— Sonam Wangchuk (@Wangchuk66) August 13, 2026అదే నాకు బహుమతి.. అయితే తాను అధికార పార్టీని కానీ, ప్రతిపక్షాన్ని కానీ లక్ష్యంగా చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘ఇది ఏ పార్టీ సమస్య కాదు.. దేశ సమస్య’ అని వ్యాఖ్యానించారు. దేశానికి కొత్త రాజకీయ దిశను చూపించగల వ్యక్తులను గుర్తించేందుకు ప్రజల సహకారం కోరారు. కేవలం మేధావులు మాత్రమే కాకుండా.. నిస్వార్థంగా పనిచేసే, మంచి వ్యక్తిత్వం కలిగిన, సూత్రాలకు కట్టుబడి ఉండే వ్యక్తులు కావాలని అన్నారు. దేశవ్యాప్తంగా అలాంటి వ్యక్తుల పేర్లను ప్రజలు సూచించాలని ఆయన కోరారు. వివిధ రాష్ట్రాలు, నగరాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి నాకు ఇవ్వగలిగే ఉత్తమ బహుమతి.. అలాంటి మంచి వ్యక్తుల పేర్లను సూచించడమే అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. -
నామి'లేట్'డ్ పదవులు
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడనేది అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా గత నెలలో పదవీకాలం పూర్తయిన కార్పొరేషన్ చైర్మన్లు, ఇప్పటి వరకు భర్తీ చేయని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎప్పుడు ప్రకటిస్తారనే విషయంలో కంగాళీ ఏర్పడింది. అసలు ఈ పోస్టుల భర్తీ ఉంటుందా ? ఉంటే ఎప్పుడు? ప్రాతిపదికలేమిటి? గతంలో పనిచేసిన వారికి మళ్లీ అవకాశమిస్తారా? పూర్తిగా కొత్త వారిని నియమిస్తారా? తదితర ప్రశ్నలు కాంగ్రెస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల అనంతరం ఆగస్టులో పార్టీ పదవులు భర్తీ చేసి, సెప్టెంబర్లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించినా, ఆశావహుల్లో మాత్రం సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. అసలు ఇప్పట్లో కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేసేది లేదని ఓ ముఖ్య నేత ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానించడం ఈ కంగాళీకి కారణమవుతోంది. అయితే, సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 19నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈలోపే కొన్ని నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తారనే చర్చ ఆశావహులకు కొంత ఊరటనిస్తున్నా అది జరుగుతుందా లేదా అనే మీమాంస మాత్రం వారిని వెంటాడుతుండడం గమనార్హం. పెద్ద ఎత్తున ఆశావహులు అవకాశం ఎదురుచూస్తున్న వారి జాబితా చాంతాడంత కనిపిస్తోంది. కొత్తగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేతలే ఉమ్మడి జిల్లాకు ఓ 20 మందికి తగ్గకుండా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పిడమర్తి రవి, నాగా సీతారాములు, సాధు రమేశ్రెడ్డి, వక్కలగడ్డ చంద్రశేఖర్, కమర్థపు మురళి (ఖమ్మం), గౌరి సతీష్, అయిళ్ల శ్రీనివాస్గౌడ్ (రంగారెడ్డి), సీఎన్రెడ్డి, పల్లె లక్ష్మణ్కుమార్, బొల్లు కిషన్ (హైదరాబాద్), కొక్కిరాల విశ్వప్రసాద్ , దుర్గం భాస్కర్, రేఖానాయక్, పురాణం సతీశ్కుమార్ (ఆదిలాబాద్), వినయ్రెడ్డి, మార చంద్రమోహన్రెడ్డి, ఏబీ శ్రీనివాస్, మునిపల్లి సాయారెడ్డి, అరికెల నర్సారెడ్డి (నిజామాబాద్), కర్ల సత్యప్రసన్నరెడ్డి, ఆకారపు భాస్కర్రెడ్డి, ఊట్కూరు నరేందర్రెడ్డి (కరీంనగర్), పున్నా కైలాష్ నేత, కొండేటి మల్లయ్య, గుమ్ముల మోహన్రెడ్డి, లక్ష్మి నారాయణరెడ్డి, చనగాని దయాకర్ (నల్లగొండ), ఇనగాల వెంకట్రామ్రెడ్డి, ఈవీ శ్రీనివాస్, ఐత ప్రకాశ్రెడ్డి, కొనగాల మహేశ్ (కరీంనగర్)ల పేర్లు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గతంలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారు కలిపి ప్రతి జిల్లాలో 20 మందికి తగ్గకుండా ఆశావహులు కనిపిస్తున్నారు. ఎవరి మాట నెగ్గుతుందో..? ఇటీవల ఢిల్లీలో జరిగిన తెలంగాణ ముఖ్య నేతల భేటీ అనంతరం గాం«దీభవన్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. గతంలో నామినేటెడ్ పదవులతో సహా ఎలాంటి కీలక విషయంలోనైనా సీఎం, టీపీసీసీ చీఫ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జులు నిర్ణయం తీసుకునే ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయితే, ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో టీపీసీసీ సమన్వయ కమిటీలో చర్చించిన తర్వాతే పదవుల భర్తీపై తుది నిర్ణయానికి రావాలని రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అధిష్టానం స్పష్టం చేసిందని తెలుస్తోంది. మరో విశేషమేమిటంటే... హస్తినలో భేటీలు ముగిసిన అనంతరం రాష్ట్రానికి వచ్చిన పార్టీ నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారని, గతంలో లాగా రాజకీయ చర్చలు జరగడం లేదన్న చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతుండడం నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో మరింత గుబులు రేపుతోంది. -
తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పథకం రద్దు?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పరిపాలనా చరిత్రలో ఇది చీకటి రోజని, కళ్యాణ లక్ష్మి పథకం రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఒకే రోజు 8 జీవోల అమలును నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. అడ్వకేట్ విజయ్ గోపాల్ వేసిన పిల్ విచారణ సందర్భంగా, గత నెల రోజులుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి కౌంటర్ దాఖలు కాకపోవడం వల్లే హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.జులై 8 నుంచి ఆగస్టు 7 వరకు ఐదు సార్లు సమయం తీసుకున్నప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేసిందని ఆయన ఆరోపించారు. గత 9 నెలలుగా వెరిఫికేషన్ పేరుతో ఈ పథకానికి నిధులు ఆపేశారని, కేసీఆర్ హయాంలో బాల్య వివాహాలను అరికట్టడానికి, పేదల కష్టాలు తీర్చడానికి తెచ్చిన ఈ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 13 లక్షల మంది లబ్ది పొందారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ మాదిరిగానే ఈ పథకాన్ని కూడా నాశనం చేసి, ఇక్కడి నిధులను మెఘా, పొంగులేటి, రేవంత్ రెడ్డి బంధువుల కంపెనీలకు మళ్లించే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, ఆ నోట్ ఫైల్ పట్టుకొని గన్ పార్క్ వద్దకు చర్చకు రావాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరి, అజారుద్దీన్లకు సవాల్ విసిరారు.ప్రభుత్వానికి చేతకాకపోతే తమ బీఆర్ఎస్ లీగల్ సెల్ను సంప్రదించాలని, ఆర్టికల్ 15(3), ఆర్టికల్ 21 ప్రకారం ఈ పథకం చట్టపరమైనదేనని తామే కౌంటర్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీని ప్రజలు అడుగుతారనే భయంతోనే ప్రభుత్వం ఈ పథకానికి మంగళం పాడుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు. -
కరవు రావాలని కొందరు క్షుద్ర పూజలు చేశారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘కరవు రావాలని కొందరు క్షుద్ర పూజలు చేశారు. కానీ దేవుడు మన వైపే ఉన్నాడు.. వర్షాలు కురిపించాడు. ఇలాంటి పూజలు చేస్తే మీకే తిరగబడుతుంది’’ అంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అడిగి చేయించుకోండి. కూకట్పల్లి నియోజకవర్గాన్ని ప్రతీక దృష్టితో అభివృద్ధి చేయాలని శ్రీధర్ బాబుని ఆదేశిస్తున్నానన్నారు.‘‘గత పదేళ్ల పాలన, ఈ రెండేళ్ల మా పాలనను బేరీజు వేసుకోండి. తెలంగాణలో రూ.3 కోట్ల 28 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఆడ బిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా అందించాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాం. కడుపులో విషం పెట్టుకుని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి ఉసిగొల్పినా వెనక్కి తగ్గలేదు..ఆడ బిడ్డలను బస్సులకు యజమానులను చేశాం. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాం. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో స్టాళ్లను ఇచ్చాం. ఒక వైపు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించుకుంటూనే.. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. డబ్బా ఇండ్లు వద్దు.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న వాళ్లు మీలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా?. పట్టణంలో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్కు శ్రీకారం చుట్టింది..మొదటి విడతలో లక్ష ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ సొంతింటి కలను నిజం చేసేందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా. 22 ఏ విషయంలో మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాది. ఈ విషయంలో మీకు ఆందోళన అవసరం లేదు. సోషల్ మీడియాలో కొందరు చేసే అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు. పదేళ్ల వారి పాలను.. రెండేళ్ల మీ తమ్ముడి పాలనను బేరీజు వేసుకోండి. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళుతున్నాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. -
‘అన్నం పెట్టిన వాళ్లను మర్చిపోతే పుట్టగతులుండవు’
కామారెడ్డి: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, అలా ఎవరికి అమ్ముడుపోలేదన్నారు. కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్కు మద్దతిచ్చానన్నారు. అభివృద్ధి జరుగుతుందనే ఆశతో సీఎం రేవంత్కు మద్దతు తెలిపానని పోచారం స్పష్టం చేశారు. తన మాటల వెనుక రాజకీయ రహస్యం ఏది కూడా లేదని, ఉన్నది ఉన్నట్లు చెప్పడం తన నైజమన్నారు.రెండు రోజుల క్రితం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పోచారం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల విధేయతతో మాట్లాడారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదరవుతున్న ఇబ్బందులపై ఆయన పశ్చాత్తాప వ్యాఖ్యలు చేశారు.మంత్రి పదవి కోసమో, డబ్బుల కోసమో పార్టీ మారలేదు. కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదని చెప్పాను. కండువా కప్పుకుంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామంటే తప్పని పరిస్థితుల్లో కండువా కప్పుకున్నా. 6 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎం చెప్పినా మంత్రులు నా ఫోన్ ఎత్తడం లేదు’ అని అన్నారు. -
సీఎం ఎదుట కన్నీళ్లు.. లంచం ఆరోపణలు.. అసలు ట్విస్ట్ ఇచ్చిన గోల్డ్ మెడలిస్ట్!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో 12వ తరగతి చదువుతున్న ఒక క్రీడాకారిణి అంతర్జాతీయ తైక్వాండో టోర్నమెంట్కు వెళ్లలేకపోయిన ఉదంతం రాజకీయ దుమారానికి దారితీసింది. ఆ విద్యార్థిని వద్ద రూ. 1.5 లక్షలు లంచం డిమాండ్ చేశారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించగా, ఆ తర్వాత సదరు విద్యార్థిని మరో వీడియో విడుదల చేసి అసలు వాస్తవాలను వెల్లడించింది.డెహ్రాడూన్లోని సీఎన్ఐ గర్ల్స్ స్కూల్కు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని శైరా, ఆగస్టు 10న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నిర్వహించిన ‘ముఖ్యమంత్రి యువ విద్యార్థి మంథన్’ కార్యక్రమంలో పాల్గొంది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యానని, అయితే రూ. 1.5 లక్షలు సమకూర్చుకోలేక ఆ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయానని సీఎం ఎదుట భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. దీంతో సీఎం ధామి ఆమెను ఓదార్చి, విద్యార్థిని వివరాలు సేకరించి తగిన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.లంచం ఆరోపణలతో కాంగ్రెస్ విమర్శలుఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో స్పందించింది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థిని నుంచి రూ. 1.5 లక్షలు లంచం డిమాండ్ చేశారని ఆరోపిస్తూ ఎక్స్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. జాతీయ స్థాయిలో స్వర్ణం గెలిచిన ప్రతిభావంతురాలైన విద్యార్థినిని బీజేపీ అవినీతి పాలన వల్ల అంతర్జాతీయ వేదికకు దూరం చేశారని ధ్వజమెత్తింది. అంతేకాకుండా, ముఖ్యమంత్రి సోషల్ మీడియా ఖాతాల నుంచి ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని తొలగించారని కాంగ్రెస్ ఆరోపించింది.उत्तराखंड में एक बहादुर बेटी ने CM पुष्कर सिंह धामी के सामने खड़े होकर BJP सरकार के भ्रष्टाचार की पोल खोल दी।बच्ची ने बताया 👇मैंने ताईक्वांडो में नेशनल लेवल पर गोल्ड मेडल जीता था, लेकिन मैं इंटरनेशनल खेलने नहीं जा सकी, क्योंकि मुझसे 1.5 लाख रुपए की घूस मांगी गई।CM धामी ने… pic.twitter.com/D9kKJiyOm9— Congress (@INCIndia) August 12, 2026 అసలు వాస్తవం చెప్పిన విద్యార్థినిఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో శైరా మరో వీడియోను విడుదల చేసి పూర్తి వివరణ ఇచ్చింది. సీఎం కార్యక్రమంలో సమయం లేక పూర్తి విషయాన్ని చెప్పలేకపోయానని తెలిపింది. జమ్మూలో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్లో గెలిచిన తర్వాత రొమేనియాలో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్కు ఎంపికైనట్లు పేర్కొంది. ఆ పర్యటనకు అయ్యే మొత్తం ఖర్చులో సంబంధిత క్రీడా సంస్థ సుమారు రూ. 1.70 లక్షలు భరించేందుకు అంగీకరించిందని, మిగిలిన రూ. 1.5 లక్షల ఖర్చును తానే స్వయంగా భరించాల్సి వచ్చిందని వివరించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన మిగతా మొత్తాన్ని సమకూర్చుకోవడంలో సహాయం కోరాలని తన పాఠశాలకు గానీ, ఇతరులకు గానీ ముందుగా సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఈ రూ. 1.5 లక్షలు ఎవరూ అడిగిన లంచం కాదని, టోర్నమెంట్ ఖర్చుల్లో తాను చెల్లించాల్సిన వాటా మాత్రమేనని, ప్రభుత్వ అధికారులెవరూ తన వద్ద లంచం డిమాండ్ చేయలేదని శైరా స్పష్టం చేసింది. -
మరో పార్టీ నుంచి పోటీ చేస్తే.. ఇప్పుడున్న పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అనంతరం కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడమంటే పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని ‘అనర్హత’పిటిషన్లలో పిటిషనర్లు వాదించారు. అధికారికంగా పార్టీకి రాజీనామా చేయకపోయినా.. మరో పార్టీ టికెట్పై పోటీ చేయడం, ప్రచారం చేయడం వంటి చర్యలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతను నిర్ణయించే విషయంలో శాసనసభ స్పీకర్ అధికార పరిధికి పరిమితులున్నాయని చెప్పారు. శాసనసభలో ప్రభుత్వ స్థిరత్వం దెబ్బతిన్నదా? పార్టీ బలం తగ్గిందా? అన్నది కాకుండా.. సంబంధిత సభ్యుడు తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారా? అన్నదే పరిశీలించాల్సిన అంశమని పేర్కొన్నారు.పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వివేక్రెడ్డి, గండ్ర మోహన్రావు వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్కుమార్.. కాంగ్రెస్లో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన స్పీకర్.. చట్టపరంగా వీరంతా పార్టీ మారలేదంటూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, పల్లె రాజేశ్వర్రెడ్డి, చింత ప్రభాకర్, పాడి కౌశిక్రెడ్డితో పాటు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రతివాదులుగా స్పీకర్తోపాటు పార్టీ మారినట్లు ఆరోపణలున్న వారిని కూడా చేర్చారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమా ర్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. దానం అంగీకరించినట్టే...: వివేక్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పార్టీ సభ్యత్వాన్ని సభలోనే వదులుకోవాలన్న పరిమితి లేదని చట్టంలో ఎక్కడా లేదన్నారు. పదో షెడ్యూల్ ఉద్దేశం కేవలం సభలో ‘ఫ్లోర్ మేనేజ్మెంట్’కాదని.. ప్రజ లు ఇచ్చిన రాజకీయ తీర్పును పార్టీ మార్పు ల ద్వారా నిర్వీర్యం కాకుండా చూడటమేనన్నారు. దానం నాగేందర్.. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు చూపించే గెజిట్, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినట్లు చూపించే గెజిట్, ఫారం–26 అఫిడవిట్లను ఆధారాలుగా ఆయన సమర్పించారు.ఎమ్మెల్యేగా ఎన్నిక, ఎంపీగా పోటీపై సమర్పించిన సాక్ష్యాలను దానం తిరస్కరించలేదని, వాటిని అంగీకరించినట్లేనని.. అలాంటప్పుడు మళ్లీ నిరూపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక పార్టీపై గెలిచి, మరో పార్టీ తరఫున పోటీ చేస్తే అసలు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లేనని 2019లో ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. -
HP: పెట్రోల్పై కొత్త భారం.. లీటర్కు 60 పైసలు అదనం
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఇప్పటివరకు కారణాలు అందరికీ తెలిసినవే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, పన్నుల భారం, ప్రపంచ పరిణామాల ప్రభావం. కానీ ఓ రాష్ట్రంలో ఇప్పుడు ఇంధనంపై పడిన కొత్త భారం మాత్రం వీటికి భిన్నం. లీటర్ పెట్రోల్, డీజిల్పై అదనంగా 60 పైసలు వసూలు చేసే కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ప్రజలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో చూద్దాం.. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ‘విడో అండ్ ఆర్ఫన్ సెస్’ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. నేటి(ఆగస్టు 12) నుంచి హిమాచల్ ప్రదేశ్లో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్పై అదనంగా 60 పైసలు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర పన్నుల, ఎక్సైజ్ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ కొత్త సెస్ అమల్లోకి వచ్చింది. ఆయిల్ కంపెనీలు డీలర్లకు ఇంధనం విక్రయించే సమయంలోనే ఈ సెస్ వర్తిస్తుంది. చిన్న మొత్తం.. కానీ పెద్ద చర్చ!లీటర్కు 60 పైసల వసూలు.. ఈ సెస్కు చట్టపరంగా ఉన్న పరిమితి మాత్రం ఎక్కువ. ప్రభుత్వం అవసరమైతే లీటర్కు రూ.5 వరకు సెస్ విధించే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో ఈ మొత్తం మరింత పెరుగుతుందా? అనే చర్చ మొదలైంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం సంక్షేమమేనని చెబుతున్నప్పటికీ.. ప్రజలపై అదనపు భారం మోపుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.వితంతువుల కోసం.. కానీ అందరూ చెల్లించాల్సిందే!ఈ సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వితంతువులు, అనాథల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. అయితే ఈ పన్నును చెల్లించేది మాత్రం ప్రతి ఒక్కరూ. పెట్రోల్ వినియోగించే సాధారణ ప్రజలు, ట్యాక్సీ డ్రైవర్లు, రైతులు, చిన్న వ్యాపారులు కూడా ఈ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఇదే అంశంపై పెట్రోలియం డీలర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన ధరలు పెరిగితే ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఇంధనం కొనుగోలు చేసే అవకాశం ఉందని, దాంతో రాష్ట్ర ఆదాయంపైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అంతేకాదు.. ఈ సెస్ ద్వారా వచ్చే నిధుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని కూడా డీలర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎంతమంది వితంతువులు, ఎంతమంది అనాథలకు ఈ నిధులు ఉపయోగపడతాయి? ఎంత మొత్తం ఖర్చు చేస్తారు? అనే వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.హిమాచల్ ఆర్థిక పరిస్థితి కారణమా?ఈ కొత్త సెస్ వెనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం భారీ అప్పుల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల రుణ చెల్లింపుల భారం ఉంది. రాష్ట్ర అప్పులు లక్ష కోట్ల రూపాయలు దాటిన పరిస్థితుల్లో.. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే రెవెన్యూ లోటు గ్రాంట్లలో మార్పులు కూడా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు.ఇతర రాష్ట్రాల్లోనూ ఇంధన సెస్లుఇంధనంపై ప్రత్యేక సెస్లు విధించడం హిమాచల్ ప్రదేశ్తోనే మొదలైన విషయం కాదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు రోడ్లు, సామాజిక భద్రత, పర్యావరణం వంటి అంశాల కోసం పెట్రోల్, డీజిల్పై అదనపు సెస్లు వసూలు చేస్తున్నాయి. అయితే హిమాచల్ నిర్ణయంలో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సెస్ను నేరుగా వితంతువులు, అనాథల సంక్షేమం కోసం ఉద్దేశించినట్లు ప్రకటించడం.సంక్షేమ కార్యక్రమాలకు నిధులు అవసరమే అయినప్పటికీ.. ప్రజలపై అదనపు పన్నుల భారం ఎంతవరకు సమంజసం? ఈ నిధులు నిజంగా లబ్ధిదారులకు చేరుతాయా? అనేది ప్రశ్నలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. -
కరువుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లదే బాధ్యత
లక్డీకాపూల్(హైదరాబాద్): తుమ్మిడిహెట్టి నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం బరాజ్ల వైఫల్యంతో ఏర్పడిన కరువుకు ఆయా పార్టీలే బాధ్యత వహించాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించి యుద్ధ ప్రాతిపదికన ఎల్లంపల్లికి అనుసంధానం చేయాలనే డిమాండ్పై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సాధన సమితి, తెలంగాణ జలసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. జలసాధన సమితి రాష్ట్ర కన్వీనర్ నైనాల గోవర్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, టి.హనుమంతరావు, నీటిపారుదల విశ్లేషకులు సారంపల్లి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిందన్నారు. కేవలం ముగ్గురు ఇంజనీర్ల దగ్గర రూ.1,000 కోట్లు అవినీతి నిరోధక శాఖ దాడిలో లభించాయన్నారు. కేసీఆర్ రీడిజైనింగ్ పేరిట తుమ్మిడిహెట్టిలో కూడా తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. 18 ఏళ్లయినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించిన పెండింగ్ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయి నేటికీ పూర్తి కాలేదని చెప్పారు. ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బరాజ్లను ఇప్పటికిప్పుడు ఉపయోగించడం ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం సాధ్యం కాదని చెప్పారు. హైదరాబాద్కు నీళ్లు అందించేది కేవలం ప్రాణహిత నది మాత్రమే అన్నారు. తక్షణమే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించాలన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి టి.శ్రీనివాస్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి ఎం. హన్మేశ్, సజయ, సంధ్య, రామన్న, ఝాన్సీ, జైపాల్సింగ్, లాల్కుమార్ శ్రీనివాస్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఫ్రేమ్లో మోదీ–పవార్–షా..
ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒకే ఫ్రేమ్లో కనిపించిన ఫొటో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సుప్రియా సూలే కుమార్తె రేవతి సూలే వివాహ రిసెప్షన్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ పరిణామం.. సాధారణ కుటుంబ వేడుకే అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.सुप्रिया सुळे यांची मुलगी रेवती सुळे आणि सारंग लखानी यांचा दिल्लीत रिसेप्शन सोहळा. यावेळी अमित शाह यांनी उपस्थित राहीले. रेवती आणि सारंग यांना आशिर्वाद दिले. #sharadpawar #amitshah pic.twitter.com/pSE3rg9UQL— Ramraje Shinde (@ramraje_shinde) August 10, 2026Prime Minister Modi ji attended the wedding reception of Sharad Pawar's granddaughter today. He blessed the newlyweds during the event. pic.twitter.com/0BVKo5YXZT— Avinash K S🇮🇳 (@AvinashKS14) August 10, 2026ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో కొనసాగుతున్న శరద్ పవార్ పార్టీ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మోదీ, పవార్, షా కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఈ వివాహ వేడుకకు కొందరు కాంగ్రెస్ పెద్దలు, ఎన్సీపీ-ఎస్పీ మిత్రపక్షాల నేతలు కొందరు దూరంగా ఉండడమూ ఇందుకు మరో ప్రధాన కారణమైంది. అయితే ఇది కేవలం కుటుంబ కార్యక్రమంలో భాగమైన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఎన్సీపీ (ఎస్పీ) వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో మాత్రం.. ఈ కలయికపై ఊహాగానాలు మొదలయ్యాయి.కొసమెరుపు: మోదీ విధానాలపై తరచూ విమర్శలు చేసే రోహిత్ పవార్.. అదే వేదికపై ప్రధాని మోదీతో కలిసి ఫొటోకు పోజివ్వడం కూడా చర్చకు దారితీసింది.If Sharad Pawar’s faction ever boards the NDA ship, Rohit Pawar will probably be the first passenger with his bags packed. 😂On social media, Rohit Pawar keeps claiming that he will never bow before the BJP. When it came to Delhi, he was among the first to meet PM Modi along…— Saffron Monk (@mangeshspa) August 11, 2026ఇక ఈ వివాహ వేడుకకు బీజేపీ అగ్రనేతలు హాజరు కావడం కంటే కొన్ని గంటల ముందే.. ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన లోక్సభ ఎంపీల బృందం ప్రధాని మోదీని కలిసింది. సుప్రియా సూలే నేతృత్వంలోని ఎనిమిది మంది ఎంపీలు మహారాష్ట్రకు సంబంధించిన పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితులు, సాగునీరు, నదుల అనుసంధానం, రైల్వే ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ వంటి అంశాలపై వినతిపత్రం అందించారు. పుణె–నాశిక్ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, ఉల్లి ధరలు, చంద్రభాగా నది కాలుష్యం వంటి సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.రాజకీయ మార్పులపై ఊహాగానాలుమోదీతో పవార్ వర్గం వరుస భేటీలు, కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై పార్టీ వైఖరి వంటి పరిణామాలు కొత్త చర్చలకు కారణమయ్యాయి. డీలిమిటేషన్ విషయంలో తమ నిర్ణయం తుది బిల్లు వచ్చిన తర్వాతే తీసుకుంటామని సుప్రియా సూలే ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కొన్ని షరతులతో ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.ఇండియా కూటమిలో ఉంటూనే.. ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెబుతోంది. మహారాష్ట్ర సమస్యలు, ప్రజా ప్రయోజన అంశాలపైనే కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేస్తోంది. గతంలోనూ శరద్ పవార్, సుప్రియా సూలేలు ప్రధాని మోదీని కలిసి విద్యార్థుల సమస్యలు, నీటి నిర్వహణ, రైతుల అంశాలపై చర్చించారు.ఒక ఫొటో.. ఎన్నో ప్రశ్నలు!ప్రస్తుతం రేవతి సూలే వివాహ రిసెప్షన్లో తీసిన ఈ చిత్రం కేవలం ఓ కుటుంబ వేడుక జ్ఞాపకమే అయినప్పటికీ.. దాని వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీతో పవార్ సాన్నిహిత్యం పెరుగుతోందా? లేదంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఈ భేటీలా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫొటో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. -
యూపీలో రాజకీయ భూకంపం రానుందా? 403 సీట్లు మరీ..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు చర్చలు ముందుగానే ప్రారంభం కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. అయితే, రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో ఎక్కువ వాటా పొందడమే పార్టీ లక్ష్యం కాదు. దానికి బదులుగా, సంస్థాగత బలం, అభ్యర్థి సామర్థ్యం, కుల సమీకరణాలు, సమాజ్వాదీ పార్టీ మద్దతు కలిసొచ్చే గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలపై చర్చలు జరగాలని పార్టీ కోరుతోంది. అలాంటి నియోజకవర్గాల్లో కూటమికి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తోంది.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో పరిమిత ఉనికి మాత్రమే ఉన్న కాంగ్రెస్కు ఈ విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన తర్వాత పార్టీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఇరు పార్టీలు కూడా 403 అసెంబ్లీ స్థానాలన్నింటిపైనా సర్వేలు నిర్వహిస్తున్న వేళ భవిష్యత్తులో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలన్న చర్చలకు ఇది పునాది వేయొచ్చు.సీట్ల సర్దుబాటు పరిమితం కాలేదుసీట్ల సర్దుబాటు ప్రధానంగా ఎన్ని స్థానాలు దక్కాయన్న లెక్కల ఆధారంగా నిర్ణయం తీసుకోవడాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తమకు వాస్తవికంగా గెలిచే అవకాశం ఉన్న కొద్దిపాటి స్థానాలపై దృష్టి పెట్టినా, గెలుపు అవకాశాలే ప్రమాణంగా ఉండాలని పార్టీ కోరుతోంది.“ఒక విషయం అంశంలో మేము స్పష్టంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. అయితే అది సమాజ్వాదీ పార్టీ నిర్ణయం. రాష్ట్రంలో మా ఉనికిని పెంచుకోవాలని కోరుతున్నాం. అందుకోసం మంచి స్థానాల్లో పోటీ చేయడం ముఖ్యం” అని ఓ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు.“ఒక పార్టీ వరుసగా మూడు సార్లు ఓడిపోయిన స్థానాన్ని మళ్లీ అదే పార్టీకి ఇవ్వడం వల్ల కూటమికి ఉపయోగం ఉండదు. మరో పార్టీ అభ్యర్థి తన ఓట్లతో పాటు భాగస్వామ్య పార్టీ ఓట్లను కూడా కలిపి తెచ్చుకోగలిగితే అది మరింత బలమైన అవకాశం అవుతుంది” అని ఓ కాంగ్రెస్ ఎంపీ తెలిపారు.కాంగ్రెస్ లక్ష్యం రెండు విధాలుగా ఉంది. అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడం, ఉత్తరప్రదేశ్లో బలహీనమైన సంస్థాగత వ్యవస్థను తిరిగి నిర్మించుకోవడం. 403 స్థానాల్లో చేస్తున్న సర్వేలు కాంగ్రెస్-సమాజ్వాదీ పార్టీ ఒప్పందాన్ని ప్రభావితం చేయొచ్చు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు విడివిడిగా 403 నియోజకవర్గాలన్నింటినీ అంచనా వేస్తున్నాయి.గత ఎన్నికల ఫలితాలు, కుల సమీకరణాలు, సంస్థాగత బలం, అభ్యర్థుల సామర్థ్యం, రెండు పార్టీల మద్దతు వర్గాలు పరస్పరం బదిలీ అయ్యే అవకాశం వంటి అంశాలను ఈ సర్వేలు పరిశీలించే అవకాశం ఉంది.“ముందుగా జరిగిన సమావేశంలో 403 స్థానాలన్నింటిపైనా సిద్ధం కావాలని, సంస్థను బలోపేతం చేయాలని నిర్ణయించాం. అయితే ఎన్నికలు దగ్గరపడే వేళ కుల సమీకరణాలు, సమాజ్వాదీ పార్టీ మద్దతు వల్ల కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలను గుర్తించాలి” అని ఓ కాంగ్రెస్ ఎంపీ తెలిపారు. “సాధారణ అంగీకారానికి రావడానికి సమాజ్వాదీ పార్టీ తన సర్వే చేస్తోంది. కాంగ్రెస్ కూడా తన సర్వే చేస్తోంది. తుది నిర్ణయం పార్టీ నాయకత్వం తీసుకుంటుంది” అని మరో కాంగ్రెస్ ఎంపీ తెలిపారు.మా వాటా ఎక్కువ: సమాజ్వాదీ పార్టీభవిష్యత్తులో ఏ ఒప్పందం జరిగినా రాష్ట్రంలో రెండు పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అసెంబ్లీలో తన ఉనికిని పెంచుకోవాలని చూస్తుండగా, సమాజ్వాదీ పార్టీ రాష్ట్రంలో పెద్ద భాగస్వామ్య పార్టీగా ఉంది. కూటమి నిర్ణయాలు అగ్ర నాయకత్వమే తీసుకుంటుందని ఓ సీనియర్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు తెలిపారు. కాంగ్రెస్ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించలేమని చెప్పారు. “2027 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే మా వాటా ఎక్కువ. అభ్యర్థుల గెలుపు అవకాశాల ఆధారంగానే సీట్ల పంపకం ఉంటుంది” అని ఆయన తెలిపారు.ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఈ సంబంధాన్ని ఎలా చూడాలనుకుంటుందో సంకేతాలు ఇచ్చింది. ఇటీవల ఉత్తరప్రదేశ్కు ఏఐసీసీ ఇన్ఛార్జ్గా నియమితులైన రాజేంద్ర పాల్ గౌతమ్, పార్టీ “సమానత్వం, గౌరవం”తో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఆశించిన ఫలితం రాలేదు. సమాజ్వాదీ పార్టీ 47 స్థానాలు, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకోగా, 403 సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 312 స్థానాలతో ఘన విజయం సాధించింది.చర్చలు ఆలస్యం కావడం, నియోజకవర్గ స్థాయిలో తగిన సమన్వయం లేకపోవడం కూటమికి నష్టం చేశాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య 20కి పైగా స్థానాల్లో “స్నేహపూర్వక పోటీలు” కూడా జరిగాయి.“చర్చలు ఆలస్యం కావడం, నియోజకవర్గ స్థాయిలో తగిన సమన్వయం లేకపోవడం వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభావం భూమి స్థాయిలో కనిపించలేదు” అని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎంపీల సమావేశానికి హాజరైన ఓ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు.ఈ సమావేశం పార్లమెంట్ సమావేశాల సమయంలో జరిగింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని కలిసిన తర్వాత ఇది జరిగింది.“కూటమి చివరి క్షణంలో నిర్ణయమయ్యేది కాదు. కలిసి వెళ్లాలా వద్దా అన్నది ముందుగానే నిర్ణయించాలి. గత అనుభవాల దృష్ట్యా ఇది కీలకం” అని ఓ సీనియర్ కాంగ్రెస్ ఎంపీ తెలిపారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.2024 ఎన్నికలు కాంగ్రెస్కు కొత్త మోడల్ యూపీ 2017 ఎన్నికలు హెచ్చరికగా నిలిస్తే, 2024 లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ అనుసరించాలనుకుంటున్న మోడల్గా నిలిచాయి. లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మళ్లీ కూటమిగా పోటీ చేశాయి. ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ 62 స్థానాలు, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసింది. సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు గెలిచాయి. మొత్తం గెలిచిన స్థానాల సంఖ్య 43కి చేరింది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62 స్థానాలు గెలిచిన బీజేపీ 33 స్థానాలకు పరిమితమైంది.తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్న దానికంటే, కూటమి బలాన్ని విజయాలుగా మార్చగలిగే నియోజకవర్గాలు దక్కాయా అన్నదే ముఖ్యం అని కాంగ్రెస్ భావిస్తోంది. అదే సూత్రాన్ని ఇప్పుడు 403 స్థానాల అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని కోరుతోంది. -
బీజేపీకి సంతోషం కలిగించే మాటలొద్దు!
కాంగ్రెస్లో జెన్జీ రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది. పార్టీ లైన్ను దాటి కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయన పేరును ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని సంతోష పెట్టేలా మాట్లాడడం మానుకుంటే మంచిదంటూ సూచనలు చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన ‘యువత కార్యక్రమం’ కంటే.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు జెన్జీ యువతను ఎక్కువగా ఆకర్షించాయని థరూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. కేరళ కాంగ్రెస్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీ నేతల వ్యాఖ్యలు బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడేలా ఉండకూడదని పరోక్షంగా హెచ్చరించారు.థరూర్ వ్యాఖ్యలపై స్పందించిన వేణుగోపాల్.. ఆ వ్యాఖ్యలను తాను పూర్తిగా వినలేదని, మీడియా కథనాల ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. “కాంగ్రెస్ నేతలు పార్టీ విధానాలకు ఎప్పుడూ కట్టుబడి ఉండకపోయినా.. బీజేపీని సంతోషపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి” అని అన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు వస్తే బీజేపీకి అది రాజకీయంగా లాభిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే థరూర్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారని తాను భావించడం లేదని స్పష్టం చేశారు.జెన్జీపై రాహుల్ ప్రచారాన్ని సమర్థించిన కాంగ్రెస్ఇదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన యువత కార్యక్రమాలను వేణుగోపాల్ గట్టిగా సమర్థించారు. ప్రయాగ్రాజ్లో జరిగిన ఛాత్రోంకీ గూంజ్ కార్యక్రమానికి వచ్చిన వారు సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలు కాదని.. నిజమైన జెన్జీ యువతేనని పేర్కొన్నారు. కోటా, డెహ్రాడూన్లలోనూ ఇదే తరహా స్పందన వచ్చిందని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై రాహుల్ నిరంతరం పోరాడుతున్నారని అన్నారు.అసలు థరూర్ ఏమన్నారు?మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్.. రాహుల్ గాంధీ “ఛాత్రోంకీ గూంజ్” కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కార్యక్రమం లేవనెత్తిన అంశాలే CJP నిరసనల్లోనూ ఉన్నాయని.. అయితే జంతర్ మంతర్ వద్ద జరిగిన CJP ఆందోళన స్థాయిలో కాంగ్రెస్ కార్యక్రమం ఎందుకు ప్రభావం చూపలేకపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. “మనం యువత గొంతు విన్నామా? జెన్జీ నాడిని పట్టుకోగలిగామా?” అంటూ థరూర్ ప్రశ్నించారు.అయితే తన వ్యాఖ్యలు పార్టీపైనో, లేదంటే రాహుల్ గాంధీపై దాడి కాదని తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. యువతకు రాజకీయాల్లో మరింత భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరాన్ని మాత్రమే చెప్పానని తెలిపారు.సీజేపీ ప్రభావంపై రాజకీయ చర్చనీట్ పరీక్ష అంశాలు, విద్యార్థుల సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అదే సమయంలో యువత సమస్యలను రాజకీయ పార్టీలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాయన్న ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్లో అంతర్గత చర్చకు దారితీయగా.. వేణుగోపాల్ స్పందనతో పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ యువత కార్యక్రమాలకు పూర్తి మద్దతుగా నిలిచినట్లు స్పష్టమైంది. -
రేవంత్ మాటలే బీఆర్ఎస్కు ఆయుధాలు!
తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ల మధ్య రాజకీయ పెనుగులాట ఆసక్తికరంగా ఉంది. మూడో పక్షం బీజేపీ అధికార సాధన లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ, ఇప్పటివరకైతే ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో పట్టు నిలబెట్టుకోవడంతో పాటు,ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరగకుండా ఉండడానికి అన్ని రకాల యత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో హైడ్రా ద్వారా ప్రభుత్వానికి స్వాధీనం అయిన భూముల అమ్మకం ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం కోసం వినియోగించాలని ఆలోచిస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ ను బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించినా అందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లుగా కనిపిస్తుంది. ఈ పరిణామం ఎటువైపు దారి తీస్తుందన్నది చర్చగా ఉంది. ప్రభుత్వంపై కాని, కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కాని ఆరోపణలు వస్తున్న తీరు రేవంత్ కు చికాకు కలుగుతుండవచ్చు. ఇక బీఆర్ఎస్ నాయకత్వం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన ఆధారపడి రాజకీయాలను నడుపుతోంది. మాజీ ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం జనంలో తిరగకుండా, వెనుక ఉండి పార్టీని నడుపుతున్నారు. ఫేసెస్ ఆఫ్ ద పార్టీగా కేటీఆర్, హరీష్ రావులు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ఆందోళనలకు సన్నద్దమవుతున్నారు. రేవంత్ ప్రసంగాలలో ఏ మాత్రం తప్పులు దొర్లినా వెంటనే అందుకుని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి కేటీఆర్, హరీష్ రావు శాయశక్తుల కృషి చేస్తున్నారు. ప్రభుత్వపై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా వారు పని చేస్తున్నారు.ఈ క్రమంలో కొన్నిసార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల దుమారం హద్దులు మీరుతున్నట్లు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో ఇంజనీరింగ్ విద్యను క్రిమినల్ వేస్ట్ అని వ్యాఖ్యానించారు. కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం ఇంజనీర్లందరిని కించపరచడం కాకపోవచ్చు. ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు కోల్పోతోందని చెప్పాలన్నది ఆయన భావన. అందులో కొంత నిజం ఉంది. కొంతమంది ఇంజనీరింగ్ పూర్తి చేసినా మంచి ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇటీవలి కాలంలో వివిధ కారణాల వల్ల సుమారు 60 కాలేజీలు మూతపడ్డాయట. లెక్చరర్లు మంచి విద్య అందించాలని చెప్పడం తప్పు కాదు. కాని అసలు ఆ ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్ అని అనడం విమర్శలకు దారి తీసింది. రేవంత్ రెడ్డి ఒక్కోసారి కొన్ని వ్యాఖ్యలు చేసి ఇబ్బందులలో పడుతున్నారు. హైడ్రాను సమర్ధించడానికి హిట్లర్తో పోల్చుకోవడం, ఇరాన్ యుద్ద విధ్వంసాన్ని ప్రస్తావించడం వంటివి చేశారు. ఇప్పుడేమో ఇంజనీరింగ్ విద్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ రంగంలో అయినా కొన్ని ప్రమాణ లోపాలు ఉండవచ్చు. కాని అంతమాత్రాన దానిని క్రిమినల్ వేస్ట్ అని అంటామా అన్నది ఆలోచించుకోవాలి. అలాగైతే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలను ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది కదా! ఇంజనీరింగ్ విద్యను లక్షలాది మంది చదువుకున్నారు కాబట్టే దేశంలోకాని, ఇతర దేశాలలో కాని మనవాళ్లు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో రాణిస్తున్నారన్న సంగతిని గ్రహించాలి. రేవంత్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకోవడానికిబీఆర్ఎస్ నేతలు అన్ని వ్యూహాలు అమలు చేశారు. తెలంగాణలోని యువతను అవమానించే రీతిలో రేవంత్ మాట్లాడారంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్లికేషన్ రాయలేని స్థితిలో ఇంజనీర్లు ఉన్నారంటున్న రేవంత్ తన ఎన్నికల అఫిడవిట్ ను పూర్తి చయగలరా అని సవాల్ చేశారు.కాంగ్రెస్ పార్టీనే క్రిమినల్ వేస్ట్ అని కేటీఆర్ మండిపడ్డారు . ఆ తర్వాత రేవంత్ పై కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేశారు.రేవంత్ ఇంజీనిరింగ్ విద్యను వేస్ట్ అనడాన్ని ఎవరూ సమర్దించరు. అలాగే కేటీఆర్ కూడా రేవంత్ ను అదే మాట అనడం కరెక్టు కాదని చెప్పాలి. తమను వ్యక్తిగతంగా అటాక్ చేస్తే తామూ అదే చేస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. కొంత హద్దులు మీరి ఇరువైపులా విమర్శలు చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక ఇంజీనర్లకు మద్దతు ఇస్తూ రాకెట్ పంపుతున్నవారిని అవమానిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ కూడా రాశారు. ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని ఆయన మండిపడ్డారు. జెన్ జి, కాక్రోచ్ ఉద్యమాలకు మద్దతు ఇచ్చే విషయంలో ఈ రెండు పార్టీలు పోటీ పడ్డాయి. ఢిల్లీలో కాంగ్రెస్ కు కొంత అడ్వాంటేజ్ ఉన్నా, తెలంగాణకు వచ్చేసరికి అదికారంలో అదే పార్టీ ఉండడంతోబీఆర్ఎస్ ఆ అవకాశాన్ని వాడుకుంది. కొద్ది రోజుల క్రితం నిరుద్యోగులతో సంగ్రామ్ పేరుతో ఒక భారీ సభను నిర్వహించారు. ఖమ్మంలో ఒక నిరుద్యోగి ఆత్మహత్యయత్నం చేస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడాన్ని తన నోట్ లో తప్పుపట్టారు. ఇది కాంగ్రెస్ పై నిరుద్యోగి ఛార్జీషీట్ అని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం యువతను ఆకర్షిస్తే తమకు అధికారం రావడం ఖాయమనిబీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్న తరుణంలో రేవంత్ వ్యాఖ్య వారికి అందివచ్చినట్లయిందనిపిస్తుంది. ఇక హైడ్రా కమిషనర్ రంగనాధ్ విషయంలో రేవంత్ కోర్టు ఆదేశాలను పాటించడానికి ఇష్టపడడం లేదని అర్దం అవుతుంది. రంగనాధ్ ను బదిలీ చేయాలని హైకోర్టు సూచించినా ,అది ప్రభుత్వ విచక్షణాధికారమన్న భావనలో రేవంత్ ఉన్నారనుకోవాలి. అదే టైమ్ లో హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల అమ్మకం ద్వారా అరవైవేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు దీనిని వాడవచ్చన్నది ప్రభుత్వ వర్గాల భావన. అయితే ఈ భూములను అమ్మడానికి అవకాశం లేదన్నది విపక్షం వాదనగా ఉంది. గత రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయి ఉండడం, ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లింపులు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేకపోవడం, మెట్రో రైలు రుణం వ్యవహారం మొదటికి రావడం ఇలా అనేక సమస్యలు ఉన్న తరుణంలో నిజంగానే ఈ భూములను అమ్మే అవకాశం వస్తే అది ప్రభుత్వానికి జాక్ పాట్ అవుతుంది.కాని మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి చికాకుగా మారుతున్నాయి.ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను చెల్లించవలసిన సుమారు 400 కోట్లకు పైగా రుణాన్ని తీర్చివేశారట.ఇది ఎలా సాధ్యమైందని,దానిపై విచారణ చేయించగలరా అని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లూటింగ్ ఏజెంట్లుగా మారారని ఆయన ధ్వజమెత్తారు. ఆయా శాఖలలో అవినీతి జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారికి ఇవన్ని ఒక చక్రబంధం వంటివి. వీటిని జాగ్రత్తగా తప్పించుకుంటూ ముందుకు పోవాలని అదికార కాంగ్రెస్ యత్నిస్తుంది. కాని ఆ చక్రబంధంతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికిబీఆర్ఎస్ అన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. ఎవరిది పై చేయి అవుతుందో కాలమే తేల్చుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బీజేపీలో ఆయనే నా ఫేవరేట్.. ‘హలో అంకుల్’ అంటూ రాహుల్..
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సహజం. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బీజేపీలో తనకు ఇష్టమైన నాయకుడు ఎవరో చెబుతూ.. మాజీ పంజాబ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరును రాహుల్గాంధీ ప్రస్తావించారు.ఇన్స్టాగ్రామ్లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ రాహుల్గాంధీ.. అమరీందర్ సింగ్తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. ‘‘ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన చాలా కూల్. సైనిక చరిత్రపై ఆయనకు మంచి పట్టు ఉంది. హలో అంకుల్ అమరీందర్’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. జెన్ జెడ్, విద్యార్థులతో మరింతగా మమేకమయ్యేందుకు రాహుల్గాంధీ ఈ ఇన్స్టాగ్రామ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే అమరీందర్ సింగ్పై చేసిన వ్యాఖ్య వైరల్గా మారింది.రాహుల్ వ్యాఖ్యలపై అమరీందర్ సింగ్ కూడా స్పందించారు. తన గురించి రాహుల్గాంధీ మంచి మాటలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలను చిన్నప్పటి నుంచే తనకు తెలుసని గుర్తుచేశారు. రాహుల్ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్గాంధీ తనకు క్లాస్మేట్, స్నేహితుడని చెప్పారు. అయితే వ్యక్తిగత సంబంధాలు, రాజకీయ అనుబంధాలు వేర్వేరు అని అమరీందర్ స్పష్టం చేశారు. రాహుల్, సోనియాగాంధీ కుటుంబంతో తన వ్యక్తిగత, కుటుంబ సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని.. కానీ రాజకీయంగా మాత్రం తాను బీజేపీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు.అమరీందర్ వ్యాఖ్యలకు పంజాబ్ బీజేపీ నేతలు కూడా స్పందించారు. పంజాబ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రీత్పాల్ సింగ్ బలియావాల్.. అమరీందర్ సింగ్ను పంజాబ్లో అత్యున్నత స్థాయి నాయకుడిగా అభివర్ణించారు. అయితే కాంగ్రెస్ పంజాబ్ యూనిట్లో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్న సమయంలోనే రాహుల్ ఆయనను గుర్తు చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేత రాణా గుర్జీత్ సింగ్ మాత్రం రాహుల్, అమరీందర్కు కుటుంబ సంబంధాలు ఉన్నాయని, అమరీందర్ గౌరవనీయమైన నాయకుడని అన్నారు. ఆయన కాంగ్రెస్ను వీడకుండా ఉంటే పార్టీలో అందరికీ మార్గదర్శకుడిగా ఉండేవారని అభిప్రాయపడ్డారు.అమరీందర్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్లో కీలక ప్రాంతీయ నాయకుడిగా ఉన్నారు. 2017లో పంజాబ్లో కాంగ్రెస్కు ఘన విజయం అందించి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత విభేదాల నేపథ్యంలో 2021లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత కాంగ్రెస్ను వీడారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసి, 2022 ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అనంతరం బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం అమరీందర్ కుటుంబ సభ్యులు కూడా బీజేపీలోనే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్తో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ.. సోనియాగాంధీ కుటుంబంతో తన వ్యక్తిగత అనుబంధం కొనసాగుతుందని అమరీందర్ పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో రాహుల్గాంధీ చేసిన ‘హలో అంకుల్ అమరీందర్’ వ్యాఖ్య మరోసారి ఆ పాత రాజకీయ, కుటుంబ అనుబంధాలను తెరపైకి తెచ్చింది."Hello, Uncle Amarinder!"LoP Shri @RahulGandhi gives a warm shoutout to his favourite politician from the BJP. pic.twitter.com/kwgQPDZ5SV— Congress (@INCIndia) August 6, 2026 -
కాంగ్రెస్ కంటే సీజేపీనే బెటర్: శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చేపట్టిన విద్యార్థి నిరసనల ప్రచార కార్యక్రమం ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేదని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అంగీకరించారు. ముంబైలో జరిగిన ‘ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్’ (ఐఐఎంయూఎన్) 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీ అంశాలపై తాము ముందుగానే గళం విప్పినప్పటికీ, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసనలకు వచ్చిన జనసందోహం తమ ప్రచారానికి రాలేదన్నారు.తాము లేవనెత్తిన అంశాలనే సీజేపీ కూడా జంతర్ మంతర్ వద్ద ప్రస్తావించిందని, రాహుల్ గాంధీ నేతృత్వంలో ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో మమేకమయ్యామని శశిథరూర్ గుర్తుచేశారు. అయితే, తమ వ్యూహంలో ఎక్కడ లోపం జరిగిందో, యువత (జెన్ జీ) నాడిని పట్టుకోవడంలో ఎందుకు విఫలమలమయ్యామో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై జూన్ 20 నుంచి సీజేపీ చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఇది కూడా చదవండి: ‘వర్షం కురిసిన ఉదయం’.. వందకి రూ. 400 ఇస్తామన్నా.. -
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. కాంగ్రెస్ నేత హత్య
బెంగళూరు: కర్ణాటకలోనియ దారుణ ఘటన వెలుగు చూసింది. ఉడుపి జిల్లాలో కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్, మాజీ పంచాయతీ అధ్యక్షుడు డేవిడ్ డిసౌజా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో డేవిడ్ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఓ వాహనంలో వచ్చి డిసౌజాపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, డిసౌజా కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా ఉండటంతో పాటు కాంట్రాక్టు పనులు చేసేవారు. గతంలో పంచాయతీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. దీంతో ఆయన హత్య స్థానిక రాజకీయ, వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది.అయితే, డేవిడ్ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. -
10, 11, 12వ తేదీల్లో తప్పనిసరిగా హాజరుకండి
న్యూఢిల్లీ: పార్లమెంట్లో చాలా కీలకమైన అంశాలు చర్చకు రానున్నందున ఈ నెల 10, 11, 12వ తేదీల్లో తప్పనిసరిగా హాజరు కావాలంటూ శుక్రవారం కాంగ్రెస్ తన పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈ మూడు రోజుల్లో తమ ఎంపీలు కూడా తప్పనిసరిగా సభల్లో ఉండేలా చూడాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాలను కూడా కాంగ్రెస్ కోరింది. వచ్చే వారంలో వివాదాస్పద విదేశీ విరాళాల నియంత్రణ సవరణ(ఎఫ్సీఆర్ఏ) బిల్లు–2026, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టే చాన్సుందన్న వార్తల నేపథ్యంలో లోక్సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ కె.సురేశ్, రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్ విప్ జైరాం రమేశ్ ఈ మేరకు వేర్వేరుగా క్షుప్తంగా విప్లను జారీ చేశారు. అయితే, ఎఫ్సీఆర్ఏ, నియోజకవర్గాల బిల్లును ప్రవేశపెట్టే యోచన లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఎఫ్సీఆర్ఏ బిల్లు నెగ్గాలంటే సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు మాత్రం మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమవుతుంది. -
డీసీసీ అధ్యక్షుల మార్పు?
సాక్షి, హైదరాబాద్: నియామకాలు జరిగి నిండా సంవత్సరం కాకముందే జిల్లా కాంగ్రెస్ (డీసీసీ) అధ్యక్షులను మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉత్తర తెలంగాణకు చెందిన నలుగురు డీసీసీ అధ్యక్షుల పనితీరు బాగాలేదని ఏఐసీసీకి నివేదికలు వెళ్లిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో డీసీసీ అధ్యక్షుల పనితీరుపై చర్చ జరిగిందని, ఈ చర్చలో ఏఐసీసీ అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారని, ఇందుకు సమన్వయ కమిటీ కూడా అంగీకారం తెలిపిందని సమాచారం. దీంతో త్వరలోనే డీసీసీ అ«ధ్యక్షుల మార్పులుంటాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సమన్వయం ఏదీ? సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని అందరు డీసీసీ అధ్యక్షుల పనితీరు మదింపు నివేదికలను మీనాక్షి ప్రవేశపెట్టారు. జిల్లాల వారీగా పలు సూచికల ఆధారంగా ర్యాంకింగులిచ్చిన ఆమె.. కొందరి పనితీరు బాగాలేదని సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సమక్షంలోని కమిటీ దృష్టికి తెచ్చారు. ఈ జాబితాలో మహిళలతోపాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు తెలిసింది. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నిర్వహించడంలో, జిల్లాలోని పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో వీరు విఫలమవుతున్నారని, ఏఐసీసీకి తగిన సమాచారం ఇవ్వడం లేదని ఆమె సమన్వయ కమిటీ దృష్టికి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలోనే సమన్వయకమిటీ అంగీకారం మేరకు త్వరలోనే ఆ ముగ్గురు లేదా నలుగురు డీసీసీ అధ్యక్షుల మార్పు ఉంటుందని గాం«దీభవన్ వర్గాలంటున్నాయి.తమ విషయంలో సామాజిక అన్యాయం జరుగుతోందని కొందరు డీసీసీ అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. అగ్రవర్ణాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల పనితీరుపై ఎలాంటి సమీక్ష ఎందుకు జరపడం లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన తమ పనితీరును మాత్రమే ఎందుకు లెక్కగడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని నేతలందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని, కొందరు రావడం లేదని, వారితో సఖ్యత కుదరడం లేదని, ఈ విషయంలో టీపీసీసీ, ఏఐసీసీలు ఎలాంటి చొరవ తీసుకోకుండా తాము కలుపుకొని పోవడం లేదని అనడంలో అర్థం లేదని వారంటున్నారు. -
‘బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది’
సాక్షి,హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, అయినప్పటికీ ఆల్మట్టి, జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు ప్రణాళిక ప్రకారం నీటి పంపిణీ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. సాగునీటి అధికారుల సూచనల మేరకు వచ్చిన ఇన్ఫ్లోకు అనుగుణంగా నీటి నిర్వహణ జరుగుతోందని చెప్పారు.సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు నీళ్లు ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని జూపల్లి స్పష్టం చేశారు. పాలమూరు బిడ్డ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా అల్లుడు అయిన సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని నిలిపివేశారన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికే బీఆర్ఎస్ హంగామా చేస్తోందని ఆరోపించారు. జూరాలకు నీళ్లు వదలాలంటూ ప్రాజెక్టుల వద్ద ముందుగానే డ్రామాలు చేస్తూ, అధికారులు నీటిని విడుదల చేసిన తర్వాత దానిని తమ క్రెడిట్గా ప్రచారం చేసుకోవడమే వారి లక్ష్యమని విమర్శించారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్, భీమా ప్రాజెక్టులకు కాంగ్రెస్ హయాంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.చెడిపోయిన పంపులు, మోటార్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలను కూడా మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. భీమా ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాన్ని బీఆర్ఎస్ కోల్పోయిందని, జూరాలకు 50 టీఎంసీల నీటి వినియోగానికి అవసరమైన రిజర్వాయర్లు కూడా నిర్మించలేదని అన్నారు. గట్టు, తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టులను సైతం విస్మరించిందని ఆరోపించారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వంద శాతం పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కృష్ణా జలాల్లో ఉన్న హక్కులను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుందని జూపల్లి పేర్కొన్నారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుతూ తెలంగాణ ప్రయోజనాలను సాధిస్తామని స్పష్టం చేశారు.ఎల్నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు అధికారులు సూచించిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. పంట కొనుగోలు, బోనస్ అంశాలపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అసత్యమని, పాలమూరు జిల్లా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సాగు, తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి జూపల్లి వెల్లడించారు. -
కాంగ్రెస్ మీటింగ్లో ట్విస్ట్.. మాజీ సీఎం ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు..
పంజాబ్ కాంగ్రెస్లో పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ‘హర్ బూత్, కాంగ్రెస్ మజ్బూత్’ సంస్థాగత కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ భూపేష్ బఘేల్కు వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన చేపట్టారు. ‘భూపేష్ బఘేల్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేయడంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది.కాగా, పార్టీ ఇన్చార్జ్ భూపేశ్ బఘేల్, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ వేదికపై ఉన్న సమయంలోనే కొందరు కార్యకర్తలు ‘బఘేల్ గో బ్యాక్’ అని ముద్రించిన టీ షర్టులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, మాజీ మంత్రి భారత్ భూషణ్ అషుకు అనుకూలంగా కూడా నినాదాలు చేశారు. అనంతరం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను బయటకు వెళ్లాలని రాజా వారింగ్ కోరారు. దీంతో వారింగ్, అషు అనుచరుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.అనంతరం స్పందించిన రాజా వారింగ్.. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన వారు ఆర్ఎస్ఎస్ అనుకూల వర్గం అంటూ ఆరోపించారు. తమ కార్యక్రమాలను భంగం కలిగించే ప్రయత్నం జరుగుతుందనే ముందస్తు సమాచారం తమకు ఉందని చెప్పుకొచ్చారు. కొద్దిమంది మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. అయితే, రాజా వారింగ్ వ్యాఖ్యలను భారత్ భూషణ్ అషు అనుచరులు తీవ్రంగా ఖండించారు.‘మేము కాంగ్రెస్ కార్యకర్తలమే. మాకు కాంగ్రెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం రాజా వారింగ్కు లేదు’ అంటూ వారు స్పందించారు.After posters controversy, T-shirts in Ludhiana। Picture Punjab Congress program. pic.twitter.com/fpCn0fUI7I— Parmeet Bidowali (@ParmeetBidowali) August 6, 2026మరోవైపు.. రాజా వారింగ్ మాట్లాడుతూ, గతంలో విజిలెన్స్ బ్యూరో కేసులో అషు అరెస్టు అయినప్పుడు ఎనిమిది రోజుల పాటు విజిలెన్స్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఆయనకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకుడి వ్యక్తిగత ఆస్తి కాదని, అందరి పార్టీ అని స్పష్టం చేశారు. మరోవైపు భూపేష్ బఘేల్ స్పందిస్తూ.. పార్టీ కార్యక్రమాలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రమశిక్షణా ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్కు బయట ప్రత్యర్థులతో పాటు పార్టీలోనే ఉన్న ‘స్లీపర్ సెల్స్, ‘అంతర్గత విధ్వంసక శక్తులను’ కూడా గుర్తించి బయటకు పంపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. -
‘పట్టభద్రుల ఓటర్ల నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి’
సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను బూత్ స్థాయిలో పార్టీ పట్టును బలోపేతం చేసే కార్యక్రమంగా భావించి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.గురువారం రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాల్లో ఆయన అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. రాబోయే "హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్" పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు, సర్ ప్రక్రియ పురోగతిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించి క్యాడర్కు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు.పాత, కొత్త నాయకులు సమన్వయంతో వ్యవహరించి ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. పట్టభద్రుల్లో ఓటరు నమోదు ప్రాముఖ్యతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఓటరు నమోదును చేపట్టాలని, బూత్ స్థాయిలోని ప్రతి గ్రాడ్యుయేట్ను పార్టీ శ్రేణులు కలిసేలా కార్పొరేషన్ల చైర్మన్లు, అసెంబ్లీ, పార్లమెంట్ బాధ్యులు, జిల్లా అధ్యక్షులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులతో పాటు సంబంధిత పార్టీ బాధ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఉంటుందని, ఈ విషయంలో తుది నిర్ణయం హై కమాండ్దేనని తేల్చి చెప్పారు.ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో చేరేలా మరియు తప్పులను సరిదిద్దేలా సర్ ప్రక్రియపై పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రకాష్ గౌడ్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, అరికెపూడి గాంధీ, కార్పొరేషన్ ఛైర్మన్లు మల్ రెడ్డి రాంరెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బండి రమేష్, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, నర్సింహా రెడ్డి, ధారా సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ రెడ్డిని ఓడిస్తా.. కాంగ్రెస్ ను భయపెడుతున్న PK కామెంట్స్
-
30 మంది రెబల్స్ భేటీ.. డీకేకు చెక్ పెట్టే వ్యూహం?
-
పంజాబ్ ఎన్నికల్లో ఆ పార్టీకే ఆధిక్యం.. బీజేపీకి భారీ ఎదురుదెబ్బ!
పంజాబ్లో 2027లో రాబోయే శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరగనున్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేపట్టిన తాజా మూడ్ సర్వేలో వెల్లడయింది. పంజాబ్ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన ప్రత్యర్థులపై స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ విజయావకాశాల్లో ముందంజలో ఉంది. అయినప్పటికీ 2022 ఎన్నికల తరహాలో ఏకపక్ష తీర్పు కాకుండా ఈసారి ఎన్నికల సమరం పోటీగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 58 నుండి 63 సీట్లు గెలుచుకుని సాధారణ మెజారిటీ మార్కుకు అతి చేరువగా లేదా స్వల్పంగా దాటే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే అంచనా వేసింది. ప్రతిపక్షంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 36 నుండి 43 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం ఉన్నది. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ (డబ్ల్యూడీ) పార్టీ 4 నుండి 7 సీట్లు గెలుచుకుని గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2 నుండి 6 సీట్లు, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడీ) 2 నుండి 4 సీట్లు గెలుపొందే అవకాశాలుండగా, ఇండిపెండెంట్లు, ఇతరులు మిగిలిన స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.పార్టీల వారీగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 37 శాతం, కాంగ్రెస్ 31 శాతం, వారిస్ పంజాబ్ దే 14 శాతం, బీజేపీ 8 శాతం, శిరోమణి అకాలీదళ్ 6 శాతం, ఇతరులు 4 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే పేర్కొంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎలాంటి ముందస్తు పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతాయనే ప్రాతిపదికన ఈ అంచనాలు రూపొందించడం జరిగింది. 2022 నాటి ఏకపక్ష అనుకూల వేవ్ నుంచి పంజాబ్ రాజకీయాలు ఇప్పుడు ప్రభుత్వ పాలనా పనితీరు ప్రాతిపదికగా జరిగే పోరు వైపు మళ్లాయని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. గత ఎన్నికల్లో సాంప్రదాయ పార్టీలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆప్కు అనుకూల ప్రభంజనాన్ని సృష్టించగా, ఈసారి మాత్రం ఓటర్లు ప్రభుత్వం అందించిన సుపరిపాలన, సంక్షేమ పథకాల అమలు, నిరుద్యోగ నిర్మూలన-ఉపాధి కల్పన, వ్యవసాయ విధానాలు, ఆర్థిక నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ, రాజకీయ నాయకుల విశ్వసనీయత ఆధారంగానే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 40 శాతం మంది ఓటర్లు ఆయనకే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంటూ మద్దతు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీకి 33 శాతం మంది మద్దతు లభించగా, అమృత్పాల్ సింగ్కు 13 శాతం మంది మద్దతు తెలిపారు. ఇతర నాయకులకు అత్యల్ప ప్రజాదరణ లభించింది. ఈ సర్వేలోని అత్యంత కీలకమైన అంశం ఏంటంటే... ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పట్ల ఉన్న ప్రజాదరణకు, క్షేత్రస్థాయిలోని ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఉన్న అసంతృప్తికి మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా వ్యతిరేకత తక్కువగా ఉన్నప్పటికీ, అనేక నియోజకవర్గాలలో ఆప్ ఎమ్మెల్యేలపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందే ఎక్కువమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించి కొత్తవారికి అవకాశమిస్తే ఆప్ విజయావకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని ఈ మూడ్ సర్వేలో వెల్లడయింది. ప్రభుత్వంపై కాకుండా స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే ఓటర్ల ప్రవర్తనను శాసించనున్నట్లు సర్వే అంచనా వేసింది.రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలమైన గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణాత్మక బలాన్ని కలిగి ఉండి, ఆప్కు ప్రధాన సవాలుగా నిలుస్తోంది. కాంగ్రెస్ నాయకుల్లో మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీకే అత్యధిక ప్రజాదరణ ఉన్నట్లు ఈ సర్వే వెల్లడయింది. కాంగ్రెస్ పార్టీ చన్నీని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, పార్టీలోని అంతర్గత విబేధాలను నియంత్రిస్తూ సరైన అభ్యర్థులను పోటీలో నిలబెడితే అనేక నియోజకవర్గాల్లో ఆప్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) రాజకీయ ప్రభావం రోజురోజుకీ క్షీణిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది. అకాలీదళ్కు సాంప్రదాయ ఓటు బ్యాంక్గా ఉన్న సిక్కు 'పంథిక్' ఓటర్లు, ముఖ్యంగా అమృత్సర్, గుర్దాస్పూర్, తరణ్ తారన్ వంటి సరిహద్దు జిల్లాల్లోని యువ సిక్కు ఓటర్లు వేగంగా 'వారిస్ పంజాబ్ దే' వైపు మొగ్గు చూపుతున్నారు. మత్తు పదార్థ రహిత పంజాబ్, సిక్కు అస్తిత్వ అంశాలపై స్పష్టమైన ప్రచారం చేయడంతో 'వారిస్ పంజాబ్ దే' కొన్ని ప్రాంతాల్లో కీలక శక్తిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా దీని ప్రభావం పరిమితంగా ఉన్నప్పటికీ, కొన్ని కీలక నియోజకవర్గాల్లో సాంప్రదాయ ఓట్ల విధానాన్ని మార్చడం ద్వారా ఫలితాలను తలకిందులు చేసే సామర్థ్యం ఈ ఈ పార్టీకి ఉన్నది.పంజాబ్లో బీజేపీ తన దీర్ఘకాలిక విస్తరణ వ్యూహాన్ని కొనసాగిస్తున్నది. లూథియానా, జలంధర్, అమృతసర్, హోషియార్పూర్, పటియాలా, ఎస్.ఎ.ఎస్ నగర్ (మొహాలి) వంటి ప్రధాన పట్టణ నియోజకవర్గాల్లో పార్టీ ఓటు బ్యాంకు విస్తరించేందుకు కృషి చేస్తున్నది. పట్టణ ప్రాంత హిందూ ఓటర్లు, వ్యాపారులు, చదువుకున్న యువతలో ఆదరణ పెరిగినప్పటికీ, సిక్కు రైతాంగంలో తిరిగి నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడం బీజేపీకి అతిపెద్ద సవాలుగా మిగిలిపోయింది. దీంతో కొన్ని పట్టణ స్థానాల్లో సీట్లు సాధించే అవకాశం ఉన్నా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మార్పును సృష్టించే పరిస్థితి బీజేపీకి ఇంకా రాలేదు.రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు కొంతమంది ఎంపీలు, ముఖ్య నేతలు ఆప్ని వీడటం పట్టణ ప్రాంతాల్లో రాజకీయంగా చర్చనీయాంశమైనప్పటికీ, ఎన్నికల ఫలితాలపై దీని తక్షణ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని సర్వే నిర్ధారించింది. ఈ చేరికలు పట్టణ ప్రాంతాల్లో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచినప్పటికీ, సాధారణ ఓటర్ల ప్రాధాన్యతల్లో పెద్దగా మార్పు తేలేదు. ముఖ్యంగా గ్రామీణ పంజాబ్లో వ్యవసాయం, ఉపాధి, పాలన, స్థానిక అభ్యర్థుల బలం మాత్రమే ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. డేరా సచ్చా సౌదా, రాధా స్వామి సత్సంగ్ బియాస్, డేరా సచ్ ఖండ్ బల్లాన్, నామ్ధారి , నిరంకారి వంటి డేరాలు పంజాబ్లోని మాల్వా, దోఆబా ప్రాంతాల్లో దాదాపు సగం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సామాజికంగా గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. డేరాలు నేరుగా ఏ పార్టీకీ ఓటు వేయాలని ఆదేశాలు ఇవ్వకపోయినా, వారి సామాజిక ప్రభావం దగ్గరగా జరిగే పోటీల్లో ఫలితాలను ప్రభావితం చేస్తుంది. డేరాలతో మెరుగైన సంబంధాల వల్ల బీజేపీకి కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, అది మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద విజయాన్ని కట్టబెట్టలేదని సర్వే విశ్లేషించింది.మొత్తంగా చూస్తే, 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సిద్ధాంతాల కంటే ఎక్కువగా ప్రజాపాలన, నాయకత్వ విశ్వసనీయత, అభ్యర్థుల ఎంపిక మరియు స్థానిక సమస్యల ఆధారంగానే జరగనున్నాయి. ఏకపక్ష ప్రభంజనాలు లేకుండా వందలాది నియోజకవర్గాల్లో హోరాహోరీ స్థానిక పోటీలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, సంస్థాగత బలం, ప్రజల అంచనాలకు తగినట్లుగా స్పందించే తీరుపైనే అంతిమ విజయం ఆధారపడి ఉంటుంది.పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజన్ పాండే పర్యవేక్షణలో, సీనియర్ పరిశోధకుడు అమిత్ ఓహ్లాన్ సమన్వయంలో 24 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లతో కూడిన 6 బృందాలు జూన్ 20 నుండి జూలై 31, 2026 వరకు (45 రోజుల పాటు) పంజాబ్లోని మాల్వా, మాఝా, దోఆబా ప్రాంతాలలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించాయి. ‘సిస్టమాటిక్ స్ట్రాటిఫైడ్ రాండమ్ శాంప్లింగ్’ పద్ధతిలో వివిధ సామాజిక వర్గాలు, వృత్తులు, వయస్సు, ఆర్థిక నేపథ్యాలు కలిగిన ఓటర్లతో ముఖాముఖి సంభాషించి మొత్తం 8,000 మంది ప్రతినిధుల నుండి శాంపిల్స్ సేకరించి ఈ నివేదికను తయారు చేశారు.-'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే. -
30 ఫ్లస్.. డీకేకు చెక్ పెట్టే వ్యూహమా?
కేబినెట్ విస్తరణ తర్వాత కర్ణాటక కాంగ్రెస్లో మొదలైన అసంతృప్తి మరింత తీవ్రరూపం దాలుస్తోంది. మంత్రి పదవులు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు నిరసనలు కొనసాగిస్తుండగా.. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెబల్ నేతలు నేడు కీలక సమావేశం నిర్వహిస్తుండడం.. ఉత్కంఠను రేకెత్తిస్తోంది.ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. అయితే పలువురు సీనియర్ నేతలు తమకు అవకాశం రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు నేతల అనుచరులు బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట నిరసనలు కూడా చేపట్టారు. ముఖ్యంగా తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న నేతలు.. ప్రాంతీయ సమతుల్యత, సీనియారిటీ, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. కొన్ని జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదని, మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కూడా అసంతృప్త నేతలు చెబుతున్నారు.ఇప్పటికే రాజీనామా చేసిన ఎమ్మెల్యే..మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి చెందిన ఇండీ ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదని అనుచరులు చెబుతున్నారు. మరో నేత బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా ఆలోచనలో ఉన్నారు. వీరితో పాటు దినేశ్ గుండు రావు, ఎం. కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియకృష్ణ, ఎం.సీ. సుధాకర్, ఆర్బీ తిమ్మాపూర్, రహీం ఖాన్ వంటి పలువురు నేతలు కేబినెట్ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.మంత్రి పదవుల ఎంపికలో ప్రాంతీయ సమతుల్యత పాటించలేదని, సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు తమ అనుచరులతో కలిసి నిరసనలు చేపట్టగా.. మరికొందరు పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.రాజీనామా చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తా: డీకేఅసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా హెచ్చరికలపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కఠినంగా స్పందించారు. రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరని, రాజీనామా లేఖలు వస్తే నిమిషాల్లో ఆమోదిస్తామని హెచ్చరించారు. “రాజకీయాల్లో రాజీనామాలు సాధారణం. పార్టీ అన్నింటికంటే ముఖ్యం. ఓపికగా ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, సహనం పాటించడం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని అసంతృప్త నేతలకు సూచించారు. ఈ తరుణంలో.. డీకే శివకుమార్తో చర్చల అనంతరం కొందరు నేతలు మెత్తబడినట్లు సమాచారం.నేడు ఏం తేలనుంది?మంత్రి పదవులు దక్కని నేతలు నేడు రహస్యంగా భేటీ అవుతున్నట్లు సమాచారం. ఆ సమావేశంలో.. తమ డిమాండ్లు, పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచే మార్గాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. దాదాపు 30 మందికిపైగా ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది. సీఎం డీకే వైఖరి కారణం.. అవసరమైతే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని కూడా వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేల సమావేశం నేపథ్యంలో ఈ అసంతృప్తి ఏ స్థాయికి వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.అధిష్టానం రంగంలోకి..కర్ణాటక కాంగ్రెస్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలాను బెంగళూరుకు పంపింది. ఇప్పటికే ఆయన సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చించారు. ఇవాళో, రేపో అసంతృప్త నేతలతో చర్చలు జరిపి వివాదాన్ని సద్దుమణిగేలా చేయడమే లక్ష్యంగా హైకమాండ్ ప్రయత్నిస్తోంది.ప్రభుత్వానికి ముప్పు ఉందా?కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 113. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి 135 స్థానాలు గెలుచుకుంది. అంటే మెజారిటీ మార్క్ కంటే 22 స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ 66, జేడీఎస్ 19 స్థానాలు గెలుచుకున్నాయి.అందుకే ప్రస్తుతం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినా.. ప్రభుత్వం పడిపోయేంత సంఖ్యాబలం సంక్షోభం లేదని పార్టీ ధీమాగా ఉంది. కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బయటకు వెళితే తప్ప ప్రభుత్వానికి తక్షణ ముప్పు ఉండదన్న అంచనా ఉంది. అయితే సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. సీనియర్ నేతల అసంతృప్తి కొనసాగితే అది డీకే శివకుమార్ నాయకత్వానికి, పార్టీ అంతర్గత ఐక్యతకు రాజకీయ సవాల్గా మారే అవకాశం ఉంది.ఇప్పటి వరకు మంత్రి పదవుల కోసం జరిగిన అసంతృప్తి.. నేడు జరిగే ఎమ్మెల్యేల సమావేశంతో ఏ మలుపు తిరుగుతుందన్నదే కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రెబల్ ఎమ్మెల్యేలు ఏ నిర్ణయం తీసుకుంటారు? అధిష్టానం వారిని బుజ్జగిస్తుందా? లేదంటే డీకే శివకుమార్ కఠిన వైఖరినే కొనసాగిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. -
హాలోగ్రామ్.. సోలో పెత్తనం
సాక్షి, హైదరాబాద్: నామినేషన్..ఒకటీ రెండుసార్లు కాదు..ఏకంగా 8 సార్లు. ఇదే పద్ధతిలో ఒకే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన టెండర్ ఒప్పందమే ఇప్పటికీ కొనసాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా, ప్రభుత్వాలు మారినా సంస్థ (కన్సార్షియం) మాత్రం మారలేదు. రాష్ట్రంలో మద్యం బాటిళ్లపై అతికించే లేబుళ్ల సరఫరా కాంట్రాక్టును అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే సంస్థకు నామినేషన్ పద్ధతిపై కట్టబెడుతున్నారు. హాలోగ్రామ్లుగా పిలిచే ఈ లేబుళ్ల సరఫరా బాధ్యతను కొత్త సంస్థకు కట్టబెట్టేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రయత్నాలు జరుగుతున్నా..అవి పేరుకు మాత్రమేనని, లోలోపల ఎప్పటికప్పుడు ‘సర్దుబాట్లు’ కొనసాగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నిసార్లు సంబంధిత ఫైలు కదిలినా అది కార్యరూపం దాల్చక పోవడం, తాజాగా ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసి రెండేళ్లవుతున్నా పాత సంస్థకే టెండర్ కొనసాగుతుండటం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కాగా ఇదే సంస్థ కొత్తగా మరో ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడానికి కూడా ఈ ‘సర్దుబాటే’ కారణమని, పాత సంస్థను మార్చే హడావుడి కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమవుతోందని, ఈ లేబుళ్లకు సంబంధించిన ఏ ఫైలూ ముందుకు కదలడం లేదని ఎక్సైజ్ వర్గాలే అంటుండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు, సదరు సంస్థ ఇచ్చే ఆమ్యామ్యాలు..వెరసి ఈ నామినేషన్ తంతు ఏళ్ల తరబడి కొనసాగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సదరు సంస్థకు ప్రతి నెలా 15 కోట్ల లేబుళ్లకు గాను రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తుండటం గమనార్హం. టెండర్ గడువు ఎప్పుడో ముగిసినా.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2013లో యూఫ్లెక్స్, శ్రీటెక్, సీ–టెల్ అనే మూడు సంస్థల కన్సార్షియంకు హాలోగ్రామ్ల టెండర్ ఖరారయ్యింది. 2018లోనే ఈ టెండర్ గడువు ముగిసింది. 2013 నుంచి 2018 వరకు ఐదేళ్ల పాటు టెండర్ ప్రకారం లేబుళ్ల సరఫరా జరగ్గా, ఆ తర్వాత నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు గడువును పొడిగిస్తూ వస్తున్నారు. 2018 నుంచి గడువు ముగిసినప్పుడల్లా కొత్త టెండర్ నోటిఫికేషన్ కోసం ఫైలు కదలడం, ప్రభుత్వ పెద్దలతో సదరు కన్సార్షియం ‘అవగాహన’కు రావడం, ఫైలు వెనక్కి తిరిగి రావడం, మళ్లీ అదే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం పరిపాటిగా మారిపోయింది. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న ఓ వ్యక్తి మధ్యవర్తిత్వం వహించగా, మాజీ ఎంపీ వ్యవహారం నడిపారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడూ అదే తీరు.. ‘సర్దుబాటు’ తంతు కొనసాగిందనే విషయం తెలుసుకున్న ప్రస్తుత కీలక మంత్రి అగ్గిమీద గుగ్గిలం అయి వెంటనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అది తాజా ‘సర్దుబాటు’ జరిగే వరకు మాత్రమేనని, ఆ తర్వాత మళ్లీ పరిస్థితి యధాతథమేనని ఎక్సైజ్ వర్గాల సమాచారం. అయితే హాలోగ్రామ్ల సరఫరా కోసం తూతూ మంత్రంగా 2024లో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్కు హాలోగ్రామ్లు సరఫరా చేసే ఆసక్తి ఉన్న సంస్థలు తమను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ మేరకు 23 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఈ బిడ్లు దాఖలై దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అది ఫైనల్ కాలేదు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటన్నది బహిరంగ రహస్యమేనని అంటున్నారు. ఇదే సమయంలో ఈ మద్యం లేబుళ్ల సరఫరా టెండర్ దక్కించుకునేందుకు తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న ఓ మీడియా అధిపతి ప్రయత్నం చేశాడని సమాచారం. కాగా ప్రస్తుత ప్రభుత్వంలో ఓ కీలక నేత సహకారంతో హాలోగ్రామ్ల సరఫరా టెండర్ కోసం ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న సంస్థతోనే ‘సర్దుబాటు’ జరగడంతో ఆ మీడియా అధిపతి తన ప్రయత్నాల నుంచి తప్పుకున్నారనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. రిజ్వీ విఫల యత్నాలు ఇదంతా జరుగుతుండగానే అప్పట్లో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రిజ్వీ..ఈ లేబుళ్ల కాంట్రాక్టు ప్రభుత్వ రంగ సంస్థకు కట్టబెట్టాలని యోచించారు. ఈ మేరకు సెక్యూరిటీ సర్టిఫికెట్లు ముద్రించే నాసిక్లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ను సంప్రదించారు. ఆ సంస్థకు ఉన్న సాంకేతిక నైపుణ్యం, ఎంత ధరకు హాలోగ్రామ్లు సరఫరా చేయగలరనే వివరాలను సేకరించారు. ఈ మేరకు నాసిక్ ముద్రణాలయానికి టెండర్ను ఇచ్చే ఫైలును కదిలించారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ ఫైలుకు మోక్షం కలగలేదు. పాత సంస్థ ఆధ్వర్యంలోనే ఇప్పటికీ హాలోగ్రామ్లు సరఫరా అవుతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే.. ప్రస్తుతం లిక్కర్ (ఐఎంఎల్) బాటిళ్లకు మాత్రమే హాలోగ్రామ్లు సరఫరా చేస్తున్న సదరు పాత సంస్థ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. మద్యం సీసాలతో పాటు బీర్ బాటిళ్లకు కూడా తామే హాలోగ్రామ్లు ఇస్తామని, అది కూడా నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వాలని ప్రభుత్వంపై ‘అన్ని రకాలుగా’ ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి రేపోమాపో ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తొలినాళ్లలోనే అవినీతి మరకలు! మద్యం సీసా మూతపై అడ్డంగా అతికించి ఉండే లేబుల్నే హాలోగ్రామ్ అంటారు. దీన్ని హాలోగ్రాఫిక్ ఎక్సైజ్ అధెసివ్ లేబుల్ (హెచ్ఈఏల్ లేబుల్) అని కూడా పిలుస్తారు. తెలంగాణలో ఈ హాలోగ్రామ్లను హెడోనిక్ పాత్ ఫైండర్ సిస్టమ్ (హెచ్పీఎఫ్ఎస్) విధానంలో తయారు చేస్తున్నారు. అంటే ఒక మద్యం బాటిల్ను ఏ కంపెనీ తయారు చేసింది? తయారైన బాటిల్ ఏ డిపోకు వచ్చింది? అక్కడి నుంచి ఏ షాప్కు వెళ్లింది? ఏ సైజ్లో ఉందనే వివరాలు ఈ లేబుల్పై ఉంటాయి. ఈ విధానం ద్వారా ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో కూర్చుని రాష్ట్రంలో సరఫరా అయ్యే ప్రతి మద్యం బాటిల్ పంపిణీ వ్యవస్థను ట్రాక్ చేయవచ్చు. ఈ లేబుల్స్ను సరఫరా చేసేందుకు 2013లో (ఉమ్మడి రాష్ట్రంలో) టెండర్ ఖరారు చేశారు. మూడు సంస్థల కన్సార్షియం ఈ టెండర్ను దక్కించుకుంది. వాస్తవానికి అప్పట్లోనే ఈ టెండర్ ఖరారు ప్రక్రియకు అవినీతి మరకలు అంటాయి. ఆ అవినీతి మరకలు తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా కొనసాగుతూనే ఉన్నాయని, పాత సంస్థకే గత ఎనిమిదేళ్లుగా నామినేషన్ పద్ధతిలో టెండర్ కొనసాగిస్తున్నారంటే ఆమ్యామ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో కుదుర్చుకున్న టెండర్ అగ్రిమెంట్ ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ టెండర్ దక్కించుకున్న కన్సార్షియంలోని మూడు సంస్థలు రెండు రాష్ట్రాల బాధ్యతలను అనధికారికంగా పంచుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లేబుళ్ల సరఫరా బాధ్యతలు యూఫ్లెక్స్ చూస్తుండగా, ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారం, సాఫ్ట్వేర్ నిర్వహణను సీ–టెల్ అనే సంస్థ చూస్తున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 33 పైసలకు పెరిగిన ఒక లేబుల్ రేటు ప్రస్తుతం ప్రతి నెలా 15 కోట్ల లేబుళ్లను సదరు సంస్థ బేవరేజెస్ కార్పొరేషన్కు అందిస్తోంది. టెండర్ దక్కించుకున్న సమయంలో ఒక లేబుల్ను 22 పైసలకు సరఫరా చేస్తామని ఒప్పందం కుదరగా, అది క్రమంగా పెరుగుతూ ఇప్పుడు ప్రతి లేబుల్ సరఫరా రేటు 33 పైసలకు చేరింది. అంటే ప్రతినెలా రూ.5 కోట్లు, సంవత్సరానికి సుమారు రూ.60 కోట్ల విలువైన లేబుళ్లను ఈ సంస్థ సరఫరా చేస్తోందన్నమాట. మరి ఇందులో అసలు ఖర్చయ్యేది ఎంతో.. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు, అధికారులకు సమర్పించే ఆమ్యామ్యాలు ఎన్నో అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలీ కాంట్రాక్టును ఇలా నామినేషన్ పద్ధతిన ఇంకెన్ని సంవత్సరాలు పొడిగిస్తారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భవిష్యత్తు తరాలు క్షమించవు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించడం దురదృష్టకరమని, బాధ్యత గల నాయకులు యువతకు ఆదర్శంగా నిలవాలని, కానీ రాహుల్ గాంధీ ఆ దిశగా వ్యవహరించడం లేదని అన్నారు.పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం బాధ్యత అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనుకేసుకురావడం సరికాదని, రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇదే విధంగా దూషిస్తే ఆయన అదే విధంగా స్పందిస్తారా అని ప్రశ్నించారు.అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు వచ్చినప్పటికీ ఆయన హుందాగా స్పందించారని, చిన్నారులు తప్పులు చేయడం సహజమని, వారిని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదేనని మోదీ సూచించారు. ఆయన స్పందనలో క్షమాగుణం, బాధ్యత మాత్రమే కనిపించగా, విద్యార్థిని స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పడం భారతీయ సంస్కృతి, విలువలకు నిదర్శనమని మంత్రి అన్నారు.అలాగే, భారతీయ సంప్రదాయాలు పెద్దలను గౌరవించడం, తప్పు చేసిన వారిని క్షమించి సరైన మార్గంలో నడిపించడం వంటి విలువలను బోధిస్తాయని వారు గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకుడిగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా వ్యవహరించాల్సిన సమయంలో రాహుల్ గాంధీ బాధ్యతాయుత రాజకీయాలను విస్మరించారు. అయితే, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అవమానకరమైన భాషను ప్రోత్సహించే నాయకులను భవిష్యత్తు తరాలు తిరస్కరిస్తాయని, దేశ ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యువత మద్దతు ఎప్పటికీ ఉంటుందని మంత్రి కిషన్రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి దక్కలేదు
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది, మా కష్టాల గురించి అడిగేవారే లేరని, అమ్మా నాన్న లేని అనాథలుగా అనిపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంవై గోపాలకృష్ణ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రి పదవి దక్కకపోవడం ఆశ్చర్యంగా, అవమానంగా ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణ లో అనేక లోపాలున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారన్నారు. సిద్దుకు ఆప్తుడనని ఇవ్వలేదు: సుధాకర్ యశవంతపుర: తాజా మాజీ మంత్రి, చింతామణి ఎమ్మెల్యే డాక్టర్ ఎంసీ సుధాకర్ సీఎం శివకుమార్ను ప్రస్తావించకుండా ప్రభుత్వ ముఖ్యులు కారణమని ఎదురుదాడి చేశారు. వచ్చే రోజుల్లో గట్టి నిర్ణయం తీసుకోక తప్పదన్నారు. మంత్రి స్థానం తప్పడంపై స్పందిస్తూ, సిద్ధరామయ్య పనితీరును చూసి దగ్గరయ్యా, ఆ ద్వేషంతో నాకు మంత్రి పోస్టు ఇవ్వలేదని పరోక్షంగా సీఎంపై విమర్శలు చేశారు. గతంలో మంత్రులుగా ఉన్నవారికి మళ్లీ ఇచ్చారు, వారిలో ఏం చూసి ఇచ్చారో తనకు తెలియదన్నారు. -
కర్ణాటక కాంగ్రెస్లో బిగ్ ట్విస్ట్.. సీఎంకు షాకిచ్చిన మండలి చైర్మన్
కర్ణాటక రాజకీయాల్లో ‘రాజీనామా’ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కర్ణాటక శాసన మండలి చైర్మన్ బసవరాజ్ హొరట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తనకు ఫోన్ చేసి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరినట్లు వెల్లడించారు. అయితే ఈ విషయంలో బీజేపీ, జేడీఎస్ నాయకులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. ఈ క్రమంలో సీఎం డీకేకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు.ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం కొంతమంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమం చేయాలన్న చర్చలు రాజకీయ దుమారం రేపగా, ఇప్పుడు అదే చర్చ శాసన మండలికి చేరింది. మండలి ఛైర్మన్ బసవరాజ్ హొరట్టికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫోన్ చేసి రాజీనామా చేయాలని కోరినట్లు హొరట్టి స్వయంగా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో హొరట్టి వెంటనే స్పందిస్తూ..‘ఛైర్మన్ను పార్టీ అధిష్ఠానం నిర్ణయించదు.. సభే ఎన్నుకుంటుంది. తొలగించాలంటే సభా నిబంధనల ప్రకారమే జరగాలి’ అని కౌంటర్ ఇచ్చారు. తన పదవీకాలం 2028 వరకు ఉందని, తనను తొలగించాలంటే సభలో అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సిందేనని హొరట్టి స్పష్టం చేశారు. ఈ అంశంపై బీజేపీ, జేడీఎస్ నేతలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.తనను తొలగించాలంటే కనీసం 10 మంది సభ్యులు 14 రోజుల ముందుగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత సభలో జరిగే ఓటింగ్ ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. 1956 నుంచి ఏ చైర్మన్ కూడా ప్రభుత్వం మధ్యలో రాజీనామా చేయించలేదని, తనను తొలగించడానికి ఎలాంటి కారణం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 75 సభ్యుల కర్ణాటక శాసన మండలిలో కాంగ్రెస్కు 38 మంది సభ్యులతో మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో హొరట్టి కొనసాగింపుపై రాజకీయ చర్చ మరింత వేడెక్కింది. దీంతో, ముఖ్యమంత్రి, మండలి చైర్మన్ మధ్య పొలిటికల్ ట్విస్ట్ చోటుచేసుకుంది.#WATCH | Bengaluru, Karnataka: On the removal and changes of names from the Karnataka Legislative Council Chairman's list, BJP leader Basavaraj Horatti says, “...Whatever decision is taken by the House, the House is supreme. I will go to the House. Whatever the House decides, I… pic.twitter.com/q9fnQJC0Ir— ANI (@ANI) August 3, 2026అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం శాసన మండలి చైర్మన్ పదవికి సలీం అహ్మద్ పేరును ఖరారు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇదే సమయంలో అసెంబ్లీ స్పీకర్గా జీఎస్ పాటిల్, డిప్యూటీ స్పీకర్గా ఏఎస్ పొన్నన్న, డిప్యూటీ చైర్పర్సన్గా ఉమాశ్రీ పేర్లను కూడా కాంగ్రెస్ ఆమోదించింది. కాగా, పార్టీ ముందుగానే చైర్మన్ పేరును ప్రకటించడంపై హొరట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని ఘాటుగా వ్యాఖ్యానించారు. -
ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి?
కర్ణాటక: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు గురించి సీఎం డీకే శివకుమార్ హైకమాండ్తో చర్చలు జరిపారు. కొందరు మంత్రులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. గతంలో సిద్దరామయ్య సర్కారులో పనిచేసిన మంత్రులకు ఇప్పుడు అవే శాఖలను కేటాయించే అవకాశముంది. పాత మంత్రులు శాఖల మార్పును వాంఛిస్తున్నారు. మంత్రి కే.హెచ్.మునియప్ప ఆహారపౌరసరఫరాల శాఖకు బదులుగా సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో వ్యవసాయ శాఖను చూసిన ఎన్.చెలువరాయస్వామికి అదే శాఖను ఇస్తారని తెలుస్తోంది. సిద్దు హయాంలో మంత్రులుగా ఉండి, మళ్లీ ఇప్పుడు పదవులు చేపట్టిన శివరాజ్ తంగడగి, బీ.జేడ్ జమీర్ అహ్మద్ ఖాన్, సంతోష్ లాడ్, మధుబంగారప్ప, నాగేంద్ర, ఎస్.ఎస్.మల్లికార్జున్లకు పాత శాఖలే ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కొత్త మంత్రులకు ఈ శాఖలు? కొత్తగా చేరిన రుద్రప్ప లమాణికి–ఎక్సైజ్, కే.ఎస్.బసవంతప్ప–పురపాలక, టీ.రఘుమూర్తి–ఎస్టీల సంక్షేమం, రిజ్వాన్ హర్షద్–ఉన్నత విద్య, పుట్టరంగశెట్టి–పశు సంవర్ధక, పట్టు, అజయ్సింగ్–చిన్న పరిశ్రమల–కే.ఎం.శివలింగేగౌడ, హెచ్.సీ.బాలకృష్ణ–అటవీ, పర్యావరణ, బసవరాజరాయరెడ్డి–న్యాయ, అసెంబ్లీ వ్యవహారాలు, విజయానంద కాశప్పనవర్–జౌళి, లక్ష్మణ్ సవది–సహకార, చక్కెర శాఖలు లభించే అవకాశముంది. -
నెక్ట్స్ ఇక తెలంగాణే
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇక తెలంగాణపై దృష్టి పెట్టనుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులను చక్కదిద్దడంలో భాగంగా అధికార మార్పిడి, మంత్రివర్గ విస్తరణ ప్రక్రియలు హైకమాండ్ చేపట్టింది. కర్ణాటకలో దశల వారీగా ఈ కార్యక్రమం పూర్తి చేసింది. ఇక రాష్ట్రం వంతే అనే అభిప్రాయం పార్టీవర్గాలు, ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెడతారని, అందులో భాగంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ ఫైలుకు ఈ నెలలో కదలిక వస్తుందని అంటున్నారు. అధిష్టానం నుంచి ఏ క్షణమైనా కబురు రావచ్చని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్ బెర్తుపై ఎమ్మెల్యేల ఆశలుఈ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. విస్తరణకు అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇస్తే ఈ దఫాలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల మార్పునకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావడం, పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్తుపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఎన్నికల మంత్రివర్గం కూర్పుపై అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు చేయనుంది. అయితే ఇటీవలæ పార్టీ ముఖ్య నేతలు, టీపీసీసీ సమన్వయ కమిటీతో అధిష్టానం భేటీ అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు రాలేదు. కానీ కర్ణాటక ఎపిసోడ్ పూర్తయిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే తెలంగాణపై హైకమాండ్ దృష్టి పెడుతుందని అంటున్నారు. -
అసంతృప్తి నేతలకు డీకే శివకుమార్ షాక్!
కర్ణాటక కాంగ్రెస్లో మంత్రి పదవుల కేటాయింపు తర్వాత మొదలైన అసంతృప్తి చర్చలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెక్ పెట్టారు. మంత్రి పదవులు దక్కకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని ప్రకటించడంపై ఆయన నేరుగా స్పందించారు. ఈ క్రమంలో రాజకీయాల్లో రాజీనామాలు సర్వసాధారణమని.. దాన్నొక టీ కప్పులో తుపానుగా చూపించే ప్రయత్నం చేశారు.మంగళవారం ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ.. “రాజీనామా చేయాలనుకునేవారిని ఎవరూ ఆపలేరు” అంటూ వ్యాఖ్యానించారు. అయితే పార్టీతోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని, పదవులు రాకపోయినా నేతలు ఓపికగా ఉండాలని సూచించారు.ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రి పదవి దక్కని సీనియర్ నేత యశ్వంతరాయగౌడ వి. పాటిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.ఈ పరిణామాలపై స్పందించిన డీకే శివకుమార్.. గతంలో తాను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని గుర్తుచేశారు. ధర్మ్సింగ్, సిద్ధరామయ్య ప్రభుత్వాల సమయంలో తనకు మంత్రి పదవి దక్కని సందర్భాలు ఉన్నాయని.. అయినా పార్టీ కోసం ఓపికగా ఉన్నానని చెప్పారు. “నాకు కూడా అప్పట్లో అవకాశాలు రాలేదు. నేను రాజీనామా చేయలేదు. జీ. పరమేశ్వర కూడా ఓపికగా ఎదురుచూశారు. పార్టీలో ఉంటేనే భవిష్యత్ ఉంటుంది” అని డీకే వ్యాఖ్యానించారు.మరోవైపు మంత్రి పదవి దక్కని నేతలకు తగిన బాధ్యతలు అప్పగిస్తామని డీకే శివకుమార్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ప్రతి నాయకుడికి పదవి ఆశించడం సహజమేనని, అసంతృప్తిగా ఉన్న వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.కేబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్లో అసంతృప్తి బయటపడటం అధిష్ఠానానికి కొత్త తలనొప్పిగా మారింది. అయితే నేతల మధ్య సమన్వయం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇదే సమయంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు.. పదవుల కోసం ఒత్తిడి తెస్తున్న నేతలకు స్పష్టమైన సంకేతంగా మారాయి. పార్టీని వీడే నిర్ణయం వ్యక్తిగతమైనదే అయినప్పటికీ.. రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్లోనే కొనసాగాలని ఆయన సూచించినట్లు కనిపిస్తోంది. -
డీకే శివకుమార్కు బిగ్ షాక్ 12 మంది కాంగ్రెస్ MLAల రాజీనామా?
-
రేవంత్రెడ్డే క్రిమినల్ వేస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను, చదువుకున్న యువతను ‘క్రిమినల్ వేస్ట్’గా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొనడం అత్యంత అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. పోటీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న లక్షలాది మంది యువతను అవమానించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. నిజంగా క్రిమినల్ వేస్ట్ ఎవరైనా ఉంటే 89 కేసులు ఎదుర్కొంటున్న రేవంత్రెడ్డేనని, అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడమే కాంగ్రెస్ పార్టీ చేసిన అసలైన క్రిమినల్ వేస్ట్ అని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రాహుల్గాందీ, రేవంత్రెడ్డి కలిసి ఇచ్చిన గ్యారంటీలు, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేశారని విమర్శించారు. కనీసం తన ఎన్నికల అఫిడవిట్ను అయినా స్వయంగా నింపే సామర్థ్యం రేవంత్కు ఉందా? అని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రి బాధ్యత నుంచి వెంటనే తప్పుకోవాలని, రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవ¯న్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేణు సూసైడ్ లేఖ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు రాసిన సూసైడ్ లేఖ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పట్టే చార్జిషీట్ లాంటిదని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగాల హామీ అమలు కాకపోవడం వల్లే తాను తీవ్ర నిరాశకు గురయ్యానని వేణు తన లేఖలో పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని అన్నారు. అయితే యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులపాటు నిర్వహించి యువతకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలని డిమాండ్ చేశారు. లేకుంటే యువతకు జరిగిన ద్రోహంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున గట్టిగా ప్రశ్నిస్తామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాళేశ్వరంపై అసత్య ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీరు ఎలా వస్తోందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. గాయత్రి, మేడారం పంపింగ్ వ్యవస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణను రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం సిద్ధం చేసిన రాయదుర్గం–ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టును రద్దు చేసింది రేవంత్ ప్రభుత్వమేనన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇటీవల దివంగతుడైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపైనా కేసులు పెట్టారని మండిపడ్డారు. పౌర సరఫరాలు, విద్యాశాఖ అవినీతి అంశాలను బయటపెట్టి ఈడీ, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడినందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. -
కర్ణాటక కాంగ్రెస్లో అసమ్మతి.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?
సాక్షి,బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి బయటపడింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన వేళ పార్టీలో తిరుగుబాటు వ్యక్తమైంది. కేబినెట్లో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశవంతరాయగౌడ వి. పాటిల్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణికి అందజేశారు.మరోవైపు సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ సైతం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ అధిష్ఠానానికి షాక్ ఇచ్చారు. తమతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేబినెట్లోకి కొత్తగా 20 మంది మంత్రులను చేర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, వరుస రాజీనామాలు, ఎమ్మెల్యేల అసంతృప్తితో రాజధాని బెంగళూరులో తీవ్ర కలకలం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. -
రాహుల్ గాంధీ మాట తప్పారు జాబ్ రాక విద్యార్థి సూసైడ్ నోట్
-
ఎమ్మెల్సీ.. ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సభ్యుల (ఎమ్మెల్సీ) ఎంపికపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. నవంబర్లో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా స్థానాలు, వచ్చే ఏడాది మార్చిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయా స్థానాల్లో అభ్యర్థిత్వాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రాథమికంగా చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల కంటే తక్కువ సమయం ఉండగా వచ్చే మార్చిలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఆయా స్థానాల అభ్యర్థిత్వాలపై వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండింటికి పది మందికి పైగా.. నల్లగొండ–ఖమ్మం–వరంగల్, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు వచ్చే మార్చిలోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పట్టభద్రుల స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాణీదేవీ, తీన్మార్ మల్లన్న పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్లోనే ఓటరు నమోదు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల అంచనా. అప్పటి నుంచే ఓటర్ల నమోదు హడావుడి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు పదిమందికిపైగా ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ స్థానానికి టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.ఆయనతోపాటు ఉపాధ్యాయ సంఘాల నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి జి. హర్షవర్దన్రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీశ్ యాదవ్తోపాటు పలు విద్యాసంస్థల అధినేతలు కూడా పోటీ పడుతున్నారు. ఇక నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానం నుంచి తెలంగాణా డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు ఖమ్మం జిల్లా యువనేత డాక్టర్ జి.లోకేశ్ యాదవ్, వరంగల్ జిల్లాకు చెందిన దొమ్మాటి సాంబయ్య, నమిండ్ల శ్రీనివాస్, కాశీరాం నాయక్, నల్లగొండ నుంచి చనగాని దయాకర్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై త్వరలోనే పూర్తిస్థాయి కసరత్తు ప్రారంభమవుతుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి.మిగిలిన సామాజిక వర్గాలకు.. గవర్నర్ కోటా కింద ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యల పదవీకాలం నవంబర్లో ముగియనుంది. ఎస్సీ, ఓసీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురి పదవీ విరమణతో ఖాళీ కానున్న స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించాలని అధిష్టానం భావిస్తోంది. ఇందులో రెండు స్థానాలు బీసీలకు, ఒకటి ఎస్సీలకు ఇవ్వాలనేది ఆ పార్టీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత గౌడ, ముస్లిం, మాల, వెలమ, లంబాడీ, ఎంబీసీ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలుగా అవకాశమిచ్చింది. అందువల్ల నేపథ్యంలో ఈసారి మున్నూరుకాపు, యాదవ, పద్మశాలి, ముదిరాజ్, మాదిగ సామాజిక వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలించే అవకాశాలున్నాయి. ఒకవేళ ఓసీలకు ఇవ్వాల్సి వస్తే వైశ్య, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు అవకాశం లభించనుంది. ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి యువతకు అవకాశాలు కలి్పస్తారని, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఓసీలకు కేటాయిస్తారని, గవర్నర్ కోటాలో బీసీ, ఎస్సీలకు అవకాశమిస్తారనే మరో చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతుండటం గమనార్హం. -
కాంగ్రెస్తో పొత్తుకు ఆప్ రెడీ.. నెక్ట్స్ జరిగేదేంటి?
గోవాలో 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలు కూటమి ఏర్పాటుపై ప్రాథమిక చర్చలు ప్రారంభించాయి. కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీ చర్చలు ప్రారంభించగా, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.గోవా అసెంబ్లీలో 40 మంది సభ్యులు ఉంటారు. అసెంబ్లీ ఎన్నికలు 2027 ఫిబ్రవరి-మార్చిలో జరిగే అవకాశం ఉండటంతో పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో బీజేపీ ఇప్పటికే కనీసం 30 స్థానాలు గెలిచి రాష్ట్రంలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీశ్ చోడంకర్ మాట్లాడుతూ.. కూటమి ఏర్పాటుపై గోవా ఫార్వర్డ్ పార్టీ అధినేత విజయ్ సర్దేశాయితో చర్చలు జరిపినట్లు తెలిపారు. శనివారం దక్షిణ గోవాలోని ఫటోర్డాలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్, జీఎఫ్పీ 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.శనివారం జరిగిన చర్చలు ప్రాథమిక స్థాయిలో మాత్రమే జరిగాయని, కూటమిని కొనసాగించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చోడంకర్ తెలిపారు. "మళ్లీ సమావేశమై సీట్ల సర్దుబాటు సహా ఇతర విషయాలను ఖరారు చేస్తాం" అని ఆయన చెప్పారు.ఇదిలా ఉండగా, ఆప్ గోవా అధ్యక్షుడు వాల్మీకి నాయక్ పొత్తుపై నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటు చేసిన పార్టీ కమిటీని కలిశారు. ఆప్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న పార్టీలతో పొత్తుకు సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే ప్రధాన లక్ష్యమని నాయక్ మీడియాతో చెప్పారు.ప్రస్తుతం గోవాలో 33 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇందులో 28 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాల్లో 20 స్థానాలు గెలిచింది. ఆ తర్వాత ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది.ప్రస్తుతం కాంగ్రెస్కు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఆప్కు ఇద్దరు ఎమ్మెల్యేలు, గోవా ఫార్వర్డ్ పార్టీ, రివల్యూషనరీ గోవన్స్ పార్టీకి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. చర్చలు ప్రారంభం కావడంతో 2027 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి వ్యూహాన్ని పరిశీలించడం ప్రారంభించాయి. -
‘నాకు సొంత ఇల్లే లేదు’.. భారీ మెజార్టీ ఇస్తేనే పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తనకు భారీ మెజార్టీతో గెలిపిస్తామని ముందస్తుగా హామీ ఇస్తేనే తాను పోటీకి దిగుతానని ఆయన స్పష్టం చేశారు.ప్రజల పూర్తి మద్దతు, నమ్మకం ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతానని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన రాజకీయ నిబద్ధతను,ఆస్తుల వివరాలను ప్రస్తావిస్తూ.. తనకు నల్లగొండలో సొంత ఇల్లు గానీ, తన సొంత గ్రామంలో ఎలాంటి భూములు గానీ లేవని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. తాను స్వార్థం కోసం కాకుండా, కేవలం ప్రజల సేవ కోసమే రాజకీయాలు చేస్తున్నానని అన్నారు.నల్లగొండ పట్టణాభివృద్ధిపై తనకున్న లక్ష్యాన్ని చాటిచెప్పిన ఆయన, నల్లగొండను సాధారణ పట్టణంలా కాకుండా ఒక అత్యాధునిక నగరంగా, రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే నల్లగొండను కార్పొరేషన్గా మార్చామని, రహదారులు, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి వివరించారు. -
‘నామినేటెడ్’పై కాంగ్రెస్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ కార్పొరేషన్లు, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని గాం«దీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వేం నరేందర్రెడ్డి సమావేశమై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పార్టీ నాయకత్వం నిర్దేశించిన విధానాల ప్రకారమే చేపట్టాలని నిర్ణయించారు. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సూచనలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. నియామకాల విషయంలో స్థానిక నాయకత్వం అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు సముచిత గుర్తింపు కలి్పంచాలని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. ఆశావహుల పేర్లపై చర్చ ఉమ్మడి జిల్లాలకు నియమించిన ఇన్చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలకు సంబంధిత జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఆయా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, సీనియర్ నాయకులు హాజరై ఆశావహుల పేర్లపై చర్చించనున్నారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేసిన కృషి, నాయకుల సేవలను పరిగణనలోకి తీసుకుని సమన్వయంతో నివేదిక సిద్ధం చేసి పీసీసీకి పంపాలని నిర్ణయించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో పార్టీ సంస్థాగత నాయకత్వానికి అధిక ప్రాధా న్యం ఇవ్వాలని గాం«దీభవన్లో జరిగిన సమావేశం నిర్ణయించింది.మొత్తం పోస్టుల్లో సుమారు 60 శాతం పదవులను గతంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన నాయకు లు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులకు కేటాయించాలని నిర్ణయించారు. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన వారికి గుర్తింపు కలి్పంచడమే ఈ నిర్ణయం ఉద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి.నియామకాలలో సామాజిక న్యాయం పాటించాలని కూడా సమావేశం నిర్ణయించింది.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు తగిన ప్రాధాన్యం కలి్పస్తూ అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఉండేలా జాబితాలు రూపొందించాలని సూచించారు. సామాజిక సమతుల్యతతో పాటు ప్రాంతీయ సమతుల్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నాయకత్వం నిర్ణయించింది.సీఎం, పీసీసీ చీఫ్ తుది నిర్ణయం జిల్లాల నుంచి వచ్చే నివేదికలను పరిశీలించిన అనంతరం అన్ని సంప్రదింపులు పూర్తి చేసి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో చాలాకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవుల నియామకాల కోసం ఎదురుచూస్తున్న పార్టీ నాయకుల్లో ఈ పరిణామం ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
‘ప్రభుత్వానికి-గాంధీ భవన్కు ఎలాంటి విభేదాలు లేవు’
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి- గాంధీ భవన్కు ఎలాంటి విభేదాలు లేవన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని, అందులో చిన్న చిన్న సమస్యలు సహజమన్నారు. పార్టీకి-ప్రభుత్వానికి మధ్య అన్నదమ్ముల పంచాయతీ మాత్రమే ఉందన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుందని, దాన్ని గ్యాప్ అనడం కరెక్ట్ కాదన్నారు. కోఆర్డినేషన్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఢిల్లీలో జరిగిందన్నారు. తమ అంతర్గత పంచాయతీలలో ఇతరులు దూరితే వాళ్లకే నష్టమన్నారు పొంగులేటి. ధరణి టెండర్ నుంచి భూ భారతి వరకూ SET(ప్రత్యేక విచారణ బృందం) విచారణ చేస్తుందన్నారు. ప్రోహిబిటెడ్ లిస్ట్లో బీఆర్ఎస్ ఎంత పెట్టింది - కాంగ్రెస్ ఎలా చేసింది లెక్కలు SET తీస్తుందన్నారు. రీ -సర్వే వల్ల 90శాతానికి పైగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. -
విద్యార్థులకు కావాల్సింది క్షమాభిక్ష కాదు మోదీజీ: రాహుల్
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల ఆందోళనలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష కాదు, క్షమాపణ చెప్పాలని అన్నారు."భారత్ విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష అవసరం లేదు. వారికి ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది" అని రాహుల్ చెప్పారు. విద్యార్థులు తనపై చేసిన వ్యాఖ్యలను "క్షమిస్తున్నాను" అన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాహుల్ ఇలా అన్నారు.నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను రాహుల్ కలుసుకుని ఓదార్చారు. ఈ భేటీ చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరిగింది. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు దుఃఖంలో ఉండటాన్ని చూడటం కంటే బాధాకరమైనది మరొకటి లేదని రాహుల్ అన్నారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి యువకుడు, యువతి వెనుక జీవితాంతం బాధ మోసే కుటుంబం ఉంటుందని చెప్పారు.పలుసార్లు ప్రశ్నపత్రాల లీకులు జరగడం, పరీక్షలు రద్దు కావడం, ఎన్నో సంవత్సరాల సన్నాహాలు ఒక్క రాత్రిలో వృథా కావడం విద్యా వ్యవస్థలోని వైఫల్యాన్ని బయటపెట్టాయని అన్నారు. నిజాయితీగా లేని వ్యవస్థలో విద్యార్థులు నిజాయితీగా శ్రమించాలని అడుగుతున్నారని చెప్పారు.ప్రశ్నపత్రం లీక్ కారణంగా భవిష్యత్తు కోల్పోయిన ఒక్క విద్యార్థినైనా, దుఃఖంలో ఉన్న ఒక్క తల్లిదండ్రినైనా ప్రధాన మంత్రి కలవలేదని ఆయన విమర్శించారు. విద్యార్థులు, వారి కుటుంబాలు అనుభవిస్తున్న వేదనను కేంద్ర ప్రభుత్వం గుర్తించడంలో విఫలమైందని అన్నారు. -
కాంగ్రెస్ ‘గో’ రాజకీయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ గోవుల చుట్టూ రాజకీయం దిశగా పావులు కదుపుతోంది. హిందుత్వ ఓట్లు గంపగుత్తగా బీజేపీ ఖాతాలో పడకుండా సంఘ్తో సంబంధం లేని ఓటు బ్యాంకును తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలను అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు నుంచే మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్రెడ్డి త్వరలోనే గోవులను కేంద్రంగా చేసుకొని కీలక నిర్ణయం ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో గోరక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని.. త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.కమిషన్ ఏర్పాటుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో గోమాత పూజ చేయాలని, ఈ కార్యక్రమానికి బతుకమ్మ తరహా ప్రాచుర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే గోమాత దినోత్సవం నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలియవచి్చంది. తద్వారా గోజాతి సంరక్షణతోపాటు హిందుత్వ ప్రభావం ఉన్న ఓటర్లను ఆకర్షించే వ్యూహాన్ని అమలు చేయాలనేది సీఎం రేవంత్రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. బోర్డు కావాలని అడిగితే.. వాస్తవానికి గత నెలలో రాష్ట్రంలోని గోశాలల నిర్వాహకులతో పశుసంవర్థక శాఖ సమావేశమైంది. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలోని 200కుపైగా గోశాలల నిర్వాహకులు తమ సాదకబాధలను ప్రభుత్వం ముందు పెట్టారు. గోసరంక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని పశుసంవర్థక శాఖ అధికారులు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఏకంగా కమిషన్ ఏర్పాటు చేద్దామని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం గమనార్హం.ఈ నేపథ్యంలోనే బాలల సంక్షేమ కమిషన్ తరహాలోనే గోరక్షణ కమిషన్కు అధికారాలు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. గోవుల సంరక్షణతోపాటు అన్ని గోశాలలపై పర్యవేక్షణ, గోశాలలకు విరాళాల విషయంలో పారదర్శకత, గోవధ, ఇతర అంశాల్లో ఫిర్యాదులపై కమిషన్ తుది నిర్ణయం తీసుకొనేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటు కానున్న ఈ కమిషన్లో పశుగణాభివృద్ధి, విజయా డెయిరీ, వెటర్నరీ యూనివర్సిటీ, గోశాలల నిర్వాహకులు, పశుసంవర్ధక శాఖ అధికారులను సభ్యులుగా నియమించనున్నట్లు సమాచారం. గోశాలలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఇప్పటికే రాష్ట్రంలోని మొయినాబాద్, యాదాద్రి, వేములవాడల్లో భారీ గోశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంద ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మొయినాబాద్ గోశాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక రాష్ట్రంలోని 258 గోశాలలకు రిజి్రస్టేషన్ తప్పనిసరి చేయడమే కాకుండా ఆయా గోశాలలు సొంతంగా మనుగడ సాగించేలా ఆర్థిక పరపతి కల్పించే దిశలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. ఇక బతుకమ్మ పూజ తరహాలోనే గోమాత పూజను కూడా ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున గిన్నిస్ రికార్డు సాధించేందుకు పశుగణాభివృద్ధి సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.ఈ సంస్థ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,500 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. వారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో ఏకకాలంలో గోవులను సమీకరించి వాటికి పూజ చేయబోతున్నామని తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ సింగం చరణ్ కౌశిక్ యాదవ్ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఏటా సెపె్టంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట బీజేపీ చేసే హడావుడికి కూడా గోవుతోనే చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోజును గోమాత దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఫలితమిస్తున్న విరుగుడు బీజేపీని కౌంటర్ చేసేందుకు కొన్ని రాజకీయ వ్యూహాలు ఫలితాన్ని ఇస్తున్నాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఆ పార్టీ నేత కేజ్రీవాల్ ఓ టీవీ ఇంటర్వ్యూలో హనుమాన్ చాలీసా పఠించారు. ఆ తర్వాత కన్నాట్ప్లేస్లోని ఓ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. బీజేపీకి పడాల్సిన హిందుత్వ ఓట్లకు గండి కొట్టేందుకు ఈ పరిణామం ఓ కారణమనే విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి.అలాగే 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే కొన్ని వారాల ముందు తన ఫాంహౌస్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుత చండీ మహాయాగం నిర్వహించారు. అంగరంగ వైభవంగా ఈ యాగాన్ని నిర్వహించడం ద్వారా ఆయన తనలోని హిందుత్వవాదాన్ని బహిరంగంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో తాము హిందూ వ్యతిరేకులం కాదని బహిరంగ పర్చడం ద్వారా బీజేపీకి అనుబంధంగా లేని హిందుత్వ ఓట్లను ఆకర్షించవచ్చని కాంగ్రెస్ కూడా అంచనా వేస్తోంది. -
రెండు ఎమ్మెల్సీలనూ కొట్టాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పట్టభధ్రులకు మరింత దగ్గరయ్యేలా, వచ్చే ఫిబ్రవరిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలనూ గెలుచుకునేలా ఇప్పటినుంచే నేతలంతా పనిచేయాలని పీసీసీ సమన్వయ కమిటీలో నిర్ణయించారు. గ్రాడ్యుయేట్ స్థానాలకు ఆగస్టులోగా అభ్యర్థుల ఎంపికపై నిర్ణయానికి రావాలని నిశ్చయించారు. ఇందుకోసం మహబూబ్నగర్–హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలకు ఎన్నికల ఇన్చార్జిగా మంత్రి దామోదర రాజనర్సింహకు బాధ్యతలు కట్టబెట్టారు. ఆయన ఇతర మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి అభ్యర్థిపై నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డిలను ఇన్చార్జీలుగా నియమించారు.మంత్రులు తమ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు (డీసీసీ), ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో విస్తృతంగా చర్చించి.. ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ద్వారా పార్టీ అధిష్టానానికి నివేదిక సమరి్పంచాలని నిర్ణయించారు. సెప్టెంబర్ నుంచి ఓటరు ఎన్రోల్మెంట్ ప్రక్రియను విస్తృతంగా జరపాలనే నిశ్చయానికి వచ్చారు. రెండు స్థానాలను గెలిపించుకునేలా ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా నేతలు కృషి చేయాలని అధిష్టానం సూచించింది. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ జాతీయ కార్యాలయం ’ఇందిరా భవన్’లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సర్’ప్రక్రియపైనా చర్చించారు. పార్టీ, ప్రభుత్వ మధ్య మరింత సమన్వయం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై ఓ యాక్షన్ప్లాన్ను తయారు చేసే అంశంపై విస్తృత చర్చ జరిగింది. సెప్టెంబర్ 15 తర్వాతే కొత్త కార్పొరేషన్లు ఇక రాష్ట్రంలో ఇటీవల గడువు ముగిసిన కార్పొరేషన్లతోపాటు, కొత్త కార్పొరేషన్లకు చైర్మన్లు, ఇతర సభ్యుల నియామకాలను సెప్టెంబర్ 15 తర్వాత నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెండేళ్లపాటు పనిచేసిన కార్పొరేషన్ చైర్మన్లను కొనసాగించాలని కొందరు, వారిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని మరికొందరు వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై తుది నిర్ణయానికి వచ్చేందుకు కొంత గడువు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో మిగిలిపోయిన సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షుల ఎంపికకు మరోమారు ఏఐసీసీ పరిశీలకులను హైదరాబాద్ పంపాలని నిర్ణయించారు.సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ప్రధాన పోటీదారుల్లో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొనగా, రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు నేతల పేర్లపై పీఠముడి నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని అధిష్టానం చెప్పినట్లు సమాచారం. ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్)పై ఇప్పటికే బీఎల్ఏల పనితీరుపై కమిటీ భేటీలో సంతృప్తి వ్యక్తంకాగా, వెనకబడిన నియోజకవర్గాల్లో మరింత దూకుడుగా ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. పథకాలకు ఇంటింటికీ చేర్చడానికి యాక్షన్ ప్లాన్: భట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ కేడర్, సంస్థాగత వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ చేర్చేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి సమన్వయ కమిటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ మాట్లాడుతూ, పారీ్ట–ప్రభుత్వ సమన్వయం, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలిపారు. -
ఓ పొలిటికల్ డిజైన్ ఉంది.. ఆ నెలలో చెబుతా: జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టే.. ఈ ముడున్నరేళ్ల మా పార్టీ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ‘‘నేనేదైనా మాట్లాడాలనుకుంటే ఢిల్లీ ట్రైన్ ఎక్కి రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాతే బయటికి వచ్చి మాట్లాడుతా. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడే వ్యక్తిని కాదు’’ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.‘‘మూడున్నరేళ్ల క్రితం మా పార్టీలో లోపాలు ఉంటే బయట మాట్లాడాను. కార్యకర్తల వ్యవహారం, పార్టీ అంశాలపై అంతర్గతంగా, బహిరంగంగాను చర్చించాను. ఈ మధ్య పీఏసీ మీటింగ్లో అంతర్గతంగా మాట్లాడే విషయాలు కూడా బయటికి వస్తున్నాయని సమావేశానికి పోవడమే మానేశాను. పీఏసీ మీటింగ్కి వెళ్లి ఉంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఏఐసీసీ ఇంచార్జ్, సీఎం దృష్టికి తీసుకెళ్లేవాణ్ని. మళ్ళీ నేను మాట్లాడిన అంశాలు బయటకి వచ్చేవి.. అందుకే పోలేదు. ఈ మూడున్నర ఏళ్లుగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలను ఎక్కడ బహిరంగంగా, అంతర్గతంగా చర్చించలేదు’’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.‘‘ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ 40 మంది కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి పిలిచారు. అందులో నాకు ఆహ్వానం అందింది. ఆ సమావేశంలో రాహుల్ గాంధీతో 15 నిమిషాలు మాట్లాడాను. నేను సంగారెడ్డి రాంనగర్లోని రాంమందిర్ నుంచి విద్యార్థి నేతగా నా రాజకీయ ప్రయాణం మొదలై.. నేడు ఢిల్లీలో మీ నివాసానికి వచ్చి మీ ముందు కూర్చునే వరకు సాగిందని చెప్పాను. మీ ముందు ఒక రోజు ఇలా కూర్చొని మాట్లాడాలని అనుకున్నా.. ఇప్పుడు మాట్లాడుతున్నా నేను అనుకున్నది సాధించాను అని చెప్పాను..ఏ పార్టీ నుంచి ప్రధాన మంత్రి ఉన్నా అధికారంలో ఉన్నన్ని రోజులే గుర్తుపెట్టుకుంటారని చెప్పా. పదవులతో పని లేకుండా గుర్తు పెట్టుకునే వారిలో మీ కుటుంబమే ఉంటుందని చెప్పా. కానీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని దేశ ప్రజలు చిరకాలం గుర్తి పెట్టుకుంటారని కూడా చెప్పాను. రాహుల్ గాంధీ నన్ను పక్కకి పిలిచి ఓ మాట చెబుతాను వింటావా అని అడిగారు. మీకు ఎవరిపై అయిన కోపం ఉంటే మీడియా ముందు మాట్లాడకండి. ఢిల్లీకి వచ్చి నాతో మాట్లాడండి అన్నారు. ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టే.. ఈ ముడున్నరేళ్ళ మా పార్టీ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదు..రాజకీయంగా నాకు మనసులో ఓ కోరిక ఉంది. నాకు ఓ పొలిటికల్ డిజైన్ ఉంది. అది నవంబర్లో చెబుతా. ఈ మూడు నెలల కాలంలో రాజకీయంగా నాకు ఓ క్లారిటీ వస్తుంది. నాకు ఫ్యామిలీ కంటే పబ్లిక్, పాలిటిక్సే ముఖ్యం. నేను 24 గంటల పాటు పబ్లిక్, పాలిటిక్స్ గురించే ఆలోచిస్తా’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
‘నా వ్యాఖ్యల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను’
సాక్షి,ఢిల్లీ: లోక్సభలో తనకు మాట్లాడే అవకాశం లేదని తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని, క్షమాపణలు చెప్పబోమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యనించారు. బుధవారం రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘విద్యార్థులపై పోలీసుల దుశ్చర్యకు కేంద్రహోంమంత్రి అమిత్ షానే బాధ్యత వహించాలి. పోలీసులు మేకులున్న లాఠీలతో విద్యార్థులను చావబాదారు. పెల్లెట్ గన్ తగిలి ఓ యువకుడు కన్ను పోవాల్సిన పరిస్థితి వచ్చింది.మహిళలు, మైనర్లపై కూడా దాడులు చేశారు. పోలీసులకు అమిత్షా ఆదేశాలైనా ఇచ్చి ఉండాలి.. ఆయనకు తెలియకుండా జరిగుండాలి’అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీకేజీల నిరసనల సందర్భంలో, విద్యార్థి నిరసనకారులపై పోలీసుల కాల్పులు, లాఠీఛార్జీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆదేశాలు ఇచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అమిత్ షా ఆదేశాలు ఇచ్చారనడానికి రాహుల్ గాంధీ దగ్గర ఏవైనా రాతపూర్వక ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని, లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు సభకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని, అలాంటప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. -
మల్లిఖార్జున ఖర్గే Vs జేపీ నడ్డా..దద్దరిల్లిన పార్లమెంట్..
-
సర్కార్ కీలక నిర్ణయం.. పథకాలకు ఈ కొత్త సర్టిఫికెట్ తప్పనిసరి
-
హైడ్రా రంగనాథ్ దూకుడుకు బ్రేక్.. రేవంత్ సర్కార్కు ఎదురుదెబ్బ?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి పరిధి వారికి ఉంటుంది. సర్వాధికారాలు ఒకే వ్యవస్థకు ఉండవు. చెక్స్ అండ్ బేలెన్సెస్తో నడిచేదే ప్రజాస్వామ్యం. కాని దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అధికారంలో ఉన్నవారు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంటారు. కార్యనిర్వహణాధికారిగా ఉండవలసిన అధికారిక వ్యవస్థ కూడా ఇష్టారాజ్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పడానికి, హైదరాబాద్ లోని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తాయి. రంగనాథ్కు సమర్దుడైన అధికారిగా పేరు ఉండవచ్చు. కాని తనకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్న విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారన్న విమర్శ కొంతకాలంగా వినిపిస్తున్నదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా సంబంధ, బాంధవ్యం ఉండడం కావచ్చు.. లేదా తన సహజ ప్రవృత్తి కావచ్చు.. ఏదైనా కానీ.. న్యాయ వ్యవస్థను సైతం పదే,పదే దిక్కరిస్తున్నారన్న అభిప్రాయం వల్ల ఆయనకు చిక్కులు వచ్చిపడ్డాయి. ఏకంగా ఆయనను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించడం తీవ్ర సంచలనం అయింది. రేవంత్ సర్కార్ కు పెద్ద ఎదురు దెబ్బే అన్నది అందరి అభిప్రాయం. రంగనాథ్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించి,తన పరువు కాపాడుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఏ మార్గం అనుసరిస్తుందన్నది ఆసక్తికర అంశంగా ఉంది. రంగనాథ్ను బదిలీ చేయాలన్న కోర్టు ఆదేశం, కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని ప్రభుత్వానికి చెందిన న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పదే,పదే కోర్టుధిక్కరణ కు పాల్పడుతున్నందున, ఇలాంటి అరుదైన ఆదేశం ఇవ్వవలసి వచ్చిందని కోర్టు తీర్పును సమర్ధించేవారు వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య ఇది ఘర్షణకు దారి తీస్తుందా?లేక మద్యే మార్గంగా రాజీ కుదురుతుందా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్లినప్పుడు ఎలాంటి వాదన చేస్తుందన్నదానిపై ఈ వ్యవహారం ఆధారపడి ఉండవచ్చు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూమిని ,ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్దరించడానికి ఈ హైడ్రా ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో కమిషనర్ గా నియమితులైన రంగనాథ్ కొన్ని చెరువులను పరిరక్షించారన్న పేరు తెచ్చుకున్నారు. అంతవరకు మంచిదే. కాని ఆయా చోట్ల ప్రైవేటు వ్యక్తుల, నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన తీరు వివాదాస్పదం అయింది. హైడ్రా ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఇంటిని కూల్చిన సన్నివేశంలో ఒక చిన్నారి తన పుస్తకాలను కూడా అధికారులు తీసుకోనివ్వలేదని మీడియా ముందు చెప్పిన వీడియో వైరల్ అయింది. అది రేవంత్ సర్కార్ కు తీరని చేటు చేసింది. అలాగే కొన్నిచోట్ల అపార్టుమెంట్లు, విల్లాలను తొలగించిన వైనం మధ్య తరగతి వారిలో తీరని ఆక్రోశం మిగిల్చింది.రూపాయి,రూపాయి కూడగట్టుకుని, బ్యాంకు లోన్లు తీసుకుని తాము ఇంటిని కొనుగోలు చేస్తే, సడన్ గా హైడ్రా వచ్చి వాటిని కూల్చితే తమ పరిస్థితి ఏమిటని అనేక మంది వాపోయారు.లే అవుట్ లకు అనుమతి ఇచ్చినప్పుడు, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు ,విద్యుత్ తదితర సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు అధికారులు ఎందుకు నివారించలేదన్న ప్రశ్న వస్తుంది. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వమే ఒకవైపు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేస్తుంటుంది.మరో వైపు అక్రమ నిర్మాణాలు అంటూ అదే ప్రభుత్వం కూల్చివేతలకు దిగుతుంది. చెరువుల గర్భంలో ఆక్రమణలకు పాల్పడి ,అనధికారికంగా నిర్మాణాలు చేస్తే చర్య తీసుకోవడం తప్పుకాదు.కొన్ని చోట్ల ఆయా కాలనీలవారు స్వయంగా హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో కూడా చర్యలు చేపట్టారు. పార్కులను పరిరక్షించారు. మొత్తం మీద లక్షన్నర కోట్ల విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగించామని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. అది నిజమే కావచ్చు. అయినా ఎందుకు ఇప్పుడు ఇలాంటి క్రైసిస్ లో పడ్డారు?కొన్ని ప్రైవేటు స్థలాలను కూడా ప్రభుత్వ భూములుగా పరిగణించి చర్య తీసుకున్నారన్నది ఆరోపణ. ఆ సంస్థలు ,వ్యక్తులు కోర్టును ఆశ్రయించి రక్షణ పొందినా,వాటిని పట్టించుకోకుండా రంగనాథ్ వ్యవహరించారన్నది విమర్శ. లోతుకుంట భూ వివాదం కూడా అలాంటిదే. 65 కోర్టు ధిక్కరణ పిటిషన్ లు ఆయనపై పడ్డాయంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పిటిషన్ లపై కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయకపోవడంపై ఆగ్రహించింది. ఏకంగా హైడ్రాను గ్రీకు పురాణాలలోని పలు తలల రాక్షసుడిగా అభివర్ణించింది.కొద్ది రోజుల క్రితం కూడా హైకోర్టు ఒక వ్యాఖ్య చేస్తూ తాము సంయమనం పాటిస్తున్నామని, రంగనాధ్ కస్టడీకి ఆదేశించేవాళ్లమే అని హెచ్చరించింది.ఈ నేపధ్యంలో రంగనాధ్ క్షమాపణ కోరిన తీరును హైకోర్టు ఆక్షేపించింది. తాను పిటిషనర్ స్థలంలో జోక్యం చేసుకోలేదని,పిటిషనర్ ఆరోపణలన్నీ అవాస్తవమని, కోర్టు మరోలా అనుకుంటే క్షమించాలని అఫిడవిట్ లో పేర్కొన్నారు.ఇందులో నిజాయితీ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తీర్పు తర్వాత రంగనాద్ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. నిజానికి ఒక అదికారిగా అంత సీరియస్ గా మాట్లాడి ఉండాల్సింది కాదేమో!భూకబ్జాదారులు ,లాండ్ మాఫియా వ్యక్తులు కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇది ఒకరకంగా కోర్టులతో మళ్లీ తగాదా పడినట్లే అవుతుందేమో తెలియదు. రాజకీయ వ్యవస్థలోని వారు ,రేవంత్ ప్రభుత్వంలోని బాధ్యులు ఆయన తరపున మాట్లాడి ఉంటే సమంజసంగా ఉండేదేమో!ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు పెద్దగా ముందుకు వచ్చినట్లు కనిపించదు. అదేదో రేవంత్ చూసుకుంటారులే అన్నట్లుగా ఉన్నారేమో అనిపిస్తుంది.ఊహించినట్లే రేవంత్ సమర్ధించుకోవల్సి వచ్చింది. భూకబ్జాదారులే కోర్టులలో కేసులు వేస్తున్నారని ఆయన అన్నారు.అంతేకాక గతంలో బిఆర్ఎస్ హయాంలో సి.ఎస్.గా పనిచేసిన సోమేష్ కుమార్ పై400 కోర్టు ధిక్కరణ కేసులు పడ్డాయని ఆయన గుర్తు చేశారు. హైడ్రా ను కొనసాగించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రంగనాద్ బదిలీపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.కోర్టు తీర్పు ప్రతి చూశాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంటే అప్పీల్ కు వెళ్లడానికే రంగం సిద్దం అవుతున్నదని అనుకోవచ్చు.న్యాయ వ్యవస్థ తన పరిధి దాటి ఆదేశాలు ఇచ్చిందన్నది ముఖ్యమంత్రి భావనగా కనిపిస్తుంది. అధికారి బదిలీ అన్నది ప్రభుత్వ అభీష్టం మేరకు జరుగుతుందన్నది ఆయన చెప్పకనే చెప్పారు.ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అప్పుడే చెప్పలేం. లోతుకుంటలోని 10వేల కోట్ల రూపాయల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసిందని రంగనాద్ అంటున్నారు. ఇందులో నిజానిజాలను న్యాయవ్యవస్థకు మరింత గట్టిగా వివరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది. ఆక్రమణలలో ఉన్నవాటిని కూల్చడంలో హైడ్రా వివక్ష చూపుతోందన్న విమర్శ కూడా వచ్చింది. ఉదాహరణకు దుర్గం చెరువు ఎఫ్ టి ఎల్ లో ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి,వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేవరకు ఎందుకు ఆగారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సమీప బంధువుల ఇళ్లు ఇందులో ఉండడమే కారణమని వారు ఆరోపిస్తుంటారు. దీనిపై హైడ్రా లేదా ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు కనిపించదు.రంగనాధ్ వ్యవహార శైలి చూస్తే తానేదో సర్వస్వతంత్రుడన్నట్లుగా అనిపిస్తుంటుందన్నది ఒక ఆరోపణ.ఆయన చిత్తశుద్దిని ఆక్షేపించడం లేదు కానీ.. దూకుడుగా ప్రవర్తించడాన్ని తప్పుపడుతున్నారు. కాగా రేవంత్ ఒక సందర్భంలో తాను హిట్లర్ మాదిరి ప్రవర్తిస్తానని, ఇరాన్ యుద్దంతో హైడ్రా కూల్చివేతలను పోల్చడం వివాదాస్పదం అయింది. హైదరాబాద్ లో వేల కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నది నిజం. కాని ఆ నెపంతో పేద,మధ్య తరగతివారి ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చడం ఎంతవరకు సమర్ధనీయం అన్నది ఆలోచించుకోవాలి. ఇందులో హ్యూమన్ ఫేస్ ను కూడా జోడించి చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదేమో. యుపిలో బుల్ డోజర్ రాజ్ నడుస్తోందని కాంగ్రెస్ పదే,పదే ఆరోపిస్తుంటుంది. అదే బుల్ డోజర్ రాజ్ ను తెలంగాణకు తెచ్చారని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది.ఈ అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని రేవంత్ సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం కూడా ఉండవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సమన్వయం లేదు.. కలహాలు పెరిగాయి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలు, అంతర్గత పోరుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కొరవడటం.. జిల్లాల్లో మంత్రుల ఏకఛత్రాధిపత్యం.. ఎమ్మెల్యేల నియోజకవర్గాల స్థాయి అభివృధ్ధి పనుల్లో జాప్యంపై వరుసగా వస్తున్న ఫిర్యాదులపై రాష్ట్ర నాయకత్వాన్ని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. కొన్ని నెలలుగా జిల్లాల స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలించిన కాంగ్రెస్ హైకమాండ్, ప్రభుత్వం–పార్టీ మధ్య సమన్వయం గాడి తప్పుతోందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జితో జరిగిన సమావేశంలో పార్టీ వ్యవహారాలపై స్పష్టమైన హెచ్చరికలు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అందరిదీ సొంత అజెండానే.. రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పరిస్థితి, సంస్థాగత వ్యవహారాల, ఎస్ఐఆర్ కొనసాగుతున్న తీరుపై రెండు గంటలపాటు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి తెప్పించుకున్న నివేదికలు, ఇంచార్జీలు ఇచ్చిన నివేదికలపై అధిష్టాన పెద్దలు సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ శ్రేణులకు చేరడం లేదని, పార్టీ నుంచి వచ్చే అభిప్రాయాలు ప్రభుత్వానికి వెళ్లడం లేదని, మంత్రులు–ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడిందని వచ్చిన నివేదికలపై గట్టిగానే చర్చ జరిగినట్లు సమాచారం. చాలామంది మంత్రులు తమ తమ శాఖలు, నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని, జిల్లాల వారీగా పార్టీని సమన్వయం చేసే బాధ్యత కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని పార్టీ పెద్దలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రులు సొంత నియోజకవర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, నిధుల కేటాయింపుల్లోనూ వారికి ప్రాధాన్యమిచ్చుకుంటూ జిల్లా ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు అందాయని రాష్ట్ర నేతల దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. మంత్రుల స్థాయిలోనూ, కార్పొరేషన్ పదవుల్లో ఉన్న నేతలు తమ సొంత అజెండా, సొంత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నాలు తప్ప, పార్టీ ఇమేజ్కు పెద్దగా దోహదం చేయడం లేదన్న అంశంపై ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగానే ఎస్ఐఆర్ ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల భాగస్వామ్యం కొరవడిందన్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. షబ్బీర్..సామేల్..డీసీసీల వ్యవహారాలపై ప్రశ్నలు తమకు అందించిన నివేదికల్లోని అంశాలను ప్రస్తావిస్తూ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతల నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. ముఖ్యంగా యాదాద్రి దేవస్థాన పాలకమండలి ఎంపికలో జిల్లా నేతల అభిప్రాయాలను కోరకపోవడం, జిల్లా నేతలను విస్మరించారని ఫిర్యాదులు రావడం, పీసీసీని లక్ష్యంగా చేసుకుంటూ సీనియర్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యలు చేయడం, యూత్ కాంగ్రెస్ నేత వ్యవహారంలో జరిగిన వివాదం, ఇటీవల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చుట్టూ జరిగిన పరిణామాలు, ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్రంగా స్పందించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. మండల కమిటీల ఏర్పాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న ఆరోపణలతో అనేక జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా మాట్లాడినట్లు తెలిసింది. అభివృద్ధి నిధుల కేటాయింపు, అధికార యంత్రాంగం స్పందన, స్థానిక సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేల సూచనలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాలపైనా అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. రంగంలోకి హైకమాండ్ రాష్ట్ర పరిస్థితిని గాడిన పెట్టేందుకు హైకమాండ్ రంగంలోకి దింగింది. పార్టీ సమన్వయాన్ని కాపాడే క్రమంలో మొదటి అడుగుగా బుధవారం ఢిల్లీలో పార్టీ పీసీసీ సమన్వయ కమిటీ భేటీని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతోపాటే.. మీనాక్షికి పార్టీ–ప్రభుత్వ సమన్వయాన్ని బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహించడం, విభేదాలను అంతర్గతంగానే పరిష్కరించడం, బహిరంగ విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోమని స్పష్టమైన కేతాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ నేతల విషయంలో అవసరమైతే హైకమాండ్ నేరుగా జోక్యం చేసుకుంటుందని, ఏఐసీసీ పరిశీలకులను పంపి అవసరమైన చర్యలకు దిగుతామనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. -
కాళేశ్వరంపై ఉద్దేశపూర్వక రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం కన్నెపల్లి వద్ద తగిన నీటి మట్టం ఉన్నందున పంప్హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోయే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు నీరు అందించడం లేదన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో గ్రౌటింగ్ పూర్తయిన తర్వాత పరిమిత స్థాయిలో నీటిని నిల్వ ఉంచి మూడు పంప్హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజినీర్లు సూచించారని తెలిపారు.సోమవారం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే 48 గంటల్లో నివేదిక ఇచ్చారని, అందుకే దానిని బీఆర్ఎస్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదుం ఎన్డీఏ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు. రూ.8.5 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మిస్తే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ప్రభుత్వ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి సాధ్యం కాకపోవడంతోనే నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశామని చెప్పారు. ఐటీ ఉద్యోగాలు తగ్గాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం ఐటీ టవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోవడంలో విఫలమైందన్నారు. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వకపోవడంతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని విమర్శించారు. టీ–ఫైబర్ ప్రాజెక్టును పూర్తి చేస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపారు. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు రెండున్నరేళ్లుగా నిలిచిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్–కరీంనగర్ రైల్వే మార్గం విద్యుద్దీకరణతోపాటు మిడ్ మానేరు వద్ద రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ సాధించిన విజయం తెలంగాణ యువత ప్రతిభను ప్రపంచానికి చాటిందని కేటీఆర్ అన్నారు. అర్ధరాత్రి బీజేపీతో కాంగ్రెస్ దోస్తీ: ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ మధ్య అంతర్గత అవగాహన ఉందని, అర్ధరాత్రి వేళల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదా లు జరిగినా వివరాలు బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్కడ దొరికిన నగదును లెక్కించడానికి మిషన్లు కూడా సరిపోవట్లేదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. -
జై జవాన్.. జై కిసాన్.. జై 'యువ'
సాక్షి, హైదరాబాద్: వికసిత్ భారత్ 2047, సబ్కా సాథ్ సబ్కా వికాస్ వంటి నినాదాలతో మాత్రమే మార్పు రాదని, యువశక్తిని సరైన దిశలో నడిపించి దేశ భవిష్యత్తుతో వారిని అనుసంధానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే ఒకప్పుడు ‘జై జవాన్, జై కిసాన్‘ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ‘జై జవాన్, జై కిసాన్, జై యువ‘ అనే నినాదంతో ముందుకెళుతుందని చెప్పారు. యువశక్తి ఇక రోడ్లపై పోరాడటమే కాదు, పార్లమెంట్లోకి రావడానికీ సిద్ధంగా ఉందని, చట్టాలను కేవలం పాటించడానికే కాదు, రూపొందించడానికీ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వర్షాకాల సమావేశాల్లో లోక్సభ స్థానాల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో పాటు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే వయసును తగ్గించే అంశంపై కూడా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నాలుగు అంశాలపై ఒకేసారి చర్చ జరగాలని, ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం ఉంటే ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలు, భాగస్వామ్య వర్గాల అభిప్రాయాలు తీసుకుని దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం జాతీయ మీడియాతో మాట్లాడారు. విని, ఆలోచించి, చట్టం చేయాలి ‘ప్రదానమంత్రికి తెలంగాణ ప్రభుత్వం తరఫున నా డిమాండ్ ఒక్కటే. సీట్ల పెంపు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్తో పాటు ఎన్నికల వయసు తగ్గింపు అంశాన్ని కూడా చర్చించండి. దేశంలో లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ.. ఇలా ఎక్కడ ఎన్నికల వ్యవస్థ ఉన్నా అక్కడ చర్చ జరగాలి. ప్రజల స్వరమే దీనిపై తుది నిర్ణయానికి ఆధారం కావాలి. ప్రధాని మోదీ ఎప్పుడూ మాట్లాడడమే కాదు వినడమూ అలవర్చుకోవాలి. మీ పార్టీ, మీ వ్యవస్థలో మీరు చెప్పేది అందరూ వింటారు. ఎందుకంటే మీరు ఎప్పుడూ ‘మన్ కీ బాత్‘ పేరుతో ఆకాశవాణిలో మాట్లాడుతూనే ఉంటారు. మీకు మాట్లాడడం మాత్రమే అలవాటు. వినే అలవాటు లేదు. కానీ ఇప్పుడు వినడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే దేశం మారుతోంది. దేశ ప్రజలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడడం ప్రారంభించారు. మీరు కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. విని, ఆలోచించి, చట్టం చేయాలి. యువశక్తిని రాజకీయ వ్యవస్థలోకి తీసుకొస్తే దేశ భవిష్యత్తు మారిపోతుంది. 21, 25 సంవత్సరాలకు తగ్గించాలి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఇంకా 25 సంవత్సరాలుగానే ఎందుకు ఉండాలి? అందుకే ఆగస్టు నెలను చరిత్రాత్మక నెలగా మార్చాలని నిర్ణయించాం. తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని నిర్వహించి, ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 సంవత్సరాలకు, రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 25 సంవత్సరాలకు తగ్గించాలని తీర్మానం చేసి ఆమోదించాలని నిర్ణయించాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మోదీకి ఇది రెండో పరాజయం ‘దేశంలోనే అత్యంత శక్తివంతుడు తానేనని భావించే మోదీకి ఇది రెండో పరాజయం. రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలు తెచ్చినప్పుడే రాహుల్గాంధీ హెచ్చరించారు. ఈ చట్టాలను దేశ ప్రజలు అంగీకరించరని, విరమించుకోవాలని సూచించారు. కానీ మోదీ తనను ఏమీ చేయలేరని భావించారు. రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని నాడు రాహుల్గాంధీ చెప్పినా వినలేదు. చివరకు దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమబాట పట్టారు. ప్రాణాలు పోయినా వెనక్కు తగ్గకుండా ఉద్యమించి మోదీని వెనక్కు తగ్గించారు. ఆ మూడు నల్లచట్టాలను విరమించుకునేలా చేసి రైతులకు క్షమాపణలు చెప్పించారు. దాన్ని ఒక పాఠంగా తీసుకుని మోదీ మారతారని, ప్రతిపక్షానికి గౌరవం ఇస్తారని భావించాం. కానీ మారలేదు. పాత ధోరణినే కొనసాగించారు. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి విద్యా రంగంలోనూ అదే పరిస్థితి కనిపించింది. యూజీసీ–నెట్ సహా అనేక పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పరీక్షలు రాసిన విద్యార్థులు విఫలం కాలేదు.. పరీక్షలను సక్రమంగా నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వమే విఫలమైంది. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ, నార్కోటిక్స్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బెదిరించి విద్యార్థులను, వారి పక్షాన మాట్లాడిన వారిని నియంత్రించాలని ప్రయత్నించారు. దేశమంతా వీధుల నుంచి పార్లమెంట్ వరకు తమ శక్తిని యువత చాటింది. 56 అంగుళాల ఛాతీ అంటూ గొప్పలు చెప్పుకున్న అహంకారాన్ని ఓడించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాదు.. నీట్ ఘటనల్లో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు కేంద్రం ఆర్థికసాయం అందించాలి. విద్యార్థులపై పెట్టిన అన్ని క్రిమినల్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. రాహుల్గాంధీ కోరినట్టు అది జరగకపోతే యువశక్తి మరో ఉద్యమం చేపడుతుంది..’ అని రేవంత్రెడ్డి హెచ్చరించారు. ఈ విజయం ముమ్మాటికీ విద్యార్థులదే.. ‘మొదట దేశం, తర్వాత ప్రజలు, చివరగా పార్టీ. దేశ ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు కాంగ్రెస్ ముందు నిలబడుతుంది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, నిజాం పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసింది, స్వతంత్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు యువత చేసిన ఉద్యమాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావించడం లేదు. ఈ విజయం ముమ్మాటికీ విద్యార్థులు, యువతదే. వారికి అండగా నిలబడడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకుంది. పేదలను మరింత పేదలుగా మార్చడం బీజేపీకి ఎప్పుడూ అలవాటు. అందుకే చిన్న రాష్ట్రాలన్నింటికీ నష్టం జరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతోంది. దీనికి శాస్త్రీయ పరిష్కారాన్ని కనుగొనాలి..’ అని సీఎం అన్నారు. -
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,278.14 కోట్లకు పరిపాలనా అనుమతి, 2,009.23 ఎకరాల భూసేకరణకు ఆదేశాలు జారీ చేసింది. IAF కోసం 1,609.23 ఎకరాలు, సివిల్ ఏవియేషన్కు 400 ఎకరాలు వాడనుంది. జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్గా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తారు. MRO, కార్గో, ప్యాసింజర్ సేవలకు ఎయిర్పోర్ట్ రూపకల్పన ఉండనుంది. భూసేకరణ, రోడ్ల మళ్లింపు, విద్యుత్ టవర్ల తొలగింపునకు నిధులు వాడతారు. హైటెన్షన్ లైన్లు, నీటి వనరుల మార్పునకు ప్రత్యేక ప్రణాళిక వేస్తున్నారు. 2026 డిసెంబర్ 31లోగా భూసేకరణ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (79) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆదివారం ప్రకటించారు. వయసు పెరగడం, ఆరోగ్యం బలహీనపడటం, రాజకీయాల్లో అవినీతి పెరగడమే ఇందుకు కారణమని చెప్పారు.ఎక్స్లో చేసిన పోస్టులో సిద్ధరామయ్య, ప్రజా జీవితంలో చురుగ్గా కొనసాగుతానని, కానీ ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. "రాజకీయ రంగం అవినీతిమయంగా మారిపోయింది. అందుకే నేను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అయితే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ప్రజల కష్టసుఖాలకు గొంతుకగా నిలుస్తాను" అని పేర్కొన్నారు.తన వరుణ నియోజకవర్గ ప్రజలు మరోసారి పోటీ చేయాలని కోరుతున్నారని, కానీ ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. తన నిర్ణయానికి కారణం వివరిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి తన వయసు 81 లేదా 82 ఏళ్లు ఉంటుందని సిద్ధరామయ్య తెలిపారు."ఇప్పుడు నా వయసు 79 ఏళ్లు. మా ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అప్పటికి నాకు 81-82 ఏళ్లు వస్తాయి. నా ఆరోగ్యం గతంలో ఉన్నంత బలంగా లేదు. ఇంతకుముందులా అదే ఉత్సాహంతో పని చేయడం ఇక సాధ్యం కాదు" అని అన్నారు.సిద్ధరామయ్య తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి కూడా ప్రస్తావించారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ప్రజా జీవితంలో అడుగుపెట్టానని, 2028తో ఆ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తవుతాయని చెప్పారు."ఓటములు, విజయాలు రెండూ చూశాను. కానీ నేను నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఎప్పుడూ వ్యవహరించలేదు. నా మనస్సాక్షిని ఎప్పుడూ మోసం చేయలేదు అన్న సంతృప్తి నాకు ఉంది" అని చెప్పారు. ఎన్నికల రాజకీయాల తీరు మారిపోయిందని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు."ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రాజకీయాలు పూర్తిగా అవినీతిమయంగా మారిపోయాయి. నిజాయితీ రాజకీయాలకు నిలదొక్కుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను" అని పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలకు వీడ్కోలు ప్రకటించినా, ప్రజల కోసమే పని చేస్తానని సిద్ధరామయ్య చెప్పారు. "50 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు నన్ను తమలో ఒకడిగా భావించి ప్రేమతో నడిపించారు. ఆ రుణం నా మీద ఉంది. అందుకే నా మిగిలిన జీవితం కూడా ప్రజాసేవకే అంకితం" అని పోస్టులో పేర్కొన్నారు. -
మాకు ఆత్మగౌరవం కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దళిత ప్రజా ప్రతినిధులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడ్డారు. పార్లమెంటు సభ్యులుగా, శాసనమండలి, శాసన సభ్యులుగా ప్రజాక్షేత్రంలో గెలిచినప్పటికీ... ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద కనీస మర్యాద లేకపోవడం పరాజయం కంటే ఘోర అవమానంగా భావిస్తున్నట్లు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా గెలిచినందుకే ఈ అవమానాలు పడాల్సి వస్తుందా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రజాప్రతినిధుల మాదిరిగా తమకు కూడా గౌరవ మర్యాదలు దక్కాలని, అందరితో సమానంగా ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యం పొందాలని వారు కోరుతున్నారు. ఇందులో భాగంగా ఎస్సీ ప్రజాప్రతినిధుల కమిటీ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, కన్వీనర్ మల్లు రవి నేతృత్వంలో ఎస్సీ ఎంపీలు కడియం కావ్య, గడ్డం వంశీ, ప్రభుత్వ విప్లు అద్దంకి దయాకర్, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఏఆర్ నాగరాజు, మట్టా రాగమయి, మందుల సామేల్, కడియం శ్రీహరి తదితరులు శనివారం ప్రజాభవన్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి గోడును వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో గెలిపిస్తే... ఆయా ఎస్సీ ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం దక్కడం లేదంటూ ఉపముఖ్యమంత్రి ఎదుట వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ నియోజకవర్గాల్లో డివిజన్ స్థాయి అధికారి నుంచి మండల స్థాయి అధికారి వరకు ఎవరికి బదిలీ అయినా తమ దృష్టికి రావడం లేదని, కనీసం కొత్త అధికారులకు పోస్టింగ్ ఇస్తున్న విషయం కూడా కనీస సమాచారం ఉండడం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల పర్యటన వివరాలు కూడా తమకు తెలిడయం లేదని వివరించారు. ఈ అంశంపై జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు, చివరకు కలెక్టర్ను అడిగినా స్పందన రావడం లేదని, సచివాలయంలోని సంబంధిత శాఖ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే వారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఎస్సీ ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా భట్టి ముందు విన్నవించారు. ప్రాధాన్యత ఇస్తేనే నియోజకవర్గంలో పార్టీకి మరింత మంచిపేరు వస్తుందని, తదుపరి ఎన్నికల్లో మరింత మెజార్టీ వస్తుందన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి భారీగా పెరుగుతోందని, కొందరు అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, వారితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వివరించారు. ఈ అవినీతిని అరికట్టకుంటే, అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని వ్యవహారాన్ని కట్టడి చేయకుంటే భవిష్యత్లో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందనే అంశాన్ని కూడా వివరించినట్లు తెలిసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం అయ్యాయని, ఎస్సీ నియోజకవర్గాల్లో అదనంగా మరో వెయ్యి ఇళ్లు చొప్పున యూనిట్లు పెంచాలని ఎస్సీ ప్రజాప్రతినిధులు కోరారు. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధి ఇవ్వాలని కూడా వివరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకుని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పర్యటించాలని కోరినట్లు తెలిసింది. ఈ సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీ కూడా చర్చకు వచి్చనట్లు సమాచారం. ఎస్సీ ప్రజాప్రతినిధుల సమస్యలను సావధానంగా విన్న భట్టి వారికి నచ్చజెప్పినట్లు తెలిసింది. ఎస్సీ ప్రజాప్రతినిధుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భట్టి వారికి సూచించారు. అందరి ఐక్యతే పార్టీకి బలం అని, పార్టీకి నష్టం కలిగించే ఏ పనీ చేయవద్దన్నారు. తన పూర్తి సహకారం ఉంటుందని వారికి స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టీనేతల మధ్య సమస్యలు వస్తే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని, లేకుంటే పార్టీ అధ్యక్షుడు, లేదా తన దృష్టికి తీసుకురావాలని, అలా కాకుండా రచ్చకెక్కితే మంచిది కాదంటే తుంగతుర్తి వ్యవహారంపై స్పందించినట్లు తెలిసింది. -
హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. యువత సాధించిన విజయాన్ని మా ఖాతాలో వేసుకోవడం లేదని.. ఇది యువత సాధించిన విజయంగా పేర్కొన్నారు.’’రాజకీయ పార్టీలు కేవలం మద్దతు మాత్రమే ఇచ్చాయి. ఓటు హక్కు ను 18 ఏళ్లకే కల్పించి యువతను రాజకీయాల్లో రాజీవ్ గాంధీ ప్రోత్సహించారు. ప్రపంచంలో చాలా దేశాల్లో 18 ఏళ్ల యువతకు చట్టసభల్లో అవకాశం ఇచ్చారు. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. 21 ఏళ్లకే చట్టసభల్లోకి వచ్చేలా యువతకు అవకాశం ఇవ్వాలని సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం’’ అని రేవంత్ చెప్పారు.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ర్యాలీ నిర్వహించామని.. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు వేలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారన్నారు. ఏకచ్ఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా యావత్ విద్యార్థి లోకం ఏకమైంది. నీట్ పరీక్ష సక్రమంగా నిర్వహించలేని దుస్థితి. చైనా చొచ్చుకొస్తుంటే అడ్డుకోలేని దుస్థితి. విద్యార్థి లోకానికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు’’ అని ఆయన పేర్కొన్నారు. -
ఈ ప్రభుత్వాన్ని దించే సమయం వచ్చింది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మన విద్యా వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే దిశగా చాలా పెద్ద అడుగని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. శనివారం ఆయన ఎక్స్లో వీడియో రూపంలో మాట్లాడారు.‘‘దేశవ్యాప్తంగా పోరాడిన విద్యార్థులందరికీ అభినందనలు. మీ అందరిని చూస్తుంటే గర్వంగా ఉంది. వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, తమ భవిష్యత్తును కాపాడేందుకు ధైర్యంగా నిలిచిన ప్రతి యువకుడికి, ప్రతి విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు.ఇంకా 2 డిమాండ్లు మిగిలే ఉన్నాయి. విద్యార్థులను, భారత భవిష్యత్తును గౌరవిస్తూ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. రైతులు, కార్మికులు, పేదలు, ఈ ప్రభుత్వం అణచివేసిన ప్రతి ఒక్కరూ తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడటమే నిజమైన ధైర్యం. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించే సమయం వచ్చింది. భయపడొద్దు’’ అని పేర్కొన్నారు. धर्मेंद्र प्रधान का इस्तीफा हमारे education system को फिर से संवारने की दिशा में बहुत बड़ा कदम है। शाबाश देश भर के छात्रों, आप सभी पर गर्व है।सड़कों पर आ कर लोकतंत्र, संविधान और अपने भविष्य की रक्षा में डट कर खड़े होने वाले हर एक युवा, हर छात्र को बहुत-बहुत बधाई।2 मांगें… pic.twitter.com/Uc2cEOCVKA— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026 -
కోమటిరెడ్డి బ్రదర్స్తో అదే చెప్పా: ఎమ్మెల్యే సామెల్
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్లో తుంగతుర్తి పంచాయితీ మరోసారి తీవ్ర విభేదాలను బయటపెట్టింది. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా పర్యటనలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. తనకు టికెట్ ఇచ్చింది రాజగోపాల్రెడ్డి కాదని, ఏఐసీసీ అని స్పష్టం చేశారు.తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంలో రాజగోపాల్రెడ్డి పాత్ర లేదని ఎమ్మెల్యే సామెల్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టికెట్ నా చేతిలో లేదు.. రాజగోపాల్రెడ్డి చేతిలో అంతకన్నా లేదు. ఏఐసీసీ నాకు టికెట్ ఇచ్చింది. నన్ను గెలిపించింది రాజగోపాల్రెడ్డి కాదు.. పార్టీ’’ అని పేర్కొన్నారు.‘నాకు తెలియకుండా ఎలా?’తన నియోజకవర్గంలోకి రావాలంటే కనీస సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని సామెల్ అన్నారు. ‘‘నాకు తెలియకుండా నా నియోజకవర్గానికి ఎలా వస్తారు?’’ అంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు గౌరవం ఉండాలని పేర్కొన్నారు. ‘పార్టీలో నేనే ముందున్నా’కాంగ్రెస్లో తానే ముందునుంచి ఉన్నానని ఎమ్మెల్యే సామెల్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో రాజగోపాల్రెడ్డిని గెలిపించేందుకు తన కేడర్ ఎంతో కష్టపడిందని, అయితే ఇప్పుడు అదే కేడర్ బాధపడుతోందని అన్నారు. ‘‘మునుగోడులో ఆయన్ను గెలిపించినందుకు నా కార్యకర్తలు బాధపడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. రాజగోపాల్రెడ్డి గతంలో తన గెలుపుపై వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ‘‘నేను గెలుస్తా అని గతంలో రాజగోపాల్రెడ్డి చెప్పారు. అప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చారు’’ అని విమర్శించారు.కులాల ఓట్లపై ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల సమయంలో సామాజిక వర్గాల ఓట్లపై కూడా సామెల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజగోపాల్రెడ్డికి మాదిగలు ఓటు వేశారు.. నాకు రెడ్లు ఓటేశారు’’ అని అన్నారు.‘ఎన్నిసార్లు కలిసినా రోడ్లు ఇవ్వలేదు’గతంలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ‘‘నేను ఎన్నోసార్లు కలిశాను. రోడ్లు కావాలని అడిగాను. చివరకు అటెండర్తో ఫోన్ చేయించినా వెళ్లి కలిసేవాడిని’’ అని పేర్కొన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్పై వ్యాఖ్యలుకోమటిరెడ్డి సోదరులు నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తాను చెప్పినట్లు సామెల్ వెల్లడించారు. ‘‘కోమటిరెడ్డి బ్రదర్స్ను ఇన్వాల్వ్ కానివ్వొద్దని చెప్పా. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఇకనైనా అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అన్నారు. మొత్తంగా మునుగోడు కాంగ్రెస్లో ఎమ్మెల్యే సామెల్, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి తెరపైకి రావడంతో రాజకీయాలను మరింత వేడెక్కించాయి. -
విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న మోదీ ప్రభుత్వం: సోనియా
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అకౌంటబిలిటీ కోరిన పాపానికి మోదీ ప్రభుత్వం విద్యార్థులపట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని, ఈ దేశ భవిష్యత్తుగా కాకుండా శత్రువులా చూస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీప ఆర్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించార.ఉ. దేశ విద్యా వ్యవస్థను దిగజారుస్తున్న మోడీ ప్రభుత్వ డొల్లతనాన్ని ఈ దేశ విద్యార్థులు బట్టబయలు చేశారని వ్యాఖ్యానించారు. విద్యార్థుల పక్షాన నిలవడం నైతికంగానే కాకుండా రాజకీయ, రాజ్యాంగబద్ధ ధర్మం కూడా అని స్పష్టం చేశారు. నిరాశ నిస్పృహలను కలిగించే విద్యావ్యవస్థ, మోడీ ప్రభుత్వపు అహంకార ధోరణి, బాధ్యతారాహిత్యం వంటి అంశాలన్నీ నిరసనలకు దారితీయడం సహజ పరిణామమేనని సోనియాగాంధీ ‘ద హిందూ’పత్రికలో ‘ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్, యంగ్ ఇండియాస్ ట్రామా’శీర్షికతో రాసిన కథనంలో పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు ‘ఛలో సంసద్’సందర్భంగా విద్యార్థులపై చూపిన క్రూరత్వం ఈ ప్రభుత్వ హయాంలో కొత్తేమీ కాదని, 2020లో సీఏఏ నిరసన ప్రదర్శనల సందర్బంగానూ పోలీసులు, పారా మిలటరీ బలగాలు దారుణంగా వ్యవహరించాయని, మహిళ రెజ్లర్లపై జరిగిన దమనకాండను కూడా ఈ దేశం మరచిపోలేదని అన్నారు. విద్యార్థులు ధైర్యంగా వేస్తున్న ప్రశ్నలకు ఈ ప్రభుత్వం పిరికితనంతో జవాబు చెబుతోందని, క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టడంలో దారుణంగా విఫలమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేందుకు నిరాకరించడం ప్రజల మనసుల్లో గూడుకట్టుకుపోయిన ఆగ్రహానికి ఆజ్యం పోసిందని అన్నారు. ఎనీ్టయేను శక్తిమంతం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచి్చన సలహాలను బహిరంగంగానే తిరస్కరించడం ద్వారా ప్రధాన్ ధిక్కారాన్ని ప్రదర్శించడమే కాకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆ కథనంలో ఆరోపించారు. -
నిధులు గప్పిన నిప్పు!
సాక్షి, హైదరాబాద్: నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలో ఉన్నందున తమ నియోజకవర్గాలకు ఎడాపెడా నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవాలకున్న తమ ఆశలు అడియాసలుగానే మిగిలిపోతున్నాయంటూ పలువురు మథన పడుతున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు పదుల కోట్లలో గత రెండున్నరేళ్లుగా పెండింగ్లోనే ఉండిపోవడం వారిలో అసంతృప్తిని రాజేస్తోంది.ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు, స్కూల్, అంగన్వాడీ బిల్డింగులు, నీటి సరఫరా పనులు, పైప్లైన్లు, మోటార్లు, బోర్ల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాల కోసం డబ్బులు సకాలంలో రాకపోవడంతో పనులు ఆగిపోతున్నాయని, సగం పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతో చేతులెత్తేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 కోట్లు ఇచ్చారని, ఆ తర్వాత 9 నెలల కిందట నియోజకవర్గానికి రూ.5 కోట్లు అంటూ ఉత్తర్వులు జారీ చేసినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని చెబుతున్నారు.గతంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు తమ చుట్టూ తిరుగుతున్నారని, నిధుల కోసం ప్రభుత్వం వద్దకు వెళితే డబ్బుల్లేవనే సమాధానం వస్తోందని, ప్రభుత్వ పెద్దలను ఈ విషయమై పలుమార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోతోందని వివరిస్తున్నారు. ఇదిలావుండగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాభవన్లో సమావేశాలు నిర్వహించినప్పుడు, పాత హామీలకు నిధుల కోసమే ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని, ఇలాంటి సమయంలో నియోజకవర్గాల్లో ఎలాంటి కొత్త హామీలు ఇవ్వొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేసినట్టు ఈ సమావేశాలకు హాజరైన పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు. సన్నిహితుల వద్ద ఏకరువు.. నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడా బాహాటంగా మాట్లాడలేకపోయినా తమ సన్నిహితుల వద్ద మాత్రం తమ అంతరంగాన్ని పంచుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చామని, ప్రజలు కూడా తమ హామీలు నమ్మి ఓట్లేస్తే..ఇప్పుడు ఆ పనులు పూర్తి చేసే పరిస్థితి లేదని అంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే మళ్లీ ఎన్నికలకు ఏం చెప్పి వెళతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల వద్దకు వెళితే అప్పుల లెక్కలు చెబుతున్నారని, కొత్తగా హామీలు ఇవ్వొద్దని ఆదేశిస్తున్నారని, దీంతో ప్రజలకు సంబంధించిన పనులేమీ చేయలేక పోతున్నామంటూ తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల నియోజకవర్గాలకు వందల కోట్లు ఎక్కడివి? తమ నియోజకవర్గాలకు నిధులు అడిగితే ఆర్థిక పరిస్థితి, అప్పుల గురించి చెబుతున్నారని, అలాంటప్పుడు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల నియెజకవర్గాలకు ఏకకాలంలో వందల కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ సన్నిహితుల వద్ద ఎమ్మెల్యేలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల నియోజకవర్గాలకు అడిగిందే తడవుగా నిధులు ఎలా మంజూరు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి కూడా ఈ తరహా అసంతృప్తి నేపథ్యంలోనే గతంలో పాలమూరు జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలు కలిసినప్పుడు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా నిధుల అంశమే హాట్ టాపిక్గా మారుతోంది. ముఖ్యంగా గత మూడు, నాలుగు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విషయం చర్చనీయాంశమవుతోంది. అనిరుద్రెడ్డి దూకుడు! నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరు««ద్రెడ్డి కొంత దూకుడుగానే వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడో తాను గెలిచిన కొత్తలో రూ.150 కోట్లకు రోడ్లు మంజూరయ్యాయని, తన గురువు, ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి ఈ రోడ్లు మంజూరు చేసినా.. ఇంకా రూ.50 కోట్ల మేరకు నిధులు రావాల్సి ఉందని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో తాను నేరుగా ఆర్థిక మంత్రిని కలుస్తానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు. అవసరమైతే 10 వేల మందితో దీక్ష కూడా చేపడతానని ఆయన తన సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం. కాగా ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హ్యామ్ రోడ్ల శంకుస్థాపనల కోసం పాలమూరు జిల్లాకు వెళ్లినప్పుడు కూడా అనిరు«ధ్ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు. ఎప్పుడూ కోమటిరెడ్డి వెన్నంటి ఉండే ఆయన మహబూబ్నగర్కు వెళ్లి మంత్రిని పలకరించి వెళ్లిపోవడం పాలమూరు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. పలువురు ఇతర ఎమ్మెల్యేలదీ ఇదే అభిప్రాయం! అనిరు«ధ్తో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అంతర్గత సమావేశాల్లో ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇటీవల దిల్కుషా గెస్ట్హాస్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ ఎమ్మెల్యేల సమావేశం జరిగినప్పుడు కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించిన చర్చ వచ్చింది. తమకు కూడా నిధులు సరిగా ఇవ్వడం లేదని, సబ్ప్లాన్ నిధులను కూడా మంజూరు చేయడం లేదని పలువురు వాపోయినట్టు సమాచారం.మరోవైపు తమ నియోజకవర్గాల అభివృద్ధికి అదనంగా రూ.10 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానం చేయడం గమనార్హం. కాగా ఈ అభివృద్ధి నిధుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10–15 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఒకరితో మరొకరు టచ్లో ఉంటున్నారని, ఏం చేయాలనే దానిపై గుట్టుగా మంతనాలు జరుపుతున్నారని, ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలనే చర్చ కూడా వారి మధ్య జరుగుతున్నట్టు గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రతిపక్షాలకు గుండు సున్నా.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) కింద ఏడాదికి కొన్ని నిధులను ఎమ్మెల్యేలకు ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. అయితే ఈ పేరుతో ఇవ్వాలంటే అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచనతోనే ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) పేరుతో ముఖ్యమంత్రి విచక్షణ మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయించాలని నిర్ణయించారు.ఆ మేరకు తొలినాళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలకు కూడా ఎస్డీఎఫ్ నిధుల కింద రూ.10 కోట్ల చొప్పున ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన ఎమ్మెల్యేలకు మాత్రం ఇంతవరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూపాయి ఇవ్వకపోవడం గమనార్హం. అభివృద్ధి నిధులే కాకుండా ఇతర సంక్షేమ పథకాల అమల్లోనూ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, నియోజకవర్గాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ తమకు అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. రూపాయి కూడా ఇవ్వలేదు.. ‘గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఏసీడీపీ కింద రూ.5 కోట్లు ఇచ్చే వారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండున్నరేళ్లుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఏసీడీపీ కింద ప్రభుత్వానికి అనేకమార్లు ప్రతిపాదనలు పంపినా ఆమోదించడం లేదు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు ఆర్దిక మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి కూడా తీసుకెళ్లాం. విడుదల చేస్తామనే హమీ తప్ప ప్రయోజనం లేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రూ.10 కోట్లలో పెండింగ్ ఉన్న వాటిని కూడా ఇవ్వడం లేదు. – కొత్త ప్రభాకర్రెడ్డి, కేపీ వివేకానంద (బీఆర్ఎస్) అసెంబ్లీలో ప్రస్తావించినా ఫలితం లేదు.. మా నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు ఇస్తున్నా మాకు రూపాయి విదల్చడం లేదు. ఏఎస్డీపీ కింద ఇవ్వాల్సిన నిధుల కోసం అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించాం. సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రాలిచ్చాం. ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశాం. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. – బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, పాయల్శంకర్ సరైన సమయంలో సరైన నిర్ణయం.. నాకు అన్నింటికంటే నియోజకవర్గ ప్రయోజనాలే ముఖ్యం. ఈ ప్రాంత ప్రజల గురించే నా ధ్యాసంతా. జడ్చర్ల ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నా. మంజూరై రెండేళ్లయినా నిధులు రాక సగం పూర్తయిన ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు ఆగిపోయాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా. – జనంపల్లి అనిరుధ్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే (కాంగ్రెస్) -
అస్సలు సోనమ్ వాంగ్ చుక్ ఎవరు? : అభిజిత్ దీప్కే
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమం ఇప్పుడు కొత్త రాజకీయ మలుపు తిరిగింది. ఈ పోరాటానికి అసలు నాయకత్వం ఎవరిది? ఉద్యమ క్రెడిట్ ఎవరికి దక్కాలి? అనే అంశాలపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అస్సలు సోనమ్ వాంగ్చుక్ ఎవరు? ఆయన దీక్ష విరమిస్తే ఉద్యమం ఎందుకు ఆగాలి? అంటూ అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. ఈ ఉద్యమం ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు.వాంగ్చుక్ దీక్ష విరమించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే తమ పోరాటం మాత్రం ఆగదని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం సోనమ్ వాంగ్చుక్ది కాదు. నాది కాదు. అలాగే ఏ రాజకీయ పార్టీది కూడా కాదు. ఇది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కొనసాగే ప్రజా ఉద్యమం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్మంతర్లో మా ఆందోళన కొనసాగుతుంది’ అని ఆయన వెల్లడించారు.వాంగ్చుక్ నిర్ణయం సరైంది కాదుఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సోనమ్ వాంగ్చుక్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. వాంగ్చుక్ను సామాజిక కార్యకర్త అన్నా హజారేతో పోల్చారు. అన్నా హజారే ఓ దశలో ఉద్యమం తర్వాత మౌనంగా వహించినట్లే ఇప్పుడు వాంగ్చుక్ కూడా అదే దారిలో నడుస్తున్నారు’అని వ్యాఖ్యానించారు.విద్యార్థుల ప్రతినిధులు లేకుండానే ప్రభుత్వ ప్రతినిధులతో మూసి తలుపుల వెనుక సమావేశమై వ్యక్తిగత ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే వాంగ్చుక్ దీక్షను విరమించారని మసూద్ ఆరోపించారు. ఏ హామీల ఆధారంగా, ఏ పరిస్థితుల్లో దీక్ష విరమించారో దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం సోనమ్ వాంగ్చుక్ వంటి నిష్కళంక పర్యావరణవేత్తపై కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా వాంగ్చుక్ను కలిసి ప్రభుత్వ చర్యలను వివరించారని, పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలు, ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటి అంశాలపై స్పష్టమైన హామీలు ఇచ్చిన తర్వాతే ఆయన గౌరవప్రదంగా దీక్షను విరమించారని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తెలిపారు.అయితే ఈ వివాదాల మధ్య అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ఒక వ్యక్తి నిర్ణయంతో ఉద్యమాలు ముగిసిపోవని, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేవలం పరీక్షల అవకతవకల అంశంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రూ.6 లక్షలకే రూ.60 లక్షల ఫ్లాట్
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున పేదలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించాలని ప్రజా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతంలోనే సొంతింటి కలను నెరవేర్చేందుకు నియోజకవర్గాన్ని యూనిట్గా ఎంపిక చేశామన్నారు. అక్కడే ఇందిరమ్మ టవర్స్ నిర్మించి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఈ ఇళ్ల కోసం స్థానికంగా అందుబాటులో ఉన్న మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీసేవ వాట్సాప్ నంబర్(8096958096), మీ సేవ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.60 లక్షల విలువ ఉండే ఒక ఫ్లాట్ను కేవలం రూ.6లక్షలకు మాత్రమే ఇస్తున్నామన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, దరఖాస్తులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియలో రిజర్వేషన్లు పాటిస్తామని, అన్ని వర్గాలకు ఇళ్లు ఇచ్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మొత్తం ఇళ్లలో 50శాతం ఇళ్లు రిజర్వేషన్ల పద్దతిలోనే కేటాయిస్తామని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని పనిని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. లబ్ధిదారుల మీద ఆర్థిక భారం తగ్గించడానికి ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇస్తోందని, ఇది విక్రయ ప్రక్రియ కాదని, ప్రభుత్వ ఆర్థిక సహకారం అని స్పష్టం చేశారు. లబ్ధిదారుడి వాటా అన్ని ప్రాంతాల్లో రూ.6 లక్షలు మాత్రమే అని అన్నారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా ప్రయోగాత్మకంగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్లలో యాజమాన్య హక్కుల రిజర్వేషన్కు సంబంధించి ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ప్రభుత్వ అవుట్ సోర్సింగ్, 4వ తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10 శాతం చొప్పున మొత్తం 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామన్నారు. ఈ 50 శాతం రిజర్వేషన్లలో 30 శాతం మహిళలకే కేటాయిస్తున్నామని, మిగిలిన 50 శాతం వాటా జనరల్ కేటగిరీకి మంజూరు చేస్తామన్నారు. -
సీఎం రేవంత్కు కేటీఆర్ లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. గ్లోబేరినా టెక్నాలజీస్ అంశంలో చేసిన అసత్య ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. గ్లోబేరినా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేవని స్పష్టం చేశారు.‘‘గ్లోబేరినా బినామీ కంపెనీ అనడం, సీబీఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించాననడం పూర్తిగా అవాస్తవం. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి బాధ్యతారహితంగా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసమే తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని విమర్శలు గుప్పించారు. గడువులోగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు. -
షర్మిలకు షాక్.. YSRCPలో చేరిన కాంగ్రెస్ నేతలు
-
2027లో ఉత్తరప్రదేశ్ను ఏలేది ఎవరు?
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పటికే తారాస్థాయికి చేరింది. అధికార బీజేపీతో పాటు విపక్షాలైన సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుంచే తమ పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సామాజిక సమీకరణాలు, కులగణనలే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు సరికొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి.బీజేపీ సరికొత్త వ్యూహం - సంస్థాగత బలోపేతంగత లోక్సభ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకున్న భారతీయ జనతా పార్టీ, ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వెనుకబడిన వర్గాల ఓట్లు పార్టీకి దూరమవ్వకుండా ఉండేందుకు క్షేత్రస్థాయిలో సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడంతో పాటు, హిందుత్వ, అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తూ ప్రజల్లో మతపరమైన, సామాజిక ఐక్యతను చాటేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.ఎస్పీ ‘పీడీఏ’ ఫార్ములా - మారుతున్న సమీకరణలుసమాజ్వాదీ పార్టీ ఈసారి టికెట్ల కేటాయింపులో వినూత్న పద్ధతిని అనుసరిస్తోంది. కేవలం నాయకుల వ్యక్తిగత ప్రభావంపై ఆధారపడకుండా, ప్రతి నియోజకవర్గంలోని సామాజిక పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేస్తోంది. కేవలం యాదవ, ముస్లిం ఓట్లకే పరిమితం కాకుండా, ఇతర వెనుకబడిన కులాలను కూడా తమ వైపునకు తిప్పుకోవడానికి ‘పీడీఏ’ (వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాక) నినాదంతో ముందుకు సాగుతోంది.మాయావతి ఒంటరి పోరుయూపీలో మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఏ పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. పార్టీకి బలమైన పునాదిగా ఉన్న దళిత ఓటు బ్యాంకును తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు, ఇతర వెనుకబడిన వర్గాలు, సవర్ణుల్లో కొంత భాగాన్ని ఆకట్టుకునేలా పాత సామాజిక ఇంజినీరింగ్ సూత్రాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ దూకుడు - కులగణన అస్త్రంరాష్ట్రంలో కోల్పోయిన పాత ప్రాభవాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా కులగణన అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, జనాభా ప్రాతిపదికన ప్రతి వర్గానికి సరైన ప్రాతినిధ్యం దక్కాలనే డిమాండ్ను బలంగా వినిపిస్తోంది. అంతేకాకుండా రైతులు, యువకులు, వివిధ సామాజిక వర్గాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే పనిలో పడింది.ఓవైసీ ఎంట్రీతో మారుతున్న సమీకరణలుఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ రాక యూపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముస్లిం ఓట్లతో పాటు దళిత, వంచిత వర్గాలను కూడగట్టి సరికొత్త సామాజిక సమీకరణాన్ని తెరపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం నేరుగా విపక్షాలైన ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సామాజిక సమీకరణల ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్ జనాభాలో వెనుకబడిన తరగతులు, దళిత, ముస్లిం కమ్యూనిటీలదే సింహభాగం ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ఏ కులం ఎంత బలంగా ఉందనే లెక్కలే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తూ వస్తున్నాయి. యాదవ, కుర్మి, లోద్, నిషాద్ వంటి వెనుకబడిన కులాలు, ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించేందుకే అన్ని ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.ఇది కూడా చదవండి: గాంధీ నుంచి సోనమ్ వాంగ్చుక్ వరకు.. -
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
గన్ ఫౌండ్రి: దేశ రాజధానిలో రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీ తదితర నేతలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా, దేశ ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ వ్యవహరించన తీరును నిరసిస్తూ బీజేపీ గాం«దీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో బుధవారం గాంధీభవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయ పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో పరిస్థితి విషమించింది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతోపాటు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక టీవీ జర్నలిస్టు, మహిళా కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. బీజేపీ ఆధ్వర్యంలో... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు గాం«దీభవన్ ముట్టడికి ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ విచి్ఛన్నకర రాజకీయాలు, రాహుల్గాంధీ దేశ వ్యతిరేక వైఖరిపై బీజేపీ పోరుబాట చేస్తుందని చెప్పారు. నీట్ పరీక్ష పత్రం లీకేజిపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, రాహుల్ ప్రధాని నివాసం ముట్టడికి దిగడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనలో అసలు విద్యార్థులే లేరని, కేవలం సామాజిక విద్రోహ, ఆ్రల్టాలెఫ్ట్ మూకలను జమచేసి ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. అనంతరం గాం«దీభవన్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుని గోషామహాల్, అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఎన్.రామచందర్రావు, ఇతర బీజేపీ నేతల అరెస్ట్పై కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఎం.రఘునందన్రావు, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, ఖండించారు. నీట్ ప్రశ్నపత్రం అంశంపై లోక్ సభలో చర్చకు సిద్ధమని కేంద్ర్రం ముందుకు వచ్చినా కూడా చర్చకు రాకుండా కాంగ్రెస్ రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కిషన్రెడ్డి అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజిపై విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. కరీంనగర్లో ఉద్రిక్తత కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ నిరసన కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని కార్ఖానగడ్డ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టి, కోర్టుసర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి ఊహించని విధంగా సమీపంలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం వైపు ర్యాలీ మళ్లింది. అప్రమత్తమైన పోలీసులు మేడిపల్లి సత్యంను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ తదితరులు కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. కార్యాలయంలో ఉన్న బీజేపీ కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్రావు తదితరులు కర్రలతో కాంగ్రెస్ నాయకులపై దాడి చేశారు. కార్యాలయం గేట్ వేసి పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ, ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. చెప్పులు, కుర్చీలు విసురుకున్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి కాంగ్రెస్ శ్రేణులను చెదరగొట్టారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి బీజేపీ నేతలు సిద్ధమవగా డీసీసీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ముక్కులో నుంచి రక్తం రావడంపై స్పందించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నివాసం దగ్గర జులై 21న సాయంత్రం ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీని తరలించే సమయంలో ఆయన ముక్కులో నుంచి రక్తం వచ్చింది.దీనిపై ఇవాళ రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘పర్వాలేదు. అలాంటి దెబ్బలు తినడం నాకు కొత్త కాదు. ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా బాగానే ఉంది. నా బాధ్యత భారత ప్రజల సంకల్పాన్ని వ్యక్తం చేయడం. విద్యార్థుల సంకల్పమైనా, యువత ఆకాంక్షలైనా, రైతుల గళమైనా వాటిని వినిపించడమే ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత. భారత ప్రజల గొంతుకగా నిలవాలి. ప్రజలు ఎందుకు బాధపడుతున్నారో దేశం దృష్టికి తీసుకురావాలి. ఇవి చాలా చిన్న మూల్యాలు. పెద్ద త్యాగాలు కావు. ప్రజల ఆకాంక్షల కోసం వారి వెంటే నిలబడే అవకాశం రావడం నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అందుకే రెండు మూడు దెబ్బలు తగిలినా నాకు ఎలాంటి సమస్య లేదు. అవసరమైతే ఇంకా ఎన్నో దెబ్బలు తినడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను’’ అని రాహుల్ చెప్పారు. -
నీట్ ఆందోళనలపై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశాన్ని రాజకీయ మైలేజ్ కోసం ఉపయోగించొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలకు సూచించారు. పేపర్ లీకేజీ ఘటనలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన ఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఇంటర్, పదో తరగతి పరీక్షలతో పాటు పంజాబ్లో గ్రూప్-డీ పరీక్ష, అలాగే కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.అలాంటి సందర్భాల్లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని ప్రతిపక్షాలు, ఇప్పుడు నీట్ లీక్ అంశాన్ని మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నాయని జేపీ నడ్డా ప్రశ్నించారు. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు.నీట్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎంతసేపైనా చర్చించేందుకు మేము సిద్ధం. సమస్యలకు పరిష్కారం పార్లమెంట్లో చర్చ ద్వారానే లభిస్తుంది. చర్చలకు పార్లమెంట్కు మించిన వేదిక మరొకటి లేదు’ అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. -
అమ్మాయిల దుస్తులు చించేస్తారా..? బీజేపీ, కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందా..?
-
వైఎస్సార్సీపీలో చేరిన ఒంగోలు కాంగ్రెస్ నేతలు
సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇవాళ (బుధవారం) వైఎస్సార్సీపీలో చేరారు. ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.నాగలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సీనియర్ నాయకుడు డి.సతీష్బాబు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్ భవిష్యత్తులో సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తమను ఎంతగానో ఆకర్షించాయని నాగలక్ష్మి, సతీష్బాబు వెల్లడించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందని.. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. -
కేంద్ర సర్కారు ముందు రాహుల్ గాంధీ 3 డిమాండ్లు
న్యూఢిల్లీ: విద్యార్థులపై అమానుషంగా లాఠీఛార్జ్ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో 152 సార్లు పేపర్లు లీకేజ్లు జరిగాయని తెలిపారు. అన్ని సార్లు పేపర్ లీకేజీలు జరిగితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని చెప్పారు. నిరసనలు తప్ప విద్యార్థులు చేసిన నేరం ఏంటని నిలదీశారు. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎన్డీఏ సర్కారు పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటీకరిస్తోందని చెప్పారు.3 డిమాండ్లు కేంద్ర సర్కారు ముందు రాహుల్ గాంధీ మూడు డిమాండ్లు పెట్టారు. ‘‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి’’ అని అన్నారు. "అందరికీ స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన మన విద్యా వ్యవస్థ ఇప్పుడు అక్రమాలతో నిండిన వ్యవస్థగా మారింది. గత 10 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాల లీక్లు జరిగాయని మనకు తెలుసు. లెక్క వేస్తే నెలకు దాదాపు ఒకటి చొప్పున జరుగుతున్నట్టే. దీని ప్రభావం 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై పడింది. వీరంతా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారు. కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారు. చివరికి వారి ఆశలను పూర్తిగా అవమానిస్తున్నారు.ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక్కరికీ శిక్ష పడలేదు. అంటే కొందరు వ్యక్తులు లేదా ఒక వర్గం మన విద్యా వ్యవస్థను, దేశంలో అత్యంత విలువైన సంపదైన విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేసింది? ఒక్క శిక్ష కూడా పడలేదు. వ్యవస్థ అక్రమాలతో నిండిపోయిందన్న విషయం ఒక్కటే కాదు, అది సామాన్య ప్రజలకు అందని స్థాయిలో ఖరీదుగా కూడా మారింది.ఈ గణాంకం ప్రతి యువకుడికి తెలుసు. కానీ భారత ప్రభుత్వం మాత్రం తెలుసుకోలేకపోతోంది. ఒక పరీక్ష రాసే కుటుంబాలు ఖర్చు చేస్తున్న మొత్తం, కేంద్ర ప్రభుత్వం విద్య కోసం కేటాయిస్తున్న మొత్తం బడ్జెట్కు దాదాపు సమానం.ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిన తర్వాత, పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఖర్చు చేసే నిధినే విద్యా బడ్జెట్ అంటారు. అది రూ. 1.4 లక్షల కోట్లు. అదే సమయంలో, ప్రతి ఏడాది నీట్ పరీక్ష రాసే కుటుంబాలు కలిపి రూ.1.32 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి.ఇది ఆ కుటుంబాల నుంచి జరుగుతున్న బహిరంగ దోపిడీ తప్ప మరొకటి కాదు. అంత డబ్బు ఖర్చు చేయించిన తర్వాత ప్రశ్నపత్రం లీక్ అయిందని చెబుతున్నారు. అంటే మొత్తం వ్యవస్థ అక్రమాలతో నిండిపోయింది. యువత వీధుల్లోకి రావడానికి ఇదే రెండో కారణం. అది పూర్తిగా సరైన కారణం" అని అన్నారు. -
కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్ Vs బీజేపీ
-
కాక్రోచ్ జనతా పార్టీపై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్
-
కాంగ్రెస్ VS బీజేపీ..హైదరాబాద్ లో హై టెన్షన్
-
విజయవాడలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల కొట్లాట
సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ కౌంటర్ ఆందోళన చేపట్టింది. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాల కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విజయవాడలో మ్యూజియం రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు "డౌన్ డౌన్ రాహుల్ గాంధీ", "డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ" అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తోందని వారు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఒకేచోట చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.అనంతరం, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ..‘మోదీ ఇంటి ముట్టడి వెనుక అసలు శక్తులు బయటపడ్డాయి. దాడి వెనుక కాంగ్రెస్ అగ్రనేతల హస్తం ఉంది. జంతర్ మంతర్ నిరసనలకు కాంగ్రెసే సూత్రధారి. సోనమ్ వాంగ్చుక్ను వెనుక ఉండి నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీనే. నిరసనల్లో ఒక్క నీట్ విద్యార్థి కూడా లేరు, కేవలం లెఫ్ట్ యూనియన్ నాయకులే ఉన్నారు. నిరసనల్లో అర్బన్ నక్సల్స్, 370 రద్దును వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి. నీట్ లీకేజీకి సంబంధించి 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు. నేపాల్, బంగ్లాదేశ్ తరహా అలజడులు సృష్టిస్తే ఉపేక్షించం. విద్యార్థులకు భరోసా, నిజమైన నీట్ బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
నల్ల దుస్తుల్లో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
-
రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా కాంగ్రెస్ ర్యాలీ
వికారాబాద్: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా కొడంగల్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొడంగల్లోని తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నినాళులు అర్పించారు.కరీంనగర్ జిల్లాలో..జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల నిరసన కార్యక్రమంలో పోలీసుల లాఠీఛార్జ్ పై నిరసన ప్రకటించారు. ప్రధాన మంత్రీ నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫ్లెక్సీ లు దగ్ధం చేశారు.నల్లగొండలో..నల్లగొండలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు.సిద్దిపేట జిల్లాలో.. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన జరిగింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో, ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన విద్యార్థుల నిరసన ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ఉద్యమాన్ని , సత్యాగ్రహాన్ని తలపించింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు తిరగబడకుండా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి అని గాంధేయ మార్గంలో నిరసన తెలిపారు. అనేక మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థుల లాఠీచార్జ్ పై కనీసం హోంమంత్రి సంఘీభావం తెలపలేదు. ఇప్పటికే ఛాత్రోంకి గుంజ్ పేరుతో దేశ వ్యాప్తంగా విద్యార్థులతో రాహుల్ గాంధీ గారు విద్యా వ్యవస్థ పై మాట్లాడుతు విద్యార్థుల గొంతు వినిపిస్తున్నారని పొంగులేటి అన్నారు. కామారెడ్డి జిల్లాలో..రాహుల్ గాంధీ అరెస్ట్ ను నిరసిస్తూ నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లి చౌరస్తాలో 161వహై వే పై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతా రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆలే మల్లికార్జున్, జుక్కల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా..రాహుల్ గాంధీ తో పాటు ప్రతిపక్షాల నేతల అక్రమ అరెస్టు నిరసిస్తూ, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని గాంధీ చౌక్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని కాంగ్రెస్ శ్రేణుల నిరసన తెలిపారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నిర్మల్ జిల్లా బైంసా.. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ముధోల్ నియోజకవర్గం ఇంచార్జ్ నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో ఆందోళన బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


